Monday, December 2, 2019

మెకంజీకి సహాయపడిన కావలి సోదరులు
ఏలూరు కు చెందిన కావలి వెంకట సుబ్బయ్యకు నలుగురు కుమారులు ఒక కుమార్తె. ఆ నలుగురూ వరుసగా వెంకట సీతయ్య, వెంకట రామస్వామి, వెంకట బొర్రయ్య, వెంకట లక్ష్మయ్య. కుమార్తె పేరు లక్ష్మి దేవమ్మ. ఈమెకు విస్సన్నకోట జమిందారు రమణప్పతో వివాహం అయింది. వారికి పిల్లలు లేకపోవటంతో వెంకట సీతయ్య తన కుమారుడిని దత్తత ఇచ్చి విస్సన్నపేట జమిందారీని సొంతం చేసుకొన్నాడు. (రి. కృష్ణా జిల్లా మాన్యువల్, పే 339)
మిగిలిన ముగ్గురు సోదరులు కల్నల్ కాలిన్ మెకంజీ వద్ద సహాయకులుగా పని చేసారు.
కావలి వెంకట బొర్రయ్య (Cavelly Venkata Boriah) (1776-1803)
బొర్రయ్య 1776 లో ఏలూరులో జన్మించాడు. ఇతను ఏలూరు లోని ఒక ప్రెవేట్ స్కూలు లో పది సంవత్సరముల వరకూ విద్యనభ్యసించాడు. ఆ తరువాత సంస్కృతం నేర్చుకోవటంకోసమని ఆ స్కూలునుండి బయటకు వచ్చేసి సాంప్రదాయ సంస్కృతపాఠశాలలో చేరాడు. ఇక్కడ అయిదారు నెలలలోనే సంస్కృతంలో ప్రావీణ్యత గడించి సొంతంగా పద్యాలల్లేవాడట.
అప్పటికే ఇతని అన్నలు ఈస్ట్ ఇండియా కంపనీలో ఉద్యోగులుగా ఉండటం, వారిలాగే తానుకూడా ఉన్నతంగా జీవించాలనే ఆశయంతో ఉండేవాడు బొర్రయ్య. ఈ క్రమంలో తన ఇంటికి రెండుమైళ్ల దూరంలో కల కొత్తూరు వెళ్ళి పెర్షియన్, హిందీ భాషలను,నేర్చుకొన్నాడు. పద్నాలుగేళ్ళు వచ్చాక మచిలీపట్నంలో Mr. Morgan నడుపుతున్న స్కూలులో చేరి కొన్నాళ్లు విద్యాభ్యాసం చేసాడు. ఇది 1790-93 మధ్య కాలం కావొచ్చు. అప్పట్లో చర్చిఫాదర్లే చర్చ్ లలో విద్యాబోధన చేస్తుండేవారు.
తీరిక సమయాలలో తెలుగు సాహిత్యం, చందస్సు, అలంకారశాస్త్రం అభ్యసనం చేస్తూ పద్యాలు రాయటం మొదలు పెట్టాడు. అత్తలూరి పాపయ్య వ్రాసిన కవిత్వం ఎక్కువగా ఇష్టపడేవాడు.
మచిలీపట్నంలో ఆంగ్లేయులతో ఏర్పడిన పరిచయాల ద్వారా బొర్రయ్య ఈస్ట్ ఇండియా కంపనీ, మచిలీపట్నం సైనిక విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. ఒంగోలు, మునగాల, కొండపల్లి లాంటి వివిధ ప్రాంతాలలో ఉంటున్న సైనికులకు జీతాలను తీసుకొనివెళ్ళి పంచిపెట్టే ఉద్యోగం అది. ఉద్యోగరీత్యాకూడా బొర్రయ్యకు అనేకమంది ఆంగ్లేయులతో పరిచయాలు పెరిగాయి. అప్పటికి ఇతని వయసు పద్దెనిమిదేళ్ళు. కొంతకాలం నర్సాపురంవద్ద బ్రిటిష్ స్థావరమైన మెడపొల్లం (మాధవపాలెం) లో కూడా పనిచేసాడు.
కల్నల్ మెకంజీ వద్ద పనిచేస్తున్న సోదరుడు నారయణప్ప (క్రిష్ణా జిల్లా మాన్యువల్ 338 పేజి లో నారాయణప్ప వెంకట లక్ష్మయ్య కొడుకు అని ఉంది) సిఫార్సుతో, బొర్రయ్య మెకంజీ వద్ద ప్రధాన లేఖకునిగా ఉద్యోగంలో కుదిరాడు. బొర్రయ్య మేధాశక్తులపట్ల మెకంజి ఎంతో మాన్యత కలిగిఉండేవాడు. బొర్రయ్య చక్కని చిత్రకారుడు కూడా కావటంతో అనేక ఆలయాల డ్రాయింగులను చిత్రించాడు
1798 లో టిప్పుసుల్తాను గొడవల సమయంలో ఒక నిజాం జమిందారుకి చెందిన అనుచరులు కంపనీ కాగితాలను ఎత్తుకుపోతే, వాటిని తిరిగి సంపాదించిపెట్టమని బొర్రయ్య ను కోరాడు మెకంజీ. ఆ జమిందారు బొర్రయ్యను ఖైదు చేయించి తిండితిప్పలు పెట్టకుండా హింసించాడు. బొర్రయ్య ధైర్యం కోల్పోకుండా ఆ జమిందారుని పొగుడుతూ పద్యాలు అల్లి, అతని విశ్వాసాన్ని చూరగొని మెకంజీ కాగితాలతో పాటూ తనుకూడా అనేక బహుమతులను సంపాదించుకొన్నాడు.
తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృతం, పర్షియన్, భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండటంతో దక్షిణ భారతదేశ శాసనాలను అర్ధంచేసుకొని అవలీలగా ప్రతులు తీసి ఇంగ్లీషులోకి అనువదించేవాడు బొర్రయ్య. కొన్ని సార్లు బొర్రయ్య దట్టమైన అరణ్యాలు, కొండలు, వాగులు దాటుకొని విషయసేకరణ జరపాల్సివచ్చేది.
బొర్రయ్య వ్రాసిన- Account of the Jains, collected from a priest of this sect at Mudgeri; Translated by Cavelly Boria, Brahmin: for Major C Mackenzie - 1809 Asiatic Researches vol 9 - అనే పరిశోధనాత్మక వ్యాసం భారతదేశ జైనమత పునరుజ్జీవనంలో మైలురాయిగా నిలిచిపోయింది.
మెకంజీ 1811-13 ల మధ్య జావా బదిలీ అయినపుడు బొర్రయ్య ఏలూరు వచ్చేసాడు. ఈ కాలంలో టిప్పు సుల్తాను, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధవిశేషాలను కావ్యంగా రాసాడు (?). శ్రీరంగ రాజుల వంశావళిని తెలియచేసే “శ్రీరంగరాజ చరిత్ర” కావ్యాన్ని రచించాడు.
1803 లో ఇరవైఆరేళ్ల వయసులో బొర్రయ్య, రుద్రవాతం (మెదడు నరాలు చిట్లి హఠాత్తుగా మరణించటం) బారిన పడి అకస్మాత్తుగా చనిపోయాడు. బొర్రయ్య స్మారకచిహ్నాన్నిమద్రాసు సముద్రపు ఒడ్డున ఏర్పాటు చేయించాడు మెకంజీ. ఇది 1834 నాటికి అక్కడే ఉన్నట్టు కావలి లక్ష్మయ్య దక్కను కవులపుస్తకం పై The Journal Of The Royal Asiatic Society 1834 Vol. I లో వచ్చిన ఒక రివ్యూ వ్యాసం ద్వారా తెలుస్తున్నది.
బొర్రయ్యకు పన్నెండేళ్ళ వయసులోనే కసింకోట జమిందారైన వెంకటాచలం చిన్న సోదరితో వివాహమైంది. వీరిద్దరికీ ఒక కూతురు పుట్టి చనిపోయింది.
****
కావలి వెంకట లక్ష్మయ్య
ఇతని గురించి పెద్దగా వివరాలు తెలియవు. బొర్రయ్య చనిపోయాకా అతని ఉద్యోగాన్ని ఇతనికి ఇచ్చినట్లు అనుకోవాలి ఎందుకంటే ఇతను బొర్రయ్య తమ్ముడు కనుక.
మెకంజీ ముఖచిత్రంతో వచ్చిన Saturday Magazine, June 28, 1834 సంచికలో మెకంజీపై Alexander Johnston వ్రాసిన ఒక సంస్మరణ వ్యాసంలో వెంకట లక్ష్మయ్య ప్రస్తావన ఉంది. ఇందులో మెకంజీ మొదలుపెట్టిన పనిని కొనసాగించాలని, దీనికొరకు Royal Asiatic Society చర్యలు తీసుకొని, మెకంజీ సహాయకులను సంప్రదించాలని, వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని రాసుకొచ్చాడు.
తాను కావలి వెంకట లక్ష్మయ్యకు పైన చెప్పిన పనులను చేపట్టమని ఒక ఉత్తరం వ్రాసానని, అది అందుకొని – వెంకటలక్ష్మయ్య మద్రాసులో రెండువందల మంది ఔత్సాహిక స్థానికులతో Madras Literary Society ని స్థాపించి మెకంజీ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకు తెలియచేసాడు- అని అలెగ్జాండర్ పేర్కొన్నాడు
.
ఇదే వ్యాసంలో వెంకట లక్ష్మయ్య రాయల్ ఏసియాటిక్ సొసైటి లండన్ కు భారతదేశప్రతినిధిగా కావలి వెంకట లక్ష్మయ్య వ్యవహరిస్తూన్నడని ఉంది. అంతే కాక మెకంజీ చిత్రపటంలో టెలిస్కోపు ధరించిన వ్యక్తే లక్ష్మయ్య అని – అతన్ని నేను ఇటీవల కలిసానని చిత్రపటంలో ఉన్నట్లే ఉన్నాడని A. Johnston చెప్పినట్లు ఫుట్ నోట్సుద్వారా తెలుస్తుంది.
చాలాచోట్ల టెలిస్కోపు పట్టుకొన్న వ్యక్తి కిష్టప్ప అనే నౌకరుగా చెప్పబడ్డాడు. ఇది మరింత శోధించవలసిన విషయం. (ముందుపోస్టులో ఫొటో ఉంది) వెంకట లక్ష్మయ్య మద్రాసులో స్థిరపడ్డాడు.
ఇక మెకంజీ సేకరణలను కేటలాగు చేసింది లక్ష్మయ్య అని ఒక వాదన వినిపిస్తుంది. దీనికి ఆధారాలు లభించవు కానీ, మెకంజీ 1817 లోనే తన మిత్రుడు, అప్పటి ఏసియాటిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంటు అయిన Alexander Johnston రాసిన ఒక ఉత్తరంద్వారా -తన సేకరణలను 17 విభాగాలుగా విభజించుకొని సుమారు పది పేజీల నోట్సు రాసుకొని ఉన్నట్లు అర్ధమౌతుంది. (రి. Royal Asiatic society, Journal 1834 vol 1 p.no 333)
****
కావలి వెంకట రామస్వామి
ఇతని గురించి కూడా పెద్దగా వివరాలు లభించవు. మెకంజీ మరణించాక ఇతను ఉద్యోగం కోల్పోయి ఉంటాడు. వెంకట లక్ష్మయ్యలా అదే రంగాన్ని కాక మెకంజీ సేకరించిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావటానికి ప్రయత్నించినట్లున్నాడు. సి.పి బ్రౌన్ కూడా కాటమరాయని కథ, బొబ్బిలి యుద్ధం, కడప రాజుల చరిత్ర లాంటి పుస్తకాలు మెకంజీ సేకరణలనుంచే గ్రహించి ఉండచ్చనే ఊహ సత్యదూరం కాకపోవచ్చు. ఈ పని బ్రౌన్ కన్నా ఓ ముప్పై ఏళ్ల ముందే చేయటం రామస్వామి ముందు చూపు తెలియచేస్తుంది.
రామస్వామి 1829 లో కలకత్తా నుంచి, “దక్కను కవుల” పేరిట కవుల చరిత్ర అనే ఒక్క పుస్తకం మాత్రమే వెలువరించాడు.
ఈ పుస్తకాన్ని విలియం బెంటింగ్ కి చాలా భక్తితో అంకితమిచ్చాడు. దీనిలో నన్నయ, పోతన, అవ్వయార్, సుందరర్ లాంటి మొత్తం 79 మంది కవుల చరిత్రను ఇంగ్లీషులో అక్షరబద్దం చేసాడు. ఇది గొప్ప విశేషం. బహుసా ఇదే మొదటి తెలుగు కవుల చరిత్ర కావొచ్చు. (ఇందులో చాలామంది నేటి తెలంగాణాకు చెందిన కవులు కూడా ఉన్నట్లున్నారు. నాకు తెలియటం లేదు మిత్రులు పరిశీలించగలరు)
ఇతను చాలా కాలం కలకత్తాలో వ్యాపారాలు చేసి, చివరకు మద్రాసులో స్థిరపడినట్లు అర్ధమౌతుంది
బొల్లోజు బాబా
దక్కను కవుల పుస్తకం లింకు
https://archive.org/details/in.ernet.dli.2015.47980

No comments:

Post a Comment