Wednesday, July 21, 2010

వారిలో ఒకరు (ONE OF THEM)-- P.P. Ramachandran



వారిలో ఒకరు 

స్కూలు బస్ స్టాప్ వద్ద అమ్మాయిలు
బస్సుకోసం ఎదురుచూస్తున్నారు

ఎంత ప్రయత్నించినా
వలికే దేహ సౌందర్యాన్ని
గొడుగులు, బ్యాగులు, జోళ్లు, యూనిఫార్మ్ లు 

నిలువరించలేక పోతున్నాయి.

బయటకురికే వారి హృదయాలను
వారి మాటలు, చూపులు, భంగిమలూ
ఏ మాత్రం దాచలేక పోతున్నాయి.

కళ్ళముందే బస్సులు దాటిపోతూంటే
ఆందోళన పె
రుగుతూంటుంది.
*****


వారిలో ఒకామె  ప్రభుత్వాధికారి
మరొకామె  ఓ గృహణి అవుతారు
ఇంకొకామె  దారి తప్పుతుంది.....


ఆ స్కూలు పక్కనుంచి సాగే బస్సులో
ఒళ్లో పిల్లాడ్ని పెట్టుకొని కూర్చున్న ఆమె  తన భర్తతో
"ఈ స్కూల్లోనే నేను చదువుకొన్నది" అంటోంది.


అక్కడ ఇంకా ఒకరు బస్సుకోసం
ఎదురుచూస్తూనే ఉంటారు
ఇప్పటికీ!


Source:  ONE OF THEM  --   P.P. Ramachandran

Wednesday, July 14, 2010

ప్రార్ధన


ఇప్పుడిక ఓ ఎడారిని ప్రసాదించు 

వర్షించే ఇసుకా, ప్రవహించే ఎండా
దిగంతాలవరకూ
పరచుకొన్న ఏకాంతం
నిర్జల సరోవరాల తో కూడిన
ఓ ఎడారి కావాలిపుడు.
దానికేమాత్రం తగ్గినా
ఈ ఘడియ రక్తికట్టదు.


లేదా
ఓ సముద్రాన్నిప్పించు
దేహాన్ని తేల్చుతూ ఉండేంత ఉప్పని నీరు
చుట్టూ విశాలంగా విస్తరించిన ఏకాంతం
కింద వెచ్చని బడబాగ్ని
పైన చల్లని సుడిగాలులతో కూడిన
ఓ ఉప్పని సముద్రమైనా చాలు
సరిగా సరిపోతుంది.

లేక పోతే 

ఓ రాత్రిని అనుగ్రహించు
అన్ని వైపుల్నుంచీ వీచే నల్లని గాలి
మువ్వలచేతికర్రతో సాగే నేత్రధ్వయం
స్పటికం లా వణికే  చిక్కని నీలిమా
పొదలమాటున మెరిసే కనుల ఏకాంతంతో కూడిన
రాత్రయినా చాలు సందర్భోచితంగా ఉంటుంది.

లేదా.........






బొల్లోజు బాబా

Tuesday, July 6, 2010

శిలపరశెట్టి పురస్కార సభా విశేషాలు



ముందు పోస్టులో చెప్పిన విధంగా శిలపరశెట్టి పురస్కార సభ ఆంధ్రాయూనివర్సిటీ తెలుగువిభాగం సమావేశమందిరంలో  జరిగింది.  ఈ సభకు ప్రముఖ కవయిత్రి, అనువాదకురాలు జగద్దాత్రి గారు అధ్యక్ష్యత వహించారు. డా. కాళీపట్నం రామారావు గారు ముఖ్య అతిధి గా వచ్చారు.  ప్రముఖ కవి విమర్శకులు శ్రీ రామతీర్ధ  గారు నా కవితా సంకలనం పై సుదీర్ఘమైన విశ్లేషణ చేసారు. కాళీపట్నం రామారావు గారి చేతులమీదుగా శ్రీరాధేయ గారికి నాకు పురస్కారాలు ప్రధానం చేయటం జరిగింది. ట్రుస్టు నిర్వాహకులైన శ్రీ సనారా గారు, శ్రీ శిలపరశెట్టి మోహన్ కుమార్ గారు ప్రసంగించారు.  ఈ కార్యక్రమం తరువాత కుమారి నికితా మోహన్ రచించిన "Penchant" అనే ఇంగ్లీషు  కవితా సంకలనావిష్కరణ జరిగింది.  ఈ పాప వయసు 12 సంవత్సరాలు. ఈ సభలో శ్రీ కొంపెల్ల, శ్రీ జోగారావు, శ్రీ గరిమెళ్ల నాగేశ్వరరావు, శ్రీ ఎల్.ఆర్. స్వామి వంటి ప్రముఖ సాహితీ వేత్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాకు అభినందనలు తెలియచేసిన అందరకూ ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు
బొల్లోజు బాబా

Saturday, July 3, 2010

నా కవితా సంకలనానికి శిలపరశెట్టి స్మారక ప్రత్యేక ప్రశంస అవార్డు

నా "ఆకుపచ్చని తడిగీతం" కవితాసంకలనం 2009 సంవత్సరానికి గాను శిలపరశెట్టి రాములు నాయుడు స్మారక  ప్రత్యేక ప్రశంసా పురస్కారానికి ఎంపికయ్యింది.

ప్రముఖ కవి, విమర్శకుడు శ్రీ రాధేయ గారి "అవిశ్రాంతం"  ఉత్తమ కవితా సంపుటి పురస్కారం పొందింది. "మగ్గం బతుకు" అనే కవితాసంపుటి ద్వారా చేనేత కార్మికుల దీన స్థితిగతులను అద్భుతంగా అక్షరీకరించి లబ్ధప్రతిష్టులైన రాధేయ గారి సరసన కూర్చునే అదృష్టాన్ని కలిగించిన శిలపరసెట్టి రాములు నాయుడు ట్రస్టు  నిర్వాహకులు శ్రీ మాధవీ సనారా గారికి, న్యాయనిర్ణేతలు శ్రీ రామతీర్ధ గారికి   ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. 

సమావేశ వివరాలు

సమయం: 5:30 ని.


తేదీ: 04-07-2010

స్థలం: ఆంద్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సమావేశ హాలు

పురస్కార ప్రధాత:  డా. కాళీపట్నం రామారావు గారు.


నన్నింతకాలం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించిన బ్లాగ్మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

భవదీయుడు
బొల్లోజు బాబా