Thursday, November 27, 2008

హేమంత్ కార్కర్ కు అశ్రు నివాళి

మిత్రమా
నిన్నెందుకలా సంబోధిస్తున్నానో కూడా
నాకు తెలియటం లేదు.
నిన్నటివరకూ నీగురించి తెలియదు
నిన్నెప్పుడూ చూడలేదు
అయినప్పటికీ.....
నా ఆత్మీయ మిత్రమా
ఎందుకు ఉదయంనుంచీ
పదే పదే గుర్తుకు వస్తున్నావు?
ఎందుకు నీకై
హృదయం మౌనంగా రోదిస్తుంది?

కనురెప్పల మాటున
పలుచని నీటి పొరపై ఎన్నో దృశ్యాలు
లుక లుక లాడుతున్నాయి.
నీలం షర్టులో నీవు
హెల్మెట్ ధరిస్తూ, జాకెట్ సరిచేసుకొంటూ
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ
ఎవరికో దిశా నిర్ధేశం చేస్తూన్న
దృశ్యాలు పదే పదే
కుత కుత లాడుతున్నాయి.

నిన్నటి దాకా
అగ్ని వర్షం కురిపించిన
నీ కనులు తృప్తి నిండిన
నిశ్శబ్ధాన్ని ధరించాయి.
వదరుబోతు మృత్యువు
ఎదురుచూడని నిబ్బరమది.

ఒక నమ్మకం, ఒక భరోసా
కలిగించాలంటే ప్రాణమివ్వటం కంటే
మరేదీ ఉండదనుకొన్నావా?

నువ్వు మాత్రం మరొక శవం కాదు
ఎందుకంటే
నీవు నడిచిన ఐడియాలజీ మార్గం
నా జాతిని ప్రభావితం చేస్తుంది.
చేస్తూనే ఉంటుంది.

(ముంబాయి టెర్రరిస్టు దాడులలో చనిపోయిన, నిజాయతీ పరుడైన ఏ.టి.ఎస్. అధికారి శ్రీ హేమంత్ కార్కర్ మరియు ఇతర సిబ్బంది ఆత్మ శాంతికి )

Tuesday, November 25, 2008

వంశవృక్షం

ఒక వృక్షం
ఇష్టంతోనో, అయిష్టంగానో
కొమ్మలు రెమ్మలుగా విడిపోయి
నలుదిక్కులకూ చెదిరిపోవటం
ఎంతటి అనివార్యమిపుడు!

అవసరపడో, అనురాగంతోనో
ఆ కొమ్మలన్నీతమ పువ్వుల, తుమ్మెదల
సమేతంగా గుమిగూడటం
ఎంతటి అబ్బురం!

తమలో ప్రవహిస్తున్న పత్రహరితపు
మూలాల్నీ, మార్గాల్నీ
తెలుసుకోవటం, తెలియచెప్పటం
ఎంతటి సంబరం!

అన్ని వర్ణాలూ
ధవళ కాంతిలోకి కుప్పకూలినట్లుగా
అన్ని శాఖలూ
వంశమనే అద్దంలో ఒదిగిపోవటం
ఎంతటి లీలా వినోదం!

నాస్టాల్జిక్ పొత్తిలిలో
కేరింతలు కొడుతున్న
వృక్షశకలాలను సమయం
చెర్నకోలై అదిలించటం
ఎంతటి ఛిధ్ర దృశ్య విషాదం!

బొల్లోజు బాబా

Thursday, November 20, 2008

నైట్ షిఫ్ట్ కేబిన్ మాస్టర్

పట్టాలపై రైలుబండి
మిణుగురుల దండలా మెరుస్తోంది.
నిదురించే ప్రయాణీకులు
గమ్యాల్ని స్వప్నిస్తున్నారు.

వాడు మాత్రం
నిద్రను నిలువునా పాతరేసి
ఎరుపు ఆకుపచ్చ కాంతుల చేతులతో
ప్రతి రైలునూ నిలుపుతూ, పంపుతూ ఉంటాడు.

వాడూపిన పచ్చ జండాకి
వేయి స్వప్నాల్ని కడుపులో మోస్తున్న
ఇనుప అనకొండా భారంగా కదుల్తుంది.

ప్రయాణీకులు నిదురలో గమ్యాల్ని
పలవరిస్తూ ఉంటారు.

నూటనాలుగు జ్వరంతో ఉన్న వాడి కూతురుపై
కలిగిన ఆలోచనల్ని గౌతమీ ఎక్స్ ప్రెస్
తన చక్రాల పాదాలతో తొక్కేస్తుంది.
ఇంటివద్ద సగం ఖాళీగా ఉండే మంచపు తలపుల్ని
గూడ్సుబండి ఎక్కించుకు తీస్కుపోతుంది.
నిదురలో వీని మెడచుట్టూ చేతులువేసి
దగ్గరకు లాక్కొనే జీవనానురాగాలకు
వీడెప్పుడూ ఓ జీవిత కాలం లేటే.

ఒక్కోరాత్రి అరవై, డభ్బై రైళ్లను పంపించి
తెల్లారేసరికల్లా వీడో రైలు చక్రంలా మారిపోతాడు.

అదేపట్టాపై, అదే చక్రం అనంత దూరాలు సాగినట్లుగా
ఎరుపు, ఆకుపచ్చ కాంతుల మధ్య వీని జీవితం
జీవరాహిత్య గూడ్సు బండిలా సాగుతూంటుంది .

పట్టాకు చక్రానికి మధ్య నలిగిన రూపాయి బిళ్లలా
షిఫ్టుకీ, షిఫ్టుకీ మధ్య వీడి జీవగడియారం చితికి
ఎపుడో వచ్చే వృద్ధాప్యాన్ని ఇపుడే బోనస్ గా అందిస్తుంది.

నిదురించే ప్రయాణీకులు
గమ్యాలను మాత్రమే స్వప్నిస్తూంటారు.

వీని ఒక్క పొరపాటు
వేయి శవాలను పీల్చుకొనే మూడడుగుల నేలనే సత్యం
వీడి నరాలలో పాదరస ప్రవాహాల్ని పరుగులెట్టిస్తుంది.

తప్పుకొన్న పట్టాలమధ్య పొంచిఉన్న ప్రమాదాన్ని గుర్తించి
వీడో నిలువెత్తు ఎర్రజెండాయై
పరిగెత్తే రైలుకు ఎదురెల్తూవేసిన వెర్రికేకలు
అసహనపు ప్రయాణీకుల తిట్లలో కరిగిపోతాయి.

మెలుకువ గాజు పెంకులపై
వీడు చేసిన తపస్సు ఫలితంగా
నిదురించే ప్రయాణీకులు
తమ తమ గమ్యాలలోకి మేల్కొంటారు.

బొల్లోజు బాబా

Friday, November 14, 2008

నువ్వు నువ్వే- నేను నేనే

నేనో పాతికసంవత్సరాలపాటు
వెతికి వెతికి నిన్ను చేరుకుంటాను.
నువ్వో ఇరవై వసంతాలలో నాకై
చూసి చూసి నన్ను ఆహ్వానిస్తావు.

అంతవరకూ మనం జీవించినకాలమంతా
నిలువునా కుప్పకూలుతుంది.

సహజీవనమనే కొత్తవేషం కడతాం.

శరీరాలు ఒకదానికొకటి
ఎంతవెలిగించుకొని కరిగించుకొన్నా
ఎవరి పరిమళాలు వారివే!

ఎన్ని స్వాంతనలూ, ధైర్యాలూ,
ఓదార్పులూ ఇచ్చిపుచ్చుకొన్నాఎడారులూ,
ఎడారులకొనలవేలాడే మృగతృష్ణలూ,
నీవి నీవే! నావి నావే.

ఇరువురి ఆశల్ని, ఆశయాల్ని
ఎంతఒకే తెరపై చిత్రించినా
ఎవరి వర్ణాలు వారివే!

తమబరువుని తామే
మోసుకుతిరిగే మేఘాల్లా
ఎవరి శ్వాసభారాన్ని వాళ్ళే మోసుకోవాలి.

సముద్రం తరపుననీళ్ళు వకాల్తా తీస్కొని
ఎట్లైతే ఆటుపోట్లని నృష్టించలేదో
అలాగే
ఒకరి దప్పిక, ఆకలి, నొప్పులను
మరొకరు పూరింపలేరు.

ఎన్ని రోజులు కలిపి మండించినా
ఎన్ని రోజాల్ని కలిసి పండించినా
నువ్వు నువ్వే, నేను నేనే.
నేనే నువ్వు అనుకోవటం
నువ్వే నేను అనుకోవటమంతమాయ.

అయినా సరే
లోకం దృష్టిలో మనిద్దరిదీ
ఎప్పటికీ అన్యోన్యదాంపత్యమే.

బొల్లోజు బాబా

Monday, November 10, 2008

ఈ కవితకు పేరు సూచించండి.

విరగకాచినవెన్నెల్లో
మరొక్కపొగడపువ్వు కూడా
పట్టేట్టు లేదు.

రాత్రయితే చాలు
ఋతువు తప్పని
వలసపక్షుల్లా
నీ జ్ఞాపకాలు
హృదయంపై వాలతాయి.

హృదయతరువుపై
మరొక్కవసంతం కూడా
పట్టేట్టు లేదు.


చుంబనంలో
మోహావేశంలో
మూసుకొన్న
కన్నియనయనాల్లా
హృదయం తీయగా
వణుకుతుంది.

పొగడ పూల పరిమళంలో
వెన్నెల జలకాలాడుతూంది.



బొల్లోజు బాబా

Wednesday, November 5, 2008

నగర మర్యాద + ఈమాట, ఆంధ్రభూమి లలో పడిన నా కవితల లింకులు.

బ్లాగ్మిత్రులకు, పెద్దలకు
ఈమాట వెబ్ పత్రిక యొక్క దశమ వార్షికోత్సవ సంచికలో ప్రచురింపబడిన " సార్ గారండీ, సార్ గారండీ" అనే కవిత మరియు మూడు నవంబరు న ఆంధ్రభూమి సాహితి పేజీలో ప్రచురింపబడిన " మట్టికనుల నా పల్లె" అనే కవితల లింకులను ఇక్కడ ఇస్తున్నాను. (పేజీ చివరలో ఉంటుంది)
నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మిత్రులకు, పెద్దలకు సదా కృతజ్ఞుడనై ఉంటాను.
ధన్యవాదములతో
భవదీయుడు
బొల్లోజు బాబా

http://www.eemaata.com/em/issues/200811/1348.html

http://andhrabhoomi.net/sahiti.html



నగర మర్యాద

రహదారికిరుపక్కలా చెట్లు క్రమేపీ తగ్గి
హోర్డింగులు మొదలైతే
నగరంలోకి ప్రవేశిస్తున్నామన్నమాటే.
రకరకాల రంగుల్లో, వింతైన వెలుగులతో
హోర్డింగులు వంగి వంగి స్వాగతం పలుతూంటాయి.

నోరూరించే రుచులూ, ఇంటిని మరిపించే ఆతిధ్యం అంటూ
కొన్ని హోర్డింగులు అత్యంత అతి వినయంతో ఆహ్వానిస్తాయి.

"తలతిరుగుడా అయితే పక్షవాతం కావొచ్చు" అంటూ మన క్షేమం కోరుతూ
కిడ్నీలెక్కడ దొంగిలింపబడతాయో చెపుతూంటాయి.

వేయబోయే కొత్త వేషాలకు దుస్తులు మావద్దే కొనుక్కోమని
కొన్ని హోర్దింగులు ప్రాకులాడుతూంటాయి.

మేమమ్మే చదువులే టౌనులో బెస్టంటూ
మీర్రాకపోతే మామీద ఒట్టంటూ కొన్ని ప్రాధేయపడతాయి.

మాదే " అసలైన అనువంశీక షాపంటూ" కొన్ని దీనంగా నమ్మబలుకుతాయి.

నిక్కచ్చైన KD బంగారం మావద్ద మాత్రమే లభ్యం
రండి రండి రండంటూ మరికొన్ని గారాలు పోతాయి.

"మిక్సీ కొనండి మారుతీ కారు ఖచ్చితంగా పొందండి" అంటూ
కొన్ని హోర్డింగులు రోడ్డు గుద్ది మరీ, సాదరంగా పిలుస్తాయి.

ఆఖరుకు చస్తే
మార్చురీ వేను ఫోను నంబర్లతో సహా (ఉపయోగపడే సమాచారమిది)
హోర్డింగులు ఆత్మీయంగా, సవివరంగా, సవినయంగా,
తెలుపుతూ నగరానికి ఆహ్వానిస్తాయి.

తెచ్చుకొన్న చమురు ఇంకి పోయేదాకా
నగరమన్నాకా, ఆమాత్రం మర్యాద చేయద్దూ మరి?


బొల్లోజు బాబా


Saturday, November 1, 2008

ప్రొడిగల్ సన్స్

కాలేజీ చదువులకని
ఇల్లు విడిచిన పిల్లలు
ఇంకా తిరిగి రారు.

వృద్దాశ్రమంలో అంతా బాగానే ఉంటుంది.
వేళకు తిండి, వైద్యం, కాలక్షేపం.
కానీ
మెలుకువ నిద్రపొడవునా వ్యాపిస్తూంటుంది.

చలిచేతుల్ని
అనుభవాల చుట్టూ వేసి
వెచ్చచేసుకోవాల్సిందే.

