Wednesday, January 11, 2023

థేరీ గాథలు…ఒక అనుసృజన

ఈ పుస్తకం చదివేది కాదు. మన మానసిక స్థితి వలన ఈ పుస్తకంలోకి మనం ప్రయాణిస్తాం- డా. కాళ్ళకూరి శైలజ
థెరీగాథల పుస్తకం ఆత్మను ఇముడ్చుకొన్న ఈ ఒక్క వాక్యం చాలు .... థాంక్యూ మేడం గారు ఈ గొప్ప కాన్కకు...
.
ఈ వ్యాసాన్ని సృజనసాహిత్య పేజీలో ప్రచురించినందుకు శ్రీ విల్సన్ రావు గారికి ధన్యవాదములు.
బొల్లోజు బాబా
.
థేరీ గాథలు…ఒక అనుసృజన
.
బొల్లోజు బాబా గారు కవి, సాహిత్య విశ్లేషకులు, వక్తగా అందరికీ పరిచితమే. ఆయన ఎంచుకున్న మరో ప్రత్యేకమైన బాట చారిత్రక రచన. ఇప్పటికే చారిత్రక విభాగంలో ఆయన రెండు గ్రంథాలను రచించిన, తన అభిరుచిని, అధ్యయనాన్ని చాటుకున్నారు.

కవి రక్తంలో ఆవేశం, ఆవేదన కలిసి ప్రవహిస్తుంటాయి. సృజనాత్మకతకు విస్తృతమైన సాహిత్య పరిశీలన అవసరం అన్నది నిర్వివాదాంశం.

బాబా గారు అప్పుడప్పుడు సచ్చిదానంద గారి కవితల అనువాదం తమ ముఖ పుస్తక పేజీలో ప్రకటిస్తుంటారు. మరో భాషలో వచ్చిన సున్నితమైన భావోద్వేగాలు మనసును ఎంతగానో వెంటాడితే తప్ప వాటిని మాతృభాషలోకి అనువాదం చేయలేరనిపిస్తుంది.

ఈ మధ్య బాబా గారి కవితాత్మకు, చారిత్రక నేపథ్యం తోడై 'థేరిగాథలు' కవితా సంకలనం వెలుడింది.
 
మానవ అస్తిత్వంలో 'తాత్విక ధోరణి' అత్యంత ఉన్నతమైంది. భూమిపైన జీవానుక్రమంలో జరిగిన రూపాంతరాలలో మనిషి పుట్టుకే శ్రేష్టం. ఆలోచనలు, భావనలు అని మనం వేర్వేరుగా వర్గీకరించుకునే నైరూప్యత ఒక అభివ్యక్తిని పొందడం మానవ మేధకు పరాకాష్ట.
అవసరాలు, కాంక్షలు తీరినప్పుడు సుఖం, తీరనప్పుడు దుఃఖం సహజం. చిత్రంగా సుఖదుఃఖాల్లో మానవుడు తనను తాను మరొకరితో పోల్చుకుంటాడు. ఈ పోలిక సుఖం విషయంలో అసూయ, విద్వేషం ప్రతీకారం, హింసగా పరిణమిస్తుంది.
 
అదే దుఃఖం కలిగితే నిస్పృహ, నిరాశ, బాధ నిండిపోతాయి. అందరూ బాగున్నారు, నాకే కష్టం వచ్చిందనే క్రుంగుబాటు వస్తుంది. ఆ సమయంలో సరైన సాంత్వన లభించినట్లైతే నిత్య జీవన సరళి లోకి పునఃప్రవేశించి, ఉపశమనం వైపు నడక నేర్చుకుంటాడు. పుట్టిన తరువాత నేర్చుకునే నడక ఎంత గొప్పదో ఈ నడక కూడా అంతే ముఖ్యం. ప్రధానం కూడా. ఈ ప్రయాణానికి అవసరమైన ఆర్ద్రతను సర్వ మానవులకు పంచిపెట్టిన సంపూర్ణ బోధకుడే బుద్ధుడు.
తన దుఃఖం కోసం కాక పరుల దుఃఖం పట్ల సహానుభూతి చూపాడాయన. అందుకే దుఃఖ మూల కారణాన్ని అన్వేషించేందుకు సిద్ధపడి, సాధించాడు. కోరికలే విషాదానికి కారణమని తెలుసుకున్న క్షణమే బుద్ధుని కళ్ళకు లోకంలోని సమస్త జీవజాలం సమానంగా కనబడింది. అందుకే, లింగ, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరితో సంభాషించ గలిగాడు. ధనం, అధికారం సాటి వారిని పీడించేలా మనిషినెంత కఠినంగా మారుస్తాయో గమనించాడు.

బుద్ధ బోధనలకు పీడిత జనమంతా ఆకర్షితులయారు. ముఖ్యంగా స్త్రీలు ప్రభావితమయ్యారు. వారినందరినీ ఆదరించి భిక్షుణులుగా వచ్చేందుకు అనుమతించి, మహిళలను జనజీవన స్రవంతిలో భాగం చేసిన తొలి తత్వవేత్త బుద్ధుడే. ఈ సూత్రాన్నే మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య సమరంలో అవలంబించాడు. అలా బుధ్ధ మార్గంలోకి వచ్చిన బౌద్ధ బిక్షుణులు వ్రాసుకున్న కవితలు 'థేరీ గాథలు'.

'మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా' ద్వారా 'థేరీగాథ' ఛార్లెస్ హాలిసే గారి ఇంగ్లీష్ సంకలనం ఒకప్పుడు వాడ్రేవు చినవీర భద్రుడు గారు సూచించిన తరువాత నేను తెప్పించుకుని చదవడం జరిగింది. ఇది 2016 లో జరిగిన విషయం. పచ్చి గాయాన్ని మోస్తున్న నా హృదయానికి ఈ ప్రతి బౌద్ధ బిక్షుణి కవితా, ఓదార్పునిచ్చి బుజ్జగించాయి.

దుఃఖ గాథలు, ముఖ్యంగా స్త్రీల వ్యక్తిగతమైన దుఃఖ గాథలు ఎక్కడ దొరుకుతాయి? మాతృస్వామ్య వ్యవస్థ తొలగిపోయాక స్త్రీకి భర్త, బిడ్డలు, కుటుంబం అనే మూడు భౌతిక, మానసిక సంకెళ్లు పడ్డాయి. సంఘం చెక్కిన చెరసాలలో ప్రపంచ నాగరికతలన్నిటా ఈ ధోరణి కనబడుతుంది.
సున్నిత హృదయం వలనో, ప్రేమమూర్తి గానో స్త్రీ వాటిని బంధనాలుగా కాకుండా బంధాలుగా చూసింది. భర్త నిరాదరణ, కుటుంబ కలహాలు, బిడ్డల నిర్లక్ష్యం, భర్త లేదా బిడ్డ మరణం ఇవన్నీ స్త్రీ జీవితాన్ని బహిరంతరాలలో కృంగదీసినపుడు మరో విధంగా బతకలేని నిస్సహాయత ఆవరిస్తుంది.

'థేరీగాథ'లు బుద్ధుని కాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా స్త్రీ ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను, విషాదాలను లిఖిత పూర్వకంగా రికార్డు చేశాయని చెప్పవచ్చు. అటువంటి 'థేరీగాథల'ను తెలుగులోకి అనుసృజన చేయటం బొల్లోజు బాబా గారి సున్నితమైన సహానుభూతి గల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

బాబా గారు గొప్ప ఆసక్తితో ఎన్నో ప్రామాణిక గ్రంథాలను సేకరించి, వాటిలోంచి మేలైన మణిపూసలను ఎన్నుకుని (తె)వెలుగులోకి తెచ్చారు.

ఎందరో స్త్రీలు సంపన్నులు. అధికారి భార్య ఒకరైతే, వ్యాపారి కూతురు మరొకరు. అన్ని స్థాయిలకు చెందినవారు ఉన్నారిందులో. వీరంతా ఇంటి నుంచి, ఈతిబాధలకు విసిగి తమ పరిమితులను ఛేదించి, కుటుంబాన్ని ఎదిరించి బుధ్ధ భగవానుని అనుసరించారు.
'సామ','ముత్త', 'పున్న'--గా పిలవబడే ఎందరో బౌద్ధ బిక్షుణుల కవితలు బాబా గారు ఇందులో చేర్చారు.

"breakthrough all that is dark with wisdom made full".....
"సంపూర్ణ జ్ఞానంతో ఈ సువిశాల చీకట్లను ఛేదించు "
బౌద్ధ బోధనల సారం ప్రబోధ కవితలుగా కొత్త రూపు దిద్దుకుంది. బాబా గారి సరళమైన భాష వలన మూలంలోని జటిలమైన ఉద్బోధ కూడా పాఠకునికి స్పష్టంగా అర్ధమౌతుంది.
కోరికలను జయించడమే కాదు, తిరిగి వాటివైపు ఆకర్షితులు కాని వారే నిజమైన ముక్తి సాధించగలరు అనే జ్ఞాన బోధ ఒక్కో కవితతో మరింతగా వ్యక్తిగత బాధ్యతను గుర్తుచేస్తుంది.
"From all that holds you back"
"వెనక్కులాగే అన్ని శక్తుల నుండి " అంటూ బాబా గారు మన వాడుకలో,లోతైన విషయాన్ని సూటిగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

"What does being a woman have to do with it?.......and that one sees what really is!"
'సోమ' అనే మహిళ తీక్షణమైన ఈ ప్రశ్నను, 'సత్యదర్శనం సరిగా ఉన్నపుడు స్త్రీ అయితే ఏంటటా?" అంటారు బాబాగారు.

