Wednesday, August 26, 2026

హరప్పా నుండి హిందుత్వ వరకూ

బొల్లోజు బాబా

అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వ్యవస్థాపక అధిపతి.  ఇతను హరప్పాను 1853లో సందర్శించాడు. 1872-73లో కొన్ని ట్రయల్ తవ్వకాలు నిర్వహించాడు. అక్కడ సీల్స్ (ముద్రలు), ఇతర పురావస్తువులను గమనించాడు. బ్రాహ్మీ లిపి కంటే పురాతనమైన లిపిలాంటిదేదో

ఉన్నట్లు గుర్తించాడు. 1920లలో ASI డైరెక్టర్ సర్ జాన్ మార్షల్, హరప్పా  మొహెంజోదారోల వద్ద నిర్వహించిన తవ్వకాల ద్వారా సింధు నాగరికత  చారిత్రక  ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసింది.

సింధులోయ నాగరికత (Indus Valley Civilization), హరప్పా నాగరికత అనేవి ఒకే నాగరికతను సూచించే రెండు పేర్లు. సింధులోయలో విస్తరించింది కనుక సింధులోయ నాగరికత అని సర్ జాన్ మార్షల్ పిలిచాడు. హరప్పా అనే పురాతన నగరం ఈ నాగరికతలో ప్రముఖ కేంద్రంగా ఉంది కనుక దీనిని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. హరప్పా కాక ఇంకా మొహెంజొదారో, లఖన్ జొదారో,  థోలావిరా, లోథాల్, రాఖిగఢీ, కలిబంగన్, బనవాలి సుర్కొతడ వంటి ఇతర ప్రధాన నగరాలు కూడా ఉన్నాయి. హరప్పా నాగరికతకు సంబంధించి నేటివరకూ సుమారు 2000 సైట్లను గుర్తించారు. ఇంకా చాలా చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి.

హరప్పా నాగరికతా అధ్యయనం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొనింది ఎందుకంటే ప్రపంచంలోని ప్రారంభ నాగరికతా కేంద్రాలైన ఈజిప్టు, మొసొపొటేమియ, చైనాల సరసన హరప్పా నాగరికత కూడా ఒకటి. ఇది విస్తీర్ణంలో ఈజిప్టు, మొసొపొటేమియాల కన్న పెద్దది, ఎక్కువజనాభా కలిగినది. ఇంకా చెప్పాలంటే హరప్పా నాగరికత ఆ రెండు ప్రాచీననాగరికతలకన్నా భౌగోళికంగా చాలా పెద్దది.  సుమారు పదిలక్షల చదరపు కిలోమీటర్లమేర విస్తరించి ఉండేది. ప్రధాననగరాలలో లక్షల జనాభా నివసించేవారు. ఇంతపెద్దది కనుక వివిధ భాషలు విశ్వాసాలనుకలిగి

ఉండేదని భావిస్తారు. అంటే భారతదేశ బహుళత్వం అనేది అప్పటినుంచే ఉందని అనుకోవచ్చు.

విభజనానంతరం మొహెంజొదారొ, హరప్పా నగరాలు పాకిస్తానుకు వెళిపోయినా, భారతదేశంలో పంజాబ్, హర్యానాలలో అనేక సైట్లు బయటపడి  హరప్పా నాగరికత ఏమేరకు భౌగోళికంగా విస్తరించిందో ప్రపంచానికి తెలిసింది. గగ్గర్-హక్ర నదీతీరంపై (వేదాలలో చెప్పబడిన సరస్వతి నది) అనేక సింధు గ్రామాలు విస్తరించి ఉన్నాయి కనుక ఈ నాగరికతను సింధు-సరస్వతి నాగరికతగా ఎస్.పి. గుప్తా, బి.బి. లాల్ లాంటి చరిత్రకారులు పిలిచారు.  నేడు హరప్పా సంస్కృతి ఉత్తర భారతదేశంలోనే కాక దక్షిణాన తమిళనాడు, తూర్పున బెంగాలు వరకు తదనంతరకాలంలో విస్తరించిందని గుర్తించారు.

హరప్పా  ప్రజలు ఎవరు?

మూడు విడతలుగా జరిగిన వలసల వలన భారత ఉపఖండం ఆధునిక మానవులతో (homo sapiens) జనావాసంగా మారింది. మొదటివలస- 65 వేలఏండ్లక్రితం Out of Africa వలస ద్వారా ఆఫ్రికానుంచి భారతదేశంలోకి ప్రవేశించిన మొదటిమానవులు వీరు Hunter-gatherers. రెండవ వలస - 9000-5000 ఏండ్ల క్రితం మధ్య ఇరాన్ పీఠభూమినుంచి వచ్చిన Iranian Agriculturalists. వీరు భరతఖండలోకి  వ్యవసాయాన్ని తీసుకొనివచ్చారు. మూడవ వలస- c4000-3500 సంవత్సరాల క్రితం మధ్య ఆసియా స్టెప్పీల నుండి వచ్చిన ఋగ్వేదఆర్యులు.  వీరు పశుపోషకులు.

హరప్పా నాగరికతకు చెందిన ప్రజలు ఆర్యులరాకకు ముందునుంచీ ఇక్కడ జీవిస్తున్న ఈ దేశ మÖలవాసులని, వీరు నేటి దళిత, ఆదివాసి, బహుజనులు అని ఈ క్రింది జన్యుశోధనల ద్వారా అవగతమౌతుంది.

1. హరప్పా నాగరికతకు చెందిన రాఖిగరి అనే చోట 2800-2300 BCEకి  చెందిన ఒక స్త్రీ మృతదేహం దొరికింది. దీని అవశేషాలపై జరిపిన DNA  పరీక్షలలో ఆమె జన్యువులలో మొదటి రెండవ వలసల ద్వారా వచ్చిన ఆఫ్రికా Hunter-gatherers, Iranian Agriculturalists జన్యు మూలాలు ఉన్నాయి తప్ప మూడవ వలస ద్వారా వచ్చిన ఆర్యుల జన్యువులు లేవు అని గుర్తించారు.[1]  (Cell Journal, 2019). అంటే హరప్పా ప్రజల జన్యువులు 65 వేల ఏళ్ళ క్రితం వచ్చిన మొదటి వలసదారులతోను, c9000 ఏళ్ళక్రితం వచ్చిన రెండవ వలసదారులతో మాత్రమే నిర్మితమైనవని తెలుస్తుంది. ఈ ఫలితం మరోలా చెప్పాలంటే హరప్పా ప్రజలు ఈ దేశానికి మూలవాసులు (aboriginals) అని ప్రతిపాదిస్తుంది.

2. భారతదేశ SC, ST, Brahmin సామాజిక వర్గాలలో జన్యుపరమైన వ్యత్యాసాలను Swarkar Sharma బృందం చేసిన అధ్యయనం తెలియచేసింది. ఈ అధ్యయనంద్వారా మూడవవలసలో వచ్చిన R1a1 స్టెప్పీ ఆర్యజన్యువులు బ్రాహ్మలలో ఎక్కువగాను, SC, ST ప్రజలలో తక్కువగాను అదేవిధంగా వేదపూర్వ (హరప్పా నాగరికత) H1, O జన్యువులు SC, ST ప్రజలలో ఎక్కువగాను, బ్రాహ్మలలో తక్కువగాను ఉన్నట్లు గుర్తించారు.  (టేబుల్ చూడుడు)

ఇదే తరహా జన్యు పరీక్షలు Lower Castes  (OBC) లపై కూడా జరిగాయి. Lower Castes లో మూలవాసుల H1 జన్యువు SC,ST లతో సమానంగా 20-30% వరకు ఉన్నట్లు గుర్తించారు.[2]  (Sengupta et al., Thanseem et al. (2006). మరో అధ్యయనం ప్రకారం Middle Castes (OBC)  జన్యువులు ASI (Ancestral South Indian) జన్యువులతో సుమారు 40-70% సారూప్యత చూపాయి.[3]  (Narasimhan et.al 2019, Reich et al 2009). ఇది OBCలను హరప్పా ప్రజలతో నేరుగా కలుపుతుంది.

ఈ జన్యు అధ్యయనాలన్నీ హరప్పా ప్రజలు ఈ దేశ మూలవాసులని, నేటి దళిత, ఆదివాసీ, బహుజనుల సుదూర పూర్వీకులని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి.

వివిధ దశలు

హరప్పా నాగరికత 6000-1300 BCE మధ్య మూడు దశలలో జరిగింది. (BCE, Before Common Era /క్రీస్తుపూర్వ,  CE, Common Era/ క్రీస్తుశక)

ఎ. 6000-2600 BCE మధ్య  ప్రారంభ దశ: ఈ దశలో గోధుమలు బార్లీ, పప్పుధాన్యాల వ్యవసాయం ప్రారంభమైంది. మెహర్ గఢ్ వంటి చిన్నచిన్న గ్రామాలు ఏర్పడ్డాయి.  ఇళ్ళు మట్టి ఇటుకలతో నిర్మించుకొన్నారు. సిరామిక్ వస్తువులు, చిన్నచిన్న ఆభరణాలు ఉండేవి.  సరళ సమాజం.

బి. 2600-1900 BCE మధ్య రెండవ దశ లేదా మెచ్యూర్ దశ: ఈ పరిపక్వ దశలో హరప్ప, మొహెంజోదారో, ధోలావిరా లాంటి పెద్దనగరాల నిర్మాణం, డ్రైనేజి వ్యవస్థ, గ్రిడ్ లాంటి పాటర్న్‌తో  రోడ్లు నిర్మించుకొన్నారు. నదులకు ఆనకట్టలు కట్టి నీటిని జలాశయాలలో నిలువచేసి వ్యవసాయం కొరకు వినియోగించుకొన్నారు.  మొసపటోనియా, ఈజిప్టులతో సముద్ర వ్యాపారం చేసారు.

హరప్పా సమాజం సంక్లిష్ట సమాజం. బహుశా పాలకవర్గం, వర్తకులు, కార్మికులుగా విభజన కలిగి ఉండొచ్చు.

సి. 1900-1300 BCE మధ్య క్షీణ దశ: నగరాలు క్షీణించాయి. వాణిజ్యం తగ్గిపోయింది.  నదులు ఎండిపోవటం, అనావృష్టి వల్ల వ్యవసాయం తగ్గిపోయింది. నగర సంస్కృతి కనుమరుగై గ్రామీణజీవనం పెరిగింది.

c2000 BCE లో వచ్చిన  ఈ వాతావరణ మార్పులు ఒక్క హరప్పా  నాగరికతనే కాదు యురేషియా మొత్తాన్ని ప్రభావితం చేసింది. c2000 BCE కాలంలో సరస్సులలో ఆక్సిజన్ ఐసోటోపు పరీక్షలు తీవ్రమైన కరువును సూచిస్తున్నాయి.  అదే సమయంలో Carpinus betulus [4] లాంటి ఎడారి వృక్షాలు అధికంగా పెరటం అనేది ఆనాటి వర్షాభావ పరిస్థితులను తెలుపుతుంది. సింధులోయలో నివసించిన ప్రజలు పాకిస్తాన్ మైదానాలలోకి, తూర్పుఉత్తర, దక్షిణ భారతదేశంవైపుకు చెదిరిపోయారు.

1000 BCE నాటికి భారత ఉపఖండంలోకి ఇనుము వాడకంతో  కొత్త శకం మొదలైంది.

నగరాలు, ఇళ్ళ నిర్మాణం

హరప్పా  ప్రజలు పెద్దపెద్ద నగరాలను ప్రణాళికాబద్ద విశాలమైన రోడ్లతో నిర్మించారు. హరప్పా నగరం దిక్సూచి (కార్డినల్ డైరెక్షన్) ప్రకారం నిర్మించబడింది.  తూర్పు పడమర ప్రధాన రోడ్లు, వాటిని కలుపుతూ ఉత్తర దక్షిణ అనుసంధాన రోడ్లతో నగరం మొత్తం ఒక గ్రిడ్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. హరప్పా ప్రజలకు ఖగోళశాస్త్ర అవగాహన ఉంది. కృత్తిక నక్షత్రం ఆ కాలంలో తూర్పువైపున ఉండేది.  (క్రమేపీ 72 ఏళ్ళకు ఒక డిగ్రీచొప్పున తూర్పఉత్తరం వైపు జరుగుతూ ఇప్పుడు తూర్పుకు సుమారు 52 డిగ్రీల ఉత్తరం వైపున ఉంది). ఈ నక్షత్రదిశను కాలగణన, దిక్కులను గుర్తించటానికి, నగరాల ప్లానింగ్‌కు ఆనాటి ప్రజలు ఉపయోగించుకొన్నారు.

ఇదే తరహా నగర నిర్మాణ శైలి హరప్పా పతనమైన  వెయ్యేళ్లతరువాత నిర్మించిన తక్షశిల, పాటిలిపుత్ర, ఉజ్జయిని వంటి నగరాలలో కనిపిస్తుంది.  ద్పుీజు 4వ శతాబ్దానికి చెందిన అర్థశాస్త్రంలో నగర ప్రణాళిక తూర్పు-పడమర ప్రాధాన్యంతో ఉండాలని సూచిస్తుంది.

కాల్చిన ఇటుకలు, కొన్ని చోట్ల పచ్చి ఇటుకలతో ఇళ్ళను  నిర్మించారు. ఒకేపరిమాణం కలిగిన ఇటుకలను ఉపయోగించారు.  వీరి ఇటుకలు 1:2:4 నిష్పత్తిని (ఉదా. 7ఞ 14 ఞ 28 సెం.మీ.) కొలతలతో ఉండేవి. గదులు, ఇళ్ళు, ప్రజాభవనాలకు (కోటలు?) ఇవే కొలతలు కనిపిస్తాయి. ఇళ్ళు బలమైన పునాదులు అనేక గదులతో రెండు అంతస్థులవరకు ఉండేవి. నీటి కొరకు ఇళ్ళలో బావులు ఉన్నాయి.

హరప్పానగరాలలో వేలకొలది బావులు, నీటిని నిల్వ ఉంచే చెరువులు, సామÖహిక స్నానవాటికలు (మతపరమైన?) కలవు. మురుగునీటి వ్యవస్థ అత్యుత్తమ ప్రమాణాలు కలిగిఉండి లీకేజులు కాకుండా లోపలి వైపున  జిప్సమ్ పూత ఉంది.   నీటి నిర్వహణకు వీరు ఇచ్చిన ప్రాముఖ్యత అది. ఇంటిలోపల వ్యక్తిగత స్నానగదులు, టాయిలెట్లు ఉండటం హరప్పానగరాల ప్రత్యేకత. ఇవి ఘనవ్యర్ధాలకు కాక మురుగునీటిని బయటకు పంపించే నిర్మాణాలు. ఘనవ్యర్ధాలను తొలగించటానికి బహుశా మాన్యువల్ స్కావెంజెర్స్ ఉండేవారని భావించవచ్చు.

హరప్పా ప్రజలు మతపరంగా ఆలయాలు, పిరమిడ్లు, సమాధులు లాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టలేదు. దీనికి కారణం  రాజు, సైన్యం లాంటి బలమైన కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ఉండేది కాదు అని Gregory L Possehl లాంటి చరిత్రకారులు భావించారు. నగరంలో అక్కడక్కడా ఎత్తైన ప్లాట్‌ఫార్మ్‌లు కలవు. ఇవి వరదల నుండి కాపాడే నిర్మాణాలా లేక సామÖహిక ఆచారాలు లేదా సామాజిక కార్యకలాపాల కోసం ఉద్దేశించినవా అనేది  చర్చనీయాంశం.

ఇంటిమధ్య విశాలమైన మండువ (courtyard) దాని చుట్టూ మÖడువైపులా గదులు, ఒకవైపున విశాలమైన గుమ్మంతో హరప్పా ఇళ్ళనిర్మాణం ఉంది. ఈ గుమ్మం సాధారణంగా తూర్పువైపు ఉంది.  ఇలాంటి మండువా లోగిలి ఇళ్ళు నేటికీ గ్రామాలలో చూడవచ్చు.

సముద్రవ్యాపారం అంతర్జాతీయ సంబంధాలు

హరప్పా ప్రజలు గుజరాత్‌లోని లోథాల్, ధోలోవిరా ఓడరేవులద్వారా ప్రపంచదేశాలతో సముద్రవ్యాపారం చేసారు. వీరు  ఆఫ్ఘనిస్తాన్  నుంచి ఆభరణాల తయారీకి వాడే ఇంద్రనీలమణులను (Lapis lazuli) దిగుమతి చేసుకొని వాటిని తిరిగి మొసొపొటేమియా, ఈజిప్టులకు ఎగుమతి చేసారు.

ఈజిప్టు నుంచి రాగులు, జొన్నలు దిగుమతి చేసుకొన్నారు.  ఓమన్ నుండి రాగిలోహాన్ని దిగుమతి చేసుకొన్నారు.

హరప్పా ప్రజలు గవ్వలు, విలువైన రత్నాలతో చేసిన బంగారు ఆభరణాలు, ఏనుగుదంతాలు, విలువైన పూసలు, కాటన్ వస్త్రాలు, రంగులు, ఉన్ని,  నూనెగింజలు, కలప ధాన్యాలు మొదలైనవాటిని మొసపటోనియా, ఈజిప్టు లాంటి ప్రాంతాలకు సముద్రమార్గం ద్వారా ఎగుమతి చేసేవారు. ఈజిప్షియన్ మమ్మీలపై నేడు కనిపించే Cornelian పూసలు హరప్పా ప్రజలు అందించినవే అని కొందరి అభిప్రాయం.

