Friday, June 26, 2026

ఉపాధి కల్పన

ఉపాధి కల్పన అంటూ
కొండల్ని తవ్వేసారు
నదుల్ని అమ్మేశారు
అడవుల్ని నరికేశారు
సముద్రాల్ని కంచెలతో చుట్టేశారు.

భూమి ఇచ్చిన రైతు
కూలీగా చేరాడు
నదిని కోల్పోయిన జాలరి
సెక్యూరిటీ గార్డయ్యాడు
అడవిని కోల్పోయిన గిరిజనుడు
గేటు బయట నిలబడ్డాడు
రోజుకు పద్దెనిమిది గంటలు
తమ జీవితాల్ని డెలివరీ చేస్తూ.

లాభాలన్నీ
పై అంతస్తులకు లిఫ్టులో వెళ్లిపోయాయి.

ఈ శతాబ్దపు
అత్యంత అమానవీయమైన
వంచన ఏమిటంటే
వారి భూమిని
వారి నదిని
వారి అడవిని
వారి భవిష్యత్తుని వారినుండి తీసేసుకొని
"ఉపాధి కల్పించాం" అని చెప్పి
చప్పట్లు కొట్టించుకోవటం.

బొల్లోజు బాబా

Sunday, June 21, 2026

కవిత్వ భాష – నిర్మాణ పద్దతులు

కవిత్వ భాష – నిర్మాణ పద్దతులు
(13, 14 జూన్ 2026 తారీఖులలో యానాంలో కవిసంధ్య ఆధ్వర్యంలో జరిగిన కవిత్వ శిక్షణాశిబిరంలో నేను చేసిన ప్రసంగ పాఠం)

కవిత్వం అంటే ఏమిటి?
ఒక ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో లేక ఈ మూడింటినీ కలగలిపో కళాత్మకంగా చెప్పిన భాషారూపమే కవిత్వం. అందుకనే కవిత్వాన్ని బహుముఖాలు కలిగిన భాషగా నిర్వచిస్తారు.
అభినవగుప్తుని దృష్టిలో “ఆనందోపదేశములు” కావ్య ప్రయోజనాలు. అంటేకవిత్వం ఆనందాన్ని ఉపదేశాన్ని ఇవ్వాలి అని. ఆధునిక కాలానికి వచ్చేసరికి సంఘశ్రేయస్సు, అభ్యుదయ భావనలు, సామాజిక స్పృహ, అస్థిత్వవాదం వంటి భావనలు కవిత్వానికి కొత్త దిశలను నిర్దేశించాయి. ఫలితంగా కవిత్వం కేవలం సౌందర్యానుభవం కాక, సామాజిక అనుభవాల వేదికగా విస్తరించింది. ఇది ఆధునిక కవిత్వం సాధించిన ముఖ్యమైన పరిణామం.

వచనానికి కవిత్వానికి తేడా ఏమిటి?
వచనాన్ని కవిత్వాన్ని వేరు చేసేది భాషే. వచనానికి చెప్పే విషయమే ప్రధానం కానీ చెప్పే పద్దతి కాదు. కవిత్వానికి వచ్చేసరికి విషయంతో పాటూ దానిని ఎంత ఉద్వేగభరితంగా చెపుతున్నామనేది కూడా ప్రధానమే. వచన భాషకు అర్ధస్ఫూర్తి నివ్వటం ఒక్కటే పని. అంటే తాను చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పటంతో దాని బాధ్యత తీరిపోతుంది. కవిత్వ భాష అర్ధాంతర స్ఫూర్తినిస్తుంది. అంటే చెపుతున్న విషయంతో పాటు చెప్పని విషయాన్ని కూడా ధ్వనింపచేయటం. దీన్నే ధ్వని, వక్రోక్తి, లేదా Latent Content అంటూ వివిధ పేర్లతో అలంకారికులు పిలిచారు.
వచనంలోని భాషకు, కవిత్వభాషకు ఉండే తేడాను తెలుసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ..

1. Alphabet
ABCDE
FGHIJ
KLMNO
PQRSTU
VWXYZ
2. Suicide
ABCDE
FGHIJ
KLMNO
PQRSTU
VWXYZ
మొదటి దాంట్లో ఎబిసిడి లను ఆల్ఫాబెట్స్ అని చెప్తున్నట్లు అర్ధమౌతుంది. అంతటితో ఆ వాక్యం పూర్తయింది ఇక దానినుంచి ఏ రకమైన అదనపు అర్ధాలు పొందలేము.

రెండవ దాంట్లో కవి ఒక కొత్త విషయాన్ని చెపుతున్నాడు. అక్షరమాలను ఆత్మహత్య అంటున్నాడు. (ఆ విషయం మనం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది వేరే విషయం). వెంటనే మన ఆలోచనలు పరిపరివిధాలుగా విస్తరిస్తాయి. ఆల్ఫాబెట్స్ కు నాగరికత అని అర్ధం చెప్పుకొంటే నాగరికతను ఆత్మహత్యగా కవి చెప్తున్నట్లు భావించాలి. ఆత్మహత్య చేసుకొన్నది మనిషి కావచ్చు, మానవత్వం కావొచ్చు, అమాయకత్వం కావొచ్చు, స్వచ్చత కావొచ్చు, మన ఆలోచన పరిధిని బట్టి అనేక రకాలుగా విశ్లేషించుకోవచ్చు. కానీ ఇన్ని విషయాలనూ కవి నేరుగా చెప్పటం లేదు, ఇవన్నీ కవి చెప్పని విషయాలు. చెపుతున్న విషయాలే కాక చెప్పని విషయాలను కూడా ధ్వనింపచేయటం అంటే ఇదే. ఇక్కడ కవి తనకు కలిగిన భావాన్ని మనలోకి ప్రవేశపెట్టాడు. అది కూడా భిన్న కోణాలలో ఆవిష్కరింపబడేలా. పైది వచనమైతే క్రిందది కవిత్వం.
 
కవిత్వంలో ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేవి రెండు ముఖ్యమైన అంశాలు. ఏది చెప్పాలనేది కవి స్వేచ్ఛకు, జీవితంపై అతని అవగాహనకు సంబంధించింది. రోజూ చూసే అనేకాంశాలను, అనుభవాలను వాటిలోని వైరుధ్యాలను కవి వస్తువుగా తీసుకొంటాడు. వస్తువును చెప్పే విధానాన్ని శిల్పం అంటారు.
 
కవిత్వ భాష
ఒక దృశ్యమో, ఊహో నేరుగా కవిత్వంగా మారదు. దానిని కవిత్వభాషలోకి మార్చాలి. మామూలు భాషను కవిత్వభాషగా మార్చేందుకు, సిమిలీ, మెటఫర్, పెర్సొనిఫికేషన్, మెటనొమీ సినడ్కకీ, అల్లిగొరి, మెటాఫర్, పారడాక్స్, అల్యూజన్, ఐరనీ వంటి వివిధ కవిత్వనిర్మాణ పద్దతులు తోడ్పడతాయి. పైన చెప్పిన ఆల్ఫాబెట్స్ ఉదాహరణలో పారడాక్స్ ప్రక్రియ ఉంది. ఈ కవిత్వ భాషనే ప్రముఖ కవి సచ్చిదానందన్ “సమాంతర బాష” అన్నాడు.
కవిత్వభాష శిల్పాన్ని నిర్దేశిస్తుంది. “సాహిత్యానికి సాహిత్య లక్షణాన్ని ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదు” అంటారు బాలగోపాల్.
మనం రోజూ చూసే దృశ్యాలు, ఎదుర్కొనే సంఘటనలు, చేసే ఊహలు కవిత్వంగా మారటానికి కవిత్వభాషగా మారాటానికి వివిధ కవిత్వనిర్మాణ పనిముట్లు ఎలాసహాయపడతాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం.

1. సిమిలీ, మెటఫర్
సిమిలీ అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో వలె/లాగ/పోలె/రీతిగా వంటి పదాలను ఉపయోగించి పోల్చుతాం. అలాకాక మొదటి వస్తువే రెండవ వస్తువు అని చెబితే దాన్ని మెటఫర్ అంటారు.
ఉదాహరణకు ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అంటే సిమిలీ. ఆమె ముఖం చంద్రబింబం అనటం మెటఫర్.
సిమిలీ: ఇంటిపనుల్లో అలసిపోయిన ఒక స్త్రీ ఆదమరచి నిదురపోయే దృశ్యం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఆమెకు నిద్రాభంగం కలగకూడదని ఇంట్లోవాళ్లు అనుకోవటం కూడా సహజమే. ఇది చాలా మామూలుగా ప్రతీ ఇంట్లో జరిగే విషయమే. దాన్ని కవితావస్తువుగా తీసుకొని శివారెడ్డి గారు వ్రాసిన “ఆమె ఎవరైతే మాత్రం” అన్న కవిత ఒక సాదాసీదా దృశ్యాన్ని గొప్ప కవిత్వంలా ఎలా మలచవచ్చో అనటానికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

“నా భార్యో, పక్కింటావిడో,
పిల్లలతల్లి, తెల్లని పిల్లో” ఎవరైనా కావొచ్చు
ఆమె అస్వప్నంగా,
ముకుళిత పుష్పంలా ముడుచుకు పడుకుంది//
కరుగుతున్న మంచుముక్కలా ఆమె పడుకుంటే
కదులుతున్న నీటిబొట్టులా ఆమె పడుకుంటే
కంట్లో బంధింపబడ్డ గొప్ప దృశ్యంలా ఆమె పడుకుంటే
రాత్రంతా ముకుళించి రేప్పొద్దున్న
వికసించే అద్భుత పుష్పంలా
ఆమె పడుకుంటే పడుకోనీ” (ఆమె ఎవరైతే మాత్రం -- శివారెడ్డి)

పై కవితా వాక్యాలలో నిదురించే ఆ స్త్రీ రూపాన్ని మంచుముక్క, నీటిబొట్టు, దృశ్యం, పుష్పం అనే వివిధ వర్ణణలతో పోలుస్తాడు కవి. ఇందులో కవి ఉపయోగించుకొన్న టెక్నిక్ ను Simily అంటారు.
 
మెటఫర్:
కవిత్వభాషలో మెటఫర్ అత్యంత ప్రధానమైన అంశం. =రెండు వస్తువుల (అవి భౌతికమైనవి లేదా మానసికమైనవి కావొచ్చు) మధ్య ఇతరులు ఊహించలేని పోలికను తీసుకువచ్చినపుడే అది మంచి మెటఫర్ అవుతుంది. మంచి మెటఫర్ ఉన్న కవిత్వాన్ని ఏ భాషలోకి అనువదించినా భావం చెడదు.
 
సాయింత్రపు ఎర్రటి గాయంలోకి
సాగిపోతోంది రైలు.
రైల్లో కూచుని
ఆలోచనల రక్తంలో తడుస్తున్నాను.
ప్రపంచమంతా పచ్చిపుండు.//
నాతో నేను ప్రయాణించక తప్పదని
ఇంతకాలానికి తెలుసుకొన్నాను. (సహప్రయాణికుడు - ఇస్మాయిల్)

మెటఫర్ ని ఉపయోగించుకొని ఒక మూడ్ ని కవితలోకి ప్రవేశపెట్టటాన్ని పై వాక్యాలలో చూడొచ్చు. రైలుప్రయాణం జీవితానికి ప్రతీకగా భావించాలి. ముసలితనం సమీపించే కొద్దీ స్నేహాలు, పరిచయాలు, సందోహాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఒంటరితనం జీవితంలోకి కొద్దికొద్దిగా ఎగబాకుతూంటుంది. అప్పుడు జ్ఞాపకాలలోనే భారంగా రోజులు వెళ్లదీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై మనతో మనమే ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న భావన ఏర్పడుతుంది. అతి సున్నితమైన ఈ మానసికస్థితిని - సాయింత్రపు ఎర్రటిగాయం, ఆలోచనలరక్తం, ప్రపంచం ఒక పచ్చిపుండు అన్న మెటఫర్ ల ద్వారా కవి ఆవిష్కరించగలిగారు.
 
2. పెర్సొనిఫికేషన్

మానవలక్షణాలను వస్తువులకో, జీవులకో లేక ఒక ఊహకో ఆరోపించి కవిత్వం చెప్పే పద్దతిని పెర్సొనిఫికేషన్ అంటారు.
కవిత్వం రాసే పద్దతులలో ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. దీనివల్ల ఒక విషయం పాఠకుని మనస్సులో లోతుగా నాటుకొంటుంది

పెర్సొనిఫికేషన్ టెక్నిక్ దైనందిన సంభాషణలలో, కథలలో, వార్తాకథనాలలో కనిపిస్తూనే ఉంటుంది. “ఈ బండి పెట్రోలు పొదుపు చేస్తుంది” అంటాం. “సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు” అంటూ ఓ కథ మొదలవ్వొచ్చు. “ఆ పథకం అందరిజీవితాలలో వెలుగులు నింపింది” అన్న ఓ వార్తాంశం కావొచ్చు. అన్నీ పెర్సొనిఫికేషన్ కు చక్కని ఉదాహరణలే.
అందమైన అమ్మాయి చందమామ పోలికని పెర్సొనిఫికేషన్ టెక్నిక్ ద్వారా చెప్పాలనుకొంటే ఇలా చెప్పొచ్చు. “ఆమె వదనాన్ని చూసి చందమామ ఈర్ష్యతో మబ్బులచాటుకు వెళిపోయింది”

నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు. --- ఇస్మాయిల్

ఇల్లుఖాళీ చేసిన సందర్భాన్ని కొండేపూడి నిర్మల ఒక కవితలో ఇలా వర్ణిస్తారు.
 
ఉనికి తాలూకు ఆనవాళ్ళన్నీ
చెరిగిపోతాయి
పెట్టేబేడా సర్దేయగానే
ఒకట్రొండు బాధగా వొంగిన
మేకులు మినహా
పెద్దగా మార్పేమీ ఉండదు.//
అద్దంలేని గోడ
తలమాసిందని చెప్పదు
సబ్బులేని స్నానాలగది కిటికీ
పరిమళాన్ని పావురంలా ఎగరేయదు (ఇల్లు ఖాళీ చేసినపుడు - కొండేపూడి నిర్మల)

పై వాక్యాలలో మేకులకు, అద్దానికి, స్నానాల గదికి మానవలక్షణాలు ఆరోపించటం ద్వారా మామూలు సందర్భంలోని ఉద్వేగం ఎన్నోరెట్లు హెచ్చింపబడింది. మేకులే బాధతో వొంగాయంటే ఇక మానవహృదయం ఎంత? అనే భావన కలిగిస్తారు కవయిత్రి. దీనంతటికీ కారణం సమర్ధవంతంగా వాడబడిన పెర్సొనిఫికేషన్ (Personification) టెక్నిక్.
 
3. పారడాక్స్, ఆక్సిమొరాన్ లు
పరస్పరవ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు భావాల్ని కలిపి చెప్పటాన్ని పారడాక్స్ అంటారు. భయం తెలిసినవాడే నిజమైన వీరుడు, చనిపోవటం కొరకు బ్రతకితీరాలి, కనిపించనివాటిని చూసే కళే దృష్టి, విడిపోయి కలిసిఉందాం, భిన్నత్వంలో ఏకత్వం- వంటి వాక్యాలు పారడాక్స్ కు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

పరస్పర వ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు పదాల్ని కలిపి చెప్పటాన్ని ఆక్సి మొరాన్ అంటారు. తెలివైన మూర్ఖుడు, బహిరంగ రహస్యం, ఒరిజినల్ కాపీ, శాంతి దళం, మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ఆక్సిమొరాన్ కూడా ఒకరకమైన పారడాక్సే. అందుకే దీనిని సంక్షిప్త పారడాక్స్ (compact Paradox) అనికూడా అంటారు.

"చల్లని చంద్రబింబం లాంటి ఆమె ముఖం... నా మనసులో విరహపు మంటల్ని రగిలిస్తోంది." పారడాక్స్ కి ఉదాహరణగా చెప్పొచ్చు.
 
త్రిశ్రీ కవిత్వంలో కనిపించే కొన్ని పారడాక్స్ అభివ్యక్తిలు .....

• మృత్యువును కౌగిలించుకునైనా మాట నిలబెట్టాలి//
• ఉరికంబాన్ని ఉర్రూతలూగించి అయినా ప్రాణశక్తిని తేజోమయం చేయాలి (ఎన్ కౌంటర్)
• భయం ముందు నిర్భయంగా చెలరేగిపోతాను. (రహస్యోద్యమం)
• హతుడే హంతకుడైన చోట హత్య నేరం కాలేదు (ఆత్మహత్యలన్నీ హత్యలే)
• కొన్ని ఎండలు వానలకు తడిశాయి (సంధ్యార్ణవం)
కవిత్వం ఎక్కువగా పోలికలపై ఆధారపడి నడుస్తుంది. పారడాక్స్ మాత్రం వైరుధ్యాలను ఎంచుకొంటుంది. అందుకే పారడాక్స్ ఒక మేధాపరమైన విలక్షణ ప్రక్రియ. గొప్ప పారడాక్స్ ను సృష్టించగలిగే కవి మేధాకవిగా గుర్తింపు పొందగలడు.
 
4. మెటానమి, సినక్డకి

కవిత్వంలో రెండువస్తువులను పోల్చుతున్నప్పుడు, ఒక వస్తువు బదులుగా దానికి సంబంధం ఉన్న మరొక వస్తువును పెట్టటాన్నే మెటానమి (Metonymy) అంటారు.
 
మెటఫర్ లో కూడా రెండు వస్తువులను పోల్చటం జరుగుతుంది. కానీ దానిలో రెండు వస్తువులు స్పష్టంగా తెలుస్తూంటాయి. మెటానొమిలో ఒక వస్తువే చెప్పబడుతుంది రెండవ దానిని ఊహించుకోవాలి. దీనివల్ల మెటానొమీ కలిగిన వాక్యాలను అర్ధం చేసుకోవటానికి పాఠకుడు కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది.
 
“మా ఆఫీసరు ఒక పెద్దపులి” -- అనే వాక్యం మెటాఫర్ కు ఉదాహరణ. దీనిలో పోల్చబడిన రెండు వస్తువులు స్పష్టంగా ఉన్నాయి. వాటిలో పెద్దపులి లక్షణాలైన నిర్దయ, క్రౌర్యం, బలం లాంటివి ఆఫీసరు అనే వ్యక్తికి చేరి అతని స్వభావాన్ని అర్ధం చేసుకోవటానికి దోహదపడతాయి.
 
“పెద్దపులి రివ్యూ మీటింగ్ పెట్టింది” - అనే అన్న వాక్యం మెటానమికి ఉదాహరణ. ఇక్కడ ఆఫీసరు, పెద్దపులి అన్న రెండు వస్తువులలో ఒకటే ప్రస్తావించబడింది. రివ్యూ మీటింగులు ఆఫీసరులే పెడతారుకనుక పెద్దపులి అన్న పదం ఆఫీసరుకి ప్రాతినిధ్యపదం అవుతుంది. ఆ ఆఫీసరు పెద్దపులిలా నిర్దయుడని, క్రూరుడని, బలవంతుడని అర్ధం చేసుకోవాలి.

