Tuesday, July 14, 2020

మూడో కన్నీటి చుక్క పుస్తక సమీక్ష శ్రీ అరవింద జాషువా



Aravind Jashua మిత్రమా... నేనెలా స్పందించాలో కూడా తెలియటం లేదు.
ఒకటి మాత్రం అర్ధమైంది. నా పుస్తకం చేరాల్సిన ఒక "సహృదయుని" కి చేరింది...... అంతే... అంతకు మించి నాకు ఇంకేమీ తట్టటం లేదు... మన్నించు
బొల్లోజు బాబా
***
Bolloju Baba గారు ఏదో నన్ను ప్రేమించి తన "మూడో కన్నీటి చుక్క" కవితల పుస్తకం పంపించారు గానీ నిజానికి ఆ పుస్తకం గురించి విశ్లేషించే అర్హత నాకేమీ లేదు. ఆయన కవితలు fb లో పోస్ట్ చేయగానే చదవడం, ఆయన శైలికి, భావవ్యక్తీకరణ లోని నిజాయితీకి అచ్చెరువొందడం, ఆపుకోలేక ఆ కవితలలో ఒకదాన్ని నాకు ఒచ్చిన english లోకి మార్చి రాయడం తప్ప. నేను జీవితంలో నిజంగా చదివిన కవితల పుస్తకాలు రెండే. 1) శ్రీ శ్రీ మహాప్రస్థానం 2) తిలక్ అమృతం కురిసిన రాత్రి. ఈ రెండూ కాకుండా రష్యన్ కవి పుష్కిన్ కవితలు కొన్ని ఇంగ్లీష్ లో చదివాను అంతే. వీటినే మాటిమాటికీ చదవడం తప్పించి కవితలు పెద్దగా చదివింది లేదు. మహాప్రస్థానం ఇంట్లో ఉండేది కాబట్టి చిన్నప్పుడు చదివినా ఒకటీ రెండు కవితలు తప్పించి మిగతా కవితల్లోని పదాలకి మనకి అర్ధాలే తెలియకపోవడం వల్ల, శ్రీ శ్రీ గారి ఆవేశం తో మా నాన్నగారు relate చేసుకున్నట్టుగా నేను relate చేసుకోలేకపోవడం వల్ల అది తిరిగి పుస్తకాల షెల్ఫ్ లోపలికి వెళ్ళిపోయింది.
ఇక మిగిలింది అమృతం కురిసిన రాత్రి. దాన్నే సంవత్సరాల తరబడి చదువుతూ, అనుభూతి చెందుతూ వస్తున్నా. మహాప్రస్థానం కంటే అమృతం కురిసిన రాత్రి నన్ను ఆకర్షించడం వెనక రెండు కారణాలు ఉన్నాయనుకుంటున్నా. 1) నాకు కమ్యూనిజం లాంటి విప్లవ భావాలకన్నా ప్రేమ లాంటి సున్నిత భావాలు ఉండడం. 2) అమృతం కురిసిన రాత్రి సరళమైన, సులభమైన మామూలు మాటలలో రాయబడడం. నిజానికి మొదటికారణం కన్నా రెండోదే బలమైనది అనుకుంటా. ఆ సింప్లిసిటీ వల్లే అమృతం కురిసిన రాత్రి ప్రభావం మరింత ఎక్కువగా నా మీద ఉంది. బాబా గారి కవిత్వం పట్ల నాలాంటి మామూలు, కవి రచయితల సంఘాలలో అస్సలు కనిపించని వ్యక్తి కి ఆకర్షణ కలగడానికి కారణం అదే సరళత్వం, అదే సింప్లిసిటీ.
నిజానికి కవిత అనే formatలో ఏదైనా భావాన్ని వ్యక్తీకరించే రోజులు ఇంకా ఉన్నాయా అని అనిపిస్తోంది కొన్నిసార్లు. రొమాంటిసిజానికి రోజులు కావు ఇవి. బాబా గారు అన్నట్టు
జీవితం అనే పదునైన కత్తి
కాలాన్ని-
ఆఫీసు, అనుబంధాలు, స్వప్నాలుగా
ముక్కలు ముక్కలు చేసి వడ్డించే" రోజులు ఇవి. ఒక 20 ఏళ్ల క్రితం నేను కవిని అని చెప్పుకుంటే ఎలాఉండేదో తెలియదు కానీ, ఈ రోజుల్లో నేను కవిని అని చెప్పుకుంటే జనం అవసరమా అన్నట్టు చూస్తారని అనిపిస్తుంది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో, ముందుకన్నా మరెక్కువగా మనకి కవుల, రచయితల, చిత్రకారులు, సినిమా దర్శకుల అవసరం ఉంది. మార్కెట్ అనే Molekh మన మెడకు డబ్బు అనే కేరట్ కట్టి గాడిద తన ఇరుసులో తిరుగుతున్నట్టుగా మనల్ని materialism చుట్టూ తిప్పుతూ, అవసరమైతే మత మౌఢ్యాన్నీ, కుల పిచ్చినీ కూడా మనకి inject చేసి మనం మనుషులం అని మర్చిపోయేలా చేస్తున్న ఈ రోజుల్లో, కవుల అవసరం మరింత ఉంది. రచయితల, చిత్రకారులు, గాయకుల, సినిమా దర్శకుల అవసరం మరింత ఉంది. మానవత్వం వైపు (ఒంటరిగా అయినా, వెలివేయబడి అయినా)నించుని గొంతెత్తి నిజాన్ని మానవత్వాన్ని, సరైన జీవిత ప్రధాన్యతలని చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రేమని పంచాల్సిన అవసరం ఉంది. ఒక alternative దృక్కోణం అవసరం ఇప్పుడు మరింతగా ఉంది. అదే బాబా గారి కవితల్లో నాకు కనిపించింది. కవిత్వం విషయంలో పామరుడినైన నన్ను ఆయన కవితలవైపు ఆకర్షించింది. ఎందుకంటే కవులు, కళాకారులు బాబా గారే "సృజన" అనే కవితలోఅన్నట్టుగా -
ఏవి
అంతకుముందు లేవో
వాటిని కొందరు
గొప్ప కాంక్షతో, దయతో
అన్వేషించి
అక్షరాల్లో మనోప్రపంచాల్ని,
శిలల్లో భంగిమలని
రంగుల్లో ప్రవహించే దృశ్యాలను
అవిష్కరిస్తుంటారు.
వాటిని కొందరు
గొప్ప విభ్రమతో, లాలసతో
అలా చూస్తూనే ఉండిపోతారు ఏనాటికీ".
అదీ విషయం. సృజనాత్మకత, సృజనశీలుల అవసరం ఉంది. ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది.
***
మతం పేరుతో మారణకాండ జరుపుతూ , ఆవు పేరుతో సాటి మనుషుల్ని హత్యకావిస్తున్న ఈ రోజుల్లో- ఆవుని పూజించడం ఈ దేశంలోని హిందువుల సంస్కృతి అన్నది ఎంత నిజమో అది వొట్టిపోతే కబేళా కి పంపించి కొత్త అవుని కొనుక్కోవడం అంతే సహజం అని "కుట్రలు" అనే కవితలో బాబాగారు చెప్పినట్టుగా ధైర్యంగా చెప్పే కవుల అవసరం ఉంది.
"ఇపుడీ దేశానికి ఏమైంది
ఎవరిని వదశాలకు పంపడానికి
ఇన్ని కుట్రలు పన్నుతోంది?"
(కుట్రలు)
అని ఖుల్లంఖుల్లాగా నిజాలుచెప్పగల మానవత్వం గల కవుల, కవితల అవసరం ఉంది.
"భయ్యా! నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను" అన్న కవితలో ఇన్నేళ్ల మా స్నేహంలో ఇటు పులిహోర బూరెలు అటు
అటు సేమియా బిర్యానీలు ఇటూ ప్రవహిస్తూనే ఉన్నాయి" అన్న వాక్యంలో మనందరం మన ముస్లిం స్నేహితులని చూసుకుంటాం. కానీ తర్వాత వచ్చే పంక్తులే
"కానీ మొన్న జండాల పండగ రోజున
మైకులో "వందేమాతర గీతం వస్తుంటే దాన్ని
కూడబలుక్కుంటూ
వచ్చి రాని ఉచ్చారణ లో వణుకుతూ అందరికీ వినబడేలా
అతను పైకి పాడడం చూసాక నాకు భయం వేసింది"
- ఎలా మనం మన సోదరులని betray చేశామో గుర్తుచేస్తాయి.
