Tuesday, July 14, 2020

బంధన ఛాయ – నామాడి శ్రీధర్ (December 11, 2009 న పుస్తకం వెబ్ సైటులో వ్రాసిన సమీక్ష)

బంధన ఛాయ – నామాడి శ్రీధర్
(December 11, 2009 న పుస్తకం వెబ్ సైటులో వ్రాసిన సమీక్ష)
****
తూర్పు గోదావరి అంబాజీపేటకు చెందిన శ్రీధర్, విప్లవోద్యమాలు, సామాజికోద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. పాత్రికేయునిగా రాష్ట్ర రాజధానిలో కొంతకాలం ఉన్నారు. విప్లవ, కళా సాంస్కృతిక కేంద్రీకరణకు రోసి, తిరిగి తన స్వస్థలం చేరుకొని తనలోని “ఆకుపచ్చ లోయ” ని (మొదటి సంకలనం పేరు) కాపాడుకొన్నారు. — నరేష్ నున్నా, కవి సంపాదకుడు.
*****
కవిత్వాన్ని “గరగ” గా చేసి భక్తితో శిరసున ధరించిన కవి జీవితోత్సవ దారులలో నడుస్తూంటాడు, ఈ పుస్తకం పొడవునా. అతని కాలి మువ్వల కదలికలు చదువరి హృదయంలో శబ్దిస్తూంటాయి. అతని అడుగుల లయ పాఠకుని మనోవనంలో ఓ చైత్రగీతంలా వినిపిస్తూంటుంది. అతని నుంచి వచ్చే తేజస్సు చదువరి ఆకాశంపై నీలిమ తెరచాపై విచ్చుకొంటుంది.
ఆ కవి పేరు “నామాడి శ్రీధర్” – పుస్తకం పేరు “బంధన ఛాయ”.
చివరి పేజీ వరకూ పరుచుకొన్న కవిత్వ గాఢత మత్తెక్కించి వదుల్తుంది. “హృదయాన్ని బంధించిన ఛాయా జాలం” మాత్రం చేతిలో పుస్తక రూపంలో రెపరెపలాడుతూంటుంది.
ఈ సంపుటిలో మొత్తం 49 కవితలున్నాయి. ఆరు వివిధ కవుల అనువాదాలు.
కవిత్వానికి రాజకీయాలు, సిద్దాంతాలు అనవసరమని విశ్వసించిన ఇస్మాయిల్ గారి మార్గంలో ఈ కవి ప్రయాణిస్తున్నాడనిపిస్తుంది. పదాల పొహళింపు విషయంలో కృష్ణశాస్త్రిగారు జ్ఞప్తికొచ్చారు చాలా చోట్ల.
వస్తువు ఎంపిక, కవిత ఎత్తుగడ, నడక, క్లుప్తత, భావ గాంభీర్యతల వంటి విషయాలలో శ్రీ నామాడి శ్రీధర్ సంతకం ప్రతీ కవితలో స్పష్టంగా తెలుస్తూంటుంది.
జీవితోత్సవాల్ని గానం చేసే కవులు మనకు చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో నామాడి శ్రీధర్ ను “ఎత్తుగా” నిలబెడుతుందీ “బంధన ఛాయ”.
పొటమరించే భావుకత ప్రతీ కవితలో పొంగి పొర్లతూ, అక్షరక్షరం నివ్వెరపరుస్తూ అద్బుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ కవితలలో నిరాశా ధోరణులుకానీ, వాస్తవాల్లోంచి ఊహల్లోకి “ఎస్కేప్” అవ్వటాలు కానీ కనిపించవు. ఈ కవికి జీవితంపైన, అది అందించే అందాలు అనుభవాలపైనా అపారమైన ప్రేమ, గౌరవం, విశ్వాసమూను. అందుకే ఒక చోట ఇలా అంటాడు.
బహుధా వందనీయ దివసాన్ని
అరచేతుల్లో పొదివిపట్టుకొని
పరవశంతో ముద్దుపెట్టుకొన్నాను
(కాన్క)
– ప్రకృతి చూపించే అనేక అందాల్ని అద్బుతమైన నైపుణ్యంతో ఒడిసిపట్టుకొన్నాడీ కవి కొన్ని కవితలలో.
