Sunday, March 8, 2026

తళ్ళికోట యుద్ధం జీహాద్ యుద్ధమా?

తళ్ళికోట యుద్ధం 1565 జనవరి 23 న జరిగింది. దీనినే రాక్షస-తంగడి యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించడానికి దక్కన్ ప్రాంతానికి చెందిన నాలుగు ముస్లిం రాజ్యాలు తమలోని శత్రుత్వాలను పక్కనపెట్టి ఒక్కటయ్యాయి. అవి అహ్మద్‌నగర్ (సుల్తాన్ హుస్సేన్ నిజాం షా), బీజాపూర్ (సుల్తాన్ అలీ ఆదిల్ షా), గోల్కొండ (సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా), బీదర్ (సుల్తాన్ అలీ బరీద్ షా).
 
వీరందరూ కలిసి విజయనగర సామ్రాజ్యంపై మూకుమ్మడిగా దాడి చేసి ఓడించారు. విజయనగర సైన్యానికి నాయకత్వం వహించింది శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు. ఈ యుద్ధంలో అళియ రామరాయలు ఓడిపోయి, శత్రువుల చేతిలో మరణించాడు. విజయనగర సైన్యం చెల్లాచెదురైంది. ఈ ఓటమితో దక్షిణ భారతదేశంలో అత్యంత బలమైన విజయనగర హిందూ సామ్రాజ్యం కూలిపోయింది.

I. తళ్ళికోట యుద్ధం జీహాద్ యుద్ధమా?

జీహాద్ అంటే ఇస్లామ్ మతరక్షణ, విస్తరణ కొరకు చేసే యుద్ధంగా నిర్వచిస్తారు. (ఇతర అర్ధాలున్నప్పటికీ నేడు అలా స్థిరపడింది). చరిత్రలో కొన్ని యుద్ధాలు జీహాద్ గా పేర్కొనబడ్డాయి కానీ ప్రతి యుద్ధం జీహాద్ అని ప్రకటించలేదు. భారతదేశంలో జరిగిన ముస్లిం యుద్ధాలను జీహాద్ లుగా ప్రకటించినట్లు ఆనాటి సమకాలీన ఆధారాలు లేవు. ముఖ్యంగా “జీహాద్” అనే పదం ఎక్కడా వాడలేదు.
 
ఈ రోజు Sandeep Balakrishna లాంటి కొందరు హిందుత్వవాదులు, ధర్మ డిస్పాచ్ లాంటి వెబ్ సైట్లు - భారతదేశంలో ముస్లింలు చేసిన యుద్ధాలను జీహాద్ గా అభివర్ణిస్తున్నారు. ఈ ధోరణి 2010 నుంచి ఎక్కువయింది. లవ్ జీహాద్, ఫుడ్ జీహాద్ లాంటి పదాలను సృష్టించి ప్రజలమధ్య విద్వేషాలను రగులుస్తున్నారు.
 
ఇటీవల ఒక ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త కూడా తన కొత్త పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవటానికి తళ్ళికోట యుద్ధం అనేది కొందరు ముస్లింరాజులు కలిసి హిందూరాజుపై జరిపిన “జీహాద్” అని ప్రకటించటం శోచనీయం, సత్యదూరం. ఈ విషయాన్ని దృవీకరించే ఆనాటి సమకాలీన ఆధారం ఒక్కటి కూడా లేదు. భారతదేశంలో హిందూ-ముస్లిం యుద్ధాలను జీహాద్ గా చెప్పటం పూర్తిగా ఇటీవలి పరిణామం. హిందుత్వవాదుల సృష్టి. మనుషులను విడదీదే విద్వేషపూరిత ప్రచారం. దాన్ని బలపరచే విధంగా తెలుగుసాహిత్యం దోహదపడటం నైతిక పతనం.
ఆనాటి వివిధ రచనలలో తళ్ళికోట యుద్ధాన్ని వర్ణించిన వాక్యాలలో ఎక్కడా జీహాద్ అన్న పదం కనిపించదు. హిందువులను కాఫిర్ (అవిశ్వాసి) గా వర్ణించటం ఆ కాలపు శైలి తప్ప మతప్రస్తావన కాదు.
 
II. జీహాద్ యుద్ధం చేయడం అంటే కొన్ని పద్దతులు పాటించాలి. అవి-

1. పవిత్రయుద్ధానికి పిలుపు ఇచ్చి ఆ యుద్ధాన్ని స్పష్టంగా జీహాద్ అని ప్రకటించాలి
2. పండితుల మద్దతుతో మతపరమైన ఫత్వా ఇవ్వాలి.
3. పాలకుడు తనను తాను ఘాజీ గా సంభోదించుకోవాలి
4. యుద్ధం యొక్క ప్రధాన ఉద్దేశం మత విస్తరణ అని చూపాలి
ఇన్ని నియమాలు పాటించినపుడు మాత్రమే ఆ యుద్ధాన్ని జీహాద్ అని అంటారు.
ఆ కాలానికి చెందిన వివిధ ఇస్లామ్, ఇస్లామేతర రచనలలో తళ్ళికోట యుద్ధ ప్రస్తావనలు ఉన్నాయి దేనిలోను జీహాద్ అనే పదం కనిపించదు. వాటి వివరాలు ఇవి….
.
A. ఇస్లామ్ చరిత్రకారులు తళ్ళికోట యుద్ధం గురించి చెప్పిన అంశాలు
.
1. తజ్కిరత్ అల్-ములూక్ (Tazkirat al-Muluk/ రాజుల వృత్తాంతం)
పేరుతో బీజాపూర్ కోర్టులో 1560 లలో పనిచేసిన రఫీ-ఉద్-దీన్ షిరాజీ అనే చరిత్రకారుడు తళ్ళికోట యుద్ధానికి సంబంధించి….
“ఇస్లాం రాజులు (నిజాం షా, ఆదిల్ షా, కుత్బ్ షా, బరీద్ షా) గత పరాజయాలు, భూభాగ నష్టాల తర్వాత “కాఫిర్” రామరాయను ఓడించేందుకు కూటమి కట్టటం; కృష్ణా నది దాటటం; తుపాకీల వినియోగం, రామరాయ మరణం; విజయోత్సవాలు లాంటి ఘట్టాలు వివరించాడు.” ఈ యుద్ధం ప్రధానంగా ప్రతీకారం, అధికార విస్తరణ లాంటి అంశాల ఆధారంగా జరిగిందని చెప్పాడు.

2. బుర్హాన్-ఇ-మఆసిర్ (Burhan-i-Maasir చారిత్రిక ఘనకార్యాలు) సయ్యద్ అలీ తబాతబా అహ్మద్‌నగర్ కోర్టు చరిత్రకారుడు 1590లలో రచించిన రచనలో తళ్ళికోట యుద్ధాన్ని ఇలా వర్ణించాడు.
“రామరాయ “దక్కన్‌లో ఏకైక అధికారి” గా ప్రకటించుకోవడంతో అతన్ని కూలదోయడానికి కూటమి ఏర్పడింది. రాజకీయ అధికారాల విస్తరణ, భూభాగ హక్కులకొరకు ఈ యుద్ధం జరిగిందని చెప్పాడు” తప్ప ఎక్కడా జిహాద్ ప్రస్తావన తేలేదు.

3. తరీఖ్ ఇ-ఫిరిష్తా (Tarikh-i-Ferishta ఫరిస్టా రచించిన చరిత్ర) — మహ్మద్ ఖాసిం ఫరిష్తా బీజాపూర్ చరిత్రకారుడు. ఇది 1589 నాటి రచన. దీనిలో ఫరిష్టా తళ్ళికోట యుద్ధం గురించి ఈ మాటలు చెప్పాడు.
“సుల్తాన్లు తమ శత్రుత్వాన్ని పక్కనబెట్టి కూటమి కట్టారని, కృష్ణా దాటి యుద్ధం చేసి “కాఫిర్” ను ఓడించారని చెప్పాడు. యుద్ధానికి ప్రధాన కారణం రామరాయ అధికారాన్ని అంతం చేసి రాజకీయ ఆధిపత్యం పొందటం అన్నాడు” దీనిలో కూడా “జిహాద్” ప్రకటన లేదు.

B. పోర్చుగీసు/యూరోపియన్ లు చెప్పిన అంశాలు

1. సెసారే ఫెడెరిచి (Cesare Federici): ఇటాలియన్ వ్యాపారి. 1567–68 మధ్య హంపి అవశేషాలు దర్శించాడు. “నలుగురు మూర్ రాజులు” ద్రోహంతో విజయనగరాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నాడు తప్ప. మతపరమైన యుద్ధంగా చెప్పలేదు.
 
2. డియోగో దో కౌటో (Diogo do Couto) 16వ శతాబ్దం చివర సందర్శించిన పోర్చుగీస్ చరిత్రకారుడు. “మూర్ రాజులు” కూటమి కట్టి “బిస్నగ రాజు” పై యుద్ధం చేశారని చెప్పాడు. పూర్వ అవమానాలకు ప్రతీకారం అన్న రాజకీయ భావనే తప్ప జిహాద్ ప్రస్తావన లేదు.
ఇతర జెసుయిట్/పోర్చుగీస్ లేఖలు (ఉదా: ఆంటోనియో రుబినో, 1608) లాంటి వాటిలో భూ వివాదాలు, ప్రతీకారం, కూటమి, ఇవి మాత్రమే యుద్ధకారణాలుగా ఉన్నాయి తప్ప మతపరమైన జిహాద్ పదజాలం లేదు.

III. తళ్ళికోట యుద్ధాన్ని జీహాద్ గా ఎవరు పేర్కొన్నారు

19-20 వ శతాబ్దపు చరిత్రకారులైన జాన్ బ్రిగ్స్, రాబర్ట్ స్యూవెల్ లాంటి వారు ఈ యుద్ధానికి రాజకీయ సైనిక వివరణలు ఇచ్చారు తప్ప జీహాద్ గా లేబుల్ చెయ్యలేదు. ఆధునిక చరిత్రకారులు - రిచర్డ్ ఎం. ఈటన్, బర్టన్ స్టీన్, సంజయ్ సుబ్రహ్మణ్యం, ముజఫ్ఫర్ ఆలం, రోమిలా థాపర్ మొదలైన వారు తళ్ళికోట యుద్ధానికి మతపరమైన ఫ్రేమింగ్‌ను తిరస్కరించారు.
నిజానికి అళియరామరాయలు సుల్తానులతో చాలాకాలం మైత్రిలో ఉన్నాడు. కొన్ని సార్లు వారితో ఘర్షణలు పడ్డాడు. ఇతని సైన్యంలో చాలామంది ముస్లిం సైనికులు ఉండేవారు. తన సింహాసనంపై ఖురాన్ ప్రతిని ఉంచుకొని ఇస్లాంమతాన్ని గౌరవించాడు.
 
తళ్ళికోట యుద్ధాన్ని జీహాద్ గా ప్రచారం చేయడం పూర్తిగా ఇటీవలి పరిణామం. మతవాదుల విద్వేషపూర్వక ఎత్తుగడ ఇది. ఈ ప్రచారం చేస్తున్నది Dharma Dispatch, True Indology, INDIAN REAL HISTORY వంటి వెబ్‌సైట్‌లు ఇతర సోషల్ మీడియా అకౌంట్లు ఇంకా అనేకానేక వాట్సప్ కథనాలు. యుద్ధానంతరం హంపిలోని ఆలయాల విధ్వంసాన్ని జిహాద్ గా చెబుతారు వీళ్ళు. కానీ అక్కడ వైష్ణవ క్షేత్రాల విధ్వంసం జరిగింది కానీ శైవ క్షేత్రాల విరూపం ఎందుకు జరగలేదనే ప్రశ్నకు వీరివద్ద సమాధానం ఉండదు.

