Sunday, February 9, 2020

"మూడోకన్నీటి చుక్క" 2

"మూడోకన్నీటి చుక్క" పుస్తకంపై Srinivasa Nyayapati గారు సహృదయంతో చేసిన అవలోకనం నన్నునాకు కొత్తగా దర్శింపచేసింది.

కొన్ని అనుభూతులను ఇద్దరం కలిసే అనుభవించామనే ఊహ తృప్తిగా అనిపిస్తోంది.

వాసుగారి ఆత్మీయ పలుకులకు సదా కృతజ్ఞుడను.

థాంక్యూ సర్

బొల్లోజు బాబా
***

__గుండె పూడికను తీసేసే మధురాంబువు__
.

బొల్లోజు బాబాగారితో నాకున్నదల్లా ఈ ముఖపుస్తక పరిచయం. అముఖపరిచయం. అయితేనేం, వారి కవిత్వంతో మంచి పరిచయమే ఉంది, ఈ మాధ్యమంలో. ఈ మూడో కన్నీటి చుక్క నా చెంపమీదుగానూ జారి దొర్లింది.

సరళమైన prose poems కుందుర్తి కాలానికే తెలుగులో మొదలయ్యాయి. "నా కవిత్వాన్ని సారళ్య సుందరి వరించింది." అని చెప్పుకోగలిగే కవులు కుందుర్తి తరువాత మనకు మరీ ఎక్కువమంది కనిపించరు. ఇదుగో ఇప్పుడు బొల్లోజు బాబా (తను అలా చెప్పుకోకున్నా) అదే కోవకు చెందిన కవి అని అనుకుంటాను నేను.

ఇస్మాయిల్ తరువాత అంత నిజాయితీగా నిరాడంబరంగా తను జీవించిన జీవితానికీ స్వానుభవాలకూ మాత్రమే అక్షరదర్పణాన్ని అందిచ్చిన కవి బొల్లోజు బాబా. బాబా తనే ఓ చోట చెప్పుకున్నట్టుగా తను జై శ్రీరామ్ అన్నా ఆ నినాదం వినగానే స్ఫురించే ఉద్యమానికి చేయూతనిచ్చేవాడుకాడు. అలాగే లాల్ సలామ్ అన్నా సరే ఒక రంగు జెండాని ఎత్తిపట్టుకొని ఒక పక్షానికే వత్తాసు పలికే రకమూ కాదు. ఏ రాజకీయ దుర్వాసనలూ అంటని మామూలు మనిషన్నమాట. ఈ మామూలు మనుషుల జీవనప్రయాణమే ఒక అసిధారావ్రతం. వీళ్ళు తమ ఆత్మావిష్కరణకోసం చేసే సుదీర్ఘమైన ప్రయాణం, ఈ ప్రపంచం గుండానే, ఈ జీవితంలో దొరికే ఓ పుంజీడు స్మృతులతోనే సాగుతుంది. బాబా దీనికి మినహాయింపు కాదు.

బాబా కవిత్వంలో ఉన్నది జీవితంలో ఉన్నది. ఇల్లూ తలితండ్రులూ పిల్లలూ (ముఖ్యంగా పిల్లలు) ఇల్లువదిలి దూరాలు వెళ్ళడం ఒకరికొకరు దూరం కావడం nostalgia అన్నీ. ఇవేకాదు, ఆధునిక నగరజీవితపు డొల్లతనం కించిత్ రాజకీయ చైతన్యమూ కాస్త సామాజిక స్పృహానూ. అయితే బాబా తను రాసినదానిని కవిత్వంగా మలచడానికి ఏ ఒక్క ప్రత్యేకమైన టెక్నిక్కూ వాడకుండా నిర్మలఝరిని తలపించే శైలిలో సున్నితంగా మనం కోల్పోతున్నవి ఎత్తిచూపుతాడు. మనల్నే మనకి పునఃపరిచయం చేస్తాడు. ఆ పరస్వపరిచయం పూర్తయాక మన వొళ్ళంతా ఏ కవనలేపనం అంటుకుంటుందో కానీ మనం విషాదమధురమైన బాధను అనుభవిస్తాం.

ఇందులోని కవితలు "వలస పోవటం.." చదివి పితావైపుత్త్రనామాసీత్ అన్నమాట తలుచుకున్నాను."రహస్య ప్రియురాలు" చదివి నేను సముద్రపొడ్డునుంచి తెచ్చుకున్న గవ్వను తడిమి చూసుకున్నాను. "నాన్నతనం" చదివి ఒక కొడుకుగా తండ్రిగా నా ఆత్రుతలూ అనుబంధాలూ ఏమిటా అని అవలోకించుకున్నాను. "గుండె పూడిక" చదివి నా గుండెలో దాన్ని దాచుకున్నాను. "Personal" చదివి హమ్మయ్య నాలాంటివారే ఈ కవి కూడా అని స్థిమితపడ్డాను. "గురుదేవులకు వందనాలు" చదివి నా గురుదేవులకు నమస్కారాలు అర్పించాను.

ఇలా చెప్పుకుంటూపోతే ఇందులోని ప్రతి కవితా నన్ను స్పర్శించినదే అని చెప్పాలి. స్పర్శ. ఆ స్పర్శ కోసం ఎదురుచూసినవాళ్ళకి బాబా కవిత్వం సహస్రహస్తాలతో వెలుతురు వేళ్ళతో స్వాగతం పలుకుతుంది. నేనీ స్వాగతాన్ని మన్నించి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే బొల్లోజు బాబా నన్ను మార్చే ప్రయత్నం చెయ్యలేదు, సదా నేను నేనుగా ఉండే కవిత్వాన్నే నాకు ఇచ్చాడు. ఈ గుండె పూడికను తీసేసే మధురాంబువు చాలు నాకు.

-వాసు-

For copies,

Bolloju Baba,
30-7-31,
Suryanarayana Puram,
Kakinada

No comments:

Post a Comment