Wednesday, September 12, 2012

కవిత్వ "గిజిగాడు" - శిఖామణి


ప్రముఖ కవి శిఖామణి తాజా సంకలనం పేరు గిజిగాడు. గిజిగాడు అంటే అందమైన గూటిని నిర్మించుకొనే పసుపురంగు అడవిపిచ్చుక అని అర్ధం. ఇది గడ్డిపోచలు, నార, పీచు వంటివాటితో అద్బుతమైన నిర్మాణకౌశలాన్ని కలిగిఉండే పొందికైన గూటిని నిర్మించుకొంటుంది. లోపలిగోడలకు బంకమట్టి అద్ది గూటికి బలాన్ని కలిగిస్తుంది. మిణుగురుపురుగులను తెచ్చి ఆ బంకమట్టికి అతికించి గూటిని చీకట్లోకూడా ప్రకాశించేలా చేస్తుంది. ఈ లక్షణాలన్నీ శిఖామణి కవిత్వానికి చక్కగా సరిపోతాయి. ఇతని కవిత్వంలో పల్లెసరుకులే తప్ప పట్టణ సరంజామా కనిపించదు. ఇతని కవిత్వానికి బలమిచ్చేది ఆ మట్టివాసనే. ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకాలు మణిపూసలై ఇతని కవిత్వాన్ని అలంకరిస్తాయి.
జీవితంలోని వైవిధ్యాలని, వైరుధ్యాలని, లోతుల్ని జాగ్రత్తగా ఒడిసిపట్టుకొని అద్బుతమైన కవిత్వంగా మార్చే రసవిద్య శిఖామణి సొంతం. ఈ సంకలనంలోని కవితలన్నీ చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా, నిప్పులాంటి స్ఫష్టతతో చెప్పేసి హృదయాన్ని ధ్యానంలోకో, సహానుభూతిలోకో, అలజడిలోకో మళ్ళిస్తాయి.

ఈ సంకలనం "రంగూను సన్నెకల్లు" అనే కవితతో ప్రారంభమౌతుంది. ఉపాధికోసం రంగూను వెళ్ళిన తన పూర్వీకులు అక్కడ నుంచి తెచ్చిన సన్నెకల్లు గురించి ఈ కవిత. పైకి ఓ వస్తు కవితలా అనిపించినా అంతర్లీనంగా ఈ కవితలో మూడుతరాలలో కాలగమనంలో మానవసంబంధాలలో వచ్చిన మార్పులను ఇమిడ్చిన విధానం అబ్బురపరుస్తుంది. "మిక్సీల యుగంలో మా రంగూను సన్నెకల్లు అవసరం లేక వంటగది వసారా పంచన అనాధలా పడివుంది" అనటం ద్వారా క్షీణిస్తున్న మానవతావిలువలకు రంగూను సన్నెకల్లును ప్రతీక చేసినట్లు అర్ధమౌతుంది.

బాల్యస్మృతులు ఒక కాలానికి, ఒక ప్రాంత సంస్కృతికి సాక్ష్యాలు. ప్రపంచీకరణ ప్రభావంతో అనేక ఆచారాలు, అలవాట్లు అంతరించిపోతున్నాయి. వీటిని కవిత్వంలోకి తీసుకురావటం ద్వారా వాటికి చరిత్రలో ప్రాణం పోసినట్లవుతుంది. అలా చేయబట్టే ఒకనాటి తెలుగునాట ఉండిన జీవనస్థితిగతుల్ని శ్రీనాధుని పద్యాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఈ సంకలనంలోని కొన్ని కవితలద్వారా శిఖామణి ఆ భాద్యత తీసుకొన్నాడా అనిపిస్తుంది. ముత్యాలుగారి నిలువుటద్దం, తాటాకుగదుల పెట్టె, నీలాటి రేవు, అడ్డసరం కట్టవ, మా వూరి మరిడమ్మ, చలివేంద్రం, ఆరణాల షాపు, దీపం చెట్టు, పొన్నచెట్టు వంటి కవితలు ఓ అర్ధశతాబ్దపు యానాం (శిఖామణి పుట్టిపెరిగిన ఊరు) సామాజిక, నైసర్గిక, సాంస్కృతిక స్వరూపాలకి కవిత్వరూపాలు. ఇవి వొఠి "శిఖామణీ-యానాం జ్ఞాపకాలు" మాత్రమే కావు. కాలానుగుణంగా వచ్చిన సమాజమార్పులపై హృదయమున్న ఓ మనిషి చేసిన వ్యాఖ్యానాలు - కవిత్వం హృదయసంబంధి కదా!. శిఖామణిది ఆత్మాశ్రయకవిత్వంలా అనిపించే సామాజిక కవిత్వం అని నిరూపిస్తాయి ఈ కవితలు. అలాగని వీటిలో కనిపించేది నాష్టాల్జియా కాదు. ఉదాహరణకు...

