Sunday, February 9, 2020

a Comment

(Saradhi Motamarri gaaru జమిందారీ వ్యవస్థ గురించి నన్ను టాగ్ చేసినందుకు ఒక చోట నేను చేసిన కామెంటు ఇది. కామెంటు కనుక ఈ రాతను విహంగ వీక్షణంగా భావించాలి)

చోళుల కాలంలో గ్రామాలు ఒక యూనిట్ గా ఉండి పండించిన పంటలో రాజుగారికి పన్ను రూపంలో సగభాగం కట్టేవారు (సంగోరు భాగం). కొన్ని గ్రామాలను కలిపి నాడులు అని పిలిచేవారు. వీటికి పన్ను వసూలు అధికారులుగా రాజ ప్రతినిధులు ఉండేవారు (వీరిని సామంతులు అనుకోవచ్చు)

కృష్ణదేవరాయలి కాలంలో పాలెగార్లు ఉండేవారు. వీరు కొన్ని గ్రామాలకు గాను రాజునుండి అధికారం పొంది పండించుకొని నిర్ణయించిన శిస్తు కట్టేవారు. మరొక విశేషం ఏమిటంటే వీరు సొంతసైన్యం కలిగి ఉండి రాజుకు అవసరమైనప్పుడు యుద్ధాలకు తమ సైన్యాన్ని పంపించి సహాయపడేవారు.

ముఘలుల కాలంలో కొన్ని గ్రామాలను కలిపి జాగీరులుగా విభజించి వీటికి జాగీరు దారులను నియమించి పన్ను వసూలు చేసేవారు. ఈ జాగీరు దారులు తిరిగి భూమిని కొద్దిమంది జమీన్ దారులకు కౌలుకి ఇచ్చి పండించేవారు. వీరు కూడా సంగోరు భాగాన్ని సుల్తానుకు పన్నుగా చెల్లించేవారు.

ఈ వ్యవస్థలలో రైతు పాత్ర ఎక్కడా లేదు. భూమి అంతా రాజుగారి పేరుపై ఉండేది. పండించుకొనేవారికి కానీ కౌలుకు తీసుకొన్నవారికి గానీ భూమిని అమ్ముకొనే హక్కు ఉండేది కాదు. ఎవరైనా పన్నులు కట్టకపోతే (కరువు కాలంలో కూడా) వారి జమిందారీని మరొకరికి ఇచ్చేసి శిక్షించేవారు రాజు లేదా రాజ ప్రతినిధులు.

శ్రీనాధుడు అంతటి కవే శిస్తుకట్టనందుకు శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. "పురవీధి నెదురెండ పొగడదండ" అంటాడు. పొగడదండ అంటే రాతిగుండులతో చేసిన దండ. దానిని మెడలో వేసి రోడ్డుపైన ఎండలో నడిపించేవారు.

కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిలబిలాక్షులు తినిపోయె దిలలు బెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు సుంకంబు లేడు నూర్లు ... అని వాపోతాడు. ఇదీ ఆనాటి రైతుల స్థితి.
****

ఈస్ట్ ఇండియా కంపనీకి భారతదేశం అంతా దఖలు పడ్డాక ఈ భూమిని అప్పటి బ్రిటన్ లో ఉన్న పద్దతి లాగ రాజు స్వాధీనం నుంచి ప్రజల పరం చేసారు. భారత దేశానికి సంబంధించి భూమి విషయంలో ఇదొక విప్లవాత్మక మార్పు

అంతవరకూ ఉండిన జమిందార్లు వారు పండించుకొంటున్న భూమికి శాశ్వత హక్కుదారులు కాదు. పన్నుకట్టకపోతే తొలగించి వేరేవారికి ఇచ్చేసేవారు. కానీ బ్రిటిష్ వారు చేసింది శాశ్వత సెటిల్ మెంటు.

నార్త్ ఇండియాలో పైన చెప్పిన జమిందారులకు "సెటిల్ మెంట్" చేసారు. అంటే ఆ భూమిపై వారికి అమ్ముకొనే, వంశపారంపర్య, శాస్వత హక్కులను ధఖలు చేసారు.

ఇక మన ప్రాంతానికి వచ్చేసరికి థామస్ మన్రో అనే మహానుభావుడు 1800 లో, కంపనీ అధికారులను వారిని ఒప్పించి రైత్వారీ పద్దతిని ప్రవేశ పెట్టాడు. అంటే పండించే రైతుకే భూమిని కట్టపెట్టటం అన్నమాట. అలా అప్పటికి భూమిని పండిస్తున్న సామాజిక వర్గాల చేతులలోకి వేల ఎకరాల భూమి చేరింది.

మన్రో ఉద్దేశం మంచిదే అయినా తదనంతర పరిణామాలు భూమి విషయంలో సామాజిక అసమతుల్యతకు దారితీసింది. నిజంగా భూమిని పండించే దళిత, బహుజనులకు భూమి దక్కలేదు.

అయినప్పటికీ మన్రో చేసిన పని అప్పటికి విప్లవాత్మకమైనది, గొప్ప సామాజిక కోణం కలిగి ఉన్నది. జమిందారులు అనే మధ్యవర్తులు లేకుండా నిజంగా కష్టపడే రైతులకే భూమిని అప్పగించాడు. ఒక జమిందారు మాత్రమే ఉండాల్సిన భూమికి వందలమంది వ్యక్తులను యజమానుల్ని చేసాడు.

ఆ విధంగా మన్రో రాయలసీమ వాసులకు ఆరాధ్యుడయ్యాడు. అక్కడి ప్రజలు మన్రోకి గుడి కూడా కట్టారని అంటారు. .
ఈ సెటిల్ మెంటులు రాయలసీమలో జరిగినంత పారదర్శకంగా ఇతర జిల్లాలలో జరగలేదు.

అలా అమ్ముకొనే, వంశపారంపర్య హక్కులతో భూమిని దక్కించుకొన్న రైతులు జమిందారులుగా అవతరించారు.

భూమి అందరికీ చెందాలి అనే ఉద్దేశంతో దేశమంతటా తిరిగి వినోభాభావే భూదాన్ ఉద్యమం చేసాడు. వేల ఎకరాలు కలిగిన జమిందారుల నుంచి కొంత భూమిని దానంగా తీసుకొని దానిని భూమి లేనివారికి పంచటం దీని ఉద్దేశం . ఇది ఆచరణలో విఫలమైంది. ఎలాగంటే తండ్రో తాతో ఇచ్చిన భూమిని వారి వారసులు ఆ దానం చెల్లదని కోర్టులకు వెళ్ళి తిరిగి స్వాధీనం చేసేసు కొన్నారు. ఇప్పటికీ ఇంకా కోర్టు కేసులు జరుగుతున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చాక భారత ప్రభుత్వం లాండ్ సీలింగ్ ఆక్ట్ పెట్టి ఈ జమిందారీలను రద్దు చేసింది. ఆ భూములన్నీ తిరిగి ప్రభుత్వపరం అయ్యాయి.

తిరిగి ఈరోజు పరిశ్రమల స్థాపన/ఉపాధి కల్పన పేరుతో వేల ఎకరాలు సేకరిస్తూ/తీసుకొంటూ/లాక్కొంటూ కొత్తరకం జమిందారీతనం నడుస్తోంది ఇప్పుడు.

ప్రపంచాన్ని నడింపించేది ఒకటే సూత్రం ఎవరివద్ద భూమి ఉంటుందో అక్కడ డబ్బు, అధికారం ఉంటుంది. వాటి బై ప్రొడక్ట్ దోపిడీ ... ఇదే చరిత్ర మొత్తం.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment