Tuesday, November 25, 2014

ఇస్మాయిల్ గారి గురించి మరోసారి.....



ఈ రోజు ప్రముఖ కవి ఇస్మాయిల్ గారి 11 వ వర్ధంతి.  ఆ సందర్భం గా ఆయన గురించి ఇదివరలో వ్రాసిన ఒక వ్యాసం మరలా ............
భవదీయుడు
బొల్లోజు బాబా

ఇస్మాయిల్  కవిత్వం,  కాసిన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫొటోలు

అప్పుడు నేను పి.జి. విద్యార్ధిని.  కవిత్వం అంటే తిలక్, ఇస్మాయిల్, శిఖామణి, చలం అని అనుకొనే రోజులవి. అప్పటికి అచ్చయిన నా కొన్ని కవితలను ఇస్మాయిల్ గారికి చూపించాలని నా తాపత్రయం.  మిత్రుని ద్వారా ఓ రోజు ఆయనకు పరిచయం చేయించుకొన్నాను.  పసుపు పచ్చని దేహచ్ఛాయ, ఎత్తైన విగ్రహం, సన్నని స్వరం, రంగులు చిమ్మే సాదా దుస్తులతో ఆయనను చూడగానే కవిత్వంతో నిండిన గౌరవం కలిగింది.  కుశలప్రశ్నలయ్యాకా నా కవితల గురించి ఆయనన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తే.  “నీ కవిత్వంలో స్పార్క్ ఉంది.  ఆవేశాన్ని పదాలలోకి ఒంపేప్పుడు తేలికైన పదాల్ని ఎంచుకోవాలి.  భావాన్ని మరింత క్లుప్తంగా చెప్పగలగాలి” అన్నారు.  ఇది జరిగి సుమారు పదిహేను సంవత్సరాలు అయ్యింది.  ఇప్పటిదాకా వ్రాసిన నా కవితలను తరచి చూసుకొంటే క్లుప్తత, పదాల ఎంపిక విషయంలో ఆయన పరిశీలన ఎంతటి సూక్ష్మమో తెలుస్తూంటుంది.
చాలా కాలం కవిత్వానికి దూరంగా ఉండటం వలన, ఆయనను కలుసుకోవటం అదే మొదలు మరియు చివరు అయ్యింది నాకు.   ఇదిగో ఇప్పటికి మరలా ఇలా........


ఇస్మాయిల్

ఇస్మాయిల్ గారు 26 మే, 1928 న జన్మించారు.  వీరు కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేసారు.  25 నవంబర్, 2003 న ఆయన అనంత నిశ్శబ్దం లోకి జారిపోయారు.

కవిగా, విమర్శకునిగా ఇస్మాయిల్ గారు పోషించిన పాత్ర తెలుగు సాహితీవనంలో నిలువెత్తు పొగడచెట్టై పరిమళాలు చిందిస్తూనే ఉంటుంది.  ఆయన రచించినవి పదిపుస్తకాలే కావొచ్చు, అన్నీ కలిపి ఓ మూడు, నాలుగొందల పేజీల సారస్వతమే అవ్వొచ్చు, కానీ వాటి ముద్ర మాత్రం తెలుగు సాహిత్యంపై ఏ నాటికీ చెరగనిది.



ఇస్మాయిల్ కవిత్వం


ఇస్మాయిల్ గారనగానే రెండు విషయాలు చాలామంది స్మరణకు వస్తాయి.  మొదటిది “’చెట్టు నా ఆదర్శం” అన్న ఇస్మాయిల్, రెండవది ఆయన ఆంధ్రదేశానికి పరిచయం చేసిన హైకూ.  ఇస్మాయిల్ కవిత్వ భాష విశిష్టమైనది.  క్లిష్టపదాలు, పొడుగు వాక్యాలు ఉండవు. ఛందస్సులు, లయ శయ్యల వంటివి కనపడవు.  అయినప్పటికి ఈయన కవిత్వం ఒక అనుభూతిని పదచిత్రాల ద్వారా పఠితకు ప్రసారం చేసి అతనూ అనుభూతి చెందేలా చేస్తుంది, అదీ ఎంతో నిశ్శబ్దం గా.


సౌందర్యారాధన, మానవత్వంపై విశ్వాసం, స్వేచ్ఛాశీలత, ప్రకృతి ఉపాసన ఆయన కవిత్వానికి కాన్వాసు.  మన దైనందిక విషయాలను, చిన్న చిన్న అనుభవాల్నీ, అపుడపుడూ ప్రకృతి కరుణించే సుందర దృశ్యాలకు, కరుణ తాత్వికలను అద్ది కవిత్వంగా మలచి మనకందించారు. ఇస్మాయిల్ కవిత్వంలో ఇజాలు, వాదనల వంటి శృంఖలాలు కనిపించవు. కేవలం కవిత్వం మాత్రమే వినిపిస్తూంటుంది.  జీవితోత్సవాన్ని ఎన్నికోణాల్లో ఆనందించవచ్చో అన్ని కోణాల్నీ ఆయన తన కవిత్వంలో ఆవిష్కరించారు. అందుకనే ఇస్మాయిల్ గారి పుస్తకాలను వరుసగా చదువుతున్నపుడు ఇతివృత్త సంబంధమైన మొనాటనీ కనిపించదు.

ఆయన కవిత్వంలో పదచిత్రాల సౌందర్యం పరిమళిస్తూంటుంది.  పదచిత్రాల్ని ఎవరైనా కల్పన చేయగలరు.  కానీ ఒక దృశ్యాన్ని నలుగురూ చూసే దృష్టితో కాక కొత్తగా దర్శించి దాన్ని పదచిత్రంగా మలచటం ఇస్మాయిల్ గారికే చెల్లింది. ఒక్కోసారి ఈయన “ఇలా ఎలా” చూడగలిగారబ్బా అని విస్మయంతో ఆశ్చర్యపడక తప్పదు.  ఈ క్రింది ఉదాహరణలను చూస్తే అర్ధం అవుతుంది ఆయన విలక్షణ వీక్షణం.



ఎక్కడెక్కణ్ణించో ఎగిరి వచ్చిన కాకులు చింతచెట్టులో నల్లగా అస్తమిస్తాయి /

ప్రణయక్రీడలో మన అంగాల పాచికల్ని మహోద్రేకంతో విసిరి నక్షత్రాల పావుల్ని రాత్రల్లా నడిపించాం గుర్తుందా! /

కిటికీలోంచి చూస్తే వెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలా ఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు /

తొలిసంజె నారింజని ఎవరు ఒలిచేరు, తెలిఎండ తొనలను ఎవరు పంచారు /

ఊగుతోంది వేయి పిర్రల సముద్రం /

మూగిన బంధుమిత్రులు మోసుకుపోయి అతణ్ణి విత్తనంలా పాతారు /

భూమి బుగ్గపై చల్లటి నవ్వు సొట్టలా బావి /

ఉదయాలు అనాది నుంచీ సూర్య శిశువును ఎన్నివిధాలుగా ఎగరేసి పట్టుకొన్నాయో/

నీడల విసనకర్రను విప్పి ఎండలో సేదదీరుస్తుంది చెట్టు ----- ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన
కవితలనన్నీ టైప్ చెయ్యవలసి ఉంటుంది. ఎన్ని పదచిత్రాలు, ఎన్నెన్ని సునిశిత దృశ్యాలు.


బుద్దిగా ప్రేమించుకోక
యుద్దమెందుకు చేస్తారో
నాకర్ధం కాదు.



పై వాక్యాల సారాంసమే ఇస్మాయిల్ కవిత్వమూ, జీవితమూను.  జీవితానందాల్ని గానం చేసే కవికి, వానిని పాడుచేసే మనుష్యులను చూస్తే ఇలాకాక వేరెలా అనిపిస్తుందీ!

తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య)


ఆత్మహత్యకు ఎంత అద్బుత నిర్వచనం.  ఈ గుప్పెడు వాక్యాలలో,  ఒక అమ్మాయి జీవితంలో ఓడి పోవటం,  తద్వారా ఎదుర్కోవలసి వచ్చిన సామాజిక వివక్ష, నిత్యం ముల్లై బాధించిన ఈ ప్రపంచాన్ని ఇక ఏమాత్రమూ తప్పించుకోలేని దోషిగా నిలబెట్ట టమూ – ఎంతగొప్పగా ఇమిడి పోయాయి.