నిజానికి మధ్యయుగాలలో కనిపించేది రాజ్యకాంక్షతో కూడిన యుద్ధోన్మాదం. కన్నూమిన్నూ కానని హింస, అరాచకత్వం ఆక్రమణ దాని లక్షణాలు. ఈ యుద్ధోన్మాదాన్ని మతోన్మాదంగా చిత్రీకరించడం అనేది ఒకమతంలో ఎవరైతే అధిపత్యాన్ని కలిగి ఉంటారో వారికి లబ్ది చేకూర్చే ఎత్తుగడ.
 
CE1323 లో తుగ్లక్ దక్షిణభారత దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించి ఆంధ్రదేశాన్ని ఢిల్లీ సుల్తానుల పాలనకిందకు తెచ్చాడు. అప్పుడు ముసునూరి ప్రోలయనాయకుని నాయకత్వంలో ఆంధ్ర నాయకులు స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నారు. ఆ సందర్భంలో వేయించిన విలస తామ్రశాసనం చారిత్రికంగా విలువైనది.
 
"ఈ శాసనంలో - ముస్లిం పాలనలో ఆంధ్ర ప్రాంతం "మైలపడి" (అపవిత్రమైందని), దానిని యజ్ఞయాగాదులతో, బ్రాహ్మణులకు అగ్రహారాలు (భూములు) దానం చేయడం ద్వారా ప్రోలయ నాయకుడు "పునరుద్ధరణ" (శుద్ధి) చేశాడని పేర్కొనబడింది."

అంటే ఈ శాసనం బ్రాహ్మణాధిక్యతకొరకు, వర్ణధర్మం స్థాపన కొరకు వేయించిన శాసనం. మధ్యలో ముస్లింల ప్రస్తావన రాజకీయపరమైనది.

నిజానికి యుద్ధసమయంలో, రాజ్యకాంక్షలో మతాన్ని చూడటం మనువాదుల కుట్ర. తమ ఆధిపత్యం సడలుతున్నందుకు యుద్ధ ఉన్మాదాన్ని మత ఉన్మాదంగా చిత్రించారు. ఆ మేరకు దానాలు, సంభావనల రూపంలో లబ్దిపొంది తిరిగి తమ ఆధిక్యతను పునస్థాపించుకొన్నారని అవి ఆనాటి సోషల్ డైనమిక్స్ అని విలస శాసనం ద్వారా అర్ధమౌతుంది.
.
IV. ముగింపు
.
ఈ నేలపై ఒక్క ముస్లింలు హిందువులకు మాత్రమే యుద్ధాలు జరగలేదని కాస్త చరిత్ర చదివితే అర్థం అవుతుంది. హిందువులకు హిందువులకు మధ్యకూడా అంతకన్నా ఎక్కువే యుద్ధాలు జరిగాయని అప్పుడుకూడా సంపదలకోసం ఆలయాలు తవ్వబడ్డాయని, విగ్రహాలు విరూపం చేయబడ్డాయని, ముస్లింలు చేసిన యుద్ధాలలో హిందూ సైనికులే ఆ పని చేశారని కూడా అర్థమౌతుంది. అంతిమంగా లబ్దిపొందింది ఎవరో విలస శాసనం చివరిపంక్తులు చెబుతున్నాయి. నేటికీ అదే ధోరణి.
 
రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాల్లో మతాన్ని వెతకడం చరిత్రను వక్రీకరించే ప్రమాదకరమైన అవగాహన. రాజకీయ, ఆర్థిక, సామ్రాజ్యవిస్తరణ లక్ష్యాలతో సాగిన యుద్ధాలను మతపరమైనవిగా చిత్రించడం నేటి మతవాదుల దుష్ప్రచారం. గతంలో ముస్లింలు చేసిన ప్రతి యుద్ధమూ మతవిస్తరణ కోసమేనని, అదే ధోరణి నేడు ‘లవ్ జీహాద్’, ‘ఫుడ్ జీహాద్’ వంటి పేర్లతో కొనసాగుతోందని చెప్పడం విషప్రచారం మాత్రమే.

యుద్ధ సమయంలో కంటే, ప్రశాంత కాలంలో ఒక రాజు తన రాజ్యంలో భిన్న మతాలను ఎలా ఆదరించాడు, ఎలా సంరక్షించాడు అన్నదే చరిత్రాత్మకంగా పరిశీలించాల్సిన ప్రమాణం కావాలి.
యుద్ధోన్మాదమే మతోన్మాదం అనే అవగాహనతో రాసే సాహిత్యం సమకాలీన మత రాజకీయాలకు చరిత్ర పేరుతో ఊతం ఇచ్చినట్లు. ఇది వాంఛనీయం కాదు.
 
బొల్లోజు బాబా

Sunday, March 1, 2026

కాలం వెడల్పు

.
రద్దీ రోడ్డుకు చెరోవైపున
అపరిచితుల్ని తప్పించుకుంటూ
సెల్‌ఫోన్‌ మాటల్లో మునిగిన
ఇద్దరు బాల్యమిత్రులు.

ఒకే వీధిలో ఎదిగిన అడుగులు
ఇప్పుడు వేర్వేరు ఫుట్‌పాత్‌లపై.
ఒకే నవ్వు పంచుకున్న పెదాలు
ఇప్పుడు వేర్వేరు సంభాషణల్లో.

