Tuesday, July 14, 2020

సర్కారు జిల్లాల నుంచి ఫ్రెంచివారి నిష్క్రమణ

ఫ్రెంచి సేనాని Marquis de Bussy 1751 లో సలాబద్ జంగుకి సైనిక సహకారం అందించి అతడిని నిజాం రాజుని చేసాడు. దానికి ప్రతిగా సలాబత్ జంగు ఫ్రెంచి సేనల పోషణ నిమిత్తం 1753 లో శ్రీకాకుళం నుండి ఏలూరు వరకూ ఉన్న ఉత్తర సర్కారు ప్రాంతాలను ఫ్రెంచివారికి అప్పగించాడు. అలా సుమారు 470 కిలోమీటర్లు పొడవున్న అత్యంత సారవంతమైన కోస్తా భూములు ఫ్రెంచి వారి పరమయ్యాయి. అప్పట్లో ఇవి రెండులక్షల రూపాయిల పన్ను ఆదాయం కలిగి ఉండేవి. అంతవరకూ ఈ పరగణాలకు గవర్నరుగా ఉన్న జాఫర్ అల్లీఖాన్ ఈ ప్రాంతాలను ఫ్రెంచివారికి ఇవ్వటాన్ని ఇష్టపడలేదు. అదే విధంగా విజయనగరం రాజైన విజయరామ గజపతికి కూడా ఈ ప్రాంతాలను ఫ్రెంచివారికి స్వాధీనపరచటం నచ్చలేదు. ఈ విషయం తెలుసుకొన్న ఫ్రెంచి అధికారి Moracin, ఇదివరకు నిజాం ప్రభువుకు చెల్లించిన కౌలు కంటే తక్కువ మొత్తానికే భూములను ఇస్తానని చెప్పటంతో విజయరామ రాజు ఫ్రెంచివారి పక్షాన చేరిపోయాడు . ఫ్రెంచి సైన్యం మద్దతుతో 1757 లో ఈ విజయరామరాజు బొబ్బిలి వంశస్థులను అంతమొందించి తుదకు తాండ్రపాపారాయుని చేతిలో హతమయ్యాడు.
విజయరామరాజు అనంతరం విజయనగర సంస్థానాధీశునిగా వచ్చిన ఆనందగజపతి రాజు ఫ్రెంచివారి పట్ల విముఖత కలిగి వారిని ఎలాగైనా కోస్తా జిల్లాలనుండి తరిమేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీషు వారితో చేతులు కలిపాడు. అదేసమయంలో కలకత్తా నుండి విస్తరిస్తూ వస్తున్న బ్రిటిష్ వారికి ఆనందగజపతి రాజు మద్దతు వెతుకుతున్నతీగ కాలికి తగిలినట్లయింది.
కోస్తా జిల్లాలనుండి ఫ్రెంచివారిని పారద్రోలటానికి చేసిన యుద్ధాలలో తూర్పుగోదావరి జిల్లాలోని చందుర్తి అనే చోట 1759 డిసెంబరు 9 న ఫ్రెంచి, ఇంగ్లీషు సేనల మధ్య జరిగిన “చందుర్తి యుద్ధం” నిర్ణయాత్మకమైనదిగా; మొత్తం భారతదేశంలోనే ఫ్రెంచి వారి విస్తరణకు అడ్డుకట్టవేసిన ముఖ్యమైన యుద్ధాలలో ఒకటిగా చరిత్రకారులు భావిస్తారు. ఈ యుద్ధంలో ఫ్రెంచి సేనలు పరాజయంపొంది తొలుత రాజమండ్రి, అక్కడనుండి మచిలిపట్నం పారిపోగా బ్రిటిష్ సేనలు వెంబడించి వారిని ఓడించి పాండిచేరీకి తరిమేసాయి. ఆ విధంగా ఒకప్పుడు శ్రీకాకుళం నుంచి కృష్ణానది వరకూ కల కోస్తాజిల్లాలలో ఏడేళ్ళపాటు అధికారం చెలాయించిన ఫ్రెంచి వారు తమ ఉనికిని పూర్తిగా కోల్పోయారు. కాలక్రమేణా ఫ్రెంచి వారు పాండిచేరి ఇంకా పెద్దగా ప్రాధాన్యత లేని ఇతర ప్రాంతాలకు పరిమితమై తమ వ్యాపారాలను చేసుకొన్నారు.