***
చలం గురించి ఆయన స్నేహితుడు రామ్మూర్తి ఇలా అన్నాడట "chalam is a man with a woman's heart" అని. గొప్ప రచనలు గొప్ప కవితలు రాయాలంటే అమ్మాయిల మనసుకి ఉండే సున్నితత్వం ఉండాలి. స్పందించాలంటే, ఆక్రోశించాలంటే గుండెలో ఇంకా చెమ్మ ఉండాలి. అది ఉంది కాబట్టే బాబా గారు సమాజంలో జరుతున్న ప్రతీ విషయం గురించీ స్పందించారు. అది ఎంత చిన్న విషయం అయినా అది ఆయన దృష్టి ని దాటిపోలేదు. పోలవరం బోటు ప్రమాదం జరిగినప్పుడు ముందూ వెనకా ఆలోచించకుండా గోదావరిలో దూకి అనేకమందిని రక్షించిన చదువూ సంధ్యా లేని అనాగరికులైన గిరిజనుల గురించి ఎవరు వీళ్లంతా? అని మనం ఆలోచించామా? వాళ్ళు ఎవరో బాబా గారు ఇలా చెప్పారు.
"ఐస్ ఏజ్ నుంచి డిజిటల్ ఏజ్ దాకా
మానవజాతి నౌకాయానానికి
ఏ చరిత్రా గుర్తించని
కనిపించని తెడ్లు వీళ్ళు.
మనుషులుగా మనం పూర్తి వైఫల్యం
చెందలేదనడానికి మిగిలున్న
ఒకే ఒక సాక్ష్యం వీళ్ళు"
(ఎవరు వీళ్లంతా).
***
ఈ కవితా సంపుటి అంతా కొన్ని అద్భుతమైన expressions తో నిండివుంది. కొన్ని ప్రశ్నించేవి, కొన్ని తీవ్రంగా అనుభూతి చెందించి "wow"అనిపించేవి. పిచ్చుకల గురించి, చెట్లగురించి, కొండల గురించి, పాపల గురించి, నాన్నల గురించి, తనప్రియుడి పేరు పచ్చబొట్టు పొడిపించుకున్న అమాయకురాలైన ప్రేమికురాలిగురించి, చావు గురించి, బతకడంలోని మజా గురించి ,బతుకులో అస్తిత్వం కాపాడుకోవాల్సిన అవసరం గురించీ, అమ్మాయిల ఆ "మూడు రోజుల" గురించీ ఇంకా ఎన్నో. ఈ పుస్తకం గురించి ఇంకా రాయాల్సింది బోల్లంత ఉంది. మనసుని తట్టే మాటలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. బహుశా గత 25 యేళ్లుగా నేను అమృతం కురిసిన రాత్రి చదువుతున్నట్టే అనేక సంవత్సరాలు "మూడో కన్నీటి చుక్క" చదువుతూనే ఉంటాను. పూర్తిగా నాలో ఇంకేవరకూ.
***
వైవిధ్యమే అందం. ఎదుటిమనిషిని judge చేస్తూ ఉన్నంతకాలం, ఎదుటివారికన్న నైతికంగా ఉన్నతులం అని భావిస్తున్నంత కాలం మనం వాళ్ళని ప్రేమించలేం. జీవితాన్ని ఆస్వాదించలేం.
బాబాగారు అన్నట్టుగా -
ఏ రెండు
కన్నీటి చుక్కలూ ఒకేలా ఉండవు.
వాటిని చూసినపుడు
జారిన మూడో కన్నీటి చుక్క
కవిత్వం.
***
ఇంతకీ బాబా గారిని నేనెప్పుడూ కలవలేదు. కానీ కలిసినపుడు ఏం మాటాడతాను? నేనేమీ కవినీ critic కాదు కాబట్టి ఆయన తన "ప్రవహించే వాక్యం" లో అన్నట్టుగా "నిర్మాణ వ్యూహాల గురించీ ఇప్పుడు బలంగా వీస్తున్న పరిణామాల" గురించీ అయితే మాట్లాడు కోము for sure. బహుశా "ఒక కవిని కలిశాను" కవితలోలా ఆయన చేతిని నాచేతుల్లోకి తీసుకుంటాను.
"పావురం కన్నా మెత్తగా
నీరెండకన్నా వెచ్చగా
కవిగా బ్రతికిన క్షణాల వాసన వేస్తూ" ఉన్న ఆ చేయిని అదిమి నా కృతజ్ఞతలు తెలియచేస్తాను.

No comments:

Post a Comment