ఒక మిత్రుడు ఈ వాట్సప్ సందేశాన్ని పంపి దీనిపై వివరణ ఇవ్వమని అడిగాడు. నాకు తెలిసిన వివరణలు ఇవి. ఈ మెసేజ్ సారాంసం ఏమిటంటే శూద్రులు హిందూ ధర్మంలో గొప్ప మర్యాదలు పొందారు. వేదాలను అధ్యయనం చేసారు. వారిపై ఎక్కడా వివక్ష చూపినట్లు ఆధారాలు లేవు అంటూ శూద్ర ఋషులను, భక్తి సంప్రదాయ శూద్ర పంత్ లను కలగాబులగం చేసి వండిన వ్యాసం ఇది.
దీని వెనుక ఉద్దేశాలు ఏమిటంటే- ఈ రోజు సనాతన ధర్మం కావాలి అంటూ చేస్తున్న ప్రచారానికి హిందూ ధర్మం శూద్రులపట్ల వర్ణ వివక్ష చూపింది అనే ప్రధానమైన అభ్యంతరానికి సమాధానం చెప్పుకోవలసి వస్తున్నది. ఈ అంశానికి సమాధానంగా ఇదిగో చరిత్రలో ఈ ఈ శూద్రులు వేదాలను చదివి ఋషులయ్యారు అంటూ గొప్ప లిస్ట్ నొకదాన్ని ఇస్తున్నారు. ఏ రకమైన వివక్షా లేదని తీర్పులు ఇచ్చేస్తున్నారు.
నిజానికి పురాణాలలో శూద్ర ఋషుల వెనుక చాలా సందర్భాలలో బ్రాహ్మణ తండ్రి లేదా ఏదో దైవశక్తి ఉండటం గమనించవచ్చు. అది నిజమైన శూద్ర సమానత్వం అవ్వదు.
ముస్లిమ్ పాలన వచ్చాక వర్ణవ్యవస్థ సడలింది. బ్రిటిష్ పాలనలో పూర్తిగా చట్టవ్యతిరేకం అయ్యింది. సూఫీ వేదాంతం ప్రభావంతో శూద్ర వర్గాలు భక్తి సంప్రదాయాన్ని నిర్మించుకొన్నాయి. ఇది హిందూ ధర్మానికి ప్రతిగా నిలబెట్టిన ఆథ్యాత్మిక సంప్రదాయం. ఒకనాటి బౌద్ధ జైన మతాలతో దీనిని పోల్చవచ్చు.
ఇక చివరలో రొడ్డకొట్టుడు శ్లోకం పుట్టుకతో అందరూ శూద్రులే బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణులు అవుతారని గొప్ప రిఫరెన్స్ గా ఇచ్చారు. అదే సమయంలో ఈ వ్యాసంలోని వ్యక్తులు వేదాలు చదివారు బ్రహ్మజ్ఞానం పొందారు అంటూ ఒకపక్క మాట్లాడుతూ వారు బ్రాహ్మణులు అని చెప్పక శూద్రులు అని చెప్పటం- గొప్ప జోక్.
****

వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని మెకాలే - మాక్స్ ముల్లర్ మానస పుత్రులు, పాశాంఢ ఎడారి మత మార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు, రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది "మా వంటి శూద్రులను (author of this article)" హిందూ ధర్మం నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు చరిత్రలో ఎన్నడైనా శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా...??? వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారా...???
వివరణ: . హిందూ ధర్మశాస్త్రాలు శూద్రులను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి సేవలు చేయాలని చెప్పాయి. కాస్త చదువుకొంటే ఈ విషయాలు తెలుస్తాయి. ఈ ధర్మశాస్త్రాలను రాసింది క్రీపూ నుండి క్రీశ 6 వ శతాబ్దం మధ్య. అప్పటికి బ్రిటిష్ వారు లేరు, వామపక్ష చరిత్రకారులు లేరు. శూద్రుడు వేదాలు వింటే ఏం చెయ్యాలో హిందూ ధర్మశాస్త్రాలు ఇలా చెప్పాయి.
1. ద్విజుణ్ణి అవమానించిన శూద్రుని నాలుక కోసివేయాలి (మను 8.270)
2. కాత్యాయనుని ఆదేశాల ప్రకారం శూద్రుడు వేదాలను పొరపాటునగాని, పొంచి ఉండిగానీ విన్నట్లయితే అతని నాలుక రెండుగా చీల్చబడుతుంది. అతని చెవులలో సీసం పోయబడుతుంది.
3. శూద్రుడు ఉన్నతజాతికి ధర్మాన్ని ఉపదేశిస్తే రాజు వాడి నోట్లో, చెవిలో మండుచున్న నూనెను పోయించాలి (మను 8.272)
4. శూద్రుడు మతధర్మ సూత్రాలు బోధిస్తున్నా, వేదమంత్రాలు ఉచ్ఛాటన చేస్తున్నా బ్రాహ్మణున్ని అవమానిస్తున్నా అతనికి శిక్షగా నాలుక తెగనరికి వేయాలి (బృహస్ఫతి స్మృతి)
5. శూద్రుడెవరైనా ఉద్దేశపూర్వకంగా వేదమంత్రోచ్ఛాటనను ఆలకిస్తున్నట్లయితే అతని చెవుల్లో సీసంగాని, లక్క గాని కరిగించి పోయాలి, వేదపఠనం చేస్తున్నట్లయితే, అతని నాలుక కోసివేయాలి. వేదపాఠాన్ని స్ఫురణకు తెచ్చుకొంటున్నట్లయితే అతని శరీరాన్ని రెండుగా ఖండించాలి (గౌతమ ధర్మ సూత్రాలు)
6. శూద్రకులజులు ద్విజునిపై అసత్యారోపణ చేసినా, అవమానించినా, బ్రాహ్మణులకు వారి విధులకు సంబంధించి పాఠాలు చెప్పినా రాజోద్యోగులు వారి నాలుకలు కత్తిరింపచేయాలి. (నారద స్మృతి)
7. ఇక పై సూత్రాలు ఎప్పుడైనా సామాజికంగా అమలులో ఉన్నాయా అని ప్రశ్నిస్తారు కొందరు. నిన్నమొన్నటి వరకు ఉన్నాయి. పీష్వాల పాలనలో అబ్రాహ్మణుడు ఎవరైనా వేదమంత్రాలను పఠిస్తే వారి నాలుకలను కత్తిరించేవారు. ఈ చట్టాన్ని ధిక్కరించి వేదాలను ఉచ్ఛరించిన అనేకమంది కంసాలుల నాలుకలను కత్తిరించమని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బ్రాహ్మణులు కంసాలులు గొడవలు ఈస్ట్ ఇండియా కంపనీ ప్రెసిడెంటువద్దకు వచ్చినట్లు Resolution of Government Dated 28th July 1779 ద్వారా తెలుస్తున్నది.
ఇక సమకాలీనంగా జరిగిన కొన్ని వందల వర్ణ వివక్షా దాడుల ఉదాహరణలను న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లతో సహా డా. అంబేద్కర్, రచనలు ప్రసంగాలు సంపుటం 5 లో పొందుపరిచారు. వాదించటానికి కొంచెం చదువుకొని రావాలి.

వివరణ: మన వేదాలు ఇతిహాసాలు పురాణాలు అన్ని విదేశీ ఆర్యపండిత రాతలు. వీరు వచ్చి స్థానిక ద్రవిడ, నాగ జాతులను జయించి, వారిని శూద్రులు, అతిశూద్రులుగా (ఎస్సీ) విభజించి ఆధిపత్యం చలాయించారు. వేదాలు, పురాణాలు ఇతిహాసాలు ఆర్యపండిత ఆధిపత్యాన్ని స్థిరపరచే రాతలు. ఈ ప్రక్రియలో కొన్ని రాతలు వారే రాసుకొని అవి శూద్రుల, అతిశూద్రుల రాతలుగా ప్రచారం చేసారు.
చాలా సందర్భాలలో తండ్రి బ్రాహ్మణుడై ఉంటాడు. అలా ఇవి మీరాతలే, మీరు ఆర్యపండితుల ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు మీరే రాసుకొన్నారు చూడండి అంటూ చెప్పటం ఒక రకమైన మార్కటింగ్ టెక్నిక్.
ఇక వాల్మీకి బ్రాహ్మణుడు. పేర్లు, అగ్నిశర్మ/లోహ జంఘ. బోయ అని కల్పించారు..

వివరణ: వ్యాసుడు: బ్రాహ్మణ పరాశురుడికి జన్మించాడు. తాత బ్రాహ్మణ వశిష్టుడు. ఇతను శూద్ర స్త్రీకి పుట్టాడు. క్షేత్రబీజ ప్రాధాన్యతలను అనుసరించి ఇతను బ్రాహ్మణుడు.

వివరణ: ఆత్రేయ కాదు ఐతరేయ. తల్లి దాసి. పేరు ఐతరేయ. ఆమెకు ఒక గొప్ప తపోసంపన్నుడైన ఋషివల్ల మహిదాసుడు అనే కొడుకు పుట్టాడు. ఇతనిని తండ్రి సరిగ్గా పోషించటం లేదని, ఐతరేయ భూదేవిని ప్రార్ధించగా భూదేవి ప్రత్యక్షమై ఐతరేయ మహిదాసకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించినట్లు, ఆ శక్తితో ఐతరేయ మహిదాసు ఐతరేయ బ్రాహ్మణాన్ని రచించినట్లు – ఒక కథనం. ఇందులో దైవశక్తి చెప్పబడింది.

వివరణ: కవశ ఐలూశ అనే ఋషి దాసికి జన్మించాడు. ఒక రోజు బృగు, అంగీరసుడులు యజ్ఞం చేస్తుండగా ఐలూశు డు వచ్చి వారి సరసన కూర్చున్నందుకు ఆ బ్రాహ్మణులు ఇతనిని తక్కువ కులజుడివని దూషించి, ఒక నీరు దొరకని ఎడారిలోకి తరిమేసారు. అక్కడ ఇతనికి సరస్వతి కటాక్షం లభించింది. సరస్వతి నది ఇతని వెంటే నడిచింది. ఆ మహిమకు బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి ఇతనిని ఋషిగా అంగీకరించారు. ఈ కథలో దైవశక్తి చెప్పబడింది తప్ప బ్రాహ్మణులు శూద్రులను సోదరభావంతో స్వీకరించినట్లు చెప్పబడలేదు.

