Sunday, March 17, 2024

ప్రాచీన భారతీయ లౌకికత

 2400 సంవత్సారాల క్రితపు భారతదేశ సనాతన ధర్మం ఇలా ఉంది......

ఒక మతానికి చెందిన వ్యక్తులు అసందర్భంగా తమమతాన్ని పొగుడుకోవటం, ఇతరమతాలను నిందించటం చేయరాదు.  పరమతానికి చెందినవారిని కూడా గౌరవించవలెను.  ఇలా చేయుటవలన తమ మతాన్ని అభివృద్ధిచేసుకోవటమే కాక ఇతరమతాలవారికి ఉపకారం కలిగించిన వారు అవుతారు.  తన వారిని స్తుతిస్తూ ఇతరమతస్తులను నిందించేవాడు తన మతానికే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. - అశోక చక్రవర్తి, XII వ శిలాశాసనము


(రానున్న "వేద బాహ్యులు" పుస్తకం నుంచి)


బొల్లోజు బాబా

Wednesday, March 13, 2024

ఆ గుడిలో దేవుడు లేడు – రవీంద్రనాథ్ టాగూర్

ఆ గుడిలో దేవుడు లేడు – రవీంద్రనాథ్ టాగూర్
.
“ఆ గుడిలో దేవుడు లేడు” అన్నాడు సన్యాసి
రాజుకు కోపం వచ్చింది
“లేడా! ఓ సన్యాసి, నువ్వు నాస్తికుడివా?
రత్నాలు పొదిగిన పీఠంపై బంగారు విగ్రహం
కాంతులు చిమ్ముతోంది
అదంతా ఖాళీగ ఉందని అంటావా?

“అది ఖాళీ కాదు; బదులుగా నీ రాజగర్వంతో నిండి ఉంది
అక్కడ దేవుడిని కాదు నిన్ను నువ్వు ప్రతిష్టించుకొన్నావు” సన్యాసి అన్నాడు.

రాజు ముఖం చిట్లించి “ అంబరాన్ని తాకే  ఈ గొప్పనిర్మాణంపై
ఇరవై లక్షల బంగారు నాణేలు చల్లాను,
అవసరమైన ఆగమసంబంధ పూజలు చేసి దేవతలకు సమర్పించాను
అంతగొప్ప దేవాలయంలో దేవుడు లేడని నువ్వు ఎలా చెప్పగలవు?

ఆ సన్యాసి ప్రశాంతంగా సమాధానం చెప్పాడు
“మీ ప్రజలలో రెండుకోట్లమంది 
ఘోరమైన కరువుతో బాధపడిన సంవత్సరం;
ఆకలితో ఆశ్రయం కొరకు నీవద్దకు వచ్చి, వెళ్ళగొట్టబడ్డారు,
రోడ్లపక్క, అడవులలో, శిథిల ఆలయాలలో వారు ఆశ్రయం వెతుక్కొన్నారు
అదే సంవత్సరంలో నీవు ఈ గొప్ప ఆలయ నిర్మాణానికి 
ఇరవై లక్షల బంగారు నాణాలు ఖర్చుచేసినపుడు
ఆ రోజునే దేవుడు తన తీర్పు చెప్పాడు:
“నా నివాశం శాశ్వతదీపాలతో వెలుగుతుంది
సత్యం, శాంతి, దయ, ప్రేమ లాంటి విలువలే పునాదులు.
తన స్వంత ప్రజలకు ఆశ్రయం కల్పించలేకపోయిన 
ఈ పిసినారి నిరుపేద రాజు నిజంగా నాకు ఇల్లు ఇవ్వగలనని 
అనుకొంటున్నాడా?”

ఆ రోజే దేవుడు  నీ దేవాలయం విడిచి వెళ్ళిపోయాడు
రోడ్డుపక్కన, చెట్ల క్రింద ఉన్న పేదల వద్దకు చేరాడు.
సముద్రపు నురుగ వలే నీ దేవాలయం ఖాళీగా ఉంది

కోపంతో రాజు అరిచాడు
“ఈ పిచ్చివాడిని నా రాజ్యం నుంచి బహిష్కరించండి”

సన్యాసి ప్రశాంతంగా బదులిచ్చాడు
“దైవాన్ని బహిష్కరించిన చోటునుంచి
భక్తులను కూడా బహిష్కరించండి”

మూలం: There is No God in that Temple by Rabindranath Tagore, Deeno Daan 1900.
అనువాదం: బొల్లోజు బాబా

Wednesday, March 6, 2024

ద్వారక గ్రాఫిక్స్

ఇటీవలి ద్వారకా పేరుమీద వచ్చిన ఒక వీడియో చూసి నిజంగా సముద్రగర్భంలో ఇన్ని నిర్మాణాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలిగింది. కొంచెం వెతకగా అవన్నీ ఫేక్ వీడియోలు, చిత్రాలు అని అర్ధమైంది.

 
అబద్దాలు పునాదులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. నిజానికి వీటిని ప్రచారంలో పెట్టేవారందరూ రాజకీయ ఐటి సెల్ ఉద్యోగులు కావొచ్చు. వాళ్ళకు ఇది జీతాలు ఇచ్చే వ్యాపకం. కానీ ఈ ఉచ్చులో సామాన్యులు, కాస్తో కూస్తో ఆలోచనకలిగిన విద్యాధికులు కూడా పడటం శోచనీయం.
ద్వారక ఒకనాటి గొప్ప అంతర్జాతీయ ఓడరేవు. అరవైయ్యవ దశకంలో అక్కడ తవ్వకాలు జరిగాయి. సముద్రగర్భంలో మానవనిర్మిత రాతిదిమ్మలు, గోడలతాలూకు రాతి ఇటుకలు లభించాయి. ఇవి ఓడరేవులో పడవలను కట్టటానికి ఉపయోగించే రాతి లంగరులుగా గుర్తించారు. (చూడుడు ఫొటో)
నేలపై జరిపిన తవ్వకాలలో 9 వ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి ప్రతిమలు కనిపించాయి. బాగా లోతుగా చేసిన తవ్వకాలలో క్రీస్తుపూర్వపు రెండువేలకు చెందిన కుండపెంకులు లభించాయి. ఇంతకు మించిన పురోగతి లేదు.
 
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఫొటోలు గ్రాఫిక్ వి. మోసపూరితమైన ఒక నేరేటివ్ ని నిర్మించటానికి సృష్టించినవి.

ద్వారక సముద్రగర్భ పురావస్తుశోధనలో పాల్గొన్న శ్రీ పుట్టస్వామి గుడిగర్ అనే శాస్త్రవేత్త - సోషల్ మీడియాలో, న్యూస్ చానెల్స్ లో ప్రచారం అవుతున్న ద్వారకా ఫేక్ ఫొటోలు వీడియోల పట్ల ఇలా అన్నారు--

"మాతవ్వకాలలో ఏరకమైన ఆలయ శిథిలాలు కనిపించలేదు. ఈ దేశం అబద్ధాల ఊబిలో కూరుకుపోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం మరింత దారుణంగా ఉంది".
 
బొల్లోజు బాబా






Saturday, March 2, 2024

మహాగురువు శ్రీ యర్రోజు మాధవాచార్యులు



జీవిత విశేషాలు

శ్రీ యర్రోజు మాధవాచార్యులు 1913, అక్టోబరు 22 న కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. వీరి తండ్రి శోభనాద్ర్యాచార్యులు, తల్లి రుక్మిణమ్మ. శోభనాద్ర్యాచార్యులు వేదపండితులు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉండేది. వీరు నూజివీడు జమిందారీలో స్వర్ణకార కులవృత్తిని నెరిపారు. మాధవాచార్యులుగారికి చిన్నతనంలోనే తండ్రిగారు గతించటంతో తల్లి రుక్మిణమ్మ గారి పెంపకంలోనే పెరిగారు. వీరి బాల్యం, ప్రాధమిక విద్యాభ్యాసం అంతా నూజివీడులోను, పిదప గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ లోను తమ చదువు కొనసాగించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బిఎ. హానర్స్ పట్టా పొందారు.

శ్రీ మాధవాచార్యులు గుడివాడ ఎ.ఎన్.ఆర్ కళాశాలలో ఓరియంటల్ లాంగ్వేజెస్ శాఖాధిపతిగా 1950 నుండి 1966 వరకు పనిచేసారు. శ్రీ రాజా రంగయ్యప్పారావు పాఠశాలలో తెలుగు పండితునిగా సేవలందించారు. తరువాత కొంతకాలం నూజివీడు ధర్మప్పారావు కళాశాల తొలి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించారు. వీరు ఎక్కడ పనిచేసినా ఆ ప్రాంతంలోని సాహిత్య, కళా రంగాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ఎందరో కళాకారులకు ఒక వేదిక కల్పించి వారిలోని ప్రతిభను పదిమందికి తెలిసేలా చేసేవారు. అలా గుడివాడలో రచయితల సంఘం, కృష్ణరాయ కళాసమితి మొదలైన సాంస్కృతిక సంస్థలు ఏర్పడటానికి దోహదపడ్డారు. గుడివాడలో కవిరాజ కళాభవనం నిర్మించటంలో వీరిపాత్ర ఎంతో ఉన్నది.[1] శ్రీ మాధవాచార్యులు గుడివాడలో ఉండగా- కోడూరు అచ్చయ్య, తుమ్మలపల్లి కామేశ్వర రావు, కఠారి సత్యనారాయణరావు, జి.ఎస్.ఆర్ ఆంజనేయులు, శ్రీమతి పువ్వుల అనసూయ, శ్రీ నెరుసు వీరాస్వామి లాంటి ప్రభృతులతో కూడి గుడివాడ కళాసమితి అనే సంస్థ ఆధ్వర్యంలో అనేక సాహిత్య కార్యక్రమాలను,[2] ఎందరో లబ్దప్రతిష్టులతో సాహిత్య సభలు, అవధానాలను ఏర్పాటు చేసారు.

సాహిత్య కృషి

శ్రీ మాధవాచార్యులు మఘవలయము, ప్రతిమా శంబూకము, మణి ప్రవాళము, భువన విజయము, ముక్కోటి, వ్యాసాలు-ఉపన్యాసాలు వంటి వివిధ రచనలు గావించి గొప్ప కీర్తి నార్జించారు.

