Monday, January 2, 2023

అయ్యప్ప కల్ట్ -చారిత్రిక విశ్లేషణ



.
దక్షిణభారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఒక ఆరాధన విధానం అయ్యప్ప స్వామి. అయ్యప్పస్వామికి మణికంఠ, శబరినాథ, ధర్మశాస్త అనే వివిధ పేర్లు కలవు. దక్షిణభారత దేశ ప్రతిమలలో ఈయన పులిని స్వారీచేస్తున్నట్లు, శ్రీలంకదేశపు ప్రతిమలలో తెల్లని ఏనుగుపై ఊరేగుతున్నట్లు ఉంటుంది.
.
జన్మవృత్తాంతం
క్షీరసాగరమథనం అనంతరం దేవతలకు రాక్షసులకు విష్ణుమూర్తి అమృతం పంచేందుకు మోహినిగా అవతారం ధరించాడు. ఈ మోహినీ అవతారాన్ని చూసి ఆకర్షింపబడిన శివుడు, ఆమెను కూడగా శివకేశవుల అంశతో అయ్యప్ప జన్మించాడు. అందుకు ఈయనకు హరిహర సుతుడు అనే పేరువచ్చింది. అదేసమయంలో పందళదేశ రాజు అయిన రాజశేఖరుడు వేటకు వచ్చి ఈ బాల అయ్యప్పను/హరిహరసుతుని చూసి తనకు సంతానం లేనందుకు భగవంతుడు ఇలా అనుగ్రహించాడని భావించి, ఆ శిశువును ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకోసాగాడు. మహారాజు ఈ అయ్యప్పకు రాజ్యపాలన అప్పగించాలని భావించాడు. ఒక ఆలయాన్ని నిర్మించి ఇమ్మని అయ్యప్ప తండ్రిని కోరగా నిర్మించిన ఆలయమే శబరిమల ఆలయం. అక్కడ అయ్యప్ప స్వామి స్థిరనివాసం ఏర్పరుచుకొని భక్తుల పూజలందుకొంటున్నాడని పురాణకథనం.
.
ఇతర కథనాలు
1. అయ్యప్పస్వామి ఒక ఫూజారి కుమారుడు. ఇతను తన తండ్రిని చంపిన ఉదయానన్ అనే క్రూరమైన బందిపోటుదొంగను సంహరించి, అతను బంధీగా చేసిన పాండ్యరాకుమార్తెను విడిపించినట్లు ఒక కథనం కలదు.
2. అయ్యనారే అయ్యప్ప: తమిళనాడులో అయ్యనార్ గ్రామాన్ని రక్షించే అనార్య దేవుడు. శూద్రులదైవం. అయ్యనార్ విగ్రహానికి అయ్యప్ప విగ్రహానికి పోలికలు ఉండటాన్ని బట్టి అయ్యప్ప స్వామి కి అయ్యనార్ కు చారిత్రిక సంబంధాలు ఉండవచ్చునని, గ్రామీణ శూద్ర దైవం కాలక్రమేణ హైందవీకరణ చెంది ఉండవచ్చునని ప్రముఖ చరిత్రకారుడు T.A. Gopinatha Rao అభిప్రాయపడ్డారు.
3. Sreedhara Menon అనే చరిత్రకారుడు – అయ్యప్ప ఆలయానికి బ్రాహ్మణిజంతో కంటే బుద్ధిజంతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని ప్రతిపాదించాడు. అయ్యప్ప భక్తులు దీక్షలో ఉన్నప్పుడు శాఖాహారభోజనం, మాల దుస్తులు పవిత్రంగా ధరించటం, నేలపై శయనించటం, భిక్ష ద్వారా ఆహారం స్వీకరించటం, బ్రహ్మచర్యం పాటించటం, దురలవాట్లు మానుకోవటం- లాంటి బౌద్ధసన్యాసులు నిత్యం పాటించే నియమాలు ఆచరిస్తారు.
బౌద్ధ రచనల్లో సాహ్య పర్వతశ్రేణులపై “నీలకంఠ అవలోకేశ్వర” ఆలయం నిర్మించినట్లు ఉటంకింపులు కలవు. నీలకంఠ అవలోకేశ్వరుని విగ్రహం అయ్యప్పస్వామి విగ్రహంతో సారూప్యతలు కలిగి ఉంటుంది కనుక అయ్యప్ప కల్ట్ బుద్ధిజానికి దగ్గర అని శ్రీథర మీనన్ అభిప్రాయపడ్డారు.
4. అరేబియానుంచి వచ్చిన ఒక ముస్లిమ్ యోగి అయిన వావర్ తో అయ్యప్పస్వామి ఆథ్యాత్మిక సంబంధాలు కలిగి ఉన్నాడని మరొక జనశృతి కలదు. అయ్యప్పస్వామి వావర్ యోగి స్నేహితులుగా ఉండేవారట. శబరిమలై ప్రధాన ఆలయం పక్కనే వావర్ స్వామికి చిన్న గుడి ఉంటుంది. ఇక్కడ ఒక ముస్లిమ్ పూజారి నేటికీ పూజలు నిర్వహిస్తుంటాడు. అయ్యప్పస్వామే స్వయంగా పందళదేశరాజుకు కలలో కనిపించి వావర్ స్వామికి మసీదు నిర్మించమని ఆదేశించాడట. అలా నిర్మించిన వావర్ స్వామి మసీదు శబరిమలైకు వెళ్ళే దారిలో ఉంటుంది. శబరిమలై భక్తులు దీనిని కూడా తమ యాత్రలో భాగంగా దర్శించుకొంటారు.
ఈ వావర్ కు సంబంధించిన చారిత్రిక వివరాలేవీ లభించవు. బహుశా ముస్లిముల ప్రాబల్యాన్ని అంగీకరించే ప్రక్రియలో హిందూమతం చేసుకొన్న ఒక సర్దుబాటుగా ఈ వావర్-అయ్యప్ప ఉదంతాన్ని చూడాలని Eliza Kent అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
5. కేరళ ఆళపుర జిల్లాలో అర్థంగల్ అనే ఊరిలో సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఉంది. ఇది 16 శతాబ్దంలో నిర్మించబడింది. 1584 లో దీనికి Fr Jacomo Fenicio చర్చిఫాదర్ గా ఉండేవారు. ఇతని కాలంలోనే శబరిమలైను ఈ అర్థంగళ్ చర్చి ని కలిపే ఐతిహ్యం రూపుదిద్దుకొంది.
Fr Jacomo Fenicio తన ప్రేమపూర్వక మాటలతో, స్వస్థపరచే మహిమలతో స్థానిక ప్రజల ప్రేమను అభిమానాన్ని సంపాదించుకొన్నాడు. ఇతనికి హిందూ సంస్కృతి, ఆచారాలపట్ల అపారమైన గౌరవం ఉండేదట. ఆ సంగతులతో కూడిన ఒక పుస్తకాన్ని కూడా లాటిన్ భాషలో రచించాడు.
అయ్యప్పస్వామికి ఈ చర్చిఫాదరు స్నేహితుడు కావటంవలనే ఇన్ని మహిమలు చూపించగలుగుతున్నాడని ప్రజలు విశ్వసించారు. క్రమేపీ శబరిమలై దర్శించిన భక్తులు ఈ చర్చిని కూడా దర్శించుకోసాగారు. ఈ ప్రక్రియ ఈనాటికీ కొనసాగటం విశేషం.
***
ప్రధాన స్రవంతిలో మనుగడలో ఉండే భావజాలం ఎప్పటికప్పుడు ఎక్కువమంది ప్రజలు దేన్నైతే విశ్వసిస్తున్నారో దాన్ని own/appropriate చేసుకోవటం జరుగుతుంది. చారిత్రికంగా అయ్యప్ప కల్ట్ లో అదే జరిగింది అని అర్ధమౌతుంది.
నిజానికి విష్ణువుకి, శివుడికి పుట్టిన స్వామిగా అయ్యప్పను సృష్టించటానికి కారణం – అప్పట్లో లక్షలాది ప్రాణాలను తీసిన శైవ వైష్ణవ ఘర్షణలను సర్దుపరచటానికే అనే వాదన కూడా కలదు. మోహిని-శివుని వృత్తంతం ఉన్న భాగవత పురాణంలో అయ్యప్ప స్వామి జన్మించిన ప్రస్తావనలు లేవు కనుక ఈ హరిహర సుతుడు అన్న భావన ఆ తరువాత కల్పించినదని కొందరి అభిప్రాయం.
మళయాల జానపద గీతాలలో అయ్యప్పస్వామి కొండలలో తిరిగే ఒక యోధుడు. విల్లంబులను ధరించి, దారిదోపిడి దొంగలనుంచి బాటసారులను, వ్యాపారులని కాపాడే రక్షకుడు
అయ్యప్పస్వామి కల్ట్ వివిధ దశలలో వివిధ ఆరాధనా విధానాలను ఇముడ్చుకొన్న తీరు విస్మయపరుస్తుంది. ఒక ఆదివాసీ దేవుడిగా, ఒక శూద్రదేవుడిగా, హరిహరుడనే పేరుతో ఒక పురాణ పురుషుడిగా భిన్నకాలాలలో కనిపిస్తుంది. ఇంకా భిన్న పాలనలలో ఇస్లాం, క్రిష్టియన్ మత విశ్వాసాలను గౌరవించి అంగీకరించిన విధానం చారిత్రికంగా ఒక గొప్ప పరిణామంగా భావించాలి. ఇది సర్వమానవ ఐక్యతకు తోడ్పడింది తప్ప మనుషుల్ని వారివారి విశ్వాసాల ఆధారంగా ముక్కలు చేయటానికి ప్రయత్నించలేదు.
***
హిందూ మతవిశ్వాసాలు బహుముఖీనమైనవి. ప్రజలందరినీ ఐఖ్యపరచటానికి కాలానుగుణంగా అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ భిన్న ఆరాధన విధానాలను గౌరవించటం గమనించవచ్చు.
కేరళలోని సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఒకప్పటి శివాలయమని నేడు కొందరు రాజకీయనాయకులు వాదిస్తున్నట్లు –హిందూభావజాలం ప్రజలు మత ఆధారంగా విడిపోయి విచ్ఛిన్నమైపోవాలని ప్రయత్నించలేదు చారిత్రికంగా.
.
బొల్లోజు బాబా






No comments:

Post a Comment