వివరణ: దాసి అయిన జాబాలి కొడుకు సత్యకామ. జాబాలి ఇతనిని హరిద్రుమతుడు అనే గురువు వద్దకు విద్యనేర్చుకొనేందుకు పంపుతుంది. ఉపనయనయనం చేసే ఉద్దేశంతో అతని కులగోత్రములు అడుగగా, నాకు తెలియవు అంటుంది తల్లి. ఆ గురువు దివ్య దృష్టితో అతని జన్మను తెలుసుకొని గాయత్రిమంత్రం ఉపదేశిస్తాడు.
జాబాలి పై దయతో గౌతముడు అనేబ్రాహ్మణుడు అతనికి బ్రాహ్మణ హోదా ఇస్తాడు తప్ప స్వంతంగా/పోరాడి గడించుకొన్నది కాదు. దీన్ని బ్రాహ్మణాధిక్యతగానే చూడాలి.

వివరణ: మతంగుడు మూల వాసి. ఇతను నాస్తికుడు, ఋషి. ఇతని ఆలోచనలు ఆర్యధర్మానికి భిన్నమైనవి. ఇతను అందరూ మైత్రీభావనతో మెలగాలని చెప్పేవాడు. వేదబాహ్యుడు. అయినప్పటికీ ఇతనిని ఆర్యబ్రాహ్మణులు హిందూ ధర్మంలోని ఋషిగా ప్రచారించుకొన్నారు. ఇతనికి ఆశ్రమాలు కలవు. ఇతని కుమారుడు కపిలుడు. యోగసాంఖ్యశాస్త్రకర్త. మతంగుడే నేటి పంచమవర్ణానికి ఆదిపురుషుడుగా చెబుతారు.
బ్రాహ్మణ అగస్త్యుడు దక్షిణానికి వచ్చి తన శిష్యులతో ఆశ్రమాలు ఏర్పరచుకొనే క్రమంలో అప్పటికే ఇక్కడ ఉన్న మతంగుని ఆశ్రమాలను ఆక్రమించుకోగా, మతంగుడు మరొక చోటుకు తరలిపోవలసి వచ్చిందని ఒక కథనం కలదు.

వివరణ: సంతానం కొరకు అంబ ను వ్యాసునితో సంభోగించటానికి వెళ్లమంటే, వ్యాసుని గడ్డాలు చూసి ఇష్టపడక, అంబ ఒక దాసిని పంపుతుంది. అలా బ్రాహ్మణ మూలాలు కలిగిన వ్యాసుడి కి దాసికి పుట్టిన సంతానం విదురుడు. ఇతను శూద్రుడు కాదు. క్షేత్రబీజ ప్రాధాన్యతలను బట్టి బ్రాహ్మణుడే.

వివరణ: వత్సుడిని అతని సోదరుడే నువ్వు శూద్ర స్త్రీకి పుట్టావు అని నిందించగా, కాదు నేను బ్రాహ్మణుడినే అని వాదించి అగ్నిప్రవేశం చేసి తన దోషాన్ని తొలగించుకొన్నాడు. ( మను 8-116). కనుక ఇతను బ్రాహ్మణుడు.

వివరణ: కవశ ఐలుషుని గురించి ఇదివరకే పైన చెప్పటం జరిగింది. ఈ పాయింటు రిపీట్ అయింది. బ్రాహ్మణత్వం పొందాడు అని చెబుతూ మరలా చివర్లో శూద్రుడు కాదా అని ప్రశ్నిస్తారెందుకు? అంటే........

వివరణ: కృష్ణుని పాత్రద్వారా మనుస్మృతిలోని వర్ణవిభజనను ఆర్యపండితులు చెప్పించారు- నేనే నాలుగు వర్ణాలను సృష్టించాను. వాటికి ధర్మాలు నిర్ణయించాను. స్వధర్మమే పాటించాలి వీడరాదు అని చెబుతాడు గీతలో. అంటే శూద్రుడు జీవితాంతం శూద్రుడిగానే ఉంటూ పై మూడు వర్ణాలకు సేవలు చేసుకోవాలని అర్ధం. మీ శూద్రులలో ఒకడే ఇలా చెప్పాడు అని ఆ పాత్రతో చెప్పించటం, అందరినీ ఒప్పించే ప్రక్రియ. Manufacturing of opinion అని చెప్పొచ్చు.

వివరణ: గుహుడు కిరాతరాజు. ఇతను మతంగుని వలె మూలనివాసి. స్థానికుడు. ఆర్యులు దక్షిణాపథానికి వచ్చే క్రమంలో అనేక స్థానిక రాజులతో సంబంధాలు పెట్టుకొన్నారు. వారిలో గుహుడు ఒకడు. ఇతను ఆర్యులవైపు ఉన్నాడు కనుక అస్మదీయుడయ్యాడు. ఆర్యపండితులకు వ్యతిరేకంగా ఉండిన వారిని అవతారాలు ఎత్తి మరీ సంహరించినట్లు కథలు కథలుగా పురాణాలు రాసుకొన్నారు.

వివరణ: శబరి మాతంగ ఆశ్రమవాసి. మూల నివాసి. ఆర్య సంస్కృతికి వెలుపలి వ్యక్తి. ఆర్యులను ఆహ్వానించింది కనుక ఆర్య సాహిత్యంలో చోటు దక్కించుకోగలిగింది.