“మఘవ లయము” అను పద్యకృతిని ఆనాటి కళలు ఎక్సైజ్ శాఖా మంత్రి అయిన రాజా రంగయ్యప్పారావు బహద్దరు కు 1965లో అంకితమిచ్చారు

“మఘవ” అనేది మహా ఘనత వహించిన అనే వాక్యానికి సంక్షిప్తనామం. నిజాం అధినేత మీర్ ఉస్మాన్ అలీఖాన్ కు బ్రిటిష్ ప్రభుత్వం హిస్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదు ఇచ్చింది. దీనిని తెలుగులో “మహా ఘనత వహించిన” అని వ్రాసేవారు. 1930 ల ప్రాంతంలో నిజాం రాజును వ్యంగ్యంగా సంబోధించటానికి మఘవ అని పిలిచేవారు మఘవ లయము అంటే మహాఘనత వహించిన నిజాం రాజుయొక్క అధికార లయము (నాశనము) అని సంకేతార్ధము.

నిజాం రాజ్యాన్ని స్వతంత్ర్యభారతావనిలో విలీనం చేయటానికి జరిపిన భారతప్రభుత్వ పోలీసు చర్య ఈ మఘవలయ కావ్య వస్తువు. ఈ కావ్యంపై గోల్కొండ పత్రికలో వచ్చిన ఒక సమీక్షలో- యర్రోజు మాధవాచారి శైలి విశ్వనాథ సత్యన్నారాయణ రచనా పోకడలతో ఉన్నదని సమీక్షకుడు అభిప్రాయపడ్డాడు[3].

దుష్టుడైన ఒక వ్యక్తి నిజాం రజాకార్లతో కలిసి చెడు వర్తనుడై ప్రజలను పీడిస్తుండగా, అతని సోదరుడే అతనిని చంపివేయటం మఘవలయ కావ్యాంశము. ఈ కావ్యంలో శ్రీ మాధవాచార్యులు ఎంతో ధైర్యంగా రజాకార్ల కోపాగ్నికి గురికావచ్చునేమోనని కూడా ఆలోచించక, ఆనాడు రజాకార్లు హిందువుల పట్ల, వారి ప్రార్ధనాలయముల పట్ల జరిపిన అత్యాచారములను ఎంతో వేదనతో ఇలా వర్ణించారు. ఇవి ఆనాటి పరిస్థితులను కళ్ళకు కడతాయి.


//దివ్యస్థలంబుల దేవాలయంబుల| మధుమాంస దుర్గంధమయ మొనర్చి

విగ్రహంబుల నెల్ల విధ్వంసనము చేసి| మూత్రాభిషేకాల ముంచి యెత్తి

భూషణాదుల దొంగపోటుగా హరించిన| వాహనాలెక్కి సవారిచేసి

చేదికందినవారి సిగలెల్ల గొరిగించి| యుపవీతముల మొలకుచ్చుపోసి

యర్చకస్త్రీల గర్భాలయముల బట్టి| చెప్పరానట్టి విధముల జెఱచి చెఱచికఱకు

గుండెలు రూపులు తిరుగు మొఱకు|రక్కసుల రాజ్యమైపోయె నక్కట కట|

అయ్యవార్లనదల్సి రొయ్యలు దినిపించి|నిష్టాగరిష్టులనిచ్చి సున్తీచ్చేసి కుచ్చుటోపీలు పెట్టి మతము మార్చినారు........ అంటూ దుఃఖపడుతూ ఆనాటి హిందువుల నిస్సహాయ పరిస్థితులను, రజాకార్ల దుష్ట చేష్టలను చరిత్రలో నిక్షిప్తం చేసారు శ్రీ యర్రోజు మాధవాచార్యులు. ఇది వీరు నిర్వహించిన ఒక చారిత్రిక బాధ్యతగా నేడు గుర్తించవచ్చును.

అలాంటి క్రూరపరిస్థితులనుండి నిజాం రాజ్యాన్ని విడిపించి ప్రజలకు విముక్తికలిగించిన సర్ధార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలను మాధవాచార్యులు ఈ విధంగా స్తుతించారు


వల్లభాయి పటేలు మేధా విభవ ప్రయోగ సముదారుడ’యి

చేసిన వీర కార్యము ఫలితము త్రిలింగ విషయాభ్యుదయారున

కాంతి పూరమైనది. ఇది ఫలోదయము [4]//

***

రామాయణంలోని శంబుకవధ ఘట్టంలోని ఔచిత్య, అనౌచిత్యాలను తాత్వికంగా చర్చించిన కావ్యం ప్రతిమా శంబూకము. భువన విజయము ఏకాంకిక నాటిక.

మాధవాచార్యులు జానపద వాజ్ఞ్మయం పై పి.హెచ్.డి చేసి సమర్పించటానికి రైలులో వెళుతుంటే రజాకార్ల ఉద్యమసమయంలో జరిగిన అల్లర్లలో సూట్ కేస్ పోవటంతో ఆ పరిశోధన తాలూకు పత్రాలను పోగొట్టుకొన్నారు. అలా డాక్టరేట్ ను మిస్ అయ్యారు. ఆ లోటు తీర్చుకోవటం కొరకు ఉద్యోగవిరమణ అనంతరం హానరరీ ఫెలోషిప్ తీసుకొని “మేకా రాజా రంగారావు అప్పారావు – జీవిత చరిత్ర” అనే పరిశోధనా గ్రంధాన్ని రచించారు[5].

శ్రీ మాధవాచార్యులు గొప్ప వాక్పటిమ కలిగిన ఉపన్యాసకులు. ఆకాశవాణిలో తెలుగు సాహిత్యంపై అనేక ప్రసంగాలు చేసారు. ఈ రేడియో ఉపన్యాసాలను ఇంకా మరికొన్ని వ్యాసాలను కలిపి “వ్యాసాలు-ఉపన్యాసాలు” పేరుతో పుస్తకరూపంలో వెలువరించారు.


మహా గురువు బిరుదు ప్రధానం

మలేషియా ఆంధ్రసంఘం వారు మాధవాచార్యులను మలేషియా ఆహ్వానించారు. వీరు అక్కడ ఒక నెలరోజుల పాటు తెలుగు సాహిత్యం గురించి వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వీరికి మలేషియా ఆంధ్రసంఘం వారు “మహా గురువు” అనే బిరుదును ఇచ్చి గొప్పగా సత్కరించారు

సామాజిక సేవ

మాధవాచార్యులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1942 లో బొంబాయిలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభలకు తెలుగు ప్రతినిధిగా హాజరయ్యారు. స్వాతంత్ర్యానంతరం కూడా కాంగ్రెస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూ- వితంతు పునర్వివాహం, అనాధప్రేత సంస్కారము లాంటి వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు.

నూజివీడు జమిందారు కుమారరాజాగా ప్రసిద్ధిచెందిన మంత్రివర్యులు శ్రీ మేక రంగయప్పారావు గారితో యర్రోజు మాధవాచార్యులకు ప్రగాఢమైన స్నేహానునుబంధం ఉండేది. తన మఘవలయం కావ్యాన్ని కుమారరాజా గారికి అంకితం ఇచ్చారు. మాధవాచార్యుల ప్రోత్సాహంతోనే 1966లో శ్రీ కుమారరాజా వారు నూజివీడులో ధర్మప్పారావు కళాశాల నెలకొల్పారు[6]. ఇది నేడు శాఖోపశాఖలుగా విస్తరించి నడుస్తూ ఉన్నది.

***

ఆంధ్రనాటక కళాపరిషత్తు 1929లో స్థాపించబడింది. 1944 లో దీనిని పునర్వవస్థీకరించే వరకూ పెద్దగా చెప్పుకోదగిన కృషి కాని తెలుగు నాటకరంగ అభివృద్ధికాని జరగలేదు. అలా ఆంధ్ర నాటక కళాపరిషత్తును పునర్వవస్థీకరించిన పెద్దలలో శ్రీ రాజా రంగయ్యప్పారావు, శ్రీ యర్రోజు మాధవాచార్యులు, కాజ వెంకట్రామయ్య, దుక్కిపాటి మధుసూదనరావు తదితరులు ముఖ్యులు. వీరందరూ పరిషత్ నిర్వహణ బాధ్యత వహించి, ఒక నియమావళిని ఏర్పరచి పరిషత్తు నిర్విఘ్నంగా, సమర్ధవంతంగా పనిచేయటానికి దోహదపడ్డారు. వీరిలో మాధవాచార్యులు క్రియాశీలకపాత్ర పోషించించారు. అప్పటినుంచి ప్రతిఏటా నాటకపోటీలు జరపటం ఆంధ్రదేశంలోని నాటకసంఘాలలో గొప్ప ఉత్తేజాన్ని, చైతన్యాన్ని నింపింది.

ఆంధ్ర నాటక కళాపరిషత్తు కార్యవర్గ కమిటీలో మాధవాచార్యులు వివిధ హోదాలలో దాదాపు 1944 నుంచి మూడు దశాబ్దాలపాటు పని చేసి తెలుగు నాటకరంగానికి తమ విశిష్టమైన సేవలను అందించారు. పలు నాటక పోటీలను నిర్వహించటం, నటులను ప్రోత్సహించటం, ప్రతిభకలిగినవారిని సన్మానించటం[7] లాంటి పనులద్వారా ఎంతో మంది ప్రతిభావంతులను సినీ నాటకరంగాలకు పరిచయం చేసారు. అలా ఈ పరిషత్తు ద్వారా వెలుగులోకి వచ్చిన రచయితలలో ఆచార్య ఆత్రేయ, భమిడిపాటి రాధాకృష్ణ, డి.వి. నరసరాజు, పినిశెట్టి, బెల్లంకొండ రామదాసు, కొండముది గోపాలరాయ శర్మ తదితరులు; నటులలో ఎన్.టి. రామారావు, రమణమూర్తి, మిక్కిలినేని, జగ్గయ్య, రావికొండలరావు, చదలవాడ, వల్లం నరసింహరావు లాంటివారు ముఖ్యులు[8].

