Wednesday, December 4, 2019

విశ్వబ్రాహ్మణులు ఎవరు?


భారతదేశ మత చరిత్రను రెండు రకాలుగా విభజించుకోవాలి. ఒకటి వేదాలకు పూర్వ మత చరిత్ర, రెండు వేదాల ఆవిర్భావం తరువాతి మత చరిత్ర. వేదాలకు పూర్వ మత చరిత్ర 1750 BCE వరకూ జరిగిన చరిత్రగా గుర్తించారు. ఇందులోనే సింధులోయ నాగరికత కొన్ని స్థానిక మతాలు వృద్ధిచెందాయి. కాలక్రమేణా జైన, బౌద్ధ మతాలు విస్తరించాయి.
వేదకాలానంతర హిందూ మతం 6 వ శతాబ్దం నాటికి విస్తరించి ప్రముఖ మతంగా ఆవిర్భవించింది. 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతంతో దేశమంతా పర్యటించి, వెళ్ళినచోటల్లా గుళ్ళను స్థాపించి హిందూ మతానికి ప్రచారం కల్పించాడు.
12 వ శతాబ్దం వరకూ హిందూ, బౌద్ధ, జైన మతాలన్నీ సమాజంలో సమాదరణ పొందుతుండేవి. మూడు మతాలు దాదాపు పక్కపక్కనే సహజీవనం చేసాయి.
అప్పట్లో హిందు బ్రాహ్మణులు, జైన బ్రాహ్మణులు, బౌద్ధ బ్రాహ్మణులు (శ్రమణులు) అని విడివిడిగా ఉంటూ ఆయా మత సేవలు చేస్తూండేవారు.
భూమి నుండి వచ్చే ఆదాయంలో వీరికి వాటా ఉండేది.
వీరు కాక చార్వాకులనబడే నిరీశ్వరవాదులు కూడా మనుగడ సాగించారు.
వీరందరిమధ్యా శతృత్వాలు ఉండేవని పదకొండవ శతాబ్దపు పర్షియన్ యాత్రికుడు Al-Biruni రికార్డు చేసాడు.
ఈ మత ఘర్షణలలో మొదట చార్వాక, బౌధ్ద మతాలు క్షీణించాయి. ఆ తదుపరి జైన మతం కూడా తొలగిపోవటంతో హిందూ మతం ప్రధాన మతంగా మిగిలింది. ఈ తతంగం దాదాపు అయిదారువందల ఏళ్ల పాటు జరిగింది.
***
నేటి దళిత, బహుజన కులపురాణాలను పరిశీలిస్తే అనేక ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తూంటాయి. చాలా వాటిలో ఆయాకులాల మూల పురుషుడు చక్రవర్తి అని, గొప్ప సామ్రాజ్య నిర్మాత అని, ఈ సృష్టికే మూల పురుషుడు అని అనేక ఉక్తులు కనిపిస్తాయి. ఈ విషయాలను ఉత్త అతిశయోక్తులుగా అనుకోలేం.
బహుసా వీరందరూ నిర్మూలించబడిన లేదా హిందూ మతంలో విలీనం చేసుకోబడిన- పశుపతినాథ, శాక్తేయ జైన, బౌద్ధ, చార్వాక, స్థానిక మతస్థుల వంశీయులు అవ్వొచ్చు అనే విషయాన్ని కూడా తృణీకరించలేం.
మతపరంగా ప్రాధాన్యతకోల్పోయాకా సామాజికంగా దస్యులుగా మిగిలిపోయి, శూద్రులుగా పిలువబడిన నాలుగవ వర్ణపు సమూహమే- ఒకనాటి వేదపూర్వకాల ప్రిమిటివ్ మతాలకు చెందిన వారై ఉండవచ్చుననే అభిప్రాయం చరిత్రకారులలో ఉంది.
ఈ నేపథ్యంలోంచి ప్రస్తుత విశ్వబ్రాహ్మణ వివాదాన్ని రెండు కోణాల్లోంచి పరిశీలించొచ్చు.
I.----- నేటి విశ్వబ్రాహ్మణులు ఒకనాటి జైనులా?----
తెలుగునాట జైన మతం ఒకప్పుడు విస్తారంగా విలసిల్లింది. వెంగి, భట్టిప్రోలు, కళింగ, ఉదయగిరి, బోధన్, నల్గొండ, విజయవాడ, కడప, విశాఖపట్నం, పెనుగొండ, నెల్లూరు జిల్లాలలో పురావస్తు శోధనల్లో జైన మత శకలాలువిరివిగా లభిస్తున్నాయి.
ఆంధ్రదేశంలో పన్నెండవ శతాబ్దం నాటికి- విశ్వబ్రాహ్మణులు, జైనులు గ్రామాలలో కరణాలుగా చేసేవారు. హిందూ మతవ్యాప్తి జరగాలంటే వీరిని తొలగించి వారి స్థానంలో బ్రాహ్మణులను నియమించటం అప్పటికి రాజకీయ అవసరం. దీని కొరకు బెనారస్, హొయసల, యాజ్ఞవల్క, తమిళ్, కాయస్థ బ్రాహ్మణులను గుంటూరు జిల్లాలో అధికారిక పదవులలో నియమించటం జరిగింది. వీరి సంఖ్య తక్కువ.
అలా నియమింపబడిన బ్రాహ్మణులలో ఆరువేలమందిని ఒక సారి, మూడువేల మందిని ఒకసారి కరణాలుగా నియోగింప చేసిన ఉదంతం ఆంధ్రదేశానికి సంబంధించి ప్రత్యేకమైనది.
అంత పెద్ద సంఖ్యలో ఖాళీలు సృష్టించాలంటే అప్పటికి కరణీకాలు చేస్తున్న అన్యమతస్థులను తొలగిస్తే తప్ప సాధ్యం కాదు.
జైన బ్రాహ్మణులకు, హిందూ బ్రాహ్మణులకు ఒక మోసపూరిత సమస్య ఇచ్చి పరిష్కరించలేదని వేలమంది జైన బ్రాహ్మణులను గానుగ తొక్కించిన కథ ఒకటి మెకంజీ కైఫీయత్తులలో లభిస్తున్నది.
---------"ఆఖరి కాకతీయ రాజు జైనులను గానుగలో తిప్పించి చంపించాడు. రెడ్డి రాజులు కూడా హిందూవేతర మతస్థులను ఊచకోత కోయించారు. " --------- (Ref: A Mannual of Kistna District (Madras: 1883), pp. 1-50.)
కులపురాణంలో చెప్పినట్లు చరిత్రలో విశ్వబ్రాహ్మణులు, వేదాలకంటే ముందునించే ఉండటం, కరణాలుగా పనిచేయటం నిజమే అయితే వారు వేదకాలం కంటే ప్రాచీనమైనదని చెప్పబడే జైనమతానికి చెందినవారని అనుకోవటానికి ఆస్కారం ఉంది.
12 వ శతాబ్దంలో ఈ ఊచకోతలకు వెరసి జైన మతాన్ని వదిలేసి హిందూ మతంలోకి మారిపోయి ఉండవచ్చు.
వీరబ్రహేంద్రస్వామి కాళికాంబ శతకంలో కనిపించే - బ్రాహ్మణ ధిక్కారం, విగ్రహారాధన నిరసన, కులవ్యవస్థను నిరాకరించటం, మనుషులందరూ ఒక్కటే అని భోధించటం, హిందూ దేవుళ్లను ప్రస్తావించకపోవటం - లాంటి విషయాలన్నీ హిందూ మతాన్ని అన్యమతంగా భావించి ప్రవచించినవే అనే ఊహ తార్కికమే అవుతుంది.