సెలయేరా సెలయేరా

గలగలమంటో నిత్యం
ఎలా పాడ గలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్లు
పాడకుంటే ఎలా?

జీవితంలోని కష్టాలను కప్పిపుచ్చు కొని ఆనందంగా ఉండక తప్పదు అని ప్రవచించే ఈ కవితే ఇస్మాయిల్ గారి జీవితాదర్శం.  ఆయనకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా చిరు నవ్వు ను, సంతృప్తిని వీడ లేదంటారు సన్నిహితులు. అందుకేనేమో ఓ కవితలో ఇలా అన్నారు.


నేను డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది.
డబ్బెందుకు?
కిటికీ లోంచి వాలి టేబుల్ పై పుస్తకాన్ని, పెన్నుని
ఇంకు స్టాండుని మంత్రించే సూర్యకిరణం ఖరీదెంత!
ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది.

సూర్యకిరణాలు, చంద మామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, ఇవీ ఇస్మాయిల్ కవితాలోకపు డబ్బులు.  వారి సతీమణిని మరో కవితలో వర్ణించిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది.

మా ఆవిడ ఒక చేత్తో ఆకాశాన్ని ఎత్తిపట్టుకొంటుంది
ఒక చేత్తో భూమిని బుజ్జగిస్తుంది.
ఒక పిట్టచేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది.

ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది......


నా ఇల్లు, నా సంసారం అనుకుంటూ నిత్యం శ్రమించే ఇల్లాలిని ఇంతకన్నా గొప్పగా వర్ణించే వాక్యాలు తెలుగు సాహిత్యంలో లేవు అంటే అతిశయోక్తి కాదు.

ఇస్మాయిల్ గారు తన పద్యాల్ని తెరుచుకొన్న పద్యాలు అన్నపుడు, మిగిలిన వారివి మూసుకొన్న పద్యాలా అంటూ తెలుగు సాహిత్యవిమర్శనా లోకంలో
కొంత అలజడి రేగింది.  అలా
అన్నప్పుడు ఇస్మాయిల్ గారి ఉద్దేశ్యం ఒక కవిత చదవగానే పాఠకుడు ఆ పద్యానికి కంటిన్యూ అవుతారనీ, అంటే అతను కవితను తనంతట తానుగా కొనసాగించుకొనే అవకాశం ఉంటుందని.  అలాంటి "ఓపెన్ నెస్" ఈయన కవితలలో ఉండి పాఠకుల కల్పనా శక్తికి పని కల్పించటం ద్వారా అవి మరింతగా వారి హృదయంలోకి ఇంకటం జరుగుతుంది.

స్త్రీవాద కవిత్వాన్ని ఇస్మాయిల్ గారు అహ్వానించలేదన్న అపవాదు వారిపై ఉంది.  కానీ నిజానికి ఆయన ఉద్దేశ్యం కవిత్వం ప్రకృతిని ప్రతిబింబిస్తుందనీ, స్త్రీ ప్రకృతికి దగ్గర కనుక వారికి కవిత్వం వ్రాసే అవసరం రాకపోవచ్చుననీ మాత్రమే అన్నారు.  ఆ తరువాత వచ్చిన స్త్రీవాద కవిత్వాన్ని చూసిన ఆయన, కవిత్వం అనేది అంతర్గతకల్లోలాల వల్ల జనిస్తుంది, ఈనాడు స్త్రీలకు కూడా ఈ మానసిక అశాంతి తప్పటం లేదన్న మాట అని అభిప్రాయ పడ్డారు.

జ్ఞాపకాలూ – అనుభవాలు


ఇస్మాయిల్ గారితో వివిధ ప్రముఖుల అనుభవాలు, అభిప్రాయాలు  వారి మాటల్లోనే ..........

·        ఎందుకు బతకాలి అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం నాకిప్పటికీ గుర్తుంది.  స్టాఫ్ రూం కిటికీ లోంచి బయటకు చూస్తూ “ఎండ వెచ్చగా ఉంది, పచ్చిక పచ్చగా ఉంది – ఇక్కడింత హాయిగా ఉంటే, బతక టానికేమయ్యిందయ్యా నీకు? అన్నారు. – విన్నకోట రవిశంకర్

·        ఎనభైయవ దశకంలో కాకినాడలో నెల నెలా వెన్నెల పేరుతో జరిగే సాహితీసమావేశాలకు ఇస్మాయిల్ వచ్చేవారు.  సమావేశమంతా అన్ని గంటలూ మౌనంగా ఉండే ఆయన, మధ్యలో జేబులోంచి ఒక తెల్లటి కాగితం మడత విప్పి ఒక కవిత చదివి వినిపించేవారు. ఆ కవితను రెండవ సారి కూడా చదివేవారు కాదు.  ఆ సభలో ఆయన పార్టిసిపేషను అంతే.  కానీ చివరిదాకా అలా అందరి కబుర్లనూ ఆస్వాదిస్తూ ఉండేవారు. – వాడ్రేవు వీర లక్ష్మీ దేవి

·        చాలా ఏళ్ల క్రితం నేను కాకినాడ వెళ్లినప్పుడు రోజల్లా విడుపు లేకుండా మాట్లాడుకున్న గంటలు, ఆయన నామీద చూపించిన ఆప్యాయత, వీధరుగు మీద విశ్రాంతిగా కూర్చుని తిరగేసిన పుస్తకాలు, ఆయనా, వాళ్లావిడ మాకిచ్చిన ఆతిథ్యం నాకిప్పటికీ గుర్తొస్తాయి.  అన్ని గంటలసేపు ఆయనతో మాట్లాడినా ఆయన తన కవిత్వాన్ని గురించి ఏమీ చెప్పలేదు.  చదివి వినిపించలేదు. వాటన్నిటికన్నా కూడా ఇప్పటికీ నన్ను పట్టుకొనేది ఆయన పద్యాల్లోని నిశ్శబ్దమే. --- వెల్చేరు నారాయణరావు

·        ఇస్మాయిల్ గారిని ఒక ప్రశ్న అడిగారు “ఒక మైనారిటీ మతస్తునిగా సమాజంలో సాహిత్య రంగంలో మీ అనుభవమేమిటి” అని.  దానికి ఇస్మాయిల్ గారి సమాధానం

“మతం గురించి  కులం గురించి ఆలోచన నాకెప్పుడూ రాలేదు.  నేను మొదట్నుంచి అందరిలో ఒకణ్ణిగా, తెలుగువాణ్ణిగా  ఫీలవుతూ వచ్చాను..... నా మైనారిటీ మతం నాకు ’హేండీకేప్’ కాలేదు”  ---సి. ధర్మారావు


·        ఇస్మాయిల్ కవిగారి స్నానం గురించి – ఆ
వ్రతవిధానం కనీసంగా ఒక గంటన్నర పడుతుంది. ... సెంట్లు పౌడర్లు స్నోలు అద్దుకుని ధౌత వస్త్రాలతో కడిగిన ముత్యంలా ఈయన గది బయటికొచ్చేవారు.  --- సి. ధర్మారావు.