సుమేరియన్ నాగరికత మెసొపొటేమియా ప్రాంతంలో ప్రపంచంలోని తొలి నాగరికతలలో ఒకటి. ఇది BCE 4500-1900 మధ్య ప్రస్తుత ఇరాక్ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. సుమేరియన్లు సింధులోయనాగరికతను “మెలుహా” అని పిలుచుకొనేవారు.

మెలుహా నుండి ఆభరణాలకు ఉపయోగపడే  విలువైన ‘కర్నెలియన్ స్ఫటిక రాళ్ళు’, అధికనాణ్యత కలిగిన ‘మెస్ కలప’ ఓడలలో సుమేరియాకు ఎగుమతి అయ్యేది. హరప్పా ముద్రలు/సీళ్లు మెసొపొటేమియాలో దొరికాయి. అదే విధంగా మెసొపొటేమియన్ తూనికరాళ్ళు హరప్పన్ సైట్‌లలో కనుగొన్నారు. సుమేరియన్  పురాణ గాథలలో- మెసపొటేమియా హరప్పా నాగరికత (మెలుహా) మధ్య వాణిజ్య సంబంధాలను సంబంధించిన వివరాలు కలవు.

“మెలుహా భూమి నీ కోసం విలువైన కార్నెలియన్ రత్నాలు, మెస్ కలప, ఇంకా ఉత్తమమైన అబ్బా కలప పెద్ద పెద్ద నౌకలలో పంపించుగాక.” Enki and Ninhursag సుమేరియన్ పురాణగాథ, cBCE.. 2000. [5]

హరప్పా వ్యాపారులు ఎప్పటినుంచి మెసొపొటేమియాతో వ్యాపారం సాగిస్తున్నారో తెలియదు కానీ ద్పుీజు 4100 నాటికే వీరు ఎగుమతి చేసిన Lapis lazuli అనే ఇంద్రనీలమణులు మెసొపొటేమియా నగరమైన Tepe Gawra వద్ద లభించాయి.

మొసొపొటేనియాలో సుమేరియన్ల అనంతరం వచ్చిన  అక్కాడియన్ సామ్రాజ్య స్థాపకుడు సర్గన్ BCE 2300లో వేయించిన శాసనంలో, ఆయన రాజ్యంలోకి దూరప్రాంతాల నుండి వచ్చిన నౌకల వివరాలు కలవు.  ఆ నౌకలు వచ్చిన ప్రాంతాల జాబితాలో అత్యంత దూరంగా ఉన్న దేశంగా మెలూహా పేరు ఉన్నది.

BCE 2300 కాలానికి చెందిన ఒక అక్కడియన్ గ్రంథంలో మెలుహాకు చెందిన లూ-సున్జిదా (Lu-Sunzida) [6] అనే వ్యక్తి తన విరిగిపోయిన దంతాన్ని బాగుచేయించుకొన్నందుకు పది వెండినాణాలు చెల్లించినట్లు ఉంది.  ఇతను బహుశా హరప్పా నుంచి సుమేరియాకు వ్యాపారనిమిత్తం వచ్చిన వ్యక్తి కావొచ్చు (Medical tourism?). ఈ ఉదంతం ఆ కాలంలో ఈ రెండు ప్రాచీననాగరికతల మధ్య జరిగిన రాకపోకలను తెలియచేస్తుంది.

హరప్పా వ్యాపారులు సుమారు రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న  మొసొపొటేమియాతో అరేబియా సముద్రం ద్వారా ప్రయాణించి వ్యాపారం చేసారు.  కృత్తిక నక్షత్రం, దృవనక్షత్రం ఆధారంగా ప్రయాణాల్లో దిశల్ని గుర్తించేవారు. వీరు విదేశీవ్యాపారానికి ఉపయోగించిన నౌకలు పొడవుగా ఉండి మధ్యన కేబిన్ ను కలిగి ఉన్నట్లు మట్టిఅచ్చుల ద్వారా తెలుస్తుంది. ఇవి నేటికీ వినియోగంలో ఉన్న “హౌస్ బోట” ను పోలి ఉన్నాయి.  ఏ రకమైన నౌకా శిథిలాలు లభించలేదు.  

కంచుని తయారుచేయటానికి ఉపయోగపడే సీసము, పూసలతయారీలో

ఉపయోగపడే lapis lazuli లపై హరప్పన్‌లకు మోనోపొలి ఉండేది. వీటిని మొసపటేమియాకు, ఈజిప్టుకు ఎగుమతి చేసి బంగారము వెండి బదులుగా పొందేవారు.

వ్యాపారాల ఎగుమతి దిగుమతులకు తూనికలు ప్రధానము.  హరప్పా ప్రజలు తూనికరాళ్ళను ప్రమాణీకరించారు.  సింధుప్రాంత Rohri పర్వతాలవద్ద లభించే రాతితో ఈ తూనికరాళ్లను తయారు చేసారు. ఇవేరాళ్లు మొసొపొటేమియాలో కూడా లభించడాన్ని బట్టి తూనికల ప్రమాణీకరణలో హరప్పా ప్రజల పాత్ర అవగతమౌతుంది. హరప్పానాగరికత శిథిలమైన అనంతరం కూడా నేటికీ వారి కొలతలే కనిపిస్తాయి. అర్థశాస్త్రంలో చెప్పిన అంగుళం కొలత హరప్పాకాలం నుండి ఉన్నదే.

హరప్పా ప్రజల సామాజిక వ్యవస్థ

హరప్పానాగరికత లిపి ఇంకా కనుగొనబడని కారణంగా వారిగురించిన సామాజిక వివరాలు నేటికీ స్పష్టాస్పష్టమే. ఈ నగరాల చుట్టూ బలమైన గోడలు ఉండటాన్ని బట్టి ‘లోపలి ప్రజలు’ ‘బయట ప్రజలు’ అనే విభజన ఉండేది అని భావించాలి. హరప్పా నాగరికతకు చెందిన ప్రజలలో హెచ్చుతగ్గుల అంతస్థులు  ఉన్నవో లేవో తెలియరాదు.

వారి ప్రభుత్వం, మతవిశ్వాసాలు, భాష, పరిపాలన యుద్ధ తంత్రాలులాంటి వివరాలు పెద్దగా తెలియరావు

హరప్పా  ప్రజలు అద్భుతమైన హస్తకళలు కలిగి ఉన్నారు.  రత్నాల హారాలు, శంఖాలతో చేసిన గాజులు, జంతువులు, మానవ ఆకృతులు, పిల్లల ఆటబొమ్మలు లాంటి ఎన్నో అవశేషాలు దొరికాయి.   

హరప్పా  ప్రజలు  పత్తిని పండించారు. కాటన్ వస్త్రాలు ధరించారు. పట్టు, ఉన్నిలను ఉత్పత్తి చేసారు.

హరప్పా తవ్వకాలలో పాచికలు, చదరంగం లాంటి ఆటలకు సంబంధించిన అనేక పావులు లభించాయి. ఇవి పెద్దల కోసం రూపొందించినవి కావొచ్చు.  పిల్లల కోసం మట్టితో చేసిన అనేక ఆట బొమ్మలు దొరికాయి. ఇవన్నీ ఆనాటి సమాజంలో పిల్లల ఆటలు, పెద్దల వినోదం పట్ల ఉన్న ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తాయి.

హరప్పా ప్రజలు నేటి స్త్రీల వలె పాపిటమొదట్లో సింధూరాన్ని, చేతులకు గాజులను, మెడలో పూసల దండలను ధరించారు. హరప్పన్లు ఇరాన్‌లోని దరెస్తాన్ అనే ప్రాంతం నుండి ఈ సింధూరాన్ని దిగుమతి చేసుకొని ఉండవచ్చునని దేవ్‌దత్ పట్టనాయక్ అభిప్రాయపడ్డాడు. పురుషులు నుదురుపై బొట్టు, జబ్బలకు తాయెత్తులు లాంటివి కట్టుకొనేవారు. (Priest King)

నేడు మనం ఇంటిముందు వేసుకొనే ముగ్గుల డిజైన్లు, స్వస్తిక చిహ్నం లాంటివి అనేకం హరప్పాలో కనిపించాయి.

రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు ఉండే భంగిమతో ఒక బొమ్మ హరప్పా శిథిలాలలో దొరికింది.  ఇది భారతదేశానికి ప్రత్యేకమైన సాంస్కృతిక సంజ్ఞ.

హరప్పన్లు వ్యవసాయం చేసారు. ఋతువుల ప్రారంభం, వ్యవసాయ కాలాలను నిర్ణయించటానికి  ఖగోళపరిజ్ఞానాన్ని  ఉపయోగించుకొన్నారు.  వారు వాడిన నాగలి, నీటిపారుదల విధానాలు నేటికీ మారలేదు. ఎద్దులబండ్లు ఏ మార్పులు లేకుండా అదే నిర్మాణంతో నేటికీ కొనసాగుతున్నాయి. నాగలి చాళ్లు ఉన్న పొలం తవ్వకాలలో బయటపడింది. 

హరప్పా  నాగరికత కాలంలోనే ఈజిప్టులో పిరమిడ్లు లాంటి బృహత్ నిర్మాణాలు జరిగాయి కానీ హరప్పా ప్రజలు అలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చెయ్యలేదు కారణాలు తెలియరావు.

కొన్ని సమాధులలో శంఖం, గాజులు, మృతుల తాలూకు గిన్నెలు, ఆభరణాలు, రాగిదర్పణం లాంటివి దొరకడాన్ని బట్టి హరప్పా ప్రజలు Death rituals ని పాటించేవారని, మరణానంతర జీవితం పట్ల వారు విశ్వాసం కలిగిఉండేవారని అర్థమౌతుంది. జనాభాకు అనుగుణంగా అధికసంఖ్యలో సమాధులు లభించకపోవటాన్ని బట్టి ఈ ప్రజలు ఖననం మాత్రమే  కాక దహనసంస్కారాన్ని పాటించి ఉంటారు.

హరప్పా ప్రజల మత విశ్వాసాలు

హరప్పా ప్రజలు తమ నమ్మకాలను, ఆలోచనలను, విలువలను చిన్న చిన్న సంకేతాత్మక చిత్రాలలో నిక్షిప్తం చేసారు. వీటిని మోటిఫ్స్ అంటారు. మోటిఫ్స్ అనేవి పునరావృతమయ్యే చిహ్నాలు.  ఇవి ముద్రలు, అచ్చులు, కుండలపై డిజైన్ల రూపంలో నేడు లభిస్తున్నాయి. వీటిలో ముద్రలు, అచ్చులు “steatite”అనే రాయిపై చెక్కబడిన ఒకటి రెండు అంగుళాల చతురస్రాకారపు బిళ్ళలు. వ్యాపారులు తమ సరుకులను  మÖటలుగా కట్టి వాటిని విప్పటానికి వీలు లేకుండా  ఈ మట్టి ముద్రలను సీల్స్‌గా వేసేవారు. ఇది ఒక రకంగా దృశ్యభాష. హరప్పన్ ముద్రలలో హింస, యుద్ధబీభత్సం, స్త్రీపురుషుల శృంగార దృశ్యాలు, దంపతులు లాంటివి  కనిపించవు.

హరప్పా లిపి ఇంకా డీకోడ్ కాని కారణంగా ఆనాటి ప్రజల సంస్కృతి, ఆచారాలను, పురాణ కథనాలను అర్ధం చేసుకోవటానికి పురావస్తు తవ్వకాలో లభించే మోటిఫ్స్,  ఆటబొమ్మలు, వస్తువులు, నిర్మాణాల మాత్రమే ఆధారం. వీటిలో ముఖ్యంగా యూనికార్న్ జంతువు, మహాయోగి, వృక్షదేవత, అమ్మదేవత లాంటి చిహ్నాలు ముఖ్యమైనవి.

యూనికార్న్ ముద్ర (ఒకే కొమ్ముకలిగిన జంతువు). హరప్పా ముద్రలలో యూనికార్న్ థీమ్‌కి సంబంధించిన సీల్స్ వెయ్యికిపైగా దొరకగా ఇతర సీల్స్ ఒక్కొక్కటి వందకు లోపే దొరికాయి. యూనికార్న్‌కు అర్ధం స్పష్టంగా తెలియదు. ఇది మÖపురం లేని ఎద్దుకు, కృష్ణజింకకు మధ్యంతరంగా ఉంటుంది  ఈ మోటిఫ్ ఒక తెగ, వంశానికి లేదా ఈ ముద్రలను వేయించిన యజమానికి ప్రతీకగా భావిస్తారు. అనేక ముద్రలలో ఈ  ఏకశృంగ జీవికి ఎదురుగా ఒక పాత్ర (Manger నీటిపాత్ర లేదా సాంబ్రాణిపాత్ర) ఉండటాన్ని బట్టి దీన్ని మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ఒక మిథికల్ జీవిగా పరిగణిస్తారు. ఇలాంటి చిహ్నం తమిళ సంగంకాల (BCE 300) నాణాలపై  ఉన్నట్లు గుర్తించారు.

 ఈ యూనికార్న్ జంతువు జెబు ఎద్దుకి (humped bull మోపురము కలిగిన ఎద్దు) కళాత్మక రూపమని Gregory L Possehl అభిప్రాయపడ్డాడు. ఈ వాదనకు ఆధారంగా రెండు కొమ్ములు కలిగిన జెబు ఎద్దుల బొమ్మలు కొన్ని చూపిస్తారు. జెబు ఎద్దులకు ఎత్తైన మూపురము, గంగడోలు ఉంటాయి. వీటిని దున్నలను వినియోగించినట్లే బరువులు లాగటానికి, భూమిదున్నడానికి,  మాంసం కొరకు వినియోగించేవారు.

ఆధునిక భారతదేశంలో జెబు ఎద్దులు పవిత్రంగా భావించబడతాయి.  సంక్రాంతి కనుమపండుగరోజున ఈ ఎద్దులను అలంకరించి ఊరంతా తిప్పటం ఆచారం. గంగిరెద్దుగా, నందీశ్వరునిగా, వెంకన్నబాబుగా జెబు ఎద్దులను పూజించటం మనం హరప్పా కాలం నుంచి నిలుపుకొంటూ వచ్చిన ఒక బహుజన సంస్కృతి.

ప్రోటో-శివ:   హరప్పా ముద్రలలో అత్యంత చర్చనీయ చిహ్నాలలో ఇది ఒకటి. ఇది 3.5 సెం.మీ చతురస్రాకారపు ముద్ర. ఈ భంగిమలో ఒక వ్యక్తి ఒక వేదికపై యోగ భంగిమలో ఆసనంపై కూర్చుని ఉంటాడు. ఈ వ్యక్తి తలపై గేదె కొమ్ముల శిరస్త్రాణం ఉంది. అతని చుట్టూ ఏనుగు, ఖడ్గమృగం, పులి, గేదె వంటి జంతువులు, వేదిక కింద జింకలు ఉన్నాయి. ఆ యోగి చుట్టూ జంతువులు ఉన్నాయి కనుక అతను “పశుపతి” కావచ్చునని సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడి, ప్రొటో-శివ అని పేరుపెట్టాడు. ఆ ముద్ర స్త్రీ బొమ్మ కావొచ్చునని, తపస్సుచేసుకొనే ఋషి అని,  శిరస్త్రాణంలో గేదె కొమ్ములు ఉన్నాయి కనుక ఆ మనిషి “గేదె దేవుడు మహిష” కావొచ్చునని కొందరు ప్రతిపాదించారు.  ఇది మతపరమైన చిహ్నం అని అందరూ అంగీకరించారు.

చెట్టు దేవత: హరప్పా ప్రజలు చెట్లను గౌరవించారు. బహుశా పూజించారు. రావిచెట్లు అనేక ముద్రలలో కనిపిస్తాయి. తుమ్మ, వేపచెట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. ఒక ముద్రలో రావిచెట్టు మధ్యలో ఒక దేవత ఉండటం, దానిముందు మోకరిల్లి ప్రార్ధిస్తున్న భంగిమలో ఒక వ్యక్తి అతని వెనుక ఏడుగురు సహాయకులు, ఒకమేక నిలుచుని  ఉండటం కనిపిస్తుంది.  ఈ ఏడుగురు సప్తసింధు/ఏడునదులు, ఏడుగురు ఋషులు, సప్తమాతృకలు  లాంటి భావనలతో సంబంధం కలిగి

ఉండొచ్చు. మొత్తం దృశ్యం ఒక సామÖహిక మతక్రతువును తెలియచేస్తుంది.  (వృక్షారాధన, వృక్షదేవత బొమ్మలు చూడుడు).

రావిచెట్టు ఆ తరువాత వచ్చిన బౌద్ధమతంలో ఆరాధనీయ బోధివృక్షంగా పూజలందుకొంది. నేటికీ గ్రామాలలో రావి, వేప, తుమ్మచెట్లను పూజిస్తారు. 

మరొక ప్రముఖమైన ముద్ర కింద పులి చూస్తుండగా చెట్టుపై  దాక్కొన్న  మనిషి ముద్ర.  ఈ ముద్రకు ఆ తరువాతి కాలానికి చెందిన శివరాత్రి మహాత్య్మానికి సంబంధం చెబుతారు. ఒక వేటగాడు పులిని తప్పించుకోవటానికి ఒక చెట్టు ఎక్కుతాడు. పులి చెట్టుకిందే తచ్చాడటంతో అతను  ఆ రాత్రంతా ఆ చెట్టుమీద గడపగలసి  వస్తుంది.  నిద్రరాకుండా చెట్టు ఆకులు తెంపి కిందవేస్తుంటాడు. తెల్లారే సరికి తాను కూర్చున్నది మారేడు చెట్టని, దానిఆకులు తెంపి కింద ఒక శివలింగంపై వేసి పూజచేసినట్లు తెలుసుకొంటాడు. ఇది మహా శివరాత్రి రోజున జరగటంచే ఆ వేటగాడు శివుని అనుగ్రహం పొందాడని ఐతిహ్యం.

అమ్మదేవత: సంతానోత్పత్తి, వ్యవసాయ దిగుబడులకొరకు అమ్మదేవతలను ఆరాధించటం మానవనాగరికతలో అనాదిగా వస్తూన్న ఆచారం. పెద్ద వక్షోజాలు, విశాలమైన పిరుదులు,  ఆభరణాలు, పూల అలంకరణ వంటి లక్షణాలతో అమ్మదేవతలను గుర్తించవచ్చు.

హరప్పాలో కూడా అమ్మదేవత ఆకారాలతో ఉన్న అనేక మట్టి ముద్రలు, టెర్రకోట బొమ్మలు దొరికాయి.  

కొన్ని ముద్రలలో స్త్రీ గొప్ప శక్తులు కలిగినట్లు చిత్రించబడింది.  వృక్షంలో నిలుచుని పూజలందుకొంటున్న స్త్రీ (వృక్షదేవత?), రెండు చేతులతో పులులను  నిలువరిస్తున్న స్త్రీ, సగం పులి సగం స్త్రీ దేహంతో ఉన్న పులిదేవత (Mythical Tiger Sphynx?) లాంటి ముద్రల ద్వారా  హరప్పన్లలో అమ్మదేవతారాధన

ఉన్నట్లు నిర్ధారించారు.

హరప్పా వద్ద లభించిన అమ్మదేవతా మట్టిప్రతిమ నగలు,  శిరోజాలంకరణతో ఉంది. నేటి గ్రామదేవతారాధనకు మÖలాలు హరప్పానాగరికతో ఉన్నాయని Asco Parpola అభిప్రాయపడ్డాడు. హరప్పా అమ్మదేవతా ప్రతిమకు ఆ తరువాత మౌర్యుల కాలానికి చెంది తక్షశిల వద్ద దొరికిన అమ్మదేవతా ప్రతిమకు పోలికలు కనిపిస్తాయి. ఇదే తరహా ప్రతిమలు బౌద్ధ జైనాలలో యక్షిణి దేవతలతో సామ్యాలు ఉంటాయి. ఆ తదనంతర కాలంలో హైందవీకరణ చెందిన అమ్మదేవతలు ఆయుధాలు ధరించి ఉండటం గమనార్హం. ఈ రోజు దేశవ్యాప్తంగా కనిపించే గ్రామదేవతల సంస్కృతి  హరప్పాకు కల్చరల్ కంటిన్యూటీ. 

స్త్రీకొరకు యుద్ధం చేసుకునే ఇద్దరు వీరులు ఒక ముద్రలో కనిపిస్తారు.  నూరుకొనే రాయిపై ధాన్యం విసురుతున్న మహిళ మట్టిబొమ్మ, ఆనాటి కుటుంబంలో స్త్రీపోషించిన పాత్రను చెబుతుంది. తవ్వకాలలో లభించిన స్త్రీల అవశేషాలద్వారా వారు పురుషులకంటే తక్కువ పోషకపదార్ధాలు తీసుకొన్నట్లు గుర్తించారు. 

నీటి గేదె: అనేక ముద్రలలో కొమ్ములు కలిగిన గేదెలు /దున్నలు కనిపిస్తాయి. తవ్వకాలలో గేదె ఎముకలు లభించాయి. దేశం నలుమÖలలా గ్రామాలలో ఎక్కడైనా జాతర్లు జరిగే  దున్నలను బలి ఇవ్వటం ఆచారంగా వస్తుంది.  దీనికి మÖలాలు హరప్పా నాగరికతలో కనిపిస్తాయి. 

ఒక వ్యక్తి ఒకకాలితో దున్న తలను అణిచిపెడుతూ, బల్లెంతో తలనరకే దృశ్యంలో హరప్పా ప్రజలు బలులు ఇచ్చారనే సూచనలు ఉన్నాయి. (చూడుడు: దున్నను చంపుతున్న దృశ్యం)

హరప్పాలో దొరికిన పశువుల ఎముకలపై నరికిన గుర్తులు (Butching/slaughtering cuts) ఉన్నాయి. ఇది కూడా వారు జంతువులను బలి ఇచ్చి మాంసాన్ని తినేవారని అర్థమౌతుంది. ఈ అలవాటు నేటికీ దళిత బహుజన సమాజాల ఆహారపుటలవాట్లలో సజీవంగా ఉంది. హరప్పన్లకు వైదిక క్రతువులు యజ్ఞాలు, సంస్కృతం తెలిసినట్లు ఆధారాలు లభించలేదు.

దున్నరూపం కల ముద్రలు, దున్నలుకట్టిన బండి ఆటబొమ్మలు అనేకం లభించాయి. కొన్ని ముద్రలపై దున్నపోతుతో పోరాడుతున్న దృశ్యాలను బట్టి, అప్పట్లో  bull fight (జల్లికట్టు) వంటి పోరాటాలు ఉండేవి అనికూడా ఊహించవచ్చు. వంటపాత్రలలో దున్నమాంస అవశేషాలను డిఎనఎ పరీక్షల ద్వారా గుర్తించారు.

హరప్పా నాగరికత తవ్వకాలలో దొరికిన ఎముకలలో 50 నుంచి 60% వరకూ దున్నలు, Zebu ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు లాంటి మచ్చికచేయబడిన జంతువులకు సంబంధించినవి. వీటిలో దున్నల ఎముకలు అధికంగా ఉన్నట్లు గుర్తించడాన్ని బట్టి హరప్పా ప్రజలు పశుమాంసాన్ని ఇష్టపడేవారని భావించవచ్చు. అడవి పందులు, కుందేళ్ళు, లేళ్ళు, దుప్పులు, లాంటి అడవి జంతువుల ఎముకలు కూడా దొరికాయి. సుదూరంగా ఉన్న సముద్రపు చేపల ఆనవాళ్ళ ఆధారంగా చేపలను ఎండబెట్టి రవాణా చేసేవారని తెలుస్తుంది.

నాగారాధన: హరప్పా ప్రజలు సర్పాలను ఆరాధించేవారని కొన్ని ముద్రలద్వారా తెలుస్తుంది.  ఒక ముద్రలో ఎద్దు తల కలిగిన ప్రధాన దైవానికి ఇరువైపులా ఇద్దరు భక్తులు చేతులుజోడించి నమస్కరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి వెనుక ఒక్కో సర్పము నిలబడి వారి శిరస్సును కప్పుతూ ఉండటం గమనించవచ్చు.  మరొక ముద్రలో కూడా సర్ప ఆకృతి కనిపిస్తుంది. 

మేకలు, గొర్రెలు: వీటిని మాంసం, పాలు, ఉన్ని కొరకు హరప్పన్‌లు పెంచుకొనేవారు.  కొన్ని ముద్రలలో మెడపట్టీలు కలిగిన కుక్కబొమ్మలు కూడా  ఉన్నాయి. చేపలు, నక్షత్రాలు అనేక ముద్రలలో బాక్‌గ్రౌండ్ గా ఉన్నాయి.

హరప్పన్ ముద్రలలో ఎద్దు, ఏనుగు, ఖడ్గమృగము, పులి, గేదె, మేక, దుప్పి, మొసలి, చేప, తాబేలు, కుక్క, లేడి లాంటి జంతువులు కనిపించాయి కానీ గుర్రం మాత్రం ఎక్కడా కనిపించలేదు.  సింధులోయ నాగరికత అవశేషాలు లభించిన చోట్ల ఇంతవరకూ జరిగిన తవ్వకాలలో  గుర్రానికి సంబంధించి ఒక్క అస్థిపంజరంకానీ, ఎముకలు కానీ లభించలేదు. ఈ దృగ్విషయం  ఆర్యులు గుర్రాలపై హరప్పా అనంతరకాలంలో వచ్చారనటానికి ఆధారంగా నిలుస్తుంది.  1999లో,  NS Rajaraman, హరప్పాలో గుర్రాల ఉనికి ఋజువులు ఉన్నాయని, గుర్రం ముద్ర కూడా ఉందని పేర్కొన్నారు. కానీ, అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన ఇండాలజిస్టు Micheal Witzel, డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి సృష్టించిన  ఆ ముద్ర ఒక నకిలీ అని నిరూపించారు.[7]

కంచుతో చేసిన ఆటకత్తె విగ్రహం (Dancing girl): హరప్పా నాగరికతలో అత్యంత ఆకట్టుకొనే కళాకృతి కంచుతో చేసిన ఆటకత్తె బొమ్మ (ఇది 11 సెంటీ మీటర్ల ఎత్తు ఉంది. లాస్ట్ వాక్స్ పద్ధతి ఉపయోగించి పోతపోసిన విగ్రహం ఇది. ఇది సన్నగా నిటారుగా, తలకొద్దిగా వెనుకకు తిప్పి, మోకాలివద్ద ఒంగుని, కుడిచేయి నడుముపై, ఎడమచేయి మోకాలిపైభాగంపైన ఉంచి నగ్నంగా నిలుచుని ఉన్న యువతి బొమ్మ ఇది. మెడలో పూసల నెక్లెస్ ఉంది. ఎడమచేతికి ఇరవై ఐదు గాజులు, కుడిచేతికి నాలుగు గాజులు కలవు. జుట్టు వదులుగా ముడివేయబడి ఉంది. ఈ బొమ్మలోని యువతి బాడిలాంగ్వేజ్ గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖలక్షణాలు ఆదివాసీ జాతికి చెందినవారిని పోలి ఉన్నాయి.  ఈ బొమ్మను ఒక నృత్యభంగిమగా భావించి జాన్ మార్షల్  దీనికి Dancing girl అని పేరు పెట్టాడు. ఇంతవరకు మొత్తం రెండు ఆటకత్తెల విగ్రహాలు మాత్రమే దొరికాయి.  ఇది ఆటకత్తె బొమ్మ కాకపోవచ్చునని ఉన్నతకుటుంబానికి చెందిన స్త్రీ బొమ్మ కావొచ్చునని ఉపేందర్ సింగ్ (2008) అభిప్రాయపడ్డాడు. 

హరప్ప ప్రజలు లోహశాస్త్రంపై సాధించిన ప్రగతిని ఈ విగ్రహం ఒక సాక్ష్యం.  Dancing girl ను పోతపొయ్యటం  కొరకు ఉపయోగించిన ost wax technique ను తమిళనాడు స్థపతులు ఇంకా వాడుతూ ఉన్నారు. భుజాలవరకూ గాజులు ధరించే ఆచారం రాజస్తాన్, గుజరాత్ రబారి సంచారతెగ స్త్రీలు, రాజస్తాని మార్వారి, బంజారా స్త్రీలు, తెలుగు ప్రాంతాలలో లంబాడి స్త్రీలలో నేటికీ గమనించవచ్చు.

పూజారి రాజు (Priest King): ఇతను పూజారి కాని రాజు కానీ కాకపోవచ్చు కూడా. ఈ విగ్రహం 18 సెం.మీ ఎత్తు ఉంది. భుజంపై పువ్వుల శాలువా కప్పి  ఉంది. ఈ బొమ్మకు విశాలమైన అరమోడ్పు కళ్ళు, ఆభరణాలు తగిలించటానికి చెవుల కింద రంద్రాలు, నుదుట బొట్టు, కుడిచేతికి తాయెత్తు,  విరిగిపోయిన నిటారు ముక్కు, మీసం, గెడ్డం ఉన్నాయి.  దీనిని  పూజారి రాజు అని మార్షల్ పిలిచాడు.  ఇది అసంపూర్ణ విగ్రహం అని కొందరు భావించారు. పార్పొలా దీనిని కూర్చుని ఉన్న దేవుని విగ్రహం అని ప్రతిపాదించాడు.

పూజారిరాజు బొమ్మ హరప్పా విగ్రహాలలోకెల్లా అత్యంత నిగూఢమైనది. ఆడంబరమైన వేషధారణను బట్టి ఈ బొమ్మ  ఒక ఆధ్యాత్మికస్థాయి వ్యక్తిదా లేక పాలకుడిదా అనే చర్చజరిగింది. ఇతరముద్రలలో వలే ఇది ఏ రకమైన గాథను తెలియచేయదు.  ఒకే ఒకటి దొరికింది.  ఈ విగ్రహం ద్వారా ఆనాటి శిల్పచాతుర్యం తెలుస్తుంది తప్ప మరేరకమైన వివరాలు లభించవు.

***

జాన్ మార్షల్ తన తవ్వకాలలో లభించిన లింగ, యోని ఆకారాల కొన్ని శిల్పాలను చూపి హరప్పా  ప్రజలు లింగారాధకులు అని ప్రతిపాదించాడు.8  వీటికి సంబంధించిన మరేవిధమైన ఇతర సమాంతర ఆధారాలు లభించకపోవటంతో ఆ తదుపరి చరిత్రకారులు ఈ ఊహను తిరస్కరించారు.

హరప్పా సంస్కృతి వ్యాప్తి-  కొనసాగింపు

హరప్పా నాగరికత 1900-1300 BCE మధ్య క్షీణించటానికి పర్యావరణ మార్పులు ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆర్యులు వీరిపై దండయాత్రచేసి సామÖహిక హననం జరిపారనటానికి ఏ విధమైన పురావస్తు ఆధారాలు లభించలేదు.  అప్పటికే వాణిజ్యం తగ్గి వనరులు క్షీణించి  కరువుకాటకాలతో  క్షీణదశలో ఉన్న హరప్పా  ప్రజలను, భరతఖండంలోకి  ప్రవేశించిన ఆర్యులు స్థానిక ఘర్షణలతో చెల్లాచెదురు చేసి ఉండొచ్చు అని చరిత్రకారుల ఆధునిక అవగాహన.

హరప్పా నాగరికత క్షీణించిన అనంతరం ఆ ప్రజలు నగరాలను వదిలేసి తూర్పువైపు గుజరాత్,  రాజస్థాన్, హర్యానా, పంజాబ్, గంగా బేసిన్ ప్రాంతాలకు, మరికొంతమంది  దక్షిణభారతదేశానికి తరలిపోయారు.  

తమిళనాడులో కీళడి వద్ద జరిపిన తవ్వకాలలో BCE ఆరోశతాబ్దానికి చెందిన ఒక పట్టణ నాగరికత బయటపడింది. ఇక్కడలభించిన కొన్ని కుండపెంకులపై హరప్పాలిపిలోని కొన్ని గుర్తులను పోలిన సంజ్ఞలు ఉన్నాయి. ప్రముఖ ఇండాలజిస్ట్ ఆర్. బాలకృష్ణన్ కీళడి-హరప్ప నాగరికతల మధ్య సామ్యాలను గుర్తించాడు.

2006లో సెంబియన్-కండియార్‌లో నాలుగు హరప్పా లిపి గుర్తులు లభించాయి, ఇవి BCE 1500కి చెందినవి. వీటిని ఎపిగ్రాఫిస్ట్ ఇరవతం మహదేవన్ హరప్పా-ద్రావిడ సంబంధానికి ముఖ్యమైన ఆధారాలుగా పేర్కొన్నాడు. అడిచనల్లూర్, కొర్కై వంటి సైట్‌లలో కుండలు, పూసలు వంటి వస్తువులు హరప్పా శైలితో పోలికలు కలిగి ఉన్నాయి.  హరప్పా పతనానంతరం అక్కడి ప్రజలు తమిళనాడు వలస వచ్చారని  తమిళనాడు చరిత్రకారులు బలమైన సాక్ష్యాలను చూపుతున్నారు.  అంతేకాదు BCE 3345 నాటికే కీళడిలో ఇనుము తయారీ ఆనవాళ్ళు లభించాయని కె.అమర్‌నాథ్ రామకృష్ణ ప్రతిపాదించారు. ఈ అంశం భారతదేశ చరిత్ర గమనాన్ని మార్చేంత కీలకమైనది.

హరప్పాస్త్రీలు గాజులు ధరించారు, పాపిటిలో సింధూరం పెట్టుకొన్నారు,  సిగలో పూలు ధరించారు, మెడలో హారాలు వేసుకొన్నారు, నల్లపూసలు ధరించారు. తిరగలిపై పిండివిసిరారు, మట్టిపొయ్యలపై బహుశా చపాతీలు  చేసారు,  కవ్వంతో మజ్జిగ చిలికారు, ఆటబొమ్మలతో పిల్లలను సాకారు, ఇంటిముందు అందమైన ముగ్గులు వేసారు, అమ్మదేవతలను కొలిచారు, చెట్లను సర్పాలను ఆరాధించారు, పూజారి రాజు ప్రతిమలో దేహంపై చుట్టబడి ఉండే వస్త్రం  నేటి స్త్రీలు ధరించే చీరకు పూర్వరూపంగా కొందరు చెబుతారు - ఈరోజు మనం దేనినైతే భారతీయ సంస్కృతి అని పిలుస్తున్నామో దానిని హరప్పన్ స్త్రీలు నిర్మించారని  ప్రముఖ మైథాలజిస్ట్ దేవదత్ పట్టానాయక్ అంటారు.

శివుడు, దుర్గ, కృష్ణుడు, నాగపూజ లాంటి ఆరాధనలు వేదపూర్వమÖలాలు

ఉన్నాయని డి.డి. కొశాంబి అభిప్రాయపడ్డాడు.