రామాయణంలో రామసేతును నిర్మించిన విశ్వకర్మ కొడుకైన "నల" జైనుడని జైన పురాణాలు చెపుతున్నాయి. (రి. wiki/Nala_)
II. --------విశ్వబ్రాహ్మణులు సాంస్క్రిటైజేషనుకు గురయిన శూద్రులు--------
A. హిందూమతంలో నాలుగే వర్ణాలు ఉన్నాయి. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు.
విశ్వబ్రాహ్మణులు అంటే బంగారు పని వారు మాత్రమే కాదు. కంచర, కమ్మర, వడ్రంగి, శిల్పకార లాంటి చేతి వృత్తుల వారు. వీరందరిలో స్వర్ణకారులకు కాస్త సమాజంలో మెరుగైన జీవనం ఉండేది. ఎందుకంటే వీరు ఎలైట్ ప్రజల అవసరాలు తీరుస్తుంటారు కనుక.
B. ఈ స్వర్ణకారులు, కొంతమేరకు శిల్పులు- ఇతర కులాల వలెనే "Sanskritization" కి గురయ్యారు. అంటే బ్రాహ్మణులను అనుకరించటం -శాకాహారం, జంద్యం, ఆచారవ్యవహారాలు లాంటివి పాటించటం. (నేడు కార్పొరేట్ సంస్కృతిలో అందరూ సూటూ బూటూ వేసుకొని, స్పూను ఫోర్కులతో బర్గర్లు, పిజ్జాలు తింటున్నట్లు)
C. మిగిలిన పంచవృత్తుల వారు పెద్దగా బ్రాహ్మణీకరణకు పోలేదు. వారికి మనుగడే ప్రశ్నార్ధకం. కనుక.
D. ఇక రిజర్వేషన్ల అంశానికి వస్తే వీరందరూ చేతి వృత్తుల వారు. ఆధునిక కాలంలో చేతి వృత్తులన్నీ దాదాపు అంతరించి పోయాయి. దానిలో కులప్రాధాన్యత కూడా పోయింది. (ఉండాలని నా ఉద్దేశం కాదు). అందుచే వీరిని చేతివృత్తులు కోల్పోయిన కులాల సమూహంలో చేర్చి రిజర్వేషన్లు ఇస్తున్నారు.
దీనికీ వీరి బ్రాహ్మణీకరణకు సంబంధం లేదు. ఈ రెండిటిని కలిపి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు.
E. విశ్వబ్రాహ్మణులు/పంచవృత్తికారులు నిచ్చెన మెట్లలో శూద్రులే.
ఎందుకంటే ఫ్యూడల్ వ్యవస్థలో ఒక వడ్రంగో, కంచరో, కంసాలో వూరు దాటి పొరుగూరుకు వెళ్ళే స్వాతంత్ర్యం ఉండేది కాదు. ఒక వేళ పారిపోతే చేతులు నరికే వారు. మిడివియల్ చరిత్రలో వీరూ ఇతర శూద్ర, అతిశూద్ర కులాలలాగ బానిసజీవితాన్ని గడిపారు. శిల్పులు సంచార జీవనం గడిపేవారు.
****
ఇక ప్రస్తుత వినోదినిగారిపై జరుగుతున్న దాడిని నేను ఖండిస్తున్నాను. వారు ఎంతో లోతైన విశ్లేషణ చేసి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఒక సంఘ సంస్కర్తగా శాస్త్రీయంగా నిరూపించారు. ఇంతకాలం కాలజ్ఞాన కవిగా వేసిన ముద్రను తొలగించినందుకు వారికి మనం రుణపడాలి. ఆ విషయంలో ఆమెతో అప్పట్లో మాట్లాడి అభినందించాను కూడా.
శూద్ర అన్న పదం ఎంత మాత్రం తప్పుకాదు. ఎందుకంటే అది ఉత్పత్తి కులాలలో మనల్ని ఉంచుతుంది. ఈ రోజు భారతదేశం కొన్ని కోట్ల డాలర్ల విదేశీమారకాన్ని పొందటానికి కారణమైన - నలందా, అజంతా, ఎల్లోరా, మహాబలిపురం, బృహదీశ్వరాలయం, కంచి, మధుర, హంపి, కోణార్క్, బదామి కేవ్ టెంపుల్స్, ఢిల్లీ ఐరన్ పిల్లర్ లాంటి అనేక టూరిస్ట్ నిర్మాణాలను ఉత్పత్తి చేసింది మనమే అని గర్విద్దాం.
బొల్లోజు బాబా

No comments:

Post a Comment