Monday, January 16, 2023

“శంబుక వధ” నాటకం ఒక పరిశీలన

శ్రీ త్రిపురనేని రామస్వామి గారి జయంతి సందర్భంగా ఆయన శంబుక వధ నాటకంపై వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
బొల్లోజు బాబా


“శంబుక వధ” నాటకం ఒక పరిశీలన
.
భారతీయ తాత్విక చింతనలో భావవాదం, భౌతికవాదం వేదకాలం నుంచీ సమాంతరంగా ప్రయాణిస్తూ ఉన్నాయి. భావవాదం మతాన్ని నిర్మించి మనిషిని మూఢవిశ్వాసాలలో కూరుకుపోయేలా చేయగా, భౌతిక వాదం కార్యాలకు కారణాలను అన్వేషించే హేతువాదాన్ని నిర్మించింది. హేతువాదం అంటే ఒక ఆలోచనా విధానం.
కర్మసిద్ధాంతం, పాపపుణ్యాలు, స్వర్గనరకాలకు ప్రాధాన్యతనివ్వకుండా కార్యకారణ సంబంధాలను విశ్లేషించి సత్యాన్వేషణ చేయటం.
 
హేతువాదులు వేదనిందకులు కనుక వారిని గౌరవించరాదని మనుస్మృతి చెప్పింది. ఆంధ్రదేశంలో హేతువాదం భిన్న రూపాలలో మనుగడసాగించింది. శ్రీనాథుడు తన కాశీఖంఢంలో - బౌద్ధులు, చార్వాకులు, జైనులు, లోకాయుతులు, వైతండికులు, పాషండులు, కాపాలికులు, దిగంబరులు, పాశుపతులు అనే తొమ్మిదిరకాలైన నాస్తికులు ఆంధ్రదేశంలో ఉన్నట్లు వర్ణించాడు. వీరందరూ భౌతికవాదులు. వేమన జీవించిన కాలంలో ఆంధ్రనాట నాస్తిక విశ్వాసాలు ప్రజలలో ప్రచారంలో ఉండేవని అతని అనేక పద్యాలద్వారా తెలుస్తుంది. ఆధునిక కాలంలో స్వామినేని ముద్దునరసింహనాయుడు, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి లాంటి వారు – అంధవిశ్వాసాలను, మతమౌఢ్యాన్ని ఖంఢించి హేతువాద భావాలను ప్రచారం చేసిన క్రాంతదర్శులు. వీరిలో వివిధ సాహిత్య ప్రక్రియలద్వారా హేతువాదాన్ని ప్రచారం చేయటానికి జీవితకాలం పాటుపడిన వ్యక్తిగా త్రిపురనేని రామస్వామి ముఖ్యులు.

త్రిపురనేని రామస్వామి హేతువాద దృక్పథంతో పురాణ కథలను, పాత్రలను, ఘట్టాలను తీసుకొని వాటిలోని అహేతుక అంశాలను, అనౌచిత్యాలను చర్చిస్తూ కురుక్షేత్ర సంగ్రామం, ఖూని, శంబుక వధ, సూతపురాణం, కుప్పుస్వామి శతకం, వివాహవిధి లాంటి రచనలుచేసారు. వీటిలో-వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణ కొరకు, బ్రాహ్మణ మునుల ఒత్తిడితో శ్రీరాముడు శంబుకుడిని వధించే ఘట్టాన్ని “శంబుక వధ” పేరుతో 1920 లో రచించిన నాటకం ఎంతో సంచలనాన్ని సృష్టించి నేటికీ ఆధునిక ఆంధ్రసాహిత్యంలో ఒక నిరుపమాన రచనగా నిలిచింది. తదనంతర కాలంలో చలం, నార్ల వెంకటేశ్వరరావు, జి.వి కృష్ణారావు, ముద్దుకృష్ణ లాంటి రచయితలు ఇదే కోవలో మరిన్ని రచనలు చేయటానికి ఈ రచన ప్రేరణ అనటంలో సందేహం లేదు.

1. శంబుక వృత్తాంతం

శంబుక వృత్తాంతం రామాయణ ఉత్తరకాండలోనిది. రామరాజ్యంలో అకాలమరణాలు ఉండేవి కావట. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు తన కొడుకును కోల్పోయాడు. “యశ్య రాష్ట్రే నృపాలష్య తురీయశ్చ తపోదన! తత్ర తధ్యం భవత్యేన విప్ర బాలస్య మారణం” - ఏ రాజ్యంలో శూద్రులు తపస్సు చేస్తారో అక్కడ బ్రాహ్మణ కుమారులు అకాలమరణం పొందుతారని స్మృతి వాక్యం. దీని ఆధారంగా చేసుకొని రామరాజ్యంలో ఎక్కడో ఒక శూద్రుడు తపస్సు ఆచరిస్తున్నాడని దాని కారణంగా వర్ణధర్మాచరణకు భంగం కలిగిందని అందుచే ఈ బ్రాహ్మణ బాలకుడు అకాలమరణం చెందాడని నారదుడు, వసిష్ఠ్యాది రుషులు శ్రీరామునితో చెప్పగా, రాముడు తన వాయువాహనంపై రాజ్యమంతా నేరస్తుని కొరకు గాలించాడు. దక్షిణాదిన ఒక సరస్సు తీరంపై శంబుకుడనే ఒక శూద్రుడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లు గుర్తించి రాముడు అతని శిరస్సు ఖండించాడు. శంబుకుని శిరస్సు నేలపై పడగానే ఎక్కడో అయోధ్యలో ఉన్న మరణించిన బ్రాహ్మణ బాలకుడు తిరిగి శ్వాసపీల్చుకోవటం ఆరంభించాడట. స్థూలంగా శంబుక వృత్తాంతం ఇది.

పై మూల కథను మార్చకుండా రామస్వామిగారు హేతువాద దృక్ఫథంతో వర్ణధర్మ ఆచరణలోని అనౌచిత్యాన్ని, అన్యాయాన్ని ప్రశ్నిస్తారు శంబుకవధలో. దానికొరకు నాలుగు అంకాలలో గొప్ప ప్లాట్ ను నిర్మించి తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేసారు.

2. శంబుక వధ నాటకం

ఈ నాటకానికి రామస్వామిగారు రాసుకొన్న 27 పేజీల ముందు మాటలో రామాయణానికి సంబంధించిన చారిత్రిక, సామాజిక, భౌగోళిక అంశాలను, ఆర్య అనార్య విషయాలను చర్చించారు. ఈ నాటకంలో అంగదుడు, హనుమంతుడు, శంబుక శిష్యులు, చయనులు, సోమయాజులు లాంటి మూలంలో లేని పాత్రలు సృష్టించారు. అంతేకాక శంబుకునికి చిదానందాశ్రమము నెలకొల్పి శిష్యులకు ద్రవిడజాతి హక్కులను గురించి బోధనలు చేస్తున్నట్లు చెప్పటం, శ్రీరామ చంద్రుడు శంబుకుని కలిసి తత్వచర్చలు చేయటం లాంటి అమూల కల్పనల ద్వారా తను చెప్పదలచుకొన్న హేతువాద అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పారు.
నాటకంలో మొత్తం 4 అంకాలు కలవు. మొదటి అంకంలో తన ఆశ్రమానికి వచ్చిన అంగదునితో శంబుకుని సంభాషణ. రెండవ అంకములో శంబుకుని తపస్సుగురించి బ్రాహ్మణుల చర్చలు, కుట్రలు, రామచంద్రునితో శంబుకుని గురించి వసిష్ఠుడు చెప్పటం. మూడవ అంకంలో అంగదుడు శంబుకునితో బ్రాహ్మణులు జరుపుతున్న పన్నాగం గురించి చెప్పి వారించటం. వారి మధ్య పండిత చర్చలు. నాలుగవ అంకంలో రామునిచే శంబుక వధ.

3. వివిధ పాత్రల చిత్రణ

శ్రీరామచంద్రుడు: శంబుకుడు వర్ణధర్మాలను ధిక్కరిస్తున్నాడని తెలిసిన శ్రీరాముడు అతనిని రాజసభకు పండితుల సమక్షంలో తన వాదనను వినిపించుకోవలసినదిగా ఒక ఉత్తరమును పంపిస్తాడు; చిదానందాశ్రమంలో తపస్సు చేసుకొంటున్న శంబుకుని కలిసి అతనితో చర్చలు జరుపుతాడు; శంబుకుడు చెబుతున్నవిషయాలతో ఏకీభవించి ఇతను నిరపరాధి అని వెనుతిరుగుతాడు; మరలా వసిష్ఠుడు, ఇతర బ్రాహ్మణుల ఒత్తిడిమేరకు చేసేదేమిలేక తిరిగి వచ్చి శంబుకుని వధించటం జరుగుతుంది. మూలంలో రాముడు శంబుకునితో ఏ విధమైన చర్చలు లేకుండా నేరుగా వధిస్తాడు.
ఈ కల్పనల వెనుక రామస్వామిగారి ఉద్దేశం రాముని పాత్ర లోని దుర్గుణాలను చర్చించటం కాక, భావవాదంలోని (వర్ణధర్మాచరణ) క్రూరత్వాన్ని నిరూపించటంగా భావించాలి. అంతే కాక రాముని దైవంగా భావించే జనబాహుళ్యపు మనోభావాలను కించపరచకుండా బ్రాహ్మణాధిక్యం ఏమేరకు పాలకులను కూడా ప్రభావితం చేసి సమాజంలోని శూద్రులకు అన్యాయం చేసిందో అనే అంశాన్ని అంగీకరింపచేసే యోచనకూడా ఉండవచ్చు. 
`
శంబుకుడు: ఈ నాటకంలో శంబుకుడు పాత్ర శూద్రజాతి ప్రతినిధిగా శాంత స్వభావునిగా, అతిధిమర్యాదలు తెలిసిన వ్యక్తిగా, వేదవేదాంగములు, స్మృతులు చదువుకొన్న జ్ఞానిగా తీర్చిదిద్దటం జరిగింది.
అంగదుడు, శంబుకుల మధ్య సంభాషణలలో - స్మృతులు బ్రాహ్మణులకొరకు రాసుకొన్నవని; వాటిలో శూద్రులకు స్థానం లేకపోగా వారిపట్ల పక్షపాత ధోరణి కలిగి ఉన్నవని; ఆర్యులచే పరాజితలమైన మనం వారితో సమాన స్వాతంత్ర్యమును హక్కులను పొందాలి, దానికై నేను హింసాపరాజ్ఞ్ముఖుడనై ఆశ్రమము స్థాపించి తపస్సుసాగిస్తున్నాను; ఒకవేళ ఆ రామచంద్రుడే వచ్చి నన్నీ జపతపంబులు మాని ద్విజసేవ చేయమన్నను నా అంతరాత్మకు వ్యతిరేకముగా దానినొనొర్పజాలను- అంటూ మాట్లాడించటం ద్వారా శంబూకుడిని సొంత వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిగా చిత్రీకరిస్తారు రామస్వామి గారు.
 
రాముడు నిన్ను వధించే అవకాశం ఉంది అని అంగదుడు అన్నప్పుడు, శంబుకుడు “నా మరణము వలన ఆర్యులకు కలుగు లాభముకన్న అనార్యులకు కలుగు లాభము మెండుగనుండును.” అని బదులిస్తాడు. ఇది రచయిత క్రాంతదర్శనానికి నిదర్శనం. ఈ నాటకం వచ్చిన అరవై ఏండ్లకు తెలుగునాట వెల్లివిరిసిన అస్తిత్వ ఉద్యమసమయంలో శంబుకుడిని బహుజన అస్తిత్వానికి ప్రతీకగా తీసుకొని గొప్పకవిత్వం వచ్చింది.
 
శంబుకుడు రాజసభలో పండితుల సమక్షంలో తన వాదనను వినిపించుకోవలసినదిగా శ్రీరాముడు ఆహ్వానించినపుడు శంబూకుని శిష్యుడు - మన వాదనను ఎంతకాలం రహస్యంగా ఉంచుకొంటాం? రామభద్రుని మధ్యవర్తిగా ఉంచుకొని ఆర్యులతో శాస్త్రవాదనలు చేసి మనహక్కులను నిలబెట్టుకొందామని సలహా ఇస్తాడు. దానికి శంబుకుడు - వారు వేద ప్రామాణ్యామునంగీకరింపరు మనము స్మృతి ప్రామాణ్యము నంగీకరింపము. ఉత్తరములో స్మృతి తిరస్కారులమని మనపై అభియోగం చేసారు. అలాంటప్పుడు ఇక వాదించటానికి ఏముంటుంది. మీరు వేదాన్ని ప్రమాణంగా తీసుకొంటే చర్చలకు వస్తామని స్మృతులని ప్రమాణంగా తీసుకోదలిచితే రాలేమని సమాధానం ఇప్పించాడు శంబుకుడు.
 
శ్రీరాముడు శంబుకుని ఆశ్రమానికి వచ్చినపుడు జరిగిన చర్చలలో- “మీరు శూద్రులు మీకు వేదములను చదువటానికి కానీ మతప్రసంగములు చేయటానికి కానీ అర్హత లేదు అనగా అది ఎవరి ఆదేశము” అని తిరిగి ప్రశ్నిస్తాడు శంబుకుడు

పై సన్నివేశాల ద్వారా శంబుకుడు వేద వేదాంగ విద్యాపారంగతుడని, వేదాలను అంగీకరించినా వర్ణధర్మాలను స్థిరపరుస్తోన్న స్మృతులను వ్యతిరేకించి, ప్రజలందరకు సమానహక్కులుండాలని వాదించే జ్ఞానసంపన్నుడిగా చిత్రించారు రచయిత.
 
అంగదుడు: ఈ పాత్ర బహుశా రామస్వామి గారే అనుకోవచ్చు ఎందుకంటే మొత్తం నాటకంలో వివిధ పాత్రల వ్యక్తిత్వాలను విశ్లేషిస్తూంటుందీ పాత్ర. రచయిత తన అభిప్రాయాలను అంగదుడు పాత్ర ద్వారా ధారాళంగా చెప్పగలిగారు.
 
శంబుకుని వధించటానికి బ్రాహ్మణబాలకుని మరణం కారణం. అలా జరగటానికి రాజు వైఫల్యం అని చెప్పే స్మృతివాక్యం దోహదకారి. రామస్వామి గారు బ్రాహ్మణ బాలకుని మరణం కట్టుకథ అని చెప్పటానికి అంగదుని పాత్రను వాడుకొని ఇలా చెప్పించారు రచయిత.
//"ఔరా! యౌరా యేమి యీ కుట్ర! ఏమి యీతంత్రము! ఏమి యీ ఛద్మకౌశలము! ఇప్పుడంతయు నర్ధమయినది; వసిష్ఠులవారెంత తంత్రజ్ఞులు! మొన్నసాయింకాలము, వసిష్ఠులవారశ్వనీ దేవతలతో గుసగుసలు వోవుటకు గారణమిదియా! అశ్వనీ దేవతల సాహాయ్యమున నీకుఱ్ఱవానిని మూర్ఛపోగొట్టి శంబుకర్షితపముచే మరణించెనని చెప్పవచ్చిరి//
అశ్వనీదేవతలు ఆది వైద్యులు. వారి సహాయంతో వసిష్ఠ్యాదులు ఒక కుర్రవాడిని కొద్దిసేపు శవరూపంలో పడుకొని ఉండేటట్లు చేసి, ఆ సమయంలో అతను శంబూకుని తపస్సువల్ల చనిపోయాడని రాముని వద్ద నాటకములాడి రాముడుని శంబుకునిపై ఉసిగొల్పినట్లుగా కల్పన చేయటం ద్వారా రామస్వామి గారు వర్ణధర్మాన్ని పరిరక్షించటానికి ఎంతటి కుట్రలకైనా బ్రాహ్మణులు పాల్పడేవారని నిరూపించయత్నించారు.

వసిష్ఠ్యాదులు: వసిష్ఠునికి శ్రీరాముడు నమస్కరించగానే “వర్ణాశ్రమాచార పరిరక్షణ సామర్థ్యమస్తు” అని దీవిస్తాడు. ఈ దీవెనలోనే నాటకం ఆత్మ మొత్తం ఇమిడిపోయింది. వసిష్ఠుడు, చైనులు, సోమయాజి అనే పాత్రలు రాముడిని ప్రేరేపించి వర్ణధర్మాలు కలుషితంకాకుండాచూసే మిషతో శంబుకుని వధించేలా చేస్తారు.
 
4. శంబుక వధ నాటక ప్రాసంగిత

స్మృతుల రూపంలో భావవాదం, బ్రాహ్మణాధిక్యత అనేవి భారతీయ సమాజాన్ని ఏ మేరకు ప్రభావితం చేసి ప్రజలను విడదీసిందో చెప్పటం ఈ నాటక రచనా లక్ష్యము. ఈ నాటకంద్వారా రామస్వామిగారు సంధించిన ప్రశ్నలు నేటికీ ప్రాసంగితను కోల్పోలేదు.
 
ఎ. ఇట్లు వ్రాయబడిన శాస్త్రములు మన శాస్త్రము లెట్లగును? మనకుగా వ్రాసిరా? మన అభిప్రాయములంగొనిరా? కాని నేడు మనమేల వానిచే బంధింపబడవలయు?
శాస్త్రములు శూద్రులకు తపస్సు చేయుట నిషేదించింది కదా అని అంగదుడు ప్రశ్నించినపుడు శంబూకుడు ఇచ్చిన జవాబు అది. రుషులు కల్మషమతులై పక్షపాతముతో శాస్త్రములు చెప్పితిరని అంటాడు శంబూకుడు.
 
బి. ద్విజేతరులు తపంబు చేసిన యెడల ఆ ద్విజశిశువులెట్లు మరణింతురు? అని హనుమంతుని ద్వారా వేయించిన ప్రశ్న చాలా విలువైనది. తార్కికమైనది. ఇక్కడ హనుమంతుడు ఒక ద్రవిడ స్థానంలో ఉండి ఆర్య వసిష్ఠుడిని ప్రశ్నిస్తున్నాడు. పై ప్రశ్న అడిగినందుకు హనుమంతునితో ఒక బ్రాహ్మణ ప్రతినిధి - "ఆంజనేయా! శ్రమపడి ప్రశ్ననడిగితివిగాని, నీకు శాస్త్ర చర్చ చేయునధికారము లేదెరుంగుదువువా! మా బోంట్లు ధర్మ సూక్ష్మములు నీకు జెప్పనుదగదు, నీవు విననుదగదు" అంటూ చెప్పించిన సమాధానం హిందూ మతంలో శతాబ్దాలపాటు నడిచిన బ్రాహ్మణాధిక్యతకు అద్దంపడుతుంది. "అయ్యా! మాకెందులకు జెప్పకూడదో ఇప్పుడు తెలిసినది" అని హనుమంతునితో అనిపించటంలో- ప్రశ్నిస్తామనే భయంతోనే మాకు శాస్త్రాలను నిషిద్దం చేసారనే అధిక్షేపణ దాగిఉంది.

సి. "వేదజ్ఞానమును గ్రహించిన వారు, గ్రహింపనిష్టపడిన వారు హిందువులనబడుచుండిరి. హిందువులయ్యినా లాభమును బొందజాలని వారు మాబోంట్లు, కాన మేమెట్లు వేదములను బొందగూడదో! యెట్లు భగవద్ధ్యానము జల్పుకొనగూడదో దేవరవారే యోజింతురుగాక." -- ఇవి శంబూకుడు శ్రీరామునితో పలికిన పలుకులు. శూద్రులకు వేదజ్ఞానము నిషిద్ధము. వేదాన్ని అంగీకరించినవాడు హిందువు. హిందువులమయ్యికూడా వేదాలకు మమ్ములను ఎందుకు దూరం చేస్తున్నారు అనే శంబూకుని వాదనలో ఆలయప్రవేశం నిషేదించినందుకు మతం మార్చుకోవలసివచ్చింది అనే సమకాలీన వాదన కూడా ఇమిడి ఉంది. బ్రాహ్మణులకే పరిమితం చేయబడిన వేదజ్ఞానం మాకూ కావాలనటంలో, నిచ్చెనమెట్ల వ్యవస్థను నిర్మూలించమని, అందరికీ సమాన హక్కులు కల్పించమని కోరటంగా అర్ధం చేసుకోవాలి.
***

హిందూమత చరిత్రలో బ్రాహ్మణిజపు కుట్రలను, కుతంత్రాలను సామాన్య ప్రజలకు అవగతం చెయటానికి శంబుక వధ నాటకాన్ని రచించారు రామస్వామి గారు. భావవాదానికి ప్రాతినిధ్యం వహించే పురాణాలను హేతుదృష్టితో చూడాల్సిన అవసరాన్ని, విచారించే తత్వాన్ని తెలిపారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికిల్ 51 ఏ నందు, శాస్త్రీయదృక్పథం, మానవత్వాన్ని పెంపొందించుకోవడం, విచారించే తత్వాన్ని అలవర్చుకోవడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతగా చెప్పబడింది. తదనుగుణంగా ప్రజలలో శాస్త్రీయ దృక్ఫథం పెరగాలి విశ్వాసాలకు మూఢవిశ్వాసాలకు గల తేడా తెలుసుకోగలగాలి. ఇతరులపట్ల ఇతరమత విశ్వాసాలపట్ల సహిష్ణుత కలిగి ఉండాలి. ఇవన్నీ హేతువాదాన్ని జీవనవిధానంగా చేసుకొన్నప్పుడు సాధించగలం. దీనికి సాహిత్యం దోహదపడుతుంది.
 
ఎనభైల తరువాత రైట్ వింగ్ రాజకీయాలు ప్రబలమవ్వటం వల్ల ప్రజలు మరింత అంధవిశ్వాసాలలోకి కూరుకుపోవటం జరుగుతోంది. ఉన్నత స్థానంలో ఉన్న నాయకులే- వినాయకుడిని చూపించి మన పూర్వీకులకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసని మాట్లాడుతున్నారు; మనుషులకు వయసుపెరగటం వల్ల శరీరం అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక గ్లోబల్ వార్మింగ్ అంటున్నారంటూ ఆధునిక విజ్ఞానాన్ని తక్కువచేస్తారు. ఒక మంత్రి న్యూటన్ నియమాలు వేదాల్లో ఉన్నాయంటాడు; మరొకరు ఆవు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందంటాడు; ఇంకొకడు భారతదేశం వేల సంవత్సరాల క్రితమే టెలివిజను, ఇంటర్నెట్ కనుగొన్నదని అంటాడు.
పై వ్యాఖ్యలు అనాలోచితమైనవి కావు. అవి రైట్ వింగ్ రాజకీయాలకు ఉపయోగపడే అంశాలు. నాయకులు తమ రాజకీయ లబ్దికొరకు ప్రజలను పోలరైజ్ చేయటానికి వీటిని పదే పదే వల్లిస్తున్నారు. నేటి యువత వీరి వలలో చిక్కకుండా ఉండాలంటే యుక్తాయుక్త విచక్షణ కలిగిన శాస్త్రీయ దృక్ఫథం అవసరం.
 
ఇలాంటి రాజకీయ సామాజిక నేపథ్యంలో త్రిపురనేని రామస్వామి సాగించిన హేతువాద పోరాటం యొక్క ప్రాసంగిత మరింత పెరిగింది.
 
రామస్వామి గారి రచనలలో దైవ దూషణ కనిపించదు. భావవాదపు అహేతుక, అమానవీయ అంధ విశ్వాసాలను, కుట్రలను మాత్రమే ఖంఢించారు తప్ప ప్రజల విశ్వాసాలను గాయపరిచేలా రచనలు చేయలేదు. ఈ నాటకంలో కనిపించేది బ్రాహ్మనిజంపైన ద్వేషమే తప్ప బ్రాహ్మణ ద్వేషం కాదు. ఈ లక్షణాలను సమకాలీన హేతువాద వ్యాఖ్యాతలు అలవర్చుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
త్రిపురనేని రామస్వామి గారి పోరాటాన్ని తలచుకోవటం, వారు స్వప్నించిన నిర్మాణాత్మక భౌతికవాదాన్ని ముందుకు తీసుకెళ్ళటం చారిత్రిక అవసరం.


బొల్లోజు బాబా




Wednesday, January 11, 2023

థేరీ గాథలు…ఒక అనుసృజన

ఈ పుస్తకం చదివేది కాదు. మన మానసిక స్థితి వలన ఈ పుస్తకంలోకి మనం ప్రయాణిస్తాం- డా. కాళ్ళకూరి శైలజ
థెరీగాథల పుస్తకం ఆత్మను ఇముడ్చుకొన్న ఈ ఒక్క వాక్యం చాలు .... థాంక్యూ మేడం గారు ఈ గొప్ప కాన్కకు...
.
ఈ వ్యాసాన్ని సృజనసాహిత్య పేజీలో ప్రచురించినందుకు శ్రీ విల్సన్ రావు గారికి ధన్యవాదములు.
బొల్లోజు బాబా
.
థేరీ గాథలు…ఒక అనుసృజన
.
బొల్లోజు బాబా గారు కవి, సాహిత్య విశ్లేషకులు, వక్తగా అందరికీ పరిచితమే. ఆయన ఎంచుకున్న మరో ప్రత్యేకమైన బాట చారిత్రక రచన. ఇప్పటికే చారిత్రక విభాగంలో ఆయన రెండు గ్రంథాలను రచించిన, తన అభిరుచిని, అధ్యయనాన్ని చాటుకున్నారు.

కవి రక్తంలో ఆవేశం, ఆవేదన కలిసి ప్రవహిస్తుంటాయి. సృజనాత్మకతకు విస్తృతమైన సాహిత్య పరిశీలన అవసరం అన్నది నిర్వివాదాంశం.

బాబా గారు అప్పుడప్పుడు సచ్చిదానంద గారి కవితల అనువాదం తమ ముఖ పుస్తక పేజీలో ప్రకటిస్తుంటారు. మరో భాషలో వచ్చిన సున్నితమైన భావోద్వేగాలు మనసును ఎంతగానో వెంటాడితే తప్ప వాటిని మాతృభాషలోకి అనువాదం చేయలేరనిపిస్తుంది.

ఈ మధ్య బాబా గారి కవితాత్మకు, చారిత్రక నేపథ్యం తోడై 'థేరిగాథలు' కవితా సంకలనం వెలుడింది.
 
మానవ అస్తిత్వంలో 'తాత్విక ధోరణి' అత్యంత ఉన్నతమైంది. భూమిపైన జీవానుక్రమంలో జరిగిన రూపాంతరాలలో మనిషి పుట్టుకే శ్రేష్టం. ఆలోచనలు, భావనలు అని మనం వేర్వేరుగా వర్గీకరించుకునే నైరూప్యత ఒక అభివ్యక్తిని పొందడం మానవ మేధకు పరాకాష్ట.
అవసరాలు, కాంక్షలు తీరినప్పుడు సుఖం, తీరనప్పుడు దుఃఖం సహజం. చిత్రంగా సుఖదుఃఖాల్లో మానవుడు తనను తాను మరొకరితో పోల్చుకుంటాడు. ఈ పోలిక సుఖం విషయంలో అసూయ, విద్వేషం ప్రతీకారం, హింసగా పరిణమిస్తుంది.
 
అదే దుఃఖం కలిగితే నిస్పృహ, నిరాశ, బాధ నిండిపోతాయి. అందరూ బాగున్నారు, నాకే కష్టం వచ్చిందనే క్రుంగుబాటు వస్తుంది. ఆ సమయంలో సరైన సాంత్వన లభించినట్లైతే నిత్య జీవన సరళి లోకి పునఃప్రవేశించి, ఉపశమనం వైపు నడక నేర్చుకుంటాడు. పుట్టిన తరువాత నేర్చుకునే నడక ఎంత గొప్పదో ఈ నడక కూడా అంతే ముఖ్యం. ప్రధానం కూడా. ఈ ప్రయాణానికి అవసరమైన ఆర్ద్రతను సర్వ మానవులకు పంచిపెట్టిన సంపూర్ణ బోధకుడే బుద్ధుడు.
తన దుఃఖం కోసం కాక పరుల దుఃఖం పట్ల సహానుభూతి చూపాడాయన. అందుకే దుఃఖ మూల కారణాన్ని అన్వేషించేందుకు సిద్ధపడి, సాధించాడు. కోరికలే విషాదానికి కారణమని తెలుసుకున్న క్షణమే బుద్ధుని కళ్ళకు లోకంలోని సమస్త జీవజాలం సమానంగా కనబడింది. అందుకే, లింగ, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరితో సంభాషించ గలిగాడు. ధనం, అధికారం సాటి వారిని పీడించేలా మనిషినెంత కఠినంగా మారుస్తాయో గమనించాడు.

బుద్ధ బోధనలకు పీడిత జనమంతా ఆకర్షితులయారు. ముఖ్యంగా స్త్రీలు ప్రభావితమయ్యారు. వారినందరినీ ఆదరించి భిక్షుణులుగా వచ్చేందుకు అనుమతించి, మహిళలను జనజీవన స్రవంతిలో భాగం చేసిన తొలి తత్వవేత్త బుద్ధుడే. ఈ సూత్రాన్నే మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య సమరంలో అవలంబించాడు. అలా బుధ్ధ మార్గంలోకి వచ్చిన బౌద్ధ బిక్షుణులు వ్రాసుకున్న కవితలు 'థేరీ గాథలు'.

'మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా' ద్వారా 'థేరీగాథ' ఛార్లెస్ హాలిసే గారి ఇంగ్లీష్ సంకలనం ఒకప్పుడు వాడ్రేవు చినవీర భద్రుడు గారు సూచించిన తరువాత నేను తెప్పించుకుని చదవడం జరిగింది. ఇది 2016 లో జరిగిన విషయం. పచ్చి గాయాన్ని మోస్తున్న నా హృదయానికి ఈ ప్రతి బౌద్ధ బిక్షుణి కవితా, ఓదార్పునిచ్చి బుజ్జగించాయి.

దుఃఖ గాథలు, ముఖ్యంగా స్త్రీల వ్యక్తిగతమైన దుఃఖ గాథలు ఎక్కడ దొరుకుతాయి? మాతృస్వామ్య వ్యవస్థ తొలగిపోయాక స్త్రీకి భర్త, బిడ్డలు, కుటుంబం అనే మూడు భౌతిక, మానసిక సంకెళ్లు పడ్డాయి. సంఘం చెక్కిన చెరసాలలో ప్రపంచ నాగరికతలన్నిటా ఈ ధోరణి కనబడుతుంది.
సున్నిత హృదయం వలనో, ప్రేమమూర్తి గానో స్త్రీ వాటిని బంధనాలుగా కాకుండా బంధాలుగా చూసింది. భర్త నిరాదరణ, కుటుంబ కలహాలు, బిడ్డల నిర్లక్ష్యం, భర్త లేదా బిడ్డ మరణం ఇవన్నీ స్త్రీ జీవితాన్ని బహిరంతరాలలో కృంగదీసినపుడు మరో విధంగా బతకలేని నిస్సహాయత ఆవరిస్తుంది.

'థేరీగాథ'లు బుద్ధుని కాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా స్త్రీ ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను, విషాదాలను లిఖిత పూర్వకంగా రికార్డు చేశాయని చెప్పవచ్చు. అటువంటి 'థేరీగాథల'ను తెలుగులోకి అనుసృజన చేయటం బొల్లోజు బాబా గారి సున్నితమైన సహానుభూతి గల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

బాబా గారు గొప్ప ఆసక్తితో ఎన్నో ప్రామాణిక గ్రంథాలను సేకరించి, వాటిలోంచి మేలైన మణిపూసలను ఎన్నుకుని (తె)వెలుగులోకి తెచ్చారు.

ఎందరో స్త్రీలు సంపన్నులు. అధికారి భార్య ఒకరైతే, వ్యాపారి కూతురు మరొకరు. అన్ని స్థాయిలకు చెందినవారు ఉన్నారిందులో. వీరంతా ఇంటి నుంచి, ఈతిబాధలకు విసిగి తమ పరిమితులను ఛేదించి, కుటుంబాన్ని ఎదిరించి బుధ్ధ భగవానుని అనుసరించారు.
'సామ','ముత్త', 'పున్న'--గా పిలవబడే ఎందరో బౌద్ధ బిక్షుణుల కవితలు బాబా గారు ఇందులో చేర్చారు.

"breakthrough all that is dark with wisdom made full".....
"సంపూర్ణ జ్ఞానంతో ఈ సువిశాల చీకట్లను ఛేదించు "
బౌద్ధ బోధనల సారం ప్రబోధ కవితలుగా కొత్త రూపు దిద్దుకుంది. బాబా గారి సరళమైన భాష వలన మూలంలోని జటిలమైన ఉద్బోధ కూడా పాఠకునికి స్పష్టంగా అర్ధమౌతుంది.
కోరికలను జయించడమే కాదు, తిరిగి వాటివైపు ఆకర్షితులు కాని వారే నిజమైన ముక్తి సాధించగలరు అనే జ్ఞాన బోధ ఒక్కో కవితతో మరింతగా వ్యక్తిగత బాధ్యతను గుర్తుచేస్తుంది.
"From all that holds you back"
"వెనక్కులాగే అన్ని శక్తుల నుండి " అంటూ బాబా గారు మన వాడుకలో,లోతైన విషయాన్ని సూటిగా పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

"What does being a woman have to do with it?.......and that one sees what really is!"
'సోమ' అనే మహిళ తీక్షణమైన ఈ ప్రశ్నను, 'సత్యదర్శనం సరిగా ఉన్నపుడు స్త్రీ అయితే ఏంటటా?" అంటారు బాబాగారు.

"నా శ్రవణం స్ఫుటిత పడింది "
"అన్ని దుఃఖాలు,వాటి మూలాలు అర్ధమయ్యాయి "
"పులు కడిగిన ముత్యంలా వారు (పరివ్రాజకులు)దోష రహితులు "
"వారికి దుఃఖ నాశనం తెలుసు"
"నడవాల్సిన మార్గంలో నడక ఆరంభించేసాను నేను "
"ఈ దేహాన్ని అలంకరించి వివాహం అనే బంధంలో అమ్ముకోమంటున్నావా?"
"సముద్రంలో తప్పిపోయిన నావికుడు తీరాన్ని చేరుకొన్నట్లు నీకు కూడా గమ్యం దొరుకుతుందిలే"

పై వాక్యాలను పేరు సైతం చెప్పుకోని బౌద్ధ భిక్షుణిలు పలికారు. అవి మానవ చరిత్రలో తాత్విక చింతనలో పరమోన్నత వాక్యాలయ్యాయి. ఇది మహిళ తన స్వరాన్ని స్పష్టంగా, సమున్నతంగా, వెలిబుచ్చిన బృహత్ సందర్భం.

ఆనాటి మహిళలో తెగువ, వైరాగ్యం, అస్తిత్వ ప్రకటన అన్నీ బుధ్ధుడు తెరచిన ద్వారాల వలన మాత్రమే సాధ్యపడ్డాయి. అవన్నీ నేటికీ ఏ స్త్రీ ఐనా తెలుసుకోదగ్గ సత్యాలు. మానసిక స్థైర్యం ఇచ్చే అమృత గుళికలు.

మూలగ్రంధంలోని తాత్విక పరిమళం రవ్వంతైనా పొల్లుపోకుండా మనకు అందించడంలో బాబాగారు కృతకృత్యులయ్యారు.

ఈ పుస్తకం చదివేది కాదు. మన మానసిక స్థితి వలన ఈ పుస్తకంలోకి మనం ప్రయాణిస్తాం.
అదే మార్గం, ఆ మార్గమే గమ్యం కూడా.

కాళ్ళకూరి శైలజ.






పై వ్యాసంపై మిత్రులు చేసిన ఆత్మీయ వ్యాఖ్యలు. అందరకూ కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
.
నేను ఇటీవల ఇష్టంగా కొని చదివిన పుస్తకం థేరీగాథలు...నిజంగా కవి,చరిత్రాకారుడు బొల్లోజు బాబా గారి కృషికి
అభినందనలు
చెప్పాలి.
ఆ నాటి తల్లుల హృదయాన్ని వాక్యాలుగా మన ముందుంచారు.వేల ఏళ్ల కిందటే స్త్రీ మూర్తుల హృదయ స్పందనలు, వారి కళాత్మక వ్యక్తీకరణ అబ్బురపరుస్తుంది.ఈ పూట మళ్లీ ఒకసారి చదవాలనిపించింది.ఈ పుస్తకం పై కాళ్లకూరి శైలజ మేడంగారు అందించిన వ్యాసం ఆసక్తిగా చదివించింది.ఈ పుస్తకం మనం చదివేది కాదు.మన మానసిక స్థితి అన్న వాక్యాలు అక్షర సత్యాలు..మేడంగారికి ధన్యవాదాలు. @పల్లిపట్టు నాగరాజు
.
తాత్విక కి చింతనకు పరాకాష్టగా భావించే బౌద్ధ భిక్షుణుల కవితల్ని థేరీ గాధలు పేరుతో తెలుగులో అందించిన బొల్లోజు బాబా కవిత్వాన్ని కాళ్లకూరి శైలజ చక్కగా విశ్లేషించారు. @ డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
.
బొల్లోజు బాబాగారి అనుసృజన "థేరీగాధలు" మూల గ్రంధం చదివిన కాళ్ళకూరి శైలజ గారు ఆ పుస్తకంలో ప్రయాణించి సమీక్షించడం వల్ల చాలా విషయాలు తెలిశాయి. మనకూ ఓ టికెట్ కొనిచ్చి మనల్నీ ప్రయాణించమని ఆ మార్గాన్ని గమ్యంగా చూపినందుకు ధన్యవాదాలు. జంధ్యాల రఘుబాబు
.
కాళ్ళకూరి శైలజ గారి "థేరీ గాథలు - ఒక అనుసృజన"లో ప్రముఖ రచయిత బొల్లోజు బాబా గారి ఆవేదనను ఆవేశాన్ని సున్నిత భావోద్వేగాల సమాహారాన్ని చాలా చక్కగా వివరించారు.@కరిపే రాజ్ కుమార్
.
థేరీ గాథలు ఒక Monumental Work.బొల్లోజు బాబా గారి వర్క్స్ లో ఇది ప్రధానంగా నిలిచిపోతుంది.మంచి రివ్యూ అందించినందుకు శైలజ గారికి ధన్యవాదాలు. బాబా గారికి ఆలింగన నమస్సులు.@శ్రీనివాస గౌడ్

Sunday, January 8, 2023

Tonight I Can Write - poem by Pablo Neruda




ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
“దూరంగా వణుకుతోన్న నీలి నక్షత్రాల ఈ రాత్రి” లాంటివి.

రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.

ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను.
తనను నేను ప్రేమించాను. ఒక్కోసారి తనుకూడా నన్ను.

ఇలాంటి రాత్రులలోనే నేన్తనని నా చేతుల్తో చుట్టేసి
అనంత ఆకాశం క్రింద పదే పదే ముద్దులాడేవాడిని.

ఆమె నన్ను ప్రేమించింది. ఒకోసారి నేను కూడా తనను.
తదేకంగా చూసే ఆమె విప్పారిన కళ్ళను ప్రేమించకుండా ఎలా ఉండగలను.

ఈ రాత్రి నేను అత్యంత విషాద వాక్యాలను వ్రాయగలను
నాకామె లేదనీ, నేనామెను కోల్పోయానని తెలుసుకొనటానికి

ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.

నా ప్రేమ ఆమెనెందుకు నిలువరించలేకపోయిందనేది కాదు సమస్య
ఈ తారల రాత్రి ఆమె నాతో లేకపోవటమే.

అంతే! అంతకు మించేమీ లేదు. దూరంగా ఎవరో పాడుతున్నారు.
తనను పోగొట్టుకున్నందుకు నా మనసుకు అశాంతి మిగిలింది. అంతే!

నా చూపు ఆమెను వెతుకుతోంది, తనను నా దరి చేర్చటానికై.
నా హృదయం ఆమెకై చూస్తోంది. ఆమె నాతో లేదు.

అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
కానీ మేమిరువురమూ అప్పటిలా లేము.

ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవచ్చు. నిజంగానే.
కానీ ఆమెను నేను ఎంతెలా ప్రేమించానూ?
నా స్వరం గాలిలో తడుముకొంటోంది, ఆమె చెవుల కోసమై.

మరొకరిది. ఆమె మరొకరిది. నేను తనను ముద్దులు పెట్టుకోకముందు లాగానే
తన స్వరం, తన మేని మిసిమి, తన విప్పారిన కళ్లు అన్నీను.

ఇకపై నేనామెను అంతలా ప్రేమించకపోవొచ్చు. అది నిజం. ఏమో ప్రేమించవచ్చేమో!
ప్రేమ క్షణికమే, మరిచిపోవటం సుదీర్గంగా ఉంటుంది.

ఇలాంటి రాత్రులలో ఒకప్పుడు తను నా కౌగిట ఉన్నందుకేనేమో
తనను కోల్పోయింనందుకు నా హృదయంలో అశాంతి.

బహుశా ఇదే తను నాకు చేసే చివరి గాయం.
ఇవే నేనామెకు వ్రాసే ఆఖరి వాక్యాలు.

(* పాబ్లో నెరూడా (Pablo Neruda) ‘పుయేదో ఎస్క్రిబీర్‘ అన్న స్పానిష్ కవిత ఆంగ్లానువాదం ‘Tonight I can write‘ ఆధారంగా).