·        రేడియో కవి సమ్మేళనంలో కవులంతా కొత్త సంవత్సరం మీద ఊగిపోతూ పద్యాలు చదివితే, ఈయన మాత్రం తాపీగా పదేళ్ల క్రితం వచ్చిన తన పాత పుస్తకాల నుంచి కవితలు వినిపించటం లాంటిది కూడా ఆయనకే చెల్లింది (ఉగాది మీద పద్యాలు రాయటమేమిటి?)  -- విన్నకోట రవిశంకర్

·        ఇస్మాయిల్ కుటుంబం ఆ ఇంట్లోకి మారి మూడే రోజులైంది.  ఇంకా సామాన్లు సర్దుకోలేదు.  మాకు చాయ్ ఇవ్వాలని ఆయన తాపత్రయం.  పాలకోసం వాళ్లబ్బాయి వెళ్లాడు.  ఆయన మమ్మల్ని చూసి ప్రసన్నవదనుడైనా, ఆ పొరల వెనుక ఏదో వేదన లాంటిది కనిపించింది.  అనారోగ్యంగా ఉన్నా, వద్దన్నా కారు దాకా వచ్చారు.  మళ్లీ ఎప్పుడు చూస్తామో ఆయన్ని అనిపించింది.  మరో వారంరోజుల్లోనే చూడలేని లోకాలకు వెళ్లిపోతారనుకోలేదు.  --  డా. ఎన్. గోపి

ఇస్మాయిల్ ఉత్తరాలు
·        ఇస్మాయిల్ గార్ని తలుచుకోగానే తక్షణం గుర్తొచ్చేవి ఆయన ఆకుపచ్చ అక్షరాలే.  శిధిల నేత్రాలు అనే నా కవిత అచ్చులో చూసి “ఇది తెలుగు పద్యంలా లేదు” అంటూ మెచ్చుకుంటూ రాశారాయన.  – అఫ్సర్


·        ఆయన చిన్నతమ్ముడు వజీర్ రెహ్మాన్, నలుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడు మరణించిన కొంతకాలానికి ఆయన మూడో తమ్ముడు చనిపోయారు.  అప్పుడు ఇస్మాయిల్ గారు ఉత్తరం రాస్తూ “ఈ వరస కింది నుంచి మొదలైనట్టుంది.  మనకి ఆట్టే దూరం లేదు” అన్నారు.  అన్నట్టుగానే అదే వరుసలో మరణాలు జరిగాయి –స్మైల్


·        ప్రజాతంత్రలో నా ’విస్మృతి’ కవిత అచ్చుకాగానే కవిత నచ్చిందని చెపుతూ రాసిన ఉత్తరంతో పాటు “ఇంకెక్కడా ఖాళీ దొరకనట్టు అనంతపురం వెళ్లారేమిటి? అక్కడసలే గాడిదలు ఎక్కువ” అంటూ ఓ చెణుకు. ఇస్మాయిల్ గారు అనంతపురం కాలేజీలో పనిచేసారు – కల్పనా రెంటాల

·        పతంజలి శాస్త్రి కి ఇస్మాయిల్ గారు తమ కుమారుని పెళ్ళికి ఆహ్వానిస్తూ వ్రాసిన ఉత్తరం ”ధర్మపత్ని సమేత: ఇస్మాయిల్ కవి: స్వపుత్రస్య పరిణయ మహోత్సవం....... అంటూ సరదాగా సంస్కృతంలో సాగుతుంది.

·        ఆయన నాకు రాసిన కార్డు (26-10-2003) ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడ్తున్నట్టు అనిపించింది.  “ నా ఆరోగ్యం కూడా నన్ను మర్చిపోయింది.  చాలా జబ్బుపడ్డాను” అని  –  యాకూబ్

ప్రముఖుల అభిప్రాయాలు
·    
        మేం (ఉభయులం) స్వేచ్ఛా భావుకులం, అభయులం, నిత్యబాలలం, నిత్యసంతోషులం, మాకులం విమల విశ్వశాంతి కులం, మంచి జీవన శిల్పులం, నాకు ఇస్మాయిల్ అంటే ఇష్టమంత ఇష్టం  -- పి.వి. నరసింహారావు

·        అతని ప్రతికవితలోను ఒక మనోహరత్వాన్ని, ఒక హృదయరంజకత్వాన్ని అనుభవించాకనే నేను ఆయన మొదటి కావ్యాన్ని ప్రచురించాను  -  సోమసుందర్

·        తనకు పోటీగా ఎన్ని ప్రబల కవి సిద్దాంతాలు ఉన్నా, తనదైన వాదాన్ని కడదాకా నిలిపిన గొప్ప కవి,
కవిత్వాన్ని మానవతా ప్రబోధ సాధనంగా మహోన్నత శిఖరాలపై నిలిపాడు ఇస్మాయిల్  -- సి.నా.రె.

·        సాదీ మహాకవి ఒక మాటంటాడు " జ్ఞానవంతులకు పచ్చని చెట్టులోని ఒక్కొక్క ఆకు ఒకో దివ్యజ్ఞాన ప్రపంచంలాగ కనిపిస్తుందని" , నిజంగా ఈ మాటలకు  నూటికి నూరు పాళ్లూ సరిపోయే తెలుగు కవి ఇస్మాయిల్ మాత్రమే  -- శిఖామణి

·        ఒక రుషిలాగ, సూఫీ కవిలాగ, ఒక హైకూగా ఇస్మాయిల్ బతికాడు.  తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్య చరిత్ర పుటల మీద పచ్చని సంతకంలా ఇస్మాయిల్ పది కాలాలు పదిలంగా ఉంటాడు  -  ఎండ్లూరి సుధాకర్

·        ఈయన సదా బాలకుడిగా లోకాన్ని చూసాడు, నిత్య నూతనుడిలా జీవించాడు  -- స్మైల్

·    

          వెయ్యి సంవత్సరాల సాహిత్య జీవితంలో తెలుగులో ఇలాంటి కవి మరొకరు లేరు  - వేల్చేరు నారాయణరావు
·      
          ఇస్మాయిల్ ఎందుకు విశిష్టకవి అయ్యారంటే, ఏ వ్యాసం ద్వారానో, విస్తృతమైన నవలద్వారానో, కధ ద్వారానో, వార్తా కధనం ద్వారానో చెప్పదగిన ఆవేశకావేషాలను, సిద్దాంత చర్చలను, ఒక నిలువెత్తు పద్యంలా పోతపొయ్యటానికి ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

·        నేను పెద్ద సాహిత్య విమర్శకుడిని కాదు కాని, శ్రీశ్రీ తర్వాత తెలుగు కవిత్వాన్ని మరో మలుపు దాటించిన వాడు ఇస్మాయిల్ అని నేను గట్టిగా నమ్ముతాను  --   సి. ధర్మారావు.

·        సాదా సీదాగా ఉండే ఇస్మాయిల్ కవిత్వానికి అంతశక్తి ఎక్కణ్ణించి వచ్చిందంటే ’నిబద్దత లేకపోవడమే ఆయన  కవిత్వ శక్తికి కారణం” అని ఆయన (అఫ్సర్ తండ్రిగారు) లెనిన్ అన్నమాటని గుర్తుచేసేవారు  -- అఫ్సర్

ఆణిముత్యాలు

ఇస్మాయిల్ గారు వివిధ సందర్భాలలో వెలువరించిన అభిప్రాయాలు


·        క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ, వాటి స్పందనలూ, జీవితాన్ని జీవనపాత్రంగా మార్చే అనంతమైన అనుభూతులూ, ఇవి కాక కవిత్వానికేవీ అర్హం?


·        అనుభూతి ఎప్పుడూ వైయక్తికమే. అనుభవ వస్తువు ఒకటైనా, ఎవరి అనుభూతి వారిది. అది ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఒకరి అనుభూతిలా మరొకరి అనుభూతి ఉండదు. ఈ నవనవోన్మేషమైన అనుభూతిని ఆవిష్కరించటమే కవి కర్తవ్యం

·                కవి అనుభవాల్ని తనలో ఇంకించుకుని, అంతర్దర్శి ఐననాడే మంచి కవిత్వం జనిస్తుంది.

·                అనుభూతులు శబ్ద ప్రపంచానికి చెందినవి కావు. ఈ నిశ్శబ్దాన్ని శబ్దంలోకి ప్రవేశపెట్టటమే కవిత్వం విశిష్ట లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం  కూడా అంతే.

·        పదచిత్రమనేది ఐంద్రియకం (sensuous). ఇంద్రియ జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. హేతుబుద్ధికి సంబంధించింది కాదు. లోతైన అనుభూతుల్నీ(feelings), భావాల్నీ(emotions) ఆవాహించే శక్తి పదచిత్రానికుంది.

·        లేబిల్స్ ఉపయోగించడం నాకిష్టం లేదు. అందుకనే నా కవిత్వానికి పేరు పెట్టనీయలేదు

·        ప్రస్తుతం తయారవుతున్న కవిత్వాన్ని రెండు రకాలుగా విశాలంగా వర్గీకరించవచ్చు ననుకుంటాను. poetry of ideas (అభిప్రాయ కవిత్వం), poetry of experience (అనుభవ కవిత్వం).

·        మినీ కవిత్వం రాస్తున్న యువకవులు చమత్కారమే కవిత్వం అనుకుంటున్నారు. చమత్కారం వేరు, కవిత్వం వేరు.

·        కవిత్వం వల్ల కొంపలు కాల్తాయి. విప్లవాలు వస్తాయి అని మీరనుకున్నట్టయితే నిరాశ కోసం సిద్ధపడండి. అది చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.

·        బ్రహ్మాండం బద్దలయ్యే సంఘటనలకి బ్రహ్మాండం బద్ధలయే కవిత్వం పుడ్తుందని ఆశించడం అమాయకత్వం.

·        ప్రతిదేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికిమాలినదని యువ రచయితలకు నూరి పోసి వాళ్ల చేత నినాద ప్రాయమైన శుష్కరచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకొంటున్నారు.  సాహిత్యంలో రాజకీయ కాలుష్యాన్ని మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను.  కమ్యూనిష్టు ప్రభావం వల్ల ఎంతో మంది యువరచయితలు, జబ్బుపడి సాహిత్యపరంగా శవ ప్రాయులయ్యారు.  ఆ అకవిత్వ కల్మషం దేశమంతా అలముకొంది.  ఈ వెల్లువ ఇంకా తగ్గినట్టు లేదు.  దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్ఛకోసమూ, రచయితల వ్యక్తి ప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూనూ, నలభైయ్యేళ్ల బట్టి పోరు సాగిస్తున్నాను.

·        కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు.దాని సామ్రాజ్యమే వేరు.

·        కవిత్వమనేది కవి సంపూర్ణ అస్తిత్వంలోంచి ఉద్భవిస్తుంది. నేను బ్రాహ్మణుణ్ణి లేదా దళితుడిని అని జీవితాన్ని కుంచింపజేసుకున్నవాడు కవిత్వమేం రాయగలడు?


·        జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని.  ఈ విధంగా మన చేతనని సుసంపన్నం చేస్తుంది కవిత్వం.


ఇస్మాయిల్  రచనలు
1. చెట్టు నా ఆదర్శం  2. మృత్యువృక్షం  3. చిలకలు వాలిన చెట్టు  4. రాత్రి వచ్చిన రహస్యపు వాన  5. బాల్చీలో చంద్రోదయం  6. కప్పల నిశ్శబ్దం   7. రెండో ప్రతిపాదన (అనుసృష్టి)  8. కరుణ ముఖ్యం  9.  కవిత్వంలో నిశ్శబ్దం (ఒక వ్యాసం) 10. పల్లెలో మా పాత ఇల్లు  (రివ్యూ)

చివరి మూడు రచనలలో, మొదటి రెండూ సాహితీ విమర్శనా వ్యాస సంపుటులు, చివరది ఆయన మరణానంతరం, అభిమానులు వెలువ రించిన కవితాసంకలనం.  (హైపర్ లింకులు కలిగిఉన్న పుస్తకాల పేర్లపై క్లిక్ చేసినట్లయితే ఆ పుస్తకాలను ఈమాట వారి ఆర్చైవులలో చదువుకొనవచ్చును)

కవితా పఠనం చేస్తున్న ఇస్మాయిల్ గారి వీడియో కోసం ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి



అవార్డులు/రివార్డులు

·        1989లో ఇస్మాయిల్ గారి షష్టిపూర్తి, రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి గారి చేతులమీదుగా జరగటం ఒక గొప్ప విశేషం.
·        1999 లో కళాసాగర్ వారి విశిష్ట పురస్కారాన్ని అందుకొన్నారు
·        15-6-2003 హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “చెట్టంత కవికి పిట్టంత సత్కారం” పేరిట ఇస్మాయిల్ అభినందన సభ జరిగింది.
·        కవిత్వంలో నిశ్శబ్దం   అన్న సాహిత్య వ్యాసాలకు తెలుగు విశ్వవిద్యాలయం వారు అవార్డు నిచ్చారు.


చివరగా

కీర్తి శేషుడైన కవి
కాలతీరాన
కాసేపు పచార్లు చేసి
గులకరాయొకటి
గిరవాటేసి
తిరిగి వెళ్లిపోయాడు

అన్న ఆయన కవితావాక్యాలలోని కవి ఎవరనేది ఇన్నాళ్లకు అర్ధం అయ్యింది.  ఆయన ఎవరో కాదు ఇస్మాయిల్ గారే.
చెట్టు నా ఆదర్శం అని ప్రకటించుకొన్న ఇస్మాయిల్  గారి కవిత్వం తెలుగు సాహిత్య చరిత్ర లో చిరస్థాయిగా నిలుస్తుంది
.

ఆయన సాహిత్య శకటాన్ని ఎక్కడ ఆపారో దాన్ని అక్కడి నుండి కొనసాగించటం తదుపరి కర్తవ్యం, భుజానికెత్తుకోవలసిన ఇంకొక పని  -  ఆయన ఎంతో ప్రేమతో, ఓపికతో నెరవేర్చినదే – ఎందరో సదా బాలకుల రాకకు అనుకూలంగా దారిని సుగమం చేయటం  -   అన్న తమ్మినేని యదుకుల భూషణ్ గారి మాటలు స్మరించుకొందాం.


Acknowledgements
1.     Md. రెహ్మాన్  లెక్చరర్, కాకినాడ (ఇస్మాయిల్ గారి బంధువు)
2.     అంతర్జాలంలో పైన ఉటంకింపబడిన  లింకులలోని ఇస్మాయిల్ గారి వివిధ రచనలు
3.     సలాం ఇస్మాయిల్ – వ్యాస సంపుటి

4.     Tribute to Ismail –DVD by Indraganti’s Family

Tuesday, November 18, 2014

సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్

ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్నశ్రీ సోమసుందర్ గారు నిత్యయవ్వనుడు, నిత్యోత్సాహి. తెలుగు సాహిత్యక్షేత్రంలో కురువృద్దుడు. వయసు 90 వసంతాలు దాటినప్పటికీ ఇప్పటికీ కవిత్వాన్ని తన ఉఛ్వాస నిశ్వాసాలుగా వెలువరిస్తున్న గొప్ప కవి, విమర్శకుడు శ్రీ సోమసుందర్ గారు.

శ్రీ సోమసుందర్ గారు కవిగా, కధకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతోగత 66 సంత్సరాలుగా సాహితీ సేవ చేయుచున్నారు. సాహితీక్షేత్రంలో వీరు సహస్రబాహువులతో ప్రకాశించే కార్తవీర్యార్జునుని గా అగుపిస్తారు.

జననం - విద్యాభ్యాసం
శ్రీ సోమసుందర్ గారు తూర్పుగోదారి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న శంఖవరం అనే గ్రామంలో శ్రీ కాళూరి సూర్యప్రకాశరావు, శ్రీమతి వెంకాయమ్మలకు 18-11-1924న అష్టమ సంతానంగా జన్మించారు. తన పినతల్లిగారైన శ్రీమతి ఆవంత్స వెంకాయమ్మగారికి సంతానం లేకపోవటం వలన చిన్నతనంలోనే శ్రీ సోమసుందర్ గారు వారింటికి దత్తుకు వెళ్లారు. ఆవిధంగా కాళ్ళూరి అనే ఇంటి పేరు ఆవంత్సగా మారింది.

తనను దత్తత తీసుకున్న వారికి మెండైన సాహిత్యాభిలాష కలిగిఉండటంవల్ల, చిన్నతనం నుంచే సంస్కృత కావ్యాలు, శతకాలు, అమరకోశం వంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం వీరికి కలిగింది. కానీ విధి వశాత్తు వీరి దత్తత తల్లితండ్రులు వీరికి పదేళ్ళ వయసుండ గానే పరమపదించారు. అయినప్పటికీ వీరి చిన్నారి మనసుపై ఆ పుణ్య దంపతులు వేసిన సాహిత్య ముద్ర మాత్రం అలానే నిలిచిపోయింది. వీరి ప్రాధమిక విద్యాభాసం అంతా పిఠాపురంలోనే జరిగింది. 1943 లో కాకినాడ పి.ఆర్.కళాశాలలో ఉన్నత విద్య నభ్యసించారు.


దేశ భక్తి

ఆ కాలం లో స్వాతంత్ర్యం కోసం జరిపే పోరాటానికి ఆ బాలగోపాలమూ ఉత్తేజితమై సర్వం త్యజించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపేవారు. శ్రీ సోమసుందర్ గారు కూడా అప్పుడు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. 1942 లో విద్యార్ధులను కూడదీసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెచేసారు. వీరి చర్యలకు ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం వీరిని లాకప్పులో పెట్టి, రోజూ స్టేషనుకు వచ్చి సంతకం చేయాలన్న షరతుపై విడుదల చేసింది.

శ్రీ సోమసుందర్ గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పోలీసుదెబ్బలకు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అప్పుడు వ్రాసిన వీరి మొదటి గీతంలో ఎంతటి గొప్ప దేశ భక్తి ఉందో గమనించండి.

రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా
రండర్రా గద్దల్లారా రండి రండి
సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన
నా శరీరాన్ని తినివేయండి ...........

ఇక్కడ తన శరీరాన్ని కాకుల్ని గద్దలనూ తినివేయమంటున్నారేమిటా అనుకోవచ్చు కానీ అది అనన్యమైన దేశభక్తిగా గ్రహించాలి, ఎందుకంటే తను చనిపోయిన తరువాత తన శరీరం కూడా బ్రిటిష్ వారికి దక్కకూడదనే తీవ్ర స్వాతంత్ర్య కాంక్ష. (ఇది వారు స్వయంగా చెప్పిన విశ్లేషణ).

వీరు స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్ధి నాయకుడిగా, కమ్యూనిష్టు పార్టీ సభ్యునిగా తనదైన గొప్పపాత్రను పోషించారు. సామ్రాజ్య వాద శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 1954 వరకూ వీరు కమ్యూనిష్టు పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించారు. తరువాత తరువాత రాజకీయాలు, సాహిత్య వ్యాసంగము ఏకకాలంలో నిర్వహించటం వలన , తనకెంతో ప్రీతిపాత్రమైన సాహిత్యానికి తగిన న్యాయం చేయలేకపోతున్నానని ఆత్మపరిశీలన చేసుకొని, క్రమక్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు.

సాహితీ ప్రయాణం
వీరు ఫోర్తు ఫారం చదువుతున్న రోజుల్లో పద్య ప్రక్రియపై మోజు కలిగి, చందస్సును క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. ఈ ప్రక్రియలో ప్రతీ రోజూ అభ్యాసం కొరకు తాను వ్రాసిన వివిధ పద్యాలను మిత్రులకు, ఉపాద్యాయులకు చూపేవారు. 1943 వరకూ కూడా భావకవిత్వం వీరికి తారసపడలేదు. భావకవిత్వాన్ని చదివిన తరువాత వీరు తనదైన వచనా శైలిని అలవరచుకొన్నారు. వీరు కమ్యూనిష్టు కార్యకర్తగా పనిచేసారు కనుక ఆ భావజాలం వీరి కవిత్వంలో అంతర్లీనంగా జాలువారుతుంది. వీరి కవిత్వానికి మానవుడే ప్రాతిపదిక, సమాజమే నేపధ్యం..

వజ్రాయుధం నుండి ఆమ్రపర్ణి వరకూ సుమారు ఆరున్నర దశాబ్ధాల పాటు శ్రీ సోమసుందర్ చేసిన కవితాయానంలో సమాజ సంకుల సమరమే అన్ని కోణాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఈ కవి మానవుని విస్మరించి, ఆకాశంలో విహరించిన సందర్భాలు కనపడవు.

వీరు 1969-73 ల మద్య కాకినాడకు మకాం మార్చి ' కళా కేళి " అనే సాహిత్య పత్రికను నడిపారు. (వీరు పిఠాపురంలో నివసిస్తున్న ఇంటి పేరు కూడా "కళాకేళి నికేతన్””") ఈ ప్రక్రియలో వీరు కొంత ఆర్ధికంగా నష్టపోయి, కొంత భూమిని కూడా అమ్ముకోవలసి వచ్చింది. ఈ కాలం మినహా మిగిలిన జీవితకాలమంతటిలో, వీరు ప్రతిఏటా ఒకటో రెండో పుస్తకాలు చొప్పున రాస్తూనే ఉన్నారు.

1975 లో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి కళా ప్రపూర్ణ అవార్డును పొందినపుడు, వారి అభిమానులు కాకినాడలో సన్మానం జరిపారు. దానికి విచ్చేసిన దేవులపల్లి, వీరికి ప్రత్యేకంగా కబురు పెట్టించి కాకినాడ రప్పించుకొన్నారు. ఆ రోజు జరిగిన సభకు శ్రీ సోమసుందర్ అధ్యక్ష్యత వహించారు. ఆ సభలో దేవులపల్లి ఒక చీటిపై " మీరు నా కవిత్వంపై విమర్శనాత్మక పుస్తకం వ్రాయాలి" అని కోరారు. దానిని పైకి మైకులో చదవమని దేవులపల్లి కోరగా వీరు మైకు తీసుకొని "మీ సాహిత్యం పై నేను పుస్తకం వ్రాయటం నాకు సాద్యమా? "అని అడిగారు. దానికి దేవులపల్లి మరలా మరో చీటిపై " మీరు వ్రాయగలరు, మీకా సమర్ధత ఉంది వ్రాయండి ఇది నా ఆజ్ఞ అనుకోండి" అని వ్రాసి ఇచ్చి, దాన్ని కూడా చదవమని సైగ చేసి చెప్పారట. ఆవిధంగా ఆవిర్భవించిన గ్రంధమే "క్రిష్ణశాస్త్రి కవితాత్మ".

తెలుగు విమర్శనా సాహిత్యంలో ఇంతటి ఉత్తమ విమర్శ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో శ్రీ దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారి కవితాత్మను పట్టుకొన్న గొప్ప పుస్తకమిది. కృష్ణ శాస్త్రి గారి పై వ్రాసిన పుస్తకాలలో ఒకదానికి ప్రైజు ఇవ్వదలచి పోటీ పెడితే, పోటికి పంపించబడ్డ 15 పుస్తకాలలో శ్రీ సోమసుందర్ గారు వ్రాసిన "కృష్ణ శాస్త్రి కవితాత్మ" అనే ఈ పుస్తకం మొదటి బహుమతి గెలుచుకోవటం వీరి సునిశిత పరిశీలనా శక్తికీ, రచనా పటిమకు నిదర్శనం.

ఇంత సుదీర్ఘకాలంగా మీరు సాహిత్యాన్ని ఎలా సృష్టించగలుగుతున్నారని అడిగినప్పుడు వారు చిరునవ్వు నవ్వి " రాయలేకుండా ఉండలేక. ఏమీ రాయకపోతే ఆరోజు దుర్దినంగా ఉంటుంది" అన్న వారి మాటలను బట్టి, వారు కవిత్వం వ్రాయటం ఒక పూవు సుగంధాలను విరజిమ్మినట్లు, చెట్లు వసంతాన్ని ధరించటం లాగా ఒక సహజ లక్షణమా అని అనిపించక మానదు
శ్రీ సోమసుందర్ గారు జీవితమే కవిత్వం అని నమ్మి, జీవితాన్నే కవిత్వానికి అంకితం చేసిన వ్యక్తి, శతాధిక గ్రంధ కర్త. కొందరు కవులు తాము వ్రాసిన ఒకటి రెండు రచనలతో వచ్చిన కీర్తితో జీవితాన్ని వెళ్లదీస్తారు. కానీ శ్రీ సోమసుందర్ గారి రచనలు అసంఖ్యాకం. దేని ప్రతిభ దానిదే, దేని సౌరభం దానిదే. ్సామాన్య మానవుడిని కవిత్వంలో ఆవిష్కరించటానికై వీరు కవిత్వాన్ని నిత్యాగ్నిహోత్రంగా పాటించారు.

