Sunday, June 21, 2026

కవిత్వ భాష – నిర్మాణ పద్దతులు

కవిత్వ భాష – నిర్మాణ పద్దతులు
(13, 14 జూన్ 2026 తారీఖులలో యానాంలో కవిసంధ్య ఆధ్వర్యంలో జరిగిన కవిత్వ శిక్షణాశిబిరంలో నేను చేసిన ప్రసంగ పాఠం)

కవిత్వం అంటే ఏమిటి?
ఒక ఆలోచననో, ఉద్వేగాన్నో, అనుభవాన్నో లేక ఈ మూడింటినీ కలగలిపో కళాత్మకంగా చెప్పిన భాషారూపమే కవిత్వం. అందుకనే కవిత్వాన్ని బహుముఖాలు కలిగిన భాషగా నిర్వచిస్తారు.
అభినవగుప్తుని దృష్టిలో “ఆనందోపదేశములు” కావ్య ప్రయోజనాలు. అంటేకవిత్వం ఆనందాన్ని ఉపదేశాన్ని ఇవ్వాలి అని. ఆధునిక కాలానికి వచ్చేసరికి సంఘశ్రేయస్సు, అభ్యుదయ భావనలు, సామాజిక స్పృహ, అస్థిత్వవాదం వంటి భావనలు కవిత్వానికి కొత్త దిశలను నిర్దేశించాయి. ఫలితంగా కవిత్వం కేవలం సౌందర్యానుభవం కాక, సామాజిక అనుభవాల వేదికగా విస్తరించింది. ఇది ఆధునిక కవిత్వం సాధించిన ముఖ్యమైన పరిణామం.

వచనానికి కవిత్వానికి తేడా ఏమిటి?
వచనాన్ని కవిత్వాన్ని వేరు చేసేది భాషే. వచనానికి చెప్పే విషయమే ప్రధానం కానీ చెప్పే పద్దతి కాదు. కవిత్వానికి వచ్చేసరికి విషయంతో పాటూ దానిని ఎంత ఉద్వేగభరితంగా చెపుతున్నామనేది కూడా ప్రధానమే. వచన భాషకు అర్ధస్ఫూర్తి నివ్వటం ఒక్కటే పని. అంటే తాను చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పటంతో దాని బాధ్యత తీరిపోతుంది. కవిత్వ భాష అర్ధాంతర స్ఫూర్తినిస్తుంది. అంటే చెపుతున్న విషయంతో పాటు చెప్పని విషయాన్ని కూడా ధ్వనింపచేయటం. దీన్నే ధ్వని, వక్రోక్తి, లేదా Latent Content అంటూ వివిధ పేర్లతో అలంకారికులు పిలిచారు.
వచనంలోని భాషకు, కవిత్వభాషకు ఉండే తేడాను తెలుసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ..

1. Alphabet
ABCDE
FGHIJ
KLMNO
PQRSTU
VWXYZ
2. Suicide
ABCDE
FGHIJ
KLMNO
PQRSTU
VWXYZ
మొదటి దాంట్లో ఎబిసిడి లను ఆల్ఫాబెట్స్ అని చెప్తున్నట్లు అర్ధమౌతుంది. అంతటితో ఆ వాక్యం పూర్తయింది ఇక దానినుంచి ఏ రకమైన అదనపు అర్ధాలు పొందలేము.

రెండవ దాంట్లో కవి ఒక కొత్త విషయాన్ని చెపుతున్నాడు. అక్షరమాలను ఆత్మహత్య అంటున్నాడు. (ఆ విషయం మనం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది వేరే విషయం). వెంటనే మన ఆలోచనలు పరిపరివిధాలుగా విస్తరిస్తాయి. ఆల్ఫాబెట్స్ కు నాగరికత అని అర్ధం చెప్పుకొంటే నాగరికతను ఆత్మహత్యగా కవి చెప్తున్నట్లు భావించాలి. ఆత్మహత్య చేసుకొన్నది మనిషి కావచ్చు, మానవత్వం కావొచ్చు, అమాయకత్వం కావొచ్చు, స్వచ్చత కావొచ్చు, మన ఆలోచన పరిధిని బట్టి అనేక రకాలుగా విశ్లేషించుకోవచ్చు. కానీ ఇన్ని విషయాలనూ కవి నేరుగా చెప్పటం లేదు, ఇవన్నీ కవి చెప్పని విషయాలు. చెపుతున్న విషయాలే కాక చెప్పని విషయాలను కూడా ధ్వనింపచేయటం అంటే ఇదే. ఇక్కడ కవి తనకు కలిగిన భావాన్ని మనలోకి ప్రవేశపెట్టాడు. అది కూడా భిన్న కోణాలలో ఆవిష్కరింపబడేలా. పైది వచనమైతే క్రిందది కవిత్వం.
 
కవిత్వంలో ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేవి రెండు ముఖ్యమైన అంశాలు. ఏది చెప్పాలనేది కవి స్వేచ్ఛకు, జీవితంపై అతని అవగాహనకు సంబంధించింది. రోజూ చూసే అనేకాంశాలను, అనుభవాలను వాటిలోని వైరుధ్యాలను కవి వస్తువుగా తీసుకొంటాడు. వస్తువును చెప్పే విధానాన్ని శిల్పం అంటారు.
 
కవిత్వ భాష
ఒక దృశ్యమో, ఊహో నేరుగా కవిత్వంగా మారదు. దానిని కవిత్వభాషలోకి మార్చాలి. మామూలు భాషను కవిత్వభాషగా మార్చేందుకు, సిమిలీ, మెటఫర్, పెర్సొనిఫికేషన్, మెటనొమీ సినడ్కకీ, అల్లిగొరి, మెటాఫర్, పారడాక్స్, అల్యూజన్, ఐరనీ వంటి వివిధ కవిత్వనిర్మాణ పద్దతులు తోడ్పడతాయి. పైన చెప్పిన ఆల్ఫాబెట్స్ ఉదాహరణలో పారడాక్స్ ప్రక్రియ ఉంది. ఈ కవిత్వ భాషనే ప్రముఖ కవి సచ్చిదానందన్ “సమాంతర బాష” అన్నాడు.
కవిత్వభాష శిల్పాన్ని నిర్దేశిస్తుంది. “సాహిత్యానికి సాహిత్య లక్షణాన్ని ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదు” అంటారు బాలగోపాల్.
మనం రోజూ చూసే దృశ్యాలు, ఎదుర్కొనే సంఘటనలు, చేసే ఊహలు కవిత్వంగా మారటానికి కవిత్వభాషగా మారాటానికి వివిధ కవిత్వనిర్మాణ పనిముట్లు ఎలాసహాయపడతాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం.

1. సిమిలీ, మెటఫర్
సిమిలీ అంటే ఒక వస్తువును మరొక వస్తువుతో వలె/లాగ/పోలె/రీతిగా వంటి పదాలను ఉపయోగించి పోల్చుతాం. అలాకాక మొదటి వస్తువే రెండవ వస్తువు అని చెబితే దాన్ని మెటఫర్ అంటారు.
ఉదాహరణకు ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది అంటే సిమిలీ. ఆమె ముఖం చంద్రబింబం అనటం మెటఫర్.
సిమిలీ: ఇంటిపనుల్లో అలసిపోయిన ఒక స్త్రీ ఆదమరచి నిదురపోయే దృశ్యం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. ఆమెకు నిద్రాభంగం కలగకూడదని ఇంట్లోవాళ్లు అనుకోవటం కూడా సహజమే. ఇది చాలా మామూలుగా ప్రతీ ఇంట్లో జరిగే విషయమే. దాన్ని కవితావస్తువుగా తీసుకొని శివారెడ్డి గారు వ్రాసిన “ఆమె ఎవరైతే మాత్రం” అన్న కవిత ఒక సాదాసీదా దృశ్యాన్ని గొప్ప కవిత్వంలా ఎలా మలచవచ్చో అనటానికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

“నా భార్యో, పక్కింటావిడో,
పిల్లలతల్లి, తెల్లని పిల్లో” ఎవరైనా కావొచ్చు
ఆమె అస్వప్నంగా,
ముకుళిత పుష్పంలా ముడుచుకు పడుకుంది//
కరుగుతున్న మంచుముక్కలా ఆమె పడుకుంటే
కదులుతున్న నీటిబొట్టులా ఆమె పడుకుంటే
కంట్లో బంధింపబడ్డ గొప్ప దృశ్యంలా ఆమె పడుకుంటే
రాత్రంతా ముకుళించి రేప్పొద్దున్న
వికసించే అద్భుత పుష్పంలా
ఆమె పడుకుంటే పడుకోనీ” (ఆమె ఎవరైతే మాత్రం -- శివారెడ్డి)

పై కవితా వాక్యాలలో నిదురించే ఆ స్త్రీ రూపాన్ని మంచుముక్క, నీటిబొట్టు, దృశ్యం, పుష్పం అనే వివిధ వర్ణణలతో పోలుస్తాడు కవి. ఇందులో కవి ఉపయోగించుకొన్న టెక్నిక్ ను Simily అంటారు.
 
