Tuesday, July 14, 2020

కరోనా పద్యం - 2


ఉలిక్కిపడి నిద్రలేచాను... ఏదో పీడకల
మంచం మీంచి లెగిసి హాల్ లోకి వచ్చాను
అద్దంలో నా ప్రతిబింబం నన్ను చూసి నవ్వుతోంది
ఆశ్చర్యపడుతూ దగ్గరకు వెళ్ళాను
"భయపడ్డావ్ కదూ.... భయం వేసింది కదూ"
అంటూ ఇంకా బిగ్గరగా నవ్వుతోంది.
మెల్లగా నడుచుకొంటూ బయటకు వచ్చాను
తెల తెల వారుతోంది అప్పుడే
అంతా నిశ్శబ్దం.... ఏ రణగొణ ధ్వనులూ లేవు
పక్షుల శబ్దాలు మొదలయ్యాయి
ఎన్ని యుగాల క్రిందట ఈ నగరం వాటిని
విని ఉంటుందో అంత స్పష్టంగా!
గాయపడ్డ నగరానికి గాయపడ్డ గానం గొప్ప ఉపశమనం
మరణాల్ని యాచించే భిక్షపాత్ర
ఎర్రెర్రగా ఉదయిస్తోంది
భయమేసింది లోపలకు వచ్చేసాను
రాత్రి ఫ్లాస్కులోంచి కషాయం ఒంపుకొని
కప్పులో వేసుకొని తాగుతూ గమనించాను
నా నీడ నాతో లేదు.
ఎప్పుడు నన్ను విడిచిపోయిందో గుర్తురావటం లేదు.
ఒక్కసారిగా ఏకాకినైపోయానన్న స్పృహ
జలదరింపచేసింది
ఒంటరితనం నా చుట్టూ పంజరంలా బిగుసుకొంది.
నా ప్రతిబింబం నన్ను చూస్తూ
గేలిచేస్తూ ఇంకా నవ్వుతోంది.
దాని దగ్గరకు వెళ్ళి
అద్దంలోని నా మొఖాన్ని చేతుల్లోకి తీసుకొని
దాని నుదిటిపై మెత్తగా ముద్దుపెట్టి
"అనూహ్యతలకు అనాదిగా
భయపడూతూనే ఉన్నాడు మానవుడు
కానీ ఏనాడూ ఓడిపోలేదు" అన్నాను
బొల్లోజు బాబా

No comments:

Post a Comment