ఆరున్నర దశాబ్ధాల వీరి సాహితీయాత్రలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ప్రళయాలు, కరువులు, ఎన్నో కనిపిస్తాయి. జాతి చైతన్యాన్ని కవితా చైతన్యంగా సమర్ధ వంతంగా తర్జుమా చేసిన అభ్యుదయ కవిగా శ్రీ సోమసుందర్ గారికి తెలుగు సాహిత్యంలో సాటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

వీరు సాహిత్యజీవితంలో అందుకోవలసిన శిఖరాలు అందుకోలేదని నిర్ధ్వంద్వంగా చెప్పవచ్చును. అకాడమీ ప్రైజులు, అవార్డులు వీరి దరి చేరకపోవటానికి కారణం శ్రీ సోమసుందర్ గారు ఎన్నడూ రాజకీయనాయకుల దగ్గర, అధికార పీఠాల్లో ఉన్నవారిదగ్గర తలవంచి నిలబడలేదు.

వ్యక్తిత్వం
శ్రీ సోమసుందర్ అభ్యుదయ కవి. తెలంగాణా ఉద్యమాన్ని కోస్తా ప్రాంతం నుండి సమర్ధించి కవిత్వం వెలువరించిన మహామనీషి శ్రీ సోమసుందర్ గారు. అప్పట్లో " ఖబడ్దార్ హే నిజాం పాదుషా .... ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురని " గర్జించిన సాహసి.

శ్రీ సోమసుందర్ గారి వ్యక్తిత్వంలో మరొక విశిష్టమైన అంశం ఏమిటంటే వీరు చాచే నిష్కల్మష స్నేహ హస్తం. వీరి సమకాలీనులలో ఎవరికైనా ఏదైనా అవార్డు వచ్చినట్లయితే వారిని అభినందిస్తూ వ్యాసమో, పుస్తకమో వ్రాసి ఆ అవార్డేదో తనకే వచ్చినంత ఆనందించటం వీరి కల్మషమెరుగని మనస్సుకు అద్దం పడుతుంది.

వీరు ఎందరో కవులను ప్రోత్సహించారు. అలనాటి ఓలేటి శశాంక మొదలు ఈ నాటి అరుణ్ బవేరా వరకూ.

ఇస్మాయిల్, మిరియాలరామకృష్ణ, మల్లిక్, చందుసుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ వంటి చాలా మందిని వీరు వెన్ను తట్టి ముందుకు నడిపించారు.

వీరికి రెండు పార్శ్వాలు. ఒకటి రచనా వ్యాసంగం. రెండవది తన రచనల్లో దేన్నైతే ప్రవచించారో దానికోసం నిరంతర పోరాటం. దానిలో భాగంగా శ్రీ సోమసుందర్ గారు ప్రతీ ఏటా ఐదుగురు కవులకు ఆరువేల రూపాయిల నగదు బహుమతిని, తాను నెలకొల్పిన సోమసుందర్ లిటరరీ ట్రస్టు ద్వారా అందచేస్తున్నారు.

2006 లో వీరి ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఆధునిక మహిళా సాహిత్య సదస్సు జరిపారు. దానికి రాష్ట్రం నలుమూలలనుంచీ అనేక మంది కవయిత్రులు విచ్చేసి పాల్గొన్నారు.

పాత కొత్త తరాల వారధి
1953 వరదలకు చలించిపోయిన సోమ సుందర్ గారు వ్రాసిన గోదావరి జలప్రళయం అనే కావ్యంలోని కొన్ని కరుణ రస ప్రధాన పద్య పాదాల ను చూస్తే వీరి కవితా శక్తిని గుర్తించవచ్చును.

ఏమమ్మా, ప్రళయమువలె పొంగి ఓ గౌతమి
ఇకనైనా దయను చూపి శాంతించవదేమి?
ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల
కోరలెత్తి మ్రింగుట ఇది ఏమన్యాయమే తల్లీ...

2004 లో వీరు రచించిన అక్షర నాదం అనే కవితా సంపుటిలోని కొన్ని పద చిత్రాల ను గమనించినట్లయితే వీరి ప్రతిభ, వీరేవిధంగా రెండు తరాలకు వారధిగా ఉన్నారనే విషయం సుస్ఫష్టమౌతుంది.

గ్లోబలైజేషన్ తో ఈ భూమి రజస్వలై
నవవరాన్వేషణలో మిటకరిస్తుంది......
హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ తో
అవతరించిన క్లోనింగ్ కోడె దూడ
' అంబా" అని అరవడం
గ్రాంధికమని నిషేదిస్తుంది. (నేటిని ఏటికి విడిచి అనే కవితనుంచి )


నేడు నా ముని వాకిట
పూచిన గులాబి పరిమళం నిండా
బాంబుల విషధూమం నింపింది పడమటి గాలి (సమరం కాదిది మరణం అనే కవితనుంచి )

ఇన్ని జంత్ర స్వరాల నాదాలలోంచి
ఎన్ని వెన్నెల మైదానాలు - ఎలా తెరుచుకున్నాయి?
దూరంలో మసకబారిన కొండలు
బూడిద బుంగలు (బితోవెన్ సంగీతంపై వ్రాసిన మూన్ లైట్ సొనాటా అనే కవిత నుంచి)

వంకవంకల వయ్యారాలతో
తల్లిలా పవళించిన ఏటి ఒడిలో
నిటారుగా నిలచిన కొబ్బరి తోట....
రేగిన జుత్తుతో ఊరికే మారాంచేసే
పిల్లవాడి వెర్రి ఊగిసలాట...... (ఏటి వడిలో కొబ్బరి తోట అనే కవిత నుంచి)


వీరి కవిత్వంలో సరళత, అదే సమయంలో అర్ధ గాంభీర్యతా , ఉదత్తమైన లోతైన భావాలు, మానవత్వపు పరిమళాలు పుష్కలంగా పొర్లాడుతూంటాయి.

బానిసల దేశం, గోదావరి ప్రళయం, రక్తాక్షి, హిరోషిమా, రక్షరేఖ, సీకింగ్ మై బ్రోకెన్ వింగ్, వంటి వీరి రచనలలో ఆయా సంఘటనలకు, సందర్భాలకు ఒక కవి తన హృదయమంతటితోనూ స్పందించిన విధానాన్ని దర్శించవచ్చు.

అంధురాలికోసం బిథోవెన్ సృష్టించిన వెన్నెల, సౌరాష్ట్రంలో జరిగిన నరమేధం, ఎన్నటికీ పూర్తికాని సోమశిల ప్రోజెక్టూ, ఖుజరహో శిల్ప విన్యాసం, సొమాలియాలో అన్నార్తులూ, సైగల్ గానమాధుర్యం ఇవీ వీరి కవితా వస్తువులు. వీటిలో ఏ ఒక్కటీ కూడా ఈ మట్టిని , గాలిని విడిచి సాము చెయ్యవు.

అవార్డులు
వీరు 1979 లో సోవియట్ లాండ్ నెహ్రూబహుమతి పొందారు. రాజాలక్ష్మీ ఫౌండేషను అవార్డు, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు. 2008 సంవత్సరానికి గానూ ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారం వీరిని వరించి వన్నెకెక్కింది.

శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి ఇంతవరకూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాకపోవటం ఆశ్చర్యకరం. ప్రభుత్వ పరంగా వీరికి జరిగిన అన్యాయం పెరుమాళ్ల కెరుక. కవిత్వం సోమసుందర్ కెరుక.


వీరి రచనల పట్టిక
వీరింతవరకూ 77 పుస్తకాలు రచించారు. చాలా పుస్తకాలు అనేక పునర్ముద్రణలు పొందాయి.
వీరు ప్రస్తుతం తన స్వీయచరిత్ర రెండవ భాగాన్ని వ్రాస్తున్నారు.

