Tuesday, July 14, 2020

సింహాచలం - కొన్ని సంగతులు


చాన్నాళ్ళక్రితం హంపి సందర్శించినపుడు అక్కడ పాక్షికంగా విరూపం చేయబడిన విగ్రహాలను చూపిస్తూ ఆ గైడు ఇదంతా ముస్లిమ్ దాడులవల్ల జరిగింది అంటూ అత్యుత్సాహంతో చెప్పటం ఎందుకో నచ్చలేదు. అది రాజ్యకాంక్ష. మనుష్యుల కుత్తుకలను తెగనరికే రక్తదాహం. అక్కడ మత ప్రసక్తి అనవసరం అనిపించింది.
ఇటీవల సింహాచలం వెళ్ళినపుడు అక్కడి అంతరాలయంలోని అందమైన శిల్పాలను నాశనం చేసింది మహమ్మదీయ పాలకులే అంటూ వెనుకవైపునుంచి ఎవరో మాట్లాడుకోవటం విన్నప్పుడు కూడా అదే అనిపించింది. బహుసా ఏ సారాయి తాగిన సైనికుడో పెద్ద సుత్తి తీసుకొని ఆ సుందరశిల్పాల్ని ఒక్కొక్కటీ బద్దలుకొట్టుకొంటూ ఆ ఉన్మత్తతలో వికటాట్టహాసం చేసుకొంటూ మిత్రుల ముందు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు అతను పొంగిపోతూ చెలరేగిపోయిన దృశ్యాన్ని ఊహించుకొన్నాను. ఇక్కడ మతం కన్నా మనుషుల్లోని అరాసిక్యం పెద్దదిగా కనిపించింది.
చలం ఎక్కడో “ఈ ప్రపంచంలోని సుందరమైన శిల్పాలను నిలబెడితే వాటికి నీ వీపు ఆన్చి రుద్దుకొని దురదతీర్చుకొంటావు” అంటాడు. శిల్పులు ఏళ్ళతరబడి కష్టపడి చెక్కిన అద్భుతమైన సృజనని క్షణాల్లో నాశనం చేయటం దాదాపు అలాంటి అరసికతే.
***
సింహాచలం ఆలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
.
1. స్థలపురాణం
ఈ ఆలయస్థలపురాణంలో విష్ణుమూర్తి నరసింహావతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించటం ప్రహ్లాదుని అనుగ్రహించటం ప్రధాన వస్తువు.
సాధారణంగా ఆలయాలు తూర్పుముఖంగా ఉంటాయి. సింహాచల ఆలయం పశ్చిమముఖంగా ఉంటుంది. దీనికి వివరణగా ఒక గాధ ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని మొదట తూర్పుముఖంగానే నిర్మించారట. ఆ ఆలయ శిల్పికి అతని కొడుకుకి వచ్చిన ఒక గొడవకారణంగా ఇది పశ్చిమ దిక్కుగా మారిపోయిందట. ఆలయ ప్రధాన శిల్పికి అంతవరకూ తల్లి సంరక్షణలో పెరిగి తండ్రిని చేరుకొనే అతని కొడుకుకు మధ్య జరిగే సంవాదాలలాంటివి – కోనార్క్, హళేబీడు (జక్కన్న) లాంటి ఇతర ఆలయాల స్థలపురాణాలలో కూడా కనిపించే నేరేటివ్స్. ఒకే కథ అనేక ఆలయాల స్థలపురాణాలలో పునరావృతం కావటం ఆసక్తికరం.
వివిధస్థలపురాణాలలాగే సింహాచల స్థలపురాణం కూడా పదిహేనో శతాబ్దం తరువాత పురాణాల ఆధారంగా వ్రాయబడి ఉండొచ్చు.
2. రామానుజాచార్యుని రాక
పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యుడు సింహాచల క్షేత్రానికి వచ్చాడని, అప్పటివరకూ శివాలయంగా ఉన్న ఈ ఆలయాన్ని వైష్ణవాలయంగా మార్చాడని ఒక స్థానిక కథనం కలదు.
రామానుజాచార్యుడు వచ్చి ఇక్కడి స్థానికులకు శివుడు, విష్ణువులలో ఎవరు గొప్ప అనేది తేల్చటానికి – కొంత విభూతి, తులసి ఆకులను దేవుని ఎదుట ఉంచి ఉదయానికల్లా తులసిఆకులు మాత్రమే ఉండటాన్ని విష్ణుమహిమగా చూపి వారిని ఒప్పించారట.
రాత్రికి రాత్రి ఆ ఆలయంలోని శివలింగాన్ని విష్ణువిగ్రహంగా మార్చమని శిల్పులను ఆదేశించగా వారు అలా చేస్తున్నప్పుడు ఆ అసంపూర్ణ శిల్పం రక్తం కార్చటం చూసి ఆ శిల్పులు భయపడి నిలిపివేసారట. రామానుజాచార్యులు వెంటనే శిల్పానికి చందనం కప్పి మూసివేసారట. నేటికీ మూలవిరాట్టు విగ్రహం అసంపూర్ణంగా ఉంటుందంటారు. అందుకనే నిత్యరూపదర్శనం లింగాకారంగాను, నిజరూపదర్శనం ఏడాదికి ఒకరోజు మాత్రమే ఉండటం స్వామి అభీష్టంగా భావిస్తారు.
1087, 1096 CE నాటి ఆలయశాసనాలను బట్టి సింహాచలాలయంలో అప్పటికే విష్ణువు కొలువు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కనుక రామానుజాచార్యుని గాధలోని చారిత్రకతను నిర్ధారించలేము. పదకొండవ శతాబ్దానికి పూర్వం ఈ ఆలయమొక ఆదివాసీ ఆరాధన కేంద్రం అయి ఉండవచ్చు.
1268 లో నరసింహదేవ I ఆలయాన్ని పునర్నిర్మాణం గావించాడు. అంతకు పూర్వం కల సుమారు 18 శాసనాలు కల రాళ్లను సాధ్యమైనంతమేరకు తిరిగి ఆలయనిర్మాణంలో వాడుకొన్నారు.
3. కృష్ణదేవరాయుని సందర్శన
కృష్ణదేవరాయలు 30 మార్ఛ్ 1516 న సింహాచల ఆలయాన్ని దర్శించాడు. రాయల వారు 991 ముత్యాలు కలిగిఉన్న కంఠహారాన్ని ఇతర విలువైన కానుకలను సమర్పించుకొన్నాడు. ప్రతాపరుద్రుడిని జయించి అతని భార్యలను తన గుర్రాలకు నాడాలు కొట్టే శ్రామికులకు ఇచ్చివేస్తాను అని ఒక శాసనం వేయించినట్లు న్యూనెజ్ తన విస్మృతసామ్రాజ్యం లో చెప్పాడు కానీ అలాంటి శాసనమేదీ సింహాచలంలో కనిపించదు.
4. ఆలయంపై దాడి
గోల్కొండను కులికుతుబ్ షా పాలిస్తున్న కాలంలో (1580-1612) లో ఈ ఆలయంపై దాడి జరిగింది. 1580 లో ఈ ప్రాంతాన్ని అంతవరకూ పాలిస్తున్న స్థానిక రాజులు గోల్కొండ రాజ్యం పై తిరుగుబాటు చేసారు. అలా తిరుగుబాటు చేసిన వారిలో హిందూ రాజులే కాక అలం ఖాన్ , ఖాన్ ఖానాన్ లాంటి ముస్లిం జాగీర్ దారులు కూడా ఉన్నారు. అలా చాలా చోట్ల గోల్కొండ ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ కప్పాలు కట్టకుండా స్వీయపాలన కొరకు అనేక అలజడులు జరిగాయి.
ఈ అల్లర్లను అణచివేయటానికి కుతుబ్ షా తనవద్ద మంత్రిగా ఉన్న మల్కా అమిన్ కు సైన్యాన్ని తోడిచ్చి ఈ ప్రాంతానికి పంపించాడు. ఇతను మొదటగా ఉదయగిరి రాజు కౌలానందుడి తలనరకటంతో తన నరమేధాన్ని మొదలు పెట్టాడు. ఇతను కృష్ణా నది దాటి కోస్తా ఆంధ్ర ప్రాంతాలలోని వందలాది సామంతులను చంపుతూ అల్లర్లను క్రమక్రమంగా అణచివేస్తూ 1599 నాటికి శ్రీకూర్మం చేరుకొన్నాడు.
ఇతను శ్రీకూర్మంలో అనేకమంది స్థానిక జమిందార్లను సంహరించాడు. శ్రీకూర్మ ఆలయాన్ని ధ్వంసం చేసాడు. ఇదే సమయంలో సింహాచల ఆలయంపై కూడా దాడి చేసాడు.
ఇలా ఆలయాల ధ్వంసం జరుగుతున్నదనే విషయాన్ని కొద్దిమంది స్థానికులు కులి కుతుబ్ షాకు నివేదించటంతో సింహాచలం, శ్రీకూర్మం లోని పరిస్థితులను చక్కదిద్దమని అశ్వారాయుడు అనే ఒక హిందూ అధికారిని ఇక్కడకు పంపించాడు. ఈ అశ్వారాయుడు పద్మనాయక వంశానికి, విప్పర్ల గోత్రానికి చెందిన వ్యక్తి. ఇతను కళింగదేశములో మల్కా అమిన్ చేసిన దౌర్జన్యాలకు బలయిపోయిన వారిని శాంతపరచి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను తిరిగి నెలకొల్పాడు.
1604 నాటి ఒక శాసనం ద్వారా- రాజప్రతినిధిగా వచ్చిన అశ్వారాయుడు ఈ ఆలయాలను తిరిగి తెరిపించి, ధార్మిక విధులను కొనసాగేలా చేసాడని తెలుస్తున్నది.
గోగులపాటి కూర్మనాధ అనే శతకకవి వ్రాసిన సింహాద్రి నరసింహ శతకంలో మహమ్మదీయ సైనికులు సింహాచలంపై దాడికి వస్తున్నప్పుడు ఆ కవిగారికి కోపం వచ్చి నరసింహస్వామిని నిందాస్తుతి చేయగా, తేనెటీగల దండును ఆ సైన్యంపై పంపి వారిని చెల్లాచెదురు చేయటం ద్వారా స్వామి మహమ వెల్లడయినట్లు వర్ణణలు కలవు.
కూర్మనాథ కవి 1750 ప్రాంతాలలో ఈ శతకం వ్రాసినట్లు తెలుస్తున్నది. కానీ ఈ సమయంలో ఆలయంపై దాడులు జరిగిన చారిత్రిక ఆధారాలు లేవు. కనుక ఈ శతకం బహుసా 1599 లో మల్కా అమిన్ చేసిన దాడిని దృష్టిలో ఉంచుకొని వ్రాసినది కావొచ్చును.
***
సుమారు వేయి సంవత్సరాల చరిత్రకలిగిన ఆలయమిది. ఆలయాలను నిర్మించేది, పోషించేది వాటిమీద వచ్చే ఆదాయం కొరకు అనే చాణుక్యనీతి తెలిసినా ఆలయాలు లేని మానవజాతిని ఊహించలేం.
నేడు మనచుట్టూ చేతులు తెగిన, కాళ్ళునరికిన, ముక్కులు చెక్కిన శిల్పాలతో అనేక ఆలయాలు కనిపిస్తాయి. వీటన్నిటికీ కారణం మతమనే బూచిని చూపటం నేడు ఎక్కువైపోయింది. అందమైన శిల్పాకృతులు నాశనం అయ్యాయే అనే సగటు హిందువు బాధను తెలివిగా ఒక మతంమీద ద్వేషంగా కన్వర్ట్ చేయబడుతోంది. అలాంటి దుశ్చర్యలను వ్యక్తులు చేసిన దౌష్ట్యాలుగా ఎందుకు చూడరాదు?
పై ఉదంతంలో మల్కా అమిన్ ఒక్క హిందువులను మాత్రమే చంపలేదు. సాటి ముస్లిములను కూడా అణచివేసాడు. అప్పటి రాజనీతి అది. ఇప్పటి విలువలతో పోల్చలేం. గోల్కొండ నవాబు చేయగలిగినంత డామేజ్ కంట్రోల్ చేయటానికి ప్రయత్నించాడు. దేశం అంతటా ఇదే జరిగి ఉంటుందని చెప్పలేను. కనీసం సింహాచల శిల్పాల విరూపీకరణలో ఇవి కొన్ని మరుగునపడిన విషయాలు అని భావిస్తాను.
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. The Simahachalam Temple by Dr. K.sundaram
2. DV Potdar Commemoration Volume Edited by Surendranath Sen 1950
3. The_Aravidu_Dynasty_Of_Vijayanagar_Vol_I by Henry_Heras

7 comments:

  1. Too much secularism..... please refer contemporary sources.. they accepted their deeds without hypocrisy

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ రాధాకృష్ణ గారు

      పై వ్యాసానికి కొనసాగింపు ఈ వ్యాసం. వీలైతే చదవండి. మరింత విపులంగా నా వాదన ఉంటుంది. చరిత్రకు సంబంధించి ద్వేషాన్ని అందరూ మాట్లాడతారు, కానీ గతంలో ఉన్న మంచిని కొద్దిపాటి ఆధారాలతో మాట్లాడేవారు కొందరే ఉంటారు.... గమనించగలరు.


      https://sahitheeyanam.blogspot.com/2020/02/blog-post_64.html

      Delete
  2. SUNDAY, FEBRUARY 9, 2020 న పోస్ట్ చేసిన వ్యాసం పేరు...

    హిందూ ఆలయాలకు ఏం జరిగింది?

    ReplyDelete
  3. Heights of stupidity, secularism doesn't mean forgetting the facts..

    ReplyDelete
    Replies
    1. its ok... I wrote references for each of my sentences....
      you can disagree .... no problem

      show me your intellectuality by giving enouch counter evidences... not one line statements

      Delete
  4. Yourself admitted in the article that Malka Ameen the sardar of Golconda sultan was destroyed the temple...so Muslims are destroyers of temples in India...hence withdraw yours sudo secular opinions..

    ReplyDelete