Tuesday, July 14, 2020

మెకంజీసేకరించిన తూర్పుగోదావరి శాసనాలు

మెకంజీసేకరించిన తూర్పుగోదావరి శాసనాలను పరిశీలిస్తున్నప్పుడు చాలా చిత్రమైన చోట్లలో లభించిన శాసనాల వివరాలు అందులో కనిపించాయి. దేవాలయాల శాసనాలు సరే కొన్ని వందల ఆలయశాసనాల ప్రతులను తీసారు.
అవికాక గోదావరి గట్టున లభించినవి అంటూ కొన్ని, జైలు లోపల నేలపై పడి ఉన్నవి అంటూ మరికొన్ని, పేపర్లు సాపుచేసే రాయిమీద ఉన్న శాసనం అంటూ ఒకటి అనపర్తి ఊరి మధ్యలో పాతుకుపోయిన శాసనమూ అంటూ మరొకటి ఇలా అనేక శాసనాల పాఠాలు కనిపించాయి.
పాపం మెకంజీ అనుచరులు శాసనాల కొరకు అప్పట్లో నేలను దాదాపు జల్లెడ పట్టారని అర్ధమైంది.
అలా రాజమండ్రి సివిల్ జడ్జి గారైన శ్రీ ఆసిస్క్యూ దొరగారి ఇంటి గుమ్మంలోపల ఉత్తరం వైపున పాతి ఉన్న శాసనమట ఇది.
గణపతిదేవుడు క్రీశ 1247 లో వేయించిన శాసనం ఇది.
ఇందులో గణపతి దేవరాజులు తమ "జలరు" మహాదేవరాజు పేరున గజ్జరాన (రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామం గజ్జరం) ఒక విగ్రహప్రతిష్టగావించినట్లు, ఆ ఆలయ అంగరంగ భోగాల కొరకు అంగడి సుంకాలలో మార్పులు తెచ్చి నట్లు అర్ధమౌతుంది. (ఆలయ నూనె ఖర్చులకొరకు GST స్లాబులేవో పెంచారన్నమాట)
ఇక్కడ "జలరు" అన్నమాటకు అర్ధం లభించలేదు. ఎవరైనా చెపితే తెలుసుకోవాలని ఉంది.
ఇకపోతే అలా వివిధ ప్రాంతాలలో ఉన్నాయని చెప్పబడిన శాసనాలు ఎక్కడైనా భద్రపరచారా లేక అలాగే నేలలోకప్పడిపోయాయో తెలియదు. ఒక వేళ నిజ శాసనాలు లేకపోతే అలా చెదురుమదురుగా పడిఉన్న కొన్ని వందల అలాంటి శాసనాలకు కైఫియత్తులే దిక్కు. ఇవి నేను గమనించినంత మేరకు ఆర్కియాలాజికల్ సర్వే పుస్తకాలలోకి ఎక్కినట్లు లేవు. ఆర్కియలాజికల్ శాసన సర్వేలు మొదలవ్వటానికి ఎనభైఏళ్ల క్రితం నాటివి మెకంజీ రికార్డులు.
(పై ఫొటో రాజమండ్రి గౌతమీ గ్రంధాలయంలో ఉన్న శిధిలావస్థకు చేరుకొన్న 500 పేజీల మెకంజీ వ్రాతప్రతి లోనిది)
బొల్లోజు బాబాNo photo description available.

No comments:

Post a Comment