సినక్డకి (Synecdoche) కూడా మెటానమీ లాంటిదే కానీ ఇక్కడ ఒక వస్తువు బదులుగా దానికి సంబంధం ఉన్న మరొక వస్తువులోని “భాగం” తో (part) పోల్చటం జరుగుతుంది.
ఆయన “పంజా” విసిరి పదిమంది “పొట్ట” కొట్టాడు. -- ఈ వాక్యంలో పంజా, పొట్ట అన్న పదాలు “సినక్డకి” లకు ఉదాహరణలు. పంజా అన్న పదం మనకు పులిని గుర్తుకు తెస్తుంది. పంజా పులికి, పొట్ట మనిషికి చెందిన “భాగాలు” మాత్రమే, సంపూర్ణార్ధాన్ని పాఠకుడు పూరించుకోవాలి. ఒక మనిషి తన పొట్ట నింపుకోవటానికి ఏదో ఉద్యోగం చేస్తాడు.
 
పైవాక్యంలో ఉన్న సినక్డకి టెక్నిక్ వల్ల – పెద్దపులి లాంటి ఒక దయలేని ఆఫీసరు పదిమందిని ఉద్యోగంలోంచి తీసేసాడు అన్న విస్త్రుతార్ధం సిద్ధించింది.

చంద్రబింబం నడుచుకొంటూ వస్తున్నది అంటే మెటానమీ.

ఆమె రాకతో గదంతా వెన్నెలతో నిండిపోయింది అంటే సినక్డకి.

పైట కొంగును చూస్తే
నా కెందుకో
పాతివ్రత్యం గుర్తొస్తుంది !
భుజాలనించి కిందికి వేలాడే
గుదిబండలా
అదెప్పుడూ నా స్వేచ్ఛని హరిస్తూనే ఉంటుంది !//
నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే
ముందుగా పైటని తగలెయ్యాలి
పైటని తగలెయ్యాలి. (పైటను తగలెయ్యాలి -- జయప్రభ)

స్త్రీ స్వేచ్ఛ, హక్కులను తరతరాలుగా హరిస్తున్న ఆచారాలు, వివక్షను "పైట" అనే పదంతో మెటానోమికాభివ్యక్తి చేసారు కవయిత్రి. స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షను తగలెయ్యాలి అన్న అర్ధంలో పైటను తగలెయ్యాలి అన్న ప్రయోగం చేసారు.
 
చాలామంది కవుల ఐకానిక్ కవితలన్నీ మెటానొమికాభివ్యక్తి కలిగిన కవితలే కావటం గమనార్హం. ఇస్మాయిల్ - చిలకలువాలిన చెట్టు, ఖాదర్ మొహిద్దిన్-పుట్టుమచ్చ, శిఖామణి-కొయ్యకాలు, సతీష్ చందర్-కలవని కనుపాపలు, తిలక్-నీవులేవు నీ పాట ఉంది, జయప్రభ-పైటను తగలెయ్యాలి, కొండేపూడి నిర్మల-నడిచేగాయాలు, మెర్సి మార్గరెట్-ప్రశ్నలగది మొదలైనవి కొన్ని ఉదాహరణలు.
"కవిత్వం మెటాఫర్ నుండి మెటానమీకి... ప్రయాణించాలి" అన్న వేగుంట మోహన్ ప్రసాద్ మాటలు కవిత్వంలో మెటానొమీకి కల స్థానాన్ని, స్థాయిని చెపుతాయి. మెటానొమీ పై పట్టుసాధించిన కవులు గొప్పకవులుగా నిలిచిపోతారు.
 
5. అల్లిగొరి
బయటకు ఒక అర్థం లోపల మరొక అర్థం ధ్వనింపచేసే టెక్నిక్ ను అల్లిగొరి అంటారు. దానికి శిఖామణి గారి నల్లని దానను అనే పేరుతొ రాసిన కవిత గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఆ కవిత మొత్తం మినువులపై రాసిన కవితగా అనిపించినా అంతర్లీనంగా దళితతాత్విక చింతనతో నడుస్తుంది.
 
నేను నల్లని దానను
నవ ధాన్యాల్లో నాలుగో దానను
నా పేరు మినుము
శక్తికి నేను ఇనుము//
గుండె కింది తడిలాంటి
ఇంతచెమ్మ నన్ను సోకితే చాలు
వొళ్లంతా కింజల్కపు పులకింతలతో
ఉబ్బితబ్బిబైపోతాను
ఆపై నన్ను స్పృశిస్తే
శ్వేత ప్రపంచాన్ని తెల్ల మొగం వేయించి
ఉర్రూతలూగించిన
ఆటపాటల నెలరేడు
మైఖేల్ జాక్సన్ లా
తెల్లగా మిలమిలా మెరిపోతాను.
నేను నల్లనిదానను
చరిత్రగర్భాన్ని చీల్చుకొచ్చిన
వేయి రేకుల బాకుల నల్ల కలువను
వర్తమాన దళిత రణక్షేత్రంలో
సమతారథం శిఖరాగ్రంపై
రెపరెపలాడే గబ్బిలపు ధ్వజాన్ని (నల్లని దానను - శిఖామణి)

సమకాలీన తెలుగు సాహిత్యంలో అల్లిగొరికి ఇంతకు మించి శక్తివంతమైన ఉదాహరణ దొరకదు.
 
6. హైపర్ బొలి
హైపర్ బొలి అంటే అతిశయోక్తీకరించటం. ఆలూరి బైరాగి నాక్కొంచెం నమ్మకమివ్వు కవితలో నాక్కొంచెం నమ్మకమిస్తే
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టమాటోలాంటి సూర్యుడ్ని
ఆరిన అప్పడంలాంటి చంద్రుడ్ని
ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను
నాదగు బాహుబంధనంలో
ఈ విశాల బ్రహ్మండాన్ని చాపలా చుట్టేస్తాను…. అంటాడు ఇవన్నీ హైపర్ బొలి టెక్నిక్ కు చక్కని ఉదాహరణ.
 
7. అల్యూజన్ (Allusion)
చరిత్రనుంచో, పూర్వసాహిత్యం నుంచో ఏదైనా ఒక ఉదంతాన్ని సూచించే పదాన్నొ, వాక్యాన్నొ కవితలో ఉదహరించటాన్ని అల్యూజన్ అంటారు.

శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలును
గొడ్డలితో నరుకుతున్నాడు
బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి
పాతాళానికి తొక్కేస్తున్నాడు/
కాలం కసాయి కత్తిమీద నిలబడి
గర్జిస్తున్న చండాలుడు
ఆదిశంకరునిపై నాలుగు వేటకుక్కల్ని
ఉసిగొల్పుతున్నాడు (నడుస్తున్న చరిత్ర - శివసాగర్)

పై కవితలో శివసాగర్ దళిత పురాణపాత్రలచే తమకు అన్యాయం చేసినవారిపై తిరుగుబాటు చేయిస్తాడు. ఇది ఒక కొత్త ఉదయానికి సూచనగా చెపుతాడు. దీన్ని తమ చరిత్రను తామే లిఖించుకోవటానికి చేసిన ప్రయత్నంగా భావించాలి.
అల్యూజన్ వల్ల, కవిత పరిధి పెరిగి అర్ధం విస్త్రుతమౌతుంది. కవి ఉటంకించిన ఉదంతం పట్ల చదువరికి పూర్వజ్ఞానం లేకపోతే అల్ల్యూజన్ అర్ధం కాదు.

8. ఐరనీ (Irony)

పైకి ఒక అర్ధాన్ని అంతర్లీనంగా దానికి "వ్యతిరేక అర్ధాన్ని" కలిగి ఉండేలా చెప్పటాన్ని ఐరనీ అంటారు. వెటకారం, సార్కాజం లకు దగ్గర ఐరనీ
కవిత్వంలో ఐరనీని ఉపయోగించి గొప్ప ధిక్కారాన్ని పలికించవచ్చు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు, అవకతవకలకు కలిగే కోపంలోంచి ఐరనీ పుడుతుంది. మార్చలేని నిస్సహాయ స్థితిని ఐరనీ ద్వారా చాలా శక్తివంతంగా వ్యక్తీకరించవచ్చు.
 
//నువ్వొకప్పుడు ఇంగ్లాండవతారంలో మమ్మల్ని
కరుణించావ్
మూర్ఖులం నీ లీల గ్రహించలేక నిన్ను ద్వేషించాం
అయితే నేం
పాపుల్ని కరుణించే వరకూ నువ్ నిద్రపోవ్ కదా
నివ్విప్పుడు అమెరికావతారంలో సాక్షాత్కరించి
మా ద్వారాలు తెరిపించావ్
ఇప్పుడు మా మెదడూ – హృదయంలోనూ నీ
నామ స్మరణమే// - (ప్రపంచీకరణ)

ఇరవై ఏళ్ల క్రితం అద్దేపల్లి ప్రభు వ్రాసిన ఈ కవితలో వస్తువు ప్రపంచీకరణ. ప్రపంచీకరణ దుష్ప్రభావాలను ఇంకా పూర్తిగా అవగాహనకు రాని సమయంలోనే వ్రాసిన కవిత ఇది. ఇందులో ప్రపంచీకరణను దేవుని అవతారంగా చెపుతాడు కవి. ఒకప్పుడు ఇంగ్లాడు రూపంలో వచ్చింది, ఇప్పుడు అమెరికా రూపంలో వస్తోంది అంటాడు. కరుణించటం, లీలగ్రహించటం, సాక్షాత్కరించటం, నామ స్మరణ వంటి ప్రయోగాలు మతపరిభాషగా అనిపించినా వాటి వాచ్యార్ధాలకు వ్యతిరేకార్ధలను ఇస్తాయి కవితలో. ఇది ఐరనీగా చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణకు లొంగిపోవటం వల్ల విచ్చిన్నమౌతున్న మానవవిలువలు, పరాయీకరణల పట్ల కవికి కలిగిన కోపంలోంచి పుట్టుకొచ్చిన ఐరనీ ఇది. సమకాలీన సామాజపోకడపై సంధించిన గొప్ప వక్రోక్తి.
 
9. నిరలంకారత
ఒక కొత్త ఆలోచననో, బరువైన సంఘటననో, బలమైన ఉద్వేగాన్నో చెప్పదలచుకొన్నప్పుడు నిరలంకారంగా చెప్పటం కూడా ఒక మంచి కవిత్వ నిర్మాణ టెక్నిక్.

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం – ప్రాణమిస్తం// (కాళోజి)

మహాకవి కాళోజీ వ్రాసిన పై వాక్యాలలో ఏరకమైన అలంకారాలు కనిపించపోయిన ఒక జాతి అంతరంగం ఆవిష్కృతమైంది. భావోద్వేగాలను, మానవ సంవేదనను వ్యక్తీకరించే కవిత్వానికి కొన్నిసార్లు అలంకారాలు అవసరం లేదనటానికి మహాకవి కాళోజీ కవిత్వమే నిదర్శనంగా నిలుస్తుంది.
 
అలంకారాలు లేకుండా కూడా మంచి కవిత్వం చెప్పగలుగుతున్నప్పుడు ఇక అలంకారాల ఉపయోగం ఏమిటి అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఎంతో శక్తివంతమైన కవితా వస్తువు, లోతైన కొత్త ఊహ లేదా గుండెలను బలంగా మోదగలిగేటంతటి సత్తువ కలిగిన ఉద్వేగమూ లేక పోతే నిరలంకార కవిత్వం ఉత్త వచనంగా మిగిలిపోతుంది.
 
త్రిపురనేని శ్రీనివాస్ “వచనమై తేలిపోతావ్” అని హెచ్చరించింది అలాంటి కవిత్వం గురించే.
 
ముగింపు

కవిత్వభాషలో మరొక ముఖ్యమైన అంశం లయ. యతి, ప్రాశలు ఆధునిక కవిత్వానికి వర్తించకపోయినప్పటికి పదాల మధ్య అనుప్రాస కవిత్వానికి అందాన్నిస్తుంది. పాదవిభజన కూడా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఆ వాక్యాలలో ఒక అంతర్లయ అనుభవానికి వచ్చి చదువుతున్నప్పుడు హాయినికలిగిస్తుంది.
 
కవి తనకు కలిగిన అనుభవాన్ని పదాల సహాయంతో భాషలోకి తీసుకొస్తాడు. వివిధ కవిత్వనిర్మాణ టెక్నిక్ లైన సిమిలీ, మెటఫర్, పారడాక్స్, పెర్సొనిఫికేషన్, మెటనిమి, సినక్డకి, అల్లిగొరి, అల్యూజన్, పారడాక్స్, ఐరనీ, హైపర్ బొలి వంటి వివిధ నిర్మాణపద్దతులు మామూలు భాషను కవిత్వభాషగా మారుస్తాయి.
 
ప్రతిభ కలిగిన కవి తాను చెప్పదలచుకొన్న అంశానికి తగిన టెక్నిక్ లను వాడుకొని తన ఉద్వేగాన్ని యధాతధంగా చదువరిలో ప్రవేశ పెట్టగలుగుతాడు. అప్పుడు మాత్రమే అతని వ్రాసింది కవిత్వమౌతుంది. లేకపోతే పేలవమైన వచనంగా మిగిలిపోతుంది.
 
ఈ కవిత్వ నిర్మాణ మెళకువలన్నీ తెలుసుకున్నంత మాత్రాన కవిత్వం వచ్చేస్తుందా? అంటే—ఇవి కవిత్వాన్ని ఎలా రాయాలో’ మార్గం చూపుతాయి తప్ప, కవిత్వాన్ని సృష్టించలేవు. కవిత్వాన్ని కవే స్వయంగా సృష్టించాలి. దానికి నిశిత పరిశీలన, ప్రతిభ, అభ్యాసం అత్యంత ఆవశ్యకం.
సాహిత్యం ఒక అనంతమైన నదీ ప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్తూ మానవజాతి భౌతిక మానసిక ప్రపంచాలను అన్వేషిస్తూ తన స్థలకాలాదులను, విశేషాలను లిఖించుకొంటూ సాగిపోతాడు. ప్రతీతరపు రచనలూ కాలక్రమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి ఆ తరం జీవించిన జీవితాలను భవిష్యతరాలకు అందిస్తాయి. మానవజీవితాలను, ఉద్వేగాలను అక్షరబద్దం చేసేది సాహిత్యం మాత్రమే. చదివితే వచ్చే రాంకుల్లాగ, మార్కుల్లాగా సాహిత్యం చేసే పని పైకి కనిపించదు. మరీ ముఖ్యంగా కవిత్వం చేసే పని.
 
బొల్లోజు బాబా

పై అంశాలు ఇదివరలో నేను రాసిన "కవిత్వ భాష" అనే పుస్తకంలోనివి లింకు మొదటి కామెంటులో కలదు


https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba


Monday, June 8, 2026

ఫిడెల్‌కు గీతం (Song to Fidel by చేగువెరా)

సూర్యుడు ఉదయిస్తాడని చెప్పావు,
పద వెళ్దాం - ఎవరూ నడవని ఆ దారుల వెంట
నువ్వు ప్రాణంగా ప్రేమించే
పచ్చటి క్యూబాను విముక్తం చేద్దాం!

మనతలలపై మెరిసే విప్లవ తారలు
అవమానాలన్నింటినీ తుడిచేస్తూ సాగుదాం,
విజయమైనా మరణమైనా.

మొదటి బుల్లెట్ శబ్దానికి
అడవి ఆశ్చర్యంతో మేల్కొంటుంది,
ఆ క్షణంలో... తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.

భూమి, భుక్తి, న్యాయం, స్వేచ్ఛ అంటూ
నీ గళం నలుదిక్కులా ప్రతిధ్వనించినప్పుడు,
తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.

ఆ నియంతపై పోరాటం ముగిసి,
తుది సమరానికి వ్యూహాలు సిద్ధమవుతున్నప్పుడు,
తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.

క్యూబా విసిరిన బాణం గుచ్చుకొని
ఆ క్రూరమృగం తన గాయాలను నాక్కుంటున్నప్పుడు,
గర్వంతో నిండిన గుండెలతో మేం నీ పక్కనే ఉంటాం.

బహుమతులతో ప్రలోభపెట్టే ఆ శక్తులు
మన నిజాయితీని కొల్లగొట్టలేవు
మనకు కావలసింది వాళ్ల తుపాకులు, బుల్లెట్లు, లాఠీలు...
అంతకు మించి ఏమీ వద్దు!

అమెరికా ఖండ చరిత్ర వైపు సాగే ఈ ప్రయాణంలో,
ఒకవేళ ఇనుప గుళ్ళు మనల్ని అడ్డుకుంటే...
మన గెరిల్లా అస్థికలను కప్పడానికి
క్యూబా కన్నీటి వస్త్రాన్ని ఒక్కదాన్ని కోరుతాం,
అంతకు మించి ఏమీ వద్దు!

Song to Fidel by Ernesto ‘Che’ Guevara

భావానువాదం- బొల్లోజు బాబా
***
1957లో క్యూబా విప్లవ పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో, ఎర్నెస్టో "చే" గువేరా తన సహచరుడు ఫిడెల్ కాస్ట్రోకు అంకితంగా రాసిన కవిత ఇది. ఇది విప్లవ మైత్రికి, నిబద్ధతకు, త్యాగానికి ప్రతీక. "నీ పక్కనే ఉంటాం" అనే వాక్యం ఈ కవితకు హృదయం.
ఈ కవితను ప్రస్తావించిన శ్రీ కె. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో

నడిచిన అడుగులు



అనేక : తెలుగుప్రభ సాహిత్య పేజీ లో నా కవిత.


ఒకట్రెండు నక్షత్రాలు రాలినా
ఆకాశం కూలిపోదు
ఒకట్రెండు రాళ్ళు తీసినా
ఏరు ఆగిపోదు
నువ్వు నేనూ లేకపోయినా
ఈ లోకం తిరుగుతూనే ఉంటుంది
మనం వదిలిన కథలను మోసుకొంటూ

పడిపోయి లేచావు చూడు అదొక కథ
తప్పుచేసి ఒప్పుకొన్న కథ
ప్రేమించి గోడదూకిన కథ
ఒక నిజం కోసం నిలిచిన కథ
నీ గురించి చెప్పేటపుడు
కళ్లలో వెలుగు రావాలి,
“తను ఒక కథ” అని
హృదయం గర్వంగా పలకాలి.

నువ్వు కాదు…
నువ్వు మిగిల్చిన కథలు మాత్రమే శాశ్వతం


బొల్లోజు బాబా
స్కై బాబా అన్నకు ధన్యవాదములతో



ఎవరికీ పట్టని విషాదం


ఈ సంవత్సరం
ఒక్క వలసపక్షీ రాలేదని
స్థానిక పత్రికలో
ఒక మూల చిన్న వార్త

కానీ
రేపు
గూడకొంగల రెక్కలనీడలో
విచ్చుకొనే వసంతం కూడా రాదని
సారసపక్షుల దేహకాంతులను
ధరించే శరత్తు కూడా కనిపించదని
ఉల్లంకి పిట్టలు విడిచివెళ్ళే
పసిడి వెలుగుల
హేమంతం కూడా కరుణించబోదని
ఎవ్వరూ
మాట్లాడుకోవటం లేదు
ఆశ్చర్యంగా


బొల్లోజు బాబా
(పర్యావరణ దినోత్సవం సందర్భంగా - రానున్న నా కొత్త కవిత్వ సంపుటి నుంచి)

Sunday, May 24, 2026

రిజర్వేషన్లపై....


