Sunday, February 9, 2020

తుపాకి మాట్లాడితే



చరిత్రను రికార్డు చేయటం కూడా కవిత్వానికి బాధ్యతే.

ప్రశాంతతలో జ్ఞాపకం చేసుకొనే ఉద్వేగాలలోంచి కవిత్వం పుడుతుందన్న వర్డ్స్ వర్త్ మాట – నిత్యం జాతి వివక్షతో ప్రజలు సామూహిక ఊచకోతకు బలి అయ్యే సందర్భాలలో వర్తించదనే విషయం, జీన్ అరసనాయగం బ్లాక్ జులై గురించి వ్రాసిన Apocalypse 83 సంపుటిలోని కవిత్వం చదివితే అర్ధమౌతుంది.

శ్రీలంకలో తమిళులపై జులై, 1983 లో జరిగిన మూక దాడులను ‘బ్లాక్ జులై’ అంటున్నారు చరిత్రకారులు. ఈ దాడులలో దాదాపు మూడువేలమంది ప్రాణాలు కోల్పోయారు. తమిళులకు చెందిన సుమారు ఎనిమిదివేల ఇళ్ళను, ఆరువేలకుపైగా షాపులను తగలబెట్టారు. లక్షా యాభైవేలమంది నిర్వాసితులయ్యారు. ఇదంతా చరిత్ర. చరిత్రపుస్తకాలలో పైన చెప్పిన తారీఖులు, లెక్కలు, కారణాలు మాత్రమే ఉంటాయి. ఆనాటి బాధితుల మనోద్వేగాలు, హంతకుల ఉన్మత్తత, తటస్థుల ప్రవర్తన లాంటివి ఒక్క కవిత్వంలో మాత్రమే లభిస్తాయి. జీన్ అరసనాయగం ఆ దాడులలో ఒక బాధితురాలు కనుక అవన్నీ ఆమె కవిత్వంలో ప్రతిబింబించాయి. చివరి వూపిరిదాకా శ్రీలంక వ్యథని కవిత్వం చేస్తూనే వున్న ఆమె ఈ నెలలో కన్నుమూశారు. ఆమెకి నివాళిగా ఈ అనువాదాలు.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగ ఎక్కడ వివక్షతో ఊచకోత జరిగినా అరసనాయగం కవిత్వాన్ని గుర్తుచేసుకొనే పరిస్థితి ఉంది.

*
తుపాకి మాట్లాడితే – If the gun speaks

తుపాకి మట్లాడితే
అంతా నిశ్శబ్దమే
భయం తాలూకు నిశ్శబ్దం
రక్తంతో, బుల్లెట్లతో తుపాకి మాట్లాడితే.

గణేష్ విగ్రహ తొండానికి గుచ్చిన
ఎర్ర మందారం
ఒక రక్తవాంతులా ఉంది

చేతులపై, కాళ్ళవద్దా ఉంచిన
ప్రతీ పువ్వూ
ఒక తెరిచిన గాయం

నల్లూరు ఆలయవీధిలో బంగారు రథాన్ని
తాళ్ళతో లాగుతున్నారు మనుషులు
ఇసుకలో మెల్లగా కదులుతోందది

ఠాప్ మనే శబ్దాలు
ఓ వేయి కొబ్బరికాయలు పగిలుంటాయి
వాటి తీయని నీరు
అనాచ్ఛాదిత దేహాలపై, తలలపై
ప్రవహించింది

తుపాకుల శబ్దాలు నిలచిపోయాకా
అంతా నిశ్శబ్దం
మంటల చిటపటలు
అగ్నిసముద్రంలా వ్యాపించాయి

చిధ్రమైన బూడిద నేలపై
ఓ వేయి చితులు కాల్తున్నాయి.

(నల్లూరు- ఊరిపేరు. ఇక్కడ పోలీసుల ఫైరింగ్ లో అనేకమంది చనిపోయారు.

అరసనాయకం కవిత్వంలో భక్తిని, మనిషి చేస్తున్న హింసను పారలల్ గా నిలపటం చాలాకవితల్లో కనిపిస్తుంది. నువ్వు సృష్తించిన మానవుడు ఇంత హింసను చేస్తుంటే అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నట్లుంటుంది)

భయం Fear

గొంతులో భయం అడ్డుపడుతుంది
మాటలు బయటకు రావు
అల్లరి మూకల భయం

రాత్రి భయం
వెలుగు భయం
శత్రువుని చూపించే,
పగలంటే భయం
గజగజ వణుకుతూన్న దేహం మొత్తం
భయంగా మారుతుంది

మంటలు, మంటలు, మంటలు.

మృత్యు దృశ్యాలతో కిక్కిరిసిన నేత్రాలు
జ్వరంతో, దిగ్భ్రమతో
రాయిలా అంధత్వం పొందుతాయి.

నిద్రలో భయం, కలల్లో భయం
మాట్లాడితే భయం
వీధులో నడిస్తే భయం
మనవైపు ఎవరైనా
తేరిపార చూస్తే భయం
ప్రతి చూపులో, భంగిమలో భయం,
అడుగువేయాలంటే భయం
వాళ్ళు మమ్మల్ని చంపటానికి
వస్తున్నారంటే భయం
పారిపోవాలంటే భయం

మోకరిల్లటానికి ఇంకేమాత్రమూ శక్తి లేని దేహంతో
ఇంకా ఇక్కడే ఉంటున్నందుకు
నా ఆత్మలో ఏ కొంతైనా సారం మిగిలి ఉంటుందా?

శరణార్ధి శిబిరం – Refugee camp 1983

నేను ధరించిన ఒకే బట్ట
అది భరిస్తోన్న నా చమట, మురికి
నాకొక గుర్తింపు, హోదాను ఇస్తోంది

నేనెవరినో నాకు తెలిసింది

నేనెవరితో ఉన్నానో, మాట్లాడుతున్నానో
కలిసి దుఃఖపడుతున్నానో
మా అందరకూ ఒకటే పేరు
-శరణార్థి-

ఈ స్కూలు ఆవరణలో
రెండు చేతులు ముందుకు చాచి
ఈ ప్లేటులో వేయించుకొన్న గుప్పెడు మెతుకులు
నా ఆకలిని శాంతింప చేయొచ్చు
బహుసా నీది కూడా.
ఇదోరకమైన ఆకలి, తొందరగానే తీరుతుంది
ఏ భయము, ఏ అపాయమూ లేకుండా
జీవించాలనే ఆకలి అలా కాదు.

కొన్ని గుడ్డలేవో మడతపెట్టుకొని
తలగడగా చేసుకొని సిమెంటు నేలపై పడుకొంటాను
స్కూలు డెస్క్ లే నా పొలిమేరలు.
సురక్షిత ప్రాంతపు అంచుల్లో ఉండేదాన్ని
తటస్థ భూమి.

లక్షమందో ఇంకా ఎక్కువమందో ప్రజలతో పాటూ
నేనూ నిర్వాసితమయ్యాను
-అందరూ శరణార్థులే-

అనువాదం: బొల్లోజు బాబా

(ఈ వ్యాసం సారంగ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)

నిశ్శబ్దం పై రూమీ



1
పదాలింక చాలు మిత్రమా
చెవులను చూడనియ్యి,
నీ మిగతా కవితను
ఆ భాషలో మాట్లాడించు

2.
ఈ కవిత నిడివి తగ్గిస్తాను
ఎందుకంటే
అదంతా ఈ ప్రపంచంలో
మన కళ్ళముందు కనిపిస్తూనే ఉంది.

3.
ఈ నిశ్శబ్దాన్ని గుర్తించావా?
అది నువ్వు నీ గదిలో ఒంటరిగా
మాట్లాడటానికి ఎవరూ లేనప్పటి
నిశ్శబ్దం లాంటిది కాదు.

4.
ఇది స్వచ్ఛమైన నిశ్శబ్దం
ఇది
బ్రతికున్న కుక్కలు చచ్చిన కుక్కను
పీక్కు తింటున్నప్పటి నిశ్శబ్దం కాదు.

5.
నిర్మలమైన ఖాళీగా మారు
అందులో ఏముంటుంది? అని నువ్వు అడిగితే
నిశ్శబ్దం మాత్రమే అని చెప్పగలను.

6.
నిశ్శబ్దం
నువ్వు సాధన చేయాల్సిన కళ

మూలం: జలాలుద్దీన్ రూమీ
అనువాదం: బొల్లోజు బాబా

పురావస్తు తవ్వకాల చోటు వద్ద - At an Archaelogical Site by Yahuda Amichai



ఒక పురావస్తు తవ్వకాల చోటు వద్ద
శుభ్రంగా తుడిచి, వరుసలలో పేర్చిన
విలువైన వస్తువుల, పాత్రల శకలాలను చూసాను
ఆ పక్కనే
వ్యర్ధమని పారబోసిన ధూళి గుట్ట ఉంది.
దానిపై ముళ్ళ మొక్కలు కూడా మొలవవు

లోతుల్లోంచి తవ్వి, అణువణువూ గాలించి,
హింసించి, వేరుచేసి కుమ్మరించిన
ఈ ధూళి గుట్ట ఏమై ఉంటుందా అని
నాలో నేను తర్కించుకొన్నాను.

సమాధానం దొరికింది

ఈ ధూళి అంతా మనలాంటి ప్రజలే
వెండి, బంగారం, చలువరాయి
ఇంకా విలువైన వస్తువులనుండి
జీవితకాలమంతా దూరం చేయబడి
చనిపోయి నేటికీ ఇంకా ధూళిగానే
మిగిలిపోయిన మనమే

ఈ ధూళి కుప్పే మనం,
మన శరీరాలు,
మన ఆత్మలు
మన నోటి మాటలు
మన అన్ని ఆశలు.

Source: At an Archaelogical Site by Yahuda Amichai
అనువాదం: బొల్లోజు బాబా

"ఒక… " లో అనేకత్వమే సిద్దార్థ కవిత్వం





(సిద్దార్థ కట్టా కవిత్వ సంపుటి “ఒక…” రొట్టమాకు రేవు అవార్డు అందుకొంటున్న సందర్భంగా అభినందనలు తెలుపుతూ )

సిద్ధార్థ కట్టా కవిత్వం జీవితంలోని మల్టిప్లిసిటీని ప్రతిబింబిస్తుంది. అందుకే ఇతని కవిత్వంలో కాషాయమయమైన రాజకీయాలు; సానిటరీ పాడ్ల మీడ పన్నులు వేసే రాజ్యం పట్ల ధిక్కారం; గాయాలగేయాలతో రాజ్యానికి ఉరితాళ్లు పేనటం; విప్లవాన్ని స్వప్నించే తూనీగలు; నేలను లాక్కెళ్ళి నేలమీద పడేసే పసిపాప పాదాలు; పూలను మొక్కలకే ఉంచవా, నేను అమ్మవద్దే ఉన్నట్టు అని అభ్యర్ధించే పసిహృదయాలు; చీరమడతల్లో వెయ్యో అరవెయ్యో దాచిపెట్టే అమ్మలు; నోటుపై గాంధిబొమ్మ బదులు నాన్న బొమ్మ ఉండాలనేంతగా ప్రేమించబడే నాన్నలు; error 404 page not found లాంటి అత్యాధునిక పరిభాషలో పలికే వీడ్కోలు గీతాలు; మాట్లాడే సీతాకోకలు; ప్రేమలో ప్రతీదీ ప్రాణం పోసుకొంటుందన్న ఎరుకా; ….. లాంటి భిన్న జీవన పార్శ్వాలు అద్భుతంగా పలికాయి.

వస్తు విస్త్రుతి సిద్ధార్థ కవిత్వానికి గొప్ప బలం. చంద్రికల నుంచి ఉరికొయ్యలదాకా ఇతని కవిత్వం విస్తరించి ఉంది. యువకవుల్లో ఇది అరుదుగా కనిపించే లక్షణం. మంచి కవినుండి గొప్పకవిని వేరుచేసేది ఈ లక్షణమే.

ఇతని వ్యక్తీకరణ పరిధి చాలా విశాలమైనది. “రాత్రికి పెరుగన్నంలోకి చందమామను నంజి పెట్టేది” అని అమ్మగురించి ఎంత సౌకుమార్యంగా వర్ణిస్తాడో “పురుషాంగాలకు కత్తులు /మొలిచినపుడే మీ జాతి అంతరించింది” అంటూ పసిపిల్లలను అత్యాచారాలు చేయటం పట్ల తీవ్రంగా ఆక్షేపణ చేయగలడు.
నేడు మనుషులను మనుషులుగా కాక సమూహాలుగా మాత్రమే గుర్తించుకొంటున్న కాలం. సిద్ధార్థ కవిత్వం మనుషులను ప్రేమించటంలోని సౌందర్యాన్ని పట్టిచూపుతుంది. ఇది మానవసంబంధాలను వ్యక్తీకరించే అంశం. మానవసంబంధాలకవిత్వం కాలం ఉన్నంత వరకూ నిలిచిఉంటుంది.

ఎవరైనా జ్ఞాపకం వస్తే
ఒక దీపాన్ని వెలిగించి
చుట్టూతా చేతులను ఉంచండి
స్పర్శతడి సజీవంగా ఉన్న
మీ చర్మాలకు అతుక్కు పోతారు//
మీరో పూలవనాన్ని నిర్మించుకోండి
ఆప్తుల మాటలన్నీ
అత్తరులో మునిగిన తూనీగలై
తచ్చాడుతాయి (జ్ఞాపకమొస్తే) …. లాంటి వాక్యాలలోని ఆర్థ్రత మనుషులు ప్రేమైక జీవులని, ఇచ్చిపుచ్చుకోవటంలోనే జీవితపు అత్తరుపరిమళాలు ఉంటాయని చెపుతాడు సిద్ధార్థ.

కవిత్వంలో సౌందర్యవర్ణణలు ఆక్షేపణకు గురవుతున్న సందర్భమిది. సామాజిక ఘర్షణే కలిగిఉన్నదే ఉత్తమ కవిత్వమని తీర్మానించే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాసిన ఈ వాక్యాలు- జీవితంలోని అన్ని పార్శ్వాలను కవిత్వం స్పృశించినపుడు అది సంపూర్ణమౌతుందన్న సత్యాన్ని ఆవిష్కరిస్తాయి.

ఒక రోజు ఎలా వస్తుందో తెలుసా
నీ అరచేతుల మీద సీతాకోక చిలుకలు వాలినట్లు
నల్లటి చెరువులో చంద్రుడు బంతిపువ్వై ఈదుతున్నట్టూ
ఒకపూట తన హంసపాదాలతో వెతుకుతుంది నిన్ను
పాల మీద మీగడ కట్టుకున్నట్టు భలే నవ్వుతావప్పుడు మెత్తగా
నీ నోరు 32 నక్షత్రాల ఆకాశం మరి// (ఎలా వస్తుందో తెల్సా) వాక్యాలలో - చంద్రుడుని నల్లటి చెరువులో బంతిపువ్వుగా పోల్చటం గొప్ప ఊహ. ముత్యాల లాంటి పళ్ళు అనటం ఒకనాటి కవిసమయం. నోరారా నవ్వటాన్ని 32 నక్షత్రాల ఆకాశం అనటం బహుసా ఏ పూర్వకవీ చేయని ప్రయోగం. మనల్ని, మనజీవితాల్ని ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరిచేసి, నిలువనీయని జీవనసౌందర్యపు అనుభూతులు ఇవన్నీ. అందంగా, ప్రతిభావంతంగా చెప్పినప్పుడు ఇవికూడా కవిత్వానికి అర్హమే!

మనిషి ఒక అద్భుతం అనేకవితలో ఒక అద్భుతాన్ని చూపిస్తాడు సిద్ధార్థ. మానవ జన్మ ఉత్తమమైనదని ప్రవచన కారులు చెప్పొచ్చు. వాటి అర్ధాలు వేరు, వాటి ఉద్దేసాలు వేరు. మనిషి ఎందుకు అద్భుతమయ్యాడో ఒక కవిగా ఇలా అంటాడు సిద్ధార్థ.
నువ్వు ఊహించు
బతకటం ఎంత అద్భుతం//
ఎండకి గొంతెండిన పావురం
దాహాన్ని గ్రహించగలవు
కిటికీ చివర
రెండు దోసిళ్ల నీటిని పూయగలవు

అవన్నీ కాదు గానీ
ఓ పొడిగుండెని నువ్వు కనిపెట్టలేవా?
దానిని తడి చేసే మాయ నీలో ఇంక లేదా?
మనిషివి కదా
తడి చేయటం నీ లక్షణం
ఇప్పుడు చెప్పూ మనిషెంత అద్భుతం (మనిషి ఒక అద్భుతం) ఏ వాక్యమూ వాచ్యం కాదు. ప్రతీ వాక్యమూ ధ్వన్యాత్మకమే. మనిషి జన్మ రహస్యం, దాహాన్ని గుర్తించటం, తడిచేయటం….. అంతే ఈ రెండే. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా ఇదే అంతిమ సత్యం. దాన్ని గుప్పెడు వాక్యాల్లోకి కుదించిన సిద్ధార్థను కవి అని ఎలా అనగలం? ఒక అద్భుతమని కాక.

పిల్లలంటే సిద్ధార్థకు ప్రేమ. పసిపాపల ప్రస్తావన అనేక కవితల్లో వస్తుంది. వచ్చిన చోటల్లా ఆల్చిప్పలో కృత్రిమ ముత్యాన్ని పెట్టినట్లు కాక సహజంగా అమరిపోవటం కవి ప్రతిభ.

దాచుకున్న బొమ్మకు స్నానం చేయించినట్టు
నేల బుగ్గపై పసిపిల్ల ముగ్గురాసింది
ఆకాశం ఆశపడి నీళ్ల ముద్దు పెట్టింది
ఒక నాన్న చెంపలు తడిచిపోయాయి (ఐదు రెక్కలు) కూతురు వేసిన ముగ్గు వానకు కొట్టుకుపోతే నాన్న ఏడ్చాడట. ఎంత ఉదాత్త ఊహ. ఆ ఊహను కవిత్వీకరించిన విధానం ఎంత దీప్తిమంతంగా ఉందీ! ఇక్కడ వానకు కూడా పాపంటే ఇష్టమేనని ఎంత గడుసుగా అంటున్నాడూ కవి.

//పూలమొక్కను
నన్నుగా పరిగణించి
కొద్దిగా నీళ్ళను ఇవ్వండి
మీ పిల్లల అలంకరణకు
కొన్ని పూలను ఇస్తాను// (Error 404) ఇదొక వీడ్కోలు గీతం. నాకోసం వెతక్కండి అంటున్నాడు కవి. ఇక్కడ “నేను” లో ఉన్నది జీవన పరాజితుడో, రాజ్యం మాయం చేసిన అమరుడో ఎవరైనా కావొచ్చు. ఈ సందర్భానికి పిల్లల అలంకరణ ప్రస్తావనలో కవి ప్రేమే కనిపిస్తుంది.

//పక్కింటి పసిపిల్ల జ్వరం వాసన
పక్కింటి పూలతోటను రాతిరెవరో ఖాళీ చేశారట మరి// (పసి పిల్లకు జ్వరమొచ్చింది) వాక్యంలో కవి ఆడుకొనే పసి పిల్లలను పూలతోటగా వర్ణించటం ఒక రమణీయ ప్రతిపాదన.
Our kid కవిత ఒక భీభత్సరసప్రధాన మోదాంత మహాకావ్యం. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి తెచ్చిన విషాదాన్ని అక్షరీకరిస్తుంది. ఈ కవితలో వివిధ ఇంగ్లీషు వాక్యాలవాడటం కూడా చెపుతున్న వస్తువుకు బలం చేకూర్చటానికే. “Every school is a corporate prostitute, //
Do you know how much I do for you,//
Really no one loves me except this bubbly bus driver// సంజయ్ రిమెంబెర్ ఇట్/ ఇఫ్ యు గెట్ ఎ బెటర్ రాంక్, డాడ్ విల్ బై ఎ ప్లే స్టేషన్ ఫర్ యు//
Sanjay kumar roll num: 532/Got caught by squad while copying” లాంటి వాక్యాలు నేటి విద్యా వ్యవస్థలో పిల్లలు గురవుతున్న హింస తాలూకు బీభత్సాన్ని కళ్లకు కడతాయి. మనం ఇంతటి అమానవీయతకు అలవాటుపడిపోయామా అని జలదరింపచేస్తాడు.
కవితను అలా నడిపించి మనం ఏం చేయటంలేదో ఒక్కొక్కటీ గుర్తుచేస్తాడు సిద్ధార్థ కవిత మిగిలిన సగభాగంలో. “ఒంటికి వెన్న పూసుకున్న పాపాయి ఒక మెత్తని రహస్యమట”, "దూది చేతులు చాచి ఇక ఎత్తుకోమని అడుగుతాయట", "ఒక పాప భూజాల గూటిలోకి దప్పిక పిచ్చుకలా చేరుతుందట". ఆ కవిత చివర్లో ఇలా ముగిసి మనల్ని రకరకాల ఆలోచనల్లోకి నెట్టేస్తుంది.
బావి చుట్టూ చేరి
లోపలి చంద్రుణ్ణి చూపిస్తూ
వాళ్ళకోసమే రాలాడని
అబద్దం చెప్పండి//

మీలాంటి వాళ్ళనీ, మీమీ నాన్నల వంటి వాళ్ళనీ
అచ్చూ అలాంటి పోలికే అని
వాళ్ళలోకి ప్రవహించకండి
పిల్లలు మీ వారసత్వం కాదు
వాళ్ళు మీ అనుచరులూ కారు
పిల్లలు వట్టి పిల్లలే…… (our kid). మారిన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ కవిత, జిబ్రాన్ పిల్లలపై వ్రాసిన కవితకు ఒక పొడిగింపుగా అనుకొంటాను.

సిద్ధార్థ కవిత్వంలో సౌందర్యం ఎంత తేటగా పలుకుతుందో సమకాలీన రాజకీయాల పట్ల ఆవేదన, కోపం కూడా అంతే నిజాయితీగా పలుకుతాయి.
//రాజ్యమిపుడు
ఆవులా ఉంది, కాషాయంలా ఉందీ
పోలీసు బూటు కాలంత బలంగా ఉంది
రంగురంగుల గూండాల చేతిలాఠీలాను ఉంది
మొన్నటి వరకూ నాకో అనుమానం ఉండేది
ఇప్పుడు నివృత్తి అయింది
తూటాలదిప్పుడు కాషాయపు రంగే// (ప్రశ్న అనుకొని) -- గౌరీలంకేష్ హత్యపై రాసిన ఈ కవిత నేటి మత రాజకీయాలను స్పష్టపరుస్తుంది.

చివరగా అన్నీ దాటుకుని
ఓ చిన్నారి తూనీగ
సూర్యుని నెత్తిమీద వాలుతుంది
అప్పుడు నీకూ అనిపిస్తుంది
విప్లవం ప్రకృతి ధర్మమని. -- (విప్లవ ప్రకృతి ధర్మం). ఎన్ కౌంటర్ల పేరిట ఎంతమందిని చంపినా అంతిమంగా విప్లవమే జయిస్తుందని, ఎందుకంటే విప్లవం అనేది ప్రకృతి ధర్మమని అంటాడు. ఈ తరహా కవిత్వంలో ఇదొక నవ్యమైన ఊహ.

ఆధునిక జీవన సారాంసాన్ని కవిత్వం చేయటం సిద్ధార్థ కవిత్వలక్షణం. మంచి పదచిత్రాలను అలవోకగా సృష్టించగలిగే ప్రతిభకలిగినవాడు సిద్ధార్థ. జీవితంలోని మల్టిప్లిసిటీని అర్ధం చేసుకొన్నవాడు. జీవితం పట్ల తనకున్న నిర్ధిష్టమైన ఆలోచనలను సౌందర్యాత్మకంగాను, శక్తివంతంగానూ కవిత్వంలోకి ఒంపగలిగిన నేర్పు కలిగినవాడు.