సెప్టెంబర్ 2009

https://eemaata.com/em/issues/200909/1465.html

Monday, January 2, 2023

అయ్యప్ప కల్ట్ -చారిత్రిక విశ్లేషణ



.
దక్షిణభారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన ఒక ఆరాధన విధానం అయ్యప్ప స్వామి. అయ్యప్పస్వామికి మణికంఠ, శబరినాథ, ధర్మశాస్త అనే వివిధ పేర్లు కలవు. దక్షిణభారత దేశ ప్రతిమలలో ఈయన పులిని స్వారీచేస్తున్నట్లు, శ్రీలంకదేశపు ప్రతిమలలో తెల్లని ఏనుగుపై ఊరేగుతున్నట్లు ఉంటుంది.
.
జన్మవృత్తాంతం
క్షీరసాగరమథనం అనంతరం దేవతలకు రాక్షసులకు విష్ణుమూర్తి అమృతం పంచేందుకు మోహినిగా అవతారం ధరించాడు. ఈ మోహినీ అవతారాన్ని చూసి ఆకర్షింపబడిన శివుడు, ఆమెను కూడగా శివకేశవుల అంశతో అయ్యప్ప జన్మించాడు. అందుకు ఈయనకు హరిహర సుతుడు అనే పేరువచ్చింది. అదేసమయంలో పందళదేశ రాజు అయిన రాజశేఖరుడు వేటకు వచ్చి ఈ బాల అయ్యప్పను/హరిహరసుతుని చూసి తనకు సంతానం లేనందుకు భగవంతుడు ఇలా అనుగ్రహించాడని భావించి, ఆ శిశువును ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకోసాగాడు. మహారాజు ఈ అయ్యప్పకు రాజ్యపాలన అప్పగించాలని భావించాడు. ఒక ఆలయాన్ని నిర్మించి ఇమ్మని అయ్యప్ప తండ్రిని కోరగా నిర్మించిన ఆలయమే శబరిమల ఆలయం. అక్కడ అయ్యప్ప స్వామి స్థిరనివాసం ఏర్పరుచుకొని భక్తుల పూజలందుకొంటున్నాడని పురాణకథనం.
.
ఇతర కథనాలు
1. అయ్యప్పస్వామి ఒక ఫూజారి కుమారుడు. ఇతను తన తండ్రిని చంపిన ఉదయానన్ అనే క్రూరమైన బందిపోటుదొంగను సంహరించి, అతను బంధీగా చేసిన పాండ్యరాకుమార్తెను విడిపించినట్లు ఒక కథనం కలదు.
2. అయ్యనారే అయ్యప్ప: తమిళనాడులో అయ్యనార్ గ్రామాన్ని రక్షించే అనార్య దేవుడు. శూద్రులదైవం. అయ్యనార్ విగ్రహానికి అయ్యప్ప విగ్రహానికి పోలికలు ఉండటాన్ని బట్టి అయ్యప్ప స్వామి కి అయ్యనార్ కు చారిత్రిక సంబంధాలు ఉండవచ్చునని, గ్రామీణ శూద్ర దైవం కాలక్రమేణ హైందవీకరణ చెంది ఉండవచ్చునని ప్రముఖ చరిత్రకారుడు T.A. Gopinatha Rao అభిప్రాయపడ్డారు.
3. Sreedhara Menon అనే చరిత్రకారుడు – అయ్యప్ప ఆలయానికి బ్రాహ్మణిజంతో కంటే బుద్ధిజంతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని ప్రతిపాదించాడు. అయ్యప్ప భక్తులు దీక్షలో ఉన్నప్పుడు శాఖాహారభోజనం, మాల దుస్తులు పవిత్రంగా ధరించటం, నేలపై శయనించటం, భిక్ష ద్వారా ఆహారం స్వీకరించటం, బ్రహ్మచర్యం పాటించటం, దురలవాట్లు మానుకోవటం- లాంటి బౌద్ధసన్యాసులు నిత్యం పాటించే నియమాలు ఆచరిస్తారు.
బౌద్ధ రచనల్లో సాహ్య పర్వతశ్రేణులపై “నీలకంఠ అవలోకేశ్వర” ఆలయం నిర్మించినట్లు ఉటంకింపులు కలవు. నీలకంఠ అవలోకేశ్వరుని విగ్రహం అయ్యప్పస్వామి విగ్రహంతో సారూప్యతలు కలిగి ఉంటుంది కనుక అయ్యప్ప కల్ట్ బుద్ధిజానికి దగ్గర అని శ్రీథర మీనన్ అభిప్రాయపడ్డారు.
4. అరేబియానుంచి వచ్చిన ఒక ముస్లిమ్ యోగి అయిన వావర్ తో అయ్యప్పస్వామి ఆథ్యాత్మిక సంబంధాలు కలిగి ఉన్నాడని మరొక జనశృతి కలదు. అయ్యప్పస్వామి వావర్ యోగి స్నేహితులుగా ఉండేవారట. శబరిమలై ప్రధాన ఆలయం పక్కనే వావర్ స్వామికి చిన్న గుడి ఉంటుంది. ఇక్కడ ఒక ముస్లిమ్ పూజారి నేటికీ పూజలు నిర్వహిస్తుంటాడు. అయ్యప్పస్వామే స్వయంగా పందళదేశరాజుకు కలలో కనిపించి వావర్ స్వామికి మసీదు నిర్మించమని ఆదేశించాడట. అలా నిర్మించిన వావర్ స్వామి మసీదు శబరిమలైకు వెళ్ళే దారిలో ఉంటుంది. శబరిమలై భక్తులు దీనిని కూడా తమ యాత్రలో భాగంగా దర్శించుకొంటారు.
ఈ వావర్ కు సంబంధించిన చారిత్రిక వివరాలేవీ లభించవు. బహుశా ముస్లిముల ప్రాబల్యాన్ని అంగీకరించే ప్రక్రియలో హిందూమతం చేసుకొన్న ఒక సర్దుబాటుగా ఈ వావర్-అయ్యప్ప ఉదంతాన్ని చూడాలని Eliza Kent అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
5. కేరళ ఆళపుర జిల్లాలో అర్థంగల్ అనే ఊరిలో సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఉంది. ఇది 16 శతాబ్దంలో నిర్మించబడింది. 1584 లో దీనికి Fr Jacomo Fenicio చర్చిఫాదర్ గా ఉండేవారు. ఇతని కాలంలోనే శబరిమలైను ఈ అర్థంగళ్ చర్చి ని కలిపే ఐతిహ్యం రూపుదిద్దుకొంది.
Fr Jacomo Fenicio తన ప్రేమపూర్వక మాటలతో, స్వస్థపరచే మహిమలతో స్థానిక ప్రజల ప్రేమను అభిమానాన్ని సంపాదించుకొన్నాడు. ఇతనికి హిందూ సంస్కృతి, ఆచారాలపట్ల అపారమైన గౌరవం ఉండేదట. ఆ సంగతులతో కూడిన ఒక పుస్తకాన్ని కూడా లాటిన్ భాషలో రచించాడు.
అయ్యప్పస్వామికి ఈ చర్చిఫాదరు స్నేహితుడు కావటంవలనే ఇన్ని మహిమలు చూపించగలుగుతున్నాడని ప్రజలు విశ్వసించారు. క్రమేపీ శబరిమలై దర్శించిన భక్తులు ఈ చర్చిని కూడా దర్శించుకోసాగారు. ఈ ప్రక్రియ ఈనాటికీ కొనసాగటం విశేషం.
***
ప్రధాన స్రవంతిలో మనుగడలో ఉండే భావజాలం ఎప్పటికప్పుడు ఎక్కువమంది ప్రజలు దేన్నైతే విశ్వసిస్తున్నారో దాన్ని own/appropriate చేసుకోవటం జరుగుతుంది. చారిత్రికంగా అయ్యప్ప కల్ట్ లో అదే జరిగింది అని అర్ధమౌతుంది.
నిజానికి విష్ణువుకి, శివుడికి పుట్టిన స్వామిగా అయ్యప్పను సృష్టించటానికి కారణం – అప్పట్లో లక్షలాది ప్రాణాలను తీసిన శైవ వైష్ణవ ఘర్షణలను సర్దుపరచటానికే అనే వాదన కూడా కలదు. మోహిని-శివుని వృత్తంతం ఉన్న భాగవత పురాణంలో అయ్యప్ప స్వామి జన్మించిన ప్రస్తావనలు లేవు కనుక ఈ హరిహర సుతుడు అన్న భావన ఆ తరువాత కల్పించినదని కొందరి అభిప్రాయం.
మళయాల జానపద గీతాలలో అయ్యప్పస్వామి కొండలలో తిరిగే ఒక యోధుడు. విల్లంబులను ధరించి, దారిదోపిడి దొంగలనుంచి బాటసారులను, వ్యాపారులని కాపాడే రక్షకుడు
అయ్యప్పస్వామి కల్ట్ వివిధ దశలలో వివిధ ఆరాధనా విధానాలను ఇముడ్చుకొన్న తీరు విస్మయపరుస్తుంది. ఒక ఆదివాసీ దేవుడిగా, ఒక శూద్రదేవుడిగా, హరిహరుడనే పేరుతో ఒక పురాణ పురుషుడిగా భిన్నకాలాలలో కనిపిస్తుంది. ఇంకా భిన్న పాలనలలో ఇస్లాం, క్రిష్టియన్ మత విశ్వాసాలను గౌరవించి అంగీకరించిన విధానం చారిత్రికంగా ఒక గొప్ప పరిణామంగా భావించాలి. ఇది సర్వమానవ ఐక్యతకు తోడ్పడింది తప్ప మనుషుల్ని వారివారి విశ్వాసాల ఆధారంగా ముక్కలు చేయటానికి ప్రయత్నించలేదు.
***
హిందూ మతవిశ్వాసాలు బహుముఖీనమైనవి. ప్రజలందరినీ ఐఖ్యపరచటానికి కాలానుగుణంగా అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ భిన్న ఆరాధన విధానాలను గౌరవించటం గమనించవచ్చు.
కేరళలోని సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఒకప్పటి శివాలయమని నేడు కొందరు రాజకీయనాయకులు వాదిస్తున్నట్లు –హిందూభావజాలం ప్రజలు మత ఆధారంగా విడిపోయి విచ్ఛిన్నమైపోవాలని ప్రయత్నించలేదు చారిత్రికంగా.
.
బొల్లోజు బాబా






Monday, November 14, 2022

ఒక అనాది కథ




ఒక తాగుబోతు
తన అప్రాప్త ప్రేయసికి
ఫోన్ చేసి
ఆమె కట్ చేసిన తరువాత కూడా
మోసం, ద్రోహం అంటూ
ఏవేవో మాట్లాడాడు
ఆ మాటల్లోంచి
అతని ప్రేయసి
నడుచుకొంటూ వచ్చి
అతడిమొఖాన్ని చేతుల్లోకి తీసుకొని
పెదాలపై చిన్న ముద్దు ఉంచి
నడుచుకొంటూ
ఎటో వెళిపోయింది...
***
దేవుడు మనిషిని
స్త్రీ పురుషులనే రెండు సగభాగాలుగా
విభజించి చెరో దిక్కుకూ విసిరేసాడట
తన అర్ధభాగం కొరకు
మనిషి చేసే వెతుకులాట ఇదంతా....
.
బొల్లోజు బాబా