( "ఎన్నాళ్ళిస్తారు ఈ రిజర్వేషన్లు" అంటూ మాజీ లోక్ సభ స్పీకర్ పేరుతో వైరల్ అవుతున్న కామెంటుకు నా స్పందన)
.
రిజర్వేషన్లు అనేవి ఎవరి రొట్టెముక్క వాళ్లకు దక్కే మెకానిజం. నా ముక్కా తినేస్తాను, ఎదుటివాని ముక్కా నేనే తినేస్తాననడం మోసం, అన్యాయం.
ఈ రోజు EWS రూపంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకూ ఏదో ఒక రూపంలో రిజర్వేషన్లు ఉన్నాయి. పైగా 50% “మెరిట్ కోటా” ఉండనే ఉంది. అయినప్పటికీ “మెరిట్” పేరుతో రిజర్వేషన్లపై చేసే వాదన చాలాసార్లు ఇతరుల వాటాను కూడా ఆక్రమించుకోవాలనుకొనే మెరిట్ లేనివాళ్ళు చేసే వాదన.
అసలు ఈ గోల అంతా ఎందుకు?
అన్నీ జనాభా ప్రాతిపదికన పంచితే సరిపోదా?
అప్పుడు సుమారు 56% జనాభా ఉన్న BCలకు 27% కాకుండా 56% రిజర్వేషన్లు వస్తాయి. అలాగే సుమారు 5% జనాభా ఉన్న పేద OCలకు 10% EWS కాకుండా 5% వాటా మాత్రమే వస్తుంది.
నిజమైన న్యాయం అంటే — ప్రతి వర్గానికి వారి జనాభా, వారి ప్రాతినిధ్యం మేరకు వాటా దక్కడం. నిజానికి విద్య, భూమి, ఆర్థిక వనరులు, సామాజిక గౌరవం, నెట్‌వర్కులు ఇవన్నీ తరతరాలుగా అసమానంగా పంచబడ్డాయి. వాటిని ఎలాగా ఇప్పుడు మార్చలేం. ఆ అసమానతల్ని సరిచేయడానికే రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు భారతదేశానికే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్న విధానమే.
అసమానతల కులాన్ని నిర్మూలించనంతవరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే. అంతే కాదు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగానికి కూడా విస్తరించాలి. ప్రజల సొత్తైన భూముల్ని, అడవుల్ని, గనుల్ని ఉచితంగా, ఏటా లక్షల కోట్ల రుణమాఫీలు, టాక్స్ మినహాయింపులు పొందుతున్న ప్రైవేట్ రంగం ఆ మాత్రం సామాజిక బాధ్యత ఎందుకు వహించదు? మంది సొమ్ముతో వారి సామాజిక వర్గాలే వృద్ధి చెందాలా?
బొల్లోజు బాబా

సోషల్ మీడియా ఆల్గోరిథం

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఆల్గోరిథం ఎలా సెట్ చేసారంటే, బత్తాయిలకు మేలు చేసేది మాత్రమే వైరల్ అవ్వగలదు. ఏదైనా వైరల్ అయిందంటే దానిలో బత్తాయిలకు అనుకూలంగా ఉండే అంశం ఏదో ఉందన్నమాట.... డిజిటల్ స్ట్రాటజిస్టు "పండితుల" ప్లానింగ్ అలాంటిది. పురాణకాలం నుంచీ చూస్తున్నదే ఇది.
అది - సమకాలీన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించి విపక్షాల సీరియస్‌నెస్‌ను ఒక జోక్‌గా మారుస్తోన్న కాక్రోచ్ పార్టీ ఉదంతం కావచ్చు; పేదల ప్రొటీన్ ఆహారాన్ని లాక్కొని ఎక్స్పోర్ట్ కంపనీలకు చేర్చే "బీఫ్ రక్షణ" అంశం కావొచ్చు

ఒక కామెంట్

ముస్లింలపై డా.అంబేద్కర్ అభిప్రాయాలను విభజన పూర్వ విభజనానంతర అభిప్రాయాలుగా చూడాలి. మొదటిదశలో - వందల ఏళ్ల పాలనలో హిందూ-దళిత సమస్యకు పరిష్కారం చూపలేకపోయిన పాలకులుగా ముస్లిములని చూస్తారు.
 
రెండవదశలో ఈదేశంపై ప్రేమతో ఇక్కడే ఉండిపోయిన ముస్లిములను బాధితులుగా/మైనారిటీలుగా చూస్తారు. రాజ్యాంగంలో వారికి సాంస్కృతిక, మత, విద్యా పరిరక్షణ హక్కులు కల్పించారు. స్వతంత్ర భారతదేశంలో వారిపై ప్రతీకారభావ ఉండరాదని భావించారు.
  
హిందుత్వ వాదులు డా. అంబేద్కర్ ముస్లింలపై విభజనపూర్వం వెలిబుచ్చిన అభిప్రాయాలను ముందుకు తెచ్చి వాదిస్తారు అతితెలివితో....
డా. అంబేద్కర్ సత్యాన్వేషి, వాస్తవికుడు. ఈ సందర్భంలో సెలెక్టివ్ కోట్స్ ద్వారా ఆయనను నిర్వచించలేం.

Wednesday, May 13, 2026

The Banker సినిమా - Dr. B. R. Ambedkar



The Banker సినిమా చూశాను. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా బయటికి ఇది ఒక రియల్ ఎస్టేట్ కథలా కనిపించినా, నిజానికి ఇది ఆర్థిక స్వేచ్ఛ కోసం నల్లజాతీయులు చేసిన పోరాట చరిత్ర

1960లలో అమెరికాలో నల్లజాతీయులకు తెల్లవారు నివసించే ప్రాంతాల్లో ఇళ్లు అమ్మడం, అద్దెకు ఇవ్వడం దాదాపు నిషేధం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో బెర్నార్డ్ గారెట్, జో మోరిస్ అనే ఇద్దరు నల్లజాతీయులు ఒక తెల్లజాతి స్నేహితుని ముందుపెట్టి వందల కొద్దీ తెల్లజాతీయుల ఇళ్లను కొనుగోలు చేసి, వాటిని నల్లజాతీయులకు అమ్ముతారు. తర్వాత వారు బ్యాంకులను కూడా కొనుగోలు చేసి, నల్లజాతీయులకు వ్యాపార రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తారు.

సినిమా ప్రారంభంలో ఒక పాత్ర ఇలా అంటుంది:
“నల్లవారు సంపాదించలేరు. సంపాదించినా తెల్లవారు సహించలేరు.”

అలాగే చివరికి, వారు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చట్టపరమైన లొసుగులు ఉన్నాయని సాకుగా చూపుతూ ప్రభ్హుత్వం వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, జైలుకు పంపిస్తుంది. కానీ కొన్నేళ్లకే అదే అమెరికా ప్రభుత్వం, నల్లజాతీయులు కూడా తెల్లవారి ప్రాంతాల్లో నివసించవచ్చని చట్టం తెస్తుంది..

ఈ సినిమా చూస్తున్నంతసేపూ, మన దగ్గర దళితులు, అన్యమతస్థులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం, అమ్మడం లాంటి వాటిపై పెరిగిన అనధికార నిషేధాలు గుర్తుకొచ్చాయి.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — అమెరికాలో అలాంటి చట్టాలు రావడానికి దాదాపు రెండు దశాబ్దాల ముందే, డా. B. R. Ambedkar భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికీ కులమతాలకు అతీతంగా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఆస్థిని కొనుక్కొనే హక్కును పొందుపరిచారు. ఎంత దూరదృష్టి! ఎంత క్రాంతదర్శనం!

బొల్లోజు బాబా



Sunday, April 12, 2026

గ్రామదేవత గొంతెమ్మ వృత్తాంతం

గొంతెమ్మ/గొంతాలమ్మ భారతంలోని కుంతీదేవి అంశ అని జానపదుల విశ్వాసం. ఆంధ్రమహాభారతంలో కుంతీదేవిని గొంతి అని సంబోధించడం అనేకచోట్ల కనిపిస్తుంది.
దళిత వర్గాలు 'గొంతెమ్మ' లేదా 'గొంతాలమ్మ' పేరుతో కుంతీ దేవిని తమ ఇలవేల్పుగా పూజించడం వెనుక అనేక జానపదగాథలు, సామాజిక పౌరాణిక అంశాలు ఉన్నాయి.
అగ్రవర్ణాల వారు కుంతీదేవిని తప్పు చేసిన శాపగ్రస్తురాలిగా భావించి దేవతగా అంగీకరించలేదు. కానీ, దళిత కులాల వారు (ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో) అట్లతద్దెను కుంతీదేవి పండుగగా ఘనంగా జరుపుకుంటారు.

దళితుల ఇలవేల్పు కావడానికి గల వివిధ ఐతిహ్యాలు
.
1. పంటల పండుగ (నేదునూరి గంగాధరం గారి కథనం): కుంతీదేవి పెంచిన ఒక ఆంబోతు రైతుల పంటలను పాడుచేయగా, ఆమె అలా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుంది. పశువులను హింసించకుండా ప్రేమగా చూసుకునే దళితుల చేలల్లోనే తిరగమని ఆ ఎద్దుకు సూచిస్తుంది.
మాలవారి చేనులో మసలుమా ముద్దూల నందన్న
మాలోరు మంచోరు మక్కువతో కొలుస్తారు ముద్దూల నందన్నా…...... అంటూ ఆ ఎద్దుకు కుంతీదేవి చెప్పిందట! ఈ సందర్భంగా పశువులను, వ్యవసాయాన్ని రక్షించే ఈ పండుగ ఒక 'పంటల పండుగ'కు ప్రతీక.

2. ధర్మరాజు శాపం (సురవరం ప్రతాపరెడ్డి గారి వివరణ): కురుక్షేత్ర యుద్ధం ముగిశాక, కర్ణుడు తన సొంత అన్న అనే రహస్యం తెలుసుకున్న ధర్మరాజు తీవ్రంగా బాధపడతాడు. ఈ విషయాన్ని ముందే చెప్పకుండా యుద్ధానికి కారణమైనందుకు కోపించి, తల్లి కుంతీదేవిని 'మాలల దేవత'గా మారమని శపిస్తాడు. అప్పటినుండి ఆమె దళితుల ఇలవేల్పు అయ్యిందని చెబుతారు.

3. కోయ గిరిజనుల విశ్వాసం: కుంతి కుమారుడైన భీమసేనుడు ఒక నర్తకిని ప్రేమించాడని, ఆ ఇద్దరికీ పుట్టినవారే తమ వంశీకులని (కోయలని) వారి నమ్మకం. అడవులు నరికే సమయంలో గొంతాలమ్మ తమకు అండగా నిలిచిందని వారు భావిస్తారు.

సమాజంలో కర్ణుడిలాగే తాము కూడా తిరస్కారానికి గురయ్యామని భావించే దళిత వర్గాలు, అగ్రవర్ణాలచే దూరం చేయబడిన కుంతీదేవిని తమను ఆదరించే 'కన్నతల్లి'గా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. (అంతేకాదు ధర్మరాజు, అర్జనుడు, భీమసేనుడు నకులుడు, సహదేవుడు లాంటి పేర్లు ఎక్కువగా దళితులకే ఉండటం గమనార్హం)

పండుగ ఆచారాలు - "సాగనంపు":

కృష్ణా, గోదావరి జిల్లాల్లో దసరా లేదా అట్లతద్దె సమయంలో పది రోజుల పాటు ఈ గొంతాలమ్మ పండుగ చేస్తారు.
రేగడి మట్టిలో పాలుపోసి పిసి గొంతెమ్మ బొమ్మను తయారు చేసి పూజిస్తారు.
పదవ రోజున గొంతెమ్మ బొమ్మతో పాటు నంది, కప్ప బొమ్మలను కూడా దళిత వాడల్లో తెల్లవార్లూ ఊరేగించి, ఊరి బయట విడిచిపెడతారు (లేదా నదిలో కలుపుతారు). ఇలా సాగనంపడాన్ని "సాగనంపు" ఉత్సవం అంటారు. (రి. కృష్ణాజిల్లా గ్రామదేవతలు, డా. జి వి పూర్ణచందు)

*****
శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు సేకరించిన జానపద వీరగాథలలో గొంతెమ్మ కథ పేరుతో ఒక వీరగాథ ఈ విధంగా సాగుతుంది.

గొంతెమ్మ కథ (గవరమ్మ గాజులు) - సారాంశం
రేణుకాదేవి కుమార్తె గవరమ్మ ఈడుకు రాగానే, ఆమె అన్నలైన జంపయరాజు, పరశురాముడు తండ్రి జమదగ్ని కలిసి ఆమెను పురుషుల గాలి తగలకుండా అడవిలో ఒక ప్రత్యేకమైన 'లక్కసిరి మేడ' కట్టించి, అక్కడ ఏడుగురు దాదుల కాపలాలో ఉంచారు.
కార్తిక మల్లన్న రాక: గోనెలకోటను పాలించే సిద్ధమాశెట్టి (విచిత్ర వీరరాజు), తరిదేవి దంపతులకు ఏడుగురు కుమారులు. వారిలో చిన్నవాడు కార్తిక మల్లన్న. సిద్ధమాశెట్టి దంపతులు తమ కుమారుడికి గవరమ్మను ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి రేణుకాపురి వచ్చారు. కానీ జంపయరాజు, పరశురాముడు అందుకు ఒప్పుకోకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
మాయా గాజుల బత్తుడు: తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న కార్తిక మల్లన్న, ఎలాగైనా గవరమ్మను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అతను గాజుల వ్యాపారి (గాజుల బత్తుడు) వేషం వేసి, 'మరల గాజులు' (చూస్తే మోహం కలిగించే మాయా గాజులు) తీసుకుని రేణుకాపురి వెళ్లాడు. ఆ గాజుల కేక విన్న గవరమ్మ, అవి కావాలని పట్టుబట్టింది. మొదట తల్లి ఎల్లమ్మ (రేణుకాదేవి) నిరాకరించినా, గవరమ్మ అన్నం నీళ్లు మానేయడంతో చివరకు ఆ గాజుల బత్తుడిని లక్కసిరి మేడకు రప్పించింది.

అపహరణ: మేడలోకి వెళ్లిన కార్తిక మల్లన్న గవరమ్మకు గాజులు తొడిగి, తన మాయా గాజులతో ఆమె మనసు మార్చేశాడు. గవరమ్మ అతనిపై మక్కువ పెంచుకుంది. మల్లన్న ఆమెను ఒక సంచిలో మూటగట్టుకుని, ఎల్లమ్మ దగ్గర డబ్బు కూడా తీసుకుని అక్కడి నుండి తప్పించుకున్నాడు.
జంపయరాజుతో పోరాటం: ఈ విషయం తెలిసిన జంపయరాజు వారిని వెంబడించాడు. కానీ మార్గమధ్యంలో అలసిపోయి నిద్రపోతున్న జంపయరాజును, గవరమ్మ సలహాతో మల్లన్న బంధించి, అతని గుండెలపై పెద్ద బండరాయిని పెట్టి వెళ్ళిపోయాడు. పరశురాముడు తన 'మైలపురి డేగ' సహాయంతో అన్నను రక్షించి, కోపంతో గోనెలకోటపై దండెత్తాడు.
పరశురాముడి శాపం: సిద్ధమాశెట్టి కుమారులు వేషాలు మార్చుకుని పరశురాముడిని చంపాలని చూసినా, డేగ హెచ్చరికతో పరశురాముడు వారిని బంధించి శిక్షించాడు. చివరకు గవరమ్మ వచ్చి తన తమ్ముడిని బ్రతిమాలింది. తనతో చెప్పకుండా లేచిపోయినందుకు కోపించిన పరశురాముడు, గవరమ్మను మాల మాదిగల ఇళ్లలో 'గొంతిదేవి' (గొంతాలమ్మ) గా పుట్టమని, కార్తిక మల్లన్నను 'నందిగాడు' గా పుట్టమని శపించాడు. వారిద్దరినీ ఆ కులాల వారు పూజిస్తారని చెప్పాడు. (రి. తెలుగు వీరగాథ కవిత్వం, తంగిరాల వెంకట సుబ్బారావు)

ముగింపు:

‘గొంతెమ్మ’ లేదా ‘గొంతాలమ్మ’ ఆరాధన అనేది కేవలం ఒక పౌరాణిక పాత్రకు పరిమితమైన పూజ కాదు; అది శతాబ్దాలుగా సామాజిక తిరస్కారానికి గురైన వర్గాల సాంస్కృతిక ప్రతిఘటనకు ఆత్మగౌరవానికి ప్రతీక. అగ్రవర్ణాల పురాణ సాహిత్యం కుంతీదేవిని కొన్నిచోట్ల శాపగ్రస్తురాలిగానో, పొరపాటు చేసిన తల్లిగానో చిత్రించి దూరం పెట్టినప్పటికీ, దళిత,జానపద వర్గాలు ఆమెను తమ ఇంటి ఆడపడుచుగా, కన్నతల్లిగా అక్కున చేర్చుకొన్నాయి. అగ్రవర్ణ సమాజం ఎవరినైతే తక్కువ చేసి చూస్తుందో, వారిని దళితవాడలు తమ ‘ఇలవేల్పు’గా మార్చుకుని గౌరవించడం ఇక్కడి విశేషం.

కర్ణుడు, అర్జనుడు ఇరువురూ బతికి ఉండాలనే అసాధ్యమైన కోరిక కుంతీదేవి కోరింది కనుక నెరవేరే అవకాశంలేని కోరికలను సూచించటానికి గొంతెమ్మ కోరికలు అనే నానుడి స్థిరపడింది.
మహాభారతంలోని కుంతీదేవి వ్యధ అయినా, జానపద వీరగాథల్లోని గవరమ్మ కష్టాలైనా... ఇవన్నీ అణగారిన వర్గాల దైనందిన జీవన పోరాటంతో మమేకమైపోయాయి. అందుకే, పాండవుల పేర్లను తమ పేర్లుగా పెట్టుకోవడమే కాకుండా, ‘గొంతెమ్మ’ పండుగను తమ ఆస్తిగా మలుచుకున్నారు. ఎద్దులను ప్రేమించడం, ప్రకృతిని (మట్టి బొమ్మలు కప్పలు) పూజించడం లాంటి అంశాలు ఈ పండుగలో అంతర్లీనంగా ఉన్న శ్రమజీవుల తాత్వికత

బొల్లోజు బాబా

Friday, April 3, 2026

కొన్ని మౌలిక ప్రశ్నలు.....

శ్రీ మందకృష్ణ మాదిగ లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యమైనవి కావు. అవర్ణులైన ప్రతి సామాజికవర్గమూ అడగాల్సిన ప్రశ్నలు అవి.

1. అన్ని వర్గాలవారు దేవుడిని పూజించినపుడు ఒక్క బ్రాహ్మణ వర్గం మాత్రమే పురోహితులుగా ఎందుకున్నారు? ఈ ప్రశ్న శతాబ్దాల క్రితమే మా శిల్పులు వేసారు. తామే తమ కాళ్ళకింద తొక్కి చెక్కిన శిల్పానికి ప్రాణప్రతిష్ట చేసాము అనే మిషతో ఆ తరువాత దానిని తాకనివ్వకుండా నిషేదించటాన్ని ప్రశ్నించారు.

ఈ అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనలో కోర్టుకేసులు కూడా నడిపి, బ్రాహ్మణులతో పాటు సమానంగా విశ్వబ్రాహ్మణులు కూడా అర్చక హక్కులు తెచ్చుకొన్నారు. ఆ వాదప్రతివాదనలన్నీ పుస్తకరూపంలో లభిస్తున్న "1818 డిసెంబర్ 15నాటి చిత్తూరు జిల్లా అదాలత్ తీర్పు" ద్వారా నేడు తెలుసుకోవచ్చు.

ఈ తీర్పు ద్వారా పూజలు, వివాహాలు, ఉపనయనాలు, ప్రాణ ప్రతిష్ఠ, గర్భగుడి అర్చనలు లాంటి హక్కులు విశ్వబ్రాహ్మణులు కూడా పొందారు. ఈ క్రమంలో ఎన్నెన్ని ప్రతిఘటనలు చవిచూసారో 1821, 1843-44 నాటి రివ్యూ పిటిషన్లు, బందరు కేసు, సేలం (1840), గుంటూరు జిల్లా (1912) విశ్వబ్రాహ్మణుల కేసుల ద్వారా తెలుస్తుంది.

చారిత్రికంగా బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించి కులనామాన్ని విశ్వబ్రాహ్మణగా మార్చుకొని (శాసనాలలో పంచానము వారు అని ఉంటుంది) వేదాధ్యయనం చేసి, జంద్యం ధరించి, పౌరోహిత్యం చేసి వారికి బలంగా ఎదురు నిలిచిన సామాజిక వర్గం విశ్వబ్రాహ్మణ వర్గమే కావొచ్చు. ఈ మార్గంలో వారు ఎంత హింసను ఎదుర్కొని ఉంటారో అనేది కూడా సులభంగా ఊహించవచ్చు.
ఇదంతా చరిత్ర. కాలక్రమేణా బ్రాహ్మణాధిపత్య రాజకీయాలవల్ల ఈ హక్కులు చాలామట్టుకు క్షీణించాయి.

ఈ రోజు రాజ్యాంగం శాసించిన ప్రకారం అన్ని వర్ణాలవారికి అర్చకత్వ అర్హతనిచ్చే వేదం నేర్పుతున్నారు. కానీ వారిని అర్చకులుగా తిరుపతి, అన్నవరంలాంటి ప్రధాన ఆలయాలలో నియమించటం లేదు. అలా ఎందుకు జరుగుతోందని ప్రతీ అవర్ణ సామాజిక వర్గమూ ప్రశ్నించాలి.


2. మరొక ప్రశ్న- ఎక్కడో పుట్టిన ఇస్లాం, క్రిష్టియానిటీలు విశ్వవ్యాప్తం అవ్వగా అంతకన్నా ప్రాచీనమైన హిందు మతం ఎందుకు విస్తరించలేకపోయింది?

అంతేకాదు ఇక్కడే పుట్టిన బౌద్ధం కూడా జపాన్ నుండి శ్రీలంకవరకూ విస్తరించి ఒక ప్రపంచ మతంగా స్థిరపడింది. ఈ మతాలలో లేనిది హిందూ మతంలో ఉన్నది ఒకటే- కులవ్యవస్థ. సాటి మతావలంబిని చంపేటంత ద్వేషాన్ని నూరిపోయటం ఈ కులవ్యవస్థ లక్షణం.
సాటిమనిషి పట్ల ఎంత వివక్ష చూపిందనటానికి మనుధర్మ శాస్త్రమే ప్రమాణం. ఇంకా చెప్పాలంటే ఓ పదిశాతం ద్విజులను మినహాయిస్తే మిగిలిన 90% జనాభాకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిరాకరించి వారిని సేవకులుగా చేసింది కులవ్యవస్థ. ఇలాంటి అసమానత్వ లక్షణాలతో ఎలా విస్తరించగలదు?

ఈ శూద్ర అతిశూద్ర వర్గాలను హిందూమతంలోనే ఉండేలా చేసింది భక్తి, సూఫీ ఉద్యమాలు. నిజానికి ఈ ఉద్యమాలు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు. వాటిని సంస్కరణల పేరుతో హిందూమతం క్రమేపీ తనలో కలిపేసుకొంది.

దుర్మార్గమైన ఈ వివక్షను తట్టుకోలేక ఇతరమతాలలోకి వెళితే వివక్షను మరింత బలంగా అమలు చేయడం సమకాలీన విషాదం.

ఇది కేవలం పూజాధికారాల కోసం కాదని — సమానత్వం, గౌరవం, మనిషితనాన్ని తిరిగి సాధించుకునేందుకని ప్రతిఒక్కరూ గుర్తించాలి.

బొల్లోజు బాబా

Post Script Comments: 

1. అసలు ప్రశ్న — అవకాశం అందరికీ సమానంగా ఉందా లేదా? అని.
ఒక వ్యవస్థను పూర్తిగా త్రోసిపుచ్చడం కన్నా దాన్ని ప్రజాస్వామ్యీకరించడం (democratize)  ఒక సామాజిక విప్లవం.
“ఇది మా దే – మీరు రావద్దు” అనే భావజాలాన్ని “ఇది అందరిదే” గా మార్చడం కూడా మార్పే. దాన్ని పాటించటం పాటించకపోవడం మన ఇష్టం. తలుపు తెరవటమే విజయం. అంతవరకే.
డా. బాబాసాహెబ్ చెప్పినట్లు అసమానతలపై పోరాడటంలో దీన్ని కూడా భాగం గా చూడాలి అనుకొంటాను

2. నేను బ్రాహ్మణులను వ్యతిరేకించను, బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తాను. 
వేదాల ఆధారంగా, యజ్ఞాలు,  కులవ్యవస్థతో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రాచీన మత వ్యవస్థ ను బ్రాహ్మనిజం అంటారు.  బ్రాహ్మణిజాన్ని బ్రాహ్మణులు ఒక్కరే పాటించరు...శూద్ర అతిసూద్ర వర్గాలలో కూడా ఉంటుంది. ఇది సూక్ష్మ విషయం. చాలామందికి అర్థం కాదు. 

3 ఒక బ్రాహ్మణుడు కావాలంటే నేర్చుకొని బట్టలు నేయవచ్చు, కుండలు చేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. అదే నేర్చుకొని నేతకాడు, కుమ్మరి పౌరోహిత్యం ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి.
రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. అలా నేర్చుకొన్న దళిత పూజారులను పెద్ద ఆలయాలో ఎందుకు నియమించటం లేదని మరో ప్రశ్న.
గుర్తుపెట్టుకోండి ...“ఇది మా దే – మీరు రావద్దు” అనే భావజాలాన్ని “ఇది అందరిదీ” గా మార్చడం కూడా మార్పే. దాన్ని పాటించటం పాటించకపోవడం మన ఇష్టం. తలుపు తెరవటమే విజయం. అంతవరకే.

Sunday, March 29, 2026

71. వృద్ధ స్త్రీలు - Old women by సచ్చిదానందన్



ప్రముఖ కవి శ్రీ కె. సచ్చిదానందన్ నూరు కవితలను అనువదించి నాలుగేళ్ళు కావొస్తుంది. దానికి వారు బ్లర్బ్ కూడా ఇచ్చారు. పుస్తకంగా తీసుకురావటం ఎందుకో కార్యరూపం దాల్చటం లేదు. ఈ ఏడు నా సొంత కవిత్వం తెచ్చే పనిలో ఉన్నాను. కనీసం వచ్చేఏడాది తప్పక తేవాలి .... నాకు నచ్చిన ఒక గొప్పకవిత దానిలోంచి....

.
71. వృద్ధ స్త్రీలు - Old women by సచ్చిదానందన్
 
వయసుడిగిన స్త్రీలు మంత్ర దండం చేతబూని
గాల్లో ఎగురుకుంటూ తిరగరు
అడవిలో ఉంటూ అర్ధంకాని శకునాలను చెప్పరు
 
ప్రశాంతమైన సాయం సమయాలలో
ఖాళీ పార్కు బెంచీపై కూర్చొని
పావురాలను పేర్లతో పిలుస్తూ గింజలు
విసురుతూ వాటిని ముద్దుచేస్తుంటారు,
ప్రభుత్వ ఆస్పత్రుల పొడవైన క్యూలలో
అలల్లా కంపిస్తూ నిలుచుని ఉంటారు లేదా
పోస్ట్ ఆఫీసులలో ఎన్నడో
పరదేశంలో మరణించిన
కొడుకు నుంచి ఉత్తరం కొరకు
వట్టిపోయిన మబ్బులా ఎదురుచూస్తుంటారు

వీధులు సంచరించేటపుడు
వాన తుంపరలా గొణుక్కుంటూ.
ఆకాశంలోకి విసిరినది ఏదో
ఇంకా క్రిందకి తిరిగిరానట్లు రెప్పవేయక
అలా పైకి చూస్తూనే ఉంటారు
షాపు అరుగులపై కలలు లేని నిద్రలో
డిసంబరు రాత్రుల్లా వారు వణికిపోతుంటారు

సగం మూసుకుపోయిన వారి కళ్ళల్లో
ఇంకా ఊయలలున్నాయి.
అలసిపోతున్న వారి జ్ఞాపకాలలో
ఇంకా కలువలు, క్రిస్టమస్ లు ఉన్నాయి.
వారి చర్మంపై ఒక్కో ముడతకూ
ఒక్కో జానపదకథ ఉంది.
వారి జారిపోయిన రొమ్ములలో
ఎవరికీ అక్కరలేదు కానీ
ఇంకా మూడు తరాలకు సరిపడా పాలున్నాయి

అన్ని ఉదయాలు వారిని చీకట్లో వదిలివేసాయి
వారికి చావంటే భయం లేదు
వారేనాడో మరణించారు.

వృద్ధ స్త్రీలు ఒకప్పుడు మహాద్వీపాలు
వారిలో దట్టమైన అరణ్యాలు, సరస్సులు, పర్వతాలు
అగ్నిపర్వతాలు ఇంకా కల్లోల అగాథాలు ఉండేవి
భూమి చల్లారకమునుపు అగ్నిగోళంగాఉన్నపుడు
వారు కరిగిపోయారు, కుచించుకుపోయారు
ఉత్త మేప్ లు గా మిగిలిపోయారు

వారిని నువ్వు ఇపుడు మడతపెట్టవచ్చు
జేబులో పెట్టుకోవచ్చు:
ఎవరికి తెలుసు, నీ ఇంటికి వెళ్ళే దారి చూపటంలో
వారు నీకు సహాయపడొచ్చు

Old women -2007 by Satchidanandan K.

అనువాదం: బొల్లోజు బాబా








Thursday, March 26, 2026

“బ్రాహ్మణ నింద- ఒక వర్గ రక్షణ సిద్ధాంతం

“జగత్తు దేవుని ఆధీనంలో ఉంటే దేవుడు మంత్రం ఆధీనంలో ఉన్నాడని ఆ మంత్రం బ్రాహ్మణుని ఆధీనంలో ఉందని, కాబట్టి బ్రాహ్మణుడు దేవునితో సమానం” అని శాస్త్రాలలో రాసుకొని తమకు తాము దేవునితో సమాన స్థానంలో పెట్టుకొన్నారు పండితులు. (నీతిశాస్త్రము, మంగు వెంకటరంగనాధ రావు, 1913 ముద్రణ, పేజి నంబరు 13)

మనుషులను ఎక్కువతక్కువలుగా విభజించి, ఆ విభజనను దైవనిర్ణయంగా చెప్పారు. నిచ్చెనమెట్ల వ్యవస్థలో కింద ఉన్నవారిని, ‘ఈరోజు తమ దుస్తితికి తమ పూర్వజన్మకర్మలే కారణమని, ఈ జన్మలో తిరగబడితే వచ్చేజన్మలో మరింత హీనజన్మ పొందవలసి ఉంటుందని’ నమ్మించటంలోనే మనువాదం విజయం ఉంది. మూడు శాతం ఉన్న వర్గం 97% ప్రజలను తమకు లోబడి ఉండేలా చేసుకోవటంలోని కిటుకు ఇదే. తమంతటతామే బానిసత్వాన్ని అంగీకరించటం కల్చరల్ హెగిమొనీ.
***

విభజించి పాలించారని బ్రిటిష్ వారిని నిందిస్తారు కానీ ఆపని చేసింది మనువాదులు. ప్రజల్ని వర్ణాలుగా విభజించి వారిపై పెత్తనాన్ని సాధించారు

బోధన, అధ్యయనం, యజ్ఞాలు నిర్వహించటం, దానధర్మాలు పొందటం బ్రాహ్మణులు చేయవలసిన పనులు. ఈ పనులను ఇతర వర్ణాలవారు చేయరాదు. క్షత్రియులు పాలన, వైశ్యులు వ్యాపారము, శూద్రులు పై ముగ్గురికి సేవలు చేయుట వారి వారి కర్మలు. వైశ్య, శూద్రులు తమ వర్ణ ధర్మములు తప్పితే లోకం అలజడి పాలవుతుంది కనుక వారు ధర్మములను పాటించే విధంగా రాజు జాగ్రత్తలు తీసుకోవలెను. (మను :8418).

ఈ సృష్టిలో సమస్తం బ్రాహ్మణుని సొత్తే. తన ఉత్తమమైన జన్మ వలన బ్రాహ్మణుడు అన్నింటికీ తీసుకోవటానికి అర్హుడే (మను: 1:100)

ధర్మశాస్త్రాలు ద్విజేతరులకు ఒక గౌరవప్రద జీవనాన్ని నిరాకరించాయి. దీన్నే division of labourers అంటారు డా. బాబాసాహెబ్ అంబేడ్కర్.

చాతుర్వర్ణవ్యవస్థలో పై న కూర్చుని 97% ప్రజలను విభజించి తమకింద తొక్కిపెట్టి ఉంచటంలోని ప్రమాదం మనువాదులకు తెలుసు. తమను తాము ఉన్నత స్థానంలో పెట్టుకొన్నందుకు వారిలో వారికే అభద్రతాభావం నెలకొని ఉంటుంది. ఏ మూలనించైనా ఎవరైనా అసూయతో దాడిచేయొచ్చన్న భయం సహజం. కనుక వారే రాసుకొన్న ధర్మశాస్త్రాలలో తమను తాము రక్షించుకోవటం కొరకు అనేక మినహాయింపులను, ప్రొటెక్షన్స్ కల్పించుకొన్నారు పండితులు.

1. బ్రాహ్మణ నింద మహాపాపం

బ్రాహ్మణులను నిందించటం దైవదోషమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని శాస్త్రాలలో రాసుకొన్నారు.

బ్రాహ్మణుడి కంటనీరు తెప్పించిన వానికి కుల బహిష్కరణ శిక్ష విధించాలి (మను. 11.68).

బ్రాహ్మణుడు ఎంతనీచుడైనప్పటికీ వాని యెడల సకల గౌరవమర్యాదలు చూపాలి (మను: 9.319).

బ్రాహ్మణుడిని పేరుని హేళనగా పలికితే శూద్రుని నోట్లో కాల్చిన మేకు దూర్చాలి. (మను 8.272).

ఒక శూద్రుడు బ్రాహ్మణున్ని అవమానిస్తే ఆ శూద్రుని నాలుక కోసివేయాలి. (మను: 8.270).

ఒక చండాలుడు ఉద్దేశపూర్వకంగా తన స్పర్శ ద్వారా ద్విజకులాలను తాకి మైలపరిస్తే వానికి మరణదండన విధించాలి. (విష్ణుస్మృతి: 5.104).

తమ శాస్త్రాలను, తమ ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే విధించాల్సిన అతి క్రూరమైన శిక్షలు కూడా వివిధ చట్టాల రూపంలో చేసారు. ప్రాచీన భారతదేశంలో ఒక వర్గం సాటి మనుషులపై సాగించిన అమానవీయ సామాజిక నియంత్రణ ఇది.

పైన చెప్పిన లౌకిక శిక్షలే కాక, బ్రాహ్మణనింద మహాపాపమని, ఎవరైనా బ్రాహ్మణనింద చేసినట్లయితే వారు మరణించాక చేసే అపరకర్మలు ఫలించవని, దానివల్ల ప్రేతత్వం పోదని అంటూ పారలౌకిక పరంగా కూడా భయపెట్టారు. ఈ అంశంపై చార్వాకులు- స్వర్గంలేదు, మోక్షం లేదు, ఆత్మాలేదు ఇవన్నీ బ్రాహ్మణులు బ్రతుకు తెరువుకోసం ఏర్పరచుకొన్న కల్పనలు మాత్రమే అని రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితమే కుండబద్దలు కొట్టారు.

2. బ్రహ్మహత్యాపాతకం

బ్రహ్మహత్యను పంచమహాపాతకములలో ఒకటిగా చేర్చారు. బ్రాహ్మణహత్య మహాపాపమని శాసనాధారాలు 4 వ శతాబ్దంనుంచీ లభిస్తాయి.

ధర్మశాస్త్రాలు వ్యక్తి స్వేచ్ఛకంటే సమాజశ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. సమాజ క్షేమం కొరకు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని త్యాగం చేయడం అత్యున్నత ధర్మంగా చెప్పబడింది. ‘నేను’ అనే భావనకంటే ‘మనం’ అనేభావన బలంగా ఉండేది. అవే ధర్మశాస్త్రాలు ఈ మొత్తం వ్యవహారం నుంచి బ్రాహ్మణుని మినహాయించాయి. ఇదొక వైరుధ్యం.

బ్రాహ్మణహత్య చేయడం అత్యంత హేయమైన పాపం కనుక రాజు ఎట్టిపరిస్థితులలో బ్రాహ్మణునికి మరణదండన విధించరాదు. బ్రాహ్మణునికి గుండుకొట్టించటమే మరణ శిక్షతో సమానం (మను 8- 379, 381).

బ్రహ్మహత్య చేసిన శూద్ర అతిశూద్రులకు మరణదండన విధించవచ్చు. (మను. 9- 236, 240). బ్రహ్మహత్య చేసిన ఇతర ద్విజవర్ణాలైతే - 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, అశ్వమేధయాగం చేయాలి, అగ్నిలోకి మూడు సార్లు దూకాలి అంటూ రకరకాల ప్రాయశ్చిత్తాలను సూచించింది మనుధర్మశాస్త్రం. (మను 11.73-75)

***
బ్రాహ్మణహత్య మహాపాతకం అనటానికి వారు చెప్పుకొన్న ఒకే ఒక కారణం- జ్ఞానం. అప్పుట్లో జ్ఞానం అనేది మౌఖికంగా మాత్రమే ఒకతరం నుంచి మరొక తరానికి భట్వాడా జరిగేది. దానికి వాహకులు బ్రాహ్మణవర్ణం. భారతదేశంలో లిఖిత సాంప్రదాయం అశోకుని శాసనాలతో మొదలయ్యింది. ఒక పండితుడైన బ్రాహ్మణుని చంపటం కొన్ని గ్రంథాలను తగలపెట్టడంతో సమానం కనుక వారిని చంపడాన్ని నిషేదించారని చెబుతారు. కానీ ఇక్కడే వస్తుంది అసలైన ప్రశ్న… జ్ఞానాన్ని వారివద్దమాత్రమే ఎందుకు దాచుకోవలసి వచ్చింది, అది సమాజంలోని అందరికీ ఎందుకు పంచలేదు, ఇతరులకు ఎందుకు నిషేదించారు? ఆ జ్ఞానాన్ని విన్నా చదివినా శిక్షలు ఎందుకు విధించారూ? అని. దానికి సమాధానం ఆధిపత్యం కొరకే అనేది సుస్పష్టం. లేఖనం రెండువేల సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ, వేదాలను పదిహేనో శతాబ్దం వరకు మౌఖికంగా కాపాడుకొంటూ వచ్చారు తప్ప లిఖితరూపంలోకి మార్చలేదు. కారణం బహుశా జ్ఞాన రక్షణ పేరుతో జాతిరక్షణ కొరకు కావొచ్చు.