“ఒక” ఇతని తొలి కవిత్వసంపుటి. భవిష్యత్తులో ఇతను మరిన్ని సంపుటులుగా విస్తరించి, తెలుగు కవిత్వకిరీటానికి మెరుపుల తురాయిలా వెలగాలని ఆశిస్తున్నాను.
రొట్టమాకు రేవు అవార్డు అందుకొంటున్నందుకు అభినందనలు.

బొల్లోజు బాబా

ప్రేమ...



చాన్నాళ్ళ తరువాత
చిన్ననాటి స్నేహితురాల్ని
కలిసాను
ఒకనాటి విఫల ప్రేమికురాలు
ఆమె.

ప్రేమించిన వాడి
పేరును
చేతిపై పచ్చబొట్టు
వేయించుకోవటాన్ని
వింతగా చెప్పుకొనేవాళ్ళం
అప్పట్లో!

హృదయంపై ఉండే
బార్‌ కోడ్‌ గీతలు ఒక్కొక్కటీ
కులానికి
మతానికి
అంతస్తుకి
ప్రతీకలని ఇప్పటికైనా
గ్రహించిందో లేదో!

బొల్లోజు బాబా

ఎవరు వీళ్లంతా?



ఏసుబాబు
వీరాస్వామి
లక్ష్మణరావు
పెంటయ్య
ఇంకా కొంతమందీ.... ఎవరు వీళ్ళంతా!
ఓ ముప్పై నిముషాల వ్యవధిలో
ధరాధిపతులు, నరహంతకులూ అనాదిగా
చేసిన కృత్యాలన్నీ అకృత్యాలేనని
ఒక్క తులసిదళంతో తేల్చిపారేసారు.

అంత చేసీ
ఒడ్డుకు లాక్కొచ్చిన ఇరవైఏడుమందిలో
ముగ్గురి ప్రాణాలు కాపాడలేకపోయామని
బాధపడుతున్నారు చూడు!

ఓ నా చిట్టి మేధావీ!

ఆ కొద్దిక్షణాలూ
బొట్టు, టోపీ, శిలువా, రోలెక్స్ వాచీ
ఏ తారతమ్యం లేదక్కడ
ఆ కొద్దిక్షణాలూ
మనం నిర్మించుకొన్న
గోడలన్నీ కుప్పకూలిపోయాయి

ఓ నా చిట్టి మేధావీ!
మరోసారి చెపుతున్నాను విను.

మానవత్వం ఒకటే
మునిగిపోతున్న ప్రాణానికి ప్రాణం పోసింది
మనిషితనం ఒకటే
మనిషిని మనిషితో బంధించింది.
మనిషి గమ్యం మనిషితనమే ఏనాటికైనా!

ఐస్ ఏజ్ నుంచి డిజిటల్ ఏజ్ దాకా
మానవజాతి నౌకాయానానికి
ఏ చరిత్రా గుర్తించని
కనిపించని తెడ్లు వీళ్ళు.
మనుషులుగా మనం పూర్తి వైఫల్యం
చెందలేదనటానికి మిగిలున్న
ఒకే ఒక సాక్ష్యం వీళ్ళు.

బొల్లోజు బాబా

(ఇటీవలి గోదావరి బోట్ ప్రమాదంలో అనేక ప్రాణాలు కాపాడిన స్థానికజాలరుల కొరకు)

గాధాసప్తశతిలో మానవసంబంధాలు -1



రెండువేల సంవత్సరాలనాటి గాథాసప్తశతిలో ఆనాటి సామాన్యులు ఎలాంటి మానవసంబంధాలను కలిగి ఉండేవారు అనేది చాలా ఆశక్తికరమైన అంశం. గ్రామపెద్ద, తల్లి, పిన్ని, అత్త, భర్త, భార్య, ప్రియుడు, ప్రియురాలు, దూతలు, మరిది, సవతి, కోడలు, పిల్లలు లాంటి పాత్రలతో చెప్పించిన అనేక గాథలద్వారా వారు నెరపిన మానవీయబంధాలు తెలుస్తాయి. ఆనాటి కుటుంబ, సాంఘికజీవనాలు ఎలానడిచాయన్నది అర్ధమౌతుంది.

సప్తశతి గాథలన్నీ గ్రామీణజీవనానికి సంబంధించినవి. పరిపాలనకు సంబంధించి ఒక గ్రామ పెద్ద, పన్నులు వసూలు చేసే అధికారి ఉండేవారని ఈ గాధల ద్వారా తెలుస్తుంది. ఆ పై స్థాయి పరిపాలనా అంతస్తుల వివరాలు తెలియరావు. ఆనాటి గ్రామాలు స్వతంత్రతను, కొంతవరకూ స్వయంపాలనను కలిగిఉండేవని అనుకోవచ్చు.

1. గ్రామాన్ని సంరక్షించటం గ్రామపెద్ద విధి. అది బహుసా దొంగలు, బందిపోట్ల ముఠాలనుంచి కావొచ్చు. ఆ విధినిర్వహణలో అతను వీరోచితంగా వ్యవహరించి, గాయాలపాలయ్యేవాడని అర్ధమౌతుంది ఈ క్రింది గాథద్వారా...

ఊరికాపు అయిన మగని చాతీ
మానిన గాయాలతో ఎగుడుదిగుడుగా ఉంది.
దానిపై తలాన్చి పడుకొన్న భార్యకు నిద్రపట్టటం లేదు.
ఊరు మాత్రం ప్రశాంతంగా నిదురపోతోంది. (31)

2. గ్రామపెద్ద విధి వంశపారంపర్యం. కాబోయే గ్రామపెద్ద చిన్నతనం నుండే తండ్రివద్ద ఊరిని సంరక్షించే విద్యలను నేర్చుకొని, అవసరమైనప్పుడు తన సాహసాన్ని ప్రదర్శించటం లాంటివి కొన్ని గాధలలో కనిపిస్తుంది.

అతని బంధువులు శంకించినట్లు
శత్రువులు భయపడినట్లు
ఊరికాపు కొడుకు, చిన్నవాడైనప్పటికీ
గ్రామాన్ని కాపాడటంలో
అసామాన్యమైన ధైర్యసాహసాలు
ప్రదర్శించాడు. (630)

3. తనకు నిర్ధేశించబడిన ధర్మాన్ని ఆచరించటమే జీవనపరమార్ధమని ప్రాచీన భారతీయసంస్కృతి చెపుతుంది.

మరణశయ్యపై ఉన్న ఊరికాపు
తన కొడుకును దగ్గరకు తీసుకొని ఇలా అన్నాడు
"నాయినా! నా పేరు చెప్పుకోవటానికి
సిగ్గుపడేలా ప్రవర్తించకు ఏనాడూ" (634)

పై గాథలో ఆ ఊరికాపు తన ధర్మాచరణలో ఏ తప్పూ చేయలేదని ఎంత ఆత్మతృప్తితో ఉన్నాడో అర్ధమౌతుంది. ఎంతటి నిష్కల్మష జీవితాలు అవి!

4. గ్రామానికి సంబంధించిన బాగోగులు చూసుకోవటంలో తలమునకలై "సంసారిక బాధ్యతలను" విస్మరించే గ్రామపెద్దలు/మల్లయోధుల ప్రస్తావనలు కొన్ని ఉన్నాయి.

ఓసి పిచ్చిదానా!
ఆనందంతో గంతులు వేస్తావెందుకూ?
ఇది సిగ్గుపడాల్సిన సందర్భం.
కుస్తీపోటీలో నీ భర్త విజయం సాధించినందుకు
మోగిస్తున్న విజయభేరి
నీ సంసారంలో సుఖం లేకపోవటాన్ని
ఊరంతా చాటింపు వేస్తున్నది. (687)

5. ఊరికాపు, పన్నులు వసూలు చేసే అధికారి, ధనికరైతులు ఆనాటి సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు. ఆనాటి ప్రజలు స్వేచ్ఛా శృంగార ప్రియులు. గొల్ల, వెలమ, మంగలి, కాపు, కంసాలి వంటి కులాల ప్రస్తావన ఉన్నప్పటికీ శృంగారపరంగా కులమతాల ప్రస్తావన ఎక్కడా కనిపించదు.

ఊరిపన్నులు వసూలు చేసే అధికారి భార్య
రోజూ ఇచ్చే మధురమైన వంటకాల రుచిమరిగిన
ఆ పాలెకాపుకు మరే ఇతర తిండి సయించటమే లేదు.

ఆ డబ్బున్న స్త్రీ, పాలెకాపును ముగ్గులోకి దించినట్లుంది. ధనవంతులు తినే ఖరీదైన, రుచికరమైన వంటకాలను అతని పేద భార్య ఎక్కడనుంచి తేగలదూ?

6. తన తొలిప్రేమను తల్లితో చెప్పుకొనే యవ్వనవతులు ఈ గాథలలో అనేకమంది కనిపిస్తారు.

అమ్మా
నదిలో నేను స్నానం చేసేటపుడు
కుంకుడు రసంతో చేదెక్కి పారే నీళ్ళను
ఆ యువకుడు దోసిళ్లతో తాగుతున్నప్పుడు
నా హృదయాన్ని కూడా తాగినట్లు అనిపించిందే!

పై గాథలో తను ఇష్టపడిన అమ్మాయి శరీరాన్ని తాకి ప్రవహించే చేదునీళ్ళు కూడా తీయగానే ఉన్నాయి అని ఒక అబ్బాయి తెలియచేయటం, ఆ సంకేతాన్ని గ్రహించిన అమ్మాయి తన తల్లితో పంచుకొని మిగిలిన వ్యవహారాలు మీరు చక్కబెట్టండి అని అన్యాపదేశంగా చెప్పటం ఎంతో హృద్యంగా అనిపిస్తుంది.

7. అత్తా కోడళ్ల మధ్య సంబంధాలు కొన్ని చోట్ల స్నేహంగా, కొన్ని చోట్ల మోసపూరితంగా, మరికొన్ని చోట్ల శత్రుభావాలతో ఉంటాయి చాలా గాథలలో.

అత్తా
పదాలు ఒకటే కావొచ్చు
అవి ప్రేమతో పలికిన మాటలా లేక
పైపై పలుకులా అనే దానిని బట్టి
కాని వాటి అర్దాలు మారిపోతాయి (450)

అత్తతో తన వేదనను చెప్పుకొంటోంది పై అమ్మాయి. స్త్రీలు చేసే అలాంటి అభియోగాలకు ఈనాటికీ కూడా ఏ మగవాడూ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేడు. ఇది మగజాతికి సంబంధించి ఒక అనాది తీయని సలపరింత. అలాంటివన్నీ కలహానంతర సమాగమాన్ని ప్రకాశింప చేయటానికే.

8. తనకు లేని సుఖం పొందుతున్నారు కనుక అని ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని, తన అధికారం చేజారిపోతూండటం వల్లేనని ఏడ్లర్ సిద్దాంతాన్ని - దేన్ని అనువర్తింపచేసుకున్నప్పటికీ అత్తా కోడళ్ళ విరసాలు ఈనాటివి కావు. భార్య మోజులో పడి కొడుకు పతనమైపోతున్నాడని ఆరోపించటం అనేక గాథల్లో కనిపిస్తుంది.

వర్తకుడా!
నీకు ఏనుగు దంతాలు, పులిచర్మాలు
ఇదివరకట్లా ఎలా సరఫరా చేయగలం?
కొత్తకోడలు వయ్యారంగా పిరుదులు
తిప్పుకుంటూ ఇంట్లో తిరుగుతూంటే! (951)

కోడలు కొంగుపట్టుకొని తిరుగుతూ ఇదివరకట్లా వేటకు వెళ్ళి ఏనుగుల్ని పులుల్ని వేటాడి తేవటం లేదని దెప్పుతోంది అత్తగారు.
అంతే కాదు మరికొన్ని గాథల్లో -భార్యగుర్తుకు రావటంతో లేడి జంటపై ఎక్కుపెట్టిన విల్లును దించేసిన విలుకాళ్ళు కూడా కనిపిస్తారు. అది భార్యాభర్తల అన్యోన్యతకు సంకేతం.

9. ఈ క్రింది గాథ మానవసంబంధాలలోని సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది.

బదులు చెప్పు
అనుచిత సమయంలో, కాని చోట
విసిగిస్తే నీకు కోపం రాదా?
శృంగారంలో మునిగి ఉన్నప్పుడు
ఎంతటి గారాల బిడ్డయినా ఏడ్చుకొంటూ దరిచేరితే
ఏ తల్లి తిట్టుకోకుండా ఉంటుందీ?

విషయం స్పష్టమే. నిజానికి ఈ గాథలోని రెండవ ఉదంతం, మొదట జరిగిన ఒక సంఘటనను సమర్ధించుకోవటానికి చెప్పినట్లు తెలుస్తుంది. ఒక ప్రియుడు తన ప్రియురాలిని కాని చోట విసిగించి ఉండొచ్చు. అప్పుడు ఆమె తిరస్కరించటమో, కోపం వచ్చి తిట్టటమో చేసి ఉంటుంది.

ఆమె చేసిన పనిని సమర్ధించటానికి ఈ ప్రాచీన గాథాకారుడు ఎంత శక్తివంతమైన దృష్టాంతాన్ని తీసుకొచ్చాడో ఆశ్చర్యం కలిగించక మానదు.

10. మానవసంబంధాలు మాత్రమే మానవుడిని జీవరాశిలో ఉత్తమంగా నిలబెట్టాయి. ఈ బంధాల వెనుక ఉండే ఆర్థ్రతను సాహిత్యం మాత్రమే లిఖించగలదు. ఈ క్రింది గాథ చదివాకా హృదయం ద్రవిస్తుంది.

గర్బం ధరించిన కోడలు పిల్లను
"నీకు ఏం తినాలని ఉందో చెప్పు" అని
పదే పదే అత్తమామలు అడుగుతూంటే
తన అత్తవారింటి పేదరికాన్ని
తన భర్తకు కలిగే సంకట స్థితిని దృష్టిలో ఉంచుకొని
ప్రతీసారీ "నీళ్ళు, నీళ్ళు" అంటుందామె. (472)

పై గాథలోని కుటుంబం బహుసా తిండికి కూడా కష్టమయిన పేదరికంలో ఉండొచ్చు. అయినా సరే ఏదోలా, గర్బవతి అయిన కోడలి కోర్కెలు తీర్చాలన్న ప్రేమ ఉంది. ఆ ఇంటిని పోషించే నాథుడు తన భర్తే కావొచ్చు. అలాంటి స్థితిలో ఆమె అనుచితకోర్కెలు కోరితే, అవి వారు తీర్చలేక పోతే- వారందరిలో అపరాధనా భావం ఎక్కడ మిగిలిపోతుందోనని ఆమె పాటించే సంయమనం ముచ్చటేస్తుంది.
గొప్ప మానవసంబంధాల గిజిగూడు ఈ గాథ.

అనువాదాలు- బొల్లోజు బాబా

1857 సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర్య పోరాటమా?



సిపాయిల తిరుగుబాటు మొదటిదీ కాదు స్వాతంత్ర్యపోరాటమూ కాదు.

ఈస్ట్ ఇండియా కంపనీ (వ్యాపారుల కూటమి) 31 డిసంబరు, 1600 లో క్వీన్ ఎలిజబెత్ I నుంచి ఒక రాజపత్రం ద్వారా అనుమతి తీసుకొని భారతదేశంలో వ్యాపారం చేయటానికి అడుగుపెట్టింది. మొదట్లో దీనికి రాజ్యాధికారం చెలాయించాలనే కోరిక లేదు కానీ కాలక్రమేణా స్థానిక రాజకీయాలలో కలగచేసుకొని రాజ్యాలను ఆధీనంలోకి తెచ్చుకోవటం మొదలుపెట్టింది. సొంత సైన్యాన్ని ఏర్పాటుచేసుకొంది.

1803 లో ఈస్ట్ ఇండియా కంపనీ వద్ద రెండున్నరలక్షల "ప్రెవేట్ సైన్యం" ఉండేది. అప్పటి బ్రిటన్ ప్రభుత్వ సైన్యం సంఖ్యకు ఇది రెట్టింపు.

ఈస్ట్ ఇండియా కంపనీ యుద్ధాలు చేసింది. రాజుల్ని ఓడించింది. వారసులు లేని రాజ్యాలను ఆక్రమించుకొంది. తన "ప్రెవేట్ సైన్యం" సహాయంతో కప్పాలను వసూలు చేయటం మొదలెట్టింది. 1850 నాటికి భారతదేశంలోని మూడొంతుల భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొంది.

అలా ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం 1857లో సిపాయిల తిరుగుబాటు వరకూ కొనసాగింది. సిపాయిల తిరుగుబాటు ఉదంతంతో విక్టోరియారాణి ఈస్ట్ ఇండియా కంపనీని రద్దు చేసి బారతదేశాన్ని 1858లో తన పాలనలోకి ( క్రౌన్ పాలనలోకి) తీసుకొంది. అప్పటినుంచి 1947 దాకా సాగిన పాలనను బ్రిటిష్ రాజ్ అని చరిత్రకారులు పిలుస్తారు.

ఈ క్రమంలో భారతదేశంలో 1858 వరకూ జరిగింది - వ్యాపారస్తుల కూటమి ప్రెవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని జరిపిన ఆధిపత్యమే తప్ప ఒక ప్రజాస్వామ్యయుత, రాజ్యపాలన కాదు. అసలు అది ప్రభుత్వమే కాదు.

1858 నుంచి జరిగినది వ్యవస్థాగతంగా, చట్టాలకు లోబడి జరిగిన రాజ్య/ప్రభుత్వ పాలన.
****

సిపాయిల తిరుగుబాటే దేశంలో జరిగిన మొదటి తిరుగుబాటా?

వేలసంవత్సరాలుగా రాజు పేరుమీద ఉండిన భూమిహక్కులు ఒక్కసారిగా కంపనీకి దఖలు పడ్డాయి. ఆ భూమిని సాగుచేసుకొంటూ ఉన్న భూస్వాములకు పించను ఏర్పాటుచేసి వారిని తొలగించింది కంపనీ. ఈ చర్యతో అంతవరకూ ఒక హార్మొనీతో నడచిన సమాజం పెద్ద కుదుపుకు లోనైంది. నిజానికిది నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఆధారిత ఫ్యూడల్ సమాజం.

ఈస్ట్ ఇండియా కంపనీ వారి దుశ్చర్యలను ప్రతిఘటిస్తూ 1857కు ముందునించీ అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి

కట్ట బొమ్మన తిరుగుబాటు, తమిళనాడు (1792-1799)
పైకుల తిరుగుబాటు, ఒరిస్సా (1804-1806)
వేలు తంబి తిరుగుబాటు, కేరళ (1808 - 1809)
కిట్టూరు తిరుగుబాటు, కర్ణాటక (1824-29)
బుందేల్ తిరుగుబాటు, మధ్య ప్రదేష్ (1842)
వీరభద్రరాజు తిరుగుబాటు, విశాఖపట్నం (1827-1833)
పాలకొండ తిరుగుబాటు, తూర్పుగోదావరి (1831-1832)
పర్లాకిమిడి తిరుగుబాటు, ఒరిస్సా (1829-35)

పై తిరుగుబాట్లన్నీ

తమతమ అధికారాలను నిలుపుకోవటానికి
భూమిపై తమ పెత్తనాన్ని కొనసాగించటానికి
ఇతర వ్యక్తిగతకారణాలతో
స్థానికంగా జరిగాయే తప్ప దేశభక్తి, స్వాతంత్ర్యకాంక్ష లాంటి జాతీయ భావాలతో దేశమంతా విస్తరించి జరగలేదు.

1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు వీటన్నిటికన్నా పెద్దది. ఇది బ్రిటిష్ వారిని గడగడలాడించింది. ఇది కూడా వ్యక్తిగత కారణాల కోసమే జరగడం గమనార్హం.

ఈ తిరుగుబాటులో బెంగాల్ సైనిక పటాలం ఒక్కటే పాల్గొంది. మద్రాసు బొంబాయి సైనికులు పాల్గొనలేదు. బ్రిటిష్ సైనికులకు మూడురెట్లు ఎక్కువ జీతం ఇస్తున్నారనే అనే కారణం ప్రధానంగా కనిపిస్తుంది వారి తిరుగుబాటుకు

సిపాయిల తిరుగుబాటుకు మద్దతు పలికిన నాయకులకు కల వ్యక్తిగత కారణాలు ఇలా ఉన్నాయి.

1. బహదూర్ షా II అప్పటికి రాజ్యం లేని మొఘల్ చక్రవర్తి. మొఘల్ రాజ్య పునస్థాపనకొరకు యత్నించాడు.
2. నానాసాహెబ్ కు పించను తగ్గించారు. కంపనీవారితో చేసిన చర్చలు ఫలించలేదు.
3. కంపనీ వారు రాణి లక్ష్మి బాయి దత్తతకుమారుడిని వారసునిగా గుర్తించలేదు
4. బెంగాల్ సైనికులు మొఘల్ రాజ్యాన్ని స్థాపించటం లక్ష్యంగా పెట్టుకొంటే, నానాసాహెబ్, తాంతియాతోపెలు మరాఠా రాజ్యాన్ని స్థాపించాలని తలచారు. ఈ వైరుధ్యం తిరుగుబాటు వైఫల్యానికి ప్రధాన కారణం.
5. సిపాయిల తిరుగుబాటుకు ఆధ్యుడుగా భావించే మంగళ్ పాండే ఒపియం ఎక్కువగా తీసుకొని ఉద్రేకితుడై బ్రిటిష్ అధికారిని చంపాడని రికార్డులద్వారా తెలుస్తుంది.

అందుకనే జవహర్ లాల్ నెహ్రూ 1857 తిరుగుబాటుని ఫ్యూడల్ శక్తులు సమాజంపై తమ పట్టుని నిలుపుకోవటానికి చేసిన ఒక ప్రయత్నమని అన్నాడు.
****

1857 సిపాయిల తిరుగుబాటుని ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం అని మొదట ఎవరు అన్నారు?

The Indian War of Independence (1909) అనే పుస్తకంలో వీర్ సావార్కర్ 1857 నాటి సిపాయిల తిరుగుబాటుని మొదటి స్వాతంత్ర్యపోరాటంగా అభివర్ణించాడు. ఆయన సమకాలీనులు, చరిత్రకారులు ఆ వాదనను అప్పట్లోనే ఖండించారు.

వీరిలో ప్రముఖ చరిత్రకారుడు శ్రీ R.C Majumdar ముఖ్యుడు. భారతీయ మధ్యతరగతి వర్గాలు ఇంగ్లీషు చదువులు చదువుకొని, అంతర్జాతీయ పరిణామాలను అర్ధం చేసుకొని స్వాతంత్ర్య పోరాటానికి దేశాన్ని సమాయుత్తపరిచారని మజుందార్ అంటాడు.

1905 లో బెంగాల్ విభజన జరిగినపుడు దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని "మొదటి స్వాతంత్ర్య సంగ్రామం" అని మజుందార్ అభిప్రాయపడ్డాడు.

బెంగాల్ విభజనను దేశవ్యాప్తంగా జాతీయవాదులు వ్యతిరేకించారు. ఈ విభజన వ్యతిరేక ఉద్యమం/ వందేమాతర ఉద్యమం/స్వదేశీ ఉద్యమంగా మారి భారతదేశ ప్రజలను సంఘటితం చేసి బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విముక్తం చేయాలన్న కోర్కెను వారిలో రగిల్చింది. .

రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జి, సుబ్రహ్మణ్య భారతి, అరవింద్ ఘోష్, ముట్నూరి కృష్ణారావు, చిదంబరం పిళ్లై లాంటి ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పైన పేర్కొన్న ప్రముఖుల పేర్లను గమనిస్తే

1. ఈ ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా జరిగినట్లు అర్ధమౌతుంది.
2. వారికి పరాయిపాలన నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న కోరిక తప్ప మరేవిధమైన వ్యక్తిగత ప్రయోజనాలు కనిపించవు.
****

బ్రిటిష్ పార్లమెంటు 1784 లో చేసిన పిట్స్ ఇండియా యాక్టు ద్వారా కంపనీ మెంబర్లు సివిల్, మిలటరీ, రెవిన్యూ హక్కులు తెచ్చుకొన్నారు. (వీళ్ళే అక్కడ ఎలైట్ వర్గాలు). దాంతో మరింత రెచ్చిపోయారు. ఆ తరువాత వచ్చిన 1813, 1833 ల నాటి చార్టర్ల ద్వారా కంపనీ అతిని కొంతమేరకు నియంత్రించటానికి ప్రయత్నించింది బ్రిటిష్ పార్లమెంటు.

1857 తిరుగుబాటులో 6 వేల మంది బ్రిటిషర్లు చనిపోవడం ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అరాచకాల ఫలితమని బ్రిటష్ పార్లమెంటులో Benjamin Disraeli వాదించిన ఫలితంగా భారతదేశం క్రౌన్ పాలనలోకి వచ్చింది. ఆ రకంగా సిపాయిల తిరుగుబాటుకి ఉన్న చారిత్రక ప్రాధాన్యత తక్కువేమీ కాదు.

1857 నాటి తిరుగుబాటునే ప్రధమ స్వాతంత్ర్య పోరాటంగా అంగీకరించటానికి ఇన్ని మతలబులు ఉన్నప్పుడు .......1847 లో పించను తగ్గించారని చేసిన ఒక ఉక్రోషపు తిరుగుబాటును "తొలి స్వాతంత్ర్యపోరాటం" అని ప్రచారించుకొంటూంటే ఆశ్చర్యంగా ఉంది.

బొల్లోజు బాబా

కనీసం తొలి పాలెగాండ్ర పోరాటం కూడా కాదు


.
నిజాం రాజు తనకు సైనిక సహాయం చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఈస్ట్ ఇండియా కంపనీకి 1800 లో బళ్ళారి, కడప, అనంతపురం ప్రాంతాలను ధారాదత్తం చేసాడు. వీటిని సీడెడ్ జిల్లాలు అంటారు.

కృష్ణదేవరాయల కాలంనుంచీ ఈ ప్రాంతాలలో పాలెగాండ్ర వ్యవస్థ ఉంది. ఒక పాలెగార్ ఆధీనంలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించిన శిస్తులను వసూలు చేయటం, తగాదాలు తీర్చటం అతని విధి. ఇందుకోసం వాళ్ళు సొంత సైన్యం కూడా కలిగిఉండేవారు. వసూలు చేసిన శిస్తులలో కొంతభాగం రాజుగారికి కప్పం రూపంలో చెల్లించాలి.

కప్పాలు సరిగ్గా చెల్లించని పాలెగాళ్లను రాజు తొలగించినపుడు ఆ గ్రామాల హక్కులను ఇతర పాలెగాళ్ళు ధరచెల్లించి పాడుకొనే వారు.

ఈస్ట్ ఇండియా కంపనీకి ఈ ప్రాంతాలు దఖలుపడటంతో ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమనే భాద్యతను థామస్ మన్రో అనే అధికారికి అప్పగించింది కంపనీ. 9, నవంబరు 1800 న థామస్ మన్రో బళ్లారికి వచ్చాడు.

భూమి శిస్తువసూలులో రైతువారి వ్యవస్థను ప్రవేశపెట్టటానికి ఈస్ట్ ఇండియా కంపనీని ఒప్పించాడు థామస్ మన్రో. రైతు వారి వ్యవస్థ అంటే జమిందార్లు, పాలెగాండ్రు లాంటి మధ్యవర్తులకు కాక రైతులకే నేరుగా భూమి అప్పగించి వారినుండి పన్నులు వసూలు చేసే వ్యవస్థ. ఇది అప్పట్లో గొప్ప విప్లవాత్మక భూసంస్కరణ.

1800 లో ఈ సీడెడ్ ప్రాంతాలలోని భూమినంతా స్వాధీనం చేసుకొంది కంపనీ. పాలెగాండ్రులందరూ తమ అధికారాన్ని, పెత్తనాన్ని రాత్రికి రాత్రి కోల్పోయారు.

అంతవరకూ తరతరాలుగా భూమిపై హక్కులు అనుభవిస్తున్న పాలెగాండ్రు దీన్ని వ్యతిరేకించారు. వారినందరనీ చర్చలకు పిలిచి వారి వారి భూమి విస్తీర్ణాన్ని బట్టి కంపనీనుంచి పించను ఏర్పాటు చేసి చాలా మట్టుకు పాలెగాండ్ర అసంతృప్తిని తొలగించగలిగాడు థామస్ మన్రో. అయినప్పటికీ తాము కోల్పోయిన హక్కుల్ని పునరుద్దరించుకోవటం కొరకు కోటల్ని ఆక్రమించుకొంటూ, గ్రామాల్లో కంపనీ అధికారుల్ని చంపివేస్తూ అనేకమంది పాలెగాండ్రు తిరుగుబాట్లు చేసారు.

1800 డిసంబరు నెలలో అయిదువందల మంది అనుచరులతో బళ్ళారిలో హరి నాయకన్ తిరుగుబాటు; నూట డబ్బై మూడు మంది కంపనీ సైనికుల మరణానికి కారణమైన 1801 నవంబరు నాటి పొటేల్ తిరుగుబాటు; 1802 జులై నెలలో ముప్పై ఆరుమంది అనుచరులతో దివాకర్ నాయర్ చేసిన అలజడి; వేలమందిని సమీకరించి 1804 లో కుద్రిత్ ఉల్లాఖాన్, ఇతర పాలెగాండ్రు చేసిన తిరుగుబాటు; అయిదువందల మంది అనుచరులతో 1804 మార్చ్ 27 న కొనకొండ్ల కోటను స్వాధీనంచేసుకొన్న గురువప్ప నాయర్ తిరుగుబాటు లాంటి అనేక పాలెగాండ్ర పోరాటాలను కంపెనీ సైన్యం అణచివేసింది. కొంతమందిని ఉరితీసింది.

గొడికోట పాలెగార్ అయిన బొమట్రాజు 1828 జూన్ 28 న తనకు ఇస్తున్న పించను సరిపోవటం లేదని ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నానని "తిండిలేక మేము చచ్చిపోతున్నాము" అని కంపనీ హవాల్దారు వద్ద చెప్పుకొన్నాడు. అధికారులు స్పందించకపోవటంతో కొంతమంది సేవకుల్ని వెంట వేసుకొని కంపనీ అధికారులపై దాడులు చెస్తే అరెస్టు చేయబడ్డాడు.

నొసుమ్ సంస్థానానికి పాలెగార్ నరసింహారెడ్డి. నొసుమ్ సంస్థానాన్ని కంపనీ స్వాధీనం చేసుకొనే సమయానికి, అంతవరకూ బాకీపడిన శిస్తు నిమిత్తమై వచ్చి వివరణ ఇవ్వాల్సిందని 1800 లో థామస్ మన్రో పిలిచినపుడు నొసుమ్ నరసింహారెడ్డి హాజరు కాలేదు.

క్రమేపీ ఏ ఆదాయవనరులూ లేక ఆర్ధిక ఇబ్బందులు తలెత్తటంతో తన పంతాన్ని వీడి పించను తీసుకొని, ఇంటికే పరిమితమై 4, నవంబరు 1804 లో చనిపోయాడు.

నొసుమ్ నరసింహారెడ్డి మరణానంతరం అంతవరకూ అతనికి ఇస్తున్న 8,323 రూపాయిల పించనును అతని భార్యకు బదలాయించింది కంపనీ.

నొసుమ్ నరసింహారెడ్డి దత్తత కుమారుడు జయరామిరెడ్డి, అతని మనవడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. 1846 నాటికి మూడు తరాలు గడిచిపోవటం; వారసులకు పించను పంచుకొంటూ రావటం వల్ల నరసింహారెడ్డి వాటా పది రూపాయిల పది అణాల ఎనిమిది పైసలకు చేరింది. అది ఇవ్వటానికి కూడా అవమానించే పరిస్థితులు ఏర్పడటం వల్ల నరసింహారెడ్డి కంపనీ అధికారులపై తిరుగుబాటు చేసాడు. నలభై ఆరు సంవత్సరాలలో వేరే ఏదో జీవనోపాధి ఏర్పాటుచేసుకోకుండా కంపనీ ఇచ్చే పించనుపై ఎందుకు ఆధారపడ్డారనేది ఆసక్తి కలిగించే అంశం.

భవిష్యత్తు అద్భుతంగా ఉందని చెప్పిన గోసాయి వెంకన్న అనే ఒక సాధువు మాటతో కంపనీతో యుద్ధానికి దిగాడు నరసింహారెడ్డి. ఊరూరూ తిరిగి మిగిలిన బాధిత పాలెగాండ్రను ఏకం చేయగలిగాడు.

వీరంతా నరసింహారెడ్డి నాయకత్వంలో నడిచి 1846 జూలై లో తాహసిల్దారును, కంపనీ గుమస్తాను చంపేయటంతో తిరుగుబాటు మొదలైంది. ఇతని అనుచరుల సంఖ్య అయిదువేలకు పెరిగింది. వీరిలో ఎక్కువగా బోయలు, యానాదులు, చెంచులు ఉన్నారు. నరసింహారెడ్డి కొంతకాలం కంపనీ పోలీసులను గడగడలాడించి 1846 అక్టోబర్ 6 న కడప కలక్టర్ కాక్రేన్ కుయుక్తులవల్ల అరస్టయి ఉరితీయబడ్డాడు.
****

జమిందార్లు, మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతే శిస్తు కట్టే రైతువారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన థామస్ మన్రో ఆలోచనలు ఆధునికమైనవి. అప్పటికి అవి విప్లవాత్మకమైనవి. కార్న్ వాలిస్ 1793 లో బెంగాల్ లో ప్రవేశపెట్టిన జమిందారీ వ్యవస్థ వల్ల జమిందార్లు బలిసిపోతున్నారు తప్ప కంపనీకి పెద్దగా లాభాలు రావటం లేదన్న దూరాలోచనను కూడా కాదనలేం.

పాలెగాండ్ర వ్యవస్థ ఫ్యూడల్ సమాజపు నిర్మాణం. ఇందులో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ దాని తాలూకు పీడన, కులాధారిత వెట్టిచాకిరీ ఉంటుంది. దాన్ని పునఃస్థాపించటానికి చేసిన వ్యక్తిగత పోరాటాన్ని దేశభక్తిగా ప్రొజెక్ట్ చేయటం; కనీసం తొలి పాలెగాండ్ర పోరాటం కూడా కానిదాన్ని తొలి స్వాతంత్ర్యపోరాటంలా ప్రచారించటం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

బొల్లోజు బాబా

పట్నం కన్నీరు..


1 October 2019 ·
..

రాత్రి వేసిన
సెమెంటు రోడ్డుపై
ఏ పశువో నడిచిందేమో!

జంట చంద్రవంకల్లా
కాలి గిట్టల గుంటలు.

వాన నీరు చేరి నీలంగా ఉన్నాయి

గోరటి వెంకన్న గుర్తొచ్చాడు

చుట్టూ చూసాను
ఒక్క పిట్టా కనిపించలేదు.

బొల్లోజు బాబా

good discussion

పాఠం



ప్యూపా నుంచి అందమైన
సీతాకోక చిలుక రావటాన్ని
నిబిడాశ్చర్యంతో
గమనించాడా పిలగాడు.

అది రెక్కల్లార్చుకొంటూ
ఎగురుతోంటే చప్పట్లు కొడుతూ
ఆనందించాడు.

కొన్నాళ్ళకు
చచ్చిపోయిన ఓ సీతాకోకను
బ్రతికించటానికి ఎన్నో ప్రార్థనలు చేసి
ఫలించక ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు.

జీవితం ముందుకేతప్ప వెనక్కు
ప్రవహించదన్న సంగతి
ఏ స్వప్నమో నేర్పుతుందిలే!

బొల్లోజు బాబా

రొట్టమాకు రేవు అవార్డు స్వీకరణ సభలో -- నా స్పందన



శ్రీ కె.ఎల్ నర్సింహారావు గారి పేరిట ఇస్తున్న ఈ రొట్టమాకు రేవు అవార్డును అందుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి గౌరవానికి నన్ను పాత్రుణ్ణి చేసిన శ్రీ యాకూబ్, శ్రీమతి శిలాలోలిత దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

అవార్డు ఎంపిక కమిటీ సభ్యులైన శ్రీ వంశీకృష్ణ, శ్రీమతి శిలాలోలిత, శ్రీ రాజారామ్ తూముచర్ల గారలకు మనఃపూర్వక వందనాలు

నాతోపాటు ఈ అవార్డును అందుకొంటున్న శ్రీ నారాయణ స్వామి వెంకటయోగి, శ్రీమతి నిర్మలారాణి తోట గారలకు నా శుభాభినందనలు.

నా గురించి చెప్పుకోవాలంటే.... నేను యానాంలో పుట్టిపెరిగాను. జంతు శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కాకినాడలో నివసిస్తున్నాను. 2006 లో "యానాం విమోచనోద్యమం" , 2009 లో "ఆకుపచ్చని తడిగీతం", 2012 లో "ఫ్రెంచి పాలనలో యానాం" 2016 లో "వెలుతురు తెర", స్వేచ్ఛా విహంగాలు", 2018 లో "కవిత్వ భాష" పేర్లతో పుస్తకాలు వెలువరించాను. ఇవి కాక అనేక సమీక్షా వ్యాసాలు, అనువాదాలు ఇ.బుక్స్ రూపంలో ఉన్నాయి. ఇదీ ఇంతవరకూ చేసిన నా సాహితీ యానం.

మా నాన్న గారు "శ్రీ బొల్లోజు బసవలింగం" గారు పద్యకవి, నాటక రచయిత అవ్వటం వల్ల మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది.
నేను ఇంటర్ కొచ్చాక శ్రీ శిఖామణి గారి కవిత్వం నన్ను ఆకర్షించింది. ఆయనను ఆరాధీంచటం మొదలెట్టాను. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఎన్నో కవిత్వ పుస్తకాలు చదవమని ఇచ్చేవారు. అలా మాది ఈనాటికి గురుశిష్యుల అనుబంధం.
మా ఊరి కవి రచయిత శ్రీ దాట్ల దేవదానం రాజు గారు నన్నెంతో ప్రోత్సహించేవారు. "ఆకుపచ్చని తడిగీతం" కవిత్వ సంపుటి రావటంలో ఆయన స్పూర్తి, ప్రోత్సాహం మరువలేనిది.
****

ఇక శ్రీ యాకూబ్ గారు కవిగా ప్రసిద్ధులు. ఆయన నెలకి రెండు కవితలు, ఒకటో అరో వ్యాసమూ వ్రాసుకొంటూ ఉన్నా తెలుగు సాహిత్యలోకంలో ఆయన స్థానానికేమీ డోకా ఉండదు. ఈ రోజు యాకూబ్ గారి గురించి మాట్లాడుకోవటం అంటే "కవిసంగమం" గురించి మాట్లాడుకోవటమే. నిజానికి కవిసంగమం ఏర్పడకముందునుంచీ నేను అంతర్జాలంలో ఉన్నాను. అప్పట్లో బ్లాగులుండేవి. ఎవరైనా తమ బ్లాగులో కొత్తగా ఏదైనా వ్రాస్తే వాటి లింకులు కూడలి, మాలిక లాంటి అగ్రిగేటర్లలో కనిపించేవి. ఆ లింకులు పట్టుకొని ఆ పోస్టులను చదువుకోవలసి వచ్చేది. అలాంటి సమయంలో "కవి సంగమం" తెలుగు కవులనందరినీ ఒక చోటికి చేర్చింది. ఒకరికొకర్ని పరిచయం చేసింది.

కవిత్వానికి ప్రింటు మీడియాలో స్పేస్ తగ్గిపోతున్న కాలంలో ఉన్నాం మనం. తెలుగు కవిత్వానికి యువకులు దూరమౌతున్నారు అనుకొనే సమయంలో వారిలో కవిత్వం పట్ల ఆసక్తిని రేకెత్తించింది కవిసంగమం. ఎంతో మంది యువకవుల్ని తయారు చేసింది. నిజానికి తెలుగు సాహిత్యాన్ని "కవి సంగమం" ఒక మలుపు తిప్పింది. ఇదంతా నేను కళ్లారా చూసిన విషయం.

నా "కవిత్వ భాష" పుస్తకాన్ని కవి సంగమానికి అంకితం ఇవ్వటానికి కూడా ప్రధానమైన కారణమిదే.

కవి సంగమం ఎంతమంది యువకవుల్ని తీసుకొచ్చింది, అంతవరకూ వచ్చిన కవిత్వాన్ని ఏఏ వ్యాసాల ద్వారా మదింపు చేసింది, ఏ ఏ ప్రపంచకవుల కవిత్వాన్ని అనువదించి అందించింది, కవిత్వ నిర్మాణ రహస్యాలను ఎలా విప్పిచెప్పింది - వంటి అంశాలపై ఎవరైనా పరిశోధన చేస్తే అది గొప్ప గ్రంధంగా మిగిలిపోతుంది.
***

ఇక నా కవిత్వం గురించి మీకందరకూ కొన్ని అభిప్రాయాలున్నట్లు గానే నాకూ కొన్ని అభిప్రాయాలున్నాయి. నా ఆకుపచ్చని తడిగీతంలో చాలా మెత్తని కవిత్వం ఉంటుంది. ప్రకృతి, జీవితం, జీవనానుభూతులు ఎక్కువగా ఉంటాయి. సమాజం తక్కువగా ఉంటుంది.
రెండో పుస్తకం 'వెలుతురు తెరలో" వైయక్తిక అనుభవాలను సామాజిక అనుభవాలు చేయటానికి కొంత ప్రయత్నించాననుకొంటాను. ఉదాహరణకు- నేను జువాలజీ అద్యాపకుడిగా కొన్ని వేల కప్పల డిసెక్షన్లు చేసి ఉంటాను. కప్పలను చంపటం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతుందని డిసెక్షన్ లను నిషేదించారు. ఈ రెండు అంశాలను లింక్ చేస్తూ సమతుల్యత అనే కవిత వ్రాసాను.
అదే విధంగా కాలెజి ఫంక్షన్లలో తెల్లగా అందంగా ఉండే అమ్మాయిలతో బొకేలు ఇప్పించటం, ఆహ్వానం చెప్పించటం లాంటివి చేస్తాం. అలాంటి ఒక సందర్భంలో చామనఛాయతో ఉండే ఒక అమ్మాయి హర్ట్ అవ్వటం గమనించాను. ఆ అనుభవం "చర్మం రంగు" కవితగా రూపుదిద్దుకొంది.

ఆ సంపుటిలోని చాలా కవితలకు కూడా ఏదో ఒక సామాజిక సంఘటనా నేపథ్యం ఉంది. నా కవిత్వానికి సైద్దాంతిక నేపథ్యం తక్కువ అనుకొంటాను. అలాగని సమాజానికి దూరంగా ఉండదు. సమాజంలోనే ఉంటుంది.

నా చిన్ని జీవితంలోని, నేను చూసిన, అనుభవించిన అంశాలనే కవిత్వీకరించటానికి ప్రయత్నించాను. నేను చూడని, నాకు తెలియని ప్రపంచాలగురించి నేను మాట్లాడ లేదు.

వెలుతురు తెరలో కథనాత్మక, సంభాషణాత్మక శైలి కనిపిస్తుంది. కధను కవితాత్మకంగా చెప్పటం, కవితలలో సంభాషణలు చొప్పించటం నాకు ఇష్టం. సంభాషణల ద్వారా నా అనుభూతిని సంపూర్ణంగా చెప్పగలుతుతున్నానని నాకు అనిపిస్తుంది. ఇది శిల్ప పరమైన విషయం గా భావిస్తాను.

వెలుతురు తెర తరువాత వ్రాసిన కవితలలో నా కవిత్వంలో కొంత మార్పు గమనించాను. మన చుట్టూ జరుగుతోన్న సంఘటనలు ఎంత మనకు సంబంధం లేక పోయిన అవి మనల్ని పరోక్షంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని గుర్తించాను. సంపుటి సంపుటికీ నా కవిత్వ సారంలో మార్పులు రావటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
***

ఈ రోజు అంతర్జాలంలో దొరకని కవి ఉండడు. నేను ఇతరభాషా కవిత్వాన్ని బాగానే చదువుతూంటాను. ఇలా చదివే ప్రక్రియలో ఒక్కో సమయంలో ఒక్కో కవి పట్ల పిచ్చి పట్టుకొంటుంది. వాటిని కాస్తో కూస్తో అనువదిస్తే తప్ప ఆ పిచ్చి తగ్గదు. 2008 లో టాగూర్ కవిత్వం, 2010 లో సూఫీ కవిత్వం, 2012 లో పాబ్లో నెరుడా, 2015 లో గాధాసప్తశతి, 2016 లో రూమీ వాక్యాలు, ఇదిగో ఇప్పుడు మళయాల కవి కె. సచ్చిదానందన్.
ఇంతవరకూ రెండువందలకు పైగా ప్రపంచ, దేశీయ కవుల కవితలను అనువదించాను.

శ్రీ సచ్చిదానందన్ 100 కవితల అనువాద సంపుటి, నా సొంత కవితల సంపుటులను తీసుకురావాలని ఉంది. త్వరలో తీసుకొని వస్తాను.

కవిత్వభాష పుస్తకంలో కవిత్వం పై వెలిబుచ్చిన నాకున్న కొన్ని అభిప్రాయాలను పంచుకొని ముగిస్తాను

"సాహిత్యం ఒక అనంతమైన నదీప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్తూ, మానవజాతి బౌతిక మానసిక ప్రపంచాలను అన్వేషిస్తూ తన స్థల కాలాదుల విశేషాలను లిఖించుకొంటూ సాగిపోతాడు. ప్రతీ తరపు రచనలూ కాల క్రమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి ఆ తరం జీవించిన జీవితాలను భవిష్యతరాలకు అందిస్తాయి. కవి ఒట్టి సాక్షి మాత్రమే కాక తన ఆలోచనలను కళాత్మకంగా వెలువరించే సృష్టి కర్త కూడా. భక్తికవిత్వం, భావకవిత్వం, సంస్కరణోద్యమ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, దళిత కవిత్వం వంటివి ఆ కాలపు రాజకీయ, సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తాయి.

మానవ జాతికి రెండు చరిత్రలుంటాయి. ఒకటి యుద్ధాలతో, తారీఖులతో, రాజకీయాలతోను మరొకటి సాంస్కృతిక భావాలతోను నిండి ఉంటాయి. రెండో దాన్ని కవులు రచయితలు నిర్మిస్తారు.
****
నా కవిత్వానికి ఇంతటి గౌరవాన్ని, ప్రేమను అందించిన ఈ అవార్డు ప్రదాతలకు సదా కృతజ్ఞుడను.
బొల్లోజు బాబా – 7/10/2018



మెకాలే ప్రతిపాదనలు-సత్యాసత్యాలు



మనం ఇప్పుడు అబద్దపు వార్తలను చరిత్రగా నమ్ముతున్న యుగంలో ఉన్నాం. కట్టుకథల్ని, పుక్కిటి పురాణాల్ని నిజమైన చరిత్ర అనే భ్రమల్లో కూరుకుపోతున్నాం. ఒక సమూహపు Psyche ని ప్రభావితం చేయటానికి ఇదంతా కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలు. ఈ సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి అవుతున్న ఇలాంటి ఫేక్ వార్తలను నిజాలుగా నమ్మే స్థితికి అందరం క్రమక్రమంగా చేరుకొంటున్నాం.

మెకాలే గురించిన ఒక ఫేక్ వార్త చాన్నాళ్లుగా వాట్సప్ ల్లో, ఫేస్ బుక్కుల్లో తిరుగుతోంది. "భారతీయుల సంప్రదాయ విద్యను నాశనం చేసి ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టటం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి భారతదేశాన్ని ఆక్రమించుకోవచ్చు" అనేది దాని సారాంసం.

థామస్ బాబింగ్టన్ మెకాలే (1800-1859) బ్రిటిష్ చరిత్రకారుడు, రచయిత. ఇతను 1834-38 మధ్య ఈస్ట్ ఇండియా కంపనీ గవర్నర్ జనరల్ కు సలహాదారుడిగా పనిచేసారు. ఇతను 1835 ఫిబ్రవరిలో చేసిన "Minute on Indian Education" అనే ఉపన్యాసం భారతదేశ విద్యావ్యవస్థను ప్రభావితం చేసింది.

ఇక పోతే పైన ప్రచారంలో ఉన్న వార్తాంశం ఫేక్ ప్రచారం అని ఈ క్రింది కారణాలు చెప్పుకోవచ్చు. (see pic)

1. 1835 ఫిబ్రవరి 2 న బ్రిటిష్ పార్లమెంటులో మెకాలే చేసిన ప్రసంగం అని చెపుతున్న మాట అబద్దం ఎందుకంటే అప్పుడు మెకాలే కలకత్తాలో ఉన్నాడు లండన్ లో కాదు. 1834 లో ఇండియా వచ్చిన మెకాలే 1838 వరకూ బ్రిటన్ వెళ్ళనే లేదు.

2. ఇకపోతే మెకాలె 2, ఫిబ్రవరి 1835 లో కలకత్తా గవర్నర్ వద్ద చేసిన ప్రసంగ పూర్తి పాఠం లభిస్తూనే ఉంది. (లింకు ఇచ్చాను చూడండి) అందులో ఎక్కడా పై వాక్యాలు కనిపించవు.

3. మెకాలె వి గా చెప్పబడుతున్న పై మాటలలో Foreign, English, Self esteem అనే పదాలు ఆధునికమైనవి. 1835 నాటికి ఆ అర్ధాలలో వాటి వాడకం లేదు.

4. 1835 నాటికే భారతదేశం (ఈ భావనకూడా అప్పటికి ఏర్పడలేదు) దాదాపు పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపనీ ఆధీనంలోకి వచ్చేసింది అలాంటి నేపథ్యంలో "I do not think we would ever conquer this country" అనే మాట అర్ధరహితం.

5. భారతదేశం ఆమూలాగ్రం సంచరించాను ఒక్క బెగ్గర్ కూడా కనిపించలేదు, ఇక్కడ అందరూ నీతిమంతులే అనే మాటలు కూడా కూడా సత్యదూరం. ఎందుకంటే అప్పటికి సన్యాసులు, థగ్గులు, పింఢారీలు, బందిపోట్లు, దారిదోపిడి దొంగలు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తూండేవారు. కలకత్తా, బొంబాయి మద్రాసు కోర్టులలో రోజూ అనేక వందల కేసుల విచారణ జరుగుతూండేది ఆ రోజుల్లో.

5. మెకాలె అప్పటికి అమలులో ఉన్న భారతీయ విద్యావ్యవస్థను మెచ్చుకొన్న ధాఖలాలు కనిపించవు.

నేను భారతీయ సంస్కృత, అరబిక్ సారస్వత అనువాదాల్ని అన్నింటినీ చదివాను అవి ... a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia. అంటాడు. అంటే మన సాహిత్యమంతా తెల్లవాళ్ల లైబ్రేరీలోని ఒక బీరువాడు పుస్తకాలకు కూడా సరిపోదు అంటాడు.

ఇది మెకాలె చేసే జాత్యహంకార వ్యాఖ్య. గర్హనీయం. అలాంటి అభిప్రాయం ఉన్నవ్యక్తి మన సంప్రదాయ విద్యపై ఇంత గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తాడని అనుకోరాదు.

ఇంతకూ మెకాలె చెప్పిందేమిటి?

1. విద్యావ్యవస్థకు గ్రాంటు చేసిన లక్షరూపాయిల డబ్బును సాంప్రదాయిక సంస్కృత, అరబిక్ విద్యలపై ఖర్చుపెట్టటం కన్నా ఇంగ్లీషు భోధనపై వెచ్చించాలి. (అంటే సైన్స్, లెక్కలు, జాగ్రపీ, అనాటమీ లాంటి విద్యలు)

2. విద్య ద్వారా ప్రజలలో ఆధునిక శాస్త్రీయ భావనలు పెరగాలి, మూఢనమ్మకాలు కాదు.

3. రష్యాలో ఆధునిక శాస్త్రాలను అధ్యయనం చేసిన ఒక వర్గం పెరగటం వలన రష్యా అభివృద్ది పథంలో ప్రయాణిస్తున్నదని పోల్చుతూ- ఇండియాలో కూడా ఇంగ్లీషు చదువులు నేర్చుకొనే ఒక వర్గం ఏర్పడాలి అంటాడు.

4. స్థానికులు నిత్యజీవితంలో సంస్కృతం, అరబిక్ లో సంభాషించుకొనే పరిస్థితులు లేవు. వీరందరినీ కలిపి ఉంచటానికి ఇంగ్లీషు విద్య అవసరం.

5. దేశంలోని సామాన్యుల దుర్భర పరిస్థితులకు, అజ్ఞానానికి పూర్వ పాలకులు, మతాలు కారణం. ఇంగ్లీషు విద్య వల్ల వారి అజ్ఞానం పారద్రోలబడుతుంది.

మెకాలే ప్రతిపాదనల వలన జరిగిందేమిటి?

1.కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్నివర్గాలకు విద్య అందుబాటులోకి వచ్చింది. .

ఇది భారతీయసమాజంలో వచ్చిన గొప్ప సామాజిక మార్పు.

ఈ మార్పుకు ప్రతినిధిగా నిలిచిన డా.బి.ఆర్.అంబేద్కర్ నేటికీ సమాజానికి ఒక టార్చ్ బేరర్ గా నిలిచారు.

2. అప్పటికి వందల సంవత్సరాలుగా కొనసాగించబడిన సతిసహగమనం, వితంతు పునర్వివాహనిషేదం, బాల్యవివాహాలు లాంటి మతసంబంధ సాంఘిక దురాచారాలు కాలక్రమేణా అంతరించటానికి ప్రధాన కారణం మెకాలె ఆనాడు ప్రతిపాదించిన శాస్త్రీయ విజ్ఞాన ఆధారిత నూతన విద్యావ్యవస్థే.

3. నేటి భారతదేశ యువత ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు అంది పుచ్చుకోవటానికి మూలాలు మెకాలె ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంలో ఉన్నాయి.

ఎవరు ఈ ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు?

అశాస్త్రీయ సంస్కృతి సాంప్రదాయాలను పునఃప్రతిష్ట చేయాలని, వీటి పేరిట ప్రజలను ఏకంచేయాలని, సమాజాన్ని కొన్ని వందల సంవత్సరాల వెనక్కు తీసుకెళ్లాలని ప్రయత్నించేవారు ఇలాంటి భావజాలాన్ని వైరల్ చేస్తున్నారు.

మెకాలేని వాడుకొని మన గతమంతా ఘనకీర్తి అని ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన పోకడ.

బొల్లోజు బాబా

1835 ఫిబ్రవరి 2 న మెకాలె చేసిన పూర్తి ప్రసంగ పాఠం

http://www.columbia.edu/…/ma…/txt_minute_education_1835.html

Image may contain: 1 person

బ్రౌన్ లేఖల్లో ఉయ్యలవాడ నరసింహారెడ్డి



చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 1820- 1822 మరియు 1826-1829 ల మధ్య కడపలో పనిచేసాడు. 1846 నుండి 1855 వరకూ మద్రాసులో పోస్ట్ మాస్టర్ జనరల్ గా ఉద్యోగం చేసాడు.

అదే సమయంలో జరిగిన ఉయ్యలవాడ తిరుగుబాటు బ్రౌన్ ను ఆకర్షించి ఉంటుంది, కడపలోని తన పాత మిత్రులవద్ద ఆ ఉదంతం గురించి కూపీ తీసి ఉంటాడు.

ఉయ్యలవాడ తిరుగుబాటు ఉదృతంగా సాగుతున్న సమయంలో సిపి సుబ్బయ్య అనే వ్యక్తి 14 సెప్టెంబరు, 1846 న బ్రౌన్ కు వ్రాసిన లేఖ ఈ విధంగా ఉంది. అప్పటికి ఇంకా ఉయ్యలవాడ నరసింహారెడ్డి పట్టుబడలేదు.

ఉయ్యలవాడ సరసింహారెడ్డి చరిత్రకు సంబంధించి ఇదొక ఆనాటి కాలానికి చెందిన విలువైన చారిత్రిక ఆధారంగా భావించాలి.

****

మహారాజశ్రీ సి.పి. బ్రౌన్ ఇస్కోయరు గారి సముఖానికి

శేవకుడు సుబ్బయ్య అనేక సలాములు చేసి వ్రాసుకున్న విజ్ఞాపనము. ఈ నెల 14 వ తేది వరకు ప్రభువులవారి అనుగ్రహము వల్లను కడపలో క్షేమం. అచ్చట ప్రభువులవార్లయొక్క క్షేమ సంతోషాతిశయములు మాకు తెలిపి సంతోషం పొందుటకు అనుగ్రహ పత్రికె దయచేసి అంపించవలయునని ప్రార్థిస్తున్నాను.

ఇటీవల కర్నూలులో రెడ్డిగారిగుండా ఎక్కువలు జరిగినట్లు తెలియనందున విజ్ఞాపనం వ్రాసుకోనభ్యంతరమైనది.... సముఖానకు వస్తున్నానని తెలియపరుచుకున్న ప్రకారం ఈ నెల 6 తేదిని ప్రయాణమై మొన్నటి రోజున కడపకు వచ్చి చేరినాను.

ఇచ్చట కడపలోనున్న చుట్టుపక్కల 5, 6 ఆమడ పరియంతం రెడ్డియొక్క భయం వల్లను ధనికులు ఊళ్ళు విడిపెట్టిపోయినారు. ధనము మాత్రం బైట జాగ్రతపరచుకొన్నారు.
కడమ సాధారణమైనవారు సాయింత్రం అయిదు, అయిదున్నర గంటలకు వీధి తలుపులు పెరటి తలుపులు వేసుకునేవారు. కొందరు ఆ వేళకే భోజనములు కాచేసుకొని పక్కవీధులలో నిరుపేదలైన వారి ఇండ్లలో పరుండేవారున్ను పల్లెలకు పోయి పరుండేవారుగా ఉన్నారు.

ఇదికాక పదిరోజుల నాడు ఇచ్చటి సెషన్ జెడ్జి గారికి రెడ్డి అర్జి మూలముగా కడప ఖజానా కొళ్ళకు వస్తున్నాను మీరు వుండవలసిన జాగ్రతలో వుండవలసినదని తెలియజేసుకున్నాడు. అది మొదలు ఖజానా వద్దను 200 సిపాయిలను కత్తులు తుపాకిలతో సిద్దపరచి కావలి వుంచినారు. జావాన్ లు మొదలు తుపాకిలు కత్తులతో వుషారుగా ఉన్నారు.

అయితే రెడ్డిగారి తరపు దివిటీ దొంగల వుపద్రవము వల్లను ప్రజలు అత్యంతమైన భీతిని పొందుతున్నారు. 5-6 రోజుల కిందట దివిటి దొంగలు వచ్చి రెండు ఇండ్లు దోచుకునిపోయినారు. వారు రావడం 150-200 దివిటీలు వేసుకొని బొగ్గులు పూసుకుని తుపాకిలు కాల్చుకుంటూ వచ్చి యిండ్లలో జొరబడి వున్నవల్లా యెత్తుకొని చేతుల వేళ్లకు గుడ్డలు చుట్టి నూనె పోసి ముట్టించి వున్న ద్రవ్యమంతా అగుపరచమని శ్రమపెట్టుతున్నారని ఇచ్చటి వార్తలవల్లను తెలిసినది.

నేను ఇచ్చటికి వచ్చిన రోజు సమాచారం బెతం చెరువువద్దను రెడ్డిగారు ఉన్నారని కడప కలకటరు వారు యింకా కొంత జనమున్ను కర్నూల్ నుంచి కమిషనర్ వారు కొంత తురుపున్నుపోయి కాచివుండగా, సదరు రెడ్డిగారు కొవెలగుంట తాలూకాకు వచ్చి పొద్దుటూరిలో ఉండేవారికి ఒక వుత్తరం మూలంగా రెండు మూడు రోజులలో ఈవూరు కొళ్ళకు వస్తున్నాను మీరు తగు జాగ్రత్తలో వుండవల్సినదని వ్రాసిన వుత్తరమును కలకటరువారి వద్దికి అంపించగా కలకటరు వారు పొద్దుటూరికి పోవుటకు 4 కుంపిణిలను దౌడు అంపించమని వ్రాసిన ప్రకారం అంపించినారున్ను, కొంతమంది జవానులను నూతనముగా జీవనము కలగచేసి అచ్చటికి సహాయార్ధమై అంపించినారు. యింతకు మించిన సమాచారములు తెలియలేదు. చక్కగా విచారించుకొని వస్తున్నాను.

కర్నూలు వద్ద జరిగే సంగతులు ప్రభువుల వారికి విశదమయ్యేకొరకకు అచ్చట వుండే రైటరు గుండా సముఖానకు అర్జీవచ్చును. ఒక వేళ నా పేర వచ్చిన దొరవారు చిత్తగించవలసినది. ఇచ్చట జరిగే సమాచారములు ఇచ్చట నాకు మిక్కి స్నేహితుడున్నాడు గన్కు ఆయనగుండా ముందు వుత్తరములు వచ్చేలాగున జాగ్రత్త పరచివున్నాను. దివ్యచిత్తానకు తేవలెను.
నేను రేపటిదినం ఇచ్చటనుండి తర్లి వస్తున్నాను. దివ్యచిత్తానకు తెచ్చి రక్షించకోరుతున్నాను

ఇదే అనేక సలాములు

sir,
your most obedient
humble servant
C. Soobiah

Cuddapah
14-sept. 1846

*****

ఈ లేఖను బంగోరె మద్రాసు ఆర్చైవ్స్ నుండి వెలికి తీసాడు. ఈ లేఖ బంగొరె సంకలన పరచిన "బ్రౌన్ జాబుల్లో కడప చారిత్రిక శకలాలు" (1977) అనే పుస్తకంలో ఉంది.

బ్రౌన్ బహుసా తనవద్దకు వస్తాను అన్న ఈ సుబ్బయ్య అనే వ్యక్తిని కడప వెళ్లి నరసింహారెడ్డి తిరుగుబాటు విషయాలు తెలియచేయమని అడిగి ఉంటాడు. సుబ్బయ్య మద్రాసు వస్తూ వస్తూ కడపలో ఆగి వివరాలు సేకరించి అక్కడ నుంచి ఈ ఉత్తరం వ్రాసి - తదుపరి సమాచారం బ్రౌన్ కు తెలియచేయమని ఒక స్నేహితుడికి, అక్కడి ఓ రైటరుకు అప్పగించి బయలుదేరి ఉంటాడు. వాళ్ళిద్దరూ బ్రౌన్ కు వ్రాసిన జాబులు దొరికితే వుయ్యలవాడ గురించి మరింత సమాచారం లభించే అవకాసం ఉంటుంది.

మొత్తం ఉత్తరంలో ఆసక్తి కలిగించే అంశమేమంటే కొల్లగొట్టటానికి వస్తున్నాను అంటూ ముందస్తు సమాచారం ఇచ్చి దాడులు చేయటం. ఇది ధైర్యమా, పక్కదోవపట్టించే వ్యూహమా, లేక పుకార్లా అనేది తెలియదు. ఎందుకంటే సెప్టెంబరునాటికే కాలికి గాయమై నరసింహారెడ్డి నల్లమల అడవులలో దుర్భేద్యమైన రహస్యప్రదేశాలకు వెళ్ళిపోయినట్లు రికార్డులు చెపుతున్నాయి.

నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్యద్వారా 16 ఏండ్ల కొడుకు, రెండో భార్యద్వారా ఒక కుమార్తె, మూడో భార్యకు ఇద్దరు కొడుకులు. వీరందరినీ అప్పటికే కడపలో ఒక బంగళాలో గృహనిర్భంధం చేసి నరసింహారెడ్డికి రావాల్సిన పించనును వాళ్లకు బృతిగా ఏర్పాటు చేసింది కంపనీ.

1846 అక్టోబర్ 6 న వంటమనిషి ద్వారా మత్తుమందు ఇప్పించి నరసింహారెడ్డిని అరెస్టు చేసాడు కడప కలక్టర్ కాక్రేన్

బొల్లోజు బాబా

(రిఫరెన్స్: బంగోరే బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు కడపజాబుల సంకలనం అనుబంధం 1 ---- దీనికి మూలం మద్రాసు ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్ లైబ్రేరీలో బ్రౌన్ జాబుల సంపుటం ఎమ్ 419 పేజీ 126)

పూలతోట



అమ్ముడు పోని పూలు
వాడి
ఎండిపోయాయనీ
ధరతక్కువ
ప్లాస్టిక్‌ పూలతో ఈ లోకం
నిండిపోయిందనీ
నిందిస్తూన్నంత కాలం
నువ్వు ఇంకా పంజరంలోనే
ఉన్నావని అర్ధం

కిటికీ అద్దాన్ని బొగ్గుపొడితో
శుభ్రం చేయి.

ఎండిన పూలు విత్తనాలై
మొలకలెత్తి పూల తోటల్ని సృష్టిస్తోన్న
దృశ్యం కనిపిస్తుంది.

ప్లాస్టిక్‌ పూలపై
ఏ తుమ్మెదా వాలటం లేదనే
సత్యం గోచరిస్తుంది.

నీలోపలకు తొంగిచూసుకో
పరిమళమేదో
సన్నగా వీచటం తెలుస్తుంది.
దాన్ని అనుసరించు.
నీ పంజరాన్ని తెరిచే
తాళంచెవి ఉన్న చెట్టుతొర్ర వద్దకు
నిన్ను తీసుకెళుతుంది.

నువ్వొక రెక్కల
కుసుమానివన్న స్పృహ
ఒక్కసారిగా కలుగుతుంది నీకు
పంజరం వీడి
ఎగరటం మొదలెడతావు

జీవితపర్యంతమూ
పరిమళించీ పరిమళించీ
పూదోటగా విస్తరించటానికే
నువ్వు ఇక్కడకు వచ్చావు


బొల్లోజు బాబా

విశ్వబ్రాహ్మణులు ఎవరు?



భారతదేశ మత చరిత్రను రెండు రకాలుగా విభజించుకోవాలి. ఒకటి వేదాలకు పూర్వ మత చరిత్ర, రెండు వేదాల ఆవిర్భావం తరువాతి మత చరిత్ర. వేదాలకు పూర్వ మత చరిత్ర 1750 BCE వరకూ జరిగిన చరిత్రగా గుర్తించారు. ఇందులోనే సింధులోయ నాగరికత కొన్ని స్థానిక మతాలు వృద్ధిచెందాయి. కాలక్రమేణా జైన, బౌద్ధ మతాలు విస్తరించాయి.

వేదకాలానంతర హిందూ మతం 6 వ శతాబ్దం నాటికి విస్తరించి ప్రముఖ మతంగా ఆవిర్భవించింది. 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతంతో దేశమంతా పర్యటించి, వెళ్ళినచోటల్లా గుళ్ళను స్థాపించి హిందూ మతానికి ప్రచారం కల్పించాడు.

12 వ శతాబ్దం వరకూ హిందూ, బౌద్ధ, జైన మతాలన్నీ సమాజంలో సమాదరణ పొందుతుండేవి. మూడు మతాలు దాదాపు పక్కపక్కనే సహజీవనం చేసాయి.

అప్పట్లో హిందు బ్రాహ్మణులు, జైన బ్రాహ్మణులు, బౌద్ధ బ్రాహ్మణులు (శ్రమణులు) అని విడివిడిగా ఉంటూ ఆయా మత సేవలు చేస్తూండేవారు.

భూమి నుండి వచ్చే ఆదాయంలో వీరికి వాటా ఉండేది.

వీరు కాక చార్వాకులనబడే నిరీశ్వరవాదులు కూడా మనుగడ సాగించారు.

వీరందరిమధ్యా శతృత్వాలు ఉండేవని పదకొండవ శతాబ్దపు పర్షియన్ యాత్రికుడు Al-Biruni రికార్డు చేసాడు.

ఈ మత ఘర్షణలలో మొదట చార్వాక, బౌధ్ద మతాలు క్షీణించాయి. ఆ తదుపరి జైన మతం కూడా తొలగిపోవటంతో హిందూ మతం ప్రధాన మతంగా మిగిలింది. ఈ తతంగం దాదాపు అయిదారువందల ఏళ్ల పాటు జరిగింది.
***

నేటి దళిత, బహుజన కులపురాణాలను పరిశీలిస్తే అనేక ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తూంటాయి. చాలా వాటిలో ఆయాకులాల మూల పురుషుడు చక్రవర్తి అని, గొప్ప సామ్రాజ్య నిర్మాత అని, ఈ సృష్టికే మూల పురుషుడు అని అనేక ఉక్తులు కనిపిస్తాయి. ఈ విషయాలను ఉత్త అతిశయోక్తులుగా అనుకోలేం.

బహుసా వీరందరూ నిర్మూలించబడిన లేదా హిందూ మతంలో విలీనం చేసుకోబడిన- పశుపతినాథ, శాక్తేయ జైన, బౌద్ధ, చార్వాక, స్థానిక మతస్థుల వంశీయులు అవ్వొచ్చు అనే విషయాన్ని కూడా తృణీకరించలేం.

మతపరంగా ప్రాధాన్యతకోల్పోయాకా సామాజికంగా దస్యులుగా మిగిలిపోయి, శూద్రులుగా పిలువబడిన నాలుగవ వర్ణపు సమూహమే- ఒకనాటి వేదపూర్వకాల ప్రిమిటివ్ మతాలకు చెందిన వారై ఉండవచ్చుననే అభిప్రాయం చరిత్రకారులలో ఉంది.

ఈ నేపథ్యంలోంచి ప్రస్తుత విశ్వబ్రాహ్మణ వివాదాన్ని రెండు కోణాల్లోంచి పరిశీలించొచ్చు.

I.----- నేటి విశ్వబ్రాహ్మణులు ఒకనాటి జైనులా?----

తెలుగునాట జైన మతం ఒకప్పుడు విస్తారంగా విలసిల్లింది. వెంగి, భట్టిప్రోలు, కళింగ, ఉదయగిరి, బోధన్, నల్గొండ, విజయవాడ, కడప, విశాఖపట్నం, పెనుగొండ, నెల్లూరు జిల్లాలలో పురావస్తు శోధనల్లో జైన మత శకలాలువిరివిగా లభిస్తున్నాయి.

ఆంధ్రదేశంలో పన్నెండవ శతాబ్దం నాటికి- విశ్వబ్రాహ్మణులు, జైనులు గ్రామాలలో కరణాలుగా చేసేవారు. హిందూ మతవ్యాప్తి జరగాలంటే వీరిని తొలగించి వారి స్థానంలో బ్రాహ్మణులను నియమించటం అప్పటికి రాజకీయ అవసరం. దీని కొరకు బెనారస్, హొయసల, యాజ్ఞవల్క, తమిళ్, కాయస్థ బ్రాహ్మణులను గుంటూరు జిల్లాలో అధికారిక పదవులలో నియమించటం జరిగింది. వీరి సంఖ్య తక్కువ.

అలా నియమింపబడిన బ్రాహ్మణులలో ఆరువేలమందిని ఒక సారి, మూడువేల మందిని ఒకసారి కరణాలుగా నియోగింప చేసిన ఉదంతం ఆంధ్రదేశానికి సంబంధించి ప్రత్యేకమైనది.

అంత పెద్ద సంఖ్యలో ఖాళీలు సృష్టించాలంటే అప్పటికి కరణీకాలు చేస్తున్న అన్యమతస్థులను తొలగిస్తే తప్ప సాధ్యం కాదు.

జైన బ్రాహ్మణులకు, హిందూ బ్రాహ్మణులకు ఒక మోసపూరిత సమస్య ఇచ్చి పరిష్కరించలేదని వేలమంది జైన బ్రాహ్మణులను గానుగ తొక్కించిన కథ ఒకటి మెకంజీ కైఫీయత్తులలో లభిస్తున్నది.

---------"ఆఖరి కాకతీయ రాజు జైనులను గానుగలో తిప్పించి చంపించాడు. రెడ్డి రాజులు కూడా హిందూవేతర మతస్థులను ఊచకోత కోయించారు. " --------- (Ref: A Mannual of Kistna District (Madras: 1883), pp. 1-50.)

కులపురాణంలో చెప్పినట్లు చరిత్రలో విశ్వబ్రాహ్మణులు, వేదాలకంటే ముందునించే ఉండటం, కరణాలుగా పనిచేయటం నిజమే అయితే వారు వేదకాలం కంటే ప్రాచీనమైనదని చెప్పబడే జైనమతానికి చెందినవారని అనుకోవటానికి ఆస్కారం ఉంది.

12 వ శతాబ్దంలో ఈ ఊచకోతలకు వెరసి జైన మతాన్ని వదిలేసి హిందూ మతంలోకి మారిపోయి ఉండవచ్చు.

వీరబ్రహేంద్రస్వామి కాళికాంబ శతకంలో కనిపించే - బ్రాహ్మణ ధిక్కారం, విగ్రహారాధన నిరసన, కులవ్యవస్థను నిరాకరించటం, మనుషులందరూ ఒక్కటే అని భోధించటం, హిందూ దేవుళ్లను ప్రస్తావించకపోవటం - లాంటి విషయాలన్నీ హిందూ మతాన్ని అన్యమతంగా భావించి ప్రవచించినవే అనే ఊహ తార్కికమే అవుతుంది.

రామాయణంలో రామసేతును నిర్మించిన విశ్వకర్మ కొడుకైన "నల" జైనుడని జైన పురాణాలు చెపుతున్నాయి. (రి. wiki/Nala_)

II. --------విశ్వబ్రాహ్మణులు సాంస్క్రిటైజేషనుకు గురయిన శూద్రులు--------

A. హిందూమతంలో నాలుగే వర్ణాలు ఉన్నాయి. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు.

విశ్వబ్రాహ్మణులు అంటే బంగారు పని వారు మాత్రమే కాదు. కంచర, కమ్మర, వడ్రంగి, శిల్పకార లాంటి చేతి వృత్తుల వారు. వీరందరిలో స్వర్ణకారులకు కాస్త సమాజంలో మెరుగైన జీవనం ఉండేది. ఎందుకంటే వీరు ఎలైట్ ప్రజల అవసరాలు తీరుస్తుంటారు కనుక.

B. ఈ స్వర్ణకారులు, కొంతమేరకు శిల్పులు- ఇతర కులాల వలెనే "Sanskritization" కి గురయ్యారు. అంటే బ్రాహ్మణులను అనుకరించటం -శాకాహారం, జంద్యం, ఆచారవ్యవహారాలు లాంటివి పాటించటం. (నేడు కార్పొరేట్ సంస్కృతిలో అందరూ సూటూ బూటూ వేసుకొని, స్పూను ఫోర్కులతో బర్గర్లు, పిజ్జాలు తింటున్నట్లు)

C. మిగిలిన పంచవృత్తుల వారు పెద్దగా బ్రాహ్మణీకరణకు పోలేదు. వారికి మనుగడే ప్రశ్నార్ధకం. కనుక.

D. ఇక రిజర్వేషన్ల అంశానికి వస్తే వీరందరూ చేతి వృత్తుల వారు. ఆధునిక కాలంలో చేతి వృత్తులన్నీ దాదాపు అంతరించి పోయాయి. దానిలో కులప్రాధాన్యత కూడా పోయింది. (ఉండాలని నా ఉద్దేశం కాదు). అందుచే వీరిని చేతివృత్తులు కోల్పోయిన కులాల సమూహంలో చేర్చి రిజర్వేషన్లు ఇస్తున్నారు.

దీనికీ వీరి బ్రాహ్మణీకరణకు సంబంధం లేదు. ఈ రెండిటిని కలిపి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు.

E. విశ్వబ్రాహ్మణులు/పంచవృత్తికారులు నిచ్చెన మెట్లలో శూద్రులే.
ఎందుకంటే ఫ్యూడల్ వ్యవస్థలో ఒక వడ్రంగో, కంచరో, కంసాలో వూరు దాటి పొరుగూరుకు వెళ్ళే స్వాతంత్ర్యం ఉండేది కాదు. ఒక వేళ పారిపోతే చేతులు నరికే వారు. మిడివియల్ చరిత్రలో వీరూ ఇతర శూద్ర, అతిశూద్ర కులాలలాగ బానిసజీవితాన్ని గడిపారు. శిల్పులు సంచార జీవనం గడిపేవారు.
****

ఇక ప్రస్తుత వినోదినిగారిపై జరుగుతున్న దాడిని నేను ఖండిస్తున్నాను. వారు ఎంతో లోతైన విశ్లేషణ చేసి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఒక సంఘ సంస్కర్తగా శాస్త్రీయంగా నిరూపించారు. ఇంతకాలం కాలజ్ఞాన కవిగా వేసిన ముద్రను తొలగించినందుకు వారికి మనం రుణపడాలి. ఆ విషయంలో ఆమెతో అప్పట్లో మాట్లాడి అభినందించాను కూడా.

శూద్ర అన్న పదం ఎంత మాత్రం తప్పుకాదు. ఎందుకంటే అది ఉత్పత్తి కులాలలో మనల్ని ఉంచుతుంది. ఈ రోజు భారతదేశం కొన్ని కోట్ల డాలర్ల విదేశీమారకాన్ని పొందటానికి కారణమైన - నలందా, అజంతా, ఎల్లోరా, మహాబలిపురం, బృహదీశ్వరాలయం, కంచి, మధుర, హంపి, కోణార్క్, బదామి కేవ్ టెంపుల్స్, ఢిల్లీ ఐరన్ పిల్లర్ లాంటి అనేక టూరిస్ట్ నిర్మాణాలను ఉత్పత్తి చేసింది మనమే అని గర్విద్దాం.

బొల్లోజు బాబా

కల్నల్ కాలిన్ మెకంజి



కాలిన్ మెకంజీ 1754 లో స్కాట్లాండులో జన్మించాడు. 2 సెప్టెంబర్ 1783 న ఈస్టిండియా కంపనీ ఉద్యోగిగా మద్రాసులో అడుగుపెట్టాడు. అది మొదలు 1821 లో కలకత్తాలో చనిపోయేవరకూ మెకంజీ ఇండియాలోనే ఉన్నాడు.

1784-90 ల మధ్య ఇతను రాయలసీమ-కృష్ణా పరిసర ప్రాంతాలలో కంపనీ సైనిక ఇంజనీరుగా పనిచేసాడు. 1799 లో టిపు సుల్తాను ఓటమి కారణంగా కంపనీ పరమైన కర్ణాటక జిల్లాలను, నిజాం దఖలు పరచిన సీడెడ్ జిల్లాలను సర్వే చేసే బాధ్యతను మెకంజీకి అప్పగించింది కంపనీ. ఆ సమయంలో సర్వే నిమిత్తం కృష్ణా దిగువ ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించాడు. కావలి వెంకట బొర్రయ్య, వెంకటనారాయణ, వెంకట రామస్వామిల సహాయంతో అనేక శాసనాలను, గ్రామచరిత్రలను సేకరించాడు.

వీరందరిలో బొర్రయ్య చాలా చురుకైన వాడు. ఇతను తెలుగు, సంస్కృతం, పర్షియన్, ఆంగ్లభాషలలో ప్రావీణ్యుడు. బొర్రయ్య వ్రాసిన- Account of the Jains, collected from a priest of this sect at Mudgeri; Translated by Cavelly Boria, Brahmin: for Major C Mackenzie - 1809 Asiatic Researches vol 9 - అనే పరిశోధనాత్మక వ్యాసం భారతదేశ జైనమత పునరుజ్జీవనంలో మైలురాయిగా నిలిచిపోయింది. తనపేరుతో కాక తన క్రింద పనిచేసే బొర్రయ్యకే ఆ వ్యాస కర్తృత్వాన్ని ఇవ్వటం మెకంజీ నిజాయితీని ప్రతిబింబిస్తుంది.

ఈ కావలి వెంకట బొర్రయ్య అనేక సంస్కృత, కన్నడ శాసనాలను ఇంగ్లీషులోకి అనువదించినట్లు ఏసియాటిక్ జర్నల్స్ లో కనిపిస్తుంది. ఆ తరువాత చాలా సంచికలలో “బొర్రయ్య నిర్ధారించాడు” అంటూ ఇతరులు వ్రాసిన వ్యాసాలలో కొన్ని రిఫరెన్సులు కనిపిస్తాయి. గొప్ప మేథావి అయిన బొర్రయ్య 1803లో 27 సంవత్సరాల వయసులోనే మరణించాడు.
.
బొర్రయ్య స్థానాన్ని అతని సోదరుడు కావలి వెంకట లక్ష్మయ్య కొనసాగించాడు. ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా 1817 లో మద్రాసు సమీపంలో ఒక గ్రామాన్ని వంశపారంపర్యంగా అనుభవించేలా ఈస్ట్ ఇండియా కంపనీ దానం చేసింది. (రి. ఎన్సైక్లోపెడియా ఏసియాటికా వా. 5)

మెకెంజీ చేస్తున్న కృషిని గుర్తించిన కంపనీ 1810 లో ఇతనిని మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేయర్ జనరల్ గా నియమించింది. కానీ వెంటనే జావా ద్వీపానికి బదిలీ చేయటంతో 1811-1813 మధ్య మెకంజీ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అక్కడే 18 నవంబరు 1812 న డచ్ సంతతికి చెందిన Petronella jacomina Bartels ను వివాహమాడాడు.

తిరిగి ఇండియా చేరుకొన్నాకా 1815 లో మెకంజీ సర్వేయర్ జనరల్ గా నియమించబడ్డాడు. కలకత్తా సెయింట్ జార్జి కోటలో లో ఇతని ఆఫీసు ఉన్నప్పటికీ – అంతవరకూ ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రాంతాలలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించటం కొరకు మద్రాసులో ఉండేందుకు కంపనీ అనుమతి తీసుకొని 1817 వరకూ మద్రాసులోనే ఉన్నాడు.

1, ఫిబ్రవరి 1817 న మెకంజి తన మిత్రుడైన అలెగ్జాండర్ జాన్ స్టన్ కు వ్రాసిన ఒక లేఖలో ఈ స్థానిక చరిత్రలను సేకరించటంలో తన ఉద్దేశాలను, నిబద్దతను, కష్టాలను ఇలా చెప్పుకొన్నాడు.

1. 1799 లో కంపనీకి సంక్రమించిన ప్రాంతాల హద్దులను నిర్ణయించే పని నాకు అప్పగించినపుడు- సరిహద్దులే కాక ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేస్తానని నేను చెప్పిన ప్రణాళికను కంపనీ ఆమోదించి, ముగ్గురు గుమస్తాలను, ఒక నాచురలిస్ట్ ను నాకు సహాయకులుగా ఇచ్చింది. కానీ 1801 లో వీరిని తొలగించటంతో నా ప్రణాళికలన్నీ భగ్నమయ్యాయి. ఈ ప్రాంతాల జీవరాశిని రికార్డు చేద్దామనే నా ఆలోచన ఫలించలేదు. అంతే కాక నా జీతం, నాకు ఇచ్చే కంటింజెన్సీ డబ్బులు కూడా తగ్గించేసారు. దీనివల్ల నా ప్రణాళిక దాదాపు కుంటుపడింది.

2. అయినప్పటికీ నేనీ పనులు చేయగలిగాను

జైనులు, బుద్ధులు వేరు వేరు అని నిర్ధారించగలిగాను (అప్పట్లో వీటిని హిందూ మతంలో అంతర్భాగాలుగా గుర్తించేవారు); ప్రాచీన మతసాంప్రదాయాలైన లింగాయత్, శైవం, పాండరం, మఠాలు వివిధ శాఖలు వాటి పుట్టుపూర్వోత్తరాలు స్పష్టపరిచాను; సుమారు మూడు వేల వివిధ శిలా శాసనాలు, తామ్రపత్రాలకు నకళ్ళు తీయించాను; ఢిల్లీ నుంచి కేప్ కొమరిన్ దాకా ఉన్న Veeracul, Maastie cull లలోని పురాతనజాతుల సంస్కృతిని వెలికితీసాను. (పైన చెప్పిన అన్ని అంశాలను మెకంజీ మొత్తం 12 రీసెర్చ్ పేపర్లుగా ఆసియాటిక్ జర్నల్ లో ప్రచురించాడు)

3. కొన్నాళ్ళు మద్రాసులోనే ఉంచమని కోరటానికి కారణాలు ఈ లేఖలో ఇలా చెప్పుకొన్నాడు మెకంజీ – “నాకు సహాయకులుగా ఉన్న వ్యక్తులతో నా అనుబంధం వ్యక్తిగతమైనది. వాళ్ళు ఈ ప్రాంతపు స్థానికులు, కలకత్తాకు నాతో పాటు వచ్చి జీవించలేరు. మేము సేకరించిన విషయాలను కేటలాగ్ చేయాలి. చాలా వాటిని అనువదించాలి. ఇది కలకత్తాలో సాధ్యపడదు. నేను ఇంగ్లాండు వెళ్ళే లోగా కనీసం స్థానిక వ్రాతప్రతులు, పుస్తకాలు, శాసనాల సంక్షిప్తసమాచారాన్ని పుస్తక రూపంలో చూడాలని నా కోరిక. దీనికి నా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కనీసం విద్యావంతులకు తదుపరి పరిశోధనలకు వీలుగానైనా వీటిని కేటలాగ్ చేయించాలి"

అలా ఇంగ్లాండు వెళ్లాలని ఆశపడ్డ మెకంజీ పాపం వెళ్ళనే లేదు కలకత్తాలో 8 మే 1821 న మరణించాడు. మెకంజీ సేకరణలు శిధిలమౌతున్నాయని గమనించిన సి.పి. బ్రౌన్ 1840 ల ప్రాంతంలో వాటికి నకళ్ళు తయారు చేయించాడు. వాటికి మరలా తిరిగి 1930-40 లలో బ్రిటిష్ ప్రభుత్వం మరోసారి నకళ్ళు తీయించటం జరిగింది. నేడు మద్రాసు లైబ్రేరీలో ఉన్నతెలుగు మెకంజీ కైఫీయత్తులు చదవటానికి వీల్లేని విధంగా పూర్తిగా పాడయిపోయాయిని తెలుస్తూన్నది.
******
మెకంజీ సేకరణా విధానం

మెకంజీ ఒక సర్వేయరు. ఆఫీసులో కూర్చునే అధికారి కాదు. సర్వే అనేది వెళ్ళి స్థానికంగా చేయాల్సినపని. అందువలన ఇతనికి అనేక ప్రాంతాలలో స్వయంగా పర్యటించే అవకాశం వచ్చింది. దీనిని వినియోగించుకొని అక్కడ గ్రామ కరణాల వద్ద ఉండే కవిలెకట్టలలో గ్రామ చరిత్రలను, స్థానికంగా లభించే తాళపత్ర గ్రంధాలను, పుస్తకాలను సేకరించాడు. వివిధ ఆలయశాసనాలను చూసి వాటి ప్రతులను తయారు చేయించాడు. శిల్పాలకు డ్రాయింగులు గీయించాడు. ఇతను నియమించుకొన్న ఉద్యోగుల జీత భత్యాలు కంపనీ భరించేది. ఇది లక్షరూపాయిల మేరకు అయినట్లు రికార్డులు చెపుతున్నాయి. క్రమేపీ కంపనీ, డబ్బులు ఇవ్వటం మానేసాకా ఒకానొక దశలో వారికి జీతాలు మెకంజీయే స్వయంగా ఇచ్చాడు. మెకంజీ సేకరణలలో ఎక్కువ భాగం ఈ విధంగా స్వయంగా సేకరించినవే.

తాను స్వయంగా వెళ్లలేని ప్రదేశాలకు తన అనుచరులను పంపి రిపోర్టులు తెప్పించుకొనే వాడు. అలా నారాయణరావు అనే వ్యక్తి పంపిన అనేక రిపోర్టులు మెకంజీ కైఫీయత్తులలో లభిస్తాయి. (ఇతని రిపోర్టులలో ఆ యా ఊర్లకు ఎలా వెళ్ళిందీ, ఎంతదూరం, ఎక్కడ బసచేసాడు, ఎంతెంత ఖర్చయిందీ లాంటి వివరాలు కూడా ఉండటం విశేషం).

మెకంజీ సేకరించిన ప్రతులు సుమారు “14 భాషలకు” సంబంధించినవి. వీటిని మెకంజీ కూడా సంపూర్ణంగా పరిశీలించలేదు. వాటిని ఎప్పటికైనా స్థిమితంగా కూర్చొని క్రోడికరించాలని అనుకొని, తనదారిలో కనిపించిన ప్రతి చిన్న అంశాన్నీ సేకరించుకొంటూ పోయాడు. వీటన్నింటిని అనువదించటమో క్రోడీకరించటమో ఒక వ్యక్తి వల్ల అయ్యేపని కాదు.

మెకంజీ మరణం తరువాత

మెకంజి మరణానంతరం అతని భార్య మరొకరిని వివాహం చేసుకొని దేశం విడిచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొంది. మెకంజి సొంతడబ్బులు పెట్టికొనుక్కొన్న పుస్తకాలు, పురాతన వస్తువుల విలువ సుమారు లక్షరూపాయిలు ఉండొచ్చని గుర్తించారు. వీటన్నింటిని ఇరవై వేల రూపాయిలకు మెకంజీ భార్య బెంగాల్ ప్రభుత్వానికి ఇచ్చివేసింది. (బహుసా అన్నీ ఒకచోట ఉంటాయని భావించి ఉండవచ్చు). ఇవి ప్రస్తుతం బ్రిటిష్ లైబ్రేరీ, బ్రిటిష్ మ్యూజియం, మద్రాస్ మ్యూజియం లలో భద్రపరచబడి ఉన్నాయి.

ఇవి కాక ప్రభుత్వోద్యోగిగా మెకంజీ సేకరించిన వస్తువులు అనేకం ఉన్నాయి. మెకంజీ మరణించాక అతని స్థానంలోకి వచ్చిన అధికారికి దాదాపు “లక్ష పేజీల” వరకూ ఉన్నవ్రాతప్రతులను, వేలకొలది ఇతర సేకరణలను ఏం చెయ్యాలో తెలియలేదు. ఇవన్నీ కంపనీకి చెందిన ఆస్తి అయినప్పటికీ వీటిని ఎలా వదిలించుకోవాలా అని కంపనీ అధికారులు తలలు పట్టుకొని కూర్చునేవారట. అలాంటి సమయంలో H H Wilson అనే అధికారి, వీటిని క్రోడికరించటానికి ముందుకురాగా కంపనీ బోర్డు వెంటనే అనుమతినిచ్చింది.

అప్పటికే మెకంజీ తన సేకరణలకు రఫ్ కేటలాగు తయారుచేసినట్లు విల్సన్ గుర్తించాడు. దాని ప్రకారం మొత్తం వ్రాతప్రతులను స్థానిక చరిత్రలు (2070), శాసనాలు (8076), సాహిత్యవిషయాలు (1568), అనువాదాలు (2159), చిత్రాలు/డ్రాయింగ్స్ (2559), నాణాలు (6218) అంటూ వేరుచేసి వాటికి ఇండెక్స్ నంబర్లు ఇచ్చి మొత్తం మెకంజీ సేకరణల వివరాలను Meckenzie Collection - A Descriptive Catalogue of the Oriental Manuscripts and Other articles అనే రెండువాల్యూముల పుస్తకాలుగా 1828 లో వెలువరించాడు.

విల్సన్ కేటలాగు ప్రకారం తెలుగుకు సంబంధించి 285 కావ్యాలు, సీడెడ్ జిల్లాల 358 గ్రామ చరిత్రలు, ఇతర తెలుగు తమిళ గ్రామచరిత్రలు 274 ఉన్నట్లు తెలుస్తున్నది. ఎనిమిది వేల శాసనాలలో తెలుగు శాసనాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేదు.

విల్సన్ ఈ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో- వీటన్నింటిలో శాసనాలు, స్థానిక చరిత్రలు ముఖ్యమైనవని, వీటిని మరింత శోధించవలసి ఉందని బావించాడు. తెలుగు సాహిత్యంలో ఎక్కువగా సంస్కృత అనువాదాలు ఉన్నాయని, కొద్దిగా మాత్రమే స్వతంత్ర రచనలు లభించాయని అన్నాడు.

మెకంజీ సేకరణలు కృష్ణా నదికి దక్షిణభాగం (రాయలసీమ ప్రాంతం) నుంచి ఎక్కువ ఉన్నట్లు, ఉత్తరభాగం నుంచి పెద్దగా లేనట్టు గుర్తించాడు. బహుసా ఆ కారణం వల్లనే కడపజిల్లా కైఫీయత్తులు ఏడు సంపుటాలుగా మనకు లభించినట్లుగా ఇతరకోస్తా జిల్లాల కైఫీయత్తులు లభించవు.

కాలిన్ మెకంజీ ప్రాసంగికత

కైఫీయత్తు అంటే స్థానిక చరిత్ర అని అర్ధం. మెకంజీ సేకరించిన ఈ కైఫీయత్తులలో ఆనాటి సామాజిక వ్యవస్థ, చరిత్ర, సాహిత్యం, గ్రామాల సరిహద్దులు, అప్పటి పాలకుల వంశావళి వంటి అనేక అపురూపవిషయాలు తెలుస్తాయి. ఇవి స్థానికుల నుండి సేకరించినవి కనుక అప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తుల వంశ చరిత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. గ్రామ ఆలయాలు, వాటికి గల మాన్యాలు, అక్కడ పండే పంటలు, పన్నులు, వృత్తికులాల మాన్యాలు, గ్రామ పుట్టుపూర్వోత్తరాల గురించిన ఆనాటి కట్టుకథలు గాథలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు లాంటి అనేక సంగతులు కైఫీయత్తులలో ఉన్నాయి.

అమరావతిలోని బౌద్ధ స్థూపాన్ని కూలగొట్టి ఏదో భవన నిర్మాణానికి అక్కడి అవశేషాలను వినియోగిస్తున్నట్లు తెలుసుకొన్న మెకంజి అమరావతి వెళ్ళి, తవ్వకాలు జరిపి అక్కడి బౌద్ధ స్థూప ఉనికిని ప్రపంచానికి తెలియచేసాడు.

రెండు శతాబ్దాల క్రితం తెలుగు నేల ఎలా ఉండేది అనే విషయాలు నేడు తెలుసుకోగలుగుతున్నామంటే ఆనాడు మెకంజీ జరిపిన కృషివల్లనే అనేది అక్షర సత్యం. లేనట్లయితే చాలావిషయాలు కాలగర్భంలో కలసిపోయి ఉండేవి.

బొల్లోజు బాబా

మెకంజీకి సహాయపడిన కావలి సోదరులు



ఏలూరు కు చెందిన కావలి వెంకట సుబ్బయ్యకు నలుగురు కుమారులు ఒక కుమార్తె. ఆ నలుగురూ వరుసగా వెంకట సీతయ్య, వెంకట రామస్వామి, వెంకట బొర్రయ్య, వెంకట లక్ష్మయ్య. కుమార్తె పేరు లక్ష్మి దేవమ్మ. ఈమెకు విస్సన్నకోట జమిందారు రమణప్పతో వివాహం అయింది. వారికి పిల్లలు లేకపోవటంతో వెంకట సీతయ్య తన కుమారుడిని దత్తత ఇచ్చి విస్సన్నపేట జమిందారీని సొంతం చేసుకొన్నాడు. (రి. కృష్ణా జిల్లా మాన్యువల్, పే 339)

మిగిలిన ముగ్గురు సోదరులు కల్నల్ కాలిన్ మెకంజీ వద్ద సహాయకులుగా పని చేసారు.

కావలి వెంకట బొర్రయ్య (Cavelly Venkata Boriah) (1776-1803)

బొర్రయ్య 1776 లో ఏలూరులో జన్మించాడు. ఇతను ఏలూరు లోని ఒక ప్రెవేట్ స్కూలు లో పది సంవత్సరముల వరకూ విద్యనభ్యసించాడు. ఆ తరువాత సంస్కృతం నేర్చుకోవటంకోసమని ఆ స్కూలునుండి బయటకు వచ్చేసి సాంప్రదాయ సంస్కృతపాఠశాలలో చేరాడు. ఇక్కడ అయిదారు నెలలలోనే సంస్కృతంలో ప్రావీణ్యత గడించి సొంతంగా పద్యాలల్లేవాడట.

అప్పటికే ఇతని అన్నలు ఈస్ట్ ఇండియా కంపనీలో ఉద్యోగులుగా ఉండటం, వారిలాగే తానుకూడా ఉన్నతంగా జీవించాలనే ఆశయంతో ఉండేవాడు బొర్రయ్య. ఈ క్రమంలో తన ఇంటికి రెండుమైళ్ల దూరంలో కల కొత్తూరు వెళ్ళి పెర్షియన్, హిందీ భాషలను,నేర్చుకొన్నాడు. పద్నాలుగేళ్ళు వచ్చాక మచిలీపట్నంలో Mr. Morgan నడుపుతున్న స్కూలులో చేరి కొన్నాళ్లు విద్యాభ్యాసం చేసాడు. ఇది 1790-93 మధ్య కాలం కావొచ్చు. అప్పట్లో చర్చిఫాదర్లే చర్చ్ లలో విద్యాబోధన చేస్తుండేవారు.

తీరిక సమయాలలో తెలుగు సాహిత్యం, చందస్సు, అలంకారశాస్త్రం అభ్యసనం చేస్తూ పద్యాలు రాయటం మొదలు పెట్టాడు. అత్తలూరి పాపయ్య వ్రాసిన కవిత్వం ఎక్కువగా ఇష్టపడేవాడు.

మచిలీపట్నంలో ఆంగ్లేయులతో ఏర్పడిన పరిచయాల ద్వారా బొర్రయ్య ఈస్ట్ ఇండియా కంపనీ, మచిలీపట్నం సైనిక విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. ఒంగోలు, మునగాల, కొండపల్లి లాంటి వివిధ ప్రాంతాలలో ఉంటున్న సైనికులకు జీతాలను తీసుకొనివెళ్ళి పంచిపెట్టే ఉద్యోగం అది. ఉద్యోగరీత్యాకూడా బొర్రయ్యకు అనేకమంది ఆంగ్లేయులతో పరిచయాలు పెరిగాయి. అప్పటికి ఇతని వయసు పద్దెనిమిదేళ్ళు. కొంతకాలం నర్సాపురంవద్ద బ్రిటిష్ స్థావరమైన మెడపొల్లం (మాధవపాలెం) లో కూడా పనిచేసాడు.

కల్నల్ మెకంజీ వద్ద పనిచేస్తున్న సోదరుడు నారయణప్ప (క్రిష్ణా జిల్లా మాన్యువల్ 338 పేజి లో నారాయణప్ప వెంకట లక్ష్మయ్య కొడుకు అని ఉంది) సిఫార్సుతో, బొర్రయ్య మెకంజీ వద్ద ప్రధాన లేఖకునిగా ఉద్యోగంలో కుదిరాడు. బొర్రయ్య మేధాశక్తులపట్ల మెకంజి ఎంతో మాన్యత కలిగిఉండేవాడు. బొర్రయ్య చక్కని చిత్రకారుడు కూడా కావటంతో అనేక ఆలయాల డ్రాయింగులను చిత్రించాడు

1798 లో టిప్పుసుల్తాను గొడవల సమయంలో ఒక నిజాం జమిందారుకి చెందిన అనుచరులు కంపనీ కాగితాలను ఎత్తుకుపోతే, వాటిని తిరిగి సంపాదించిపెట్టమని బొర్రయ్య ను కోరాడు మెకంజీ. ఆ జమిందారు బొర్రయ్యను ఖైదు చేయించి తిండితిప్పలు పెట్టకుండా హింసించాడు. బొర్రయ్య ధైర్యం కోల్పోకుండా ఆ జమిందారుని పొగుడుతూ పద్యాలు అల్లి, అతని విశ్వాసాన్ని చూరగొని మెకంజీ కాగితాలతో పాటూ తనుకూడా అనేక బహుమతులను సంపాదించుకొన్నాడు.

తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృతం, పర్షియన్, భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండటంతో దక్షిణ భారతదేశ శాసనాలను అర్ధంచేసుకొని అవలీలగా ప్రతులు తీసి ఇంగ్లీషులోకి అనువదించేవాడు బొర్రయ్య. కొన్ని సార్లు బొర్రయ్య దట్టమైన అరణ్యాలు, కొండలు, వాగులు దాటుకొని విషయసేకరణ జరపాల్సివచ్చేది.

బొర్రయ్య వ్రాసిన- Account of the Jains, collected from a priest of this sect at Mudgeri; Translated by Cavelly Boria, Brahmin: for Major C Mackenzie - 1809 Asiatic Researches vol 9 - అనే పరిశోధనాత్మక వ్యాసం భారతదేశ జైనమత పునరుజ్జీవనంలో మైలురాయిగా నిలిచిపోయింది.
మెకంజీ 1811-13 ల మధ్య జావా బదిలీ అయినపుడు బొర్రయ్య ఏలూరు వచ్చేసాడు. ఈ కాలంలో టిప్పు సుల్తాను, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధవిశేషాలను కావ్యంగా రాసాడు (?). శ్రీరంగ రాజుల వంశావళిని తెలియచేసే “శ్రీరంగరాజ చరిత్ర” కావ్యాన్ని రచించాడు.

1803 లో ఇరవైఆరేళ్ల వయసులో బొర్రయ్య, రుద్రవాతం (మెదడు నరాలు చిట్లి హఠాత్తుగా మరణించటం) బారిన పడి అకస్మాత్తుగా చనిపోయాడు. బొర్రయ్య స్మారకచిహ్నాన్నిమద్రాసు సముద్రపు ఒడ్డున ఏర్పాటు చేయించాడు మెకంజీ. ఇది 1834 నాటికి అక్కడే ఉన్నట్టు కావలి లక్ష్మయ్య దక్కను కవులపుస్తకం పై The Journal Of The Royal Asiatic Society 1834 Vol. I లో వచ్చిన ఒక రివ్యూ వ్యాసం ద్వారా తెలుస్తున్నది.

బొర్రయ్యకు పన్నెండేళ్ళ వయసులోనే కసింకోట జమిందారైన వెంకటాచలం చిన్న సోదరితో వివాహమైంది. వీరిద్దరికీ ఒక కూతురు పుట్టి చనిపోయింది.
****
కావలి వెంకట లక్ష్మయ్య

ఇతని గురించి పెద్దగా వివరాలు తెలియవు. బొర్రయ్య చనిపోయాకా అతని ఉద్యోగాన్ని ఇతనికి ఇచ్చినట్లు అనుకోవాలి ఎందుకంటే ఇతను బొర్రయ్య తమ్ముడు కనుక.

మెకంజీ ముఖచిత్రంతో వచ్చిన Saturday Magazine, June 28, 1834 సంచికలో మెకంజీపై Alexander Johnston వ్రాసిన ఒక సంస్మరణ వ్యాసంలో వెంకట లక్ష్మయ్య ప్రస్తావన ఉంది. ఇందులో మెకంజీ మొదలుపెట్టిన పనిని కొనసాగించాలని, దీనికొరకు Royal Asiatic Society చర్యలు తీసుకొని, మెకంజీ సహాయకులను సంప్రదించాలని, వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని రాసుకొచ్చాడు.

తాను కావలి వెంకట లక్ష్మయ్యకు పైన చెప్పిన పనులను చేపట్టమని ఒక ఉత్తరం వ్రాసానని, అది అందుకొని – వెంకటలక్ష్మయ్య మద్రాసులో రెండువందల మంది ఔత్సాహిక స్థానికులతో Madras Literary Society ని స్థాపించి మెకంజీ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకు తెలియచేసాడు- అని అలెగ్జాండర్ పేర్కొన్నాడు
.
ఇదే వ్యాసంలో వెంకట లక్ష్మయ్య రాయల్ ఏసియాటిక్ సొసైటి లండన్ కు భారతదేశప్రతినిధిగా కావలి వెంకట లక్ష్మయ్య వ్యవహరిస్తూన్నడని ఉంది. అంతే కాక మెకంజీ చిత్రపటంలో టెలిస్కోపు ధరించిన వ్యక్తే లక్ష్మయ్య అని – అతన్ని నేను ఇటీవల కలిసానని చిత్రపటంలో ఉన్నట్లే ఉన్నాడని A. Johnston చెప్పినట్లు ఫుట్ నోట్సుద్వారా తెలుస్తుంది.

చాలాచోట్ల టెలిస్కోపు పట్టుకొన్న వ్యక్తి కిష్టప్ప అనే నౌకరుగా చెప్పబడ్డాడు. ఇది మరింత శోధించవలసిన విషయం. (ముందుపోస్టులో ఫొటో ఉంది) వెంకట లక్ష్మయ్య మద్రాసులో స్థిరపడ్డాడు.

ఇక మెకంజీ సేకరణలను కేటలాగు చేసింది లక్ష్మయ్య అని ఒక వాదన వినిపిస్తుంది. దీనికి ఆధారాలు లభించవు కానీ, మెకంజీ 1817 లోనే తన మిత్రుడు, అప్పటి ఏసియాటిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంటు అయిన Alexander Johnston రాసిన ఒక ఉత్తరంద్వారా -తన సేకరణలను 17 విభాగాలుగా విభజించుకొని సుమారు పది పేజీల నోట్సు రాసుకొని ఉన్నట్లు అర్ధమౌతుంది. (రి. Royal Asiatic society, Journal 1834 vol 1 p.no 333)
****

కావలి వెంకట రామస్వామి

ఇతని గురించి కూడా పెద్దగా వివరాలు లభించవు. మెకంజీ మరణించాక ఇతను ఉద్యోగం కోల్పోయి ఉంటాడు. వెంకట లక్ష్మయ్యలా అదే రంగాన్ని కాక మెకంజీ సేకరించిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావటానికి ప్రయత్నించినట్లున్నాడు. సి.పి బ్రౌన్ కూడా కాటమరాయని కథ, బొబ్బిలి యుద్ధం, కడప రాజుల చరిత్ర లాంటి పుస్తకాలు మెకంజీ సేకరణలనుంచే గ్రహించి ఉండచ్చనే ఊహ సత్యదూరం కాకపోవచ్చు. ఈ పని బ్రౌన్ కన్నా ఓ ముప్పై ఏళ్ల ముందే చేయటం రామస్వామి ముందు చూపు తెలియచేస్తుంది.

రామస్వామి 1829 లో కలకత్తా నుంచి, “దక్కను కవుల” పేరిట కవుల చరిత్ర అనే ఒక్క పుస్తకం మాత్రమే వెలువరించాడు.

ఈ పుస్తకాన్ని విలియం బెంటింగ్ కి చాలా భక్తితో అంకితమిచ్చాడు. దీనిలో నన్నయ, పోతన, అవ్వయార్, సుందరర్ లాంటి మొత్తం 79 మంది కవుల చరిత్రను ఇంగ్లీషులో అక్షరబద్దం చేసాడు. ఇది గొప్ప విశేషం. బహుసా ఇదే మొదటి తెలుగు కవుల చరిత్ర కావొచ్చు. (ఇందులో చాలామంది నేటి తెలంగాణాకు చెందిన కవులు కూడా ఉన్నట్లున్నారు. నాకు తెలియటం లేదు మిత్రులు పరిశీలించగలరు)

ఇతను చాలా కాలం కలకత్తాలో వ్యాపారాలు చేసి, చివరకు మద్రాసులో స్థిరపడినట్లు అర్ధమౌతుంది

బొల్లోజు బాబా

దక్కను కవుల పుస్తకం లింకు
https://archive.org/details/in.ernet.dli.2015.47980

ఆత్మను శుభ్రపరచే కవిత్వం - వసుధారాణి “కేవలం నువ్వే”



(29, సెప్టెంబరు న పల్లిపాలెం మధునాపంతుల ఆంధ్రీకుటీరంలో జరిగిన "కేవలం నువ్వే" పుస్తక పరిచయసభలో నేచేసిన ప్రసంగ పాఠం)

విజయవాడలో జరిగిన “కేవలం నువ్వే” పుస్తకావిష్కరణ సభలో శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు వసుధారాణి గారి కవిత్వాన్ని టాగోర్, గోథే, జిబ్రాన్, నీషే, రూమీ లాంటి మహామహుల కవిత్వాలతో పోల్చుతూ సారూప్యాలను వివరించారు. ఆ ప్రసంగ పాఠాన్ని వారు క్లుప్తీకరించి ఫేస్ బుక్ లో పెట్టినపుడు ఒకాయన “మీరు అతిగా పొగిడారు” అని కామెంట్ చేసారు. అక్కడ నేను “సార్ అది అతిగా పొగడటం కాదు, భద్రుడు గారు ఇలాంటి పుస్తకాలను ఎలా పరిచయం చేయాలో ఒక నమూనాను ఇస్తున్నారు” అని బదులిచ్చాను.

అక్కడ నేను “నమూనా” అన్న మాట ఎందుకు వాడానంటే – ఈ పుస్తకంలోని కవిత్వం ప్రత్యేకమైనది. మామూలుగా అందరూ రాసే వస్త్వాశ్రయ, ఆత్మాశ్రయ కవిత్వం లాంటిది కాదు. అంతకు మించినది ఏదో ఉంటుంది ఇలాంటి కవిత్వంలో. దాదాపు ఇదే తరహా కవిత్వంతో మూడేళ్లక్రితం మోదుగు శ్రీసుధ గారి “అమోహం” సంపుటి వచ్చింది. దానిపై పరిచయవ్యాసం రాయాలని మూడ్నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను నేను. అదే విధంగా భద్రుడి గారి “నీటిరంగుల చిత్రం” పై కూడా.

ఇంతెందుకు చెపుతున్నానంటే- ఇలాంటి కవిత్వాన్ని చదవటం మంచి అనుభవం. గొప్ప ఆత్మానుభూతి కలుగుతుంది. కానీ చదివిన దానిపై నాలుగు వాక్యాలు రాయటం చాలా కష్టం. ఒక్కో మూడ్ లో ఒక్కో అర్ధాన్ని ఇస్తుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్ధమౌతాయి. హృదయానుభూతిని అక్షరాలలో పెట్టటం చాలా కష్టం. ఉదాహరణకు ఒక కవితను చూద్దాం

నేను నీకు ఒక పూలమాలని అర్పించి పొంగిపోయాను
నీవు నాకోసం పూల తోటనే సృష్టించావు
అడవిపూలతో సుగంధం నింపి పంపావు నాకొరకై
నీవు నా సత్కారాలకై చూస్తావని అనుకోవటం నా అవివేకమంటావా?
నాకోసం ఇంత ఇచ్చిన నీకు మనసైనా అర్పించనీ
ఇవ్వటం నీకేనా? నాకూ తెలుసు

పై వాక్యాలలో నీవు అన్నమాటలో ఎవరున్నారు?

నేను నమ్మే కొత్తలంక బాబా గారా? కావొచ్చు. ఇంతచక్కని జీవితాన్ని, కుటుంబాన్ని, మీలాంటి సజ్జన సాంగత్యాన్ని నాకు ఇచ్చినందుకు.
నా భార్యా? కావొచ్చు. నేను ఆమె మెడలో పూలమాల మాత్రమే వేసాను. నాజీవితాన్ని పూలతోటగా మార్చిందామె.
ఈ సమాజమా? కావొచ్చు. నేనీ సమాజానికి ఇస్తున్నదల్లా “పాఠాలు చెప్పటమే”. కానీ ఈ సమాజం నాకు తిండి బట్ట, సంతోషాల్ని, భద్రతను ఇస్తోంది. నా జీవనాన్ని సంపూర్ణం చేస్తోందీ సమాజం

ఈ ప్రకృతా? కావొచ్చు. పై కవితలో వాచ్యార్ధం తీసుకొంటే అంతే అవుతుంది. ఏ సభలోనో ఎవరో వేసిన ఓ పూలమాలను నా పెరట్లో ఏ చెట్టుకొమ్మకో వేలాడదీసాను అనుకొందాం కాసేపు. అది కొన్నాళ్లకు వాడి ఎండి దానిలోని పూల విత్తనాలు వెదజల్లబడి మొలకెత్తి పూలతోట ఏర్పడవచ్చు. నేను వేసిన మాలను ఈ నేల తీసుకొని సుగంధాలు వెదచల్లే పూలతోటగా తిరిగి అందించింది అని అనుకోవచ్చు.

ఇన్ని అర్ధాలు ధ్వనించే కవితను ఒక బావంలోకో, ఒక చట్రంలోకో కుదించటం అన్యాయమౌతుంది. ఆ అనుభూతిని ఎవరికి వారు అనుభవించాల్సిందే. ఎవరికి వారు అర్ధాలు చెప్పుకోవలసిందే. ఇలాంటి కవిత్వాన్ని సమీక్షకుడు ఎంత గొప్పగా పరిచయం చేసినా అది విఫలయత్నమే అవుతుంది తప్ప సంపూర్ణ దర్శనం కాబోదు. భద్రుడుగారి ప్రసంగాన్ని ఒక నమూనా అన్నది అందుకే. ఇపుడు నేను చూపించేది కూడా ఒక దృక్కోణమే.
***
వియోగం లేదా ఎడబాటు అనేది మానవులనందరినీ నిత్యం జ్వలింపచేస్తూ ముందుకు నడిపించే చోదకశక్తి. ఆ శక్తే లేకపోతే అందరు జఢులమై ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండిపోతాం. ఈ వియోగం భారం అనేది మనకు బయటా, లోపలా కూడా ఉంటుంది. బయట ఉండే వియోగ భారం మనకు ఇష్టమైన వస్తువుల్ని, ఆస్తుల్ని, హోదాలను సంపాదించుకోవటానికి ప్రేరేపిస్తుంది. బాహ్యమైన వస్తువులపట్ల వియోగభారం అశాశ్వతం. ఒకసారి కారు కొనేసాకా ఇక కారు కి సంబంధించిన వియోగభారం ఉండదు.

లోపల ఉండే వియోగ భారాన్ని ఒదిలించుకోవటం దానినుంచి తేలిక పడటం అంత సులువుకాదు. ఒక్కోసారి ఏది మనకు వియోగ భారాన్ని కలిగిస్తుందో కనుక్కోవటం కూడా కష్టం. అది దైవమా, సహచరుడా, సాటిమనిషా, ప్రకృతా, మానవోద్వేగాలా లేక ఇవన్నీ కలగలిపా అనేది కూడా గుర్తించలేం మనం. అయినా ఏదో తెలియని మోయలేని వియోగభారం హృదయాన్ని నిలువనీయదు. ఈ భారం నుంచి విముక్తమవ్వటం కొరకు లోలోపల ఒక యుద్ధమే జరుతుంది. ఆ యుద్ధాన్ని జయించే క్రమంలో ఇదిగో ఇలా “కేవలం నువ్వే” లాంటి కవిత్వం పుడుతుంది. ఒక రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి పుడుతుంది. ఒక ఖలీల్ జిబ్రాన్ ప్రొఫెట్ పుడుతుంది. ఒక జలాలుద్దీన్ రూమీ మస్నావి పుడుతుంది.

ఇలాంటి కవిత్వాలను వస్త్వాశ్రయమా, ఆత్మాశ్రయమా, సమాజాశ్రయమా అని తర్కించుకోవటం అనవసరం. ఇలాంటి కవిత్వం పూర్తిగా ఆత్మగతమైనవి. వియోగభారాన్ని మోస్తున్న ఒక మనిషి ఆత్మను ఆవిష్కరిస్తాయి. ఆత్మను ఆవిష్కరించటానికి సాహిత్యం వినా మరోమార్గం లేదు మానవజాతికి. భక్తి గీతాలు, సూఫీ కవిత్వం, జెన్ కథలు ఆ పని చేసాయి.

ఈ రోజు రూమీ కవిత్వం ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ పొందుతోంది. ఎందుకంటే మానవోద్వేగాలైన ఆనందం, స్వేచ్ఛ, దైవం, స్నేహం, దుఃఖం, మంచి చెడు, సౌందర్యంపట్ల వివశత్వం, పశ్చాత్తాపం, కరుణా లాంటి సామాన్య మానవుల వియోగబారాలన్నింటికీ “ప్రేమ” అనే ఒక నిర్ధిష్ట రూపాన్ని ఇచ్చాడు రూమీ. ఈ లౌకిక బంధనాలనుంచి ఆత్మను శుభ్రం చేసుకోవటం, మనల్ని అర్పించుకోవటం, అహాన్ని చంపుకోవటం ద్వారా మాత్రమే “ప్రేమ” లో ఐక్యం అవగలమని రూమీ తన కవిత్వంద్వారా చెప్పాడు. ఫై లక్షణాలన్నీ వసుధారాణి కవిత్వంలో కనిపిస్తాయి.
***

కేవలం నువ్వే సంపుటిలోని కవితలలోని వ్యక్తీకరణ విధానాన్ని, శిల్పరీతుల్ని అయిదు కోణాలలో విశ్లేషించుకోవచ్చు. అవి

1. కవి గొంతుక: నేను నువ్వు అనే రెండు మాటలతో మొత్తం కవితను అంతా నడిపించటం చాలా చోట్ల గమనిస్తాం. ఆ కవితలలో కనిపించే "నేను" ఎవరు కవా? ఒక సమూహమా? ఒక జాతా? అని తరచిచూస్తే అది కవి స్వీయగొంతుక అని అర్ధమౌతుంది. చాలా చోట్ల అది స్త్రీ స్వరమే కూడా. ముందుగా అనుకొన్నట్లు నేను అనేది కవి అయితే నువ్వు మాత్రం అనిర్ధిష్టం.

నా రోదనతో నిన్ను మొరలిడాను, నావేదన తీర్చావు
నా వాంఛల్ని నీకు విన్నవించాను, నా కోర్కెలని తీర్చావు
నా మౌనాన్ని నీకు నివేదించాను, నన్నే స్వీకరించావు
ఈ బుద్ది నాకు మొదట కలిగింది కాదేమి?

“మౌనం నువ్వు సాధన చేయాల్సిన కళ” అంటాడు రూమీ. పై కవితలో “నీవు నన్నే స్వీకరించావు” అనటం కైవల్యాన్ని సూచిస్తుంది. అంటే రూమీ చెప్పిన మౌనాన్ని వసుధారాణి గారు కొంచెం ముందుకు తీసుకువెళ్ళి భారతీయ భక్తిసంప్రదాయంలోని కైవల్యంతో ముడిపెట్టారు. ఇవి కవి పలుకుతున్న మాటలు.

నువ్వు నా జీవితంలోకి
వచ్చాకా నా జీవితాదర్శమే
మారిపోయింది
ఇప్పటిదాకా నాకోసం నేను
ఇప్పటినుంచి నీకోసం నేను.

పై వాక్యాలలో మనల్ని మనం మరొకరికి నిర్నిబంధంగా అర్పించుకోవటం అనే లక్షణం గమనించవచ్చు. ఇది కవి హృదయపు లోతుల్లోంచి పలుకుతోన్న స్వరం.

2. కథనాత్మక శైలి: కథనాత్మక శైలి పఠితల్ని ఆకర్షిస్తుంది. చెపుతున్న సంఘటననో దృశ్యాన్నో మనో ఫలకంపై చిత్రించుకోవటం ద్వారా చక్కని అనుభూతిని కలిగిస్తుంది. మొత్తం సంపుటిలో నాలుగైదు కవితలు మాత్రమే కథనాత్మకశైలిలో ఉండటం గమనించవచ్చు. ఉన్నవి కూడా ఆ శైలిలో తప్ప వేరేరకంగా చెప్పనలవికానివే కావటం గమనార్హం.

నిన్నటి ప్రదోష కాల పూజలో దోషం ఏదైనా చేశానా?
ఈరోజు సుప్రభాత వేళకి నీ మోము చిన్నబుచ్చుకుంది
మరీ వేడి పదార్ధాలు, తొందరలో నివేదించానా?
నాసాగ్రం ఎర్రబడి, చుబుకం కందివుంది.
నీకిచ్చిన కర్పూరతాంబూలం తీసుకెళ్లి దేవేరికి సమర్పించావా?
ఎర్రగా ఉండాల్సిన నీ పెదాలు మామూలుగా ఉన్నాయి.
రోజూ నే చేసే సపర్యలన్నిటికి నిజంగా నీ ప్రతిచర్య ఉంటుందా?
ఇవన్నీ నా భావనలేనా ఐతే
ఇంత వింత భావనలతో నను పుట్టించినది నీవే కదూ? విచ్చిన నీ పెదవుల దరహాసం
నా కథని మళ్ళీ మొదటికి తెస్తోంది.

చక్కని ఊహ. పై కవితలో ఒక భక్తురాలు భగవంతునితో సంభాషిస్తోంది. నేనిచ్చిన తాంబూలాన్ని సేవించావా లేక పట్టికెళ్ళి అమ్మవారికి ఇచ్చావా అని అడగటంలో – ప్రేమకన్నా భగవంతునిపై భక్తునికి ఉండే హక్కు ధ్వనిస్తుంది. నా పూజలలో ఉన్న లోపాలేమైనా ఉంటే అది నీ సృష్టిలోని లోపాలే అని భగవంతుడినే తిరిగి నిందించటం కూడా ఇలాంటిదే. ఇవన్నీ భక్తిసారం లోతుల్ని తరచిచూసినవాళ్లు మాత్రమే రాయగలిగే వాక్యాలు. ఈ భావాలను చెప్పటానికి కథనాత్మక శైలిని ఎంచుకోవటం కవి ప్రతిభ.

3. అలంకారాలు: కవిత్వాన్ని అలంకారయుతంగా చెప్పటం ఒక పద్దతి, ఏ అలంకారాలూ లేకుండా చెప్పటం మరొక పద్దతి. రెండవ పద్దతిలో బలమైన ఊహలేకపోతే ఉత్తవచనంగా మిగిలిపోతుంది. ఈ పుస్తకంలో కొన్ని కవితలు నిరలంకారంగా ఉన్నాయి. మిగిలిన చోట్ల పారడాక్స్/విరోధాభాస అలంకారాన్ని విరివిగా వాడుకోవటం గమనించవచ్చు. ఉపమ, రూపకాలు చాలా అరుదుగా కనిపించాయి.

పరస్పరవ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు భావాల్ని కలిపి చెప్పటాన్ని పారడాక్స్ అంటారు. గీతాంజలిలో, రూమీ వాక్యాలలో, భగవద్గీతలో పారడాక్స్ వ్యక్తీకరణలను అనేకం చూడవచ్చు. మిస్టిక్ కవిత్వ ప్రధానలక్షణం పారడాక్స్.
ఈ పుస్తకంలో కొన్ని పారడాక్సికల్ వ్యక్తీకరణలు

అమితమైన ఆనందాన్ని ఇచ్చేది
అంతులేని దుఃఖాన్ని కూడా ఇస్తుంది. (29)

గాయమూ
లేపనమూ
రెండూ నువ్వే (12)
ప్రేమికుడొక
స్వేచ్ఛాయుత బంధీ (19)

నీకూ నాకూ మధ్య
వారధి ఏమిటంటే
దుఃఖం
నిన్ను నన్నూ విడదీసేది
సుఖం
చిత్రంగా నీతో నా మొరలన్నీ
సుఖం కోసమే (51) ఇదొక గడుసైన విరోధాభాస. నిన్నూ నన్నూ కలిపేది దుఃఖం అనటం ఒకె. నిన్ను నన్ను విడదీసేది సుఖం అనటం కూడా ఒకె. నా మొరలన్నీ సుఖం కోసమే అనటం అంటే విడదీయటం కోసమనా? మరో మెట్టుకు వెళ్ళి ఆలోచిస్తే మనమందరం సుఖాలకోసం ఈశ్వరునికి మొరపెట్టుకోవటం వల్ల ఆయనకు మరింత దూరమౌతున్నాము అన్న సూచన అనన్యమైన ఆలోచన.

కళ్ళువిప్పుకుని
మెళకువగానే
ఉన్నాననుకున్నాను
అది నిద్రావస్థ అని
నువ్వు జాగృతం
చేసినాక కానీ
తెలిసింది కాదు. (50) (ఇక్కడ మెళకువ, నిద్రావస్థ, జాగృతం పదాల ప్రయోగం చాలా ఔచిత్యవంతంగా ఉంది)

చక్కని అందమైన ఊహాచిత్రాలు ఈ సంపుటిలో అనేకం ఉన్నాయి

ఆవిర్భావం, అంతం లేని
ప్రవాహంలో
ఆ గడ్డిపువ్వూ, ఆ కొండా
ఆ పాలపిట్టా, నేనూ
అందరం కొట్టుకు పోతున్నాం (67)

సంతోషం దుఃఖం
కోపం విచారం
ప్రేమ ద్వేషం
అన్నీ మనసు
ఊదుకొనే గాలిబుడగలే (9) లాంటి ఊహాచిత్రాలు కవికి కల కల్పనా చాతుర్యము, వాటిని అక్షరాల్లో పెట్టగలిగే ఒడుపు ఉన్నతస్థాయివని నిరూపిస్తాయి.

నాకున్న నైపుణ్యం ఒక్కటే
నువ్వు ఉన్నావని తెలుసుకోవటం
నాకు ఇప్పటికీ చేతకానిది ఒక్కటే
ఎక్కడున్నావో తెలుసుకోలేకపోవటం (70) ఇది నిరలంకార కవిత. దేవుడున్నాడని నమ్మేవాళ్ళలో కూడా అతను ఎక్కడున్నాడో చెప్పలేకపోవటం ఒక వైరుధ్యం. ఒక్కొక్కరిది ఒక్కొక్క భాష్యం. ప్రతి సామాన్యుడు నిత్యం ఎదుర్కొనే ఈ సార్వజనీన సత్యం వలన పైవాక్యాలలో ఏ రకమైన అలంకారాలు లేకపోయిన లోతైన కవితగా రూపుదిద్దుకొంది.

4. ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు: మన జీవితాలను నడిపించే ఒక శక్తిని దైవమని నమ్మి అలాంటి దైవంపట్ల చింతన కలిగిఉండటమే ఆధ్యాత్మికత. ఈ సంపుటిలో అనేక కవితలలో జీవితానికి చేసిన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు కనిపిస్తాయి.

నీవున్నావనే ఆధారాలతో కొందరు
నీవు లేవనే నిరూపణలతో కొందరు
మొత్తం మీద నీ స్మరణలోనే అందరూ (18) ఇదొకరకమైన నిందాస్తుతి అనుకోవచ్చు.

అద్భుతాలని
ఎరగా వేసి జీవితంపై
ఆశలు పెంచుతావు
ఇంతలోకే ఉదాసీనత
పెంచే కష్టం చూపి
జీవితం ఇదేనా అనిపిస్తావు. (10) మనమందరం భగవంతుడు ఆడించే బొమ్మలమనీ, ఇదంతా ఆయన లీలా వినోదమనీ చిన్నచిన్న వాక్యాలలో పొదిగారు.

5. జీవిత సూక్తులు: ఈ తరహా కవిత్వంలో జీవితసూక్తులు ఉంటాయి. ఉత్తమజీవనం ఎలాసాగించవచ్చో సూచనలుంటాయి. ఇవన్నీ జీవితాన్ని దీప్తిమంతం చేసుకోవటానికి సహాయపడతాయి.

నీకో శత్రువుండాలి
లేకుంటే నీ జీవితానికి
లక్ష్యం లేదు
నీకో మిత్రుడుండాలి
లేకుంటే నీ సంతోషానికి
అర్ధం లేదు
నీవు అజాత శత్రువువే ఐనా
అంతర్గత శత్రువుని గుర్తించు (6)

స్వర్గానికి దారెటు అని
నరకంలో ఉన్నవాడిని ప్రశ్నించకు (58)

పగ తెచ్చిపెట్టుకొనేది
అందుకు బోలెడు కారణాలు
మరి ప్రేమో
కారణం లేకుండానే కలిగేది. (44)
***
నేను అనే భావనలో మనందరం కూరుకుపోయి ఉంటాం. అంతసులభంగా ఆ ఊబిలోంచి బయటపడలేం. కనీసం ఈ పుస్తకాన్ని చదువుతున్నంతసేపైనా మనం ఆ బంధనాల్లోంచి బయటపడతాం. కనీసం ఆ కాసేపైనా మనల్ని మనం మనకు ప్రియమైనవారికి అర్పించుకొంటాం. కనీసం ఆ కాసేపైనా మనం తేలికపడతాం. కనీసం ఆ కాసేపైనా మన ఆత్మ శుభ్రపడుతుంది. ఇరవయ్యొకటో శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కవిత్వం ఒక ఫీనిక్స్ పక్షిలా పైకి లేవటానికి కారణం ఆత్మని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ కలగటమే.

ఈ తరహా కవిత్వం ఏకాలంలోనైనా, ఏ దేశానికి చెందినదైనా ఇలాగే ఉంటుంది. “కేవలం నువ్వే” పుస్తకాన్ని ఆ పరంపరకు కొనసాగింపుగా, ఈ తరంలో పలుకుతున్న వాళ్లందరి ఉమ్మడి స్వరంగా చూడాలి. ప్రతీ తరంలోనూ ఎవరో ఒకరు గానాన్ని కొనసాగిస్తారు. ఆ బావజాలపు మాధుర్యాన్ని నేటి తరానికి అందించినందుకు వసుధారాణిగారిని మనం అభినందిద్దాం.
ఈ పుస్తకానికి డా. వాడ్రేవు వీరలక్ష్మి దేవి చక్కని ముందుమాట వ్రాసారు. పుస్తకం గెటప్ బాగుంది. లోపల రత్న పోచిరాజు గారి వాటర్ కలర్ పెయింటింగ్స్ పుస్తకానికి అదనపు అందాన్ని ఇచ్చాయి.

కవయిత్రి ఫేస్ బుక్ వాల్: https://www.facebook.com/vasudha.rani.731

(ఈ వ్యాసం సారంగ లో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)

కరువుకాలం కొంగలు - Cranes in Drought ( Akaal men Saras) by Kedarnath Singh

కరువుకాలం కొంగలు - Cranes in Drought ( Akaal men Saras) by Kedarnath Singh

ఒకానొక మధ్యాహ్నం వేళ
అవి వచ్చాయి
అవి వచ్చినపుడు
అవి అలా వస్తాయని ఎవరూ ఊహించలేదు

ఒకదానివెనుక మరొకటి
గుంపులు గుంపులుగా వచ్చాయి
మెల్లమెల్లగా ఆకాశం మొత్తాన్ని
అలముకొన్నాయి
క్రమక్రమంగా ఊరు మొత్తం
కొంగల అరుపులతో నిండిపోయింది.

చాలాసేపు అవి ఊరిమీద తిరుగుతూ
రెక్కల్లోంచి ఊడిపడినట్లు
ఇంటికప్పులపై, పాకలపై, గడ్డిమేట్లపై వాలాయి.

ఒక ముసలమ్మ వాటిని చూసింది.
అవును... అవును...
ఇవి నీటికోసమే వెతుకుతున్నాయి
అని అనుకొంది

వంటింట్లోకి వెళ్ళి
ఒక కుండతో నీరు తెచ్చి
పెరటి మధ్యలో ఉంచింది

కొంగలు మాత్రం
ఆ ముసలమ్మని, ఆమె ఉంచిన నీటికుండనూ
గమనించకుండా
ఊరిమీదే చాలాసేపు తిరుగాడాయి.

క్రింద నివసించే జనం
తమను కొంగలు అని పిలుస్తారని కూడా
బహుసా ఆ కొంగలకు తెలియకపోవచ్చు

సుదూరప్రాంతం నుంచి
నీటికొరకు అన్వేషణలో ఆ కొంగలు
ఈ ఊరికి వచ్చాయి

తమ మెడలను వెనక్కు తిప్పి
అసహ్యమో, జాలో తెలియని చూపులతో
ఊరినొకసారి చూసి
గాల్లో రెక్కలు తపతప లాడించుకొంటూ
ఎగిరిపోయాయి.

Source: Cranes in a Drought ( Akaal men Saras) by Kedarnath Singh
English Translation: Sri. B.S.N Murthy
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా
One year has passed since Sri Kedarnath Singh left us. But he still lingers in his Poetry
శ్రీ కేదార్ నాథ్ సింగ్ ఇతర కవితానువాదాలు ఈ లింకులో కలవు.

English Medium

నాలుగువందల ఏళ్లుగా ఈ నేలపై జీవించిన ఇంగ్లీషు పరాయి భాష ఎప్పుడయింది?

రాత్రికి రాత్రి మతభాష ఎందుకయిందీ?

ఈ మీడియం మార్పు అనేది లెక్కలు, సైన్సు, సోషలు సబ్జక్టులకే పరిమితం. మిగిలిన తెలుగు, ఇంగ్లీషు, హిందీ/ఉర్దు లు యధాతధంగా ఉంటాయి. ఈ విషయం తెలుసుండీ ఎందుకింత రాద్దాంతం?

విద్యార్ధులలో డబ్బైశాతం మంది ఇంగ్లీషు మీడియం ముప్పై శాతం మంది తెలుగుమీడియంలో చదువుకొంటున్నారు. ఈ తెలుగుమీడియంలో చదువుతున్న వారిలో 75 శాతం మంది బడుగు విద్యార్ధులు.

లెక్కలు ఇలా ఉన్నప్పుడు ఈ బడుగు విద్యార్ధులు మాత్రమే తెలుగును బ్రతికించాలని కోరుకోవటం దుర్మార్గం.

లెక్కలు, సైన్సు, సోషలు అంతర్జాతీయ శాస్త్రాలు. వాటిని ఇంగ్లీషులోనే నేర్చుకోవటం సముచితం. వాటిని తెలుగులో నేర్పి ఆ కుర్రాడిని ఆత్మవిశ్వాసం లేనివాడిగా తయారు చెయ్యాలనుకోవటం అమానవీయం.

Enough is enough. ఇప్పటికైనా జరిగిన తప్పును సవరించుకొందాం.

కావలి బొర్రయ్య నుంచి గురజాడ వరకూ చాలామంది ఇంగ్లీషులో కూడా నిష్ణాతులు. కావలి వెంకట రామస్వామి 1829 లోనే ఇంగ్లీషులో రచనలు చేసిన తొలితరం తెలుగు రచయిత. గురజాడ కన్యాశుల్కానికి అద్భుతమైన ముందుమాట ఇంగ్లీషులో వ్రాసుకొన్నాడు. శ్రీశ్రీ తన కవితల్ని తానే ఇంగ్లీషులోకి తర్జుమా చేసుకొనేవాడు.

ఈ రోజు మనలో ఇంగ్లీషులో రచనలు చేయగలిగే వాళ్ళసంగతి దేవుడెరుగు, కనీసం తమ కథల పుస్తకాలకు ఇంగ్లీషులో ముందుమాట రాసుకోగలిగే తెలుగు కథకులు కానీ అనువదించుకోగలిగే కవులు కానీ ఎందరున్నారు?

దీనికి కారణం యాభై ఏళ్లపాటు తెలుగు మీడియం తెలుగు సాహిత్యానికి చేసిన ద్రోహం కాదా?

వాస్తవాలు మాట్లాడుకొందాం. రెండు మీడియం లు ఉండాలని నంగిరిమింగిరి మాటలు ఒద్దు..

ఇప్పట్లో తెలుగుకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు.
మన ఊరి చేపల మార్కెట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఇంగ్లీషులో మాట్లాడుకొంటున్నప్పుడు తెలుగు ప్రమాదంలో పడిందని భావిద్దాం. అంతవరకూ తెలుగుభాష అంతరించిపోతుందని ఆందోళన చెందక్కరలేదు.

బొల్లోజు బాబా

సర్వాయి పాపన్న – ఒక చారిత్రిక పరిశీలన



దళితబహుజనులు ఏకమై ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని 17 వ శతాబ్దంలోనే నిరూపించిన విప్లవకారునిగా కొందరు చరిత్రకారులు సర్వాయి పాపన్నకు పట్టం కట్టారు. చరిత్రలోంచి వ్యక్తులను తీసుకొని వారిద్వారా సమకాలీన రాజకీయ ప్రాసంగిత కలిగిన దృక్పథాన్ని ప్రకటించటం నేడు సర్వదా నడుస్తున్న వ్యవహారం.

సర్వాయి పాపన్న జీవితం జానపదగాథలలో నిక్షిప్తమై ఉంది. ఇదొక కళాత్మక రూపం. సాధారణంగా కళాత్మక రూపంలో కల్పన ఉంటుంది. కథానాయకుడి చుట్టూ వ్యతిరేక వాతావరణ రూపంలో ఒక ఘర్షణ చిత్రించబడుతుంది. చివరకు ప్రొటగానిస్ట్ మరణించటంతో కథ ముగుస్తుంది. ఆనందోపదేశాలు కళ బాధ్యతలు. చరిత్రను మోసే అవసరం కళకు ఉండదు. అందుచేత ఆ రచయిత కళారూపానికి విరుద్ధంగా ఉండే కొన్ని సామాజిక, చారిత్రిక వాస్తవాల పట్ల అయితే మౌనమైనా వహించాలి లేదా వాటిని వంకరలైనా తిప్పాలి. అందుకే వీరగాథలలో కనిపించే కథానాయకులకు చరిత్రపుస్తకాలలో కనిపించే కథానాయకులకు హస్తిమశకాంతర వ్యత్యాసం ఉంటుంది.

J.A. Boyle, 1874 లో Telugu Ballad Poetry అనే వ్యాసంలో పాపారాయుని వీరగాథను బళ్ళారికి చెందిన ఒక బోయవాని నోటివెంట విన్నట్లు, అది ఇటీవలే వ్రాసినదని పేర్కొన్నాడు. అందులో పాపన్న తల్లితో తన జీవితాశయాలను ఇలా చెపుతున్నాడు.

తల్లీ కొలువుకు వెళ్లను/
ఎంగిలి ముంత ఎత్తలేను
కొట్టుదును గొల్కొండ పట్టనము
ఢిల్లికి మొజుర్ నవుదును
మూడు గడియల బందరు కొట్టుదును
బంగార కడియాలు పెట్టుదును

ఆ తరువాత సర్వాయి పాపన్న వీరగాథను వచనరూపంగా మార్చి సర్వాయి పాపన్న చరిత్ర పేరుతో 1931 వచ్చింది. ఇది మరింత కాల్పనికతో ఉంటుంది.
***

I. సర్వాయి పాపన్న చరిత్ర

పాపన్న పన్నెండేళ్ల వయసులో చెట్టుక్రింద పడుకొన్నప్పుడు పన్నెండు తలల నాగుపాము అతనికి నీడపట్టింది. అటే పోతున్న కొంతమంది బ్రాహ్మణులు అది చూసి పాపన్న మహర్జాతకుడని, పల్లకిలో తిరుగుతాడని, గోల్కొండను ఏలుతాడని చెపుతారు. (పాపన్న కల్లుగీత వృత్తి చేసే గౌండ కులానికి చెందిన వ్యక్తి. అప్పట్లో బ్రాహ్మణ, క్షత్రియులకు తప్ప ఇతరులకు పల్లకిలో తిరిగే అర్హత ఉండేది కాదు),

అప్పటినుంచి పాపన్న నోటిమాటకు మహత్యం వచ్చిందట. తాడిచెట్టును కల్లు ఇమ్మని అడిగితే ఒంగి ఇచ్చేదట. తల్లి దాచుకొన్న కొంత సొమ్మును దొంగిలిస్తాడు. వెంకటరావు అనే ఒక భూస్వామిని శిక్షించి అతని ధనాన్ని లాక్కొంటాడు. ఒక ఎరికల ఆమెను పెండ్లిచేసుకొంటాడు. వజ్రనబుద్దు అనే జమిందారుని కొల్లగొడతాడు. గోల్కొండ సైనికులతో తలపడి విజయం సాధిస్తాడు. గోల్కొండకోటపై దాడి చేసి ఆక్రమించుకొంటాడు. తరువాత ముస్లిం సైనికులు చుట్టుముట్టినప్పుడు ఇక చిక్కక తప్పదని తెలుసుకొని కత్తితో తలనరుక్కొని చనిపోతాడు.

గోల్కొండ నవాబు ఇతని గొప్పదనాన్ని గుర్తించి రాజలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించటంతో కథ ముగుస్తుంది.

సమకాలీన కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఈ గాథలో బ్రాహ్మణ వ్యతిరేకత (వర్ణ వ్యవస్థను ధిక్కరించి పల్లకిలో తిరగటం), సామ్రాజ్య వ్యతిరేకత, భూస్వామ్య వ్యతిరేకత, దళితబహుజన రాజ్యాధికార సాధన లాంటి రొమాంటిక్ ఊహలు అనేకం కనిపిస్తాయి.

వీరగాథలు చరిత్రగా చలామణీ అయ్యేచోట చారిత్రిక వాస్తవాలు నిర్ధాక్షిణ్యంగా మరణిస్తాయన్నది ఒక నిష్టుర సత్యం.
****

II. చరిత్ర రికార్డులలో సర్వాయి పాపన్న (1650-1710)

1. ఆనాటి రాజకీయ పరిస్థితులు

సర్వాయి పాపడు 1695 నుంచి 1710 మధ్యలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఔరంగజేబు1687 లో గోల్కొండను వశపరచుకొని గోల్కొండ రాజు అబుల్ హసన్ ను బంధీగా తీసుకొనిపోయి దక్కనును నేరుగా ఢిల్లీ పాలనలోకి తీసుకొచ్చాడు. స్థానికేతరులు అధికారులుగా రావటంతో స్థానిక జమిందార్లు, కులీనులు అసంతృప్తితో ఉండేవారు. పన్నుల భారం అధికమైంది. కరువుకాటకాలు చుట్టుముట్టాయి. ఈ కాలంలో మొఘల్ సామ్రాజ్యం రాజకీయంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. అప్పటికే ఔరంగ జేబుకు తొంభైఏళ్ళు దాటాయి. ఇక చక్రవర్తి రేపోమాపో చచ్చిపోతాడని దేశం అంతా ఎదురుచూసే పరిస్థితి. వారసత్వ పోరు ఉండనే ఉంది. సామంతులు ఎవరి మట్టుకు వారు స్వతంత్రతను ప్రకటించుకొనే ఆలోచనల్లో ఉన్నారు. కేంద్రంలో కానీ, స్థానీయంగా కానీ బలమైన నాయకత్వం లేదు.

పరిస్థితి ఎంతెలా ఉండేదంటే ఔరంగజేబు 1700 లో Riza Khan అనే సైనికాధికారిని, బీదరు అల్లర్లను కట్టడి చేయమని పంపిస్తే అతను ఇక్కడకు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకొని, సమీప సంస్థానాలను ఆక్రమించుకొని, గ్రామాలను దోచుకొంటూ ఆ ప్రాంతాన్ని ఒక నియంతలా ఏలటం మొదలెట్టాడు.

2. పాపడి రంగ ప్రవేశం

ఇలాంటి అస్థిర పరిస్థితులలో సర్వాయి పాపడు తెరమీదకు వచ్చాడు.

వరంగల్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తరికొండ గ్రామంలో పాపడు జన్మించాడు. 1690 ల ప్రాంతంలో పాపడు ధనికురాలైన తన విధవ సోదరిని చంపి ఆమె ధనాన్ని దొంగిలించాడు. ఈ డబ్బుతో కొంతమంది అనుచరులను కూడగట్టుకొని తరికొండపై చిన్న దుర్గాన్ని నిర్మించుకొన్నాడు. (అనుచరులు అంటే కూలి ఇచ్చి పెట్టుకొనే వ్యక్తులు. అప్పట్లో సైన్యం అంటే కూడా కూలికి పోరాడే వ్యక్తులు. అంతే తప్ప ఆశయాలకు ఆకర్షితులై వచ్చి చేరే ఆదర్శపురుషులు కారు. యుద్ధంలో జయిస్తే రాజుకు భూములు, అధికారం, అందమైన స్త్రీలు దక్కితే; ఓడిన రాజ్యంలోని ప్రజల డబ్బులు, నగలు, బిందెలు, చెంబులు లాంటివి ఈ సైనికులు బలవంతంగా లాక్కొని పంచుకొనేవారు. సైనికులకు ఇదొక అదనపు ఆకర్షణ. యుద్ధానంతరం దొమ్మీ అనివార్యం).

అలా పాపడి నాయకత్వంలో ఈ దండు, దుర్గంలో ఉంటూ రాజమార్గం (Highway) పై హైదరాబాదువైపు వెళ్ళే వ్యాపారస్తులను, ధనిక పరివారాన్ని అటకాయించి దోపిడీలు చేసేది. ఇది చూసిన స్థానిక నాయకులు పాపడిని తరిగొండనుంచి తరిమేసారు. అక్కడనుంచి వందమైళ్ల పారిపోయి వెంకటరావు అనే జమిందారు వద్ద సేనానిగా చేరాడు పాపడు.

అక్కడ కూడా పాపడు తన పాతపద్దతులలో దారిదోపిడీలు చేస్తున్నట్లు తెలుసుకొన్న వెంకటరావు ఇతన్ని ఖైదుచేయించాడు. వెంకటరావు భార్య, తనబిడ్డకు అస్వస్థత తగ్గాలని ఖైదీలనందరినీ విడిపించిన సందర్భంలో పాపడు కూడా విడుదలై తిరిగి జనజీవనంలోకి వచ్చాడు.

3. పాపడి దురాగతాలు

పాపడు తన పుట్టిన ఊరు సమీపంలో షాపూర్ (Shahpur) అనే ప్రాంతాన్ని తన నివాసంగా చేసుకొని మరలా దారిదోపిడీలు కొనసాగించాడు. ఇక్కడ ఇతనికి సర్వాయి అనే మిత్రుడు తగిలాడు. వీరిద్దరి స్నేహం బలపడి కొండపై ఒక బలమైన దుర్గాన్ని నిర్మించి మరిన్ని క్రూర కృత్యాలు చేయటం మొదలెట్టారు. వీరి అరాచక చర్యలకు ముస్లిమ్, హిందువులు ఇద్దరూ కూడా బాధితులుగా ఉండేవారు. ఈ విషయాలు కొంతమంది ఔరంగజేబుకు తెలియచేయటంతో అతను కాసిం ఖాన్ అనే సేనాధిపతిని పాపడిని తొలగించమని పంపించాడు.

పాపడిని పట్టుకోవటానికి వెళ్ళిన కాసిం ఖాన్ ను పాపడి అనుచరులు చంపేయటంతో వీరు మరింత విజృంభించటం మొదలెట్టారు.

1702 లో గోల్కొండ డిప్యూటి గవర్నల్ రుస్తుం దిల్ ఖాన్ స్వయంగా పాపడిని అంతమొందించటానికి షాపూర్ వచ్చి రెండునెలలపాటు పాపడి బృందంతో పోరాడాడు. ఈ పోరాటంలో పాపడు, సర్వాయిలు తప్పించుకోగా, రుస్తుం దిల్ ఖాన్ కోటను ధ్వంశం చేసి హైదరాబాదు తిరిగి వచ్చేసాడు.

రుస్తుం దిల్ ఖాన్ వెళిపోయాక పాపడు, సర్వాయిలు తిరిగి వచ్చి కోటను మరింత విస్తరించి కట్టుకొని తమ కార్యకలాపాలు కొనసాగించటం మొదలెట్టారు. ఇదే సమయంలో పాపడి అనుచరులు- సర్వాయికి పుర్దిల్ ఖాన్ కి మాటామాటా వచ్చి కొట్టుకొని ఇద్దరూ హతమవటంతో పాపడు నాయకత్వానికి తిరుగులేకుండా పోయింది. పాపడు బృందం సమీపంలో ఉన్న కోటలను ముట్టడించి ఆక్రమించుకోసాగింది.

1706 లో గోల్కొండ డిప్యూటి గవర్నరు పైన చెప్పిన మరొక దోపిడిదారుడు Riza Khan ను పాపడిని నిలువరించమని అభ్యర్ధించాడు. బహుసా ముల్లును ముల్లుతో తీయాలని గోల్కొండ పాలకులు భావించి ఉంటారు. రిజాఖాన్ కొంతమంది సైన్యాన్ని పంపాడు. పాపడి ముందు వీరు నిలువలేక వెనక్కి వచ్చేస్తారు.

ప్రజలనుండి వస్తున్న ఒత్తిడులకారణంగా 1707 లో డిప్యూటి గవర్నరు రుస్తుం దిల్ ఖాన్ పాపడిని పట్టుకోవటానికి సైన్యంతో షాపుర్ వచ్చి పాపడితో తలపడ్డాడు. ఈసారి పాపడు తెలివిగా భారీ ధనాన్ని రుస్తుం దిల్ ఖాన్ కు లంచంగా ఇచ్చి తప్పించుకొన్నాడు. రుస్తుం దిల్ ఖాన్ హైదరాబాదు వెళిపోయాడు.

4. వరంగల్ కోటపై దాడి

రుస్తుం దిల్ ఖాన్ కు లంచమిచ్చి తప్పించుకొన్న పాపడు తనకు ఇక తిరుగే లేదని భావించి ఏప్రిల్ 1708 లో మూడువేలమంది అనుచరులతో వరంగల్ కోటపై దాడి చేసి, వశపరచుకొని అపారమైన సంపద, వస్తువులను చేజిక్కించుకొని; వేలమంది ధనిక వర్గానికి చెందిన స్త్రీలను బంధీలుగా తనవెంట తీసుకొని పోయాడు.

పాపడి అనుచరులు వరంగల్ పట్టణాన్ని లూటీ చేసారు. వరంగల్ మేలుజాతి కార్పెట్లకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. పెద్ద పెద్ద కార్పెట్లను తీసుకెళ్లలేక ముక్కలు చేసి పట్టుకెళ్లారు.

షాపూర్ కోటలో ఎత్తైన గోడలతో నిర్మించిన ప్రదేశంలో అపహరించిన స్త్రీలను, పిల్లలను బంధించారు. వీరిలో వరంగల్ పట్టణ న్యాయాధికారి భార్య, ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉన్నారు. అపహరించిన వారి బంధువులనుండి పెద్దమొత్తాలలో ధనాన్ని వసూలు చేయటానికి డబ్బు ఉన్న వారి స్త్రీలను పిల్లలను పాపడు ఎంచుకొనేవాడు.
(ఆ న్యాయాధికారి భార్యను పాపడు సొంతానికి ఉంచుకొని, కూతురిని నాట్యకత్తెగా తర్ఫీదు ఇమ్మని భోగం స్త్రీలవద్దకు పంపించాడు. ఆ చిన్నిపాప తాత పేరు షా ఇనాయత్. ఇతను ఆనాటి సమాజంలో గౌరవనీయుడు. ఇతను డిల్లీ వెళ్ళి బహదూర్ షా వద్ద తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొన్నప్పుడు, బహుదూర్ షా పెద్దగా స్పందించలేదు. చేసేదేమీ లేక ఇతను ఇంటికి వచ్చి తన నౌకరులందరికీ కానుకలిచ్చి స్వేచ్ఛగా బ్రతకమని పంపించేసి కొద్దిరోజులకే బెంగతో చనిపోయాడు)

5. భోనగిరి కోటపై దాడి

వరంగల్ కోటపై చేసిన దాడిద్వారా పాపడు విపరీతమైన ధనాన్ని కూడగట్టాడు. దీనితో ఆంగ్లేయులు, డచ్చివారినుండి 700 తుపాకులు కొన్నాడు. బంగారు పల్లకిలో తిరగటం మొదలెట్టాడు. చుట్టూ 700 మంది సాయుధులైన సైనికులను రక్షణగా పెట్టుకొన్నాడు.

ఆహారధాన్యాలు పెద్దఎత్తున కొంటానని పాపడు ఒకరోజు వ్యాపారస్తులకు కబురు పెట్టి, వారి ధనాన్ని, వస్తువులను, బండ్లను, పదివేల పశువులను బలవంతంగా లాక్కొని, వారిని బంధించి ఖైదులో పడేయించాడు. ఆ పశువుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాలను సాగుచేయించటం మొదలు పెట్టాడు.

వరంగల్ కోటదాడి తరువాత భోనగిరి కోటపై జూన్ 1708 లో దాడి చేసాడు. ఈ సమయంలో తన అనుచరులకు- స్త్రీలను తీసుకొచ్చిన వారికి వెండినాణాలు, ఉన్నతవర్గ స్త్రీలను ఎత్తుకొచ్చినవారికి 5 బంగారు నాణాలు ఇస్తానని చెప్పాడు. అలా భోనగిరి కోటదాడిలో సుమారు 2000 మంది స్త్రీలు అపహరింపబడ్డారు.

ఉన్నతవర్గాలు వైభవంగా జరుపుకొనే పెళ్ళిళ్లలో పాపడు మెరుపుదాడులు చేసి స్త్రీలను అపహరించి, వారి బంధువులనుండి అధికమొత్తాలలో ధనాన్ని రాబట్టేవాడు. Kilpak జమిందారు పాపడికి లొంగనందుకు తన వద్ద బంధీగా ఉన్న అతని భార్య నాలుకను కోసి అతనికి కానుకగా పంపించి హెచ్చరించాడు.

ఈ దోపిడీలలో హిందువు ముస్లిమ్ అనే వ్యత్యాసం ఉండేది కాదు. అందువల్ల ముస్లిమ్ శ్రీమంతులు, తెలుగు జమిందార్లు పాపడి అరాచకాలకు బలయ్యి, ఇతని పీడను ఒదిలించమని గోల్కొండకు మొరపెట్టుకొనేవారు.

6. చక్రవర్తి తో సన్మానం

ఔరంగజేబు చనిపోయాకా ఏర్పడిన వారసత్వపోరులో బహదూర్ షా సింహాసనాన్ని చేజిక్కించుకొన్నాడు. ఇది నచ్చని బహదూర్ షా సోదరుడు Kam Baksh హైదరాబాదుకు స్వతంత్ర రాజుగా ప్రకటించుకొన్నాడు. ఇదివిన్న బహదూర్ షా దక్కను వచ్చి అతనితో పోరాడి అంతమొందించి దక్కను సామ్రాజ్యానికి తన చక్రవర్తి స్థానాన్ని స్థిరపరచుకొన్నాడు. ఆ సందర్భంలో బహదూర్ షా హైదరాబాదు ప్రముఖులతో దర్బారు ఏర్పాటు చేసినప్పుడు పాపడు 14 లక్షల రూపాయిలు కానుకగా ఇచ్చి బహుదూర్ షా చేత సన్మానం పొందాడు.

పాపడి చేతిలో బలయినవారు ఈ చర్యతో తీవ్ర అసంతృప్తిచెందారు. ముఖ్యంగా పాపడు వద్ద బంధీలుగా స్త్రీలు, పిల్లల బంధువర్గాలు. వీరంతా కలిసి బహదూర్ షాకు తమ అసంతృప్తిని తెలియచేసారు. వారి విజ్ఞాపనల మేరకు హైదరాబాద్ నూతన గవర్నరైన Yusuf Khan కు పాపడిని అంతమొందించమని ఆదేశాలిచ్చాడు చక్రవర్తి. Yusuf Khan తిరిగి ఆ పనిని Dilawar Khan అనే సేనాపతికి అప్పగించాడు.

1709 లో పాపడు ఒక జమిందారుపై దాడుచేయటానికి వెళ్ళినపుడు షాపుర్ కోటలో పాపడిచే బంధింపబడిన వారు తిరుగుబాటు చేసి చెరనుంచి విడిపించుకొన్నారు. వీరందరికీ నాయకత్వం వహించింది పాపడి బావమరిది కావటం విశేషం. పాపడి భార్య తన భర్తలేనప్పుడు బంధీగా ఉన్న తమ్ముడికి, రహస్యంగా ఆకురాయిలను భోజనంలో దాచి అందించగా వాటి సహాయంతో అతను తన సంకెళ్లను తెంచుకొని మిగిలిన వారిని కూడా విడిపించాడు. ఇది తెలుసుకొన్న పాపడు షాపూర్ కోటకు వచ్చినపుడు అంతవరకూ బంధీలుగా ఉన్నవారు కోటలోంచి ఫిరంగులు కాలుస్తూ పాపడు అనుచరులపై ఎదురుదాడి చేసారు.

కోపోద్రిక్తుడైన పాపడి ఆదేశాలతో- కోట గుమ్మాలను తగలపెట్టి, గేదెలను చంపి రక్తంతో తడితడిగా ఉన్న వాటి చర్మాలను తొడుక్కొని ఆ మంటలలోంచి కోటలోకి వెళ్లటానికి ప్రయత్నించారు అతని అనుచరులు. ఇదే సమయానికి దిలావర్ ఖాన్ తనసైన్యంతో పాపడిని బంధించటానికి అక్కడికి వచ్చాడు. ఇలా రెండు వైపులనుండి దాడి ఎదురవ్వటంతో పాపడు తరికొండ కోటకు పారిపోయ్యాడు.

7. పాపడి పతనం

దిలావర్ ఖాన్ పాపడిని బంధించటంలో విఫలమవటంతో యూసఫ్ ఖాన్, మార్చ్ 1710 లో ఇరవై వేలమంది సైనికులను తీసుకొని తానే స్వయంగా తరికొండ కోటను చేరి పాపడి తో తలపడ్డాడు. పాపడు సైనికులకు యూసఫ్ ఖాన్ రెట్టింపు కూలి ఇస్తానని ప్రకటించటంతో అలసిపోయిన చాలామంది పాపడిని విడిచి యూసఫ్ ఖాన్ సైన్యంలో చేరిపోయారు. పాపడు కొద్ది నెలలు ప్రతిఘటించి, మందుగుండు అయిపోవటంతో మారువేషం వేసుకొని ఎవరికీ చెప్పకుండా రహస్యమార్గం ద్వారా కోటవిడిచి పారిపోయాడు. అప్పటికి అతని కొడుకులు ఇంకా యూసఫ్ ఖాన్ తో పోరాడుతున్నారు.

పాపడు మారువేషంలో హసన్నబాద్ అనే గ్రామాన్ని చేరుకొని అక్కడ ఒక కల్లు దుకాణంలో కూర్చొని కల్లు కావాలని అడగగా, ఇతన్ని ఆ దుకాణదారుడు గుర్తుపట్టి సైనికులకు అప్పగించటం జరుగుతుంది. వాళ్ళు పాపడిని బంధించి యూసఫ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్లారు. దొంగిలించిన సొత్తు ఎక్కడదాచాడో చెప్పమని ఎంత హింసించినా పాపడు ఏమీ చెప్పకపోవటంతో - పాపడి తలనరకి బహదూర్ షా వద్దకు పంపించి దేహాన్ని హైదరాబాద్ గేట్ కు వేలాడదీయించాడు యూసఫ్ ఖాన్.

అలా పాపడు కథ 1710 లో ముగిసింది.
****

III. చారిత్రిక పాపడికి వీరగాథ పాపన్నకు ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు?

పాపన్న జీవితం వీరగాథగా మారటానికున్న కారణాలలో ముస్లింలపై తిరుగుబాటు అనే అంశం ప్రధానంగా వినిపిస్తుంది. కానీ పాపన్న అనుచరులలో హుస్సైన్, తుర్కా హిమాన్, కొత్వాల్ మీర్ సాహిబ్ లాంటి ముస్లిమ్ వ్యక్తులు ఉన్నారు. అంతే కాక పాపడు దోపిడీ చేసిన వారిలో ముస్లిమ్ ఫౌజ్ దార్ లతో పాటు అనేక మంది హిందు జమిందార్లు కూడా ఉన్నారు. పాపడి ప్రధాన అనుచరులైన సర్వా హిందువు, పుర్దిల్ ఖాన్ ముస్లిము. కనుక పాపడి తిరుగుబాటు ప్రత్యేకించి ముస్లిముల ఒక్కరిపైనే కాదని అనుకోవచ్చు.

పాపడు అప్పటి అగ్రవర్ణ ఆధిపత్య వ్యవస్థపై తిరుగుబాటు చేసాడు అనేది మరొక కారణం. దీనికి ఆధారంగా- పాపడి అనుచరులలో చాకలి సర్వన్న, మంగలి మన్నన్న, కుమ్మరి గోవిందు, మేదరి యెంకన్న, యెరికల చిట్టేలు, యానాది పశేలు వంటి బలహీన వర్గాల వ్యక్తులు ఉండటం కనిపిస్తుంది.

అప్పట్లో వ్యవసాయ పనులులేని రోజుల్లో సగం ప్రజలు ఖాళీగా ఉండేవారు. వీరందరూ పాపడిని అనుసరించి ఉండొచ్చు అనే వాదనను త్రోసిపుచ్చలేం. అంతే కాక ఆనాటి సమాజంలో దొంగతనాన్ని వృత్తిగా కలిగిన కులాలు కూడా ఉండేవి. వీరు పాపడికి నాయకత్వంలో నడిచారు. వీరికి పాపడు వ్యవసాయ భూమిని ఇచ్చాడు. అందువల్ల వీరు పాపడిని ఒక వీరుడిగా జ్ఞాపకం పెట్టుకొని ఉంటారు.

ఇక మరొకవాదన- పాపన్న సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొన్నాడు అనేది. J.A. Boyle, 1874 లో సేకరించిన వీరగాథలో గోల్కొండను, బందరును కొల్లకొడతాను, బంగారు కడియాలు చేయిస్తాను అన్నపదాలు ఉన్నాయి. కొల్లకొడతాను అంటే దొంగతనం చేస్తాను అని అర్ధం. బంగారు కడియాలు చేయిస్తాను అంటే అందులో వ్యక్తిగత లాభాపేక్షే తప్ప సామ్రాజ్య వాదాన్ని అంతమొందిద్దామనే ఉద్దేసాలున్నాయనటం పాపన్నకు లేని ఔన్నత్యాన్ని ఆపాదించటంగా అనుకోవచ్చు.
****

IV. పాపడిని సామాజిక బందిపోటు అనుకోవచ్చా?

Eric Hobsbawn అనే చరిత్రకారుడు శ్రామిక వర్గాల తిరుగుబాట్లను విశ్లేషిస్తూ “Social Bandit” అనే ఒక పదాన్ని వాడాడు. అంటే రాబిన్ హుడ్ లా ధనికులను కొట్టి పేదలకు పెట్టే బాపతు అని.

ఈ సామాజిక బందిపోట్లకు సిద్ధాంత నేపథ్యం ఉండదు. రాజకీయ, ఆర్ధిక అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు వీరు తెరపైకి వస్తారు. వీరికి మార్గం ముఖ్యం కాదు గమ్యం ప్రధానం. ఇలాంటి వ్యక్తుల చర్యలు హింసాపూరితంగా, అమానవీయ ధోరణిలో ఉంటాయి.

అలాంటి పనులను ఈనాటి రాజ్యాంగం ప్రకారం విశ్లేషించవలసి వస్తే క్రిమినల్ చర్యలుగా పరిగణించాలి. ఇలాంటి వారిని రాజ్యం దోపిడి దారులుగా జమకడితే, సామాన్యజనం వీరులుగా కీర్తిస్తారు. వీరగాథలు అల్లుకొంటారు. పాపడిని ఈ కోణంలోంచి చూస్తే Social Bandit గా భావించవచ్చు.

పాపడు ధనికులను కొట్టటం అనే మాట సత్యమైనా ఆ సంపదలను నిర్మాణాత్మక పనులకు ఉపయోగించినట్లు కనిపించదు. (గుళ్ళూ, పంట చెరువులు తవ్వించాడని చెపుతున్నా అవి ఫ్యూడల్ వ్యవస్థలో పరోక్ష దోపిడీ మార్గలే).
***

ఉపసంహారం

పాపడి జీవితాన్ని గమనిస్తే సొంత భార్య, బావమరిది, చివరలో ఇతని అనుచరులు, సాటి కులస్తుడైన కల్లువ్యాపారి ఇతడిని విశ్వసించలేదని అర్ధమౌతుంది. ఇది బహుశా అంతవరకూ పాపడు చేస్తున్నది పులిస్వారీ అని అతని సన్నిహితులకు అర్ధమై ఉంటుంది. అందుకనే అందరూ చివరలో తనని విడిచిపెట్టేసారు.

వాతావరణం, విద్యావిధానం, మూఢనమ్మకాలు, కట్టుకథల పట్ల మోజు లాంటి కారణాలవల్ల హిందువులలో చరిత్రపట్ల ఉదాసీనత, నిర్లక్ష్యము ఏర్పడ్డాయని అన్న మెకంజీ అభిప్రాయం నేటికీ ప్రాసంగితను కోల్పోలేదు. అందుకనే దేవాలయాల స్థలపురాణాలకు ఉన్న ప్రాధాన్యత చారిత్రిక అంశాలకు ఉండదు.

బహదూర్ షాతో సన్మానం అందుకున్న తరువాత పాపన్న దొంగతనాలకు స్వస్థి చెప్పి తాను ఆక్రమించుకొన్న జమిందారీలను అనుభవించుకొంటూ ఉండినట్లయితె బహుసా రెడ్డి, వెలమ, నాయక రాజుల్లా ఒక రాజవంశాన్ని నిర్మించిన మూలపురుషుడిగా చరిత్రలో నిలిచిపోయేవాడేమో. అప్పుడు
సర్వాయి పాపన్న వీరగాథ ఉండేది కాదేమో- అది వేరే విషయం.

బొల్లోజు బాబా

References
1. J. F. Richards and V. Narayana Rao, “Banditry in Mughal India: Historical and Folk Perceptions,”
2. A Social History of the Deccan, 1300–1761 edited By Richard M. Eaton, Chapter 7 Papadu (F L. 1695–1710): Social Banditry In Mughal Telangana
3. The Mughal State 1526-1750 Edited By Muzaffar Alam Sanjay Subrahmanyam
4. The Indian Antiquary, A Journal Of Oriental Research. Telugu Ballad Poetry By J. A. Boyle, Esq., Mos.
5. Khafi Khan, Muntakhab al-lubab (Calcutta, 1874).
6. సర్వాయి పాపన్న పై వికిపీడియా వ్యాసం
7. సర్దార్ సర్వాయి పాపన్న, దళిత బహుజన వీరుడు, కొంపెల్లి వెంకట్ గౌడ్.