ఒకరినొకరు చూసుకోలేని దూరం
అంత పెద్దదేం కాదు
రోడ్డు వెడల్పంతే!
కానీ కాలం
ఆ రోడ్డుకంటే వెడల్పైంది.

జీవితం ఒకే దిశలో ప్రవహించే నది
ముందుకే తప్ప
వెనక్కి ప్రవహించదు.
జ్ఞాపకాలు మాత్రం
అడుగున రాళ్లలా
నీటిలో కరగక నిశ్చలంగా!

బొల్లోజు బాబా

Friday, February 13, 2026

పిల్లలు…


మన జీవితమనే ఇంట్లోకి
పిల్లలు బుడి బుడి అడుగులతో
నిశ్శబ్దంగా ప్రవేశిస్తారు

వారి చిట్టిచేతులతో
మన ఆలోచనలని
మన మాటలను
మన కాలాన్ని
కౌగిలించుకొని
పాటలతో నవ్వులతో
నింపేస్తారు

మనమేమో
చల్లని ఎండను, వేడి వెన్నెలను
మోసుకొంటూ సాగే నదిలా
తీరాల్ని ఒరుసుకొంటూ
ముందుకు సాగిపోతాం

మనం లేకపోయాక కూడా
వాళ్ళు ఇక్కడే ఉంటారు
వానాకాలం ముగిసాక
గోడలపై మిగిలే తేమలా
సాయంకాలం ఇంటిముందు
పడే పొడవైన నీడల్లా…

బొల్లోజు బాబా

suffocation

చిన్ని చిన్ని ఆశలు
ఇప్పుడే కాదని
కలలను కొంతకాలం
వాయిదా పెట్టిందామె
కాళ్ళకింద నేల గట్టిపడాలని

***
పెళ్ళయింది
తల్లయింది
వంటగది వాసనైంది
నలుగురికి నీడైంది
అన్నీ అయింది
కానీ
'తాను' అవ్వలేకపోయింది.

ఒక్కొక్కటిగా
వాయిదా... వాయిదా..
వాయిదాలే జీవితమై పోయింది

అద్దంలో అదే మొఖం
అదనంగా
నుదుటి ముడుతలు
జుత్తులో తెల్లని నిశ్శబ్దం

ఆమె తన కుమార్తెకి
ఒకటే మాట
చెప్పాలనుకుంది

“తల్లీ!
ప్రపంచం కోసం
దేన్నీ వాయిదా వెయ్యకు
ఇప్పుడే మొదలు పెట్టు
నీ కోసం
నీ ఊపిరి కోసం”

బొల్లోజు బాబా

డిజిటల్ శ్వాస.....

మరణం తరువాత కూడా
అతని పేరు
సోషల్ మీడియంలో
శ్వాస తీసుకుంటూనే ఉంది
పోస్టులుగా
ఫొటోలుగా
కామెంట్లుగా

తెలియని ఎవరో
ఎప్పుడైనా చెప్పిన
బర్త్ డే విషెస్ కు
వెలుతురు స్క్రీన్
సమాధి రాయిలా
చేతికి చల్లగా తాకుతుంది.

ఎప్పటికైనా
ఫోన్ మూసేసి
రోజువారి పనుల్లో పడిపోక తప్పదు

లోపల ఎక్కడో
సిగ్నల్ లేని ప్రాంతంలో
వేదన మాత్రం
ఇంకా లోడ్
అవుతూనే ఉంటుంది


బొల్లోజు బాబా

ఇల్లు విడిచిన పిల్లలు


కాలేజీ చదువులకై
సూట్‌కేసుల్లో
కలలు సర్దుకొని వెళ్లిన పిల్లలు
ఫోన్ నంబర్లుగా మాత్రమే మిగిలారు.

అదే ఇల్లు
అదే కాలండరు
అదే గడియారం
అన్నీ ఒకేలా నిలిచిపోయినట్లు
అదే బరువు
అదే అలసట
అదే నిశ్శబ్దం

జ్ఞాపకాల దీపం
వెలుగుకన్నా నీడనే
ఎక్కువగా పంచుతుంది.

చివరకు నిశ్శబ్దం
దేహంపై దుప్పటిలా పరుచుకొంది.

ఇల్లు విడిచిన పిల్లలు
ఫోన్ లో
వీడియో కాల్ గా
మాత్రమే తిరిగొచ్చారు.

బొల్లోజు బాబా

బడ్జెట్ డే

ఒకప్పుడు బడ్జెట్ అంటే
ఏ రంగానికి వెలుగు?
ఏ వర్గానికి ఊరట?
నా శ్రమకు
రేపు ఎంత విలువ?
లాంటి సంఖ్యల మధ్య
దేశం ఊపిరి తీసుకునేది.

దేశం నడిచే దారుల్లో
నన్ను నేను ఆసక్తిగా
వెతుక్కున్న రోజులవి.

ఇప్పుడు
బడ్జెట్ అనేది
సామాన్యుల కోసం కాక
రాజ్యం ధనవంతులకు రాసే
ప్రేమలేఖగా మారిపోయింది.

ఖర్చుల పట్టికలో
నేనొక అనవసర వ్యయాన్ని.
నా గొంతు ఎప్పుడో
నిశ్శబ్దంగా
చెరిపివేయబడింది.

నేను కేవలం
విస్మరింపబడే
ఓటును మాత్రమేనని
బడ్జెట్ లో ఒక కేటాయింపును
ఎన్నటికీ కాలేననేది
ఒక చేదునిజం.

బొల్లోజు బాబా

3/2/2026

కాకినాడ



ఈ ఊరు
నా ఉదయాలను సాయింత్రాలను
జ్ఞాపకాలుగా దాచుకొన్న
ఒక కవిత.