హరప్పా నుండి హిందుత్వ వరకు

ఈ దేశంలోకి ఆర్యులు రావటానికి సుమారు రెండువేల ఏళ్ళక్రితమే హరప్పన్లు ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతను నిర్మించారు. ఇది గ్రామీణ వ్యవసాయాధారిత సమాజాలు, నగరసంస్కృతి, వ్యాపారులు, వృత్తిపనివారు, కార్మికులతో కూడిన నాగరికత. హరప్పానాగరికతలో ఉత్పత్తికులాలు ప్రధానపాత్ర వహించాయి.  హరప్పాలో వ్యవసాయం, పశుపోషణ, భవననిర్మాణం, పడవలు, ఎడ్లబళ్ళు నిర్మించి వస్తువుల రవాణా చేయటం, చేపలవేట, ఇటుకలు కుండల తయారీ,  తోలు, లోహకారపని, వడ్రంగి, బుట్టల అల్లిక, సారాయి తయారీ, చేనేత పట్టు పరిశ్రమ, పూసలతయారీ, గాజులు, పింగాణివస్తువులు, ఆటవస్తువులు, డప్పులు, బూరలు, తంత్రీవాయిద్యముల తయారీ,  ఖనిజ  పరిశ్రమలు వంటి ఉత్పత్తికులాల సంస్కృతి ప్రబలంగా ఉండేది. ఉత్పత్తిదారులు హరప్పన్ సమాజ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచారు. వారి, నైపుణ్యాలు,  శ్రమ, జ్ఞానం హరప్పా నాగరికత పురోగతికి దోహదపడ్డాయి. ఈ వృత్తులను నేటికీ సమాజంలో శూద్ర, అతిశూద్రకులాలే నిర్వహిస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ గ్రామాలలో హరప్పానాటి శాస్త్ర పరిజ్ఞానమే కొనసాగింది.   

తదనంతరం వచ్చిన ఆర్యబ్రాహ్మణులు ఉత్పత్తికి కాక ఆధ్యాత్మికతకు, పారలౌకిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తమనుతాము ఉత్పత్తి కార్యకలాపాలనుంచి మినహాయించుకొని అధ్యయనం, అధ్యాపనం, యజనం లాంటి అనుత్పాదక ఆధ్యాత్మిక పనులకు  పరిమితమయ్యారు. ఇవి నిత్యజీవితానికి, వ్యవసాయానికి, వాణిజ్యానికి ఉపయోగపడే ఆచరణాత్మక ఉత్పత్తిజ్ఞానం కాదు. ఈ బౌద్ధికజ్ఞానాన్ని కూడా ఆర్యబ్రాహ్మణులు సంస్కృతంలో రాసుకొని, అది తమకు మాత్రమే సొంతం చేసుకొన్నారు.  అంతే కాక హరప్పాకాలంనుంచి ఉత్పత్తిదారులైన శూద్ర, అతిశూద్ర వర్గాలను ధర్మశాస్త్రాలద్వారా  నాలుగవ శ్రేణి మనుషులుగా నిర్వచించి, విద్యకు దూరం చేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు సేవలు చేయటమే వారి ధర్మంగా నమ్మించారు. ప్రజలలో మÖఢవిశ్వాసాలు, దైవభీతి, కర్మకాండలు, కర్మ సిద్ధాంతం వంటివి పెరిగి, హేతుబద్ధమైన ఆలోచనలు, వైజ్ఞానిక దృక్పథం క్షీణించాయి. ఈ చారిత్రక పరిణామం హరప్పన్ వారసులను దస్యులుగా, ద్విజుల ఆధ్యాత్మిక ఆధిపత్యానికి లోబడి జీవించేలా చేసింది, ముఖ్యంగా దళిత బహుజనులను.

హరప్పా నాగరికత పతనానంతరం భారతదేశంలోని గ్రామీణ దళిత,  బహుజనులు  సామాజిక ఉత్పత్తిదారులుగా ఉండటమే కాక-  వృక్ష,  జంతు, అమ్మతల్లి పూజలు, జాతరలలో బలులు లాంటి తమసాంస్కృతిక వారసత్వాన్ని  కొంతమేరకు సజీవంగా నిలుపుకొన్నారు.

***

A right-wing nationalist agenda would make us believe Dwijas alone were civilisation builders in India. But Indian civilisation began with the Harappan culture, whose inheritors are the present-day Shudras, Dalits, and Adivasis.[9] - Dr. Kancha Ilaiah

హిందుత్వ అనేది సాంస్కృతిక జాతీయవాద ఉద్యమం, ఇది హిందూ ఔన్నత్యం, సంస్కృతి, వేదాలు, పురాణాలు, భారతీయ చరిత్ర ఆధారంగా హిందువులను సాంస్కృతికంగా, రాజకీయంగా, సామాజికంగా ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా గుర్తించడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

“ఈ దేశాన్ని పితృభూమిగా, పవిత్రభూమిగా కలిగిఉన్న వ్యక్తే హిందువు” అంటూ హిందువుని నిర్వచిస్తారు సాంస్కృతిక జాతీయవాదులు. ఈ దేశంలో తరతరాలుగా నివసిస్తున్న ముస్లిములను, క్రిస్టియన్లను వేరు చేయడానికే ఈ నిర్వచనం అన్నది స్పష్టం.

హిందుత్వ సిద్ధాంతకర్తలు హైందవ మÖలాలను ఆర్యులు, వేదసంస్కృతి  నుంచి మొదలుపెడతారు. వేదాలు అత్యంత ప్రాచీనమైనవిగా, బారతీయసంస్కృతికి ఆధారంగా, ఆర్యబ్రాహ్మణులు ఈ దేశ సాంస్కృతిక నిర్మాతలుగా చెబుతారు.  అయితే ఇటీవలి జన్యుశాస్త్ర పరిశోధనలు ఆర్యులవలస సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయి.  దీనితో వారు హిందువుకు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఆర్యబ్రాహ్మణుల పితృభూమి సింధునదీ తీరమైనప్పటికి వారి  పవిత్రభూమి ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఆర్యులు మధ్య ఆసియానుంచి భరతఖండానికి వలసవచ్చిన యోధ జాతిగా అంగీకరిస్తే - ఆర్యబ్రాహ్మణుల పవిత్రభూమి Khorezm అవుతుందంటూ  కృత్రిమమేధ చాట్ జిపిటి ఇలా సమాధానం చెప్పింది.  ''Khorezm is in the  present-day Uzbekistan and Turkmenistan, which is described as the ''land of the Aryans'' (Ariana Vaychoh) and is widely regarded as the birthplace of Zoroaster (Zarathustra), the founder of Zoroastrianism. It is also associated with the composition of the Avesta (the sacred texts of Zoroastrianism) and possibly early Vedic hymns''

సావర్కర్ “హిందుత్వ” పుస్తకం రాసే కాలానికి (1923) ఆర్యులరాక  కంటే సుమారు రెండువేల సంవత్సరాల పూర్వం భారత ఉపఖండంలో  విలసిల్లిన హరప్పనాగరికత గురించి స్పష్టమైన అవగాహన లేదు కనుక హరప్పన్ల ప్రస్తావన తేలేదు.  ఆ తరువాతి హిందుత్వసిద్ధాంత రచనలలో కూడా హరప్పాప్రజల గురించి ఎవరూ పెద్దగా ప్రస్తావించలేదు. హరప్పాసంస్కృతిని హిందుత్వవాదులు హిందూ సంస్కృతిలో భాగంగా చూడలేదు.

హరప్పా ప్రజలు ఈ నేల మÖలవాసులు. ఆర్య సంస్కృతి ఆధారంగా ప్రతిపాదించిన ఈ హిందుత్వ పరిధిలో ఈ దేశమÖలవాసులైన హరప్పాప్రజల స్థానం ఎక్కడ అనేది చర్చనీయం.  హరప్పా గురించి తెలిసికూడా  వైదిక ఆర్యులే ఈ దేశనాగరికతా నిర్మాతలుగా భావించటం ప్రాచీన భారతదేశ వైవిధ్యభరిత వారసత్వాన్ని నిరాకరించటమే. 

భారతీయ సంస్కృతి వేదకాలపూర్వం హరప్పానాగరికతతో ప్రారంభమైందని, ఋగ్వేదఆర్యులు విదేశీమÖలాలు కలిగి ఉన్నారనే సత్యాలను అంగీకరించటానికి పండితులు సిద్ధంగాలేరు సరికదా` ఆర్యులు స్థానికులేనని, హరప్పానాగరికత కూడా ఆర్యులు నిర్మించినదే అని నిరూపించటానికి కొందరు హిందూ చరిత్రకారులు ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ ప్రతిపాదనలను సమర్థించే సరైన శాస్త్రీయ, జన్యుపరమైన ఆధారాలు లేక అలాంటి వాదనలు భావజాల ప్రేరణతో కూడినవని పరిగణించాల్సి వస్తుంది.

***

ఈ దేశాన్ని హిందురాజ్యంగా మార్చే ప్రయత్నంలో ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారపు అలవాట్లను ప్రజలపై బలవంతంగా అమలుచేస్తే - ఈ దేశానికి గర్వకారణమైన  మతం, భాష, సంస్కృతులలోని వైవిధ్యం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.  మైనారిటీల భద్రత, ప్రజలందరూ సమానులే అనే భావనపై ఆందోళనలు తలెత్తుతాయి. రాజ్యాంగం హామీపడ్డ సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుంది. మహిళలు, వెనుకబడిన కులాలపై ఆంక్షలు పెరుగుతాయి. రాజ్యాంగవిలువలకు, దేశసమైక్యత, సమగ్రతలకు భంగం వాటిల్లుతుంది. హిందుత్వభావజాలం దళితులు ఆదివాసీలు ఓబీసీలు మైనారిటీల చారిత్రక గుర్తింపును చెరిపివేస్తుంది.   

ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన డా. బి.ఆర్. అంబేడ్కర్ ఇలా అన్నారు-  “హిందూరాజ్యం నిజంగా ఏర్పడితే, అది ఈ దేశానికి గొప్ప విపత్తుగా పరిణమిస్తుంది.  హిందువులు ఎన్నిమాటలు చెప్పినా హిందూమతం స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వాలకు ముప్పు. ప్రజాస్వామ్యానికి హిందూయిజానికి పొసగదు.[10] ”

***

జన్యు ఆధారాలు ఎన్ని తెరలు తొలగించినా,  నేల పొరల్లో ఇంకా విచ్చుకోని ఎన్నో రహస్యాలను దాస్తున్న హరప్పా - కాలపు అద్దంలో నిలిచి ఉన్న ఒక అద్భుత దృశ్యం. ఊహల రెక్కలతో మనం ఈరోజు హరప్పా వీధులలో నడొచ్చు, మట్టి గోడలు మౌనంగా చెప్పే కథలు వినొచ్చు. వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన ఆనాటి మెట్లు ఎక్కొచ్చు,  పురాతన బావులలోకి తొంగి చూడవచ్చు,  విశాలమైన ఆనాటి స్నానపు గదులలో నిలబడవచ్చు, వారి పరిపూర్ణ జీవనశైలిని ఊహించుకోవచ్చు.

హరప్పా కేవలం ఒక శిథిల నగరం కాదు,  నిరంతర పరిశోధనలకు నిలయం. మౌనంగా ఉన్నా అది మన మÖలాలను, గత వైభవాన్ని, మన స్థానికతను, మన వైవిధ్యాన్ని సగర్వంగా ప్రకటిస్తూనే ఉంటుంది.

హరప్పా కేవలం చరిత్ర కాదు, సజీవంగా మనతో నడుస్తున్న మన వారసత్వ ప్రయాణం.

(ఈ వ్యాసం "హరప్పా నుండి నేటి వరకూ" అనే పుస్తకం నుండి- అమజాన్ లింక్ కామెంటులో కలదు)

బొల్లోజు బాబా

21/06/2025

 































Footnotes

1. An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers. Authors: Vasant Shinde, Vagheesh M. Narasimhan, Nadin Rohland. Cell October, 2019

2. Sengupta et al. (2006): published in the American Journal of Human Genetics, Thanseem et al. (2006): Published in BMC Genetics, Genetic Affinities among the Lower Castes and Tribal Groups of India: Inference from Y Chromosome and Mitochondrial DNA

3. Narasimhan et al. (2019): Published in Science, The Formation of Human Populations in South and Central Asia

Reich et al. (2009):Title: Reconstructing Indian Population History Journal: Nature

4. New Perspectives on the Harappan Culture in Light of Recent Excavations at Rakhigarhi: 2011–2017 Edited by Vasant Shinde, Pno. 15

5. The Roots of Hinduism, Asko Parpola, pn 250

6. The Ancient Indus Valley New Perspectives, JANE R. McINTOSH, pn 183

7. Scroll.in, Jun 14, 2018

8. Mohenjo-daro and the Indus civilization by Marshall, John పేట్ నం. 13

9. The India Forum, A New Civilisational Discourse for India, February 08, 2022

10. డా. అంబేడ్కర్ పాకిస్తాన్ ఒర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, పే 354



Further Reading

1. The Harappan Legacy, Michel Danino
2. Ancient Cities of the Indus, Gregory L Possehl
3. Rethinking the Indus, Edward Cork
4. The Ancient Indus, Urbanism, Economy and Society Rita P Wright
5. The Ancient Indus Valley, New Perspectives, Jane R McIntosh
6. Mohenjo-daro and the Indus Civilization, edited by John Marshal
7. The Indus Civilization, Irfan Habib
8. The Decline and Fall of the Indus Civilization, by Nayanjot Lahiri
9. The Indian origin of paternal haplogroup R1a1* substantiates the autochthonous origin of Brahmins and the caste system, Swarkar Sharma et al
10. Deciphering Indus Script, Asco Parpola
11. A New Civilisational Discourse for India, Kancha Ilaiah
12. Harappa.com
13. Ahimsa: 100 Reflections on the Harappan Civilization, Devdutt Pattanaik





Monday, July 27, 2026

కొండ యద్దమందు...



కొండ యద్దమందు...

(ప్రాచీన గాథలు పుస్తకానికి శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు రాసిన ముందుమాట.  వారికి నా ధన్యవాదములు) 


ఇంటర్నెట్ విప్లవం ఇంటింటికీ చేరుకున్నాక, సోషల్ మీడియా మన నిత్యజీవితంలో విడదీయరాని భాగం అయిపోయిన తరువాత - ఒకోసారి ప్రాణానికి విసుగ్గా ఉంటుంది. మాటలు, పాటలు, కదలని బొమ్మలు, కదిలే బొమ్మలూ వఱదలై ముంచెత్తుతుంటాయి మన ఏకాంతాన్ని. ఈ రణగొణధ్వనికాలుష్యానికి దూరంగా ఎందుకు పారిపోవని లోపలివాడు ప్రతిరోజూ నిలదీస్తున్నప్పుడు సమాధానంగా అమూల్యమైన కొందరి రచనలను స్మరించుకుంటాను నేను. ఈ నెట్టూ, ఈ సోషల్ మీడియా చెట్టు మీద వాలిన కవికోకిలలు, ఛప్పన్నారుగురు బ్లాగరులు, ఈ ఆర్కైవ్ డాట్ ఆర్గ్, ఈ వికీ సోర్సు - ఈ అందరూ, ఇవన్నీ కలిసి కదా నా హృదయాకాశాన్ని నిరంతరంగా విస్తరింపజేస్తున్నది!

నాకు బొల్లోజుబాబా గారితో ముఖపుస్తకపరిచయమే గానీ ముఖపరిచయం లేదు. ఆయనకు ఒక స్పష్టమైన సైద్ధాంతికనేపథ్యం ఉన్నది. దాంతో నాకు పెద్దగా అంగీకారమేమీ లేదు. తన సిద్ధాంతానికి అనుగుణంగా వాదనలను సమకూర్చుకునేందుకు ఆయన చేసే అధ్యయనం పట్ల మాత్రం షరతులతో కూడిన గౌరవం మాత్రం ఉన్నది. చిన్నా చితకా తప్పులను సూచించినప్పుడు నిస్సంకోచంగా అంగీకరించే ఆయన వినమ్రతా నాకు ఇష్టము. స్నేహానికి అభిప్రాయభేదాలు అడ్డం కావన్న సత్యవాక్కుకు నాకు లభించిన సాక్ష్యాలలో ఒకటి - బాబాగారితో నాకు కుదిరిన స్నేహం. ఈ పరిచయవాక్యాలు వ్రాయడానికి అదొక్కటే అర్హత కాజాలదని తెలుసును. ఒక సాధారణపాఠకుడిగా నాకు తోచింది వ్రాస్తానని - పుస్తకంలో వేసుకున్నా వేసుకోకపోయినా ఏమీ పర్వాలేదని చెప్పాక ఈ పుస్తకాన్ని చదివే పని తలకెత్తుకున్నాను.