Friday, November 4, 2022

శ్రీ అవధానుల మణిబాబు



కాకినాడసాహితీ మిత్రుల మధ్య చిరపరిచితమైన పేరు శ్రీ అవధానుల మణిబాబు. ఏదైనా అంశంపై ఎవరు మాట్లాడగలరు అని చర్చ వచ్చినప్పుడు శ్రీ మణిబాబు పేరు తప్పక వినిపిస్తుంది. వ్యక్తిగా మృధు స్వభావి. కవిగా స్వాప్నికుడు, సున్నిత భావుకుడు. అంశాన్ని తులనాత్మకంగా తూకం వేస్తూ లోతుగా మూల్యాంకనం చేయగల విమర్శకుడు. శ్రోతలను తనతో పాటూ అనుభూతి పడవలో ప్రయాణం చేయించగల చక్కని వక్త. అది ఆథ్యాత్మిక ప్రసంగమైనా, ఆధునిక కవిత్వంపై ఉపన్యాసమైనా.
శ్రీ అవధానుల మణిబాబు రాసిన పుస్తకాలు మొత్తం ఎనిమిది. వేటికవే ప్రత్యేకం. ఇతను విస్తృత అధ్యయన శీలి. ఎంత గొప్ప రచన చేసినా అంతకంత ఒదిగి ఉండటం మణిబాబు వినయం. ఇతను రచించిన అన్ని పుస్తకాలను నేడు ఆర్చైవ్. ఆర్గ్ లో అందరకూ అందుబాటులో ఉంచాడు. వాటిని అక్కడ నుంచి డౌన్ లోడ్ చేసుకొని చదువు కొనవచ్చును. క్రింద కామెంటులో లింక్ ఇచ్చాను చూడగలరు.
.
1. నాన్న...పాప...2018
.
శ్రీ మణిబాబుకు ఎక్కువ పేరు తీసుకొచ్చిన పుస్తకం. పిల్లలు ఎదుగుతూన్న దశలో మనం చూసిన ఎన్నో మధురమైన అనుభవాలను అనుభూతులుగా మలచుకొని దాచుకొంటాం వాటికి అక్షరరూపమిచ్చి గొప్ప కవితా వాక్యాలుగా సారస్వతంలో నిక్షిప్తం చేసారు శ్రీ మణిబాబు
.
పాప దీపం వెలిగించింది
ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడమంటే
ఈ రోజు కొత్తగా అర్ధమైంది
.
పైకి సౌందర్యవంతంగా కనిపిస్తున్నా రేపు ఆ పాపే తల్లై మరో పాపను వెలిగించబోతోందన్న సృష్టి రహస్యం లేదూ పై మూడు వాక్యాలలో.
.
.
2. . స్ఫురణ... స్మరణ (ప్రసంగాలు, సమీక్షలు) - 2017
.
తెలుగు సాహిత్యలోకంలో ఒక విమర్శకునిగా శ్రీ మణిబాబు స్థానాన్ని పదిల పరచిన పుస్తకమిది.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ ఇంద్రగంటి వారు ".......పలురచనలు చదివి స్వతంత్రబుద్ధితో ఆలోచించి అంచనాలు వేయగల నైపుణ్యం ఉండటం వల్ల సాహిత్య విమర్శవైపు దృష్టి పెట్టారని- ఈ వ్యాసాలు చదవడం ద్వారా నాకు అర్ధమైంది" అంటారు. సాహిత్యకృషిలో మర్రిచెట్టులా విస్తరించిన ఒక వ్యక్తి, అప్పుడప్పుడే శాఖలూనుతున్న ఒక చిన్న వ్యక్తిపట్ల వేసిన అంచనా అది. పెద్దల అంచనాలు భవిష్యత్ దర్శనాలు.
ఈ పుస్తకంలో శ్రీ గోపి, శ్రీ భగ్వాన్, శ్రీ దాట్ల, శ్రీ శిఖామణి లాంటి లబ్దప్రతిష్టులపై వ్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్కరిగురించి శ్రీ మణిబాబు చేసిన ప్రతిపాదనలు, పరిశీలనలు అపూర్వమైనవి.
.
.
3. అన్నవి అనుకొన్నవి (ప్రసంగాలు, సమీక్షలు) 2015
.
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ రెంటాల వారు ".... మీ పఠన వైవిధ్యం బావుంది, మీరు విశాలంగా చదువుతున్నట్టున్నారు, కేవలం చదవడం మాత్రమే కాక విలువైనవీ, అందమైనవీ ఎన్నో వాక్యాలను, పద్యాలను గుర్తుపెట్టుకుంటున్నారని గమనించాను. మీ రచనలో అవి జీడిపప్పుల్లా తగిలి రుచిని పెంచుతున్నాయి. వాల్మీకిని, రూమీని, ఫ్రాయిడ్ నీ డేల్ కార్నిగిని, టాగూర్ నీ ముకుందమాలాకారుణ్ణీ.... ఆయా సందర్భాలలో మీరు ఉటంకిస్తూ వచ్చిన పద్దతి బాగుంది" అనే గమనింపు శ్రీ మణిబాబు రచనావ్యాసంగంపై కాదు, అతని మొత్తం వ్యక్తిత్వంపైనే అని భావిస్తాను. శ్రీ మణిబాబు విశ్లేషణ బలం మొత్తం అతని తులనాత్మక అన్వయంలో దాగి ఉంటుందని నా అభిప్రాయం.
ఈ పుస్తకంలో శ్రీ ఓలేటి వారి ఉపాయనము, మునిమాణిక్యం కథలు, శ్రీ ఆవంత్స సోమసుందర్ తో ఇంటర్వ్యూ, కరుణశ్రీ సాహిత్యం, అద్దేపల్లి దీర్ఘకవిత తెరలు, ఆరుద్ర లేఖా సాహిత్యం లాంటి భిన్న సాహిత్య ప్రక్రియలపై అంతే వైవిద్యభరిత విశ్లేషణా వ్యాసాలు ఉన్నాయి.
.
.
4. నేనిలా... తానలా - 2019
.
శ్రీ మణిబాబు సముద్రంతో తనకున్నఅనుబంధాన్ని"నేనిలా...తానలా" పేరుతో ఒక దీర్ఘకవితగా మలచారు. ఈ శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.
ఈ దీర్ఘకవితను మూడు భాగాలుగా విభజించుకొంటే మొదటిభాగంలో తన బాల్యం నుండి సముద్రంతో తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాదు. రెండవ భాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుంది. మూడవభాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణ స్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది.
.
.
5. అందినంత చందమామ - 2016
.
ఇది సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారి రచనలపై చేసిన విపుల వ్యాఖ్యానం. శ్రీ సోమసుందర్ గారి వాక్యం క్లిష్టంగా ఉంటుందని విమర్శకుల అభిప్రాయం. అందినంత చందమామ అన్న పేరులోనే శ్రీ మణిబాబు ఆ విమర్శను సూచ్యప్రాయంగా చేసాడా అనిపిస్తుంది. సోముడికి పర్యాయపదం చందమామ. అలాగ, అందినంత సోమసుందర్ అని ఈ పుస్తకం పేరుని అర్ధం చేసుకోవచ్చు.
శతాధిక గ్రంధకర్త అయిన శ్రీ సోమసుందర్ ను నాకు అందినంతమేరకే నేను ఈ వ్యాసాలలో చూపించగలుగుతున్నాను అనే వినయం ఒక పక్క, ఆయన అందని చందమామ అనే శ్లేష మరో పక్కా ఇమడ్చటంగా నేను అనుకొంటాను.
ఈ వ్యాసాలన్నీ శ్రీ సోమసుందర్ ను సుందరంగా, సరళంగా ఆవిష్కరిస్తాయి.
.
.
6. పరమం - 2020
.
సుమారు ఇరవై పుస్తకాలు, వాటిలో సగం స్వతంత్ర్యరచనలు, మిగిలినవి అనువాదములు. భాసుని నాటకములు, ఆదిశంకరుని ఆత్మబోధ, క్షేమేంద్రుని చారుచర్య, పూర్ణసోమసుందరం, తిరువల్లువరు, తులసీదాసు పార్వతీ కల్యాణం, కబీరు, నామదేవుడు ఇలా భిన్నకాలాలకు చెందిన భక్తిమార్గాల అంతస్సూత్రాన్ని గుర్తెరిగి రచనలు చేసారు పరమయోగి శ్రీ మధునాపంతుల వేంకట పరమయ్య గారు. వారి రచనలను సూత్రప్రాయంగా స్పృశిస్తూ, వారి కృషికి సందర్భం వచ్చినచోటల్లా ప్రణమిల్లుతూ రాసిన వ్యాస సంపుటి పరమం.
ఆధునిక కవిత్వంపై విమర్శనా వ్యాసాలు రాసే వారు అనేకమంది. కానీ పరమయ్యగారిలాంటి వేదాంతి, పద్యకవి రచించిన ఆథ్యాత్మిక కావ్యాలను సమీక్షించటం ఒక సవాలు. శ్రీ మణిబాబు సవ్యసాచిత్వం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
.
.
7. లోనారసి - 2022
.
ఇది తాజా ప్రచురణ. వివిధ విమర్శనా వ్యాసాల సంపుటి. ఈ పుస్తకంలో శ్రీ మణిబాబు వాక్యం పదునుదేరింది. చేస్తున్న వ్యాఖ్యానాన్ని సమర్ధించటం కొరకు భిన్న రచనలలోంచి ఉటంకింపులు అలవోకగా తీసుకురావటం గమనించవచ్చు. ఈ పుస్తకంలో డా. ఎన్ రామచంద్ర గారి కుముద్వతీ తీరకథలు, శిఖామణి యానాం కథలు, పైడిపాల నూటపదహార్లు, శ్రీ మధునా పంతుల నాన్న కుర్చీ, సంగివేని రవీంద్ర చౌరస్తాలో సముద్రం, శ్రీ చందుసుబ్బారావు చందన చర్చ, విధ్వాన్ విశ్వం పెన్నేటి పాట లాంటిరచనలపై వ్రాసిన విమర్శనా వ్యాసాలు ఉన్నాయి. అన్నీ చక్కని పఠానుభవాన్ని కలిగిస్తాయి.
***
.
శ్రీ అవధానుల మణిబాబు గొప్ప సహృదయుడు. విస్తృత అధ్యయన శీలి. తను రాయాల్సిన లేదా ప్రసంగించాల్సిన పుస్తకాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తాడు. దాని సారాన్ని అప్పటికే వచ్చిన వివిధ అటు ప్రాచీన ఇటు ఆధునికరచనలతో తులనాత్మకంగా పోల్చి ఒక అంతస్సారాన్ని పాఠకునికి చూపే ప్రతిభకలిగిన విశ్లేషకుడు.
పైన చెప్పిన పుస్తకాలను అన్నింటిని ఆర్చైవ్. ఆర్గ్ లో డౌన్ లోడ్ కొరకు అందుబాటులో ఉంచారు శ్రీ మణిబాబు.
ఆసక్తి కలిగినవారు తప్పక డౌన్ లోడ్ చేసుకోగలరు. క్రింద కామెంటు రూపంలో లింకు కలదు.

 
భవదీయుడు
బొల్లోజు బాబా

శ్రీ దడాల రఫేల్ రమణయ్య



శ్రీ దడాల రఫేల్ రమణయ్య పోలీస్ సబ్ ఇన్ స్పెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్రెంచిపాలనకు వ్యతిరేకంగా జరిగిన విమోచన ఉద్యమంలోకి వచ్చారు. తన జీవితాన్ని "My Struggle for the Freedom of French India" పేరుతో అక్షరబద్దం చేసారు. ఇంగ్లీషులో వెలువడిన తొలి తెలుగు దళిత ఆత్మకథ ఇదే కావొచ్చు. మా కాలేజ్ లో దళిత ఆత్మకథలపై జరిగిన సెమినార్ లో వీరిపై ఒక పేపర్ కూడా సమర్పించాను.
2006 లో "శ్రీ దడాల రఫేల్ రమణయ్య జీవితం పోరాటం" పేరుతో ఒక మోనోగ్రాఫ్ రాయటం కొరకు సమాచారం సేకరించి కొంత వర్క్ చేసాను. ఆ కాగితాలు నిన్న పుస్తకాలు సర్దుతుంటే కనిపించాయి. ఆ తరువాత ఆ ప్రోజెక్టు ఎందుకో ముందుకు సాగలేదు. (వారి వారసులు మేమే రాస్తున్నాం అని చెప్పినట్లు గుర్తు). రాసినంత మేరకు ఇ.బుక్ గా రూపొందించి పబ్లిక్ డొమైన్ లో ఉంచుదామని అనుకొంటున్నాను. సమాచారం కొరకు నెట్ లో వెతుకుతోంటే యానాం విమోచనానికి సంబంధించిన ఫొటోలు జూన్ 20, 1954 నాటి ఆంధ్రపత్రికలో కనిపించాయి.
ఆ తరువాత 27 జూన్ న మరోసారి భారతదేశ జండాను ఎగరేయటం జరిగింది. ఈ ఫొటోలే నేడు ప్రచారంలో ఉన్నాయి. (చూడుడు-సూటు బూట్లతో ఉన్న మరో ఫొటో) జూన్ 13 నాడు లాగులతో, పంచెలతో ఉన్న ఆనాటి నాయకులు దిగిన ఫొటోలు చాలా అరుదైనవి.
ఆనాటి సంఘటనను నేను రచించిన "యానాం విమోచనోద్యమం" పుస్తకంలో ఇలా వర్ణించాను.
బొల్లోజు బాబా
.
అది ఆదివారం, జూన్ 13, 1954. ఆ రోజు ఉదయాన్నే శ్రీ దడాల రఫేల్ రమణయ్య, శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ యర్రా సత్యన్నారాయణ, శ్రీ కామిశెట్టి పరుశరామ్, శ్రీ కోన నరసయ్య, కాకినాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ భయంకరాచారి మరియు సుమారు ఓ వేయిమంది అనుచరులు ఒక సమూహంలా యానాంలోకి ప్రవేశ్రించారు. ఈ బృందం యానాం ఎడ్మినిస్ట్రేటర్ బంగళావైపు కదంతొక్కుతూ కదిలింది. ఆ బంగళాను ముట్టడించి అక్కడి ఫ్రెంచ్ జండాను తొలగించి భారత జండాను ఎగురవేయాలన్నది వీరి ఉద్దేశ్యం.
శ్రీ దడాల ఒక మెగాఫోన్ లో- మేము సంఖ్యాపరంగా ఎక్కువ- సాయుధలమై ఉన్నాము. మీరు ప్రతిఘటించినట్లయితే అది నిష్ప్రయోజనమౌతుంది- అని హెచ్చరిస్తూ దయచేసి సహకరించండి అని ఫ్రెంచి అధికారులను కోరుతూ ముందుకు కదిలారు. అయినప్పటికీ వినకుండా ఫ్రెంచి పోలీసులు కొన్ని చేతి బాంబులను వీరివైపు విసిరారు. అవి వీరికి దగ్గరలో పెద్ద శబ్దం చేసుకుంటూ పేలాయి. దానికి వీరంతా మన్యం వారి మేడ గోడకు ఆనుకొని రక్షణ పొందారు. దీనికి ప్రతిచర్యగా విమోచన ఉద్యమ బృందంలో ఉన్న సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంతో వ్యవహరించి, ఏ విధమైన పౌరనష్టం జరగకుండా ఫ్రెంచి పోలీసులను నిర్వీర్యం చేసి నిరాయుధులను చేసారు. (శ్రీ దడాల ఆత్మకథ)
వీళ్ళ రాక తెలుసుకొన్న ఫ్రెంచి విధేయ శక్తులు తలోదిక్కుకు పరిగెట్టి దాక్కున్నారు. కొంతమంది ఎదుర్లంక, ఇతరప్రాంతాలకు పారిపోయారు. మరికొంతమంది అటకలపైన, గుళ్ళలోనూ, సురక్షితమనుకున్న ఇతరప్రాంతాలలోను తలదాచుకొన్నారు. కొంతమందైతే ఆత్మరక్షణ కొరకు తుపాకీ చెంతనుంచుకొన్నారు (రి. జర్నల్ ఆఫ్ హిస్టారికల్ సొసైటీ వాల్యూమ్ 20, 2001)
ఆ విధంగా విమోచనోద్యమకారులు అడ్మినిస్ట్రేటర్ బంగళాను చేరుకొని అప్పటి అడ్మినిస్ట్రేటర్ ఇన్ చార్జ్ శ్రీ శివా గారినుండి అధికారాలను స్వాధీన పరచుకున్నారు. జూన్ 13 న ఉద్యమకారులకు ఏ విధమైన ప్రతిఘటనా ఏర్పడలేదు.
అనంతరం ఉద్యమనాయకులు ఫ్రెంచ్ జండాను తొలగించి బారతదేశ మువ్వన్నెల జండాను ఎగురవేసారు. బహిరంగ సభ ఏర్పాటు చేసి యానాం విమోచనమైందని ప్రకటించారు.
తదుపరి "యానాం విమోచనమైందని, భారత ప్రభుత్వం దీని పరిపాలన చేపట్టి, ఈ ప్రాంతాన్ని భారతావనిలో విలీనం చేసుకోవాలని, ప్రధానమంత్రి నెహ్రూకు, ఫ్రాన్స్ ప్రధానమంత్రికి, పాండిచేరీలోని ఫ్రెంచి గవర్నరుకు టెలిగ్రాములు ఇచ్చారు.
(యానాం విమోచనోద్యమం పుస్తకం నుండి- క్రింద లింకునుండి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును)











you can down load here the book yanam vimochanodyamam


https://archive.org/details/yanam-vimochanyodyamam

గాంధీ



గాంధీని విభేదించటమో, అభిమానించటమో చాలా సులువు. బ్లాక్ అండ్ వైట్ అంతే. గాంధిని అర్ధం చేసుకోవటంలో- స్పెషల్ ఎలక్టొరేట్ విషయంలో ధృఢంగా నిలబడటం లాంటి కొన్ని గ్రే ఏరియాస్ అడ్డుపడతాయి
అయినప్పటికీ--- ఈరోజు గాడ్సె, సావార్కర్ భావజాలాలు పైకిరావటం రాజకీయ ప్రేరేపితం.
ఈ పనిచేసేవారు హిందూ ఐక్యతను కోరుకొంటారు తప్ప గాంధి చెప్పిన భిన్నమతాల, భారతదేశ ప్రజలందరి ఐక్యతను కోరుకోరు.
ఇలాంటి ధోరణుల వెంటబడటం మేధావులు చేయకూడని పని అని అనుకొంటాను.

Wednesday, November 2, 2022

ఇలతో అల చేసిన సంభాషణ – మణిబాబు “నేనిలా…తానలా” దీర్ఘకవిత

 ఇలతో అల చేసిన సంభాషణమణిబాబునేనిలాతానలాదీర్ఘకవిత

కొన్ని కవితావస్తువులు కవి జీవితంతో మమేకమైపోతాయివాటితో కవి సుదీర్ఘమైన ఆత్మైక ప్రయాణం చేసి ఉంటాడు. వస్తువుతో కవికి ఉన్న అనుభవాలతో అతని హృదయంనిండి పొంగిపొర్లుతూ ఉంటుందిఅలాంటి స్థితిని అనువదించటానికి  పాతిక ముప్పై పాదాలు సరిపోవుఇలాంటి నేపథ్యంలో కవి తన ఉద్వేగాలను దీర్ఘకవితగా మలుస్తాడుఅదొక అనివార్యమైన వ్యక్తీకరణ రూపంతీసుకొన్న వస్తువును దాని భిన్నపార్శ్వాలతో కవిత్వీకరించితనదైన ఒక దృక్కోణాన్ని వస్తువుకు ఆపాదిస్తూ  వ్రాసిన విస్త్రుతమైన రచననే దీర్ఘకవితగా నిర్వచించుకోవచ్చును.

కవి, విమర్శకులు శ్రీ అవధానుల మణిబాబు  సముద్రంతో తనకున్న అనుభంధాన్ని ఒక దీర్ఘ కవితగా మలచినేనిలాతానలాపేరుతో ఇటీవల వెలువరించారు. దీర్ఘకవితను వ్రాసేటపుడు ప్రణాళిక అవసరంలేనట్లయితే అతివిస్తరణ, శాఖాచక్రభ్రమణం కావ్యాత్మను పాడుచేస్తాయిమణిబాబు దీర్ఘకవితను చక్కని ప్రణాళికతో నడిపించాడు దీర్ఘకవితను మూడుభాగాలుగా విభజించుకొంటే మొదటి భాగంలో తన బాల్యంనుండి సముద్రంతో  తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాడురెండవ భాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుందిమూడవ భాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణ స్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది.   నాస్టాల్జియా, సమకాలీనత, అన్యాపదేశంగా చెప్పిన హెచ్చరికా దీర్ఘకావ్యానికి సమగ్రతను తెచ్చిపెట్టాయిదీర్ఘకవితలకు సమగ్రత ఆత్మవంటిది

దండి తనకావ్యాదర్శంలో కావ్యంలో అష్టాదశవర్ణనలు ఉండాలంటాడు.  “నేనిలాతానలాదీర్ఘకవితలో వివిధ సందర్భాలలో చేసిన - నగరం, సముద్రం, రుతువు, సూర్యోదయం, సలిలక్రీడ, విప్రలంభం, వివాహం, కుమారోదయం, దూత్యం, నాయకాభ్యుదయం అనే పదిరకాల వర్ణణలను పోల్చుకోవచ్చును. సముద్రాన్ని వస్తువును స్వీకరించి రచనలు చేసిన శ్రీ అద్దేపల్లి, శ్రీ గరికపాటి, శ్రీ రామకృష్ణ శ్రీవత్స, శ్రీ గనారా వంటి తనపూర్వకవుల ప్రస్తావనకూడా చేయటం గమనించవచ్చుఇవి కాక ఆధునిక కావ్య లక్షణాలైన సామాజిక చైతన్యం,  పర్యావరణ కాలుష్యం పట్ల వ్యాకులత, చారిత్రిక స్పృహలు అద్భుతంగా పలికాయివీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొన్నప్పుడునేనిలాతానలాదీర్ఘకవిత అటు సాంప్రదాయక, ఇటు ఆధునిక లక్షణాలను పొదువుకొన్న ఒకమిని కావ్యంగా అనిపించక మానదు. . 

***

నేనిలాతానలాకావ్యంలో పైకి కవి తన ఎదుటగా ఉన్న సముద్రంతో చేసిన సంభాషణలా కనిపిస్తున్నప్పటికీ అది మానవజాతికి, ఆద్యంతరహితమైన సాగరానికి ఉన్న అనాది అనుబంధానికి అక్షరరూపం.  

ఎందుకు నీవంటే అపేక్షఅని కవి సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా సమాధానం ఇచ్చిందట

వెర్రివాడా!

నువ్వు నా సంక్షిప్త రూపానివి

నేను నీ సమగ్ర స్వరూపాన్ని

నేను అర్ణవం

నువ్వు అక్వేరియం.

నీ భాషలో

త్వమేవాహం- అంతే.
మనిషి సముద్రానికి సంక్షిప్తరూపం అనటం నవ్యమైన ఊహపడిలేచే లేదా లేచిపడే కెరటాలు, బడబాగ్నులు, ఉప్పెనలు, నిర్జన ఒంటరితనాలు, నిగూఢతా, నిర్మలతా మనిషి లేదా మానవజాతి లక్షణాలు కూడాను


సముద్రఘోషను కవులు భిన్న సందర్భాలకు భిన్నరకాలుగా భాష్యం చెప్పి తమ ఊహలకు ఊతంగా, ఆయా సందర్భాలను ఉన్మీలనం చేసేలా వాడుకొన్నారు.  ఈ దీర్ఘకవితలో “మేము తీరంపై రాసిన రాతల్ని, ముద్రల్ని ఎందుకు చెరిపేస్తావు నువ్వు” అని సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా బదులిచ్చిందట  


చెరిపిపోవటం కాదు

వాటిని నాలో దాచుకోవటం

భాషతెలియక ఘోషనుకొంటారు గానీ

నా శబ్దాలన్నీ మీ రాతల కలవరింతలే

మీ ఆటల తలపోతలే. ---    ఇదొక నవ్యమైన ఊహ. సముద్రఘోష అనేది, సముద్రతీరంపై మనం రాసుకొన్న రాతలు, ఆడుకొన్న ఆటలే అనటం చక్కని సందర్బోచిత నిర్వచనం.  చెప్పే విషయాలలో అన్వయసారళ్యత ఎంత తేటగా ఉంటే ఆ కవిత అంత బిగిగా ఉంటుందనటానికి చక్కని ఉదాహరణ ఇది.


ధనుష్కోటిలో

తేలుతున్న రాయిని చూసి

ప్రత్యేకత రాయిదా? నీటిదా?

ఆలోచిస్తూ

కిటికీలోంచి చీకటిని చూస్తూ

నిదరోతున్న రైలులో

ఒక్కడినే మెలకువగా ఉన్నపుడు

సాంద్రమైనదేదో వీడగలిగితే

తేలడం నీకైనా సాధ్యమే

బెండులా తేలిక కావాలంటే

గుండె మెత్తబరచుకో

చెవి దగ్గరకొచ్చి చెప్పిపోయావ్ గుర్తుందా…! … అంటూ సముద్రం తనతో చేసిన సంభాషణను తలపోసుకొంటాడు కవి ఒకచోట.  హృదయకాఠిన్యాన్ని తొలగించుకొంటే తేలికపడతాం, మార్ధవంగా మారతాం అనే ఒక గొప్ప ప్రాపంచిక సత్యాన్ని చెప్పటానికి “ధనుష్కోటిలో తేలుతున్న రాయి” అంటూ అంతే గొప్ప సాదృశ్యాన్ని తీసుకొన్నాడిక్కడ కవి. ప్రభోధాలను నేరుగా కాక పరోక్షంగా చెప్పటం సమకాలీన కవిత్వలక్షణం. అందుకే పాఠాన్ని వాచ్యంగా కాక ప్రతీకాత్మకంగా సముద్రం బోధపరచినట్లుగా చెపుతున్నాడు. చక్కటి శిల్పవ్యూహం ఇది


నువ్వో వ్యాపార కేంద్రం

రణరంగం

కార్య క్షేత్రం

విలాస స్థానం

ఏం కావాలో పట్టుకెళ్లడం వచ్చినవాడి సత్తా

చెంబుడు నీళ్లా

ఇన్ని గులకరాళ్ళా?

ఖనిజాలా? ఇంధనాలా?

మరో దేశంపై పెత్తనమా?//

నాడైనా నేడైనా

నీటిని నెగ్గినవాడే

నేలకు రాజు  --   పై వాక్యాలలో కవి చారిత్రిక దృష్టి ద్యోతకమౌతుంది. అవి చదివినపుడు అనేకానేక దృశ్యాలు మదిలో మెదులుతాయి.   జలగండానికి భయపడి చెంబుడునీళ్ళు తీసుకొని ఒడ్డునే పవిత్రస్నానం చేసే భక్తుడో; //గజఈతగాళ్ళు ముత్యాలను శోధిస్తూంటారుఓడల్లో  వ్యాపారం జరుతూంటుంది. పిల్లగాండ్రు  మాత్రం  గులకరాళ్ళను  సేకరించి మరలా విసిరేస్తూంటారు// అనే టాగూర్ వాక్యాలో; ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయిఅంటూ భారతదేశానికి బ్రిటిష్ వారి రాకను వర్ణించిన కొప్పర్తి వాక్యాలో; భవిష్యత్తులో నీటికొరకు యుద్ధాలు జరుగుతాయన్న హెచ్చరికలో  గుర్తుకు రాకమానవుతక్కువ ఖర్చుతో లవణజలాల్ని త్రాగునీరుగా మార్చే ఆవిష్కరణకు నోబుల్ బహుమతి ఇవ్వటానికి ప్రపంచమిపుడు ఎదురుచూస్తుంది.  “నీటిని నెగ్గినవాడే నేలకు రాజువాక్యాలు కవి చారిత్రిక అవగాహనకు, సమకాలీన వాస్తవాలకు,  భవిష్యత్ దర్శనానికి అద్దంపడతాయి.  


కడుపులో ప్లాస్టిక్ నింపుకున్న

షార్క్ మృతదేహాలు

వలల నిండా జీవంలేని తాబేళ్ళు//

వేల అడుగుల క్రింద చేరిన

వ్యర్ధాలను తొలగించేది ఎవరు?

సరిదిద్దుకోలేని నీకు 

తప్పుచేసే హక్కెవరిచ్చారు?అంటూ సముద్రం పలికిన మాటలు మొత్తం దీర్ఘకావ్యానికి ఆయువుపట్టునేడు తెలుగులో పర్యావరణ విధ్వంసంపై వచ్చే కవిత్వం చాలా తక్కువ. దీర్ఘకవితలకు సంబంధించి కొల్లేరు విధ్వంసం పై ఎస్.ఆర్. భల్లం వ్రాసినకొల్లేరుదీర్ఘకవిత, అంతరించిపోతున్న పక్షులపై అద్దేపల్లి ప్రభు వ్రాసినపిట్టలేని లోకం సందర్భంలో ప్రస్తావించుకోదగినవిమణిబాబు వ్రాసిననేనిలాతానలాదీర్ఘకావ్యంలో సింహభాగం సాగర కాలుష్యాన్ని దానివల్ల కలిగిన దుష్పరిణామాలను శక్తివంతంగా ఆవిష్కరించింది. కనుక దీర్ఘకావ్యాన్ని పర్యావరణ కవిత్వంగా  భావించవచ్చు. 


ఆధునిక మానవుడు చేస్తున్న కాలుష్యం వలన మానవజాతి మనుగడ ప్రమాదంలో పడింది.  గ్లోబల్ వార్మింగ్ వలన హిమశిఖరాలు కరిగి, సముద్రమట్టాలు పెరిగి, భూమి అంతా జలమయం అయ్యే అవకాసం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  ఇదొక సాంకేతిక అంశం.  ఇలాంటి వాటిని కవిత్వీకరించటం సులభం కాదు.  ఈ అంశాన్ని ఇలా అక్షరీకరిస్తాడీ కవి.


ఇదే కొనసాగితే

నా నుండి విడివడిన భూమి

మళ్ళీ నాలో కలవడం

మరెంతో దూరంలో లేదు

అపుడు

వేదన వినిపించేందుకు

నాకు మనిషి దొరకడు

తలబాదుకొనేందుకు

ఒడ్డు మిగలదు. --- ఒక ప్రాచీన మహాఖండం కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల నేడు ఉన్న భిన్న ఖండాలుగా విడిపోయిందని పాంజియా సిద్ధాంతం చెపుతుంది.  ఆ సిద్ధాంతాన్ని రేఖామాత్రంగా  స్పృశిస్తున్నాడిక్కడ కవి.  మానవులు ఇలాగే పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగించినట్లయితే నానుండి విడిపడిన భూమి నాలో కలిసిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు.  ఇంతవరకూ వ్రాసి వదిలేస్తే అదేమంత గొప్పవిషయం కాబోదు.  ఆ తరువాతి వాక్యాలే మణిబాబుని ఉత్తమకవి అని నిరూపిస్తాయి.  జలప్రళయం జరిగాకా సముద్రం మాట్లాడుకోవటానికి మనిషి ఉండడట, ఒడ్డూ మిగలదట. ఈ మాటల్ని సముద్రంతో అనిపించటం లోతైన కల్పన.  ఇక్కడ సముద్రాన్ని కవి ఎలా ఊహించుకొంటున్నాడు అని  ఆలోచిస్తే - ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక గురువు ఇంకా ఒక నైరూప్య అనంత స్వరూపునిగా భిన్నరూపాల్లో దర్శనమౌతుంది. 

***


మొత్తం రచనను

ఇదంతా

నీలో దోసెడు నీళ్ళు తీసి

మరలా నీలోనే విడిచిపెట్టటంఅంటాడు కవి ఒకచోట. ఇది పైకి వినయంగా అనిపించినా త్వమేవాహం అని మొదట్లో అన్నమాటకు అందమైన ముక్తాయింపు.  “నేనిలాతానలాఅనే శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.

శ్రీ అవధానుల మణిబాబు కవిత్వంలో గహనమైన సిద్ధాంతాల చట్రాలుండవు. నిత్యం తనను జ్వలింపచేసే మానవానుభవాలకు తాత్విక పరిమళాలు అద్ది కవిత్వంగా మార్చటం ఇతని కవిత్వరహస్యం. జీవితానుభవాలను గ్రహించటంలో- సున్నితత్వం, కరుణ, అమితమైన ప్రేమ, హృదయ నైర్మల్యం ఇతని కవిత్వాన్ని హృద్యమైన అనుభవంలా మార్చుతాయి

రచయిత ఫోన్: 9948179437


బొల్లోజు బాబా