జ్ఞాపకాల్ని వింటూ కొవ్వత్తి
రాత్రిలోకి వలికిపోతుంది.
కాలం నిండా ఘనీభవించిన చీకటి.

ఇసుక గడియారంలోని
ఒంటరి ఎడారి ధార
భారంగా జారుతుంది.

గాలి తన బరువుని
చెట్లపై ఈడ్చుకుంటూ సాగుతూంటుంది.

పాదముద్రలను
కెరటం నోట కరచుకు పోయింది.
మౌనం పంజరంలా
దేహంపై దిగింది.

కాలేజీ చదువులకని
ఇల్లువిడిచిన పిల్లలు వచ్చారు.

బొల్లోజు బాబా

Sunday, October 26, 2008

పల్లె కన్నీరు వినిపించిన శ్రీ గోరటి వెంకన్నకు వందనాలు


పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల....... అన్న పాటను శ్రీగోరటి వెంకన్న బహుళ జాతి కంపనీలు ఏవిధంగా పల్లెపల్లెలకు విస్తరించి అక్కడి జీవన విధానాన్ని, వృత్తుల్ని ఎలా ఛిద్రం చేసాయో చాలా ఆర్ధ్రంగా, వింటున్నప్పుడు భావోద్వేగానికి లోనై కన్నీరు జాల్వారే విధంగా వ్రాసారు.
ఈ పాట నిండా ఆయన తీసుకొన్న ప్రతీకలు,సామ్యాలు, వాడిన పదాలు పాటలోని వస్తువుకు గొప్ప బలాన్ని, స్ఫష్టతను చేకూర్చి చెప్పే విషయం శ్రోతకు చాలా సూటిగా చేరేలా చేస్తాయి.

మానవతా విలువలకు, స్వావలంబనకు ఆలవాలంగా ఉండే పల్లెలు నేడు సామ్రాజ్యవాద విస్తరణ ఫలితంగా తన స్వతంత్రతను, స్వచ్చతను కోల్పోయి, ఎవరిపై ఆధారపడకుండా ఇంతవరకూ బ్రతికిన తనబిడ్డలు వృత్తులు కోల్పోవటంతో పరాయి పంచన బతుకుతుండటాన్ని చూస్తూ ఈ విశాల భారత దేశంలోని ఒక పల్లె కన్నీరు పెడుతుంది, అంటూ గొప్ప ఎత్తుగడతో ఈ పాట మొదలౌతుంది. బహుళ జాతి కంపనీల విస్తరణను, సామ్రాజ్యవాదాన్ని ఈ కవి ఇక్కడ కనిపించని కుట్రలు గా వర్ణిస్తాడు. చేతి వృత్తుల చేతులిరిగిపోవటం వల్ల గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసి పోయిందని బాధపడతాడు.

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

లోహ పాత్రల ఇంద్రజాలంతో కుండల వాడకం మాయమైపోయింది . కుమ్మరి వాళ్ళు మట్టి పిసుక్కునే వామిలో తుమ్మలు మొలిచాయి అని అనటం ద్వారా వారు పని లేక చాలా కాలంగా ఉంటున్నారన్న విషయాన్ని కవి చాలా కరుణ ఉట్టిపడేలా చెపుతాడు.
నాగళ్ళ ఆరులు, కొడవల్ల కక్కులు, బండి వరలు, చేసే కమ్మరికి పనిలేక కొలిమిలో దుమ్ముపేరుకొంది పెద్ద బాడిస మొద్దుబారింది అనటంలో ఆకులం ప్రస్తుతం అనుభవిస్తున్న దైన్యం కళ్ల ముందు నిలుస్తుంది.
సాలెల మగ్గం కీళ్ళు విరిగి మూలకూర్చున్నదట. ఉపాధి మూలకూర్చున్నప్పుడు ఆత్మాభిమానం కల కుటుంబపెద్దకు ఆత్మహత్య మినహా మరో మార్గం కనిపించకపోవటం అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి.

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతు బావులెందుకెండే నా పల్లెల్లోనా

పల్లెలకు ప్రధాన ఆధారం వ్యవసాయం. అటువంటి వ్యవసాయంలో పెద్ద చిన్న రైతుల మధ్య తేడా ఈ పాదంలో చూడవచ్చును. బలిసిన దొరల పెద్దబోరు పొద్దంతా నీటిని భూమిలోతుల్లోంచి తోడుతున్నప్పుడు, చిన్నరైతు సేద్యానికుపయోగపడే బావులు, వాగులు వంకలు, మడుగులు తమ కళను కోల్పోయాయట. వీటిపైనే ఆధారపడే చాకలివానికి కూడా గడ్డుకాలమొచ్చింది అని కవి చెపుతున్నాడు. ఆ వాక్యంలో కూలిపోయినవి అన్న ఒక్క పదంద్వారా ఎంతటి విషాదాన్ని కవి పలికించాడో గమనించవచ్చు.

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పల్లెల్లో ఆటవిడుపుకోసం సేవించే కల్లుల స్థానంలో కల్తీకల్లు, బీర్లు, విస్కీలు, పెప్సీలు వచ్చిచేరాయి అనటంలో స్థానిక వనరుల విస్మరణ, కంపెనీల విస్తరణ, బలిసిన దొరలకే ధనం చేరుకోవటం వంటి విషయాల పట్ల కవి ఆవేదన చెందుతున్నాడు.

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

ఈ పాదంలో కవి సాయిబు పోరలని వర్ణించినా ఆ పోలికలన్నీ గ్రామాల్లో కాలువలలో, చెరువులలో, చేపలు, రొయ్యలు పట్టుకొని జీవనాన్ని సాగించే పల్లీయులకు కూడా వర్తిస్తుంది. రొయ్యల, చేపల పెంపకం, పెద్ద పెద్ద మరబోట్ల తో ఫిషింగ్ రంగాల్లోకి బడా స్వాములు కాలూనటంతో, ఈ పల్లీయులు కూడా చాలా చోట్ల ఉపాధి కోల్పోయి చెల్లా చెదురైనారు. తల్లికీ, ఊరికీ దూరంగా ఉన్న ఆ పోరలు తమ ఆకలి రొట్టెముక్కలతో తీర్చుకొన్నారా అయ్యో! వాటితో వారాకలి తీరిందా అని ప్రశ్నించడం, మూలాలు మరువని కవి, తడిని కోల్పోని మనిషి మాత్రమే చేయగలడు.

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

పల్లెల్లో వ్యవసాయాధారిత మరో కులం వడ్రంగి కులం. వీరు నాగళ్లు, బళ్లు చేస్తూ జీవిస్తూంటారు. పల్లే బావురుమంటున్నప్పుడు వీరికి పల్లెల్లో పని లేక ఫర్నీచరు పనులు, తాపీ పనులను వెతుక్కుంటూ పట్నాలకు వలసపోయారన్న విషయాన్ని కవి చెపుతున్నాడు.
ఆ సామూలంతా కూసూనేటి అన్న వాక్యం లో పోతులూరి వీరబ్రహ్మం పోలిక తీసుకు రావటం కవికి వారిపై కల అభిమానంగా అనుకోవచ్చు. వాకిలి పొక్కిలి లేసిందనటంలో గొప్ప పదచిత్రాన్ని గమనించవచ్చును.

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి , సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

పల్లెల్లో టైలర్ పాత్ర ఒకనాడు ఎలా ఉండేదో, పదిమందికి తలలో నాలుకలా ఎలా ఉండేవాడో వంశీ లేడిస్ టైలర్ సినిమాలో చూడవచ్చు (కామెడీ కోణాన్ని పక్కనపెట్టి). అలాంటి టైలర్ ఈ రోజు రెడిమెడు దుస్తులు పల్లెల్లోకి కూడా చొచ్చుకు పోవటం వలన వాని పాత్ర కుచించుకుపోయింది. రెక్కల బనీన్లు, సోడెలాగులు (పిక్క లాగులు) ఇప్పుడు వాడేవారేరి? ఆ నేపధ్యంలో కుట్టుమిషన్ల చప్పుళ్ళు ఆగిపోయాయని కవి చెపుతున్నాడు.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుంచీ.

ఈ మద్య కాలంలో బయలు దేరిన ఒక విచిత్ర పరిణామమిది. చెన్నై బాంబేల నుంచి కంపనీ నగలను సేల్స్ వ్యక్తులు తీసుకువచ్చి, అమ్మి పెట్టమని స్థానిక వ్యాపారస్తుల కప్పగించి, వాయిదాల పద్దతులలో డబ్బు వసూలు చేసుకుంటూంటారు. వాటిలో బంగారమెంతుంటుందో దేముడికే తెలియాలి. ఈ సేల్స్ వ్యక్తులు కూడా స్థానికంగా పాతుకుపోయిన డబ్బున్న వ్యాపారులనే తప్ప సామాన్య జీవనం గడిపే స్వర్ణ కారులను నమ్మరు. మరి అలాంటి నగలు చెర్నాకోలలై స్వర్ణకారులను తరుముతున్నప్పుడు, వీరు పల్లెల్ని విడిచి పట్నాలలో కూలిపనులు చేసుకొంటున్నారు. కొంతమంది పల్లెల్ని వీడలేక, కూలిపనులు చేయలేక వారు వృత్తి పరంగా ఉపయోగించే ద్రావకం లేదా సైనేడ్ లను తాగి ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.
ఇక పట్నాలలో అయితే మరొక పద్దతి. Exchange Offer లతో పెద్ద పెద్ద షాపులు, "మీరీరోజు ఎంత బంగారమైతే కొంటారో, దాన్నిచ్చేసి అంతే బరువున్న మరొక వస్తువుని మీరెప్పుడైనా వచ్చి పట్టుకు వెళ్ళొచ్చు" అంటూ కొనుగోలుదారుడిని ఆకర్షిస్తూంటాయి.
ఇలాంటి పరిస్థితులలో, బంగారం తీసుకొని వారం తరువాత వస్తువిస్తాననే పేద కంసాలినెవరు నమ్ముతారు?
కూలిపోయిన స్వర్ణకారుల వృత్తిని కవి ఇక్కడ చాలా ఆర్ధ్రంగా ఆవిష్కరించాడు.

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది.

కవి స్వయంగా మాదిగ కులానికి చెందినవాడవటం వలన (తప్పయితే కరక్ట్ చేయండి) ఆకులం ఎలాచితికి పోయిందో గొప్ప ప్రతీకలతో కళ్లముందు నిలుపుతున్నాడు. నోరుతెరవటం చావుకు చిహ్నం,భంగపడటం అవమానానికి, నిండమునగటం మరలా చావు/ఓటమికి చిహ్నం, పదునారిపోవటం పూర్వవైభవాన్ని కోల్పోవటం. బాటాలు, లోటో ల దాడిలో ఆ వృత్తికి చెందిన వివిధ పరికరాలు పనుల్లేక ఏవిధంగా తల్లడిల్లుతున్నాయో అద్బుతమైన పదచిత్రాలతో కవి ఎంతో ఆర్ధ్రంగా చెప్పాడు.

పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

తోలు డప్పు స్థానంలో ప్లాస్టిక్కు డప్పు వచ్చి దాన్ని పాతరేసిందని చెప్పటం. పాతరేకు, పాతరేసి అన్న మాటలలో ధ్వని సౌందర్యం కంటే హింసాత్మక ముట్టడే ఎక్కువ వినిపిస్తుంది.

పూసలోల్ల తాలాము కప్పలు, కాశిలో కలసి ఖతమౌతున్నవి.
అంటూ పూసలోళ్ల జీవనోపాధి ఏవిధంగా ఆవిరయ్యిందో కవి ఆవేదనచెందుతాడు.


ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదో నా పల్లెల్లోనా.

పల్లెటూర్లలో ఎద్దుబండి ఉన్నదంటే పాటలో చెప్పినట్ట్లు ఏడాదంతా పని దొరిదేది. అన్ని కాలాలలోనూ పనులుండేవి. ఇటుక, దాయ, పెంట తోలటం (ఇంటివద్ద పోగుపడిన పెంట అమ్ముకోవటం), అరకదున్నటం, ధాన్యం తోలటం, కుప్పనూర్పుళ్లు వంటివి. ఏ కాలానికి తగ్గ పనులు ఆ కాలంలో చేసుకుంటూ ఆ యజమాని తన కుటుంబాన్ని గౌరవంగా నడుపుకొనేవాడు. కానీ టాటా ట్రాక్టరు వచ్చి దీన్ని గుద్దితే ఈ బండి ఎగిరిపడ్డదట. ఆ పడ్డంలో ఒక కుటుంబం దాని క్రిందపడి చితికి పోయిందన్న విషయాన్ని కవి మనముందుంచుతాడు.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ అన్న ప్రశ్నకు పంటపొలాల మందుల చెత్తర వాసన అని చెపుతూనే అప్పు రైతు మెడమీద కత్తై కూర్చుంది అంటు రెంటికీ ఒక అవినాభావ సంబంధాన్ని చాలా అద్బుతంగా ఆవిష్కరిస్తారు. ఈ నేలపై ఆర్ధికంగా బలహీనమైన వారు బ్రతికే నెలవును కోల్పోతున్నారన్న సత్యాన్ని అద్భుతమైన ఉపమానంతో కవి ముడిపెడతాడు.

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై

బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

పల్లెల్లో పల్లవించే జానపద కళలు ఎలా అంతరించిపోయినయో కవి కన్నీరొలికించేలా ఇక్కడ వర్ణిస్తాడు. హార్మోనియం చెదలు పట్టిందట, యక్షగాన పంతులు ఉప్పరి పని చేసుకొంటున్నాడు, తమ కళకు పోషణ లభించక. బుడగ జంగాలు పాతబట్టలమ్ముకుంటున్నారట. ఎందుకంటే పల్లె మొత్తం దారిద్ర్యంలో ఉన్నప్పుడు ఈ కళలకు ఆదరణ ఎక్కడ చూపించగలదు? పాత బట్టల మూటలమ్ముకొంటున్నారు అని చెప్పటం ద్వారా పల్లె దరిద్రాన్ని కూడా అన్యాపదేశంగా చెపుతున్నాడిక్కడ కవి.


పిండిలా వెన్నెల కురిసే వేళ రచ్చబండపై ఊరు ఊసులు చెప్పుకొనే ఆ పాతరోజులు తలచుకొని, ప్రస్తుతం భోజనం చేసాకా ఒక్కడు కూడా బయట తిరగటం లేదేమిటబ్బా ఇదేమి చిత్రమో అంటూ ప్రశ్నించి, స్టార్ టీవీ సకిలిస్తాఉంది , సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మా నాపల్లెల్లోకు అని సమాధానాన్ని ఇస్తారు. (బహుసా కొన్ని నక్సలైట్ ప్రభావిత ప్రాంతలలో పరిస్థితులను కూడా చెప్పుతూ ఉండవచ్చు)

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.

బహుళ జాతి మాయలు, కుటీర పరిశ్రమలు పెట్టక పోవటం అంటూ కనిపించని కుట్రలను పాట చివరి పాదంలో కవి స్పష్టం చేస్తాడు. ఈ పరిస్థితులకు సూచ్య ప్రాయంగా పరిష్కారాన్ని కూడా సూచిస్తాడు కవి.

ఈ పాటలోని శభ్దసౌందర్యం ఈ పాటకు గొప్ప అందాన్నిస్తుంది. చిన్నచిన్న అచ్చ తెలుగు పదాలు పాటనిండా పరచుకొంటాయి. వింటున్నప్పుడు వీనులకు ఒక వింతైన అనుభూతిని మిగులుస్తాయి. కానీ ఈ పాటలోని పదాల వెనుకున్న వాస్తవం, దైన్యం, నిస్సహాయత అంతకు నూరురెట్లు ప్రకాశవంతంగా ఒక కరుణార్ధ్ర దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి.
ఈ పాట వందేమాతరం శ్రీనివాస్ గొంతునుండి వింటున్నప్పుడు కొన్ని చోట్ల ఆ గాన గంభీరతకు ఒళ్ళు జలదరిస్తుంది. (ఉదా: యాచకులు నా బుడగా జంగాలు అన్న చోట).

ఏ కాలంలోని కవైనా ఆయా కాలాల రాజకీయ ఆర్ధిక పరిస్థితులను, తన రాతల్లో ప్రతిబింబింప చేస్తాడు. ఆ వచ్చే మార్పులు మంచి వైపుకైతే సంబరపడిపోతాడు. అవి సగటు మానవజీవనానికి విఘాతం కలిగించేవైతే ఆవేదన వ్యక్తం చేస్తాడు. వాటికి పరిష్కారాలు తనపరిధిలో ప్రతిపాదిస్తాడు. ఈ పాటలో శ్రీ గోరటి వెంకన్న గారు సరిగ్గా అదే చేసారు. మారుతున్న పరిస్థితులలో కూలిపోతున్న ఉపాధులు, నలిగిపోతున్న బ్రతుకుల గురించి వారి పరిశీలనలను ఎంతో ఆర్ధ్రంగా ఆవిష్కరించారు. వారికి ఈ బ్లాగ్ముఖంగా వందనాలు తెలియచేసుకొంటున్నాను.

Thursday, October 23, 2008

ఒక జ్ఞాపకం.......


ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో

హృదయంలో విరిసిన సన్నజాజుల గానంలా
ఓ జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

గుప్పిట రహస్యాలను విప్పిన నూత్న యవ్వన వనాల
పరిమళాలు విరజిమ్మే శీతాకాల రాత్రులలో
నీ సాంగత్యపు కొలిమిలో నన్ను నేను
వెచ్చచేసుకొని, కరిగించుకొని మరిగించుకొనే క్షణాన
వర్షించిన సౌందర్యానందం నిన్నూ నన్నూ
ఆకాశపుటంచుల వరకూ విసిరికొట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

రొచ్చులు, రోతలూ, రేషన్లు, నెలసరి వాయిదాలూ
ఇంకా కబళించని రోజులలో
వెన్నెల పిట్టలు వాలిన పొగడ చెట్టు క్రింద
రాలిపడే పొగడపూల వానలో తడుస్తూ
పెదవులతో దేహవీణియలను మీటుకుంటూ
ఆ గానలోకంలో విచ్చలవిడిగా విహరించి
కనిపెట్టిన రహస్యాలను దాచుకొంటూ
దోచుకొంటూ, పంచుకొంటూ పరువులిడిన దూరాల
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.