మెటఫర్:
కవిత్వభాషలో మెటఫర్ అత్యంత ప్రధానమైన అంశం. =రెండు వస్తువుల (అవి భౌతికమైనవి లేదా మానసికమైనవి కావొచ్చు) మధ్య ఇతరులు ఊహించలేని పోలికను తీసుకువచ్చినపుడే అది మంచి మెటఫర్ అవుతుంది. మంచి మెటఫర్ ఉన్న కవిత్వాన్ని ఏ భాషలోకి అనువదించినా భావం చెడదు.
 
సాయింత్రపు ఎర్రటి గాయంలోకి
సాగిపోతోంది రైలు.
రైల్లో కూచుని
ఆలోచనల రక్తంలో తడుస్తున్నాను.
ప్రపంచమంతా పచ్చిపుండు.//
నాతో నేను ప్రయాణించక తప్పదని
ఇంతకాలానికి తెలుసుకొన్నాను. (సహప్రయాణికుడు - ఇస్మాయిల్)

మెటఫర్ ని ఉపయోగించుకొని ఒక మూడ్ ని కవితలోకి ప్రవేశపెట్టటాన్ని పై వాక్యాలలో చూడొచ్చు. రైలుప్రయాణం జీవితానికి ప్రతీకగా భావించాలి. ముసలితనం సమీపించే కొద్దీ స్నేహాలు, పరిచయాలు, సందోహాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఒంటరితనం జీవితంలోకి కొద్దికొద్దిగా ఎగబాకుతూంటుంది. అప్పుడు జ్ఞాపకాలలోనే భారంగా రోజులు వెళ్లదీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపై మనతో మనమే ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న భావన ఏర్పడుతుంది. అతి సున్నితమైన ఈ మానసికస్థితిని - సాయింత్రపు ఎర్రటిగాయం, ఆలోచనలరక్తం, ప్రపంచం ఒక పచ్చిపుండు అన్న మెటఫర్ ల ద్వారా కవి ఆవిష్కరించగలిగారు.
 
2. పెర్సొనిఫికేషన్

మానవలక్షణాలను వస్తువులకో, జీవులకో లేక ఒక ఊహకో ఆరోపించి కవిత్వం చెప్పే పద్దతిని పెర్సొనిఫికేషన్ అంటారు.
కవిత్వం రాసే పద్దతులలో ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. దీనివల్ల ఒక విషయం పాఠకుని మనస్సులో లోతుగా నాటుకొంటుంది

పెర్సొనిఫికేషన్ టెక్నిక్ దైనందిన సంభాషణలలో, కథలలో, వార్తాకథనాలలో కనిపిస్తూనే ఉంటుంది. “ఈ బండి పెట్రోలు పొదుపు చేస్తుంది” అంటాం. “సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు” అంటూ ఓ కథ మొదలవ్వొచ్చు. “ఆ పథకం అందరిజీవితాలలో వెలుగులు నింపింది” అన్న ఓ వార్తాంశం కావొచ్చు. అన్నీ పెర్సొనిఫికేషన్ కు చక్కని ఉదాహరణలే.
అందమైన అమ్మాయి చందమామ పోలికని పెర్సొనిఫికేషన్ టెక్నిక్ ద్వారా చెప్పాలనుకొంటే ఇలా చెప్పొచ్చు. “ఆమె వదనాన్ని చూసి చందమామ ఈర్ష్యతో మబ్బులచాటుకు వెళిపోయింది”

నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు. --- ఇస్మాయిల్

ఇల్లుఖాళీ చేసిన సందర్భాన్ని కొండేపూడి నిర్మల ఒక కవితలో ఇలా వర్ణిస్తారు.
 
ఉనికి తాలూకు ఆనవాళ్ళన్నీ
చెరిగిపోతాయి
పెట్టేబేడా సర్దేయగానే
ఒకట్రొండు బాధగా వొంగిన
మేకులు మినహా
పెద్దగా మార్పేమీ ఉండదు.//
అద్దంలేని గోడ
తలమాసిందని చెప్పదు
సబ్బులేని స్నానాలగది కిటికీ
పరిమళాన్ని పావురంలా ఎగరేయదు (ఇల్లు ఖాళీ చేసినపుడు - కొండేపూడి నిర్మల)

పై వాక్యాలలో మేకులకు, అద్దానికి, స్నానాల గదికి మానవలక్షణాలు ఆరోపించటం ద్వారా మామూలు సందర్భంలోని ఉద్వేగం ఎన్నోరెట్లు హెచ్చింపబడింది. మేకులే బాధతో వొంగాయంటే ఇక మానవహృదయం ఎంత? అనే భావన కలిగిస్తారు కవయిత్రి. దీనంతటికీ కారణం సమర్ధవంతంగా వాడబడిన పెర్సొనిఫికేషన్ (Personification) టెక్నిక్.
 
3. పారడాక్స్, ఆక్సిమొరాన్ లు
పరస్పరవ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు భావాల్ని కలిపి చెప్పటాన్ని పారడాక్స్ అంటారు. భయం తెలిసినవాడే నిజమైన వీరుడు, చనిపోవటం కొరకు బ్రతకితీరాలి, కనిపించనివాటిని చూసే కళే దృష్టి, విడిపోయి కలిసిఉందాం, భిన్నత్వంలో ఏకత్వం- వంటి వాక్యాలు పారడాక్స్ కు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

పరస్పర వ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు పదాల్ని కలిపి చెప్పటాన్ని ఆక్సి మొరాన్ అంటారు. తెలివైన మూర్ఖుడు, బహిరంగ రహస్యం, ఒరిజినల్ కాపీ, శాంతి దళం, మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ఆక్సిమొరాన్ కూడా ఒకరకమైన పారడాక్సే. అందుకే దీనిని సంక్షిప్త పారడాక్స్ (compact Paradox) అనికూడా అంటారు.

"చల్లని చంద్రబింబం లాంటి ఆమె ముఖం... నా మనసులో విరహపు మంటల్ని రగిలిస్తోంది." పారడాక్స్ కి ఉదాహరణగా చెప్పొచ్చు.
 
త్రిశ్రీ కవిత్వంలో కనిపించే కొన్ని పారడాక్స్ అభివ్యక్తిలు .....

• మృత్యువును కౌగిలించుకునైనా మాట నిలబెట్టాలి//
• ఉరికంబాన్ని ఉర్రూతలూగించి అయినా ప్రాణశక్తిని తేజోమయం చేయాలి (ఎన్ కౌంటర్)
• భయం ముందు నిర్భయంగా చెలరేగిపోతాను. (రహస్యోద్యమం)
• హతుడే హంతకుడైన చోట హత్య నేరం కాలేదు (ఆత్మహత్యలన్నీ హత్యలే)
• కొన్ని ఎండలు వానలకు తడిశాయి (సంధ్యార్ణవం)
కవిత్వం ఎక్కువగా పోలికలపై ఆధారపడి నడుస్తుంది. పారడాక్స్ మాత్రం వైరుధ్యాలను ఎంచుకొంటుంది. అందుకే పారడాక్స్ ఒక మేధాపరమైన విలక్షణ ప్రక్రియ. గొప్ప పారడాక్స్ ను సృష్టించగలిగే కవి మేధాకవిగా గుర్తింపు పొందగలడు.
 
4. మెటానమి, సినక్డకి

కవిత్వంలో రెండువస్తువులను పోల్చుతున్నప్పుడు, ఒక వస్తువు బదులుగా దానికి సంబంధం ఉన్న మరొక వస్తువును పెట్టటాన్నే మెటానమి (Metonymy) అంటారు.
 
మెటఫర్ లో కూడా రెండు వస్తువులను పోల్చటం జరుగుతుంది. కానీ దానిలో రెండు వస్తువులు స్పష్టంగా తెలుస్తూంటాయి. మెటానొమిలో ఒక వస్తువే చెప్పబడుతుంది రెండవ దానిని ఊహించుకోవాలి. దీనివల్ల మెటానొమీ కలిగిన వాక్యాలను అర్ధం చేసుకోవటానికి పాఠకుడు కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది.
 
“మా ఆఫీసరు ఒక పెద్దపులి” -- అనే వాక్యం మెటాఫర్ కు ఉదాహరణ. దీనిలో పోల్చబడిన రెండు వస్తువులు స్పష్టంగా ఉన్నాయి. వాటిలో పెద్దపులి లక్షణాలైన నిర్దయ, క్రౌర్యం, బలం లాంటివి ఆఫీసరు అనే వ్యక్తికి చేరి అతని స్వభావాన్ని అర్ధం చేసుకోవటానికి దోహదపడతాయి.
 
“పెద్దపులి రివ్యూ మీటింగ్ పెట్టింది” - అనే అన్న వాక్యం మెటానమికి ఉదాహరణ. ఇక్కడ ఆఫీసరు, పెద్దపులి అన్న రెండు వస్తువులలో ఒకటే ప్రస్తావించబడింది. రివ్యూ మీటింగులు ఆఫీసరులే పెడతారుకనుక పెద్దపులి అన్న పదం ఆఫీసరుకి ప్రాతినిధ్యపదం అవుతుంది. ఆ ఆఫీసరు పెద్దపులిలా నిర్దయుడని, క్రూరుడని, బలవంతుడని అర్ధం చేసుకోవాలి.

సినక్డకి (Synecdoche) కూడా మెటానమీ లాంటిదే కానీ ఇక్కడ ఒక వస్తువు బదులుగా దానికి సంబంధం ఉన్న మరొక వస్తువులోని “భాగం” తో (part) పోల్చటం జరుగుతుంది.
ఆయన “పంజా” విసిరి పదిమంది “పొట్ట” కొట్టాడు. -- ఈ వాక్యంలో పంజా, పొట్ట అన్న పదాలు “సినక్డకి” లకు ఉదాహరణలు. పంజా అన్న పదం మనకు పులిని గుర్తుకు తెస్తుంది. పంజా పులికి, పొట్ట మనిషికి చెందిన “భాగాలు” మాత్రమే, సంపూర్ణార్ధాన్ని పాఠకుడు పూరించుకోవాలి. ఒక మనిషి తన పొట్ట నింపుకోవటానికి ఏదో ఉద్యోగం చేస్తాడు.
 
పైవాక్యంలో ఉన్న సినక్డకి టెక్నిక్ వల్ల – పెద్దపులి లాంటి ఒక దయలేని ఆఫీసరు పదిమందిని ఉద్యోగంలోంచి తీసేసాడు అన్న విస్త్రుతార్ధం సిద్ధించింది.

చంద్రబింబం నడుచుకొంటూ వస్తున్నది అంటే మెటానమీ.

ఆమె రాకతో గదంతా వెన్నెలతో నిండిపోయింది అంటే సినక్డకి.

పైట కొంగును చూస్తే
నా కెందుకో
పాతివ్రత్యం గుర్తొస్తుంది !
భుజాలనించి కిందికి వేలాడే
గుదిబండలా
అదెప్పుడూ నా స్వేచ్ఛని హరిస్తూనే ఉంటుంది !//
నేను నడిచే శవాన్ని కాకుండా ఉండాలంటే
ముందుగా పైటని తగలెయ్యాలి
పైటని తగలెయ్యాలి. (పైటను తగలెయ్యాలి -- జయప్రభ)

స్త్రీ స్వేచ్ఛ, హక్కులను తరతరాలుగా హరిస్తున్న ఆచారాలు, వివక్షను "పైట" అనే పదంతో మెటానోమికాభివ్యక్తి చేసారు కవయిత్రి. స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షను తగలెయ్యాలి అన్న అర్ధంలో పైటను తగలెయ్యాలి అన్న ప్రయోగం చేసారు.
 
చాలామంది కవుల ఐకానిక్ కవితలన్నీ మెటానొమికాభివ్యక్తి కలిగిన కవితలే కావటం గమనార్హం. ఇస్మాయిల్ - చిలకలువాలిన చెట్టు, ఖాదర్ మొహిద్దిన్-పుట్టుమచ్చ, శిఖామణి-కొయ్యకాలు, సతీష్ చందర్-కలవని కనుపాపలు, తిలక్-నీవులేవు నీ పాట ఉంది, జయప్రభ-పైటను తగలెయ్యాలి, కొండేపూడి నిర్మల-నడిచేగాయాలు, మెర్సి మార్గరెట్-ప్రశ్నలగది మొదలైనవి కొన్ని ఉదాహరణలు.
"కవిత్వం మెటాఫర్ నుండి మెటానమీకి... ప్రయాణించాలి" అన్న వేగుంట మోహన్ ప్రసాద్ మాటలు కవిత్వంలో మెటానొమీకి కల స్థానాన్ని, స్థాయిని చెపుతాయి. మెటానొమీ పై పట్టుసాధించిన కవులు గొప్పకవులుగా నిలిచిపోతారు.
 
5. అల్లిగొరి
బయటకు ఒక అర్థం లోపల మరొక అర్థం ధ్వనింపచేసే టెక్నిక్ ను అల్లిగొరి అంటారు. దానికి శిఖామణి గారి నల్లని దానను అనే పేరుతొ రాసిన కవిత గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఆ కవిత మొత్తం మినువులపై రాసిన కవితగా అనిపించినా అంతర్లీనంగా దళితతాత్విక చింతనతో నడుస్తుంది.
 
నేను నల్లని దానను
నవ ధాన్యాల్లో నాలుగో దానను
నా పేరు మినుము
శక్తికి నేను ఇనుము//
గుండె కింది తడిలాంటి
ఇంతచెమ్మ నన్ను సోకితే చాలు
వొళ్లంతా కింజల్కపు పులకింతలతో
ఉబ్బితబ్బిబైపోతాను
ఆపై నన్ను స్పృశిస్తే
శ్వేత ప్రపంచాన్ని తెల్ల మొగం వేయించి
ఉర్రూతలూగించిన
ఆటపాటల నెలరేడు
మైఖేల్ జాక్సన్ లా
తెల్లగా మిలమిలా మెరిపోతాను.
నేను నల్లనిదానను
చరిత్రగర్భాన్ని చీల్చుకొచ్చిన
వేయి రేకుల బాకుల నల్ల కలువను
వర్తమాన దళిత రణక్షేత్రంలో
సమతారథం శిఖరాగ్రంపై
రెపరెపలాడే గబ్బిలపు ధ్వజాన్ని (నల్లని దానను - శిఖామణి)

సమకాలీన తెలుగు సాహిత్యంలో అల్లిగొరికి ఇంతకు మించి శక్తివంతమైన ఉదాహరణ దొరకదు.
 
6. హైపర్ బొలి
హైపర్ బొలి అంటే అతిశయోక్తీకరించటం. ఆలూరి బైరాగి నాక్కొంచెం నమ్మకమివ్వు కవితలో నాక్కొంచెం నమ్మకమిస్తే
కొండలు పిండి కొట్టేస్తాను
చితికిన టమాటోలాంటి సూర్యుడ్ని
ఆరిన అప్పడంలాంటి చంద్రుడ్ని
ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను
నాదగు బాహుబంధనంలో
ఈ విశాల బ్రహ్మండాన్ని చాపలా చుట్టేస్తాను…. అంటాడు ఇవన్నీ హైపర్ బొలి టెక్నిక్ కు చక్కని ఉదాహరణ.
 