ఏ రెండు వేల ఏళ్ళకో పైబడిన ప్రాచీనభారతీయసాహిత్యవైభవం ఈ పుస్తకపు పుటలలో మీకోసం ఎదురుచూస్తున్నది. "గాగర్ మే సాగర్ భర్నా" (గంగాళంలో సముద్రాన్ని నింపడం) వంటి ప్రయత్నం ఇది. అపురూపమైన దృశ్యచిత్రాల సంపుటం ఈ పుస్తకం. దృశ్యాలేనా? శబ్దాలు, వాసనలు, చిన్న చిన్న కదలికలు, సుదీర్ఘప్రవాసాలు, ఋతుచక్రభ్రమణాలు - ఇంద్రియగ్రాహ్యమైన ప్రపంచపు సూక్ష్మరూపం ఒదిగివున్నది ఈ పుస్తకంలో. మానధనులూ, దానశీలురూ అయిన రాజులు, వీరులు, వేటగాళ్ళు, రైతులు, సముద్రపతులుగా సంబోధించబడే నావికులూ, జాలరులూ, పర్వతరాజులూ, వనదేవతలూ, చెడుతోవలు తొక్కే మొగుళ్ళూ, వాళ్ళను చెవి మెలేసి అదుపులోకి తెచ్చుకోగల ధీరభార్యలు, జొన్నచేలలో మంచె మీదికెక్కి చిలుకలను తోలే జానపదకాంతలు, జాణలు, ముగ్ధలు, సురతానందాభివ్యక్తులు, విరహపు నిట్టూర్పులూ కన్నీళ్ళూ, ఏనుగులు, ఎద్దులు, లేళ్ళు, పావురాళ్ళు, సెలయేళ్ళూ, కలువలూ, ఆవపొలాల పక్కన చలికాచుకునేందుకు వేసిన నెగళ్ళూ - ఉన్నాయున్నాయెన్నెన్నో ఉన్నాయి. మరెన్నెన్నో ఉన్నాయి ఈ కలైడోస్కోపిక్ కవితాసంపుటంలో. నైలూ నది నాగరికతలో సామాన్యుడి జీవితమెట్టిదో చరిత్రకెక్కలేదని వాపోయిన శ్రీశ్రీ దక్షిణదేశపు సాగరతీరం నుంచి ఉత్తరదేశపు సస్యకేదారాల దాకా వ్యాపించిన జనజీవితాన్ని అక్కున చేర్చుకున్న ఈ కవిత్వాన్ని చూస్తే ఎంత మురిసిపోయేవాడో.

ఈ పుస్తకంలోని పదకొండు అధ్యాయాలలో కవిత్వానువాదం ఉన్నది. కొన్ని కవితల దిగువన చెప్పితే తప్ప తెలియనివి, అర్థబోధకు సహాయపడేవీ అయిన లఘుటిప్పణులున్నాయి. అంత కన్నా ముఖ్యంగా - ఈ పదకొండు అధ్యాయాలకూ కవి వ్రాసుకున్న వివరణలను పన్నెండవ అధ్యాయంలో పొందు పరిచారు. ఒకో అధ్యాయం చదివాక దాని తాలూకు వివరణ(ల)ను చదివితే మీ పఠనానుభవానికి కొంత ఉపయుక్తమవుతుంది. సద్యఃకవిత్వానందానికి పెద్ద పీట వేసి వివరణలను ఆ తరువాత ఇవ్వడం మంచి నిర్ణయం.

ఋతువర్ణనల అధ్యాయంలో కనబడే వాల్మీకి కాళిదాసుల పేర్లను వదిలేస్తే , ఇందులోని కవుల పేర్లేవీ తరచుగా వినబడేవి కావు. కొన్ని కవితల కర్తలెవరో తెలుసుకోగలిగే అవకాశమైనా లేదు. సంగం కవిత్వానికి, గాథాసప్తశతికి సంబంధించిన ఇంకో గమ్మత్తేంటంటే - వందలాది ఏళ్లకు పైగా ఆ యా కవుల పేర్లు భద్రంగా గుర్తుకుపెట్టుకుంటూ వస్తున్నప్పటికీ, అవన్నీ ఆ కవిత్వపు దీపం క్రింది నీడలో దృశ్యాదృశ్యంగా మిగిలిపోతాయి. కర్పూరం వెలిగి మాయమయ్యాక పరిమళం మాత్రం మిగిలినట్లు కవిత్వానుభూతి మాత్రం మిగులుతుంది. సార్వత్రికమైన భావోద్వేగాలు, వాటి ప్రగాఢత, సరళమైన అభివ్యక్తి,, ముక్తకస్వభావము ఉండడం వల్ల ఈ కవితలు పఠితలను చప్పున ఆకట్టుకుంటాయి. మన మాటల్లో మళ్ళీ చెప్పమని మనలను పురిగొల్పుతాయి కూడా.

వీటిల్లో నాకు బాగానచ్చినవి - సంగం కవిత్వంలోనుంచి ఒక 20-30 కవితలు, గాథాసప్తశతి అనువాదాలు, అమరుశతకం పద్యాలు. ఆనందంతోబాటు చాలా కుతూహలాన్ని ఆదరభావాన్ని కలిగించినవి ర్యాలు కలిగించినవి యోగేశ్వరుడి పద్యాలు.

అనువాదం బాగా పండాయని నాకనిపించిన కవితలకు రెండు ఉదాహరణలను సంగకాలకవిత్వం నుంచి చూపుతాను -



నా ఇంటి స్తంభాన్ని ఆనుకొని నిలిచి
“నీ కొడుకు ఎక్కడ” అని అడుగుతున్నావు
వాడెక్కడ ఉన్నాడో నాకు తెలియదు.

అతనికి జన్మనిచ్చిన ఈ గర్భం ఒక కొండ గుహ
పులి కొంతకాలం ఇక్కడ నివసించి వెళిపోయింది
ఎక్కడో ఏదో యుద్ధభూమిలో అతను నీకు దొరుకుతాడు

(పురనానూరు-86)


ఆరు పంక్తుల మూలకవితకు ఆరు పంక్తులలో అనువాదం కుదిరింది. ఆ తల్లి ధీరత్వం అనువాదంలో అంతే చక్కగా పలికింది.


ఒక బల్లి బండి చక్రాన్ని అంటిపెట్టుకొని
ప్రయాణించినట్లుగా
నేను అతనితో కలసి ఎన్నెన్నో దూరాలు నడిచాను.
అతన్ని అతని నేలలో నిద్రపుచ్చటానికి
ఒక కుండను
తయారు చెయ్యి కుంభకారుడా!
దయచేసి ఇద్దరు పట్టేదిగా
దాన్ని పెద్దగా తయారు చెయ్యి.
(పురనానూరు-256)


ఒక్క వ్యర్థపదమూ లేదు ఇందులో. దేశం కాని దేశానికి వచ్చిందా అమ్మాయి. ఇంకెవరూ తోడున్నట్లు లేరు. బిగబట్టిన దుఃఖాన్ని సూచించేందుకు ఈ కొన్ని మాటలు చాలు.

బాబాగారు ప్రధానంగా ఆంగ్లానువాదాల మీద ఆధారపడ్డారు కాబట్టి ఈ అనువాదాలను అనువాదాలకు అనువాదాలని చెప్పాలి. అందువల్ల కొన్ని సందర్భాలలో మూలంలో ఉండే సూక్ష్మతలు జారిపోయాయేమో అని అనిపించింది.


అమరుశతకం అధ్యాయంలోని 12వ కవిత (మూలంలో 92వ శ్లోకం) ఇలాగ ఉన్నది -


మైదానాలు నదులు అడవులు కొండలకు అవతల
తన భార్య ఎక్కడో సుదూరంగా ఉన్నదన్న సంగతి తెలిసినా ఆ బాటసారి
కాలి మునివేళ్ళపై నించుని
ఆమె నివసిస్తున్న ఊరి దిక్కుగా
కన్నీరు నిండిన కనులతో
తదేకంగా చూస్తున్నాడు.

మూలంలో "ఉద్గ్రీవః” (మెడనెత్తినవాడు) “చరణాగ్రరుద్ధవసుధః" (కాలి మునివేళ్ళతో నేలను అదిమినవాడు) అనే విశేషణాలను వాడాడు కవి. "మెడ ఎత్తి" "మునివేళ్ళతో నేలను అదిమి" అని అర్థాలు ఆ మాటలకు. ఆ "మెడ ఎత్తడం" అనువాదంలో చేరివుంటే ఆ ఉద్విగ్నత మరింత బాగా పలికేదేమో. అంతే కాదు, తెలుగులో బాటసారి తదేకంగా చూసాడు. సంస్కృతంలో పథికుడేమో “సాశ్రే దృశౌ ప్రోన్మృజ్య… ముహుర్వీక్షతే (కన్నీరు కారుతుండగా కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ – మళ్ళీ, మళ్ళీ - చూసాడు). అనువాదంలో ఆ సంగతి పడి ఉంటే బావుండేది.

అమరుశతకంలోని ఈ శ్లోకం బొమ్మ అయితే దానికి బొరుసులాంటి పదచిత్రం ఉన్న శ్లోకం ఇంకొకటి ఉన్నది - ఇంటి దగ్గర భర్త కోసం భార్య ఎదురుచూపులను కవిత్వీకరించినది (అమరుశతకం అధ్యాయంలో 8వ పద్యం). రాడు లెమ్మని నిరాశతో ఇంటివైపుగా ఒక అడుగు వేసిన ఆమె "ఏమో ఈ క్షణమే రావచ్చును కదా" అని తలతిప్పి చూస్తుంది. "అస్మిన్ క్షణే మా భూదాగతః అన్న సంస్కృతం మాటలను చాలా కరెక్టుగా పట్టుకున్నారు బాబాగారు. అయితే మూలంలో ఆ తలతిప్పి చూసిన చూపుకు "అమందవలితగ్రీవం" అనే విశేషణాన్నివాడారు కవి. చటుక్కున తల త్రిప్పి చూసిందట. ఆ ఝటితిస్ఫురణ తెలుగులో రాలేదు.

అకనానూరులోని 134వ కవిత అనువాదంలో (సంగం కవిత్వం అధ్యాయంలోని ఐదవది) చాలా ప్రూనింగుకు గురయ్యింది. గృహోన్ముఖుడైన ఒకాయన రథంపై అడవి గుండా ప్రయాణిస్తూ దారి ప్రక్కన సంగమించుకుంటున్న లేళ్ళను ఆటంకపరచకుండా నెమ్మదిగా రథాన్ని తోలమని చెప్పే కవిత - మూలంలో కవి "సకాలంలోవానలు కురిసాయి/అడవి అందగించింది/నిండుగా ఉన్న నల్లమబ్బును వెంటబెట్టుకొని వచ్చిన వర్షర్తువు నిలువనున్నది కొంతకాలం/ నీలిరంగు కాయా పువ్వులపైన ఎర్రటి మూపుగల పట్టుపురుగులు పారాడుతున్నాయి/రాలిన మల్లెలు నేలను కమ్మాయి/నేర్పరి చిత్రకారుడు రచించిన వర్ణచిత్రంలా ఉన్నది ఈ "మూలై" ప్రాంతం.." అంటూ ఎత్తుకుంటాడు కవి మూలంలో. ఈ కవితారంభంలో ఒక నెమ్మదితనం ఉన్నది. మట్టి వాసన, మల్లె వాసన, చల్లని గాలి, అడవి మసకబారుతున్న దృశ్యం... ఒక మంచిపాటకు ఆలాపన వణ్టి ఈ ఎత్తుగడ అనువాదంలో జారిపోయింది. పాఠకుడే ఆ దృశ్యాన్ని తన మనసులో నిర్మించుకోవాలని బాబా గారు అనుకున్నారేమో కానీ ఆ ధ్యానస్థితి నాబోటివాడికి అంత సులువుగా అందదు.

కురుంతోగై ఎనిమిదవ కవితను (సంగం కవిత్వం అధ్యాయంలో 39వ పద్యం) నందిని గార్గి గారి గొంతులో విన్నప్పుడు - https://nandinikarky.com/2021/01/20/kurunthogai-8-his-sons-mother/ - ఛందోబద్ధంగా అనువదిస్తే తప్ప ఆ లయా ఆ బిగువూ రావేమోనని అనిపించింది.

పంక్తిభోజనాలప్పుడు, రుచిచూడడంకోసం మొదట అన్ని పదార్థాలను కొద్దికొద్దిగా వడ్డిస్తూపోయిన విధాన బాబాగారు ఈ సంకలనంలో తనకు నచ్చిన ప్రాచీనకవిత్వాన్ని కొద్దికొద్దిగా రుచిచూపిస్తూపోయారు. చదివేస్తూ చదివేస్తూ ఎవరికి వారమే నిర్ణయించుకుంటాము - ఈ ఫలానా కవిత్వం ఇంకెక్కడ దొరుకుతుందో వెదికిపట్టుకొని మరింత చదవాలని. ఆ చవి, ఆ ఆకలి మీకు కలిగితే ఈ పుస్తకం ప్రయోజనం నెరవేరినట్లే.

భోజనం ఉపమానం ఎలాగూ వచ్చింది కాబట్టి పళ్ళెంలో వచ్చిపడ్డ "చేదు" గురించి కూడా కొద్దిగా చెప్పుకుందాము.

ఈ కవితా సంకలనపు చివరనున్న వివరణల గురించి చెబుతూ, ఒకో అధ్యాయాన్ని చదివి ఆ అధ్యాయానికి సంబంధించిన వివరణలను చదువుకొని ముందుకెళ్ళడం పఠనానుభవానికి కొంత సహాయకారి అవుతుందని అన్నాను ఇంతకు ముందు. "కొంత" అని ఎందుకు క్వాలిఫై చేసానంటే -
ఈ వెనకమాటల్లో బాబాగారిలోని కవిని కార్యకర్త డామినేట్ చేసాడు. తమిళంలోనో, ప్రాకృతంలోనో ఉన్న గొప్ప కవిత్వాన్ని చదువుకొని తన మాటల్లో చెప్పుకొని రసానుభూతిని పొందడంతో ఆగక ఒక కథనాన్ని (narrative) రూపొందించడం ఈ వివరణలలో ప్రధానంగా కనబడుతుంది. ఆ కథనం ప్రకారం -

1. ఈ కవిత్వమంతా నిమ్నవర్గాలవారి జీవితాలకు సంబంధించింది.
2. ఇదంతా జైనులూ, బౌద్ధులూ సృజించిన సాహిత్యం
3. బ్రాహ్మణులు ఈ సాహిత్యాన్ని ఉపేక్షించారు. ఇంకా చెప్పాలంటే - "తగలబెట్టి ఉంటారు"
4. ఈ సాహిత్యంలో తిరుగుబాటు ధోరణి ఉన్నది. ధిక్కారస్వరాలు వినిపిస్తాయి.
5. ఇందులో వర్ణితమైన కాలంలో, సమాజంలో పురుషాధిక్యత, వర్ణవివక్ష వంటి "సంస్కృత"వికారాలు ఉండవు.

ఇలాంటి కథనాలను నిర్మించేప్పుడు తార్కికమైన అభిప్రాయాలను, ఊహాపోహలను, పూర్వధారణలను కలగలిపి కుప్పకూర్చే ప్రమాదం ఉంటుందని, పాలూ-నీళ్ళను విడదీసి చదువుకోగల వీలు పాఠకులకందరికీ ఉండదని, ఇప్పటికే మనుషులకూ మనుషులకూ నడుమన దాటడానికి వీలు లేకుండా కట్టేసిన రాజకీయభావజాలాల అడ్డుగోడలను ఈ కథనాలు దృఢపరుస్తాయని నా నమ్మకం. ఒక బహుజనోద్యమమేధావిగా ఒక స్పష్టమైన దృక్కోణం ఉంటుంది. తదనుగుణమైన అభిప్రాయాలను వ్యక్తపరచడం ఒక అనివార్యత కూడా అయి ఉండవచ్చు.

కానీ కవిగా, అనువాదకుడిగా తాను పాఠకులకు అందించదలచుకున్న రసానుభూతికి ఈ సిద్ధాంతరాద్ధాంతాలు అడ్డుపడతాయని నేననుకుంటాను. ఒకోసారి కవి చూపునూ అడ్డుకుంటుంది ఇలాంటి ధోరణి. వజ్జాలగ్గం అధ్యాయంలోని ఈ తొమ్మిదవ కవితను చూడండి,

"ఓ హంసరాజమా!
స్వర్ణపద్మాలు, మంచిముత్యాలతో నిండిన
పవిత్ర మానససరోవరాన్ని విడిచిపెట్టి
ఊరికాలువలో వసిస్తూన్నందుకు
సిగ్గుతో నీవింకా చచ్చిపోలేదేమి?
(వజ్జాలగ్గం-261)

ఈ పద్యం చదవగానే ప్రసిద్ధమైన "ఎవ్వడవీవు కాళ్ళుమొగమెఱ్ఱన" చాటువు గుర్తుకువస్తుంది. ఆ చాటువుకు "కస్త్వం లోహితలోచనాస్యచరణో…" అనే సంస్కృతచాటువు ఆధారం. దానికి ఎదురుజవాబు ఈ వజ్జాలగ్గపు పద్యం అని బాబా గారు అభిప్రాయపడ్డారు - "పై చాటువులో పారలౌకిక విషయాలు గొప్పవనీ ప్రాపంచిక విషయాలు అల్పమైనవనే వెటకారపు భావన ఉంది...మానససరోవరం, దేవతలు స్నానం చేయటం లాంటి అలౌకిక కాల్పనిక విషయాలను వదిలి ఇక్కడ ఉంటున్నందుకు "నీవింకా చచ్చిపోలేదేమి" అంటూ కత్తివాదర లాంటి వ్యంగ్యంతో ఖండించాడా ప్రాకృత జైన గాథాకారుడు." అని చెప్పేసారు.

