Saturday, October 19, 2024

సనాతన ధర్మము - శూద్రులు


ఒక మిత్రుడు ఈ వాట్సప్ సందేశాన్ని పంపి దీనిపై వివరణ ఇవ్వమని అడిగాడు. నాకు తెలిసిన వివరణలు ఇవి. ఈ మెసేజ్ సారాంసం ఏమిటంటే శూద్రులు హిందూ ధర్మంలో గొప్ప మర్యాదలు పొందారు. వేదాలను అధ్యయనం చేసారు. వారిపై ఎక్కడా వివక్ష చూపినట్లు ఆధారాలు లేవు అంటూ శూద్ర ఋషులను, భక్తి సంప్రదాయ శూద్ర పంత్ లను కలగాబులగం చేసి వండిన వ్యాసం ఇది.
 
దీని వెనుక ఉద్దేశాలు ఏమిటంటే- ఈ రోజు సనాతన ధర్మం కావాలి అంటూ చేస్తున్న ప్రచారానికి హిందూ ధర్మం శూద్రులపట్ల వర్ణ వివక్ష చూపింది అనే ప్రధానమైన అభ్యంతరానికి సమాధానం చెప్పుకోవలసి వస్తున్నది. ఈ అంశానికి సమాధానంగా ఇదిగో చరిత్రలో ఈ ఈ శూద్రులు వేదాలను చదివి ఋషులయ్యారు అంటూ గొప్ప లిస్ట్ నొకదాన్ని ఇస్తున్నారు. ఏ రకమైన వివక్షా లేదని తీర్పులు ఇచ్చేస్తున్నారు.

నిజానికి పురాణాలలో శూద్ర ఋషుల వెనుక చాలా సందర్భాలలో బ్రాహ్మణ తండ్రి లేదా ఏదో దైవశక్తి ఉండటం గమనించవచ్చు. అది నిజమైన శూద్ర సమానత్వం అవ్వదు.
ముస్లిమ్ పాలన వచ్చాక వర్ణవ్యవస్థ సడలింది. బ్రిటిష్ పాలనలో పూర్తిగా చట్టవ్యతిరేకం అయ్యింది. సూఫీ వేదాంతం ప్రభావంతో శూద్ర వర్గాలు భక్తి సంప్రదాయాన్ని నిర్మించుకొన్నాయి. ఇది హిందూ ధర్మానికి ప్రతిగా నిలబెట్టిన ఆథ్యాత్మిక సంప్రదాయం. ఒకనాటి బౌద్ధ జైన మతాలతో దీనిని పోల్చవచ్చు.
 
ఇక చివరలో రొడ్డకొట్టుడు శ్లోకం పుట్టుకతో అందరూ శూద్రులే బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణులు అవుతారని గొప్ప రిఫరెన్స్ గా ఇచ్చారు. అదే సమయంలో ఈ వ్యాసంలోని వ్యక్తులు వేదాలు చదివారు బ్రహ్మజ్ఞానం పొందారు అంటూ ఒకపక్క మాట్లాడుతూ వారు బ్రాహ్మణులు అని చెప్పక శూద్రులు అని చెప్పటం- గొప్ప జోక్.
****

శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు ... వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారు ... అంటూ విషప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని మెకాలే - మాక్స్ ముల్లర్ మానస పుత్రులు, పాశాంఢ ఎడారి మత మార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు, రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది "మా వంటి శూద్రులను (author of this article)" హిందూ ధర్మం నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు చరిత్రలో ఎన్నడైనా శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా...??? వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారా...???

వివరణ:హిందూ ధర్మశాస్త్రాలు శూద్రులను  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి సేవలు చేయాలని  చెప్పాయి. కాస్త చదువుకొంటే ఈ విషయాలు తెలుస్తాయి. ఈ ధర్మశాస్త్రాలను రాసింది క్రీపూ నుండి క్రీశ 6 వ శతాబ్దం మధ్య. అప్పటికి బ్రిటిష్ వారు లేరు, వామపక్ష చరిత్రకారులు లేరు. శూద్రుడు వేదాలు వింటే ఏం చెయ్యాలో హిందూ ధర్మశాస్త్రాలు ఇలా చెప్పాయి.
 
1. ద్విజుణ్ణి అవమానించిన శూద్రుని నాలుక కోసివేయాలి (మను 8.270)

2. కాత్యాయనుని ఆదేశాల ప్రకారం శూద్రుడు వేదాలను పొరపాటునగాని, పొంచి ఉండిగానీ విన్నట్లయితే అతని నాలుక రెండుగా చీల్చబడుతుంది. అతని చెవులలో సీసం పోయబడుతుంది.
3. శూద్రుడు ఉన్నతజాతికి ధర్మాన్ని ఉపదేశిస్తే రాజు వాడి నోట్లో, చెవిలో మండుచున్న నూనెను పోయించాలి (మను 8.272)

4. శూద్రుడు మతధర్మ సూత్రాలు బోధిస్తున్నా, వేదమంత్రాలు ఉచ్ఛాటన చేస్తున్నా బ్రాహ్మణున్ని అవమానిస్తున్నా అతనికి శిక్షగా నాలుక తెగనరికి వేయాలి (బృహస్ఫతి స్మృతి)

5. శూద్రుడెవరైనా ఉద్దేశపూర్వకంగా వేదమంత్రోచ్ఛాటనను ఆలకిస్తున్నట్లయితే అతని చెవుల్లో సీసంగాని, లక్క గాని కరిగించి పోయాలి, వేదపఠనం చేస్తున్నట్లయితే, అతని నాలుక కోసివేయాలి. వేదపాఠాన్ని స్ఫురణకు తెచ్చుకొంటున్నట్లయితే అతని శరీరాన్ని రెండుగా ఖండించాలి (గౌతమ ధర్మ సూత్రాలు)

6. శూద్రకులజులు ద్విజునిపై అసత్యారోపణ చేసినా, అవమానించినా, బ్రాహ్మణులకు వారి విధులకు సంబంధించి పాఠాలు చెప్పినా రాజోద్యోగులు వారి నాలుకలు కత్తిరింపచేయాలి. (నారద స్మృతి)

7. ఇక పై సూత్రాలు ఎప్పుడైనా సామాజికంగా అమలులో ఉన్నాయా అని ప్రశ్నిస్తారు కొందరు. నిన్నమొన్నటి వరకు ఉన్నాయి. పీష్వాల పాలనలో అబ్రాహ్మణుడు ఎవరైనా వేదమంత్రాలను పఠిస్తే వారి నాలుకలను కత్తిరించేవారు. ఈ చట్టాన్ని ధిక్కరించి వేదాలను ఉచ్ఛరించిన అనేకమంది కంసాలుల నాలుకలను కత్తిరించమని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బ్రాహ్మణులు కంసాలులు గొడవలు ఈస్ట్ ఇండియా కంపనీ ప్రెసిడెంటువద్దకు వచ్చినట్లు Resolution of Government Dated 28th July 1779 ద్వారా తెలుస్తున్నది.
 
ఇక సమకాలీనంగా జరిగిన కొన్ని వందల వర్ణ వివక్షా దాడుల ఉదాహరణలను న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లతో సహా డా. అంబేద్కర్, రచనలు ప్రసంగాలు సంపుటం 5 లో పొందుపరిచారు. వాదించటానికి కొంచెం చదువుకొని రావాలి.

పరమ పవిత్ర శ్రీమద్ రామాయణ మహా కావ్యాన్ని రచించిన బోయవాడు అయిన రత్నాకర పూర్వ నామం కలిగిన వాల్మీకి మహర్షుల వారు శూద్రుడు కాదా...???

వివరణ: మన వేదాలు ఇతిహాసాలు పురాణాలు అన్ని విదేశీ ఆర్యపండిత రాతలు. వీరు వచ్చి స్థానిక ద్రవిడ, నాగ జాతులను జయించి, వారిని శూద్రులు, అతిశూద్రులుగా (ఎస్సీ) విభజించి ఆధిపత్యం చలాయించారు. వేదాలు, పురాణాలు ఇతిహాసాలు ఆర్యపండిత ఆధిపత్యాన్ని స్థిరపరచే రాతలు. ఈ ప్రక్రియలో కొన్ని రాతలు వారే రాసుకొని అవి శూద్రుల, అతిశూద్రుల రాతలుగా ప్రచారం చేసారు.
చాలా సందర్భాలలో తండ్రి బ్రాహ్మణుడై ఉంటాడు. అలా ఇవి మీరాతలే, మీరు ఆర్యపండితుల ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు మీరే రాసుకొన్నారు చూడండి అంటూ చెప్పటం ఒక రకమైన మార్కటింగ్ టెక్నిక్.
ఇక వాల్మీకి బ్రాహ్మణుడు.  పేర్లు, అగ్నిశర్మ/లోహ జంఘ. బోయ అని కల్పించారు..
 
మత్స్య గ్రంధికి జన్మించి పంచమ వేదం శ్రీమద్ భగవద్గీత, మహా భారతం వంటి పరమ పవిత్ర సనాతన గ్రంధాలను లిఖించిన కల్పి అనే పూర్వ నామం కలిగిన వ్యాస మహర్షుల వారు శూద్రుడు కాదా...??
 
వివరణ: వ్యాసుడు: బ్రాహ్మణ పరాశురుడికి జన్మించాడు. తాత బ్రాహ్మణ వశిష్టుడు. ఇతను శూద్ర స్త్రీకి పుట్టాడు. క్షేత్రబీజ ప్రాధాన్యతలను అనుసరించి ఇతను బ్రాహ్మణుడు. 
 
శూద్రునిగా పుట్టి దస్య కుమారుడు అయినా వేద జ్ఞానాన్ని ఆర్జించి రుషి అయి ఆత్రేయోపనిషత్తు, ఆత్రేయ బ్రాహ్మణమును రచించిన ఆత్రేయ ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: ఆత్రేయ కాదు ఐతరేయ. తల్లి దాసి. పేరు ఐతరేయ. ఆమెకు ఒక గొప్ప తపోసంపన్నుడైన ఋషివల్ల మహిదాసుడు అనే కొడుకు పుట్టాడు. ఇతనిని తండ్రి సరిగ్గా పోషించటం లేదని, ఐతరేయ భూదేవిని ప్రార్ధించగా భూదేవి ప్రత్యక్షమై ఐతరేయ మహిదాసకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించినట్లు, ఆ శక్తితో ఐతరేయ మహిదాసు ఐతరేయ బ్రాహ్మణాన్ని రచించినట్లు – ఒక కథనం. ఇందులో దైవశక్తి చెప్పబడింది.

పుట్టుకతో శూద్రునిగా జూదగానికి పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగానే కాదు ఆచార్యులుగా ప్రఖ్యాతి గాంచిన ఐలశు ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: కవశ ఐలూశ అనే ఋషి దాసికి జన్మించాడు. ఒక రోజు బృగు, అంగీరసుడులు యజ్ఞం చేస్తుండగా ఐలూశు డు వచ్చి వారి సరసన కూర్చున్నందుకు ఆ బ్రాహ్మణులు ఇతనిని తక్కువ కులజుడివని దూషించి, ఒక నీరు దొరకని ఎడారిలోకి తరిమేసారు. అక్కడ ఇతనికి సరస్వతి కటాక్షం లభించింది. సరస్వతి నది ఇతని వెంటే నడిచింది. ఆ మహిమకు బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి ఇతనిని ఋషిగా అంగీకరించారు. ఈ కథలో దైవశక్తి చెప్పబడింది తప్ప బ్రాహ్మణులు శూద్రులను సోదరభావంతో స్వీకరించినట్లు చెప్పబడలేదు.

శూద్రురాలికి పుట్టిన జాబల కుమారుడైన సత్యాకాం వేద సారాలను గ్రహించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, గురు విధేయతతో గౌతమ మహర్షుల వారినే మెప్పించిన సత్యాకాం, జాబల మహర్షుల వారు శూద్రుడు కాదా..???

వివరణ: దాసి అయిన జాబాలి కొడుకు సత్యకామ.  జాబాలి ఇతనిని హరిద్రుమతుడు అనే గురువు వద్దకు విద్యనేర్చుకొనేందుకు పంపుతుంది. ఉపనయనయనం చేసే ఉద్దేశంతో అతని కులగోత్రములు అడుగగా, నాకు తెలియవు అంటుంది తల్లి. ఆ గురువు దివ్య దృష్టితో అతని జన్మను తెలుసుకొని గాయత్రిమంత్రం ఉపదేశిస్తాడు.

జాబాలి పై దయతో గౌతముడు అనేబ్రాహ్మణుడు అతనికి బ్రాహ్మణ హోదా ఇస్తాడు తప్ప స్వంతంగా/పోరాడి గడించుకొన్నది కాదు. దీన్ని బ్రాహ్మణాధిక్యతగానే చూడాలి.

శూద్రురాలికి పుట్టినా కూడా వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మర్షి మాతంగి మహర్షుల వారు శూద్రుడు కాదా. ??

వివరణ: మతంగుడు మూల వాసి. ఇతను నాస్తికుడు, ఋషి. ఇతని ఆలోచనలు ఆర్యధర్మానికి భిన్నమైనవి. ఇతను అందరూ మైత్రీభావనతో మెలగాలని చెప్పేవాడు. వేదబాహ్యుడు. అయినప్పటికీ ఇతనిని ఆర్యబ్రాహ్మణులు హిందూ ధర్మంలోని ఋషిగా ప్రచారించుకొన్నారు. ఇతనికి ఆశ్రమాలు కలవు. ఇతని కుమారుడు కపిలుడు. యోగసాంఖ్యశాస్త్రకర్త. మతంగుడే నేటి పంచమవర్ణానికి ఆదిపురుషుడుగా చెబుతారు.

బ్రాహ్మణ అగస్త్యుడు దక్షిణానికి వచ్చి తన శిష్యులతో ఆశ్రమాలు ఏర్పరచుకొనే క్రమంలో అప్పటికే ఇక్కడ ఉన్న మతంగుని ఆశ్రమాలను ఆక్రమించుకోగా, మతంగుడు మరొక చోటుకు తరలిపోవలసి వచ్చిందని ఒక కథనం కలదు.

పుట్టుకతో శూద్రురాలి కుమారుడైనా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఖ్యాతి గాంచిన విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలు అందించాడు.ఇతడు శూద్రుడు కాదా.???

వివరణ: సంతానం కొరకు అంబ ను వ్యాసునితో సంభోగించటానికి వెళ్లమంటే, వ్యాసుని గడ్డాలు చూసి ఇష్టపడక, అంబ ఒక దాసిని పంపుతుంది. అలా బ్రాహ్మణ మూలాలు కలిగిన వ్యాసుడి కి దాసికి పుట్టిన సంతానం విదురుడు. ఇతను శూద్రుడు కాదు. క్షేత్రబీజ ప్రాధాన్యతలను బట్టి బ్రాహ్మణుడే.

పుట్టుకతో శూద్రుడు అయిన వత్సుడు గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషివత్స గా ప్రఖ్యాతిగాంచలేదా...? వీరు శూద్రుడు కాదా...??? Ref:-(ఆత్రేయ బ్రాహ్మణము - 2.19)

వివరణ: వత్సుడిని అతని సోదరుడే నువ్వు శూద్ర స్త్రీకి పుట్టావు అని నిందించగా, కాదు నేను బ్రాహ్మణుడినే అని వాదించి అగ్నిప్రవేశం చేసి తన దోషాన్ని తొలగించుకొన్నాడు. ( మను 8-116). కనుక ఇతను బ్రాహ్మణుడు.

శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తి, బ్రహ్మ జ్ఞానంతో ఋగ్వేదంనందలి కొన్ని ఋక్కులకు కర్తయై బ్రాహ్మణత్వం పొందిన "కవష ఐలుషుడు" శూద్రుడు కాదా...???

వివరణ: కవశ ఐలుషుని గురించి ఇదివరకే పైన చెప్పటం జరిగింది. ఈ పాయింటు రిపీట్ అయింది. బ్రాహ్మణత్వం పొందాడు అని చెబుతూ మరలా చివర్లో శూద్రుడు కాదా అని ప్రశ్నిస్తారెందుకు?   అంటే........

సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడు శూద్రులు అయిన గొల్ల వారి ఇంట్లో పెరిగాడు యశోదమ్మకి మాతృ ప్రేమని పంచాడు !! ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు.

వివరణ: కృష్ణుని పాత్రద్వారా  మనుస్మృతిలోని వర్ణవిభజనను ఆర్యపండితులు చెప్పించారు- నేనే నాలుగు వర్ణాలను సృష్టించాను. వాటికి ధర్మాలు నిర్ణయించాను. స్వధర్మమే పాటించాలి వీడరాదు అని చెబుతాడు గీతలో. అంటే శూద్రుడు జీవితాంతం శూద్రుడిగానే ఉంటూ పై మూడు వర్ణాలకు సేవలు చేసుకోవాలని అర్ధం. మీ శూద్రులలో ఒకడే ఇలా చెప్పాడు అని ఆ పాత్రతో చెప్పించటం, అందరినీ ఒప్పించే ప్రక్రియ. Manufacturing of opinion అని చెప్పొచ్చు.

మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్న జాతివాడుగా భావించబడే పల్లెకారుడు (మత్స్యకారుడు) గుహుడికి దక్కింది. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీ రాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది..? మరి గుహుడు శూద్రుడు కాదా...???

వివరణ: గుహుడు కిరాతరాజు. ఇతను మతంగుని వలె మూలనివాసి. స్థానికుడు. ఆర్యులు దక్షిణాపథానికి వచ్చే క్రమంలో అనేక స్థానిక రాజులతో సంబంధాలు పెట్టుకొన్నారు. వారిలో గుహుడు ఒకడు. ఇతను ఆర్యులవైపు ఉన్నాడు కనుక అస్మదీయుడయ్యాడు. ఆర్యపండితులకు వ్యతిరేకంగా ఉండిన వారిని అవతారాలు ఎత్తి మరీ సంహరించినట్లు కథలు కథలుగా పురాణాలు రాసుకొన్నారు.

అద్భుతమైన వేద జ్ఞానంతో, సుమధుర గానంతో సాక్ష్యాత్ ఆ శ్రీరామచంద్రుల వారికే తన ఎంగిలి ఫలాన్ని తినిపించిన శబరి శూద్రురాలు కాదా...???

వివరణ: శబరి మాతంగ ఆశ్రమవాసి. మూల నివాసి. ఆర్య సంస్కృతికి వెలుపలి వ్యక్తి. ఆర్యులను ఆహ్వానించింది కనుక ఆర్య సాహిత్యంలో చోటు దక్కించుకోగలిగింది.

స్వయంగా కవి పండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి భోజుడిగా ప్రఖ్యాతుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు వారు శూద్రుడు కాదా...???

వివరణ: అతను రాజు. హిందూ ధర్మం ప్రకారం శూద్రరాజులు పట్టాభిషేకసమయంలో సువర్ణగర్భ యాగం చేసి దండిగా సువర్ణాన్ని పండితులకు దానం ఇస్తేనే అతనికి పాలించే అర్హత వస్తుంది. శూద్ర శివాజీని కొందరు పండితులు ఈ క్రతువు చేయటానికి నిరాకరించగా, భారీ ఎత్తు ధనాన్ని ఇచ్చి పట్టాభిషిక్తుడయినట్లు చరిత్ర చెబుతుంది. రాజు శూద్రుడైనా king maker గా బ్రాహ్మణుడు ఉండటం జన్మ ఆధారిత వర్ణ వ్యవస్థ వేసిన మాస్టర్ ప్లాన్.

అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన, ముర అనే శూద్ర మహిళకు జన్మించినా వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగినచంద్రగుప్త మౌర్య శూద్రుడు కాదా...???

వివరణ: చూడుడు పై పాయింటు వివరణ. నిజానికి మౌర్య సామ్రాజ్యాన్ని పతనం చేసి నిర్మించిన ఇతర సామ్రాజ్యాలేవి అంతటి విశాలమైనవి, అఖండ భారతాన్ని పాలించినవి కావు
.
మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివృత్తికి చెందినవాడు. మరి ఆయన శూద్రుడు కాదా...???

వివరణ: చూడుడు పై పాయింటు వివరణ

విశ్వ కర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాయీ బ్రాహ్మణులు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వీరిలో అనేక లక్షల మంది వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి పౌరోహిత్యం చేస్తున్నారు. మరి వీరందరూ శూద్రులు కాదా...???

వివరణ: అవును నిజమే. అన్నీ ఉన్నాయి. శూద్రజంధ్యధారులు చరిత్రలో ఎంతో పోరాటం చేసి ఉపనయన హక్కును నిలుపుకొన్నారు (ఆర్యపండితులు ఉపనయనాన్ని మూడు వర్ణాలకే పరిమితం చేయకముందు అన్ని వర్ణాలవారు, స్త్రీలతో సహా అందరకు ఉపనయన హక్కు ఉండేది). ఇది గొప్ప విషయం. శూద్రజంద్య ధారులు ఆలయ గర్భగుడిలో ప్రవేశించి మూల మూర్తిని అర్ఛించే అర్హత కలిగిన నాడు వీరు బ్రాహ్మణ జంద్యధారులతో సమానం అవగలరు అనే సూక్ష్మవిషయాన్ని గ్రహించాలి. ఇలాంటి సన్నివేశం ఇటీవలి తంగలాన్ సినిమాలో ఉంది.

వేద కాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగా మారి, జనశృతి పౌత్రయణ జరిపిన రైక్వ ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: రైక్వ ఋషి, జన శృతి అనే శూద్రరాజు వద్ద బహుమతులు గ్రహించి అతనికి విద్యలు నేర్పినట్టు చాంధోగ్య ఉపనిషత్ లో ఉన్నది. ఆకాలంలో జైన బౌద్ధాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. జైన బౌద్ధాలలో శూద్ర బ్రాహ్మణ బేధాలు లేవు. రైక్వ ఋషి జైనుడో బౌద్ధుడో అయ్యే అవకాశం ఎలా కాదనగలరు?

కుమ్మరి వృత్తి చేసేవారి కుటుంబంలో జన్మించినా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో, భక్తితో, మెప్పించిన భక్త తుకారాం శూద్రుడు కాదా

వివరణ: 12 వ శతాబ్దం నుంచి భారతదేశంలో వ్యవస్థీకృత ముస్లిం పాలన మొదలైంది. వైదిక విద్యను స్థానంలో క్రమేపీ ఇస్లామిక్ విద్య రాసాగింది. ఇది అంతవరకూ సమాజంలో బిగుసుకుపోయి ఉన్న వర్ణ వ్యవస్థను బద్దలు కొట్టింది. ఎంతో మంది శూద్రులు విద్యనభ్యసించసాగారు. పెర్షియన్ భాషలో విద్యాబోధన సాగింది.

ముస్లిమ్ పాలకులు స్థానిక ప్రజల మతపరమైన విశ్వాసాలను గౌరవించారు. బాబర్ కాలంనుంచి ముఘల్ పాలకులు సంస్కృత పండితులను చేరదీసారు. హుమాయున్ అక్బర్ లు పరమతసహనానికి నమూనాగా నిలిచాడు. జహంగీర్, షాజహాన్ లు కూడా అదే బాటలో నడిచారు.
హజ్రత్ నిజాముద్దిన్ ఔలియా (13 వ శతాబ్దం), షా ఇనాయతుల్ల (17 వ శతాబ్దం) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిమ్ ఐక్యతను బోధించారు. నానక్ సాహెబ్ దాదు దయాల్, బుల్లా సాహెబ్, తులసి సాహెబ్ లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్ ఐక్యతకు కృషిచేసారు.

ఈ నేపథ్యంలోంచే భక్తి ఉద్యమం మొదలైంది.ఈ భక్తి ఉద్యమం ఇస్లామ్ మతంలోని ఎకేశ్వరోపాశన నుండి ప్రేరణ పొందింది. హిందు మత లక్షణాలైన కులమతాల వివక్ష లేదు, సంస్కృతం బోధనా భాష కాదు. స్థానిక భాషలలో కీర్తనలు రాసుకొన్నారు ఈ భక్తి కవులు. దేవుని చేరుకోవటానికి మధ్యలో పూజారి అవసరంలేదు. పూజలు, క్రతువులు, యజ్ఞాలు యాగాలు అవసరం లేదు. హిందూ ధార్మిక గ్రంథాలైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రస్తావన లేదు. ఉత్త భక్తి తో ఎవరైనా దేవుడిని చేరుకోవచ్చు అని చేసిన ఉద్యమమే భక్తి ఉద్యమం. దీనిని నడిపించింది శూద్రులు, ముస్లిము సూఫీలు. ఇది పరమతసహనానికి సూచనగా నిలిచింది.

క్రతువులు, వేదాలు, పురాణాలు, సంస్కృతం, వర్ణవ్యవస్థ, యజ్ఞాలు, పూజారులు ఉండే సనాతన ధర్మానికి భక్తి ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. ఈ రోజుకీ ఈ భక్తి ఉద్యమంలోని సంత్ (భక్తి ఉద్యమ నిర్మాతలు) లను వారు శూద్రులని హిందూ పీఠాధిపతులు గుర్తించరు

ఈ వ్యాసంలో తుకారం, నారాయణ గురు, కబీరు, రవి దాస్, మీరాభాయ్, సంత్ ఘాసి దాస్ లాంటి వారిని హిందూమతం ఉత్పత్తి చేసిన శూద్ర ఋషులుగా చెప్పటం వక్రీకరణ. వారు హిందూ ధార్మికతను ధిక్కరించి, వెలుపలకి వచ్చి ఒక ఉద్యమాన్ని నడిపిన గొప్ప సామాజిక సంస్కర్తలు. అంతేకాక మరికొందరు ఋషులు జైన మతానికి చెందినవారు కూడా కావొచ్చు. ఎందుకంటే దాదాపు 15 శతాబ్దం వరకూ జైనం మనుగడలో ఉంది. వారిని హిందూ ఋషులుగా అప్రాప్రియేట్ చేసుకోవటం లోతుతక్కువ వాదన.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా మారిన ఋషి నారాయణగురు వారు శూద్రుడు కాదా...???

వివరణ: ఇతను బ్రిటిష్ ఇండియాలో 19 వ శతాబ్దపు సంఘ సంస్కర్త. శూద్రుడు. కేరళాలో హిందూ మతంలోని కులవ్యవస్థపై, బ్రాహ్మణాధిక్యతపై పోరాడిన వీరుడు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన కబీర్_దాస్ శూద్రుడు కాదా...???

వివరణ: 15 వ శతాబ్దపు ముస్లిమ్ పాలనలో కబీర్ దాస్ ఒక భక్తి ఉద్యమకారుడు. ఇతనిపై సూఫీల ప్రభావం ఉంది. ఇతను ఇస్లామ్ మతాన్ని స్వీకరించాడు. ఇతనిని ఇప్పటికీ హిందూముస్లిములు సమానంగా ఆదరిస్తారు. హిందూ బ్రాహ్మణులు కబీర్ ను ఎన్నో కష్టాలపాలు చేసినట్లు అనేక కథలు కలవు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో బెంగాలీ మహారాజు లక్ష్మణ్ సేన్ కు రాజగురువుగా ఎనలేని సేవలు అందించిన ఋషి ధోయి శూద్రుడు కాదా...???

వివరణ: థోయి 12 వ శతాబ్దానికి చెందిన కవి. పావన దూత అనే కావ్యాన్ని రచించాడు. హిందుఋషా కాదా చెప్పలేం.

శూద్రునిగా పుట్టినా కూడా కళంగినథార్ శిష్యరికంలో వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానంకలిగిన తమిళ బోగర్ చైనా దేశం వెళ్లి హిందూ ధర్మ ప్రచారం చేశారు. మరి ఈయన శూద్రుడు కాదా...???

వివరణ: సిద్ధవైద్యం తెలిసిన తమిళ వ్యక్తి. పురాణ వ్యక్తి. చారిత్రిక వివరాలు తెలియరావు. క్రీపూ 3000 కి చెందిన వ్యక్తి అంటారు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ?

మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో 63 శైవ నాయనార్లలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "ఆదిపట్టన్" శూద్రుడు కాదా...???

వివరణ: చోళులకాలంలో నివసించిన శైవభక్తుడు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ?

కళింగ రాజ్యాన గోవులు కాసే వారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, కలిగిన "అచ్యుతానంద" శూద్రుడు కాదా...???

వివరణ: అత్యుతానంద దాస. 16 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో జీవించాదు. ఇతను గోకాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. తండ్రి Dinabandhu Mohanty. ఇతను కరణాలు. లేఖన వృత్తి.

కళింగ రాజ్యాన కాటికాపరి వృత్తి చేసేవారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "బలరాం దాస్" శూద్రుడు కాదా...???

వివరణ: బలరామ్ దాస్ 16 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో జీవించాడు. వీరు కాటికాపరి వృత్తి కాదు. తండ్రి Somanatha Mahapatra. ఇతను కరణాలు. వీరు సంపన్నులు.

కళింగ రాజ్యాన మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా వెలుగొందిన "భీమ దిబారా" శూద్రుడు కాదా...???

వివరణ: అవును శూద్రుడే. ఇతను 17 వ శతాబ్దానికి చెందిన వాడు. అప్పటికి ముస్లిమ్ పాలన, బ్రిటిష్ వారి ప్రభావంచే మనుధర్మం వెనక్కి వెళ్ళి శూద్రులందరూ విద్యనభ్యసిస్తున్నారు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ఋషి రవిదాస్ శూద్రుడు కాదా...???

వివరణ: రవిదాస్, మీరాభాయి లు భక్తి సంప్రదాయానికి చెందిన 15 వ శతాబ్దపు కవులు. ముస్లిమ్ సూఫీ సంప్రదాయం అనుసరించారు. రవిదాస్ పంత్ చర్మకారకులానికి చెందిన వ్యక్తి. హిందూ ధర్మాన్ని తిరస్కరించిన శూద్ర భక్తి కవి.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ముని నామ్ దేవ్ శూద్రుడు కాదా...???

వివరణ: నామ్ దేవ్ 13 వ శతాబ్దంలో ముస్లిమ్ పాలనలో జీవించిన భక్తి కవి. భూస్వామ్య శూద్రకులస్థుడు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ? ఇతను వేదాలను అనుసరించలేదు.

శూద్రుల ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చోఖ మేళ" శూద్రుడు కాదా...???

వివరణ: చొక్కమేళ మరాఠా భక్తిసంప్రదాయ కవి. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో ఆథ్యాత్మిక అన్వేషణ చేసిన మహర్ కులస్థుడు. ఇతనిని బ్రాహ్మణ పండితులు ఆలయంలోకి అనుమతించలేదు. ఆ కారణంగా సొంత ఆలయాన్ని నిర్మించుకొన్నాడు. వేదాలను, హిందూ ధర్మాలను అంగీకరించలేదు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన "సంత్ కణ్హోపుత్ర" శూద్రుడు కాదా...???

వివరణ: సంత్ కన్నోఫుత్ర స్త్రీ. రాజ నర్తకి. 15 వ శతాబ్దంలో ముస్లిమ్ పాలనలో విఠలుని ఆరాధించి కవిత్వం చెప్పిన కవయిత్రి. ఈమె వేదాలను అభ్యసించినట్లు ఎక్కడ ఉంది? రిఫరెన్స్

" మహారాజు కవార్ధ" రాజ గురువు వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన శూద్రుడైన "గురు బాలాక్ దాస్" ...!

వివరణ: గురుబాలక్ దాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జీవించిన భక్తి సంప్రదాయానికి చెందిన సంత్. కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఇతను చేస్తున్న బోధనలు ప్రజలలో విస్తరిస్తున్నాయని తెలిసిన అగ్రవర్ణ హిందువులు ఇతన్ని కత్తులతో పొడిచి చంపేసారు.

జష్పూర్ యువరాజు రాజ్ కుమార్ దిలీప్ సింగ్ రాజ గురువు శూద్రుడైన "గురు రామేశ్వర్ ప్రసాద్ గాధర".!

వివరణ: గురు రామేశ్వర్ యోగి 1905-1996 మధ్య జీవించిన చత్తిస్ గఢ్ కు చెందిన ఆథ్యాత్మిక వేత్త. ఇతను గిరిజనుల అభ్యున్నతి కొరకు పాటుపడిన సామాజిక కార్యకర్త. 

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సంత్ ఘాసిదాస్" శూద్రుడు కాదా...???

వివరణ: సంత్ ఘాసిదాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జన్మించాడు. భక్తి సంప్రదాయానికి చెందిన సంత్ గురువు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన తమిళులకు ఆరాధ్యుడు అయిన, "తిరు వల్లువార్" శూద్రుడు కాదా...???

వివరణ: తిరువళ్ళువార్ జైనుడు. హిందూమతానికి చెందిన వ్యక్తే కాదు. ఇతని కాలానికి హిందూమతం ఇంకా దక్షిణభారతదేశానికి రానేలేదు. ఇక బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఎక్కడిది. ఇదొక ఊతపదంగా ఉంది ఈ వ్యాసం మొత్తంలో. ఆ పదాలు పడితే తప్ప హిందుమతం అని అనుకోరని కాబోలు.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "గురు విఠల్ రాంజీ షిండే" శూద్రుడు కాదా...???

వివరణ: గురు విఠల్ 20 వ శతాబ్దపు సామాజిక కార్యకర్త. దళితులు, సమాజంలో వెలివేయబడినవారి అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త. వర్ణ వ్యవస్థను వ్యతిరేకించారు. బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యం ఎక్కడిది. రిఫరెన్స్.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "సోయరా భాయ్"శూద్రురాలు కాదా...??

వివరణ: ఈమె పైన చెప్పిన 14 వ శతాబ్దపు ముస్లిమ్ పాలనలో భక్తికవి గా పేరుగాంచిన చర్మకార చొక్కమేళ సంత్ యొక్క భార్య. ఈ దంపతులు వేదాలను అంగీకరించలేదు. గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యం ఎక్కడిది. రిఫరెన్స్?

మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెంది శివ, వైష్ణవ బేధాలను రూపుమాపిన "శోభి రామ్" శూద్రుడు కాదా...???

వివరణ: శోభిరామ్ 18 వ శతాబ్దం బ్రిటిష్ పాలనలో గురు శివనారాయణ వద్ద శిష్యరికం చేసిన ఒక చమర్ యోగి. వేద పాండిత్యం రిఫరెన్స్??

పంజాబ్ లో రజక వృత్తి చేయువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "నామ్ దేవ్" శూద్రుడు కాదా...???
వివరణ: ఇది రిపీట్

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బహిరామ్ చోఖమేల" శూద్రుడు కాదా.??

వివరణ: బహిరామ్ బాబా 1800 లలో జీవించిన యోగి. ఇతనికి వేదపాండిత్యం నేర్చుకొన్నాడని రిఫరెన్స్ లు ??.

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బంకా మహర్" శూద్రుడు కాదా.??

వివరణ: ఇతను పైన చెప్పిన చొక్కమేళ కు బావమరిది. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలన. వీళ్ళు వేదాలను తిరస్కరించారు. వేదపాండిత్యం ???

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "భాగు" శూద్రుడు కాదా.??

వివరణ: భాగు మహరిన్ మహర్ కులానికి చెందిన భక్తి కవయిత్రి. ఈమె గురించి వివరాలు తెలియరావు. భక్తి సంప్రయానికి చెందిన వ్యక్తి.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చన్నయ్య" శూద్రుడు కాదా.??

వివరణ: మదరా చన్నయ్య 11 వ శతాబ్దానికి చెందిన కన్నడ కవి. బసవని శిష్యుడు అంటారు
.
ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "గోపాలానంద్ మహరాజ్ " శూద్రుడు కాదా.??

వివరణ: పంతొమ్మిదో శతాబ్దపు సాధువు. స్వామినారాయణ సంప్రదాయానికి చెందిన వ్యక్తి. అనేక పుస్తకాలు రాసాడు. 1908 లో మరణించారు.

ఇలా చెప్పుకుంటే పోతే అనేక లక్షల మంది శూద్ర హిందువులు వేదాలు చదివి, బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందారు, పొందుతూ హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేస్తున్నారు...!
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్ద విద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు. ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.

వివరణ: 12 వ శతాబ్దం నుండి ముస్లిముల పాలన కారణంగా కొంతమేరకు వర్ణ వ్యవస్థ పగుళ్ళు తీసింది. శూద్రులు వేదాలను, పురాణాలను పక్కనపెట్టి భక్తి ఉద్యమాన్ని నడిపించారు. ఇది ఎక్కువగా వర్ణవ్యవస్థకు, క్రతువులకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. దీనికి ప్రేరణ ముస్లిమ్ పాలకుల సూఫీ వేదాంతం. దాన్ని ఆధారం చేసుకొని శూద్రులు, అతిశూద్రులు తమ ఆథ్యాత్మిక ప్రపంచాన్ని భక్తి ఉద్యమం ద్వారా నిర్మించుకొన్నారు. దీనిలో హిందూ మత ప్రమేయం తక్కువ.

ఇక పై శ్లోకంలో బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అంటున్నప్పుడు పైన చెప్పిన ఋషులను, సంత్ లను నేటికీ శూద్రులుగానే ఎందుకు పిలుస్తున్నారు మీరు?. వారికి బ్రహ్మ జ్ఞానం వచ్చిందని పేరు పేరుకి చెప్పినపుడు వారు శూద్రులు, చమరులు అని కులాలుగా ఎందుకు చెబుతున్నారు? వారు బ్రాహ్మణులు అని ఎందుకు చెప్పటం లేదు?
ఇంతచిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. అంటే జన్మనా జాయితే అనేది అంతా బూటకం. పై పై నాటకం.

పోనీ గత రెండువందలేళ్ళుగా బ్రహ్మజ్ఞానం వల్ల ఏ శూద్రుడు బ్రాహ్మణుడిగా మారాడో లెక్కలు తీయండి. కేస్ట్ సర్టిఫికేట్లు ఆధారాలుగా చూపి మాట్లాడాలి. గాలి కబుర్లు కాదు.  లేదూ దుర్గుణాలు కలిగిన ఏ బ్రాహ్మణుడు  శూద్రుడిగా మారాడో చెప్పండి. 

 దొంగతనం మొదలైన అపరాధాలలో శూద్రునకు 8 రెట్లు దండన విధిస్తే, వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు బ్రాహ్మణునకు 64 లేక 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనువు ఆదేశించారు. శిక్షల విషయంలో ప్రక్షిప్త శోకాలు కనిపించిన మహానుభావులకు ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలోదో విజ్ఞులైన మీరు గ్రహించగలరనుకుంటాను.!

వివరణ: ఈ శ్లోకానికి మూలం ఏటో చెప్పాలి? ఈ విధంగా చివరన ఎక్కడిదో నంబరుతో సహా ఇచ్చినట్లు…… అంతే తప్ప ఉత్తినే ఏదో నాలుగులైన్లు రాసి చెబితే ఎలా నమ్మేది.

బ్రాహ్మణుడు క్షత్రియుల్ని దూషిస్తే యాభైపణాలు, వైశ్యుల్ని దూషిస్తే ఇరవై ఐదు పణాలు, శూద్రుణ్ణి దూషిస్తే పన్నెండు పణాలు శిక్ష విధించాలి. అదే ఒక శూద్రుడు బ్రాహ్మణున్ని అవమానిస్తే ఆ శూద్రుని నాలుక కోసివేయాలి. మను: 8.270)

ద్విజుని కులాన్ని, పేరును అమర్యాదగా ఉచ్చరించిన శూద్రుని నోట్లో పదివేళ్ళ పౌడగున్న ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి. (మను 8.271)
****

బొల్లోజు బాబా

Tuesday, October 8, 2024

కొంచెం ప్రజాస్వామ్యం కండి.

వేదాలు వినకూడదని, చదువుకోకూడదని, బ్రాహ్మణులను పూజించాలని లాంటి రాతలన్నీ వ్యాసుడు, వాల్మీకి లాంటి బ్రాహ్మణేతరులే రాసుకొన్నారని అని వాదించటం ఏదైతే ఉందో అది హిలేరియస్.
బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు రాసిన బ్రాహ్మణులను, బ్రాహ్మణేతరులు అని ప్రచారించటం గొప్ప మార్కెటింగ్ టెక్నిక్.
ఇలాంటి వాదనలు శతాబ్దాలుగా చేసారు. ఇంకానా... ఇది డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల యుగం. తర్కం నడుస్తున్న రోజులు ఇవి.
కొంచెం ప్రజాస్వామ్యం కండి.

Reference comment

కృష్ణుడు ఏంచెప్పాడు- బ్రాహ్మణాధక్యతను, చతుర్వర్ణాలను చెప్పాడు గీతలో. స్వధర్మం పాటించమన్నాడు. గీత దాటొద్దన్నాడు.
విశ్వామిత్రుడు- బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనదని దాన్ని కోరుకోవటానికి తపస్సుచేసాడు
అరుంధతి - బ్రాహ్మణ కశ్యపుని ముని కుమార్తె. బ్రాహ్మణుని భార్య. మాదిగ స్త్రీ అని కథనాలు అల్లారు.
వాల్మీకి: బ్రాహ్మణుడు పేర్లు, అగ్నిశర్మ/లోహ జంఘ. బోయ అని కల్పించారు. రాసిందంతా బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు.
వ్యాసుడు: బ్రాహ్మణ పరాశురుడికి జన్మించాడు. తాత బ్రాహ్మణ వశిష్టుడు. రాసిన రాతలు బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే కావ్యాలు, ఇతిహాసాలు.
మనువు కూడా బిసి అని వాదించాడో అతితెలివి మేధావి.
ఇలాంటి వాదనలనే లోతుతక్కువ వాదనలు అంటారు. బ్రాహ్మణవాదాన్ని చెప్పినవారందరూ బ్రాహ్మణేతరులు కనుక బ్రాహ్మణవాదం/సనాతనం అనేది బ్రాహ్మణేతరులే కావాలని తమమీద వేసుకొన్నారు;
వేదాలు వినకూడదని, చదువుకోకూడదని, బ్రాహ్మణులను పూజించాలని లాంటి రాతలన్నీ తమకు తామే రాసుకొన్నారని అని వాదించటం ఏదైతే ఉందో అది హిలేరియస్.
బ్రాహ్మణాధిక్యతను స్థిరపరచే రాతలు రాసినవారిని బ్రాహ్మణేతరులు అని ప్రచారించటం మార్కెటింగ్ టేక్నిక్.
ఇలాంటి వాదనలు శతాబ్దాలుగా చేసారు. ఇంకానా... ఇప్పుడు డా. అంబేద్కర్, పెరియార్, పూలే ల యుగం, తర్కం నడుస్తున్న రోజులు ఇవి.
కొంచెం ప్రజాస్వామ్యం కండి.
పిఎస్. ఆయా పాత్రలు చారిత్రికమైనవని నమ్మలేను కానీ పురాణ పాత్రలుగా ఎంచి వాటిపై విశ్లేషణ ఇది.



బొల్లోజు బాబా

సాయిబాబా విగ్రహాలు తొలగింపు

యూపి ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలు తొలగింపు పై పెట్టిన ఒక పోస్టు వద్ద నే చేసిన కామెంట్లు ఇవి.
.
ఇది ఇక్కడితో ఆగుతుందా? హిందూ, బౌద్ధ ఆ తరువాత శైవ వైష్ణవ గొడవలుగా మారదని గ్యారంటీ లేదు.
***
శైవ వైష్ణవ గొడవలు వచ్చేంతగా శాస్త్రం ఎవరూ చదువుకోలేదు అన్న మిత్రుని వ్యాఖ్యకు ఇచ్చిన సమాధానం ఇది.
***
మీరు శాస్త్రం మాట్లాడుతున్నారు.
వాస్తవం అలా లేదు.
ఈ రోజు హిందుత్వ పేరుతో జరుగుతున్న ఈ విభజన, ద్వేషానికి కారణం వైష్ణవమే అనే భావన బలపడుతోంది.
మొన్న అయోధ్యాలయ ప్రారంభోత్సవ వేళ కూడా పిఠాధిపతుల నిరసనలో ఈ శైవ వైష్ణవ విభేధాలు స్పష్టపడ్డాయి
రాహులుడు శివుని పటం ప్రదర్శిస్తూ కూడా ఇదే అభిప్రాయాన్ని నర్మగర్భంగా ప్రకటించాడు
ఓట్లకోసం తాత అడ్డబొట్లు పెట్టుకొని శివాలయాలచుట్టూ తిరిగాడు మొన్న తమిళనాడులో.
పొలిటికల్ గా, మతపరంగా శైవ వైష్ణవ బేధాలు కన్సాలిడేట్ అవుతున్నాయి.
ఇక వ్యవహారపరంగా మతం బ్రాహ్మణుల చేతులలోంచి భజరంగ్ సేవకుల చేతులలోకి ఏనాడో జారిపోయింది.
బ్రాహ్మణుల చేతుల్లో రాజకీయనిర్ణయాలకు శాస్త్రప్రకారం సమర్ధింపులు చేయటం మిగిలింది.
ఒక వేళ అన్నిటినీ మింగేసి వైష్ణవం ఒకటే మిగిలినా.... అందులో మళ్ళా ద్వైత, అద్వైత, గౌడీయ అంటూ భిన్న శాఖల ఆధిపత్య పోరు మొదలౌతుంది.
మత ఆధారంగా విభజన ద్వేషం మొదలయ్యాకా దానికి అంతం ఉండదు. చరిత్ర ఈ నరమేథాలను చాలానే చూసింది.
బొల్లోజు బాబా

ప్రాచీనగాథ

మంచినీటిలో బతికే నీరుపిల్లి
సముద్రపు ఎండు చేపలని
తింటుందేమో కానీ
మరొకరిని కౌగిలించుకొన్న ఛాతీని
నేను హత్తుకోను
.
ఓరమ్‌పోకియార్, ఐంగురునూరు – 63
(బయట తిరుగుళ్ళు మరిగిన భర్తగురించి చెప్పిన మాటలు)
రానున్న నా ప్రాచీనగాథలు పుస్తకం నుండి
***
పై గాథ రెండువేల సంవత్సరాల క్రితపు సంగం కాలపు సాహిత్యం. అప్పటికి వైదిక ధర్మం ఇంకా దక్షిణభారతదేశానికి రాలేదు. ఇక్కడి ప్రజలను జైన, బౌద్ధ ధర్మాలు నడిపించాయి.
ఒక స్త్రీ ఎంత స్వేచ్ఛగా, ఎంత నిర్భయంగా తన అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నదో గమనించవచ్చు.
భర్త కుష్టురోగి అయినప్పటికీ వాడితోనే కాపురం చేయాలని, అతను కోరితే బుట్టలో ఎత్తుకొని ప్రియురాలి ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పింది సనాతన ధర్మం.

బొల్లోజు బాబా

సెక్యులరిజమ్ అనేది యూరోపియన్ భావన భారతీయులది కాదు. .... ఒక హిందుత్వ వాది.

సెక్యులరిజమ్ అనేది యూరోపియన్ భావన భారతీయులది కాదు. .... ఒక హిందుత్వ వాది.

***
.
ఒక మతానికి చెందిన వ్యక్తులు అసందర్భంగా తమ మతాన్ని పొగుడుకోవటం, ఇతర మతాలను నిందించటం చేయరాదు. పరమతానికి చెందినవారిని కూడా గౌరవించవలెను. ఇలా చేయుటవలన తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాక ఇతర మతాల వారికి ఉపకారం కలిగించిన వారు అవుతారు. తన వారిని స్తుతిస్తూ ఇతర మతస్తులను నిందించేవాడు తన మతానికే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము-- - అశోక చక్రవర్తి, XII వ శిలాశాసనము
.
***
హిందుత్వ వాదులకు భారతదేశం అంటే ఆరో శతాబ్దపు మతం మాత్రమే. అంతకు ముందుకూడా ఈ దేశానికి చరిత్ర ఉందని తెలుసుకోవటానికి ప్రయత్నించరు. రెండువేల సంవత్సరాల క్రితపు అశోకుని శిలా శాసనంలో చెప్పింది ప్రాచీన భారతదేశ సెక్యులరిజం.
విభజన, ద్వేషం బాగా అమ్ముడుపోయే సరుకులైనప్పుడు, సమత సహిష్ణుత ఎవరికి కావాలి?
బొల్లోజు బాబా

థేరీగాథలు


థేరీగాథలు BCE ఆరోశతాబ్దానికి చెందిన తొలితరం బౌద్ధ బిక్కుణిల అనుభవాలు. మానవ దుఃఖం, వేదన, ముక్తికొరకు అన్వేషణ, తధాగతుని బోధనలో దొరికిన సాంత్వన ఈ గాథల ఇతివృత్తం.
వీటిని అనువదించి 2022 లో పుస్తకంగా తీసుకొచ్చాను. ఛాయావారు ప్రచురించారు.
ఈరోజు వాటిని మరలా చదువుకొంటే, మంచి అనుభూతిని ఇచ్చాయి ప్రతి గాథ వెనుక చారిత్రిక అంశాలను పుస్తకం చివరలో నోట్సు రూపంలో ఇచ్చాను.
****
.
భద్ధ కుండలకేశ
.
శిరోముండనం గావించుకొని
దుమ్ముపట్టిన దుస్తులు ధరించి
తప్పులు లేనిచోట తప్పులు ఉన్నాయని
తప్పులు ఉన్నచోట వాటికి అంధురాలినై
సంచరించేదానిని
యాభై ఐదేండ్లపాటు
అంగ, మగధ, వజ్జి, కాశి, కోశల రాజ్యాల
నలుమూలలా పర్యటించాను
ఆ రాజ్య ప్రజలు ఇచ్చిన భిక్షను తిన్నాను
ఒకనాడు
నిర్మలమైన బుద్ధభగవానుడు శిష్యులతో కలసి వుండగా
గృధ్రకూటపర్వతం వద్ద చూసాను
ఎదురుగా మోకాళ్లపై కూర్చొని
చేతులు జోడించి భక్తితో నమస్కరించాను
“రా భద్దా” అన్నారాయన
ఆ క్షణమే నా ధమ్మ దీక్షా స్వీకారం జరిగింది
తధాగతుడు ఇచ్చిన వస్త్రాన్ని ధరించిన భద్ధ
అన్ని బంధనాలనుంచి విముక్తమయింది.
.
నోట్స్
.
రాజగృహలో ఒక వడ్డీవ్యాపారస్తుని కుమార్తె బద్ద. ఒకరోజు పురవీధిలో మరణదండన విధించటానికి తీసుకొని వెళుతున్న ఒక దొంగను చూసి మనసుపారేసుకొని, అతనిని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పటంతో- భద్ధ తండ్రి తలారులకు భారీగా లంచాలిచ్చి ఆ దొంగను రహస్యంగా విడిపించి ఇంటిలోకి తీసుకొని వచ్చి, స్నానం చెయించి, అలంకరించి, కూతురు ముందు నిలబెట్టాడు. ఆ దొంగ పేరు సత్తుక. ఇంతచేసినప్పటికీ ఇతనిలో ఏ మార్పు రాక, భద్ధ ఒంటిపై ఉన్న నగలను ఎలా దొంగిలించాలా అని ఆలోచించసాగాడు.
మరణదండన నుండి తప్పించుకొన్నందుకు కొండదేవతకు మొక్కుకున్నానని, అది తీర్చుకొనటానికి వెళ్లాలని, బద్దను నమ్మించి ఆమెను ఒక పెద్దకొండపైకి తీసుకొనివెళ్ళాడు సత్తుక. అక్కడ ఆమె ఒంటిపైఉన్న నగలను దొంగిలించి ఆ కొండపైనుండి కిందకు తోసేసి చంపెయ్యాలని అతని పథకం. అతని పన్నాగాన్ని గ్రహించిన భద్ధ, మిమ్ములను చివరిసారిగా ఒకసారి కౌగిలించుకోవాలనిఉంది నా ఆఖరుకోర్కె తీర్చమని అని అడిగి, సత్తుకను కౌగిలించుకొని క్షణకాలంలో అతనిని ఆ కొండపైనుంచి తోసి చంపివేసింది. ఇంత జరిగిన తరువాత ఇంటికి వెళ్ళటానికి భద్ధకు మొఖం చెల్లక, శ్వేతాంబర జైనమతంలో చేరి సన్యాసిగా జీవనం ప్రారంభించింది. అప్పట్లో జైనమతం తీసుకోవాలంటే తలపై జుత్తును చేతితో పెకలించుకోవాలి. ఆ విధంగా చేయటంవలన కేశాలు చిక్కులు పడటంతో అప్పటినుండి భద్ధకు భద్ధ కుండలకేశ (Good one with curly hair) అనే పేరు వచ్చింది. ఈమె జైనబోధనలను మొక్కవోని దీక్షతో సంపూర్ణంగా అధ్యయనం చేసి దేశసంచారానికి బయలుదేరింది.
ఏదైనా ఊరు వెళితే అక్కడ ఒక ఖాళీ స్థలంలో ఒక నేరేడు కొమ్మను పాతి తనతో ఆధ్యాత్మికంగా వాదించేవారికొరకు ఎదురుచూసేది. ఆ ఊరిలో ఎవరైనా ఈమెతో వాదించాలనుకొంటే ఆ నేరేడు కొమ్మను తొలగించి, ఈమెతో వేదాంత చర్చ చేసేవారు. అలా ఈమె యాభై ఏండ్లపాటు ప్రాచీన ఉత్తరభారతదేశంలోని అనేక పట్టణాలు సంచరించి ఎందరినో తన వాదనాపటిమతో ఓడించి దిగ్విజయయాత్ర జరుపుతూ ఒకనాడు శ్రావస్తి వచ్చింది. అక్కడ బుద్ధుని శిష్యుడైన సారిపుత్త తో వాదనకు దిగింది. వీరిరువుతూ హోరాహోరిగా వేదాంత చర్చ చేసారు. సారిపుత్త జ్ఞానసంపత్తిని గ్రహించిన భద్ధకుండలకేశ అతనిని గురువుగా ఉండమని కోరింది. సారిపుత్త బుద్ధునివద్దకు వెళ్ళమని చెప్పటంతో, భద్ధకుండలకేశ గృధ్రకూటపర్వతంపై ఉన్న బుద్ధభగవానుని చేరి నమస్కరించగానే, ఆయన “రా బద్ధా” అన్నాడట. ఆ మాటే భద్ధ కు బుద్ధుడు నేరుగా ఇచ్చిన దీక్షగా పరిగణిస్తారు.

బొల్లోజు బాబా
Uploading: 5514503 of 5514503 bytes uploaded.


Sunday, September 29, 2024

సమకాలీన తెలుగు లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

ఈ వ్యాసాన్ని కవిసంధ్య స్వర్ణోత్సవసంచికలో ప్రచురించిన గురువుగారు, శిఖామణి కి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

బొల్లోజు బాబా


సమకాలీన తెలుగు లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

చాన్నాళ్ళ క్రితం ప్రముఖ విమర్శకులు శ్రీ సీతారాం "కావ్యసౌందర్యశాస్త్రం లేదా భారతీయ లాక్షణిక సిద్ధాంతాలు వినా, మనవీ అని చెప్పుకోదగిన సాహిత్య సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా?" అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీనికి ప్రముఖ విమర్శకులు శ్రీ లక్ష్మి నరసయ్య "దళిత, బహుజన, ముస్లిం వాద సాహిత్య దృక్పథాలు వాటికి సంబంధించిన ఈస్థటిక్స్ లాంటివి దేశీయ సాహిత్య సిద్ధాంతాలు" అన్నారు.
షేక్ పీర్ల మొహమ్మద్" ఏ సిద్దాంతానికైనా యూనివర్సల్ అప్పీల్ ఉండాలి కదా" అనే కోణాన్ని గుర్తుచేసారు.
సోషల్ మీడియాలో ఈ అంశంపై జరిగిన చర్చ చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు ప్రముఖ కవి శ్రీ ఇస్మాయిల్ సమకాలీన తెలుగు లాక్షణికుడిగా కనిపించారు.
***
1. Literary theory అంటే ఏమిటి?

Literary theory సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ఏమిటి? అని ప్రశ్నించి దానికి సమాధానాలు రాబడుతుంది. అంటె రసము, ఔచిత్యం, ధ్వని, Tension, Texture, Ambiguity లాంటి ఏ ప్రక్రియ వల్ల ఒక కవిత ఎలా గొప్పకవిత అయ్యిందో/అవ్వగలదో సిద్ధాంతీకరిస్తుంది. లిటరరీ సిద్ధాంతం అంటే సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి, సృజించటానికి ఉపయోగపడే ఆలోచనలు, పద్దతులు
Literary Criticism సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది, తూకంవేస్తుంది మంచి చెడ్డలు విడమరచి చెపుతుంది. ఈ విమర్శలో ఒక కవిత ఎందువల్ల మంచికవితో లేక అకవితో పై సిద్ధాంతాల ఆధారంగా నిరూపిస్తుంది. ఎక్కడ రసభంగం జరిగింది, ఎక్కడ ఔచిత్యదోషం ఉంది, ఉద్దేశించిన ధ్వనికి ఎలా అన్వయం కుదరలేదు అనే విషయాలను విపులీకరిస్తుంది.
Literary theory, Literary Criticism లు పరస్పరాధారితాలు. ముందు theory పుడుతుంది, దానికనుగుణంగా విమర్శ జరుగుతుంది. ఉదాహరణకు సాహిత్యమనేది ఒక సాంఘిక కార్యక్రమమని, కవి సామాజిక మార్పుకు దోహదపడాలనే మార్క్సిజసిద్ధాంతం మొదటగా పుట్టింది. ఆ సిద్దాంతాన్ని ఉపయోగించుకొని ఒక కవితలో "సామాజిక ప్రయోజనం" ఏమేరకు ఉంది అంటూ విమర్శ సాగుతుంది. అలాగన్నమాట.
నిజానికి ఈ సిద్ధాంతకర్తకు, విమర్శకుడి కన్నా ముందు సృజనకారుడు అనే వాడు ఒకడుంటాడు. వాడికీ గొడవలేమీ పట్టవు. వాడిమానాన వాడు రాసుకొంటూ పోతాడు. వాడు రాసినవాటిలోంచే ఈ సిద్దాంతాలు, విమర్శలు పుట్టుకొస్తాయి.
***
2. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలు

సాహిత్యం ఎలా ఉండాలి ఏవేం అంశాల వలన ఒక రచన సాహిత్యవిలువలను పొందుతుంది అనే విషయాలను లోతుగా శోధించి, కొన్ని ప్రతిపాదనలను చేసారు మన పూర్వీకులు. ప్రాచీన భారతీయ సిద్ధాంతాలలో ప్రధానంగా అలాంటివి ఆరింటిని గుర్తించవచ్చు

• భరతుని రస సిద్ధాంతం: రసాత్మకమైనదే కావ్యమని ప్రతిపాదిస్తుంది.
• భామహుని అలంకార సిద్ధాంతం: కావ్యానికి అలంకారాలు ప్రధానం అంటుంది
• వామనుడి రీతి సిద్ధాంతం: మంచి కావ్యానికి మంచి గుణాలుండాలంటుంది.
• ఆనందవర్ధనుని ధ్వని సిద్ధాంతం: వాచ్యంగా చెప్పిన విషయం కన్నా చెప్పకుండా వదిలేసిన విషయం ప్రధానమంటుంది.
• కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం: వక్రోక్తి అంటే అలంకారములతో నర్మగర్భంగా చెప్పటం. ఇది ఆనందవర్ధనుని ధ్వనిని పోలి ఉంటుంది.
• క్షేమేంద్రుని ఔచిత్య సిద్ధాంతం: ఏది దేనికి తగి ఉంటుందో దాన్ని ఔచిత్యం అంటారు. కావ్యానికి ఔచిత్యం ఉండాలంటుందీ సిద్దాంతం.

ఇరవయ్యోశతాబ్దంలో పాశ్చాత్య Literary theory లలో అనేక దృక్పథాలు ప్రవేశించి Literary criticism ను నడిపించాయి. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలకు పాశ్చాత్య సిద్ధాంతాలకు పొంతన ఉండదు. భారతీయ, పాశ్చాత్య సంస్కృతులు పూర్తిగా భిన్నమైనవి కనుక ఈ రెండిటి మధ్య పోలికలు తేవటం దాదాపు అసాధ్యం.

మొదట్లో అరిస్టాటిల్ లాంటివారు జీవితాన్ని అనుకరించేదే కళ అన్నారు. తరువాత మిల్టన్ కాలంలో చందస్సును అనుసరించి చెప్పటమే సాహిత్యం అన్నారు కాల్పనికతే (romanticism) సాహిత్యమని షెల్లీ, కీట్స్ కవిత్వం చెప్పింది.

3. ఆధునిక సిద్ధాంతాలు
• అభ్యుదయ, సామాజిక ప్రయోజనం కలిగి ఉండటం (మార్క్సిస్ట్ సిద్ధాంతం)
• భిన్నత్వాలను celebrate చేస్తూ చరిత్రను నిరాకరించటం ద్వారా స్వీయ అస్తిత్వాన్ని ప్రకటించుకోవటం (పోస్ట్ మోడర్న్)
• మనో వైజ్ఞానిక అంశాలను పొదువుకోవటం (ఫ్రాయిడియన్)
• స్త్రీవాద (gender and Queer theories)
• సాంస్కృతిక వైవిధ్యాలను ప్రతిబింబించటం (Cultural theory)
• పాఠంలోనే అన్ని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Structuralism)
• పాఠం వెలుపల సోషల్ పొలిటికల్, హిస్టారికల్ కారణాల వల్ల చాలా కనిపించని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Post structuralism)
• రచనలో బహుళార్ధాలను వెతకటం (Deconstruction)
• వలసపాలనానంతర ప్రభావం (Post Colonial)-- లాంటి రకరకాల లిటరరీ సిద్ధాంతాలు సాహిత్యంలో "సాహిత్యసంబంధి" ఏదో తేల్చి చెప్పటం కొరకు ప్రతిపాదించబడ్డాయి. ఒక్కోక్కటీ అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో సాగుతాయి.

పైన చెప్పిన ఆధునిక లిటరరీ థీరీలను గమనిస్తే, భారతదేశానికి సంబంధించి ఎప్పుడో వందల సంవత్సరాలక్రితం ఏర్పరచిన లాక్షణిక సిద్ధాంతాలే తప్ప ఆధునిక కాలంలో మనం సృష్టించుకొన్న ఆధునిక దేశీయ సాహిత్య సిద్ధాంతాలు ఏమున్నాయి అని ప్రశ్నించుకోవటం సందర్భోచితమే కాదు అవసరం కూడా. ఆమేరకు లక్ష్మి నరసయ్య గారు చెప్పిన దళిత,బహుజన ఈస్థటిక్స్ కొంతమేరకు ఆ లోటును తీర్చిందని భావించవచ్చు.

మన తరంలో తెలుగులో అంత స్పష్టంగా కవిత్వానికి చక్కని నిర్వచనాన్ని, అసలు ఏది కవిత్వం అన్నదానికి సమాధానాన్ని, కవిత్వపు పరిధులు, బలహీనతలను విస్పష్టంగా చెప్పిన ఒక సిద్ధాంతకర్తగా శ్రీ ఇస్మాయిల్ కనిపిస్తారు. ఈయన వెలిబుచ్చిన అభిప్రాయాలపై పాశ్చాత్యప్రభావం లేదని చెప్పలేం అయినప్పటికీ ఇస్మాయిల్ గారి అభిప్రాయాలు స్వతంత్రంగా, స్థానీయంగా ఉండటం గమనించవచ్చు.

4. సమకాలీన లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్

తెలుగుకు సంబంధించినంత వరకూ కవిత్వాన్ని నిర్వచించి, కొన్ని లక్షణాలను ప్రతిపాదించిన ఆధునిక కవులలో ఇస్మాయిల్ కనిపిస్తారు. నేనొక లాక్షణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాను అని ఆయన ఎక్కడా చెప్పుకోకపోయినా ఆయన వదిలివెళ్ళిన ప్రతిపాదనలు, చేసిన చర్చలు, వాదప్రతివాదనలను ఈ రోజు మనముందే ఉన్నాయి. వాటి ద్వారా, ఇస్మాయిల్ తనజీవితకాలమంతా తపస్సుచేసి ఆధునిక కవిత్వంలోని "సాహిత్యసంబంధి" లక్షణాలను నిర్వచించారని, కవిత్వాన్ని విశ్లేషించటానికి కావాల్సిన పనిముట్లను గుర్తించారని తెలుసుకోవచ్చు.


ఒక లాక్షణికుడిగా ఇస్మాయిల్ చేసిన ప్రతిపాదనలు

1. కవిత్వంలో నిశ్శబ్దం:
మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని. అనుభూతి సామాన్య భాషకు అందదు. ఆ అనిర్వచనీయమైన ఆ నిశ్శబ్దాన్ని వాక్యాలలోకి ప్రవేశపెట్టటమే కవిత్వ లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే. (ఇది కొంతమేరకు ధ్వని సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. శబ్దం అంటే ఒక కవితలో పైకి చెపుతున్న విషయంగాను, నిశ్శబ్దం అంటే అన్యాపదేశంగా చెపుతున్న లేదా చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంచిన విషయంగాను అర్ధం చేసుకోవాలి)

2. కవిత్వం హృదయ సంబంధి:
కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు. దాని సామ్రాజ్యమే వేరు. కవిత్వానికి "కరుణ ముఖ్యం".
అసలు సృజనాత్మకతకి మూలమేమిటి? కవి యొక్క దర్శనం (vision). ఇది పూర్తిగా వైయక్తికమైనది. ఏ కవి దర్శనం వానిది. దీన్నించే అతని కవిత్వం ఉద్భవిస్తుంది. కనక, కవి నిబద్ధుడై ఉండవలసింది తన సొంత దర్శనానికే!
కవిత్వం తల్లివేరు కవి అంతర్లోకమూ, బహిర్లోకమూ కలిసేచోట తన్ని ఉంటుంది.

3. కవిత్వం చేసే పని చదువరి మనస్సులో దీపం వెలిగించడం:
కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.
“కళ కళ కోసమే” అనే వాదనా, “కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసం” అనే వాదనా – రెండూ అతి వాదాలే! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు. ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది. ఇది గుర్తించడం ముఖ్యం. ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ, తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం (emotional adjustment) సాధించటమూ – అనాది నుంచీ కళా ప్రయోజనమని ఇస్మాయిల్ గారి ప్రతిపాదన.

4. భాషని శుభ్రపరచటం:
నేను (ఇస్మాయిల్) కవిత్వంలో ఒక ముఖ్యమైన పని చేయడానికి పూనుకున్నాను. భాషని శుభ్రపరచడానికి ప్రయత్నించాను. చాలా మాటలకు మాసిన రంగులు, పాత వాసనలు ఉంటాయి. అలాంటి మాటల్ని కవిత్వంలో వాడలేదు. పాత కావ్యాల్లోనివి, పురాణాల్లోని పదాలు, సమాసాలు, పేర్లూ, కథలూ నా కవిత్వం జోలికి రాకుండా జాగ్రత్తపడ్డాను. నా స్వంతమైన, సరికొత్త అనుభవాల్ని వ్యక్తపరచటానికి, వ్యావహారికప్రపంచంలోని సరికొత్త మాటల్నే కోసుకొచ్చి వాడుకున్నాను.

5. కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు:
కవిత్వానికి లేబిల్స్ అంటించడం నాకిష్టం ఉండదు. ఆలోచన నుంచి తప్పించుకొనే మార్గాలు లేబిల్స్. అర్థం చేసుకొనే కష్టానికి పాల్పడకుండా, తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి లేబిల్స్ ఉపయోగిస్తారు. ‘బూర్జువా, శ్రామికవర్గం, రివిజనిస్టు లాంటి లేబిల్స్ అంటించి ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేయవచ్చు.
***

పైన చెప్పిన అయిదు పాయింట్లు ఆధునిక కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి దోహదపడే అంశాలు. పై అయిదు పాయింట్లు స్వేచ్ఛాప్రతిపాదనలు.

కవిత్వంలో నిశ్శబ్దం అనే ప్రతిపాదనకు ధ్వనిసిద్ధాంతం మూలాలు కనిపిస్తున్నా, చెప్పిన విధానం కొత్తది.

కవిత్వం హృదయసంబంధి అన్నటువంటి మాట emotions recollected in tranquility అన్న మాటకు దగ్గరగా అనిపించవచ్చు. కవిత్వం పూర్తిగా వైయక్తికఅనుభవంగా, దర్శనంగా ఆమేరకు తన సృజనను కొనసాగించటం ఇస్మాయిల్ నిబద్దతగా భావించాలి. సాహిత్యప్రయోజనం ఆనందోపదేశాలు అని మనవాళ్లు, పాశ్చాత్యులు అంగీకరించారు. ఆ మాటకు భిన్నంగా కవిత్వం చదువరి మనస్సులో దీపం వెలిగించడం అనటం నవ్యమైన ప్రతిపాదన

అదే విధంగా భాషను శుభ్రపరచటం తెలుగుకు మాత్రమే అన్వయించబడే ఒక విషయంగా భావించవచ్చు. ఈ ప్రతిపాదనకు మూలాలు వాడుకభాషోద్యమంలో ఉంటాయి. అలాంటి క్లిష్టపదాలను వాడటం గురించి, డెడ్ మెటఫర్లను ఒదిలించుకోవటం గురించి ఈ ప్రతిపాదన మాట్లాడుతుంది.

కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు అన్నటువంటి ప్రతిపాదనకూడా పూర్తిగా ఆధునికమైనదే. కామెడిలని, ట్రాజెడీలని సాహిత్యాన్ని లేబ్లింగ్ చేసే పద్దతి పాశ్చాత్యులది. దేశీయమైన ప్రాచీన సాహిత్యంలో ఈ పద్దతిలేదు. ఒక కావ్యం జీవితసామస్త్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఉండటంచే లేబ్లింగ్ అవసరపడలేదు భారతీయ లక్షణకారులకు. ఆధునిక కాలంలో కవిత్వాలకు వేసే లేబ్లింగ్ వలన జరిగే నష్టం గురించి మాట్లాడటం కూడా "సాహిత్య సంబంధి" కి లేబుల్స్ తో పనిలేదు అని చెప్పటమే.
.
ఈ అయిదు ప్రతిపాదనలతో కూడిన "Ismayil Literary theory" సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ని నిర్వచిస్తుంది.

బొల్లోజు బాబా





Monday, September 16, 2024

కవిత్వంలో అస్పష్టత - సంక్లిష్టత


‘‘కవిత్వమనేది
ఆత్మలోకంలో ఇద్దరి సంభాషణ
అది
స్వగతమూ కాదు
ఊదరగొట్టే ఉపన్యాసం
అంతకంటే కాదూ’’

కవిత్వం ఒక సామాజిక వ్యవహారం. నా ఆత్మతృప్తికోసం వ్రాసుకొంటాను అనటం ఒక హిపొక్రిసి. ఒక ఊహకు అక్షరరూపమివ్వగానే అది రచన అయిపోదు. దాన్ని మరొకరు చదివినప్పుడే అవుతుంది. కవికి కలిగిన ఊహను అదే స్థాయిలో పాఠకునిలో ప్రవేశపెట్టినపుడు ఏ పేచీ ఉండదు. కవిచేసిన కల్పనను పాఠకులు అందుకోలేకపోతే ఆ కవిత అస్పష్టంగా (Obscurity) ఉందని అర్ధం. అలా కాక పాఠకుడి కొంత శ్రమించి అందులో ఉన్న గూఢార్ధాన్ని విప్పుకొని ఆనందించినపుడు ఆ కవిత సంక్లిష్టంగా (Difficulty/Complexity)) ఉందని భావించాలి.

ఒక కవిత అర్ధం కాకపోవటానికి అనేక కారణాలుంటాయి. ‘‘పాఠకులే నా స్థాయికి ఎదిగి కవితను అర్ధం చేసుకోవాలని’’ కవి కోరుకోవటం సహజమైనా అదంత మర్యాదకరమైన వాదన కాదు. తన కవిత్వంలో తనకు తెలియకుండా దొర్లిన లోపాలను పరిశీలించుకోవటం అవసరం.
స్పష్టాస్పష్టంగా ఉండటం కూడా ఒక కవిత్వ లక్షణమే అయినప్పటికీ హద్దులు దాటకుండా చూడటం కవి బాధ్యత. కొన్ని కవితలు పూర్తిగా అర్ధమవ్వకపోయినా ఏదో అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించటం చేస్తాయి. దానికి కారణం ఆ కవితలలో కవి వాడిన ట్రోప్స్‌ చేసే మాయ అనుకోవచ్చు.

కవి భావం పాఠకునికి అందకపోవటాన్ని అస్పష్టతగా నిర్వచించు కొనవచ్చును.
రమణీయార్ధ ప్రతిపాదనే కవిత్వం అన్నారు ప్రాచీనులు. వివిధ రకాలైన శబ్ద, అర్ధ కావ్యదోషాలను ప్రతిపాదించి కావ్యం రమణీయంగా, స్పష్టమైన అర్ధం కలిగి ఉండేలా శాసించారు. ఆధునిక కవిత్వం ఆ శృంఖలాలను ఛేదించుకొంది. ఇది యుగధర్మం.

ఒకప్పుడు కవిత్వం ఏదో ఒక కథతో ముడిపడి ఉండేది. నేడు కవిత్వం నుండి కథ వేరుపడి స్వతంత్రంగా ప్రయాణిస్తున్నది. కవిత్వం అనేది ఒక సంపూర్ణమైన కథను కాక భావాలను, అనుభూతులను మాత్రమే వ్యక్తీకరించే సాధనంగా మారింది.

ఈ నేపథ్యంలో- జీవితం నుంచి వస్తువును తీసుకొని మూర్త వర్ణణలతో వ్రాసిన కవిత్వం సులభంగా అర్ధమౌతుంది. కుందుర్తి, తిలక్‌, శేషేంద్ర శర్మ, శిఖామణి, శివారెడ్డి, ఇస్మాయిల్‌ లాంటి కవులు ఆ కోవకు చెందిన కవిత్వాన్ని వ్రాసారు. అలాకాక అమూర్త/నైరూప్య భావాలద్వారా కవిత్వం చెప్పినప్పుడు భావప్రసరణలో కొంత సంక్లిష్టత ఏర్పడుతుంది.

ఎందుకంటే ఇక్కడ కవి వాడే ప్రతీకలు, ఉపమానాలు, భాష, చేసే ప్రయోగాల వల్ల అభివ్యక్తి జటిలమౌతుంది. ఆరుద్ర, మో, సిద్దార్థ, ఎమ్మెస్‌ నాయుడు, ఎమ్మెస్‌ సూర్యనారాయణ, అనంతు లాంటి కవుల కవిత్వం ఈ బాపతు.

కవిత్వంలో కనిపించే అస్పష్టతను - భాషాపరమైన అస్పష్టత, వస్తుపరమైన అస్పష్టత, భావపరమైన అస్పష్టతలుగా పరిశోధకులు విభజించారు.

నువ్వు దగ్గరుంటే
కోటినక్షత్రాల వెలుగునౌతాను
నువ్వు దూరమైతే
తోకచుక్కలా నేల రాల్తాను `` అంటూ తన ప్రేయసిని గురించి వర్ణించాడో యువకవి. ఇది చదివిన పాఠకుడు అయోమయానికి గురవుతాడు ఎందుకంటే తోకచుక్కలు నేల రాలవు, ఉల్కలు రాల్తాయి. పాపం ఆ యువకవికి తోకచుక్కలకు, ఉల్కలకు భేధం తెలియక చక్కని అనుభూతిని పాడుచేసాడు. ఇది భాషాగతమైన అస్పష్టత.

కవిత్వంలో అస్పష్టతను గురించి మాట్లాడుకొనేపుడు వేగుంట మోహన ప్రసాద్‌ ప్రస్తావన రాక మానదు. మో అధివాస్తవిక కవిత్వానికి చిరునామ.

రెబెకా
ప్రజాపతి ఉరుముతాడు
ఐవీ శంపాలత క్రీపర్‌ మెరుస్తుంది
ఇసిరిస్‌ వినాయకుడు చెర్లో మునుగుతాడు
కప్ప తల్లి పెళ్ళి అయిపోతుంది
బతకమ్మ పండగ చేసుకుంటాం
నీ ప్రప్రధమ అధమాధమ ప్రేయసి
చాటల్ని పంచుతుంది
కదలని అకతా నదిలో
ఆత్మకు లంగరు వేస్తాం
అక్షరం క్షయమవుతుంది
ఆత్మ శరీరమవుతుంది (రహస్తంత్రి - వేగుంట మోహన ప్రసాద్‌)

ఇది ఒక పూర్తి కవిత. క్రింద ఇచ్చిన ఫుట్‌ నోట్సులో రెబెకా అంటే Daphne Du Maurier నవల అని, ఇసిరిస్‌ అంటే ఇలియట్‌ ‘వేస్ట్‌ లాండ్‌’ లో ఫెర్టిలిటీ గాడ్‌ అని ఇంకా ఇ.ఎం.ఫార్‌ స్టర్‌ తన నవలలో ఉపయోగించిన ‘కనక్ట్‌’ థీరీ ఈ కవితలో వాడాను అని చెప్తాడు కవి. ఇవేవీ కవితను అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం సహాయపడవు సరికదా మరింత క్లిష్టతరం చేస్తాయి. కవితా వస్తువు అంతుచిక్కదు. కవితమొత్తం ఒక ఆత్మాశ్రయ అంతర్ముఖత్వ మేధావితన ప్రకటనలా అనిపిస్తుంది. వస్తుపరమైన అస్పష్టతకు రెబెకా ఉదాహరణగా నిలుస్తుంది. అయినప్పటికీ కవితలో మెరిసే విభ్రమ ఆకట్టుకొంటుంది. విభ్రమను కావ్యలక్షణంగా ప్రాచీనులు గుర్తించారు. ‘‘తిక్కగా ఉన్నా కవిత్వం ఉంటే క్షమిస్తాం’’ అని మో గురించి ఇందుకే అన్నాడేమో చేరా.

