Friday, April 29, 2022

పెండ్లికూతురు మొదటి మూడు రాత్రులు....


ఒక బ్రాహ్మణ తండ్రి తన కూతురిని ఒళ్ళోకూర్చోబెట్టుకొని కన్యాదానం చేస్తున్న ఫొటోని పురోహితుడి కామం  అంటూ ట్రోలింగ్ చేసారు ఈ మధ్య కొందరు.  అలా విపరీతమైన దృష్టితో ఆలోచించటానికి - “శూద్రకులాలలో వివాహం అయ్యాకా పెండ్లికూతురు మొదటి మూడురాత్రులు పురోహితునితో గడపాలి అనే నియమం ఉండేదని, దానిని బ్రిటిష్ వారు 1819 లో ఒక చట్టం ద్వారా నిషేదించారని” ఒక కథనం ప్రచారంలో ఉండటం కారణంగా చెప్పుకోవచ్చు.

చిత్రంగా అనిపించే ఈ వింత ఆచారం “శూద్రులలో” ఉన్నట్లు మధ్యయుగపు సాహిత్యంలో కానీ, శాసనాలలో కానీ ఎక్కడా కనిపించదు. సాధారణంగా జంతు ప్రపంచంలో  పురుషజీవి తన జన్యువులే తరువాతి తరంలోకి చేరాలనే కాంక్షతో సాటి పురుషజీవులతో ఒక యుద్ధమే చేస్తుంది.  సింహాలలో అలా నెగ్గిన సింహం ముందు జతకట్టిన సింహానికి పుట్టిన పిల్లలను స్వయంగా కొరికి చంపివేసిన తరువాత మాత్రమే, ఆ ఆడసింహంతో సంపర్కం జరిపి తన జన్యువులు కలిగిన పిల్లలు కలిగేలా చూసుకొంటుంది.  అలాంటిది భార్యను తొలి మూడు రాత్రులు మరొక పురుషుని వద్దకు పంపి తనకు కాక ఆ వ్యక్తికి కలిగిన పిల్లలను తనపిల్లలుగా పొందాలనుకోవటం ఆశ్చర్యం కలిగించకమానదు.

పెళ్ళిమంత్రాలు

అధర్వవేదం లోని ఈ శ్లోకంలో ఈ అంశానికి సంబంధించిన ఛాయలు కనిపిస్తాయి

సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర: 

తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా:

అంటే ఆ కన్యను మొదటగా చంద్రుడు, తరువాత గంధర్వుడు, తరువాత అగ్ని వరించారని ఇప్పుడు  నాలుగవ భర్తగా ఆ కన్యను  ఆ పెండ్లికొడుకు  వరిస్తున్నట్లు అర్ధం.   

ఈ శ్లోకానికి వివరణ - ఒక అమ్మాయి ఎనిమిదేళ్ల వయసువరకు చంద్రుని రక్షణలోను, పదేళ్ల వయసు వరకు గంధర్వ విశ్వవసు రక్షణలోను, పన్నెండేళ్ల వయసువరకు అగ్ని దేవుని రక్షణలోను ఉంటుందని ఆ విధంగా ఆమెకు ఆ ముగ్గురు అప్పటివరకు రక్షకులుగా ఉన్నారని ఆ తరువాత వివాహసమయంలో నాల్గవ వ్యక్తిగా మనుజుడైన భర్త రక్షణలోకి ఆమె చేరుతుందని పరాశర స్మృతి (7:4,5) లో  చెప్పబడింది. 

బహుసా పై శ్లోకానికి అనుగుణంగా కాబోలు,  పూర్వకాలంలో పెండ్లి అయిన తరువాత మూడురోజుల వరకు భార్యా భర్తలకు శృంగారం నిషేదంగా ఉండేది. నాల్గవరోజున  Gandharva-rāja Utthāpanam పేరిట హోమం చేసి వారికి శోభనం జరిపించేవారు.  ఇదే ఆచారం ఉత్తరభారతదేశంలో కొన్ని చోట్ల కనిపిస్తుంది.  ఆ నాల్గవ రోజును వివాహ చతుర్ధి/మిథిలా చతుర్ధి అని పిలుస్తారు. 

వేదకాలం నాటి ఈ ఆచారం కాలక్రమేణా ఎలా పరిణమించి ఉండొచ్చు అనేది ఆసక్తి కలిగించకమానదు.  మధ్యయుగాల భారతదేశంలో “పెండ్లి తరువాత తొలి మూడురాత్రులు” ఏంజరిగేది అనే అంశం కొందరు విదేశి యాత్రికుల రచనలలో కనిపిస్తుంది

1. Ludovico Di Varthema

        వార్థెమా1503-1508 మధ్యలో ఇండియాలో ప్రయాణించి తన అనుభవాలను The Travels of Ludovico Di Varthema అని గ్రంధస్థం చేసాడు. ఇతడు మలబార్ తీరంపై ప్రయాణించినపుడు అక్కడి బ్రాహ్మణుల గురించి ఇలా అన్నాడు

        "బ్రాహ్మణులు విశ్వసించదగిన మర్యాదస్తులు.  మహారాజు వివాహం చేసుకొన్నప్పుడు యోగ్యుడైన ఒక బ్రాహ్మణుని ఎంపిక చేసి అతనితో తన భార్యకు శోభనం జరిపిస్తాడు. ఈ పనిని బ్రాహ్మణుడు ఉచితంగా చేయడు. దీనికి మహారాజు అతనికి నాలుగు లేదా అయిదు వందల వరహాలు బహుమతిగా ఇవ్వాలి. --- బ్రాహ్మణునితో భార్య కన్నెచెర విడిపించే విధానాన్ని మహరాజు మాత్రమే పాటిస్తాడు ఇతరులు ఈ ఆచారాన్ని పాటించరు"-- —Voyages of Varthema Vol I, p. 141.  

 2. Alexander Hamilton

            ఇతను ఒక వ్యాపారి నౌకా కెప్టైన్.  1688 నుండి 1723 మధ్య ఇతడు చేసిన ప్రయాణాలు, పరిశీలనలను  New Account Of The East-indies పేరిట అక్షరబద్దం చేసాడు. 1695 లో హామిల్టన్ కాలికట్ ప్రాంతంలో ప్రయాణించాడు.  అక్కడి రాజు జమొరిన్ (Samoothiri) వివాహానంతరం తన భార్యను నంబూద్రి బ్రాహ్మణునితో మూడురోజుల పాటు నిద్రింపచేస్తాడు.  తన భార్య కన్యత్వాన్ని దేవునికి సమర్పించుకోవటం అనేది ఒక    పవిత్రమైన చర్యగా  ఆ రాజు భావించేవాడు.  ఈ పద్దతిని పాటించటానికి  కులీనులు ఇష్టపడరు. బ్రాహ్మణులకు కానుకలు ఇచ్చేంత స్తోమత  సామాన్యులకు ఉండదు- అంటూ ఆనాటి ఆచారాలను  రికార్డు చేసాడు.  (A New Account Of The East-indies  Vol.2 పే.నం. 308 by Hamilton, Alexander). 

హామిల్టన్  సామాన్య ప్రజలలో పెళ్ళి ఎలా జరుగుతుందో ఇలా వర్ణించాడు

“వధూవరులకు ఆరు ఏడు ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెద్దలు పెళ్ళిళ్ళను నిర్ణయిస్తారు.  పెండ్లికొడుకు తల్లిదండ్రులు కానుకలతో పెండ్లికూతురు ఇంటికి బంధుమిత్రులతో వెళతారు. పెండ్లి అనంతరం వధూవరులను ఊరంతా ఊరేగింపుగా తిప్పుతారు. చిన్న వయసులో పెండ్లి అయినప్పటికి కాపురానికి మాత్రం అమ్మాయికి 12 ఏళ్ళ వయసు అనంతరం మాత్రమే పంపిస్తారు.”  (A New Account Of The East-indies  Vol.1 p.n 157 by Hamilton, Alexander)

            పై రెండు ఉటంకింపులను బట్టి వివాహానంతరం భార్యను నంబూద్రి బ్రాహ్మణునితో సంగమింపచేయటం అనే తంతు రాజకుటుంబానికి మాత్రమే పరిమితమని  అర్ధమౌతుంది.

3. Buchnan

            జమురిన్ రాజవంశ స్త్రీలు నంబూద్రి బ్రాహ్మణులు లేదా పెద్ద హోదాలలో ఉండే నాయర్ లతో  మాత్రమే కలుస్తారని, వారి భర్తలతో కాపురం చేయకుండా ఆ రాజవంశ స్త్రీల యొక్క సోదరులు కాపలా కాస్తుంటారని Buchnan అనే మరో యాత్రికుడు అన్నాడు.  (A General Collection Of The Voyages And Travels  Vol. 8 పే.నం. 734 by Pinkerton, John)

4. Admiral Verhoeven

            ఇతను 1608 లో కాలికట్ ను సందర్శించాడు.  బ్రాహ్మణులు ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీల కన్యత్వాన్ని స్వీకరిస్తారు తప్ప  సామాన్య ప్రజలజోలికి వెళ్ళరు అని చెప్పాడు. (The History Of Human Marriage Vol. 1 Ed. 3rd  by Atal, Yogesh పే.నం. 171)

5. Thomas Herbert

            1626 లో భారతదేశంలో ప్రయాణించిన  Thomas Herbert – మలబార్ నాయర్ కులస్థులలో పెండ్లి కూతురు మొదటి రాత్రి బ్రాహ్మణునితో గడిపే ఆచారం కొంతకాలం క్రితం ఉండేది, కానీ నేడు ఆ ఆచారాన్ని ఎవరూ పాటించటం లేదని చెప్పాడు. (Herbert, Travels into Divers parts of Africa, and Asia the Great, P- 337 )

***

            పై వివరాలను బట్టి పెళ్ళికూతురు పురోహితునితో కన్నెరికం చేయించుకోవటమనే ఆచారం రాజవంశ స్త్రీలలో ఉన్నట్లు స్పష్టమౌతుంది తప్ప ఇతర శూద్ర కులస్థులలో ఉన్నట్లు ఆధారాలు కనిపించవు. 

6. బ్రాహ్మణుల ప్రమేయం లేకుండా జరిగే ఆచారాలు

            జమోరిన్ రాజవంశపు అమ్మాయిలు పెద్దమనిషి కాగానే, నాయర్ కులంలోని యువకులను ఆహ్వానించి వారికి కానుకలు సమర్పించి ఆ అమ్మాయితో మొదటి రాత్రి జరిపించేవారని Lopez అనే పోర్చుగీస్ వ్యాపారి తెలియచేసాడు. (The History of Human Marriage Vol I p.n172). 

         పదిహేడో శతాబ్దంలో మలబార్ రాజ్యంలో ఎవరైనా పెండ్లి చేసుకొన్న తరువాత భార్యను రాజుగారికి సమర్పించుకొని పేలస్ లో ఎనిమిది రోజుల పాటు ఉంచేవారట. తన భార్యతో రాజుగారు కూడటం గొప్ప అదృష్టంగా భావించి గడువు ముగిసాక ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళేవారట. (ibid)

            1495-1496 లలో Hieronimo Di Santo Stefano అనే ఇటాలియన్ వ్యాపారి కాలికట్ లో ప్రయాణించి ఒక ఆసక్తి కరమైన పరిశీలన రికార్డు చేసాడు. కాలికట్ లోని పురుషులు కన్యలను వివాహం చేసుకోవటానికి విముఖత చూపించేవారట.  ఒక వేళ ఒక కన్యతో వివాహ నిశ్చయం జరిగితే ఆమెను  ఇరవై రోజుల పాటు మరొక పురుషుని వద్దకు పంపి ఆమె కన్యత్వం కోల్పోయిన తరువాత మాత్రమే వివాహం చేసేవారట. ఆ అమ్మాయి తల్లి యువకులను అభ్యర్ధించి తన కూతురుకి కన్నెరికం చేయించేదట. (Account of the Journey of Hieronimo dI Santo Stefano, p.5)

               పై ఉదాహరణల ద్వారా పెండ్లికుమార్తె కన్యత్వం స్వీకరించటమనే సంప్రదాయం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం కాదని ఈ ప్రక్రియలో రాజులు, నాయిర్ పురుషులు కూడా భాగస్వామ్యమయ్యారని తెలుస్తుంది. 

7. భారతదేశం వెలుపల ఈ ఆచారం

            మధ్యయుగాల యూరప్, చైనా లలో ఫ్యూడల్ వ్యవస్థలో  తమ క్రింద పనిచేసే స్త్రీల వివాహమైన మొదటి రాత్రి భూస్వామి వారితో గడిపి వారి కన్యాత్వాన్ని గ్రహించే ఆచారం ఉండేది.  దీన్ని  droit du seigneur అని పిలిచేవారు. ఇదే కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు శోభనం  జరుపుకొనేందుకుగాను వారినుండి చర్చి కొంత రుసుము వసూలు చేసేది. (The History of Human Marriage Vol I p.n177).

            పన్నెండో శతాబ్దానికి చెందిన“The Book of Leinster” అనే ఒక పాత ఐరిష్ వ్రాతప్రతి  లో Ulster అనే రాజ్యానికి రాజు తన రాజ్యంలోని మొత్తం స్త్రీలకు వివాహమైన తొలిరాత్రి వారి కన్యాత్వాలను స్వీకరించాడని ఉంది.  ఈ పని ఏదో శారీరిక సుఖంకొరకు కాక, రాజ్య విధులలో భాగంగా చెప్పటం గమనార్హం. (ibid. పే.నం. 184)

8. ఎందుకీ ఆచారం వచ్చి ఉండవచ్చు?

            కన్యత్వం తొలగిపోయే వేళ కన్నెపొర చిరిగి రక్తం చిందటం అశుభమని, దానికి కారణమైన ఆ పురుషుని దుష్టశక్తులు పీడిస్తాయని ఒక నమ్మకం ఆనాటి ప్రజలలో ఉండేది. ఇదే భావన వేద వాజ్మయంలో కూడా ఆ రక్తం విషంతో సమానం అని చెప్పబడింది. జర్మన్స్, మొరక్కన్స్, గ్రీన్ లాండర్స్ కూడా అదేవిధంగా విశ్వసిస్తారు. (The History Of Human Marriage Vol. 1  by Atal, Yogesh p.n 190-191)  

            అందుచే  అధికమొత్తంలో ధనం, కానుకలు ఆశచూపి బాలికల కన్నెచెరవిడిపించేవారు.  రాజు, పురోహితుడు, వేరే కులానికి చెందిన యువకులు ఈ కార్యం నిర్వహించేవారు. 

            ఇలాంటి ఆచారాలు మలబార్ తీరవాసులలో ఉన్నట్లు అనేక ఉటంకింపులు కనిపిస్తాయి కానీ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా అమలులో ఉన్నట్లు సాహిత్యంలోకానీ, శాసనాలలో కానీ కనిపించక పోవటం ఆశ్చర్యకరం.  భారతదేశంలోని వివిధ కులాలు వాటి భిన్న ఆచారాలు, సంప్రదాయాలు, వేడుకలను అద్భుతంగా రికార్డు చేసిన Castes and Tribes of Southern India by Edgar Thurston;  Hindu Manners, Customs, and Ceremonies by Abbe J. A. Dubois లాంటి పుస్తకాలలో  ఇలాంటి సంప్రదాయం గురించి ప్రస్తావనలు కనిపించవు.

9. ఈస్ట్ ఇండియా కంపనీ 1819 లో చేసిన చట్టం 

            శూద్రుల వివాహసమయంలో పెండ్లికుమార్తెతో పురోహితుడు మూడు రాత్రులు గడిపే దురాచారాన్ని,  ఈస్ట్ ఇండియా కంఫనీ 1819 లో ఒక చట్టం ద్వారా నిషేదించటంతో ఈ ఆచారం నమసిపోయిందని ఈ అంశానికి సంబందించి ప్రచారంలో ఉన్న మరొక సంగతి. 

            ఈస్ట్ ఇండియా కంపనీ 1819 లో "Regulation VII of AD 1819" అనే చట్టాన్ని చేసింది.  ఈ చట్టంలో – వయసుకు రాని అమ్మాయిలను వారి తండ్రి లేదా భర్త అనుమతిలేకుండా ఎత్తుకొనిపోయి మాయమాటలు చెప్పి వ్యభిచారవృత్తిలోకి దింపే నేరాలకు విధించాల్సిన శిక్షలను; చిన్నపిల్లలను పెంచి వారిని వ్యభిచార వృత్తిలోకి దింపేవారికి విధించే శిక్షలను; భార్యాపిల్లలను పోషించకుండా సోమరిగా తిరిగే భర్తకు విధించాల్సిన శిక్షలను గురించి- ఇంకా లేబర్ చట్టాలు, ఒప్పందాలు చేసుకొని వాటిని ఉల్లంఘించినందుకు విధించాల్సిన శిక్షలను గురించి చర్చించింది (REGULAR CASES, VOL. 8 – p.no. 364, 375, Notes on Indian Affairs Vol 2 p.no. 407).

            సమాజంలో లైంగిక నేరాలను అరికట్టటానికి, ఒప్పందాల ఉల్లంఘనలు నివారించటానికి, వెట్టిచాకిరీ నియంత్రణ కొరకు చేసిన  చట్టమిది. అంతే తప్ప ఈ చట్టంలో ప్రత్యేకించి శూద్రుల వివాహసమయంలో పెండ్లికుమార్తెతో పురోహితుడు మూడు రాత్రులు గడిపే దురాచారాన్ని నిర్మూలించటానికి ఈ శాసనాన్ని  తెస్తున్నట్లు ఏ ప్రస్తావనా లేదు.  

10. ముగింపు

            శూద్రవివాహాలలో పెళ్ళికూతురు మొదటి మూడు రాత్రులు పురోహితునితో గడపాలి అనే ఆచారం అనేది మలబార్ తీర ప్రాంత రాజవంశ స్త్రీలలో ఉండేదని, శూద్ర స్త్రీలలో లేదని వివిధ విదేశీ యాత్రికుల కథనాల ద్వారా తెలుస్తుంది.  అంతే కాక ఆనాటి ప్రజలకు స్త్రీ కన్యత్వం పట్ల అపోహలు ఉండేవని, కన్య అయిన స్త్రీ ని వివాహం చేసుకోవటం అరిష్టమని భావించేవారని కొన్ని ఉటంకింపులు కనిపిస్తాయి. ఈ అంశం నలుపు తెలుపుల్లో కాక భిన్న పొరలలో దర్శనమిస్తుంది.

            ప్రచారంలో ఉన్నట్లు ఈ దురాచారాన్ని రూపుమాపటానికి ప్రత్యేకంగా  1819 లో ఒక చట్టాన్ని చేసారనటం కూడా సత్యదూరంగానే అనిపిస్తుంది. సమాజంలోని అనైతిక ప్రవర్తనలను నిరోధించటానికి జనరల్ గా చేసిన చట్టం అది. 

            శూద్ర పెళ్ళికూతురు పురోహితునితో మూడు రాత్రులు గడపటం అనే ఒక హిస్టారికల్ నెరేటివ్ లో శూద్రులు లేరని, ఆ మూడు రాత్రులు గడిపింది బ్రాహ్మణులు మాత్రమే కాదని, ఈ ఆచారం ఆసేతు హిమాచలం విస్తరించిన సంప్రదాయం కాదని అర్ధం చేసుకోవాలి. 

            ఆ సత్యదూర కథనం ప్రజలలో ఎంత లోతుకు చొచ్చుకొని పోయిందంటే ఒక సమకాలీన పెండ్లి తంతులో తండ్రి కూతుర్ల మధ్య sexual abuse ని atribute చేసేంతగా మన మనసుల్ని కలుషితం చేసింది. నిజానికి ఇలా మాట్లాడటం ద్వారా పూర్వీక శూద్ర స్త్రీలను అవమానిస్తున్నామన్న స్పృహకూడా  లేకపోవటం శోచనీయం.

.

