Monday, December 18, 2023

Bharhut స్తూపంపై ఉన్నది రామాయణ ఘట్టమా?


"Bharhut స్తూపంపై చెక్కిన దశరథ జాతక కథ ద్వారా రాముని కథ BCE రెండో శతాబ్దం నుంచి భారతదేశంలో ప్రబలంగా ఉంది" అనే వికీ వాక్యం ఆకర్షించింది. ఎందుకంటే రామునికి సంబంధించిన ఐకనోగ్రఫీ CE 5/6 శతాబ్దాలనుంచి లభిస్తుంది. అంతక్రితపు స్పష్టమైన శిల్పాలు కానీ చెక్కుడు రాళ్ళు కానీ కనిపించవు. ఈ నేపథ్యంలోంచి చూసినపుడు పై వాక్యం ఆశ్చర్యం కలిగించకమానదు.
***

1. దశరథ జాతకకథ.
.
BCE మూడవ శతాబ్దపు దశరథ జాతకకథలో దశరథ రాజుకు రామ పండిత, లక్ష్మణ అనే ఇద్దరు కొడుకులు సీతాదేవి అనే ఒక కూతురు, మరొక భార్య వల్ల భరతుడు అనే కొడుకు కలరు. తండ్రి ఆజ్ఞపై రామపండితుడు అరణ్యవాసానికి వెళ్ళగా, భరతుడు అన్నగారైన రామపండితుడిని వెతుక్కుంటూ వెళ్ళి, రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తాడు. తండ్రికి ఇచ్చిన పన్నెండేళ్ళు గడువు పూర్తికానందున రాజ్యానికి రాలేనని, తన పాదుకలను ఇచ్చి భరతుడినే రాజ్యపాలన చేయమని కోరతాడు రామపండితుడు. వనవాసం పూర్తయ్యాక రామపండితుడు తండ్రి రాజ్యాన్ని చేపట్టి పదహారు వేల ఏండ్లపాటు పరిపాలించాడు.
పై బౌద్ధ జాతక కథలో సీతాపహరణ ఘట్టం లేదు. రావణుడు లేడు. రామరావణ యుద్ధం, ధర్మసంస్థాపన లాంటివి కూడా లేవు.
***

2. స్త్రీని అపహరించుకొనిపోతున్న యక్షుడు
.
కౌశాంబి లో దొరికిన BCE ఒకటవ శతాబ్దానికి చెందిన ఎర్రమట్టి ఫలకపై, ఒక యక్షుడు ఒక స్త్రీని ఎత్తుకొని పోతున్నట్లు ఉంది. ఈ ప్రతిమలో - ఆ స్త్రీ యక్షుని కబంధ హస్తాలలోంచి తప్పించుకోవటం కొరకు పెనుగులాడుతున్నట్లు కనిపిస్తుంది. చెట్ల ఆకుల మధ్యలోనుంచి ఒక కోతి తొంగి చూస్తుంటుంది. ఆ స్త్రీ కర్ణాభరణం ఒకటి నేలపై పడి ఉంది. దుష్ప్రవర్తన కలిగిన పురుషులు, స్త్రీలను ఎత్తుకుపోవటం అనేది ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో కనిపించే ఒక నెరేటివ్.
ఈ ఎర్రమట్టి ఫలకలో చిత్రించిన "యక్షుడు స్త్రీని అపహరించుకు పోయే ఘట్టం" రామాయణంలోని సీతాపహరణంతో సరిపోలుతుంది. మరీ ముఖ్యంగా అపహరణ సమయంలో సీతామాత వానరములను చూసి వాటికి లభించేటట్లు ఆభరణాలను జారవిడవటం.
ఈ నెరేటివ్ ఆకాలపు ఏదో ఒక జానపద కథ అయి ఉండవచ్చు. లేదా నేడు లభించని ఏదో బౌద్ధ జాతకకథ అయినా కావొచ్చు.
***
CE 500 లో అప్పటికే జనశృతిలో ఉన్న రామాయణ గాథను లిఖితరూపంలోకి తీసుకురావటం జరిగింది. [1] అంటే BCE మూడో శతాబ్దపు దశరథ జాతక కథను, BCE ఒకటో శతాబ్దపు "yakṣa abducting a woman" అనే కథను, ప్రేరణగా తీసుకొని దానికి ధర్మ సంస్థాపనను వెన్నుగా నిలిపి, అనూచానంగా వస్తున్న రామాయణ ఐతిహ్యాన్ని కావ్యంగా లిఖించి ఉంటారు.
ఆనాటినుంచి రామాయణ కథ భారతదేశ నలుచెరగులా విస్తరించి దేశప్రజలందరిని కలిపి ఉంచే ఒక ఉమ్మడి భాషగా, ఈ నేల జీవనవాహినిగా, ఒక ఉమ్మడి ఆత్మగా రూపుదిద్దుకొంది.
***
.
"Bharhut స్తూపంపై చెక్కిన దశరథ జాతక కథ ద్వారా రాముని కథ BCE రెండో శతాబ్దం నుంచి భారతదేశంలో ప్రబలంగా ఉంది" అనే వికిపీడియాలోని వాక్యం Mandakranta Bose (2004) రాసిన The Ramayana Revisited అనే పుస్తకంలోనిది. ( The earliest Sculptural evidence of Rama theme can be traced to the depiction of the Dasaratha Jataka in the reliefs of Bharhut, dating from second centuary BCE. పే.337 ).
రామాయణానికి ప్రాచీనత కల్పించటానికి తీసుకొన్న ఒక పోలిక అది. Bharhut స్తూపంపై లభిస్తున్న ఒక చెక్కుడు శిల్పం (కన్నింగ్ హామ్ ప్లేట్ నం. 27) దశరథ జాతక కథతో పోలుతున్నది అని మొదటగా ప్రతిపాదించినది భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడిగా పేరొందిన అలెగ్జాండర్ కన్నింగ్ హామ్.
ఆ చెక్కుడు శిల్పంలో ఉన్నది దశరథ జాతక కథ అనే ప్రతిపాదన తప్పు అని, ఆ ప్లేట్ ఇంకా గుర్తించవలసి ఉంది అని భావిస్తున్నానని రష్యన్ ప్రొఫసర్ von Oldenburg అప్పట్లోనే అభిప్రాయపడ్డాడు.
ఆ చెక్కుడు శిల్పంలో ఉన్నది దశరథ జాతక కథ కాదని అది మహాబోధి జాతక కథ అని E. HULTZSCH, అనే చరిత్రకారుడు Jātakas of Bharaut అనే వ్యాసంలో వెల్లడించాడు. [2]
****

3. Bharhut స్తూప చెక్కుడు శిల్పంపై ఏముంది?
.
ఈ శిల్పంపై ఒక కుక్క, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ఒక వ్యక్తి సన్యాసి దుస్తులు ధరించి ఒక చేతితో గొడుగు, పాదుకలు మరొక చేతితో ఏదో సంచి తగిలించిన దండము పట్టుకొని ఉంటాడు.
మరొకవైపున రాజదుస్తులు, ఆభరణాలు ధరించిన స్త్రీ, పురుషులు ఉన్నారు.
శిల్ప మధ్యంలో ఒక కుక్క కూర్చుని ఉంది.
పై శిల్పంలో సన్యాసి దుస్తులలో ఉన్న వ్యక్తి,, రాముని పాదరక్షలు తీసుకొని వెళుతున్న భరతుడు అని; రాజ దుస్తులు ధరించిన స్త్రీపురుషులు- సీత, రాములు అని; వనవాసంలో ఉన్న సీతారాముల వద్దకు భరతుడు వచ్చి రాజ్యపాలన చేపట్టమని కోరగా, శ్రీరాముడు
సున్నితంగా తిరస్కరించి తన పాదుకలను ఇచ్చిన దశరథ జాతకఘట్టం అని, కన్నింగ్ హామ్ అనుమానపడుతూనే చెప్పాడు. (recognizable at the first glance అంటాడు)
ఆ శిల్పం లో ఉన్న వ్యక్తులు రాముడు సీత, భరతుడు కాదని, అదసలు రామాయణ ఘట్టమే అనటానికి ఈ కారణాలు చెప్పుకోవచ్చు.
మొత్తం శిల్పంలో రాముని వెంటే నిత్యం ఉండే లక్ష్మణుడు లేడు. వనవాస సమయంలో సీతా రాములు సన్యాసి దుస్తులలో ఉంటారు తప్ప రాజ దుస్తులలో కాదు. భరతుడు సన్యాసి దుస్తులలో ఉండడు. రామాయణంలో కుక్క పాత్ర లేదు.