***
ఇక పురాణాలలో బ్రహ్మహత్య చేసిన దేవుళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో అనేక కథనాలు కనిపిస్తాయి.

బ్రాహ్మణుడైన వృత్రాసురుడిని చంపినందుకు ఇంద్రుడిని బ్రహ్మహత్య పాపం వెంటాడింది. ఆ పాతకాన్ని భూమి, నీరు, చెట్లు, ఋతుమతి అయిన స్త్రీలకు పంచి విముక్తి పొందాడు.

రావణుడు బ్రాహ్మణుడు కావడంతో రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దీని నివారణ కొరకు అశ్వమేధ యాగం, రామేశ్వర లింగ ప్రతిష్ఠ చేసాడు. అలాగే శంబుక వధ ఉదంతంలో రాజ్యంలో ఎక్కడో జరిగిన బ్రాహ్మణ బాలుడి మరణానికి శ్రీరాముడినే బాధ్యుడిని చేయడం ఇదే కోవకు చెందుతుంది.

బ్రహ్మ ఐదో తలను నరికినందుకు శివుడికి బ్రహ్మహత్య పాపం తగిలి, ఆ బ్రహ్మదేవుని కపాలం చేతికి అంటుకుపోయింది. దేశాటన చేసి చివరకు కాశీలో ఆ బ్రహ్మ కపాలం చేతినుండి విడివడటంతో ఆ పాపం నుండి శివుడు విముక్తుడయ్యాడు.

ఇంద్రపదవి పొందిన నహుషుడు, బ్రాహ్మణులైన సప్తర్షులతో తన పల్లకిని మోయించినందుకు, అగస్త్యుడిని అవమానించినందుకు కొండచిలువగా మారమని శపించబడ్డాడు.

ఈ కథలన్నీ ఒకే సందేశాన్ని ఇస్తాయి: 'బ్రాహ్మణుడు' అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని, వారిపై చేసే హింస లేదా నింద పరలోక భయాలకు, సామాజిక వెలివేతలకు, శిక్షలకు దారితీస్తుందని హెచ్చరించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థను రక్షించుకోవడానికి ‘బ్రాహ్మణ నింద’ 'బ్రహ్మహత్యా పాతకం' అనే ఒక బలమైన నైతిక, లౌకిక పారలౌకిక ఆయుధాల్ని సృష్టించారు పండితులు.

ఇంద్రుడు, రాముడు, శివుడు వంటి సాక్షాత్తు దేవుళ్ళే ఈ పాపం నుండి తప్పించుకోలేక పోయారనే కథల ద్వారా... సామాన్యులలో ఒక రకమైన మానసిక దాస్యాన్ని, భీతిని కల్పించారు. చట్టం కంటే మతపరమైన భయం ద్వారా సమాజాన్ని నియంత్రించే పద్ధతి ఇది. ఈ గాథలు నేర్పేది భక్తి కాదని, ఒక వర్గపు ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగా గుర్తించడమే నేటి అవసరం.

3. ముగింపు

మొన్న ఉగాదిపూట పంచాంగం చెప్పిన ఒక పెద్దమనిషి, బ్రాహ్మణులని నిందించినవారికి “హింస తప్పదు కాక …. తప్పదు” అని గుడ్లురుముతూ శాపనార్ధాలు పెట్టాడు. ఇది ప్రజాస్వామ్యయుగం అని, రాజ్యాంగం ప్రకారం ప్రజలందరూ సమానమేనని, ఎక్కువతక్కువ అంతస్తులు ఇప్పుడు లేవనే ఎరుకలేకుండా సభలో బహిరంగంగా అలా మాట్లాడటం ఎంత బరితెగింపు! "హింస తప్పదు" అంటే ఏమిటి అర్థం?

చరిత్రలో బ్రాహ్మణ నింద అనే పదం ఉంది తప్ప – ‘మాల నింద’, ‘శూద్రనింద’, ‘కంసాలి నింద’ లాంటి పదాలు ఎందుకు లేవూ? వాళ్ళని నిందించవచ్చు. వాళ్ళు వీరిలాంటి మనుషులు కారు అనే కదా అర్థం?

ఈ ప్రజాస్వామ్య యుగంలో కూడా ఇంకా బ్రాహ్మణనింద లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే రాజ్యాంగం పట్ల, సమానహక్కులపట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్ధం! ఇంకా మనువాద రాజ్యాంగమే నడుస్తుందనే తెంపరితనం ఇది. ఆధునిక సమాజాన్ని మళ్ళీ చీకటి రోజుల్లోకి, వర్ణ వివక్షతో కూడిన అమానుష వ్యవస్థలోకి తిరిగి వెనక్కు తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు. రాజ్యాంగం పట్ల అనవగాహన.

ప్రజాస్వామ్యంలో ఏ వర్గమూ విమర్శకు అతీతం కాదు; సమాజంలో సమానత్వం, న్యాయం నిలబెట్టాలంటే అన్ని నిర్మాణాలు, విశ్వాసాలు ప్రశ్నించబడగలగాలి. ఒక వర్గాన్ని ప్రత్యేకంగా రక్షిస్తూ, దానిపై సంధించిన ప్రశ్నలను “నింద” గా నిర్వచించడం వల్ల అసమాన సంబంధాలు కొనసాగుతాయి. ఇది రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కుల సారాన్ని దెబ్బతీస్తుంది.

మానవహక్కులు పరిఢవిల్లిన ఇరవయ్యొకటవ శతాబ్దంలో “హింస తప్పదు, హింస తప్పదు” అని మైకులో హెచ్చరిస్తున్నారంటే- దమననీతి రాజ్యం ఏలిన ఒకప్పటి కాలంలో, ఆజీవికులు, బౌద్ధులు, జైనులు. చార్వాకులు, శైవులు, భక్తి కవులు లాంటి మనువాద ధిక్కారులను ఈ మనువాదులు ఏ మేరకు నిర్మూలించి ఉంటారో ఇట్టే అర్థంచేసుకోవచ్చు.

బొల్లోజు బాబా

(ఈ వ్యాసం చారిత్రక గ్రంథాలపై విమర్శాత్మక విశ్లేషణ మాత్రమే; ఏ వ్యక్తి లేదా వర్గాన్ని అవమానించడం ఉద్దేశం కాదు. ఈ వ్యాసంలోని మనుస్మృతి వాక్యాలు, ఇతర ధర్మశాస్త్రాల ఉటంకింపులు “మనుస్మృతి, తాత్పర్య రచన డా. నల్లందిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, తితిదే ప్రచురణ, డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలు ప్రసంగాలు సంపుటం 5, Manu's Code Of Law, Patrick Olivelle నుండి తీసుకోబడినవి)



Sunday, March 22, 2026

మొఘల్ చక్రవర్తులకు జన్మనిచ్చిన హిందూ స్త్రీలు

భారతదేశం చారిత్రికంగా భిన్న మత విశ్వాసాల సమ్మేళనం. అనేక సముదాయాలు వివిధ సంస్కృతులతో కలిసిమెలిసి జీవించాయి. మనుషుల మధ్య బంధుత్వాలకు మతాలు అడ్డురాలేదు. చరిత్రలో హిందూ ముస్లిమ్ ల మధ్య అనేక వివాహాలు జరిగాయి. ఇవి భిన్న సంస్కృతుల సమ్మేళనానికి దారితీసాయి. చాలామంది మొఘల్ చక్రవర్తులు హిందూ స్త్రీలకు పుట్టారు. వారి ఆస్థాన చరిత్రకారులు ఈ విషయాన్ని ఎక్కడా దాచిపెట్టలేదు. స్పష్టంగానే రాసుకొన్నారు. వీటిని ఉత్త రాజకీయ తంత్రంగా భావించలేం. ఒక ముస్లిం రాజు హిందూ స్త్రీని పెండ్లాడి ఆమెను జనానాలో ఒకానొక దేహంగా మార్చకపోవటం; ఆమెద్వారా కలిగిన పుత్రుడు సింహాసనం అధిష్టించటం అనేవి ఉత్త రాజకీయ వ్యూహాలుగా పరిగణించలేం. రాజనీతిని మించిన మానవీయకోణాన్ని, సౌహార్దతను ఊహించాలి. భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన హిందు ముస్లిమ్ వివాహాలు కొన్ని ఇవి…….
****
1. హర్కబాయి (1542-1623) - అక్బర్ Maryam-Uz-Zamani

జైపూర్ రాజైన భర్మల్ 1562 లో తనకూతురు హర్కబాయిని అక్బరుకి ఇచ్చి వివాహం చేసాడు. ఈమె అక్బరుకు ఎంతో ఇష్టమైన రాణి అయింది. హర్కబాయి అపురూప సౌందర్యం, అద్భుతమైన మేధాశక్తి, గొప్ప దయ కలిగిన స్త్రీ. అక్బర్ చూపించిన మతసహనం, లౌకికత వెనుక ఈమె హస్తం ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఈమె కోరికపై అక్బరు గోమాంసాన్ని తినటం మానివేసాడు. ఈమె ద్వారా వైదిక క్రతువులు, బ్రాహ్మణులు, సూర్యనమస్కారాలు, శాఖాహారం, పూజలు లాంటివి ముఘల్ అంతఃపురంలోకి పవేశించాయి. హిందూస్త్రీలు సంస్థానంలో హారతి ఇస్తే స్వీకరించాలని అందరినీ ఆదేశించాడు అక్బరు. హర్కబాయి అక్బరులకు 1569లో కుమారుడు కలిగాడు. ఇతనే మొఘల్ చక్రవర్తి జహంగీరు. హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మొదటి చక్రవర్తి జహంగీరు.
ముఘల్ సంస్థానంలో హర్కబాయి నాలుగుదశాబ్దాల సుదీర్ఘకాలంపాటు పట్టపురాణిగా ఆ పిదప రాజమాతగా ఎంతో గౌరవాన్ని పొందింది. ఈమె పేరుమీద ఒక ఓడ ఉండేది. ఈమె అనేక నౌకా వ్యాపారాలు చేసేది. వ్యాపారాభివృద్ధినిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేది. ఈమె ఓడ పేరు రహిమి (Rahimi.) 12000 మంది సైనికులను కలిగి ఉన్న నలుగురు మొఘలు సంపన్న వ్యక్తులలో ఈమె ఒకరు. స్త్రీలలో ఒకే ఒకరు. ఇదీ ఈమె హోదా.
జహంగీర్ తనతల్లి హర్కబాయిని ఎంతో గౌరవంగా Her Majesty అని సంబోధించేవాడు. పాదాలకు నమస్కరించిన పిదప మాట్లాడేవాడు.
1605 లో అక్బర్ చనిపోయేనాటికి హర్కబాయి ముఘల్ స్త్రీలలో అత్యంత సంపన్నురాలు . ఈమె తన 81 వ ఏట 1623 లో మరణించింది. హర్కబాయి గౌరవార్ధం అక్బరు సమాధిపక్కనే ఆగ్రాలో ఈమె సమాధికూడా నిర్మించారు.
.
2. మన్ బాయి (1570-1605)- జహంగీర్
.
జహంగీర్ తల్లి హర్కబాయి సోదరుని పేరు రాజ భగ్వంత్ దాస్. ఇతను జైపూర్/ అంబర్ ను పాలించిన 23 వ రాజు. ఇతని కూతురు పేరు మన్ భవతి బాయి (Man Bai). జహంగీరు, మన్ బాయిలు బావమరదళ్ళు అవుతారు. మన్ బాయి గొప్ప సౌందర్యరాశి, సౌశీల్యవతి. మేనత్త హర్కబాయిలా తెలివైనది. ఆమెను జహంగీరుకు ఇచ్చి వివాహం చేయాలని హర్కబాయి ప్రతిపాదించగా, వంశప్రతిష్టలు కలిగిన కుటుంబానికి చెందిన అమ్మాయి కనుక అక్బరు మన్ బాయిని కోడలుగా చేసుకోవటానికి వెంటనే అంగీకరించాడు. మన్ బాయి, జహంగీరుల వివాహం 1585 లో అంగరంగవైభవంగా జరిగింది. వీరిద్దరికి 1587 ఖుస్రో మిర్జా అనే కొమారుడు కలిగాక మన్ బాయికి పట్టమహిషి (Shah Begum) హోదా లభించింది.
మన్ బాయి సోదరుని పేరు మాధవ సింగ్. ఇతనితో తన కొడుకు ఖుస్రో మిర్జా కలిసి భర్త జహంగీరుపై వ్యతిరేకంగా కుట్రలు పన్నటం మన్ బాయిని తీవ్రమైన మనస్తాపానికి గురిచేసేది . కొడుకుకు భర్తకు నచ్చచెప్పలేక మన్ బాయి తీవ్రఒత్తిడికి గురయి 1605 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మన్ బాయి, జహంగీర్ల దాంపత్యం ఎంతో అన్యోన్యమైనది. భార్య చనిపోయిందని తెలిసిన జహంగీరు నాలుగురోజులపాటు భోజనం చేయలేదు.

జహంగీరు భార్యావియోగంతో విరాగిగామారాడని తెలిసిన అక్బరు ఆ సమయంలో తను ధరించిన తలపాగ, శాలువాలను పంపించి ఓదార్చే ప్రయత్నం చేసాడు. కొడుకుపట్ల పిచ్చిప్రేమకు, భర్త పట్ల అనురాగానికి మధ్య నలిగిపోయి ఆత్మహత్య చేసుకొన్న కోడలి పట్ల ఎంతో కలత చెందాడు అక్బరు.
జహంగీరు, అలహాబాదు, Khusrau Bagh ఆవరణలో మన్ బాయి జ్ఞాపకార్థం అందమైన సమాధిని నిర్మింపచేసాడు.
.
3. జగత్ గోసాయిన్ (1573 – 1619) – జహంగీర్
.
ఈమెకే మనవతి బాయి, జోధ్ బాయి (జోదా అక్బరు జంట కాదు) అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈమె మార్వార్ (ప్రస్తుత జోధ్ పూర్) రాకుమార్తె. రాజ్ పుత్ రాజా ఉదయ్ సింగ్ కూతురు. ఈమె తాతగారైన Maldev Rathore నాయకత్వంలో మార్వార్ బలమైన రాజపుత్రుల రాజ్యంగా ఏర్పడింది.
యువరాజుగా ఉన్న జహంగీరు ఒకనాడు ఒక రాజకుటుంబ వేడుకలో అపురూపలావణ్యవతి అయిన జగత్ గోసాయిన్ ని చూసి ప్రేమించాడు. ఆమెను పెండ్లాడాలనే కోర్కెను వెలిబుచ్చాడు. ఈ పెళ్ళి ప్రతిపాదనను అక్బరు అంగీకరించలేదు. అక్బరు తల్లి హమీదాబాను అందరిని ఒప్పించింది. అలా జహంగీరుకు జగత్ గోసాయిన్ కి 1586లో వివాహమైంది. ఈ వివాహం మార్వార్ రాజు సంస్థానంలో పండితుల వేదమంత్రాలతో ముస్లిమ్ కట్టుబాట్ల మధ్య జరిగింది.

అందం, ఆకర్షణీయ సంభాషణ, చమత్కారం, సమయస్పూర్తి, ధైర్యసాహసాలతో జగత్ గోసాయిని తక్కువ కాలంలోనే జహంగీరుకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారింది. జగత్ సంగీతంలో గొప్ప ప్రావీణ్యం కలిగిన గాయని. ఈమె 1592 లో జహంగీరుకు ఒక మగబిడ్డను ఇచ్చింది. అతనే మొఘల్ చక్రవర్తి షాజహాన్. హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన రెండవవ్యక్తి ఇతను. ఈ బిడ్డ జాతకం ప్రకారం మహర్జాతకుడని పండితులు చెప్పటంతో తాత అయిన అక్బర్ చక్రవర్తి ఈ బిడ్డకు “కుర్రం” (సంతోషకరమైన) అని నామకరణం చేసి తనవద్దే ఉంచుకొని పెంచి పెద్దచేసాడు.

1605 లో అక్బర్ మరణించాక కుర్రం తండ్రి వద్దకు వచ్చేసాడు. 1611 లో నూర్జహాన్ ను వివాహం చేసుకొన్నాకా ఆమె ఆకర్షణలోపడి జహంగీర్ జగత్ గోసాయిన్ పట్ల ఆదరణ తగ్గించేసాడు. 1619 లో జగత్ గోసాయిన్ అనారోగ్యకారణాలతో మరణించింది. ఈమె మరణానంతరం జహంగీర్ అన్ని రాజపత్రాలలో ఈమె పేరును Bilqis Makani (the Lady of Pure Abode) గా ప్రస్తావించమని ఆదేశించాడు. 1628 లో జగత్ గోసాయిన్ కుమారుడు షాజహాన్ ముఘల్ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించే నాటికి ఈమె జీవించి లేదు.
.
4. నవాబ్ బాయి
.
కాశ్మీరుకు చెందిన రాజపుత్ రాజౌరి రాకుమార్తెను ఔరంగజేబు 1638 లో పెళ్ళిచేసుకొన్నాడు. ఈమె పేరు నవాబ్ బాయి. వీరిద్దరికి 1643 లో బహదూర్ షా I జన్మించాడు. ఇతను ఔరంగజేబు మరణానంతరం ముఘల్ చక్రవర్తి అయి 1707 నుండి 1712 వరకూ పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన మూడవ వ్యక్తి. 1662 లో ఔరంగజేబు తీవ్రంగా అస్వస్థుడవగా, అతని చెల్లెలు రోషనార రాజ్యాధికారాన్ని చేతిలోకి తీసుకొని పరిపాలించసాగింది. ఈ చర్యను నవాబ్ బాయి ప్రతిఘటించింది. ఈమె కుమారులు తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు. ఈ కారణాలతో నవాబ్ బాయి అంతఃపురంలో క్రమేపీ గౌరవాన్ని కోల్పోయి ఔరంగజేబు ప్రేమకు దూరమైంది.

కొడుకులను భర్త ఖైదు చేయించాడని తెలిసి ఎంతో మానసిక క్షోభకు గురవగా, ఔరంగజేబు స్వయంగా వచ్చి నవాబ్ బాయిని ఓదార్చాడు. ఒక బాధ్యతకలిగిన తండ్రిగా, పాలకుడిగా ఏ పరిస్థితులలో సొంతకొడుకులను ఖైదుచేయించవలసిందో ఆమెకు వివరించాడు. 1691లో నవాబ్ బాయి చనిపోయింది. ఆమె గౌరవార్థం రాజ్యంలో ఒక వారంపాటు సంతాపదినాలు ప్రకటించాడు ఔరంగజేబు
.
5. ఉద్దమ్ బాయి/కుడ్సియాబేగం
.
ఉద్దమ్ బాయి హిందూ కుటుంబానికి చెందిన ఒక సామాన్య నర్తకి. రాజాస్థానంలో చేరింది. ఈమె తన సౌందర్యం, వాక్చాతుర్యం వల్ల ముఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా (r. 1719–1748) ప్రేమను చూరగొంది. మహమ్మద్ షాకు ఉద్దమ్ బాయి పట్ల మక్కువ పెరిగి రాణి హోదాను ఇచ్చాడు. వీరిద్దరికి పుట్టిన అహ్మద్ షా బహదూర్ 1748 - 1754 మధ్య ముఘల్ చక్రవర్తిగా రాజ్యమేలాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన నాల్గవ వ్యక్తి.
కొడుకు శక్తిహీనుడు, దక్షతలేనివాడు కావటంచే ఉద్దం బాయి అనధికారికంగా రాజ్యపగ్గాలు చేపట్టింది. పరిపాలకురాలిగా ఎదిగి, ప్రభుత్వ వ్యవస్థను చేతుల్లోకి తీసుకొంది. ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. డిల్లీలో గోల్డెన్ మాస్క్, కుడ్సియా బాగ్ లాంటి గొప్పనిర్మాణాలు చేపట్టింది.

పురుషుల ప్రపంచంలో ధైర్యం, తెలివితేటలు, సమర్ధత కలిగిన గొప్ప మహిళగా; ఒక నాట్యకారిణినుండి ఒక సామ్రాజ్ఞిగా ఎదిగిన ధీశాలిగా ఉద్దమ్ బాయి చరిత్రలో నిలిచిపోయింది.
.
6. అనూప్ బాయి 1699- ??
.
తొమ్మిదవ మొఘల్ చక్రవర్తి జహందర్ షా మూడవ భార్య అనూప్ బాయి. ఈమె రాజపుత్రుల యువరాణి. ఈమె Muazzamabadi అనే బిరుదును కలిగి ఉండేది. దాని అర్థం గౌరవనీయురాలైన అని. ఈమె కుమారుడు అలంగీర్ II. ఇతను 1754 – 1759 మధ్య ముఘల్ చక్రవర్తిగా పరిపాలించాడు. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన ఐదవ వ్యక్తి. ముఘల్ రికార్డులలో 1756-1761 మధ్య ప్రభావితం చూపిన తొమ్మిది మంది మొఘల్ స్త్రీలజాబితాలో Muazzamabadi పేరు ఏడవ సంఖ్యలో ఉంది .

ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అబ్దాలి రాజు, 30 జనవరి, 1757 న ఢిల్లీ వచ్చినపుడు, అలంగీర్ II చక్రవర్తి తల్లి హోదాలో అనూప్ బాయి 121 బంగారు నాణాలు, బాదంతో చేసిన పాయసం (లవజత్) ను అతనికి పంపించింది . ఆ సమయం మొఘల్ సామ్రాజ్యం అంతర్గత కలహాలతో సంక్షోభంలో ఉంది. బహుసా అబ్దాలి వంటి రాజుల సహకారం పొందటం కొరకు అనూప్ బాయి ఆ కానుకలను పంపిఉండవచ్చు. ఇదొక దౌత్యపరమైన కూటనీతి. ఈ ఉదంతాన్ని బట్టి అనూప్ బాయి తెరవెనుక పోషించినపాత్ర కొంతమేరకు అర్ధమౌతుంది. ఇంతకు మించి ఈమె గురించిన చారిత్రిక వివరాలు పెద్దగా తెలియరావు. అనూప్ బాయి 1735 లోనే మరణించిందని మరొక కథనం కలదు.
.
7. బిలాల్ కన్వర్ / జినత్ మహల్
.
బిలాల్ కన్వర్ అలంగీర్ II భార్య. ఈమె హిందూ స్త్రీ. బిలాల్ కన్వర్ 1728 లో షా ఆలమ్ II కు జన్మనిచ్చింది . ఇతను 1760 – 1806 మధ్య ముఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. షా ఆలమ్ II హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఆరవ వ్యక్తి. ఇంతకు మించి బిలాల్ కన్వర్ గురించిన సమాచారం పెద్దగా లభించదు.
.
8. లాల్ బాయి
.
బహదూర్ షా II చివరి మొఘల్ చక్రవర్తి. ఇతని తల్లి పేరు లాల్ బాయి. ఈమె హిందూ స్త్రీ. 1775 లో లాల్ బాయి బహదూర్ షా II జన్మనిచ్చింది. ఇతను హిందూ స్త్రీకి జన్మించి మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన ఏడవ వ్యక్తి.

బహదూర్ షా II బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన మొదటి స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించాడు. బ్రిటిష్ వారు ఇతనిని రంగూన్ తరలించి మరణించేవరకూ గృహనిర్భంధంలో ఉంచారు.
****
.
9. మరికొన్ని ప్రముఖ వివాహాలు
.
కమలాదేవి - అల్లావుద్దిన్ ఖిల్జి: కమలాదేవి గుజరాత్ లోని వఘేలా రాజ్ పుత్ కరణ్ దేవ్ II భార్య. ఈమె గొప్ప అందగత్తె. విదుషీమణి. అల్లావుద్దిన్ ఖిల్జీ 1298 లో గుజరాత్ ను ఓడించినపుడు ఈమెను ఢిల్లీసంస్థానానికి తీసుకువెళ్ళి పెళ్ళిచేసుకొన్నాడు. ఇది చరిత్రలో నమోదైన హిందూ-ముస్లిమ్ ల మధ్య జరిగిన మొదటి వివాహం. అప్పటికి ఈమెకు దేవలాదేవి అనే ఆరు నెలల కుమార్తె కలదు. ఆమె తండ్రి సంరక్షణలో ఉండి పెరిగి పెద్దదయింది. కమలాదేవి క్రమేపీ అల్లావుద్దిన్ ఖిల్జి విశ్వాసాన్ని చూరగొని, అతని రాజకీయ నిర్ణయాలలో సలహాలు ఇచ్చేస్థాయికి చేరుకొంది. కమలాదేవి చొరవతో ఆమె కూతురైన దేవలాదేవిని ఢిల్లీకి తెప్పించాడు అల్లావుద్దిన్ ఖిల్జి, దేవలాదేవిని అల్లావుద్దిన్ ఖిల్జి కొడుకు ఖిజ్ర ఖాన్ కు ఇచ్చి వివాహం జరిపించారు.

జహంగీరు చక్రవర్తి మరొక భార్య మలిక జహన్ హిందూ స్త్రీ. ఈమె జసల్మార్ కు చెందిన రావల్ భీమ్ కూతురు.

ఔరంగజేబ్ కొడుకైన బహదూర్ షా I, రాజా రూప్ సింగ్ కూతురును పెండ్లాడాడు.
1351 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఫిరోజ్ షా తల్లి పేరు నైలా. ఈమె భట్నేర్ హిందూ రాజ కుమార్తె .
 
విజయనగర రాజు దేవరాయ I తన కూతురుని 1407 బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కు ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్ళిచేసాడు.
 
ఖేర్లా రాజైన నరసింహరాయ్ 1417 లో తన కుతురును ఫిరోజ్ షాకు ఇచ్చి వివాహం జరిపించాడు. అపురూపసౌందర్యరాశి అయిన ఈమె ఆ తదుపరికాలంలో బహుమని సుల్తాను పట్టపురాణి హోదాను పొందింది.
 
వారణాసిలో ఇరవైముగ్గురు ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమించి హిందూమతంలోకి మారిపోయిన ఉదంతాన్ని మధ్య ఆసియా యాత్రికుడు అమిర్ అలి బాల్కి తన రాతలలో పేర్కొన్నాడు. ఇది ఆనాటి సామాన్యప్రజలలో ఉండిన మత స్వేచ్ఛను తెలియచేస్తుంది
****

అదే విధంగా మొఘల్ రాజస్త్రీలను హిందూ రాజులకు ముఖ్యంగా రాజపుత్రులకు ఇచ్చి పెండ్లిచేసిన ఉదంతాలుకూడా చరిత్రలో కనిపిస్తాయి. అక్బరుకుమార్తెకు- మేవాడ్ యువరాజు అమర్ సింగ్ కు; అక్బర్ మేనకోడలుకు రాజామాన్ సింగుకు; రూహాని బాయికు మహారాజా ఛత్రసాల్ కు; వజీర్ ఖాన్ కుమార్తె మహారాణా కుంభకు: ఒకముస్లిం సైన్యాద్యక్షుని కుమార్తెకు రాజపుత్ర రాణాసంగకు జరిగిన వివాహాలు ముస్లిం రాచస్త్రీలకు హిందూ యువరాజులకు మధ్య జరిగిన వివాహాలకు కొన్ని ఉదాహరణలుగా చెబుతారు.
.
10. ముగింపు
.
నేడు భిన్న విశ్వాసాల మధ్య వివాహాలను లవ్ జిహాద్ అని, బలవంతపు మతమార్పిడులు అని మాట్లాడటం శోచనీయం. అలాంటి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం. ఈ రోజు ముఘల్స్ అంటే రక్తపిపాసులుగా, మతం పేరుతో ప్రజల్ని ఊచకోత కోసిన రాక్షసులుగా చిత్రిస్తున్నారు. కల్పితాలతో కట్టుకథలతో ఒక అబద్దపు నెరేటివ్ ను సృష్టిస్తున్నారు. వారి పేరు ఎవరైనా ఎత్తితే తీవ్రమైన దుర్భాషలతో, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఊరూ పేరు, ఫొటో లేని సోషల్ మీడియా అనామకుల నుండి అత్యంత ఉన్నతమైన పదవులలో ఉన్నవారు వరకూ ఇదే ధోరణి. ఈ ద్వేషం బౌద్ధికంగా చాలా బలంగా ప్రజల మనసుల్లో నాటబడుతోంది. ఇక ఇలాంటి ద్వేషం భౌతికంగా ప్రతిఫలించటానికి ఎంతో దూరంలో లేము.

సాటి మనుషుల పట్ల ఎందుకింత ద్వేషమో అర్థం కాదు. ఈ ద్వేషం పునాదులపై ఏం నిర్మించాలని కోరుకొంటున్నారో ఊహకు అందదు. భిన్న అభిప్రాయాలు పరిఢవిల్లడం ప్రజాస్వామ్యం. మెజారిటేరియన్ భావజాలం మాత్రమే ఉండాలనుకోవటం ఫాసిజం. మానవజాతి పరిణామక్రమంలో మతం అనేది ఆదిమ అనాగరిక లక్షణమని, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం అనేవి నాగరిక లక్షణాలనీ ఎప్పటికి అర్ధం చేసుకొంటారూ?
ఎవరైతే ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారో వారే సమాజంలో ముస్లిముల పట్ల ఇంతటి ద్వేషానికి కారకులు అనటం సహజమైన అభియోగం. ఎవరు ముస్లిమ్ పాలనవల్ల నష్టపోయారు అని భిన్న సామాజిక వర్గాలను పరిశీలిస్తే---

రాజపుత్రులు, చోళులు, కాకతీయులు, పాండ్యులు, హొయసల రాజులు లాంటివారు సార్వభౌమత్వాన్ని కోల్పోయినా ముస్లిమ్ రాజులకు సామంతులుగా మారి అధికారాన్ని కోల్పోలేదు. అదే విధంగా స్థానిక జమిందార్లు/కౌలుదార్లకు వారి వారి హోదాలు పోలేదు చాలాచోట్ల. వ్యాపారులకు ముస్లిముల ద్వారా మధ్య ఆసియా వ్యాపారావకాశాలు పెరిగాయి. చేతివృత్తికారులకు ఆ వ్యాపారాల వల్ల పనులు పెరిగాయి.
 
ముస్లిమ్ పాలనలో వర్ణవ్యవస్థ కొంతమేర సడలటంతో దళిత బహుజనులు కొద్దిగా ఊపిరి పీల్చుకొన్నారు. అతిశూద్రులు కొంతమంది వివక్షనుంచి తప్పించుకోవటానికి ఇస్లాంలోకి మారారు. అధికజనాభా గ్రామాలలో నివసించేవారు. కేంద్రీయ ముస్లిం పాలనతో సంబంధంలేకుండా ఈ గ్రామీణ ప్రజలు స్వయంపోషణతో జీవించారు.
 
భక్తి ఉద్యమప్రభావంతో ముస్లిమ్ హిందూ ఐక్యత గ్రామాలలో బలపడింది. హోలి, దివాలి, సూఫీ, దర్గా, పీర్ల పండుగ లాంటి పండుగలలో హిందూముస్లిములమధ్య ఒకరకమైన సాంస్కృతిక సమ్మేళనం ఉండేది. దీనివల్ల కింది స్థాయి ప్రజలు ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉండేవారు.
ఇక సమాజంలో ఎవరు ముస్లిమ్ పాలన వల్ల నష్టపోయారు అంటే కొంతమేరకు పండితవర్గం కనిపిస్తుంది. వీరు జనాభాలో 5%. ఒక పండితుడు సభకు రాగా, ఏ మహారాజైనా లేచి వెళ్ళి అతనిని ఆహ్వానించి ఉచితాసనంపై కూచుండబెట్టి, పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవటం హిందూ ధర్మంలో భాగం. ముస్లిమ్ పాలనలో ఈ రకపు గౌరవాన్ని పండితులు కోల్పోయారు.

యజ్ఞయాగాదులు, Temple patronage తగ్గిపోయాయి. ఔరంగజేబు అయితే దర్బారులో కవులు, కళాకారులను నిషేదించాడు. అలా అంతవరకూ. ప్రభువు మెల్లకన్నుపై పద్యాలు చెప్పి మాన్యాలు పొందిన వైభోగం కోల్పోయారు పండితులు.
 
యజ్ఞయాగాదులు లేక శూద్రులు, అతిశూద్రులనుండి అతికష్టంగా కాపాడుకొన్న సంస్కృతం, వేదాలు పనికిరాకుండాపోయాయి.
 
ఈ వర్గం సమాజంలో శిష్టవర్గం. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన వర్గం. వీరికి జరిగిన నష్టం మొత్తం సమాజానికి జరిగిన నష్టంగాను, వీరి శత్రువులు యావత్ సమాజపు శత్రువులుగాను చేయబడ్డారు. దీన్నే గ్రామ్సీ "కల్చరల్ హెగిమొని" అని వ్యవహరించాడు – సమాజంలోని ప్రభావశీల వర్గం తన విలువలు, నమ్మకాలను మిగిలిన ప్రజలచే వారికి తెలియకుండానే ఆమోదింపచేయటం.
.
బొల్లోజు బాబా

Friday, March 20, 2026

కవితాంతరంగం @ ఖమ్మం

కవితాంతరంగం @ ఖమ్మం
రెండురోజుల పాటు సాగిన ఖమ్మం కవితాంతరంగం ప్రోగ్రామ్ లో నేను కూడా పాల్గొన్నాను. 70 మంది కవితలను వారిపేరులేకుండా ఇచ్చి విశ్లేషించమని అడగటం ఒక నూతన ప్రయోగం. గ్రూపులో ఫణిమాధవి కన్నోజు, వైష్ణవిశ్రీ, గరికపాటి మణిందర్, చిక్కొండ్ర రవి, తాండా హరీష్ గౌడ్, వనపట్ల సుబ్బయ్య ఉన్నారు.
నేను రాసిన "పౌరసత్వ పత్రాలు" కవితను దాదాపు అన్ని గ్రూపులు మెన్షన్ చేసాయి. అందరకూ ధన్యవాదములు. ఈ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు శ్రీ ప్రసేన్, శ్రీ సీతారామ్, శ్రీ రవి మారుతి లకు కృతజ్ఞతలు.
కవిత, కొన్నిఫొటోలు ఇవి.....
.
పౌరసత్వ పత్రాలు


నేను
హరప్పా వీధుల్లో
ఇటుకల మధ్య పుట్టిన జ్ఞాపకాన్ని
నిశ్శబ్దంగా నడిచిన కాలాన్ని.


వాయువ్యదిశ నుంచి వచ్చిన
వలసదారుల గుర్రాల మోతలో
సంస్కృత మంత్రాల హోరులో
నేను నా నాగరికతా పాటను కోల్పోయాను.

నా దేహంపై వర్ణాల గీతలు గీసారు
యజ్జాగ్ని వేడికి నా ఇళ్ళు కాలిపోయాయి
నా శ్రమకు బానిస సంకెళ్ళు వేసారు
నా స్వరానికి మౌనపు కచ్చడాలు బిగించారు

నేను హరప్పా వారసుడిని
ఈ దేశ మూలవాసిని
నా పౌరసత్వ పత్రాలు
ఫైళ్ళలో లేవు
నా DNA లో ఉన్నాయి
సింధునది ఒడ్డున పాతిపెట్టిన రక్తంలో ఉన్నాయి

వలసవచ్చిన వారికి ఏమున్నాయి?
పురాణాల అబద్దాలు
వర్ణవిభజన రాజకీయాలు తప్ప.
నా గోడలు ఇంకా మాట్లాడుతున్నాయి
నా మట్టి ఇంకా నిలబడి ఉంది
ఈ భూమి నాదే, ఎప్పటికీ నాదే.

బొల్లోజు బాబా


















ఒక మిత్రుడు "యుద్ధం" పై ప్రత్యేక సంచిక తెస్తున్నాం. వీలైతే ఒక కవితను పంపండి.... అని అడిగారు.
యుద్ధనేపథ్యంపై నేను అనువదించిన కవితలను ఒకసారి చదువుకొన్నాను. ఈ కవిత వద్ద ఆగిపోయాను. ఎంత గొప్ప కవిత. అనువదించి చాన్నాళ్లయింది. మళ్ళా చదివినపుడు ఆ అనుభవం మరలా తాజాగా తాకి హృదయాన్ని మెలిపెట్టింది. ఇలాంటివి రాయాలంటే ఎంత జీవితాన్ని చూడాలి!....ఈ మధ్య నాకు గూస్ బంప్స్ తెప్పించిన కవిత ఇది.
.
.
యుద్ధం ముగిసాకా (When the War is over by Shabir Ahmad Mir)
.
యుద్ధం ముగిసాకా
నువ్వు ఇలా వస్తే
బుల్లెట్లు, పెల్లెట్లు చేసిన రంద్రాలను
నీకు నేను చూపిస్తాను
నీ చేతివేళ్లతో తడిమి చూస్తే
నీకే అర్ధమౌతుంది వాళ్లెంత గాయపరచారో

యుద్ధం ముగిసాకా
శిధిలాల మధ్య భయం భయంగా వికసిస్తోన్న
ప్రిమ్ రోజెస్ పూల వాసన నీకు చూపిస్తాను
ఎంతటి దివ్యసౌందర్యం ఉండేదిక్కడ!

యుద్ధం ముగిసాకా
మా అఖండ పురాతన గిరుల మధ్య ప్రవహించే
సెలయేళ్ల గలగలల్ని నీకు వినిపిస్తాను
వాటి గొంతును కోపోద్రిక్త సరిహద్దుల చప్పుళ్ళు
ఇకపై అణచలేవు.

యుద్ధం ముగిసాకా
నేను నిన్ను దగ్గరుండి తీసుకెల్తాను
వెరినాగ్ నీటి చెలమలో నీ పాదాలను తడుపుకో
సుఖనాగ్ నీటిబుగ్గలోని నీళ్ళు దోసెళ్ళతో తాగు
ఏ భద్రతా లేకుండానే దాల్ సరస్సులో
పడవ షికారు చేస్తూ చేతిని నీళ్ళలో ఆడించు
ఇదెంత ప్రశాంత ప్రదేశమో నీకే తెలుస్తుంది.

యుద్ధం ముగిసాకా
భాష్పవాయువులు, పెప్పర్ స్ప్రేలు
సైరన్ లు, అరుపులు, మూలుగులు లేని
స్వేచ్ఛాగాలుల్ని శ్వాసించే మంచు శిల్పాలు
ఎంత అందంగా ఉంటాయో నీకు తెలిసేలా చేస్తాను.

నువ్వే చూస్తావు! నువ్వే చూస్తావు!
ఈ సువిశాల మంచు లోకపు ప్రశాంతత
అకాల సమాధులు తవ్వటానికై భగ్నం చేయకుండా ఉన్నప్పుడు
ఎంత అందంగా ఉంటుందో!

యుద్ధం ముగిసాకా
మా Wanwun బృందగానానికి తీసుకెళతాను, గొంతుకలుపు
వెండి వెన్నెల రాత్రివేళ
మా Rouff బృందనాట్యంలో చేరి ఆడుదుగాని.
మేము సంతోషంగా ఉండటం నీకూ సంతోషమేనని
నీకే తెలుస్తుంది.

యుద్ధం ముగిసాకా
నిన్ను టీ కి ఆహ్వానిస్తాను
కలిసి టీ తాగుదాం
ఉప్పని రుచితో, కుంకుమ రంగు కలిగిన టీ
నీకే తెలుస్తుంది
నేనేనాడూ నీకు శత్రువుని కానని.
.
Shabir Ahmad Mir ప్రముఖ కాశ్మీరీ కవి.
అనువాదం; బొల్లోజు బాబా,
December 4, 2019

కరుణ కన్నా గొప్ప మహిమ లేదు! - సూఫీల గొడుగు నీడలో


చాన్నాళ్ల క్రితం సారంగ కోసం కొత్తలంక బాబా గారి గురించి ఒక వ్యాసం రాసాను. ఆ వ్యాసం చదివిన ఒక మిత్రుడు ఒక మాట అన్నాడు—
“ఆ వ్యాసం కొత్తలంక బాబాగారిని కన్నా మీ అమ్మగారిని, ఆమె వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఆవిష్కరించింది” అని.
ఈ ఉమెన్స్ డే రోజున ఆ వ్యాసాన్ని తిరిగి చదివితే నాకు స్పష్టంగా తెలుస్తోంది—
అది కొత్తలంక బాబా గారి కథ మాత్రమే కాదు;
నా జీవితాన్ని నిశ్శబ్దంగా మలిచిన
మా అమ్మ కథ కూడా.
బొల్లోజు బాబా
.
కరుణ కన్నా గొప్ప మహిమ లేదు! - సూఫీల గొడుగు నీడలో
తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం సమీపంలో ఉన్న కొత్తలంకలో హజరత్ సయ్యద్ అహ్మదలీషా ఖాదర్ వలీబాబా గారి దర్గాతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి కొన్ని సంగతులు పంచుకోవాలనుకొంటున్నాను.
అవి 1930ల నాటి రోజులు.
మా మాతామహుని పేరు దొంతాభక్తుని సోమలింగం. యానాంలో నివసించేవారు. వీరికి సంతానం లేదు. ఎన్నిపూజలు చేసినా ఫలించలేదు. “రేవు అవతల ఎవరో యోగీశ్వరుడు వచ్చారట, ఆయన అనేక మహిమలు చూపుతున్నారట. వారిని దర్శించుకొన్నవారికి అనుకొన్నవి జరుగుతున్నాయట” అంటూ వారూ వీరూ చెప్పుకొనే మాటలను నమ్మి “సరే చూద్దాం ఏంజరుగుతుందో” అనుకొని ఒక రోజు మా తాతగారు కొత్తలంక వెళ్ళారు.
కొబ్బరితోట మధ్యలో ఓ చెట్టునీడన దిగంబరంగా కూర్చొని, బక్కపలచని శరీరంతో ఒక సాధువు, ఆయన చుట్టూ పది పదిహేను మంది భక్తులు. అరటిపళ్ళు, తీపితినుబండారాలు ప్రసాదంగా సమర్పించుకొని ఒక్కొక్కరు ఆయనపాదాలను తాకి నమస్కరించుకొని వెళిపోతున్నారు. కొంతమందితో ఆ సాధువు మాట్లాడుతున్నారు. మరికొందరిని వెళ్ళిపొమ్మని సైగలు చేస్తున్నారు. తెచ్చిన ప్రసాదాలను అక్కడక్కడా తీసుకొని ఎంగిలిచేస్తున్నారు, మరికొందరివి వారికే ఇచ్చేస్తున్నారు.
మా తాతగారి వంతు వచ్చింది. అరటిపళ్ళు ఆయన ముందు ఉంచి పాదాలకు నమస్కరించి లేస్తుండగా “ఏరా బ్రహ్మం, నీకు సంతానం ఉందిలే…. ఆడసంతానం” అని పలికి తలతిప్పి మరో వైపుకు చూస్తూ ఉండిపోయారట.
ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు మా అమ్మ పుట్టింది. నెలల బిడ్డను తిరిగి బాబాగారి వద్దకు తీసుకు వెళ్ళారట మా తాతయ్య, అమ్మమ్మలు. ఎవరో తన ఒంటిపై కప్పిన శాలువాను బాబా గారు పొత్తిలిగా చేసి పసిగుడ్డుగా ఉన్న మా అమ్మను ఎత్తుకొన్నారట. సపోటా పండును వలిచి తొనలు నోటిలో పెడితే మా అమ్మ చప్పరించిందట. “ఏంపేరు పెట్టమంటారు బాబా” అని మా తాతగారు అడగ్గా ” అమ్మాజి అని పెట్టరా” అన్నారట. కప్పిన శాలువాను తిరిగి ఇచ్చేయబోతే పట్టుకొనిపొండి అని బాబాగారు సైగ చేసారట. ఆ తరువాత 1948 లో కొత్తలంక బాబాగారు స్వర్గస్తులైనారు. కొత్తలంకలో వారి సమాధి వద్ద దర్గా నిర్మించారు.
అలా మా అమ్మ పేరు అమ్మాజి. మా అమ్మకు తోబుట్టువులు లేరు. మా అమ్మ జీవితాంతం ఒక వైపు హిందువుగా అన్ని పూజలు, పండగలు, వ్రతాలూ ఆచరిస్తూనే, బాబాగారిని కూడా ఎంతో భక్తితో పూజించేది. అందరి దేవుడిపటాల సరసనా కొత్తలంక బాబాగారి ఫొటో కూడా ఉండేది. మేం ఆరుగురుం సంతానం. మా అన్నయ్యలు ముగ్గురికీ హిందూ పేర్లు పెట్టారు. నాకు మాత్రం మా అమ్మ పట్టు పట్టి కొత్తలంక బాబా గారి పేరు పెట్టించింది. నా పూర్తి పేరు బొల్లోజు అహ్మదలీబాబా. మా అందరికీ పుట్టువెంట్రుకలు కొత్తలంక దర్గావద్దే తీయించారు.
నాకు బాగా చిన్నప్పుడు కొత్తలంక వెళ్లాలంటే యానాంలో పడవకట్టించుకొని ముమ్మిడివరం రేవులో దిగి, అక్కడనుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలవగట్టుపై నడుచుకొంటూ వెళ్ళేవాళ్ళం.
***
బాబాగారు ఇచ్చిన శాలువాని ఒక చెక్క పెట్టెలో వెండిపళ్ళెంలో ఉంచి పూజించేది మా అమ్మ. మాకెవరికైనా జ్వరాలొచ్చినా, చదువులకనో, పనులమీదో పొరుగూర్లు వెళుతున్నప్పుడూ బాబాగారి శాలువాని తీసి మా తలపై ఉంచి అంతా మంచి జరగాలని ప్రార్ధించేది.
ఏడాదికి రెండు మూడు సార్లు రోజంతా ఉపవాసం ఉండి, ఆ శాలువాను బయటకు తీసి, దాని ఎదురుగా కొవ్వత్తులు, అగరొత్తులు వెలిగించి, సెంటు, గంధం పూసి “కొత్తలంక బాబా నిను కోరి భజింతును, నిను చేరి సేవింతును” అనే పాటను పాడుకొంటూ పూజచేసుకొనేది మా అమ్మ. అలాగని మా అమ్మ బేల కాదు. మాహె, కారైకాల్ లాంటి సుదూరప్రాంతాలకు బదిలీలకారణంగా మా నాన్నగారు దాదాపు పన్నిండేళ్ళ పాటు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, బంధువుల సాయం అర్ధించకుండా ఆరుగురుసంతానం ఉన్న కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించింది. పాలు అమ్మి, కోళ్ళను పెంచి కోడిగుడ్లు అమ్మి, పెరట్లో కూరగాయలు పెంచి సంసారం నడిపి ఆర్ధిక ఇబ్బందులు తప్పించేది. ఆ లోపలిధైర్యమేదో బాబాగారి నుంచి పొందిందనుకొంటాను.
***
మా నాన్నగారి సంవత్సరీకాలు అయిపోయాకా “కొత్తలంక వెళ్ళాలని ఉంది నువ్వు తీసుకెళ్తావా” అని ఒకటి రెండు సార్లు అడిగింది నన్ను. అప్పటికి మా అమ్మ వయసు డబ్బై సంవత్సరాలు. అప్పట్లో నేను ఏలేశ్వరంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. పరీక్షల హడావిడి తగ్గాక వస్తానే అని చెప్పాను. ఆ తరువాత ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ గుండుతో ఉండటం చూసి ఆశ్చర్యపడి, ఎప్పుడు వెళ్లావే దర్గాకు అని అడిగితే, “ఏమోరా నేను ఇక వెళ్లగలనో లేదో అని- దర్గా ఉన్నదిక్కుకు తిరిగి జుత్తు బాబాగారికి అర్పించేసుకొన్నాను” అన్నది. ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే మా అమ్మ కూడా గతించిపోయింది. ఇది జరిగి పదిహేనేళ్లయినా నా జీవితంలో మిగుల్చుకొన్న పెద్ద వెలితి అది ఏనాటికీ.
నేను పదో తరగతి నుంచి కొత్తలంక దర్గాకు సొంతంగా వెళ్లటం మొదలు పెట్టాను. పడవపై యానాం గోదావరి దాటి, ఎదుర్లంకలో బ్రాంచ్ సైకిల్ అద్దెకు తీసుకొని మురమళ్ళవరకూ తొక్కుకుంటూ వెళ్ళి అక్కడ దాన్ని ఇచ్చేసి నడుచుకొంటూ కొత్తలంక వెళ్ళేవాడిని అప్పట్లో.
నేడు మా ఇంట్లో అందరి దేవుళ్లపటాలతో పాటు కొత్తలంక బాబాగారి పటంకూడా ఉంటుంది. నేటికీ ఏటా రెండు మూడుసార్లు కొత్తలంక దర్గాను దర్శించుకొంటాను సకుటుంబంగా. రకరకాల చిక్కుముళ్ళలో చిక్కుకున్నప్పుడు, పెద్దపనులు ఏమైనా తలపెట్టినపుడు దర్గావద్దకు వెళ్ళి ప్రార్ధించుకొని రెండుమూడుగంటలు కూర్చొని వస్తూంటాం. మా పిల్లలిద్దరి పుట్టువెంట్రుకలు కొత్తలంక బాబాగారి దర్గా వద్ద తీయించాము. రెండో సారి కేశాలు తిరుపతిలో ఇచ్చాం.
నేను డిగ్రీ చదివేటపుడు ఏ కల్మషమూ లేని ఒక మిత్రుడు “ఒరేయ్ మీరు కొత్తలంక బాబాగారిని ఇంతగా ఆరాధిస్తారు. మా తాతగారిది కోనసీమే. ఆయన బాబాగారి సమకాలీనుడు. ఎప్పుడైనా బాబాగారు మా ఇంటి అరుగుమీద కూర్చుంటే వెళ్ళిపో ఇక్కడనుంచి అని విసుక్కొనేవారట ఆయన. ఒక వ్యక్తిని కొందరు దైవంలా పూజించటం, మరికొందరు తృణీకరించటం ఎందుకు జరుగుతుందీ?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం నావద్ద అప్పుడూ లేదు ఇప్పుడూ లేదు.
చుట్టూ ఉన్న విశాలమైన గోదావరి కారణంగా కోనసీమ ప్రధానస్రవంతి చరిత్రకు కొంచెం ఎడంగానే ఉంది. అలాగని చరిత్రలేని సీమకాదు. అశోకుని పుత్రిక సంఘమిత్ర నిర్మింపచేసిన ఆదుర్రు బౌద్ధ క్షేత్రం ఘనమైన గతకీర్తికి చిహ్నం. షాజహాను ఆస్థానపండితుడైన జగన్నాధపండితరాయలు ఇక్కడివాడే. ఇతను షాజహాను కూతురు లవంగికను పెండ్లాడాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఎన్నోశతాబ్దాల క్రితం గోదావరిపై పడవలలో పెద్దమొత్తంలో ముస్లిం వ్యక్తులు వచ్చి ఇక్కడి ప్రజలలో కలిసిపోయి జీవించసాగారు అని చెపుతారు. లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకంలో ప్రధాన పాత్ర తన ముస్లిమ్ మిత్రుడిని సమాదరణతో చూస్తుంది. దళిత యోగిపుంగవుడైన ముమ్మిడివరం బాలయోగీశ్వరుని, కొత్తలంకబాబాగారిని పూజించినట్లుగానే కులమతాలకు అతీతంగా ఆనాటి కోనసీమ వాసులు ఆరాధించారు.
నా మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఒక్కటి మాత్రం చెప్పగలను. పశుపక్ష్యాదుల్ని సమాదరించటం, మనుషుల బాధల్ని తొలగించటం లాంటి విషయాలలో కొత్తలంక బాబా గారు చూపిన మహిమలను ఈ ప్రాంత ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటారు.
ఈ సృష్టిలోని జీవరాశి అంతా ఒకటేనని, సాటిమనిషి పట్ల కరుణ కలిగి ఉండాలి అనే మౌలిక జీవన సూత్రాలను కొత్తలంక బాబాగారు ఈ ప్రాంతంలో సంచరిస్తూ అనుచరిస్తూ, వెళ్ళిపోతూ మనకు ఇచ్చిన దైవసందేశం అనుకొంటాను.
బొల్లోజు బాబా
15 Jun 2020




Comment made on respectable friend's wall


## ఒకే సర్. థాంక్యూ. ఇదే మీ సమాధానం అయితే నేనేమి అనలేను. ఒక్కటే గుర్తుచేయగలను. ఆనాటి సమకాలీనులు ముస్లిం, హిందూ లేదా యూరోపియన్ కథనాలలో "జీహాద్" అని అన్న ఒక్క వాక్యం చూపండి అని పదే పదే అడిగాను. అది చూపనంతవరకూ ఎవరెన్ని వాదనలు చేసినా అది ఈ రోజు మనకు కావలసిన విధంగా చరిత్రను వక్రీకరించటంగా భావిస్తాను. మనకు కావలసినట్లు చరిత్ర ఉండదు.
## ముస్లిమ్ సైనికులు మోసం చేసి పక్షాలు మారినంత మాత్రాన అది జీహాద్ అవుతుందా? అంబి, పుష్యమిత్రుడు, జైచంద్, సాళువనరసింహ, మరాఠా రఘునాథరావు ఎంతమంది లేరు చరిత్రలో వెన్నుపోటు మోసకారులు. రాజ్యకాంక్షను దాని డైనమిక్స్ ను అర్థం చేసుకోకుండా అంతా మతమే ఉందనీ, హిందూముస్లిం యుద్ధాలన్నీ జీహాద్ లు అని ఏ ఆధారాలు లేకుండా అంటే ఎలా?
భారతదేశంలోని ముస్లిమ్ యుద్ధాలన్నీ జీహాద్ లే అని ఒక దశాబ్దకాలంగా ఎవరంటున్నారో గమనిస్తూ కూడా అలాగే అనటంలోని ఔచిత్యాన్ని, నిజాయితీని ప్రశ్నించటం తప్పందుకవుతుందీ?
వాస్తవానికి సుల్తానులు తళ్ళికోట యుద్ధంలో గెలిచిన తరువాత విజయనగర సామ్రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోలేదు. అది ముస్లిం రాజ్యం కాలేదు. రాయలవారి కుటుంబ వారసులకే వదిలి వెళిపోయారు. అలా విజయనగర సామ్రాజ్యం మరో 80 ఏళ్ళు కొనసాగింది. దీన్ని జీహాద్ అందామా లేక అతిగా వ్యవహరిస్తున్న రామరాయలకు బుద్ధిచెప్పటంగా అనుకోవాలో మీరే చెప్పండి.
•••
పాత ముస్లిం యుద్ధాలన్నీ అర్జంటుగా జీహాదులగా చెప్పటం అనేది ఇప్పుడు అవసరపడింది ఎందుకంటే...నేడు హిందుత్వవాదులు ముస్లింలపై చేస్తున్న దాష్టీకాలన్నిటికీ లెజిటమేసీ కల్పించటం కోరకు అనేది ఎవరికి తెలియని అంశం. అందుకే ఇన్నిన్ని అబద్ధాలు ఆడుతున్నారు.
****
వ్యాసంలో వాడిన "హిందూ ధర్మ సురత్రాణ" అనే పదం హిందుత్వ వాదుల సృష్టి.
ముస్లిమ్ రాజులు వివిధ యుద్ధాలలో విజయం సాధించి సుల్తానులుగా తమని తాము ప్రతిష్టించుకొన్నాక సంస్కృత శాసనాలలో వారు హమ్మీర (అమీరు), సురత్రాణ (సుల్తాను) లాంటి సాంస్క్రిటైజ్ చేయబడిన పేర్లతో పేర్కొనబడ్డారు. ఇవే పేర్లను హమ్మీర చౌహాన్, హమ్మీర వర్మన్ అంటూ కొందరు హిందూ రాజులు కూడా అనుకరించటం గమనార్హం.
శాసనాలలో హిందూ అన్నపదం 1347 లో విజయనగర రాజు మారెప్ప తనని తాను “హిందురాయ సురతాల” గా (హిందూరాజులలో సుల్తాను) చెప్పుకొన్నప్పుడు మొదటి సారిగా కనిపిస్తుంది. కొన్నాళ్ళకు ఈ పదం హిందూరాయ సురత్రాణ గా స్థిరపడింది. ఇది హిందూ ఇస్లాం Syncretism (సమ్మేళనం) కు గొప్ప ఉదాహరణ అంతే తప్ప మనుషుల్ని విడదీసే "హిందూ ధర్మ సురత్రాణ" అన్న పదం చరిత్రలో ఎక్కడా లేదు.
ఇది వాట్సప్ చరిత్రకారుల సృష్టి. ఆ పదంపట్టుకొని ఎక్కువ సేపు వాదించలేం.
బొల్లోజు బాబా
other references
1.Epigraphia Carnatica Inscription In Kolar District Vol.10, pn. 270
2. Epigraphia carnatica. By B. Lewis Rice, Director of Archaeological Researches in Mysore, pn 51
Ps.
పట్టణాలను దహనం చేసి నాశనం చెయ్యటం యుద్ధాలలో సహజం. కొన్ని ఉదాహరణలు
వాతాపి ని -పల్లవులు
అనురాధపురాన్ని - రాజరాజు
కల్యాణిని - చోళులు
దేవగిరినిని - యాదవులు, లాంటివి కనిపిస్తాయి.
మంగిరాజు ఖండిత శిరస్సుతో యుద్ధభూమిలో చాళుక్యరాజు ఫుట్ బాల్ ? ఆడుకొన్నారని ఒక శాసనం చెబుతుంది.
నిన్నమొన్నటి Sambhaji సైనికులు శత్రురాజ్యాల స్త్రీలను ఎత్తుకుపోయి అమ్ముకున్నట్లు రిఫరెన్సులు ఉన్నాయి.
ఇవన్నీ యుద్ధ ఉన్మాదాలు. వాటిని మత ఉన్మాదాలుగా చిత్రించటం నేటి విద్వేష రాజకీయాలు. తద్వారా బ్రాహ్మణాధిక్య సమాజాన్ని పునఃప్రతిష్ట చేయాలని పండితుల దురాలోచన. అంతిమంగా లబ్ది ఎవరికి అనేది విలాస శాసనం లో స్పష్టంగానే ఉంది
ఈ సూక్ష్మం తెలియనంతకాలం ప్రతిమనిషి పక్కమనిషిని ద్వేషిస్తూనే ఉంటారు



నాన్న ECG


.
సామాన్లు సర్దుతుంటే
పాత పేపర్ల మధ్య దొరికింది
పడి లేచే నల్లగీతలతో
మడతలుగా చుట్టి పెళుసుబారిన
ఒక గ్రాఫు కాగితం
నాన్న ఇసిజి.
 
