Wednesday, December 4, 2019

భూమికి పుట్టినరోజు” జరిపే ఆకెళ్ల రవి ప్రకాష్ కవిత్వం

నా కవిత్వం మీద మంచి రివ్యూ రాసిన బొల్లోజు బాబా (Bolloju Baba) కు దాన్ని ప్రచురించిన కవిసంధ్య ( Kavi Sandhya ) సంపాదకులకు నా వందనాలు - ఆకెళ్ళ రవిప్రకాష్ Ravi Prakash 🙏
భూమికి పుట్టినరోజు” జరిపే ఆకెళ్ల రవి ప్రకాష్ కవిత్వం
(ఈ వ్యాసం కవిసంధ్య పత్రికలో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)
.
‘కవిత్వం అనేది ఒక ఉత్పత్తి కాదు అదొక ప్రయాణం’ అనే సత్యాన్ని తెలిసిన కవి శ్రీ ఆకెళ్ల రవిప్రకాష్. మూడు దశాబ్దాలుగా కవిత్వంతో సహచరిస్తున్న రవిప్రకాష్ తాజా కవిత్వ సంపుటి పేరు “భూమి పుట్టినరోజు”. రవిప్రకాష్ కవిత్వం స్వేచ్ఛగా, సౌందర్యవంతంగా, తేటగా ఉంటూనే ప్రతి వాక్యం వెనుకా లోతైన అంతర్వీక్షణ, నిశిత దృష్టి, జీవన తాత్వికత పొటమరిస్తూంటాయి.
కవిత్వానికి కళాత్మకత, నూత్నదృష్టి రెండు నేత్రాల వంటివి. చక్కని నిర్మాణము, భావ పుష్టి, సందర్భోచిత అలంకారప్రయోగం లాంటివి కవితావస్తువును కళాత్మకం చేస్తాయి. అందరకూ పరిచితమైన విషయాన్నే చెపుతున్నప్పటికి దానిని ఒక నూతన దృష్టితో వ్యక్తీకరించటం మంచి కవిత్వ లక్షణం. దాన్ని చదివిన ప్రతిఒక్కరు ఇది నాకొరకే చెపుతున్నాడీ కవి అని ఉద్వేగపడాలి. ఈ రెండు లక్షణాలు రవిప్రకాష్ కవిత్వంలో పుష్కలంగా కనిపిస్తాయి.
రవిప్రకాష్ కవిత్వంలో మామూలు దృశ్యాలు గొప్ప సౌందర్యచిత్రాలుగా రూపుదిద్దుకోవటం అనేక కవితలలో చూడవచ్చు.
రాత్రి పక్షి ఆకాశాన్ని
చిట్టచివరి గుటకలో
ఎలా మింగేస్తుందో చూడు (రైలు ప్రయాణం)
పూర్తిగా చీకటి పడి ఆకాశం కనిపించకుండా పోయింది అనే దృశ్యాన్ని గొప్ప ఇమేజెరీతో సౌందర్యమయం చేస్తాడు.
సగం తీరం మీదా
సగం రాళ్లమీదా
ఆరేసిన తెల్లని ఎండ దుప్పటి (మధ్యాహ్నం)
తెల్లని తీరంపైనా, నల్లని రాళ్లపైనా ఎండ ఒకేలా, తెల్లగా ప్రకాశిస్తుంది. ఎండను దుప్పటిగా పోల్చటం అందమైన ఊహ.
కవితను చివరివాక్యాలలో అనూహ్యమలుపు తిప్పటం రవిప్రకాష్ కవిత్వలక్షణం. ఇది చాలా కవితలలో కనిపిస్తుంది. అంతవరకూ కవిత ఏదోమామూలు వైయక్తిక ఘటనను వర్ణిస్తున్నట్లుంటుండి ఒక్కసారిగా గంభీరతను సంతరించుకొంటుంది. “పాప మనసు” కవితలో ఆసుపత్రిలో ఒక పాప అదేపనిగా ఏడుస్తుండటం కవితా వస్తువు. ఏవరూ ఊరుకోబెట్టలేకపోతున్నారు, ఏవో పూర్వజన్మ జ్ఞాపకాలు కావొచ్చట, పాపమనసు నిద్రాతీరంలోకి కరగటంలేదట, రాగాలన్నీ విషాదమయ్యాయి, రంగులన్నీ దుఃఖవర్ణంలోకి ఇంకిపోయాయి అంటూ అనేక వర్ణనలతో ఆ దృశ్యాన్ని, దాని వెనుకున్న ఉద్వేగాలను అద్భుతంగా పలికిస్తారు. ఇక ఆ కవిత చివరవాక్యాలు ఇలా ముగుస్తాయి
దివారాత్రాల బేధాన్ని మర్చిపోయి
ఆగకుండా రోదిస్తున్న సముద్రంలా
పాప మనసు/ (పాప మనసు)
కవితముగియగానే ఆలోచనలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకొంటాయి. ఇంతకీ పాప ఎవరు? సముద్రమా, కాలమా, జీవితమా, కవి దుఃఖమా అంటూ అనేక కిటికీలు తెరచుకొంటాయి. ఇస్మాయిల్ గారు అన్న “తెరుచుకొన్న పద్యం” అంటే ఇదేననిపిస్తుంది.