వివరణ: అతను రాజు. హిందూ ధర్మం ప్రకారం శూద్రరాజులు పట్టాభిషేకసమయంలో సువర్ణగర్భ యాగం చేసి దండిగా సువర్ణాన్ని పండితులకు దానం ఇస్తేనే అతనికి పాలించే అర్హత వస్తుంది. శూద్ర శివాజీని కొందరు పండితులు ఈ క్రతువు చేయటానికి నిరాకరించగా, భారీ ఎత్తు ధనాన్ని ఇచ్చి పట్టాభిషిక్తుడయినట్లు చరిత్ర చెబుతుంది. రాజు శూద్రుడైనా king maker గా బ్రాహ్మణుడు ఉండటం జన్మ ఆధారిత వర్ణ వ్యవస్థ వేసిన మాస్టర్ ప్లాన్.

వివరణ: చూడుడు పై పాయింటు వివరణ. నిజానికి మౌర్య సామ్రాజ్యాన్ని పతనం చేసి నిర్మించిన ఇతర సామ్రాజ్యాలేవి అంతటి విశాలమైనవి, అఖండ భారతాన్ని పాలించినవి కావు
.

వివరణ: చూడుడు పై పాయింటు వివరణ

వివరణ: అవును నిజమే. అన్నీ ఉన్నాయి. శూద్రజంధ్యధారులు చరిత్రలో ఎంతో పోరాటం చేసి ఉపనయన హక్కును నిలుపుకొన్నారు (ఆర్యపండితులు ఉపనయనాన్ని మూడు వర్ణాలకే పరిమితం చేయకముందు అన్ని వర్ణాలవారు, స్త్రీలతో సహా అందరకు ఉపనయన హక్కు ఉండేది). ఇది గొప్ప విషయం. శూద్రజంద్య ధారులు ఆలయ గర్భగుడిలో ప్రవేశించి మూల మూర్తిని అర్ఛించే అర్హత కలిగిన నాడు వీరు బ్రాహ్మణ జంద్యధారులతో సమానం అవగలరు అనే సూక్ష్మవిషయాన్ని గ్రహించాలి. ఇలాంటి సన్నివేశం ఇటీవలి తంగలాన్ సినిమాలో ఉంది.

వివరణ: రైక్వ ఋషి, జన శృతి అనే శూద్రరాజు వద్ద బహుమతులు గ్రహించి అతనికి విద్యలు నేర్పినట్టు చాంధోగ్య ఉపనిషత్ లో ఉన్నది. ఆకాలంలో జైన బౌద్ధాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. జైన బౌద్ధాలలో శూద్ర బ్రాహ్మణ బేధాలు లేవు. రైక్వ ఋషి జైనుడో బౌద్ధుడో అయ్యే అవకాశం ఎలా కాదనగలరు?

వివరణ: 12 వ శతాబ్దం నుంచి భారతదేశంలో వ్యవస్థీకృత ముస్లిం పాలన మొదలైంది. వైదిక విద్యను స్థానంలో క్రమేపీ ఇస్లామిక్ విద్య రాసాగింది. ఇది అంతవరకూ సమాజంలో బిగుసుకుపోయి ఉన్న వర్ణ వ్యవస్థను బద్దలు కొట్టింది. ఎంతో మంది శూద్రులు విద్యనభ్యసించసాగారు. పెర్షియన్ భాషలో విద్యాబోధన సాగింది.
ముస్లిమ్ పాలకులు స్థానిక ప్రజల మతపరమైన విశ్వాసాలను గౌరవించారు. బాబర్ కాలంనుంచి ముఘల్ పాలకులు సంస్కృత పండితులను చేరదీసారు. హుమాయున్ అక్బర్ లు పరమతసహనానికి నమూనాగా నిలిచాడు. జహంగీర్, షాజహాన్ లు కూడా అదే బాటలో నడిచారు.
హజ్రత్ నిజాముద్దిన్ ఔలియా (13 వ శతాబ్దం), షా ఇనాయతుల్ల (17 వ శతాబ్దం) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిమ్ ఐక్యతను బోధించారు. నానక్ సాహెబ్ దాదు దయాల్, బుల్లా సాహెబ్, తులసి సాహెబ్ లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్ ఐక్యతకు కృషిచేసారు.
ఈ నేపథ్యంలోంచే భక్తి ఉద్యమం మొదలైంది.ఈ భక్తి ఉద్యమం ఇస్లామ్ మతంలోని ఎకేశ్వరోపాశన నుండి ప్రేరణ పొందింది. హిందు మత లక్షణాలైన కులమతాల వివక్ష లేదు, సంస్కృతం బోధనా భాష కాదు. స్థానిక భాషలలో కీర్తనలు రాసుకొన్నారు ఈ భక్తి కవులు. దేవుని చేరుకోవటానికి మధ్యలో పూజారి అవసరంలేదు. పూజలు, క్రతువులు, యజ్ఞాలు యాగాలు అవసరం లేదు. హిందూ ధార్మిక గ్రంథాలైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రస్తావన లేదు. ఉత్త భక్తి తో ఎవరైనా దేవుడిని చేరుకోవచ్చు అని చేసిన ఉద్యమమే భక్తి ఉద్యమం. దీనిని నడిపించింది శూద్రులు, ముస్లిము సూఫీలు. ఇది పరమతసహనానికి సూచనగా నిలిచింది.
క్రతువులు, వేదాలు, పురాణాలు, సంస్కృతం, వర్ణవ్యవస్థ, యజ్ఞాలు, పూజారులు ఉండే సనాతన ధర్మానికి భక్తి ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. ఈ రోజుకీ ఈ భక్తి ఉద్యమంలోని సంత్ (భక్తి ఉద్యమ నిర్మాతలు) లను వారు శూద్రులని హిందూ పీఠాధిపతులు గుర్తించరు
ఈ వ్యాసంలో తుకారం, నారాయణ గురు, కబీరు, రవి దాస్, మీరాభాయ్, సంత్ ఘాసి దాస్ లాంటి వారిని హిందూమతం ఉత్పత్తి చేసిన శూద్ర ఋషులుగా చెప్పటం వక్రీకరణ. వారు హిందూ ధార్మికతను ధిక్కరించి, వెలుపలకి వచ్చి ఒక ఉద్యమాన్ని నడిపిన గొప్ప సామాజిక సంస్కర్తలు. అంతేకాక మరికొందరు ఋషులు జైన మతానికి చెందినవారు కూడా కావొచ్చు. ఎందుకంటే దాదాపు 15 శతాబ్దం వరకూ జైనం మనుగడలో ఉంది. వారిని హిందూ ఋషులుగా అప్రాప్రియేట్ చేసుకోవటం లోతుతక్కువ వాదన.

వివరణ: ఇతను బ్రిటిష్ ఇండియాలో 19 వ శతాబ్దపు సంఘ సంస్కర్త. శూద్రుడు. కేరళాలో హిందూ మతంలోని కులవ్యవస్థపై, బ్రాహ్మణాధిక్యతపై పోరాడిన వీరుడు.

వివరణ: 15 వ శతాబ్దపు ముస్లిమ్ పాలనలో కబీర్ దాస్ ఒక భక్తి ఉద్యమకారుడు. ఇతనిపై సూఫీల ప్రభావం ఉంది. ఇతను ఇస్లామ్ మతాన్ని స్వీకరించాడు. ఇతనిని ఇప్పటికీ హిందూముస్లిములు సమానంగా ఆదరిస్తారు. హిందూ బ్రాహ్మణులు కబీర్ ను ఎన్నో కష్టాలపాలు చేసినట్లు అనేక కథలు కలవు.

వివరణ: థోయి 12 వ శతాబ్దానికి చెందిన కవి. పావన దూత అనే కావ్యాన్ని రచించాడు. హిందుఋషా కాదా చెప్పలేం.

వివరణ: సిద్ధవైద్యం తెలిసిన తమిళ వ్యక్తి. పురాణ వ్యక్తి. చారిత్రిక వివరాలు తెలియరావు. క్రీపూ 3000 కి చెందిన వ్యక్తి అంటారు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ?

వివరణ: చోళులకాలంలో నివసించిన శైవభక్తుడు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ?

వివరణ: అత్యుతానంద దాస. 16 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో జీవించాదు. ఇతను గోకాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. తండ్రి Dinabandhu Mohanty. ఇతను కరణాలు. లేఖన వృత్తి.

వివరణ: బలరామ్ దాస్ 16 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో జీవించాడు. వీరు కాటికాపరి వృత్తి కాదు. తండ్రి Somanatha Mahapatra. ఇతను కరణాలు. వీరు సంపన్నులు.

వివరణ: అవును శూద్రుడే. ఇతను 17 వ శతాబ్దానికి చెందిన వాడు. అప్పటికి ముస్లిమ్ పాలన, బ్రిటిష్ వారి ప్రభావంచే మనుధర్మం వెనక్కి వెళ్ళి శూద్రులందరూ విద్యనభ్యసిస్తున్నారు.

వివరణ: రవిదాస్, మీరాభాయి లు భక్తి సంప్రదాయానికి చెందిన 15 వ శతాబ్దపు కవులు. ముస్లిమ్ సూఫీ సంప్రదాయం అనుసరించారు. రవిదాస్ పంత్ చర్మకారకులానికి చెందిన వ్యక్తి. హిందూ ధర్మాన్ని తిరస్కరించిన శూద్ర భక్తి కవి.

వివరణ: నామ్ దేవ్ 13 వ శతాబ్దంలో ముస్లిమ్ పాలనలో జీవించిన భక్తి కవి. భూస్వామ్య శూద్రకులస్థుడు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ? ఇతను వేదాలను అనుసరించలేదు.

వివరణ: చొక్కమేళ మరాఠా భక్తిసంప్రదాయ కవి. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో ఆథ్యాత్మిక అన్వేషణ చేసిన మహర్ కులస్థుడు. ఇతనిని బ్రాహ్మణ పండితులు ఆలయంలోకి అనుమతించలేదు. ఆ కారణంగా సొంత ఆలయాన్ని నిర్మించుకొన్నాడు. వేదాలను, హిందూ ధర్మాలను అంగీకరించలేదు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్

వివరణ: సంత్ కన్నోఫుత్ర స్త్రీ. రాజ నర్తకి. 15 వ శతాబ్దంలో ముస్లిమ్ పాలనలో విఠలుని ఆరాధించి కవిత్వం చెప్పిన కవయిత్రి. ఈమె వేదాలను అభ్యసించినట్లు ఎక్కడ ఉంది? రిఫరెన్స్

వివరణ: గురుబాలక్ దాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జీవించిన భక్తి సంప్రదాయానికి చెందిన సంత్. కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఇతను చేస్తున్న బోధనలు ప్రజలలో విస్తరిస్తున్నాయని తెలిసిన అగ్రవర్ణ హిందువులు ఇతన్ని కత్తులతో పొడిచి చంపేసారు.

వివరణ: గురు రామేశ్వర్ యోగి 1905-1996 మధ్య జీవించిన చత్తిస్ గఢ్ కు చెందిన ఆథ్యాత్మిక వేత్త. ఇతను గిరిజనుల అభ్యున్నతి కొరకు పాటుపడిన సామాజిక కార్యకర్త.

వివరణ: సంత్ ఘాసిదాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జన్మించాడు. భక్తి సంప్రదాయానికి చెందిన సంత్ గురువు.

వివరణ: తిరువళ్ళువార్ జైనుడు. హిందూమతానికి చెందిన వ్యక్తే కాదు. ఇతని కాలానికి హిందూమతం ఇంకా దక్షిణభారతదేశానికి రానేలేదు. ఇక బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఎక్కడిది. ఇదొక ఊతపదంగా ఉంది ఈ వ్యాసం మొత్తంలో. ఆ పదాలు పడితే తప్ప హిందుమతం అని అనుకోరని కాబోలు.

వివరణ: గురు విఠల్ 20 వ శతాబ్దపు సామాజిక కార్యకర్త. దళితులు, సమాజంలో వెలివేయబడినవారి అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త. వర్ణ వ్యవస్థను వ్యతిరేకించారు. బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యం ఎక్కడిది. రిఫరెన్స్.

వివరణ: ఈమె పైన చెప్పిన 14 వ శతాబ్దపు ముస్లిమ్ పాలనలో భక్తికవి గా పేరుగాంచిన చర్మకార చొక్కమేళ సంత్ యొక్క భార్య. ఈ దంపతులు వేదాలను అంగీకరించలేదు. గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యం ఎక్కడిది. రిఫరెన్స్?

వివరణ: శోభిరామ్ 18 వ శతాబ్దం బ్రిటిష్ పాలనలో గురు శివనారాయణ వద్ద శిష్యరికం చేసిన ఒక చమర్ యోగి. వేద పాండిత్యం రిఫరెన్స్??

వివరణ: ఇది రిపీట్

వివరణ: బహిరామ్ బాబా 1800 లలో జీవించిన యోగి. ఇతనికి వేదపాండిత్యం నేర్చుకొన్నాడని రిఫరెన్స్ లు ??.

వివరణ: ఇతను పైన చెప్పిన చొక్కమేళ కు బావమరిది. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలన. వీళ్ళు వేదాలను తిరస్కరించారు. వేదపాండిత్యం ???

వివరణ: భాగు మహరిన్ మహర్ కులానికి చెందిన భక్తి కవయిత్రి. ఈమె గురించి వివరాలు తెలియరావు. భక్తి సంప్రయానికి చెందిన వ్యక్తి.

వివరణ: మదరా చన్నయ్య 11 వ శతాబ్దానికి చెందిన కన్నడ కవి. బసవని శిష్యుడు అంటారు
.

వివరణ: పంతొమ్మిదో శతాబ్దపు సాధువు. స్వామినారాయణ సంప్రదాయానికి చెందిన వ్యక్తి. అనేక పుస్తకాలు రాసాడు. 1908 లో మరణించారు.

జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్ద విద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు. ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.
వివరణ: 12 వ శతాబ్దం నుండి ముస్లిముల పాలన కారణంగా కొంతమేరకు వర్ణ వ్యవస్థ పగుళ్ళు తీసింది. శూద్రులు వేదాలను, పురాణాలను పక్కనపెట్టి భక్తి ఉద్యమాన్ని నడిపించారు. ఇది ఎక్కువగా వర్ణవ్యవస్థకు, క్రతువులకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. దీనికి ప్రేరణ ముస్లిమ్ పాలకుల సూఫీ వేదాంతం. దాన్ని ఆధారం చేసుకొని శూద్రులు, అతిశూద్రులు తమ ఆథ్యాత్మిక ప్రపంచాన్ని భక్తి ఉద్యమం ద్వారా నిర్మించుకొన్నారు. దీనిలో హిందూ మత ప్రమేయం తక్కువ.
ఇక పై శ్లోకంలో బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అంటున్నప్పుడు పైన చెప్పిన ఋషులను, సంత్ లను నేటికీ శూద్రులుగానే ఎందుకు పిలుస్తున్నారు మీరు?. వారికి బ్రహ్మ జ్ఞానం వచ్చిందని పేరు పేరుకి చెప్పినపుడు వారు శూద్రులు, చమరులు అని కులాలుగా ఎందుకు చెబుతున్నారు? వారు బ్రాహ్మణులు అని ఎందుకు చెప్పటం లేదు?
ఇంతచిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. అంటే జన్మనా జాయితే అనేది అంతా బూటకం. పై పై నాటకం.
పోనీ గత రెండువందలేళ్ళుగా బ్రహ్మజ్ఞానం వల్ల ఏ శూద్రుడు బ్రాహ్మణుడిగా మారాడో లెక్కలు తీయండి. కేస్ట్ సర్టిఫికేట్లు ఆధారాలుగా చూపి మాట్లాడాలి. గాలి కబుర్లు కాదు. లేదూ దుర్గుణాలు కలిగిన ఏ బ్రాహ్మణుడు శూద్రుడిగా మారాడో చెప్పండి.

వివరణ: ఈ శ్లోకానికి మూలం ఏటో చెప్పాలి? ఈ విధంగా చివరన ఎక్కడిదో నంబరుతో సహా ఇచ్చినట్లు…… అంతే తప్ప ఉత్తినే ఏదో నాలుగులైన్లు రాసి చెబితే ఎలా నమ్మేది.
బ్రాహ్మణుడు క్షత్రియుల్ని దూషిస్తే యాభైపణాలు, వైశ్యుల్ని దూషిస్తే ఇరవై ఐదు పణాలు, శూద్రుణ్ణి దూషిస్తే పన్నెండు పణాలు శిక్ష విధించాలి. అదే ఒక శూద్రుడు బ్రాహ్మణున్ని అవమానిస్తే ఆ శూద్రుని నాలుక కోసివేయాలి. మను: 8.270)
ద్విజుని కులాన్ని, పేరును అమర్యాదగా ఉచ్చరించిన శూద్రుని నోట్లో పదివేళ్ళ పౌడగున్న ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి. (మను 8.271)
****
బొల్లోజు బాబా
చాలా శ్రమ పడి ప్రాచీన ఋషుల దగ్గరినుంచి సమీపకాల సాధుసంతుల దాకా భారతదేశంలో వెలసిన హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని వివిధ రూపాలలో ఆచరించి బోధించి వ్యాప్తి చేసిన మహనీయుల గురించి వ్రాశారు. మీరు ఎంత కాదని నమ్మబలికే ప్రయత్నం చేసినా హిందూ ధర్మం నుంచి వాటిని దూరం జరిపే ప్రయత్నం చేసినా వారందరూ సనాతన ధర్మానికి చెందిన మహనీయులే.
ReplyDeleteజైన, బౌధ్ధ, శిక్ఖు ధర్మాలు సనాతన ధర్మం అనే మహానది యొక్క ఉపనదులు. ఇది కాదనలేని, శిక్యులర్ చరిత్రకారులకు మింగుడు పడని సత్యం.
అవకాశం ఉన్న చోటల్లా యథాశక్తి బ్రాహ్మణులపై నిందలు, వేదవిజ్ఞానం గురించి తక్కువ చేసే ప్రయత్నం చేశారు.
వేల ఏళ్ల భారతదేశ చరిత్ర లో ఏ గొప్పదనం, ఏ మంచితనం ఉన్నా అది సనాతన ధర్మం కాదు అని నిరూపించడమే కొంతమంది మేధావుల, చరిత్రకారుల ధ్యేయం కాబోలు.
అసలు ఆ మహనీయులు బోధించిన విషయాలు, భక్తి భావనలను, అమూల్యమైన భక్తి సాహిత్యం ఇత్యాదులు వదలి వారి వర్ణం గురించి చర్చ చేయడం ఏమిటి ? అమృతం ఆస్వాదించకుండా అది ఉన్న భాండం యొక్క వర్ణం గురించి ఆలోచిస్తే ఉపయోగం ఏమిటి?
వాల్మీకి రామాయణం, మహాభారతం, భాగవతం ఇత్యాది మహాకావ్యాల లోని గొప్పతనం , సాహిత్యం అద్భుత భక్తి భావనలు, ఉదాత్తమైన భగవంతుని అవతారాలు, లీలలు వంటివి ముఖ్యమా లేక అవి రచించిన వారి వర్ణం ముఖ్యమా ?
Is it really worth to spend one' s life in such false pursuits?
Just imagine the beautifully decorated divine murthis of Devis and Devathas. Listen to the beautiful hymns and songs composed by vaggeyakaras.
Read beautiful Sanskrit texts and literature in other Indian languages and derive immense joy.
What will be achieved by spending one's entire life in disliking a particular community and Dharma ?
FYI Aryan invasion theory AIT has been comprehensively debunked by real dharmic historians in recent times. Islamo leftist distorians like romila thapar, Irfan Habib, Audrey trusche cannot digest or accept the truth as their fake narratives written with mala fide intention have been decisively proved wrong. 75 years of studying distorted anti Sanatan pro islamic history has irreversibly corrupted the mindset of many people.
I will try to write a detailed post on this subject.
Late Tarek Fatah beautifully described the meaning of secularism.
“India is the only major civilizational country where you are systematically taught to hate your heritage and glorify the invaders who came to destroy it. And this absurdity is called ‘secularism’."
దీనికి ముందు పోస్టులో 1905 లో సనాతన ధర్మం పేరిట రాసిన ఒక పుస్తకాన్ని గురించి చర్చించాను. వాటిలో ఉన్న అభ్యంతరకర అంశాలను వివరించాను. అది చదివారుగా..... అందులో బౌద్ధ, జైన, శిక్కు మతాలను ఎక్కడా పేర్కొనలేదు.
Deleteమీరు ఇప్పుడు అవికూడా సనాతన ధర్మం అనటం అతితెలివి తేటలు అంటాను. ఎందుకంటే అవి సనాతన ధర్మంలోని యజ్ఞాలు, పునర్జన్మ, వర్ణవ్యవస్త, బ్రాహ్మణాధిక్యత, పాపపుణ్యాలు అనే అంశాలను వ్యతిరేకించి వచ్చిన మతాలు. వాటిని కూడా సనాతన ధర్మంలో కలిపేసి మాట్లాడటం అతితెలివితేటలు.
1905 నాటి సనాతన ధర్మం అనే పుస్తకంలో జైన బౌద్ధ మతాల ప్రస్తావన చూపండి. వారికంటే గొప్ప వ్యాఖ్యాతలా మీరు.
బ్రాహ్మణ నిందలు ఎవడు వేస్తాడు. వాళ్ళు కూడా ఆఫ్టర్ ఆల్ నాకులాగే 28% జిఎస్టి, 30 ఇంకం టాక్స్ కట్టి బతకలేక బతుకుతున్న సామాన్యులు. వారిని నిందిస్తే నాకేం వస్తుంది. ఎవరైనా విమర్శించేది బ్రాహ్మణులను కాదని, బ్రాహ్మానిజాన్ని అని మీకు ఎన్నటికీ అర్ధంకాని విషయం.
మీకులాంటి మనుషులకు ఇక్కడ సమాధానం ఇచ్చాను. ఈ లింకులో ఒక సారి చదువుకొండి
https://sahitheeyanam.blogspot.com/2024/10/one-more-comment.html
ఇక నా పోస్టులు మీకు ఏమీ అర్ధం కాలేదని అర్ధమౌతుంది.
మరొక్కసారి చదువుకోండి. పై పోస్టు మరొకరి వ్యాసానికి సమాధానం. అంటే తప్ప నేను కులాలను ప్రస్తావించలేదు. అయినా అర్ధం కాకపోతే నన్ను బ్లాకు చేసుకోండి. నా వాల్ పై మిడిమిడి జ్ఞానంతో కామెంటకండి.
ఈ బ్లాగు ఇలాంటిభావజాలాన్నే చెబుతుంది. అదిమీకు ఇష్టంలేకపోటే దూరంగా ఉండండి.
మీలాంటి ఫేస్ లెస్, నేమ్ లెస్ పీపుల్ తో నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు. అలాంటి వారి పుట్టుక సరైనది కాదని అనుకొంటాను. ముందు మీ అసలైన ఫొటో తో అసలైన పేరుతో చర్చించటానికి రండి మీకు ఆసక్తి ఉంటే.
అప్పుడు చర్చిద్దాం.
బొల్లోజు బాబా
పేరులో నేముంది లెండి. అయినా నా బ్లాగు లింక్ మీ పోస్టు పై వ్రాసిన వ్యాఖ్యలోనే ఇచ్చాను కదా.
Deleteమరలా ఇస్తున్నాను.
https://anupallavii.blogspot.com/2024/10/blog-post_12.html?m=1
నా పేరు కిరణ్ కుమార్ నా బ్లాగు 2007 నుంచి ఉంది. పాత బ్లాగు కాబట్టి బ్లాగు మిత్రులకు చిర పరిచయమే. ఇంకా ఏమైనా వివరాలు కావాలా ?
Anyhow my reply has done its bit. It's ok. Bye.
1.బౌద్ధజైనాలు హిందూ ధర్మంలోనివి అనటం
Delete2.బ్రాహ్మనిజంపట్ల విమర్శ, బ్రాహ్మణుని పట్ల విమర్శ మధ్య బేధం గుర్తించకపోవటం
3. ఈ జన్యుశోధనల కాలంలోకూడా AIT ని తిరస్కరించటం
4. మాటల్లో ఇస్లామ్, క్రిస్టియానిటి, కమ్యూనిస్టులపై హేట్రెడ్
5. ఇక్కడకు వచ్చి 1000 ఏళ్ళ క్రితమే సెటిల్ అయి, ఇక్కడే పుట్టి చస్తున్న వారిని ఇన్వేడర్స్ అనటం
6. మనకు నచ్చని వాటిని ఫేక్ నెరేటివ్స్ అనటం
లాంటి మీ మాటలన్నీ మీ మిడిమిడి జ్ఞానాన్ని, మీలో నరనరాన నింపుకొన్న హేట్రెడ్, డివిజన్ విషాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
మీలాంటి వారిని ఎంటర్టైన్ చెయ్యటం అనవసరం.
మిమ్మలను నేను కన్విన్స్ చేయలేను, నన్ను మీరూ చెయ్యలేరు.
ఎందుకు వృధా ప్రయాస.
అనామకంగా ఉంటూ చెట్టుచాటునుండి బాణాలు వేసే బాపతు మీరు. పేరులోనే అంతా ఉంటుంది. నిజాయితీ, ధైర్యం, వ్యక్తిత్వం అన్నీ పేరుతోనే ముడిపడి ఉంటాయి.
ఊరూ పేరు ఫొటో లేని వ్యక్తులు నా దృష్టిలో నిజాయతీ లేని చీకటి మనుషులు.