Sunday, February 9, 2020

English Medium

నాలుగువందల ఏళ్లుగా ఈ నేలపై జీవించిన ఇంగ్లీషు పరాయి భాష ఎప్పుడయింది?

రాత్రికి రాత్రి మతభాష ఎందుకయిందీ?

ఈ మీడియం మార్పు అనేది లెక్కలు, సైన్సు, సోషలు సబ్జక్టులకే పరిమితం. మిగిలిన తెలుగు, ఇంగ్లీషు, హిందీ/ఉర్దు లు యధాతధంగా ఉంటాయి. ఈ విషయం తెలుసుండీ ఎందుకింత రాద్దాంతం?

విద్యార్ధులలో డబ్బైశాతం మంది ఇంగ్లీషు మీడియం ముప్పై శాతం మంది తెలుగుమీడియంలో చదువుకొంటున్నారు. ఈ తెలుగుమీడియంలో చదువుతున్న వారిలో 75 శాతం మంది బడుగు విద్యార్ధులు.

లెక్కలు ఇలా ఉన్నప్పుడు ఈ బడుగు విద్యార్ధులు మాత్రమే తెలుగును బ్రతికించాలని కోరుకోవటం దుర్మార్గం.

లెక్కలు, సైన్సు, సోషలు అంతర్జాతీయ శాస్త్రాలు. వాటిని ఇంగ్లీషులోనే నేర్చుకోవటం సముచితం. వాటిని తెలుగులో నేర్పి ఆ కుర్రాడిని ఆత్మవిశ్వాసం లేనివాడిగా తయారు చెయ్యాలనుకోవటం అమానవీయం.

Enough is enough. ఇప్పటికైనా జరిగిన తప్పును సవరించుకొందాం.

కావలి బొర్రయ్య నుంచి గురజాడ వరకూ చాలామంది ఇంగ్లీషులో కూడా నిష్ణాతులు. కావలి వెంకట రామస్వామి 1829 లోనే ఇంగ్లీషులో రచనలు చేసిన తొలితరం తెలుగు రచయిత. గురజాడ కన్యాశుల్కానికి అద్భుతమైన ముందుమాట ఇంగ్లీషులో వ్రాసుకొన్నాడు. శ్రీశ్రీ తన కవితల్ని తానే ఇంగ్లీషులోకి తర్జుమా చేసుకొనేవాడు.

ఈ రోజు మనలో ఇంగ్లీషులో రచనలు చేయగలిగే వాళ్ళసంగతి దేవుడెరుగు, కనీసం తమ కథల పుస్తకాలకు ఇంగ్లీషులో ముందుమాట రాసుకోగలిగే తెలుగు కథకులు కానీ అనువదించుకోగలిగే కవులు కానీ ఎందరున్నారు?

దీనికి కారణం యాభై ఏళ్లపాటు తెలుగు మీడియం తెలుగు సాహిత్యానికి చేసిన ద్రోహం కాదా?

వాస్తవాలు మాట్లాడుకొందాం. రెండు మీడియం లు ఉండాలని నంగిరిమింగిరి మాటలు ఒద్దు..

ఇప్పట్లో తెలుగుకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు.
మన ఊరి చేపల మార్కెట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఇంగ్లీషులో మాట్లాడుకొంటున్నప్పుడు తెలుగు ప్రమాదంలో పడిందని భావిద్దాం. అంతవరకూ తెలుగుభాష అంతరించిపోతుందని ఆందోళన చెందక్కరలేదు.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment