భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇంట్రూడర్స్ (చొరబాటుదారులు) అంటూ ముస్లిమ్స్ ని హిందుత్వ వాదులు పదే పదే పేర్కొంటారు. సాక్షాత్తూ ‘పెద్దాయనే’---- “ప్రత్యర్ధులు ఎన్నికలలో నెగ్గితే ఈ ‘చొరబాటుదారులకు’ ప్రజల సంపదను పంచిపెడతారని, మీ మంగళసూత్రాలను కూడా వదలరని”--- పలకటం గమనార్హం. ఈ దేశంలో దాదాపు ఆరేడు శతాబ్దాలుగా జీవిస్తూ, ఇక్కడే పుట్టి ఇక్కడే మరణిస్తున్న సాటి మనిషిని ఈదేశానికి చొరబాటుదారుడు అని మాట్లాడటం మనచుట్టూ జరుగుతున్న కమ్యునల్ విభజన రాజకీయాలకు అద్దంపడుతుంది.
నిజానికి చారిత్రికంగా మధ్య ఆసియా స్టెప్పీ గడ్డి భూములనుంచి గుర్రాలపై గత 3000 సంవత్సరాలలో భారతదేశంలోకి మూడు దఫాలుగా ప్రవేశించిన చొరబాటుదారులు భారతీయసమాజాన్ని ప్రభావితం చేసారు. సనాతనులు ఆరేడు వందలేళ్ల క్రితం వచ్చిన ముస్లిమ్స్ గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప వారికంటే ముందు రెండుదఫాలుగా వచ్చిన ఇతరజాతులకు చెందిన చొరబాటుదారుల గురించి మాట్లాడరు.
1. మొదటి దశ, ఆర్యుల చొరబాటు
• మధ్య ఆసియనుంచి BCE 1500 ప్రాంతంలో ఆర్యులు అనే యోధ జాతి భారత ఉపఖండానికి వలస వచ్చి ఈ ప్రాంతంపై ఆధిపత్యం పొందారు. వీరు తమతో పాటు వేదసంస్కృతి, సంస్కృత భాషను తెచ్చారు ఇవి ఆనాటి భారత ఉపఖండంలోని స్థానిక సంస్కృతులపై ప్రభావం చూపాయి.
• ఈ రోజు జన్యుశాస్త్రంలో DNA Sequencing పద్దతి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలుగుతుంది. దీని ఆధారంగా ఒక జన్యువు వివిధ జనాభాలలో, వివిధ కాలాలలో ఎలా ప్రయాణం చేసింది అనే విషయం చాలా సులువుగా మేప్పింగ్ చేయగలుగుతున్నారు. ఈ అధ్యయనాలద్వారా, మధ్య ఆసియా నుండి కొన్ని జన్యువులు భరతఖండంవైపు కాలానుగుణంగా కదులుతూ వచ్చాయని కొన్ని పదుల సైంటిఫిక్ పేపర్లు నిర్ధారించాయి. అవే ఆర్యజనువులు. అలా వలసవచ్చిన వారే ఆర్యులు.
• మరొక ఆశ్చర్యం కలిగించే అంశం- ఆర్యులలో ఉండే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బెంగాలు బ్రాహ్మణులలో అత్యధికంగా 72.22 శాతం, ఇతర రాష్ట్రాల బ్రాహ్మణులలో 70-30% మధ్యలో కనిపించింది.
• ఇక భారతదేశ క్రిందితరగతి ప్రజలలో (Lower Castes/దళిత,బహుజనులు) ఈ ఆర్య జన్యువు 15.7 శాతం మందిలో కనిపించింది. అదే విధంగా భారతీయ గిరిజనులలో ఈ జన్యువు 7.9% మందిలో మాత్రమే గుర్తించారు.
• ఈ గమనింపు ద్వారా నేటి బ్రాహ్మణులు మధ్య ఆసియా నుంచి వచ్చిన విదేశీ ఆర్యులని, దళిత బహుజన గిరిజన ప్రజలు భరతఖండంలో సింధునాగరికతా కాలంనుండి జీవిస్తున్న స్థానికులని భావించవచ్చు.
• ఆర్యులు వర్ణవ్యవస్థను ఏర్పరచారు. సమాజాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ నాలుగు శ్రేణులుగా విభజించారు. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతులుగాను, మిగిలిన మూడు వర్ణాలు వారికి సేవచేయాలని ధర్మశాస్త్రాల ద్వారా నిర్ణయించారు. ధర్మశాస్త్రాలనేవి ఒకనాటి రాజ్యాంగం. ఇక వీరికి వెలుపల అతిశూద్రులు ఉండేవారు అతిశూద్రులు వూరివెలుపల నివసించే అంటరానివారు. ధర్మ శాస్త్రాలప్రకారం వీరసలు మనుషులే కారు.
• ఆర్యులు వారి స్త్రీలతో కాకుండా పురుషులు ఒక్కరే భరతఖండానికి వచ్చి స్థానిక అనార్య స్త్రీలను పెళ్ళాడారు. ఈ సందర్భంగా స్థానిక పురుషులను ఓడించి లేదా నిర్మూలించటం ద్వారా వారి స్త్రీలను గ్రహించటం జరిగి ఉండాలి.
• ఆర్యులు ప్రవేశపెట్టిన జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ (కులవ్యవస్థ), బ్రాహ్మణాధిక్యత, మంత్రాలు, క్రతువులు, స్వర్గనరకాలు, పాపం పుణ్యం లాంటి అభౌతిక భావనలు నేటికీ సమాజంలో తమప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి.
• ఆర్యులు భారతదేశానికి చెందిన స్థానికులే అని సనాతనులు వాదిస్తారు కానీ అలా నిరూపించే జన్యు ఆధారాలు లేవు. ఇదొక సంకట స్థితిగా మారింది సనాతన హిందూ చరిత్రకారులకు.
2. రెండవ దశ యవనులు, శకులు, పార్థియన్లు, కుషాణులు చొరబాటు
• BCE 300 – CE 100 మధ్యలో యవనులు (ఇండో గ్రీక్స్), శకులు (సిథియన్స్) పార్థియన్స్, కుషాణులు మధ్య ఆసియానుంచి భారతదేశంలోకి చొరబడిన యోధులు.
• అలెగ్జాండర్ మరణం తరువాత అతని సైన్యంలో కొంతమంది గ్రీకులు BCE 300 లలో ఇక్కడే ఉండిపోయి పంజాబ్, గాంధార ప్రాంతాలను పాలించారు. వీరిని ఇండో గ్రీక్స్ (యవనులు అని పిలిచారు). వీరు బౌద్ధాన్ని స్వీకరించారు. గాంధారకళలో బౌద్ధ శిల్పాలను చెక్కించారు. మనుస్మృతి వీరిని మ్లేచ్చులగా పరిగణించి, “తక్కువరకం క్షత్రియులు”గా గుర్తించింది.
• శకులు (సిథియన్స్) BCE 100 లో మధ్య ఆసియా స్టెప్పీలనుండి గుర్రాలపై వచ్చిన సంచార తెగలు. వీరు గాంధార, పంజాబ్, ఉజ్జయిని ప్రాంతాలను పాలించారు. వీరు బౌద్ధ, హైందవ మతాలను స్వీకరించారు. వీరిలో ప్రముఖుడైన రుద్రదమనుడు సంస్కృతాన్ని ఆదరించాడు. వీరిని పతనమైన క్షత్రియులు (Second class kshatriyas) గా మనుస్మృతి పరిగణించింది.
• పార్థియన్స్, BCE 100 లో ఇరాన్ నుంచి వచ్చిన యోధులు. వీరు ఇండో పార్థియన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు సింధ్ పంజాబ్ ప్రాంతాలను (ప్రస్తుత పాకిస్తాన్) పాలించారు. ఈ వంశంలో గోండో ఫరిస్ ప్రసిద్ధిగాంచిన రాజు. వీరి పాలనలో గాంధార శిల్పకళ అభివృద్ధిచెందింది. వీరు జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించినా, క్రమేపీ భారతీయమతాలతో విలీనం అయిపోయారు. పార్థియన్లను కూడా మనుస్మృతి పతనమైన క్షత్రియులుగా గుర్తించింది.
• కుషాణులు, CE 100 మధ్య ఆసియానుంచి వచ్చారు. కనిష్కుడు పేరుగాంచిన రాజు. కుషాణులు బౌద్ధమతాన్ని వ్యాప్తిచేసారు. వీరినాణాలపై బుద్ధుడు, శివుడు, గ్రీకుదేవతల చిహ్నాలు ఉండటం వీరి మతసహనాన్ని చూఫుతుంది. వీరు వాసుదేవవంటి భారతీయ కల్ట్ పేర్లను ఉపయోగించారు. వీరు కూడా క్షత్రియులుగానే గుర్తింపబడ్డారు.
మధ్యఆసియానుంచి భారతఖండంలోకి చొరబడిన స్టెప్పీ యోధులైన, యవనులు శకులు, పార్థియన్లు, కుషాణులు భారతదేశంలో స్థిరపడి, స్థానిక బౌద్ధ, హైందవ మతాలను స్వీకరించి క్రమేపీ భారతదేశ సమాజంలో మమేకం అయిపోయారు. కాలక్రమేణా వీరు స్థానిక కులాలుగా విలీనమయ్యారు. ఉదాహరణకు శకులు గుజరాత్ మధ్యప్రదేశ్ లోని క్షత్రియకులాలలోకి (రాజ్ పుత్రులు) కుషాణులు ఉత్తరదేశ రాజవంశాలలోకి కలిసిపోయారు.
.
