Sunday, February 9, 2020

1857 సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర్య పోరాటమా?



సిపాయిల తిరుగుబాటు మొదటిదీ కాదు స్వాతంత్ర్యపోరాటమూ కాదు.

ఈస్ట్ ఇండియా కంపనీ (వ్యాపారుల కూటమి) 31 డిసంబరు, 1600 లో క్వీన్ ఎలిజబెత్ I నుంచి ఒక రాజపత్రం ద్వారా అనుమతి తీసుకొని భారతదేశంలో వ్యాపారం చేయటానికి అడుగుపెట్టింది. మొదట్లో దీనికి రాజ్యాధికారం చెలాయించాలనే కోరిక లేదు కానీ కాలక్రమేణా స్థానిక రాజకీయాలలో కలగచేసుకొని రాజ్యాలను ఆధీనంలోకి తెచ్చుకోవటం మొదలుపెట్టింది. సొంత సైన్యాన్ని ఏర్పాటుచేసుకొంది.

1803 లో ఈస్ట్ ఇండియా కంపనీ వద్ద రెండున్నరలక్షల "ప్రెవేట్ సైన్యం" ఉండేది. అప్పటి బ్రిటన్ ప్రభుత్వ సైన్యం సంఖ్యకు ఇది రెట్టింపు.

ఈస్ట్ ఇండియా కంపనీ యుద్ధాలు చేసింది. రాజుల్ని ఓడించింది. వారసులు లేని రాజ్యాలను ఆక్రమించుకొంది. తన "ప్రెవేట్ సైన్యం" సహాయంతో కప్పాలను వసూలు చేయటం మొదలెట్టింది. 1850 నాటికి భారతదేశంలోని మూడొంతుల భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొంది.

అలా ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం 1857లో సిపాయిల తిరుగుబాటు వరకూ కొనసాగింది. సిపాయిల తిరుగుబాటు ఉదంతంతో విక్టోరియారాణి ఈస్ట్ ఇండియా కంపనీని రద్దు చేసి బారతదేశాన్ని 1858లో తన పాలనలోకి ( క్రౌన్ పాలనలోకి) తీసుకొంది. అప్పటినుంచి 1947 దాకా సాగిన పాలనను బ్రిటిష్ రాజ్ అని చరిత్రకారులు పిలుస్తారు.

ఈ క్రమంలో భారతదేశంలో 1858 వరకూ జరిగింది - వ్యాపారస్తుల కూటమి ప్రెవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని జరిపిన ఆధిపత్యమే తప్ప ఒక ప్రజాస్వామ్యయుత, రాజ్యపాలన కాదు. అసలు అది ప్రభుత్వమే కాదు.

1858 నుంచి జరిగినది వ్యవస్థాగతంగా, చట్టాలకు లోబడి జరిగిన రాజ్య/ప్రభుత్వ పాలన.
****

సిపాయిల తిరుగుబాటే దేశంలో జరిగిన మొదటి తిరుగుబాటా?

వేలసంవత్సరాలుగా రాజు పేరుమీద ఉండిన భూమిహక్కులు ఒక్కసారిగా కంపనీకి దఖలు పడ్డాయి. ఆ భూమిని సాగుచేసుకొంటూ ఉన్న భూస్వాములకు పించను ఏర్పాటుచేసి వారిని తొలగించింది కంపనీ. ఈ చర్యతో అంతవరకూ ఒక హార్మొనీతో నడచిన సమాజం పెద్ద కుదుపుకు లోనైంది. నిజానికిది నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఆధారిత ఫ్యూడల్ సమాజం.

ఈస్ట్ ఇండియా కంపనీ వారి దుశ్చర్యలను ప్రతిఘటిస్తూ 1857కు ముందునించీ అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి

కట్ట బొమ్మన తిరుగుబాటు, తమిళనాడు (1792-1799)
పైకుల తిరుగుబాటు, ఒరిస్సా (1804-1806)
వేలు తంబి తిరుగుబాటు, కేరళ (1808 - 1809)
కిట్టూరు తిరుగుబాటు, కర్ణాటక (1824-29)
బుందేల్ తిరుగుబాటు, మధ్య ప్రదేష్ (1842)
వీరభద్రరాజు తిరుగుబాటు, విశాఖపట్నం (1827-1833)
పాలకొండ తిరుగుబాటు, తూర్పుగోదావరి (1831-1832)
పర్లాకిమిడి తిరుగుబాటు, ఒరిస్సా (1829-35)

పై తిరుగుబాట్లన్నీ

తమతమ అధికారాలను నిలుపుకోవటానికి
భూమిపై తమ పెత్తనాన్ని కొనసాగించటానికి
ఇతర వ్యక్తిగతకారణాలతో
స్థానికంగా జరిగాయే తప్ప దేశభక్తి, స్వాతంత్ర్యకాంక్ష లాంటి జాతీయ భావాలతో దేశమంతా విస్తరించి జరగలేదు.

1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు వీటన్నిటికన్నా పెద్దది. ఇది బ్రిటిష్ వారిని గడగడలాడించింది. ఇది కూడా వ్యక్తిగత కారణాల కోసమే జరగడం గమనార్హం.

ఈ తిరుగుబాటులో బెంగాల్ సైనిక పటాలం ఒక్కటే పాల్గొంది. మద్రాసు బొంబాయి సైనికులు పాల్గొనలేదు. బ్రిటిష్ సైనికులకు మూడురెట్లు ఎక్కువ జీతం ఇస్తున్నారనే అనే కారణం ప్రధానంగా కనిపిస్తుంది వారి తిరుగుబాటుకు

సిపాయిల తిరుగుబాటుకు మద్దతు పలికిన నాయకులకు కల వ్యక్తిగత కారణాలు ఇలా ఉన్నాయి.

1. బహదూర్ షా II అప్పటికి రాజ్యం లేని మొఘల్ చక్రవర్తి. మొఘల్ రాజ్య పునస్థాపనకొరకు యత్నించాడు.
2. నానాసాహెబ్ కు పించను తగ్గించారు. కంపనీవారితో చేసిన చర్చలు ఫలించలేదు.
3. కంపనీ వారు రాణి లక్ష్మి బాయి దత్తతకుమారుడిని వారసునిగా గుర్తించలేదు
4. బెంగాల్ సైనికులు మొఘల్ రాజ్యాన్ని స్థాపించటం లక్ష్యంగా పెట్టుకొంటే, నానాసాహెబ్, తాంతియాతోపెలు మరాఠా రాజ్యాన్ని స్థాపించాలని తలచారు. ఈ వైరుధ్యం తిరుగుబాటు వైఫల్యానికి ప్రధాన కారణం.
5. సిపాయిల తిరుగుబాటుకు ఆధ్యుడుగా భావించే మంగళ్ పాండే ఒపియం ఎక్కువగా తీసుకొని ఉద్రేకితుడై బ్రిటిష్ అధికారిని చంపాడని రికార్డులద్వారా తెలుస్తుంది.

అందుకనే జవహర్ లాల్ నెహ్రూ 1857 తిరుగుబాటుని ఫ్యూడల్ శక్తులు సమాజంపై తమ పట్టుని నిలుపుకోవటానికి చేసిన ఒక ప్రయత్నమని అన్నాడు.
****

1857 సిపాయిల తిరుగుబాటుని ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం అని మొదట ఎవరు అన్నారు?

The Indian War of Independence (1909) అనే పుస్తకంలో వీర్ సావార్కర్ 1857 నాటి సిపాయిల తిరుగుబాటుని మొదటి స్వాతంత్ర్యపోరాటంగా అభివర్ణించాడు. ఆయన సమకాలీనులు, చరిత్రకారులు ఆ వాదనను అప్పట్లోనే ఖండించారు.

వీరిలో ప్రముఖ చరిత్రకారుడు శ్రీ R.C Majumdar ముఖ్యుడు. భారతీయ మధ్యతరగతి వర్గాలు ఇంగ్లీషు చదువులు చదువుకొని, అంతర్జాతీయ పరిణామాలను అర్ధం చేసుకొని స్వాతంత్ర్య పోరాటానికి దేశాన్ని సమాయుత్తపరిచారని మజుందార్ అంటాడు.

1905 లో బెంగాల్ విభజన జరిగినపుడు దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని "మొదటి స్వాతంత్ర్య సంగ్రామం" అని మజుందార్ అభిప్రాయపడ్డాడు.

బెంగాల్ విభజనను దేశవ్యాప్తంగా జాతీయవాదులు వ్యతిరేకించారు. ఈ విభజన వ్యతిరేక ఉద్యమం/ వందేమాతర ఉద్యమం/స్వదేశీ ఉద్యమంగా మారి భారతదేశ ప్రజలను సంఘటితం చేసి బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విముక్తం చేయాలన్న కోర్కెను వారిలో రగిల్చింది. .

రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జి, సుబ్రహ్మణ్య భారతి, అరవింద్ ఘోష్, ముట్నూరి కృష్ణారావు, చిదంబరం పిళ్లై లాంటి ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. పైన పేర్కొన్న ప్రముఖుల పేర్లను గమనిస్తే

1. ఈ ఉద్యమం మొత్తం దేశవ్యాప్తంగా జరిగినట్లు అర్ధమౌతుంది.
2. వారికి పరాయిపాలన నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న కోరిక తప్ప మరేవిధమైన వ్యక్తిగత ప్రయోజనాలు కనిపించవు.
****

బ్రిటిష్ పార్లమెంటు 1784 లో చేసిన పిట్స్ ఇండియా యాక్టు ద్వారా కంపనీ మెంబర్లు సివిల్, మిలటరీ, రెవిన్యూ హక్కులు తెచ్చుకొన్నారు. (వీళ్ళే అక్కడ ఎలైట్ వర్గాలు). దాంతో మరింత రెచ్చిపోయారు. ఆ తరువాత వచ్చిన 1813, 1833 ల నాటి చార్టర్ల ద్వారా కంపనీ అతిని కొంతమేరకు నియంత్రించటానికి ప్రయత్నించింది బ్రిటిష్ పార్లమెంటు.

1857 తిరుగుబాటులో 6 వేల మంది బ్రిటిషర్లు చనిపోవడం ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అరాచకాల ఫలితమని బ్రిటష్ పార్లమెంటులో Benjamin Disraeli వాదించిన ఫలితంగా భారతదేశం క్రౌన్ పాలనలోకి వచ్చింది. ఆ రకంగా సిపాయిల తిరుగుబాటుకి ఉన్న చారిత్రక ప్రాధాన్యత తక్కువేమీ కాదు.

1857 నాటి తిరుగుబాటునే ప్రధమ స్వాతంత్ర్య పోరాటంగా అంగీకరించటానికి ఇన్ని మతలబులు ఉన్నప్పుడు .......1847 లో పించను తగ్గించారని చేసిన ఒక ఉక్రోషపు తిరుగుబాటును "తొలి స్వాతంత్ర్యపోరాటం" అని ప్రచారించుకొంటూంటే ఆశ్చర్యంగా ఉంది.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment