Sunday, December 31, 2017

చీకటి దిష్టిబొమ్మ


జీవితకాలం శ్రమించి
చిత్రించుకొన్న చిత్తరువులో
కరిగి ప్రవహించే గడియారం
కనుల చివర నిలిచిన అశ్రుబిందువు
వేదనో నవ్వో తెలియని పెదవుల రహస్యలిపి
తుప్పుపట్టిన కిటికీ చువ్వలు
అయిందేదో అయిపోయింది
ఎండిన పూజాపత్రిని ఏట్లో కలిపినట్లు
నిన్ను బాధించిన క్షణాలను మరచిపో.
పట్టుబడిన ఎలుకలను ఊరవతల విడిచినట్లు
నిన్ను బాధించిన వ్యక్తులను మరచిపో.
మాయబుట్టని పొలిమేర చెట్టుకు కట్టినట్లు
నువ్వు బాధించిన సందర్భాలను మరచిపో.
గతాన్నొక గాలిపటం చేసి ఎగరేసి
దాని దారం తెంపేయ్
వెలుతురును అడ్డుకొంటున్న
చీకటి దిష్టిబొమ్మను దహనం చేసేయ్
కొబ్బరి పాకుడు లాంటి మెత్తని గిట్టలతో లేగదూడ
మొదటిసారిగా ఎలా నిలబడుతోందో చూడు
పాదం బరువుకు ఒరిగిన పచ్చిక మెల్లమెల్లగా
ఎలా నిటారుగా తలెత్తుకొంటుందో చూడు
బొల్లోజు బాబా

Thursday, December 21, 2017

పతంగుల రుతువు - 'Kite Season' by Eunice de Souza


చెట్లకు తోరణాల్లా వేలాడుతున్నాయి
రంగురంగుల పతంగులు
చెట్లకు తోరణాల్లా వేలాడుతున్నాయి
పక్షులు
గాజురజను పూసిన దారానికి
రెక్కో కాలో చిక్కుకొని
source: "Kites Season" by Eunice de souza
అనువాదం: బొల్లోజు బాబా

Tuesday, December 5, 2017

ఫ్రాగ్మెంట్స్


1.
కొత్తవిలువలతో
వ్యామోహాలతో
ఆక్రమింపబడిన కాలమిది
దేహాలలో పాల బదులు
ఇనుప గుప్పెళ్ళతో పూలను పిండి
వండిన అత్తరు ప్రవహిస్తోంది
2.
నీవు వెళ్ళిపోయాకా
ఈ దేహం నిర్జీవ నెమలీకలా ఉంది
నడివేసవిలో వడగాలిలా ఒంటరిగా
వీధులలో సంచరిస్తోంది
3.
ఎంతో స్వచ్చంగా బోసి నవ్వులతో
ఇక్కడికి వస్తాం
మురికి మురికిగా మారి
ఏడుస్తూ నిష్క్రమిస్తాం
4.
కాలం అప్పుడప్పుడూ కాసేపాగి
తన సెల్ఫీ తానే తీసుకొంటోంది
ఒక్కో ఫొటో
రక్తమూ కన్నీళ్ళు నింపుకొన్న
కవిత్వమై చరిత్రలోకి ఇంకిపోతోంది
5.
ఓ రాజకీయనాయకుడు
రెండువేళ్ళూ పైకెత్తి గాల్లో
అటూ ఇటూ ఊపుతున్నాడు
ఎవరి విజయమో తెలియని
వెర్రిజనం కూడా ఊపుతున్నారు
బొల్లోజు బాబా

Monday, December 4, 2017

మిత్రులకు ఆహ్వానం
అవకాశం ఉన్న మిత్రులు తప్పక హాజరు అవుతారని ఆశిస్తున్నాను
భవదీయుడు
బొల్లోజు బాబా

Friday, December 1, 2017

A B C D లు


A ఫర్ ఆపిల్ కి
మైనం కోటింగ్ తో
ఊపిరాట్టం లేదు
B ఫర్ బాల్
ఒత్తిడి భరించలేక
లేని గ్రౌండ్ లో ఉరేసుకొంది
C ఫర్ కాట్
బాగ్ పైపర్ వాయించుకొంటూ
గుహ వైపు వెళుతోంది
D ఫర్ డాల్
వాణిజ్య ప్రకటనలకు
తైతెక్కలాడుతోంది
బొల్లోజు బాబా

Monday, November 27, 2017

నన్ను క్షమించవూ......

నన్ను క్షమించవూ......

సంతలో నెమలీకలు అమ్ముతోన్న
ఒక వ్యక్తిని చూసాను

అలా అమ్మటం చట్టరీత్యా నేరమని
అతనితో చెప్పాలనుకొన్నాను

"చిరుగులు పడ్డ మాసిన దుస్తులు
కపాలానికి చర్మం తొడిగినట్లున్న మొఖం
తాడుకి వేలాడుతోన్న పగిలిన కళ్లజోడు
చెప్పులుకూడా లేని కాళ్లతో"
అతని రూపం చూసాకా
చెప్పబుద్ది కాలేదు.

అవసరం లేకపోయినా
ఓ నాలుగు నెమలీకలు కొనుక్కొని
మౌనంగా వచ్చేసాను

నెమలీ నెమలీ
నన్ను క్షమిస్తావు కదూ!

బొల్లోజు బాబా

Friday, November 24, 2017

మోహం


ఆమె నీడ
నగ్నంగా మారి
నన్ను కౌగిలించుకొంది
బిరుతెక్కిన కుచాగ్రాలు
గుచ్చుకొంటున్నాయి
వృత్తిధర్మం ఎరిగిన
వేశ్యలా
నన్ను నేను విప్పుకొని
అర్పించుకొన్నాను
ఖాళీ గవ్వలోని ఇసకలా
కాఫిన్ బాక్స్ లోని దేహంలా
ఆమె నీడలో ఒదిగిపోయి
కొత్తలోకాలకు ప్రయాణం కట్టాను.
బొల్లోజు బాబా

Thursday, November 9, 2017

లోకం


చక్కగా పరిగెడుతున్నాడు
అందరూ చప్పట్లు కొడుతున్నారు
ఎవరో దారిపై
నూనె కుమ్మరించారు
జారి పడ్డాడు
లేచి నిలబడి
అందరకూ నమస్కరించి
వెనుతిరిగాడతను
ఓటమి అతనిది కాదు
బొల్లోజు బాబా

Tuesday, November 7, 2017

మతం


తనతో విభేధించిన
వారిని కూడా దేవుడు
కంటికి రెప్పలా చూసుకొని
రక్షణ కల్పిస్తాడు కదా!
మరి ఆయన భక్తులేమిటి
ఇలా కాల్చి చంపుతున్నారు?
వీళ్ళ చేష్టలకు సిగ్గుపడి
దేవుడు నాస్తిక మతం పుచ్చుకొన్నా
ఆశ్చర్యపడక్కర లేదు.
బొల్లోజు బాబా

Friday, November 3, 2017

ఫ్రాగ్మెంట్స్



1.
ఆకాశం
తన పెదాలకు
ఏడురంగుల లిప్ స్టిక్
కొట్టుకొంది
2.
ఒంపులన్నీ
సరిగ్గా ఉన్నాయో లేదొ
ఆఖరుసారి అద్దంలో చూసుకొని
బయటకు అడుగుపెట్టింది
నెలవంక
3.
యానాం ఎలా వెళ్లాలి
కాకినాడ మీదుగానా రాజమండ్రి మీంచా?
కవిత్వ సంధ్యను ఎలా చేరుకొన్నా
ఆ సౌందర్యం లోంచి
బయటకు రాలేరు.
4.
ఫెళఫెళార్భాటాలతో
విరిగిముక్కలయింది
ఇంద్రధనుసు
నీవు మౌనం దాల్చటంతో
5.
విద్య మద్యం
ఇక్కడ MRP ధరలకే
అమ్మబడును.
ఉరేసుకోవటానికి "పెర్మిట్ రూమ్"
సదుపాయం కూడా కలదు
బొల్లోజు బాబా

Wednesday, November 1, 2017

అదేహ ప్రేయసి


నీ జ్ఞాపకాలు నిండిన రాత్రివేళ
నిర్నిద్ర దేహం
అస్వప్న జలాలలో పయనించే
గూటి పడవ అవుతుంది.
నీ రూపం, నీ నవ్వు, నీ వీడ్కోలు
నా మూసుకొన్న కనురెప్పల వెనుక
అద్దం ముందు పిచ్చుకలా
రెక్కలు ఆడిస్తూ, పొడుస్తూ,
మిథ్యా ప్రియునితో రమిస్తున్నాయి
బయటకి వెళ్ళిపోండి అని
చెప్పాలనుకొంటాను వాటితో
ఈ భారాన్ని నేను మోయలేను
అని అరవాలనుకొంటాను.
నీ చుంబనంలో బంధీ అయిన
నా పెదవులు తెరుచుకోవు.
నా గొంతులో కూడా
నువ్వే చిక్కుకొని ఉన్నావు.
బొల్లోజు బాబా

Monday, October 30, 2017

ప్రకటన


అమ్మాయి పేరు తేజోమహలట
సంబంధాలు చూస్తున్నారు
పెద్ద అందగత్తె ఏంకాదు
ఒంటినిండా కురుపులు, రోమాలు
మెల్లకన్నూ ఎత్తుపళ్ళు వంకర కాళ్ళూ
ఏ పనీ రాదుట
సోమరి వంకరబుద్దీ అంటారు
జుట్టువిరబోసుకొని దెబ్బలాటలకు దిగటం
స్నేహితుల మధ్య నిప్పులు పొయ్యటం
అడ్డగోలుగా వాదించి గెలవటం హాబీలట
వచ్చే ఎన్నికల్లోగా
ఆమెను ఎలాగైనా ఒకింటిదాన్ని చేయాలట
కట్నకానుకలు భారీగానే ఇచ్చేలా ఉన్నారు
ఏమైనా సంబంధాలుంటే చెప్పండి.