"నా శ్రవణం స్ఫుటిత పడింది "
"అన్ని దుఃఖాలు,వాటి మూలాలు అర్ధమయ్యాయి "
"పులు కడిగిన ముత్యంలా వారు (పరివ్రాజకులు)దోష రహితులు "
"వారికి దుఃఖ నాశనం తెలుసు"
"నడవాల్సిన మార్గంలో నడక ఆరంభించేసాను నేను "
"ఈ దేహాన్ని అలంకరించి వివాహం అనే బంధంలో అమ్ముకోమంటున్నావా?"
"సముద్రంలో తప్పిపోయిన నావికుడు తీరాన్ని చేరుకొన్నట్లు నీకు కూడా గమ్యం దొరుకుతుందిలే"

పై వాక్యాలను పేరు సైతం చెప్పుకోని బౌద్ధ భిక్షుణిలు పలికారు. అవి మానవ చరిత్రలో తాత్విక చింతనలో పరమోన్నత వాక్యాలయ్యాయి. ఇది మహిళ తన స్వరాన్ని స్పష్టంగా, సమున్నతంగా, వెలిబుచ్చిన బృహత్ సందర్భం.

ఆనాటి మహిళలో తెగువ, వైరాగ్యం, అస్తిత్వ ప్రకటన అన్నీ బుధ్ధుడు తెరచిన ద్వారాల వలన మాత్రమే సాధ్యపడ్డాయి. అవన్నీ నేటికీ ఏ స్త్రీ ఐనా తెలుసుకోదగ్గ సత్యాలు. మానసిక స్థైర్యం ఇచ్చే అమృత గుళికలు.

మూలగ్రంధంలోని తాత్విక పరిమళం రవ్వంతైనా పొల్లుపోకుండా మనకు అందించడంలో బాబాగారు కృతకృత్యులయ్యారు.

ఈ పుస్తకం చదివేది కాదు. మన మానసిక స్థితి వలన ఈ పుస్తకంలోకి మనం ప్రయాణిస్తాం.
అదే మార్గం, ఆ మార్గమే గమ్యం కూడా.

కాళ్ళకూరి శైలజ.






పై వ్యాసంపై మిత్రులు చేసిన ఆత్మీయ వ్యాఖ్యలు. అందరకూ కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
.
నేను ఇటీవల ఇష్టంగా కొని చదివిన పుస్తకం థేరీగాథలు...నిజంగా కవి,చరిత్రాకారుడు బొల్లోజు బాబా గారి కృషికి
అభినందనలు
చెప్పాలి.
ఆ నాటి తల్లుల హృదయాన్ని వాక్యాలుగా మన ముందుంచారు.వేల ఏళ్ల కిందటే స్త్రీ మూర్తుల హృదయ స్పందనలు, వారి కళాత్మక వ్యక్తీకరణ అబ్బురపరుస్తుంది.ఈ పూట మళ్లీ ఒకసారి చదవాలనిపించింది.ఈ పుస్తకం పై కాళ్లకూరి శైలజ మేడంగారు అందించిన వ్యాసం ఆసక్తిగా చదివించింది.ఈ పుస్తకం మనం చదివేది కాదు.మన మానసిక స్థితి అన్న వాక్యాలు అక్షర సత్యాలు..మేడంగారికి ధన్యవాదాలు. @పల్లిపట్టు నాగరాజు
.
తాత్విక కి చింతనకు పరాకాష్టగా భావించే బౌద్ధ భిక్షుణుల కవితల్ని థేరీ గాధలు పేరుతో తెలుగులో అందించిన బొల్లోజు బాబా కవిత్వాన్ని కాళ్లకూరి శైలజ చక్కగా విశ్లేషించారు. @ డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
.
బొల్లోజు బాబాగారి అనుసృజన "థేరీగాధలు" మూల గ్రంధం చదివిన కాళ్ళకూరి శైలజ గారు ఆ పుస్తకంలో ప్రయాణించి సమీక్షించడం వల్ల చాలా విషయాలు తెలిశాయి. మనకూ ఓ టికెట్ కొనిచ్చి మనల్నీ ప్రయాణించమని ఆ మార్గాన్ని గమ్యంగా చూపినందుకు ధన్యవాదాలు. జంధ్యాల రఘుబాబు
.
కాళ్ళకూరి శైలజ గారి "థేరీ గాథలు - ఒక అనుసృజన"లో ప్రముఖ రచయిత బొల్లోజు బాబా గారి ఆవేదనను ఆవేశాన్ని సున్నిత భావోద్వేగాల సమాహారాన్ని చాలా చక్కగా వివరించారు.@కరిపే రాజ్ కుమార్
.
థేరీ గాథలు ఒక Monumental Work.బొల్లోజు బాబా గారి వర్క్స్ లో ఇది ప్రధానంగా నిలిచిపోతుంది.మంచి రివ్యూ అందించినందుకు శైలజ గారికి ధన్యవాదాలు. బాబా గారికి ఆలింగన నమస్సులు.@శ్రీనివాస గౌడ్

No comments:

Post a Comment