చారిత్రికంగా అంతటి ప్రాముఖ్యత కలిగిన “చందుర్తి యుద్ధం” గురించి కైఫియత్తులలో పెద్దగా సమాచారం లభించదు. దీనికి కారణం కైఫియత్తులు రాసే సమయానికి, చందుర్తి యుద్ధం వలన భారతదేశాన్ని ఫ్రెంచివలసరాజ్యంగా మార్చగలిగే అవకాశాన్ని ఫ్రాన్స్ చేజార్చుకొన్నదనే సంగతి ఇంకా పూర్తిగా స్పష్టపడలేదని అనుకోవచ్చు.
***
చందుర్తి యుద్ధం
చందుర్తి యుద్ధం గురించిన ప్రస్తావన నేరుగా లేకపోయినా తదనంతరం జరిగిన కొన్ని స్థానిక పరిణామాలు సామర్లకోట కైఫీయత్తులో ఇలా ఉన్నాయి.
“//పూసపాటి ఆనందగజపతి సైన్యముతో వచ్చి చామర్లకోట మీద పోట్లాడగా, మహీపతిరాయనింగారు, నీలాద్రిరాయనింగారు కోటలో ఉండి కాకినాడ జగన్నాధపురంలో మందుగుండు కొని, తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చారు. కోటను వశపరచుకొనుట సాధ్యం కాలేదు. తదనంతరం ఆనంద గజపతికి నీలాద్రిరాయనింగారికి మధ్య ఒప్పందము జరిగింది. దీనిప్రకారము - నీలాద్రిరాయనింగారు చామర్లకోట ఖాళీచేసి సైన్యసహాయం అందించిన ఇంగ్లీషువారికి ఇచ్చివేసి తను పిఠాపురం కోటలో నివాసముండేటట్లు; జమిందారీ ఆదాయంలో నూటికి అయిదువరహాల వాటా ఇచ్చేటట్లు; వెలమలు, ఒంటర్లు ఎక్కడైనా వ్యవసాయం చేసుకొనేందుకు కావలసినన్ని భూములు ఇచ్చి పండినపంటలో సగభాగము ఇచ్చేలాగ; ఆనంద గజపతి వారి మనుషులు ఈ ప్రాంతములో అధికారము చెలాయించేటట్లు- ఉభయులు అంగీకారానికి వచ్చారు.
ఆనందగజపతి, నీలాద్రిరాయనింగారు ఇలా ఒప్పందానికి రావటం నచ్చని ఇంగ్లీషువారు గజపతివారిపై అలిగి వెళ్ళిపోయారు. ఆనందగజపతి కంపనీవారిని జగ్గంపేటవద్ద కలిసి ఒప్పించి వారి జండాను చామర్లకోట కోటబురుజుపై ఎగరేయించాడు.//” (సామర్లకోట కైఫీయత్తు నుంచి)
పై వాక్యాలలో ఎక్కడా చందుర్తి యుద్ధ ప్రస్తావన కానీ, ఫ్రెంచి వారి గురించి కానీ లేదు. ఆ యుద్ధానంతరం జరిగిన కొన్ని సంఘటనలను మాత్రమే ఉన్నాయి. చందుర్తి యుద్ధాన్ని పేజీలకొద్దీ వర్ణించి విశ్లేషించిన A History of military transactions of British Nation in Indostan by Robert Orme, A descriptive and historical account of the Godavery District in the presidency of Madras by Morris Henry, Records of Fort St. George Publications, History Of The French In India by Malleson లాంటి చరిత్ర పుస్తకాలలో పైన చెప్పిన సంగతులు ఎక్కడా కనిపించవు. ఎందుకంటే ఇవి పూర్తిగా స్థానీయ విషయాలు. కైఫియత్తుల లాంటి స్థానిక చరిత్రలలోనే లభిస్తాయి.
కైఫియత్తు వర్ణనలో ఇంగ్లీషు వారు గజపతివారిపై అలిగి వెళ్ళిపోయారు అన్న వాక్యంలో “అలిగి వెళ్ళిపోవటం” గురించి మెయిన్ స్ట్రీమ్ చరిత్రలో కొన్ని ఆధారాలు లభిస్తాయి.
ఆనందగజపతిరాజు కోస్తా జిల్లాల నుంచి ఫ్రెంచి వారిని వెళ్లగొట్టాలని ఇంగ్లీషు వారితో చేతులుకలిపి ఇరువురూ 1758, నవంబరు 2 న ఒక ఒప్పందం చేసుకొన్నారు. దీనిప్రకారం కల్నల్ ఫోర్డ్, ఆనందగజపతిరాజు కలిసి చేయబోయే యుద్ధంలో - కొల్లకొట్టిన సంపదలను చెరిసమానంగా పంచుకోవాలని; యుద్ధం ముగిసాకా ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న కోస్తాజిల్లాలపై పన్ను వసూలు అధికారం ఆనందరాజుకు, ఓడరేవులు ఇంగ్లీషు వారికి దక్కాలని; బ్రిటిష్ సైన్యం ఖర్చుల కొరకు నెలకు రూ. 50,000, సైనికాధికారులకు రూ.6000 చొప్పున ఆనంద గజపతి ఇవ్వాలని అంగీకారానికి వచ్చారు.
చేసుకొన్న ఒప్పందం ప్రకారం ఆనందగజపతిరాజు డబ్బు సక్రమంగా చెల్లించకపోవటంతో కల్నల్ ఫోర్డ్ అసహనంతో ఉండేవాడు. చందుర్తి యుద్ధం ముగిసేనాటికి ఆనందగజపతి రాజు 56,000 రూపాయలు బకాయి పడటమే కాక ఫోర్డ్ నుండి వ్యక్తిగత అవసరాలకొరకు 20,000 రూపాయిలను అప్పుగా తీసుకొన్నాడు కూడా.
చందుర్తి యుద్ధం ముగిసికా ఆనందగజపతి సామర్లకోటలోనే ఉండి నీలాద్రిరావుతో ఒప్పందం చేసుకొని తీరిగ్గా రాజమహేంద్రవరం వెళ్ళేసరికి అప్పటికే అక్కడ అంతవరకూ ఫ్రెంచివారి చేతుల్లో ఉన్న రాజమహేంద్రవరపు కోటను బ్రిటిష్ సైన్యం స్వాధీనపరుచుకొని ఉండటంతో ఆశ్చర్యపోతాడు. ఒప్పందం ప్రకారం కోటను తనకు అప్పగించమని అడగగా, బకాయిలు చెల్లిస్తేకాని కోటను ఇచ్చేది లేదంటాడు కల్నల్ ఫోర్డ్.
రాజమండ్రి నుంచి ఇంగ్లీషు సేనలు మచిలీపట్నంపై దాడికి బయలుదేరుతున్నప్పుడు కల్నల్ ఫోర్డ్ ఆనందగజపతిరాజును కూడా అతని సైన్యంతో రమ్మన్నప్పుడు ఆనందగజపతిరాజు అంగీకరించడు.
ఈ సందర్భంగా వీరిద్దరి మధ్యా ఘర్షణ జరిగి ఉంటుంది. ఆనందగజపతి రాజు రాజవొమ్మంగి అడవులలోకి పోయి కొంతకాలం అజ్ఞాతంలో ఉండిపోయాడు .
ఆనంద గజపతి రాజు 1758 డిసంబరు 7 న మద్రాసులోని బ్రిటిష్ ఉన్నతాధికారులకు వ్రాసిన ఒక లేఖలో ”రాజమహేంద్రవరం కోటను స్వాధీనపరచని కారణంగా తాను శిస్తులు చేయలేకపోయానని అందువల్ల కంపనీ సైన్యానికి బాకీ పడ్డానని” సంజాయిషీ ఇచ్చుకోవటం ఆసక్తికలిగిస్తుంది.