బొల్లోజు బాబా

Wednesday, April 27, 2022

Dunya Mikhail నీడ ఇంకా అక్కడే ఉంది



Dunya Mikhail నీడ ఇంకా అక్కడే ఉంది
.
కవిత్వం మందు కాదు. అది ఒక ఎక్స్ రే. గాయం ఎక్కడుందో చెప్పి దాన్ని అర్ధం చేసుకోవటానికి సహాయపడుతుంది - Dunya Mikhail
.
Dunya Mikhail ఇరాకి-అమెరికన్ కవయిత్రి. ఈమె 1965 లో బాగ్ధాద్ లో జన్మించింది. కొంతకాలం బాగ్దాద్ అబ్జర్వర్ అనే పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేసింది. ఇరాక్ యుద్ధ సమయంలో చెలరేగిన నియంతృత్వ పోకడల వల్ల దున్యా ప్రాణాలు అరచేతపెట్టుకొని అమెరికాకు వలసవెళ్ళి, అక్కడ ఉన్నతచదువులు కొనసాగించింది. ఈమె మొదటి పుస్తకం The War Works Hard (2005). The Iraqi Nights (2014) కవిత్వ సంకలనం ఈమెకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుతెచ్చిపెట్టింది.
దున్యా కవిత్వంలో యుద్ధం, వలస, విస్మృతి, జీవన భీభత్సం లాంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. యుద్ధ ఫలితంగా ప్రజలు కట్టుబట్టలతో వలసపోవటం వలన కలిగే క్షోభను ఈమె కవిత్వం శక్తివంతంగా వ్యక్తీకరిస్తుంది.
సంక్షిప్తరూపంలో వెలువరించే కవితలకు ఈమె Tablets అనే పేరు పెట్టారు. ఇవి రెండు నుంచి ఆరేడు లైన్ల వరకూ ఉండే మిని కవితల లాంటివి.
ఈ టేబ్లెట్స్ ను అరబిక్ నుంచి Kareem James Abu-Zeid ఇంగ్లీషులోకి అనువదించారు.
.
Tablets - Dunya Mikhail
నా హృదయం చాలా చిన్నది
అందుకే
తొందరగా నిండిపోతుంది
***
నీరు నీరుతో కలవటానికి
ఖాళీ ప్రదేశాలను నింపటానికి
యుద్ధాలు అవసరం లేదు
***
అతను టివి చూస్తున్నాడు
ఆమె ఒక నవల చదువుతూన్నది
ఆ నవల కవర్ పేజిపై
ఒక అతను టివి చూస్తున్నాడు
ఒక ఆమె నవల చదువుతూన్నది.
***
కొత్తసంవత్సరపు మొదటి రోజున
మనం అందరం
పాత సూర్యుడినే చూస్తాం
***
ఈ పిట్టను పట్టించుకోకు
అది ప్రతిరోజు వచ్చి
ఆ కొమ్మచివర కూర్చొని
ఒక గంటో రెండుగంటలో
పాటలు పాడి వెళిపోతుంది
అంతే… అంతకు మించేమీ లేదు
అది ఎవరికీ సంతోషం కాదు
***
ఇంటి తాళాలు
ఐడెంటిటీ కార్డులు
రంగువెలసిన ఫొటోలు
ఇవన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి
సామూహిక ఖననం జరిగిన చోటులో
***
అరబిక్ భాషకు
సుదీర్ఘ వాక్యాలు
పొడవైన యుద్ధాలు ఇష్టం.
ఎడతెగని పాటలు
అర్ధరాత్రి కబుర్లు
శిథిలాలను చూస్తూ
రోదించటం ఇష్టం.
అరబిక్ భాష
కష్టపడటాన్ని ఇష్టపడుతుంది
చిరకాల జీవితం కొరకు
చిరకాల మరణం కొరకు
***
సరిహద్దులను మేం మేఘాల్లా దాటేస్తాం
మమ్మల్నెవరూ మోసుకొని వెళ్ళరు
మేమే
ఇంకో దేశపు
వానను
ఒక భాషను
ఒక జ్ఞాపకాన్ని
మోసుకొని వెళతాం
***
కలలు రెండు రకాలు
నిలువు, అడ్డం
నీ కల ఆకారం చెప్పు
నువ్వెక్కడనుంచి వచ్చావో నేను చెబుతాను.
***
నీ కెమేరా
ఆ తల్లి పిచ్చుక కళ్ళల్లోని
భయాన్ని బంధించగలదా?
ఆమె కళ్ళల్లో
పగిలిన గుడ్లు కనబడుతున్నాయా?
***
ఆమె నీడ
ఇంకా అక్కడే ఉంది
పక్షులకు గింజలు మేపుతో
***
ఆమె మరణించింది
ఆమెను గాఢంగా ప్రేమించే వారి
కాలం నిలిచిపోయింది
ఆమె వాచ్ మాత్రం తిరుగుతూనే ఉంది
***
పిల్లలందరూ కవులే
లేని సీతాకోకచిలుకలను
వెంబడించటం మానేసేంత వరకూ
***
సూర్యుడు లేనపుడు
పువ్వు కాంతిని కోల్పోతుంది
ఆ లేకపోవటం సుదీర్ఘమైతే
పువ్వు లోనికి చూసుకొంటుంది
మరో కాంతి కోసం
***
అతని ఆలోచన వారికి నచ్చలేదు
నుదిటిపై తుపాకి పెట్టి కాల్చి చంపేసారు
ఆ బుల్లెట్ రంద్రంలోంచి
అతని ఆలోచన ప్రపంచాన్ని చేరి
తీగమొక్కలా విచ్చుకొంటుంది
***
ఆమె రాత్రిని అడిగింది
“నువ్వెందుకు చీకటిగా ఉన్నావు?”
రాత్రి బదులిచ్చింది
“నక్షత్రాల కాంతి నిన్ను చేరటానికై”
***
జీవితం
రెక్కనుండి బలవంతంగా పెరకిన ఈక లా
అందంగా బాధాకరంగా ఉంటుంది
.
మూలం: Dunya Mikhail
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Friday, April 22, 2022

పక్షి దాహం


.
మద్యాహ్నం వేడి గాలుపు
చెట్టునీడలో కూర్చొని నేను
కొమ్మపై కాకి ఒకటి వాలింది
బొంగురుపోయిన గొంతుతో
అరుస్తోంది... దాహం కాబోలు
గోలెం అంచుపై వాలి నీళ్ళకోసం చూసింది
కుళాయి టాప్ రంద్రాన్ని నీటికోసం తడిమింది

పక్షి నాలుకని తడుపలేనందుకు
నా కనులు చెమర్చాయి
చూస్తుండగానే
ఆ కాకి మనిషిరూపం ధరించి
మొఖాన్ని చేతుల్లోకి తీసుకొని
నా కన్నీళ్ళు తుడిచింది
తేరుకొనేలోపే అదృశ్యమైంది.

పిట్టగోడపై గుచ్చిన గాజుపెంకులపై
ఎండ తళతళా మెరుస్తోంది
చెట్టుపైనుండి ఎప్పటిదో
పాత పక్షిగూడొకటి గాలికి నేల కూలింది
గాలినిండా ఉత్త పొడిపొడి ఉక్కపోత

బొల్లోజు బాబా

Wednesday, April 13, 2022

రాజేంద్ర చోళుడు- గజని మహమ్మద్- సోమనాథ్-బ్రిటిష్ వారు


.
1. ఉత్తరభారత దేశంపై జరిగిన రెండు ముఖ్యమైన దాడులు
.
ఉత్తరభారతదేశం పదకొండవ శతాబ్దప్రారంభంలో రెండు పెద్ద ముట్టడులను ఎదుర్కొంది. దక్షిణభారతదేశంలో తంజావూరును రాజధానిగా చేసుకొని పాలిస్తున్న మొదటి రాజేంద్ర చోళుడు (1014-1044) సా.శ. 1022 లో తూర్పుతీరంవెంబడి 1600 కిమీ ప్రయాణించి తూర్పు ఉత్తర భారతదేశపు కళింగ, పాల, సామ్రాజ్యాలను జయించాడు. బెంగాల్లోని మహిపాల ఆలయం నుండి ఈశ్వరుని కంచు విగ్రహం, ఒరిస్సా నుంచి భైరవ, భైరవి, కాళి విగ్రహాలను, యుద్ధంలో కొల్లకొట్టి తన రాజ్యానికి తరలించుకొని పోయాడు.
రాజేంద్రచోళుడు వెనుదిరిగి వచ్చేటపుడు గంగానదీ జలాలను సైనికులచే పాత్రలతో మోయించి తమిళనాడుకు తీసుకొచ్చాడు. ఒక చోట నుయ్యి తవ్వించి దానిని ఈ జలాలతో నింపి, అక్కడ గంగైకొండచోళపురం (గంగను తెచ్చిన చోళుని పురం) అనే ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. ఇది 250 సంవత్సరాలపాటు చోళ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండింది.
రాజేంద్రచోళుని విధ్వంసం జరిగిన రెండేళ్ళకే, సా.శ. 1025 లో మధ్య ఆసియానుండి సుల్తాన్ మహమ్మద్ గజని (997-1030) ముప్పైవేలమంది సైన్యంతో ఉత్తరభారతదేశాన్ని పశ్చిమం వైపునుంచి దాడి చేసాడు. 1025 డిశంబరులో గుజరాత్ తీరంపై అప్పటికి వందేళ్లుగా పూజలందుకొంటూన్న సోమనాథ్ ఆలయంపై దాడిచేసి సంపదలను దోచుకొని, శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు అప్పటి సమకాలీన పర్షియన్ స్కాలరైన Al-Biruni రాతల ద్వారా తెలుస్తుంది.
సోమనాథ్ ఎందుకంత ప్రముఖమైనదంటే – అదొక గొప్ప ఓడరేవు. భారతదేశం నుండి చైనాకు, ఆఫ్రికాకు సముద్రమార్గంలో వెళ్ళటానికి అక్కడనుంచి ఓడలు బయలుదేరేవి. వ్యాపారులు, దళారులు, ధనపుమూటలతో కిక్కిరిసిపోతూ ఉండే ఓడరేవది.
1025 లో సోమనాథ ఆలయం నుంచి గజని ఎత్తుకెళ్ళిన ధనం సుమారు 2 కోట్ల దీనార్లు గా ఒక అంచనా. 1029 లో ఇదే గజనీ మహమ్మద్ రాయ్ (Rayy in Persia) అనే చోట ఒక పెర్షియన్ మసీదును కొల్లగొట్టగా కొంచెం తక్కువగా అంతే సొమ్ము దక్కించుకొనటాన్ని బట్టి, ఇతనికి సంపదల పట్ల దృష్టే తప్ప మతపరమైన వివక్ష ఉన్నట్లు కనిపించదు.
2. సోమనాథ ఆలయవిధ్వంసం గురించి స్థానిక కథనాలు
.
పెర్షియన్ రాతలలో సోమనాథ్ ఆలయ విధ్వంసం గురించి చేసిన రసవత్తర వర్ణనలు లాంటివి ఆనాటి సమకాలీన హిందూ శాసనాలలో కానీ జైన రాతలలో కానీ పెద్దగా కనిపించవు.
గోవాని పాలిస్తున్న కదంబ రాజు 1038 లో తాను చేసిన పుణ్యక్షేత్ర సందర్శనా యాత్రలో భాగంగా సోమనాథ ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేసినట్లు చెప్పటాన్ని బట్టి 1025 లో గజనిమహమ్మద్ సోమనాథ ఆలయాన్ని నేలమట్టం చేసి ఉండకపోవచ్చునని భావించాలి.
1169 నాటి ఒక సోమనాథ ఆలయ శాసనంలో సోమనాథ ఆలయ జీర్ణోద్ధరణ జరిపినట్లు ఉంది తప్ప గజని మహమ్మద్ దాడుల ప్రస్తావన లేదు. ఇదే సంవత్సరం నాటి మరో శాసనంలో సోమనాథ ఆలయానికి భవ బృహస్పతి అనే ప్రధాన అర్చకుని నియమించినట్లు ఉంది.
1216 లో ఆలయంపై స్థానిక మాల్వా రాజుల దాడులు నేపథ్యంలో చుట్టూ రాతినిర్మాణాలతో బలోపేతం చేయటం గురించి ఒక శాసనం ఉన్నది.
సోమనాథ ఆలయ ధ్వంసం గురించి -గజని మహమ్మద్ సమకాలీన కవి అయిన ధనపాలుడు Satyapuriya Mahavira Utsaha అనే జైన రచనలో మహమ్మద్ గజని సోమనాథ ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేయగలిగాడు కానీ సత్యపురం లో ఉన్న జైన ఆలయంలోని జైన విగ్రహాన్ని ఏమీ చెయ్యలేకపోయాడు అంటూ పరోక్షంగా సోమనాథ ఆలయ విధ్వంసాన్ని ప్రస్తావించాడు. అదేవిధంగా మరో జైన రచయిత జినప్రభసూరి- గజని మహమ్మదు మహావీరుని విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించగా అతని ఏనుగులు, గుర్రాలు దాన్ని కొద్దిగా కూడా పెకిలించలేకపోయాయని కూడా గొప్పగా చెబుతాడు. దీనిని బట్టి గజని హిందూ ఆలయాలనే కాక జైన ఆలయాలను కూడా ధ్వంసం చేసాడని భావించాలి.
ఆలయంలో దాచిన సొమ్ములకొరకు వాటిపై దాడులు సహజం. హిందూ రాజులు కూడా ఆలయాలను దోచుకొన్నట్లు చరిత్రలో అనేక సంఘటనలు కనిపిస్తాయి. సోమనాథ ఆలయం మినహాయింపు కాకపోవచ్చు. చరిత్రలో సోమనాథ ఆలయం అనేక సార్లు విధ్వంసానికి గురయింది. అన్నిసందర్భాలలోను వెంటవెంటనే పునర్నిమించుకొన్నట్లు కూడా ఆధారాలు కనిపిస్తాయి.
3. హిందూ ముస్లిమ్ ల సామరస్యత?
.
నిజానికి పన్నెండో శతాబ్దం వరకూ హిందువులు ముస్లిములు అనే విభజన లేదు. సంస్కృత శాసనాలలో ముస్లిములను మ్లేచ్ఛ, చండాల, యవన, పారశీక లాంటి మత ప్రమేయం లేని పదాలతో సంబోధించేవారు. ఒకవేళ రాజులుగా అంగీకరించవలసి వచ్చినప్పుడు మ్లేచ్ఛాధిపతి (barbarian king) అని పిలిచేవారు. (చాతుర్వర్ణ వ్యవస్థను పాటించని దేశాన్ని మ్లేచ్ఛదేశంగాను దానికి వెలుపల ఉన్నప్రాంతాన్ని ఆర్యావర్తమని ఏడవ శతాబ్దపు వైష్ణవ ధర్మశాస్త్రం నిర్వచించింది)
కాలచక్ర తంత్ర లాంటి బౌద్ధ గ్రంధాలలో ఇస్లామ్ గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మ్లేచ్ఛధర్మ అని చెప్పబడింది. 1190 నాటి జయానక కవి విరచిత పృథ్విరాజ విజయ కావ్యంలో ముస్లిములను మాతంగ, చండాల, అసుర, రాక్షస, పిశాచ, అధమ, పాపి, మ్లేచ్ఛ, తురుష్క లాంటి పదాలతో పిలవటం గమనించవచ్చు. ఇవేమీ మతపరమైన పేర్లు కావు. తురుష్క పదం మినహా మిగిలినవి తక్కువ స్థాయికి చెందిన వారని సంబోధించటానికి అప్పట్లో వాడే పదాలు.
కాలక్రమేణా ముస్లిమ్ రాజులు వివిధ యుద్ధాలలో విజయం సాధించి సుల్తానులుగా తమని తాము ప్రతిష్టించుకొన్నాక సంస్కృత శాసనాలలో వారు హమ్మీర (అమీరు), సురత్రాణ (సుల్తాను) లాంటి సాంస్క్రిటైజ్ చేయబడిన పేర్లతో పేర్కొనబడ్డారు. ఇవే పేర్లను హమ్మీర చౌహాన్, హమ్మీర వర్మన్ అంటూ కొందరు హిందూ రాజులు కూడా అనుకరించటం గమనార్హం.
శాసనాలలో హిందూ అన్నపదం 1347 లో విజయనగర రాజు మారెప్ప తనని తాను “హిందురాయ సురతాల” గా (హిందూరాజులలో సుల్తాను) చెప్పుకొన్నప్పుడు మొదటి సారిగా కనిపిస్తుంది. కొన్నాళ్ళకు ఈ పదం హిందూరాయ సురత్రాణ గా స్థిరపడింది.
1550-1600ల మధ్య కంచి వరదరాజ ఆలయంలో విజయనగర రాజులు కట్టించిన ఒక మండప స్తంభ శిల్పాలలో గుర్రంస్వారీ చేసే వ్యక్తి, ఒకవైపు ముస్లిం సైనకుడుగా(గడ్డం, ఫాంటుతో) మరొక వైపు హిందూ సైనికుడిగా (పంచె, మీసకట్టు లేకుండా) ఉంటాడు. ఇది బహుసా ఆ కాలపు హిందూ ముస్లింల సామరస్యత/అబేధంగా తీసుకోవచ్చు.
సాహిత్యంలో, శాసనాలలో ముస్లిం వ్యతిరేకత పెద్దగా కనిపించదు. దక్షిణభారత కుతుబ్ షాయి పాలనలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా వెలువరించేవారు. ఈ సమయంలోనే తెలుగులోకి అనేక ఉర్దూపదాలు వచ్చి చేరాయి. ఒరిస్సారాజులకు గజపతులని, విజయనగర రాజులను నరపతులని, గోల్కొండ రాజులను అశ్వపతులని సమానహోదాతో హిందూ ముస్లిము రాజులు వ్యవహరించుకొన్నారు.
4. హిందూ ముస్లిమ్ విభజన ఎప్పటిది?
గజని మహమ్మద్ చేసిన దండయాత్రను హిందూమతంపై చేసిన దాడిగా అభివర్ణించటం 1840ల నుంచి మొదలైంది. 1842 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీ ఆఫ్గనిస్తాన్ పై చేసిన దండయాత్రలో 16 వేలమంది సైనికులను కోల్పోయింది. తనసైన్యంలో ఉండే హిందూ సైనికులలో ఉత్సాహం నింపటానికి కొంతమంది బ్రిటిష్ సైన్యాధికారులు- గజని మహమ్మద్ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని సింహద్వార తలుపులను ఆఫ్ఘనిస్తాన్ ఎత్తుకుపొయాడు; వాటిని కనుగొని సోమనాథ ఆలయానికి చేర్చటం మన బాధ్యత అంటూ ఒక కట్టు కథ అల్లారు. అలా అప్పుడు అల్లిన కట్టుకథ కారణంగా ముస్లిమ్ దండయాత్రలు హిందూమతాన్ని నాశనం చేసే ఉద్దేశంతో జరిగాయనే అపోహ భారతీయులలో బలంగా నాటుకొంది.
ఆ తరువాత సోమనాథ ఆలయ తలుపులు అంటూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చిన తలుపులు నిజమైనవి కాదని, అవి అప్పటికి నూరేళ్ళక్రితం, ఆఫ్ఘనిస్తాన్ లో లభించే స్థానిక చెక్కలతో చేసినవని రుజువవ్వటంలో ఈస్ట్ ఇండియా కంపనీ అధికారుల బండారం బయటపడింది. (ఇవి ఇప్పుడు ఆగ్రా ఫోర్ట్ లో ఉన్నాయి) కానీ వారి విభజించి పాలించే విధానం హిందు-ముస్లిమ్ విభజనకు బీజప్రాయమయి ఉండవచ్చునన్న ఊహను కొట్టిపడేయలేం.
***
ముగింపు
గజని మహమ్మద్, రాజేంద్ర చోళుడు దాదాపు ఒకే కాలంలో చేసిన దండయాత్రలలో ఇరువురి సేనలు సుమారు 1600 కిమీ ప్రయాణించి, కొన్ని ఉత్తరభారత రాజ్యాలను జయించి, దోచుకొని, అక్కడి ఆలయాలను ధ్వంసం చేసి కొన్ని విగ్రహాలను, సంపదలను తమ ప్రాంతాలకు ఎత్తుకుపోవటంలాంటి సారూప్యతలను కలిగి ఉండటం ఆసక్తి కలిగించే ఒక చారిత్రిక విశేషం.
.
బొల్లోజు బాబా
.
.
ఉపయుక్త గ్రంథాలు
1. The Language of History, Sanskrit Narratives of Muslim Pasts -Audrey Truschke
2. India in Persianate age1000–1765- Richard M. Eaton
3. Somanatha The Many Voices of a History -Romila Thapar
4. Wikipedia






Saturday, April 9, 2022

forewords of my books on History

 

ఇంతవరకూ నేను కవిత్వంపై ఐదు పుస్తకాలు, చరిత్రపై నాలుగు పుస్తకాలు వెలువరించాను.

1954 లో యానాంలో ఫ్రెంచివారినుండి విమోచనం చెందటానికి యానాం ప్రజలు జరిపిన ఉద్యమం గురించి, "యానాం విమోచనోద్యమం" ;
1720 నుంచి 1957 మధ్య యానాం లో జరిగిన ఫ్రెంచిపాలన గురించి "ఫ్రెంచిపాలనలో యానాం";
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాలిన్ మెకంజీ సేకరించిన కైఫియ్యతులపై వ్రాసిన "మెకంజీ కైఫియ్యతులు-తూర్పుగోదావరి";
తాజాగా తూర్పుగోదావరిలో చారిత్రిక ప్రాధాన్యతగలిగిన ప్రదేశాలగురించి "ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" పుస్తకము
ఈ పుస్తకాలకు నేను రాసుకొన్న ముందుమాటలు అన్నీ ఒకచోట ఉంచాలనే ప్రయత్నమే ఈ పిడిఎఫ్.
ఈ ముందుమాటలని విడిగాచదువుకొన్నా బాగానే ఉన్నట్లు అనిపించాయి.
I believe they give you a good reading experience.... thank you
భవదీయుడు
బొల్లోజు బాబా
5/5/2022


https://archive.org/details/forewords_202204

Tuesday, April 5, 2022

దుఃఖ సమయం...

 దుఃఖ సమయం...

.
చిన్నిపాప ఏడుస్తోంది
మాజిక్ చెయ్యనా అన్నాను
ఏడుపు ఆపి ఆసక్తిగా నావైపు చూసింది
రూపాయి నాణెం ఒకటి తీసుకొని
అరచేతిలో ఉంచుకొని గుప్పెట మూసి
రెండో చేతిని ఆ గుప్పెట చుట్టూ ఆడిస్తూ
విచ్చుకొన్న పాప కళ్ళలోకి చూస్తూ
"అబ్రకదబ్రా" అని మూడుసార్లు అని
గుప్పెట తెరిచాను
నాణెం మాయమైనందుకు
పాప ఏడుపు మాని
తప్పట్లు కొడుతూ గంతులు వేసింది
ఒక్కసారిగా పాప పరుగెత్తుకొంటూ వెళ్ళి
దూరంగా ఉన్న వాళ్ళ నాన్న చేతిలోని
సెల్ ఫోన్ ను తీసుకొచ్చి
నా చేతిలో ఉంచి గుప్పిట మూసి ఊపుతూ
నా కళ్ళలోకి చూస్తూ
"అబ్బకదబ్బరా ...... అబ్బకదబ్బరా" అంటోంది
.
బొల్లోజు బాబా

Saturday, April 2, 2022

A poem by Saadi Youssef

 A poem by Saadi Youssef

.
పాతబట్టల షాపులోకి
ఒక అమ్మాయి వచ్చింది
బక్కగా ఉంది
అక్కడ వేలాడదీసిన ఒక చొక్కా
గాలికి విచ్చుకొంది
ఆ అమ్మాయి కళ్ళు కూడా విచ్చుకొన్నాయి
తన ప్రియుని చొక్కాను తేరిపార చూస్తూ
ఆ అమ్మాయి కళ్ళు విచ్చుకొన్నాయి
అతని ఎరుపు నలుపు చొక్కాను
ఇంకా
దాని ఊడిపోయిన బొత్తాలను
ఆ అమ్మాయి అలా చూస్తూనే ఉండిపోయింది.
An arabic poem by Saadi Youssef
అనువాదం: బొల్లోజు బాబా