Tuesday, June 20, 2017

“ఆకు కదలని చోట” - కదలాడే కవిత్వపు జాడ


కవులు సత్యాన్వేషులు. కవిత్వం సత్యాన్నావిష్కరించే సాధనం. కవులు ఆవిష్కరించే సత్యాలు వారి మనోలోకంలో పుట్టినవి కావొచ్చు లేదా సామాజిక పరిశీలనలో బయటపడినవి కావొచ్చు. “ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు” అన్న వాక్యంలో –ఆ కవి ఊహలో ఒక సౌందర్యరాశి నల్లని కన్నులుకు వినీలాకాశానికి సామ్యం కనిపించింది. అది ఒక సత్యావిష్కరణ. ఇలాంటి కవిత్వం చదువరి హృదయానికి హాయినిచ్చి, సంస్కారాన్ని, మార్ధవతను కలిగిస్తుంది. “ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం” అన్న వాక్యం ద్వారా, ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కవికి కొన్ని సత్యాలను ఎరుకపరచినట్లు అర్ధమౌతుంది. ఇలాంటి కవిత్వం పాఠకునికి సమాజంపట్ల బాధ్యతను గుర్తుచేసి, సామాజిక మార్పు కోసం అతన్ని కార్యోన్ముఖుడని చేస్తుంది.

ఈ రెండు రకాల కవిత్వాలలో ఒకటి గొప్పది మరొకటి తక్కువది అనుకోవటం పొరపాటు. దేని విలువ దానిదే. సమాజానికి రెండిటి అవసరమూ ఉంది. ఒకటి వైయక్తిక మార్పుకు దోహదపడితే మరొకటి సామాజిక మార్పుకు దారితీస్తుంది.మెజారిటీ కవులు, నలుపు తెలుపుల్లా ఈ రెండువిభాగాల మధ్య రాసులుపోసినట్లు విస్తరించి ఉండటం సాధారణంగా గమనిస్తాం.

రెండు పంథాల మంచి చెడ్డలు ఆకళింపు చేసుకొని కవిత్వం వెలువరించే బహుకొద్ది మంది కవులలో బాల సుధాకర్ మౌళి ఒకరు.

“ఆకు కదలని చోట” సుధాకర్ మౌళి రెండవ కవిత్వసంపుటి. చిక్కని కవిత్వం, గొప్ప ఊహాశాలితతో కూడిన భావ సంచయము, జీవించిన ప్రతీ క్షణాన్ని కవిత్వీకరించాలి అనే తపనా, సమాజం పట్ల బాధ్యత, ఆశావహ దృక్ఫధం వంటివి స్థూలంగా మౌళి కవిత్వ లక్షణాలు.

వచనం ఆలోచనాత్మకం, కవిత్వంలో ఉద్వేగం ఉంటుంది. ఈ ఉద్వేగం హృదయాన్ని కదిలించగలుగుతుంది. చదువరిని భావావేశానికి గురిచేస్తుంది. మంచి ఉద్వేగాలు పండించగలిగిన కవి ఫస్ట్ క్లాస్ కవిగా నిలుస్తాడు. మౌళి కవిత్వంలో ఈ మౌలిక లక్షణం పరిపక్వ స్థితిలో కనిపిస్తుంది.

“కవులేం చేసారు – మొండి చేతులతో గోడలపై నినాదాలు వ్రాసారు” అంటారు శివారెడ్డి. ఈ వాక్యంలో – కలంపట్టుకొన్న చేతులు మొండివెందుకయ్యాయి? కవి చేతులను రాజ్యం నరికేసిందా? అయినప్పటికీ కవి తన మార్గాన్ని వీడలేదా? గోడలపై ఆ నినాదాలు ఏం చెపుతున్నాయి? వంటి అనేక ప్రశ్నలు ఉదయించి చదువరిని ఉద్వేగభరితం చేస్తాయి. రాజ్యం చూపే అన్యాయాల పట్ల కోపం కలుగుతుంది. అదీ కవిత్వ గొప్పతనం.

కవిత్వ మాధ్యమం శక్తి తెలిసిన వాడు మౌళి. అనేక కవితలలో ఉద్వేగాలు చాలా బలంగా పలికాయి.
****
“ఆకు కదలని చోట” సంపుటిలో ప్రధానంగా ఆకర్షించే అంశం మౌళి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కవిత్వంలోకి లీనం చేసిన విధానం. ఈ సంపుటిలోని మొత్తం 63 కవితలలో 5 అనువాదకవితలు తీసేయగా మిగిలిన 57 కవితలలో 27 కవితలు ఏదో సందర్భాన్నో, వ్యక్తులనో తలచుకొంటూ వ్రాసినవి కావటం గమనార్హం. వీటిలో శివారెడ్డి, గంటేడి, అరుణ్ సాగర్, అక్బర్ వంటి వారిపై ఆరాధనతో వ్రాసుకొన్నవి కొన్ని, వృత్తిరీత్యా ఉపాద్యాయుడు కావటం వల్ల, విజయ, జీవన్, కుమారి వంటి ప్రతిభకలిగిన విద్యార్ధులపై, ఇంకా డ్రాయింగ్ టీఛర్ దుర్గ, వీరశంకర్ వంటి సహాద్యాయులపై వ్రాసినవి మరికొన్ని, ఇవికాక బాక్సైట్ తవ్వకాలు, ముస్లిమ్ రచయితపై దాడి, కల్బుర్గి, సొనిసోరి, అయిలాన్ పిలగాడు, వేట నిషేదం వంటి వివిధ సందర్భాలకు రాసినవి ఉన్నాయి.

సాధారణంగా కవులు తమ కవిత్వాన్ని స్వీయానుభవంగా ప్రకటిస్తారు. కొన్ని వాక్యాలకు ఎవరెవరు కారణమయ్యారో వారిని ఏ ప్రస్తావన లేకుండా అనామకంగా ఉంచటం జరుగుతుంది. ఇది తప్పేమీ కాదు. తన కవితకు ప్రేరణ ఇచ్చినవారి గురించి చెప్పాల్సిన బాధ్యత కవికి లేదు. చాలా కాలం క్రితం వజీర్ రెహ్మాన్ “సత్తు చిత్తు” అనే కవిత్వసంపుటిలో తద్భిన్నంగా వ్యవహరించాడు. పుస్తకం చివరలో ఒక్కో కవితకు ఇచ్చిన ఫుట్ నోట్సులో ఆ కవితకు ప్రేరణ అయిన వ్యక్తుల్ని, చదివిన వాక్యాల్ని చక్కగా విపులంగా ప్రస్తావించుకొన్నాడు. ఈ వివరణలు ఆయా కవితల్ని మరింత అర్ధం చేసుకోవాటానికి దోహదపడతాయి.

నిజానికి అలా ఒక కవిత వ్రాయటానికి కలిగిన ప్రేరణలను ప్రస్తావించిన కవితలలోనే కవి వ్యక్తిత్వం బయట పడుతుంది. పైన చెప్పిన 27 కవితలలో మౌళి ఎలాంటి మానవునిగా తననుతాను కవిత్వంలో ఆవిష్కరించుకోవాలనుకొంటున్నాడో తెలుస్తుంది. మానవ జీవితాన్ని మౌళి ఏ కోణంలోంచి చూస్తున్నాడు, ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు, ఏఏ విలువలకు కట్టుబడి ఉన్నాడు, తాను పీల్చుకొన్న సారాన్ని ఎలా కవిత్వీకరిస్తున్నాడు లాంటి వివిధ అంశాలు పై కవితలలో దొరుకుతాయి. మౌళి కవిత్వంలో ఏది సామాజికము, ఏది వైయక్తికము అని విడదీయలేం. తన చుట్టూ ఉన్న సమాజాన్ని కవి తన కవిత్వంలో ప్రతిబింబించటమే సామాజికత
 ****

సామాజిక చైతన్యంతో వ్రాసే కవిత్వం సాధారణంగా వస్తుప్రధానంగా సాగుతుంది. శిల్పాన్ని కూడా అంతే సాంద్రతతో నింపే వారిలో శివసాగర్ సమున్నత స్థానంలో ఉంటారు. “సాహిత్యానికి సాహిత్య లక్షణాన్ని ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదు” అన్న బాలగోపాల్ మాటలను మౌళి బహుసా హృదయగతం చేసుకొన్నాడేమో - అందుకనే ఇతని కవిత్వంలో పదచిత్రాలు, ప్రతీకలు, ధ్వని, శైలి, అభివ్యక్తి, సౌందర్యాత్మకత వంటివి "వస్తువును" కవిత్వమయం చేస్తాయి. ఈ విషయం ఈ సంపుటిలోని అనేక కవితలలో స్పష్టంగా తెలుస్తుంది. బతికుండటం, ఆట, పలమనేరు కవిత:మట్టి, నిర్భందపు గోడల్ని, ఆకుకదలని చోట లాంటి కవితలు ఒక్క సుధాకర్ మౌళి మాత్రమే రాయగలిగే కవితలు అన్నంత గొప్పగా ఉంటాయి. ఏం నేత్రాలవి, రాత్రి అనే కవితలు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా తోస్తాయి. చేపలు ప్రత్యుత్పత్తి చేసుకొనే కాలంలో “వేటనిషేదం” చర్య శాస్త్రీయంగా సరైనదే. దాన్ని “సముద్రం వుండదు/పడవ వుండదు/ఎవరో కన్నీళ్ళనోడుస్తూ/ గుమ్మంలోంచి కదలిపోతుంటారు” అంటూ కవిత్వీకరించటం టెక్నికల్ గా కరక్ట్ కాదు.
 ****

“ఇప్పటివరకు మేధావులందరు ఈ ప్రపంచాన్ని నిర్వచించారు. ఇప్పుడు మన బాధ్యత ఈ ప్రపంచాన్ని మార్చటం” అంటాడు మార్క్స్. ఏనాటికీ కాలదోషం పట్టని వాక్యమది. ప్రతీ తరంలోను యధాతథ స్థితిని బద్దలుకొట్టాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మార్గాలు అన్వేషింపబడుతూనే ఉంటాయి. అదొక ప్రవాహ సదృశ వెతుకులాట.

మౌళిలో కూడా ఇలాంటి అన్వేషణ కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోందన్న అంతఃశోధన తెలుస్తుంటుంది. జవాబులు వెతుక్కుంటాడు, నిరసిస్తాడు, తిరగబడతాడు, ప్రేమిస్తాడు, సమాధాన పడతాడు. ఇన్నిరకాలుగా తనలోకి ఇంకిన సమాజాన్ని ఫిల్టర్ చేసి రిఫైన్డ్ రూపంలో కవిత్వీకరిస్తాడు. అది మనల్ని ఆలోచింపచేస్తుంది, ఉద్వేగ పరుస్తుంది, వెంటాడుతుంది చాలాకాలం. గొప్పకవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు అవే కదా!

బాల సుధాకర్ మౌళి ఫోన్: 9676493680

------ బొల్లోజు బాబా

Friday, June 9, 2017

కుట్రలు


చిన్నప్పుడు
మా ఇంట్లో పాడి ఉండేది
కనుమ రోజున మా అమ్మ
ఆవుకు పసుపు, కుంకుమ పూసి
గిట్టలకు బంతిపూల దండలు కట్టి
చుట్టూ ప్రదక్షిణ చేసి, హారతి ఇచ్చి
భక్తిశ్రద్ధలతో పూజ చేసేది
బతిమాలో బామాలో ఉద్దరిణిడు
గోమూత్రం రాబట్టి తలపై చల్లుకొనేది
అదే ఆవు
ఒంటిపూట పడి క్రమంగా ఒట్టిపోతే
కబేళా బేరగాడితో గీసి గీసి బేరమాడి అమ్మేసి
మరో ఆవును తెచ్చుకొనేది.
***
ఇపుడీ దేశానికి ఏమైంది
ఎవరిని వధశాలకు పంపటానికి
ఇన్ని కుట్రలు పన్నుతోంది?
బొల్లోజు బాబా

Wednesday, June 7, 2017

కవిత్వంలో పెర్సొనిఫికేషన్ (Personification)


మానవలక్షణాలను వస్తువులకో, జంతువులకో లేక ఒక ఊహకో ఆరోపించి కవిత్వం చెప్పే పద్దతిని పెర్సొనిఫికేషన్ అంటారు.
కవిత్వం రాసే పద్దతులలో ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. దీనివల్ల ఒక విషయం పాఠకుని మనస్సులో లోతుగా నాటుకొంటుంది. మెటానొమీ లేదా సింబల్ లాంటి టెక్నిక్ లతో పోల్చినపుడు పెర్సొనిఫికేషన్ చాలా సరళంగా ఉంటూ, పాఠకుడిని శ్రమపెట్టకుండానే కవిత్వానుభూతి కలిగిస్తుంది.
పెర్సొనిఫికేషన్ టెక్నిక్ దైనందిన సంభాషణలలో, కథలలో, వార్తాకథనాలలో కనిపిస్తూనే ఉంటుంది. “ఈ బండి పెట్రోలు పొదుపు చేస్తుంది” అంటాం. “సూర్యుడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నాడు” అంటూ ఓ కథ మొదలవ్వొచ్చు. “ఆ పథకం అందరిజీవితాలలో వెలుగులు నింపింది” అన్న ఓ వార్తాంశం కావొచ్చు. అన్నీ పెర్సొనిఫికేషన్ కు చక్కని ఉదాహరణలే.
కవిత్వంలో పెర్సొనిఫికేషన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే – పెర్సొనిఫికేషన్ ద్వారా పాఠకుని మనసులో ఒక బలమైన దృశ్యరూపం ఏర్పడుతుంది. కవితలోని మూడ్ లేదా కవిత చెప్పదలచుకొన్న అంశం ఈ టెక్నిక్ వల్ల మరింత స్పష్టంగా అర్ధమౌతుంది. కవిత్వనిర్మాణ పద్దతులలో చాలా సులువుగా అందుబాటులో ఉండే ప్రక్రియ ఇది.
నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు. --- ఇస్మాయిల్
ఇస్మాయిల్ గారి కవిత్వంలో పెర్సొనిఫికేషన్ ప్రక్రియతో నిర్మించిన అనేక అద్భుతమైన ఇమెజెస్ కనిపిస్తాయి. పై ఉదాహరణలో ఒక రాలిన ఆకుకు మానవలక్షణాలైన పక్క పరచుకొని, దుప్పటి కప్పుకొని పడుకోవటం అనే క్రియలను ఆరోపణ చేసి చిన్నచిన్న మాటలతో చక్కని సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు ఇస్మాయిల్.
వర్షధారలనే పగ్గాలతో
నేలను పైకి లాక్కొందామనే
మబ్బుల ఆలోచన ఫలించకపోవటంతో
అవి ఎలా మూలుగుతున్నాయో చూడు
ఉరుముల శబ్దాలతో. – 436 (గాథాసప్తశతి)
రెండువేల ఏళ్ళక్రితం నాటి ఈ సప్తశతి గాథలో ఒక అందమైన ఊహ పెర్సొనిఫికేషన్ వల్ల మరింత అందంగా, సజీవంగా మారి, ఆ దృశ్యం మదిలో హృద్యంగా రూపుకడుతుంది. ఉరుములనేవి విఫలయత్నం చేసి అలసిపోయిన మబ్బుల మూలుగులు అనటం గొప్ప ఊహ. పెర్సొనిఫికేషన్ ను పరాకాష్టకు తీసుకెళ్ళిన పదచిత్రంగా దీన్ని భావించవచ్చు.
ఓయ్ పిల్లవాడా బయటకు వెళ్లకు.
చెరువు పక్కనున్న తాటి వరుసలు
తమ తలల్ని నింగిపై బాదుకొంటున్నాయి,
తూరుపు రేవులో పెంజీకట్లు సంచరిస్తున్నాయి. (ద రైనీ డే క్రిసెంట్ మూన్ – రవీంద్రనాథ్ టాగోర్)
తుఫాను వచ్చేలా ఉంది, బయట సంచరించవద్దు అంటూ ఒక తల్లి తన పిల్లవానికి చేసిన హెచ్చరికలో - తాటిచెట్లు తలల్ని నింగికి బాదుకోవటం, పెంజీకట్లు సంచరించటం వంటి పెర్సొనిఫికేషన్ వర్ణణల వల్ల ఒక భయానక వాతావరణం/మూడ్ అలవోకగా నిర్మింపబడింది పై వాక్యాలలో.
ఎవరూ నన్ను వినట్లేదని
దూరంగా ఓ పక్షి రోదిస్తూ ఎగిరిపోయింది
రక్తమోడుతున్న వీధులు
 ముడుచుకున్న భవనాలపై
తన రోదన వస్త్రంలా కప్పబడిందని
అది చూడలేక పోయింది (అలా వదిలేయండి – మెర్సి మార్గరెట్)
పై కవితలో పెర్సొనిఫికేషన్ టెక్నిక్ చాలా బలంగా వ్యక్తమయింది. మానవలక్షణాలైన రోదనను పక్షికి, రక్తమోడ్చటం వీధులకు, ముడుచుకుపోవటం భవనాలకు ప్రతిభావంతంగా ఆపాదించటంతో, ఆ వాక్యాలు శక్తివంతమైన కవిత్వంగా మారాయి. ప్రతి వర్ణణా చిక్కని స్పష్ట చిత్రంగా మనసుకి తెలుస్తుంది.
అలలగొంతుతో
నది పాడుతుంటుంది
ఏ సుదూరాన్నుంచో పక్షులు నదిపాట విని
కచేరి ముందు వీక్షకులు చేరినట్టు
నది వొడ్డున చేరుకుంటాయి (నదిపాట – బాల సుధాకర్ మౌళి)
నది పాడటం, ఆ పాటను విని పక్షులు నదివొడ్డుకు చేరటం పెర్సొనిఫికేషన్ క్రిందకు వస్తుంది. ఇక్కడ ఉత్త పెర్సొనిఫికేషన్ చేయటంలో మాత్రమే కాక దానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని సృష్టించటంలో కవి పరిణతి కనిపిస్తుంది. నది అలలగొంతుతో పాడటం, కచేరిముందు వీక్షకులుగా పక్షులు చేరటం వంటి వివరణలతో కవిత స్థాయి అనూహ్య ఎత్తులకు చేరింది. ఇలాంటి కవిత్వనిర్మాణంలోనే కవి ప్రతిభ స్ఫుటితమౌతుంది.
మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి.
తెల్లవార్లూ వానకురుస్తానే ఉంది.
నల్లని మంచుగడ్డకరిగిపోయింది.
ప్రశాంతతరువుల్లోకి ప్రాత:కాలం
తడితడిగా ప్రవేసించింది.
వందగుమ్మాలతో వెదురు పొద
స్వాగతం పలికింది. (ఆకుపచ్చని తడిగీతం)
చుంబనం, ప్రవేశించటం, స్వాగతం పలకటం వంటి లక్షణాలను ప్రకృతికి ఆపాదించటం ద్వారా అందమైన ఇమేజెరీ ఆవిష్కృతమైంది. వెదురుపొదలో నిలువుగా సమాంతరంగా ఉండే వెదురుమొక్కలను గుమ్మాలుగా వర్ణించటం చక్కని ఊహాశాలిత.
పెర్సొనిఫికేషన్ అనేది కవిత్వనిర్మాణంలో ఒక ప్రాధమిక స్థాయి టెక్నిక్. దీనిద్వారా సూటిగా, స్పష్టంగా కవితావస్తువును ఆవిష్కరించవచ్చు. పెర్సొనిఫికేషన్ టెక్నిక్ ఇతర నిర్మాణ పద్దతులతో ఒక భాగంగా ఉంటూ వ్రాసిన కవితలు మరింత శక్తివంతంగా ఉంటాయి.
బొల్లోజు బాబా

Friday, June 2, 2017

కవిత్వంలో ఇమేజెరీ


కవిత్వంలో ఇమేజ్ అంటే పదాలతో నిర్మించిన ఒక చిత్రం. ఆ పదాలను చదువుకొన్నప్పుడు మనసులో ఒక దృశ్యం ఊహకు వస్తుంది.
“వెన్నెల
మబ్బుల మెట్లమీదుగా
నేలకు దిగే సమయాన" (మేఘనా - శిఖామణి)
అనే వాక్యంలో రాత్రి చిక్కబడుతూండగా వెన్నెల మెల్లమెల్లగా బయటపడుతున్న ఒక దృశ్యం ఆవిష్కృతమౌతుంది. ఇక్కడ కవి ఒక ఆహ్లాదకరమైన సందర్భాన్ని సౌందర్యాత్మకంగా కవిత్వీకరించాడు.
ఒక ఆలోచననో, దృశ్యాన్నో, ఉద్వేగాన్నో చెప్పేటపుడు ఒకటికంటే ఎక్కువ ఇమేజెస్ అవసరపడొచ్చు. అనేక ఇమేజెస్ కలిసి ఒక భావాన్ని వ్యక్తీకరించినపుడు ఆ ఇమేజ్ ల సముదాయాన్ని ఇమేజెరీ అంటారు. ఒక కవితలో అనేక ఇమేజెరీలు ఉండొచ్చు.
మన అనుభూతులనన్నీ ఇంద్రియాల ద్వారానే మనం పొందుతాం. వానవెలసిన సాయింకాలం పూట - మబ్బుల మధ్యతొంగిచూస్తోన్న నీలాకాశం, చెంపలకు తాకే చల్లని గాలి, ముక్కుపుటాలను ఆగాగి తాకే చిత్తడి వాసనా, పక్షులు తమ తడిచిన రెక్కలను తపతపలాడిస్తూ చేసే శబ్దాలు, గొంతులోకి జారే వేడివేడి చాయ్ రుచీ - అన్నీ హాయైన అనుభూతులను కలిగిస్తాయి. వాటిని మనసు సంశ్లేషించి ఆ ఆహ్లాదకర అనుభవాన్ని, ఒక అందమైన జ్ఞాపకంగా మలచుకొంటుంది. కవిత్వంలో ఇమేజెరీ కూడా ఇదే పని చేస్తుంది. ఇంద్రియానుభవం ఇవ్వటం ద్వారా రససిద్ధి కలిగిస్తుంది.
వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకొని
గరగరలాడుతోంది - (దాహం) ఇస్మాయిల్
పై ఖండికలో దాహమనే ఇంద్రియానుభవాన్ని అనేక ఇమేజెస్ ద్వారా చెపుతున్నాడు కవి . వివిధ మూర్త చిత్రాలను వరుసగా పేర్చుకొంటూ వెళ్లాడు. ఆ ఆరులైన్లు చదివేసరికి పాఠకునికి ఏదో ఎడారిలో మైళ్ళ దూరం నడిచి, దాహంతో గొంతు పిడచకట్టుకుపోయిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే దాహం అనే అమూర్త భావనను- ఎడారి, ఖర్జూరచెట్టు, ముళ్ళగరగర వంటి మూర్తచిత్రాలు నేరుగా అనుభవంలోకి తీసుకొస్తాయి. ఇది ఇమేజెరీ గొప్పదనం.
కవిత్వాన్ని అబ్ స్ట్రాక్ట్ నుంచి కాంక్రిట్ కు నడిపించటంలో ఇమేజెరీ అతిముఖ్యమైన పాత్రవహిస్తుంది. ఇలా భావాలను దృశ్యరూపంలో చెప్పే పద్దతిని ఇమేజిజం అంటారు.
*****
ఇమేజెరీ కవిత్వం అంటే చెట్టు పుట్టా కవిత్వమనే భావన కొంతమందిలో ఉంది. సామాజిక, రాజకీయ, కవిత్వాల శక్తివంతమైన నిర్మాణంలో కనిపించే ఇమేజెరీకి కొన్ని ఉదాహరణలు
1.
“గుండెల్లో
మెత్తగా దిగబడే
కాగితపు కత్తి
కరెన్సీ నోటు”
అలిశెట్టి ప్రభాకర్ ఈ ఇరవై అక్షరాల కవిత మానవసంబంధాలన్నీ ఆర్ధికసంబంధాలే అన్న మార్క్స్ మాటను గుర్తుకుతెస్తుంది. డబ్బునోట్లో తలపెట్టి ఇరుక్కుపోయిన మానవజాతి పరిణామక్రియను ప్రతిబింబిస్తుంది. గుండెలోకి ఆ అక్షరాలు పదునుగా దిగిన చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. కవిత్వంలో ఇమేజెరీ స్థానం ఎంతగొప్పదో చూపుతుందీ కవిత.
2.
వాడెవడో మూర్ఖుడు
తల లేని మనిషి మొండేల్ని కుక్కినట్లు
లారీల్లో చెట్టు దుంగల్ని వేసుకెళ్తున్నాడు (అరణ్యకృష్ణ).
పచ్చని చెట్లను కొట్టేసి దుంగల్ని తరలిస్తున్న దృశ్యాన్ని తలలేని మొండాలను తీసుకెళ్ళటంలా పోల్చటం ద్వారా మన భవిష్యత్తు పట్ల భయాన్ని కలిగిస్తాడు కవి. రేపు నీ పరిస్థితి కూడా ఇదే నన్న హెచ్చరిక చేస్తాడు.. ఒక బీభత్సాన్ని కళ్ళముందు నిలుపుతాయా వాక్యాలు. ఇదంతా ఒక్క “తలలేని మనిషి మొండెం” అన్న ఇమేజ్ ద్వారా సాధ్యపడింది.
3.
కవిత్వం ఆర్భాటం కాదు
అది నగ్నంగా పడుకున్న
ఓ అపురూప సౌందర్యవతి దేహంతో
పసి పిల్లాడిలా.. పడుచు కుర్రాడిలా
ఏక కాలంలో ఆడుకునే
ఒకానొక అదృశ్య రసానంద రహస్యాత్మ (రసానందం - ప్రసాదమూర్తి).
కవిత్వం సూర్యుడిలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దర్శనమిస్తుంది. ప్రసాదమూర్తి చిత్రించిన కవిత్వచిత్రం గాఢంగా ఉంటూ చదివినపుడు ఒక్కొక్కరికి ఒక్కోరకపు ఇంద్రియానుభవాల్ని ఎరుకకు తెస్తుంది.
4.
అయ్యో
పాలింకి పోవడానికున్నట్లు
మనసింకిపోవడానికి
మాత్రలుంటే ఎంత బావుండు (అబార్షన్ స్టేట్ మెంట్ - పాటిబండ్ల రజని).
స్త్రీల Reproductive rights పట్ల స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడకపూర్వమే వ్రాసిన గొప్ప కవిత ఇది. అబార్షన్ తరువాత lactationను నిలుపుచేయటానికి మందులున్నట్లే, తన నిస్సహాయ స్థితివల్ల గాయపడిన మనసు సాంత్వన పొందటానికి మాత్రలు లేవు అన్న ఇమేజెరీ, స్త్రీవాద కోణంలో అత్యంత బలమైన అభివ్యక్తి.
5.
ఏ రోడ్డు మీదో నా చిన్నప్పటి గురువులు కనిపిస్తే
గద్దను చూసిన కోడిపిల్లలా
నా బొటనవేలు గుప్పిట్లో దాక్కుంటుంది (ఆత్మకథ - ఎండ్లూరి సుధాకర్ ).
ఈ ఇమేజెరీలో దళితచరిత్ర అంతా ఒదిగిపోయింది. ద్రోణుడు, ఏకలవ్యుడు జ్ఞప్తికి రాకమానరు. వేదాలు విన్నందుకు చెవుల్లో సీసం పోసిన చరిత్రశకలాలు కన్పిస్తాయి. సాహిత్యంలో దళిత అస్థిత్వానికి ఒక స్థానం కోసం చేసిన ఉద్యమంలో చరిత్రనిరాకరించే ప్రక్రియలో భాగం ఈ కవిత.
6.
నేను పుట్టకముందే
దేశద్రోహుల జాబితాలో
నమోదై ఉంది నాపేరు (పుట్టుమచ్చ ఖాదర్ మొహిద్దిన్)
పై వాక్యాలు తెలుగుసాహిత్యాన్ని ఉలిక్కిపడేలా చేసాయి. ‘పుట్టకముందే’ అన్న పదంవల్ల గొప్ప లోతు, పదును వచ్చి తెలుగుసాహిత్యంలో ముస్లింవాదం ఒక బిగ్ బాంగ్ తో ప్రవేశించటానికి దోహదపడింది.
ఇమేజెరీ ద్వారా కవి శక్తివంతమైన కవిత్వాన్ని సృష్టించగలడు. బలమైన ఇమేజరీ అనేది కవి ప్రతిభ, వ్యుత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. ఇమేజెరీలో ఇమేజెస్ లాజికల్ ఆర్డర్ లో లేకపోతే గందరగోళానికి దారితీసే ప్రమాదం ఉంది. ఉత్తమ కవిత్వానికి ఇమేజెరీ గీటురాయి.
బొల్లోజు బాబా