3. మూడవ దశ చొరబాటు , ఐబక్, ఖిల్జి, తుగ్లక్, సయ్యద్, లోడి, ముఘల్స్
• CE 12-15 శతాబ్దాలమధ్య మధ్యఆసియా నుంచి కుతుబుద్ధీన్ ఐబక్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు వచ్చి భారతదేశాన్ని పాలించాయి. వీరి రాజ్యాలు ఉత్తరభారతదేశానికే పరిమితం అయిన బలహీనమైన రాజ్యాలు. 1526 లో మధ్య ఆసియాకు చెందిన బాబర్ పానిపట్టు యుద్ధంద్వారా ఇబ్రహిం లోడీని ఓడించి భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనిని మేవాడ్ రాజపుత్రరాజు రాణా సంగా, లోడిని గద్దెదించటానికి ఇండియాకు ఆహ్వానించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు.
బాబర్ బలమైన కేంద్రీకృతపాలన కలిగిన విశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దీన్ని అక్బర్ విస్తరించాడు. ఔరంగజేబు ముఘల్ సామ్రాజ్యాన్ని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళి ఈ రోజు మనం దేన్నైతే అఖండ భారతదేశం అంటున్నామో దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. ఇతని పాలనలో ముఘల్ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిని పొందింది. అశోకుని మౌర్యసామ్రాజ్యం ఎంతైతే విస్తరించి ఉండేదో దాదాపు అంత భూభాగాన్ని ఔరంగజేబు తిరిగి సాధించగలిగాడు. ఇది అంతకు పూర్వ ఢిల్లి సుల్తానేట్, హిందూ రాజవంశాలకు సాధ్యం కానిది.
• ముఘలులు హిందూ ముస్లిమ్ సమాజాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా అక్బరు ద్వారా సూఫీ సాధువులైన చిస్టీ, భక్తి సంప్రదాయ గాయకులు ఐన కబీర్ నానక్ వంటివారు ఈ సంగమానికి దోహదపడ్డారు. అక్బర్ యొక దీన్ ఇ ఇలాహీ సిద్ధాంతం సమస్త మతాల ఐక్యతను కోరుకొంది.
• ముఘల్ పాలకులు రాజపుత్రులు, హిందూ జమిందారులు, ఇతర స్థానిక నాయకులను పరిపాలనలో భాగస్వామ్యం చేసారు.
• బ్రిటిష్ వారి రాకతో ఒత్తిడి, అంతర్గత అస్థిరతలు ఆర్ధిక సంక్షోభం కారణంగా ముఘల్ సామ్రాజ్యం క్షీణించింది. 1857 సైనికుల తిరుగుబాటు తరువాత చివరి ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ను గద్దె దించి, సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు అధికారికంగా తీసుకోవటం జరిగింది.
నేటి భారతదేశంలోని ముస్లిములు చివరగా గత ఐదారు వందల ఏళ్ళ క్రితం భారతదేశంలోకి ప్రవేశించినవారు. నిజానికి వీరిలో ఎక్కువశాతం హిందూమతంలో స్థానికదళిత బహుజనులపట్ల ఊపిరాడనివ్వని ఆంక్షల వలన ఇస్లామ్ లోకి మారినవాళ్ళే ఎక్కువమంది ఉండొచ్చు.
ఎవరు చొరబాటు దారులు?
ఆర్యులు, యవనులు, ముస్లిములు భారతదేశంలోకి చొరబాటుదారులుగా వచ్చినప్పటికీ, వారు స్థానిక సంస్కృతులతో కలిసిపోయి, భారతీయ సమాజ బహుళతను రూపొందించారు.
ఆర్యులు బ్రాహ్మణ సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు జన్యు ఆధారాలు చెబుతున్నాయి. యవనులు శకులు, కుషాణులు ఉత్తరభారత రాజపుత్రులుగా ఈ దేశ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మధ్య ఆసియానుండి వచ్చిన ముస్లిములతో పాటు స్థానిక దళిత, బహుజన సమూహాల నుండి ఇస్లాంలోకి మారినవారై ఉండవచ్చని ఒక అభిప్రాయం ఉంది.
నేటి రాజకీయ సందర్భంలో, “చొరబాటుదారులు” అనే పదం ముస్లిములను లక్ష్యంగా చేస్తూ, వారిని విదేశీయులుగా చిత్రీకరించడానికి ఉపయోగించబడుతుంది. ఇది చరిత్రను ఏకపక్షంగా వక్రీకరించే ప్రయత్నం, ఎందుకంటే ఇది ఆర్యులు, యవనులు, శకులు ఇతర జాతుల చొరబాట్లను విస్మరిస్తుంది.
భారతదేశంలోని ముస్లిములు గత 700 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడే పుట్టి ఈ మట్టిలోనే కలిసిపోతున్నారు. వారిలో ఎక్కువ మంది స్థానిక మూలాలు కలిగినవారే.
“చొరబాటుదారులు” అనేది చారిత్రక సంఘటనలను వివరించే పదం, కానీ ఆధునిక సమాజంలో దీనిని విభజనాత్మక రాజకీయాలకు ఉపయోగించడం తప్పుదారి పట్టిస్తుంది. విభజన, ద్వేషం కాకుండా ఐక్యత సామరస్యం వైపు మనం ప్రయాణం చేయాలి.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment