Sunday, February 9, 2020

"మూడో కన్నీటిచుక్క"5

నా కవితా సంపుటి "మూడో కన్నీటిచుక్క" పై శ్రీ Abdul Rajahussain
గారి సమీక్ష. థాంక్యూ సర్
***

బొల్లోజు బాబా “ మూడో కన్నీటి చుక్క “ సమీక్ష !!

కళ్ళు రెండే...ఏడిస్తే మొదట రాలేవి రెండు కన్నీటి చుక్కలే... ఈ మూడో కన్నీటి చుక్క ఎక్కడిది? ఇదే ….ఈ జువాలజీ మేస్టారు చెప్పుదలుచుకున్న అసలు విషయం.

ఈ జువాలజీ మేస్టారు కప్పల్ని,బొద్దింకల్ని,వాన పాముల్ని డిసెక్షన్ చేసి ఏ పార్టు ఎక్కడుందో పిల్లలకు చూపించినట్లే..తన కవిత్వంతో ఈ సమాజాన్నిడిసెక్షన్ చేసి రుగ్మతల్ని డిటెక్ట్ చేస్తున్నాడు కవి బొల్లోజు బాబా.

బొల్లోజు బాబా నాకు చాలా కాలంగా తెలుసు. సాహిత్య కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కలుసుకోవడమేకానీ,ఎప్పుడూ సాహిత్య చర్చ చేయలేదు. కారణం ఐటువంటి సందర్భమేదీ రాలేదు. అయితే ఆయన కవిత్వంచదువుతూ వుంటాను, కానీ ఎప్పుడూ ఆయన కవిత్వంపై ఏదీ రాసినట్లు గుర్తులేదు. దాదాపు రాయలేదనే చెప్పాలి. దానికిప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. అలాంటి సందర్భం కానీ, ఆ సమయం కానీ రాకపోవడమే…!!

ఇదిగో ఇప్పుడు “ మూడో కన్నీటి చుక్క “ (డిసెంబర్ 2019 ) పేరుతో బొల్లోజు బాబా తాజా కవితా సంపుటిచదివాక ఇక రాయలేకుండా వుండలేకపోతున్నాను.కారణం ఆయన కవిత్వం అలాంటిది
మరి.ఓ సారిచదివాక మళ్ళీ మళ్ళీ చదవాలనిపించి చదివాను. ఇన్ని సార్లు చదివాక కూడా ఏమీ రాయక పోతే ..అది నా లోపం అవుతుంది. మంచి కవిత్వానికి అన్యాయం చేసినట్లవుతుంది.

బొల్లోజు బాబా..కేరాఫ్ యానాం.! నిజానికి కాకినాడలో నివాసం.అయితే ఆయన సాహిత్య ప్రస్థానమంతా యానాం తోనే ముడిపడి వుంది. ఎంతగా అంటే..”యానాం విమోచనోద్యమం “
(2007)‌ గురించి ఓ పరిశోథక గ్రంథం రాసినంతగా..!

“ఆకుపచ్చని తడి గీతం”(2009) పేరుతో గుండె తడిచేసే తొలి కవితా సంపుటి వెలువరించాడు.
ఆ తర్వాత “వెలుతురు తెర “ (2016 ) ద్వితీయ సంపుటిగా వచ్చింది.మళ్ళీ మూడేళ్ళకు గానీ …. ముచ్చటగా మూడోసంపుటి “మూడో కన్నీటి చుక్క “ (2019) వెలువడింది.
కవిత్వంలో కొంచెం ‘స్లో ‘ అయినా ..కళిత్వంలో ‘ఫ్లో ‘ మాత్రం మిస్ కానివ్వడు.
ఈలోగా అనువాదాలు ..2016లో రవీంద్ర కవీంద్రుని ‘ స్ట్రే బర్డ్స్ ‘ ను “స్వేచ్ఛా విహంగాలు “పేరుతో తెలుగులో అనువదించాడు.

అలాగే సూఫీకవుల కవిత్వాన్ని“ఎడారి అత్తరు" గా తెనుగీకరించాడు. ప్యాబ్లో నెరూడా. ఇరవై ప్రేమ కవితల్ని తెలుగు సేత చేశాడు.

అలాగే రవీంద్రుని “ క్రీసెంట్ మూన్, “గాధా సప్తశతి “ వంటి అనువాదాలు చేశాడు.అంటే ..సొంత కవిత్వం కంటే అనువాదాలే ఎక్కువన్నమాట.అయితే అనువాదాల్లో కూడా తన మార్క్ ను మిస్ కాకుండా జాగ్రత్త పడటం వల్ల, అనువాదాలన్నీ దాదాపుసొంత రచనల్లాగే కనబడతాయి.

నిజానికి జంతు శాస్త్ర మేస్టార్లకి హృదయం వుండదంటారు.కానీ బొల్లోజు బాబాఇందుకు మినహాయింపు. వృత్తి జువాలజీ బోధన..ప్రవృత్తి కవిత్వ రచన..పొంతన లేని వైవిధ్యాల మధ్య తనదైన ఉనికిని చాటుకుంటున్నాడు బొల్లోజు బాబా.

సమాజమే కాన్వాస్ గా….!!

మూడో కన్నీటి చుక్క కవిత్వానికి సమాజాన్ని కాన్వాస్ గా తీసుకున్నాడు. ఇంతకు ముందే చెప్పినట్లు సమాజాన్నిచీల్చి చెండాడి (డిసెక్షన్ ) నిజాల్ని వెలికి తీశాడు. నిజం ఎంత నిష్టూరమైనా వెల్లడించడంలో వెనకాడలేదు. కాకపోతే టముకు కొట్టినట్లు కాక చాపకింద నీరులా నిశ్శబ్దంగానే దుర్మార్గాల భాండాల్ని బద్దలు చేశాడు. అవసరమనుకున్నచోట నేలకేసి కొట్టాడు. ఏది చేసినా, ఎలా చేసినా సత్యాన్ని ఆవిష్కరించి
పాఠకుడి ముందు పెడతాడు. ఆపై తీర్పు పాఠకులదే అంటాడు బొల్లోజు బాబా.

విద్యుల్లత ఈయన కవిత్వం…

బొల్లోజు కవిత్వం చదువుతుంటే ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతుంది.ఉన్నట్టుండి నల్లని మబ్బును చీల్చుకుంటూ ఓ మెరుపు మెరిసినట్లు...సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కొరడా ఝళిపించి నపుడు మనకు తెలీకుండానే మన మస్తిష్కంలో ఓ విద్యుల్లత తళుక్కున మెరుస్తుంది. పాఠకుడు ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా ..మెరుపు అనుభవాన్ని మిస్ అవుతాడు. అందుకే బొల్లోజు కవిత్వన్ని చదివేటపుడు బుర్ర దగ్గర పెట్టుకోవాలి.కవిత్వ మెరుపుల్ని ఒడిసిపట్టుకోవాలి. అనుభవించాలి.

ఉదాహరణకు ఈ కింది కవిత చూడండి.

భూమంటే విద్యుత్ కాంతుల్లో
బెల్లీ డాన్స్ చేసే ఆటకత్తె..వాడికి

భూమంటే..నొసటన దిద్దుకునే
ఆకు పచ్చని విభూతి పండు ...వీడికి

యుద్ధానంతరం
భూమికి వీరిద్దరూ
ఓ ఆరడుగుల బాధ్యత…!!” ( భూసేకరణ )

చూడ్డానికి ఈ కవిత చిన్నదే..కానీ వ్యక్తీకరణలో ఎంతో గొప్పది.

ఈ మధ్య సెజ్ ల పేరుతో,రాజధాని పేరుతో, ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం భూసేకరణ చేయడం చూస్తూనే వున్నాం. రాజ్యం ఎప్పుడూ ఉన్నోడి పక్షమే వహిస్తుంది. లేనోడ్ని పీల్చి పిప్పిచేసి, రోడ్డుపైవిసిరేయడం మామూలే. కార్పొరేట్లను బాగు చేయడానికి ,రైతుల భూముల్ని సేకరించి “సెజ్“ ల పేర ధారాదత్తం చేయడం కొత్తేమీ కాదు. కాకినాడలో వుంటున్న బొల్లోజు బాబా కు “కాకినాడ సెజ్ “ కోసం ప్రభుత్వం చేసిన భూసేకరణ తతంగం తెలియంది కాదు.సెజ్ లలో పరిశ్రమలు పెట్టి ఇంతకు మరింత సంపాదిస్తాడు కార్పొరేట్. తనకు అన్నంపెట్టే నేలతల్లిని బలవంతంగా లాక్కొని కార్పొరేప్ కు కట్టబెడుతుంది ప్రభుత్వం. పరిహారం పేరుతో తూతూ మాత్రంగా రైతు కంట తడి తుడిచేట్లు నటిస్తుంది ప్రభుత్వం.

ఒకరికి (కార్పొరేట్ కు ) భూమి విద్యుత్ కాంతుల్లో బెల్లీ డాన్స్ చేసే ఓ ఆటకత్తె..మరొకరికి ( రైతుకు) భూమంటే నుదుటన దిద్దుకునే ఆకుపచ్చని విభూతి పండు “...భేదమల్లా చూసే చూపులోనే కాదు..అనుభవంలో,ఆస్వాదనలో కూడా.!

నిజానికి ఒకడికి చెలగాటం..ఇంకొకడికి ప్రాణ సంకటం. భూసేకరణ యుధ్ధం జరిగాక..జయాపజయాల్ని పక్కనబెడితే... వీరిద్దరికీ కావలసింది మాత్రం “ ఓ ఆరడుగుల నేల “ .ఓ ఆరడుగుల బాధ్యత మాత్రమే.

బొల్లోజు కవిత్వం గురించి ఇంకేం చెప్పాలి. ఈ ఒక్క కవిత చాలదా..! అన్నమంతా పట్టి చూడాలా? ఒక్క మెతుకు చాలదా అది ఉడికిందో లేదో తెలుసుకోడానికి. అలాగే బొల్లోజు కవిత్వం పండిందో లేదో తెలుసుకోడానికి ఈ ఒక్క కవిత చాలదా? ఇంకా ఏం కావాలి?

క్షతగాత్ర నదీ.!.!

నది ప్రవాహ శీలి.జీవనది నిరంతరం ప్రవహించే జీవధార.కానీ మానవుడి స్వార్థం నదుల్నే ఎండబెడుతోంది. నదులు జీవం కోల్పోతున్నాయి. ఎండిన కన్నీటి చారికలా తమ గుర్తుల్ని
వదిలేసి కనుమరుగవుతున్నాయి.

ఎడారి నగరాల నిర్మాణాల కోసం
నదిలోని ఇసుకను
యూనిట్లు యూనిట్లుగా తరలిస్తున్నారు.

ఇసుక నుండి కావలసినంత తైలం (సొమ్ము) పిండుకుంటున్నారు. ఇదంతా మనకు తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ దుర్మార్గాన్ని “క్షతగాత్రనది “ గా అభివర్ణించాడు బొల్లొజు బాబా. ఈ కవిత ముగింపులో అద్భుతమైన ప్రతిభను చూపాడు కవి.

“అపుడెపుడో మేసిన వెన్నెల్ని
చందమామ రజనుగా రోడ్డుపై కార్చుకుంటూ
క్షతగాత్ర నది
ట్రక్కులు ట్రక్కులుగా ప్రవహిస్తోంది
నగరం వైపు …”

నిజానికి ఎన్నెల మేసి ఏరులు, నదులు, నెమరేయాలి. కానీ ఇసుకాసురుల వల్ల నదీ గర్భాలు ఒట్టి పోతున్నాయి. ప్రవాహాలకు ఆటంకం కలిగి ఎండోపోతున్నాయి. ఇప్పుడు నదుల్లో నీళ్ళు లేవు. నీళ్ళల్లో వెన్నెల లేదు.ఉన్నదల్లా ఇసుక. ఆ ఇసుకను లారీలకు లారీలు నింపి నగరాలవైపుకు ... తరలించుకు పోతున్నారు. నీళ్ళున్నప్పుడు మేసిన వెన్నెల్ని చందమామ రజనుగా కార్చుకుంటూ క్షతగాత్ర నది ట్రక్కులు ట్రక్కులుగా నగరం వైపుకు ప్రవహిస్తోందంటాడు కవి. ఎంత అద్భుతమైన భావన.!

మనుషులూ..జీవితం..!!

మనుషుల్ని,జీవితాన్ని ఇంతగా అర్థం చేసుకున్న కవిని నేనిప్పుడు చూశాను.
జీవితాన్ని వైభోగంగా కాక అనుభవంగా మలుచుకున్న వాళ్ళు మాత్రమే నిజమైన జీవితాన్ని అర్థం చేసుకుంటారు.బొల్లోజు బాబా జీవితాన్ని దగ్గరగా చూశాడు. స్పృశించాడు. అనుభవించాడు. అనుభవాన్ని అక్షరాల కవిత్వం చేశాడు ..!

*జీవితం ముందుకే తప్ప వెనక్కు
ప్రవహించదన్న సంగతిని
ఏ స్వప్నమో నేర్పుతుందిలే “(పాఠం )

*”సర్దుకు పోవడమంటే
చచ్చిపోకుండా వుండటం అంతే
చరిత్రలో
మనిషేనాడూ సర్దుకు పోలేదు “(ఉదయకాంతి )

*”జీవిత పర్యంతమూ
పరిమళించీ పరిమళించీ
పూదోటగా విస్తరించడానికే
నువ్విక్కడకొచ్చావు “(పూలతోట )

*”జీవించడం అంటే
ప్రేమించిన ఒక్కొక్కరినీ కోల్పోవడం కాదూ..!” (Alone but together)

*”జీవితం
అప్పుడప్పుడు కాస్సేపాగి
తన సెల్ఫీ తానే తీసుకొంటోంది
ఒక్కో ఫోటో
రక్తమూ కన్నీళ్ళు నింపుకున్న
కవిత్వమై చరిత్రలో ఇంకిపోతోంది “..(సెల్ఫీ )

*”గొర్రెల మధ్య గొర్రెలా
నక్కల మధ్య నక్కలా బతకడం
చాలా సులువు
మనిషిలా
బతకాలనుకోవడం కన్నా !”.

ఏ కవికైనా అనుభవం నేర్పే పాఠాలే కవిత్వం గా తన్నుకొని బయటకు వస్తాయనడానికి ఇంతకంటే రుజువులు అవసరమా?

ఈ సంపుటిలో చాలా కవితలు Narrative గా సాగుతాయి. సాధారణంగా Narration ను కథల్లో,నవలల్లో చూస్తాం. కవిత్వంలో అరుదుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు రాస్తున్న వారిలో చాలామంది Narration పట్ల మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ నరేషన్లో కవిత్వం లేకపోతే తేలిపోతుంది. శుద్ధ వచనంలా మిగిలిపోతుంది.
ఈవిషయంలో బొల్లోజు బాబా చాలా జాగ్రత్తపడ్డాడు. “Message in train, ”నన్ను క్షమించవూ, ప్రయాణం, ఒక..పురా..ప్రకాశం “,
“Alone but together, ఒక apocalypse అనంతరం, “ ఏం పని వుంటుంది నీకు?” తదతర కవితల్లో Narration ను చూడొచ్చు.

ఈ కవికి మానవ బంబంధాల పట్ల గౌరవం వుంది.ఈ కింది ఫ్రాగ్మెంట్ చూడండి .

“సామాన్లు సర్దుతుంటే
పాత ఫోను కనిపించింది
ఆన్ అయింది చిత్రంగా
కాంటాక్ట్స్ లో అమ్మ నంబరు
అలాగే వుంది “.

ఈ సృష్టిలో అనంతమైంది అమ్మ ప్రేమ ఒక్కటే.అలాంటి అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం ఎంత నిర్లక్ష్యం చేసినా అమ్మ ప్రేమ మాత్రం అలాగే వుంటుంది అనడానికిది నిదర్శనం.
ఈ విషయాన్ని ఎంత గుంభనంగా చెప్పాడో బొల్లోజు బాబా చూశారుగా. ఇలాంటి వ్యక్తీకరణలే కవి స్థాయిని పెంచుతాయి.

“గురుదేవులకు వందనాలు “ కవితలో గురు శిష్య సంబంధాన్ని గొప్పగా చెప్పాడు.

*“స్కూలు అంటేనే గురువులు
గురువులంటే నిన్నూ నన్నూ
గురిచూసి సంధించే విలుకాళ్ళు “.

గురువులను విలుకాళ్ళుగా భావించడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా..

" స్త్రీ " అనే కవితలో చివరి స్టాంజా కంట తడిపెట్టిస్తుంది.

తన స్వప్నాల్ని బతికించుకోడానికి
ఓ కుర్రాడు నేత్రాల్ని అమ్ముకొని అంథత్వాన్ని,
హృదయాన్ని అమ్ముకొని అల్పత్వాన్ని
కొనుక్కుంటాడు.
నువ్వు ఇదివరకటి లా లేవు అంటుంది ఆమె.
కాలికింద నేల కూలినట్లు
అనిపిస్తుందతనికి..

*”ఆమె ఒళ్ళో చేరి
వలవలా ఏడ్చేస్తాడు
ఆమె
తన స్తన్యాన్ని అతని
నోటికి అందించి
ఓదారుస్తుంది “!

త్యాగానికి ప్రతీక స్త్రీ మూర్తి. స్త్రీ స్తన్యం అమృతమనే దివ్యౌషధాన్నిచ్చే ప్రేమ కడలి.

ఇలాంటిదే మరొకటి.. ”గుండె పూడిక ఎవరైనా తీస్తే బావుండు".. వంటి ప్రయోగాలు హృదయానికి హత్తుకొని ఆలోచింపజేస్తాయి.

వ్యక్తిత్వాన్ని గౌరవించే ఈ కవి..”ఇంకొకరి అభిప్రాయంగా వుండే కన్నా.! నువ్వే ఓ సిద్ధాంతంలా మారు “ అంటాడు.

”ఇప్పుడీ దేశానికేమైంది? ఎవరిని వధశాలలకు పంపటానికి ఇది కుట్రలు పన్నుతోంది?” వంటి పదునైన పద ప్రయోగాలతో వర్తమాన పరిస్థితుల్ని కళ్ళముందు నిలిపాడు!

ఒకటా..రెండా? ఎన్నని చెప్పేది.మీరే చదివి తెలుసుకుంటే మరింత రస స్ఫూర్తి కలుగుతుంది.

చివరగా...ఈ మూడో కన్నీటి చుక్క ఏమిటో చెప్పి ముగిస్తాను.

*”ఏ రెండు
కన్నీటి చుక్కలు ఒకేలా వుండవు
వాటిని చూసినపుడు
జారిన మూడో కన్నీటి చుక్క
కవిత్వం !!

ఇప్పుడర్థమైందిగా..సమాజాన్ని చూసి,అనుభవించి రాసిన కవిత్వమే..!”మూడో కన్నీటి చుక్క “!
ఈ కన్నీటి చుక్క చాలా చిక్కనైనది..మంచి రంగు కలది..రుచికరమైంది.
రుచి చూడటం ఇక మీ వంతు.!!

*మూడో కన్నీటి చుక్క ,కవితా సంపుటి
వెల.రూ.100/ పేజీలు.119.
కాపీల కొరకు
బొల్లోజు బాబా
30.7.31
సూర్యనారాయణ పురం
కాకినాడ,తూ.గో.జి
ఆంధ్రప్రదేశ్
ఫోన్.9849320443
0884..2368189

No comments:

Post a Comment