పిఆర్ కాలేజ్ గ్రౌండ్
ఇప్పటికీ
నా అడుగుల్ని
లెక్కపెడుతూనే ఉంది
అక్కడ నేను పాఠాల కంటే
ప్రశ్నలే ఎక్కువ నేర్పాను

గాంధీనగర్ పార్కులో
చెట్లు పెద్దవయ్యాయి
జీవితం ఇచ్చిన విరామాల్లో
నా శ్వాసను
అక్కడే రిఫ్రెష్ చేసుకొన్నాను

సినిమా రోడ్‌లో
థియేటర్లు మారాయి,
పోస్టర్లు మారాయి,
హీరోలు మారారు.
కాలం వెనక్కి తిరగదు
కానీ
నా ఎముకలలో
ఆనాటి క్యూలో నిలిచిన
ఉత్సాహం మాత్రం
ఇప్పటికీ వెచ్చగానే ఉంది.

భావనారాయణ స్వామి గుడిలో
గంట శబ్దం వినిపిస్తే
మనసు తేలికవుతుంది
ఏదో భారాన్ని
నేనే వదిలేసుకొన్నట్టు.
అక్కడ
అడిగింది తక్కువ
వదిలేసిందే ఎక్కువ.

బీచ్ రోడ్‌లో
సముద్రం నెమ్మదిగా అలవాటైంది.
అలలు పాత కలల్ని
తీరానికి తెస్తుంటే
మౌనం వాటితో జ్ఞాపకాల మాలలల్లేది.
ఈ గాలిలో ఇంకా
వలస దుఃఖపు వాసన
కొరంగీల ఆశల్ని మోసుకెళ్ళిన
నౌకల ఊపిరి అది.

జగన్నాధపురం వంతెన
ఒకనాటి పూలవంతెన,
పూలదుకాణాలు లేకున్నా
మనసులో వేలాడిన
పూలమాలలకు
ఇప్పటికీ అదే పరిమళం.

నేను ఇక్కడ పుట్టలేదు
ఇక్కడకు చేరుకొన్నాను.
బహుశా
ఇక్కడే గతించిపోతానేమో కూడా.

అది విషాదం కాదు.
ఎంపిక.
నెమ్మదిగా ప్రేమగా మారిన
ఒక ఊరు పేరు
కాకినాడ.

బొల్లోజు బాబా

Monday, January 26, 2026

లించింగ్.... .


తమ్ముడూ!
నువ్వు హింసను
సాధన చేయాలోయ్
మనిషిని మనిషే
సజీవంగా పీక్కుతుంటూంటే
తప్పట్లు కొడుతూ
"ఒన్స్ మోర్... ఒన్స్ మోర్" అని అరుస్తూ
ఎంజాయ్ చేసే స్థాయికి చేరుకోవాలోయ్
ఏళ్ళొచ్చినయ్.
ఎప్పటికి తెలుసుకొంటావ్.
ఎక్కువ ఆలోచించకు.
ఈ ప్రపంచం
ఎలా ఆనందిస్తోందో
ఒక్కసారి చూడు !
.
బొల్లోజు బాబా

ఇది "హరప్పా నుండి నేటివరకూ" పుస్తకానికి ప్రముఖ రచయిత, చరిత్ర సాంస్కృతిక విశ్లేషకులు శ్రీ కల్లూరి భాస్కరం గారు రాసిన ముందుమాట.


చరిత్రను ఈ కాలంలో ఎలా చదవాలి, ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి ఇది ఒక బలమైన బౌద్ధిక నేపథ్యాన్ని అందించింది.
ఇంత లోతైన, బాధ్యతాయుతమైన విశ్లేషణతో ముందుమాట రాసిన శ్రీ భాస్కరం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
పాఠకుల నుంచి పుస్తకానికి వస్తున్న ఆదరణ, ఈ ప్రయత్నం సార్థకమైందనే నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది.
ఈ ప్రయాణంలో తోడైన అందరికీ ధన్యవాదాలు.
ఈ వ్యాసాన్ని ప్రచురించిన సాహిత్యప్రస్థానం పత్రిక ఎడిటర్ గారికి, ప్రచురణకర్తలు శ్రీ ఎస్.వి. నారాయణగారికి, కవర్ పేజ్ ఇచ్చిన శ్రీ గిరిధర్ గారికి, బలమైన క్రిస్పీ బ్లర్బ్ ఇచ్చిన సహృదయ మిత్రుడు శ్రీ అద్దేపల్లి ప్రభుగారికి, మరీ ముఖ్యంగా ఈ పుస్తకాన్ని కొని చదివి ఫోన్ లో మెసేజుల ద్వారా అభినందించిన అందరకూ....
బొల్లోజు బాబా
.
అసత్యాల అంధకారంపై చరిత్రవెలుగుల జడి
.
మన దేశం ఈరోజున ఒక కీలకదశలో ఉంది, కీలకమైన మలుపు తిరిగే దశలో ఉందని కూడా చెప్పవచ్చు. దానికి పూర్వరంగంలో క్షీరసాగరమథనంలా ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున భావసాగరమథనం జరుగుతోంది. అయితే, దానినీ, దాని ప్రాముఖ్యాన్నీ ఎంతమంది గుర్తించారో తెలియదు. గుర్తించవలసిన అవసరం మాత్రం ఉంది. బహుశా ఉపనిషత్తుల కాలం తర్వాత ఈ గడ్డమీద మళ్ళీ ఇప్పుడే పతాకస్థాయిలో భావాలు సంఘర్షించుకుంటున్నాయని నేను పదే పదే చెబుతూవచ్చాను. నేటి సందర్భ ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించి, అర్థం చేసుకునేవరకూ మళ్ళీ మళ్ళీ ఆ మాట చెప్పుకోక తప్పదు.
క్షీరసాగరమథనంలో విలువైనవాటితోపాటు, విషం కూడా పుట్టిందని మనకు తెలుసు. భావసాగరమథనం అందుకు భిన్నంగా ఉంటుందనీ, ఉండాలనీ ఆశించలేం. ఈ దేశానికీ, ఈ దేశగమనానికీ చెందిన ఎన్నో అంశాలలో ఒక స్పష్టతకు, ఒక అవగాహనకు రావడానికి చేయగల దోహదమే - దానినుంచి రాబట్టుకోగల విలువ; ఆ క్రమంలో అజ్ఞానపూరిత ఆవేశకావేశాల రూపంలో పుట్టుకొచ్చేది - విషం. అయినా అంతిమంగా జ్ఞానామృతభాండం చేతికందేవరకూ మథనం అనివార్యం.
ఇప్పుడీ భావసాగరమథనం అనేక రంగాల మీదుగా, అనేక పొరలలో జరుగుతోంది. వాటిలో ‘చరిత్ర’ ఒకటి. ఎక్కడైనా, ఎప్పుడైనా భావసంఘర్షణా, భౌతిక పరిస్థితులూ ఒకదానినొకటి పెనవేసుకుని, ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటూనే మనుషులను, లేదా దేశాలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఈ గమనమంతా కలసి చరిత్ర అవుతుంది. స్థలకాలాల మీదుగా జరిగిన ఈ గమనం తాలూకు వివరాలన్నీ ఒకచోట క్రోడీకరిస్తే, అది ‘చరిత్ర’ అనే రూపం ధరిస్తుంది. అయితే, శ్రీశ్రీ చెప్పినట్టు చరిత్ర అంటే కేవలం తారీకులు, దస్తావేజులు మాత్రమే కాదు; స్థలకాలాలతో లేదా పరిణామక్రమంతో ముడిపడిన ప్రతీదీ చరిత్రగానే మారుతుంది. ఆవిధంగా చూసినప్పుడు, మనకు సంబంధించి, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, కావ్యాలు, నాటకాలు, ప్రబంధాలు, అన్ని రకాల కళారూపాలు కూడా చరిత్రలో భాగమవుతాయి. కనుక, ఆధ్యాత్మికవాదులు చెప్పే ఆత్మ సర్వవ్యాపి అవునో కాదో తెలియదు కానీ, చరిత్ర సర్వవ్యాపి.
అయితే, ఒక మాట గానూ, ఒక సబ్జెక్టుగానూ కూడా చరిత్ర అంత గంద్రగోళానికి, వివాదాలకీ, తిరస్కారానికీ, చులకనకూ, అస్పృశ్యతకూ గురైన మరో మాటా, మరో సబ్జెక్టూ కనిపించదు. ఏది చరిత్ర, చరిత్ర నిర్వచనం ఏమిటి, చరిత్రను ఎలా వర్గీకరించాలి మొదలైన అనేక విషయాల్లో మన మధ్య ఇంతవరకూ ఒక కనీసమైన వస్తురూపసంబంధమైన ఏకీభావం కూడా ఏర్పడలేదు. మనకు చరిత్ర అక్కర్లేదండీ అంటూ ఒక్కమాటతో తీసి పారేసి, సంభాషణను హఠాత్తుగా ముగించిన విశ్వవిద్యాలయ పండితులు నాకు తెలుసు.
అయినాసరే, బ్రిటిష్ వలస పాలన దరిమిలా ఆత్మన్యూనతను, ఆత్మోత్కర్షగా మలచుకునే ప్రయత్నంలో మనకు చాలా గొప్ప చరిత్ర ఉందని చెప్పుకుంటూ చరిత్రరచనకు పూనుకున్న విచిత్ర చరిత్రా మనకు ఉంది. చరిత్రపట్ల తిరస్కారంతోపాటు, చరిత్ర రచనకు అవసరమైన విధివిధానాల క్రమశిక్షణ లోపించిన పరిస్థితిలో చరిత్రకు మసి పూయడం, మాయచేయడం, అణచిపెట్టడం, చరిత్ర పేరుతో అబద్ధాలను దండగుచ్చడం, లేని ఘనతను ఉన్నట్టు చూపడం, ఉన్న ఘనతను లేనిదిగానో, తక్కువ చేసో చూపడం విశృంఖలంగా జరుగుతూవచ్చింది. అదిప్పుడు ఔత్సాహిక చరిత్ర రచయితలు, అకడమిక్ పండితులు, భావజాల దృక్కోణంనుంచి చరిత్రను వ్యాఖ్యానించే ఆలోచనాపరులనే పొరలను దాటి రాజకీయకార్యక్షేత్రంలోకి, అందులోనూ అధికారపు అండ ఉన్న రాజకీయక్షేత్రంలోకి, సినిమా వంటి కళారూపాల్లోకి ప్రవేశించి మరింతగా వికటతాండవం, విలయతాండవం చేయడం చూస్తున్నాం.
ఇంకొక వింతా, వైరుధ్యమూ ఏమిటంటే; ఈ రాజకీయప్రేరిత చరిత్ర కల్పనకూ, కల్పితాలకూ, అబద్ధాలకూ, అసమగ్ర చిత్రణలకూ పాల్పడేవారు, వాస్తవంగా తాము ఉద్దేశించిన లక్ష్యానికి తామే నష్టం కలిగించుకుంటున్నామన్న సంగతిని గుర్తించకపోవడం! ఎలాగంటే, అసత్యాలతో, అర్ధసత్యాలతో, అతిశయోక్తులతో ఎవరినైనా, దేనినైనా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం జరుగుతున్నకొద్దీ; దానికి సమాంతరంగా, వాటిని ఎత్తిచూపి, ఇదీ అసలు వాస్తవమని చెప్పే ప్రయత్నమూ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అది ఉద్యమరూపం ధరించిన దామాషాలోనే ఇదీ ఉద్యమరూపం ధరిస్తుంది. అంటే, మెచ్చులు, హెచ్చులు చూపినకొద్దీ పుచ్చులూ, రొచ్చులూ కూడా వేలెత్తి చూపవలసి వస్తూ ఉంటుంది.
ఈ క్షణాన అక్షరాలా జరుగుతున్నది అదే. అదీ జరగవలసిందే కానీ, అకడమిక్ రంగానికి పరిమితమై జరగడం వేరు, రాజకీయక్షేత్రంలోకి అడుగుపెట్టి జనం భావోద్వేగాలతో నేరుగా ముడిపెట్టుకుని జరగడం వేరు. అందుకు బాధ్యత వహించవలసింది, రాజకీయప్రేరిత సోకాల్డ్ చరిత్రకారులు మాత్రమే.
నేరుగా బొల్లోజు బాబా గారి ‘హరప్పానుంచి నేటి దాకా’ అనే ఈ పుస్తకంలోకి రావలసింది పోయి, మరీ ఇంత పెద్ద ఉపోద్ఘాతమా అని, ఇంతవరకూ చదివిన పాఠకులు అనుకుంటూ ఉండవచ్చు. కానీ, ఈ పుస్తకం విలువను మదింపు వేయడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరమే. ఇది కూడా పూర్తిగా సరిపోతుందని కానీ, సమగ్రమని కానీ, సంపూర్ణ న్యాయం చేశానని కానీ నేను అనుకోవడంలేదు.
ఈ పుస్తకరూపంలోని బాబా గారి కృషి అంతా పైన చెప్పిన అనివార్య సమాంతర ప్రయత్నంలోకే వస్తుంది. తెలుగునాట ప్రస్తుతం చరిత్రరంగంలో అలాంటి సమాంతర ప్రయత్నం చేస్తున్న కొద్దిమందిలో బాబాగారు ఒకరు. ఆవిధంగా ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క వ్యాసానికీ గొప్ప ప్రాసంగికత ఉంది. చరిత్ర పేరుతో రాజకీయపు ఊతతో బయట వినిపిస్తున్న అనేకానేక విపరీతకర్ణకఠోరవికటధ్వనులకు వ్యతిరేకంగా, వాస్తవికసమాచారం ఆధారంగా, సత్యాన్వేషణ ప్రధానంగా చేసిన కర్ణపేయమైన ప్రతిధ్వనులు – స్థూలంగా ఈ వ్యాసాలు.
ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ చిరకాలంగానే కాక, సమకాలీనంగా కూడా, చరిత్ర పేరిట వివిధరూపాల్లో ప్రచారంలోకి తెచ్చిన అసత్యాలను, అర్ధసత్యాలను, వక్రీకరణలను ఎత్తి చూపి వాస్తవాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగాలు. ఆవిధంగా ప్రాసంగికతను స్థాపించుకుంటున్నాయి. ప్రతి ఒక్క వ్యాసమూ ప్రమాణసూచికలతో, అంతగా ప్రాచుర్యంలో లేని విలువైన సమాచారంతో, ఎంతో ఆసక్తినీ, ఆలోచననూ గొలిపేవిగా ఉన్నాయి. నిజానికి, ఏ విశ్వవిద్యాలయ స్థాయిలోనో, తగినంత అర్థబలం, అంగబలం ఉన్న ఏ సంస్థ ద్వారానో జరగవలసిన కృషిని వ్యక్తిగతస్థాయిలో బాబా గారు తలకెత్తుకున్నారు. కాకపోతే అందువల్ల అనివార్యంగా కొన్ని పరిమితులూ ఏర్పడతాయి కనుక ఈ పుస్తకపాఠకులు వాటినీ దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది.
తాజా జన్యుఆధారాలతో ఆర్యుల వలసను నిర్ధరించడం, కులాలు బ్రిటిష్ వారి సృష్టా అని ప్రశ్నించి చర్చించడం, మాక్స్ ముల్లర్ , మెకాలే, చివరికి ఇటీవలి అంబేడ్కర్, నెహ్రూలకు వ్యతిరేకంగా జరుగుతున్న ద్వేషపూరిత అసత్యప్రచారాన్నీ; శంభాజీ లాంటి వారికి అనుకూలంగా జరుగుతున్న అబద్ధప్రచారాన్నీ; రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ పాత్రను తక్కువ చేస్తూ బి. ఎన్. రావు పాత్రను ఎక్కువ చేసి చూపడం వగైరాలనూ ప్రశ్నిస్తూ, అసలు నిజాలను ఆవిష్కరించడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. వాటితోపాటు, మొగల్ చక్రవర్తులకు జన్మనిచ్చిన హిందూస్త్రీల గురించి, మొగల్ పాలకులు సంస్కృతాన్ని, సంస్కృతపండితులను ఆదరించడం గురించిన సమాచారాన్ని ఇవ్వడంతో సహా - ఇందులోని అనేక వ్యాసాలు - ప్రత్యేకించి గత దశాబ్దకాలంగా, అధికారపక్షపు అండతో మరింత పెద్ద గొంతును తెచ్చుకున్న ఏకపక్షవాదాలకు సముచిత ప్రతిస్పందనలు, ఆవిధంగా ఎంతైనా ప్రాసంగికాలు.
