Sunday, February 23, 2025

శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది

శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది. ఆ పోస్టుకు కొనసాగింపుగా ఆ కామెంట్లను ఒక పోస్టుగా పెడుతున్నాను.
.
మీరు పారమార్ధిక ప్లేన్ లోంచి మాట్లాడుతున్నారు. భౌతికంగా అలా లేదు. శంకరుడే స్వయంగా చెప్పాడు శూద్రుడు విద్యకు అనర్హుడు అని. ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడుండాలని. బౌద్ధ జైనాల్ని నిర్మూలించటంలో పాపం లేదని.
వీటిని మినహాయించి చేసే ఏ వాదనైనా, చెప్పే ఏ అన్వయమైనా నేటికీ సాగిస్తున్న మోసం అని భావిస్తాను.
.
బౌద్ధజైన సిద్ధాంతాలు కనుమరుగు అయ్యాయని చెప్పలేదు. అవి హిందూమతంలోకి అస్సిమిలేట్ అయ్యాయని పంచాయత ఆరాధన పారాగ్రాఫులో చెప్పాను.
అద్వైతాన్ని సిద్ధాంతపరంగా బౌతికవాదులు ఎదుర్కోలేరు. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని , బౌద్ధులు ప్రత్యక్ష మరియు అనుమాన ప్రమాణాలను మాత్రమే అంగీకరించిన భౌతికవాదులు.
వీటితో పాటు ఉపమాన, శబ్ద, అర్ధాపత్తి, అనుపలబ్ది లాంటి ప్రమాణాలను కూడా అంగీకరిస్తారు అద్వైతులు.
వీరిద్దరి మధ్యా శాస్త్ర చర్చలో అద్వైతులే విజయం సాధిస్తారు. ఎందుకంటే శబ్ద, ఉపమాన అర్ధాపత్తి లాంటి వాటికి ఆధారాలు చూపక్కరలేదు. అభౌతికమైన అంశాలను కూడా వాటిసాయంతో సత్యాలుగా చలామణీ చేయించవచ్చు.
కనుక వారిరువురి పోటీలో అద్వైతులు నెగ్గటం మోసపూరితమైనది.
శంకరుడు చేసిన పని అది. ఈ పని ద్వారా బ్రాహ్మణాధిక్యత వచ్చి, బ్రాహ్మణుడినే ఈ ఆథ్యాత్మిక క్రతువులలో అధిపతిగా నిలిపినపుడు- శతాబ్దాలుగా పండితులు ఈ మోసాన్ని అనేక తలతిక్క అన్వయాలతో సమర్ధిస్తూనే ఉన్నారు.
వ్యాసంలో ఎక్కడో చెప్పినట్టు ఈ పురాణపురుషులు చెప్పినది ఏమిటి అని కాక, దానివల్ల సమాజం ఏ ఏ మలుపులు తీసుకొంది అనేది ముఖ్యం. నాకు కనిపించేది ఏమిటో స్పష్టంగా చెప్పాను. ఈ శంకరాచార్యుని నిర్వాకం వల్ల అశాస్త్రీయత, మూఢత్వం, బ్రాహ్మణాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటి అవలక్షణాల వైపు సమాజం ప్రయాణించింది. అది పండితులకు మేలు చేసింది కనుక శంకరుడిని భక్తితో నేటికీ పూజిస్తారు.
నేను అలా చూస్తున్నాను. అలా గతం నాకు కనపడుతుంది. మీకు మరోలా కనిపించవచ్చుననే అవకాశాన్ని కాదనను.
.
తత్వం నాశనం అయిందని ఎవరన్నారు. ఎందుకు పదే పదే అంటారు ఆ మాట. నేను స్పష్టంగా చెప్పాను. తత్వాలు అస్సిమిలేట్ అయ్యాయని. ఏటా శంకరజయంతులు ఎవరు చేస్తున్నారు?
వైవిధ్యం శంకరుడితో వచ్చిందా? హాస్యాస్పదం. శంకరుని కాలానికే భిన్న పాయలు ఉన్నాయి.
మీరు భౌతిక స్థాయిలో మాట్లాడండి. శంకరనిర్వాకం వల్ల సమాజంలో ఏం జరిగి ఉంటుందో చెప్పాను. అలా జరగలేదని ఉపపత్తులు ఇవ్వండి. ఏ వేవో మాట్లాడితే ఎలా?
ఇస్లాంని కానీ క్రిస్టియానిటీని గానీ గౌరవించటం, సూఫీ దర్గా కల్చర్ ని ఆదరించటం అనేది బౌద్ధజైన కాపాలికాదుల్ని నిర్మూలించిన శంకరాచార్యుని వల్ల వచ్చింది అంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
నిజానికి ఈ సమాదరణ అనేది భారతదేశ ఆత్మ. అశోకుని 12 వ శాసనంలో ఇలా ఉంది.
///ఒక పాషండ శాఖ/మతం కి చెందిన వ్యక్తులు అసందర్భంగాతమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖ/మతాలను నిందించడం చేయరాదు. పరశాఖల/మతం వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన మతాన్ని అభివృద్ధి చేసుకోవటంమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు// సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము తప్ప దానం కాని, పూజ కాని అంత ముఖ్యాలు కావు అని దేవానాం ప్రియుడు తలుస్తున్నాడు. (XII శిలాశాసనము)///
క్రీపూ 3 వ శతాబ్దానికి శంకరాచార్యుడు ఎక్కడున్నాడు. సమత, సహిష్ణుతలను ఈ నేలకు నేర్పిందే బౌద్ధ, జైనాలు. వాటిని నిర్మూలించి ఈ రోజు మనందరినీ అన్యమతాలను పీక్కుతినే జాంబీలుగా చేసింది ఎవరు? యూట్యూబ్ తెరవండి ఒకసారి అర్ధమౌతుంది.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment