మిత్రమా
నిన్నెందుకలా సంబోధిస్తున్నానో కూడా
నాకు తెలియటం లేదు.
నిన్నటివరకూ నీగురించి తెలియదు
నిన్నెప్పుడూ చూడలేదు
అయినప్పటికీ.....
నా ఆత్మీయ మిత్రమా
ఎందుకు ఉదయంనుంచీ
పదే పదే గుర్తుకు వస్తున్నావు?
ఎందుకు నీకై
హృదయం మౌనంగా రోదిస్తుంది?
కనురెప్పల మాటున
పలుచని నీటి పొరపై ఎన్నో దృశ్యాలు
లుక లుక లాడుతున్నాయి.
నీలం షర్టులో నీవు
హెల్మెట్ ధరిస్తూ, జాకెట్ సరిచేసుకొంటూ
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ
ఎవరికో దిశా నిర్ధేశం చేస్తూన్న
దృశ్యాలు పదే పదే
కుత కుత లాడుతున్నాయి.
నిన్నటి దాకా
అగ్ని వర్షం కురిపించిన
నీ కనులు తృప్తి నిండిన
నిశ్శబ్ధాన్ని ధరించాయి.
వదరుబోతు మృత్యువు
ఎదురుచూడని నిబ్బరమది.
ఒక నమ్మకం, ఒక భరోసా
కలిగించాలంటే ప్రాణమివ్వటం కంటే
మరేదీ ఉండదనుకొన్నావా?
నువ్వు మాత్రం మరొక శవం కాదు
ఎందుకంటే
నీవు నడిచిన ఐడియాలజీ మార్గం
నా జాతిని ప్రభావితం చేస్తుంది.
చేస్తూనే ఉంటుంది.
(ముంబాయి టెర్రరిస్టు దాడులలో చనిపోయిన, నిజాయతీ పరుడైన ఏ.టి.ఎస్. అధికారి శ్రీ హేమంత్ కార్కర్ మరియు ఇతర సిబ్బంది ఆత్మ శాంతికి )
Showing posts with label ముంబాయి టెర్రరిస్టు దాడులు. Show all posts
Showing posts with label ముంబాయి టెర్రరిస్టు దాడులు. Show all posts
Thursday, November 27, 2008
Subscribe to:
Posts (Atom)
