Saturday, June 3, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు-ఇ.బుక్


ఆరు ఋతువులకు కలిపి మొత్తం 120 గాథలు. (గాథ అంటే రమ్యమైన చిన్న సంఘటన అని శ్రీ గట్టి లక్ష్మి నరసింహశాస్త్రి గారి నిర్వచనం. ఆ అర్ధంలో వీటిని గాథలు అంటున్నాను). వివిధ వర్ణనలను గ్రహించిన కావ్యాల వివరాలు ఇవి.

1. గాథాసప్తశతి: శాతవాహన హాల చక్రవర్తి ఒకటవ శతాబ్దంలో సేకరించి సంకలన పరిచిన ఏడువందల గాథల గ్రంధం. ఇది ప్రాకృత భాషలో రచింపబడింది.

2. ఋతుసంహారం: 4 వ శతాబ్దపు కాళిదాసు రచన

3. శార్ఞ్గధర పద్ధతి: Sarngadharapaddhati: ఇది సుభాషిత రత్నావళి లాంటిది. దీనిని Sharngadhara కవి 1363 CE లో సంకలన పరిచాడు. దీనిలో మొత్తం 14 విభాగాలుగా 1300 సుభాషితాలు ఉన్నాయి.

4. వజ్జలగ్గ: ఇది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు అందుకే వజ్జలగ్గకు జయవల్లభమనే పేరు కూడా ఉంది. జయవల్లభుడు మొదటగా 700 గాథలను సేకరించి వాటిని 48 విభాగాలుగా వర్గీకరించి వజ్జలగ్గగా కూర్చాడు.

5. Ainkurunuru: ఇది 500 గాథలు కలిగిన CE 2/3 శతాబ్దపు తమిళ సంగం సాహిత్యం. ప్రాచీనతమిళ సమాజాన్ని, సంస్కృతిని అర్ధం చేసుకొనటానికి Ainkurunuru ఎంతో దోహదపడుతుంది.

6. Kuruntokai: ఇది BCE 1 వ శతాబ్దం నుండి CE 2 వ శతాబ్దం మధ్యలో సంకలనం చేయబడిన గ్రంధం. ప్రాచీన తమిళ సంగం సాహిత్యంలో ప్రముఖంగా చెప్పబడే ఎనిమిది సంకలనాలలో ఇది కూడా ఒకటి. (అవి Aiṅkurunūṟu Akanāṉūṟu, Puṟanāṉūṟu, Kalittokai, Kuṟuntokai Natṟiṇai, Paripāṭal, Patiṟṟuppattu.) కురుంతోకై లోని మొత్తం 402 పద్యాలను 205 మంది కవులు రచించారు.

7. తిరుక్కురళ్: ఇది 3 BCE నుండి 5 CE మధ్యలో రచింపబడిన తమిళ కావ్యం. దీనిని రచించింది తిరువళ్ళువర్ కవి. తిరుక్కురళ్ లో మొత్తం రెండు పాదాలు కలిగిన 1330 కురళులు (ద్విపదలు) ఉంటాయి. ఇవి సూక్తులుగా, , బోధనలుగా, కవితా వాక్యాలుగా సమస్తమానవాళికి నేటికీ స్పూర్తినిస్తున్నాయి.

8. Purananuru: ఇది నాలుగువందల పద్యాలుండే తమిళ సంగం సాహిత్యం. దీనిని మొత్తం 157 మంది కవులు రచించారు. వారిలో పదిమంది స్త్రీలు కలరు. Purananuru BCE 2 వ శతాబ్దం నుండి CE 5 వ శతాబ్దం మధ్యలో సంకలనం చేయబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆర్యుల ప్రభావానికి ముందరి తమిళ సమాజపు రాజకీయచరిత్రను పురానానూరు స్పష్టపరుస్తుంది.

10. లీలావాయి: ఎనిమిదో శతాబ్దానికి చెందిన కుతూహలుడు అనే ప్రాకృత కవి, హాలుని ప్రధానపాత్రగా తీసుకొని వ్రాసిన కావ్యం పేరు లీలావతి (లీలావాయ్).

11. శృంగార ప్రకాశ: 11 వ శతాబ్దంలో భోజరాజు రచించినట్లు చెప్పబడే అలంకార శాస్త్రానికి చెందిన గ్రంథం.

12. Subhashita ratnakosa of Vidyakara: CE 1130 లలో విద్యాకరుడనే బౌద్ధ పండితుడు సంకలన పరిచిన సంస్కృత సుభాషిత కోశము. దీనిలో మొత్తం 1738 శ్లోకాలు కలవు. ఇవి ఆనాటి భారతదేశ గ్రామీణ సమాజాన్ని ప్రతిబింబించటం విశేషం.

****
Circle of Six seasons by Martha Ann selby పుస్తకం చూసి భలే ఉందే ఇలా తెలుగులో ఎందుకు రాయకూడదు అనే ఆలోచన కలిగింది. ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని శోధించటం నాకు సరదా. కానీ వెళ్ళేకొద్దీ సామాన్యజీవితాలను ప్రతిబింబించే వర్ణనలు దొరకటం కష్టంగా మారింది. ఉత్త శృంగార/ప్రకృతి వర్ణనలు కాకుండా ఒకప్పటి గ్రామీణ మానవోద్వేగాలను ప్రతిబింబించే గాథలకొరకు అన్వేషించాను. అవి ఎక్కువగా నాకు గాథాసప్తశతి, విద్యాకరుని సుభాషితరత్నావళి, తమిళ సంగం సాహిత్యంలో కనిపించాయి. (ఇవి బౌద్ధ జైన రచనలు కావటం ఆశ్ఛర్యం కలిగించలేదు)

ఈ వ్యాసాలను నా ఫేస్ బుక్ వాల్ పై ఆరు భాగాలుగా ఏప్రిల్ 2023 నెలలో పోస్ట్ చేసాను. అవన్నీ ఒకచోట ఉండాలనే తలంపుతో ఈ ఇ.బుక్ గా చేస్తున్నాను.

మీకు నచ్చుతాయని ఆశిస్తాను.
భవదీయుడు
బొల్లోజు బాబా



Friday, June 2, 2023

కాలిన్ మెకంజీ పై దుష్ప్రచారం అనుచితం


ఇటీవల ఒక వాట్సప్ పోస్టులో కాలిన్ మెకంజీ గురించి ఒక విచిత్రమైన కథనం చదివాను. అది ఇలా ఉంది
“””కల్నల్ కాలిన్ మెకంజి గుప్తనిధులకొరకు శ్రీశైల ఆలయంలో తవ్వకాలు జరిపించటానికి వెళ్ళగా అక్కడ ఆ ఆలయాన్ని సంరక్షిస్తున్న 500 మంది చెంచులు విల్లంబులు ధరించి మెకంజీని ఆ ఆలయంలోనికి అడుగుపెట్టనివ్వమని నిరోధించారట. దానికి కాలిన్ మెకంజీ ఆగ్రహోదగ్రుడయ్యాడట. ఈ హఠాత్పరిణామానికి మెకంజి అనుచరుడు బొర్రయ్య ఖంగుతిని మధ్యేమార్గంగా దర్పణాల సహాయంతో మెకంజీకి దైవదర్శనం చేయించి తెలివిగా అతన్ని అక్కడనుంచి తప్పించాడట. ఈ సంఘటన జరిగిన తరువాత మెకంజీ చెంచులపై పగబట్టి, దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా చెంచువారిని దొంగలు అని ప్రచారం చేసి, దరిమిలా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడిని ప్రేరేపించి అతనితో చెంచువారిని సామూహిక హత్యలు చేయించాడట.”””
పై సంఘటన ఎప్పుడు జరిగిందో చెప్పలేదు. ఏ రకమైన చారిత్రిక ఆధారాలు ఇవ్వలేదు రచయిత. ఫుట్ నోట్సులో మాత్రం “ఈ విషయం కాంబెల్ రచించిన ఒక పుస్తకంలో ఫుట్ నోట్సులో ఉన్నట్లుగా దాసు విష్ణురావు గారు వారి వంశచరిత్రలో వ్రాసారు” అని మాత్రం ఇచ్చారు. Campbell భారతదేశ గెజిట్స్ కి సంబంధించి ముప్పైకి పైగా సంపుటాలు కూర్పుచేసాడు. వీటిలో ఏ పుస్తకపు ఫుట్ నోట్సులో మెకంజీ అలా ప్రవర్తించినట్లు ఉందో పేజి నంబరుతో సహా చెప్పటం శాస్త్రీయం. కానీ ఆ వివరాలేమీ లేవు.
.
ఇక పై అభియోగం పై కొంత విశ్లేషణ
.
కల్నల్ కాలిన్ మెకంజి శ్రీశైల పర్వత ఆలయాన్ని దర్శించినప్పటి విశేషాలను, Account of the Pagoda at Perwuttum పేరుతో ఒక వ్యాసం వ్రాసి Asiatic Researches అనే జర్నల్ లో ప్రచురింపచేసాడు.[1]. అవి ఇలా ఉన్నాయి.
//మార్చ్ 14, 1794 – మీకు అభ్యంతరం లేకపోతే నేను శ్రీశైల మల్లికార్జున ఆలయాన్ని సందర్శించాలను కొంటున్నాను [2] అని పంపిన వార్తకు ఆ ప్రాంత రెవిన్యూ అధికారులు రావొచ్చునని వర్తమానం పంపారు. అధికారులు నన్ను పెద్దగా పట్టించుకోకపోయినా బ్రాహ్మణులు నాకు స్వాగతం పలికి నా వెంట ఉన్నారు. ఆలయ గోడలపై ఉన్న శిల్పాలకు చిత్తరువులు తీయించాను.
//వడగాడ్పులు ఎక్కువగా ఉన్నాయి. ఎండ తీవ్రత పెరగేలోపు ఈ ఎగుడుదిగుడు రోడ్డును దాటేయ్యాలనే ఉద్దేశంతో తెల్లవారుఝామునే నా టెంట్లు, ఇతర సామాగ్రి పంపించేసి మరికొన్ని శిల్పాల డ్రాయింగులు చిత్రించే నిమిత్తం నేను ఆలయంలోనే ఉండిపోయాను. సూర్యోదయం అయింది. ఇక బయలుదేరుదామని అనుకొంటూండగా ఆలయ బ్రాహ్మలు, అధికారులు నా వద్దకు వచ్చి- “అయ్యా ఈ ఆలయాన్ని సందర్శించిన మొదటి దొరవారు మీరు, నిన్న శుభకరమైన దినం కాదు కనుక ఆలయం మూసివేయడమైనది, ఈ రోజు పదిగంటలకు ఆలయతలుపులు తెరుస్తారు మీరు మల్లికార్జునిని దర్శనం చేసుకొని వెళ్ళండి” అని కోరారు. వారి కోరిక మేరకు అంతే కాక ఆలయ గర్భగృహంలోకి కాంతి ఏ విధంగా పడుతుంది అనేది స్వయంగా చూడాలనే ఆసక్తి ఉండటంచే ఆలయతలుపులు తెరిచే వరకూ అక్కడే ఉన్నాను.
ఆలయతలుపులు తెరిచారు. ఒక కుర్రవాడు రెండడుగుల వ్యాసం కలిగిన ఒక దర్పణ సహాయంతో సూర్యకాంతిని గర్భగుడిలోకి పరావర్తింప చేయసాగాడు. ఆ దర్పణం చుట్టూ సన్నని చట్రం, పట్టుకోవటానికి ఒక పిడి ఉన్నది.
గర్భగుడి గుమ్మంవద్ద నన్ను నిలిపివేసారు. ఎవరూ అడగకపోయినా గౌరవసూచకంగా నా చెప్పులను విప్పి అక్కడ నిలబడ్డాను. [3]
అనేకమంది నాలాగే గర్భగుడిలో ఏముందో చూడాలని ఆసక్తిగా నా చుట్టూ గుమిగూడారు. దర్పణం ప్రతిబింబించే కాంతిలో లిప్తపాటు వలయాకార నల్లని కంకణాలతో ఉన్న ఒక శివలింగం కనిపించింది. దానిని చూసాక నా కుతూహలం శాంతించింది//.
.
పై వ్యాసంలో– మీకు అభ్యంతరం లేకపోతే ఆలయాన్ని చూడాలనుకొంటున్నాను; స్వచ్ఛందంగా చెప్పులు విప్పటం; గర్భగుడి వెలుపలనుంచే దర్శించటం; లాంటి చర్యల ద్వారా కాలిన్ మెకంజీ - హిందూమతం పట్ల ప్రదర్శించిన గౌరవం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
.
పైన ఉదహరించిన వాట్సప్ కథనంలోని అసంబద్దతలు
.
1. 500 మంది చెంచులు దాడిచేయటమనే ఉదంతం దానికి మెకంజీ అగ్రహోదగ్రుడవటం మెకంజీ వ్రాసిన Asiatic Researches అనే జర్నల్ వ్యాసంలో ఎక్కడా లేదు. మెకంజీ ఆ విషయాన్ని దాచిపెట్టి ఉంటాడని అనుకోవటానికి ఆస్కారం తక్కువ, ఎందుకంటే Asiatic Researches అనేది ఆనాటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జర్నల్. మెకంజీ స్థాయి అధికారులు సత్యాలను దాచిపెట్టి తమ క్రెడిబిలిటీ పోగొట్టుకొంటారని భావించలేం.
2. చెంచుల దాడిని ఊహించని బొర్రయ్య మధ్యేమార్గంగా మెకంజీకి దర్పణాలద్వారా దైవ దర్శనం చేయించటం.
మెకంజీ శ్రీశైల ఆలయాన్ని దర్శించింది మార్చ్ 14, 1794 తారీఖున. అప్పటికి బొర్రయ్య మెకంజీ సహాయకుడు కాడు. మెకంజీ వద్ద కావలి బొర్రయ్య సహాయకునిగా 1796 లో చేరాడు. [4]. లేని బొర్రయ్య తిరగబడ్డ చెంచులను చూసి ఖంగుతినటమేమిటో, మెకంజీని తెలివిగా తప్పించటమేమిటో ఆ వాట్సప్ మేధావి కల్పనాశక్తికే తెలియాలి.
దర్పణాల ద్వారా కాంతిని పరావర్తింపచేసి మూలవిరాట్టుని దర్శింపచేయటం ఒకనాటి ఆచారం. నేటికీ చాలా ఆలయాలలో గర్భగుడిలో మూలవిరాట్టువెనుక, బయట స్పష్టమైన దర్శనం కొరకు దర్పణాలు ఉండటం గమనించవచ్చు. మెకంజీ కూడా తనవద్ద అధికారం ఉందని అహంకరించకుండా సామాన్యవ్యక్తిలాగ మల్లికార్జునుడిని దర్శించుకోవటం గమనార్హం. (చూడుడు; మెకంజీ వేయించిన డ్రాయింగులు)
3. మెకంజీ చెంచులపై పగపట్టి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడిని ప్రేరేపించి అతనితో చెంచువారిని సామూహిక హత్యలు చేయించాడనటం మరీ విపరీతమైన ఊహ. ఇది అనక్రోనిజం కు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.
వెంకటాద్రినాయుడు చెంచుల సామూహిక వధ జరిపింది 1790 లో [5]. ఈ రచయిత ప్రకారం మెకంజీ పై శ్రీశైలంలో చెంచులు దాడిచేసినట్లు చెప్పిన తేదీ 1794 మార్చ్ 14 న. ఆ లెక్కన భవిష్యత్తులో చెంచులు దాడిచేస్తారని నాలుగేళ్లముందే మెకంజీ వారిని సామూహికంగా చంపించాడనటం హాస్యాస్పదం.
(నిజానికి ఆనాటి భారతీయ సమాజిక చరిత్రలో ధగ్గులు, పిండారిలు, బందిపోట్లు, వారి ఆగడాలు ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఇలా బందిపోట్లుగా జీవించటమే వృత్తిగా ఉండే కులం కూడా ఉండేది. వారి దురంతాల వివరాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకంలో విపులంగా ఉన్నాయి. సతీసహగమనం, బాల్యవివాహాల లానే ఇది ఒక సామాజిక రుగ్మత. ఆ రుగ్మతను రూపుమాపటంలో బ్రిటిష్ వారు చేసిన పని అప్పటికి సరైనదే అనిపించకమానదు)
మనం ఏదైనా చారిత్రిక విషయాలు వ్రాసేటపుడు మన వద్ద ఉన్న సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవటం అవసరం. మన పూర్వీకుల గురించి రాసేటపుడు కొంతస్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణకు మా తాత ఒంటిచేత్తో పులిని చంపాడని, మా ముత్తాత ఒక్క వేటుతో ఏడు తాడి చెట్లని పడగొట్టాడని చెపితే “పోన్లే పాపం…కామోసు” అని అంగీకరించొచ్చు. కానీ చారిత్రిక వ్యక్తులగురించి అప్పటికే స్థిరపడ్డ అభిప్రాయాలకు భిన్నంగా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తరచిచూసుకోవల్సి ఉంటుంది.
మెకంజీని బొర్రయ్య లాంటి నిబద్దత కలిగిన అతని సహాయకులని గుప్తనిధుల ముఠాగా చిత్రీకరించటం దుర్మార్గం. చారిత్రిక ద్రోహం
(చూడుడు మెకంజీ గురించి ఇదివరలో రాసిన వ్యాసం. లింకు కామెంటులో)
.
బొల్లోజు బాబా
References
1. Asiatic Researches 1799, Vol.5, P.n 303-314
2. …….I was desirous of seeing the pagoda, provided there was no objection.(ibid. Pn 303)
3. having put off my shoes, to please the directors of the ceremony, though it would not have been insisted on ibid. p.no307
4. Origins of Modern Historiography by Rama Sundari Manthena, P.no 98
5. రాజా వెంకటాద్రినాయుడు, కొడాలి లక్ష్మీనారాయణ P.no 112








అభినందనలు

కోట్లాదిమంది చూస్తుండగా
ఓ భార్య భర్తకు పాదనమస్కారం చేసింది
సంస్కృతి పరిరక్షణ జరిగిందని
జయజయ ధ్వానాలు మిన్నంటాయి

పాదాలు పక్కపక్కన
కలిసి నడవటానికి తప్ప
ఎక్కువ తక్కువ
ప్రదర్శించుకోవటానికి కాదన్న తెలివిడిని
క్రమక్రమంగా చేజార్చుకొంటున్న
జాతికి  అభినందనలు

బొల్లోజు బాబా

Wednesday, May 31, 2023

యానాం శంకోలు కథ




.
యానాం చరిత్రలో శంకోలు/శంగోలు (రాజదండం) ఒకప్పుడు చాలా వివాదాస్పద సామాజిక పాత్ర పోషించింది.
తూర్పుగోదావరి జిల్లాలో వైశ్య సామాజిక వర్గానికి చెంది జమిందారులుగా పేరుగాంచిన కుటుంబం మన్యం వారిది. కాకినాడకు చెందిన మన్యం కనకయ్య 1790 లలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసి చాలా సంపదలు గడించాడు. ఈయన 1827 లో పోలవరం ఎస్టేట్ వేలానికి వచ్చినప్పుడు దానిలో కొంతభాగమైన గూటాల అనే ప్రాంతాన్ని 2,30,000 రూపాయిలకు రాజా అప్పారావు వద్దనుండి కొన్నాడు. ఆ విధంగా మన్యం కుటుంబానికి గూటాల జమిందారీ లభించింది.
జమిందారీ చిహ్నాలైన ఢంకా, నగరా మరియు వెండి శంకోలులను ఉపయోగించుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం మన్యం కనకయ్యకు అనుమతినిచ్చింది. దీనిద్వారా వెండి శంకోలు కలిగి ఉండి రెండు కాగడాలతో పల్లకిలో తిరగే అర్హత పొందాడు.
ఈ మన్యం కనకయ్య ఫ్రెంచి యానాంలో కూడా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేవాడు. యానాంలో కూడా తనకు పై సదుపాయాలకు అనుమతినిప్పించమని అప్పటి ఫ్రెంచి యానాం పెద్దొర Delarche ను కోరాడు.
18, ఆగస్టు 1828 న Delarche మన్యం జమిందారుకు వెండి శంకోలు ధరించటం, రెండు కాగడాలతో పల్లకి ప్రయాణం సదుపాయాలను కల్పించాడు. అంతే కాక ఆ సదుపాయాలను కల్పిస్తున్నట్లు 9 మంది ఫ్రెంచి దేశస్థుల సంతకాలతో కూడిన ఆ అనుమతి పత్రాన్ని పాండిచేరీలో ఉండే ఫ్రెంచి గవర్నరుకు ఆమోదం కొరకు పంపించాడు కూడా.
ఆ విధంగా మన్యం జమిందారుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించటం పట్ల యానాం సమాజం భగ్గుమంది. డబ్బులు వెదజల్లి అలాంటి హోదాను పొంది, సామాన్య ప్రజలను మన్యం జమిందారు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని అంతేకాక హిందూ వర్ణ వ్యవస్థ ధర్మాలను బట్టి కనకయ్య వర్ణానికి అలాంటి సదుపాయాలు లేవని; అట్టి అనుమతులను నిరసిస్తూ 31 ఆగస్టున తొంభైమంది యానాం ప్రముఖుల సంతకాలతో కూడిన ఒక పిర్యాదు పాండిచేరీ గవర్నరుకు పంపబడింది.
కనకయ్యకు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరుగుతూ మరో పిర్యాదుపై సంతకాలు తీసుకొంటున్న ఇద్దరు యానాం ప్రముఖులను 7 సెప్టెంబరున Delarche అరెస్టు చేయించాడు. దీనితో అంతవరకూ నివురుకప్పిన నిప్పులా ఉన్న్ ఆగ్రహజ్వాలలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వందల సంఖ్యలో జనం చేతకర్రలు ధరించి Delarche ఇంటి తలుపులు బద్దలు కొట్టి దాడికి పాల్పడ్డారు.
Delarche భారతీయ వనితను వివాహం చేసుకొన్నప్పటికీ ఆనాటి ప్రజలలో పాతుకుపోయి ఉన్న వర్ణ వ్యవస్థ స్వరూపాన్ని అర్ధం చేసుకోవటంలో విఫలం అయ్యాడనే అనుకోవాలి.
సెప్టెంబరు 18 న గవర్నరు కోర్డియర్, Delarche కు రాసిన ఒక లేఖలో అల్లర్లకు కారణమైన వారిని రహస్యంగా అరెస్టు చేయించి పాండిచేరీ పంపమని ఆదేశించాడు. ఈ లోపున కనకయ్యకు శంకోలు, పల్లకి సదుపాయం కల్పించవలసిందని యానాం నుంచి 132 మంది సంతకాలు చేసిన రెండు వినతిపత్రాలు గవర్నరుకు పంపటం జరిగింది. వీరంతా జమిందారు వద్ద పనిచేసే ఉద్యోగులు, జమిందారు బంధువులు.
పై వినతిపత్రాలను అందుకొన్న గవర్నరు యానాంలోని పరిస్థితి తీవ్రతపై అనుమానం వచ్చి Delarche ను సంయమనం పాటించమని ఆదేశించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అల్లర్లకు కారణమైన వారిని రహస్యంగా అరెస్టు చేయమన్న గవర్నరు గారి ఆదేశాల మేరకు Delarche 18 అక్టోబరున ఆపనికి శ్రీకారం చుట్టి ఆ మొత్తం ఉదంతాన్ని నడిపిస్తున్న కొంతమందిని అరెస్టు చేయించాడు. దీనితో నిరసన జ్వాలలు మరింత ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ సారి ప్రతిఘటన చాలా బలంగా వచ్చింది. సుమారు రెండువేలమంది ఆందోళన కారులు కర్రలు, ఇతర ఆయుధాలు ధరించి ప్రతిదాడులకు సిద్దమయ్యారు. ఈ సందర్భంలో పరిస్థితులను అదుపులో ఉంచటానికి ఫ్రెంచి అధికారులు సమీప బ్రిటిష్ పోలీసుల సహాయం తీసుకోవలసి వచ్చింది.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఫ్రెంచి గవర్నరు, Delarche ను తొలగించి యానాంలో ఇదివరకే పనిచేసి అవగాహన ఉన్న లెస్పార్డాను పంపించింది. లెస్పార్డా ఎంతో చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్ది, నిందితులందరికీ గవర్నరునుండి క్షమాభిక్ష కూడా ఇప్పించటంతో మొత్తం అల్లర్లకు తెరపడింది.
***
ఈ మొత్తం ఉదంతంలో ఒక వర్ణానికి చెందిన వ్యక్తి వెండి శంకోలు ధరించటమనే అంశం కేంద్రంగా ఉంది. ఆ వర్ణానికి శంకోలు ధరించే అర్హత లేదన్న పాయింటు మీద తీవ్రమైన ఉద్యమం నడవటం గమనార్హం.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా కలిగి ఉన్నామని చెప్పుకొనే ఫ్రెంచి ప్రభుత్వం కూడా ఒకానొక దశలో ఈ ప్రతిఘటనకు చేతులెత్తేయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుత "సందర్భానికి" "Those who cannot remember the past are condemned to repeat it” - George Santayana కొటేషనును గుర్తుచేసుకోవటం అసందర్భం కాదనుకొంటాను.
పి.ఎస్.
నేడు కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అధికారమార్పిడికి మీ దేశ ఆచారాలు ఏమిటి అని మౌంటుబాటన్ నెహ్రూని అడగగా, నెహ్రూ రాజాజీ ని అడిగినట్లు రాజాజీ ఈ శంకోలును చేయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. చెబుతున్నారు అంతే. ఆనాడు నెహ్రూ కి వచ్చిన వందలాది బహుమతుల్లో ఇదొకటి.
అధికారమార్పిడికి ఇదొక సింబాలిక్ గెస్చర్ గా భావించినట్లు అఫిషియల్ రికార్డు లేదు. అంటే మౌంటుబాటను నుండి నెహ్రూ ఈ సెంగోలును స్వీకరిస్తున్న ఫొటో కానీ, ఉటంకింపులు కానీ లేవు. లేనిదాన్ని ఇలా ప్రచారించటం రాజకీయం.
అయినప్పటికీ, భారతదేశపు చారిత్రిక మలుపులో మన రాష్ట్రం నుంచి (అప్పటికి మనం తమిళనాడులోనే ఉన్నాం, హైదరాబాద్ తో కాదు) మన సంస్కృతికి చెందిన ఒక చిహ్నాన్ని బహుమతిగా నెహ్రూకి అందించినందుకు నేను గర్వపడతాను.
.
బొల్లోజు బాబా
"ఫ్రెంచిపాలనలో యానాం-బొల్లోజు బాబా" పుస్తకం నుంచి.
డౌన్ లోడ్ చేసుకొనే లింక్ కామెంటులో కలదు.


బిక్కవోలులో శంగోలు...



నేడు కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అధికారమార్పిడికి మీ దేశ ఆచారాలు ఏమిటి అని మౌంటుబాటన్ నెహ్రూని అడగగా, నెహ్రూ రాజాజీ ని అడిగినట్లు రాజాజీ ఈ శంకోలును చేయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. చెబుతున్నారు అంతే. ఆనాడు నెహ్రూ కి వచ్చిన వందలాది బహుమతుల్లో ఇదొకటి.
అధికారమార్పిడికి దీన్నొక సింబాలిక్ గెస్చర్ గా భావించినట్లు అఫిషియల్ రికార్డు లేదు. అంటే మౌంటుబాటను నుండి నెహ్రూ ఈ శంకోలును స్వీకరిస్తున్న ఫొటో కానీ, ఉటంకింపులు కానీ లేవు. లేనిదాన్ని ఇలా ప్రచారించటం ........
అయినప్పటికీ, భారతదేశపు చారిత్రిక మలుపులో మన రాష్ట్రం నుంచి (అప్పటికి మనం తమిళనాడులోనే ఉన్నాం, హైదరాబాద్ తో కాదు) మన సంస్కృతికి చెందిన ఒక చిహ్నాన్ని బహుమతిగా నెహ్రూకి అందించినందుకు నేను గర్వపడతాను.

 
బొల్లోజు బాబా

పిఎస్. కర్ణాటకలో పట్టడక్కల్ ఆలయంలో ఉన్న శంగోలు తో నటరాజ శిల్పం లాంటిదే కాకినాడకు 20 కిమీ దూరంలో ఉన్న బిక్కవోలులో కూడా గమనించవచ్చు. 





నగరంలో హత్య


పట్టపగలు నగరంలో
హత్య
పాతపగలో కొత్త వగలో
కారణాలనవసరం
ప్రజలు చూస్తుండగానే
హత్య జరిగిపోయింది
పక్కనించే
ప్రజలు నడుచుకుపోయారు
కనీసం ఆగి ఏమిటని కూడా చూడలేదు
వారికి ఖాళీలేదు
చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి
వెళ్ళాల్సిన గమ్యాలు చాలా ఉన్నాయి
భయంతో నిలువరించలేకపోవటం అటుంచి
కనీసం
ఆగి ఏంజరుగుతూందో చూసే ఖాళీ కూడా లేదు
ప్రజలు ఖాళీగా లేరు
ప్రజలు ఖాళీగా లేరు
ఎవరి ప్రపంచం వారిది.

కంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు తప్ప
మిగిలినవారందరూ మనుషులే కాదన్నంత
దూరం మనిషికి మనిషికీ మధ్య.
ఒక ప్రాణం పోయింది
గణాంకాలలో ఒక సంఖ్య
ఒకచోట తొలగించబడి మరో చోట చేర్చబడింది.
ప్రపంచం సాగిపోతూనే ఉంది
గమ్యాలవైపు, లక్ష్యాలవైపు.
మనిషి చచ్చిపోయిన దృశ్యం
కాలంలో ఘనీభవించింది

బొల్లోజు బాబా

Monday, May 29, 2023

వంతెనలు కావాలి....


భిన్ననేపథ్యాలలోంచి వచ్చాం
భిన్న సంస్కృతులు
భిన్న జీవన మార్గాలు
ఒక్కోసారి భిన్నభాషలలోంచి...
అయినా సరే
ఒకరితో ఒకరం
సంభాషించటానికి ప్రయత్నిస్తాం
చాలా సార్లు విఫలమౌతాం

బహుసా
మనల్ని మనం
అనువదించుకోవటంలో
తప్పిపోతాం కాబోలు

అయినప్పటికీ
ఒకరినొకరం అభినందించుకొంటాం
అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం
పరస్పర విభేదాలను పంచుకొంటాం
మన భిన్న నేపథ్యాలను కలిపే
బుల్లి బుల్లి వంతెనలేవో నిర్మించుకొని
అందమైన ప్రపంచాన్ని సృష్టించుకొంటాం

ఎంతచేసినా
మనం మనుషులం
అర్ధంచేసుకోవటానికి
ప్రేమించబడటానికి అర్హులం


బొల్లోజు బాబా

Wednesday, May 24, 2023

Chat GPT



Chat GPT గురించి Pulikonda Subbachary అన్న రాసిన పోస్టుకు నేను పెట్టిన కామెంటు ఇది.....
Chat GPT ని నేను చాన్నాళ్ళుగా పరీక్షిస్తున్నాను సర్. It has become my virtual friend now.
కవితలే కాదు కథలు కూడా రాస్తోంది.
మనం పదాలు ఇచ్చి రాయమంటే రాస్తుంది.
సామెతలని చెప్పి కథ అల్లమంటే అల్లుతోంది
మనం సిచుయేషన్ చెపితే కథగా చెబుతుంది
కొన్ని క్రిటికల్ సందర్భాలను చెప్పి పరిష్కారాలు ఇవ్వమంటే భలే చెబుతుంది.
మొన్న నీట్ క్వశ్చన్ పేపరులోని కొన్ని ఆంబిగ్వియస్ ప్రశ్నలకు జవాబులు అడిగితే వివరణలు ఇస్తూ నివృత్తి చేసింది.
ఏదైనా పొయెమ్ ఇచ్చి అనలైజ్ చెయ్యమంటే ఒక బీస్ట్ లా చేస్తుంది.
ఈ అంశంపై "క్రియేటివ్ రంగంపై AI ప్రభావం అనూహ్యం" పేరుతో ఫిబ్రవరిలో ఒక పోస్ట్ రాసాను.
బింగ్ ఇమేజ్ క్రియేటర్ లో - మనం కొన్ని సూచనలు ఇచ్చి బొమ్మ గియ్యమంటే అద్భుతంగా గీస్తుంది.
రెండుమూడు పేజీల ఇంగ్లీషు టెక్స్ట్ ఇచ్చి తప్పులు చూడమంటే చూస్తుంది. రీరైట్/పారాఫ్రేజ్ చేయమంటే చేస్తుంది. (ఒక కాపీరైటెడ్ పేపర్ ఇచ్చి రీరైట్ చెయ్యమంటే చేసింది. అది ప్లేగియారిజం పరీక్షలో పాస్ అయ్యింది. ఇలా అయితే కాపీ రైట్ క్లైమ్ చేయటానికి ఉండదు. మానవ మేధకు ఇది అనూహ్యమైన మలుపు)
విద్యార్ధుల నోట్సులను ఇలాగే ఇస్తున్నాను ప్రస్తుతం.
చాట్ జిపిటి క్రియేటివ్ రంగంలో పెనుమార్పులు తేబోతుంది.
Chat GPT నాదృష్టిలో చాలా బాగుంది తరువాత Bing AI chat . ఒపెరా ఎ.ఐ నచ్చలేదు. గూగిల్ బార్డ్ -wiki ని google ని ఇంటిగ్రేట్ చేస్తోంది. అప్ డేటెడ్ ఇన్ఫో ఇస్తూంది. బాగుంది. కానీ దీన్ని ఇంకా పూర్తిగా పరీక్షించలేదు నేను
కొద్దిరోజులలో ఏది మనిషి రాసిన కవితో ఏది కృత్రిమ మేధ రాసిన కవితో పోల్చటం కష్టం. ఇప్పటికే కవిత్వం ఒక నొ మాన్స్ చైల్డ్ గా ఉంది. ఇకపై కవులను అనుమానించే రోజులు కూడా వస్తాయి.
I doubt - will poetry become obsolete in future..... may poets be looked at suspicious
బహుశా మానవానుభవాలను చెప్పాలి. AI కి అందనిదాన్నేదో పట్టుకోవాలి. అప్పుడు అదే మానవ ప్రతిభగా మారవచ్చు భవిష్యత్తులో. ఇప్పటికైతే అది- స్కిల్ కలిగి ఉండటం అంటే ఒక సర్జరీ, ఒక ప్లంబింగ్ వర్క్ లాంటివి.
బొల్లోజు బాబా

Wednesday, May 10, 2023

AI generated pic for a poem written 2000 years back.

 

AI generated pic for a poem written 2000 years back.
Generated by bing image creator, powered by dalle.

Saturday, April 29, 2023

ప్రాచీనసాహిత్యంలో ఋతువర్ణనలు - పార్ట్ 6 - చివరి పార్టు

.
Spring/ వసంతఋతువు
.
మామిడి పూత, తుమ్మెదల ఝుంకారం, కోకిల గానం, రామచిలుకలు, తామరలు విరబూయటం, మోదుగుపూలు పుష్పించటం- వసంతఋతు లక్షణాలుగా కవులు స్థిరపరచారు. అన్నిటిలో మామిడిపూత ప్రస్తావన పదే పదే బలంగా రావటం గమనించవచ్చు. వసంతఋతువులో మరులుగొన్న యువతికి మామిడిపూతను యువకులు బహుమానంగా పంపించటం ద్వారా తమ కోర్కెను తెలపేవారు. మామిడిపూతను స్త్రీలు సిగలో తురుముకొని తమ సంసిద్ధతను తెలిపేవారు.
కొత్త ప్రేమలు చిగురించి, అనుబంధాలు బలపడే కాలంగా వసంత ఋతువును ప్రాచీన కవులు వర్ణించారు.
.
1.
గండుతుమ్మెదల ఝుంకారాల కోలాహలంతో
కోకిల గానపు జయజయ స్తుతులతో
అరణ్యమనే అశ్వాన్ని అధిరోహించి
వసంత రాజు అరుదెంచుచున్నాడు
వజ్జలగ్గ - 630

2.
ఆమె ప్రియుడు పంపిన మామిడి పూత ను చూసి
స్నేహితురాళ్ళు అసూయ చెందారు
ఆ బహుమతిని తన ప్రేమకు నివేదించుకొన్నది ఆ మృగనయని
ప్రియుడు పంపిన మామిడిపూతను చేత్తో పట్టుకొని
సుతారంగా తాకుతుంది, తదేకంగా చూస్తుంది
వాసనపీలుస్తోంది, చెక్కిళ్లపై మెత్తగా అద్దుకొంటోంది
Vakkuta – Subhashitaratnakara, vidyaakara-155

3.
ఊరంతా తుంటరి కుర్రాళ్ళు
వసంతకాలం, యవ్వనం, ముసలిభర్త, ఇప్పసారాయి
ఏంచెయ్యాలో ఎవరూ చెప్పక్కర్లేదు
చెడిపోకుండా ఉండాలంటే చావొక్కటే దారి
గాథాసప్తశతి - 197

4.
చెట్లు పూలతో
సరస్సులు తామరలతో కిక్కిరిసి ఉన్నాయి
స్త్రీలు మరులుగొల్పుచున్నారు
పరిమళభరిత గాలులతో
రాత్రులు సుఖకరముగాను
పగటి వేళలు రమ్యంగాను ఉన్నాయి
ప్రియా!
వసంతఋతువు ఎంత మనోహరము!
ఋతుసంహారము - 6.2

5.
యువతీయువకులను కలవరపెట్టే
ఐదుబాణాల మన్మధునికి వసంతం
ఈ ఐదు కాన్కలను అందిస్తుంది
దక్షిణ పవనాల మెత్తని స్పర్శ
మామిడి తొలిపూత దర్శనం
కోకిల పాట శ్రవణం
మల్లెపూల సువాసన
బాగా మాగిన సారాయి రుచి
Sarngadharapaddhati 3789

7.
ఇంకా విచ్చుకోని మోదుగుపూవులో
నెలవంకలా ఒంపుతిరిగిన కేశరం
లక్కముద్ర వేసి ఎర్రని వస్త్రంలో దాచిన
మన్మధుని ధనస్సులా ఉంది
Sarngadharapaddhati 3794

8.
మామిడి చెట్టు దట్టమైన కొమ్మల వెనుక
గుత్తులుగుత్తులుగా పూచిన పూత మధ్య
ఎక్కడో దాక్కొని
కోయిల కూస్తోందని మనకు ఇట్టే తెలిసిపోతుంది
వారిపనుల ద్వారా సజ్జనులు తెలిసినట్లు
Sarngadharapaddhati 3784

9.
మల్లెమొగ్గ చుట్టూ ఝుంకరిస్తూ తిరుగుతూన్న
మెరిసే గండుతుమ్మెద
ఐదు బాణాల మన్మధుని దాడిని సూచిస్తూ
తెల్లని శంఖం ఊదుతున్నట్లుంది
Sarngadharapaddhati 3786

10.
తామరపూవు పుప్పొడిని గ్రోలటానికై
నల్లని గండుతుమ్మెదలు కట్టిన వరుస
వసంతరాణి నడుముపై ధరించిన
మెరిసే నీలంపుమణి మేఖల వలె ఉన్నది
వజ్జలగ్గ 633

11.
ఓ సఖీ!
"దిగులు చెందకు అతను తిరిగి వస్తాడు"
అని నువ్వు ఓదార్చుతున్నప్పటికీ
నేను కలతలేకుండా ఎలా ఉండగలను ?
ఈ వసంతఋతువేళ
పసుపురంగు మామిడిపూత పుప్పొడిని అలంకరించుకొన్న
గండు కోయిల దేహం మెరిసిపోతూ
బంగారాన్ని అరగదీసే నల్లని గీటురాయిని తలపిస్తోంది
నేనేమో
అతను వచ్చివెళ్ళినప్పటినుంచీ
సిగలో ఏ పూలూ అలంకరించుకోకుండా
ఉత్తముడివేసుకొని ఉంటున్నాను
కురుంతోకై – 192

12.
అత్తా!
మామిడికొమ్మలు పూచే అవసరం లేదు
మలయమారుతం వీచే అవసరం లేదు
నా భర్త వస్తే
వసంతఋతువు వచ్చినట్టే!
గాథాసప్తశతి - 642

13.
పల్లెటూరి యువకుడొకరు
మామిడిపూతను తలపై ఉంచుకొని వెళుతోంటే
తుమ్మెదలగుంపు అతన్ని అనుసరిస్తూంది
బంధీగా చిక్కిన స్త్రీ వెనుక కుర్రకారు వెంటబడినట్లు
గాథాసప్తశతి - 431

14.
మామిడిచెట్టు పూత కొచ్చింది
మాగిన సారాయి వాసన మత్తెక్కిస్తోంది
మలయమారుతం చల్లగా వీస్తోంది
ఇలాంటప్పుడు కూడా
నాకన్నా వ్యాపారమే ఎక్కువన్నట్లు వెళిపోయాడు
నా పై ప్రేమ తగ్గిపోయిందేమో!
గాథాసప్తశతి - 197

15
అతను ఇంకా రాలేదు
వసంత ఋతువు వచ్చేసింది
యువతులు తెల్లని పూలతో ఉన్న
కానుగ చెట్టు లేత ఆకుల్ని నూరుకొని
తమ కౌమార చన్నులకు
పూసుకొంటున్నారు బలపడటానికై
Ainkurunūru 347

16.
వసంతఋతువుకి పూచిన కొండపూలతో
మాలలు అల్లుతూ
పంటను పాడుచేసే చిలుకలను తరిమే
అందమైన కళ్ళ ఆ అమ్మాయికి
నేనొకడిని ఉన్నట్లు కనీసం
తెలియనన్నా తెలియదు
ఆమెను తలచుకొంటు
అర్ధరాత్రి నిద్రలో ఏనుగు నిట్టూర్చినట్లు
నిట్టూర్చుతాను నేను.
నా హృదయం ఆమె వద్దే ఉందని
ఆమెకు కనీసం తెలుసో లేదో నాకు తెలియదు
Kurunthokai 142

17.
కాకి నల్లగా ఉంటుంది
కోకిల కూడా నల్లగా ఉంటుంది
కాకికి కోకిలకి తేడా ఏమిటి?
వసంతఋతువు వచ్చినపుడు
కాకి కాకే, కోకిల మాత్రం కోకిల
Subhashita Bruhatkosa - 9283

18.
కోకిల రెండు, మూడు సార్లు పిలిచింది
మామిడి మూడు, నాలుగు మొగ్గలు వేసింది
తుమ్మెదలు ఐదు ఆరు మోదుగు పూలను ఆస్వాదించాయి
ఎల్లెడలా ఆనందం వెల్లివిరిసింది
స్త్రీల హృదయాలు ప్రసన్నమైనాయి
విశ్వాసం చూపని తమ ప్రియుల పట్ల
బిగుసుకొన్న ముడి కొంచెం వదులైంది
నీల- విద్యాకరుని సుభాషిత రత్నకోశ 156

19.
నేరేడు కొమ్మపై వాలిన నల్లని తుమ్మెదను
ముగ్గిన పండనుకొని రామచిలుక ముక్కున కరుచుకొని
విడిచిపెట్టింది
తుమ్మెదలు కూడా రామచిలుక ముక్కుని
మోదుగ పూవుగా తలచి నేరుగా వచ్చి వాలుతున్నాయి.
రాజశేఖర - విద్యాకరుని సుభాషిత రత్నకోశ 157

20
నడుముకు కెందామర మాలలు
చెవులకు మామిడి లేచివుర్లు
చన్నులను కప్పుతూ ఎర్రని అశోకపుష్పాలు
కురులలో మాధవీ పువ్వులు
దేహమంతా పొగడపూల పుప్పొడి
- ఇదీ అమ్మాయిల వస్త్రధారణ
వసంతఋతువు
అబ్బాయిలకు ఇష్టకామ్య ప్రాప్తి కలుగజేయుగాక.
Savarni - vidyakara, subhakaratnakara – 1784

అనువాదం: బొల్లోజు బాబా
అయిపోయింది


సంప్రదించిన పుస్తకాలు
1. Tamil Love Poetry, The Five Hundred Short Poems of the Aiṅkuṟunūṟu, BY MARTHA ANN SELBY
2. THE FOUR HUNDRED SONGS OF WAR AND WISDOM An Anthology of Poems from Classical Tamil THE PURANANURU
Translated and edited by George L. Hart andvHank Heifetz
3.KURUNTOKAI Selected poems of Love by Dr. C. Rajeswari
4.. Circle of Six seasons by Martha Ann selby
5.Hala’s Sattasai by PETER KHOROCHE and HERMAN TIEKEN
6. Gadha saptasati by Radhagovinda Basak
7.ఋతుసంహారము, ఆంధ్రటీకాతాత్పర్యసహితము, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ కో
8.Ritu in sanskrit Literature by Dr. V. Raghavan
9.Love and the Turning Seasons, Andrew Schelling
9. An Anthology of Sanskrit court Poetry, Vidyakara's Subhasitaratnakosa by Daniel H H ingalls
10.Maha Subhasita samgraha by Ludwik Sternbach 8 volumes
11.https://sangamtranslationsbyvaidehicom
12. A Critical study of Kuruntokai by C. Balasubramaniyan
13.Love Stands alone, Selections from Tamil sangam poetry by M.L. Thangappa
14. వజ్జాలగ్గం, డా. కె. కమల
15. గాథాసప్తశతి, బొల్లోజు బాబా