మాధవాచార్యులు పంతొమ్మిది వందల అరవైలలో ఆంధ్రప్రదేష్ సంగీత నాటక అకాడెమీ కి మెంబరుగా తమసేవలందించారు. [9]

విశ్వబ్రాహ్మణ ధర్మపీఠ వ్యవస్థాపన

విశ్వబ్రాహ్మణ వంశీయులకు ధర్మప్రభోదం చేయటానికి, సంఘీయులకు చేయూతనీయటం కొరకు శ్రీ మాథవాచార్యులు 1974 లో వ్యవస్థాపక సభాపతిగా విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ను స్థాపించారు. దురిశేటి వెంకటరామాచార్యులు, కొండూరి వీరరాఘవాచార్యులు సంచాలకులుగా వ్యవహరించారు. ఈ సంస్థ నేటికీ గొప్ప గణనీయమైన సేవలందిస్తున్నది[10].

***
రచయితగా, సాంస్కృతిక సేవకునిగా, కళాపోషకునిగా, సంఘసేవకునిగా తన జీవితాన్ని సమాజానికి అర్పించుకొన్న శ్రీ యర్రోజు మాధవాచార్యులు 1983, ఆగస్టు 31 న నూజివీడులోని తమ స్వగృహంలో పరమపదించారు. తెలుగు నేలకు సంబంధించిన సాహిత్య, కళా విద్యారంగాలలో వీరి పాత్ర గణనీయమైనది.
బొల్లోజు బాబా

కాకినాడ









[1] గుడివాడ వైభవం, తాత రమేష్ బాబు పే.నం. 73


[2] ఆంధ్రజ్యోతి దినపత్రిక 11, ఆగస్టు 1964, పేనం. 5


[3] రి. గోలకొండ పత్రిక 12-12-1965


[4] ఉద్యమ దర్శనము, శ్రీ ముదిగొండ శివప్రసాద్. పే.నం. 334


[5] శ్రీ యర్రోజు మాధవాచార్యులు గారి కుమార్తె శ్రీమతి కల్యాణి గారు, వారి బంధువులైన ప్రొ. డా. నూతలపాటి శ్రీనివాస్ గారు ఈ వ్యాసరచనా సమయంలో అమూల్యమైన సమాచారాన్ని అందించారు.


[6] పుష్కర కృష్ణ, కృష్ణాపుష్కర విశేష సంచిక 2016, పేనం. 112


[7] విశాలాంధ్ర, దినపత్రిక 3-5-1964 , పేనం. 6


[8] ఆధునిక నాటకరంగం ఈ దశాబ్ది ప్రయోగాలు by బోయిన వెంకటేశ్వర రావు. పే.నం.317-318. అదృష్టవంతుని ఆత్మకథ, డి.వి. నరసరాజు స్వీయ చరిత్ర, పే.నం. 148


[9] The Andhra Pradesh Legislative Asbembly Debates, official Report 15th July, 1967


[10] విశ్వబ్రాహ్మణ సర్వస్వము-విశ్వబ్రాహ్మణ ప్రముఖులు (ప్రధమ భాగము), శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు, పేనం. 288

Monday, December 18, 2023

Bharhut స్తూపంపై ఉన్నది రామాయణ ఘట్టమా?


"Bharhut స్తూపంపై చెక్కిన దశరథ జాతక కథ ద్వారా రాముని కథ BCE రెండో శతాబ్దం నుంచి భారతదేశంలో ప్రబలంగా ఉంది" అనే వికీ వాక్యం ఆకర్షించింది. ఎందుకంటే రామునికి సంబంధించిన ఐకనోగ్రఫీ CE 5/6 శతాబ్దాలనుంచి లభిస్తుంది. అంతక్రితపు స్పష్టమైన శిల్పాలు కానీ చెక్కుడు రాళ్ళు కానీ కనిపించవు. ఈ నేపథ్యంలోంచి చూసినపుడు పై వాక్యం ఆశ్చర్యం కలిగించకమానదు.
***

1. దశరథ జాతకకథ.
.
BCE మూడవ శతాబ్దపు దశరథ జాతకకథలో దశరథ రాజుకు రామ పండిత, లక్ష్మణ అనే ఇద్దరు కొడుకులు సీతాదేవి అనే ఒక కూతురు, మరొక భార్య వల్ల భరతుడు అనే కొడుకు కలరు. తండ్రి ఆజ్ఞపై రామపండితుడు అరణ్యవాసానికి వెళ్ళగా, భరతుడు అన్నగారైన రామపండితుడిని వెతుక్కుంటూ వెళ్ళి, రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తాడు. తండ్రికి ఇచ్చిన పన్నెండేళ్ళు గడువు పూర్తికానందున రాజ్యానికి రాలేనని, తన పాదుకలను ఇచ్చి భరతుడినే రాజ్యపాలన చేయమని కోరతాడు రామపండితుడు. వనవాసం పూర్తయ్యాక రామపండితుడు తండ్రి రాజ్యాన్ని చేపట్టి పదహారు వేల ఏండ్లపాటు పరిపాలించాడు.
పై బౌద్ధ జాతక కథలో సీతాపహరణ ఘట్టం లేదు. రావణుడు లేడు. రామరావణ యుద్ధం, ధర్మసంస్థాపన లాంటివి కూడా లేవు.
***

2. స్త్రీని అపహరించుకొనిపోతున్న యక్షుడు
.
కౌశాంబి లో దొరికిన BCE ఒకటవ శతాబ్దానికి చెందిన ఎర్రమట్టి ఫలకపై, ఒక యక్షుడు ఒక స్త్రీని ఎత్తుకొని పోతున్నట్లు ఉంది. ఈ ప్రతిమలో - ఆ స్త్రీ యక్షుని కబంధ హస్తాలలోంచి తప్పించుకోవటం కొరకు పెనుగులాడుతున్నట్లు కనిపిస్తుంది. చెట్ల ఆకుల మధ్యలోనుంచి ఒక కోతి తొంగి చూస్తుంటుంది. ఆ స్త్రీ కర్ణాభరణం ఒకటి నేలపై పడి ఉంది. దుష్ప్రవర్తన కలిగిన పురుషులు, స్త్రీలను ఎత్తుకుపోవటం అనేది ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో కనిపించే ఒక నెరేటివ్.
ఈ ఎర్రమట్టి ఫలకలో చిత్రించిన "యక్షుడు స్త్రీని అపహరించుకు పోయే ఘట్టం" రామాయణంలోని సీతాపహరణంతో సరిపోలుతుంది. మరీ ముఖ్యంగా అపహరణ సమయంలో సీతామాత వానరములను చూసి వాటికి లభించేటట్లు ఆభరణాలను జారవిడవటం.
ఈ నెరేటివ్ ఆకాలపు ఏదో ఒక జానపద కథ అయి ఉండవచ్చు. లేదా నేడు లభించని ఏదో బౌద్ధ జాతకకథ అయినా కావొచ్చు.
***
CE 500 లో అప్పటికే జనశృతిలో ఉన్న రామాయణ గాథను లిఖితరూపంలోకి తీసుకురావటం జరిగింది. [1] అంటే BCE మూడో శతాబ్దపు దశరథ జాతక కథను, BCE ఒకటో శతాబ్దపు "yakṣa abducting a woman" అనే కథను, ప్రేరణగా తీసుకొని దానికి ధర్మ సంస్థాపనను వెన్నుగా నిలిపి, అనూచానంగా వస్తున్న రామాయణ ఐతిహ్యాన్ని కావ్యంగా లిఖించి ఉంటారు.
ఆనాటినుంచి రామాయణ కథ భారతదేశ నలుచెరగులా విస్తరించి దేశప్రజలందరిని కలిపి ఉంచే ఒక ఉమ్మడి భాషగా, ఈ నేల జీవనవాహినిగా, ఒక ఉమ్మడి ఆత్మగా రూపుదిద్దుకొంది.
***
.
"Bharhut స్తూపంపై చెక్కిన దశరథ జాతక కథ ద్వారా రాముని కథ BCE రెండో శతాబ్దం నుంచి భారతదేశంలో ప్రబలంగా ఉంది" అనే వికిపీడియాలోని వాక్యం Mandakranta Bose (2004) రాసిన The Ramayana Revisited అనే పుస్తకంలోనిది. ( The earliest Sculptural evidence of Rama theme can be traced to the depiction of the Dasaratha Jataka in the reliefs of Bharhut, dating from second centuary BCE. పే.337 ).
రామాయణానికి ప్రాచీనత కల్పించటానికి తీసుకొన్న ఒక పోలిక అది. Bharhut స్తూపంపై లభిస్తున్న ఒక చెక్కుడు శిల్పం (కన్నింగ్ హామ్ ప్లేట్ నం. 27) దశరథ జాతక కథతో పోలుతున్నది అని మొదటగా ప్రతిపాదించినది భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడిగా పేరొందిన అలెగ్జాండర్ కన్నింగ్ హామ్.
ఆ చెక్కుడు శిల్పంలో ఉన్నది దశరథ జాతక కథ అనే ప్రతిపాదన తప్పు అని, ఆ ప్లేట్ ఇంకా గుర్తించవలసి ఉంది అని భావిస్తున్నానని రష్యన్ ప్రొఫసర్ von Oldenburg అప్పట్లోనే అభిప్రాయపడ్డాడు.
ఆ చెక్కుడు శిల్పంలో ఉన్నది దశరథ జాతక కథ కాదని అది మహాబోధి జాతక కథ అని E. HULTZSCH, అనే చరిత్రకారుడు Jātakas of Bharaut అనే వ్యాసంలో వెల్లడించాడు. [2]
****

3. Bharhut స్తూప చెక్కుడు శిల్పంపై ఏముంది?
.
ఈ శిల్పంపై ఒక కుక్క, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ఒక వ్యక్తి సన్యాసి దుస్తులు ధరించి ఒక చేతితో గొడుగు, పాదుకలు మరొక చేతితో ఏదో సంచి తగిలించిన దండము పట్టుకొని ఉంటాడు.
మరొకవైపున రాజదుస్తులు, ఆభరణాలు ధరించిన స్త్రీ, పురుషులు ఉన్నారు.
శిల్ప మధ్యంలో ఒక కుక్క కూర్చుని ఉంది.
పై శిల్పంలో సన్యాసి దుస్తులలో ఉన్న వ్యక్తి,, రాముని పాదరక్షలు తీసుకొని వెళుతున్న భరతుడు అని; రాజ దుస్తులు ధరించిన స్త్రీపురుషులు- సీత, రాములు అని; వనవాసంలో ఉన్న సీతారాముల వద్దకు భరతుడు వచ్చి రాజ్యపాలన చేపట్టమని కోరగా, శ్రీరాముడు
సున్నితంగా తిరస్కరించి తన పాదుకలను ఇచ్చిన దశరథ జాతకఘట్టం అని, కన్నింగ్ హామ్ అనుమానపడుతూనే చెప్పాడు. (recognizable at the first glance అంటాడు)
ఆ శిల్పం లో ఉన్న వ్యక్తులు రాముడు సీత, భరతుడు కాదని, అదసలు రామాయణ ఘట్టమే అనటానికి ఈ కారణాలు చెప్పుకోవచ్చు.
మొత్తం శిల్పంలో రాముని వెంటే నిత్యం ఉండే లక్ష్మణుడు లేడు. వనవాస సమయంలో సీతా రాములు సన్యాసి దుస్తులలో ఉంటారు తప్ప రాజ దుస్తులలో కాదు. భరతుడు సన్యాసి దుస్తులలో ఉండడు. రామాయణంలో కుక్క పాత్ర లేదు.