ఇప్పుడు నాన్న లేడు
కానీ ఆ గీతలు
చేతికి వెచ్చగా తగులుతున్నాయి
వేళ్ళకి తెలుస్తోంది
ఆ హృదయం ఇంకా కొట్టుకోవడం
 
భుజంపై ఎవరిదో చేయి
వెనక్కి తిరిగి చూస్తే
నా కొడుకు
నిశ్శబ్ద ప్రవాహం
.
బొల్లోజు బాబా



Sunday, March 8, 2026

తళ్ళికోట యుద్ధం జీహాద్ యుద్ధమా?

తళ్ళికోట యుద్ధం 1565 జనవరి 23 న జరిగింది. దీనినే రాక్షస-తంగడి యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించడానికి దక్కన్ ప్రాంతానికి చెందిన నాలుగు ముస్లిం రాజ్యాలు తమలోని శత్రుత్వాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయి. అవి అహ్మద్‌నగర్ (సుల్తాన్ హుస్సేన్ నిజాం షా), బీజాపూర్ (సుల్తాన్ అలీ ఆదిల్ షా), గోల్కొండ (సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా), బీదర్ (సుల్తాన్ అలీ బరీద్ షా).
 
వీరందరూ కలిసి విజయనగర సామ్రాజ్యంపై మూకుమ్మడిగా దాడి చేసి ఓడించారు. విజయనగర సైన్యానికి నాయకత్వం వహించింది శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు. ఈ యుద్ధంలో అళియ రామరాయలు ఓడిపోయి, శత్రువుల చేతిలో మరణించాడు. విజయనగర సైన్యం చెల్లాచెదురైంది. ఈ ఓటమితో దక్షిణ భారతదేశంలో అత్యంత బలమైన విజయనగర హిందూ సామ్రాజ్యం కూలిపోయింది.

I. తళ్ళికోట యుద్ధం జీహాద్ యుద్ధమా?

జీహాద్ అంటే ఇస్లామ్ మతరక్షణ, విస్తరణ కొరకు చేసే యుద్ధంగా నిర్వచిస్తారు. (ఇతర అర్ధాలున్నప్పటికీ నేడు అలా స్థిరపడింది). చరిత్రలో కొన్ని యుద్ధాలు జీహాద్ గా పేర్కొనబడ్డాయి కానీ ప్రతి యుద్ధం జీహాద్ అని ప్రకటించలేదు. భారతదేశంలో జరిగిన ముస్లిం యుద్ధాలను జీహాద్ లుగా ప్రకటించినట్లు ఆనాటి సమకాలీన ఆధారాలు లేవు. ముఖ్యంగా “జీహాద్” అనే పదం ఎక్కడా వాడలేదు.
 
ఈ రోజు Sandeep Balakrishna లాంటి కొందరు హిందుత్వవాదులు, ధర్మ డిస్పాచ్ లాంటి వెబ్ సైట్లు - భారతదేశంలో ముస్లింలు చేసిన యుద్ధాలను జీహాద్ గా అభివర్ణిస్తున్నారు. ఈ ధోరణి 2010 నుంచి ఎక్కువయింది. లవ్ జీహాద్, ఫుడ్ జీహాద్ లాంటి పదాలను సృష్టించి ప్రజలమధ్య విద్వేషాలను రగులుస్తున్నారు.
 
ఇటీవల ఒక ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త కూడా తన కొత్త పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవటానికి తళ్ళికోట యుద్ధం అనేది కొందరు ముస్లింరాజులు కలిసి హిందూరాజుపై జరిపిన “జీహాద్” అని ప్రకటించటం శోచనీయం, సత్యదూరం. ఈ విషయాన్ని దృవీకరించే ఆనాటి సమకాలీన ఆధారం ఒక్కటి కూడా లేదు. భారతదేశంలో హిందూ-ముస్లిం యుద్ధాలను జీహాద్ గా చెప్పటం పూర్తిగా ఇటీవలి పరిణామం. హిందుత్వవాదుల సృష్టి. మనుషులను విడదీదే విద్వేషపూరిత ప్రచారం. దాన్ని బలపరచే విధంగా తెలుగుసాహిత్యం దోహదపడటం నైతిక పతనం.
ఆనాటి వివిధ రచనలలో తళ్ళికోట యుద్ధాన్ని వర్ణించిన వాక్యాలలో ఎక్కడా జీహాద్ అన్న పదం కనిపించదు. హిందువులను కాఫిర్ (అవిశ్వాసి) గా వర్ణించటం ఆ కాలపు శైలి తప్ప మతప్రస్తావన కాదు.
 
II. జీహాద్ యుద్ధం చేయడం అంటే కొన్ని పద్దతులు పాటించాలి. అవి-

1. పవిత్రయుద్ధానికి పిలుపు ఇచ్చి ఆ యుద్ధాన్ని స్పష్టంగా జీహాద్ అని ప్రకటించాలి
2. పండితుల మద్దతుతో మతపరమైన ఫత్వా ఇవ్వాలి.
3. పాలకుడు తనను తాను ఘాజీ గా సంభోదించుకోవాలి
4. యుద్ధం యొక్క ప్రధాన ఉద్దేశం మత విస్తరణ అని చూపాలి
ఇన్ని నియమాలు పాటించినపుడు మాత్రమే ఆ యుద్ధాన్ని జీహాద్ అని అంటారు.
ఆ కాలానికి చెందిన వివిధ ఇస్లామ్, ఇస్లామేతర రచనలలో తళ్ళికోట యుద్ధ ప్రస్తావనలు ఉన్నాయి దేనిలోను జీహాద్ అనే పదం కనిపించదు. వాటి వివరాలు ఇవి….
.
A. ఇస్లామ్ చరిత్రకారులు తళ్ళికోట యుద్ధం గురించి చెప్పిన అంశాలు
.
1. తజ్కిరత్ అల్-ములూక్ (Tazkirat al-Muluk/ రాజుల వృత్తాంతం)
పేరుతో బీజాపూర్ కోర్టులో 1560 లలో పనిచేసిన రఫీ-ఉద్-దీన్ షిరాజీ అనే చరిత్రకారుడు తళ్ళికోట యుద్ధానికి సంబంధించి….
“ఇస్లాం రాజులు (నిజాం షా, ఆదిల్ షా, కుత్బ్ షా, బరీద్ షా) గత పరాజయాలు, భూభాగ నష్టాల తర్వాత “కాఫిర్” రామరాయను ఓడించేందుకు కూటమి కట్టటం; కృష్ణా నది దాటటం; తుపాకీల వినియోగం, రామరాయ మరణం; విజయోత్సవాలు లాంటి ఘట్టాలు వివరించాడు.” ఈ యుద్ధం ప్రధానంగా ప్రతీకారం, అధికార విస్తరణ లాంటి అంశాల ఆధారంగా జరిగిందని చెప్పాడు.

2. బుర్హాన్-ఇ-మఆసిర్ (Burhan-i-Maasir చారిత్రిక ఘనకార్యాలు) సయ్యద్ అలీ తబాతబా అహ్మద్‌నగర్ కోర్టు చరిత్రకారుడు 1590లలో రచించిన రచనలో తళ్ళికోట యుద్ధాన్ని ఇలా వర్ణించాడు.
“రామరాయ “దక్కన్‌లో ఏకైక అధికారి” గా ప్రకటించుకోవడంతో అతన్ని కూలదోయడానికి కూటమి ఏర్పడింది. రాజకీయ అధికారాల విస్తరణ, భూభాగ హక్కులకొరకు ఈ యుద్ధం జరిగిందని చెప్పాడు” తప్ప ఎక్కడా జిహాద్ ప్రస్తావన తేలేదు.

3. తరీఖ్ ఇ-ఫిరిష్తా (Tarikh-i-Ferishta ఫరిస్టా రచించిన చరిత్ర) — మహ్మద్ ఖాసిం ఫరిష్తా బీజాపూర్ చరిత్రకారుడు. ఇది 1589 నాటి రచన. దీనిలో ఫరిష్టా తళ్ళికోట యుద్ధం గురించి ఈ మాటలు చెప్పాడు.
“సుల్తాన్లు తమ శత్రుత్వాన్ని పక్కనబెట్టి కూటమి కట్టారని, కృష్ణా దాటి యుద్ధం చేసి “కాఫిర్” ను ఓడించారని చెప్పాడు. యుద్ధానికి ప్రధాన కారణం రామరాయ అధికారాన్ని అంతం చేసి రాజకీయ ఆధిపత్యం పొందటం అన్నాడు” దీనిలో కూడా “జిహాద్” ప్రకటన లేదు.

B. పోర్చుగీసు/యూరోపియన్ లు చెప్పిన అంశాలు

1. సెసారే ఫెడెరిచి (Cesare Federici): ఇటాలియన్ వ్యాపారి. 1567–68 మధ్య హంపి అవశేషాలు దర్శించాడు. “నలుగురు మూర్ రాజులు” ద్రోహంతో విజయనగరాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నాడు తప్ప. మతపరమైన యుద్ధంగా చెప్పలేదు.
 
2. డియోగో దో కౌటో (Diogo do Couto) 16వ శతాబ్దం చివర సందర్శించిన పోర్చుగీస్ చరిత్రకారుడు. “మూర్ రాజులు” కూటమి కట్టి “బిస్నగ రాజు” పై యుద్ధం చేశారని చెప్పాడు. పూర్వ అవమానాలకు ప్రతీకారం అన్న రాజకీయ భావనే తప్ప జిహాద్ ప్రస్తావన లేదు.
ఇతర జెసుయిట్/పోర్చుగీస్ లేఖలు (ఉదా: ఆంటోనియో రుబినో, 1608) లాంటి వాటిలో భూ వివాదాలు, ప్రతీకారం, కూటమి, ఇవి మాత్రమే యుద్ధకారణాలుగా ఉన్నాయి తప్ప మతపరమైన జిహాద్ పదజాలం లేదు.

III. తళ్ళికోట యుద్ధాన్ని జీహాద్ గా ఎవరు పేర్కొన్నారు

19-20 వ శతాబ్దపు చరిత్రకారులైన జాన్ బ్రిగ్స్, రాబర్ట్ స్యూవెల్ లాంటి వారు ఈ యుద్ధానికి రాజకీయ సైనిక వివరణలు ఇచ్చారు తప్ప జీహాద్ గా లేబుల్ చెయ్యలేదు. ఆధునిక చరిత్రకారులు - రిచర్డ్ ఎం. ఈటన్, బర్టన్ స్టీన్, సంజయ్ సుబ్రహ్మణ్యం, ముజఫ్ఫర్ ఆలం, రోమిలా థాపర్ మొదలైన వారు తళ్ళికోట యుద్ధానికి మతపరమైన ఫ్రేమింగ్‌ను తిరస్కరించారు.
నిజానికి అళియరామరాయలు సుల్తానులతో చాలాకాలం మైత్రిలో ఉన్నాడు. కొన్ని సార్లు వారితో ఘర్షణలు పడ్డాడు. ఇతని సైన్యంలో చాలామంది ముస్లిం సైనికులు ఉండేవారు. తన సింహాసనంపై ఖురాన్ ప్రతిని ఉంచుకొని ఇస్లాంమతాన్ని గౌరవించాడు.
 
తళ్ళికోట యుద్ధాన్ని జీహాద్ గా ప్రచారం చేయడం పూర్తిగా ఇటీవలి పరిణామం. మతవాదుల విద్వేషపూర్వక ఎత్తుగడ ఇది. ఈ ప్రచారం చేస్తున్నది Dharma Dispatch, True Indology, INDIAN REAL HISTORY వంటి వెబ్‌సైట్‌లు ఇతర సోషల్ మీడియా అకౌంట్లు ఇంకా అనేకానేక వాట్సప్ కథనాలు. యుద్ధానంతరం హంపిలోని ఆలయాల విధ్వంసాన్ని జిహాద్ గా చెబుతారు వీళ్ళు. కానీ అక్కడ వైష్ణవ క్షేత్రాల విధ్వంసం జరిగింది కానీ శైవ క్షేత్రాల విరూపం ఎందుకు జరగలేదనే ప్రశ్నకు వీరివద్ద సమాధానం ఉండదు.

నిజానికి మధ్యయుగాలలో కనిపించేది రాజ్యకాంక్షతో కూడిన యుద్ధోన్మాదం. కన్నూమిన్నూ కానని హింస, అరాచకత్వం ఆక్రమణ దాని లక్షణాలు. ఈ యుద్ధోన్మాదాన్ని మతోన్మాదంగా చిత్రీకరించడం అనేది ఒకమతంలో ఎవరైతే అధిపత్యాన్ని కలిగి ఉంటారో వారికి లబ్ది చేకూర్చే ఎత్తుగడ.
 
CE1323 లో తుగ్లక్ దక్షిణభారత దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి ఆంధ్రదేశాన్ని ఢిల్లీ సుల్తానుల పాలనకిందకు తెచ్చాడు. అప్పుడు ముసునూరి ప్రోలయనాయకుని నాయకత్వంలో ఆంధ్ర నాయకులు స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారు. ఆ సందర్భంలో వేయించిన విలస తామ్రశాసనం చారిత్రికంగా విలువైనది.
 
"ఈ శాసనంలో - ముస్లిం పాలనలో ఆంధ్ర ప్రాంతం "మైలపడి" (అపవిత్రమైందని), దానిని యజ్ఞయాగాదులతో, బ్రాహ్మణులకు అగ్రహారాలు (భూములు) దానం చేయడం ద్వారా ప్రోలయ నాయకుడు "పునరుద్ధరణ" (శుద్ధి) చేశాడని పేర్కొనబడింది."

అంటే ఈ శాసనం బ్రాహ్మణాధిక్యతకొరకు, వర్ణధర్మం స్థాపన కొరకు వేయించిన శాసనం. మధ్యలో ముస్లింల ప్రస్తావన రాజకీయపరమైనది.

నిజానికి యుద్ధసమయంలో, రాజ్యకాంక్షలో మతాన్ని చూడటం మనువాదుల కుట్ర. తమ ఆధిపత్యం సడలుతున్నందుకు యుద్ధ ఉన్మాదాన్ని మత ఉన్మాదంగా చిత్రించారు. ఆ మేరకు దానాలు, సంభావనల రూపంలో లబ్దిపొంది తిరిగి తమ ఆధిక్యతను పునస్థాపించుకొన్నారని అవి ఆనాటి సోషల్ డైనమిక్స్ అని విలస శాసనం ద్వారా అర్ధమౌతుంది.
.
IV. ముగింపు
.
ఈ నేలపై ఒక్క ముస్లింలు హిందువులకు మాత్రమే యుద్ధాలు జరగలేదని కాస్త చరిత్ర చదివితే అర్థం అవుతుంది. హిందువులకు హిందువులకు మధ్యకూడా అంతకన్నా ఎక్కువే యుద్ధాలు జరిగాయని అప్పుడుకూడా సంపదలకోసం ఆలయాలు తవ్వబడ్డాయని, విగ్రహాలు విరూపం చేయబడ్డాయని, ముస్లింలు చేసిన యుద్ధాలలో హిందూ సైనికులే ఆ పని చేశారని కూడా అర్థమౌతుంది. అంతిమంగా లబ్దిపొందింది ఎవరో విలస శాసనం చివరిపంక్తులు చెబుతున్నాయి. నేటికీ అదే ధోరణి.
 
రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాల్లో మతాన్ని వెతకడం చరిత్రను వక్రీకరించే ప్రమాదకరమైన అవగాహన. రాజకీయ, ఆర్థిక, సామ్రాజ్యవిస్తరణ లక్ష్యాలతో సాగిన యుద్ధాలను మతపరమైనవిగా చిత్రించడం నేటి మతవాదుల దుష్ప్రచారం. గతంలో ముస్లింలు చేసిన ప్రతి యుద్ధమూ మతవిస్తరణ కోసమేనని, అదే ధోరణి నేడు ‘లవ్ జీహాద్’, ‘ఫుడ్ జీహాద్’ వంటి పేర్లతో కొనసాగుతోందని చెప్పడం విషప్రచారం మాత్రమే.

యుద్ధ సమయంలో కంటే, ప్రశాంత కాలంలో ఒక రాజు తన రాజ్యంలో భిన్న మతాలను ఎలా ఆదరించాడు, ఎలా సంరక్షించాడు అన్నదే చరిత్రాత్మకంగా పరిశీలించాల్సిన ప్రమాణం కావాలి.
యుద్ధోన్మాదమే మతోన్మాదం అనే అవగాహనతో రాసే సాహిత్యం సమకాలీన మత రాజకీయాలకు చరిత్ర పేరుతో ఊతం ఇచ్చినట్లు. ఇది వాంఛనీయం కాదు.
 
బొల్లోజు బాబా