Tuesday, July 28, 2020

సప్తశతి గాథల భౌగోళికత - పార్ట్ 12

సప్తశతి గాథల భౌగోళికత - పార్ట్ 12
.
ఒకటో శతాబ్దానికి చెందిన శాతవాహన వంశానికి చెందిన హాలచక్రవర్తి గాథాసప్తశతిని సంకలనపరిచాడు. సప్తశతి గాథల భౌగోళికతను గుర్తించటానికి శాతవాహన సామ్రాజ్యస్వరూపాన్ని అర్ధం చేసుకోవలసి ఉంటుంది.
ఉత్తరాదికి చెందిన మౌర్యవంశపాలకులకు సామంతులుగా ఉండి పరిపాలన సాగించిన శాతవాహనులు క్రీపూ 232 లో అశోకుని మరణం తరువాత స్వతంత్ర్యం ప్రకటించుకొని (శ్రీముఖుడు) సొంతంగా రాజ్యం ఏలటం మొదలుపెట్టారు. సాతవాహనుల Home Town ఎక్కడ అనేదానిపట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరు తెలంగాణలోని కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించినట్లు Ajay Mitra Shastri మొదట్లో ప్రతిపాదించినా తరువాత ఆయన ఆ వాదనను వెనక్కు తీసుకొన్నారు. James Burges, Barnet వంటి చరిత్రకారులు శాతవాహనుల మొదటి రాజధాని శ్రీకాకుళం, తరువాత అమరావతి పిదప ప్రతిష్టానపురం గా పేర్కొన్నారు. P.T Srinivasa Iyyangar VV Mirashi లు వీరు మొదట ప్రతిష్టానపురం, తరవాత అమరావతిగా పేర్కొన్నారు.

కోటిలింగాల ఇంకా సమీప ప్రాంతాలలో శాతవాహనులకు చెందిన విలువైన నాణాలు దొరికాయి. వీటి ఆధారంగా శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అని చెప్పటానికి ఖారవేలుని హాతిగుంఫ శాసనము, నాసిక్ శాసనాలు, అమరావతి శాసనాలు, ఇటీవల కర్ణాటకలో బయటపడ్డ కనగనహళ్ళి శాసనాలు ప్రతిబంధకమౌతాయి. ఎందుకంటే వాటిలో ఎక్కడా దీని ప్రస్తావన లేదు. బహుసా మెగస్తనీస్ చెప్పిన 32 మహా నగరాలలో కోటిలింగాల కూడా ఒకటి కావొచ్చు.
శాతవాహనులు తూర్పు దక్కను ప్రాంతంలో ఉద్భవించి ఉండవచ్చని ఆర్.జి. భండార్కరు వంటి కొందరు చరిత్రకారులు భావించారు. ఇది కృష్ణాజిల్లాలో ఉన్న శ్రీకాకుళం అయి ఉండవచ్చునని ఒక ఊహ. దీనిప్రకారం శాతవాహనులు మొదట్లో కృష్ణా, గోదావరి నదుల డెల్టా ప్రాంతంలో ఉద్భవించి ధరణికోట కేంద్రంగా పాలన సాగించారు. తరువాత మహారాష్ట్ర, పశ్చిమ, మధ్య భారతదేశానికి విస్తరించి, జన్నూరు (పూనె), ప్రతిష్టానపురం (మహారాష్ట్ర) లను రాజధానులుగా చేసుకొన్నారు. శాతవాహనులు అయిదు శాఖలుగా విడిపోయారు. వీటిలో ఒకటి కుంతల రాజ్యం. ఇది నేటి కర్ణాటక రాష్ట్రంలో కలదు. హాలుడు కుంతల రాజు గా చెప్పబడ్డాడు. ఇతను నాలుగేండ్లు మాత్రమే పాలన సాగించాడు (క్రీశ. 20-24).
క్రీశ. 220 వరకూ వీరి పాలన కొనసాగింది. శాతవాహనులు ఉత్తర దక్షిణభారతదేశ భాగాలను అంటె సుమారు యాభైశాతం భారత భూభాగాన్ని, 450 సంవత్సరాలపాటు పాలించిన ఆంధ్ర రాజులు. ఇంతటి ఘన చరిత్ర మౌర్యులు, గుప్తులు, మొఘలులు చివరకు బ్రిటిష్ వారికి కూడా లేదు.
***
వింధ్యపర్వతాలనుండి తుంగభద్రా నది వరకుఉన్న భారతదేశభూభాగాన్ని దక్షిణాపథం అంటారు. దీనికి పైన ఉన్న ప్రాంతాన్ని ఉత్తరాపథం అని, క్రిందన దక్షిణ దేశం (నేటి తమిళనాడు కేరళలు) గా పిలుస్తారు. శాతవాహనులు నేటి ఆంధ్ర, తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల భూభాగాన్ని ఏకంచేసి పరిపాలన సాగించారు.