4. మహాబోధి జాతకకథ: 

Bharhut స్తూపంపై లభించిన శిల్పంలో ఉన్నది రామాయణ ఘట్టం కాదని అది మహాబోధి జాతక కథ అని E Hultzsch అభిప్రాయపడ్డాడు.
బెనారస్ ను పాలించే రాజు చెంతకు బోధి అనే పేరుకల ఒక సన్యాసి వచ్చాడు. అతని జ్ఞానాన్ని గుర్తించిన రాజు, బోధిని తన రాజ్యంలో ఉండిపొమ్మని కోరాడు. బోధి రాకవల్ల ప్రజలు సుఖశాంతులతో జీవించసాగారు. రాజుగారి పెంపుడు కుక్క బోధికి ఎంతో దగ్గరయింది. బోధికి వస్తున్న మంచి పేరు పట్ల మంత్రులకు అసూయపుట్టింది. రాజుకు చెడ్డమాటలు చెప్పి బోధికి మరణ శిక్ష విధింపచేసారు. ఆ సంగతి తెలియని బోధి రాజమందిరానికి వచ్చినప్పుడు, ఆ పెంపుడు కుక్క అరుస్తూ బోధికి రానున్న ప్రమాదాన్ని సూచించింది. అది గ్రహించిన బోధి తన కుటీరానికి వెళ్ళి, తనకు కావలసిన గొడుగు, చెప్పులు, దండము, దుస్తుల మూటను తీసుకొని ఆ రాజ్యాన్ని విడిచి వెళిపోదామని నిశ్చయించుకొన్నాడు. ఈ లోపులో రాజు గారు తన తప్పు తెలుసుకొని బోధి వద్దకు వచ్చి క్షమాపణ కోరి అతనిని రాజ్యం వీడి వెళ్ళొద్దని ప్రార్ధించి తన గురువుగా స్వీకరించాడు.
పైన చెప్పిన శిల్పంలోని గొడుగు, పాదుకలు, దండం, దుస్తుల మూట ధరించిన సన్యాసి, మహారాజు, రాణి, కూర్చుని ఉన్న కుక్క వంటి ఆకృతులను బట్టి అది మహాబోధి జాతకకథ అని ఇట్టే పోల్చుకోవచ్చు. [3] [4]

****

Bharhut చెక్కుడు ఫలకకు రామాయణానికి ఏ రకమైన సంబంధంలేదు. కాగా ఆ చెక్కుడు ఫలక BCE రెండో శతాబ్దానికి చెందిన రామాయణ ఘట్టమని, రాముని శిల్పరూపం అంతటి ప్రాచీన కాలం నుంచీ లభిస్తున్నదని చెప్పటం అబద్దపు ప్రచారం. ఎందుకు చేస్తున్నారు అంటే CE ఐదో శతాబ్దం నుంచి మాత్రమే కనిపించే రామాయణ ఐకనోగ్రఫీ ని BCE రెండో శతాబ్దం వరకూ వెనక్కి నెట్టే ప్రయత్నమేనని అనుమానం కలగక మానదు. హిందూమతం వేల, లక్షల సంవత్సరాల క్రితానిది అని చెప్పే అనేక Textual ఆధారాలు చూపగలరు తప్ప Non Textual శిల్పశాస్త్ర లేదా ఆర్కియలాజికల్ ఆధారాలు లభించవు. భారతదేశంలో నేడు ఎక్కడ తవ్వినా ఇబ్బడిముబ్బడిగా లభించే ఆర్కియలాజికల్ ఋజువులన్నీ బౌద్ధజైనాలకు చెందినవి. హిందూమత ఋజువులు CE ఆరో శతాబ్దం తరువాతనుండి లభ్యమౌతాయి. అవికూడా బౌద్ధజైన మూలాలను కలిగి ఉండటం పరిపాటి.
 
అదే విధంగా మూడవ శతాబ్దపు నాగార్జునకొండ వద్ద లభించిన కొన్ని చెక్కుడు ఫలకలలో దశరథ జాతక కథ అని అంటారు కాని అది కూడా అనుమానాస్పదంగానే అనిపిస్తుంది.
 
***

రాముని ఆలయాలు CE ఐదో శతాబ్దం నుంచి ఉన్నట్లు శాసనాధారాలు లభిస్తున్నప్పటికీ, నేడు అవి కనిపించవు. ప్రస్తుతం దేశంలో అత్యంత పురాతనమైన రామమందిరం చత్తిస్ గడ్, రాయ్ పూర్ లో ఉన్న రాజీవ లోచన ఆలయంగా గుర్తించారు. ఇది CE ఏడో శతాబ్దానికి చెందింది.


[1] valmiki.iitk వాల్మికి రామాయణ పేరుతో ఉన్న వెబ్ సైట్
[2] Journal of the Royal Asiatic Society , Volume 44 , Issue 2 , April 1912
[3] Barhut Book II, Jataka Scenes by Benimadhab Barua, 1934, pn. 147 లో 27 వ ఫలకంలో ఉన్నది దశరథ జాతకం కాదని, అది Hultzsch చెప్పినట్లు మహాబోధి జాతక కథ అని Benimadhab Barua అభిప్రాయపడ్డారు.
[4] The Jataka or Stories of the Buddha's former birth, Vol 5, Edited by E.B. Cowell, pn 119

బొల్లోజు బాబా



Friday, December 15, 2023

Jyoti Krishan Verma కవిత్వం

.
Jyoti Krishan Verma ప్రముఖ హిందీ కవి. Khule Aakash Mein, Meethe Pani ki Matkiyan అనే రెండు సంపుటులను వెలువరించారు. ఇతని కవితలు వివిధ పత్రికలలో, సంకలనాలలో చోటు చేసుకొన్నాయి.
.
1.
భూమి
ప్రపంచంలో
అత్యంత చిన్న కవిత
ఎవరైనా రాయాలనుకొంటే
అది ఇలా రాయాలి
భూమి
Earth


2.
యుగాల క్రితం
మానవుడు
కవిత్వం రాయని
కాలమొకటి ఉండేది.
అందుకనే బహుశా
చరిత్రకారులు
దానిని
రాతియుగం అని
పిలిచి ఉంటారు
Eons Ago


3.
దుఃఖం
.
నీటి యొక్క
అతిపెద్ద దుఃఖం
దాని కన్నీళ్ళు
ఎవరికీ
కనిపించకపోవటమే
Grief


4.
ప్రేమ
నీవు చెట్టు
కొమ్మ, ఫలము అయితే
నేను
నీ వేర్లుగా ఉండాలని
కోరుకొంటాను
Love

 
5.
నది
.
ఎండిపోయిన నది వేదన తెలుసా మీకు?
తెలియక పోతే
ఒకసారి సముద్రాన్ని అడుగు
దాహానికి, తృప్తికి మధ్య
దూరాన్ని చెరిపేయడానికి
ఎంతకాలంగా అది రోదిస్తుందో.
River


6.
శిఖరం
ఎన్నో యుగాలుగా నిలబడి ఉన్న
పర్వతం
ఎవరైనా వచ్చి
తనని అధిరోహించి
దాని ఏకాకితనాన్ని దూరం చేస్తారని
ఆశిస్తుంది
ఎదురుచూపుల్లో దాన్ని కళ్ళు
శిలలైపోయాయి
దాని దేహం ఏనాడో
రాతిగా మారిపోయింది
Mountain


Original: Jyothi Krishan Verma
Translated from Hindi into English by Basudhara Roy


తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Tuesday, November 28, 2023

శ్రీ మువ్వా శ్రీనివాసరావు కవిత్వంలో వస్తు వైవిధ్యం

 

కవి ఏ విషయాన్ని చెప్పదలచుకొన్నాడో దాన్ని వస్తువని చెప్పిన విధానాన్ని శిల్పమని అంటారు.  సామాజిక జీవితం, జీవనవైరుధ్యాలు, మానవసంబంధాలు, పర్యావరణం లాంటి అనేక అంశాల కళాత్మక వ్యక్తీకరణే సాహిత్యంలో వస్తువుగా మారుతుంది.  ఏ వస్తువుకైనా మానవజీవితమే భూమిక.  ఒక సంఘటన లేదా ఒక అనుభూతి లేదా ఒక ఆలోచనా ఏదైనా వస్తువుగా ఉండొచ్చు.   సాహిత్య వస్తువు కాలానుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది.   ప్రబంధకవులు ఎన్నుకొన్న కథా వస్తువుకు ఆధునిక కవి రాస్తున్న వస్తువుకూ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఒక కవి సుదీర్ఘకాలంపాటు చేసిన సాహితీయానంలో కూడా ఈ వస్తు పరిణామం గమనించవచ్చు.

ప్రతికవికి ఒక నిర్ధిష్టమైన  సాహిత్య దృక్ఫథం ఉంటుంది.  తన ఆశయాలకు, నిబద్ధతకు, ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉండేవాటినే వస్తువులుగా స్వీకరిస్తాడు. వస్తు శిల్పాలు ఒకదానినొకటి కబళించుకోకుండా పరస్పర ఫూరకాలుగా ఉన్నప్పుడు అది గొప్ప కవిత్వమౌతుంది.  శ్రీ మువ్వా శ్రీనివాసరావు ఇంతవరకూ సమాంతర ఛాయలు, 6th ఎలిమెంట్, వాక్యాంతం, వైరాయణం అనే కవితాసంపుటులను వెలువరించారు.  వీరి వస్తు స్పృహ గొప్పది. వైవిధ్యభరితమైనది. వీరి కవిత్వంలో వస్తువైవిధ్యం ఉత్తమస్థాయిలో ఉన్నట్లు ఈ క్రింది పరిశీలనల ద్వారా అర్ధంచేసుకోవచ్చు.

 

1. రైతు పట్ల సహానుభూతి

ప్రకృతిపరంగా, రాజకీయకారణాలతో, ప్రపంచీకరణ ప్రభావం వలనా నేడు రైతు  దిగులు అంచులకు నెట్టివేయబడుతున్నాడు.  గౌరవంతో జీవించే పరిస్థితులు కరువయ్యాయి.  జీవనం ఛిద్రమైంది. శ్రీనివాసరావు అనేక కవితలలో రైతు దీనస్థితిని చిత్తరువుగా నిలిపారు. 

సూర్యుడు మేఘాలను కుప్పపోసి

గిట్టుబాటు ధర దొరకని రైతు

పత్తిని కాల్చినట్లు కాలుస్తున్నాడనిపిస్తుంది  (బొట్టుసూర్యుడు-6th ఎలిమెంట్)

పై వాక్యాలు సూర్యుని ఎండతీవ్రతను వర్ణించటానికి ఉద్దేశించినవైనా, అక్కడ తెచ్చిన రైతుప్రస్తావన ద్వారా ఈ కవికి రైతులపై ఉన్న సహానుభూతిని అర్ధం చేసుకోవచ్చు.

పండిన పిడికెడు గింజలు 

పుట్టకముందే నపుంసకత్వం నిర్ధేశించుకొన్నాయి//

విధిలేక తనే అంతమై

అలజడి విత్తుతున్నాడు అలలు మొలవాలని

నడిచిన అలలు సందేశం చేరవేస్తాయని// (సమాంతర ఛాయలు)

ఒకప్పుడు   రైతు పండించిన పంటలోని కొన్ని గింజలను విత్తనాలుగా దాచుకొని తదుపరి పంటకు వాదుకొనేవాడు.  ఆధునిక వ్యవసాయం వాడే హైబ్రిడ్ విత్తనాలు ఒక పంటమాత్రమే పండుతాయి.  వాటి గింజలు మొలకెత్తవు, విత్తనాలుగా పనికిరావు.  ప్రతీ పంటకూ విత్తనాలు కొనుక్కోవలసి రావటం రైతుకు అదనపు ఖర్చు. పై కవితలో పిడికెడు గింజల నపుంసకత్వం అర్ధం అది.  ఆ చితికి పోయిన రైతు తన చావు అలలుగా మారి  తన వాదన వినిపిస్తుందని భావించటం సమకాలీన  విషాదం.

***

ఈ రోజు ఏనాడూ ఒక ఆవుకు పేడ ఎత్తని, గడ్డి మేపని సమూహాలు ఆవుని కాపాడతామని కత్తులు ధరించి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అది రాజకీయ ప్రేరేపితం. కానీ  నిజానికి రైతుకు పశువుతో ఉండే అనుబంధం అలాంటిది కాదు.  హృదయగతమైనది.   ఒక   కవితలో చనిపోయిన ఎద్దుని తలచుకొని వెక్కి వెక్కి ఏడ్చిన ఒక రైతుని మనకళ్ళముందు నిలుపుతాడు కవి.  ఇదొక గ్రామీణ పురాపరిమళం.

ఏడ్చి ఏడ్చి చింతనిప్పులయిన

నాన్న కళ్ళు నాకింకా గుర్తే

ఎద్దుపోతేనే గుండెలవిసిన నాన్న కళ్ళు

మానవత్వపు వాకిళ్ళు (నాన్నకళ్ళు-సమాంతర ఛాయలు)

డంకెల్ ఒప్పందాల వల్ల సంప్రదాయ వ్యవసాయరంగం చితికిపోయింది.  అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యచేసుకొన్నాడట రైతు.  అతను పండించిన పత్తితో చేసిన వత్తే అతని తలవద్ద వెలగటం ఒక సామాజిక వైఫల్యం.

డంకెల్ రంకెలకు

అప్పుల వేలం డప్పుల చప్పుళ్ళకు

తను పండించిన పత్తి,  దీపం వత్తులై

రైతన్నల నెత్తిమీద వెలుగుతున్నాయి (పోస్ట్ మార్టం- సమాంతర ఛాయలు)

 

2. పర్యావరణ పరిరక్షణ/ప్రకృతి సౌందర్యం

కవులు ప్రకృతిని ఎంతైతే ఆస్వాదిస్తారో దాని విధ్వంశం పట్ల కూడా అంతే వ్యసనపడుతూంటారు. శ్రీ శ్రీనివాసరావు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాసిన కవితలకన్నా పర్యావరణ పరిరక్షణను వస్తువుగా చేసుకొని వ్రాసిన కవితలు ఎక్కువ.

మనిషిని కట్టేయ్యడానికి

మబ్బులు

నాలుగు మెరుపు తాళ్ళు ఇస్తానన్నాయి

మనిషిని కడిగెయ్యడానికి

సూర్యుడు

నాలుగు బిందెల ఎండనీరు ఇస్తానన్నాడు

మనిషిని మత్తులో ముంచెయ్యడానికి

చంద్రుడు

నాలుగుతీగెల వెన్నెల వీణను ఇస్తానన్నాడు

 

కానీ

మనిషిని మనిషిగా మార్చెయ్యడానికి

ఎవరైనా

నాలుగు కవితావాక్యాలు ఇవ్వగలరా? (ఏమివ్వాలి? -వాక్యాంతం)

మెరుపుతాళ్ళు, ఎండనీరు, వెన్నెల వీణ గొప్ప సౌందర్యాత్మక వ్యక్తీకరణలు.  మానవజీవితానికి ప్రకృతికి ఉండే సంబంధాన్ని అందంగా చెబుతూనే అంతిమంగా  మనిషిని మనిషిగా మార్చేది కవిత్వమే  అని స్పష్టపరుస్తాడు.

 

పదిలంగా పేడ ఉండ్రాల్లు చుడుతోంది

ఏ వినాయకుడి కోసమో//

దేహానికి దీపాన్ని తొడుక్కొన్నది

ఏ కళ్ళకు

చీకటి రంద్రాల చమత్కారాన్ని చూయించడం కోసమో//

ప్రకృతి కళ్యానపు పనిలో

మనకు తప్ప

ప్రతిపురుగుకూ ఓ పాత్ర ఉంది (ప్రతికథనం-వాక్యాంతం)

పేడపురుగు పేడతో ఉండ్రాళ్ళు చుట్టి వాటిని దొర్లించుకొంటు వెళ్ళటం ఒక అందమైన ప్రకృతిదృశ్యం. మిణుగురు పురుగులు రాత్రివేళల మెరుపులు చిందించటం ఒక హృద్యచిత్రం.  ఆ మెరుపు వెలుగులని చీకటి రంద్రాలు అనటం అద్భుతమైన వర్ణన. ప్రకృతిలో   ప్రతిజీవికీ ఒక స్పష్టమైన పాత్ర ఉందని చెబుతూ,   మనిషికే ఏ పాత్రా లేదు అని కుండబద్దలుకొడతాడు.  ఆ విధంగా మనిషి చేస్తున్న పర్యావరణ విధ్వంసాన్ని పరోక్షంగా ఎత్తిచూపుతున్నాడు కవి.

 

3. మధ్యతరగతి జీవన వాస్తవికత

మధ్యతరగతి జీవులకళ్ళు పైవర్గాలకు అతుక్కుపోయి, కాళ్ళుమాత్రం పేదరికంలో కూరుకుపోయి ఉంటాయి. నిత్య సంఘర్షణ, ఉన్నదాంట్లో సర్దుకుపోవటం, అసంతృప్తుల మధ్య సాగుతుంది మధ్యతరగతి జీవనయానం.   ఈ అంశాలను ఒకకవితలో ఆలోచనాత్మకంగా ఇలా చెబుతున్నాడు కవి.

రెండు విసుర్రాళ్ళ మధ్య

పెసరగింజల్లా పగిలిపోతుంటాం//

తాత తాతెవరో తెలియకున్నా

వంశవైభవాన్ని వర్ణిస్తూంటాం

మధ్యతరగతి మనుషులం మేం

 

ఒంటినిండా పులుముకొన్న ఇంటిపేరును

ఏ పలుకుబడి వున్నోడితోనో అంటుగట్టి

ఆశల చిగురులు తొడుక్కుంటాం// (మధ్యపర్వం-సమాంతర ఛాయలు)

 

ఆ రెండు విసుర్రాళ్లను  సంఘర్షణ,  సంక్షోభం అని కవిత చివర్లో గుట్టు విప్పుతాడు కవి.  గొప్పలకు పోవటం, ఒకే ఇంటిపేరున్నగొప్పవ్యక్తులతో పోల్చుకోవటం, నిత్యం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడటం మన నైజమని;   గతంలో కూరుకుపోయి  భవిష్యత్తు పట్ల నేలవిడిచి సాముచేస్తూ  గ్లోబల్ గుహలో రెక్కలు తెగిన పక్షుల వలే జీవిస్తున్నామని అంటాడు కవి. 

 

4. స్త్రీలు పిల్లల పట్ల గౌరవం

ఈ కవికి స్త్రీల పట్ల ప్రగాఢమైన గౌరవం, ప్రేమ ఉన్నట్లు దయ్యాలమాణిక్యమ్మ, క్షమించకు తల్లి, అమ్మమ్మ, నెలరాని రోజు లాంటి అనేక కవితల ద్వారా అర్ధమౌతుంది.

వయసు ముడతల మీద భయాన్ని వాలనీయక

ధైర్యపు నీడలా నడుస్తుండేది

కాలువ మడవ మీద కాచుకు కూర్చున్న

రైతు మాణిక్యం

మా నాయిన అమ్మ  (దయ్యాల మాణిక్యమ్మ- సమాంతర ఛాయలు)

***

అమ్మమ్మ పిడికిలి నుండి

జారిన

పంచదార ధార

నా నాలుకపై చేసిన

చేసిన సంతకం

నేనికా దాచుకునే ఉన్నా  (అమ్మమ్మ-సమాంతర ఛాయలు)

చిన్నవయసులోనే భర్తను కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోక పసివాళ్లుగా ఉన్న పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన కవి నాయినమ్మ దయ్యాల మాణిక్యమ్మ గురించి వ్రాసిన ఈ వాక్యాలు స్త్రీల పట్ల, మరీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలిగిన స్త్రీల పట్ల ఉన్న కవికి ఉన్న గౌరవం తెలియచేస్తుంది

ఈ కవికి అమ్మంటే అనురాగం. అమ్మంటే ఒక భాగ్యం. అమ్మంటే భరోసా.  అనేక కవితలలో అమ్మతనం గురించిన వాక్యాలు పాయసంలో ద్రాక్షపలుకుల్లా తియ్యగా తగుల్తూంటాయి.  అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదూ…

భాగ్యం అంటే ఏమిటో తెలుసా

అమ్మచూస్తుండగానే ముసలాడైపోవడం

అమ్మనీడలోనే అమ్మంత అయిపోవడం (అమ్మంత కావడం-వాక్యాంతం) – నిజంగానే అమ్మచూస్తుండగానే

ముసలాడైపోవటం ఎంత అదృష్టం. ఇదొక నవ్యమైన ఊహ.

 

ఈ మధ్యనే మొదలైంది

నాకో మహాగురువు సాన్నిధ్యం… అంటూ తన మనవడి గురించి చెప్పుకోవటం ఒక నులివెచ్చని

హ్రుదయస్పర్శ.

 

5. ఉద్యమ స్పృహ

సాహిత్యం మానవోద్వేగాల వ్యక్తీకరణ మాత్రమే కాదు అవసరపడినప్పుడు సామాజిక చైతన్యంతో రాజ్యవ్యతిరేక ఉద్యమబాట పట్టవలసి ఉంటుంది. దానికి అందరు కవులూ సిద్ధంగా ఉండరు. ప్రజలస్వామ్యమెప్పుడు? ఈ పద్యానికి ముగింపులేదు, గురితప్పిన పిడికిళ్ళు లాంటి కవితలలో ఈ కవికి ఉద్యమభావజాలం పట్ల సానుకూల వైఖరి ఉన్నట్లు కనిపిస్తుంది.

మా వూరి మర్రి చెట్టుమీద

అర్ధరాత్రి

మందారం పూసిందని

ఖాకీలు కాలువల్లా ప్రవహించాయి

 

తుపాకి గొట్టాలు

తూర్పు మొక్కలను పసిగట్టాయి

తెల్లవార్లూ

లాఠీలు ఎముకలూ

మాట్లాడుకొంటూనే ఉన్నాయి ( 1975 … ఓ పోరాట గాథ - సమాంతర ఛాయలు)

ఎమర్జెన్సీ కాలంలో ఏ కాస్త ప్రభుత్వ వ్యతిరేకత వాసన తగిలినా బిలబిలమంటూ పోలీసులు దిగిపోయి, రాజ్యధిక్కారనేరం మోపి ఆలోచనాపరులను చితకబాది జైళ్ళకు తరలించేవారు.  ఆ నేపథ్యంలోంచి రాసిన కవిత ఇది.   రాజ్యధిక్కారాన్ని, మందారం పూసింది, తూర్పుమొక్కలు అనటంలో రాజ్యవ్యతిరేక భావజాలం పట్ల ఉన్న సానుకూల దృక్ఫథం అర్ధమౌతుంది.

 

6. మానవసంబంధాలు

మానవసంబంధాలను స్పృశించని సాహిత్యం ఉండదు. ప్రపంచీకరణ, పరాయీకరణ, వస్తువ్యామోహం లాంటి ఆధునిక జీవనసరళులు మానవసంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరుమనుషులు కలిసిన చోట సంబంధాలు ఉండక తప్పదు.  మానవసంబంధాలు ఎంతగా విచ్ఛిన్నమైపోయినా మనకుటుంబవ్యవస్థ నేటికీ ప్రపంచానికి ఆదర్శంగానే ఉంది. శ్రీనివాసరావుని మానవసంబంధాల కవి అని పిలుచుకునే విధంగా మానవసంబంధాలపై అచంచలమైన విశ్వాసంతో లోతుగా, వివిధ కోణాలలో, మానవసంబంధాలలోని చీకటివెలుగులను ప్రతిబింబిస్తూ అనేక కవితలు రాసారు.

            //ఒక్కొక్కటిగా గదులన్నింటినీ

బయటకు విసిరేయాలి//

అటాచ్డ్ బాత్రూం ని

పెరటి చివరి గోడమీద ఉతికెయ్యాలి

ఈ లివింగ్ రూముని

ఇరుగుపొరుగు వచ్చిపొయ్యేలా

ఇంటిముందు అరుగుగా పరిచెయ్యాలి//

గడుల గడుల ఈ ఇంటిని

ఎక్కడకక్కడ విడగొట్టాలి

కుటుంబసభ్యుల మధ్య

కొత్తకూడికలు మొదలెట్టాలి (కూడికలు+తీసివేతలు- వాక్యాంతం)

ఈ కవితలో కవి-మానవ సంబంధాల విచ్చిన్నానికి మనిషికో గది ఉండే ఆధునిక ఇంటి ప్లాను కూడా కారణమే అనే చిత్రమైన పరిశీలన చేస్తాడు. లివింగు రూముని ఇరుగుపొరుగు వచ్చిపొయేలా ఇంటిముందు అరుగులా పరిచేయాలి అనటం అంటే కూలిపోతున్న మానవ సంబంధాలను నిలబెట్టుకొమ్మని చెప్పటం. ముక్కలు ముక్కలుగా ఉన్న ఇంటిని ఎక్కడికక్కడ విడగొట్టినప్పుడే, కుటుంబసభ్యుల మధ్య బంధాలు మెరుగవుతాయి అంటాడు. ఇది ఏకకాలంలో సమాజానికి చేస్తున్న హెచ్చరికా, ఉపదేశం.

పెళ్ళంటే

అతను ఆమెగా మారటం

ఆమె అతను కావటం//

ఒకరినుండి ఒకరు నిరంతరం ప్రవహించడం

జీవితానికి కొత్తపిలకలు వేయడం

చెరో అమ్మనాన్నను అదనంగా పొందటం

రెండు చెవులై వినడం, రెండు కళ్లై చూడటం

రెండు పాదాల్లా నడవటం, ఒక్క గుండెగా మిగలటం// (పెళ్ళి @ - వాక్యాంతం)

మానవసంబంధాలను ఉజ్వలీకరించే  కవితా వాక్యాలవి. ఆదర్శ వైవాహిక జీవిత ఔన్నత్యానికి శిలాక్షరాలు.  ఒకరికొరకు ఒకరు అని అన్న భావనకు అద్భుతమైన వ్యక్తీకరణ. ఒక కొత్త తరాన్ని సృష్టించటం, చెరో అమ్మనాన్నను అదనంగా పొందటం అనే వాక్యాలలో- ఒక సాంస్కృతిక పరంపర దాగి ఉంది, మూడు తరాలను పెనవేసే అందమైన అల్లిక ఉంది. ఈ కవి దార్శనికుడు కనుకనే ఒకే వస్తువులోని మంచి చెడుల గమనింపు లోతుగా చేయగలిగాడు.

అదేం చిత్రమో

ఈ ప్రకృతికి ఎందుకింత నిర్దయో

రవ్వంత దుఃఖాన్ని స్వీకరించదు//

దుఃఖాన్ని ఇంకెక్కడా పారబోయలేం

ఇంకో మనిషిలో తప్ప

అందుకైనా ఒక తోడుండాలి (కన్నీటికి తోడూ జోడూ - వాక్యాంతం)

గొప్ప తాత్వికత నిండిన వాక్యాలివి.  మనిషికి మనిషి అవసరాన్ని విశదపరచే వాక్యాలు.  మన ఉద్వేగాలను దుఃఖమైనా, సంతోషమైనా మరొక మనిషితో పంచుకోగలమే తప్ప ఈ భౌతిక ప్రపంచంతో కాదు అనే భావన ఉదాత్తమైనది. మన దుఃఖాన్ని పంచుకోవటానికైనా మనకొక తోడుండాలి, మానవసంబంధాలను నిలుపుకో అని హెచ్చరిస్తున్నాడు కవి.

అమాయకంగా అనుకున్నా

కొడుకు మొక్కలా ఉన్నప్పుడు

ఎక్కడయితేనేం

ఎలా నయితేనేం

చెట్టంత ఎదగాలని

ఆ నీడలో సేదదీరాలని.

 

రోజూ చెట్లమధ్యలో

బతికే నాకు

ఎందుకు గుర్తులేదో

చెట్టు కదలదని

నీడకోసం దానిచెంతకే చేరాలని (ఆవలితీరం-సమాంతర ఛాయలు)

గొప్ప ఆర్తి ధ్వనించే వాక్యాలివి. ప్రపంచీకరణ ప్రభావంచే ఉపాథి కొరకు వలసలు అనివార్యమైనాయి. ఆ కారణంగా కుటుంబ సభ్యులు చెట్టుకొకరుగా విడిపోక తప్పనిసరైంది.  నా కొడుకు చెట్టంత ఎదగాలి అని కోరుకోవటం సహజమే.  కానీ ఆ చెట్టు మనవద్దే ఉండి మనకు నీడనివ్వాలని కోరుకోవటం ఆధునికకాలంలో అమాయకత్వమే.  సమకాలీన మానవసంబంధాలకు అద్దం పట్టే కవిత ఇది.