“చంద్రరశ్మి అను శంఖ ధ్వని” అనే కవితలో చీకటి పడటాన్ని వర్ణిస్తూ…
మలిసంజ అలలమీంచి
నునులేత చీకటి
సరుగుడు తోటలో
అడుగిడుతోంది తొలుత.
పనిపాటల తల్లి పిల్లల చెంతకి
లేగదూడలు చెంగున పాల కడలికి
పిట్టలు చెట్టుకి
చెట్టు చైత్ర స్వప్నంలోకి
ఆదరవుతో చేరే
వ్యవధినిచ్చిన కాటుక
వడివడిగా అలముకొంటోంది
ఊరూ వాడా.
ఇక్కడ చైత్రస్వప్నం అనటంద్వారా భవిష్యత్తుపై ఆశనీ, కాటుక అలముకోవటం అనే ప్రతీకతో చీకటి పడటాన్ని సూచిస్తున్న ఈ కవి కల్పనాశక్తి ముచ్చటకొల్పుతుంది.
వ్యక్తులకో, వస్తువులకో, అనుభవాలకో ఇక శలవు అని చెప్పటం కొంతమందికి చాలా సులభంకావొచ్చు. కానీ అలాంటి సందర్భాలు కవులను వెంటాడి వేధిస్తాయి తమని కవిత్వీకరించమని. అలాంటి కొన్ని సందర్భాలకు ఈ కవి కల్పించిన కొన్ని అక్షర రూపాలు….
బహుకాల పక్షి గానం
ఎడబాయని చెట్టుకి ఆనుకొని
తమకంతో తలచుకొన్నాను నిన్ను.
చెల్లా చెదిరిపోయే జ్ఞాపకపుంజం
మృధులకాంతిలో నిదురపోలేదు. (ఛాయా స్పర్శ)
ఈ యవ్వనాంతంలోంచి
ఒక్కమాట మాత్రం విను
’అది ఉత్త రూపాకర్షణ కాదు,
ఇప్పటికీ తలచుకుంటాను నిన్ను
అసంపూర్ణ కవితలో సుడి తిరిగే ఆర్తిలాగ’
(అసంపూర్ణ కవిత)
గతించిన తల్లిగారిపై వ్రాసిన ఓ ఎలిజీ లో…
ప్రాణప్రదాయినీ
ఈ జన్మాంతర పెనుతుఫాను
అల్లకల్లోలంలో కనుగొనలేకున్నాను నిన్ను
—- అనటంలో అంతటి వియోగాన్ని స్వీకరించలేని మనోస్థితి చాలా ఆర్ధ్రంగా, సూటిగా ప్రతిబింబించింది. ఇదే వస్తువుపై (?) వ్రాసిన మరో కవిత అద్బుతమైన ఎత్తుగడతో మొదలవుతుంది ఇలా –
అఖిల ప్రపంచంతో ముక్తసరి సంభాషణ
ఒక్క నీ ఎదట మాత్రమే కబుర్ల పోగుని నేను
ఇక నీకు నాకు మాటల్లేక
దిన దినము పూడుకుపోయే గొంతుక
నీ ఎదుటమాత్రమే కబుర్ల పోగుగా ఉండే నాకు, నీవు లేకపోవటంతో నా గొంతుక పూర్తిగా మూసుకు పోతోంది క్రమక్రమంగా అనటంలో గొప్ప అవ్యాజమైన ప్రేమని, భరించలేని వియోగ తీవ్రతనీ, చైతన్యం నుంచి మౌనచీకట్లలోకి జారిపోతున్న హృదయాన్ని అంతే భావతీవ్రతతో ఆవిష్కరిస్తాడు కవి.
కవి ఎవరికీ జవాబుదారీ కాడు. కవిత్వం అంతకంటే కాదూ. అయినప్పటికీ తాను నడచివచ్చేసిన బాటని తడిమిచూసుకోవటం ఒక్కోసారి అనివార్యమౌతుంది. విప్లవమార్గాన్ని వీడి శుద్దకవిత్వదారులు తొక్కడం పట్ల కవి కున్న సంవేదనో/సంజాయిషీనో ఒక కవితలో ఇలా ప్రతిబింబించింది.
నవ యవ్వన
హృదంతరాళంలోంచి
ఉవ్విళ్లూరుతో ఉప్పొంగిన నినాదం
శుష్కవచనంగా అంతర్ధానమయింది……
(సంజాయిషీ పత్రం)
అద్బుతమైన పదచిత్రాలు ఈ కవితలను ప్రకాశింపచేస్తూంటాయి వశీకరించే సుగంధస్పర్శతో.
మృతపుష్పాల మాదిరి ఊహలు
ఊరక సంచరిస్తాయి
నదితో కలిసి
(అంతలో)
సెలయేటి ఒడిలో పడి కొట్టుకుపోయే
ఎండుకొమ్మల మీద ఏమి స్మరించేను
దూరదేశపు లకుముకి పిట్టల జంట (కలకూజితం)
కాళ రాత్రి నొక
నల్లమందు గుళికమల్లే
మింగిన కోకిల ఈ హృదయం
(పునర్గానం)
ఒక్కొక్క గుక్కతో
నల్ల ద్రాక్ష సాయింత్రం
మిగల పండిపోతోంది
నడి జాము రాత్రికి
ఆమెని ఒంటరి వేళ కమ్ముకొన్నాక
ఆదిమ దేహ వాంఛతో దేబరించి
మొర్రోమని శోకించే కుక్కన్నేను
— వంటి పదచిత్రాలెన్నో ఈ సంపుటి నిండా బంధన ఛాయలై అలముకొని ఉన్నాయి.
కవిత్వంలో విస్తరణ ఎంతైతే దోషమో అతిక్లుప్తత కూడా అంతే దోషం. దీనివల్ల కొన్ని సార్లు కవిత అస్పష్టతలోకి జారిపోతుంది. ఈ సంపుటిలో “మృగయ” అనే కవితలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. దాన్ని ఓ అధివాస్తవిక కవితగా సమర్ధించుకోవచ్చునుగాక, కానీ అనుభూతికి అడ్డంగా నిలిచేది కవిత్వమెలా అవుతుంది? అమూర్త భావనల దుబారా వల్ల కూడా అస్పష్టత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. చాలా చోట్ల వాక్యాలకు ఫుల్ స్టాపులు, కామాలు వాడకపోవటం కూడా ఒక టెక్నిక్ లానే అనిపిస్తోంది.
“నువ్వేనా” అన్న కవిత అత్యద్బుతంగా ఉంది. శరణార్ధ గాయకుడు, మనసులో మాట, అశాంతం-ఒకింత కుంకుమ, అనురక్తి వంటి కవితలలో కనిపించే ప్రేమ సౌందర్యం అబ్బురపరుస్తుంది.
కవితలోని భావాన్ని అంతే నర్మగర్భంగా చెపుతూంటాయి కవితాశీర్షికలు. వీటిపట్ల కవి శ్రద్ధ మెచ్చుకోదగినది.
గురు పూర్ణిమ రాత్రి
నైర్మల్య చంద్రుడిలా
అరచేతుల్లో వాలిన
కొత్త కవితల పుస్తకం
–అంటూ ఇస్మాయిల్ గారి కవిత్వం గురించి వర్ణించిన ఓ కవితలోని పై వాక్యాలు ఈ కవితా సంపుటికి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. నైర్మల్య చంద్రుడంటే ఇజాలు, రాజకీయాలు అంటని కవిత్వమని. నూత్నలోకాల సౌందర్యాల్ని మోసుకొచ్చే సీతాకోకచిలుకే అరచేతిల్లో వాలిన కొత్త కవితల పుస్తకమని భావించవచ్చు.
చక్కని చిక్కని కవిత్వాన్ని అభిమానించే వారికి, నామాడి శ్రీధర్ గారి “బంధన ఛాయ” తప్పక నచ్చుతుంది.
పుస్తకం వివరాలు:
బంధన ఛాయ
వెల:50/-
కాపీలకొరకు: నామాడి శ్రీధర్, అంబాజీపేట, తూర్పుగోదావరి జిల్లా, ఆం.ప్ర. 533214.
మెయిల్: sridhar_namadi@rediffmail.com

No comments:

Post a Comment