సప్తశతి గాథలలో గోదావరి, తపతి, నర్మద/రేవా వంటి నదులు, వింధ్యపర్వతాల యొక్క ప్రస్తావనలు విరివిగా కనిపిస్తాయి. ఉత్తరభారతదేశపు భౌగోళిక చిహ్నాలయిన హిమాలయాలు, గంగ, యమున (ఒక గాథలో మాత్రమే) లాంటివి కనిపించకపోవటాన్ని బట్టి ఈ గాథలు పూర్తిగా దక్షిణభారత ప్రాంతానికి రచనలుగా భావించవచ్చు.
శాతవాహన రాజ్యం తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియన్ సముద్రాలను హద్దులుగా కలిగి ఉండటంచే సముద్ర ఉత్పత్తులైన ముత్యాలు, శంఖాల గురించి చాలా గాథలలో కనిపిస్తుంది.
1. పర్వతాలు
.
వింధ్యపర్వతాలు మధ్యప్రదేష్, రాజస్థాన్, గుజరాత్ లలో విస్తరించిన పర్వతశ్రేణి. సాత్పూరా పర్వత శ్రేణిని కూడా ప్రాచీన రచనలలో వింధ్య పర్వతాలుగానే వర్ణించారు. ప్రాచీన ఉత్తరభారత సంస్కృత సాహిత్యానికి, దక్షిణభారత ప్రాకృత సాహిత్యానికి వింధ్యపర్వతశ్రేణి సరిహద్దుగా నిలిచింది. సప్తశతి వ్రాయబడిన కాలం తరువాత ఈ సరిహద్దు క్రమేపీ చెరిగిపోయింది. శాతవాహనులు ఉత్తర దక్షిణ భారతీయ సంస్కృతులకు వారధిగా నిలిచారు.
.
శాతవాహన రాజులకు సంస్కృతం రాదు అనేది చెప్పటానికి ఒక గాథ ప్రచారంలో ఉంది. ఒకనాడు శాతవాహన రాజు జలక్రీడ సమయంలో రాణిపై నీటిని చల్లినపుడు ఆమె “మా మోదకై స్తాడయ’ (నన్ను నీటితో కొట్టవద్దు) అన్నదట. ఆ వాక్యాన్ని అర్థంచేసుకోలేని రాజు, మోదకాలు (లడ్లు)తో కొట్టమంటున్నదని భావించి- ఓ బుట్టతో లడ్లు తెప్పించాడట. రాణి పకపక నవ్వటం చేత, ఆ అవమానాన్ని భరించలేక ఆ రాజు ఆరునెలలలో సంస్కృతం నేర్చుకొని నిష్ణాతుడయ్యాడట. పై గాథలోని రాజు హాలుడేనని అంటారు. ఈ గాథద్వారా- దక్షిణ భారతదేశ రాజులకు/ప్రజలకు సంస్కృతం రాదని, వారు తొందరలోనే ఆ భాషను నేర్చుకొని నగరీకులు అయ్యారని అర్ధం చేసుకోవాలి. ఈ సాంస్కృతిక మార్పు ఫలితంగా ప్రాకృత, పైశాచి, పాళి భాషలు నశించిపోయాయి.
***
సప్తశతిలో వింధ్యపర్వత ప్రస్తావన ఏడు గాథలలో కనిపిస్తుంది. వింధ్యపర్వతలోయల్లో తిరుగుతున్న నల్లని మబ్బులను పుళిందులు నల్లని ఏనుగుల మంద అని భ్రమించారట; వింధ్యపర్వత సానువులకు కాసేపు అతుక్కొని విడిపోయే మబ్బులు, వింధ్యపర్వతాలు విడుస్తున్న చర్మపుపొరలవలె ఉన్నాయట.
.
కారుచిచ్చువల్ల నల్లబడ్డ వింధ్యపర్వత శ్రేణి
తెల్లని మబ్బులతో కలసి
క్షీరసాగరమధన సమయంలో
ఎగసిపడిన పాలతుంపరలు పడ్డ విష్ణుమూర్తిలా ఉన్నది. (117)
.
వింధ్యపర్వతాల అందాలను వర్ణించే అందమైన గాథ ఇది. వింధ్యపర్వతాలను విష్ణుమూర్తితోను, మబ్బుల్ని పాలచుక్కలతోను పోల్చటం ఎంతో రమ్యమైన భావన.
***
.
వింధ్యపర్వత శిఖరములపైకెక్కి చేసిన యుద్ధములో
క్షతగాత్రుడై ఇంటికి తిరిగి వచ్చిన సంగతి ఎవరూ మాట్లాడకండి
గ్రామపెద్దకు ఇంకా ఊపిరాడుతోంది
ఆ మాట వింటే అవమాన భారంతో ప్రాణాలు వదిలేస్తాడు. (731)
.
పై గాథలో వింధ్యపర్వతాలు ఎక్కి చేసిన యుద్ధం గురించి ప్రస్తావించబడింది. వింధ్యపర్వతాలు దక్షిణాపథానికి పెట్టని కోట. భారతదేశ ఉత్తర పశ్చమప్రాంతాలను పాలించిన - ఇండోగ్రీకులు, సిథియనులు (చైనా), పార్థియనులు,, క్షాత్రపులు (పెర్షియా), కుషానులతో (మంగోలియా)- శాతవాహనులు అనేక యుద్ధాలు చేసారు. ఆ క్రమంలో జరిగిన ఒక యుద్ధాన్ని పై గాథ చెపుతున్నది. యుద్ధంలో గాయపడి ఇంటికి రావటం అవమానకరమని ఆనాటి ప్రజలు భావించేవారని అనుకోవాలి. ఈ సంఘటనలో వర్ణించిన మానవీయకోణం అద్వితీయమైనది.
వింధ్యపర్వతం కాక మందర పర్వత ప్రస్తావన ఉన్నప్పటికీ అది పౌరాణిక వర్ణనగా భావించాలి. అలాగే అనేక గాథలలో మలయపవనాలు ప్రేమోద్దీపన కలిగించినట్లు ఉన్నప్పటికి వాటికి భౌగోళికతను ఆపాదించలేం.
.
2. నదులు
సప్తశతి గాథలలో నర్మద (కొన్ని గాథలలో రేవానది పేరుతో), తపతి, గోదావరి నదుల ప్రస్తావనలు విరివిగా కనిపిస్తాయి.
ఈ నదులు మధ్యప్రదేష్, గుజరాత్ మహరాష్ట్రా, తెలంగాణ, ఆంధ్రప్రదేష్, కర్ణాటక రాష్ట్రాలలో ప్రవహిస్తాయి.
.
ఒప్పుకొంటాను
ఇతర నదులకు కూడా మెత్తని తీరాలు, పక్షుల కూజితాలు
ఇరువైపులా పొడవైన గుబురు వనాలు, చల్లని నీళ్ళు
అన్నీ ఉండొచ్చు కానీ రేవా నది అందాలు వేరే!
నిరుపమానమైనవి. (678)
.
స్వర్గమైనప్పటికీ సొంతఊరుకు సాటిరాదు అంటాడో సినీకవి. మన బాల్య యవ్వనాలతోముడిపడి ఉండే వూరి వాగు, వంకలు, నదీ తీరాల అందాలు ఏనాటికీ నిరుపమానమైనవే.
***
.
ఓసీ నర్మదా!
ఈ రోజు నీవు నీ ప్రియుడైన వరదప్రవాహంతో కూడి
వెదురుపొదలలో నిర్లజ్జగా ఆడిన సరసాలను
నీ భర్త అయిన సముద్రునితో చెబుతాను. (760)
.
Image may contain: text that says "WESTERN SATRAPS Ujjaini Map 7: The Satavahana (Andhra) heartland 150 Bce- 200C 200 Vidisha Sanchi Narmada Baruch 100 miles 100 200kms Tapri Ajanta Nasik Thal Ghat Sopara Kanheri Junnar Nane Ghat Pratisthana Karle Arabian Sea KALINGA Kirishna KONKANA Nagarjunakonda Rajahmundry Amaravati Bay of Bengal"పై గాథ ఏదో బ్లాక్ మెయిల్ వ్యవహారంలా కనిపిస్తున్నప్పటికీ ఆ గాథలోని బిగి ఆశ్చర్యం కలిగిస్తుంది. నదిని స్త్రీగా, సముద్రుడిని పురుషునిగా వారిరువురిని భార్యభర్తలుగా వర్ణించే పద్దతి పౌరాణిక సాంప్రదాయమే. పై గాథలో అందం ఎక్కడ ఉందంటే- సాధారణంగా నది వరదల సమయంలో మాత్రమే పొంగి పొర్లి తీరంపై ఉండే పొదలను ముంచెత్తుతుంది. నదీతీరపు వెదురు పొదలలో యువతీయువకులు సాగించిన స్వేచ్ఛా ప్రణయాలను వర్ణించిన గాథాకారుడు నర్మదా నది కూడా తన వరదప్రియునితో సరసాలాడటానికి వెదురుపొదలలోకి దూరిందనటం ఎలా ఉందంటే- కాల్పనికతకు అంతం అనేది ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నిస్తే ఇదిగో ఇక్కడ ఉంటుంది అని ఉదహరించే విధంగా ఉంది.
***
.
గోదావరి రేవు మెట్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయనే సాకుతో
ఆమె అతని చాతీకి అతుక్కుపోయింది
అతనుకూడా నిజంగా అదే ఉద్దేశంతో
ఆమెను బలంగా కౌగిలించుకొన్నాడు (193)
.
అందమైన దృశ్యమిది. ఆమెకు అతడంటే ఇష్టం. గోదావరి నీళ్ళరేవు మెట్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయనే వంకతో తన ఇష్టాన్ని అతనికి తెలియచేసింది. బహుసా అతనికి కూడా ఆమంటే ప్రేమే కావొచ్చు. ఆమె జారి పడిపోకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే బిగికౌగిలిలో బంధించాడట. గొప్ప తోడుదొంగలు ఇరువురూ…. పట్టపగలే పదిమందిలో పట్టుబడకుండా తమ ప్రేమను ప్రకటించుకొన్నారు.
.
అతని మగసిరికి దక్కిన అదృష్టము
నా ఆడతనం చూపిన బరితెగింపు
ఉప్పొంగి తొంగిచూసిన గోదావరికి ఇంకా
వానాకాలపు రాత్రులకు మాత్రమే తెలుసు (231)
.
పై గాథ రెండువేల సంవత్సరాల నాటిది. కాలగమనంలో ఈ గోదావరి తన ఇసుకతిన్నెల పరుపులపై సుఖించిన ఎన్నెన్ని జంటల రహస్యాలను తన అలల కనులతో చూసిఉంటుందీ!.
***
Image may contain: text that says "Shravasti Gadhasapthasati Geography Satavahana Dynasty First Century Bec Second Century CE Vindhyas Narmada Tapati Madhyapradesh Naneghat junnar Paithan Maharashtra Arabian Sea Godavari Bay of Benga Telangana Karnataka Krishna Amaravathi (Dhanyakataka) Andhra Pradesh"మొత్తం గాథలలో నర్మదా/రేవా నది ప్రస్తావన అయిదు గాథలలో, తపతినది ఒక గాథలో, గోదావరి పన్నెండు గాథలలో కనిపిస్తాయి. ఈ గాథలు ప్రధానంగా గోదావరి నది ప్రవహించే మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందినవిగా నిర్ధారించవచ్చును. ఈ గాథలలో ఎక్కడా సముద్రం, గుర్రాలు, బ్రాహ్మణుల గురించి లేకపోవటం గమనార్హం.
.
పిచ్చిపిల్లా!
యవ్వనం వరదపొంగులాంటిది
పగళ్ళు పరుగులు పెడతాయి
రాత్రులు తిరిగిరావు
ఎందుకు నీకీ పెంకి అలక? (45)
.
పై గాథ ఉత్త సంభాషణ. మగనిమీదో, ప్రియుని మీదో అలిగి దూరంగా ఉంటున్న ఒక అమ్మాయికి, ఆమె అత్తో, స్నేహితురాలో ఇస్తున్న సలహా అది. యవ్వనం వరదపొంగులా వచ్చిపోతుంది, అది ఉన్నప్పుడే జీవితాన్ని అనుభవించు అంటూందామె. ఇందులో తత్వమూ ఉంది, మానవసంబంధాలను ముడివేసే తార్కికతా ఉంది. "వయసుకాస్త ఉడిగినాక మనసుండీ వ్యర్ధమూ" అంటూ ఆత్రేయ చేసిన హెచ్చరికలాంటిది కూడా ఉంది.
.
వరదలో కొట్టుకుపోతున్న
చెట్టుకొమ్మ చివరన గూటిలో ఉన్న తన పిల్లలను
కాపాడాలని వరదను వెంబడిస్తోంది తల్లి కాకి. (202)
.
ఇదొక కరుణపూరిత దృశ్యం. వరదలు జీవనాన్ని అతలాకుతలం చేస్తాయి. వాటి బీభత్సం నదీపరివాహక ప్రాంతాలలో నివసించేవారు మాత్రమే నిక్షిప్తం చేయగలిగే దృష్టాంతం. పై గాథలో వర్ణించబడిన తల్లి కాకి రక్షణకు, మాతృత్వభావనకు సూచిక. ఇది సర్వకాల సర్వావస్థలలోను పశుపక్ష్యాదులలోనే కాదు మానవులకూ వర్తించే సార్వజనీన దృగ్విషయం.
***
సప్తశతి గాథలలో వర్ణించబడిన ప్రదేశాలను బట్టి ఇవన్నీ వింధ్యపర్వతాలకు దక్షిణప్రాంతానికి చెందినవని, నర్మద, తపతి, గోదావరి నదీ తీరప్రాంతానికి చెందినవని భౌగోళికంగా నేటి మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేష్ రాష్ట్రాలకు చెందినవని భావించవచ్చు.
బొల్లోజు బాబా



No comments:

Post a Comment