కవిగారు గుమ్మం పక్కనే సోఫాలో పేపరు చదువుకొంటున్నపుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు.  ఆ వచ్చిన వ్యక్తి ఎవరో పోల్చుకోవటానికి ప్రయత్నించి విఫలమై అర్ధాంగిని పిలుస్తాడు కవి “ఏమోయ్ ఎవరో వచ్చారు చూడు అంటూ” ఆమె “ఎవరో తెలుసుకోలేకపోయారా” అంటూ వస్తుందామె.   ఇంతవరకూ అందరి ఇళ్ళలో జరిగేదే.  ఈ ఘటనతో ఘర్షణపడి కూలిపోయిన సంసారాలు ఉండొచ్చు. కానీ దాని నుండి ఒక జీవితసత్యాన్ని వెలికి తీయటం కవి ప్రతిభ. ఆ సత్యమేదో మానవసంబంధాలను పటిష్టపరిచేదిగా ఉండటం మరింత ప్రశంసనీయం. ఆ కవిత ఇలా ముగుస్తుంది. 

క్షమించడంలో కూడ

ఆనందం వెతుకుతూ ఆమె

క్షమించబడటంలో

సంతోషంలో నేను

 

సంసారం సజావుగా

సాగిపోతూనే ఉంది (థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్-సమాంతర ఛాయలు) .

క్షమ మనుషుల్ని కలిపి ఉంచుతుందనటంలో సందేహం లేదు.  ఆ క్షమ  స్త్రీ ద్వారానే పలికించటం అనాదిగా జరుగుతున్నదే కావొచ్చు. అది పితృస్వామ్య భావన అంటూ ఎన్ని సార్లు చెప్పుకొన్నా అది సంసారం సజావుగా సాగిపోవటానికి దోహదపడే అంశం కాకపోవచ్చు అన్నివేళలా.  క్షమించబడటానికి సంతోషించి, విశ్వాసంగా ఉన్నప్పుడే ఆ ఇరువురి మధ్య ప్రేమ పరిపూర్ణమవుతుంది.

***

కరోనా వైరస్ ప్రపంచంలోని మనుషుల మధ్య అనుబంధాలను విచ్ఛిన్నం చేసిందని బాహ్యంగా కనిపిస్తున్నా, ఈ కవి తన అంతర్దృష్టితో చూసి ఇలా అంటున్నాడు.

రొసెట్టా రాయినుండి

మాసిపోయిన భాషనే బతికించుకున్నోళ్ళం

మహా అయితే… ఏమవుతుంది

మాలోమాకు యుద్ధాల పేరుతో

గతంలో

పోయినంత మంది మళ్ళీ పోతాం

అప్పుడు ద్వేషంతో కొట్టుకున్నోళ్ళం

ఇప్పుడు ఐకమత్యంతో పోరాడుతున్నాం

కరోనా… కారణజన్మమే నీది  (వైరాయణం)

క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందిన రోసెట్టా రాయిపై ఉన్న లిపిని ఛేదించిన తరువాత మాత్రమే ఆర్కియాలజిస్టులకు ఈజిప్టు పిరమిడ్ల గోడలపై ఉన్న Hieroglyphs లిపిని డీకోడ్ చేయటం సాధ్యమైంది. అలా ఒక ప్రాచీనఈజిప్షియన్ ప్రపంచాన్ని తిరిగి బతికించుకోగలిగాం.  ఓ కరోనా నీవల్ల ఏం జరుగుతుంది అని ప్రశ్నించటం, ఏం జరిగినా నువ్వు మాలో ఐకమత్యాన్ని పెంచుతున్నావు అంటూ గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించటం మానవజాతి పరిణామక్రమాన్ని అర్ధం చేసుకొన్న క్రాంతదర్శి మాత్రమే రాయగలిగే వాక్యాలు.

 

7. ప్రపంచీకరణ

మన జీవన విధానం, అలవాట్లు, సంప్రదాయాలు, పండుగలు, భాష, సాహిత్యం, కళలు అన్నీ కలిస్తే మన సంస్కృతి. ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఇవన్నీ  మార్కెట్ సరుకులుగా మారిపోతున్నాయి. మనిషితనం పోయి వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది.  గుంపులో ఏకాకితనం, అమానవీకరణ,, నగరంలో ఉంటూనే నగరం పట్ల విముఖత లాంటివి   ప్రపంచీకరణ దుష్పరిణామాలు.   దీన్ని కవులు గుర్తించి వాటినికవిత్వంలోకి తీసుకొస్తున్నారు.  

మహానగరం అంటే

మంచితనం కోసం

వెతుకులాడటమేనట

 

మహానగరమంటే

బతుకుల్ని

బహుచౌకగా అమ్ముకొనే

పెద్ద తిరనాళ్ళట//

అయినా సరే

ఉసిళ్ళలా ఊళ్ళన్నీ

ఇక్కడే వాలిపోతున్నాయి

ఏమీ సాధీంచకుండానే

రాలిపోతున్నాయి (సమాంతర ఛాయలు)

పై కవితా వాక్యాలలో కవి  నగరజీవితాన్ని నగ్నంగా మనముందు నిలుపుతాడు, నగర జీవనపు ఒరిపిడిని, వలస దుఃఖాన్ని, దాని అనివార్యతని అలతి అలతి మాటలలో  పట్టుకొన్నాడు.

//వస్తువుల్లో ఇరుక్కుపోయిన నా జీవితాన్ని

పట్టుకొందామని పరిగెత్తుతున్నా

పక్కనే ఉన్నట్లనిపించినా

చటుక్కున మాయమై

అందీ అందనంత దూరం జరిగి

దొరక్కుండా దోబూచులాడుతుంది

వస్తువుల్ని ప్రేమిస్తూ

మనుషుల్ని వాడుకొంటున్న

సమాజంలో సగటు మనిషిగా వున్నానేమో (గాజుపూల కంపు- సమాంతర ఛాయలు)

వస్తువుల్ని వాడుకోవాలి మనుషుల్ని ప్రేమించాలి అనేది ఒక ఆదర్శవంతమైన జీవనశైలి.  ప్రపంచీకరణ దీన్ని తారుమారు చేసింది. మనిషికి కాక వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది.  మనిషిని వస్తువులకు బానిస చేసింది. మార్కెట్ నిర్ధేశించిన వస్తువులని కొంటున్నాం, వింటున్నాం, తింటున్నాం.  వస్తువుల క్రింద మనిషి కూరుకుపోయాడు.  ఇద్ సమకాలీన జీవన వైచిత్రి.

 

8. దురాచారాల పట్ల నిరసన

కవిత్వం ప్రజలలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలను ప్రశ్నించాలి, దురాచారాలను ఖండించాలి.  ఇప్పటికీ అనేక చోట్ల నేలలో ఏదైనా విగ్రహం దొరికితే దానికి గుడి కట్టించి జాతరలు చేయటం ఒక తంతులా మారింది ప్రతీచోటా.  నిజానికి అక్కడ దొరికింది ఒకనాటి గుడికి చెందిన సాలభంజికో, యక్షిణో విగ్రహం కావొచ్చు.  వాటికి పూజలు, జాతరలు చేయడంలో భక్తి కన్నా వ్యాపారం ఉంటుందనటంలో సందేహం లేదు.  ఇలాంటి విషయాలను  స్పృశించటం అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పలికించటం.  

నేలలో దొరికితే చాలు

సాలభంజిక కూడా’

అమ్మవారిగా పూజలందుకొంటుంది

తిరునాళ్ళు జరుగుతాయి

పూలదండలు

విలపిస్తాయి కానీ ఎవరికీ వినబడవు  (స్థలభంజిక-వాక్యాంతం)

 

9. మెటపొయెట్రి

కవిత్వంపై రాసే కవితలను మెటపొయెమ్స్ అంటారు.  ప్రతికవి తన కవిత్వతత్వాన్ని కవితాత్మకంగా చెప్పుకోవటం కద్దు.

మిత్రమా ప్రియురాలి పెదాలపై అంటిన

వెన్నెల ఎంగిలిలో కలిసిపోతే పో

కానీ

అవసరం అయినప్పుడన్నా

అక్షరాన్ని ఆయుధంగా మార్చు(అక్షరాయుధం -వాక్యాంతం)

ప్రేమగీతాలు, చెట్టు పిట్టా కవిత్వాలు మాత్రమే వెలువరిస్తూ, సామాజిక స్పృహకొరవడిన కవులపై సంధించిన వ్యంగ్యాస్త్రం పై కవిత.

కవి గాడు అనే కవితలో “వాడు మాటల్ని మంత్రిస్తాడు/జనం నాలుకలపై ప్రశ్నల్ని అతికిస్తాడు అంటూ కవికి ఉన్న సామాజిక బాధ్యతను గుర్తుచేస్తాడు.

నా ఏడుపేదో

నేనే ఏడుస్తుంటే

మెల్లగా నా పక్కన చేరి

నా ఏడుపుకు రాగం కట్టి

నువ్వు మాత్రమే ఆస్కార్

కొట్టేస్తావనుకోలేదు (అశ్రు సంగీతం-వాక్యాంతం)

 

చాలా సూటిగా, పదునుగా కవిత్వంలోని ఒక ధోరణిపై చేసిన విమర్శ ఇది.  ఇన్ని దశాబ్దాలుగా పేదల కష్టాలపై కవిత్వం రాసి రాసి ఆ రాసినోళ్ళు అవార్డులు పొందారు తప్ప ఆ కష్టాలు అనుభవించినవారికి ఆ కవిత్వాల వల్ల ఏం మేలు జరిగింది అన్న ప్రశ్న విలువైనది.    

 

10. పర్యాటక కవిత్వం

పర్యటనకోసమో, చుట్టపుచూపుగానో కొత్తప్రాంతాలను దర్శించినపుడు అక్కడి పర్యాటక స్థలాల అందాలను, వింతలు విశేషాలను చాలా మంది కవులు తమ కవిత్వంలో బంధించారు.  శ్రీనివాసరావు కూడా తన అమెరికా పర్యటనలో చూసిన అక్కడి విశేషాలతో కొన్ని కవితలు రాసారు. 

అతిశయించిన ప్రకృతిపై

జలఖడ్గం సాగించిన

వేల ఏండ్ల అందమైన పోరాటం//

ప్రతిరోజు

వేలాది జనం సాక్షిగా

ఉభయ సంధ్యల అందాన్ని

ఓడిస్తున్న గ్రాండ్ కేనియన్ (గ్రాండ్ కేనియన్ - వాక్యాంతం)

గ్రాండ్ కేనియన్ అనేది అమెరికాలోని కొలరాడొ నది వెంబడి నీటిప్రవాహపు కోతకు  సహజసిద్ధంగా ఏర్పడిన కొండచరియలసమూహము.   ఇది సహజసిద్దమైన ఒక ప్రకృతి వింతగా గుర్తింపబడి, గొప్ప పర్యాటక క్షేత్రంగా పేరుతెచ్చుకొంది.  నదీ కోతను జలఖడ్గం చేసిన పోరాటంగా చెప్పటం చక్కని పోలిక.

***

వాళ్ళక్కడ వెలుగుల వడియాలు పెట్టుకొన్నారు

వందలకొద్దీ సూర్యుళ్ళనీ

వేలాది చంద్రుళ్ళనీ

ఒకే గ్రైండర్లో నూరి

వెలుగు వలయాల వడియాలు

పెట్టుకొన్నారు//

చీకటికి బట్టలిప్పి

చిందులేయిస్తారిక్కడ (లావేగాస్- 6th ఎలిమెంట్)

లాస్ వేగాస్ గురించి వ్రాసిన కవితా వాక్యాలవి. లాస్ వేగాస్ జూదానికి, రాత్రి జీవితానికి ప్రసిద్ధి.  రాత్రి జీవితం అనగానే తప్పని సరిగా మిరిమిట్లు గొలిపే లైటింగ్ ఉంటుంది.  ఆ లైటింగ్  సూర్యచంద్రులని నూరి వడియాలుగా పెట్టినట్లుంది అనటం నవ్యమైన ఊహ.   

     

11. రాజకీయ అభిప్రాయాలు

నేడు మతతత్వ పార్టీలు ప్రజలను పోలరైజేషను గురిచేసి రాజకీయ అధికారం పొందటం కోసం   ముస్లిములను టార్గెట్ చేయటం జరుగుతున్నది.  ఈ క్రమంలో భాగంగా తాజ్ మహల్ ఒకనాటి శివాలయమని ఆధారరహిత వాదనను కొందర ముందుకు తెచ్చారు. ఈ అంశంపై శ్రీనివాసరావు నిర్ధ్వంధ్వంగా తన అభిప్రాయాన్ని ఇలా చెబుతారు.

వేదికనెక్కిన వీధి కుక్కలు వాగినంతనే

తాజ్ మహల్ పునాది వాసన మారుతుందా?

ఇప్పుడూ మనదే కదా!

అయినా

అప్పుడెప్పుడో మనదనుకోవడం

నిజంగానే దౌర్భాగ్యం

కోట్లమంది దేవుళ్ళున్న దేశంలొ

ఇంకో ఇద్దరిని కలుపుకుంటే పోయేదేముంది? (వాక్యాంతం)

            కోట్ల మంది దేవుళ్ళున్న దేశంలో ఇంకోఇద్దరిని కలుపుకొంటే తప్పేమిటి? అనే ప్రశ్నలోని సహిష్టుత ప్రతి నిజమైన హిందువుకూ అర్ధమౌతుంది. అది భారతజాతి గమ్యం అవ్వాలి.   

తెలంగాణా ఉద్యమం నడిచే సమయంలో ప్రత్యేక తెలంగాణా అంశం గొప్ప భావోద్వేగాలను రేకెత్తించిన అంశం.   అంశంపై చేసిన ఈ వ్యాఖ్య చాలా విలువైనది

విడివడటం నేరమేమీ కాదు

వేర్పాటే విముక్తీకాదు

మునిగిపోయిందేమీ లేదు

మళ్ళీమొదలుపెడదాం పరుగు//

అక్కడైనా, ఇక్కడైనా పేదజనం ఒక్కటే

ఎప్పటికయినా

ప్రపంచ పేదలంతా ఏకం కావాల్సిందే (వాక్యాంతం)

పేదప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే, వాళ్ళు ఏనాటికైనా ఏకంకావాల్సిందే అనే ఆకాంక్ష నరనరానా కమ్యూనిష్టు భావజాలంనింపుకొన్న వారు మాత్రమే చేయగలిగే వ్యాఖ్య.

మహాత్మా

నీవు నడిచి వెళ్ళిన బాటను

అక్షరాలతో పుస్తకాలనిండా ముద్రించుకున్నాం

భద్రంగా బీరువాల్లో దాచుకున్నాం//

మహాత్మా

నీవు విడిచివెళ్ళిన ఆశయాలను

అందంగా మూటగట్టి

మా పిల్లలెవరికీ అందకుండా

ఆకాశపు ఉట్టిలో దాచిపెట్టాం//

మహాత్మా

ఉత్తమాటలుగానే మిగిలిపోయాం 

మన్నిస్తావా? (మార్గదర్శి - వాక్యాంతం)

గాంధీ ఆలోచనలవైపు నేడు ప్రపంచదేశాలు చూస్తున్నాయి. మనవద్దమాత్రం గాడ్సే క్రమక్రమంగా పూజనీయుడౌతున్నాడు.  ఈ సున్నితాంశాన్ని కవి గుర్తించాడు. మహాత్మా నన్ను మన్నించు అని కోరుతున్నాడు.

 

12.  సమకాలీనత

సమాజంలో సమకాలీన సంక్షోభాలు, వైరుధ్యాలను కవిత్వంలోకి తీసుకురావటం వల్ల ఆ కవిత్వానికి గొప్ప లోతు విస్తృతి వచ్చి చేరతాయి. సమకాలీనత పాఠకునిలో ఆసక్తి రేపుతుంది. శ్రీనివాసరావు కవిత్వంలో సమాజంలో సమకాలీన  ఆధునిక అంశాలు వివిధ కవితలలో కనిపిస్తాయి.  సోషల్ మిడియాలో అజ్ఞాతంగా ఉంటూ నకిలీ ప్రొఫైళ్ళతో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసే వ్యక్తులు ఉంటారు.  కొన్ని సందర్భాలలో వీరు చేసే ట్రోల్స్ మర్యాదస్తుల పాలిట తలనొప్పిగా పరిణమిస్తాయి.  ఇది అవాంఛనీయం. Fake ID అనే కవిత ఈ అంశాన్ని స్పృశిస్తుంది.

            వెలుగులో ఓడిపోయేవాడు

ముఖపుస్తకంలో తలదాచుకొని

ముఖానికి వేరే బొమ్మేసుకుని

నకిలీ ప్రొఫైళ్ళ నెమలీకలతో దర్శనమిస్తుంటాడు//

అసలు మనిషెవరో ఎప్పటికీ తెలియదు  (Fake ID - వాక్యాంతం)

కరోనా ప్రపంచ విలయాన్ని సృష్టించింది.  తన ప్రయాణం ఎటువైపు మార్కెట్ వైపా మనిషితనం వైపా అని ఒక్కసారి ఆగి ఆలోచించుకోవాల్సిన స్థితి కల్పించింది మనిషికి. ఆ సంక్లిష్టతను అలతి అలతి మాటలలో ఇలా అక్షరీకరించారు శ్రీనివాసరావు

మనుషులు చస్తే

మళ్ళీ పుడతారు

మార్కెట్ చస్తే మనమెట్లా అంటాడొకడు!

బతికుంటే చాలు

బలుసాకు తినైనా బతకొచ్చంటాడు మరొకడు

ఒకే యుద్ధంలో

రెండు గీతోపదేశాలు వినిపించి

తర్క తాంబూలమిచ్చి తన్నుకు చావమంటున్నావు కదా!

కరోనా… కారణ జన్మమే నీది! (వైరాయణం)

వైరాయణం సంఘటనాత్మక కవిత్వసంపుటిగా భావించవచ్చు. పై కవితలోని బలం అంతా “ఒకే యుద్ధంలో రెండు గీతోపదేశాలు” అన్నవాక్యం వద్ద ఉంది. ఇంతవరకూ జరిగిన మానవపరిణామం అంతా కరోనా కారణంగా కొత్తగా కనిపించటం పట్ల చేసిన లోతైన వ్యాఖ్య అది. కరోనా నేపథ్యంలో  మనిషిపై మార్కెట్ చేస్తూ వచ్చిన దాడి ఒకవైపు, మానవ జీవనేచ్ఛ మరోవైపు చేరగా జరిగిన సంఘర్షణను ఇముడ్చుకొన్న అనల్పార్ధ తాత్విక వచనమిది.

శ్రీనివాసరావు కవిత్వం సమకాలీనంగా ఉండే సామాజిక అంశాలను ప్రతిభావంతంగా ఇముడ్చుకొందని వీరి అనేక కవితలు సాక్ష్యమిస్తాయి.

***

మువ్వా శ్రీనివాసరావు వస్తు స్పృహ వైవిధ్యభరితమైనది. ఇతని  ప్రారంభకవితలలో కనిపించే వైయక్తిక వస్తువు క్రమేపీ సార్వజనీన వస్తువుగా పరిణామం చెందటాన్ని గమనించవచ్చు. పల్లెటూరి అనుభవమైనా, మానవసంబంధాల పరిమళమైనా, నగర చిధ్రజీవనశకలమైనా, పదునైన రాజకీయ అభిప్రాయమైనా ఇతని చేతిలో కళాత్మకతను సంతరించుకొంటుంది. ఏ వస్తువును తీసుకొని రాసిన కవితలోనైనా  అంతఃస్సూత్రంగా మానవతావాదం పలుకుతుంది. అదే శ్రీనివాసరావు కవిత్వ స్వరం.

 

బొల్లోజు బాబా

5/03/2022