Sunday, February 9, 2020

ఎవరు వీళ్లంతా?



ఏసుబాబు
వీరాస్వామి
లక్ష్మణరావు
పెంటయ్య
ఇంకా కొంతమందీ.... ఎవరు వీళ్ళంతా!
ఓ ముప్పై నిముషాల వ్యవధిలో
ధరాధిపతులు, నరహంతకులూ అనాదిగా
చేసిన కృత్యాలన్నీ అకృత్యాలేనని
ఒక్క తులసిదళంతో తేల్చిపారేసారు.

అంత చేసీ
ఒడ్డుకు లాక్కొచ్చిన ఇరవైఏడుమందిలో
ముగ్గురి ప్రాణాలు కాపాడలేకపోయామని
బాధపడుతున్నారు చూడు!

ఓ నా చిట్టి మేధావీ!

ఆ కొద్దిక్షణాలూ
బొట్టు, టోపీ, శిలువా, రోలెక్స్ వాచీ
ఏ తారతమ్యం లేదక్కడ
ఆ కొద్దిక్షణాలూ
మనం నిర్మించుకొన్న
గోడలన్నీ కుప్పకూలిపోయాయి

ఓ నా చిట్టి మేధావీ!
మరోసారి చెపుతున్నాను విను.

మానవత్వం ఒకటే
మునిగిపోతున్న ప్రాణానికి ప్రాణం పోసింది
మనిషితనం ఒకటే
మనిషిని మనిషితో బంధించింది.
మనిషి గమ్యం మనిషితనమే ఏనాటికైనా!

ఐస్ ఏజ్ నుంచి డిజిటల్ ఏజ్ దాకా
మానవజాతి నౌకాయానానికి
ఏ చరిత్రా గుర్తించని
కనిపించని తెడ్లు వీళ్ళు.
మనుషులుగా మనం పూర్తి వైఫల్యం
చెందలేదనటానికి మిగిలున్న
ఒకే ఒక సాక్ష్యం వీళ్ళు.

బొల్లోజు బాబా

(ఇటీవలి గోదావరి బోట్ ప్రమాదంలో అనేక ప్రాణాలు కాపాడిన స్థానికజాలరుల కొరకు)

No comments:

Post a Comment