ఈ సంపుటిలో వివిధ శీర్షికలతో లఘుకవితలను వ్రాసారు ఇది శిల్ప పరమైన విశేషంగానే భావించాలి ఎందుకంటే ఈ ప్రక్రియకో పేరు పెట్టి ఖ్యాతి నొందాలనే ఉద్దేశం కనిపించదు. వానాకాలం పద్యాలు, విమాన పద్యాలు, ప్రశ్నలు, విశాఖనగర పద్యాల శీర్షికలతో ఉన్న కవితలలో ఈ రీతి కనిపిస్తుంది.
ఎవరూ నడవని రోడ్లమీద
నడుస్తూ వర్షం (వానాకాలం పద్యాలు)
భోరున పడే వానను గమనిస్తే, వాన జల్లు రోడ్డుపై ఒక్కోసారి ధారల పాదాలతో ముందుకు కదులుతూన్నట్లు అనిపిస్తుంది. చాలా సున్నితమైన పరిశీలన ఇది.
రవి ప్రకాష్ “విమాన పద్యాలు” పేరుతో వ్రాసిన కవితలలోని వర్ణనలు కూడా అంతే హృద్యంగా ఉంటాయి.
ఆకాశంలో ఒకడే చంద్రుడు
సముద్రం మీద వేల లక్షల చంద్రుళ్ళు - ఈ లోకానికి చంద్రుడొక్కడే కానీ సాగరతరగలపై ప్రతిబింబించే లక్షల చంద్రుళ్ళను చూడాలంటే విమానం కిటికీ పక్క సీటు దక్కించుకోవాల్సిందే.
వీధి దీపాల్ని మెళ్లో వేసుకుని
మాయా ద్వీపంలా వెలుగుతూ నగరం - అనే విమానపద్యంలో “మాయా ద్వీపం” అన్న ఒక్క పదంతో నగరాన్ని- పుర్రెలు మెడలో ధరించిన రాక్షసునిగా ధ్వనింపచేస్తారు.
నగరం అంటే రవిప్రకాష్ కు లౌల్యం. నగరం అంటేనే కొత్త స్వరాలు, కొత్త ఘర్షణలు, కొత్త అనుభూతులు. ఇవే కదా కవిత్వానికి ముడిసరుకు. తన ప్రతి సంపుటిలోను నగరం పై నాలుగైదు కవితలు ఉంటాయి. “ఇసక గుడి” సంపుటిలో పాండిచేరి నగరంపై వ్రాసిన పెద్దకవిత, ఈ సంపుటిలో మద్రాసు నగరంపై వ్రాసిన “మద్రాసులో ఒక రాత్రి” అనే కవిత అన్నింటిలోకి మకుటాయమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రతికవితలోను నగరం కొత్తగా దర్శింపచేయటం కవి ప్రతిభ.
కవిత్వం ఉద్వేగాలకు అక్షరరూపం ఇస్తుంది. ఇది మనుషుల్ని దగ్గరచేస్తుంది. ఒకరి పట్ల ఒకరికి దయ ప్రేమ కరుణ లాంటి అనుభూతులు కలిగింపచేస్తుంది. మానవ సంబంధాలను పటిష్టపరుస్తుంది. ఈ సంపుటిలోని అనేక కవితలు మానవ సంబంధాలలోని ఆర్థ్రతను నిండారా ఆవిష్కరిస్తాయి.
“నాన్న ఉంగరం” కవితలో పద్దెమిదేళ్ళక్రితం గతించిన తండ్రిగారి ఉంగరాన్ని తను ప్రస్తుతం ధరించటం పై వ్రాసిన కవితలో…
జాలరి వలల చుట్టూ
గాఢమవుతున్న సాయింత్రపు నీడలా
నాన్న మౌనాన్ని కూడా
తనలోకి ఇముడ్చుకుందీ వుంగరం//
చిత్తం ఇసక తీరం మీద
మెత్తగా జారిపడిన పండుటాకులా
వెచ్చగా స్పర్శిస్తూవుంటుందీ వుంగరం - (నాన్న వుంగరం).
నాన్న ఉంగరాన్ని ధరించటం అంటే ఆ తరాన్ని, ఆ తరపు బాధ్యతల్ని వెచ్చని స్పర్శగా దాల్చటమే. ముందు తరానికి వారసులుగా మనం కొనసాగించాల్సిన పారంపర్యతకు ఉంగరాన్ని ప్రతీకగా చేస్తున్నాడు కవి. తాను కూడా గాఢమవుతున్న సాయింత్రాన్ని చేరుకొంటున్నాను అనే స్పృహ ధ్వనిస్తుందీ కవితలో. ఇదొక పునరావృత క్రీడ.
“జీవనదీ ఆరు ఉపనదులు” కవితలో “ఆడవాళ్లందరినీ వంటింట్లోకి /వెళ్లడాన్ని నిషేధించి /మనందరినీ పాలించమంటే /ఈ భూప్రపంచం /ఎంత మార్ధవంగా /ఎంత సున్నితంగా /ఎంత దయగా /ఎంత నిర్భయంగా /మారిపోతుందో చూడాలని ఉంది” అంటాడు. ఇది స్త్రీల సామర్ధ్యం పట్ల, స్త్రీలకు దక్కాల్సిన సాధికరత పట్ల కవికి ఉన్న సహానుభూతిని పట్టిచూపుతుంది.
ఊరినుంచి వస్తూ బహుమతులు తెచ్చే తండ్రిని గుర్తుచేసుకుంటూ వ్రాసిన “నాన్న జ్ఞాపకం”; ఆవిర్లు గక్కే వంటల్ని వడ్డించే అమ్మను తలచుకొంటూ వ్రాసిన “వంటిల్లు”; తన సహాద్యాయి మరణంపై వ్రాసిన “సూర్యుని మరణం” లాంటి కవితలలో మానవసంబంధాలు కరుణాత్మకంగా వ్యక్తీకరించబడ్డాయి.
ఈ లోకంపైనా, మనుషులపైనా, మనో వేదనలపట్లా, మానవ సంబంధాలపైనా అవ్యాజమైన అనురక్తే రవిప్రకాష్ కవిత్వ తత్వం. మానవాళిపై అచంచలమైన ప్రేమ అనేక కవితల అంతఃసూత్రం.
మానవాళి మొత్తం
ఒకే దేశంగా ఒకే మతంగా ఏకమయ్యి
ఒకర్ని పాలించాలనుకునే వాళ్లనీ
ఒకర్ని నియంత్రించాలనుకునే వాళ్ళనీ
భూగోళం మీంచి ఖాళీ చేసి
పంపాల్సిన రోజు
ఒకరోజు తప్పక వస్తుంది
ఆ రోజు కోసం మళ్ళీ
భూమి పుట్టిన రోజు కోసం
ఎదురుచూస్తూ - (భూమి పుట్టిన రోజు) అనే వాక్యాల ద్వారా- కవి యుద్ధాలు, నియంతలు, అడ్డుగోడలు లేని వసుధైక కుటుంబాన్ని స్వప్నిస్తున్నాడని అర్ధమౌతుంది.
ఈ క్రమంలో శాస్త్రీయత, మేధలను, కవి కలలు, ఊహలు డామినేట్ చేస్తున్నట్లు అనిపించినా ఇది ఒక బృహత్ స్వప్నం. ఎంతవరకూ వాస్తవలోకంలో జరుగుతుందో తెలియదు కానీ ప్రతి మనిషి మనోలోకంలో ఈ స్వప్నం సాకారం అయిన రోజు ఈ భూమికి నిజంగా పుట్టిన రోజే అవుతుంది.
రవిప్రకాష్ భావుకుడు, మానవతావాది, గజిబిజి జీవితంలోని సౌందర్యాన్ని ఒడిసిపట్టుకోగలిన బాహ్యనేత్రం; చిక్కులు పడిన ఆలోచనలల్లో మెరుపులా కనిపించి మాయమయ్యే జీవనతాత్విక వ్యాఖ్యానాన్ని దర్శించగలిగే అంతర్నేత్రం కలిగినవాడు, కవిత్వానికే కట్టుబడిన నైష్టికుడు.
ఈ పుస్తకానికి డా.రవూఫ్ ముందుమాట వ్రాసారు. కవితలకు శ్రీ గిరిధర్ వేసిన చక్కని చిత్రాలు కవితాత్మకు అలంకారంగా ఉన్నాయి. మంచి, సాంద్రమైన కవిత్వాన్ని ఇష్టపడేవారికి భూమిపుట్టిన రోజు తప్పక నచ్చుతుంది.
- బొల్లోజు బాబా




No comments:

Post a Comment