బొల్లోజు బాబా

Friday, October 27, 2017

మూడు అనుభవాలు

మూడు అనుభవాలు ఒక చెవిటివానికి కోయిల పాట ఎలాఉంటుందో వినాలనిపించింది. ఓ కవిమిత్రుణ్ణి అడిగాడు గులాబిపూవులా ఉంటుందన్నాడు. ఒక అందమైన గులాబీని చెవి వద్ద ఉంచుకొన్నాడు మెత్తని పరిమళ స్వరం గులాబి ముళ్ళు చెవితమ్మెల్ని గాయపరిచాయి చేతికి రక్తం వెచ్చగా తగిలింది అనామక కాకి రక్తం ***** ఒక అంధునికి ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనిపించింది సాగరంలా ఉంటుందన్నాడో మిత్రుడు వెంటనే సముద్రంలో దూకేసాడతను గవ్వలు, రాళ్ళు గుచ్చుకొని గాయాలయ్యాయి లోతుల్లోకి కూరుకుపోతూంటే ఒక సముద్రగుర్రం తన వీపుపై ఎక్కించుకొని ఒడ్డున దీబెట్టింది ప్రేమంటే అర్ధమైందతనికి ***** ఒక మూగవానికి దేవుడు కనిపిస్తే ఏం మాట్లాడాలన్న సందేహం వచ్చింది చిమ్మెట శబ్దాలలో నీకు సమాధానం లభిస్తుందన్నారెవరో చిమ్మెటలు కిక్కిరిసిన తోటలో ఎన్నోరాత్రులు ఓపికతో ఒంటరిగా ఎదురుచూసాడతను ఓ వేకువ జామున అతను దేవునితో సంభాషించాడు. బొల్లోజు బాబా

Sunday, August 20, 2017

సృజన

అంతకు ముందు ఏవి లేవో వాటిని కొందరు గొప్ప కాంక్షతో, దయతో అన్వేషించి అక్షరాల్లో మరోప్రపంచాల్ని శిలల్లో భంగిమల్ని రంగుల్లో ప్రవహించే దృశ్యాల్ని ఆవిష్కరిస్తూంటారు వాటిని కొందరు గొప్ప విభ్రమతో, లాలసతో అలా చూస్తూనే ఉండిపోతారు ఏనాటికీ బొల్లోజు బాబా

Friday, July 7, 2017

వలసపక్షుల గానం


ఓ రద్దీట్రాఫిక్ లో
రెండు చీమలు కలుసుకొని
కాసేపు ముద్దులాడుకొని
విడిపోయినట్లుగా మనమూ
కలుసుకొని విడిపోతూంటాం.
ఉద్యోగమో, వివాహమో, అనంతశయనమో
ఏదైనా కానీ
కలయికను లోపలనుంచి తొలిచి
వియోగ శిల్పాన్ని సృష్టించే అద్భుత శిల్పులు.
ఎప్పుడు కలుసుకొన్నామో
సమయాలు సందర్భాలు ఉంటాయికానీ
ఎప్పుడు ఒకరి హృదయంలో ఒకరు
మనుష్యులమై మొలకెత్తామో
తారీఖులు దస్తావేజులు ఉండవు
ఎందుకు కలుసుకొన్నామో
కారణాలు అవసరాలు తెలుస్తుంటాయి
ఎందుకు ఒకరి దూరం
దిగంతాలవరకూ పరుచుకొనే విషాదం
అవుతుందో ఎన్నటికీ తెలియదు
నదిలో కొట్టుకు పోతున్న దుంగపై
కాసేపు వాలి
పేరు, ప్రవర చెప్పుకొనే వలసపక్షులు
చేసే గానమిది.
బొల్లోజు బాబా

Time has come......


కొలతలుగానో మమతలుగానో
చూడబడే ఆమె
నెలకో మూడురోజులు 
ఓ రక్తగర్భ అనీ
రక్తాశ్రువులు చిందించే
ఓ గాయగర్భ కూడా అని
మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది.
ఋతుమతి, పుష్పవతి
ఏకవస్త్ర, త్రిరాత్ర అంటూ
సౌందర్యాత్మక భాషలో కప్పెట్టిన
కొన్ని దైహిక ధర్మాల పట్ల
అసున్నితత్వం పొందాల్సిన సమయం వచ్చింది
ఇన్ సెనిరేటర్ లోకి విసిరిన
నాప్కిన్ తో పాటు
కొన్ని బిడియాల్ని, సంకోచాల్ని
వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది
ఆమెక్కూడా!
.
బొల్లోజు బాబా

Tuesday, June 20, 2017

“ఆకు కదలని చోట” - కదలాడే కవిత్వపు జాడ


కవులు సత్యాన్వేషులు. కవిత్వం సత్యాన్నావిష్కరించే సాధనం. కవులు ఆవిష్కరించే సత్యాలు వారి మనోలోకంలో పుట్టినవి కావొచ్చు లేదా సామాజిక పరిశీలనలో బయటపడినవి కావొచ్చు. “ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలి నీడలు కలవు” అన్న వాక్యంలో –ఆ కవి ఊహలో ఒక సౌందర్యరాశి నల్లని కన్నులుకు వినీలాకాశానికి సామ్యం కనిపించింది. అది ఒక సత్యావిష్కరణ. ఇలాంటి కవిత్వం చదువరి హృదయానికి హాయినిచ్చి, సంస్కారాన్ని, మార్ధవతను కలిగిస్తుంది. “ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం” అన్న వాక్యం ద్వారా, ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కవికి కొన్ని సత్యాలను ఎరుకపరచినట్లు అర్ధమౌతుంది. ఇలాంటి కవిత్వం పాఠకునికి సమాజంపట్ల బాధ్యతను గుర్తుచేసి, సామాజిక మార్పు కోసం అతన్ని కార్యోన్ముఖుడని చేస్తుంది.

ఈ రెండు రకాల కవిత్వాలలో ఒకటి గొప్పది మరొకటి తక్కువది అనుకోవటం పొరపాటు. దేని విలువ దానిదే. సమాజానికి రెండిటి అవసరమూ ఉంది. ఒకటి వైయక్తిక మార్పుకు దోహదపడితే మరొకటి సామాజిక మార్పుకు దారితీస్తుంది.మెజారిటీ కవులు, నలుపు తెలుపుల్లా ఈ రెండువిభాగాల మధ్య రాసులుపోసినట్లు విస్తరించి ఉండటం సాధారణంగా గమనిస్తాం.

రెండు పంథాల మంచి చెడ్డలు ఆకళింపు చేసుకొని కవిత్వం వెలువరించే బహుకొద్ది మంది కవులలో బాల సుధాకర్ మౌళి ఒకరు.

“ఆకు కదలని చోట” సుధాకర్ మౌళి రెండవ కవిత్వసంపుటి. చిక్కని కవిత్వం, గొప్ప ఊహాశాలితతో కూడిన భావ సంచయము, జీవించిన ప్రతీ క్షణాన్ని కవిత్వీకరించాలి అనే తపనా, సమాజం పట్ల బాధ్యత, ఆశావహ దృక్ఫధం వంటివి స్థూలంగా మౌళి కవిత్వ లక్షణాలు.

వచనం ఆలోచనాత్మకం, కవిత్వంలో ఉద్వేగం ఉంటుంది. ఈ ఉద్వేగం హృదయాన్ని కదిలించగలుగుతుంది. చదువరిని భావావేశానికి గురిచేస్తుంది. మంచి ఉద్వేగాలు పండించగలిగిన కవి ఫస్ట్ క్లాస్ కవిగా నిలుస్తాడు. మౌళి కవిత్వంలో ఈ మౌలిక లక్షణం పరిపక్వ స్థితిలో కనిపిస్తుంది.

“కవులేం చేసారు – మొండి చేతులతో గోడలపై నినాదాలు వ్రాసారు” అంటారు శివారెడ్డి. ఈ వాక్యంలో – కలంపట్టుకొన్న చేతులు మొండివెందుకయ్యాయి? కవి చేతులను రాజ్యం నరికేసిందా? అయినప్పటికీ కవి తన మార్గాన్ని వీడలేదా? గోడలపై ఆ నినాదాలు ఏం చెపుతున్నాయి? వంటి అనేక ప్రశ్నలు ఉదయించి చదువరిని ఉద్వేగభరితం చేస్తాయి. రాజ్యం చూపే అన్యాయాల పట్ల కోపం కలుగుతుంది. అదీ కవిత్వ గొప్పతనం.

కవిత్వ మాధ్యమం శక్తి తెలిసిన వాడు మౌళి. అనేక కవితలలో ఉద్వేగాలు చాలా బలంగా పలికాయి.
****
“ఆకు కదలని చోట” సంపుటిలో ప్రధానంగా ఆకర్షించే అంశం మౌళి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కవిత్వంలోకి లీనం చేసిన విధానం. ఈ సంపుటిలోని మొత్తం 63 కవితలలో 5 అనువాదకవితలు తీసేయగా మిగిలిన 57 కవితలలో 27 కవితలు ఏదో సందర్భాన్నో, వ్యక్తులనో తలచుకొంటూ వ్రాసినవి కావటం గమనార్హం. వీటిలో శివారెడ్డి, గంటేడి, అరుణ్ సాగర్, అక్బర్ వంటి వారిపై ఆరాధనతో వ్రాసుకొన్నవి కొన్ని, వృత్తిరీత్యా ఉపాద్యాయుడు కావటం వల్ల, విజయ, జీవన్, కుమారి వంటి ప్రతిభకలిగిన విద్యార్ధులపై, ఇంకా డ్రాయింగ్ టీఛర్ దుర్గ, వీరశంకర్ వంటి సహాద్యాయులపై వ్రాసినవి మరికొన్ని, ఇవికాక బాక్సైట్ తవ్వకాలు, ముస్లిమ్ రచయితపై దాడి, కల్బుర్గి, సొనిసోరి, అయిలాన్ పిలగాడు, వేట నిషేదం వంటి వివిధ సందర్భాలకు రాసినవి ఉన్నాయి.

సాధారణంగా కవులు తమ కవిత్వాన్ని స్వీయానుభవంగా ప్రకటిస్తారు. కొన్ని వాక్యాలకు ఎవరెవరు కారణమయ్యారో వారిని ఏ ప్రస్తావన లేకుండా అనామకంగా ఉంచటం జరుగుతుంది. ఇది తప్పేమీ కాదు. తన కవితకు ప్రేరణ ఇచ్చినవారి గురించి చెప్పాల్సిన బాధ్యత కవికి లేదు. చాలా కాలం క్రితం వజీర్ రెహ్మాన్ “సత్తు చిత్తు” అనే కవిత్వసంపుటిలో తద్భిన్నంగా వ్యవహరించాడు. పుస్తకం చివరలో ఒక్కో కవితకు ఇచ్చిన ఫుట్ నోట్సులో ఆ కవితకు ప్రేరణ అయిన వ్యక్తుల్ని, చదివిన వాక్యాల్ని చక్కగా విపులంగా ప్రస్తావించుకొన్నాడు. ఈ వివరణలు ఆయా కవితల్ని మరింత అర్ధం చేసుకోవాటానికి దోహదపడతాయి.

నిజానికి అలా ఒక కవిత వ్రాయటానికి కలిగిన ప్రేరణలను ప్రస్తావించిన కవితలలోనే కవి వ్యక్తిత్వం బయట పడుతుంది. పైన చెప్పిన 27 కవితలలో మౌళి ఎలాంటి మానవునిగా తననుతాను కవిత్వంలో ఆవిష్కరించుకోవాలనుకొంటున్నాడో తెలుస్తుంది. మానవ జీవితాన్ని మౌళి ఏ కోణంలోంచి చూస్తున్నాడు, ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు, ఏఏ విలువలకు కట్టుబడి ఉన్నాడు, తాను పీల్చుకొన్న సారాన్ని ఎలా కవిత్వీకరిస్తున్నాడు లాంటి వివిధ అంశాలు పై కవితలలో దొరుకుతాయి. మౌళి కవిత్వంలో ఏది సామాజికము, ఏది వైయక్తికము అని విడదీయలేం. తన చుట్టూ ఉన్న సమాజాన్ని కవి తన కవిత్వంలో ప్రతిబింబించటమే సామాజికత
 ****

సామాజిక చైతన్యంతో వ్రాసే కవిత్వం సాధారణంగా వస్తుప్రధానంగా సాగుతుంది. శిల్పాన్ని కూడా అంతే సాంద్రతతో నింపే వారిలో శివసాగర్ సమున్నత స్థానంలో ఉంటారు. “సాహిత్యానికి సాహిత్య లక్షణాన్ని ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదు” అన్న బాలగోపాల్ మాటలను మౌళి బహుసా హృదయగతం చేసుకొన్నాడేమో - అందుకనే ఇతని కవిత్వంలో పదచిత్రాలు, ప్రతీకలు, ధ్వని, శైలి, అభివ్యక్తి, సౌందర్యాత్మకత వంటివి "వస్తువును" కవిత్వమయం చేస్తాయి. ఈ విషయం ఈ సంపుటిలోని అనేక కవితలలో స్పష్టంగా తెలుస్తుంది. బతికుండటం, ఆట, పలమనేరు కవిత:మట్టి, నిర్భందపు గోడల్ని, ఆకుకదలని చోట లాంటి కవితలు ఒక్క సుధాకర్ మౌళి మాత్రమే రాయగలిగే కవితలు అన్నంత గొప్పగా ఉంటాయి. ఏం నేత్రాలవి, రాత్రి అనే కవితలు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా తోస్తాయి. చేపలు ప్రత్యుత్పత్తి చేసుకొనే కాలంలో “వేటనిషేదం” చర్య శాస్త్రీయంగా సరైనదే. దాన్ని “సముద్రం వుండదు/పడవ వుండదు/ఎవరో కన్నీళ్ళనోడుస్తూ/ గుమ్మంలోంచి కదలిపోతుంటారు” అంటూ కవిత్వీకరించటం టెక్నికల్ గా కరక్ట్ కాదు.
 ****

“ఇప్పటివరకు మేధావులందరు ఈ ప్రపంచాన్ని నిర్వచించారు. ఇప్పుడు మన బాధ్యత ఈ ప్రపంచాన్ని మార్చటం” అంటాడు మార్క్స్. ఏనాటికీ కాలదోషం పట్టని వాక్యమది. ప్రతీ తరంలోను యధాతథ స్థితిని బద్దలుకొట్టాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మార్గాలు అన్వేషింపబడుతూనే ఉంటాయి. అదొక ప్రవాహ సదృశ వెతుకులాట.

మౌళిలో కూడా ఇలాంటి అన్వేషణ కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోందన్న అంతఃశోధన తెలుస్తుంటుంది. జవాబులు వెతుక్కుంటాడు, నిరసిస్తాడు, తిరగబడతాడు, ప్రేమిస్తాడు, సమాధాన పడతాడు. ఇన్నిరకాలుగా తనలోకి ఇంకిన సమాజాన్ని ఫిల్టర్ చేసి రిఫైన్డ్ రూపంలో కవిత్వీకరిస్తాడు. అది మనల్ని ఆలోచింపచేస్తుంది, ఉద్వేగ పరుస్తుంది, వెంటాడుతుంది చాలాకాలం. గొప్పకవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు అవే కదా!

బాల సుధాకర్ మౌళి ఫోన్: 9676493680

------ బొల్లోజు బాబా

Friday, June 9, 2017

కుట్రలు


చిన్నప్పుడు
మా ఇంట్లో పాడి ఉండేది
కనుమ రోజున మా అమ్మ
ఆవుకు పసుపు, కుంకుమ పూసి
గిట్టలకు బంతిపూల దండలు కట్టి
చుట్టూ ప్రదక్షిణ చేసి, హారతి ఇచ్చి
భక్తిశ్రద్ధలతో పూజ చేసేది
బతిమాలో బామాలో ఉద్దరిణిడు
గోమూత్రం రాబట్టి తలపై చల్లుకొనేది
అదే ఆవు
ఒంటిపూట పడి క్రమంగా ఒట్టిపోతే
కబేళా బేరగాడితో గీసి గీసి బేరమాడి అమ్మేసి
మరో ఆవును తెచ్చుకొనేది.
***
ఇపుడీ దేశానికి ఏమైంది
ఎవరిని వధశాలకు పంపటానికి
ఇన్ని కుట్రలు పన్నుతోంది?
బొల్లోజు బాబా

Wednesday, June 7, 2017

కవిత్వంలో పెర్సొనిఫికేషన్ (Personification)


మానవలక్షణాలను వస్తువులకో, జంతువులకో లేక ఒక ఊహకో ఆరోపించి కవిత్వం చెప్పే పద్దతిని పెర్సొనిఫికేషన్ అంటారు.
కవిత్వం రాసే పద్దతులలో ఇది ఒక ముఖ్యమైన టెక్నిక్. దీనివల్ల ఒక విషయం పాఠకుని మనస్సులో లోతుగా నాటుకొంటుంది. మెటానొమీ లేదా సింబల్ లాంటి టెక్నిక్ లతో పోల్చినపుడు పెర్సొనిఫికేషన్ చాలా సరళంగా ఉంటూ, పాఠకుడిని శ్రమపెట్టకుండానే కవిత్వానుభూతి కలిగిస్తుంది.
పెర్సొనిఫికేషన్ టెక్నిక్ దైనందిన సంభాషణలలో, కథలలో, వార్తాకథనాలలో కనిపిస్తూనే ఉంటుంది. “ఈ బండి పెట్రోలు పొదుపు చేస్తుంది” అంటాం. “సూర్యుడు నడినెత్తిన నిప్పులు చెరుగుతున్నాడు” అంటూ ఓ కథ మొదలవ్వొచ్చు. “ఆ పథకం అందరిజీవితాలలో వెలుగులు నింపింది” అన్న ఓ వార్తాంశం కావొచ్చు. అన్నీ పెర్సొనిఫికేషన్ కు చక్కని ఉదాహరణలే.
కవిత్వంలో పెర్సొనిఫికేషన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే – పెర్సొనిఫికేషన్ ద్వారా పాఠకుని మనసులో ఒక బలమైన దృశ్యరూపం ఏర్పడుతుంది. కవితలోని మూడ్ లేదా కవిత చెప్పదలచుకొన్న అంశం ఈ టెక్నిక్ వల్ల మరింత స్పష్టంగా అర్ధమౌతుంది. కవిత్వనిర్మాణ పద్దతులలో చాలా సులువుగా అందుబాటులో ఉండే ప్రక్రియ ఇది.
నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు. --- ఇస్మాయిల్
ఇస్మాయిల్ గారి కవిత్వంలో పెర్సొనిఫికేషన్ ప్రక్రియతో నిర్మించిన అనేక అద్భుతమైన ఇమెజెస్ కనిపిస్తాయి. పై ఉదాహరణలో ఒక రాలిన ఆకుకు మానవలక్షణాలైన పక్క పరచుకొని, దుప్పటి కప్పుకొని పడుకోవటం అనే క్రియలను ఆరోపణ చేసి చిన్నచిన్న మాటలతో చక్కని సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు ఇస్మాయిల్.
వర్షధారలనే పగ్గాలతో
నేలను పైకి లాక్కొందామనే
మబ్బుల ఆలోచన ఫలించకపోవటంతో
అవి ఎలా మూలుగుతున్నాయో చూడు
ఉరుముల శబ్దాలతో. – 436 (గాథాసప్తశతి)
రెండువేల ఏళ్ళక్రితం నాటి ఈ సప్తశతి గాథలో ఒక అందమైన ఊహ పెర్సొనిఫికేషన్ వల్ల మరింత అందంగా, సజీవంగా మారి, ఆ దృశ్యం మదిలో హృద్యంగా రూపుకడుతుంది. ఉరుములనేవి విఫలయత్నం చేసి అలసిపోయిన మబ్బుల మూలుగులు అనటం గొప్ప ఊహ. పెర్సొనిఫికేషన్ ను పరాకాష్టకు తీసుకెళ్ళిన పదచిత్రంగా దీన్ని భావించవచ్చు.
ఓయ్ పిల్లవాడా బయటకు వెళ్లకు.
చెరువు పక్కనున్న తాటి వరుసలు
తమ తలల్ని నింగిపై బాదుకొంటున్నాయి,
తూరుపు రేవులో పెంజీకట్లు సంచరిస్తున్నాయి. (ద రైనీ డే క్రిసెంట్ మూన్ – రవీంద్రనాథ్ టాగోర్)
తుఫాను వచ్చేలా ఉంది, బయట సంచరించవద్దు అంటూ ఒక తల్లి తన పిల్లవానికి చేసిన హెచ్చరికలో - తాటిచెట్లు తలల్ని నింగికి బాదుకోవటం, పెంజీకట్లు సంచరించటం వంటి పెర్సొనిఫికేషన్ వర్ణణల వల్ల ఒక భయానక వాతావరణం/మూడ్ అలవోకగా నిర్మింపబడింది పై వాక్యాలలో.
ఎవరూ నన్ను వినట్లేదని
దూరంగా ఓ పక్షి రోదిస్తూ ఎగిరిపోయింది
రక్తమోడుతున్న వీధులు
 ముడుచుకున్న భవనాలపై
తన రోదన వస్త్రంలా కప్పబడిందని
అది చూడలేక పోయింది (అలా వదిలేయండి – మెర్సి మార్గరెట్)
పై కవితలో పెర్సొనిఫికేషన్ టెక్నిక్ చాలా బలంగా వ్యక్తమయింది. మానవలక్షణాలైన రోదనను పక్షికి, రక్తమోడ్చటం వీధులకు, ముడుచుకుపోవటం భవనాలకు ప్రతిభావంతంగా ఆపాదించటంతో, ఆ వాక్యాలు శక్తివంతమైన కవిత్వంగా మారాయి. ప్రతి వర్ణణా చిక్కని స్పష్ట చిత్రంగా మనసుకి తెలుస్తుంది.
అలలగొంతుతో
నది పాడుతుంటుంది
ఏ సుదూరాన్నుంచో పక్షులు నదిపాట విని
కచేరి ముందు వీక్షకులు చేరినట్టు
నది వొడ్డున చేరుకుంటాయి (నదిపాట – బాల సుధాకర్ మౌళి)
నది పాడటం, ఆ పాటను విని పక్షులు నదివొడ్డుకు చేరటం పెర్సొనిఫికేషన్ క్రిందకు వస్తుంది. ఇక్కడ ఉత్త పెర్సొనిఫికేషన్ చేయటంలో మాత్రమే కాక దానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని సృష్టించటంలో కవి పరిణతి కనిపిస్తుంది. నది అలలగొంతుతో పాడటం, కచేరిముందు వీక్షకులుగా పక్షులు చేరటం వంటి వివరణలతో కవిత స్థాయి అనూహ్య ఎత్తులకు చేరింది. ఇలాంటి కవిత్వనిర్మాణంలోనే కవి ప్రతిభ స్ఫుటితమౌతుంది.
మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి.
తెల్లవార్లూ వానకురుస్తానే ఉంది.
నల్లని మంచుగడ్డకరిగిపోయింది.
ప్రశాంతతరువుల్లోకి ప్రాత:కాలం
తడితడిగా ప్రవేసించింది.
వందగుమ్మాలతో వెదురు పొద
స్వాగతం పలికింది. (ఆకుపచ్చని తడిగీతం)
చుంబనం, ప్రవేశించటం, స్వాగతం పలకటం వంటి లక్షణాలను ప్రకృతికి ఆపాదించటం ద్వారా అందమైన ఇమేజెరీ ఆవిష్కృతమైంది. వెదురుపొదలో నిలువుగా సమాంతరంగా ఉండే వెదురుమొక్కలను గుమ్మాలుగా వర్ణించటం చక్కని ఊహాశాలిత.
పెర్సొనిఫికేషన్ అనేది కవిత్వనిర్మాణంలో ఒక ప్రాధమిక స్థాయి టెక్నిక్. దీనిద్వారా సూటిగా, స్పష్టంగా కవితావస్తువును ఆవిష్కరించవచ్చు. పెర్సొనిఫికేషన్ టెక్నిక్ ఇతర నిర్మాణ పద్దతులతో ఒక భాగంగా ఉంటూ వ్రాసిన కవితలు మరింత శక్తివంతంగా ఉంటాయి.
బొల్లోజు బాబా

Friday, June 2, 2017

కవిత్వంలో ఇమేజెరీ


కవిత్వంలో ఇమేజ్ అంటే పదాలతో నిర్మించిన ఒక చిత్రం. ఆ పదాలను చదువుకొన్నప్పుడు మనసులో ఒక దృశ్యం ఊహకు వస్తుంది.
“వెన్నెల
మబ్బుల మెట్లమీదుగా
నేలకు దిగే సమయాన" (మేఘనా - శిఖామణి)
అనే వాక్యంలో రాత్రి చిక్కబడుతూండగా వెన్నెల మెల్లమెల్లగా బయటపడుతున్న ఒక దృశ్యం ఆవిష్కృతమౌతుంది. ఇక్కడ కవి ఒక ఆహ్లాదకరమైన సందర్భాన్ని సౌందర్యాత్మకంగా కవిత్వీకరించాడు.
ఒక ఆలోచననో, దృశ్యాన్నో, ఉద్వేగాన్నో చెప్పేటపుడు ఒకటికంటే ఎక్కువ ఇమేజెస్ అవసరపడొచ్చు. అనేక ఇమేజెస్ కలిసి ఒక భావాన్ని వ్యక్తీకరించినపుడు ఆ ఇమేజ్ ల సముదాయాన్ని ఇమేజెరీ అంటారు. ఒక కవితలో అనేక ఇమేజెరీలు ఉండొచ్చు.
మన అనుభూతులనన్నీ ఇంద్రియాల ద్వారానే మనం పొందుతాం. వానవెలసిన సాయింకాలం పూట - మబ్బుల మధ్యతొంగిచూస్తోన్న నీలాకాశం, చెంపలకు తాకే చల్లని గాలి, ముక్కుపుటాలను ఆగాగి తాకే చిత్తడి వాసనా, పక్షులు తమ తడిచిన రెక్కలను తపతపలాడిస్తూ చేసే శబ్దాలు, గొంతులోకి జారే వేడివేడి చాయ్ రుచీ - అన్నీ హాయైన అనుభూతులను కలిగిస్తాయి. వాటిని మనసు సంశ్లేషించి ఆ ఆహ్లాదకర అనుభవాన్ని, ఒక అందమైన జ్ఞాపకంగా మలచుకొంటుంది. కవిత్వంలో ఇమేజెరీ కూడా ఇదే పని చేస్తుంది. ఇంద్రియానుభవం ఇవ్వటం ద్వారా రససిద్ధి కలిగిస్తుంది.
వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకొని
గరగరలాడుతోంది - (దాహం) ఇస్మాయిల్
పై ఖండికలో దాహమనే ఇంద్రియానుభవాన్ని అనేక ఇమేజెస్ ద్వారా చెపుతున్నాడు కవి . వివిధ మూర్త చిత్రాలను వరుసగా పేర్చుకొంటూ వెళ్లాడు. ఆ ఆరులైన్లు చదివేసరికి పాఠకునికి ఏదో ఎడారిలో మైళ్ళ దూరం నడిచి, దాహంతో గొంతు పిడచకట్టుకుపోయిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే దాహం అనే అమూర్త భావనను- ఎడారి, ఖర్జూరచెట్టు, ముళ్ళగరగర వంటి మూర్తచిత్రాలు నేరుగా అనుభవంలోకి తీసుకొస్తాయి. ఇది ఇమేజెరీ గొప్పదనం.
కవిత్వాన్ని అబ్ స్ట్రాక్ట్ నుంచి కాంక్రిట్ కు నడిపించటంలో ఇమేజెరీ అతిముఖ్యమైన పాత్రవహిస్తుంది. ఇలా భావాలను దృశ్యరూపంలో చెప్పే పద్దతిని ఇమేజిజం అంటారు.
*****
ఇమేజెరీ కవిత్వం అంటే చెట్టు పుట్టా కవిత్వమనే భావన కొంతమందిలో ఉంది. సామాజిక, రాజకీయ, కవిత్వాల శక్తివంతమైన నిర్మాణంలో కనిపించే ఇమేజెరీకి కొన్ని ఉదాహరణలు
1.
“గుండెల్లో
మెత్తగా దిగబడే
కాగితపు కత్తి
కరెన్సీ నోటు”
అలిశెట్టి ప్రభాకర్ ఈ ఇరవై అక్షరాల కవిత మానవసంబంధాలన్నీ ఆర్ధికసంబంధాలే అన్న మార్క్స్ మాటను గుర్తుకుతెస్తుంది. డబ్బునోట్లో తలపెట్టి ఇరుక్కుపోయిన మానవజాతి పరిణామక్రియను ప్రతిబింబిస్తుంది. గుండెలోకి ఆ అక్షరాలు పదునుగా దిగిన చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. కవిత్వంలో ఇమేజెరీ స్థానం ఎంతగొప్పదో చూపుతుందీ కవిత.
2.
వాడెవడో మూర్ఖుడు
తల లేని మనిషి మొండేల్ని కుక్కినట్లు
లారీల్లో చెట్టు దుంగల్ని వేసుకెళ్తున్నాడు (అరణ్యకృష్ణ).
పచ్చని చెట్లను కొట్టేసి దుంగల్ని తరలిస్తున్న దృశ్యాన్ని తలలేని మొండాలను తీసుకెళ్ళటంలా పోల్చటం ద్వారా మన భవిష్యత్తు పట్ల భయాన్ని కలిగిస్తాడు కవి. రేపు నీ పరిస్థితి కూడా ఇదే నన్న హెచ్చరిక చేస్తాడు.. ఒక బీభత్సాన్ని కళ్ళముందు నిలుపుతాయా వాక్యాలు. ఇదంతా ఒక్క “తలలేని మనిషి మొండెం” అన్న ఇమేజ్ ద్వారా సాధ్యపడింది.
3.
కవిత్వం ఆర్భాటం కాదు
అది నగ్నంగా పడుకున్న
ఓ అపురూప సౌందర్యవతి దేహంతో
పసి పిల్లాడిలా.. పడుచు కుర్రాడిలా
ఏక కాలంలో ఆడుకునే
ఒకానొక అదృశ్య రసానంద రహస్యాత్మ (రసానందం - ప్రసాదమూర్తి).
కవిత్వం సూర్యుడిలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దర్శనమిస్తుంది. ప్రసాదమూర్తి చిత్రించిన కవిత్వచిత్రం గాఢంగా ఉంటూ చదివినపుడు ఒక్కొక్కరికి ఒక్కోరకపు ఇంద్రియానుభవాల్ని ఎరుకకు తెస్తుంది.
4.
అయ్యో
పాలింకి పోవడానికున్నట్లు
మనసింకిపోవడానికి
మాత్రలుంటే ఎంత బావుండు (అబార్షన్ స్టేట్ మెంట్ - పాటిబండ్ల రజని).
స్త్రీల Reproductive rights పట్ల స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడకపూర్వమే వ్రాసిన గొప్ప కవిత ఇది. అబార్షన్ తరువాత lactationను నిలుపుచేయటానికి మందులున్నట్లే, తన నిస్సహాయ స్థితివల్ల గాయపడిన మనసు సాంత్వన పొందటానికి మాత్రలు లేవు అన్న ఇమేజెరీ, స్త్రీవాద కోణంలో అత్యంత బలమైన అభివ్యక్తి.
5.
ఏ రోడ్డు మీదో నా చిన్నప్పటి గురువులు కనిపిస్తే
గద్దను చూసిన కోడిపిల్లలా
నా బొటనవేలు గుప్పిట్లో దాక్కుంటుంది (ఆత్మకథ - ఎండ్లూరి సుధాకర్ ).
ఈ ఇమేజెరీలో దళితచరిత్ర అంతా ఒదిగిపోయింది. ద్రోణుడు, ఏకలవ్యుడు జ్ఞప్తికి రాకమానరు. వేదాలు విన్నందుకు చెవుల్లో సీసం పోసిన చరిత్రశకలాలు కన్పిస్తాయి. సాహిత్యంలో దళిత అస్థిత్వానికి ఒక స్థానం కోసం చేసిన ఉద్యమంలో చరిత్రనిరాకరించే ప్రక్రియలో భాగం ఈ కవిత.
6.
నేను పుట్టకముందే
దేశద్రోహుల జాబితాలో
నమోదై ఉంది నాపేరు (పుట్టుమచ్చ ఖాదర్ మొహిద్దిన్)
పై వాక్యాలు తెలుగుసాహిత్యాన్ని ఉలిక్కిపడేలా చేసాయి. ‘పుట్టకముందే’ అన్న పదంవల్ల గొప్ప లోతు, పదును వచ్చి తెలుగుసాహిత్యంలో ముస్లింవాదం ఒక బిగ్ బాంగ్ తో ప్రవేశించటానికి దోహదపడింది.
ఇమేజెరీ ద్వారా కవి శక్తివంతమైన కవిత్వాన్ని సృష్టించగలడు. బలమైన ఇమేజరీ అనేది కవి ప్రతిభ, వ్యుత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. ఇమేజెరీలో ఇమేజెస్ లాజికల్ ఆర్డర్ లో లేకపోతే గందరగోళానికి దారితీసే ప్రమాదం ఉంది. ఉత్తమ కవిత్వానికి ఇమేజెరీ గీటురాయి.
బొల్లోజు బాబా

Wednesday, May 31, 2017

ఒక దుఃఖానికి కొంచెం ముందు...

ఈరోజు వివిధ లో నా కవిత. ఎడిటర్ గారికి, మంచి చిత్రాన్ని ఇచ్చినందుకు అక్బర్ అన్నకు ధన్యవాదములు.
బొల్లోజుబాబా


Sunday, May 28, 2017

కవిత్వంలో ఇమేజ్, మెటఫర్, సింబల్ లు


ఇమేజ్
ఒక చక్కని వర్ణన మాత్రమే.   ఇక వేరే అర్ధాలేమీ ఉండవు

1. కిటికీలోంచి చూస్తే
వెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలా
ఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు --  ఇస్మాయిల్

2. నిన్నరాత్రి ఎక్కడెక్కడికో
తప్పిపోయిన
నీడల్ని లాక్కొచ్చి
భవనాలకు, చెట్లకు
మనుష్యులకూ అతికిస్తున్నాడు
సూర్యుడు
తన కిరణాల దారాలతో!

మొదటి ఉదాహరణలో ఒక రైలు రాత్రిపూట ఎలా కనిపిస్తుందో చేసిన వర్ణన ఉంది.  ఆ ఇమేజ్ సౌందర్యమే కవిత్వం.  అంతకు మించి ప్రయోజనాన్ని కానీ వేరే అర్ధాన్ని కానీ ఆ వాక్యంనుంచి పొందలేము.  ఆ ఇమేజ్ ను సృష్టించటంలోనే కవి ప్రతిభ దాగి ఉంటుంది.
రెండవ ఉదాహరణకూడా అంతే ఆ దృశ్యం ఎంతవరకూ చూపగలదో అంతవరకూ మాత్రమే మనం చూడగలం.

మెటఫర్
చెప్పిన విషయం కాక మరో అర్ధాన్ని కలిగిఉండటం.
1. తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య)  -- ఇస్మాయిల్

2. ఈ రోజుకూడా సూర్యుడు బహుసా
ఆకాశపుటటెండెన్స్ రిజిష్టరులో
రెండు సంతకాలూ చేసేసి వెళిపోయుంటాడు.

మొదటి ఉదాహరణలో ఆ పిల్ల ప్రపంచపు ముల్లుని పీకి పారేయటం అన్న క్రియ కాదిక్కడ ప్రధానం.  ఆ చేష్ట ద్వారా కవి చెప్పదలచుకొన్నది ఆ అమ్మాయి ఆత్మహత్యచేసుకొంది అని అన్యాపదేశంగా చెప్పటం.  ఇక్కడ ఆత్మహత్యకు ప్రపంచపు ముల్లుని పీకిపారేయటం అనే క్రియ మెటాఫర్ గా మారింది.
రెండో ఉదాహరణలో ఆ రోజు యధావిధిగా సూర్యుడు ఉదయించి అస్తమించాడు అన్న విషయాన్ని చెప్పటం జరిగింది.


సింబల్
చెప్పిన విషయంతో పాటు మరో అర్ధాన్ని కలిగి ఉండటం.

1. సూర్యుని కోల్పోయినందుకు కన్నీరు రాల్చుకొంటే
నక్షత్రాలను కూడా చేజార్చుకోవలసి వస్తుంది.  -- టాగూర్

2.సంజె వేళ
దీపాలు వెలిగించారు
ఎవరి దీపాలు వారివి. -- ఇస్మాయిల్

మొదటి ఉదాహరణలో చెప్పిన విషయంతో పాటు - జీవితంలో ఎదురుదెబ్బతగిలినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఉన్న ఆనందాలను కూడా అనుభవించలేవు అనే ఒక జీవితపాఠం కూడా సింబాలిక్ గా  తెలుస్తుంది.

రెండవ ఉదాహరణలో కూడా ఎవరి దీపాలు వారివి అనటంలో  విశ్వప్రేమను చూపించేది సూర్యుడే నని చెప్పటం/జీవనయానంలో ఎవరి వెలుగులు వారివి అని సూచించటం.

బొల్లోజు బాబా

Wednesday, April 26, 2017

ఫ్రాగ్మెంట్స్

ఫ్రాగ్మెంట్స్

1.
అస్థిత్వం అనేది
గోనె సంచిలో తీసుకెళ్ళి
ఊరిచివర విడిచినా
తోకతిప్పుకుంటూ వచ్చి చేరే
పిల్లిపిల్లలాంటిది.

2.
ఏకాంత సాయింత్రాలతో
జీవితం నిండిపోయింది
నిరీక్షణ దీపస్థంభంలా
దారిచూపుతోంది.

3.
చెంచాలు గజమాలను
మోసుకెళుతున్నారు.
ఏ జన్మలో చేసుకొన్న పాపమో అని
పూవులు దుఃఖపడుతున్నాయి.

4.
ఒక్కో విప్లవంలోంచి
ఒక్కో నియంత పుట్టుకొచ్చినట్లు
ఒక్కో విత్తనం లోంచి
ఒక్కో ఉరికొయ్య మొలకెత్తుతోంది.

5.
చచ్చిపోయిన సీతాకోకను
బ్రతికించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన
ఆ పిలగాడికి
అది ఎందుకు బ్రతకటం లేదో
ప్యూపానుంచి సీతాకోక రావటం
చూసాకనే అర్ధమైంది

బొల్లోజు బాబా

Sunday, April 23, 2017

జీవించటమే.......


ఓ రోజు హఠాత్తుగా ఒకదారి తన గమ్యాన్ని మరచిపోయింది. చాలా బెంగ పట్టుకొంది దానికి, గమ్యం లేని జీవితమేమిటని. తన గమ్యాన్ని వెతుక్కొంటూ ప్రయాణం కట్టిందా దారి. కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతోంది.
పిట్టల్ని పెంచే కులవృత్తిని కోల్పోయి ఏదో ఫాక్టరీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఓ ముసలి చెట్టును అడిగింది "నా గమ్యాన్ని ఎక్కడైనా చూసావా" అని. "తూర్పువైపున బోల్డన్ని గమ్యాలుంటాయని మా పూర్వీకులు చెప్పేవారు ఆ వైపు ప్రయత్నించు" అంది ఆ చెట్టు. అటుగా కదిలింది. పొద్దున్నుంచీ ఏమీ తినలేదేమో నిస్సత్తువ ఆవరిస్తోంది.
ఎదురుపడ్డ ఒక ఎర్రనత్తను అడిగితే "నన్ను అనుసరించు" అంటూ వెనుకకు నడవటం మొదలెట్టింది. దారికి దాని వాలకంపై అనుమానం వేసి ముందుకు సాగింది.
చీకటి పడింది. అడవి గుండా ప్రయాణం. ఏవేవో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. దారికి భయం వేసింది. అయినా సరే గమ్యాన్ని కనుక్కోవాలన్న నిశ్చయం సడలలేదు. ఆకలి చలిలా కొరుకుతుంది.
కొందరు దారిదోపిడి దొంగలు పొదలమాటునుండి మీదపడి దారిని బంధించారు. ఓపికలేక ప్రతిఘటించలేకపోయింది. గమ్యం లేదని గమనించి ఒదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
తెల్లారింది. నెమ్మదిగా అన్వేషణ కొనసాగించింది దారి. ఏదో ఊరు కనిపించింది. పాత ఫ్లెక్సిలతో చేసిన గూళ్ళలో మనుషులు జీవిస్తున్నారు. వస్తూన్న ఒక వ్యక్తిని దాహం అడిగింది. నీళ్ళు తాగుతూ అతన్ని చూసింది. ఒక కాలు లేదు అతనికి. ఏమైంది అని ప్రశ్నించింది. "రైల్లో పల్లీలమ్ముతాను, ఓ రోజు ఆక్సిడెంట్ అయ్యింది" అన్నాడు. అతని లేని కాలును చేతిలోకి తీసుకొని తడిమింది. కన్నీళ్ళు వచ్చాయి. ఆకలి వల్ల ఎక్కువ బాధపడలేక పోయింది.
వెళ్ళిపోతున్న అతని వెనుక చేరి బుట్టలోంచి గుప్పెడుపల్లీలలను దొంగిలించి గబగబా నోట్లో కుక్కుకొంది. రైలుపట్టాలకు అంటుకొన్న రక్తం జ్ఞాపకాలు గొంతుకడ్డుపడ్డాయి. కుంటుకొంటూ పడమరవైపు వెళుతోన్న అతన్ని చూస్తుంటే అర్ధమైంది గమ్యం అంటే ఏమిటో. ఇంకెప్పుడూ అది గమ్యం కొరకు అన్వేషించలేదు.
బొల్లోజు బాబా

Friday, April 21, 2017

వేడుక


పాపం పసివాడు
లోకం
ఎదురుపడ్డప్పుడల్లా
శోకంతో
కన్నీరు మున్నీరయ్యేవాడు
వాడి బాధ చూడలేక
ఓ దేవత వాడి నేత్రాలపై
బీజాక్షరాలను లిఖించి
కన్నీటి బిందువులు కవిత్వంగా మారే
వరమిచ్చింది
విషయాన్ని పసికట్టిన లోకం
మరిన్ని దృశ్యాలను
అతని కళ్ళలోకి వంపి
కవిత్వాన్ని పిండుకొంటోంది
వేడుకగా
బొల్లోజు బాబా

Friday, April 14, 2017

ఎలుగెత్తి చాటుదాం

ఎలుగెత్తి చాటుదాం
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
అసంఖ్యాక హృదయాలలో
నిత్యం ప్రకాశించే మార్తాండ తేజుడని
చదువు సమీకరించు పోరాడు అన్న మూడు పదాలలో
మన జీవితాలకు దిశానిర్ధేశనం చేసిన
ఆధునిక భోధి సత్వుడని
వీధి కుళాయి నీళ్ళు తాగనివ్వని వివక్షా తిమిరంతో
జ్ఞానమనే కాంతిఖడ్గంతో సమరం చేసిన
అవిశ్రాంత యోధుడనీ, అలుపెరుగని ధీరుడనీ
"మేం హరిజనులమైతే మీరంతా దెయ్యం బిడ్డలా" అని ప్రశ్నించి
పోరాటాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాన్ని
ముక్కుసూటిగా ఎదుర్కొన్న ధీశాలి అని
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
ఎన్ని యుగాలైనా కొండెక్కని పరిమళ దీపమని
మనుస్మృతిలోని నిచ్చెనమెట్లని మొదటగా గుర్తించి దాన్ని
తగలెయ్యమని పిలుపునిచ్చిన గొప్ప సామాజిక శాస్త్రవేత్త అని
హిందూ భావజాలాన్ని ఒక చారిత్రాత్మక మలుపుతిప్పిన చరితార్ధుడని
దేశంలో సగభాగానికి సమానహక్కులు
పోరాడి సాధించిపెట్టిన గొప్ప మానవతా వాది అని
దేశ మహిళలందరకూ ప్రాతఃస్మరణీయుడనీ
తన జాతిపై జరుగుతున్న అణచివేతను లండన్ సమావేశంలో
నిప్పులాంటి స్పష్టతతో ప్రపంచానికి ఎరుకపరచి
తన ప్రజకు ప్రత్యేక అస్థిత్వాన్ని సాధించిపెట్టిన రాజనీతిజ్ఞుడనీ
దీన జనోద్దారకుడనీ
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
అంబేద్కరిజం అంటే ఆ మహనీయుని
వెన్నెముకతో చేసిన వజ్రాయుధమనీ
స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అనే మూడు సింహాలను
భారత రాజ్యాంగంగా మలచి సామాన్యుడికి కాపలాగా పెట్టిన
అనితర సాధ్యుడనీ, అపార విద్యాపారంగతుడనీ
మానవజాతికి వన్నెతెచ్చిన మేధో శిఖరమని
ఈ శతాబ్దపు మూర్తీభవించిన జ్ఞాన స్వరూపమని
దళిత బహుజనుల జీవితాలలో నీలికాంతులతో వెలిగే ఆరంజ్యోతి అనీ
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కర్ అంటే ఆత్మవిశ్వాసమనీ
జై భీమ్ అంటే దారిచూపే చూపుడు వేలని
ఎలుగెత్తి చాటుదాం అందరం
బొల్లోజు బాబా
(డా. బి.ఆర్. అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా)

Friday, April 7, 2017

కీమో థెరపీ


ఇంట్లోకి ఇంకా అడుగుపెట్టనే లేదు
తల వెంట్రుకల చుట్ట
బండి చక్రంలా గాలికి
దొర్లుకొంటూ దొర్లుకొంటూ వచ్చి
గడప వద్ద ఆగింది
పెను దుఃఖం
ఒక ఆలింగనం
ఎడతెగని కన్నీరు
వెంట్రుకల్ని ఒక్కొక్కటీ
రాల్చుకొంటూన్న తరువు
మెల్లమెల్లగా
గతంలోకి కూరుకుపోతోంది.
కటిక రాత్రి
జుట్టుపట్టుకొని ఈడ్చుకుపోతూంటే
తెగిన చీకటి దారాల్లా వెంట్రుకలు
ఎల్లెడలా మృత్యుశైత్యం
ఒక వేదన
భయప్రవాహం
విచ్చుకొన్న ఓదార్పు తెరచాప
బొల్లోజు బాబా

Thursday, April 6, 2017

నాలుగు స్తంభాలు


మొన్నో నలుగురు వ్యక్తులు
కొండపై రాత్రివిందుచేసుకొన్నాకా
ఉదయానికల్లా కొండ మాయమైందట
ఆ నలుగురే
నదీవిహార యాత్రజరిపిన మర్నాటికల్లా
నదీ, నదీ గర్భపు ఇసుకా అదృశ్యమయ్యాయని
ఆశ్చర్యంగా చెప్పుకొన్నారు
వాళ్ళే
చెట్టపట్టాలేస్కొని పంటచేలల్లో
తిరుగాడిన సాయింత్రానికల్లా
పచ్చని చేలన్నీ కనిపించకుండా పోయాయట
ఈరోజు వాళ్లకో కొత్త ఊహ పుట్టిందట
అందరూ గుసగుసలుగా చెప్పుకొంటున్నారు.
వివరాలింకా బయటపడలేదు
ఇంతలో…
"అలా జరగటానికి వీల్లేదు" అంటూ
రోడ్డుపై ఒకడు గొణుక్కుంటూ
గాల్లో ఏవో రాతలు వ్రాసుకొంటూ
అడ్డొచ్చిన నన్ను తోసుకొని సాగిపోయాడు
ఎలా జరగటానికి వీల్లేదటా? అని ఆలోచించాను
వెంటనే స్ఫురించింది
అవునవును
నాకూ అన్పిస్తోంది
ఖచ్చితంగా అలా జరగటానికి వీల్లేదు
బొల్లోజు బాబా

Friday, March 31, 2017

Sister Anonymous

Putting her two hands in his armpits she lifted him up from toilet seat and brushed his teeth, washed his body blotted with towel, dressed him carefully moved him to the bed and made him lay down on it While searching the tablets she asked "you said your son is asking you to come home, why dont you go?" With tear filled eyes He was staring at the cieling for mentioning his son who stopped even ringing him. Bolloju Baba

Thursday, March 30, 2017

ఉగాది కవిసమ్మేళనంలో కవితా పఠనం

ఆంధ్రప్రదేష్ భాషా సాంస్కృతిక శాఖవారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో కవితాగానం మరియు మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాధ రెడ్డి గారిచే సన్మానం.
ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ జి.వి. పూర్ణచంద్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.



వసంతసేన ఏమంది?

శీతవేళ సెలవు తీసుకొన్నాక
వసంతసేన మల్లెలపల్లకిలో అరుదెంచింది
కోయిలలు, మామిడిపూతలు, వేపచిగుర్లు, 
వెన్నెల రాత్రులు ఆమె  సైన్యం

ఆమెకు పదార్చనచేయటానికి కవులు
అక్షరసుమాల్ని సమాయత్తం చేసుకొన్నారు.
శుకపికములు ఆమెకు స్వాగతగీతాలాలపించాయి.
ఆమె బంగారు మేని తేజస్సు చుట్టూ పరిభ్రమించే
సీతాకోకలు దివ్యత్వాన్ని పొందుతున్నాయి.
నులివెచ్చని కాంతి తన కిరణాల వేళ్లతో
ఆమెను తాకి మురిసిపోతోంది
కోయిలలు తమ శ్రావ్య గళాలతో
ఆమె సౌందర్యాన్ని గానం చేస్తున్నాయి
ఆమె రాకకు పులకించిన తరువులు 
కొత్తపూతల పుప్పొడులను రాల్చుకొన్నాయి

తేనెలూరు చూపులతో పరికించి చూసిన వసంతసేన 
"కాలం ఒక్కటే శాశ్వతం.... ప్రేమే సత్యం" అని అంది.

నిజమే కదా!
అనాదిగా సమస్త ప్రకృతీ ఆమె మాటల్లో 
లయం అయ్యే ఉంది.
పుడమి సంగీతాన్ని నూత్నసృష్టి, మృత్యువు
నిత్యం శ్రుతిచేస్తూనే ఉన్నాయి.
జీవితపు దారులను ప్రేమ తన పరిమళాలతో
ప్రకాశింపచేస్తూనే ఉంది

మిత్రమా!
కాలానికో, ప్రేమకో వినమ్రంగా నమస్కరించి
అస్థిత్వాన్నో ఆత్మనో ఆనందంగా 
సమర్పించుకోవటంలో ఎంతటి
జీవనమాధుర్యముంది!

బొల్లోజు బాబా



Monday, March 27, 2017

దోసిలిలో నది కవితా సంపుటిపై వ్రాసిన సమీక్ష

శ్రీ దాట్ల దేవదానం రాజు గారి దోసిలిలో నది కవితా సంపుటిపై వ్రాసిన సమీక్ష ఆంధ్రప్రభ లో.   ఎడిటర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.  




పూర్తిపాఠం ఇది

దోసిలినిండా కవిత్వం

మట్టినీ ఆకాశాన్నీ
నదినీ పర్వతాన్నీ
కరుణనీ మానవతనీ
ఒక సమూహం కోసం
ఏకాంతంగా ప్రేమించేవాడే కవి ...... అన్న వాక్యాలు దాట్ల దేవదానం రాజు ఇటీవల వెలువరించినదోసిలిలో నదికవితాసంపుటి  లోనివిపై వాక్యాలకు సంపుటిలోని కవిత్వం నిలువెత్తు దర్పణం పడుతుందివైయక్తికంగా ఉంటూనే, సామాజికంగా పలకటం ఆధునిక కవిత్వలక్షణంఅత్యంత సంక్లిష్టమైన గుణాన్ని దాదేరా ఒక కవితలో
కవిత్వం ఒక తపస్సు
ఒక దీపస్తంభం .....  అన్న అలతి అలతి పదాలలో నిర్వచిస్తాడు. ఆత్మ దర్శనం కోసం చేసే తపస్సు వైయక్తికమైనదిదారిచూపటం కోసం దీపస్తంభమై నిలబడటం సామాజికంరెంటినీ సమన్వయపరుస్తూ సృజించేదే ఉత్తమకవిత్వంగా నిలుస్తుంది, “దోసిలిలో నదిగా మారుతుంది.

నిర్మలమైన భావధార, చిక్కని అనుభూతి, ఇజాలతో సంబంధం లేని జీవనస్పర్శలు, తేటగా కనిపిస్తూనే లోతుగా తాకే వాక్యాలు దాదెరా కవిత్వలక్షణాలుపడవప్రయాణం, వానచినుకులు, రాజకీయనాయకుల వాగ్దానాలు, మట్టి, వెన్నెల వంటి సాధారణ వస్తువులు అసాధారణ కవితలుగా మారటం సంపుటిలోని అనేక కవితలలో చూడొచ్చు.
ఒక కాంతిగురించిఅనే కవితలో 
వెన్నెల వెలుగుల్ని
మంచిగంధంలా
అరగదీసి రంగరించి
తెలుగింటి ముగ్గులా
బొటనవేలు....చూపుడువేలు సందున
శబ్దమై జారితే
కవిత్వమౌతుంది. ...... అంటాడువెన్నెల, గంధం, ముగ్గు అనే మూడు పదాలతో సాధించిన పదచిత్రం  బిగుతైన నిర్మాణానికి చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.

కడియం పూలనర్సరీలకు ప్రసిద్ది. ఊరిమీదుగా బస్సులో ప్రయాణిస్తున్నా ఒక పరిమళకాంతి మొహానికి తాకుతుంది.  “పరిమళ కంకణంఅనే కవితలో  ఊరిని
మట్టి మంచి గంథంలోంచి
మొలకెత్తి
గాలికి అంకితమైన
పరిమళాల కొలువు.... కడియం .....” అని చేసిన వర్ణనాసౌరభం హృదయానికి ఆహ్లాదకరంగా తాకకమానదు.

ఒక సభలో ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి గారి ప్రసంగం విన్నతరువాత వ్రాసిన కవితలో అనుభవాన్ని అద్భుతంగా ఇలా వర్ణిస్తారు దాదెరా.
ఒళ్ళంతా కళ్ళై
కవిత్వ సౌందర్యాన్ని వీక్షించాను
లుప్తమైన నూనెలో
వత్తిని అటూ ఇటూ జరుపుకొని
నన్ను నేను వెలిగించుకొన్నాను
చిరుదీపపు వెలుగులో
అలౌకికానందాన్ని పదిలపరచుకొన్నాను  (ప్రేరణ).  చిన్నచిన్న మాటలతో గొప్ప కవిత్వసౌందర్యాన్ని దర్శింపచేస్తాడుతనని తాను కవిత్వంతో వెలిగించుకోవటం అనేది అమేయమైన అలౌకికానందం. దాన్ని గొప్ప వొడుపుతో అక్షరాలలోకి వొంపి మనకందిస్తాడు.

జబ్బుకు మందేదీఅనే కవితలో ఒక వ్యక్తి స్వశక్తితో ఎదుగుతూ, పేరుతెచ్చుకొంటున్నపుడు చుట్టూ ఉండే కొంతమంది ప్రదర్శించే అసూయా, ద్వేషాలను వర్ణిస్తూ అలాంటి వ్యక్తుల గురించి  చివరలో
నీది రోగమేనని వైద్యుడూ చెప్పడు
నిన్ను నయం చేసే మందులుండవు
నేను నిన్ను కాపాడలేను  అని అంటాడుచిత్రంగా ఇదే సంపుటిలోనిసహృదయంఅనే కవిత అదే వస్తువును అవతలి పక్షం నుంచి చెపుతూ....
కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకొని
వేదన దిగమింగక్కర్లేదు
చీకటిలో కుమిలిపోనక్కర్లేదు
వాడి ఎదుగుదలను స్వాగతిద్దాం  అంటూ మొదలౌతుంది. ఎదుటివాని ఎదుగుదలకు అసూయచెందే జంతుస్థితినుండి మనుషులు సహృదయత కలిగిన ఉన్నతదశకు ఎదగాలని కవి ఆశిస్తున్నట్లు భావించాలి.

బియాస్ నది మృతులపై వ్రాసిన స్మృతిగీతంలో
కరకెరటమూ
సముదాయించి ఒడ్డు చేర్చలేదు
ప్రవాహపు నావ
అలలపై కూర్చుండబెట్టి
సేద తీర్చలేదు//
అగమ్య పథాన
జలఖడ్గం గుండెల్ని చీల్చింది (దుఃఖరసం).... అంటూ అలనాటి విషాదాన్ని శోకదృశ్యచిత్రాలుగా, పదునైన వ్యక్తీకరణలతో కనులముందు నిలిపి అనుకంప రగిలిస్తాడు.

తెలుగునేల రెండురాష్ట్రాలుగా విడిపోవటం పట్ల కవులందరూ అటో, ఇటో హృదయానుగతంగా స్పందించారుకవికూడా సమాజంలో భాగమే కనుక చుట్టూ జరిగే సంఘటనలకు తనవంతు బాద్యతగా స్పందించక తప్పదుఅందులో మినహాయింపు ఉండదు సందర్భాన్ని పురస్కరించుకొని  వ్రాసినకొత్త లోకాలుఅనే కవితలో
ఒక మేఘం కింద
ఉదయాలు రెండు
విడి ముద్దులు మధురం.”  అంటూ రెండు రాష్ట్రాలను రెండు కొత్తలోకాలుగా ఆవిష్కరించి ఆహ్వానించటం జరిగింది.

సంపుటిలోఉనికిఅనే కవిత రైతువెతల్ని ఎత్తిచూపుతుందిరుణ మాఫీ పేరుతో రైతులలో లేనిపోని ఆశలు కల్పించి, వాగ్ధానభంగం కావించిన నాయకులను ఉద్దేశించి
ప్రపంచం ఎప్పుడూ ఉంటుంది
రైతు కూడా ..... అని అనటం ద్వారా వారి అధికారం అశాశ్వతమని పరోక్షంగా హెచ్చరిస్తాడు.

మోహం, పరిమళం ఆచూకీ, తీరంగూడు, పడవ, సగం తర్వాత వంటి కవితలు సున్నితమైన జీవనానుభవాలకు చక్కని కవిత్వరూపాలు

పుస్తకంలో మొత్తం 37 కవితలున్నాయి. దీనికి ముందుమాటలు శ్రీ ఎం. నారాయణ శర్మ, డా.సీతారాం లు వ్రాసారు. ముఖచిత్రం శ్రీ ముమ్మిడి చిన్నారి సమకూర్చారు

సరళంగా ఉంటూనే లోతైన అభివ్యక్తిని, ఆలోచింపచేసే తత్వాన్ని పొదుగుకొన్నదోసిలిలో నది”  మంచికవిత్వాన్ని ఇష్టపడేవారందరికీ నచ్చుతుంది.

వెల: 60 రూపాయిలు
కాపీల కొరకు
దాట్లదేవదానం రాజు
8-1-048 ఉదయిని
జిక్రియనగర్
యానాం – 533464
ఫోన్: 9440105987

బొల్లోజు బాబా - 9849320443