“To be or not to be” షేక్స్‌పియర్‌ హామ్లెట్‌ స్వగతం లోని ప్రసిద్ధ వాక్యం. ఒక డోలాయమాన మానసిక స్థితిని అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది.

ఆలూరి బైరాగి ‘‘హామ్లెట్‌ స్వగతం’’ కవిత ఇలా మొదలౌతుంది
తీగలు త్రెంచిన తుఫాను తగ్గిన తరువాత నేడు
తెలుస్తున్నది విధ్వంసపు టడుగుజాడల రాలుటాకుల పూల మధ్య
వేసిన ప్రశ్న ఒప్పైన ప్రత్యుత్తరం తప్పేనని
ప్రత్యుత్తరం తప్పైతే వేసిన ప్రశ్న తప్పేనని
వానకు తడిసి ఎండకెండి చేరుకొన్నది నావ నేడు తీరాన్ని
పగిలి చెదిరి చిద్రుపలై మునిగి దూరపారాన్ని
యిప్పుడిరక పగమరచిన సెగలారిన చీకటిలో
నీడల నటన బాధించదు ఇంద్రియాలను
ఆవేశం అలసటగా, చైతన్యం వేడిలేని వెలుతురుగా,
కలగా, అలగా, ఒక తీయని జలగా మారిన ఈ వేళలందు
తెలుస్తున్నది చావు బ్రతుకులిక్కడ లెక్కకు రావని
లెక్కకు వచ్చేవిచ్చట ఒక చూపని,
ఒక నవ్వని, ఒక కిరణం, ఒక పూవని,
తెలుస్తున్నది//......... అంటూ ఒక ప్రవాహగతిలో సాగిపోతుంది కవిత.

తీగలు తెంచిన తుఫాను అన్న ఊహే బుద్దికి అందదు. ఏం ప్రశ్నో, ఎవరు వేశారో అర్ధం కాదు. ఒక వేళ టుబి ఆర్‌ నాటుబి ప్రశ్నే అనుకొన్నా ఆ ప్రశ్నెందుకు తప్పో, జవాబెందుకు తప్పవుతుందో అర్ధం కాదు. నీడల నటన, అలసట చెందే ఆవేశం, వేడిలేని వెలుతురు చైతన్యం, లెక్కకు వచ్చే చూపు- లాంటి అమూర్తభావనలు కవితను అర్ధం చేసుకోవటంలో అడ్డుతగుల్తాయి. మొత్తం కవితలో వేదనలాంటి అనుభూతి స్పష్టాస్పష్టంగా తెలుస్తూంటుంది తప్ప విషయం అర్ధం కాదు. దీన్ని భావపరమైన అస్పష్టతగా భావించవచ్చు.

ఎమ్మెస్‌ నాయుడు తెలుగు సాహిత్య రంగంలో పేర్గాంచిన కవి. ‘‘ఒక వెళ్లిపోయాను’’ కవితా సంకలనంతో అలజడి రేపి తనని తాను నిరూపించుకొన్న భావుకుడు. ‘గాలి అద్దం’ ఇతని రెండవ సంపుటి. నాయుడు కవిత్వంలో అద్బుతమైన పదచిత్రాలు ఉంటాయి. ఒక మత్తులోకి లాక్కెళ్తాయి. భావం కనపడీ కనపడకుండా దోబూచులాడి నేను చెప్పేది ఇంతవరకే ఆపై నీ ఊహకు పనిపెట్టుకో అంటూ అదృశ్యమైపోతూంటుంది.

ఆధునిక జీవితంలో ఎన్ని అసంగతాలు, మార్మికతలు, అస్ఫష్టతలూ ఉన్నాయో అన్నీ ఇతని కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. చెప్పేది ఎంతైతె ఉంటుందో చెప్పనిదీ రెట్టింపు ఉంటుంది.

(( మరల తల ))
ముఖమొహ్హటే
చలామణి గారడి
చలనం చలచలన
మరో మర
మరల తల
తాటకతై
మోహ మొహాల దడబడ
నయన ఖార్ఖానాలో మకమక
దాటని కన్నీటి పొలిమేర
ఆలోచనల పశువు
చిద్విలాస సంఘర్షణలో
దిగంబరై `` (ఎమ్మెస్‌ నాయుడు).

కవితా శీర్షికే తిరకాసుగా ఉంది. ఇక లోపలకు వెళితే పదాలను ఓ డబ్బాలో వేసి తిప్పి తిప్పి పేపరుపై బోర్లించినట్లు అనిపిస్తుంది.

బి.ఎస్‌.ఎం కుమార్‌ కవిత్వం మరీ అరాచకంలా అనిపిస్తుంది. అస్పష్టతకు మించిన పేరేదైనా ఉంటే సరిగ్గా సరిపోతుంది. ఆయన ఒక కవితలో కొంతభాగం ఇది. (పూర్తికవితలు కూడా ఇలానే ఉన్నాయి)

//తరగని నడకల్ని వేలాడేసిన సమయాన్ని పీలుస్తూ
రాత్రి మెల్లగా కూల్చే సంభాషణ
ఇద్దరమూ ఎదురుగానే కూర్చున్నాం
తన గాజు బిందువుల్ని నా తలమీదుగా ఒదులుతూ
అరచేతులు కలగనే కన్నీళ్లు బయటపడని రోడ్డు పగులుతూ.... (పేజి.నం: 3 నిఘాలు, వృత్తాలూ, వెల్తురారిన కళ్లు)

కుమార్‌ మంచి ప్రతిభాశాలి భాషాపటిమా, నూత్నపదబంధాల్ని సృష్టించగలిగే శక్తి కలిగినవాడు. అయినప్పటికీ పదానికి పదానికి పొంతన కానీ, వాక్యానికి వాక్యానికీ మధ్య ఒక క్రమం కానీ, భావానికి భావానికి మధ్య ఒక అన్వయం కానీ ఉండదు ఇతని కవిత్వంలో. ప్రముఖ విమర్శకుడు శ్రీ తమ్మినేని యదుకుల భూషణ్‌ అన్నట్లు ‘‘కవిత వ్రాయటం పూర్తయింది, ఇక అర్ధం చేసుకోవటమే మిగిలుంది’’ అనుకోవాలి.

నేడు వస్తువినిమయ ధోరణులు, ఉపాధులు విచ్ఛిన్నం కావటం, జీవికకోసం వలసలు తప్పని సరి అవ్వటం, రాజకీయ అవినీతి పెచ్చరిల్లటం లాంటి సాంస్కృతిక సామాజిక మార్పులు అనేకం చోటుచేసుకోవటం వల్ల జీవనం సంక్లిష్టమైపోయింది. ఆధునిక కవులు వైయక్తికమైన తమ విరక్తిని, అసంతృప్తిని, బాధను వ్యక్తీకరించటానికి చేసే ప్రయత్నంలో జీవితంలోని అస్పష్టత కవిత్వంలోకి వచ్చి చేరింది.

కవి మానసిక సంక్షోభం, అతి ప్రతీకాత్మకత, భావాలను నియంత్రించలేక పోవటం, మితిమీరిన నైరూప్య భావచిత్రణ మొదలగునవి కవిత్వంలో అస్పష్టతకు కారణాలుగా చెప్పుకోవచ్చు.
కవిత్వంలో అవిచ్ఛిన్నత, అసంబద్దత పోస్ట్‌మోడర్న్‌ లక్షణాలుగా చెపుతారు. అలాంటి కవిత్వం సామాన్య పాఠకునికి అస్పష్టంగా ఉంటుందని యువకవులు గుర్తించాలి.
****
కొంతమంది పాఠకులు కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు. కవిత్వం అంటే న్యూస్‌ పేపర్‌ కథనంలా సుభోధకంగా ఉండాలని భావిస్తారు. ఇలాంటి వారికి కవితలోని ‘కవిత్వభాష’ అర్ధం కాక ఆ కవిత అస్పష్టంగా ఉందని ఆరోపిస్తారు. నిజానికి అది అస్పష్టత కాదు సంక్లిష్టత. ఒకే కవితలో విభిన్న ఆలోచనలను, కోణాలను, సన్నివేశాలను చొప్పించటం సంక్లిష్టతకు దారి తీస్తుంది. అలాంటి కవిత్వాన్ని పొరలు పొరలుగా విప్పుకొని చదువుకొన్నప్పుడు రససిద్ధి కలుగుతుంది. వాక్యాల మధ్య అర్ధాలను వెతుక్కొని, కలుపుకొని హృదయగతం చేసుకొన్నప్పుడు ఆ కవిత తాలూకు సంపూర్ణ చిత్రం ఏర్పడుతుంది. కవి ఉద్దేశించిన భావాలు అవగతమౌతాయి. ఒక పజిల్‌ ను విప్పుకొన్నప్పుడు కలిగినటువంటి ఆనందం కలుగుతుంది.

ఒక కవి ఎంతో శ్రమించి కవిత్వాన్ని సృజించినపుడు, పాఠకులు కూడా కొంత శ్రమించి ఆ కవితాఫలాన్ని అందుకోవటం వారి బాధ్యత. అలాంటి పాఠకులే కవిత్వానికి సహృదయులు. ఈ ప్రక్రియలో ఒక రచనలోని మంచి చెడ్డలను విశ్లేషించే విమర్శకుల పాత్రకూడా ముఖ్యమైనది.
కవి ఊహలను అందుకోవటానికి ఒక పాఠకుడు ఏమేరకు శ్రమించాలో, చెల్లి సురేంద్రదేవ్‌ వ్రాసిన ‘‘ ఎంగిలి బిర్యాని చేతులు’’ అనే కవితను ఉదాహరణగా తీసుకొని పరిశీలిద్దాం.

ఈ కవిత కావేరి జలవివాదం గురించి. దీనిలో అతని సామాజిక దృక్ఫథం, రాజకీయ అవగాహన, కవిత్వతత్వం స్పష్టంగా వ్యక్తమవటం గమనించవచ్చు. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో ప్రవహించే కావేరి జలాల పంపకం ఇరురాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. తమిళనాడు దిగువ రాష్ట్రం కనుక కర్ణాటక విడుదల చేస్తేనే నీరు పొందే పరిస్థితి. దీన్ని నేపథ్యంగా తీసుకొని వ్రాసిన ఒక కవితలో, కావేరి నదికి తమిళులకు మధ్య ఉన్న చారిత్రిక, ఐతిహాసిక అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు సురేంద్ర.

ఎంగిలి బిర్యానీ చేతులు

ఎవడో గిట్టనివాడు
మన గడ్డివాములపైన
పూరిగుడెసెల పైన
లంకచుట్ట విసిరినట్లు
ఈ రెండు రాష్ట్రాల నడుమ
ఏ ఫారిన్‌ సిగరెట్‌ చిచ్చుపెట్టిందో
బెంగుళూరు నడిబడ్డున తగలబడిపోయిన
వాహనాల అస్తికలను పశ్చిమవాహిని లో
ఎవరు కలుపుతారో?

ఎంగిలి బిర్యానీ చేతులు అనే కవితా శీర్షిక- కావేరి వివాదం కారణంగా కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న దాడులు అన్నీ రాజకీయ ప్రేరేపితమని, కవి తీసుకొన్న స్టాండ్‌ ని ముందే బలంగా వ్యక్తీకరిస్తుంది.

తమిళనాడులోని శ్రీరంగపట్నం వద్ద ప్రవహించే కావేరినదిని పశ్చిమ వాహిని అంటారు. దీన్ని దక్షిణ గంగగా భావించి పితృదేవతలకు తర్పణం విడువడం అనాదిగా ఆ నాటలో ఒక ఆచారం. సురేంద్ర పై కవితా వాక్యాలలో బెంగళూరులో తగులబడిన అస్తికలు తమిళులవని అన్యాపదేశంగా చెపుతున్నాడు.