బాబాగారి అన్వయం సరైనది కాదేమోనని నా అభిప్రాయం. ఆ సంస్కృతశ్లోకం "పారలౌకికత" సందర్భంలో చెప్పినది అయి ఉండకపోవచ్చు. ఉదాత్తతకు ఔన్నత్యానికీ హంసను, సామాన్యతకు/అల్పత్వానికి కొంగనూ ప్రతీకగా తీసుకొని కొన్ని విషయాల విలువ సామాన్యులకు తెలియనంత మాత్రాన వాటి విలువ తగ్గదు అని చెబుతున్నాడు సంస్కృతకవి. వజ్జాలగ్గపు కవి (జినవల్లభుడు) సైతం అదే మాటను ఇంకోలా చెబుతున్నాడు. "ఏది గొప్ప" అనే విషయంలో ఇద్దరు కవులదీ ఏకాభిప్రాయమే. వజ్జాలగ్గంలో ఈ పద్యం పొందుపరచబడ్డ హంసవజ్జా విభాగంలోని ఏడు పద్యాలను చూస్తే స్పష్టమయ్యేది అదే. ఇంతా చేసి, వజ్జాలగ్గము హైందవేతరమైన శుద్ధ జైన/సెక్యులర్ కావ్యమేమీ కాదు. హిందూదేవతల ప్రస్తావన ఉన్న పద్యాలూ ఉన్నాయి.

సంస్కృతానికి దీటుగా లేదా ఒక మెట్టుకు ఎగువన ప్రాకృతాన్ని తమిళాన్ని నిలపడం ఒక తీరు. సంస్కృతంతో బాటు ప్రాకృతమూ, తమిళమూ నా ఆస్తి అని మురిసిపోగలగడము - అది వేరు. ఈ సంకలనపు పఠితలు బాబాగారు లేవనెత్తిన ప్రశ్నల గురించి నిజాయితీగా ఆలోచిస్తూనే మన ఉమ్మడి వారసత్వం పట్ల మమకారాన్ని, కవిత్వసంస్కారాన్ని నిలుపుకుంటారని ఆశిస్తాను.

తీపితో భోజనాన్ని ముగించడమే కదా మనకు పరిపాటి కదా...


రకరకాల ఒత్తిడుల మధ్య ఈ పుస్తకం చదవడానికి రెండు నెలల కన్నా ఎక్కువ సమయం పట్టీంది నాకు. మొదటగా ఒప్పుకున్నది - తప్పొప్పులు కనిపెట్టి, ఏమైనా సలహాలుంటే ఇచ్చేందుకు. ఇలాంటి సమీక్ష ఒకటి వ్రాస్తానని అనుకోలేదు. వారాల పాటు Whatsapp ద్వారా సాగిన మా చర్చలో బాబాగారు చాలా ఓపికగా ఉన్నారు. విమర్శను సహృదయంతో స్వీకరించారు. నా ఆలస్యాన్ని భరించారు. తన వాదాలను అనువాదాలను ఛాలెంజ్ చేసినప్పుడల్లా తనకు ఆధారాలను నాకు పంపించారు. ఒక అర్ధరాత్రివేళ నిద్రనాపుకుంటూ "ఎవ్వడవీవి కాళ్ళుమొగమెఱ్ఱన" పద్యానికి మూలమైన శ్లోకం కోసం వెదికాము ఇద్దరమూ. మహాసుభాషితసంగ్రహంలో తాను దాన్ని పట్టుకొని పంపినప్పుడు ఎంత సంబరపడ్డానో చెప్పలేను. ఆ ముచ్చట గురించి ఈ వ్యాసంలో వ్రాస్తానని చెబితే "కణతకి గురిపెట్టి [ఆ శ్లోకాన్ని] చూపిస్తే తప్ప [తనను] వదలలేదని రాయండి"అని సూచించారు. వారి హాస్యస్ఫూర్తికి స్నేహశీలతకు వందనం!

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే - ఈ కవిత్వాన్ని మనకు పరిచయం చేసేందుకు బాబాగారు పడ్డ శ్రమకు అనేక ఆంగ్లసంకలనకర్తలు ప్రేరణ, వారికి ఆధారం - శతాబ్దాల క్రితం తమిళప్రాకృతసంస్కృతసంకలనకర్తల పరిశ్రమ. మరెందరో అజ్ఞాతవ్యక్తుల పరిరక్షణప్రయత్నం. ఇందరు వ్యక్తులూ, ఇంత సాంకేతికతా వంతెనగా అమరగా ఇంత చక్కని కవిత్వం మనదాకా ప్రయాణించి వచ్చింది. ధన్యులము మనము.



స్వస్తి.



ఉరుపుటూరి శ్రీనివాస్
బెంగుళూరు
schary.vuruputuri@gmail.com

ఈ పుస్తకం అమజాన్ లింకు మొదటి కామెంటులో కలదు. 





Sunday, July 26, 2026

బహుజన వాదం నుంచి మనువాదం వైపు


(ప్రముఖ రచయిత శ్రీ బండి నారాయణ స్వామి రాసిన "దళితబహుజన వాదానికి కొత్త పిలుపు" అనే వ్యాసం పై నా విమర్శ ఇది. వ్యాసం లింకు మొదటి కామెంటులో కలదు.)

1. "హిందూ దళిత బహుజనులు" అనే విభజన కృత్రిమం. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, వివిధ ప్రాంతాల ప్రజల అనుభవాలు, మత విశ్వాసాలు, సంస్కృతులు ఒకేలా ఉండవు. అదే ఈ దేశ వైవిధ్యం. బలం.

2. దళిత సమస్యకు మూల కారణం కులవ్యవస్థ. కులవ్యవస్థకు మతపరమైన సమర్థన ఉన్నంతకాలం "హిందూ దళిత బహుజన" అనే భావన చెల్లదు. కులవ్యవస్థను "వృత్తిధర్మం" గా మాత్రమే చూపి, పుట్టుక ఆధారిత వ్యవస్థను తేలికగా తీసిపారేయడం చారిత్రిక వాస్తవాలను తిరస్కరించటమే.

3. ఆరె.స్సెస్‌/హిందు.త్వ దృక్పథం సామాజిక న్యాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందని వ్యాసం అంగీకరిస్తూనే మళ్ళీ అదే, హిందూ చట్రంలోకి దళితబహుజనులను తీసుకురావటం వైరుధ్యం. అవగాహన లేమి. కులవ్యవస్థను అలాగే అంగీకరించడం సమస్యను మూలంలో పరిష్కరించదు. కుల నిర్మూలనకు అవసరమైన నిర్మాణాత్మక మార్పులపై వ్యాసం స్పష్టత ఇవ్వలేదు.
4. "నాస్తికులు, మార్క్సిష్టులు మతాన్ని అధ్యయనం చేయరు, సంస్కృతిని ధ్వంసం చేస్తారు" అనే వ్యాఖ్య ఉపరితలమైనది. అతిగా ఉంది. అనేకమంది మార్క్సిస్టులు, హేతువాదులు, సామాజిక శాస్త్రవేత్తలు మతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. మంచి చెడ్డలను చర్చించారు. కోశాంబి, రామస్వామి, దేవీప్రసాద్, గ్రాంసి, డా. అంబేడ్కర్ మొదలైనవారు. మనువాదుల లక్ష్యమైన నాస్తికులను, మార్క్సిస్టులను, లౌకిక వాదులను విమర్శించటాన్ని ఈ రచయిత నిస్సిగ్గుగా తలకెత్తుకొన్నారు.

5. మతాన్ని విమర్శించడం అంటే సంస్కృతిని తిరస్కరించడం కాదు. సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేయడమూ కాదు. అది సంస్కరణలకు మార్గం. విశ్వాసాలు అనేవి కాలానుగుణంగా సంస్కరింపబడాలి. విమర్శించకుండానే సహగమనాలు, బాల్యవివాహాలు నిర్మూలించబడ్డాయా? మతాచారాలపై విమర్శ కూడా ప్రజాస్వామ్య హక్కే.

6. "హిందూ" అనే పదాన్ని దళితబహుజన రాజకీయాల కేంద్రంగా చేయడం అంబేడ్కర్ ఆలోచనలకు విరుద్డం. అంబేడ్కర్ చివరికి హిందూ మతాన్ని విడిచి బౌద్ధమతాన్ని స్వీకరించారు.
7. ముస్లింల విమర్శలకు కేవలం ఇస్లాం గ్రంథాలనే కారణంగా చూపడం ఏకపక్ష విశ్లేషణ. భారతదేశపు వెయ్యేళ్ళ సామాజిక, రాజకీయ, చారిత్రక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశానికి సంబంధించి ముస్లిం యుద్ధాలు జిహాద్ యుద్ధాలు కావని చరిత్రకారులు చెబుతుంటే ఈ రచయిత మాత్రం పదే పదే జిహాద్ పదాన్ని వాడుతూ మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమేరకు ఒక అసత్యాన్ని ప్రజల ఉమ్మడి భావనలలో స్థాపించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎవరి మెప్పుకోరకో ఈజీ గానే అర్థమౌతుంది.

8. ఇస్లాం, క్రైస్తవ మతాల సంస్కరణలపై దృష్టి పెట్టినంతగా, హిందూ మతంలోని కులాధిపత్య నిర్మూలనకు స్పష్టమైన కార్యాచరణను వ్యాసం ప్రతిపాదించలేదు. ఆ అవసరాన్ని గుర్తించినట్లు కూడా లేదు రచయిత గందరగోళ దృక్పథం.

9."దేశం ముందు, మతం తర్వాత" అనే సిద్ధాంతం భారత రాజ్యాంగంలోని లౌకిక విలువలతోనే సాధ్యమవుతుంది; దీనికి కొత్త గా "హిందూ దళిత బహుజనవాదం" అనే టాగ్ తో దళిత బహుజనుల వైవిధ్యాన్ని గంపగుత్తగా హిందూ మతానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రచయిత. ఇది వారిని హిందు.త్వావైపు రాజకీయంగా లాగటమే. ఇది ఎవరి లక్ష్యమో అందరికీ తెలుసు. మనువాదులతో కుమ్మక్కవటం ఒక బహుజన రచయితకు భావ్యమా?

10. బ్రాహ్మణులు వారి సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టే మతగ్రంథాలను తరతరాలుగా కాపాడుకుంటూ రావడం వల్ల ఈ సమాజం హైరార్కికల్ నిర్మాణంగా రూపుదిద్దుకుందని, పుట్టుక ఆధారంగా మనుషులను ఎక్కువ–తక్కువలుగా విభజించే వ్యవస్థ బలపడిందని గుర్తించలేకపోవడం ఈ రాజ్యాంగ యుగంలో అజ్ఞానంతో సమానం. ఈ వ్యాసకర్త దళితబహుజనులందరి తరపునా ఆ ప్రక్రియను గొప్పదిగా గుర్తించటం మరింత అవమానకరం.
వ్యాసం ప్రతిపాదించిన భావజాలాన్ని సిద్ధాంతపరంగా అమలు చేసే రాజకీయ లేదా సామాజిక యంత్రాంగం ఏమిటో వివరించలేదు. బహుశా దళితబహుజనులందరూ మనువాదులుగా మారాలని రచయిత పిలుపునిస్తున్నారా?

11. దళిత బహుజనుల విముక్తికి ప్రధాన ఆధారం రాజ్యాంగం, సమాన హక్కులు, చట్టబద్ధ రక్షణలు అనే ఎరుక లేకుండా కొత్తగా మతాన్ని రంగంలోకి దింపటం దేని కొరకో అనే ప్రశ్న ఏర్పడుతుంది.
12. వ్యాసం అన్ని వర్గాలను సమన్వయం చేయాలని పైపైన ప్రతిపాదిస్తున్నప్పటికీ, "హిందూ" గుర్తింపును కేంద్రంగా ఉంచడం వల్ల ఇతర దళిత, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం బహుజన వర్గాల అస్తిత్వాన్ని కబళించడం అనే కుట్ర కనిపిస్తుంది. ఇది స్పష్టంగా మనువాద దృక్పథం.


సత్యాన్ని దాచవచ్చు; శాశ్వతంగా ఓడించలేరు.



 కొన్ని జంతర్ మంతర్  రీల్స్ చూసినప్పుడు యువత ఇప్పటికైనా కళ్లు తెరుస్తోందనే ఆశ కలిగింది. గర్వం వేసింది. అక్కడ అవమానాలు, దాడులు భరిస్తున్న ప్రతి మనిషి బాధ కలచివేస్తోంది. హింస ఎప్పుడూ వాదనకు ప్రత్యామ్నాయం కాదు.

అదేసమయంలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్న పెయిడ్ విద్వేష కామెంట్లు చూస్తున్న ప్రతిసారీ, ఈ దేశంలో ఎంత లోతైన విషప్రచారం జరుగుతోందో అర్థమవుతోంది. దుఃఖం కలుగుతోంది.
తమ రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసం విదేశీ ఆర్య పండితులు ఈ దేశప్రజలమధ్య విద్వేషాలు నూరిపోసారు. మతం మత్తులో ఉంచారు. సామాజిక చైతన్యాన్ని తీవ్రంగా దెబ్బతీశారు.
 
చరిత్రను వక్రీకరించడం, ప్రజల మధ్య అనుమానాలు పెంచడం, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడం—ఇవి గర్వకారణాలు కావు. ఈ విధ్వంసాన్ని చరిత్ర తప్పకుండా నమోదు చేస్తుంది.
 
సత్యాన్ని దాచవచ్చు; శాశ్వతంగా ఓడించలేరు.



అపర చాణుక్యుడా... లేక నేటి సంక్షోభాలకు ఆద్యుడా?

అపర చాణుక్యుడు, మౌన ముని, ఆధునిక భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు— ఇవన్నీ మీడియా ఇచ్చిన బిరుదులు.

ఆయన పాలనను తిరిగి చూస్తే, నేడు దేశాన్ని వేధిస్తున్న అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక సంక్షోభాల విత్తనాలు అప్పుడే నాటబడ్డాయనే అభిప్రాయం కలగకమానదు.

బాబ్రీ మసీదు కూల్చివేత దేశ లౌకిక ప్రజాస్వామ్యానికి తీరని గాయం. దేశ అత్యున్నత కార్యనిర్వాహక బాధ్యతలో ఉండి కూడా ఆ ఘటనను అడ్డుకోలేకపోవడం కేవలం పరిపాలనా వైఫల్యమా? లేక మతాధారిత రాజకీయాలకు చారిత్రక అవకాశాన్ని కల్పించిన నిశ్శబ్ద సమ్మతమా? ఆ ఘటన తర్వాత భారత రాజకీయాలకు "మతం" కేంద్రబిందువుగా మారింది.

ఆర్థిక రంగంలోనూ అదే కథ. "సంస్కరణలు" అనే ఆకర్షణీయమైన పదం వెనుక ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచే, స్వయం సమృద్ధి భావనను పక్కన పెట్టే, మార్కెట్ శక్తులకు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. అభివృద్ధి పేరిట అసమానత పెరిగింది. సంపద కొద్దిమంది కార్పొరేట్ వర్గాల వద్ద కేంద్రీకృతమైంది. శాశ్వత ఉద్యోగాల స్థానంలో అస్థిర ఉపాధి వచ్చింది. ఉత్పత్తి రంగం క్షీణించింది. మేకులనుండి 800 అడుగుల ఇత్తడి విగ్రహాల్ని దిగుమతి చేసుకొంటున్నాం. పబ్లిక్ రంగం అమ్మకానికి పెట్టబడింది. సామాన్య ప్రజల జీవితం మాత్రం మరింత దయనీయంగా మారింది.

ఇవన్నీ జరిగినా ఇప్పటికీ ఆయనను "మహా సంస్కరణవాది" గా కీర్తించడం చరిత్రను ఏకపక్షంగా చదవడమే. సంస్కరణలు ఎవరికి ఉపయోగపడ్డాయి? కార్మికులకా, రైతుకా, చిన్న పరిశ్రమలకా? లేక కార్పొరేట్ వర్గాలకా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పకుండా సంస్కరణలు గొప్పవని పొగడటం మేధో నిజాయితీ కాదు.

OBC రిజర్వేషన్లలో ఆయన ప్రవేశపెట్టిన క్రీమీ లేయర్ వల్ల సామాజిక వెనుకబాటు స్థానంలో ఆదాయప్రమాణం చేరి, రిజర్వేషన్ల ప్రాతిపదిక అయిన సామాజిక వివక్ష అనే తాత్విక పునాది బలహీనపడింది. ఇది బలహీనవర్గాలపై జరిపిన కుట్ర.

ఆ మౌన ముని పండిత వర్గానికి చెందినవాడు ఆయన విధానాల వల్ల నేడు దేశం మనువాదుల చేతుల్లోకి పోయింది. నేటి భారతదేశ మత, ఆర్ధిక, రాజకీయ సంక్షోభానికి కారణం ఈ మనువాద మాఫియానే.

ఈ దేశంలో మనువాదులను ఎదిరించి, ఎందుకు ఆ మార్గం దేశ ప్రజలకు ఎలా మేలు చేయదో వివరిస్తూ వేలపేజీల సారస్వతాన్ని రాసిపెట్టారు డా. అంబేడ్కర్. ఏనాటికైనా మనువాదానికి విరుగుడు అంబేద్కరిజమే.

ఈ సత్యాన్ని నేటి Gen Z ఇప్పుడిప్పుడే గుర్తించినట్లు అనిపిస్తోంది. మొన్న జంతర్ మంతర్ ఉద్యమంలో ఈ దేశ యువత నోట డా. అంబేడ్కర్ ఒక నినాదంగా మారటం శుభపరిణామం.

బొల్లోజు బాబా

Uploading: 743424 of 2290361 bytes uploaded.


Thursday, July 23, 2026

మరపురాని పరిమళం


పుస్తకం మధ్యలో
ఎండిపోయిన గులాబి

దానికిప్పుడు
సువాసన లేదు
విలువా లేదు

అయినా
పేజీ తెరిచిన ప్రతిసారి
ఒక సాయింత్రం నాలో వికసిస్తుంది

ఆమె నవ్వు
గది మూలలో వెలుగుతుంది.

ఆమె వేళ్ల వెచ్చదనం
ఆమె జుట్టు పరిమళం
ఆమె కళ్ల మాటలు
ఒక్కొక్కటిగా
ఆ పేజీల మధ్యనుండి
బయటకు వస్తుంటాయి.

కాలం
మనుషులను మాత్రమే తీసుకెళ్తుంది.
వాళ్లు తాకిన వస్తువుల్లో
వాళ్ల ఋతువులను
మరిచిపోతుంది.

అందుకే
కొన్ని పాత వస్తువులు
మనలో ఎప్పుడో
నిశ్శబ్దమైపోయిన
ఒక వసంతాన్ని
మళ్ళీ పూయిస్తాయి.

బొల్లోజు బాబా

Friday, June 26, 2026

ఉపాధి కల్పన

ఉపాధి కల్పన అంటూ
కొండల్ని తవ్వేసారు
నదుల్ని అమ్మేశారు
అడవుల్ని నరికేశారు
సముద్రాల్ని కంచెలతో చుట్టేశారు.

భూమి ఇచ్చిన రైతు
కూలీగా చేరాడు
నదిని కోల్పోయిన జాలరి
సెక్యూరిటీ గార్డయ్యాడు
అడవిని కోల్పోయిన గిరిజనుడు
గేటు బయట నిలబడ్డాడు
రోజుకు పద్దెనిమిది గంటలు
తమ జీవితాల్ని డెలివరీ చేస్తూ.

లాభాలన్నీ
పై అంతస్తులకు లిఫ్టులో వెళ్లిపోయాయి.

ఈ శతాబ్దపు
అత్యంత అమానవీయమైన
వంచన ఏమిటంటే
వారి భూమిని
వారి నదిని
వారి అడవిని
వారి భవిష్యత్తుని వారినుండి తీసేసుకొని
"ఉపాధి కల్పించాం" అని చెప్పి
చప్పట్లు కొట్టించుకోవటం.

బొల్లోజు బాబా

Sunday, June 21, 2026

కవిత్వ భాష – నిర్మాణ పద్దతులు

కవిత్వ భాష – నిర్మాణ పద్దతులు
(13, 14 జూన్ 2026 తారీఖులలో యానాంలో కవిసంధ్య ఆధ్వర్యంలో జరిగిన కవిత్వ శిక్షణాశిబిరంలో నేను చేసిన ప్రసంగ పాఠం)

కవిత్వం అంటే ఏమిటి?
ఒక ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో లేక ఈ మూడింటినీ కలగలిపో కళాత్మకంగా చెప్పిన భాషారూపమే కవిత్వం. అందుకనే కవిత్వాన్ని బహుముఖాలు కలిగిన భాషగా నిర్వచిస్తారు.
అభినవగుప్తుని దృష్టిలో “ఆనందోపదేశములు” కావ్య ప్రయోజనాలు. అంటేకవిత్వం ఆనందాన్ని ఉపదేశాన్ని ఇవ్వాలి అని. ఆధునిక కాలానికి వచ్చేసరికి సంఘశ్రేయస్సు, అభ్యుదయ భావనలు, సామాజిక స్పృహ, అస్థిత్వవాదం వంటి భావనలు కవిత్వానికి కొత్త దిశలను నిర్దేశించాయి. ఫలితంగా కవిత్వం కేవలం సౌందర్యానుభవం కాక, సామాజిక అనుభవాల వేదికగా విస్తరించింది. ఇది ఆధునిక కవిత్వం సాధించిన ముఖ్యమైన పరిణామం.

వచనానికి కవిత్వానికి తేడా ఏమిటి?
వచనాన్ని కవిత్వాన్ని వేరు చేసేది భాషే. వచనానికి చెప్పే విషయమే ప్రధానం కానీ చెప్పే పద్దతి కాదు. కవిత్వానికి వచ్చేసరికి విషయంతో పాటూ దానిని ఎంత ఉద్వేగభరితంగా చెపుతున్నామనేది కూడా ప్రధానమే. వచన భాషకు అర్ధస్ఫూర్తి నివ్వటం ఒక్కటే పని. అంటే తాను చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పటంతో దాని బాధ్యత తీరిపోతుంది. కవిత్వ భాష అర్ధాంతర స్ఫూర్తినిస్తుంది. అంటే చెపుతున్న విషయంతో పాటు చెప్పని విషయాన్ని కూడా ధ్వనింపచేయటం. దీన్నే ధ్వని, వక్రోక్తి, లేదా Latent Content అంటూ వివిధ పేర్లతో అలంకారికులు పిలిచారు.
వచనంలోని భాషకు, కవిత్వభాషకు ఉండే తేడాను తెలుసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ..

1. Alphabet
ABCDE
FGHIJ
KLMNO
PQRSTU
VWXYZ
2. Suicide
ABCDE
FGHIJ
KLMNO
PQRSTU
VWXYZ
మొదటి దాంట్లో ఎబిసిడి లను ఆల్ఫాబెట్స్ అని చెప్తున్నట్లు అర్ధమౌతుంది. అంతటితో ఆ వాక్యం పూర్తయింది ఇక దానినుంచి ఏ రకమైన అదనపు అర్ధాలు పొందలేము.

రెండవ దాంట్లో కవి ఒక కొత్త విషయాన్ని చెపుతున్నాడు. అక్షరమాలను ఆత్మహత్య అంటున్నాడు. (ఆ విషయం మనం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది వేరే విషయం). వెంటనే మన ఆలోచనలు పరిపరివిధాలుగా విస్తరిస్తాయి. ఆల్ఫాబెట్స్ కు నాగరికత అని అర్ధం చెప్పుకొంటే నాగరికతను ఆత్మహత్యగా కవి చెప్తున్నట్లు భావించాలి. ఆత్మహత్య చేసుకొన్నది మనిషి కావచ్చు, మానవత్వం కావొచ్చు, అమాయకత్వం కావొచ్చు, స్వచ్చత కావొచ్చు, మన ఆలోచన పరిధిని బట్టి అనేక రకాలుగా విశ్లేషించుకోవచ్చు. కానీ ఇన్ని విషయాలనూ కవి నేరుగా చెప్పటం లేదు, ఇవన్నీ కవి చెప్పని విషయాలు. చెపుతున్న విషయాలే కాక చెప్పని విషయాలను కూడా ధ్వనింపచేయటం అంటే ఇదే. ఇక్కడ కవి తనకు కలిగిన భావాన్ని మనలోకి ప్రవేశపెట్టాడు. అది కూడా భిన్న కోణాలలో ఆవిష్కరింపబడేలా. పైది వచనమైతే క్రిందది కవిత్వం.
 
కవిత్వంలో ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేవి రెండు ముఖ్యమైన అంశాలు. ఏది చెప్పాలనేది కవి స్వేచ్ఛకు, జీవితంపై అతని అవగాహనకు సంబంధించింది. రోజూ చూసే అనేకాంశాలను, అనుభవాలను వాటిలోని వైరుధ్యాలను కవి వస్తువుగా తీసుకొంటాడు. వస్తువును చెప్పే విధానాన్ని శిల్పం అంటారు.
 
కవిత్వ భాష
ఒక దృశ్యమో, ఊహో నేరుగా కవిత్వంగా మారదు. దానిని కవిత్వభాషలోకి మార్చాలి. మామూలు భాషను కవిత్వభాషగా మార్చేందుకు, సిమిలీ, మెటఫర్, పెర్సొనిఫికేషన్, మెటనొమీ సినడ్కకీ, అల్లిగొరి, మెటాఫర్, పారడాక్స్, అల్యూజన్, ఐరనీ వంటి వివిధ కవిత్వనిర్మాణ పద్దతులు తోడ్పడతాయి. పైన చెప్పిన ఆల్ఫాబెట్స్ ఉదాహరణలో పారడాక్స్ ప్రక్రియ ఉంది. ఈ కవిత్వ భాషనే ప్రముఖ కవి సచ్చిదానందన్ “సమాంతర బాష” అన్నాడు.
కవిత్వభాష శిల్పాన్ని నిర్దేశిస్తుంది. “సాహిత్యానికి సాహిత్య లక్షణాన్ని ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదు” అంటారు బాలగోపాల్.
మనం రోజూ చూసే దృశ్యాలు, ఎదుర్కొనే సంఘటనలు, చేసే ఊహలు కవిత్వంగా మారటానికి కవిత్వభాషగా మారాటానికి వివిధ కవిత్వనిర్మాణ పనిముట్లు ఎలాసహాయపడతాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం.

1. సిమిలీ, మెటఫర్
సిమిలీ అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో వలె/లాగ/పోలె/రీతిగా వంటి పదాలను ఉపయోగించి పోల్చుతాం. అలాకాక మొదటి వస్తువే రెండవ వస్తువు అని చెబితే దాన్ని మెటఫర్ అంటారు.
ఉదాహరణకు ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అంటే సిమిలీ. ఆమె ముఖం చంద్రబింబం అనటం మెటఫర్.
సిమిలీ: ఇంటిపనుల్లో అలసిపోయిన ఒక స్త్రీ ఆదమరచి నిదురపోయే దృశ్యం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఆమెకు నిద్రాభంగం కలగకూడదని ఇంట్లోవాళ్లు అనుకోవటం కూడా సహజమే. ఇది చాలా మామూలుగా ప్రతీ ఇంట్లో జరిగే విషయమే. దాన్ని కవితావస్తువుగా తీసుకొని శివారెడ్డి గారు వ్రాసిన “ఆమె ఎవరైతే మాత్రం” అన్న కవిత ఒక సాదాసీదా దృశ్యాన్ని గొప్ప కవిత్వంలా ఎలా మలచవచ్చో అనటానికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

“నా భార్యో, పక్కింటావిడో,
పిల్లలతల్లి, తెల్లని పిల్లో” ఎవరైనా కావొచ్చు
ఆమె అస్వప్నంగా,
ముకుళిత పుష్పంలా ముడుచుకు పడుకుంది//
కరుగుతున్న మంచుముక్కలా ఆమె పడుకుంటే
కదులుతున్న నీటిబొట్టులా ఆమె పడుకుంటే
కంట్లో బంధింపబడ్డ గొప్ప దృశ్యంలా ఆమె పడుకుంటే
రాత్రంతా ముకుళించి రేప్పొద్దున్న
వికసించే అద్భుత పుష్పంలా
ఆమె పడుకుంటే పడుకోనీ” (ఆమె ఎవరైతే మాత్రం -- శివారెడ్డి)

పై కవితా వాక్యాలలో నిదురించే ఆ స్త్రీ రూపాన్ని మంచుముక్క, నీటిబొట్టు, దృశ్యం, పుష్పం అనే వివిధ వర్ణణలతో పోలుస్తాడు కవి. ఇందులో కవి ఉపయోగించుకొన్న టెక్నిక్ ను Simily అంటారు.
 
మెటఫర్:
కవిత్వభాషలో మెటఫర్ అత్యంత ప్రధానమైన అంశం. =రెండు వస్తువుల (అవి భౌతికమైనవి లేదా మానసికమైనవి కావొచ్చు) మధ్య ఇతరులు ఊహించలేని పోలికను తీసుకువచ్చినపుడే అది మంచి మెటఫర్ అవుతుంది. మంచి మెటఫర్ ఉన్న కవిత్వాన్ని ఏ భాషలోకి అనువదించినా భావం చెడదు.
 
సాయింత్రపు ఎర్రటి గాయంలోకి
సాగిపోతోంది రైలు.
రైల్లో కూచుని
ఆలోచనల రక్తంలో తడుస్తున్నాను.
ప్రపంచమంతా పచ్చిపుండు.//
నాతో నేను ప్రయాణించక తప్పదని
ఇంతకాలానికి తెలుసుకొన్నాను. (సహప్రయాణికుడు - ఇస్మాయిల్)

మెటఫర్ ని ఉపయోగించుకొని ఒక మూడ్ ని కవితలోకి ప్రవేశపెట్టటాన్ని పై వాక్యాలలో చూడొచ్చు. రైలుప్రయాణం జీవితానికి ప్రతీకగా భావించాలి. ముసలితనం సమీపించే కొద్దీ స్నేహాలు, పరిచయాలు, సందోహాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఒంటరితనం జీవితంలోకి కొద్దికొద్దిగా ఎగబాకుతూంటుంది. అప్పుడు జ్ఞాపకాలలోనే భారంగా రోజులు వెళ్లదీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై మనతో మనమే ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న భావన ఏర్పడుతుంది. అతి సున్నితమైన ఈ మానసికస్థితిని - సాయింత్రపు ఎర్రటిగాయం, ఆలోచనలరక్తం, ప్రపంచం ఒక పచ్చిపుండు అన్న మెటఫర్ ల ద్వారా కవి ఆవిష్కరించగలిగారు.
 
2. పెర్సొనిఫికేషన్

మానవలక్షణాలను వస్తువులకో, జీవులకో లేక ఒక ఊహకో ఆరోపించి కవిత్వం చెప్పే పద్దతిని పెర్సొనిఫికేషన్ అంటారు.
కవిత్వం రాసే పద్దతులలో ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. దీనివల్ల ఒక విషయం పాఠకుని మనస్సులో లోతుగా నాటుకొంటుంది

పెర్సొనిఫికేషన్ టెక్నిక్ దైనందిన సంభాషణలలో, కథలలో, వార్తాకథనాలలో కనిపిస్తూనే ఉంటుంది. “ఈ బండి పెట్రోలు పొదుపు చేస్తుంది” అంటాం. “సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు” అంటూ ఓ కథ మొదలవ్వొచ్చు. “ఆ పథకం అందరిజీవితాలలో వెలుగులు నింపింది” అన్న ఓ వార్తాంశం కావొచ్చు. అన్నీ పెర్సొనిఫికేషన్ కు చక్కని ఉదాహరణలే.
అందమైన అమ్మాయి చందమామ పోలికని పెర్సొనిఫికేషన్ టెక్నిక్ ద్వారా చెప్పాలనుకొంటే ఇలా చెప్పొచ్చు. “ఆమె వదనాన్ని చూసి చందమామ ఈర్ష్యతో మబ్బులచాటుకు వెళిపోయింది”

నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు. --- ఇస్మాయిల్

ఇల్లుఖాళీ చేసిన సందర్భాన్ని కొండేపూడి నిర్మల ఒక కవితలో ఇలా వర్ణిస్తారు.
 
ఉనికి తాలూకు ఆనవాళ్ళన్నీ
చెరిగిపోతాయి
పెట్టేబేడా సర్దేయగానే
ఒకట్రొండు బాధగా వొంగిన
మేకులు మినహా
పెద్దగా మార్పేమీ ఉండదు.//
అద్దంలేని గోడ
తలమాసిందని చెప్పదు
సబ్బులేని స్నానాలగది కిటికీ
పరిమళాన్ని పావురంలా ఎగరేయదు (ఇల్లు ఖాళీ చేసినపుడు - కొండేపూడి నిర్మల)

పై వాక్యాలలో మేకులకు, అద్దానికి, స్నానాల గదికి మానవలక్షణాలు ఆరోపించటం ద్వారా మామూలు సందర్భంలోని ఉద్వేగం ఎన్నోరెట్లు హెచ్చింపబడింది. మేకులే బాధతో వొంగాయంటే ఇక మానవహృదయం ఎంత? అనే భావన కలిగిస్తారు కవయిత్రి. దీనంతటికీ కారణం సమర్ధవంతంగా వాడబడిన పెర్సొనిఫికేషన్ (Personification) టెక్నిక్.
 
3. పారడాక్స్, ఆక్సిమొరాన్ లు
పరస్పరవ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు భావాల్ని కలిపి చెప్పటాన్ని పారడాక్స్ అంటారు. భయం తెలిసినవాడే నిజమైన వీరుడు, చనిపోవటం కొరకు బ్రతకితీరాలి, కనిపించనివాటిని చూసే కళే దృష్టి, విడిపోయి కలిసిఉందాం, భిన్నత్వంలో ఏకత్వం- వంటి వాక్యాలు పారడాక్స్ కు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

పరస్పర వ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు పదాల్ని కలిపి చెప్పటాన్ని ఆక్సి మొరాన్ అంటారు. తెలివైన మూర్ఖుడు, బహిరంగ రహస్యం, ఒరిజినల్ కాపీ, శాంతి దళం, మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ఆక్సిమొరాన్ కూడా ఒకరకమైన పారడాక్సే. అందుకే దీనిని సంక్షిప్త పారడాక్స్ (compact Paradox) అనికూడా అంటారు.

"చల్లని చంద్రబింబం లాంటి ఆమె ముఖం... నా మనసులో విరహపు మంటల్ని రగిలిస్తోంది." పారడాక్స్ కి ఉదాహరణగా చెప్పొచ్చు.
 
త్రిశ్రీ కవిత్వంలో కనిపించే కొన్ని పారడాక్స్ అభివ్యక్తిలు .....

• మృత్యువును కౌగిలించుకునైనా మాట నిలబెట్టాలి//
• ఉరికంబాన్ని ఉర్రూతలూగించి అయినా ప్రాణశక్తిని తేజోమయం చేయాలి (ఎన్ కౌంటర్)
• భయం ముందు నిర్భయంగా చెలరేగిపోతాను. (రహస్యోద్యమం)
• హతుడే హంతకుడైన చోట హత్య నేరం కాలేదు (ఆత్మహత్యలన్నీ హత్యలే)
• కొన్ని ఎండలు వానలకు తడిశాయి (సంధ్యార్ణవం)
కవిత్వం ఎక్కువగా పోలికలపై ఆధారపడి నడుస్తుంది. పారడాక్స్ మాత్రం వైరుధ్యాలను ఎంచుకొంటుంది. అందుకే పారడాక్స్ ఒక మేధాపరమైన విలక్షణ ప్రక్రియ. గొప్ప పారడాక్స్ ను సృష్టించగలిగే కవి మేధాకవిగా గుర్తింపు పొందగలడు.
 
4. మెటానమి, సినక్డకి

కవిత్వంలో రెండువస్తువులను పోల్చుతున్నప్పుడు, ఒక వస్తువు బదులుగా దానికి సంబంధం ఉన్న మరొక వస్తువును పెట్టటాన్నే మెటానమి (Metonymy) అంటారు.
 
మెటఫర్ లో కూడా రెండు వస్తువులను పోల్చటం జరుగుతుంది. కానీ దానిలో రెండు వస్తువులు స్పష్టంగా తెలుస్తూంటాయి. మెటానొమిలో ఒక వస్తువే చెప్పబడుతుంది రెండవ దానిని ఊహించుకోవాలి. దీనివల్ల మెటానొమీ కలిగిన వాక్యాలను అర్ధం చేసుకోవటానికి పాఠకుడు కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది.
 
“మా ఆఫీసరు ఒక పెద్దపులి” -- అనే వాక్యం మెటాఫర్ కు ఉదాహరణ. దీనిలో పోల్చబడిన రెండు వస్తువులు స్పష్టంగా ఉన్నాయి. వాటిలో పెద్దపులి లక్షణాలైన నిర్దయ, క్రౌర్యం, బలం లాంటివి ఆఫీసరు అనే వ్యక్తికి చేరి అతని స్వభావాన్ని అర్ధం చేసుకోవటానికి దోహదపడతాయి.
 
“పెద్దపులి రివ్యూ మీటింగ్ పెట్టింది” - అనే అన్న వాక్యం మెటానమికి ఉదాహరణ. ఇక్కడ ఆఫీసరు, పెద్దపులి అన్న రెండు వస్తువులలో ఒకటే ప్రస్తావించబడింది. రివ్యూ మీటింగులు ఆఫీసరులే పెడతారుకనుక పెద్దపులి అన్న పదం ఆఫీసరుకి ప్రాతినిధ్యపదం అవుతుంది. ఆ ఆఫీసరు పెద్దపులిలా నిర్దయుడని, క్రూరుడని, బలవంతుడని అర్ధం చేసుకోవాలి.

సినక్డకి (Synecdoche) కూడా మెటానమీ లాంటిదే కానీ ఇక్కడ ఒక వస్తువు బదులుగా దానికి సంబంధం ఉన్న మరొక వస్తువులోని “భాగం” తో (part) పోల్చటం జరుగుతుంది.
ఆయన “పంజా” విసిరి పదిమంది “పొట్ట” కొట్టాడు. -- ఈ వాక్యంలో పంజా, పొట్ట అన్న పదాలు “సినక్డకి” లకు ఉదాహరణలు. పంజా అన్న పదం మనకు పులిని గుర్తుకు తెస్తుంది. పంజా పులికి, పొట్ట మనిషికి చెందిన “భాగాలు” మాత్రమే, సంపూర్ణార్ధాన్ని పాఠకుడు పూరించుకోవాలి. ఒక మనిషి తన పొట్ట నింపుకోవటానికి ఏదో ఉద్యోగం చేస్తాడు.
 
పైవాక్యంలో ఉన్న సినక్డకి టెక్నిక్ వల్ల – పెద్దపులి లాంటి ఒక దయలేని ఆఫీసరు పదిమందిని ఉద్యోగంలోంచి తీసేసాడు అన్న విస్త్రుతార్ధం సిద్ధించింది.

చంద్రబింబం నడుచుకొంటూ వస్తున్నది అంటే మెటానమీ.

ఆమె రాకతో గదంతా వెన్నెలతో నిండిపోయింది అంటే సినక్డకి.

పైట కొంగును చూస్తే
నా కెందుకో
పాతివ్రత్యం గుర్తొస్తుంది !
భుజాలనించి కిందికి వేలాడే
గుదిబండలా
అదెప్పుడూ నా స్వేచ్ఛని హరిస్తూనే ఉంటుంది !//
నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే
ముందుగా పైటని తగలెయ్యాలి
పైటని తగలెయ్యాలి. (పైటను తగలెయ్యాలి -- జయప్రభ)

స్త్రీ స్వేచ్ఛ, హక్కులను తరతరాలుగా హరిస్తున్న ఆచారాలు, వివక్షను "పైట" అనే పదంతో మెటానోమికాభివ్యక్తి చేసారు కవయిత్రి. స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షను తగలెయ్యాలి అన్న అర్ధంలో పైటను తగలెయ్యాలి అన్న ప్రయోగం చేసారు.
 
చాలామంది కవుల ఐకానిక్ కవితలన్నీ మెటానొమికాభివ్యక్తి కలిగిన కవితలే కావటం గమనార్హం. ఇస్మాయిల్ - చిలకలువాలిన చెట్టు, ఖాదర్ మొహిద్దిన్-పుట్టుమచ్చ, శిఖామణి-కొయ్యకాలు, సతీష్ చందర్-కలవని కనుపాపలు, తిలక్-నీవులేవు నీ పాట ఉంది, జయప్రభ-పైటను తగలెయ్యాలి, కొండేపూడి నిర్మల-నడిచేగాయాలు, మెర్సి మార్గరెట్-ప్రశ్నలగది మొదలైనవి కొన్ని ఉదాహరణలు.
"కవిత్వం మెటాఫర్ నుండి మెటానమీకి... ప్రయాణించాలి" అన్న వేగుంట మోహన్ ప్రసాద్ మాటలు కవిత్వంలో మెటానొమీకి కల స్థానాన్ని, స్థాయిని చెపుతాయి. మెటానొమీ పై పట్టుసాధించిన కవులు గొప్పకవులుగా నిలిచిపోతారు.
 
5. అల్లిగొరి
బయటకు ఒక అర్థం లోపల మరొక అర్థం ధ్వనింపచేసే టెక్నిక్ ను అల్లిగొరి అంటారు. దానికి శిఖామణి గారి నల్లని దానను అనే పేరుతొ రాసిన కవిత గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఆ కవిత మొత్తం మినువులపై రాసిన కవితగా అనిపించినా అంతర్లీనంగా దళితతాత్విక చింతనతో నడుస్తుంది.
 
నేను నల్లని దానను
నవ ధాన్యాల్లో నాలుగో దానను
నా పేరు మినుము
శక్తికి నేను ఇనుము//
గుండె కింది తడిలాంటి
ఇంతచెమ్మ నన్ను సోకితే చాలు
వొళ్లంతా కింజల్కపు పులకింతలతో
ఉబ్బితబ్బిబైపోతాను
ఆపై నన్ను స్పృశిస్తే
శ్వేత ప్రపంచాన్ని తెల్ల మొగం వేయించి
ఉర్రూతలూగించిన
ఆటపాటల నెలరేడు
మైఖేల్ జాక్సన్ లా
తెల్లగా మిలమిలా మెరిపోతాను.
నేను నల్లనిదానను
చరిత్రగర్భాన్ని చీల్చుకొచ్చిన
వేయి రేకుల బాకుల నల్ల కలువను
వర్తమాన దళిత రణక్షేత్రంలో
సమతారథం శిఖరాగ్రంపై
రెపరెపలాడే గబ్బిలపు ధ్వజాన్ని (నల్లని దానను - శిఖామణి)

సమకాలీన తెలుగు సాహిత్యంలో అల్లిగొరికి ఇంతకు మించి శక్తివంతమైన ఉదాహరణ దొరకదు.
 
6. హైపర్ బొలి
హైపర్ బొలి అంటే అతిశయోక్తీకరించటం. ఆలూరి బైరాగి నాక్కొంచెం నమ్మకమివ్వు కవితలో నాక్కొంచెం నమ్మకమిస్తే
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టమాటోలాంటి సూర్యుడ్ని
ఆరిన అప్పడంలాంటి చంద్రుడ్ని
ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను
నాదగు బాహుబంధనంలో
ఈ విశాల బ్రహ్మండాన్ని చాపలా చుట్టేస్తాను…. అంటాడు ఇవన్నీ హైపర్ బొలి టెక్నిక్ కు చక్కని ఉదాహరణ.
 
7. అల్యూజన్ (Allusion)
చరిత్రనుంచో, పూర్వసాహిత్యం నుంచో ఏదైనా ఒక ఉదంతాన్ని సూచించే పదాన్నొ, వాక్యాన్నొ కవితలో ఉదహరించటాన్ని అల్యూజన్ అంటారు.

శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలును
గొడ్డలితో నరుకుతున్నాడు
బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి
పాతాళానికి తొక్కేస్తున్నాడు/
కాలం కసాయి కత్తిమీద నిలబడి
గర్జిస్తున్న చండాలుడు
ఆదిశంకరునిపై నాలుగు వేటకుక్కల్ని
ఉసిగొల్పుతున్నాడు (నడుస్తున్న చరిత్ర - శివసాగర్)

పై కవితలో శివసాగర్ దళిత పురాణపాత్రలచే తమకు అన్యాయం చేసినవారిపై తిరుగుబాటు చేయిస్తాడు. ఇది ఒక కొత్త ఉదయానికి సూచనగా చెపుతాడు. దీన్ని తమ చరిత్రను తామే లిఖించుకోవటానికి చేసిన ప్రయత్నంగా భావించాలి.
అల్యూజన్ వల్ల, కవిత పరిధి పెరిగి అర్ధం విస్త్రుతమౌతుంది. కవి ఉటంకించిన ఉదంతం పట్ల చదువరికి పూర్వజ్ఞానం లేకపోతే అల్ల్యూజన్ అర్ధం కాదు.

8. ఐరనీ (Irony)

పైకి ఒక అర్ధాన్ని అంతర్లీనంగా దానికి "వ్యతిరేక అర్ధాన్ని" కలిగి ఉండేలా చెప్పటాన్ని ఐరనీ అంటారు. వెటకారం, సార్కాజం లకు దగ్గర ఐరనీ
కవిత్వంలో ఐరనీని ఉపయోగించి గొప్ప ధిక్కారాన్ని పలికించవచ్చు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు, అవకతవకలకు కలిగే కోపంలోంచి ఐరనీ పుడుతుంది. మార్చలేని నిస్సహాయ స్థితిని ఐరనీ ద్వారా చాలా శక్తివంతంగా వ్యక్తీకరించవచ్చు.
 
//నువ్వొకప్పుడు ఇంగ్లాండవతారంలో మమ్మల్ని
కరుణించావ్
మూర్ఖులం నీ లీల గ్రహించలేక నిన్ను ద్వేషించాం
అయితే నేం
పాపుల్ని కరుణించే వరకూ నువ్ నిద్రపోవ్ కదా
నివ్విప్పుడు అమెరికావతారంలో సాక్షాత్కరించి
మా ద్వారాలు తెరిపించావ్
ఇప్పుడు మా మెదడూ – హృదయంలోనూ నీ
నామ స్మరణమే// - (ప్రపంచీకరణ)

ఇరవై ఏళ్ల క్రితం అద్దేపల్లి ప్రభు వ్రాసిన ఈ కవితలో వస్తువు ప్రపంచీకరణ. ప్రపంచీకరణ దుష్ప్రభావాలను ఇంకా పూర్తిగా అవగాహనకు రాని సమయంలోనే వ్రాసిన కవిత ఇది. ఇందులో ప్రపంచీకరణను దేవుని అవతారంగా చెపుతాడు కవి. ఒకప్పుడు ఇంగ్లాడు రూపంలో వచ్చింది, ఇప్పుడు అమెరికా రూపంలో వస్తోంది అంటాడు. కరుణించటం, లీలగ్రహించటం, సాక్షాత్కరించటం, నామ స్మరణ వంటి ప్రయోగాలు మతపరిభాషగా అనిపించినా వాటి వాచ్యార్ధాలకు వ్యతిరేకార్ధలను ఇస్తాయి కవితలో. ఇది ఐరనీగా చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణకు లొంగిపోవటం వల్ల విచ్చిన్నమౌతున్న మానవవిలువలు, పరాయీకరణల పట్ల కవికి కలిగిన కోపంలోంచి పుట్టుకొచ్చిన ఐరనీ ఇది. సమకాలీన సామాజపోకడపై సంధించిన గొప్ప వక్రోక్తి.
 
9. నిరలంకారత
ఒక కొత్త ఆలోచననో, బరువైన సంఘటననో, బలమైన ఉద్వేగాన్నో చెప్పదలచుకొన్నప్పుడు నిరలంకారంగా చెప్పటం కూడా ఒక మంచి కవిత్వ నిర్మాణ టెక్నిక్.

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం – ప్రాణమిస్తం// (కాళోజి)

మహాకవి కాళోజీ వ్రాసిన పై వాక్యాలలో ఏరకమైన అలంకారాలు కనిపించపోయిన ఒక జాతి అంతరంగం ఆవిష్కృతమైంది. భావోద్వేగాలను, మానవ సంవేదనను వ్యక్తీకరించే కవిత్వానికి కొన్నిసార్లు అలంకారాలు అవసరం లేదనటానికి మహాకవి కాళోజీ కవిత్వమే నిదర్శనంగా నిలుస్తుంది.
 
అలంకారాలు లేకుండా కూడా మంచి కవిత్వం చెప్పగలుగుతున్నప్పుడు ఇక అలంకారాల ఉపయోగం ఏమిటి అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఎంతో శక్తివంతమైన కవితా వస్తువు, లోతైన కొత్త ఊహ లేదా గుండెలను బలంగా మోదగలిగేటంతటి సత్తువ కలిగిన ఉద్వేగమూ లేక పోతే నిరలంకార కవిత్వం ఉత్త వచనంగా మిగిలిపోతుంది.
 
త్రిపురనేని శ్రీనివాస్ “వచనమై తేలిపోతావ్” అని హెచ్చరించింది అలాంటి కవిత్వం గురించే.
 
ముగింపు

కవిత్వభాషలో మరొక ముఖ్యమైన అంశం లయ. యతి, ప్రాశలు ఆధునిక కవిత్వానికి వర్తించకపోయినప్పటికి పదాల మధ్య అనుప్రాస కవిత్వానికి అందాన్నిస్తుంది. పాదవిభజన కూడా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఆ వాక్యాలలో ఒక అంతర్లయ అనుభవానికి వచ్చి చదువుతున్నప్పుడు హాయినికలిగిస్తుంది.
 
కవి తనకు కలిగిన అనుభవాన్ని పదాల సహాయంతో భాషలోకి తీసుకొస్తాడు. వివిధ కవిత్వనిర్మాణ టెక్నిక్ లైన సిమిలీ, మెటఫర్, పారడాక్స్, పెర్సొనిఫికేషన్, మెటనిమి, సినక్డకి, అల్లిగొరి, అల్యూజన్, పారడాక్స్, ఐరనీ, హైపర్ బొలి వంటి వివిధ నిర్మాణపద్దతులు మామూలు భాషను కవిత్వభాషగా మారుస్తాయి.
 
ప్రతిభ కలిగిన కవి తాను చెప్పదలచుకొన్న అంశానికి తగిన టెక్నిక్ లను వాడుకొని తన ఉద్వేగాన్ని యధాతధంగా చదువరిలో ప్రవేశ పెట్టగలుగుతాడు. అప్పుడు మాత్రమే అతని వ్రాసింది కవిత్వమౌతుంది. లేకపోతే పేలవమైన వచనంగా మిగిలిపోతుంది.
 
ఈ కవిత్వ నిర్మాణ మెళకువలన్నీ తెలుసుకున్నంత మాత్రాన కవిత్వం వచ్చేస్తుందా? అంటే—ఇవి కవిత్వాన్ని ఎలా రాయాలో’ మార్గం చూపుతాయి తప్ప, కవిత్వాన్ని సృష్టించలేవు. కవిత్వాన్ని కవే స్వయంగా సృష్టించాలి. దానికి నిశిత పరిశీలన, ప్రతిభ, అభ్యాసం అత్యంత ఆవశ్యకం.
సాహిత్యం ఒక అనంతమైన నదీ ప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్తూ మానవజాతి భౌతిక మానసిక ప్రపంచాలను అన్వేషిస్తూ తన స్థలకాలాదులను, విశేషాలను లిఖించుకొంటూ సాగిపోతాడు. ప్రతీతరపు రచనలూ కాలక్రమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి ఆ తరం జీవించిన జీవితాలను భవిష్యతరాలకు అందిస్తాయి. మానవజీవితాలను, ఉద్వేగాలను అక్షరబద్దం చేసేది సాహిత్యం మాత్రమే. చదివితే వచ్చే రాంకుల్లాగ, మార్కుల్లాగా సాహిత్యం చేసే పని పైకి కనిపించదు. మరీ ముఖ్యంగా కవిత్వం చేసే పని.
 
బొల్లోజు బాబా

పై అంశాలు ఇదివరలో నేను రాసిన "కవిత్వ భాష" అనే పుస్తకంలోనివి లింకు మొదటి కామెంటులో కలదు


https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba