Wednesday, January 11, 2023

థేరీ గాథలు…ఒక అనుసృజన

ఈ పుస్తకం చదివేది కాదు. మన మానసిక స్థితి వలన ఈ పుస్తకంలోకి మనం ప్రయాణిస్తాం- డా. కాళ్ళకూరి శైలజ
థెరీగాథల పుస్తకం ఆత్మను ఇముడ్చుకొన్న ఈ ఒక్క వాక్యం చాలు .... థాంక్యూ మేడం గారు ఈ గొప్ప కాన్కకు...
.
ఈ వ్యాసాన్ని సృజనసాహిత్య పేజీలో ప్రచురించినందుకు శ్రీ విల్సన్ రావు గారికి ధన్యవాదములు.
బొల్లోజు బాబా
.
థేరీ గాథలు…ఒక అనుసృజన
.
బొల్లోజు బాబా గారు కవి, సాహిత్య విశ్లేషకులు, వక్తగా అందరికీ పరిచితమే. ఆయన ఎంచుకున్న మరో ప్రత్యేకమైన బాట చారిత్రక రచన. ఇప్పటికే చారిత్రక విభాగంలో ఆయన రెండు గ్రంథాలను రచించిన, తన అభిరుచిని, అధ్యయనాన్ని చాటుకున్నారు.

కవి రక్తంలో ఆవేశం, ఆవేదన కలిసి ప్రవహిస్తుంటాయి. సృజనాత్మకతకు విస్తృతమైన సాహిత్య పరిశీలన అవసరం అన్నది నిర్వివాదాంశం.

బాబా గారు అప్పుడప్పుడు సచ్చిదానంద గారి కవితల అనువాదం తమ ముఖ పుస్తక పేజీలో ప్రకటిస్తుంటారు. మరో భాషలో వచ్చిన సున్నితమైన భావోద్వేగాలు మనసును ఎంతగానో వెంటాడితే తప్ప వాటిని మాతృభాషలోకి అనువాదం చేయలేరనిపిస్తుంది.

ఈ మధ్య బాబా గారి కవితాత్మకు, చారిత్రక నేపథ్యం తోడై 'థేరిగాథలు' కవితా సంకలనం వెలుడింది.
 
మానవ అస్తిత్వంలో 'తాత్విక ధోరణి' అత్యంత ఉన్నతమైంది. భూమిపైన జీవానుక్రమంలో జరిగిన రూపాంతరాలలో మనిషి పుట్టుకే శ్రేష్టం. ఆలోచనలు, భావనలు అని మనం వేర్వేరుగా వర్గీకరించుకునే నైరూప్యత ఒక అభివ్యక్తిని పొందడం మానవ మేధకు పరాకాష్ట.
అవసరాలు, కాంక్షలు తీరినప్పుడు సుఖం, తీరనప్పుడు దుఃఖం సహజం. చిత్రంగా సుఖదుఃఖాల్లో మానవుడు తనను తాను మరొకరితో పోల్చుకుంటాడు. ఈ పోలిక సుఖం విషయంలో అసూయ, విద్వేషం ప్రతీకారం, హింసగా పరిణమిస్తుంది.
 
అదే దుఃఖం కలిగితే నిస్పృహ, నిరాశ, బాధ నిండిపోతాయి. అందరూ బాగున్నారు, నాకే కష్టం వచ్చిందనే క్రుంగుబాటు వస్తుంది. ఆ సమయంలో సరైన సాంత్వన లభించినట్లైతే నిత్య జీవన సరళి లోకి పునఃప్రవేశించి, ఉపశమనం వైపు నడక నేర్చుకుంటాడు. పుట్టిన తరువాత నేర్చుకునే నడక ఎంత గొప్పదో ఈ నడక కూడా అంతే ముఖ్యం. ప్రధానం కూడా. ఈ ప్రయాణానికి అవసరమైన ఆర్ద్రతను సర్వ మానవులకు పంచిపెట్టిన సంపూర్ణ బోధకుడే బుద్ధుడు.
తన దుఃఖం కోసం కాక పరుల దుఃఖం పట్ల సహానుభూతి చూపాడాయన. అందుకే దుఃఖ మూల కారణాన్ని అన్వేషించేందుకు సిద్ధపడి, సాధించాడు. కోరికలే విషాదానికి కారణమని తెలుసుకున్న క్షణమే బుద్ధుని కళ్ళకు లోకంలోని సమస్త జీవజాలం సమానంగా కనబడింది. అందుకే, లింగ, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరితో సంభాషించ గలిగాడు. ధనం, అధికారం సాటి వారిని పీడించేలా మనిషినెంత కఠినంగా మారుస్తాయో గమనించాడు.

బుద్ధ బోధనలకు పీడిత జనమంతా ఆకర్షితులయారు. ముఖ్యంగా స్త్రీలు ప్రభావితమయ్యారు. వారినందరినీ ఆదరించి భిక్షుణులుగా వచ్చేందుకు అనుమతించి, మహిళలను జనజీవన స్రవంతిలో భాగం చేసిన తొలి తత్వవేత్త బుద్ధుడే. ఈ సూత్రాన్నే మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య సమరంలో అవలంబించాడు. అలా బుధ్ధ మార్గంలోకి వచ్చిన బౌద్ధ బిక్షుణులు వ్రాసుకున్న కవితలు 'థేరీ గాథలు'.

'మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా' ద్వారా 'థేరీగాథ' ఛార్లెస్ హాలిసే గారి ఇంగ్లీష్ సంకలనం ఒకప్పుడు వాడ్రేవు చినవీర భద్రుడు గారు సూచించిన తరువాత నేను తెప్పించుకుని చదవడం జరిగింది. ఇది 2016 లో జరిగిన విషయం. పచ్చి గాయాన్ని మోస్తున్న నా హృదయానికి ఈ ప్రతి బౌద్ధ బిక్షుణి కవితా, ఓదార్పునిచ్చి బుజ్జగించాయి.

దుఃఖ గాథలు, ముఖ్యంగా స్త్రీల వ్యక్తిగతమైన దుఃఖ గాథలు ఎక్కడ దొరుకుతాయి? మాతృస్వామ్య వ్యవస్థ తొలగిపోయాక స్త్రీకి భర్త, బిడ్డలు, కుటుంబం అనే మూడు భౌతిక, మానసిక సంకెళ్లు పడ్డాయి. సంఘం చెక్కిన చెరసాలలో ప్రపంచ నాగరికతలన్నిటా ఈ ధోరణి కనబడుతుంది.
సున్నిత హృదయం వలనో, ప్రేమమూర్తి గానో స్త్రీ వాటిని బంధనాలుగా కాకుండా బంధాలుగా చూసింది. భర్త నిరాదరణ, కుటుంబ కలహాలు, బిడ్డల నిర్లక్ష్యం, భర్త లేదా బిడ్డ మరణం ఇవన్నీ స్త్రీ జీవితాన్ని బహిరంతరాలలో కృంగదీసినపుడు మరో విధంగా బతకలేని నిస్సహాయత ఆవరిస్తుంది.

'థేరీగాథ'లు బుద్ధుని కాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా స్త్రీ ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను, విషాదాలను లిఖిత పూర్వకంగా రికార్డు చేశాయని చెప్పవచ్చు. అటువంటి 'థేరీగాథల'ను తెలుగులోకి అనుసృజన చేయటం బొల్లోజు బాబా గారి సున్నితమైన సహానుభూతి గల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

బాబా గారు గొప్ప ఆసక్తితో ఎన్నో ప్రామాణిక గ్రంథాలను సేకరించి, వాటిలోంచి మేలైన మణిపూసలను ఎన్నుకుని (తె)వెలుగులోకి తెచ్చారు.

ఎందరో స్త్రీలు సంపన్నులు. అధికారి భార్య ఒకరైతే, వ్యాపారి కూతురు మరొకరు. అన్ని స్థాయిలకు చెందినవారు ఉన్నారిందులో. వీరంతా ఇంటి నుంచి, ఈతిబాధలకు విసిగి తమ పరిమితులను ఛేదించి, కుటుంబాన్ని ఎదిరించి బుధ్ధ భగవానుని అనుసరించారు.
'సామ','ముత్త', 'పున్న'--గా పిలవబడే ఎందరో బౌద్ధ బిక్షుణుల కవితలు బాబా గారు ఇందులో చేర్చారు.

"breakthrough all that is dark with wisdom made full".....
"సంపూర్ణ జ్ఞానంతో ఈ సువిశాల చీకట్లను ఛేదించు "
బౌద్ధ బోధనల సారం ప్రబోధ కవితలుగా కొత్త రూపు దిద్దుకుంది. బాబా గారి సరళమైన భాష వలన మూలంలోని జటిలమైన ఉద్బోధ కూడా పాఠకునికి స్పష్టంగా అర్ధమౌతుంది.
కోరికలను జయించడమే కాదు, తిరిగి వాటివైపు ఆకర్షితులు కాని వారే నిజమైన ముక్తి సాధించగలరు అనే జ్ఞాన బోధ ఒక్కో కవితతో మరింతగా వ్యక్తిగత బాధ్యతను గుర్తుచేస్తుంది.
"From all that holds you back"
"వెనక్కులాగే అన్ని శక్తుల నుండి " అంటూ బాబా గారు మన వాడుకలో,లోతైన విషయాన్ని సూటిగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

"What does being a woman have to do with it?.......and that one sees what really is!"
'సోమ' అనే మహిళ తీక్షణమైన ఈ ప్రశ్నను, 'సత్యదర్శనం సరిగా ఉన్నపుడు స్త్రీ అయితే ఏంటటా?" అంటారు బాబాగారు.

"నా శ్రవణం స్ఫుటిత పడింది "
"అన్ని దుఃఖాలు,వాటి మూలాలు అర్ధమయ్యాయి "
"పులు కడిగిన ముత్యంలా వారు (పరివ్రాజకులు)దోష రహితులు "
"వారికి దుఃఖ నాశనం తెలుసు"
"నడవాల్సిన మార్గంలో నడక ఆరంభించేసాను నేను "
"ఈ దేహాన్ని అలంకరించి వివాహం అనే బంధంలో అమ్ముకోమంటున్నావా?"
"సముద్రంలో తప్పిపోయిన నావికుడు తీరాన్ని చేరుకొన్నట్లు నీకు కూడా గమ్యం దొరుకుతుందిలే"

పై వాక్యాలను పేరు సైతం చెప్పుకోని బౌద్ధ భిక్షుణిలు పలికారు. అవి మానవ చరిత్రలో తాత్విక చింతనలో పరమోన్నత వాక్యాలయ్యాయి. ఇది మహిళ తన స్వరాన్ని స్పష్టంగా, సమున్నతంగా, వెలిబుచ్చిన బృహత్ సందర్భం.

ఆనాటి మహిళలో తెగువ, వైరాగ్యం, అస్తిత్వ ప్రకటన అన్నీ బుధ్ధుడు తెరచిన ద్వారాల వలన మాత్రమే సాధ్యపడ్డాయి. అవన్నీ నేటికీ ఏ స్త్రీ ఐనా తెలుసుకోదగ్గ సత్యాలు. మానసిక స్థైర్యం ఇచ్చే అమృత గుళికలు.

మూలగ్రంధంలోని తాత్విక పరిమళం రవ్వంతైనా పొల్లుపోకుండా మనకు అందించడంలో బాబాగారు కృతకృత్యులయ్యారు.

ఈ పుస్తకం చదివేది కాదు. మన మానసిక స్థితి వలన ఈ పుస్తకంలోకి మనం ప్రయాణిస్తాం.
అదే మార్గం, ఆ మార్గమే గమ్యం కూడా.

కాళ్ళకూరి శైలజ.






పై వ్యాసంపై మిత్రులు చేసిన ఆత్మీయ వ్యాఖ్యలు. అందరకూ కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
.
నేను ఇటీవల ఇష్టంగా కొని చదివిన పుస్తకం థేరీగాథలు...నిజంగా కవి,చరిత్రాకారుడు బొల్లోజు బాబా గారి కృషికి
అభినందనలు
చెప్పాలి.
ఆ నాటి తల్లుల హృదయాన్ని వాక్యాలుగా మన ముందుంచారు.వేల ఏళ్ల కిందటే స్త్రీ మూర్తుల హృదయ స్పందనలు, వారి కళాత్మక వ్యక్తీకరణ అబ్బురపరుస్తుంది.ఈ పూట మళ్లీ ఒకసారి చదవాలనిపించింది.ఈ పుస్తకం పై కాళ్లకూరి శైలజ మేడంగారు అందించిన వ్యాసం ఆసక్తిగా చదివించింది.ఈ పుస్తకం మనం చదివేది కాదు.మన మానసిక స్థితి అన్న వాక్యాలు అక్షర సత్యాలు..మేడంగారికి ధన్యవాదాలు. @పల్లిపట్టు నాగరాజు
.
తాత్విక కి చింతనకు పరాకాష్టగా భావించే బౌద్ధ భిక్షుణుల కవితల్ని థేరీ గాధలు పేరుతో తెలుగులో అందించిన బొల్లోజు బాబా కవిత్వాన్ని కాళ్లకూరి శైలజ చక్కగా విశ్లేషించారు. @ డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
.
బొల్లోజు బాబాగారి అనుసృజన "థేరీగాధలు" మూల గ్రంధం చదివిన కాళ్ళకూరి శైలజ గారు ఆ పుస్తకంలో ప్రయాణించి సమీక్షించడం వల్ల చాలా విషయాలు తెలిశాయి. మనకూ ఓ టికెట్ కొనిచ్చి మనల్నీ ప్రయాణించమని ఆ మార్గాన్ని గమ్యంగా చూపినందుకు ధన్యవాదాలు. జంధ్యాల రఘుబాబు
.
కాళ్ళకూరి శైలజ గారి "థేరీ గాథలు - ఒక అనుసృజన"లో ప్రముఖ రచయిత బొల్లోజు బాబా గారి ఆవేదనను ఆవేశాన్ని సున్నిత భావోద్వేగాల సమాహారాన్ని చాలా చక్కగా వివరించారు.@కరిపే రాజ్ కుమార్
.
థేరీ గాథలు ఒక Monumental Work.బొల్లోజు బాబా గారి వర్క్స్ లో ఇది ప్రధానంగా నిలిచిపోతుంది.మంచి రివ్యూ అందించినందుకు శైలజ గారికి ధన్యవాదాలు. బాబా గారికి ఆలింగన నమస్సులు.@శ్రీనివాస గౌడ్

Sunday, January 8, 2023

Tonight I Can Write - poem by Pablo Neruda




ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
“దూరంగా వణుకుతోన్న నీలి నక్షత్రాల ఈ రాత్రి” లాంటివి.

రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.

ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.

ఇలాంటి రాత్రులలోనే నేన్తనని నా చేతుల్తో చుట్టేసి
అనంత ఆకాశం క్రింద పదే పదే ముద్దులాడేవాడిని.

ఆమె నన్ను ప్రేమించింది. ఒకోసారి నేను కూడా తనను.
తదేకంగా చూసే ఆమె విప్పారిన కళ్ళను ప్రేమించకుండా ఎలా ఉండగలను.

ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను
నాకామె లేదనీ, నేనామెను కోల్పోయానని తెలుసుకొనటానికి

ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.

నా ప్రేమ ఆమెనెందుకు నిలువరించలేకపోయిందనేది కాదు సమస్య
ఈ తారల రాత్రి ఆమె నాతో లేకపోవటమే.

అంతే! అంతకు మించేమీ లేదు. దూరంగా ఎవరో పాడుతున్నారు.
తనను పోగొట్టుకున్నందుకు నా మనసుకు అశాంతి మిగిలింది. అంతే!

నా చూపు ఆమెను వెతుకుతోంది, తనను నా దరి చేర్చటానికై.
నా హృదయం ఆమెకై చూస్తోంది. ఆమె నాతో లేదు.

అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము.

ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవచ్చు. నిజంగానే.
కానీ ఆమెను నేను ఎంతెలా ప్రేమించానూ?
నా స్వరం గాలిలో తడుముకొంటోంది, ఆమె చెవుల కోసమై.

మరొకరిది. ఆమె మరొకరిది. నేను తనను ముద్దులు పెట్టుకోకముందు లాగానే
తన స్వరం, తన మేని మిసిమి, తన విప్పారిన కళ్లు అన్నీను.

ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవొచ్చు. అది నిజం. ఏమో ప్రేమించవచ్చేమో!
ప్రేమ క్షణికమే, మరిచిపోవటం సుదీర్గంగా ఉంటుంది.

ఇలాంటి రాత్రులలో ఒకప్పుడు తను నా కౌగిట ఉన్నందుకేనేమో
తనను కోల్పోయింనందుకు నా హృదయంలో అశాంతి.

బహుశా ఇదే తను నాకు చేసే చివరి గాయం.
ఇవే నేనామెకు వ్రాసే ఆఖరి వాక్యాలు.

(* పాబ్లో నెరూడా (Pablo Neruda) ‘పుయేదో ఎస్క్రిబీర్‘ అన్న స్పానిష్ కవిత ఆంగ్లానువాదం ‘Tonight I can write‘ ఆధారంగా).


సెప్టెంబర్ 2009

https://eemaata.com/em/issues/200909/1465.html

Monday, January 2, 2023

అయ్యప్ప కల్ట్ -చారిత్రిక విశ్లేషణ



.
దక్షిణభారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఒక ఆరాధన విధానం అయ్యప్ప స్వామి. అయ్యప్పస్వామికి మణికంఠ, శబరినాథ, ధర్మశాస్త అనే వివిధ పేర్లు కలవు. దక్షిణభారత దేశ ప్రతిమలలో ఈయన పులిని స్వారీచేస్తున్నట్లు, శ్రీలంకదేశపు ప్రతిమలలో తెల్లని ఏనుగుపై ఊరేగుతున్నట్లు ఉంటుంది.
.
జన్మవృత్తాంతం
క్షీరసాగరమథనం అనంతరం దేవతలకు రాక్షసులకు విష్ణుమూర్తి అమృతం పంచేందుకు మోహినిగా అవతారం ధరించాడు. ఈ మోహినీ అవతారాన్ని చూసి ఆకర్షింపబడిన శివుడు, ఆమెను కూడగా శివకేశవుల అంశతో అయ్యప్ప జన్మించాడు. అందుకు ఈయనకు హరిహర సుతుడు అనే పేరువచ్చింది. అదేసమయంలో పందళదేశ రాజు అయిన రాజశేఖరుడు వేటకు వచ్చి ఈ బాల అయ్యప్పను/హరిహరసుతుని చూసి తనకు సంతానం లేనందుకు భగవంతుడు ఇలా అనుగ్రహించాడని భావించి, ఆ శిశువును ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకోసాగాడు. మహారాజు ఈ అయ్యప్పకు రాజ్యపాలన అప్పగించాలని భావించాడు. ఒక ఆలయాన్ని నిర్మించి ఇమ్మని అయ్యప్ప తండ్రిని కోరగా నిర్మించిన ఆలయమే శబరిమల ఆలయం. అక్కడ అయ్యప్ప స్వామి స్థిరనివాసం ఏర్పరుచుకొని భక్తుల పూజలందుకొంటున్నాడని పురాణకథనం.
.
ఇతర కథనాలు
1. అయ్యప్పస్వామి ఒక ఫూజారి కుమారుడు. ఇతను తన తండ్రిని చంపిన ఉదయానన్ అనే క్రూరమైన బందిపోటుదొంగను సంహరించి, అతను బంధీగా చేసిన పాండ్యరాకుమార్తెను విడిపించినట్లు ఒక కథనం కలదు.
2. అయ్యనారే అయ్యప్ప: తమిళనాడులో అయ్యనార్ గ్రామాన్ని రక్షించే అనార్య దేవుడు. శూద్రులదైవం. అయ్యనార్ విగ్రహానికి అయ్యప్ప విగ్రహానికి పోలికలు ఉండటాన్ని బట్టి అయ్యప్ప స్వామి కి అయ్యనార్ కు చారిత్రిక సంబంధాలు ఉండవచ్చునని, గ్రామీణ శూద్ర దైవం కాలక్రమేణ హైందవీకరణ చెంది ఉండవచ్చునని ప్రముఖ చరిత్రకారుడు T.A. Gopinatha Rao అభిప్రాయపడ్డారు.
3. Sreedhara Menon అనే చరిత్రకారుడు – అయ్యప్ప ఆలయానికి బ్రాహ్మణిజంతో కంటే బుద్ధిజంతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని ప్రతిపాదించాడు. అయ్యప్ప భక్తులు దీక్షలో ఉన్నప్పుడు శాఖాహారభోజనం, మాల దుస్తులు పవిత్రంగా ధరించటం, నేలపై శయనించటం, భిక్ష ద్వారా ఆహారం స్వీకరించటం, బ్రహ్మచర్యం పాటించటం, దురలవాట్లు మానుకోవటం- లాంటి బౌద్ధసన్యాసులు నిత్యం పాటించే నియమాలు ఆచరిస్తారు.
బౌద్ధ రచనల్లో సాహ్య పర్వతశ్రేణులపై “నీలకంఠ అవలోకేశ్వర” ఆలయం నిర్మించినట్లు ఉటంకింపులు కలవు. నీలకంఠ అవలోకేశ్వరుని విగ్రహం అయ్యప్పస్వామి విగ్రహంతో సారూప్యతలు కలిగి ఉంటుంది కనుక అయ్యప్ప కల్ట్ బుద్ధిజానికి దగ్గర అని శ్రీథర మీనన్ అభిప్రాయపడ్డారు.
4. అరేబియానుంచి వచ్చిన ఒక ముస్లిమ్ యోగి అయిన వావర్ తో అయ్యప్పస్వామి ఆథ్యాత్మిక సంబంధాలు కలిగి ఉన్నాడని మరొక జనశృతి కలదు. అయ్యప్పస్వామి వావర్ యోగి స్నేహితులుగా ఉండేవారట. శబరిమలై ప్రధాన ఆలయం పక్కనే వావర్ స్వామికి చిన్న గుడి ఉంటుంది. ఇక్కడ ఒక ముస్లిమ్ పూజారి నేటికీ పూజలు నిర్వహిస్తుంటాడు. అయ్యప్పస్వామే స్వయంగా పందళదేశరాజుకు కలలో కనిపించి వావర్ స్వామికి మసీదు నిర్మించమని ఆదేశించాడట. అలా నిర్మించిన వావర్ స్వామి మసీదు శబరిమలైకు వెళ్ళే దారిలో ఉంటుంది. శబరిమలై భక్తులు దీనిని కూడా తమ యాత్రలో భాగంగా దర్శించుకొంటారు.
ఈ వావర్ కు సంబంధించిన చారిత్రిక వివరాలేవీ లభించవు. బహుశా ముస్లిముల ప్రాబల్యాన్ని అంగీకరించే ప్రక్రియలో హిందూమతం చేసుకొన్న ఒక సర్దుబాటుగా ఈ వావర్-అయ్యప్ప ఉదంతాన్ని చూడాలని Eliza Kent అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
5. కేరళ ఆళపుర జిల్లాలో అర్థంగల్ అనే ఊరిలో సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఉంది. ఇది 16 శతాబ్దంలో నిర్మించబడింది. 1584 లో దీనికి Fr Jacomo Fenicio చర్చిఫాదర్ గా ఉండేవారు. ఇతని కాలంలోనే శబరిమలైను ఈ అర్థంగళ్ చర్చి ని కలిపే ఐతిహ్యం రూపుదిద్దుకొంది.
Fr Jacomo Fenicio తన ప్రేమపూర్వక మాటలతో, స్వస్థపరచే మహిమలతో స్థానిక ప్రజల ప్రేమను అభిమానాన్ని సంపాదించుకొన్నాడు. ఇతనికి హిందూ సంస్కృతి, ఆచారాలపట్ల అపారమైన గౌరవం ఉండేదట. ఆ సంగతులతో కూడిన ఒక పుస్తకాన్ని కూడా లాటిన్ భాషలో రచించాడు.
అయ్యప్పస్వామికి ఈ చర్చిఫాదరు స్నేహితుడు కావటంవలనే ఇన్ని మహిమలు చూపించగలుగుతున్నాడని ప్రజలు విశ్వసించారు. క్రమేపీ శబరిమలై దర్శించిన భక్తులు ఈ చర్చిని కూడా దర్శించుకోసాగారు. ఈ ప్రక్రియ ఈనాటికీ కొనసాగటం విశేషం.
***
ప్రధాన స్రవంతిలో మనుగడలో ఉండే భావజాలం ఎప్పటికప్పుడు ఎక్కువమంది ప్రజలు దేన్నైతే విశ్వసిస్తున్నారో దాన్ని own/appropriate చేసుకోవటం జరుగుతుంది. చారిత్రికంగా అయ్యప్ప కల్ట్ లో అదే జరిగింది అని అర్ధమౌతుంది.
నిజానికి విష్ణువుకి, శివుడికి పుట్టిన స్వామిగా అయ్యప్పను సృష్టించటానికి కారణం – అప్పట్లో లక్షలాది ప్రాణాలను తీసిన శైవ వైష్ణవ ఘర్షణలను సర్దుపరచటానికే అనే వాదన కూడా కలదు. మోహిని-శివుని వృత్తంతం ఉన్న భాగవత పురాణంలో అయ్యప్ప స్వామి జన్మించిన ప్రస్తావనలు లేవు కనుక ఈ హరిహర సుతుడు అన్న భావన ఆ తరువాత కల్పించినదని కొందరి అభిప్రాయం.
మళయాల జానపద గీతాలలో అయ్యప్పస్వామి కొండలలో తిరిగే ఒక యోధుడు. విల్లంబులను ధరించి, దారిదోపిడి దొంగలనుంచి బాటసారులను, వ్యాపారులని కాపాడే రక్షకుడు
అయ్యప్పస్వామి కల్ట్ వివిధ దశలలో వివిధ ఆరాధనా విధానాలను ఇముడ్చుకొన్న తీరు విస్మయపరుస్తుంది. ఒక ఆదివాసీ దేవుడిగా, ఒక శూద్రదేవుడిగా, హరిహరుడనే పేరుతో ఒక పురాణ పురుషుడిగా భిన్నకాలాలలో కనిపిస్తుంది. ఇంకా భిన్న పాలనలలో ఇస్లాం, క్రిష్టియన్ మత విశ్వాసాలను గౌరవించి అంగీకరించిన విధానం చారిత్రికంగా ఒక గొప్ప పరిణామంగా భావించాలి. ఇది సర్వమానవ ఐక్యతకు తోడ్పడింది తప్ప మనుషుల్ని వారివారి విశ్వాసాల ఆధారంగా ముక్కలు చేయటానికి ప్రయత్నించలేదు.
***
హిందూ మతవిశ్వాసాలు బహుముఖీనమైనవి. ప్రజలందరినీ ఐఖ్యపరచటానికి కాలానుగుణంగా అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ భిన్న ఆరాధన విధానాలను గౌరవించటం గమనించవచ్చు.
కేరళలోని సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఒకప్పటి శివాలయమని నేడు కొందరు రాజకీయనాయకులు వాదిస్తున్నట్లు –హిందూభావజాలం ప్రజలు మత ఆధారంగా విడిపోయి విచ్ఛిన్నమైపోవాలని ప్రయత్నించలేదు చారిత్రికంగా.
.
బొల్లోజు బాబా