చోళరాజు కంఠమండు నీటి కొరకు
అగస్త్య మహర్షిని ప్రార్ధిస్తే
జంభాపతి దేవత
వెనవా తీర్థ విళక్కువా...!
అంటూ స్వాగతించిన కావేరి నది...
గుర్తుచేస్తున్నాడు కవి.
తన రాజ్యంలోని ప్రజలు నీరులేక కరువులతో అల్లాడుతున్నప్పుడు కంఠమాన్‌ అనే తమిళ చోళ రాజు తన సమకాలీనుడైన అగస్త్య మహామునిని వేడుకొన్నాడట. అపుడు అగస్త్యుడు తన కమండలం నుంచి నీరును నేలపై చల్లగా కావేరి నది ఏర్పడిరదని, ఆ నదిని జంభాపతి అనే దేవత ‘‘ఈ రాజ్య ప్రజల దాహాన్ని తీర్చే కాంతిపుంజం’’ గా ఆహ్వానించినట్లు - ఒక తమిళ ఇతిహాసం చెపుతుంది.

పై ఖండికల ద్వారా తమిళుల సంస్కృతి, చరిత్రలలో కావేరినది ఒక భాగంగా ఎప్పటినుంచి ఉన్నదో స్పష్టపరుస్తున్నాడు కవి.

/నాడు తైత్తరీయ ఉపనిషద్‌ లో ‘‘అన్నం బహు కుర్వీత’’
అంటూ కావేరిని కీర్తించారు
నేడు
శ్రీరంగనాథలో ఎండిన కావేరినదిని చూడు
ఇప్పటికైనా సిగ్గేస్తుందా...?

భారతీయులకు నది అంటే దైవం. ఆవిషయాన్ని మన పూర్వీకులు ఏనాడో గుర్తించి తైత్తరీయ ఉపనిషద్‌ లో నదీ వనరుల్ని ప్రస్తావిస్తూ let us share, let us produce and share”అన్నారు. కానీ ఈరోజు పంచుకోవటానికి ఇన్ని యుద్ధాలా అన్న సూటి ప్రశ్న ఆలోచింపచేస్తుంది.
కర్నాటిక్‌ సంగీత విద్వాంసులు

త్యాగరాజు... ముత్తుస్వామి దీక్షితార్‌..
శ్యామశాస్త్రి
ఈ నీళ్ళు త్రాగిన వాళ్ళే//
ఎక్కడో కొడగు కనుమలలో జన్మించి
తమిళుల దాహార్తిని తీరుస్తూ
పుదుచ్చేరి తీరానా పూమ్బుహార్‌ లో
కావేరి బంగాళాఖాతంలో కలిసిపోతుంది
పెట్రోల్‌ బాంబ్స్‌ వేసిన ఎంగిలి బిర్యానీ చేతులకు
కనీసం ఇదైనా తెలిసిందా!
‘బిలగుండ్లు’ భద్రంగా ఉండాలి. /

తమిళనాట స్థిరపడిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రిలను కర్ణాటక సంగీతానికి కావేరినది అందించిన కానుకలు. వీరు కావేరిఒడ్డున నివసిస్తూ, అనేక కీర్తనలలో కావేరిని స్తుతించారు.

కావేరి నది కర్ణాటకలో పుట్టి, తమిళనాడులో ప్రవహించి, పుదుచ్చేరి వద్ద సముద్రంలో కలుస్తోన్నదనే సంగతైనా కనీసం ఈ అలజడులు చేస్తున్న వారికి తెలుసా- ఇది మూడు రాష్ట్రాల ఉమ్మడి సొత్తని ప్రశ్నిస్తున్నాడు కవి.

తమిళుల పక్షాన నిలబడి ఇంత గొప్పగా చెప్పిన కవి చివరలో కర్ణాటకకు ఒక హెచ్చరిక కూడా చేస్తాడు ‘‘బిలగుండ్లు భద్రం గా ఉండాలి’’ అని.

బిలగుండ్లు అనేది కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతం. అక్కడ తమిళనాడుకు ఎంతనీరు వస్తుందో నీటిపారుదల నిపుణులు బొట్టు బొట్టు లెక్కిస్తారు. బిలగుండ్లు జోలికి వస్తే ఊరుకోమన్న హెచ్చరిక ఆఖరి వాక్యంలో ధ్వనిస్తుంది.

అనేక మంది చారిత్రిక వ్యక్తులు, సంఘటనలు, ఉటంకింపులతో కవిత రాయాలంటే ఆయా అంశాలపట్ల కవి రీసెర్చ్‌ చేయాలి. చదవాలి, అవగాహన పెంచుకోవాలి. తనదైన వ్యాఖ్యానం చేయగలగాలి. ఇవన్నీ పై కవితలో కనిపిస్తాయి. యధాలాపంగా చదివితే ఇలాంటి కవితలు అర్ధం కావు. అలాగని అస్ఫష్టత ఉందని కాదు. ఇది సంక్లిష్టత. కవిత్వంలో సంక్లిష్టతను విప్పుకోవాలంటే పాఠకుడు కొంచెం శ్రమించాలి. కవి స్థాయిని అందుకోవటానికి ప్రయత్నించాలి.

పై కవితలో కవిత్వాంశ ఎక్కడ ఉంది అనే అనుమానం కలగవచ్చు. కావేరి అల్లర్లను ‘‘ఎంగిలి బిర్యాని చేతులు’’ అనటం లోనే ఉంది. నేడు సమాజంలో ఉండే రాజకీయ వ్యూహాలు, ఈ సమస్య పట్ల కవికి ఉన్న దృక్ఫధం సూటిగా స్పష్టంగా ఆవిష్కృతమై కవితను ఊహించని ఎత్తులకు తీసుకువెళ్ళింది. మిగిలిన వాక్యాలన్నీ ఆ దృక్ఫధానికి రక్తమాంసాలుగా మారిపోయి గొప్ప ఉద్వేగభరితమైన అనుభవాన్ని అందిస్తాయి.

(కవిత్వంలో ఉండే సంక్లిష్టతను వివరించటానికి పై కవితను ఉదాహరణగా తీసుకొన్నాను తప్ప కవిత్వపఠనం ఇంత శ్రమతో కూడుకున్నది అని భయపెట్టటానికి కాదు. కవి ఎంతో శ్రమించి ఒక సృజన చేస్తున్నపుడు పాఠకుడు కూడా కొంత శ్రమించాల్సిన భాద్యత ఉండాలని చెప్పటానికి మాత్రమే. అదే లేకపోతే భాషపుట్టినపుడు పుట్టిన కవిత్వం ఇంతకాలం మనగలదా?)

రాత్రి హోరున వర్షం
ఉదయం లేచి చూస్తే
ఎదురింటాయనకు రెండు మేడలు. (ఇస్మాయిల్‌ హైకు)

యాధాలాపంగా చదివితే వర్షానికి రెండుమేడలకు సంబంధం తెలియదు. సాధారణంగా భారీ వర్షం వచ్చినపుడు రోడ్లపై నీళ్లు నిలబడటం సాధారణం. అలా నీళ్లు నిలిచినపుడు ఎదురింటాయన మేడ ఆ నీళ్లలో ప్రతింబింబంగా ఏర్పడి రెండు గా కనిపిస్తున్నదనే చక్కని ఊహను ఈ హైకూ దృశ్యమానం చేస్తుంది.
****

కొన్ని కవితలు ఒకే అర్ధాన్ని కాక భిన్న అర్ధాలను ఊహించుకొనేలా ఉంటాయి. ఆలా ఉండటాన్ని అనిర్వచనీయత (Ambiguity) అని కొందరు నిర్వచించారు. కవిత్వం ప్రధానంగా అర్ధకళ. బహుళార్ధాలు వచ్చేలా రాయటం కవిత్వంలో సామాన్యమే. కవిత్వాన్ని ఎలా వ్రాసినా ఇస్మాయిల్‌ గారు అన్నట్లు ‘‘కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది’’.

మామూలు భాషవేరు కవిత్వభాష వేరు. కప్పిచెప్పేది కవిత్వం అన్నారు. కవిత్వం కొంత గూఢతను సహజంగానే కలిగిఉంటుంది. పాఠకునిలో హృదయాన్ని కదిలించగలిగే ఉద్వేగాలను/అనుభూతులను ఇవ్వగలిగితే అది మంచి కవిత్వమౌతుంది. ఈ ప్రక్రియలో కవిత అర్ధమైందా లేదా అనేది కొంత అప్రస్తుతం అయినప్పటికీ అస్పష్టకవిత్వం ఉత్తమ కవిత్వమనిపించుకోదు.
కవి, ఒక భావ వాహిక, పాఠకుడు ముగ్గురూ కలిసినపుడే రచన అవుతుంది. భావాలు కవి వద్దే ఆగిపోతే దాన్ని కవిత్వం అనలేం. కవిత్వంలో అస్పష్టతకు కవిని నిందించరాదు. అస్పష్టత అనేది భావప్రసార సంబంధమైన సమస్య. ఈ అంశానికి సంబంధించి ఆధునిక కవిత్వం మరిన్ని మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

బొల్లోజు బాబా

(కవిత్వభాష పుస్తకంలోని “అస్పష్టత-సంక్లిష్టత” పేరుతో రాసిన వ్యాసం.
పూర్తిపుస్తకాన్ని కింది లింకులోనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును).

Saturday, September 7, 2024

మిత్రుని వాల్ పై చేసిన కామెంటు....(ఎడిటెడ్)


బ్రాహ్మణ భక్తి బ్రాహ్మణ ద్వేషం కవలలు ---కొంతవరకూ నిజమే కావొచ్చు.

రెండో శతాబ్దానికి చెందిన సంస్కృత వ్యాకరణ వేత్త పతంజలి అతని మహాభాష్య అనే గ్రంధంలో – బ్రాహ్మణులు శ్రమణులు(బౌద్ద, జైన, ఆజీవికులు) పాము ముంగిసల్లా ఆగర్భ శత్రువులని అన్నాడు.
కాపాలికా మతంలో చేరిన ప్రతీ వ్యక్తి ఒక బ్రాహ్మణుడిని చంపి అతని పుర్రెలో భిక్షాటన చేయాలని ఒక నియమం ఉండేది.

చార్వాకులు బ్రాహ్మణుల పట్ల సెటైర్స్ వేసారు "తోడేలు పాదముద్ర" అనే పిట్టకథ పేరుతో. వారు అభూతకల్పనలతో మాయమాటలు చెబుతారని అన్నారు. వేదాలను రచించినవారు విదూషకులు, మోసగాళ్ళు, రాక్షసులు అన్నారు.

వేదాలను అధ్యయనం చేస్తున్నవారిని "మూర్ఖుల సమూహం" గా వర్ణించాడు, ఏడవ శతాబ్దానికి చెందిన జైన మత ఉద్యోదన సూరి తన కువలయమాల కావ్యంలో.
 
బౌద్ధులు బ్రాహ్మణీయ సిద్ధాంతాలను అంగీకరించలేదు. బుద్ధుడు బ్రాహ్మణులు చెప్పుకొనే ఉత్తమజన్మ భావనను విమర్శించాడు. వారు కూడా మామూలు మనుషులే అన్నాడు. అది ద్వేషంగా పరిణమించిందో లేదో తెలియదు కానీచాలామంది హిందూ బ్రాహ్మణులు బౌద్ధంలో చేరారు
.
అశోకుడు లౌకిక భావనలని అవలంబించాడు. బ్రాహ్మణులకు అగ్రపీఠం ఇవ్వలేదు. అందరినీ సమాదరించాడు. ఈ రాజనీతి బ్రాహ్మణవాదుల సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సవాలు చేసింది.

బ్రాహ్మణుల పట్ల ద్వేషం అనేది సైద్ధాంతికంగా వారు చేస్తున్న అశాస్త్రీయ అరాచకాల పట్ల అని ఊహిస్తాను ముఖ్యంగా జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వ్యవస్థ పట్ల.
 
కిందనున్నవారు పైకి చేరలేక, ఒక వర్ణంలో పుట్టినందుకు జీవితాంతం బానిస జీవితాన్ని గడపాల్సి రావటం, దానికి కారణమైన "బ్రాహ్మనిజం" పై కలిగిన ద్వేషం అది.

ఈ ద్వేషం నుండి తప్పించుకోవటానికి ధర్మశాస్త్రాలలో బ్రాహ్మణుని సేవించాలి. దూషించరాదు, తాకరాదు, దండించరాదు (రాజుకూడా), గాయపరిస్తే మరణ శిక్ష, ఇక హత్య అయితే వేయి జన్మలవరకూ విముక్తే ఉండదు (ఈశ్వరునికూడా బ్రహ్మహత్యాపాతకదోషం అంటుతుంది అనే పురాణాలతో) అంటూ చాలా చాలా బలమైన రాతలు రాసుకొన్నారు. బ్రాహ్మణాధిక్యతను చాటి చెప్పే పురాణాలు ఇతిహాసాలు రాసుకొన్నారు.
 
సమాజంనుంచి ప్రతిఘటన రాకుండా. ధర్మశాస్త్రాలను రాజుచే బలంగా అమలుచేయించుకొన్నారు.
 
బ్రాహ్మనిజానికి- ఇతర సాంస్కృతిక జీవనాలకు మధ్య జరిగిన సంఘర్షణే మన చరిత్ర. ఇది ముఖ్యంగా బౌద్ధ హిందూ మతాల ఘర్షణ అంటారు డా. అంబేద్కర్ గారు.

 
బొల్లోజు బాబా