ఈమద్య ప్రచురించిన వీరి పుస్తకం పేరు " దేశి సారస్వతము-సమాజ వాస్తవికత. " దేశి సాహిత్యంలో ఉండే సామాజిక స్పృహపై వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంధం.
వజ్రాయుధం: నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వ్రాసిన కవితాసంకలనం. 1946 అక్టోబరు 26న దొడ్డి కొమరయ్య మరణంపై వ్రాసిన ఖబడ్ధార్ అనే కవితతో ఇది మొదలవు తుంది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేదించింది. 1956 లో శ్రీసంజీవరెడ్డి ప్రభుత్వం నిషేదాన్ని ఎత్తివేసింది. ఇది ఇప్పటికి 5 ముద్రణలు పొందింది. అనంతపురం యూనివర్సిటీ వారు దీనిని టెక్ట్స్ బుక్ గా పెట్టుకొన్నారు.
కాహళి : ఇవి ఆంధ్రరాష్ట్ర ఉద్యమ సమయంలో వ్రాసిన కవితలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమిస్తున్న సమయంలో వారానికి ఒకటి చొప్పున "జ్వాల" అనే వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. 1953 లో పుస్తక రూపంగా వచ్చాయి.
గోదావరి జల ప్రళయం: 1953 లో వచ్చిన గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో, శ్రీ సోమసుందర్ గారు రాజమండ్రి, అమలాపురం, కపిలేశ్వరం వంటి ప్రాంతాలను సందర్శించి అప్పటి గోదావరి భీభత్సాన్ని కరుణరసార్ధ్రంగా కవిత్వీకరించారు.
రక్తాక్షి : ఫ్యూడల్ చట్రంలో సమాజం ఎదుర్కొన్న నిరంకుశత్వాలు, అమానుషత్వాలను కధా వస్తువుగా తీసుకొని చేసిన చందోబద్ద కావ్యం. ఈ కావ్య ప్రత్యేకత ఏమిటంటే ఆధునిక కాలంలో విశ్మరింపబడ్డ ప్రాచీన చందస్సును తీసుకొని రచించటం. ఉదా: శ్రీ వృత్తం, వనితా వృత్తం వంటివి. రక్తాక్షి కావ్యంలో రెండు భాగాలు ఉంటాయి. 1. సచితానందం 2. రక్తాక్షి
మేఘరంజని: 1954 లో వెలువడ్డ కధాకావ్యం. దీర్ఘ వచన పద్యం. మొత్తం ఆరు చాప్టర్లు ఉంటాయి.
సోమరసం-సుందరకాండ: ఇది తాత్విక చింతనామయ కావ్యం. ఏమిటీ లోకం, ఏమిటీ భాదలు వంటి ప్రశ్నలు, వాటికి కవి కనుగొన్న సమాధానాలతో ఈ కావ్యం రచింపబడింది.
మిణుగురులు: అద్బుతమైన పదచిత్రాలతో కూడిన ఆధునిక కవితాసంకలనం.
అనలకిరీటం: 1975 లో వెలువడిన కవితా సంపుటి. Progressive and Revolutionary భావాల Concealed expressions తో కూడిన కవితల పుస్తకం. (శ్రీ సోమసుందర్ గారి మాటలలో)
వెన్నెలలో కోనసీమ : 1977 లో అమలాపురంలో ఆవిష్కరింపబడిన గీత సంపుటి. సంగీతానికి అనుకూలంగా ఉండే గీతాల రచన. ఈ గీతాలలో చాలావాటిని రేడియోలలో పాటలుగా పాడారు.
రాలిన ముత్యాలు: మిని కవితల ఉద్యమానికి ముందే లఘుకవితల పేరిట వ్రాసినటువంటి చిన్ని చిన్ని కవితలు.
మాఊరు మారింది: శ్రీసోమసుందర్ గారు ఎమర్జన్సీని బలపరిచారు. ఈ విషయం శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలవరపరచి, వీరితో భేటీ అయి అయిదురోజులపాటు చర్చించగా, వీరు ఎమర్జన్సీ కి వ్యతిరేకంగా తన భావాలను మార్చుకొని, ఒక స్టేట్ మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ భావ పరిణామక్రమంలో వ్రాసిన 7 భాగాల కావ్యమే మావూరు మారింది. దీనిలో ప్రణాళికల ద్వారా గ్రామాలే విధంగా మారాయి అని వివరిస్తూ వ్రాసినటువంటి కావ్యం.
ఆగతనికి శుభారంభం : వచన కవితలు
బృహత్కావ్యాలు (నాలుగు సుదీర్ఘ కవితలు): నాలుగు దీర్ఘకావ్యాలు. సుమారు 300 పేజీల పుస్తకం. ఈ పుస్తకంలో అక్షయతరంగిణి, కాలం వీలునామా, ముక్తఛ్ఛాయ, అరచే లోయలు అనే నాలుగు దీర్ఘ కవితలు ఉంటాయి. దీనిలో ముక్తఛ్చాయ లో మననుంచి మన నీడ విడిపోవటం, అసలు మననీడ అంటే ఏమిటి అనే విషయాలపై తాత్విక, భౌతిక చింతనలతో కూడిన భావాలుంటాయి.
ఒక్క కొండలో వేయి శిల్పాలు: 120 పేజీల దీర్ఘ కవితల సంకలనం
ఆంగ్ల సీమలో ఆమని వీణలు (యాత్రా సాహిత్యం): 1983 లో వీరు ఆంగ్లసీమలో చేసిన ప్రయాణ విశేషాలతో కూడిన ట్రావెలాగ్.
గంధ మాదనం: రచనా కాలం 1995/96. హనుమంతుడు సీతను అన్వేషించటానికి వెళ్లినపుడు మద్యలో మకాంచేసిన పర్వతం పేరు గంధమాదనం. జీవితం యొక్క అన్వేషణకు గ్రంధాలయం ప్రాతిపదిక అనే భావనతో వ్రాసిన దీర్ఘకావ్యం.
చేతావని: చేతావని అంటే వార్నింగ్ (1994). బాబ్రిమసీదు కూల్చినపుడు వ్రాసిన దీర్ఘ కావ్యం. 50 పేజీలు.
దోనా పాలా: ఇది ఒక ప్రదేశం పేరు. గోవా ప్రయాణంలో వ్రాసిన కవితలు.
రక్షరేఖ: బాబ్రి మసీదు కూలగొట్టిన తరువాత బొంబాయిలో (ముంబాయి) మతకలహాలు చెలరేగాయి. ఇలాంటి మతకలహాలు పాకిస్తాను విడిపోయినప్పుడు కూడా జరగలేదు. వాటికి స్పందిస్తూ వ్రాసినటువంటి దీర్ఘ కవితా సంపుటి.
హృదయంలో హిరోషిమా: 1997 లో హీరోషిమా ఉదంతాన్ని స్మరించుకొంటూ వ్రాసిన కవితలు.
ధూప ఛ్చాయ: నక్సలైట్లు రైలుపెట్టిని కాల్చివేస్తే దాన్ని నేపధ్యంగా తీసుకొని వ్రాసిన దీర్ఘకావ్యం.
జీవన లిపి : 120 పేజీల సంపూర్ణ కావ్యం. మానవుడు విప్లవానికై జరిపేకృషి అనే అంశంపై వ్రాసిన దీర్ఘకావ్యం.
సీకింగ్ మై బ్రోకెన్ వింగ్ :దేశంలో అతివాద పార్టీలన్ని (left wing) విడిపోతున్నాయి. దాన్ని సింబలైజ్ చేస్తూ వ్రాసిన అన్వేషాత్మకమైన దీర్ఘ కవిత.
సోమసుందర్ కధలు : 1984 లో ప్రచురింపబడిన శ్రీ సోమసుందర్ గారి బానిసల దేశం వగైరా కధలు.
బుద్దదేవ్ బోస్: శ్రీ బుద్దదేవ్ బోస్ అనే ఆయన ప్రముఖ బెంగాలీ కవి. వీరి మోనోగ్రాఫ్ మరియు కొన్ని కవితల యొక్క అనువాదాలతో కూడిన రచన.
లియోనార్డో డావిన్సీ: డావిన్సీజీవిత చరిత్ర. ఆయనను ఒక సంపూర్ణ మానవునిగా దర్శింపచేసే పుస్తకం.
హంసధ్వని: భారతీయ ఆధునిక సంగీతకారుల జీవితచిత్రణలు. (బిస్మిల్ల, బడేముల్లా తదితరులు).
కాజీ నజ్రుల్ ఇస్లాం: శ్రీ ఖాజీ, బెంగాలీ విప్లవకవి. వీరి కవిత్వాన్ని, జీవితాన్ని ఈ పుస్తకంద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసారు.
కాళిదాసు రామకధ: రచనా కాలం 1990 లు. రఘువంశంలో కాళిదాసు చెప్పిన రామకధకు, వాల్మీకి రామకధకు గల సునిశితమైన వ్యత్యాసాలను తెలుపుతూ వ్రాసిన విశ్లేషాత్మక పుస్తకం.
రుధిరజ్యోతిర్ధర్శనం: శ్రీరంగం నారాయణ బాబు కవిత్వం లోతు పాతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూపించిన గొప్ప విమర్శనాత్మక గ్రంధం.
జాతికి జ్ఞాన నేత్రం: శ్రీకొడవటిగంటి కుటుంబరావు రచనలపై చేసిన విశ్లేషణాత్మకమైన గ్రంధం.
కవిత్వం కాలాతీత కాంతిరేఖ: ఆధునిక కవిత్వానికి ఉండవలసిన లక్షణాలపై సూత్రీకరణ చేస్తూ వ్రాసిన విశ్లేషణాత్మకమైన 200 పేజీల గ్రంధం.
ఆధునిక కావ్య ప్రకాళిక: ఇతరుల పుస్తకాలకు వ్రాసిన పీఠికలలో కొన్నింటిని ఏర్చి కూర్చి చేసిన సంకలనం.
అమృత వర్షిణి: తిలక్ కవిత్వంపై వ్రాసిన విమర్శనాత్మక వ్యాసావళి.
సాహిత్యంలో సంశయ కల్లోలం: విరసం ఆవిర్భవించిన కొత్తలో విజయనగరం నుంచి చిత్తూరుదాకా ప్రయాణించి సభలు జరిపి, ఆ సభల్లో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు ఇచ్చిన సమాధానాల సంకలనం. ఆ ఆ ప్రదేశాలలో వారి సందేహాలను చిన్న చిన్న స్లిప్పులపై తీసుకొని, వాటికి సమాధానాలను పత్రికా ముఖంగా ఇచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరించి ఈ పుస్తకంగా ప్రచురించారు.
అక్షర సుమార్చన: తిక్కన, వేమన ఇత్యాదులపై వ్రాసిన వ్యాసావళి. శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య గారికి అంకితమీయబడినది.
పురిపండా ఎత్తిన పులి పంజా: పురిపండా అప్పలస్వామి వారిపై వ్రాసిన వ్యాస సంపుటి.
నూరు శరత్తులు : 1990 లకి నూరేళ్ళు నిండిన (కృ.శా., విశ్వనాధ మొ.)వారిపై వ్రాసిన వ్రాసావళి.
ఆ తరం కవితా తరంగాలు: భావకవుల తరువాత వచ్చిన పఠాభి, పాలగుమ్మి పద్మరాజు, వంటి వారిపై వ్రాసిన వ్యాసావళి.
నారాయణ చక్రం: డా: సి. నారాయణ రెడ్డి కవిత్వంపై విశ్లేణాత్మకంగా వ్రాసిన గ్రంధం.
గోపుర దీపాలు : చలం పురూరవ పై వ్రాసిన పుస్తకం.
కృష్ణశాస్త్రి కవితాత్మ: కృష్ణశాస్త్రి కవిత్వంపై సమగ్ర విమర్శ.
గురజాడ గురుత్వాకర్షణ: గురజాడ పై వ్రాసిన పుస్తకం. పూర్రిచర్డ్ అనే మాటపై పరిశోధన ఉంటుంది.
శరచ్చంద్రిక : శ్రీ శ్రీ నుంచి కుందుర్తి వరకూ ఆధునిక కవులపై వ్రాసిన పరిశీలనాత్మక వ్యాసావళి.
ఉర్దూసాహిత్యంలో ఉన్నత శిఖరాలు: కబీర్ నుంచి ఖైఫీ అహ్మద్ దాకా ఉండిన గొప్ప గొప్ప కవులను గురించి పరిచయంచేస్తూ వ్రాసిన పుస్తకం.
శేషేంద్ర జాలం: శేషేంద్ర కవిత్వంపై వ్రాసిన వ్యాసావళి.
అగ్నివీణ ఆలాపించిన అణుసంగీతం: అనిసెట్టి సుబ్బారావు కవిత్వం పై వ్రాసిన విశ్లేషణాత్మక పుస్తకం.
కవితా కల్పవల్లి: ఆధునిక కవిత్వం-విమర్శనాత్మక విశ్లేషణ.
ఆగామి శతాబ్ధానికి ఆహ్వానం: వ్యాసాలు.
చరమ దశాబ్ది-కవితా రసాబ్ధి: 90 లలో కవిత్వంపై వచ్చిన వ్యాసావళి.
అక్షర నాదం: 2004 కవితా సంపుటి.
ఆమ్రపర్ణి: కావ్యం
జీవన లిపి: సంపూర్ణ కావ్యం
చిన్మయ లహరి: స్వీయ కవితా సంపుటి.
మనస్సంగీతం: పాటల సంపుటి.
విషవలయం: నాటకం. 1980 లలో అనేక పరిషత్తులలో బహుమతులు సాధించిన గొప్ప నాటకం
లేఖలుసినీనటుడు రమణారెడ్డికి శ్రీ సోమసుందర్ గారు వ్రాసిన లేఖలను నెల్లూరులోని వీరి అభిమానులు పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు.
నగరం నుంచి గగనం దాకా మనిషి: వివిధ పత్రికలలో చుట్టు-చూపు అనే పేరుతో వచ్చిన వ్యాసాలన్నింటిని సంగ్రహపరచి ప్రచురించిన పుస్తకం. సుమారు 250 పేజీలు.
మంది-మనిషి: వ్యాస సంపుటి .

శ్రీ సోమసుందర్ గారి వద్ద ప్రస్తుతం ఇంకా 10 పుస్తకాలవరకూ అముద్రితంగా ఉన్నాయి. త్వరలో వెలువరించాలన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

(91 వ పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగు సాహితీ మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో --- పాత పోస్టే మరో సారి)
బొల్లోజు బాబా

Sunday, November 16, 2014

అందరూ
ఉత్తపేర్లేనట
అనాచ్ఛాదిత ఆత్మలు
బయటపడేలా
ఈ పేర్లను
బండకేసి తోమాలి
బొల్లోజు బాబా

Saturday, November 15, 2014

1816 నాటి తెలుగు సమాజం - రంగుల చిత్రాలలో

రవివర్మ కు ముందు హిందూ దేవతల చిత్రాలు ఎలా ఉండేవో అంటూ ఎక్కడో చర్చ జరిగింది. 1816 లో M.Leger, Jean Amable అనే ఫ్రెంచి దేశస్థులు వేసిన కొన్ని చిత్రాల లింకు ఇది. ఇందులో మహిషాసురమర్ధిని, భక్తకన్నప్ప, వివిధ కులవృత్తులు, సారాతయారీ, పైపుతాగుతూ రాట్నం వడికే స్త్రీ, కసరత్తులు చేస్తున్న స్త్రీ, పురుషులు వంటి చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి తెలుగునాట చిత్రించబడటం మరో విశేషం. ఒకరకంగా టైమ్ మెషిన్ లో ప్రయాణించినట్టుంది నాకైతే. (క్లిక్ చేస్తే పెద్దవిగా కనిపిస్తాయి)
http://gallica.bnf.fr/…/12148/btv1b2300743r.r=telinga.langEN

Friday, November 14, 2014

చదువులు


స్వచ్ఛమైన
సెలయేరు
పొర్లుతూ దొర్లుతూ
నదిని చేరేసరికి
నిలువెల్లా
మురికి మురికి
బొల్లోజు బాబా