ఆ క్రమంలోనే కొందరు చారిత్రకవ్యక్తులు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వారు తీసుకున్న చర్యలు వగైరాలను, ప్రచారంలో ఉన్నదానికి భిన్నమైన కోణంలో, లేదా మరుగుపడిన కోణంలో రచయిత చూపిస్తారు; అలనాటి రాజరాజనరేంద్రుడితో మొదలుపెట్టి, ఔరంగజేబ్, దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇటీవలి ఇందిరాగాంధీ తదితరులు ఇందుకు ఉదాహరణలు.
ఇందులోని ‘ఆదిశంకరాచార్యుడు-ఆధ్యాత్మికయాత్ర’, ‘సింహాచలం-కొన్ని సంగతులు’ మొదలైన వ్యాసాలు చదువుతున్నప్పుడు, అవి అమిత ఆసక్తికరంగా ఉండడమే కాక; ప్రాచీన, మధ్యయుగ, ఆధునికపూర్వకాలిక చారిత్రకగమనాన్నీ, ఆ వెలుగులో నేటి దేశగమనాన్నీ అర్థం చేసుకోవడానికి అవి ఎంతైనా తోడ్పడతాయనిపించింది. సింహాచలం కేంద్రంగా జరిగిన యుద్ధాల తీరునే గమనిస్తే, ఇప్పుడు కూడా అలాగే రాజకీయయుద్ధాలు మతం ముసుగులోనే జరుగుతున్న సంగతి మనకు స్ఫురిస్తుంది.
అలాగే, ‘అయోతీ థాస్-దక్షిణభారత దళితమేధావి’, ‘రిజర్వేషన్ల కోసం పోరాడిన పెరియార్’ మొదలైనవి ఇటీవలి తరాలకు పెద్దగా తెలియని విస్మృతవ్యక్తులను, లేదా ఆయారంగాలలో వారి విస్మృతపాత్రనూ పరిచయం చేసిన వ్యాసాలు. ఈ పుస్తకం విలువను పెంచే విశేషాలు ఇంకా అనేకం ఉన్నప్పటికీ, విస్తరణభయంవల్ల ప్రస్తావించ లేకపోతున్నాను. పుస్తకం ఎలాగూ మీ చేతుల్లో ఉంది కనుక మీరే వాటిని దర్శించవచ్చు.
చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. ఇటువంటి చరిత్ర ప్రధానమైన వ్యాసాలకు సంబంధించి, వస్తురూపాల నిర్వహణలో కేవలం ఒక కోణం కాక, అనేక కోణాలు జతపడి ఉంటాయి, అనేకవైపుల నుంచి విషయాలను పరిశీలించి నిగ్గు తేల్చుకోవలసి ఉంటుంది. ఒక నిర్దిష్ట ఉదాహరణ చెప్పాలంటే; సమాజం, సంస్కృతి, సాహిత్యం, మతవిశ్వాసాలు, దేవీదేవతలు, స్త్రీ-పురుష అంతరాలు మొదలైనవాటిని స్వదేశ, లేదా ప్రాంత కేంద్రితంగా మాత్రమే చూసినప్పుడు వాటి సమగ్రచరిత్ర బయటపడదు; ఎందుకంటే, ఇలాంటి అనేక విషయాలలో, ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు దేశాలుగా చెప్పుకునే అనేక ప్రాంతాలు పరస్పరం ప్రభావితం చేసుకున్నాయి, అనేకమైన వాటిని ఇచ్చిపుచ్చుకున్నాయి. కనుక వాటిని విశ్వజనీనకేంద్రితంగా చూసినప్పుడే వాటి గురించిన సమగ్రచరిత్ర వెల్లడవుతుంది.
ఉదాహరణకు, గ్రామదేవతారాధన మూలాలు హరప్పా సంస్కృతిలోనే ఉన్నాయనడం కానీ, ‘భారతీయసంస్కృతి’లోని సిందూరం, నల్లపూసలు, పువ్వులు ధరించడం వగైరా స్త్రీల తాలూకువన్నీ హరప్పన్ల నుంచి వచ్చాయనడం కానీ పాక్షికసత్యాలే అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల సౌభాగ్యవర్ధనంతో నేరుగా ముడిపెట్టుకుని చూసిన ఋతురక్తం, ప్రసవరక్తం, జంతురక్తాల నేపథ్యంనుంచి సిందూరధారణ వచ్చిందనీ; అలాగే, పూవులు, పండ్లు, రకరకాల మూలికలతో కూడిన పెరటిసాగుతో స్త్రీలకు మొదటినుంచీ, దాదాపు ప్రపంచమంతటా హార్దికసంబంధం ఉంటూ వచ్చిందనీ తేల్చిన అధ్యయనాలు అనేకం ఉన్నాయి. అలాగే, స్త్రీల స్థానం దిగజారడం వెనుక కూడా ఇలాంటి విశ్వజనీనకేంద్రిత చరిత్ర చాలా ఉంది. మనదేశానికి మాత్రమే పరిమితమై దానిని చెప్పుకోవడంవల్ల ఆ అంశానికి పూర్తి చారిత్రకన్యాయం జరగదు.
ఇతరత్రా ఎంతో విలువైన సమాచారమూ, దృష్టికోణమూ, ప్రాసంగికతా కలిగిన ఈ పుస్తకంలోని అంశాలను ఇలాంటి అదనపు కోణాలను కూడా జత చేసుకుని చూడాలని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఎన్నో చారిత్రకాంశాలను పొందుపరచడంతోపాటు, ఎన్నో ఆలోచనలను రేకెత్తించే ఈ పుస్తకం ఇలాంటి మరెన్నో కోణాలనుంచి పరిశీలనకు ఒక చక్కని ఆధారభూమిక కాగలిగినది.
బొల్లోజు బాబాగారికి హృదయపూర్వక అభినందనలు.

-కల్లూరి భాస్కరం

(ఈ వ్యాసం సాహిత్యప్రస్థానం పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)