పోటీలు, పోలికలూ, పధకాలు, పన్నాగాల వలల్లో
ఇంకా చిక్కుకోని ఆ అకలుషిత దినాల్లో
పట్టుకుచ్చులతో స్పృశించే నారింజ కాంతుల రాత్రిలో
వాంఛ, అంగీకారం పెనవేసుకొన్న క్షణాన
నీ కురులమల్లియలను కాల్చేలా నా శ్వాస జ్వలించేవేళ
విచ్చుకొన్న పెదవులు, సగంమూసిన కనులతో
నీ సౌందర్యం శాటిన్ తెరై నా హృదయంపై పరచుకొన్నప్పుడు
ఒక అదృశ్య హస్తం నిన్నూ నన్నూ ఎత్తుకపోయి
కాలరహిత, ఆలోచనారహిత, చేతనారహిత స్థితిలో కప్పెట్టిన
జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
********************

ఏమిటీ పరధ్యానం! వింటున్నారా?
స్కూలు ఫీజ్ కట్టటానికి రేపే ఆఖరు రోజుట.
చంటిదాన్ని హాస్పటల్ కి తీసుకెళ్ళాలి నంబరుబుక్ చేసారా?

జ్ఞాపకం హాయిగా సలుపుతుంది
వాస్తవం ముల్లుగర్రై పొడుస్తుంది.

బొల్లోజు బాబా

Sunday, October 19, 2008

ఒకానొక రెడ్ లైట్ ఏరియా


నాలుగు రోడ్ల కూడలి
పరాకాష్టకు చేరుకున్న ఒకానొక
వికృత క్రీడ యొక్క భీభత్సావృత కూపం.

జీవితం లైంగికంగా వ్యాప్తిచెందే
అంటురోగమయిన చోట
కన్నెలు మల్లెలవుతాయి
మల్లెలు కత్తులవుతాయి.

ఇక్కడ స్త్రీ చర్మం గజాల్లెక్కనా
గంటల్లెక్కనా వ్యాపారం చేయబడుతుంది.
ఇక్కడ అసూర్యంపశ్యల మాంసం
దేహాల్లెక్కన వడ్డీకి తిప్పబడుతుంది.

వర్ణ, వర్గ, కుల, మతాలనబడే
సభ్యసమాజపు శిలాతెరలు ఇక్కడ
దేహాలమద్య కనిపించని మంచుపొరలవుతాయి.

కిలికించితాలు, చెక్కిళ్ళ సిగ్గుదొంతరలు,
సుఖమనిపించే విరహాలు, పరిష్వంగ పులకింతలు,
అవన్నీ ఇక్కడి జీవన పరాజితుల
గుండెల్లో కలల శిలాజాలు.

ముత్యం భస్మమయినట్లు
స్వప్నయవ్వనం కాలిపోగానే, వాస్తవం
అనకొండాలా మృత్యుకౌగిలించుకుంటుంది.

పింప్ లు పిండుకోగా స్థనాల్లో
మిగిలింది రక్త గడ్డలొక్కటే.
నిత్యం వందల డైనోసార్ పందుల
రత్యానంతరం దేహాల్లో మిగిలింది
రోదనా ప్రవాహమొక్కటే.

కసుగాయల చెక్కిళ్లు చిదిమితే
కారేది పాలు కాదు ఎయిడ్స్ మాత్రమే.
ఎడారి కొమ్మలు పుష్పించేదిక
వేదనా బూడిద మాత్రమే.

ప్రపంచ ప్రాచీన వృత్తి ఇక్కడి
వ్రణ యోనులకు జీవనాధారమై
అదే మృత్యుదాతయై విరాజిల్లుతుంది.

సమాన ఆస్తి హక్కు, 30% రిజర్వేషన్ల వల్ల ఏం లాభం?
జీవన పరిస్థితులు మెరుగుపర్చాలి కానీ?


బొల్లోజు బాబా

(ఒకానొక రెడ్ లైట్ ఏరియా చూసి చలించి)