“జగత్తు దేవుని ఆధీనంలో ఉంటే దేవుడు మంత్రం ఆధీనంలో ఉన్నాడని ఆ మంత్రం బ్రాహ్మణుని ఆధీనంలో ఉందని, కాబట్టి బ్రాహ్మణుడు దేవునితో సమానం” అని శాస్త్రాలలో రాసుకొని తమకు తాము దేవునితో సమాన స్థానంలో పెట్టుకొన్నారు పండితులు. (నీతిశాస్త్రము, మంగు వెంకటరంగనాధ రావు, 1913 ముద్రణ, పేజి నంబరు 13)
మనుషులను ఎక్కువతక్కువలుగా విభజించి, ఆ విభజనను దైవనిర్ణయంగా చెప్పారు. నిచ్చెనమెట్ల వ్యవస్థలో కింద ఉన్నవారిని, ‘ఈరోజు తమ దుస్తితికి తమ పూర్వజన్మకర్మలే కారణమని, ఈ జన్మలో తిరగబడితే వచ్చేజన్మలో మరింత హీనజన్మ పొందవలసి ఉంటుందని’ నమ్మించటంలోనే మనువాదం విజయం ఉంది. మూడు శాతం ఉన్న వర్గం 97% ప్రజలను తమకు లోబడి ఉండేలా చేసుకోవటంలోని కిటుకు ఇదే. తమంతటతామే బానిసత్వాన్ని అంగీకరించటం కల్చరల్ హెగిమొనీ.
***
విభజించి పాలించారని బ్రిటిష్ వారిని నిందిస్తారు కానీ ఆపని చేసింది మనువాదులు. ప్రజల్ని వర్ణాలుగా విభజించి వారిపై పెత్తనాన్ని సాధించారు
బోధన, అధ్యయనం, యజ్ఞాలు నిర్వహించటం, దానధర్మాలు పొందటం బ్రాహ్మణులు చేయవలసిన పనులు. ఈ పనులను ఇతర వర్ణాలవారు చేయరాదు. క్షత్రియులు పాలన, వైశ్యులు వ్యాపారము, శూద్రులు పై ముగ్గురికి సేవలు చేయుట వారి వారి కర్మలు. వైశ్య, శూద్రులు తమ వర్ణ ధర్మములు తప్పితే లోకం అలజడి పాలవుతుంది కనుక వారు ధర్మములను పాటించే విధంగా రాజు జాగ్రత్తలు తీసుకోవలెను. (మను :8418).
ఈ సృష్టిలో సమస్తం బ్రాహ్మణుని సొత్తే. తన ఉత్తమమైన జన్మ వలన బ్రాహ్మణుడు అన్నింటికీ తీసుకోవటానికి అర్హుడే (మను: 1:100)
ధర్మశాస్త్రాలు ద్విజేతరులకు ఒక గౌరవప్రద జీవనాన్ని నిరాకరించాయి. దీన్నే division of labourers అంటారు డా. బాబాసాహెబ్ అంబేడ్కర్.
చాతుర్వర్ణవ్యవస్థలో పై న కూర్చుని 97% ప్రజలను విభజించి తమకింద తొక్కిపెట్టి ఉంచటంలోని ప్రమాదం మనువాదులకు తెలుసు. తమను తాము ఉన్నత స్థానంలో పెట్టుకొన్నందుకు వారిలో వారికే అభద్రతాభావం నెలకొని ఉంటుంది. ఏ మూలనించైనా ఎవరైనా అసూయతో దాడిచేయొచ్చన్న భయం సహజం. కనుక వారే రాసుకొన్న ధర్మశాస్త్రాలలో తమను తాము రక్షించుకోవటం కొరకు అనేక మినహాయింపులను, ప్రొటెక్షన్స్ కల్పించుకొన్నారు పండితులు.
1. బ్రాహ్మణ నింద మహాపాపం
బ్రాహ్మణులను నిందించటం దైవదోషమని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని శాస్త్రాలలో రాసుకొన్నారు.
బ్రాహ్మణుడి కంటనీరు తెప్పించిన వానికి కుల బహిష్కరణ శిక్ష విధించాలి (మను. 11.68).
బ్రాహ్మణుడు ఎంతనీచుడైనప్పటికీ వాని యెడల సకల గౌరవమర్యాదలు చూపాలి (మను: 9.319).
బ్రాహ్మణుడిని పేరుని హేళనగా పలికితే శూద్రుని నోట్లో కాల్చిన మేకు దూర్చాలి. (మను 8.272).
ఒక శూద్రుడు బ్రాహ్మణున్ని అవమానిస్తే ఆ శూద్రుని నాలుక కోసివేయాలి. (మను: 8.270).
ఒక చండాలుడు ఉద్దేశపూర్వకంగా తన స్పర్శ ద్వారా ద్విజకులాలను తాకి మైలపరిస్తే వానికి మరణదండన విధించాలి. (విష్ణుస్మృతి: 5.104).
తమ శాస్త్రాలను, తమ ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే విధించాల్సిన అతి క్రూరమైన శిక్షలు కూడా వివిధ చట్టాల రూపంలో చేసారు. ప్రాచీన భారతదేశంలో ఒక వర్గం సాటి మనుషులపై సాగించిన అమానవీయ సామాజిక నియంత్రణ ఇది.
పైన చెప్పిన లౌకిక శిక్షలే కాక, బ్రాహ్మణనింద మహాపాపమని, ఎవరైనా బ్రాహ్మణనింద చేసినట్లయితే వారు మరణించాక చేసే అపరకర్మలు ఫలించవని, దానివల్ల ప్రేతత్వం పోదని అంటూ పారలౌకిక పరంగా కూడా భయపెట్టారు. ఈ అంశంపై చార్వాకులు- స్వర్గంలేదు, మోక్షం లేదు, ఆత్మాలేదు ఇవన్నీ బ్రాహ్మణులు బ్రతుకు తెరువుకోసం ఏర్పరచుకొన్న కల్పనలు మాత్రమే అని రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితమే కుండబద్దలు కొట్టారు.
2. బ్రహ్మహత్యాపాతకం
బ్రహ్మహత్యను పంచమహాపాతకములలో ఒకటిగా చేర్చారు. బ్రాహ్మణహత్య మహాపాపమని శాసనాధారాలు 4 వ శతాబ్దంనుంచీ లభిస్తాయి.
ధర్మశాస్త్రాలు వ్యక్తి స్వేచ్ఛకంటే సమాజశ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. సమాజ క్షేమం కొరకు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని త్యాగం చేయడం అత్యున్నత ధర్మంగా చెప్పబడింది. ‘నేను’ అనే భావనకంటే ‘మనం’ అనేభావన బలంగా ఉండేది. అవే ధర్మశాస్త్రాలు ఈ మొత్తం వ్యవహారం నుంచి బ్రాహ్మణుని మినహాయించాయి. ఇదొక వైరుధ్యం.
బ్రాహ్మణహత్య చేయడం అత్యంత హేయమైన పాపం కనుక రాజు ఎట్టిపరిస్థితులలో బ్రాహ్మణునికి మరణదండన విధించరాదు. బ్రాహ్మణునికి గుండుకొట్టించటమే మరణ శిక్షతో సమానం (మను 8- 379, 381).
బ్రహ్మహత్య చేసిన శూద్ర అతిశూద్రులకు మరణదండన విధించవచ్చు. (మను. 9- 236, 240). బ్రహ్మహత్య చేసిన ఇతర ద్విజవర్ణాలైతే - 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, అశ్వమేధయాగం చేయాలి, అగ్నిలోకి మూడు సార్లు దూకాలి అంటూ రకరకాల ప్రాయశ్చిత్తాలను సూచించింది మనుధర్మశాస్త్రం. (మను 11.73-75)
***
బ్రాహ్మణహత్య మహాపాతకం అనటానికి వారు చెప్పుకొన్న ఒకే ఒక కారణం- జ్ఞానం. అప్పుట్లో జ్ఞానం అనేది మౌఖికంగా మాత్రమే ఒకతరం నుంచి మరొక తరానికి భట్వాడా జరిగేది. దానికి వాహకులు బ్రాహ్మణవర్ణం. భారతదేశంలో లిఖిత సాంప్రదాయం అశోకుని శాసనాలతో మొదలయ్యింది. ఒక పండితుడైన బ్రాహ్మణుని చంపటం కొన్ని గ్రంథాలను తగలపెట్టడంతో సమానం కనుక వారిని చంపడాన్ని నిషేదించారని చెబుతారు. కానీ ఇక్కడే వస్తుంది అసలైన ప్రశ్న… జ్ఞానాన్ని వారివద్దమాత్రమే ఎందుకు దాచుకోవలసి వచ్చింది, అది సమాజంలోని అందరికీ ఎందుకు పంచలేదు, ఇతరులకు ఎందుకు నిషేదించారు? ఆ జ్ఞానాన్ని విన్నా చదివినా శిక్షలు ఎందుకు విధించారూ? అని. దానికి సమాధానం ఆధిపత్యం కొరకే అనేది సుస్పష్టం. లేఖనం రెండువేల సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ, వేదాలను పదిహేనో శతాబ్దం వరకు మౌఖికంగా కాపాడుకొంటూ వచ్చారు తప్ప లిఖితరూపంలోకి మార్చలేదు. కారణం బహుశా జ్ఞాన రక్షణ పేరుతో జాతిరక్షణ కొరకు కావొచ్చు.
***
ఇక పురాణాలలో బ్రహ్మహత్య చేసిన దేవుళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో అనేక కథనాలు కనిపిస్తాయి.
బ్రాహ్మణుడైన వృత్రాసురుడిని చంపినందుకు ఇంద్రుడిని బ్రహ్మహత్య పాపం వెంటాడింది. ఆ పాతకాన్ని భూమి, నీరు, చెట్లు, ఋతుమతి అయిన స్త్రీలకు పంచి విముక్తి పొందాడు.
రావణుడు బ్రాహ్మణుడు కావడంతో రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దీని నివారణ కొరకు అశ్వమేధ యాగం, రామేశ్వర లింగ ప్రతిష్ఠ చేసాడు. అలాగే శంబుక వధ ఉదంతంలో రాజ్యంలో ఎక్కడో జరిగిన బ్రాహ్మణ బాలుడి మరణానికి శ్రీరాముడినే బాధ్యుడిని చేయడం ఇదే కోవకు చెందుతుంది.
బ్రహ్మ ఐదో తలను నరికినందుకు శివుడికి బ్రహ్మహత్య పాపం తగిలి, ఆ బ్రహ్మదేవుని కపాలం చేతికి అంటుకుపోయింది. దేశాటన చేసి చివరకు కాశీలో ఆ బ్రహ్మ కపాలం చేతినుండి విడివడటంతో ఆ పాపం నుండి శివుడు విముక్తుడయ్యాడు.
ఇంద్రపదవి పొందిన నహుషుడు, బ్రాహ్మణులైన సప్తర్షులతో తన పల్లకిని మోయించినందుకు, అగస్త్యుడిని అవమానించినందుకు కొండచిలువగా మారమని శపించబడ్డాడు.
ఈ కథలన్నీ ఒకే సందేశాన్ని ఇస్తాయి: 'బ్రాహ్మణుడు' అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని, వారిపై చేసే హింస లేదా నింద పరలోక భయాలకు, సామాజిక వెలివేతలకు, శిక్షలకు దారితీస్తుందని హెచ్చరించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థను రక్షించుకోవడానికి ‘బ్రాహ్మణ నింద’ 'బ్రహ్మహత్యా పాతకం' అనే ఒక బలమైన నైతిక, లౌకిక పారలౌకిక ఆయుధాల్ని సృష్టించారు పండితులు.
ఇంద్రుడు, రాముడు, శివుడు వంటి సాక్షాత్తు దేవుళ్ళే ఈ పాపం నుండి తప్పించుకోలేక పోయారనే కథల ద్వారా... సామాన్యులలో ఒక రకమైన మానసిక దాస్యాన్ని, భీతిని కల్పించారు. చట్టం కంటే మతపరమైన భయం ద్వారా సమాజాన్ని నియంత్రించే పద్ధతి ఇది. ఈ గాథలు నేర్పేది భక్తి కాదని, ఒక వర్గపు ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగా గుర్తించడమే నేటి అవసరం.
3. ముగింపు
మొన్న ఉగాదిపూట పంచాంగం చెప్పిన ఒక పెద్దమనిషి, బ్రాహ్మణులని నిందించినవారికి “హింస తప్పదు కాక …. తప్పదు” అని గుడ్లురుముతూ శాపనార్ధాలు పెట్టాడు. ఇది ప్రజాస్వామ్యయుగం అని, రాజ్యాంగం ప్రకారం ప్రజలందరూ సమానమేనని, ఎక్కువతక్కువ అంతస్తులు ఇప్పుడు లేవనే ఎరుకలేకుండా సభలో బహిరంగంగా అలా మాట్లాడటం ఎంత బరితెగింపు! "హింస తప్పదు" అంటే ఏమిటి అర్థం?
చరిత్రలో బ్రాహ్మణ నింద అనే పదం ఉంది తప్ప – ‘మాల నింద’, ‘శూద్రనింద’, ‘కంసాలి నింద’ లాంటి పదాలు ఎందుకు లేవూ? వాళ్ళని నిందించవచ్చు. వాళ్ళు వీరిలాంటి మనుషులు కారు అనే కదా అర్థం?
ఈ ప్రజాస్వామ్య యుగంలో కూడా ఇంకా బ్రాహ్మణనింద లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే రాజ్యాంగం పట్ల, సమానహక్కులపట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్ధం! ఇంకా మనువాద రాజ్యాంగమే నడుస్తుందనే తెంపరితనం ఇది. ఆధునిక సమాజాన్ని మళ్ళీ చీకటి రోజుల్లోకి, వర్ణ వివక్షతో కూడిన అమానుష వ్యవస్థలోకి తిరిగి వెనక్కు తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు. రాజ్యాంగం పట్ల అనవగాహన.
ప్రజాస్వామ్యంలో ఏ వర్గమూ విమర్శకు అతీతం కాదు; సమాజంలో సమానత్వం, న్యాయం నిలబెట్టాలంటే అన్ని నిర్మాణాలు, విశ్వాసాలు ప్రశ్నించబడగలగాలి. ఒక వర్గాన్ని ప్రత్యేకంగా రక్షిస్తూ, దానిపై సంధించిన ప్రశ్నలను “నింద” గా నిర్వచించడం వల్ల అసమాన సంబంధాలు కొనసాగుతాయి. ఇది రాజ్యాంగం ప్రసాదించిన సమాన హక్కుల సారాన్ని దెబ్బతీస్తుంది.
మానవహక్కులు పరిఢవిల్లిన ఇరవయ్యొకటవ శతాబ్దంలో “హింస తప్పదు, హింస తప్పదు” అని మైకులో హెచ్చరిస్తున్నారంటే- దమననీతి రాజ్యం ఏలిన ఒకప్పటి కాలంలో, ఆజీవికులు, బౌద్ధులు, జైనులు. చార్వాకులు, శైవులు, భక్తి కవులు లాంటి మనువాద ధిక్కారులను ఈ మనువాదులు ఏ మేరకు నిర్మూలించి ఉంటారో ఇట్టే అర్థంచేసుకోవచ్చు.
బొల్లోజు బాబా
(ఈ వ్యాసం చారిత్రక గ్రంథాలపై విమర్శాత్మక విశ్లేషణ మాత్రమే; ఏ వ్యక్తి లేదా వర్గాన్ని అవమానించడం ఉద్దేశం కాదు. ఈ వ్యాసంలోని మనుస్మృతి వాక్యాలు, ఇతర ధర్మశాస్త్రాల ఉటంకింపులు “మనుస్మృతి, తాత్పర్య రచన డా. నల్లందిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, తితిదే ప్రచురణ, డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలు ప్రసంగాలు సంపుటం 5, Manu's Code Of Law, Patrick Olivelle నుండి తీసుకోబడినవి)