7. అల్యూజన్ (Allusion)
చరిత్రనుంచో, పూర్వసాహిత్యం నుంచో ఏదైనా ఒక ఉదంతాన్ని సూచించే పదాన్నొ, వాక్యాన్నొ కవితలో ఉదహరించటాన్ని అల్యూజన్ అంటారు.

శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటనవేలును
గొడ్డలితో నరుకుతున్నాడు
బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి
పాతాళానికి తొక్కేస్తున్నాడు/
కాలం కసాయి కత్తిమీద నిలబడి
గర్జిస్తున్న చండాలుడు
ఆదిశంకరునిపై నాలుగు వేటకుక్కల్ని
ఉసిగొల్పుతున్నాడు (నడుస్తున్న చరిత్ర - శివసాగర్)

పై కవితలో శివసాగర్ దళిత పురాణపాత్రలచే తమకు అన్యాయం చేసినవారిపై తిరుగుబాటు చేయిస్తాడు. ఇది ఒక కొత్త ఉదయానికి సూచనగా చెపుతాడు. దీన్ని తమ చరిత్రను తామే లిఖించుకోవటానికి చేసిన ప్రయత్నంగా భావించాలి.
అల్యూజన్ వల్ల, కవిత పరిధి పెరిగి అర్ధం విస్త్రుతమౌతుంది. కవి ఉటంకించిన ఉదంతం పట్ల చదువరికి పూర్వజ్ఞానం లేకపోతే అల్ల్యూజన్ అర్ధం కాదు.

8. ఐరనీ (Irony)

పైకి ఒక అర్ధాన్ని అంతర్లీనంగా దానికి "వ్యతిరేక అర్ధాన్ని" కలిగి ఉండేలా చెప్పటాన్ని ఐరనీ అంటారు. వెటకారం, సార్కాజం లకు దగ్గర ఐరనీ
కవిత్వంలో ఐరనీని ఉపయోగించి గొప్ప ధిక్కారాన్ని పలికించవచ్చు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు, అవకతవకలకు కలిగే కోపంలోంచి ఐరనీ పుడుతుంది. మార్చలేని నిస్సహాయ స్థితిని ఐరనీ ద్వారా చాలా శక్తివంతంగా వ్యక్తీకరించవచ్చు.
 
//నువ్వొకప్పుడు ఇంగ్లాండవతారంలో మమ్మల్ని
కరుణించావ్
మూర్ఖులం నీ లీల గ్రహించలేక నిన్ను ద్వేషించాం
అయితే నేం
పాపుల్ని కరుణించే వరకూ నువ్ నిద్రపోవ్ కదా
నివ్విప్పుడు అమెరికావతారంలో సాక్షాత్కరించి
మా ద్వారాలు తెరిపించావ్
ఇప్పుడు మా మెదడూ – హృదయంలోనూ నీ
నామ స్మరణమే// - (ప్రపంచీకరణ)

ఇరవై ఏళ్ల క్రితం అద్దేపల్లి ప్రభు వ్రాసిన ఈ కవితలో వస్తువు ప్రపంచీకరణ. ప్రపంచీకరణ దుష్ప్రభావాలను ఇంకా పూర్తిగా అవగాహనకు రాని సమయంలోనే వ్రాసిన కవిత ఇది. ఇందులో ప్రపంచీకరణను దేవుని అవతారంగా చెపుతాడు కవి. ఒకప్పుడు ఇంగ్లాడు రూపంలో వచ్చింది, ఇప్పుడు అమెరికా రూపంలో వస్తోంది అంటాడు. కరుణించటం, లీలగ్రహించటం, సాక్షాత్కరించటం, నామ స్మరణ వంటి ప్రయోగాలు మతపరిభాషగా అనిపించినా వాటి వాచ్యార్ధాలకు వ్యతిరేకార్ధలను ఇస్తాయి కవితలో. ఇది ఐరనీగా చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణకు లొంగిపోవటం వల్ల విచ్చిన్నమౌతున్న మానవవిలువలు, పరాయీకరణల పట్ల కవికి కలిగిన కోపంలోంచి పుట్టుకొచ్చిన ఐరనీ ఇది. సమకాలీన సామాజపోకడపై సంధించిన గొప్ప వక్రోక్తి.
 
9. నిరలంకారత
ఒక కొత్త ఆలోచననో, బరువైన సంఘటననో, బలమైన ఉద్వేగాన్నో చెప్పదలచుకొన్నప్పుడు నిరలంకారంగా చెప్పటం కూడా ఒక మంచి కవిత్వ నిర్మాణ టెక్నిక్.

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం – ప్రాణమిస్తం// (కాళోజి)

మహాకవి కాళోజీ వ్రాసిన పై వాక్యాలలో ఏరకమైన అలంకారాలు కనిపించపోయిన ఒక జాతి అంతరంగం ఆవిష్కృతమైంది. భావోద్వేగాలను, మానవ సంవేదనను వ్యక్తీకరించే కవిత్వానికి కొన్నిసార్లు అలంకారాలు అవసరం లేదనటానికి మహాకవి కాళోజీ కవిత్వమే నిదర్శనంగా నిలుస్తుంది.
 
అలంకారాలు లేకుండా కూడా మంచి కవిత్వం చెప్పగలుగుతున్నప్పుడు ఇక అలంకారాల ఉపయోగం ఏమిటి అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఎంతో శక్తివంతమైన కవితా వస్తువు, లోతైన కొత్త ఊహ లేదా గుండెలను బలంగా మోదగలిగేటంతటి సత్తువ కలిగిన ఉద్వేగమూ లేక పోతే నిరలంకార కవిత్వం ఉత్త వచనంగా మిగిలిపోతుంది.
 
త్రిపురనేని శ్రీనివాస్ “వచనమై తేలిపోతావ్” అని హెచ్చరించింది అలాంటి కవిత్వం గురించే.
 
ముగింపు

కవిత్వభాషలో మరొక ముఖ్యమైన అంశం లయ. యతి, ప్రాశలు ఆధునిక కవిత్వానికి వర్తించకపోయినప్పటికి పదాల మధ్య అనుప్రాస కవిత్వానికి అందాన్నిస్తుంది. పాదవిభజన కూడా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఆ వాక్యాలలో ఒక అంతర్లయ అనుభవానికి వచ్చి చదువుతున్నప్పుడు హాయినికలిగిస్తుంది.
 
కవి తనకు కలిగిన అనుభవాన్ని పదాల సహాయంతో భాషలోకి తీసుకొస్తాడు. వివిధ కవిత్వనిర్మాణ టెక్నిక్ లైన సిమిలీ, మెటఫర్, పారడాక్స్, పెర్సొనిఫికేషన్, మెటనిమి, సినక్డకి, అల్లిగొరి, అల్యూజన్, పారడాక్స్, ఐరనీ, హైపర్ బొలి వంటి వివిధ నిర్మాణపద్దతులు మామూలు భాషను కవిత్వభాషగా మారుస్తాయి.
 
ప్రతిభ కలిగిన కవి తాను చెప్పదలచుకొన్న అంశానికి తగిన టెక్నిక్ లను వాడుకొని తన ఉద్వేగాన్ని యధాతధంగా చదువరిలో ప్రవేశ పెట్టగలుగుతాడు. అప్పుడు మాత్రమే అతని వ్రాసింది కవిత్వమౌతుంది. లేకపోతే పేలవమైన వచనంగా మిగిలిపోతుంది.
 
ఈ కవిత్వ నిర్మాణ మెళకువలన్నీ తెలుసుకున్నంత మాత్రాన కవిత్వం వచ్చేస్తుందా? అంటే—ఇవి కవిత్వాన్ని ఎలా రాయాలో’ మార్గం చూపుతాయి తప్ప, కవిత్వాన్ని సృష్టించలేవు. కవిత్వాన్ని కవే స్వయంగా సృష్టించాలి. దానికి నిశిత పరిశీలన, ప్రతిభ, అభ్యాసం అత్యంత ఆవశ్యకం.
సాహిత్యం ఒక అనంతమైన నదీ ప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్తూ మానవజాతి భౌతిక మానసిక ప్రపంచాలను అన్వేషిస్తూ తన స్థలకాలాదులను, విశేషాలను లిఖించుకొంటూ సాగిపోతాడు. ప్రతీతరపు రచనలూ కాలక్రమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి ఆ తరం జీవించిన జీవితాలను భవిష్యతరాలకు అందిస్తాయి. మానవజీవితాలను, ఉద్వేగాలను అక్షరబద్దం చేసేది సాహిత్యం మాత్రమే. చదివితే వచ్చే రాంకుల్లాగ, మార్కుల్లాగా సాహిత్యం చేసే పని పైకి కనిపించదు. మరీ ముఖ్యంగా కవిత్వం చేసే పని.
 
బొల్లోజు బాబా

పై అంశాలు ఇదివరలో నేను రాసిన "కవిత్వ భాష" అనే పుస్తకంలోనివి లింకు మొదటి కామెంటులో కలదు


https://archive.org/details/kavithva-bhasha-by-bolloju-baba


Monday, June 8, 2026

ఫిడెల్‌కు గీతం (Song to Fidel by చేగువెరా)

సూర్యుడు ఉదయిస్తాడని చెప్పావు,
పద వెళ్దాం - ఎవరూ నడవని ఆ దారుల వెంట
నువ్వు ప్రాణంగా ప్రేమించే
పచ్చటి క్యూబాను విముక్తం చేద్దాం!

మనతలలపై మెరిసే విప్లవ తారలు
అవమానాలన్నింటినీ తుడిచేస్తూ సాగుదాం,
విజయమైనా మరణమైనా.

మొదటి బుల్లెట్ శబ్దానికి
అడవి ఆశ్చర్యంతో మేల్కొంటుంది,
ఆ క్షణంలో... తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.

భూమి, భుక్తి, న్యాయం, స్వేచ్ఛ అంటూ
నీ గళం నలుదిక్కులా ప్రతిధ్వనించినప్పుడు,
తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.

ఆ నియంతపై పోరాటం ముగిసి,
తుది సమరానికి వ్యూహాలు సిద్ధమవుతున్నప్పుడు,
తోడుగా మేం నీ పక్కనే ఉంటాం.

క్యూబా విసిరిన బాణం గుచ్చుకొని
ఆ క్రూరమృగం తన గాయాలను నాక్కుంటున్నప్పుడు,
గర్వంతో నిండిన గుండెలతో మేం నీ పక్కనే ఉంటాం.

బహుమతులతో ప్రలోభపెట్టే ఆ శక్తులు
మన నిజాయితీని కొల్లగొట్టలేవు
మనకు కావలసింది వాళ్ల తుపాకులు, బుల్లెట్లు, లాఠీలు...
అంతకు మించి ఏమీ వద్దు!

అమెరికా ఖండ చరిత్ర వైపు సాగే ఈ ప్రయాణంలో,
ఒకవేళ ఇనుప గుళ్ళు మనల్ని అడ్డుకుంటే...
మన గెరిల్లా అస్థికలను కప్పడానికి
క్యూబా కన్నీటి వస్త్రాన్ని ఒక్కదాన్ని కోరుతాం,
అంతకు మించి ఏమీ వద్దు!

Song to Fidel by Ernesto ‘Che’ Guevara

భావానువాదం- బొల్లోజు బాబా
***
1957లో క్యూబా విప్లవ పోరాటం ఉద్ధృతంగా సాగుతున్న రోజుల్లో, ఎర్నెస్టో "చే" గువేరా తన సహచరుడు ఫిడెల్ కాస్ట్రోకు అంకితంగా రాసిన కవిత ఇది. ఇది విప్లవ మైత్రికి, నిబద్ధతకు, త్యాగానికి ప్రతీక. "నీ పక్కనే ఉంటాం" అనే వాక్యం ఈ కవితకు హృదయం.
ఈ కవితను ప్రస్తావించిన శ్రీ కె. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో

నడిచిన అడుగులు



అనేక : తెలుగుప్రభ సాహిత్య పేజీ లో నా కవిత.


ఒకట్రెండు నక్షత్రాలు రాలినా
ఆకాశం కూలిపోదు
ఒకట్రెండు రాళ్ళు తీసినా
ఏరు ఆగిపోదు
నువ్వు నేనూ లేకపోయినా
ఈ లోకం తిరుగుతూనే ఉంటుంది
మనం వదిలిన కథలను మోసుకొంటూ

పడిపోయి లేచావు చూడు అదొక కథ
తప్పుచేసి ఒప్పుకొన్న కథ
ప్రేమించి గోడదూకిన కథ
ఒక నిజం కోసం నిలిచిన కథ
నీ గురించి చెప్పేటపుడు
కళ్లలో వెలుగు రావాలి,
“తను ఒక కథ” అని
హృదయం గర్వంగా పలకాలి.

నువ్వు కాదు…
నువ్వు మిగిల్చిన కథలు మాత్రమే శాశ్వతం


బొల్లోజు బాబా
స్కై బాబా అన్నకు ధన్యవాదములతో



ఎవరికీ పట్టని విషాదం


ఈ సంవత్సరం
ఒక్క వలసపక్షీ రాలేదని
స్థానిక పత్రికలో
ఒక మూల చిన్న వార్త

కానీ
రేపు
గూడకొంగల రెక్కలనీడలో
విచ్చుకొనే వసంతం కూడా రాదని
సారసపక్షుల దేహకాంతులను
ధరించే శరత్తు కూడా కనిపించదని
ఉల్లంకి పిట్టలు విడిచివెళ్ళే
పసిడి వెలుగుల
హేమంతం కూడా కరుణించబోదని
ఎవ్వరూ
మాట్లాడుకోవటం లేదు
ఆశ్చర్యంగా


బొల్లోజు బాబా
(పర్యావరణ దినోత్సవం సందర్భంగా - రానున్న నా కొత్త కవిత్వ సంపుటి నుంచి)

Sunday, May 24, 2026

రిజర్వేషన్లపై....


( "ఎన్నాళ్ళిస్తారు ఈ రిజర్వేషన్లు" అంటూ మాజీ లోక్ సభ స్పీకర్ పేరుతో వైరల్ అవుతున్న కామెంటుకు నా స్పందన)
.
రిజర్వేషన్లు అనేవి ఎవరి రొట్టెముక్క వాళ్లకు దక్కే మెకానిజం. నా ముక్కా తినేస్తాను, ఎదుటివాని ముక్కా నేనే తినేస్తాననడం మోసం, అన్యాయం.
ఈ రోజు EWS రూపంలో దాదాపు అన్ని సామాజిక వర్గాలకూ ఏదో ఒక రూపంలో రిజర్వేషన్లు ఉన్నాయి. పైగా 50% “మెరిట్ కోటా” ఉండనే ఉంది. అయినప్పటికీ “మెరిట్” పేరుతో రిజర్వేషన్లపై చేసే వాదన చాలాసార్లు ఇతరుల వాటాను కూడా ఆక్రమించుకోవాలనుకొనే మెరిట్ లేనివాళ్ళు చేసే వాదన.
అసలు ఈ గోల అంతా ఎందుకు?
అన్నీ జనాభా ప్రాతిపదికన పంచితే సరిపోదా?
అప్పుడు సుమారు 56% జనాభా ఉన్న BCలకు 27% కాకుండా 56% రిజర్వేషన్లు వస్తాయి. అలాగే సుమారు 5% జనాభా ఉన్న పేద OCలకు 10% EWS కాకుండా 5% వాటా మాత్రమే వస్తుంది.
నిజమైన న్యాయం అంటే — ప్రతి వర్గానికి వారి జనాభా, వారి ప్రాతినిధ్యం మేరకు వాటా దక్కడం. నిజానికి విద్య, భూమి, ఆర్థిక వనరులు, సామాజిక గౌరవం, నెట్‌వర్కులు ఇవన్నీ తరతరాలుగా అసమానంగా పంచబడ్డాయి. వాటిని ఎలాగా ఇప్పుడు మార్చలేం. ఆ అసమానతల్ని సరిచేయడానికే రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు భారతదేశానికే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్న విధానమే.
అసమానతల కులాన్ని నిర్మూలించనంతవరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే. అంతే కాదు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగానికి కూడా విస్తరించాలి. ప్రజల సొత్తైన భూముల్ని, అడవుల్ని, గనుల్ని ఉచితంగా, ఏటా లక్షల కోట్ల రుణమాఫీలు, టాక్స్ మినహాయింపులు పొందుతున్న ప్రైవేట్ రంగం ఆ మాత్రం సామాజిక బాధ్యత ఎందుకు వహించదు? మంది సొమ్ముతో వారి సామాజిక వర్గాలే వృద్ధి చెందాలా?
బొల్లోజు బాబా

సోషల్ మీడియా ఆల్గోరిథం

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఆల్గోరిథం ఎలా సెట్ చేసారంటే, బత్తాయిలకు మేలు చేసేది మాత్రమే వైరల్ అవ్వగలదు. ఏదైనా వైరల్ అయిందంటే దానిలో బత్తాయిలకు అనుకూలంగా ఉండే అంశం ఏదో ఉందన్నమాట.... డిజిటల్ స్ట్రాటజిస్టు "పండితుల" ప్లానింగ్ అలాంటిది. పురాణకాలం నుంచీ చూస్తున్నదే ఇది.
అది - సమకాలీన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించి విపక్షాల సీరియస్‌నెస్‌ను ఒక జోక్‌గా మారుస్తోన్న కాక్రోచ్ పార్టీ ఉదంతం కావచ్చు; పేదల ప్రొటీన్ ఆహారాన్ని లాక్కొని ఎక్స్పోర్ట్ కంపనీలకు చేర్చే "బీఫ్ రక్షణ" అంశం కావొచ్చు

ఒక కామెంట్

ముస్లింలపై డా.అంబేద్కర్ అభిప్రాయాలను విభజన పూర్వ విభజనానంతర అభిప్రాయాలుగా చూడాలి. మొదటిదశలో - వందల ఏళ్ల పాలనలో హిందూ-దళిత సమస్యకు పరిష్కారం చూపలేకపోయిన పాలకులుగా ముస్లిములని చూస్తారు.
 
రెండవదశలో ఈదేశంపై ప్రేమతో ఇక్కడే ఉండిపోయిన ముస్లిములను బాధితులుగా/మైనారిటీలుగా చూస్తారు. రాజ్యాంగంలో వారికి సాంస్కృతిక, మత, విద్యా పరిరక్షణ హక్కులు కల్పించారు. స్వతంత్ర భారతదేశంలో వారిపై ప్రతీకారభావ ఉండరాదని భావించారు.
  
హిందుత్వ వాదులు డా. అంబేద్కర్ ముస్లింలపై విభజనపూర్వం వెలిబుచ్చిన అభిప్రాయాలను ముందుకు తెచ్చి వాదిస్తారు అతితెలివితో....
డా. అంబేద్కర్ సత్యాన్వేషి, వాస్తవికుడు. ఈ సందర్భంలో సెలెక్టివ్ కోట్స్ ద్వారా ఆయనను నిర్వచించలేం.

Wednesday, May 13, 2026

The Banker సినిమా - Dr. B. R. Ambedkar



The Banker సినిమా చూశాను. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా బయటికి ఇది ఒక రియల్ ఎస్టేట్ కథలా కనిపించినా, నిజానికి ఇది ఆర్థిక స్వేచ్ఛ కోసం నల్లజాతీయులు చేసిన పోరాట చరిత్ర

1960లలో అమెరికాలో నల్లజాతీయులకు తెల్లవారు నివసించే ప్రాంతాల్లో ఇళ్లు అమ్మడం, అద్దెకు ఇవ్వడం దాదాపు నిషేధం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో బెర్నార్డ్ గారెట్, జో మోరిస్ అనే ఇద్దరు నల్లజాతీయులు ఒక తెల్లజాతి స్నేహితుని ముందుపెట్టి వందల కొద్దీ తెల్లజాతీయుల ఇళ్లను కొనుగోలు చేసి, వాటిని నల్లజాతీయులకు అమ్ముతారు. తర్వాత వారు బ్యాంకులను కూడా కొనుగోలు చేసి, నల్లజాతీయులకు వ్యాపార రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తారు.

సినిమా ప్రారంభంలో ఒక పాత్ర ఇలా అంటుంది:
“నల్లవారు సంపాదించలేరు. సంపాదించినా తెల్లవారు సహించలేరు.”

అలాగే చివరికి, వారు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చట్టపరమైన లొసుగులు ఉన్నాయని సాకుగా చూపుతూ ప్రభ్హుత్వం వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, జైలుకు పంపిస్తుంది. కానీ కొన్నేళ్లకే అదే అమెరికా ప్రభుత్వం, నల్లజాతీయులు కూడా తెల్లవారి ప్రాంతాల్లో నివసించవచ్చని చట్టం తెస్తుంది..

ఈ సినిమా చూస్తున్నంతసేపూ, మన దగ్గర దళితులు, అన్యమతస్థులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడం, అమ్మడం లాంటి వాటిపై పెరిగిన అనధికార నిషేధాలు గుర్తుకొచ్చాయి.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — అమెరికాలో అలాంటి చట్టాలు రావడానికి దాదాపు రెండు దశాబ్దాల ముందే, డా. B. R. Ambedkar భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికీ కులమతాలకు అతీతంగా దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఆస్థిని కొనుక్కొనే హక్కును పొందుపరిచారు. ఎంత దూరదృష్టి! ఎంత క్రాంతదర్శనం!

బొల్లోజు బాబా



Sunday, April 12, 2026

గ్రామదేవత గొంతెమ్మ వృత్తాంతం

గొంతెమ్మ/గొంతాలమ్మ భారతంలోని కుంతీదేవి అంశ అని జానపదుల విశ్వాసం. ఆంధ్రమహాభారతంలో కుంతీదేవిని గొంతి అని సంబోధించడం అనేకచోట్ల కనిపిస్తుంది.
దళిత వర్గాలు 'గొంతెమ్మ' లేదా 'గొంతాలమ్మ' పేరుతో కుంతీ దేవిని తమ ఇలవేల్పుగా పూజించడం వెనుక అనేక జానపదగాథలు, సామాజిక పౌరాణిక అంశాలు ఉన్నాయి.
అగ్రవర్ణాల వారు కుంతీదేవిని తప్పు చేసిన శాపగ్రస్తురాలిగా భావించి దేవతగా అంగీకరించలేదు. కానీ, దళిత కులాల వారు (ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో) అట్లతద్దెను కుంతీదేవి పండుగగా ఘనంగా జరుపుకుంటారు.

దళితుల ఇలవేల్పు కావడానికి గల వివిధ ఐతిహ్యాలు
.
1. పంటల పండుగ (నేదునూరి గంగాధరం గారి కథనం): కుంతీదేవి పెంచిన ఒక ఆంబోతు రైతుల పంటలను పాడుచేయగా, ఆమె అలా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుంది. పశువులను హింసించకుండా ప్రేమగా చూసుకునే దళితుల చేలల్లోనే తిరగమని ఆ ఎద్దుకు సూచిస్తుంది.
మాలవారి చేనులో మసలుమా ముద్దూల నందన్న
మాలోరు మంచోరు మక్కువతో కొలుస్తారు ముద్దూల నందన్నా…...... అంటూ ఆ ఎద్దుకు కుంతీదేవి చెప్పిందట! ఈ సందర్భంగా పశువులను, వ్యవసాయాన్ని రక్షించే ఈ పండుగ ఒక 'పంటల పండుగ'కు ప్రతీక.

2. ధర్మరాజు శాపం (సురవరం ప్రతాపరెడ్డి గారి వివరణ): కురుక్షేత్ర యుద్ధం ముగిశాక, కర్ణుడు తన సొంత అన్న అనే రహస్యం తెలుసుకున్న ధర్మరాజు తీవ్రంగా బాధపడతాడు. ఈ విషయాన్ని ముందే చెప్పకుండా యుద్ధానికి కారణమైనందుకు కోపించి, తల్లి కుంతీదేవిని 'మాలల దేవత'గా మారమని శపిస్తాడు. అప్పటినుండి ఆమె దళితుల ఇలవేల్పు అయ్యిందని చెబుతారు.

3. కోయ గిరిజనుల విశ్వాసం: కుంతి కుమారుడైన భీమసేనుడు ఒక నర్తకిని ప్రేమించాడని, ఆ ఇద్దరికీ పుట్టినవారే తమ వంశీకులని (కోయలని) వారి నమ్మకం. అడవులు నరికే సమయంలో గొంతాలమ్మ తమకు అండగా నిలిచిందని వారు భావిస్తారు.

సమాజంలో కర్ణుడిలాగే తాము కూడా తిరస్కారానికి గురయ్యామని భావించే దళిత వర్గాలు, అగ్రవర్ణాలచే దూరం చేయబడిన కుంతీదేవిని తమను ఆదరించే 'కన్నతల్లి'గా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. (అంతేకాదు ధర్మరాజు, అర్జనుడు, భీమసేనుడు నకులుడు, సహదేవుడు లాంటి పేర్లు ఎక్కువగా దళితులకే ఉండటం గమనార్హం)

పండుగ ఆచారాలు - "సాగనంపు":

కృష్ణా, గోదావరి జిల్లాల్లో దసరా లేదా అట్లతద్దె సమయంలో పది రోజుల పాటు ఈ గొంతాలమ్మ పండుగ చేస్తారు.
రేగడి మట్టిలో పాలుపోసి పిసి గొంతెమ్మ బొమ్మను తయారు చేసి పూజిస్తారు.
పదవ రోజున గొంతెమ్మ బొమ్మతో పాటు నంది, కప్ప బొమ్మలను కూడా దళిత వాడల్లో తెల్లవార్లూ ఊరేగించి, ఊరి బయట విడిచిపెడతారు (లేదా నదిలో కలుపుతారు). ఇలా సాగనంపడాన్ని "సాగనంపు" ఉత్సవం అంటారు. (రి. కృష్ణాజిల్లా గ్రామదేవతలు, డా. జి వి పూర్ణచందు)

*****
శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు సేకరించిన జానపద వీరగాథలలో గొంతెమ్మ కథ పేరుతో ఒక వీరగాథ ఈ విధంగా సాగుతుంది.

గొంతెమ్మ కథ (గవరమ్మ గాజులు) - సారాంశం
రేణుకాదేవి కుమార్తె గవరమ్మ ఈడుకు రాగానే, ఆమె అన్నలైన జంపయరాజు, పరశురాముడు తండ్రి జమదగ్ని కలిసి ఆమెను పురుషుల గాలి తగలకుండా అడవిలో ఒక ప్రత్యేకమైన 'లక్కసిరి మేడ' కట్టించి, అక్కడ ఏడుగురు దాదుల కాపలాలో ఉంచారు.
కార్తిక మల్లన్న రాక: గోనెలకోటను పాలించే సిద్ధమాశెట్టి (విచిత్ర వీరరాజు), తరిదేవి దంపతులకు ఏడుగురు కుమారులు. వారిలో చిన్నవాడు కార్తిక మల్లన్న. సిద్ధమాశెట్టి దంపతులు తమ కుమారుడికి గవరమ్మను ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి రేణుకాపురి వచ్చారు. కానీ జంపయరాజు, పరశురాముడు అందుకు ఒప్పుకోకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
మాయా గాజుల బత్తుడు: తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న కార్తిక మల్లన్న, ఎలాగైనా గవరమ్మను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అతను గాజుల వ్యాపారి (గాజుల బత్తుడు) వేషం వేసి, 'మరల గాజులు' (చూస్తే మోహం కలిగించే మాయా గాజులు) తీసుకుని రేణుకాపురి వెళ్లాడు. ఆ గాజుల కేక విన్న గవరమ్మ, అవి కావాలని పట్టుబట్టింది. మొదట తల్లి ఎల్లమ్మ (రేణుకాదేవి) నిరాకరించినా, గవరమ్మ అన్నం నీళ్లు మానేయడంతో చివరకు ఆ గాజుల బత్తుడిని లక్కసిరి మేడకు రప్పించింది.

అపహరణ: మేడలోకి వెళ్లిన కార్తిక మల్లన్న గవరమ్మకు గాజులు తొడిగి, తన మాయా గాజులతో ఆమె మనసు మార్చేశాడు. గవరమ్మ అతనిపై మక్కువ పెంచుకుంది. మల్లన్న ఆమెను ఒక సంచిలో మూటగట్టుకుని, ఎల్లమ్మ దగ్గర డబ్బు కూడా తీసుకుని అక్కడి నుండి తప్పించుకున్నాడు.
జంపయరాజుతో పోరాటం: ఈ విషయం తెలిసిన జంపయరాజు వారిని వెంబడించాడు. కానీ మార్గమధ్యంలో అలసిపోయి నిద్రపోతున్న జంపయరాజును, గవరమ్మ సలహాతో మల్లన్న బంధించి, అతని గుండెలపై పెద్ద బండరాయిని పెట్టి వెళ్ళిపోయాడు. పరశురాముడు తన 'మైలపురి డేగ' సహాయంతో అన్నను రక్షించి, కోపంతో గోనెలకోటపై దండెత్తాడు.
పరశురాముడి శాపం: సిద్ధమాశెట్టి కుమారులు వేషాలు మార్చుకుని పరశురాముడిని చంపాలని చూసినా, డేగ హెచ్చరికతో పరశురాముడు వారిని బంధించి శిక్షించాడు. చివరకు గవరమ్మ వచ్చి తన తమ్ముడిని బ్రతిమాలింది. తనతో చెప్పకుండా లేచిపోయినందుకు కోపించిన పరశురాముడు, గవరమ్మను మాల మాదిగల ఇళ్లలో 'గొంతిదేవి' (గొంతాలమ్మ) గా పుట్టమని, కార్తిక మల్లన్నను 'నందిగాడు' గా పుట్టమని శపించాడు. వారిద్దరినీ ఆ కులాల వారు పూజిస్తారని చెప్పాడు. (రి. తెలుగు వీరగాథ కవిత్వం, తంగిరాల వెంకట సుబ్బారావు)

ముగింపు:

‘గొంతెమ్మ’ లేదా ‘గొంతాలమ్మ’ ఆరాధన అనేది కేవలం ఒక పౌరాణిక పాత్రకు పరిమితమైన పూజ కాదు; అది శతాబ్దాలుగా సామాజిక తిరస్కారానికి గురైన వర్గాల సాంస్కృతిక ప్రతిఘటనకు ఆత్మగౌరవానికి ప్రతీక. అగ్రవర్ణాల పురాణ సాహిత్యం కుంతీదేవిని కొన్నిచోట్ల శాపగ్రస్తురాలిగానో, పొరపాటు చేసిన తల్లిగానో చిత్రించి దూరం పెట్టినప్పటికీ, దళిత,జానపద వర్గాలు ఆమెను తమ ఇంటి ఆడపడుచుగా, కన్నతల్లిగా అక్కున చేర్చుకొన్నాయి. అగ్రవర్ణ సమాజం ఎవరినైతే తక్కువ చేసి చూస్తుందో, వారిని దళితవాడలు తమ ‘ఇలవేల్పు’గా మార్చుకుని గౌరవించడం ఇక్కడి విశేషం.

కర్ణుడు, అర్జనుడు ఇరువురూ బతికి ఉండాలనే అసాధ్యమైన కోరిక కుంతీదేవి కోరింది కనుక నెరవేరే అవకాశంలేని కోరికలను సూచించటానికి గొంతెమ్మ కోరికలు అనే నానుడి స్థిరపడింది.
మహాభారతంలోని కుంతీదేవి వ్యధ అయినా, జానపద వీరగాథల్లోని గవరమ్మ కష్టాలైనా... ఇవన్నీ అణగారిన వర్గాల దైనందిన జీవన పోరాటంతో మమేకమైపోయాయి. అందుకే, పాండవుల పేర్లను తమ పేర్లుగా పెట్టుకోవడమే కాకుండా, ‘గొంతెమ్మ’ పండుగను తమ ఆస్తిగా మలుచుకున్నారు. ఎద్దులను ప్రేమించడం, ప్రకృతిని (మట్టి బొమ్మలు కప్పలు) పూజించడం లాంటి అంశాలు ఈ పండుగలో అంతర్లీనంగా ఉన్న శ్రమజీవుల తాత్వికత

బొల్లోజు బాబా

Friday, April 3, 2026

కొన్ని మౌలిక ప్రశ్నలు.....

శ్రీ మందకృష్ణ మాదిగ లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యమైనవి కావు. అవర్ణులైన ప్రతి సామాజికవర్గమూ అడగాల్సిన ప్రశ్నలు అవి.

1. అన్ని వర్గాలవారు దేవుడిని పూజించినపుడు ఒక్క బ్రాహ్మణ వర్గం మాత్రమే పురోహితులుగా ఎందుకున్నారు? ఈ ప్రశ్న శతాబ్దాల క్రితమే మా శిల్పులు వేసారు. తామే తమ కాళ్ళకింద తొక్కి చెక్కిన శిల్పానికి ప్రాణప్రతిష్ట చేసాము అనే మిషతో ఆ తరువాత దానిని తాకనివ్వకుండా నిషేదించటాన్ని ప్రశ్నించారు.

ఈ అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనలో కోర్టుకేసులు కూడా నడిపి, బ్రాహ్మణులతో పాటు సమానంగా విశ్వబ్రాహ్మణులు కూడా అర్చక హక్కులు తెచ్చుకొన్నారు. ఆ వాదప్రతివాదనలన్నీ పుస్తకరూపంలో లభిస్తున్న "1818 డిసెంబర్ 15నాటి చిత్తూరు జిల్లా అదాలత్ తీర్పు" ద్వారా నేడు తెలుసుకోవచ్చు.

ఈ తీర్పు ద్వారా పూజలు, వివాహాలు, ఉపనయనాలు, ప్రాణ ప్రతిష్ఠ, గర్భగుడి అర్చనలు లాంటి హక్కులు విశ్వబ్రాహ్మణులు కూడా పొందారు. ఈ క్రమంలో ఎన్నెన్ని ప్రతిఘటనలు చవిచూసారో 1821, 1843-44 నాటి రివ్యూ పిటిషన్లు, బందరు కేసు, సేలం (1840), గుంటూరు జిల్లా (1912) విశ్వబ్రాహ్మణుల కేసుల ద్వారా తెలుస్తుంది.

చారిత్రికంగా బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించి కులనామాన్ని విశ్వబ్రాహ్మణగా మార్చుకొని (శాసనాలలో పంచానము వారు అని ఉంటుంది) వేదాధ్యయనం చేసి, జంద్యం ధరించి, పౌరోహిత్యం చేసి వారికి బలంగా ఎదురు నిలిచిన సామాజిక వర్గం విశ్వబ్రాహ్మణ వర్గమే కావొచ్చు. ఈ మార్గంలో వారు ఎంత హింసను ఎదుర్కొని ఉంటారో అనేది కూడా సులభంగా ఊహించవచ్చు.
ఇదంతా చరిత్ర. కాలక్రమేణా బ్రాహ్మణాధిపత్య రాజకీయాలవల్ల ఈ హక్కులు చాలామట్టుకు క్షీణించాయి.

ఈ రోజు రాజ్యాంగం శాసించిన ప్రకారం అన్ని వర్ణాలవారికి అర్చకత్వ అర్హతనిచ్చే వేదం నేర్పుతున్నారు. కానీ వారిని అర్చకులుగా తిరుపతి, అన్నవరంలాంటి ప్రధాన ఆలయాలలో నియమించటం లేదు. అలా ఎందుకు జరుగుతోందని ప్రతీ అవర్ణ సామాజిక వర్గమూ ప్రశ్నించాలి.


2. మరొక ప్రశ్న- ఎక్కడో పుట్టిన ఇస్లాం, క్రిష్టియానిటీలు విశ్వవ్యాప్తం అవ్వగా అంతకన్నా ప్రాచీనమైన హిందు మతం ఎందుకు విస్తరించలేకపోయింది?

అంతేకాదు ఇక్కడే పుట్టిన బౌద్ధం కూడా జపాన్ నుండి శ్రీలంకవరకూ విస్తరించి ఒక ప్రపంచ మతంగా స్థిరపడింది. ఈ మతాలలో లేనిది హిందూ మతంలో ఉన్నది ఒకటే- కులవ్యవస్థ. సాటి మతావలంబిని చంపేటంత ద్వేషాన్ని నూరిపోయటం ఈ కులవ్యవస్థ లక్షణం.
సాటిమనిషి పట్ల ఎంత వివక్ష చూపిందనటానికి మనుధర్మ శాస్త్రమే ప్రమాణం. ఇంకా చెప్పాలంటే ఓ పదిశాతం ద్విజులను మినహాయిస్తే మిగిలిన 90% జనాభాకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిరాకరించి వారిని సేవకులుగా చేసింది కులవ్యవస్థ. ఇలాంటి అసమానత్వ లక్షణాలతో ఎలా విస్తరించగలదు?

ఈ శూద్ర అతిశూద్ర వర్గాలను హిందూమతంలోనే ఉండేలా చేసింది భక్తి, సూఫీ ఉద్యమాలు. నిజానికి ఈ ఉద్యమాలు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు. వాటిని సంస్కరణల పేరుతో హిందూమతం క్రమేపీ తనలో కలిపేసుకొంది.

దుర్మార్గమైన ఈ వివక్షను తట్టుకోలేక ఇతరమతాలలోకి వెళితే వివక్షను మరింత బలంగా అమలు చేయడం సమకాలీన విషాదం.

ఇది కేవలం పూజాధికారాల కోసం కాదని — సమానత్వం, గౌరవం, మనిషితనాన్ని తిరిగి సాధించుకునేందుకని ప్రతిఒక్కరూ గుర్తించాలి.

బొల్లోజు బాబా

Post Script Comments: 

1. అసలు ప్రశ్న — అవకాశం అందరికీ సమానంగా ఉందా లేదా? అని.
ఒక వ్యవస్థను పూర్తిగా త్రోసిపుచ్చడం కన్నా దాన్ని ప్రజాస్వామ్యీకరించడం (democratize)  ఒక సామాజిక విప్లవం.
“ఇది మా దే – మీరు రావద్దు” అనే భావజాలాన్ని “ఇది అందరిదే” గా మార్చడం కూడా మార్పే. దాన్ని పాటించటం పాటించకపోవడం మన ఇష్టం. తలుపు తెరవటమే విజయం. అంతవరకే.
డా. బాబాసాహెబ్ చెప్పినట్లు అసమానతలపై పోరాడటంలో దీన్ని కూడా భాగం గా చూడాలి అనుకొంటాను

2. నేను బ్రాహ్మణులను వ్యతిరేకించను, బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తాను. 
వేదాల ఆధారంగా, యజ్ఞాలు,  కులవ్యవస్థతో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రాచీన మత వ్యవస్థ ను బ్రాహ్మనిజం అంటారు.  బ్రాహ్మణిజాన్ని బ్రాహ్మణులు ఒక్కరే పాటించరు...శూద్ర అతిసూద్ర వర్గాలలో కూడా ఉంటుంది. ఇది సూక్ష్మ విషయం. చాలామందికి అర్థం కాదు. 

3 ఒక బ్రాహ్మణుడు కావాలంటే నేర్చుకొని బట్టలు నేయవచ్చు, కుండలు చేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. అదే నేర్చుకొని నేతకాడు, కుమ్మరి పౌరోహిత్యం ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి.
రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. అలా నేర్చుకొన్న దళిత పూజారులను పెద్ద ఆలయాలో ఎందుకు నియమించటం లేదని మరో ప్రశ్న.
గుర్తుపెట్టుకోండి ...“ఇది మా దే – మీరు రావద్దు” అనే భావజాలాన్ని “ఇది అందరిదీ” గా మార్చడం కూడా మార్పే. దాన్ని పాటించటం పాటించకపోవడం మన ఇష్టం. తలుపు తెరవటమే విజయం. అంతవరకే.