Wednesday, October 19, 2022

చరిత్రను పొదువుకొన్న కవిత్వం-థేరీగాథలు



ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారికి ధన్యవాదములు
థాంక్యూ సోమచ్ సర్.
బొల్లోజు బాబా
ఈ పుస్తకం ధర ₹150 + ₹30 పోస్ట్ ఖర్చులు. కావలసిన వారు 9848023384 కి కాల్ చెయ్యగలరు
.
చరిత్రను పొదువుకొన్న కవిత్వం-థేరీగాథలు

1. మీరు మౌలికంగా కవి అని అనుకుంటాను. చరిత్ర పట్ల మీ ఉద్వేగం చరిత్ర అధ్యయనం లో కనిపిస్తుంది. థేరీ గాథలు మిమ్మల్ని ఆకర్షించడానికి కారణం కవిత్వమా? లేక చరిత్రా?

జ. సాహిత్యంలో తొలిసారిగా నిక్షిప్తం చేయబడిన స్త్రీల హృదయస్వరాలు థేరీగాథలు. రెండున్నరవేల సంవత్సరాల క్రితపు థేరీ గాథలలోని కవిత్వం నేటికీ మన హృదయాల్ని కంపింపచేస్తుంది. ఆ కారణంగానే కావొచ్చు వీటిని అనువదించే సమయంలో గొప్ప అనుకంప పొందాను. ఆ కవిత్వం ఇచ్చే అనుభూతి కన్నా చరిత్రపరంగా ఆ గాథలద్వారా లభించే ఆనాటి సమాజం గురించిన సమాచారం మరింత విలువైనది అనుకొంటాను. ఇది వస్తువులకో సాహిత్యానికో ఉండే యాంటిక్ వాల్యూ లాంటిది కాదు. ఫెమినిజం విషయమై – స్త్రీపురుషులిద్దరూ సమానమేనని, పురుషాధిక్య పీడనను ఒదిలించుకోవటానికి ఒంటరిగానైనా జీవించవచ్చు అంటూ అప్పట్లోనే అంతటి పురోగమన భావాలను వ్యక్తం చేసిన సమాజం వాటన్నిటినీ కోల్పోయి ఇరవయ్యో శతాబ్దంలో పాశ్చాత్య సమాజాలనుండి ఫెమినిజం పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావటంలోని చారిత్రికపరిణామం పట్ల ఆసక్తి అది.
నీ నేత్రాలు అందంగా ఉన్నాయి అంటూ, తనను ప్రేమిస్తున్నానని వేధించే యువకునికి తన కనుగుడ్డును పెరకి నువ్వు ఇష్టపడే కన్ను ఇదిగో, ఇది శ్లేష్మంనిండిన గోళం అని చెప్పిన శుభ గొప్ప అసమానమైన ప్రతీకతో స్త్రీ దేహం సుఖాలకు నెలవు కాదు, స్త్రీ ఒక భోగవస్తువు కాదు అనే విషయాన్ని నిర్ధ్వంధ్వంగా ప్రకటించింది.
నేను స్వేచ్ఛనొందాను, మూడు కుటిల విషయాలనుండి, భర్త రోలు రోకలి – అంటూ ముత్త తన స్వేచ్ఛను, తన దేహంపై హక్కులను, తన శ్రమ విలువను తనకు తానే నిర్వచించుకొంటుంది. ఇలాంటి స్పష్టత కొరకు ఆధునిక మహిళ ఇంకా పోరాడుతూనే ఉంది.
 
2. దుఃఖం అనే మాట బౌద్ధంతో విడదీయరాని పదం. థేరీ గాథలలో స్త్రీల దుఃఖపు గాథల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?

జ. ఈ గాథలు చాలామట్టుకు దుఃఖాన్ని నేపథ్యంగా కలిగిన స్త్రీలుచెప్పుకొన్న అనుభవాలు. భర్తను మరో స్త్రీతో పంచుకోవటం, పుట్టిన సంతానం చనిపోవటం, కాపురంలో భర్త పెట్టే హింస, ప్రాణాలుతోడేసే కాన్పులు, సంసారంలో గొడ్డు చాకిరీ, భర్త చనిపోవటం లేదా వదిలేసిపోవటం, వార్ధక్యంలో పిల్లలు ఆస్తిలాక్కొని ఇంట్లోంచి గెంటేయటం లాంటి అనేక స్త్రీల దుఃఖాలు ఈ గాథలనిండా పరచుకొని ఉన్నాయి. “స్త్రీగా ఉండటమే ఒక దుఃఖం” అంటుంది కిసగౌతమి అంతిమంగా.
తాము సన్యసించటానికి ప్రధాన కారణాలు, దుఃఖ మూలాల అన్వేషణ, దుఃఖ నివారణ, దుఃఖం నుండి విమోచన చెందటం అని ఈ స్త్రీలు చాలా గాథలలో చెప్పుకొన్నారు. రాగ ద్వేష మోహాలను అధికమించిన స్థితి అయిన నిబ్బాణను సాధించటం జీవితాశయంగా భావించారు. “నా హృదయంలో దిగిన దుఃఖమనే అదృశ్యబాణాన్ని తథాగతుడు తీసివేసాడు” అని అనేకమంది థేరీలు ప్రకటించుకొన్నారు. తమ దుఃఖం బుద్ధుని బోధనల వల్ల తొలగిపోయిందని తొలితరం బౌద్ధ సన్యాసినులు చెప్పిన సాక్ష్యమే ఈ గాథలు.

3. భారతీయ సాహిత్యం మీద థేరీ గాథల ప్రభావం కొనసాగిందని భావించ వచ్చా?

జ. థేరీగాథలను ఒక సాహిత్య నెరేటివ్ గా భావిస్తే – విద్య, స్వేచ్ఛ, ఆథ్యాత్మిక సాధనలకు స్త్రీలు అర్హులని ప్రభోదించాయి. అప్పట్లో స్త్రీ పురుషునితో సమాన హోదాను పొందేదని అనేక గాథల ద్వారా అర్ధమౌతుంది. – “ధమ్మదిన్నా! రా నాపక్కన కూర్చుని విను, నేను సన్యసించదలిచాను, ఈ సంపదలకు నీవే వారసురాలవు, నీకు ఇష్టమైతే ఇక్కడే ఉండవచ్చు లేకపోతే మీ పుట్టింటికి వెళిపోవచ్చు” అంటూ ఒక భర్త భార్యతో చేసిన సంభాషణ ఈనాటికీ తాజాగానే ఉంది. కూతురు ఇసిదాసి కాపురం చెడిపోతూండటంతో రెండుసార్లు పునర్వివాహం చేస్తాడొక తండ్రి. నిన్నమొన్నటివరకూ పునర్వివాహం అన్నమాటే నేరం మన సమాజంలో. భర్త తనను చంపటానికి పన్నాగం పన్నాడని తెలుసుకొన్న భద్ధ, భర్తనే హత్యచేస్తుంది. హత్యచేయటం సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు, కానీ అలాంటి ప్రమాదకర బంధంలోంచి నేడు ఎంతమంది ధైర్యంగా బయటకు రాగలుగుతున్నారనేది చర్చనీయం.
గాథాసప్తశతి, హరివిజయ, సేతుబంధ, గౌదావహొ, లీలావాయి, వజ్జాలగ్గ లాంటి ప్రాకృత రచనల నుండి సుమారు 3000 వరకూ అందమైన పద్యాలను వివిధ సంస్కృత అలంకార గ్రంథాలలోకి ఉదాహరణలుగా, ఇతర సంస్కృత కావ్యాలలో వర్ణనలుగా, తీసుకొన్నట్లు V.M. Kulkarni పరిశోధన చేసి తెలిపారు. థేరీ గాథలు కూడా అదే కోవకు చెందిన ప్రాకృత (పాలీ) రచన. కానీ థేరీ గాథలనుండి ఏ రకమైన భావాల సంగ్రహణ జరగకపోవటాన్ని బట్టి ప్రధాన స్రవంతి సాహిత్యం థేరీగాథలను ఫూర్తిగా విస్మరించిందనే భావించాలి. దీనికి కారణం కారణం భాష కాక భావజాలం అని అనుకోవచ్చు.
థేరీగాథల తదుపరి వచ్చిన భారతీయ సాహిత్యం స్త్రీపురుషులు ఇరువురూ సమానమే అనే భావననుండి దూరంగా జరిగి పాతివ్రత్యం, న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అనే భావజాలంలోకి జారిపోవటం గమనార్హం.

4. గాథాసప్తశతి, గౌడవహా, వజ్జలగ్గ, థేరీ గాథలు, ప్రాచీన భారతీయసాహిత్యంలో ఇవి ప్రధాన స్రవంతిగా కాక ఒక పాయగా వుండి నాయనిపిస్తుంది. దీని గురించి మీ అభిప్రాయం?
జ. చెప్పలేం. ఇవి బౌద్ధ, జైన మతాలతో సంబంధం ఉన్న ప్రాకృత రచనలు. ఎప్పుడైతే సంస్కృతం పండితభాషగా స్థిరపడిందో అప్పటినుంచి ప్రాకృత రచనలకు బదులు సంస్కృత కావ్యాలు రావటం మొదలైంది. ప్రాకృతభాష ఉత్థానపతనాలు ప్రాచీన భారతదేశ మతచరిత్రతో ముడిపడి ఉండటం ఆసక్తికరం. సాశ. 4వ శతాబ్దం నుండి సంస్కృతం భరతఖంఢంలో నలుమూలలకు విస్తరించ సాగింది. అంతవరకూ క్రతువులకు, మతసంబంధ రచనలకు పరిమితమై ఉన్న సంస్కృతం ఒక్కసారిగా రాజాశ్రయం పొంది రాజకీయభాషగా, సాహిత్యభాషగా మారటం దక్షిణ ఆశియా చరిత్రలో కీలక రాజకీయ, సామాజిక పరిణామంగా The Language of Gods అనే పుస్తకంలో Sheldon Pollock అభిప్రాయపడ్డాడు. ఈ వెల్లువలో అంతవరకూ ప్రధాన స్రవంతిగా ఉన్న ప్రాకృత రచనలు కొట్టుకుపోయి ఉండవచ్చ్చు.
నేడు తాళపత్ర గ్రంధాలను డిజిటైజ్ చేస్తున్నట్లుగానే ఆనాటికి ఉన్న ప్రాకృత రచనలలో మతప్రసక్తి లేని అంశాలను కొందరు పండితులు సంస్కృతభాషలోకి ఏదో మార్గం ద్వారా తీసుకొచ్చినట్లు పైన చెప్పిన V.M. Kulkarni పరిశోధన ధృవపరుస్తుంది.
 
5. ఈ రచన చేయటంలో మీ అనుభవాలు చెప్పండి
జ. మీకు గుర్తుందో లేదో చాన్నాళ్ళ క్రితం మీరు థేరీగాథలు చదివారా అని అడిగారు. అప్పటికి వాటిగురించి విన్నాను తప్ప చదవలేదు. నెట్ లో వెతికితే శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి బ్లాగులో థేరీ గాథలపై వ్రాసిన అద్భుతమైన వ్యాసం కనిపించింది. మూలాల కోసం అన్వేషించాను. చాలానే కనిపించాయి. ఆనాటి స్త్రీలు, వారి జీవనం, చారిత్రిక నేపథ్యం చదువుతున్నప్పుడు గొప్ప అనుభూతికి లోనయ్యాను. దాని ఫలితమే నేడు మీ చేతిలో ఉన్న “థేరీగాథలు-తొలితరం బౌద్ధ సన్యాసినుల కవిత్వం” అనే పుస్తకం
థేరీ అంటే సన్యాసిని లేదా భిక్షుణి అని అర్ధం. తొలి తరం బౌద్ధ సన్యాసినులు తమ అనుభవాలకు ఇచ్చుకొన్న కవిత్వరూపమే థేరీ గాథలు. భిన్న సామాజిక నేపథ్యాలనుంచి వచ్చిన మొత్తం 73 మంది థేరీలు రాసుకొన్న 73 కవితలు ఇవి. మానవ దుఃఖం, వేదన, ముక్తికొరకు అన్వేషణ, తధాగతుని బోధనలలో దొరికిన సాంత్వన ఈ గాథల ప్రధాన ఇతివృత్తం. థేరీ గాథలు రెండున్నరవేల ఏళ్ళ క్రితపు సమాజాన్ని స్త్రీ దృక్కోణంలోంచి మనకు చూపిస్తాయి. ఈ పుస్తకం చివరలో ఒక్కో కవితయొక్క చారిత్రిక నేపథ్యాన్ని విపులంగా వివరించాను.
ఈ పుస్తక రచనా సమయంలో నాకు బౌద్ధ పరిభాష విషయంలో వచ్చిన అనేక సందేహాలను, ఎంతో ఓర్పుతో పూజ్య బిక్ఖు ధమ్మరక్ఖిత గారు తీర్చారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
 
(ప్రశ్నలు అడిగినది ప్రముఖ కవి, కథకుడు శ్రీ అద్దేపల్లి ప్రభు)


Monday, October 10, 2022

నీటిరంగుల సాయింత్రం



మాధురి అంతర్జాల పత్రికలో ప్రచురితమైన నా కవిత. మిత్రులు శ్రీ ఉండవల్లి ఎమ్ గారికి ధన్యవాదములు.
.
నీటిరంగుల సాయింత్రం
.
అందమైన కాన్వాస్ పై
సూర్యాస్తమయ దృశ్యాన్ని చిత్రించాను
రెండు కొండలు మధ్య
పండిన నారింజలా సూర్యబింబం,
వెండి అంచులతో మెరిసే మబ్బులు,
గూళ్ళకు చేరే పక్షులు
చిన్న కొలను దాని మధ్యలో కలువపూలు
అలలపై ఏటవాలు సూర్యకిరణాలు
రెక్కలమధ్య తలదాచుకొని ధ్యానముద్రలో కొంగ
ఒడ్డున పచ్చిక, పొదలు, దూరంగా రెండు కొబ్బరి చెట్లూ
అద్భుతంగా వచ్చింది చిత్తరువు

బ్రష్ మొనను నోటిలో ఉంచుకొని
పళ్ళమద్య ఆడిస్తూ
ఆ నీటిరంగుల చిత్రాన్ని, దాని సౌందర్యాన్ని
గొప్ప ఆరాధనతో ఆస్వాదిస్తూ
తదేకంగా ఆలా చూస్తూనే ఉండిపోయాను చాలాసేపు
చిత్తరువు కింద సంతకం చేద్దామనుకొనే లోపు
పండిన నారింజలాంటి సూర్యుడు
రెండుకొండల మధ్యలో అస్తమించాడు.
వెన్నెల నావనెక్కి వచ్చిన రాత్రి లోకి
నీటిరంగు వెలుగుల ఇంద్రజాలం అదృశ్యమైంది.

బొల్లోజు బాబా









థేరీ గాథలు***** మనసుతో చదవాల్సిన కవిత్వానుభవాలు - బెందాళం క్రిష్ణారావు



థేరీ గాథల పుస్తకంపై చక్కని అర్ధవంతమైన సమీక్ష చేసినందుకు కృతజ్ఞతలు సర్ బెందాళం క్రిష్ణారావు గారు
బొల్లోజు బాబా


.

బెందాళం క్రిష్ణారావు is with Bendalam KrishnaRao and
2 others.
·

థేరీ గాథలు*****
మనసుతో చదవాల్సిన కవిత్వానుభవాలు
- బెందాళం క్రిష్ణారావు
------------------------------------
చరిత్ర అంటే ఎవరికి ఆసక్తి ఉండదు..ప్రతి ఒక్కరికీ దానిని తెలుకోవాలన్న తపన తప్పక ఉంటుంది. అయితే అది కల్పనల్లో కూరుకుపోతే తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో గానీ నిజమైన ఆసక్తినీ, జిజ్ఞాసనీ అందించలేదు. ప్రాచీన భారత దేశ చరిత్రకు మూలాధారాల్లో అత్యంత కీలకమైనది బౌద్ధ సాహిత్యం. ..సంఘం శరణం గచ్ఛామి..అనే భావనలో జనించిన బౌద్ధం ఎప్పడూ నేలవిడిచి సాము చేయలేదు. అందుకే ఇది కాల్పనికతకు దూరంగా మానవ జీవన నైతికతతో మనసు కేంద్రంగా ధార్మిక పరిమళాలను ఈ లోకంలో వెదజల్లింది.
బుద్ధుని మహా పరినిర్యాణం తరువాత ఆనాటి మగధ రాజధాని రాజగృహ సమీపంలోగల సప్తపర్ణిక అనే గుహలో సమావేశమైన భిక్షువులు సుత్త, వినయ పిటకాలను క్రోడీకరించారు. అందులో సుత్త పిటకంలోని ఐదో భాగమైన ఖుద్ధక నికాయ నందున్న 18 గ్రంథాల సముదాయంలో ‘థేరీ గాథలు’ కూడా ఒకటి. ఆనాటి పాళీ భాష నుంచి ఇవి వందేళ్ల కిందట 1909లో తొలిసారిగా ఇంగ్లీష్ లోకి తర్జుమా అయినాయి. వాటన్నింటినీ పరిశీలించిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు, రచయిత బొల్లోజు బాబా ఈ పుస్తకాన్ని ‘థేరీ గాథలు’ పేరిట తెలుగులో తాజాగా అనుసృజన చేశారు. ఇందులోని కవిత్యరూప గాథలన్నీ 2600 సంవత్సరాల నాటి సమాజాన్ని మహిళా దృక్కోణంలో మన ముంగిట ఆవిష్కరిస్తాయి.
ఇందులోని కవితా వాక్యాలకు మూలకర్తలైన భిక్షుణిల పేర్లు బౌద్ధ సాహిత్యంలో ఎన్నో చోట్ల మనకు తారసపడతాయి. వీరంతా గౌతమ బుద్ధుని సమకాలికులు. తొలి భిక్షుణి సంఘం వీరితోనే ఆరంభమైంది. కొంతమంది ఆరంభమైన తర్వాత చేరినవారు కూడా ఉన్నారు. ప్రజాపతి గౌతమి ప్రోద్బలంతోనే బుద్ధుడు భిక్షుణి సంఘాన్ని ఆరంభించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ సంఘంలో మొత్తం భిక్షుణి (థేరీ)లు ఎంతమంది అనే కచ్చితమైన సంఖ్య తెలియకపోయినా 73మంది థేరీల గాథలను ఇందులో చదవవచ్చు.
 
ఈ థేరీలంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కారు. సమాజంలో అట్టడుగు స్థితి నుంచి రాజమాతల వంటి ఉన్నత స్థాయికి చెందినవారు ఉన్నారు. తమ తమ జీవన నేపథ్యాలు ఎంతో విభిన్నమైనవి అయినప్పటికీ వీరందరినీ సద్ధమ్మమే కలిపింది.
 
ఈ థేరీ గాథల్లో ఐదు పంక్తుల కవితా వాక్యాల నుంచి ఏడు పేజీల వరకూ 68 గాథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. థేరీల మధ్య జరిగిన సంభాషణలు, వారికి బుద్ధుడు ఇచ్చిన ఉపదేశాలు. ఈ గాథల్లో ఎంతో రమణీయంగా తొణికిసలాడుతుంటాయి. ఆనాటి సామాజిక జీవితాన్ని, రాజకీయ పరిస్థితుల్ని ఈ గాథలు చదువరుల కళ్లముందు నిలుపుతాయి. ఆ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
 
దు:ఖ మూలాలను అర్ధం చేసుకోవడంలో, వాటిని అధిగమించడంలో తధాగతుని మార్గంలో ఎలా పయనిస్తున్నామో థేరీలు కవితాత్మకంగా ఈ గాథల్లో అభివ్యక్తీకరించారు. రెండున్నర సహస్రాబ్ధాల కిందట, అంతకు వందేళ్ల ముందే మహిళల మానసిక అనుభవాలు, భావ వ్యక్తీకణ, ధార్మిక అవగాహన ఎంత స్పష్టంగా, సూటిగా, లోతుగా ఉందో చెప్పడానికి ఈ థేరీ గాథలే చారిత్రక సత్యాలు. వారికి ఆ మనో స్పష్టతని, చైతన్యాన్ని ఇచ్చింది తధాగతుడు ఉపదేశించిన బౌద్ధ ధమ్మమే తప్ప వేరొకటి కాదు.
 
బుద్ధుని కాలానికి చేతిరాత గ్రంథాలు లేవు. ఆయా సమయాల్లో, వివిధ సందర్భాల్లో చేసిన బోధనలను విని జ్ఞప్తిలో ఉంచుకోవడానికి పదేపదే మననం చేసుకోవడం తప్ప ఇంకెలాంటి సౌలభ్యం లేదు. అయినా ఈ గాథలు ఎప్పటికప్పుడు రాసుకుని ఉన్నవాటిగా అనిపిస్తాయి. థేరీలు ‘శీల- సమాధి- ప్రజ్ఞ’లతో జీవితాలను, అంతరంగాలను మమేకం చేసుకుని అష్టాంగమార్గంలో ముందుకుసాగడం వల్లే ఈ గాథలు ఇంతటి ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
 
విద్యను మహిళలకు, శూద్రులకు ఎంతో దూరం చేసిన ఆనాటి సమాజపు కారుచీకట్లలో ఈ థేరీలు ధార్మిక విద్యుల్లతలై ఈ కవితా గాథలను ప్రకాశవంతం చేశారు. ఈ గాథలతో పాటు ‘ఎండ్ నోట్స్’ పేరిట రచయిత బొల్లోజు బాబా 32 పేజీల్లో ఎంతో ఉపయుక్తమైన అంశాలను అందించారు. ఇందులో ఆయన ఇచ్చిన సమాచారం, విశ్లేషించిన విషయాలు థేరీ గాథలకు ఒక పరిపూర్ణతని తీసుకొచ్చాయి. ఆనాటి మానవ సంబంధాలను, సామాజిక సంబంధాలను బౌద్ధ సాహిత్య వెలుగుల్లో వివరిస్తూ మంచి విశేషాలను అందించారు. ఆనాటి మహిళల జీవితాల్లో ఆవరించిన దు:ఖం, విషాద సందర్భాలు, నిస్సహాయత ఎలాంటివో ఈ గాథలు తట్టిలేపుతాయి. ఎంతో ఆధునిక ప్రపంచంలో ఉన్నామని భావిస్తున్న నేటికాలంలో కూడా మహిళల జీవితాలను అడుగడునా సవాల్ చేస్తున్న దు:ఖం, విషాదాలు, కన్నీళ్లు, కలతలు, ప్రేమ రాహిత్యం, నిస్సహాయత వంటివన్నీ ఆనాటికి ముందు నుంచే రకరకాల రూపాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయని అర్ధమైన తర్వాత మనసు ఎంతో ఆర్ద్రతకు లోనవుతుంది. మార్పు రావాల్సింది బయట ప్రపంచంలో మాత్రమే కాదని..ముందు అది మనసు లోలోతుల్లోంచి జనించాలని మరోసారి స్పష్టమౌతుంది.
ఈ పుస్తకానికి భిక్ఖు ధమ్మరక్ఖిత బంతే అర్ధవంతమైన ముందుమాటని, ప్రసిద్ధ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు చివరి కవర్ పేజీపై ఇందులోని అంశాల నేపథ్యాన్ని తనదైన శైలిలో పరిచయ రూపంలో అందించారు.
 
ఇటీవల వస్తున్న పుస్తకాల శ్రేణిలో ‘థేరీ గాథలు’ ఎంతో విలువైన పుస్తకం అని భావిస్తున్నాను. 182 పేజీల్లో ఉన్న ఈ పుస్తకాన్ని ఒకసారి చదివి పక్కన పెట్టేయడానికి వీలు కుదరదు. కేవలం కళ్లు, నోటితో మాత్రమే కాదు. పదేపదే మనసుతో చదవాల్సిన పుస్తకమిది. అప్పుడే చదువరులు థేరీల మనోస్పందన వినగలరు. ఈ పుస్తకం కోసం హైదరాబాద్ లోని ఛాయ రిసోర్స్ కేంద్రం వారిని 7093165151 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చును.
**************

కాకినాడ ఆత్మను ప్రతిబింబించే రచన-అలనాటి కోకనాడ



శ్రీ గొడవర్తి సత్యమూర్తి గారు రచించిన అలనాటి కాకినాడ అనే పుస్తకంపై నేను చేసిన పరిచయ వ్యాసం. ఇది సాహిత్య ప్రస్థానం, అక్టోబరు, 2022 సంచికలో ప్రచురింపబడింది. ఎడిటర్ సత్యాజీ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
ఈ పుస్తకావిష్కరణ రోజున నా అభిమాన రచయిత శ్రీ యండమూరిగారి సమక్షంలో ప్రసంగించటం మరచిపోలేని గొప్ప జ్ఞాపకం.
బొల్లోజు బాబా
.
కాకినాడ ఆత్మను ప్రతిబింబించే రచన-అలనాటి కోకనాడ
.
కాకినాడ చుట్టూ చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. వాటి చరిత్రపై ఇప్పటికే అనేక మంది పుస్తకాలు వెలువరించారు. పక్కనే ఉన్న పిఠాపురం చరిత్రపై పి.వి. పరభ్రహ్మ శాస్త్రి, కందుకూరి ఈశ్వర దత్తు, కురుమెళ్ళ వెంకటరావు, శ్రీరాం వీరబ్రహ్మకవి లాంటి చరిత్రకారులు గొప్ప లోతైన పుస్తకాలను రచించారు.
రాజమహేంద్రవరం చరిత్రను శ్రీచిలుకూరి వీరభద్రరావు, శ్రీభావరాజు వెంకట కృష్ణారావు, శ్రీబేతవోలు రామబ్రహ్మం గ్రంధస్థం చేసారు. కోరంగి చరిత్రను శ్రీ పొన్నమండ రామచంద్రరావు వెలువరించారు.
పెద్దాపురం, సామర్లకోట చరిత్రలను శ్రీ వత్సవాయి రాయజగపతివర్మ గారు రికార్డు చేసారు. ఇటీవల శ్రీ వంగలపూడి శివకృష్ణ పెద్దాపురం చరిత్రను పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు.
ద్రాక్షారామం ఆలయచరిత్రపై SrI Y V Ramana , శ్రీ మారేమండ రామారావు, శ్రీ జాస్తి దుర్గాప్రసాద్ లు పుస్తకాలు వెలువరించారు. శ్రీ దాట్లదేవదానం , ఈ వ్యాసకర్త యానాం చరిత్రను గ్రంధస్థం చేసారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే- Nothing has really happened until it has been recorded అంటారు ప్రముఖ రచయిత్రి వర్జీనియా వుల్ఫ్. అలా చూసుకొన్నప్పుడు చరిత్రను రికార్డు చేయటం అనేది ఎంతటి అవసరమైన ప్రక్రియో అర్ధమౌతుంది.
 
1. కాకినాడ చరిత్రపై మొదటి పుస్తకం ఈ “అలనాటి కోకనాడ”

గొప్ప చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల మధ్య ఉన్నప్పటికీ కాకినాడ పట్టణ సమగ్ర చరిత్రను తెలిపే పుస్తకం ఇంతవరకూ రాలేదు. 1917 లో అనసూయ అనే పత్రికలో “కాకినాడపుర పూర్వచరిత్ర” పేరుతో ఒక వ్యాసం వచ్చింది.
కల్నల్ మెకంజి అనే బ్రిటిష్ అధికారి 1815-16 లలో ఈ ప్రాంతపు స్థానిక చరిత్రలను సేకరించి కైఫియ్యతుల రూపంలో భద్రపరిచాడు. వాటిలో రాజమహేంద్రవరం, సామర్లకోట, సర్పవరం, జల్లూరు ఉన్నాయి తప్ప కాకినాడ కైఫియ్యతు లేదు.
ఆ లోటును ఈ పుస్తకం భర్తీ చేస్తుంది. ఆ విధంగా శ్రీ గొడవర్తి సత్యమూర్తి గారి కృషి ఎంతో విలువైనది. చారిత్రాత్మకమైనది. తూర్పుగోదావరి జిల్లా చరిత్రకు సంబంధించి ఈ పుస్తకం ఒక గొప్ప జోడింపు.
***
కాకినాడకు సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ప్రస్తావన మూడవ విష్ణువర్ధనుడు (క్రీశ.709-746) వేయించిన ఈపూరు శాసనంలో కనిపిస్తుంది. దానిలో కేశవశర్మ అనే బ్రాహ్మణునికి దానంగా ఇచ్చిన భూమి సరిహద్దులు ఇలా చెప్పబడ్డాయి.
“పోల్నాడు విషయే జలయూరు నామ గ్రామే పశ్చిమదిశాయాం ఏలియేరునదీ పశ్చిమతః ప్రభాకరక్షేత్రోత్తర కాకండివాడ క్షేత్రపూర్వతః….
పోల్నాడువిషయ అంటే నేటి పిఠాపురం తుని పెద్దాపురం ప్రాంతాలు, జలయూరు అంటే నేటి జల్లూరు, ఏలియేరునది అంటే నేటి ఏలేరునది, కాకండివాడ అంటే నేటి కాకినాడ. పై శాసనం ఆధారంగా ఎనిమిదవ శతాబ్దంలో కాకినాడ కాకండివాడ పేరుతో వ్యవహరింపబడిందని గుర్తించవచ్చు.
ఆ తరువాత కాకినాడ ప్రస్తావన పదిహేనో శతాబ్దం వరకూ ఎక్కడా కనిపించదు. పద్నాలుగో శతాబ్దంలో ఈ ప్రాంతంలో సంచరించిన శ్రీనాథుడు – పిఠాపురం, ద్రాక్షారామం, చాళుక్యభీమవరం, కోటిపల్లి, భైరవపాలెం, పట్టిసీమ, పలివెల లాంటి ప్రాంతాల గురించి చెబుతాడు తప్ప కాకినాడ ప్రస్తావన చేయలేదు. అంటే అప్పటికి కాకినాడ ప్రాముఖ్యత కలిగిన ఊరుగా రూపుదిద్దుకొని ఉండకపోవచ్చు.
రాజమహేంద్రవరం కైఫియ్యతులో కాకినాడ కాకినాడుగా చెప్పబడింది. క్రీశ.1450 ప్రాంతంలో మట్టుపిల్లివారు అనే కమ్మవారు, క్రీశ.1500ల ప్రాంతంలో చిట్నీడి ధర్మారాయినిం అనే వెలమవారు క్రీశ.1670 లలో చంద్రారాయిణింగారు ఈ కాకినాడు ప్రాంతాన్ని జమిందారీ చేసినట్లు మెకంజీ కైఫియ్యతుల ద్వారా తెలుస్తుంది. ఈ చంద్రారాయణింగారి వారసులే నేడు మనం చెప్పుకొనే పిఠాపురం జమిందారులు.
 
2. ఆసక్తికర సంఘటనల సమాహారం ఈ పుస్తకం

చరిత్ర రచన అనేది చాలా శ్రమతో కూడుకొన్నది. శక్తియుక్తులను హరించివేసే పని అది. ఎందుకంటే నేడు మనముందు అపారమైన సమాచారం ఉంది. దేన్ని సేకరించాలి, ఎంతవరకూ సేకరించాలి, సేకరించిన వాటిని ఎలా ఒక వరుసక్రమంలో అమర్చుకోవాలి అనే విషయాలు కత్తిమీద సాములాంటివి. ఈ పుస్తకం చదివితే ఆ పనిని శ్రీ గొడవర్తి సత్యమూర్తి గారు సమర్ధవంతంగా నిర్వర్తించారని అర్ధమౌతుంది. శ్రీ సత్యమూర్తిగారు ఐదేళ్లుగా ఎంతో ఓపికగా ఈ పుస్తక సమాచారాన్ని సేకరించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా శోధించి, నిర్ధారించుకొన్న తరువాతే ఈ పుస్తకరూపంలోకి తెచ్చారు. అందుకనే దీనిలోని ప్రతివ్యాసానికి గొప్ప సాధికారికత వచ్చింది. ఇందులో ఎక్కడా అభూతకల్పనలు, అసత్యాలు, వక్రీకరణలు, హిస్టారికల్ ఇన్ కన్సిస్టెన్సీస్, హిస్టారికల్ ఫాలసీస్ లాంటివి లేకపోవటం సత్యమూర్తి గారి అకుంఠితమైన కృషికి, అనన్యసామాన్యమైన ప్రతిభకు, ఖచ్చితత్వానికి నిదర్శనం.
ఈ పుస్తకంలో ఇతరులు రాసిన కొన్ని వ్యాసాలు ఉన్నాయి. వాటిని యధాతధంగా మూలరచయిత పేరుతోనే ఈ పుస్తకంలో చేర్చారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలను గ్రహించి తిరిగి కొత్తగా తిరగరాయటం, ఎన్నో ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్న సత్యమూర్తి గారికి పెద్ద కష్టమైన పని కాదు. కానీ వీరు అలా చేయకపోవటం వీరి మంచితనం. నిజాయితీ. సత్యసంధత.
చరిత్రపుస్తకాలకు ప్రధానంగా ఉండాల్సినవి సంఘటనల క్రమం మరియు తదనంతరకాలంలో ఆ సంఘటనల వల్ల ప్రభావితమైన పరిణామాలు. అలనాటి కోకనాడ పుస్తకంలోని వ్యాసాలను 8 చాప్టర్లుగా విభజించారు. ఇలా విభజించటం వలన మంచి రీడబిలిటీ వచ్చిందీ పుస్తకానికి.
***
విలక్షణమైన నగరం పేరుతో ఉన్న మొదటి చాప్టర్ లో కాకినాడ ప్రాచీన చరిత్రను క్రీస్తుశకం ఏడో శతాబ్దం నుండి 1839 సంవత్సరంలో వచ్చిన కోరంగి తుఫాను వరకూ సవివరంగా చెప్పారు. చరిత్రగమనంలో కాకినాడ పాత్రను ఈ విభాగం సోదాహరణంగా వివరిస్తుంది.
రెండవ చాప్టరు పేరు అపురూప కట్టడాలు. ఈనాటికి నిలిచి ఉన్న డచ్ వారి నిర్మాణాలు, కలక్టర్ భవనము, పురపాలక భవనం, విక్టోరియా వాటర్ వర్క్స్ లాంటి కలోనియల్ బిల్డింగుల గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని పొందుపరిచారు. ఈ విభాగంలో మొత్తం 11 వ్యాసాలున్నాయి.
పరాయిపాలనలో నగరం అనే విభాగంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన కాకినాడ బాంబుకేసు, కాకినాడ దొమ్మీకేసు, ఇంగ్లీషు క్లబ్ ధ్వంసం లాంటి సంఘటనల పూర్వాపరాలు ఉత్కంఠ కలిగేలా వర్ణించారు.
స్వరాజ్య సైనికులు పేరుతో ఉన్న విభాగంలో స్వాతంత్రపోరాటంలో పాల్గొన్న అలనాటి యోధులైన మహర్షి బులుసుసాంబమూర్తి, మల్లిపూడి పళ్ళంరాజు, చెలికాని రామారావు, మర్ల అప్పయ్యశాస్త్రి లాంటి వారి గురించి అరుదైన సమాచారాన్ని పొందుపరచారు. ఈ విభాగంలో 10 వ్యాసాలున్నాయి.
విద్యాలయాలు పేరుతో ఉన్న అయిదో విభాగంలో పి.ఆర్. కళాశాల, ఆంధ్రా పాలిటెక్నిక్, మెక్లారిన్ హైస్కూల్, రంగరాయ మెడికల్ కాలేజ్, సిబిఎమ్ పాఠశాల ఎమ్.ఎస్ ఎన్. కళాశాల లాంటి వివిధ విద్యాలయాల ఆవిర్భావం, అభివృద్ధి, వాటి విశిష్టతలను తెలుపుతూ మొత్తం 20 వ్యాసాలు ఉన్నాయి.
అలనాటి సంస్థలు అనే ఆరో చాప్టరులో బాంక్ ఆఫ్ మద్రాస్, ఆంధ్రసాహిత్య పరిషత్, ప్రభుత్వ ఆసుపత్రి, కోకనాడ చాంబర్ ఒఫ్ కామర్స్, సరస్వతి గానసభ, యంగ్మెన్స్ లైబ్రేరి, బ్రహ్మసమాజమందిరం, ఈశ్వర పుస్తక భాంఢాగారం, గాంధిభవన్, టౌన్ హాల్, కాస్మొపాలిటన్ క్లబ్ లాంటి అనేక సంస్థల పుట్టు పూర్వోత్తరాలు వాటి చరిత్రను మొత్తం 32 వ్యాసాలలో అత్యంత ఆసక్తికలిగే విధంగా చెప్పారు. ఇవన్నీ దాదాపు వందా నూట యాభై ఏండ్లుగా నడిచిన ఇంకా నడుస్తున్న సంస్థలు.
ఈ సంస్థల చరిత్ర, కాకినాడ సమాజ నిర్మాణంలో ఇవి పోషించిన పాత్ర చదువుతున్నప్పుడు, మన ముందుతరం వారి క్రాంతదర్శనం, వారు చేసిన సాంఘిక సేవ మనకు అర్ధమౌతుంది. మనం ఇంకా ఎంత ఉన్నతంగా జీవించవచ్చో ప్రేరణ కలిగిస్తుంది.
ఎందరో మహానుభావులు పేరుతో ఉన్న చాప్టరులో శ్రీ మల్లాడి సత్యలింగనాయకర్, పిఠాపురం మహారాజ వారు, బుర్రా వెంకటప్పయ్య, లంకలపిల్లి రామారావు, వింజమూరి సిస్టర్స్, కృత్తివెంటి పేర్రాజు పంతులు, డా.లక్కరాజు సుబ్బారావు, దురిశేటి శేషగిరిరావు, పైడా వెంకట నారాయణ, లాంటి లబ్దప్రతిష్టులైన స్థానికుల జీవితాలను ఛాయామాత్రంగా స్పృశిస్తూ మొత్తం 24 వ్యాసాలు ఉన్నాయి.
ఇక చివరగా అలనాటి జ్ఞాపకాలు పేరిట ఉన్న విభాగంలో ఉన్న కాకినాడ పురపాలక సంఘానికి చైర్మన్ లుగా వ్యవహరించినవారి జాబితా, పార్లమెంటు సభ్యుల, శాసన సభ్యుల వివరాలు, వివిధ ప్రాంతాల పేర్లు ఎలా వచ్చాయో వంటి విశేషాలతో 15 వ్యాసాలు కలవు. ఇవి కాకినాడ ఉజ్వలవైభోగాన్ని తెలుపుతాయి.
నా ఊహలలో రేపటి కాకినాడ అనే పేరుతో వివిధ పట్టణ ప్రముఖులు చెప్పిన అభిప్రాయాలు ఈ పుస్తకం చివరలో పొందుపరచారు. వాటిలో కాకినాడ అత్యుత్తమనగరంగా రూపుదిద్దుకోవటానికి జె ఎన్ టి యు ప్రొఫసర్ డా. కె.వి.ఎస్. వి మురళికృష్ణగారు ఇచ్చిన కొన్ని సూచనలు ఇవి. వీటిపై నాయకులు దృష్టిపెడతారని ఆశిస్తాను.
*బీచ్ రోడ్డును అభివృద్ధి చేయాలి
* కోరంగి మడ అడవులను టూరిస్టు కేంద్రంగా తీర్చిదిద్దాలి
* ఆంధ్రుల సంస్కృతి, చరిత్రలను ప్రతిబింబించేలా కాకినాడలో మ్యూజియం నెలకొల్పాలి
* కాకినాడలో ఒకనాటి బ్రహ్మసమాజ మందిరంలాగ ప్రపంచంలోని 10 ప్రధాన మతాలకి సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రంను ఒకేచోట నిర్మించాలి
*బయో డైవర్సిటీ పార్క్ ను ఏర్పరచాలి

3. ముగింపు
ఒక ప్రాంత చరిత్రను చదివినపుడు ఆ ప్రాంతం ఏ మేరకు ప్రపంచ, దేశీయ పరిణామాలలో పాలుకొంచుకొంది అనే పరిశీలన చేసినపుడే ఆ రచన సమగ్ర రచన అనిపించుకొంటుంది.
ఈ పుస్తకం చదివినపుడు భిన్న కాలాలలో కాకినాడ తన అస్తిత్వాన్ని బలంగా చాటుకొందని అర్ధమౌతుంది.
క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కాకినాడ జైన మతానికి చెందిన గొప్ప ఆథ్యాత్మిక కేంద్రమని, అనేక జైన ఆలయాలు ఉండేవని, వాటికి రెండవ విష్ణువర్ధనుడు కొన్ని భూములను దానం చేసాడని, అప్పట్లో ఇది కొకండ పర్రు పేరుతో వ్యవహరించబడిందని తెలుస్తుంది.
ఇంగ్లీషువారు ఇంజరం వద్దా, ఫ్రెంచి వారు యానాం వద్దా తమ గిడ్డంగులు నిర్మించుకొని వ్యాపారాలు చేస్తున్న సమయంలో 1734 లో Dutch వారు కాకినాడను స్థావరంగా చేసుకొని వ్యాపారాలు చేసి కాకినాడను ప్రపంచపటంలో నిలిపారు.
క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నుంచి క్రీస్తుశకం 19 శతాబ్దం వరకూ మనుగడలో ఉన్న కోరంగి ఓడరేవులో ఇసుక మేటలువేయటం వల్ల నిరుపయోగంగా మారినప్పుడు, కాకినాడ ఓడరేవు ఆ స్థానాన్ని భర్తీచేసి నేడు ఒక గొప్ప పోర్టుగా సేవలు అందిస్తున్నది
జాతీయోద్యమ సమయంలో కాకినాడలో జరిగిన భయంకరాచారి గారు జరిపిన కాకినాడ బాంబు కుట్ర కేసు, కాకినాడ దొమ్మీ కేసు దేశవ్యాప్తంగా పేర్గాంచాయి. ఎంతో మంది స్వాతంత్రోద్యమ కారులకు ప్రేరణగా నిలిచాయి.
శ్రీ మల్లాడి సత్యలింగనాయకర్ వీలునామా లో ఒక క్లాజ్ ఏమిటంటే ప్రతిఏటా ఒక విద్యార్ధిని ఉన్నత చదువులకొరకు విదేశాలకు పంపి ఆర్ధికసహాయం అందించటం. ఆ క్లాజ్ ద్వారా డా. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అమెరికాలో చదువుకొన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావుగారు కనిపెట్టిన టెట్రాసైక్లిన్ అనే మందు వలన కొన్ని కోట్లమంది ప్రాణాలు నిలిచిచాయి. బహుశా మానవాళికి అంతటి మేలు జరగబోతుందని శ్రీ మల్లాడి సత్యలింగనాయకర్ గారికి తెలిసే ఆ క్లాజ్ పెట్టి ఉంటారు.
కళా సాహిత్య రంగాలకు సంబంధించి- శ్రీ.రేలంగి, శ్రీ.ఎస్వీ రంగారావు, శ్రీమతి అంజలీ దేవి, శ్రీమతి.సూర్యాకాంతం, శ్రీరావు గోపాలరావు, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ లాంటి ఆణిముత్యాలను కాకినాడ ప్రపంచానికి బహూకరించింది.
ప్రతీ ప్రాంతచరిత్రకు ఒక ఆత్మ ఉంటుంది. చరిత్రకారుడు ఆ ఆత్మను పట్టుకోవాలి. సత్యమూర్తి గారు కాకినాడ ఆత్మను పట్టుకొన్నారు. ఈ పుస్తకరూపంలో రికార్డు చేసారు. తన కాలాన్ని, మేధను వెచ్చించి ఇంతటి బృహత్ రచన గావించినందుకు కాకినాడ పౌరసమాజం వీరికి రుణపడింది. సత్యమూర్తిగారికి అభినందనలు.
బొల్లోజు బాబా

వెల: 300/-
పుస్తకం లభించుచోటు: గొడవర్తి కృష్ణకుమారి
3-16C-60, Union Bank Building
Shanti Nagar, Kakinada, 533003
Ph: 9949588222







థేరీగాథలు

 thank you somuch Durgaprasad Avadhanam gaaru for your kindwords and crisp comments sir.

.
థేరీగాథలు
.
తొలితరం బౌద్ధ సన్యాసిల కవిత్వం
అనుసృజన:-బొల్లోజు బాబా
ముద్రణ:-chaaya Resources Center
.
థేరీ! అంటే అర్థం సన్యాసిని/భిక్షుణి/ రెండువేల ఐదువందల అరవై అయిదు సంవత్సరాల కింద బుద్ధుడు మహా పరినిర్వాణం పొందిన తర్వాత బిక్షువులు మహాకాశ్యాపథేరుని అధ్యక్షతన మగధ దేశపు రాజధాని రాజగృహనగర సమీపంలో సప్తపర్ణికా గుహలో సమావేశమై సుత్త, వినయాలను సంగ్రహించారు. సుత్త మపీటకలో బుద్ధుని బోధనలు ఉన్నాయి. వినయములు భిక్షుసంఘ నిర్మాణం, భిక్షువులు,భిక్షువులు, పాటించవలసిన నియమాలు ఉన్నాయి. సుత్తపిటకలో,దీఘనికాయ,మజ్జినికాయ,సంయుత్తనికాయ,అంగుత్తర నికాయ ,ఖుద్ధకనికాయలోని 18గ్రంథాలలో థేరీగాథులు ఒకటి.
ఈ పుస్తకం చదువుతున్నప్పుడు బుద్ధుడికి సంబంధించిన చాలా విషయాలు చాలా తేలికగా అర్థమవుతాయి బౌద్ధం భౌతికంగా లేకపోయినా భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా బౌద్ధమత ప్రభావం ఉంది, ఎక్కువగా
సోషల్ మీడియాలో బుద్ధ మతాన్ని ఖండిస్తూ వైదిక మతస్తులు, వైదిక మతాన్ని ఖండిస్తూ బౌద్ధ మతస్తులు ,వాళ్లు వినిపించే వాదనలు మనకి కనిపిస్తాయి బహుశా దీని వెనక వాళ్ళ జాతి ,మత ,కుల, రాజకీయ, వ్యాపారాల, లాభాలు అవసరాలు కోసం వాళ్లు అలా ఒకరిని ఒకరు ఖండించుకుంటారు, ఎవరి శాఖలలో ధర్మాలని వాళ్ళు మోస్తూ ఉంటారు!
గొప్ప విషయం ఏమంటే వివిధ విరుద్ధ నేపథ్యాల నుండి వచ్చిన ఆ స్త్రీలంతా ఒక సంఘంగా ఒక సోదర సమాజంగా మారగలటం మానగలటం. ఈ పుస్తకం లోని ప్రతి కవితలను ప్రతి కవియిత్రీ తాము మూడు విషయాలు తెలుసుకోగలిగాను అని ప్రకటిస్తుంది.
బుద్ధసారాన్ని తెలుసుకుంటానికి చాలా సులువైన మార్గం ఈ పుస్తకంలో ఉంది అందరూ చదవండి చదివించండి
దుర్గాప్రసాద్ అవధానం, నల్గొండ

Sunday, October 9, 2022

ప్రాచీన తమిళమతాలు

ప్రాచీన తమిళమతాలు
.
చోళులది ఏ మతం అని చర్చకు వచ్చినపుడు, అప్పట్లో హిందూమతమే లేదు అనే వాదన చేయటానికి కారణం, తమిళులకు బలమైన సాంస్కృతిక, ఆథ్యాత్మిక చారిత్రిక నేపథ్యం ఉండటమే. ఈ వాదనను పిడివాదం గానో, సంకుచిత వాదమనో భావించలేం. స్థానికంగా ఉండే బహుళతను విచ్చిన్నం చేసి, ప్రజలను సామాజికంగా ఒకరిమీదకు మరొకర్ని ఉసిగొల్పే హిందుత్వాను నిలువరించటానికి చేస్తున్న వాదనగా దీన్ని చూడాలి.
ఉత్తరభారతానికి చెందిన జైనం, బౌద్ధం, వైదిక మతాలు తమిళనేలపైకి ప్రవేశించేనాటికే ఇక్కడి ప్రజలకు తమవైన దేవుళ్ళు, తమవైన ఆథ్యాత్మిక మార్గాలు (మతం) ఉన్నాయి. వీటి ప్రస్తావన తమిళులు అత్యంత పవిత్రమైనదిగా భావించే తొల్కాప్యం అనే గ్రంధంలో కనిపిస్తుంది.
తొల్కాప్యం అంటే ఆదికావ్యం అని. ఇది రాయబడిన కాలం BCE 5,320 నుండి CE 8 వ శతాబ్దం వరకు ఉండొచ్చని కొద్దిమంది తమిళ చరిత్రకారులు క్లెయిమ్ చేసుకొన్నప్పటికీ, BCE మూడవ శతాబ్దం నుండి CE 8 వ శతాబ్దం మధ్య దీని రచన జరిగి ఉండవచ్చునని అధికులు అంగీకరించారు.
***
తమిళుల ప్రాచీన ఆరాధనా విధానాలు/మతాలు:
తమిళ భూమి 5 ప్రాంతాలుగా విభజించబడింది. అవి అడవులు, పర్వతాలు, వ్యవసాయ భూమి, సముద్రతీరం, బీడుభూములు.
అడవులకు మయోన్, పర్వతాలకు సేయోన్, వ్యవసాయభూమికి వెందాన్, సముద్రతీరానికి వరునమ్ అనే పేర్లు కల అధిపతులు ఉంటారని వారిని ఆయా ప్రాంత ప్రజలు పూజించి ప్రసన్నం చేసుకొనేవారని తమిళ తొల్కాప్యంద్వారా అర్ధమౌతుంది.
తొల్కాప్యం లో విజయాలను ఇచ్చే దేవతగా కొట్టవ్వై (అవ్వయార్) అనే స్త్రీ మూర్తి కలదు.
తొల్కాప్యంలో శివపెరుమాన్ పేరుతో శివుని ప్రస్తావన ఉంది. లింగరూపంలో శివుని ఆరాధన జరిగినట్లు ప్రాచీన తమిళ గ్రంధాలలో కనిపించదు.
***
ఉత్తరభారత మతాలు క్రమేపీ దక్షిణభారతం వైపు విస్తరించినపుడు మొదటగా జైనం క్రమేపీ బౌద్ధం వచ్చింది.
చీలికలు పేలికలు ఉన్న వివిధ వైదిక ఆరాధనాపద్దతులను ఏకం చేసే ప్రయత్నంలో - ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు సూర్యుడు, శివుడు, విష్ణుమూర్తి, విఘ్నేశ్వర, పార్వతీదేవి లను ప్రధాన దేవతలుగా చేసి ఆరాధించే పంచాయతన పద్దతిని ప్రవేశపెట్టాడు. వివిధ ఆరాధన పద్దతులు ఏకం అవ్వటంతో బలమైన హిందూమత భావన ఏర్పడింది.
శంకరాచార్యుడు అఖండ భారతావని అంతా తిరిగి హిందుధర్మాన్ని ప్రచారం చేసి, అనేకచోట్ల పండిత చర్చలు జరిపి ఆలయాలు స్థాపించి-హిందూమతానికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే నేడు మనం హిందూమతంగా అనుకొంటున్న జీవన విధానం ఎనిమిదో శతాబ్దం నుంచి మొదలైందని చెప్పవచ్చు.
అంతకు ముందు భిన్న ఆరాధనా పద్దతులు బౌద్ధం, జైనం లతో సహా కలిసి సహజీవనం చేసేవి. రాజులు కూడా బౌద్ధ ఆరామాలకు, జైన బసతులకు, హిందూ దేవాలయాలకు ఏ రకమైన వివక్షా లేకుండా దానదర్మాలు ఇచ్చేవారని అనేక శాసనాలు తెలియచేస్తున్నాయి. ఎప్పుడైతే అన్నింటినీ కలిపి హిందూమతం అనే ఒక చట్రంలో బిగించాలనే ప్రయత్నం జరిగిందో బౌద్ధ-వైదిక, జైన-శైవ, శైవ-వైష్ణవ వర్గాల మధ్య ఘర్షణలు తప్పలేదు. చరిత్ర వాటన్నింటినీ రికార్డు చేసింది.
***
రాజరాజ చోళుడు శ్రీలంకను జయించటాన్ని శ్రీరాముడు, లంకను జయించటంగాను, ఇతనిని రామునితో సమానమైన హిందూ రాజు అంటూ కొందరు హిందుత్వ వాదుల చేస్తున్న వ్యాఖ్యలు ఎవరికైనా చికాకు తెప్పించక మానవు. ముఖ్యంగా వారి సంస్కృతి భిన్నమైనది అని చెప్పుకొనే ద్రవిడులకు ఇలాంటి వాదన Safronizing their culture గా అనిపించకమానదు. 

ఇంతటి చరిత్ర కలిగిన తమిళ ఆరాధన విధానాలలోని బహుళతను విస్మరించి - శైవులైనప్పటికి జైన, బౌద్ధ, వైష్ణవ, శాక్తేయ మతాలను సమాదరించిన చోళులను హిందుత్వా అనే చట్రం లో బిగించటానికి చేస్తున్న ప్రయత్నాలు భావజాల ఘర్షణలకు దారి తీస్తున్నాయి.  లింగాయత్ లు తాము హిందూమతానికి చెందిన వారము కాదని సుప్రీం కోర్టులో కేసు నడుపుతున్నారు. చోళులు శైవులు, వారు హిందువులు కాదు అనే స్టేట్మెంట్ ఆషా మాషీ స్టేట్మెంట్ కాదు.  


బొల్లోజు బాబా

Thursday, October 6, 2022

తొలితరం స్త్రీల అనుభవాలూ అనుభూతులూ....... శ్రీ దాట్ల దేవదానం రాజు



నేనెంతో అభిమానించే కవి కథకుడు శ్రీ దాట్లదేవదానం రాజు గారు నా పుస్తకంపై రాసిన ఆత్మీయ వాక్యాలు.
ధన్యవాదాలు రాజు గారు మీ ప్రేమకు
థాంక్యూ సర్
బొల్లోజు బాబా




తొలితరం స్త్రీల అనుభవాలూ అనుభూతులూ...


చరిత్ర, సామాజిక విశ్లేషకుడు బొల్లోజు బాబా. అంతే గాక కవీ, కవితానిర్మాణ పద్ధతులను విప్పి చెప్పే భాష్యకారుడు కూడా. ఇంకా అవన్నీ ప్రవృత్తులు. వృత్తిరీత్యా జీవశాస్త్రాధ్యాపకుడు. మొన్న బాబా వచ్చినపుడు నేను లేను. ఇంటికొచ్చి ఎంతో అందంగా మరెంతో తేలిగ్గా మరింకెంతో వినూత్న ఆకారంలో థేరీ గాథలు పుస్తకం చూసి ఆనందించాను. ఒకసారి తిరగేశాను. 

పుస్తకం చివర ముప్పై రెండు పేజీల ఎండ్‌ నోట్సు ఉంది. దీన్ని ఎలా చదవాలో అపుడే ఒక నిర్ణయానికి వచ్చేశాను. తప్పో ఒప్పో తెలీదు గానీ ముందు పుట్‌నోట్సు చదివి దాని నెంబరు ఆధారంగా థేరీ గాథలు చదవడం మొదలెట్టాను. అంటే ఎడమ చేతివేళ్లతో పేజీని ఎంచుకుని కుడి చేతి బొటనవేలు చూపుడువేలు మధ్య ముగింపు సమాచారం చదివిన తర్వాత థేరీలను చదివానన్నమాట. ఇదో గమ్మత్థైన పఠనానుభవం. ఇలా చదవడం మొదలెట్టాక మరోలా చదవడం సాధ్యం కాలేదు
.
నా ఉద్దేశంలో అనుసృజన అంటే ఇంతకంటే తేలిగ్గా భావప్రసారాన్ని చేయలేం అనిపించేలా వాక్యాల్ని రాయడం. సుబోధకంగా ఉండటం, అన్వయ క్లిష్టత లేకుండా చూసుకోవడం, నేటివిటీని సాధించి ఇది మన భాషే అనిపించేలా అనుసృజయించాలి. బొల్లోజు బాబా ఈ విషయంలో విజయం సాధించాడు.
 
ఒక సాధారణ స్త్రీ మౌలిక అనుభవాలే థేరీ గాథలు. ఆ స్త్రీ సంపన్నవర్గానికి చెంది ఉండొచ్చు లేదా పామర మధ్యతరగతి అయ్యుండొచ్చు. ఆ అనుభవాలకు కవితారూపంగా అర్థం చేసుకున్నాను.

ఎప్పటి సమాజం లోంచి ఇవి పుట్టుకొచ్చాయి. ఆ స్థితి ఇప్పుడుందా? అయినా గానీ అప్పటికీ ఇప్పటికీ స్త్రీ తాలూకు మనోభావాలకు దర్పణంగానే ఉన్నాయి. భిన్న సామాజిక నేపథ్యం లోంచి వచ్చినవి. కొన్ని గాథలు పునరుక్తుల్లా ఉండటంలో అనుసృజనకారుడు నిమిత్తమాత్రుడని నేను భావిస్తున్నాను.

బాధ్యతలు తీరింతర్వాత సన్యసించడం సరే ఎంపిక చేసుకున్న వరుడు చనిపోతే బలవంతంగా సన్యసింపచేయడాన్ని ఇందులో చూస్తాం. ఎక్కువ మంది అభాగినులు కుటుంబ కట్టుబాట్లలో ఇమడలేక జన్మరాహిత్యం కోసం పాకులాడటమూ కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందర్నీ కోల్పోయిన పటాచర, ఇట్టే యవ్వనం కరిగిపోయడాన్ని గమనించిన అమ్రపాలి, తనూ తల్లీ ఒకే మగాడికి భార్య అని తెలిసి శరీర కోరికలకు దూరమవ్వాలని తలచిన ఉత్పలవణ్ణ, తన కళ్ళను మోహించిన కుర్రాడికి కళ్లనే పెకిలించిన శుభ

మనసును ఎలా నిగ్రహించుకున్న దంతిక...ఇలా ఎందరో భిక్షుణి అవతారం ఎత్తిన స్త్రీలు వారి గాథలూ ఇందులో వింటాం. ఇదంతా స్వచ్ఛమైన కవిత్వరూపంలోనే ఉన్నాయా అంటే నేను చెప్పగలిగేది కాదు.దేహం నిజస్వరూపం తెలిసాక ప్రశాంతత లభించడం అనేది ఇందులోని సగటు స్త్రీకి కలిగిన అనుభవంగా చూస్తాం. 

నాకు మొత్తం థేరీలు చదివాక కారణం తెలియదు గానీ నా మనసులో ఎందుకో వైరాగ్య భావనలు చెలరేగాయి. ఇది తప్పే లేదా నా బలహీనత కావచ్చు. జీవితం నీటిబుడగ అనీ దేహవాంఛలు తాత్కాలికమని ప్రశాంతమైన మార్గాల్ని ఎన్నుకోవాలనిపించింది.

బొల్లోజు బాబా నమ్మకమైన మంచి దారి ఎన్నుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. చారిత్రక పరిశోధనల అంచుకు చేరి మహాద్భుతాలు సృష్టించాలని ఎవరికీ తెలియని విషయాల్ని వెలికితీసి మంచి ఫలితాల్ని పొందాలని కోరుకుంటున్నాను. శ్రమించి థేరీగాథల్ని వెలువరించిన బాబాకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను- 

దాట్ల దేవదానం రాజు





బొల్లోజు బాబా గారికి శుభాకాంక్షలు



థాంక్యూ Sujatha Chebrolu గారు మీ మాటలు నా కెంతో విలువైనవి.

ఈ గాథలు బీసీఈ ఆరో శతాబ్దం నాటివి. Bolloju Baba అనుసృజన. ఛాయా Mohan Babu వేశారు..బుద్దుడి కాలం నాటి ఈ ప్రకటన ల్లో నేనేం చూస్తాను అనుకుంటూ పేజీలు తెరిచాను .సమాన మైన స్త్రీ పురుష గౌర వం ఉన్న చోట ఇచ్చాపుర్వక మైన దీక్ష తీసుకున్న సన్యా సిను లు తాను పొందిన అనుభవ సారాన్ని రాసుకున్నారు..ఇందులో నన్ను నేను వెతుక్కుంటూ ఏం పొందాను ఏం చేసాను. సరైన దారిలో నడి చానా అనుకుంటూ చదివితే ఇది మన ప్రపంచం కాదు, ఎన్నో చిక్కు ముడులు న డి చే చరిత్ర పోగులు పోస్తూ తీసుకు వచ్చిన సముద్రపు వడ్డున పేరుకు పోయిన కాలుష్యపు చెత్త కాళ్ళ చుట్టూ ఉన్నఈ సమాజం లో ఉండి అవ్వాల్టి లో మనల్ని ఏం చూసుకుంటాను ..
బొల్లోజు బాబా గారికి శుభాకాంక్షలు


ఒక పెద్ద canvas ను 182 పేజీల్లో కి తెచ్చారు .అసలు ఇంత ఎడిట్ ఎందుకు చేశారు .ఒక్కో కథ రాస్తే ఎంత బావుండేది కనీసం కొన్ని కథలు .అది ఇంకెంతో గొప్ప ఇతిహాసం అయ్యేది..ఎట్లాగూ చదివారు..ఈ ఫుట్ నోట్స్ తో నాకు తృప్తి కలుగ లేదు ..ఇందులో అందరూ అన్నీ పోగొట్టుకుని సన్యాసం పుచ్చుకున్నా రా అదీ లేదు. బుద్దుడి ను నమ్మి..లేదా ఈ జీవితాన్ని కోరుకుని వచ్చేశారు ..ఎంత బాగా మనసులో మాటలు చెప్పుకున్నారు.ఎంత కష్ట పడితే ఈ పుస్తకం బయటికి వచ్చింది..
బావుంది చదవండి అని రెండు ముక్కల్లో చెప్పటం అన్యాయం
కొన్ని చదువు కోవాలి మన కి అదృష్టం ఉంటే( ఈ పదం నాకు నచ్చదు కానీ వేరే దొరక లేదు)


పుస్తకం కోసం ఫోన్ చేయ వలసిన నంబర్ 7093165151


సుజాత చెబ్రోలు


Sunday, October 2, 2022

"థేరీగాథలు".. వ్యథాభరిత వీచికలు - మార్ని జానకిరామ చౌదరి.



కాకినాడ సాహితీ మిత్రులలో సౌమ్యులు, కవి, సాహిత్యకార్యకర్త, అయిన శ్రీ మార్ని జానకీరామ్ చౌదరి గారు నా "థేరీ గాథలు" పుస్తకంపై రాసిన స్పందన ఇది. ఈ చక్కని సహృదయ వ్యాక్యాలు నాకు బహూకరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను
బొల్లోజు బాబా

.

"థేరీగాథలు".. వ్యథాభరిత వీచికలు - మార్ని జానకిరామ చౌదరి.
.

రెండున్నర సహస్రాబ్దాలకు పూర్వం(2600 సం.కు పూర్వం) తొలితరం బౌద్ధ సన్యాసినులు/భిక్షుణిలు (బుద్ధుడి సమకాలికులు) తమ విషాదభరిత దుఃఖ గాథలను, తథాగతుడి బోధనలద్వారా చేకూరిన సాంత్వనను కవిత్వరూపంలో వ్యక్తీకరించారు. బహుశ ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలోనే మహిళలచే చెప్పబడ్డ తొలి కవితాసంకలనంగా చెప్పుకోవచ్చు.

థేరీ గాథలు పాళీ భాషనుండి 1909 వ సంవత్సరంలో మొదటిసారిగా ఆంగ్లంలోనికి అనువదించబడ్డాయి. వీటిని చారిత్రక పరిశోధకులు, ప్రముఖ రచయిత శ్రీ బొల్లోజు బాబా గారు తులనాత్మకంగా పరిశీలించి, 73 మంది థేరీల గాథలను తెలుగు భాషలోకి అనుసృజన చేసారు. ఈ థేరీలందరూ అనేక సామాజిక వర్గాలకు చెందినవారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలనుండి అంతఃపురంలోని రాజమాతల వరకూ ఉన్నారు.

నాటి సమాజంలో ప్రేమరాహిత్యంతో కూడిన వైవాహిక బంధంలో ఇమడలేని స్త్రీల దుర్భరమైన జీవనాన్ని, అనేకరకాలుగా కష్టాలకడలికి ఎదురీదిన మహిళల దైన్యాన్ని, విషాదవీచికల్ని ఈ 'థేరీగాథలు' ప్రతిబింబిస్తాయి. వీటిని పరిశీలిస్తే గుండెల్ని పిండే ఎన్నో బాధాతప్త గాథలు మనకు గోచరిస్తాయి.

ఉదాహరణకు మరణదండనకు గురికాబడిన దొంగను చూసి, మనసు పారేసుకొని, అతడిని వివాహమాడి జీవితాన్ని చేజేతులా బలిచేసుకొన్న 'బద్ధ' విషాదగాథ.

కట్టుకున్న భర్త పాముకాటుకి, పెద్ద కొడుకు వరద పోటుకి, చిన్న కొడుకు గ్రద్ధ ఎత్తుకుపోయి మరణించగా..... పుట్టింటికి చేరితే తుఫానుకి ఇల్లుకూలి, తల్లిదండ్రులు కూడా మరణించారన్న వార్త విన్న విధివంచిత 'పటాచార' హృదయవిదారక గాథ.

కాశీ పట్టణంలో సంపన్న వ్యాపారి కూతురుగా పుట్టి, అనూహ్యంగా వేశ్యగా మారి, కాశీ పట్టణం ఒక్కరోజు వ్యాపార ఆదాయం వేయి బంగారు నాణాలైతే.. ఈమె సంపాదన అయిదు వందల నాణేలు కావటంతో 'అర్థకాశి' గా పిలువబడిన ఓ అభాగ్యురాలి దయనీయగాథ.

కొడుకును కోల్పోయి, పుత్రశోకంతో ఉన్మత్తగా మారిన 'కిసగౌతమి' కి బుద్ధుడు మరణంలేని ఇంటినుండి ఒక ఆవగింజ తెమ్మని చెప్పి జ్ఞాననేత్రం తెరిపించిన గాథతో పాటు.. తన కళ్ళను మోహించిన యువకునికి కంటిగ్రుడ్డునే పెకలించి ఇచ్చిన 'శుభ' సాహసగాథ.

అశాశ్వతమైన సౌందర్యం, యవ్వనం ఎలా ఆవిరైపోతాయో వర్ణించిన అసాధారణ సౌందర్యరాశి ఆమ్రపాలి; తన తల్లి, తాను ఒకే పురుషునికి భార్యలుగా సవతులమని తెలిసాక, దేహవాంఛలను రోసి సన్యసించిన 'ఉత్పలవణ్ణ' వంటి స్త్రీలు తమ వేదనల్ని, విషాదభరిత గాథల్ని ఒకరితో ఒకరు పంచుకొని.. బాధలనుండి విముక్తి కొరకు అన్వేషణలో భాగంగా తథాగతుణ్ణి ఆశ్రయిస్తే, తన జ్ఞానబోధ ద్వారా వారి మనోక్లేశాన్ని తొలగించి, సాంత్వన చేకూర్చే విధానాన్ని కవిత్వీకరించటం జరిగింది.

విషాదమయ జీవితాలను సాహసోపేతంగా ఎదుర్కొని, పురుషాధిక్య సమాజానికి ఒక సవాలుగా, సమాధానంగా, సమాంతరంగా సహజీవనం గావించిన ఆనాటి స్త్రీల అనుభవాల గాథలను అనువాదంలో చేయితిరిగిన బాబాగారు చాలా సరళంగా, హృద్యంగా అనుసృజన చేసారు.

తథాగతుని బోధనలు అనుసరిస్తూ, దుఃఖసాగరాన్ని ఎలా అధిగమించామన్న విషయాన్ని థేరీలు కవిత్వరూపంలో అభివ్యక్తీకరించారు. వాటిలో కొన్ని వాక్యాలను పరిశీలిద్ధాం :

నేను స్వేచ్ఛనొందాను
మూడు కుటిల విషయాలనుండి
భర్త, రోలు, రోకలి
నేను ముక్తినొందాను
నన్ను వెనక్కిలాగే
మూడు కుటిల విషయాలనుండి
జననం, మరణం, పునర్జన్మ (ముత్త)
****

ఒకదీపం తీసుకొని నా కుటీరంలోకి వెళ్ళాను
చాపపై కూర్చున్నాను
సూదితో వత్తిని వెలుపలికి లాగాను
దీపం ఆరిపోయింది
నా మనస్సు కూడా విముక్తమయింది" (పటాచార)
****
నా జీవితంలోంచి దేవుళ్ళను
మగవాళ్ళనూ తరిమేసాను " (విమల)
****

శిథిలమైన నా దేహం
నేడు ఇది బాధలు వసించే చోటు
పెచ్చులు రాలుతున్న ఒక జీర్ణగృహం" (ఆమ్రపాలి)

****
ఆమె నా గుండెల్లో గుచ్చుకొన్న బాణాన్ని
నా పుత్రశోకాన్ని బయటకు లాగేసింది (అయిదు వందల థేరీలు)
****
వార్ధక్యమా/ నువ్విక వెళ్ళిపోవచ్చు
నేను జన్మరాహిత్యాన్ని పొందాను" (శోణ)
****
నీ వాంఛలన్నీ కుండలో దాచిన
మూలికల్లా వడలి ఎండిపోతాయి" (థేరిక)

ఇలా తనదైన శైలిలో బాబాగారు థేరీల వ్యథాభరిత గాథలలోని ఆత్మను ఆవాహన చేసుకొని, మనసుకు హత్తుకునేలా కవిత్వనిర్మాణం (అనుసృజన) చేయటం జరిగింది. ఈ పుస్తకాన్ని మామూలు కవిత్వంలా చదవకూడదు. ఏకాంతంగా కూర్చొని, ఏకాగ్ర చిత్తంతో చదివితే.. ఒకరకమైన అలౌకిక అనుభూతికి లోనవటంతోపాటు, థేరీల భావగర్భిత మనోస్పందనల్ని పట్టుకోవచ్చు.

పుస్తకం చివర్లో బాబాగారు 32 పేజీల్లో 'ఎండ్ నోట్స్' ద్వారా ఆయా బౌద్ధ సన్యాసినుల/థేరీల నేపథ్య కథనంతో పాటు ఆనాటి సామాజిక స్థితిగతులతో కూడిన ఉపయుక్తమైన చారిత్రిక అంశాలను విపులంగా అందించారు. దీనివలన చదువరులకు బౌద్ధ సన్యాసినులుగా మారిన థేరీల ప్రస్థానం, ఆయా కాలమాన పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది.

ఈ పుస్తకానికి పూజ్య బౌద్ధభిక్షు 'బిక్ఖు ధమ్మరక్ఖిత' అభిమానపూర్వకంగా ముందుమాట రాయగా, చివరి కవర్ పేజీపై సుప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ చినవీరభద్రుడు గారు థేరీగాథల నేపథ్యాన్ని చక్కగా విశ్లేషించారు. 182 పేజీల ఈ పుస్తకానికి శ్రీ గిరిధర్ అరసవెల్లి చక్కటి ముఖచిత్రాన్ని అందించారు. అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో లేదా 9848023384 నంబరులో లభించును.

- మార్ని జానకిరామ చౌదరి.