టాంక్ బండ్ కు నక్లస్ రోడ్డులా
మా ఆది ఆంధ్రపేటకు చెరువుగట్టు
మా నాయినమ్మ కంఠాన్ని అంటిపెట్టుకునే పట్టెడలా శోభిల్లేది. (ముత్యాలుగారి నిలువుటద్దం) వంటి వాక్యాల ద్వారా ఒక గొప్ప సుందరచిత్రాన్ని మన కళ్ళముందు నిలుపుతాడు.

చిన్నపాటి తలనొప్పికే
చాంతాడంత పరీక్షల చీటీలు రాసే కాలంలో
ఆమె రుసుములేని ఒక సంచార ప్రజావైద్యశాల
పట్టాలులేని ఒక ప్రకృతి వైద్యురాలు
మా వాడ వైద్యభిషక్కు మా చెల్లిగోపెమ్మ పెద్ది -- (తాటాకుగదుల పెట్టె) అనే వాక్యాలతో సామాజిక స్పృహను పలికిస్తాడు.

పొన్నచెట్టు అనే కవితలో...
పండిన ఎర్రని కిళ్ళీపెదవుల్లాంటి ముక్కులతో
కొమ్మకొమ్మకు రామచిలుకలు
వాటిలో
ముండకోపనిషత్తులో చెప్పిన
జీవాత్మ పరమాత్మలను
గుర్తించటం ఎలా? ... అంటూ తాత్విక చింతన కలిగిస్తాడు.

ఆ మధ్య యానంలో జరిగిన అల్లర్లపై వ్రాసిన "యానామా నా ఆరోప్రాణమా" అనే కవితలో
నా కన్నతల్లీ! యానామా!
శ్వాసించినా ధ్యానించినా
కవితను ఉపాశించినా
నా అక్షరాలనిండా పరచుకున్న
నా బాల్యమా నా కన్నీళ్లా
నా రక్తమా నా చమటా
మునివాటిక లాంటి
యానామా! ఏమయిందే నీకీవేళ ---- అని ఆవేదన చెందుతాడు. ఈ కవిత చదివాకా తమ అస్థిత్వాన్ని ఒక ప్రాంతంతో అంతలా మమేకం చేసిన కవులు మరెవరైనా ఉన్నారా అనే సందేహం కలగక మానదు.

కొత్తింట్లోకి మారిన కొత్తలో కలిగే అనుభూతులు ప్రతిఒక్కరికి గమ్మత్తుగానే ఉంటాయి. కొన్నాళ్ళకు అవి పాతబడి జ్ఞాపకాలలోయల్లోకి జారుకొంటాయి. కానీ శిఖామణి వాటిని అపురూపమైన పదచిత్రాలుగా మలిచి "కొత్తింట్లో" అనే కవితగా మనముందుంచాడు. "కాంక్షా పరిమళం" అనే కవితలో "మట్టికంటే పేరుమోసిన సుగంధద్రవ్యం ఈ భూప్రపంచంమీద లేదు" అని ఎంతో సాధికారికంగా ప్రకటిస్తాడు.

అద్బుతమైన ఒక గానకచేరీ గురించి (నేలమీది కెరటం), ఒక చిత్రప్రదర్శన వీక్షణంపై (ఎనిమిదింపావుకి), డాబా ఎక్కినపుడు గింజలకోసం వాలే పావురాల మీద (డాబామీద పావురాలు), పిల్లల్ని తల్లిలా సాకుతున్న మిత్రునిపై (మగతల్లి) వ్రాసిన కవితలన్నీ- ఒక కవితలో శిఖామణే అన్నట్లు "చిక్కుపడ్డ దారపుఉండలాంటి జీవితంలో కవిత్వకొసను వెతికి పట్టుకొన్న సందర్భాలే"

"మడిచిన పేజీ" అనే కవితలో మంచి కవితను చదివినపుడు కలిగే అనుభూతిని అద్బుతమైన ఇమేజెస్ లో శిఖామణి అక్షరీకరించాడు.
నాగలికర్రు మెత్తగా దిగుతున్నట్టు సాగే వాక్య విన్యాసాల్నీ
ఇనపరజనును ఆకర్షించే
అయస్కాంతంలాంటి శైలీరమ్యతల్నీ
సాలెపట్టు దారం మీద కొలువుదీరిన
మంచుబిందువుల్లాంటి అక్షరాల వెంట పరుగుదీస్తుండగా
కాలికి గొప్పుతగిలినట్టు
తడియారని గొప్ప పదబంధం ఒకటి
ఇక ఎంతమాత్రమూ ముందుకు కదలడానికి వీల్లేదని
ముందరికాళ్ళకు బంధం వేసింది --- (మడిచిన పేజీ) ఆ తరువాత ఆ పుస్తకపు పేజీ చివర మడతపెట్టి, పుస్తకాన్ని గుండెలపై బోర్లించి ఒక అనిర్వచనీయమైన పారవశ్యస్థితిలోకి వెళతాడట చదువరి. ఈ పుస్తకంలో అనేకచోట్ల అలాంటి స్థితిని, పేజీల మడతల్ని శిఖామణి మనకు కలిగిస్తాడు.
నవతంత్రుల దేహవీణ అనే కవితలో – "ఆశ్వాదించే జ్వరమానిలాంటి పాదరసపు రసన ఉండాలే గాని వొట్టి వెచ్చదనమూ గొప్ప రుచే" అనే వాక్యం శిఖామణి తన కవితలలో ఇంత వైవిధ్యం ఎక్కడనుంచి పట్టుకొస్తాడో చెప్పకనే చెపుతుంది.
అంబేద్కర్ విగ్రహాల విధ్వంశాన్ని నిరసిస్తూ వ్రాసిన "విగ్రహాలు మాట్లాడతాయి" అనే కవితలో - ముందు నువ్వు నిర్మించదలచుకొన్నదేదో తెలుసుకో తర్వాత ధ్వంశం చేయదగిందేదో నీ అంతట నీకే తెలుస్తుంది" అన్న పదునైన వాక్యం ఆలోచింపచేస్తుంది.

అలా
సాయింకాల పూట
కాలవగట్టుకో కొబ్బరితోటలోకో
షికారుకి వెళ్ళినట్టు
అప్పుడప్పుడూ
దేహంలోకి వాహ్యాళి కెళ్ళాలి (దేహ వాహ్యాళి).
తన దేహవాహ్యాళిలో కలిగిన వైయక్తిక అనుభూతులకు శిఖామణి మానవత, తాత్వికతలను అద్ది లోతు వెడల్పును ఇచ్చి
అదేస్థాయిలో అవి చదువరుల మనస్సులకు అవి అనుభవమయ్యేలా చేస్తాడు. అందుకనే అనుభూతి, మానవత, తాత్వికతలు శిఖామణి కవిత్వంలో పుష్కలంగా పొటమరించే అందాలు. ఈ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో కె.శ్రీనివాస్ అన్నట్లు "సస్టైయిన్డ్ రిలీజ్ డ్రగ్ లాగ శిఖామణి అక్షరాల్లో కవిత్వం నిలకడగా స్రవిస్తూ ఉంటుంది".
ఈ సంకలనంలో మొత్తం 35 కవితలున్నాయి. ఈ పుస్తకం ప్రముఖకవి శ్రీ వేగుంట మోహనప్రసాద్ కి అంకితం ఇవ్వటం జరిగంది. చక్కని చిక్కని కవిత్వాన్ని ఇష్టపడే వారికి గిజిగాడు తప్పక నచ్చుతుంది.

ప్రతుల కొరకు
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
Palapitta Publications
వెల: 95 రూపాయిలు

(ఈ వ్యాసాన్ని "పాలపిట్ట"  సెప్టెంబరు సంచికలో ప్రచురించిన శ్రీ గుడిపాటి గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను   -  బొల్లోజు బాబా)