4. మహాబోధి జాతకకథ: 

Bharhut స్తూపంపై లభించిన శిల్పంలో ఉన్నది రామాయణ ఘట్టం కాదని అది మహాబోధి జాతక కథ అని E Hultzsch అభిప్రాయపడ్డాడు.
బెనారస్ ను పాలించే రాజు చెంతకు బోధి అనే పేరుకల ఒక సన్యాసి వచ్చాడు. అతని జ్ఞానాన్ని గుర్తించిన రాజు, బోధిని తన రాజ్యంలో ఉండిపొమ్మని కోరాడు. బోధి రాకవల్ల ప్రజలు సుఖశాంతులతో జీవించసాగారు. రాజుగారి పెంపుడు కుక్క బోధికి ఎంతో దగ్గరయింది. బోధికి వస్తున్న మంచి పేరు పట్ల మంత్రులకు అసూయపుట్టింది. రాజుకు చెడ్డమాటలు చెప్పి బోధికి మరణ శిక్ష విధింపచేసారు. ఆ సంగతి తెలియని బోధి రాజమందిరానికి వచ్చినప్పుడు, ఆ పెంపుడు కుక్క అరుస్తూ బోధికి రానున్న ప్రమాదాన్ని సూచించింది. అది గ్రహించిన బోధి తన కుటీరానికి వెళ్ళి, తనకు కావలసిన గొడుగు, చెప్పులు, దండము, దుస్తుల మూటను తీసుకొని ఆ రాజ్యాన్ని విడిచి వెళిపోదామని నిశ్చయించుకొన్నాడు. ఈ లోపులో రాజు గారు తన తప్పు తెలుసుకొని బోధి వద్దకు వచ్చి క్షమాపణ కోరి అతనిని రాజ్యం వీడి వెళ్ళొద్దని ప్రార్ధించి తన గురువుగా స్వీకరించాడు.
పైన చెప్పిన శిల్పంలోని గొడుగు, పాదుకలు, దండం, దుస్తుల మూట ధరించిన సన్యాసి, మహారాజు, రాణి, కూర్చుని ఉన్న కుక్క వంటి ఆకృతులను బట్టి అది మహాబోధి జాతకకథ అని ఇట్టే పోల్చుకోవచ్చు. [3] [4]

****

Bharhut చెక్కుడు ఫలకకు రామాయణానికి ఏ రకమైన సంబంధంలేదు. కాగా ఆ చెక్కుడు ఫలక BCE రెండో శతాబ్దానికి చెందిన రామాయణ ఘట్టమని, రాముని శిల్పరూపం అంతటి ప్రాచీన కాలం నుంచీ లభిస్తున్నదని చెప్పటం అబద్దపు ప్రచారం. ఎందుకు చేస్తున్నారు అంటే CE ఐదో శతాబ్దం నుంచి మాత్రమే కనిపించే రామాయణ ఐకనోగ్రఫీ ని BCE రెండో శతాబ్దం వరకూ వెనక్కి నెట్టే ప్రయత్నమేనని అనుమానం కలగక మానదు. హిందూమతం వేల, లక్షల సంవత్సరాల క్రితానిది అని చెప్పే అనేక Textual ఆధారాలు చూపగలరు తప్ప Non Textual శిల్పశాస్త్ర లేదా ఆర్కియలాజికల్ ఆధారాలు లభించవు. భారతదేశంలో నేడు ఎక్కడ తవ్వినా ఇబ్బడిముబ్బడిగా లభించే ఆర్కియలాజికల్ ఋజువులన్నీ బౌద్ధజైనాలకు చెందినవి. హిందూమత ఋజువులు CE ఆరో శతాబ్దం తరువాతనుండి లభ్యమౌతాయి. అవికూడా బౌద్ధజైన మూలాలను కలిగి ఉండటం పరిపాటి.
 
అదే విధంగా మూడవ శతాబ్దపు నాగార్జునకొండ వద్ద లభించిన కొన్ని చెక్కుడు ఫలకలలో దశరథ జాతక కథ అని అంటారు కాని అది కూడా అనుమానాస్పదంగానే అనిపిస్తుంది.
 
***

రాముని ఆలయాలు CE ఐదో శతాబ్దం నుంచి ఉన్నట్లు శాసనాధారాలు లభిస్తున్నప్పటికీ, నేడు అవి కనిపించవు. ప్రస్తుతం దేశంలో అత్యంత పురాతనమైన రామమందిరం చత్తిస్ గడ్, రాయ్ పూర్ లో ఉన్న రాజీవ లోచన ఆలయంగా గుర్తించారు. ఇది CE ఏడో శతాబ్దానికి చెందింది.


[1] valmiki.iitk వాల్మికి రామాయణ పేరుతో ఉన్న వెబ్ సైట్
[2] Journal of the Royal Asiatic Society , Volume 44 , Issue 2 , April 1912
[3] Barhut Book II, Jataka Scenes by Benimadhab Barua, 1934, pn. 147 లో 27 వ ఫలకంలో ఉన్నది దశరథ జాతకం కాదని, అది Hultzsch చెప్పినట్లు మహాబోధి జాతక కథ అని Benimadhab Barua అభిప్రాయపడ్డారు.
[4] The Jataka or Stories of the Buddha's former birth, Vol 5, Edited by E.B. Cowell, pn 119

బొల్లోజు బాబా



Friday, December 15, 2023

Jyoti Krishan Verma కవిత్వం

.
Jyoti Krishan Verma ప్రముఖ హిందీ కవి. Khule Aakash Mein, Meethe Pani ki Matkiyan అనే రెండు సంపుటులను వెలువరించారు. ఇతని కవితలు వివిధ పత్రికలలో, సంకలనాలలో చోటు చేసుకొన్నాయి.
.
1.
భూమి
ప్రపంచంలో
అత్యంత చిన్న కవిత
ఎవరైనా రాయాలనుకొంటే
అది ఇలా రాయాలి
భూమి
Earth


2.
యుగాల క్రితం
మానవుడు
కవిత్వం రాయని
కాలమొకటి ఉండేది.
అందుకనే బహుశా
చరిత్రకారులు
దానిని
రాతియుగం అని
పిలిచి ఉంటారు
Eons Ago


3.
దుఃఖం
.
నీటి యొక్క
అతిపెద్ద దుఃఖం
దాని కన్నీళ్ళు
ఎవరికీ
కనిపించకపోవటమే
Grief


4.
ప్రేమ
నీవు చెట్టు
కొమ్మ, ఫలము అయితే
నేను
నీ వేర్లుగా ఉండాలని
కోరుకొంటాను
Love

 
5.
నది
.
ఎండిపోయిన నది వేదన తెలుసా మీకు?
తెలియక పోతే
ఒకసారి సముద్రాన్ని అడుగు
దాహానికి, తృప్తికి మధ్య
దూరాన్ని చెరిపేయడానికి
ఎంతకాలంగా అది రోదిస్తుందో.
River


6.
శిఖరం
ఎన్నో యుగాలుగా నిలబడి ఉన్న
పర్వతం
ఎవరైనా వచ్చి
తనని అధిరోహించి
దాని ఏకాకితనాన్ని దూరం చేస్తారని
ఆశిస్తుంది
ఎదురుచూపుల్లో దాన్ని కళ్ళు
శిలలైపోయాయి
దాని దేహం ఏనాడో
రాతిగా మారిపోయింది
Mountain


Original: Jyothi Krishan Verma
Translated from Hindi into English by Basudhara Roy


తెలుగు అనువాదం: బొల్లోజు బాబా