ఇంగ్లీషు సేనలు ఒంటరిగానే 1759 ఏప్రిల్ లో మచిలీపట్నాన్ని వశపరచుకొన్నాయి.
అంతిమంగా విజేతగా నిలిచిన ఇంగ్లీషు వారి మద్దతు ముందుముందు అవసరముంటుందని తలచిన నిజాం ప్రభువు సలాబత్ జంగ్ 1759 మే 14 న ఒక దానపత్రం ద్వారా ఈ కోస్తా జిల్లాలను బ్రిటిష్ వారికి “ఈనాం” గా ఇచ్చాడు. వాటిని "సర్కారు జిల్లాలు" అని పిలిచేవారు. అవి ఇప్పటి విభజన ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలు. ఆ దానపత్రంలో అంతవరకూ ఈ ప్రాంతాలలో ఉంటున్న ఫ్రెంచి వారు వారి వారి సరంజామాను సర్దుకొని పదిహేను రోజుల్లో ఖాళీచేసి వెళిపోవాలి కూడా ఉండటం గమనార్హం. అలా కోస్తాజిల్లాలలో ఫ్రెంచివారి భవిష్యత్తు ముగిసిపోయింది.
ఆ విధంగా సామర్లకోట కైఫియత్తులో కనిపించే “ఇంగ్లీషు వారి అలక” వెనుక ఆర్ధిక, రాజకీయ కారణాలెన్నో కనిపిస్తాయి. ఈ ఉదంతంలో ఇంగ్లీషు వారు, ఆనందగజపతిరాజు ఇద్దరిలో ఎవరు ఎవరిని వాడుకొన్నారో ఇతమిద్దంగా తేల్చలేం. నిజాం ప్రభువు దృష్టిలో ఆనందగజపతి రాజు చాన్నాళ్ళుగా శిస్తులు బకాయి పడటంతో ఒక “రెబల్ జమిందారు” గా చెడ్డపేరు తెచ్చుకొన్నాడు. బ్రిటిష్ వారు నిజాం ప్రభువును ఒప్పించి, పాతబాకీలన్నీ రద్దుచేయించి తిరిగి ఆనందగజపతి రాజుకే ఈ ప్రాంతాల జమిందారీ ఇప్పించటం కొసమెరుపు.
***
సామర్లకోట కైఫీయత్తులో ఫ్రెంచి వారి గురించిన ఒక ప్రస్తావన ఇలా ఉంది.
//“అవమాన భారంతో కుంగిపోయిన పిఠాపురం జమిందారు నీలాద్రిరాయినింగారు, పెద్దాపురం జమిందారు జగపతిరాజులు ఎలాగైనా పగతీర్చుకోవాలని జట్టుకట్టారు. కాకినాడ జగన్నాధపురం రేవులో ఫ్రెంచివారి ఓడ ఒకటి వచ్చి ఆగింది. వీరిద్దరు ఒక డచ్చివ్యాపారిని మధ్యవర్తిగా పెట్టుకొని- చామర్లకోటనుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు ఫ్రెంచివారితో నాలుగులక్షలరూపాయిలకు ఒక ఒప్పందం చేసుకొని లక్షరూపాయిలు బయానాగా ఇచ్చారు. రెండువందలమంది ఫ్రెంచి సైన్యాన్ని ఓడదింపి, చామర్లకోటకు నావలమీద తీసుకొచ్చారు. నీలాద్రిరాయనింగారు మొత్తం వ్యవహారంపై నమ్మకం కుదరక ఊగిసలాడుతుంటే జగపతిరాజు అతడిని ఉత్సాహపరచి, అయిదారువందలమంది సైనికులతో వెంటవేసుకొని, ఆనందగజపతి సైన్యంపై యుద్ధం చేయనారంభించారు. ఆ యుద్ధంలో వత్సవాయి జగపతికి తుపాకిగుండు తగిలి చనిపోయాడు. రావునీలాద్రిరాయనింగారు పారిపోయి జూపల్లెవారి సంస్థానంలో తలదాచుకొన్నాడు. నీలాద్రిరాయనింగారు పరారీ అయినాడని గ్రహించి, ఆనందగజపతి చామర్లకోటవచ్చి కోటలో తొలగించబడిన ఇంగ్లీషువారి జండాను తిరిగి నిలబెట్టి, అక్కడ కాపలా కాస్తున్న ఫ్రెంచివారిని తరిమేసాడు. వారు తిరిగి కాకినాడ ఓడమీదకు పోయారు”.// (సామర్లకోట కైఫీయత్తు నుంచి)
ఆనందగజపతి రాజుకు మద్దతుగా బ్రిటిష్ వారు నిలవగా, ఫ్రెంచివారికి అండగా రెడ్డి పోలవరం రాజా, మంగపతి దేవు, నూజివీడు అప్పారావు, మొగల్తూరు వెంకట రాజా, పెద్దాపురం జగపతి రాజు, పిఠాపురం నీలాద్రిరావు లాంటి జమీందారులు నిలిచారు . చందుర్తి యుద్ధంలో ఫ్రెంచి వారు ఓడిపోయి నిష్క్రమించటంతో ఈ జమిందారులందరూ చెల్లాచెదురైపోయారు. వీరిలో పిఠాపురం జమిందారు నీలాద్రిరావుగారు, పెద్దాపురం జమిందారు జగపతిరాజులు ఈ అవమానభారాన్ని తట్టుకోలేకపోయారు. వీరికి అప్పటికే ఆనందగజపతిరాజుతో పాత శత్రుత్వాలు ఉన్నాయి. అతన్ని దెబ్బతీయటానికి వీరిద్దరూ తమ సర్వశక్తులూ కూడదీసుకొని ఒక చివరిప్రయత్నం చేసినట్లు పై ఉదంతం ద్వారా అర్ధమౌతుంది.
దీనికి సంబంధించి ఆధారాలు Robert Orme వ్రాసిన A History of military transactions of British Nation in Indostan by Robert అనే పుస్తకంలోకనిపిస్తాయి. గంజాంనుంచి తిరిగి వస్తున్న Moracin అనే ఫ్రెంచి సైనికాధికారిని 1759 డిసెంబరు నెలలో పెద్దాపురం జమిందారైన జగపతిరాజు కలిసి, సైనిక సహాయం కోరగా అతను కొంతమంది ఫ్రెంచి సైనికులను జగపతిరాజుకు తోడు ఇచ్చి పంపించాడు. ఈ సంగతి తెలిసిన ఆనందగజపతి రాజు ఈ తిరుగుబాటును అణచివేయమని తన సైన్యాన్ని సామర్లకోట పంపాడు. అదేసమయంలో మచిలీపట్నం వెళుతున్న బ్రిటిష్ సైన్యం కూడా వీరితో కలిసింది. పెద్దాపురం జమిందారు జగపతి రాజు, పిఠాపురం జమిందారు నీలాద్రిరావు లు ఫ్రెంచి సైనికులతో కలిసి ఆనందగజపతిరాజు సైన్యానికి తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చారు. ఈ పోరాటంలో మొరాసిన్ పంపిన ఫ్రెంచి సైనికులు తట్టుకోలేక వెనక్కి వచ్చేసారు. జగపతిరాజు చనిపోగా, నీలాద్రిరావు పారిపోయాడు.
Orme కథనానికి కైఫియత్తు కథనానికి చాలా తేడా కనిపిస్తుంది. జగపతిరాజు మొరాసిన్ కు లక్షరూపాయలు బయానాగా ఇచ్చి సైనిక సహాయం కోరిన సంగతి Orme పుస్తకంలో కనిపించదు. అంతే కాక సామర్లకోట కోటపై ఫ్రెంచి సైనికులను తరిమివేసి తిరిగి అక్కడ ఇంగ్లీషువారి జండాను ఎగరేసిన సంగతి కూడా. అంటే బహుసా జగపతిరాజు మద్దతుతో ఫ్రెంచి వారు ఈ ప్రాంతంలో తిరిగి ప్రవేశించి అక్కడి బ్రిటిష్ జండాను తొలగించి, తమ సైనికులను కాపలా ఉంచి ఈ ప్రాంతం ఇంకా మా ఆధీనంలోనే ఉంది అని ప్రకటించుకొన్నారని ఊహించుకోవచ్చు. ఇది కోస్తా జిల్లాలలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి ఫ్రెంచివారు చేసిన చివరి విఫలయత్నమని అనుకోవాలి.
***
ముగింపు
ఆనందగజపతిరాజు ఇంగ్లీషు వారిని ఆహ్వానించి సైనిక సహాయం అందించినందుకు నెలకు అరవై వేలు ఇవ్వటానికి ఒప్పందం చేసుకోవటం; అదే విధంగా ఫ్రెంచి వారు సైనిక సహాయం అందించేలా జగపతి రాజు నాలుగు లక్షలకు బేరం కుదుర్చుకోవటం ఆసక్తికరంగా అనిపిస్తాయి. అప్పట్లో యూరోపియన్స్ వద్ద తుపాకులు, ఫిరంగులు ఎక్కువగా ఉండేవి. వాటి సహాయంతో స్థానిక శత్రువులను నిర్మూలించవచ్చుననే దురాశ జమిందార్లలో కనిపిస్తుంది. మొదట్లో యూరోపియన్ల దృష్టి వ్యాపారావసరాలకు ఉపయోగపడే ఓడరేవులపైనే ఉన్నప్పటికీ, కాలక్రమేణా అది సైన్యాన్ని పోషించటం కొరకు భూములను ఈనాములుగా పొందటం వరకూ వెళ్ళింది.
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మెకంజీ కైఫియత్తులలో ఎంతో చారిత్రిక ప్రాధాన్యత కలిగిన చందుర్తి యుద్ధ ప్రస్తావన లేకపోవటం ఆశ్చర్యం కలిగించకమానదు. బహుసా అప్పటి ప్రజలు ఈ యుద్ధాన్ని ఇంగ్లీషు, ఫ్రెంచి రాజ్యాలమధ్య యుద్ధంగా కాక రెండు సంస్థానల మధ్య యుద్ధంగా భావించి ఉంటారు. అందుకనే విజయనగర సంస్థానాధీశుడైన ఆనందగజపతిరాజు గురించి, పెద్దాపురం సంస్థానానికి చెందిన జగపతిరాజు గురించిన సమాచారమే ఎక్కువగా ఉంటుంది. ఒక గొప్ప సంఘటన జరిగేటపుడు ఆ సంఘటనలో పాలుపంచుకొనే వ్యక్తులకు అది తెలియదు. కాలం నిర్ణయిస్తుంది.
ఆనందగజపతిరాజుతో చేసిన యుద్ధంలో జగపతిరాజు చనిపోయినపుడు అతని భార్య సతీసహగమనానికి సిద్ధపడింది. ఆ సందర్భంగా ఆనందగజపతి రాజు భార్య ఆమెకు పసుపుకుంకుమలు పంపించిందట. ఆ చర్యకు అవమానపడిన జగపతిరాజు భార్య “మాది కూడా దేశమే ఇక్కడా పసుపుకుంకుమలు లభిస్తాయి, భవిష్యత్తులో మీ దేశానికీ అవసరపడొచ్చు మీరే ఉంచుకోండి” అని తిరిగి పంపించేసిందట. “నా భర్తమరణానికి కారణమైన ఆనందగజపతి రాజు భార్యకూడా వైధవ్యాన్ని పొందుగాక” అని శాపం ఇచ్చి సతీసహగమనం చేసిందామె. ఈ సంఘటన జరిగి మూడునెలలు తిరక్కుండా 1760 లో ఆనందగజపతిరాజు రాజమండ్రిలో మసూచి సోకి చనిపోవటం కాకతాళీయమే.
జగపతిరాజు భార్య శాపం పెట్టటం కైఫియత్తు అయితే, 1760 లో ఆనందగజపతిరాజు చనిపోవటం చరిత్ర. రెండిటినీ విడదీయలేం.
(రానున్న నా తదుపరి పుస్తకం “తూర్పుగోదావరి జిల్లా-మెకంజీ కైఫియత్తులు” పుస్తకం నుండి)
బొల్లోజు బాబా

No comments:

Post a Comment