Saturday, August 28, 2021

పరిచయాలు, సమీక్షలు, ప్రసంగాలు - బొల్లోజు బాబా, సాహిత్యవ్యాసాలు

నేను ఇంతవరకూ చేసిన పుస్తక పరిచయాలు, సమీక్షలు, ప్రసంగ పాఠాలు అన్నీ ఒక చోట... .... .. మొత్తం 84 వ్యాసాలు, 450 పేజీలు

ఇక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును





Monday, August 23, 2021

makineedi meeting

 శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ బహుముఖీన ప్రజ్ఞకలిగిన వారు. కవిగా, కథకునిగా, విమర్శకునిగా, చిత్రకారునిగా వారు చేసిన సాహిత్యప్రయాణం ఎంతో ఫలవంతమైనది.

శ్రీ మాకినీడి సుమకవితాంజలి నుండి “అనేకులుగా” వరకూ చేసిన కవిత్వ ప్రయాణంలో -సామాజిక స్పృహ, మానవసంబంధాలు, తన లోలోపలకి చేసుకొన్న తవ్వకం- అనే మూడు అంశాలను ఒక అంతర్లయలా చేసుకొని వీరు మంచి కవిత్వాన్ని సృజించారు.
బొల్లోజు బాబా

Friday, August 20, 2021

#సంతకం #కవిత్వపరామర్శ

Thank you so much Vinodini Madasu gaaru for choosing my Book.
Eagerly awaiting the event.
Bolloju Baba
May be an image of Vinodini Madasu and text
#సంతకం #కవిత్వపరామర్శ
....................................................................
“ అస్తిత్వం అనేది
గొనె సంచిలో తీసుకెళ్ళి ఊరిచివర విడిచినా
తోకూపుకుంటూ వచ్చిచేరే పిల్లి పిల్ల లాంటిది
దాన్ని ప్రేమించటం నేర్చుకో
ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని నిలుపుకో
ఈ ప్రపంచం
నిన్నెలా చూడాలనుకుంటుందో
అలా వేషం కట్టి
ఆత్మ లోకంలో అమ్ముడుపోకు
అబద్ధపు వేషం పదే పదే కట్టి
నువ్వే ఓ నిలువెత్తు అబద్ధంగా మారిపోకు
ఈ ప్రపంచం
ఏవి నీకు ఉండకూడదని ఆశిస్తుందో
అదే నీ అస్తిత్వం వాటిని కోల్పోకు
కర్ణుడు కవచ కుండలాలని కోల్పోయినట్లు.
ఇంకొకరి అభిప్రాయంగా ఉండేకన్నా
నువ్వే ఓ సిద్ధాంతంలా మారు ”
..................................................................................................
#వినోదినిమాదాసు #21_08_2021 #శనివారం రాత్రి 8 గంటలకు



Tuesday, August 10, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 4



వజ్జలగ్గ – గాథలు పార్ట్ 4
#వజ్జలగ్గ
.
ప్రాచీన భారత సమాజంలో స్త్రీలు పురుషులతో సమానమైన గౌరవాన్ని పొందారు. ఎవరైనా భర్తను కోల్పోయినా భర్త ఉండగా అక్రమ సంబంధం కలిగి ఉన్నా ప్రాయశ్చిత్తం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకొని సాధారణ జీవనం సాగించవచ్చు అని హిందు ధర్మశాస్త్రాలు చెప్పాయి. వితంతు పునర్వివాహం కూడా ఆనాటి సమాజానికి వింత కాదు. భారతంలోని దమయంతి పునర్వివాహ స్వయంవర ఉదంతం దీనికి తార్కాణం. పరాశర, నారద స్మృతులలో కూడా పునర్వివాహ ప్రస్తావనలు ఉన్నాయి.
కర్మకాండలు, క్రతువులు జరపవలసి వచ్చినప్పుడు తప్పని సరిగా దంపతులు పాల్గొనాలి కనుక అత్యవసర పరిస్థితులలో ముప్పై ఏండ్ల పురుషుడు పన్నెండేళ్ళు దాటిన బాలికను మాత్రమే వివాహం చేసుకోవాలని, అదే విధంగా 24 ఏండ్ల యువకుడు 8 ఏండ్లు దాటిన బాలికను మాత్రమే పెండ్లాడాలని మనుసంహిత చెప్పింది. ఎలాంటి వివాహమైనా ఆ బాలిక రజస్వల అయి యుక్తవయసువచ్చాక మాత్రమే కాపురానికి పంపాలని కూడా చెప్పబడింది. ఆ మేరకు చూసినప్పుడు ఆనాటి సమాజంలో బాల్యవివాహాలు విశృంఖలంగా జరిగినట్లు చెప్పలేం., వివాహ వయస్సు అబ్బాయిలకు 25 ఏండ్లు, అమ్మాయిలకు 16 ఏండ్లు ఉండాలని వైద్యగ్రంధమైన శుశ్రుత సంహిత నిర్ధేశించింది.
BCE 200 నుంచి CE 150 మధ్య దాదాపు 350 సంవత్సరాలు భారతదేశం మరీముఖ్యంగా ఉత్తరభారతదేశం అత్యంత క్లిష్టమైన చీకటి కాలాన్ని చూసింది. మొదట గ్రీకులు తరువాత సింథియన్ లు, పార్థియన్ లు భరత ఖంఢంపై దండయాత్రలు జరిపారు. ఈ దండయాత్రలలో మొత్తం హిందూ జనాభాలోని 50 శాతం మంది నిర్మూలించబడ్డారు. వీరిలో సగం మంది చంపబడితే మిగిలినవారిని బానిసలుగా ఎత్తుకుపోయారు. ఈ కాలంలోనే ఓడిపోయిన స్థానిక జనాభా బానిసత్వానికి గురయ్యింది. అప్పుడే స్త్రీలు బానిసకొక బానిసగా మార్చబడ్డారు.
(అలా విపరీతమైన అంతర్గత ఒత్తిడికి గురైన హిందూ సమాజం. అగ్రెసివ్ నెస్ ను పొంది శాంతి, పరిత్యాగాలను బోధించే బౌద్ధ జైనాలను ద్వేషించి వాటికి దూరంగా జరిగిందనే ఒక వాదన కలదు. అంతవరకూ సన్యాసిగా మారి అన్నీ పరిత్యజించి తపస్సు చేసుకోవటం గొప్పదిగా చెప్పబడినప్పటికీ - వార్ధక్యంలో తప్ప వయసులో ఉన్నప్పుడు సన్యసించినా వారసులను ఇవ్వకుండా ఈ ఐహిక బంధాలను పరిత్యజించినా అలాంటి వ్యక్తులను శిక్షించాలని -అర్ధ శాస్త్రంలో కౌటిల్యుడు గట్టిగా చెప్పాడు. )
ఒకప్పుడు స్త్రీలకు కూడా ఉపనయనం ఉండేది. అది CE 200 నుండి ఆగిపోయింది. వివాహ వయస్సు తగ్గించబడింది. దానివల్ల వారికి విద్యలు దూరమయ్యాయి. ఈ మూడు కారణాల వల్ల స్త్రీ యొక్క స్థానం క్రమేపీ క్రిందకు జారింది.
ఈ సందర్భంలోనే స్త్రీలకు పాతివ్ర్యత్యం గురించి; జీవితపర్యంతం పరాధీనంగా బ్రతకటమే ఆదర్శంగాను; భర్త ధూర్తుడైనా అతన్నే పూజించాలని; భర్త తనకు అనుకూలవతికాని భార్యను త్యజించవచ్చు కానీ భార్యకు ఆ హక్కు లేదని లాంటి నీతి సూత్రాలను స్మృతికారులు బోధించటం మొదలుపెట్టారు. స్త్రీ అంటే పుత్రుడను ఇచ్చే సాధనంగా మార్చివేసారు.
ఈ కాలానికే చెందిన వజ్జలగ్గలోని కొన్ని గాథలు ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో చెపుతాయి. ఈ గాథలు స్త్రీలను పురుషాధిక్యత అనే చట్రంలో బిగించటానికి సాహిత్యరూపంలో ఉన్న సామాజిక సూత్రాలు అని సులభంగానే పోల్చుకొనవచ్చును.
***
అందరూ తృప్తిగా భోంచేసాకా మిగిలినవి
ఆమె తింటుంది
సేవకులతో సహా అందరూ నిదురించాక
ఆమె నిద్రకుపక్రమించి
అందరికన్నా ముందరగా నిద్రలేస్తుంది
ఆమె ఇంటి ఇల్లాలు కాదు ఆ గృహ లక్ష్మి (455)
.
ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు ఆ ఇల్లాలు
చేతి గాజులమ్మి తన పేద భర్తకు
గౌరవభంగం కలగకుండా చూసిందట.
ఆమె ఔదార్యానికి ఊరు ఊరంతా కన్నీరు పెట్టుకొంది. 458
.
గుణమే మిన్న అని నమ్మే పేద మగని పరువు నిలపటం కొరకు
ఆడంబరాలు, పటాటోపం ప్రదర్శించే తన పుట్టింటివారితో
గిల్లికజ్జాలు పెట్టుకొని తెగతెంపులు చేసుకొందట
ఆ ఉత్తమ ఇల్లాలు. (462)
.
పిల్లలందరూ భోజనాలు చేసాకా
మిగిలిన ఆహారపదార్ధాలను
తనకు ఆకలిగా ఉన్నప్పటికీ
ఆ ఇల్లాలు యాచకులకు బిక్షంగా వేస్తోంది
కుటుంబగౌరవం నిలబెట్టటం కొరకు (461)
***
చక్కగా చూర్ణం చేసి సరైన పాళ్ళలో కలిపి
సిరా తయారు చేయటం నీకు రాదు,
లేఖినిని సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు, తప్పులు రాస్తున్నావు
మూర్ఖుడా! నీవు ప్రజ్ఞకలిగిన లిపికారుడవు కాదు
అందమైన పత్రాలను పాడుచేసేలా ఉన్నావు
నీవింక దయచేయి. (508)
ఒకప్పుడు లేఖకులు ఊరూరా తిరుగుతూ ఊరి పండితుల వద్ద ఉండే వివిధ గ్రంధాలకు పుత్రికలను పుట్టిస్తూ (నకళ్ళు తీయటం) జీవనం సాగించేవారు. రామాయణ భారతాదులకు నకళ్ళుతీయించి పంచిపెట్టటం ఒక పుణ్యకార్యంగా ఉండేది అప్పట్లో. అలాంటి లేఖన పని సరిగ్గా చేతకాని ఒక లేఖకుని గురించి పైగాథ తెలుపుతుంది.
ధార్మిక కావ్యాల నకళ్ళు తీయించటానికి అవసరమయ్యే తాళపత్రాల కొరకు ఊరిలో తాటి వనాలను పెంచి ఆలయాలకు దానంగా ఇచ్చినట్లు పలు శాసనాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు: విమలపాత్రుడు అనే దాత CE 1433 లో నాలుగు లక్షల అరవై వేల తాళ్ళను నాటించి ఆ సందర్భముగా పిఠాపురం కుంతీమాథవ స్వామి ఆలయంలో వేయించిన ఒక శాసనంలో – ప్రజలకు బుద్దిన్ని, మతివిశేషమున్ను ధర్మమున్ను యీ తాడాకుల నే పంచాంగాలు పురాణాలు శాస్త్రాలు ధర్మకర్తలు వ్రాసి చదువంగాను//సకలధర్మాలకున్ను తాంటి వృక్షమే మూలము…. అని ఉన్నది.
.
జ్యోతిష్కుడు బలపాన్ని చేత ధరించి
నగరవీధుల్లో సంచరిస్తున్నాడు,
అతనికి గ్రహగతులన్నీ తెలుసు
ఎవరైనా తమ గ్రహచారం అడిగితే
అతను లెక్కించి చెబుతాడు. (497)
వేదకాండలకు శుభ ముహూర్తములు నిర్ణయించేందుకు వేదాలకు ఉపాంగంగా జ్యోతిష్యశాస్త్రం ఏర్పడింది. వరాహమిహిరుడు, ఆర్యభట్టారకుడు, పరాశరుడు, కల్యాణవర్మ లాంటి వారు ఖగోళశాస్త్ర పరిశీలనలను జ్యోతిష్యశాస్త్రానికి అన్వయించి ఈ రంగాన్ని తీర్చిదిద్దారు.
ఈ జ్యోతిష్యశాస్త్రం హిందూ సమాజాన్ని సంపూర్ణంగా శాసించిందనే చెప్పాలి. రాజుల స్థాయిలో యజ్ఞయాగాదులకు, యుద్ధాలకు, మంచి చెడ్డలకు ముహుర్తాలు, శాంతులు నిర్ణయించటమే కాక సామాన్యుల జీవితాలలోకి కూడా జ్యోతిష్యం ఏ మేరకు చొచ్చుకుపోయిందో పై గాథ తెలియచేస్తుంది. నగరవీధుల్లో జ్యోతిష్యం ఒక అంగడి సరుకుగా ఉంటూ ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసి ఉంటుందో! ఎంతమందికి ఉపాధి కల్పించి ఉంటుందో ఊహింపశక్యం కాదు.
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

Sunday, August 8, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 3

 వజ్జలగ్గ – గాథలు పార్ట్ 3

.
(వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు)
***
వింధ్యపర్వతాలు, తూర్పుకనుమలు ప్రాకృతగాథల భౌగోళిక సరిహద్దులుగా ఉన్నాయి. అక్కడి అరణ్యాలలో జీవించే పుళిందుల ప్రస్తావనలు అనేక గాథలలో విస్తారంగా కనిపిస్తాయి. వేటాడి సేకరించిన జంతువుల చర్మాలు, ఏనుగు దంతాలను ఈ పుళిందులు పట్టణం నుంచి వచ్చే వ్యాపారులకు విక్రయించేవారని కొన్ని గాథలద్వారా తెలుస్తుంది. ప్రాకృత గాథలలో ఈ పుళిందులు కారుమేఘాలను చూసి ఏనుగుల మంద అని సంబరపడేవారిగాను, ముత్యాలను కాదని గవ్వలను ఎంచుకొనే కల్లకపటం లేనివారిగాను కనిపిస్తారు. "వేటగాడు అతని కొత్తపెండ్లాము" అనే Motif లో (వివిధ గాథల మూలాంశం) అకలుషిత ప్రేమ, శృంగారేచ్ఛ అపురూపంగా వ్యక్తీకరింపబడుతుంది.
.
వింటిని చెక్కగా వచ్చిన పేళ్ళు
గాలికి సుడులు తిరుగుతూ
పైకి లేచిన దృశ్యం విజయపతాకంలా
ఆ వేటగాని భార్యకు పట్టిన అదృష్టాన్ని
అందరకూ చాటుతోంది. (207)
.
పై గాథ హాల విరచితం గా సప్తశతి లో కూడా ఉన్నది. కొత్తగా పెళ్ళయిన వేటగాడు భార్యతో మిక్కిలి అన్యోన్యంగా ఉన్నాడని చెప్పటానికి, రోజూ అతను తన బరువైన విల్లును (అంతబరువు మోయలేక) చెక్కి చెక్కి సన్నగా తేలికగా చేసుకొంటున్నాడు అనే సాదృశ్యం అనేక గాథలలో కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు బరువైన విల్లును ధరించి పులులు ఏనుగులను వేటాడిన ఆ వేటగాడు భార్యతో సరసాలలో మునిగిపోయి బరువైన విల్లును మోసే సత్తువను కూడా కోల్పోయడని అనటంలో వ్యంగ్యం కన్నా వారి అన్యోన్యతే ఎక్కువ ప్రతిబింబిస్తుంది.
.
సవతులంతా ఏనుగు కుంభస్థలాలలో
దొరికే ముత్యాలతో అల్లిన హారాలను ధరించగా
వేటగాని పడుచుభార్య నెమలి ఈకలు ధరించి
వారి మధ్య గర్వంగా నడుస్తోంది. (212)
.
ఇదే గాథ హాల సప్తశతిలో పొట్టిస అనే కవి పేరిట ఉంది. ఏనుగు కుంభస్థలాలోని ముత్యాలను (ఒకరకమైన గుండ్రని సున్నపు నిర్మాణాలు) సంపాదించటం వీరత్వానికి చిహ్నం. ఆ వేటగాడు ఏన్నో ఏనుగులను చంపి వాటినుంచి సేకరించిన ముత్యాలతో హారాలు అల్లి పాత భార్యలకు బహూకరించి ఉంటాడు. ఇక పడుచుదైన కొత్త భార్య భర్తను కొంగున కట్టేసుకొంది. భర్త వేటకు వెళ్ళటమే లేదు. ఏనుగుల వధా లేదు, ముత్యాల హారాలు లేవు. ఆమెకు దక్కుతున్నవి నెమలి ఈకలు మాత్రమే. అలా భర్త తన చుట్టూ తిరుగుతూ ఉండటం తన ఆడతనానికి దక్కిన గౌరవంగా గర్వంగా భావిస్తూ నెమలి ఈకలు మాత్రమే ధరించి సవతుల మధ్య తిరుగుతోన్నదట ఆ పడుచు పుళింద స్త్రీ.
.
ఆడ ఏనుగుల మంద
వేటగాని భార్య వక్షోజాలతో
“మీ దయ వల్ల మాకు వైధవ్యం సంక్రమించటం లేదు.
మీ కివే మా వందనాలు” అన్నది. (211)
ఒక సప్తశతి గాథలో - పుట్టింటికి వెళ్ళి తిరిగి వస్తూన్నపుడు దారిపొడవునా కానుగ చెట్ల ఆకులకు అంటుకొని ఉన్న మత్తగజాల మదజలాలను గమనించి- తన భర్త మరణాన్ని ముందే ఊహించిందట ఒక వేటగాని భార్య. వీరుడైన తన భర్త బ్రతికి ఉంటే ఏనుగులు అంత విశృంఖలంగా సంచరించగలిగేవి కావు అని ఆమె విశ్వాసం. ఒక స్త్రీ తన భర్త వీరత్వంపై ఉంచిన నమ్మకానికి ఉదాత్త వ్యక్తీకరణ ఇది. దాదాపు అలాంటి భావనే వజ్జలగ్గ పై గాథలో కూడా కనిపిస్తుంది.
.
అనేక ప్రాకృత గాథలలో జింకలను వేటాడే వేటగాని వర్ణనలు ఉంటాయి. వీటి ద్వారా అన్యోన్య దాంపత్యం, కరుణ, ప్రేమ వంటి భావాలనెన్నింటినో పలికించారు ప్రాచీన గాథాకారులు.
ఒక గాథలో కొత్తగా పెళ్ళయిన వేటగాడు జింకల జంటపై బాణం గురిపెట్టి భార్య గుర్తుకు రాగా బాణాన్ని క్రిందకు దించివేసాడనటంలో ఉదాత్తగుణం ఆనాటి కుటుంబ అనుబంధాలలోని ఆర్థ్రతను ఇన్ని వందల సంవత్సరాల తరువాతకూడా తడితడిగా ప్రకటిస్తుంది.
ఈ క్రింది గాథలో వేటగాడు మగజింకను బాణంతో కొట్టాడు. ఆడ జింకపై సంధించటానికి మరొక బాణం తీస్తుంటే, ఆడజింక అన్న మాటలట ఇవి.
.
ఓ వేటగాడా!
ఒక బాణం సరిపోతుంది కదా
ఎందుకు పొదిలోంచి మరొకటి తీస్తున్నావు
మా ఇరుదేహాలలో ఉండేది ఒకే ప్రాణం (217)
***
బాణం తగిలిన వృద్ధ హరిణం
భుజాలు ఎగవేస్తూ ఇలా అంటోంది
“గానం ఆపకు... పాడు
గొంతులో జీవం ఉన్నంతవరకూ
పాడుతూనే ఉండు” (218)
.
నిండైన జీవితాన్ని చూసి పండిపోయిన ఒక జింక చావును ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఎన్ని కష్టాలొచ్చినా గానం ఆగకూడదు, పాట కొనసాగాలి అనటం ఒక జీవితాదర్శంగా చెపుతున్నాడు గాథాకారుడు.
*
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

Thursday, August 5, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 2

 వజ్జలగ్గ – గాథలు పార్ట్ 2

.
(వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు)
***
హరప్ప ముద్రలపై (Seal) ఏనుగు బొమ్మలుండటాన్ని బట్టి అయిదువేల ఏండ్లక్రితం నుంచే మనపూర్వీకులకు ఏనుగులతో సాహచర్యం ఉందని ఊహించవచ్చు.
రుగ్వేదంలో ఏనుగు "మృగ హస్తిన్" (చేయికలిగిన జంతువు) అని చెప్పబడింది. . మహాభారత యుద్ధంలో ఏనుగుల ప్రస్తావన కలదు. అలగ్జాండర్ యుద్ధ ఏనుగును చూసి హడిలిపోయాడని ఒక కథనం ఉంది.
ఏనుగులను మచ్చికచేయటం, వాటిని వివిధ అవసరాలకు వాడుకోవటం రాజుకు మాత్రమే ఉండే హక్కుగాను, ఏనుగుని ఇతరులెవరైనా మచ్చికచేసిన, చంపినా మరణదండన అని కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ( BCE రెండో శతాబ్దం) చెప్పబడింది. ఏనుగులపై మోనోపలి రాజ్యానికి మాత్రమే పరిమితం చేయటం రాజ్య సంరక్షణ వ్యూహంగా అనుకోవాలి.
ఏనుగులను పట్టుకోవటం, శిక్షణ, సంరక్షణ, వాటి పోషణ చూసే అధికారిని హస్త్యాధ్యక్ష అంటారని అతని విధులు, బాధ్యతలు గురించి ఒక అధ్యాయమే కలదు కౌటిల్యుని అర్ధశాస్త్రంలో.
పైవన్నీ ఒకపార్శ్వం కాగా - అడవిలో స్వేచ్ఛగా సంచరించే ఏనుగులను బంధించి వాటిని వివిధ రకాల యాతనలకు గురిచేసి శిక్షణ ఇవ్వటాన్ని ఎవరో ఓ ప్రాచీన గాథాకారుడు నిశితంగా పరిశీలించి ఉంటాడు. ఆ సందర్భాలను ఉద్వేగభరిత గాథలుగా పోతపోయటం మరో పార్శ్వం….. ఆ పని ఒక్క సాహిత్యం మాత్రమే చేయగలదు
.
సరస్సులో జలకాలాడుతున్నప్పుడు
తొండంతో సుతారంగా తెంపిన తామరతూడుతో
ఆడ ఏనుగు తనను మెత్తగా తట్టటం
శృంఖలాలతో బంధించబడిన ఏనుగుకు ఇంకా గుర్తు (191)
.
ఓ గజరాజమా!
నీవు స్వేచ్ఛగా ఉన్నప్పుడు తినిన
గంధపు చెట్ల ఆకుల గురించి ఆలోచిస్తూ చింతించకు.
నీ యజమాని ఇప్పుడు అందించిన ఎండుగడ్డిని అంగీకరించు
ఉన్నతులు విధి వైపరీత్యాలను
తమను తాము మెరుగుపరచుకోవటానికి వాడుకొంటారు. (192)
.
విపరీతమైన ఆకలి బాధిస్తున్నప్పటికీ
దూరమైన తన తోడు గుర్తుకు రావటంతో
తొండం చివర పచ్చని తామరతూడులు
అలా నిశ్చలంగా నిలిచిపోయాయి (196)
ఏనుగులు సమూహజీవులు. వాటి మధ్య అనుబంధాలు ఉంటాయి. ఏనుగులు ఒకదానినొకటి గుర్తించుకొని సహానుభూతి ప్రకటించుకొంటాయి. ఒక సారి జంటకడితే మరణంలో తప్ప విడిపోవు. ఒకదానిపట్ల మరొకటి నిబద్దులై ఉంటాయి. వాటి అన్యోన్యత పైగాథలలో అద్భుతంగా ఒదిగిపోయింది. 196 వ గాథలో దూరమైన తన జోడు జ్ఞాపకం రాగా తిండి సయించటం లేదు అనే మాట ఎంత గొప్పగా చెప్పాడా ప్రాచీన కవి.
***
.
ఓ హంసరాజమా!
స్వర్ణపద్మాలు, మంచిముత్యాలతో నిండిన
పవిత్ర మానససరోవరాన్ని విడిచిపెట్టి
ఊరికాలువలో వసిస్తూన్నందుకు
సిగ్గుతో నీవింకా చచ్చిపోలేదేమి? (261)
పై గాథకు ఒక చాటువు ఆధారం.
మానససరోవరం నుంచి వచ్చి ఊరి చెరువుగట్టుపై వాలిన ఒక హంసను అక్కడి లోకల్ కొంగలు “ఎవరు నీవు, ఎక్కడనుంచి వచ్చావు?” అని ప్రశ్నించగా “నన్ను హంస అంటారు నేను స్వర్ణపద్మాలు, మంచిముత్యాలతో నిండి, దేవతలు స్నానించే పవిత్ర మానససరోవరం నుంచి వచ్చాను” అన్నదట. దానికి ఆ లోకల్ కొంగలు “అక్కడ నత్తలుంటాయా” అని ప్రశ్నించగా “నత్తలంటే ఏమిటి” అని విస్తుపోయి ఎదురుప్రశ్నించిందట ఆ మానససరోవరపు హంస. ఆ ప్రశ్నకు “నత్తలంటే తెలీదా” అని పకపక నవ్వాయట లోకల్ కొంగలు.
పై చాటువులో పారలౌకిక విషయాలు గొప్పవనీ ప్రాపంచిక విషయాలు అల్పమైనవనే వెటకారపు భావన ఉంది. ఇదే చాటువుని కొనసాగిస్తూ చాన్నాళ్లక్రితం నేను వ్రాసిన “ఆ తరువాత ఏమైందంటే…” అనే కవితను ఇలా ముగించాను.
//కొన్నాళ్లకు
అమృతజలాలు లభించక
నత్తల్నెలా పగలగొట్టుకొని తినాలో తెలియక
మానససరోవరపు కొంగ కృశించి కృశించి
ఆ చెరువు గట్టునే చచ్చిపోయింది. (“ఆ తరువాత ఏమైందంటే…” వెలుతురు తెర- 2016)
వజ్జలగ్గలోని 261 వ గాథ పై చాటువును స్పృశిస్తూ చక్కని లోతైన కోణాన్ని దర్శింపచేస్తుంది.
ప్రాకృతభాష స్థానీయమైనది. (లోకల్ కొంగల భాష). సంస్కృతభాష పండితులది. బౌద్ధ, జైన మతాల భాష ప్రాకృతం కాగా సంస్కృతం హిందూమత భాష. బౌద్ధ జైనాలు మోక్షం, కర్మకాండలు లాంటి పారలౌకిక విషయాలను అంగీకరించవు. మానససరోవరం, దేవతలు స్నానం చేయటం లాంటి అలౌకిక విషయాలవెనుక ఉండే కాల్పనికతను పై ప్రాకృత గాథలో “నీవింకా చచ్చిపోలేదేమి” అంటూ కత్తివాదర లాంటి వ్యంగ్యంతో ఖండించాడా ప్రాకృత జైన గాథాకారుడు.
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

Tuesday, August 3, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 1

 వజ్జలగ్గ – గాథలు పార్ట్ 1

.
వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. వజ్జలగ్గలోని భాష శ్వేతాంబర జైనులు వాడే మహారాష్ట్ర ప్రాకృతము. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు అందుకే వజ్జలగ్గ కు జయవల్లభమనే పేరు కూడా ఉంది. జయవల్లభుడు మొదటగా 700 గాథలను సేకరించి వాటిని 48 విభాగాలుగా వర్గీకరించి వజ్జలగ్గగా కూర్చాడు. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే ధర్మ, అర్ధ, కామ అనే త్రివర్గాల ఆధారంగా ఈ విభజన ఉంటుందని జయవల్లభుడే ఒక గాథలో చెప్పాడు. ఇది జైన రచన కనుక మోక్షం అనే భావన లేకపోవటం గమనార్హం.
.
ధర్మ అంటే కర్తవ్యము, నైతికత; అర్ద అంటే ప్రాపంచిక విజయాలు; కామ అంటే ఐహిక సుఖాలు. వజ్జలగ్గ తొలికూర్పులో ధర్మ అనే అధ్యాయంలో 63 గాథలు, అర్ధ పేరుగల అధ్యాయంలో 347 గాథలు, కామ ప్రకరణంలో 342 గాథలు ఉండేవి. కాలానుగుణంగా అనేక గాథలు వచ్చి చేరటం తో మొత్తం 95 విభాగాలుగా 990 గాథలుగా వజ్జలగ్గ విస్తరించింది. హాలుని గాథాసప్తశతి, గౌడవహ, గాథాకోశ లాంటి ప్రాకృత రచనలలోని అనేక గాథలు వజ్జలగ్గలో పునరుక్తం అయ్యాయి.
.
వజ్జలగ్గలోని గాథలకు హాలుని సప్తశతిలోని గాథలకున్నంత ప్రాచుర్యం రాలేదు. అయినప్పటికీ కొన్ని వజ్జలగ్గ గాథలను ఆనందవర్ధనుడు, మమ్మటుడు వంటి ఆలంకారికులు తమ శాస్త్రాలలో ఉదాహరణలుగా ప్రస్తావించారు.
వజ్జలగ్గ కావ్యానికి 1969 లో Prof. M.V. Patwardhan ఇంగ్లీషు అనువాదం వెలువరించారు. ఈ క్రింది గాథల అనువాదాలు పై పుస్తకం నుంచి చేసినవే.
***
మంచి వ్యక్తికి కోపంరాదు,
వచ్చినా మనసులో చెడు తలపులు పెట్టుకోడు
పెట్టుకొన్నా వాటిని ఎన్నడూ వ్యక్తం చేయడు
ఒకవేళ చేసినా, ఆ పనికి సిగ్గుపడిపోతాడు (34)
.
పై గాథలో సజ్జనుడు ఎలా జీవిస్తాడనే విషయాన్ని చెపుతున్నాడా ప్రాచీన గాథాకారుడు. తమిళకవి తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురల్ కావ్యం భారతదేశానికి సంబంధించి నైతిక నియమావళిని చెప్పే ప్రాచీన రచనగా గుర్తిస్తున్నారు. ( ఇతను CE 5వ శతాబ్దం/ BCE 3వ శతాబ్దం అని రెండు భిన్నమైన వాదనలు కలవు). తిరువళ్ళువర్ ఒక జైన పండితుడు. తిరుక్కురల్ కావ్యంలో కూడా వజ్జలగ్గ లో లానే ధర్మ, అర్ధ, కామ అనే విభాగాలు ఉంటూ కొంతమేరకు భావసారూప్యం కలిగి ఉంటుంది.
.
దక్షిణభారతదేశంలో జైనులతోపాటు వారి రచనలు కూడా చాలామట్టుకు అదృశ్యమైనాయి. తమిళులు మాత్రం జైనులను కొర్రువేసి నిర్మూలించినా వారి రచనలను నేటికీ నిలుపుకొని (సంగం సాహిత్యం) తమది అతి ప్రాచీన సంస్కృతిగా ప్రచారించుకొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశ ప్రాచీన సంస్కృతి నిర్మాణంలో జైన పండితుల పాత్ర, ప్రాకృతభాష సృష్టించిన సాహిత్యం రెండూ అతి ముఖ్యమైనవి.
***
దారిద్ర్యమా!
నీవల్ల కలిగే కష్టాలను, ఇక్కట్లను
ఆత్మగౌరవం కలిగినవారు సాధారణంగా
బయటపడనీయరు.
బంధువులు వచ్చినప్పుడో పండుగ రోజునో
విపత్తు సమయాలలోనో
అవే బయటపడిపోతుంటాయి. (138)
***
దారిద్ర్యమా!
నీకు వందనాలు.
నీవు చేసిన మేలు వలన
నేను ఎవరికీ కనిపించకపోయినా
అందరూ నాకు కనిపిస్తున్నారు (140)
పై రెండుగాథలలో పేదరికం అనాదిగా మానవులకు ఎన్నెన్ని పాఠాలు నేర్పుతోందో కదా అనిపించకమానదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనచుట్టూ ఉన్నవారి నిజస్వరూపాలు మనకు తెలుస్తాయి అనే మాట ఎప్పటిదీ?
***
కాళ్ళకు అడ్డంపడుతున్న తన పేగుల్ని తప్పించుకొంటూ
ఒక చేత ఖడ్గం ధరించి మరో చేత్తో
వాలిపోతున్న శిరస్సును పైకెత్తి నిలుపుకొంటూ
మీదపడే శత్రువులపై వీరుడు ప్రతిదాడి చేస్తున్నాడు (167)
***
యుద్ధభూమిలో స్పృహతప్పి పడిపోయిన
యజమాని పక్కనే నేలకొరిగిన యోధుడు
రాబందులు తనపేగుల్ని బయటకు పీకుతున్నప్పటికీ
వాటి రెక్కల కదలికలవల్ల తన స్వామి మొఖానికి గాలి తగిలి
అతనికి మెలకువ వస్తే బాగుణ్ణు అని కోరుకొంటున్నాడు (177)
.
పై రెండు గాథలలో ధర్మాచరణ వర్ణించబడుతోంది. ఆనాటి సమాజంలో ప్రతిఒక్కనికి ఒక ధర్మం నిర్ధేశించబడింది. ఆ ధర్మం ప్రకారం అతను జీవించాల్సిందే. వేరే మార్గం లేదు. గుణకర్మలను బట్టి ఈ వర్ణధర్మాలు మార్చుకోవచ్చు అంటూ పుస్తకాలలో ఉన్నప్పటికీ వాస్తవికంగా అలాంటి వెర్టికల్ మొబిలిటీ జరిగిందా అనేది అనుమానమే. 167 వగాథలో ఒక వ్యక్తి తాను చనిపోయే చివరి క్షణం వరకూ తన ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే అనే సత్యాన్ని తెలియచేస్తుంది. 177 వ గాథలో తన ప్రాణాలు పోతున్నా సరే యజమాని క్షేమాన్నే కోరుకోవాలి అంటు స్వామిభక్తిని రొమాంటిసైజ్ చేసి చెపుతున్నాడా ప్రాచీన కవి.
బొల్లోజు బాబా
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan