Friday, August 20, 2021

#సంతకం #కవిత్వపరామర్శ

Thank you so much Vinodini Madasu gaaru for choosing my Book.
Eagerly awaiting the event.
Bolloju Baba
May be an image of Vinodini Madasu and text
#సంతకం #కవిత్వపరామర్శ
....................................................................
“ అస్తిత్వం అనేది
గొనె సంచిలో తీసుకెళ్ళి ఊరిచివర విడిచినా
తోకూపుకుంటూ వచ్చిచేరే పిల్లి పిల్ల లాంటిది
దాన్ని ప్రేమించటం నేర్చుకో
ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని నిలుపుకో
ఈ ప్రపంచం
నిన్నెలా చూడాలనుకుంటుందో
అలా వేషం కట్టి
ఆత్మ లోకంలో అమ్ముడుపోకు
అబద్ధపు వేషం పదే పదే కట్టి
నువ్వే ఓ నిలువెత్తు అబద్ధంగా మారిపోకు
ఈ ప్రపంచం
ఏవి నీకు ఉండకూడదని ఆశిస్తుందో
అదే నీ అస్తిత్వం వాటిని కోల్పోకు
కర్ణుడు కవచ కుండలాలని కోల్పోయినట్లు.
ఇంకొకరి అభిప్రాయంగా ఉండేకన్నా
నువ్వే ఓ సిద్ధాంతంలా మారు ”
..................................................................................................
#వినోదినిమాదాసు #21_08_2021 #శనివారం రాత్రి 8 గంటలకు



తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 3

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 3

.
వ్యభిచారం అనేది అతిప్రాచీన వ్యవస్థీకృత వ్యాపారం. థెరి గాథలకు ధమ్మపాలుడు చేసిన వ్యాఖ్యానంలో ఒక వేశ్య సంపాదించిన ధనంలో సగం ఆమెకు చెందగా మిగిలిన సగం వేశ్యావాటిక నిర్వహించేవారికి చెందుతుంది అంటాడు. దానిని బట్టి సుమారు రెండున్నరవేల సంవత్సరాల క్రితపు గణికావ్యవస్థ ఆర్ధిక అంశాలు కొంతమేరకు అర్ధమౌతాయి.
.
విమల ఒక గణిక కూతురు. వేశ్యాగృహంలోనే పుట్టి పెరిగింది. ఒకనాడు ఈమె బుద్ధుని ప్రియశిష్యుడైన మొగ్గల్లన అనే భిక్షుకుడిని చూసి అతన్ని ఆకర్షించి వశపరచుకోవాలని ప్రయత్నించింది. అతను ఈమెను తృణీకరిస్తూ – “నీవు చర్మం కప్పుకొన్న పెంటకుప్పవు; గడ్డల వక్షోజాలు ఉన్న దయ్యానివి; నీ నవరంద్రాలలో దుర్వాసనా స్రావాలు ప్రవహిస్తున్నాయి; శుచిని కోరుకొనేవారు పెంటను ఎలాగైతే తప్పించుకొంటారో నీ శరీరాన్ని అలాగే తప్పించుకొంటారు” అంటూ అవమానిస్తాడు. అతని మాటలు విమలలోని అహంకారాన్ని చంపివేసి, ఆమెను బౌద్ధసన్యాసినిగా మారేలా చేసాయి.
విమల థెరీగా మారాక వ్రాసుకొన్న గాథ ఇలా ఉంది.
.
యవ్వనం
కాంతులీనే చర్మం
వంకలేని దేహాకృతి
అతిలోక సౌందర్యం
అపరిమితమైన పేరు ప్రఖ్యాతులతో
కనులు మూసుకొనిపోయి
ఎవరూ నా కంటికి కనపడేవారు కారు
అందంగా అలంకరించుకొని
వేశ్యాగృహం బయట వేటగత్తెలా నిలుచుని
వలలో చిక్కుకొన్న మగవాళ్ళని చూసి నవ్వుకొనేదాన్ని
నేడు
శిరోముండనం
కాషాయ వస్త్రాలు
భిక్షుకజీవనం
అన్ని బంధాలను తెంచుకొని
చెట్టు నీడలో ఉన్నాను నేను
లోలోపల బడబాగ్ని చల్లారింది
నా జీవితంలోంచి
దేవుళ్ళను, మగవాళ్ళను తరిమేసాను (72-76)
.
పై గాథలో చివరి వాక్యం కీలకమైంది. అంతటి విప్లవాత్మక భావాలను నేడు వ్యక్తీకరించే పరిస్థితులు ఉన్నాయా అనేది సందేహాస్పదమే!
***
బుద్ధుడు సన్యసించకపూర్వం సిద్ధార్ధునిగా ఉన్నప్పుడు అంతఃపురంలో అతనితో సన్నిహితంగా మెసిలిన వారిలో పన్నెండు మంది బౌద్ధభిక్షుణిలుగామారి ధమ్మమార్గంలో ప్రయాణించారు. సిద్ధార్ధుని అంతఃపుర స్త్రీలు ఎంతమంది అనేదానికి ఎక్కడా వివరాలు దొరకవు. ఒక కథనం ప్రకారం సిద్ధార్ధుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినప్పుడు శాక్యులు ఒక్కో కుటుంబంనుంచి ఒక్కో యువతిచొప్పున మొత్తం నలభైవేలమందిని సిద్ధార్ధుని అంతఃపురానికి పంపించారట. ఈ ఉదంతం సిద్ధార్ధుని మగటిమిని చెప్పటానికే అని సులువుగానే అర్ధమౌతుంది. సిద్ధార్ధుని సమకాలీనుడైన బింబిసారునికి 500 మంది అంతఃపుర స్త్రీలు ఉండటాన్ని బట్టి సిద్ధార్ధుని స్త్రీజనం కూడా అంతే సంఖ్యలో ఉండేవారని ఊహించవచ్చు.
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందినవారు కీర్తి ప్రతిష్టలకొరకు అంతఃపురంలో అనేకమంది స్త్రీలను ఉంచుకొనేవారు. వీరిలో వివాహం చేసుకొన్నవారిని భార్యలు/రాణులుఅని, విలాసం కొరకు ఉంచుకొన్నవారిని ఉంపుడుగత్తెలని (గణికలు) పిలిచేవారు. ఈ గణికలు రాజుగారికి ఛత్రం, వింజామర ధారిణులుగా, పానపాత్ర అందించటానికి, సింహాసనం, రథాదుల వద్ద సహాయకారులుగా ఉండాలి అని చాణుక్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడింది. ఈ ఉంపుడుగత్తెలకు వెయ్యినుంచి మూడువేల పణాల వరకూ ఖజానా నుంచి జీత భత్యాలు ఇచ్చేవారు. ఈ గణికా వృత్తి నుండి విముక్తమవ్వాలంటే ఇరవై ఐదు వేల పణాలు చెల్లించి స్వేచ్ఛనొందవచ్చు. గణికాపుత్రునికైతే పన్నెండువేల పణాలు చెల్లించాలి. వయసు దాటిపోయిన గణికలు కోశాగారంలో కానీ, వంట శాలలో కానీ పనికి కుదరవచ్చు. రాజుగారు చెప్పిన పురుషుని వద్దకు వెళ్ళని గణికకు వెయ్యి కొరడా దెబ్బలు లేదా ఐదువేల పణాల జురిమానా వరకూ విధించేవారు. ఇదీ అనాటి రాజ స్త్రీజనుల జీవన స్థితిగతులు.
గౌతమ బుద్ధుని పూర్వజీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన కొద్దిమంది అంతఃపురవాసినుల గాథలు ఇవి.
(తధాగతుడు ఒకనాటి తన గణిక అయిన తిస్సాతో ఇలా అంటున్నాడు)
.
తిస్సా!
సాధనను సాధన చేయి
నిన్ను అనుబంధాలు కబళించనీయకు
సంకెళ్ళ నుంచి విముక్తమవ్వు
ఈ లోకంలో నిష్కల్మషంగా జీవించు (5)
.
(తధాగతుడు ఉపాసమతో అనే మరో గణికతో ఇలా అంటున్నాడు)
ఉపాసమా
ఈ ప్రవాహాన్ని నీవు దాటాలి
ఇది మృత్యుమార్గం, అత్యంత కష్టమైనది
ఉపాసమా! నీవు ఇప్పటికే
అన్ని ప్రలోభాలని జయించావు
కొద్దిగా ఓరిమితో ఉండు
ఇదే నీ చివరి జన్మ (10)
.
సంఘ
నేను నా ఇంటిని
నా కొడుకుని, నా పశుసంపదను
నేను ఇష్టపడే వాటన్నిటినీ
త్యజించాను
నా అజ్ఞానం పటాపంచలైంది
నేను కోర్కెలను జయించాను
నా దాహం తీరింది
ఇప్పుడు ఎంతో శాంతిగా ఉంది నాకు
సంఘ సిద్ధార్ధుని అంతఃపుర స్త్రీ అని చెప్పినప్పటికీ - ఆమె పశులకాపరిగా స్వతంత్ర జీవనం సాగించినట్లు, కుటుంబాన్ని కలిగి ఉన్నట్లు పై గాథ ద్వారా అర్ధమౌతుంది.
థేరీలు రాజమాత నుండి వేశ్యల వరకూ వివిధ సామాజిక స్థాయిల నుండి వచ్చారు.
(ఇంకా ఉంది)
గాథల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
.
Ref.
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot

Thursday, August 19, 2021

తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -- పార్ట్4

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు -- పార్ట్4

1500 BCE నాటికి మనుగడలో ఉండిన మాతృస్వామ్య సమాజం క్రమేపీ పితృస్వామ్య సమాజంగా మారడానికి వేద సంప్రదాయం/ఆర్యసంస్కృతి దోహదపడింది. అంతవరకూ వేదాధ్యయనం చేసి, సామాజిక ఉత్పత్తిలో పురుషులతో సమానపాత్ర పోషించి, వేదకాండలను నిర్వహించి; విదుషీమణులుగా, కవయిత్రులుగా, గణనీయమైన పాత్రవహించిన స్త్రీలను ఈ సనాతన ధర్మం కట్టడి చేసి పురుషాధిక్య చట్రంలో బిగించసాగింది.
ఆర్యసంస్కృతి స్త్రీలనే కాక శూద్రులను కూడా జ్ఞానానికి (సంస్కృతానికి) దూరంగా ఉంచింది. వీరికి వేదవిద్యలు నేర్పాలా వద్దా అంటూ అతిప్రాచీన ఆపస్తంబధర్మసూత్ర మొదలు ఆ తదుపరి ఆదిశంకరాచార్యుల బ్రహ్మసూత్ర, పదహారోశతాబ్దపు అప్పయ్యదీక్షితులవరకూ చర్చోపచర్చలు జరుగుతూనే ఉండటం గమనార్హం.
ఆర్యసంస్కృతి ద్వారా వెలికి గురైన స్త్రీలను, శూద్రులను మొదటగా చేరదీసింది జైనమతం. బుద్ధునికన్నా 50 ఏండ్లు పెద్దవాడైన జైన మహావీరుడు ముప్పై ఆరువేల మంది స్త్రీలతో సంఘాన్ని నెలకొల్పాడు. పార్శ్వనాథుడు (BCE 872 -772) స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా అథ్యాత్మిక మార్గాన్ని అన్వేషించే స్వేచ్ఛ ఉందని వారు కూడా జ్ఞాన సముపార్జన చేసి గురుస్థానం పొంది బోధనలు చేయవచ్చని ప్రవచించాడు. అంతే కాక స్త్రీలు అధికారిక, రాజకీయ స్థానాలకు కూడా అర్హులని చెప్పాడు. బౌద్ధ జైనాలు స్థానిక భాషలలో జ్ఞానాన్ని అందిస్తూ, శూద్రులను స్త్రీలను అక్కున చేర్చుకొన్నాయి. ఈ చర్యలు ఆర్యసంస్కృతి భావజాలానికి ప్రతికూలంగా పనిచేసి ఉండొచ్చు, అదొక చారిత్రిక భావజాలవైరుధ్యం.
***
BCE మూడో శతాబ్దంలో మెగస్థనిస్ భారతదేశం గురించి చెబుతూ అక్కడ -- బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, విద్యలను అధ్యయనం చేసే సంచార స్త్రీ లు ఉన్నారని, వీరిని పబ్బజితా (pabbajita the Female Wanderer) అంటారని చెప్పాడు. ప్రతీదశలో స్త్రీ ఎవరో ఒకరి సంరక్షణలో ఉండాలి తప్ప ఆమెకు స్వాతంత్ర్యం లేదు అంటూ మనుస్మృతిలో (400 BCE -700 CE) చెప్పిన పురుషాధిక్య కట్టుబాటును ధిక్కరించి భార్యగానో, తల్లిగానో మరొకరికి లొంగిపోయి, స్వేచ్ఛను కోల్పోవటానికి ఇష్టపడని స్త్రీలు బౌద్ధ జైనాల వైపు ఆకర్షితులై సంచార జీవనాన్ని సాగించేవారని ఊహించవచ్చు.
బుద్దిజం క్షీణించాక ఈ female wanderers ను అప్పటి సమాజం “Loose women” గా చూడటం మొదలుపెట్టి ఉంటుంది. (ఆంధ్రదేశంలో శిథిలరూపంలో ఉన్న ఒకనాటి బౌద్ధారామాలను లంజలదిబ్బలు అనే పేరుతో వ్యవహరింపబడటం నేటికీ గమనించవచ్చు.) “Loose women” ను, ఆత్మస్వేచ్ఛకొరకు సంప్రదాయాన్ని ధిక్కరించిన పరిత్యాగులను కలిపి చూడలేం. ఎందుకంటే బుద్ధిజంలోని అష్టాంగమార్గ అనుసరణ కఠినమైనది. చెడువర్తనకు తావు లేనిది.
స్త్రీలు బౌద్ధ బిక్షుణిలుగా మారాలంటే కొన్ని నిబంధనలు కలవు. కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి. తల్లిదండ్రులు జీవించి ఉంటే వారి అనుమతి లేదా భర్త ఉంటే అతని అనుమతి తప్పని సరి. అప్పటికే సంఘంలో ఉండే ఇతర బిక్షుణి, బిక్షుకుల అంగీకారం ఉండాలి. ఈ దశలో కుటుంబసంబంధాలను తెంచుకోనక్కరలేదు.
ఇలా రెండేళ్ల పాటు బౌద్ధ సన్యాసిని వద్ద విద్యనభ్యసించాక సంఘంలోకి సభ్యురాలిగా తీసుకొంటారు. అలాంటి వారిని "సిఖమన" అంటారు (sikkhamana- female buddhist probationar). ఈ దశలో 12 ఏండ్లపాటు సంఘంలో ఉంటే బిక్షుణిగా గుర్తిస్తారు. ఈమె కొత్తగా సంఘంలోకి వచ్చినవారికి శిక్షణ ఇవ్వవచ్చు. వృద్ధ భిక్షుణిని థేరి అంటారు.
బౌద్ధ ఆరామంలో మఠవాసినులుగా ఉండాలంటే -- వనాలలో సంచరించకూడదు; ఒంటరిగా జనావాసాలలోకి వెళ్లకూడదు; ఒంటరిగా నదులు దాటకూడదు; ఒంటరిగా రాత్రివేళల సంచరించకూడదు; ఒంటరిగా ప్రయాణించకూడదు; పురుషులు, స్వైరిణిలు స్నానమాడిన చోట స్నానం చేయరాదు- లాంటి నియమాలను బుద్ధుడే స్వయంగా స్త్రీల కొరకు చెప్పాడు.
***
థేరీ గాథల ద్వారా ఆనాటి స్త్రీలు ఎంతటి ఆత్మవిశ్వాసంతో, స్వతంత్ర వ్యక్తిత్వంతో, ఎన్ని కష్టాలొచ్చినా నిరాశకు కృంగిపోని దృఢచిత్తంతో, అచంచలమైన స్వేచ్ఛాకాంక్షతో కూడిన జీవనేచ్ఛతో జీవనం సాగించారో ఆశ్చర్యం కలిగించక మానదు…
పురుషుని అండలేకుండా స్త్రీలు స్వతంత్రంగా నివసించటం వల్ల కలిగే సామాజిక సమస్యలు బౌద్ధమతానికి తెలుసు. దైహికవాంఛల పట్ల వైముఖ్యం పెంపొందించుకోవటమే దీనికి పరిష్కారంగా సూచించినట్లు సుభ చెప్పిన గాథ ద్వారా అర్ధంచేసుకోవాలి.
***
సుభ ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. గొప్ప అందగత్తె. యుక్తవయసులో బౌద్ధ దీక్ష తీసుకొని తక్కువ కాలంలోనే ఆత్మజ్ఞానం పొంది వివేచన కలిగిన భిక్షుణిగా పేరుతెచ్చుకొన్నది. ఒకనాడు ఆమె ఒంటరిగా అడవిలో సంచరిస్తున్నప్పుడు కామాతురుడైన ఒక అందమైన యువకుడు ఎదురై ఆమెను నిలువరించాడు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ కు సంక్షిప్తరూపమిది.
సుభ:
ఎవరవోయి నీవు? నేను నీకేమి చేసాను?
ఎందుకు నాదారికి అడ్డు పడుతున్నావు?
ఒంటరిగా ఉన్న అమ్మాయిని తాకటం సరి కాదు
నేను పవిత్రంగా ఉన్నాను, ఏ కళంకమూ లేదు
మా రక్షకుడు, బోధకురాలు నన్ను తీర్చిదిద్దిన విధానమది.
నీ బుద్ధి మంచిగా లేదు, కోర్కెతో రగిలిపోతోంది
నేను నిర్మలంగా ఉన్నాను
నాకు ఏ వాంఛలూ లేవు
తేటగా ఉన్నాను
నా మార్గానికి ఎందుకు అడ్డుపడుతున్నావు?
యువకుడు:
నువ్వు అందగత్తెవు, అమాయకంగా ఉన్నావు
నీ కాషాయ వస్త్రాలను విడిచిపెట్టు
మనిద్దరం ఈ అడవిలో విహరిద్దాం
గాలి తియ్యగా ఉంది
అడవంతా పుష్పించింది
తరువులు పుప్పొడి వెదచల్లుతున్నాయి
వసంత రుతువు ఆనందాలకు నెలవు
ఏ తోడూ లేక ఈ వన సంచారం ఏం సుఖం నీకు?
చుట్టూ మృగాలు,
మగ ఏనుగులచే ఉద్రేకించబడిన
ఆడఏనుగుల ఘీంకారాలు
భయం వేయటం లేదా?
నీవు నాతో వచ్చేయి
నీకొరకు పెద్ద భవంతి నిర్మిస్తాను
బంగారం, రత్నాలు, ముత్యాలతో
సేవకులు నిన్ను అలంకరిస్తారు
గంధపుచెక్కతో చేసిన తల్పంపై పవళించగ
రా... నన్ను అంగీకరించు...
సుభ:
ఈ దుర్భలదేహంలో మృత్యువు ఉంది
ఈ దేహాన్ని ఎందుకు తదేకంగా
చూస్తున్నావు?
దీనిలో నిన్ను ఆకర్షించినదేమిటీ?
యువకుడు:
నీ నేత్రాలు... మృగనయనీ... నీ నేత్రాలు!
అవి ప్రకాశించే నీలి కలువలు
వాటిని చూస్తే నీపై నా ప్రేమ అతిశయిస్తుంది
నీవు నిష్క్రమించినా
నీ కనులను, నీ కనుబొమలను, నీ చూపులను
స్మరించుకొంటూనే ఉంటాను
నీ నేత్రాలను మించినవేవీ లేవీ లోకంలో
సుభ:
బుద్ధభగవానుడి పుత్రికను నీవు వాంఛిస్తున్నావు
ఇది తప్పు మార్గము
నాకు ఏ కోర్కెలు లేవు
కోర్కెలు అంటే ఏమిటో కూడా నాకు తెలియదు
కోరుకోవటానికి అర్హతకలిగినది ఏదీ కనిపించదు నాకు
నేను అష్టాంగమార్గంలో సాగుతున్నాను
అంధుడా!
నీవు లేని వస్తువుల వెంటపడుతున్నావు
నేత్రాలు అనేవి
గుంటల్లో ఉండే చిన్న చిన్న గోళాలు
కన్నీళ్ళు, శ్లేష్మం నిండిన బంతులు
(అని చెప్పి ఆమె తన కంటిని బలవంతంగా పెకలించి అతని చేతిలో పెట్టి ఇలా అన్నది)
.
నీవు ఎంతో ప్రేమించిన
నా నేత్రం ఇదిగో!
తీసుకో .... ఇక ఇది నీదే!
.
(ఊహించని ఈ సంఘటనకు చలించిపోయిన ఆ యువకుడు పశ్చాత్తాపం పొంది క్షమించమని ఆమెను కోరాడు)
యువకుడు:
పవిత్రమైన భిక్షుణీ!
దయచేసి నీవు నీ పూర్వరూపాన్ని పొందు
నన్ను మన్నించు.
ఇకపై ఇలా ఎన్నడూ జరగదు
దయచేసి నీవు నీ పూర్వరూపాన్ని పొందు
నన్ను మన్నించు. (369-402)
(పిదప సుభ తధాగతుని వద్దకు వెళ్ళగా అతని చూపులు ఆమెపై ప్రసరించగానే ఆమెకు నేత్రము తిరిగి పూర్వస్థితికి వచ్చింది.)
.
పై గాథలో సుభకు ఆ యువకునిపై ఏ రకమైన మోహమూ లేదు. శారీరిక వాంఛలపట్ల ఆసక్తి లేదు. బుద్ధుని బోధనల వల్ల అంతర్నేత్రం పొందిన ఆమెకు బాహ్యనేత్రాలు అవసరం లేవని చెప్పటమే ఈ గాథ పరమార్ధం. సుభకు నేత్రము తిరిగి తెప్పించటం అనే ఉదంతం విశేషమైనది ఎందుకంటే బుద్ధభగవానుడు మహిమలు చూపించిన దాఖలాలు పెద్దగా కనిపించవు.
సోర్స్:
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot
గాధల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

Tuesday, August 17, 2021

తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 2

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 2

ఆమ్రపాలి
.
వైశాలి నగరంలో ప్రమదావనంలో పనిచేసే తోటమాలికి ఒక మామిడిచెట్టు క్రింద ఓ చిన్నారి శిశువు దొరికింది. ఆ శిశువుకు అతడు అంబపాలి/ఆమ్రపాలి అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆమె అపురూపమైన సౌందర్యరాశిగా రూపుదిద్దుకొంది. ఆమెను పెండ్లాడాలని అనేకమంది యువరాజులు పోటీపడి వాదులాడుకొనేవారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారినపుడు- అంబపాలిని వేశ్యగామారి అందరికి ప్రేమను పంచుతూ జీవించమని పెద్దలు తీర్పుచెప్పారట. ఆ మేరకు అంబపాలి వేశ్యగా జీవనం సాగించి అపారమైన ధనాన్ని కూడబెట్టి నగరంలో ఉన్నతవర్గానికి చెందిన వ్యక్తిగా జీవించసాగింది. బింబిసార చక్రవర్తి ద్వారా అంబపాలి కుమారుడిని పొందింది. ఒకనాడు అంబపాలి గౌతమ బుద్ధుని బోధనలు స్వయంగా విని, బౌద్ధ బిక్షుణి గా మారి సంఘారామ జీవనం ప్రారంభించింది. తన సంపదలను సంఘపరం చేసింది. గొప్ప ఆరామాన్ని నిర్మించింది. తధాగతుడు నిర్వాణానికి నాలుగు నెలల ముందు అంబపాలి నిర్మించిన ఆరామంలో కొన్నాళ్ళు బసచేసాడు.
అంబాపాలి వేశ్య. అంతఃపురవాసినిగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. అన్నీ పరిత్యజించి బుద్ధుని బోధనల ప్రభావంతో ఆమె వ్రాసిన ఒక గాథలో అందం శాశ్వతం కాదు అనే జీవితసత్యం ప్రకటిస్తుంది. ఇది ధర్మమార్గంలోకి ప్రజలను ఆకర్షించటానికి వ్రాసినదిగా భావించాలి.
.
ఒకప్పుడు నా కురులు
గండుతుమ్మెదల రంగులో నల్లగా, ఒత్తుగా ఉండేవి
నేడు
జనపనార వలె వడిలిపోయి ఉన్నాయి
ఒకప్పుడు నా కొప్పునిండా పూలుండేవి
తలంతా సుగంధ పేటికలా పరిమళాలు చిందేది
నేడు
కుందేలు ఉన్నివలే దుర్గంధమోడుతోంది
ఒకప్పుడు నా కనుబొమలు
నెలవంకల వలే కాంతులీనుతూ ఉండేవి
నేడు
అవి వాలి, ముడుతలు పడి ఉన్నాయి.
ఒకప్పుడు నా కనులు
వజ్రాలవలే తళుక్కుమంటూ మెరిసేవి
నేడు
అవి ఎవరినీ వెనక్కి తిరిగి చూసేలా చేయటం లేదు
ఒకప్పుడు నా గొంతు
తోటలో సంచరించే కోయిల వలే ఉండేది
నేడు
బీటలుతీసి, పెళుసు బారి
నా వయసును స్పష్టంగా పలికిస్తూ ఉంది
ఒకప్పుడు నా వక్షోజాలు
అందంగా, ఉన్నతంగా గుండ్రంగా ఉండేవి
నేడు
అవి ఖాళీ తోలు సంచుల్లా వేలాడుతున్నాయి
ఒకప్పుడు నా పాదాలు
మెత్తని దూదికూరినట్లు మృదువుగా ఉండేవి
నేడు
అవి పగుళ్ళుతీసి పుచ్చిపోయాయి
చూసావుగా నా దేహం ఎలాగ శిథిలమైందో
నేడు ఇది
బాధలు వసించే చోటు
పెచ్చులు రాలిపోతున్న
ఒక జీర్ణ గృహం
సత్యాన్ని పలికేవాని బోధనలు ఇవి (252-270)
.
ఏ మతంలోనైనా ఉన్మత్తతలకు దారితీసే ఐహిక సుఖాల పట్ల విముఖతను పెంచేలా బోధనలు ఉంటాయి. బుద్ధిజం మినహాయింపు కాదు. ఏమిజన్మంబు ఏమి జీవనంబు; మానవా ఏమున్నది ఈ దేహం; తోలుతిత్తి ఇది తుటులు తొమ్మిది … లాంటి వైరాగ్య గీతాలలోని భావధారకు 2600 ఏండ్లక్రితం అంబాపాలి రచించిన ఈ గీతమే మూలం అనటానికి సందేహించక్కరలేదు.
గాథల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
.
Ref.
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot



Saturday, August 14, 2021

తెరిగాథ : బౌద్ధ భిక్షుకిల ప్రాకృత గాథలు - పార్ట్ 1

 తెరిగాథ : బౌద్ధ భిక్షుకిల ప్రాకృత గాథలు - పార్ట్ 1

.
బుద్ధునికి సమకాలీనులు స్వయంగా ఆయనవద్దే శిష్యరికం చేసిన తొలి బౌద్ధ సన్యాసినులు చెప్పుకొన్న స్వీయానుభవ కవితలు థేరిగాథలు. థేరీ అంటే సన్యాసిని/భిక్షుకి/భిక్షుణి అని అర్ధం. ఈ గాథలు BCE ఆరోశతాబ్దంలో వ్రాయబడినా చాలాకాలం మౌఖికంగా ఉండి BCE 80 లో పాలి భాషలోకి గ్రంధస్థం చేయబడ్డాయి. మొత్తం 494 థేరీ గాథలను 73 మంది వివిధ థేరీలు రచించారు. వీరిలో బ్రాహ్మణులు 21 మంది, క్షత్రియులు 27, వైశ్యులు 17, శూద్రులు 8 మంది అని Peggy Kim Meill గుర్తించాడు
.
CE ఆరోశతాబ్దంలో ధర్మపాలుడు థేరీగాథలకు వ్యాఖ్యానం వ్రాసాడు. ఇది ప్రపంచ సాహిత్యంలోనే తొలి కవితాసంకలనం మరీ ముఖ్యంగా స్త్రీలు వ్రాసిన సంకలనం.
థేరీ లందరూ సమాజంలో వివిధ సామాజిక స్థాయిలనుంచి వచ్చారు. రాజమాతల నుండి వేశ్యలవరకూ భిన్న నేపథ్యాలను కలిగి ఉన్నారు. వీరందరికీ బౌద్ధం ఏ విధంగా మానసిక ధైర్యాన్ని, జీవనేచ్ఛని, జ్ఞానాన్ని ఇచ్చిందో వీరే వివిధ గాథలలో చెప్పుకొన్నారు. వీరు తొలితరం బౌద్ధులు. థేరీగాథలు 2600 సంవత్సరాల నాటి సమాజాన్ని స్త్రీ దృక్కోణంలోంచి మనకు చూపిస్తాయి. శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఒక వ్యాసంలో అన్నట్లు క్రీస్తుపూర్వపు 6 వ శతాబ్దమంతా ఈ థేరీ గాథల కవితాసంకలనంలో కనిపిస్తుంది.
థేరీ ల జీవన విధానం
.
సంఘారామంలోకి స్త్రీలను బుద్ధుడు మొదట్లో అనుమతించలేదు. ఒకనాడు ప్రజాపతి గౌతమి (ఈమె బుద్ధుని పెంచిన పినతల్లి) కపిలవస్తులో బుద్ధుని వద్దకు వెళ్ళి “ఓ తధాగతా! అన్ని బంధాలను పరిత్యజించి, బౌద్ధధర్మాన్ని ఆచరించటానికి స్త్రీలు కూడా సంఘంలోకి రావాలనుకొంటున్నారు, వారిని అనుమతించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను” అని అడుగగా తధాగతుడు అంగీకరించలేదు. మరో సందర్భంలో ప్రజాపతి గౌతమి - కేశఖంఢన చేసుకొని, కాషాయ వస్త్రాలను ధరించి, ఉబ్బి, దుమ్ము గొట్టుకుపోయిన పాదాలతో బుద్ధుడిని వైశాలి నగరంలో కలుసుకొని స్త్రీలకు ప్రవేశం కల్పించమని మరలా ప్రార్ధించింది.
తధాగతుడు మొదట్లో అంగీకరించకపోయినా పదే పదే అభ్యర్ధనల అనంతరం – కొన్ని ప్రత్యేకమైన కట్టుబాట్లతో స్త్రీలను సంఘంలోకి అనుమతించాడు. బిక్షుకిలు (సన్యాసినులు) సంఘంలో ద్వితీయ శ్రేణి జీవనాన్ని సాగించేలా ఈ కట్టుబాట్లు ఉన్నాయని వీటిని తొలగించమని ప్రజాపతి గౌతమి చాలా సందర్భాలలో తధాగతుని కోరినట్లు కొన్ని గాథలలో కలదు- మరీ ముఖ్యంగా ఎంతపెద్దవయసు సన్యాసినులైనా అత్యంత పిన్నవయస్కుడైన సన్యాసికి కూడా ఎదురుపడినపుడు సాష్టాంగవందనం చేయాలనే మొదటి సూత్రాన్ని.
బౌద్ధాన్ని స్వీకరించిన స్త్రీలు సన్యాసుల వలె చైత్యాలలో నివసించాలి. ఒక్కొక్కరికి మూడు కాషాయ వస్త్రములు, ఒక బిక్షాపాత్ర, సూది దారం, నీటినివడకొట్టుకొనే పాత్ర, ఒక చాకు ఇవ్వబడతాయి. బిక్షుకిలకు ఇవి కాక బహిష్టుసమయంలో ధరించే మొలపట్టీ అదనం. వీరు నివసించే గదులు సామాన్యంగా మట్టితో కానీ, వెదురుతో కానీ నిర్మించబడి ఉంటాయి. నివాసాలకు సమీపంలో వీరి వసతి ఉండాలి. వీరు ఊరిలో సంచరిస్తూ, బుద్ధుని బోధనలు ప్రవచిస్తూ అన్నం, బార్లీ, గోధుమలు, పండ్లు, కూరగాయలను మాత్రమే భిక్షంగా గ్రహించాలి. నెయ్యి, పాలు, తేనె, పెరుగు, మాంసము లాంటివి నిషిద్ధము. ఒక ప్రాంతంలో కనీసం 5 మంది భిక్షుకీలు ఉన్నప్పుడే సంఘం ఏర్పడాలి.
***
థేరిగాథలు పాలిభాషనుండి ఇంగ్లీషులోకి 1909 లో అనువదించబడ్డాయి. ఈ గాథలు గానానికి వీలుగా పాటలుగా, సత్సంగంలో చెప్పుకొనే కథలుగా ఉండేవి. ప్రతీ గాథ క్రింద దానిని రచించిన వారి పేరు ఉంటుంది. వీరు నిజంగా ఆ గాథలను రచించిన కవయిత్రులా, అసలు వారు స్త్రీ లేనా అనే ప్రశ్నలు రాకమానవు. దీనికి సమాధానంగా- ఇతర బౌద్ధ రచనలలో ప్రస్తావించబడిన 20 మంది స్త్రీ భిక్షుకుల పేర్లు ఈ 73 మంది పేర్లతో సరిపోలుతుండటం; ఈ థేరీగాథలలో చెప్పిన వివిధ జీవితానుభవాలలో 40 కథలు ఆనాటి సమకాలీన బౌద్ధ గ్రంధాలలో కూడా ఉండటాన్ని బట్టి థేరీగాథలు కల్పితగాథలు కాకపోవచ్చని, వాటిని వ్రాసిన వ్యక్తులు చారిత్రిక స్త్రీలేనని పండితులు నిర్ధారించారు .
***
చంద (Chanda) ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీ. ఈమె చిన్నవయసులోనే మహమ్మారివల్ల (ahiwataka-roga- శ్వాసవలన అంటుకొనే వ్యాధి. మొదట బల్లులు, పాములకు వచ్చి క్రమేపీ కుక్కలు పిల్లులు, చివరకు మనుషులకు కూడా సోకే ప్రాణాంతక వ్యాధి) కుటుంబాన్ని బంధువులను కోల్పోయింది. ఒక అనాధగా మారింది. ఇల్లులేదు, ఉపాధి లేదు. వీధులలో యాచించి బ్రతకాల్సిన స్థితి ఈమె తన దీనస్థితి నుంచి జ్ఞానమార్గం వైపు ఎలా ప్రయాణించిందో ఒక గాథరూపంలో ఇలా నిక్షిప్తం చేసింది.
ఒకప్పుడు నేను చాలా పేదరాలిని, విధవను,
సంతానం, బంధువులు, స్నేహితులు లేరు.
తిండిలేదు, సరైన దుస్తులు లేవు.
భిక్షా పాత్ర, చేతకర్ర ధరించి ఇల్లిల్లూ తిరుగుతూ
చలిలో, గాడ్పులలో ఏడేళ్ళపాటు బిచ్చమెత్తుకొని జీవించాను.
ఒకనాడొక సన్యాసినిని చూసి నాకు బౌద్ధదీక్ష ఇవ్వమని అడిగాను
ఆమె నన్ను ఆదరించింది.
నాపై కరుణ చూపి నన్ను గొప్ప జీవిత ధ్యేయం వైపు నడిపించింది.
నేను ఆమె బోధనలు శ్రద్ధగా విన్నాను, ఆచరించాను
నేడు ఏ మాలిన్యమూ నా హృదయాన్ని తాకలేదు. (122-126)
.
పై గాథలోని చందా కు దీక్ష ఇచ్చిన స్త్రీ పేరు పతాచర (Patacara). ఈమె ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. జీవితం నిండా దుర్భరమైన కష్టాలు. పతాచర యుక్తవయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులను కాదని, ఇంటిలో పనిచేసే ఒక సేవకునితో లేచిపోయి పెళ్ళిచేసుకొంది. గర్భం ధరించి పురుడు కోసం పుట్టింటికి వెళదామని బయలుదేరగా మార్గం మధ్యలోనే నొప్పులు వచ్చి దారిపక్కనే ప్రసవిస్తుంది. రెండో గర్భానికి కూడా అలాగే జరుగుతుంది. భర్త పాముకాటుకు గురై మరణిస్తాడు. పుట్టింటికి పోదామని బయలుదేరగా మార్గ మధ్యంలో వరదలో కొట్టుకుపోయి పెద్దకొడుకు, గద్ద ఎత్తుకుపోగా చిన్నకొడుకు మరణిస్తారు. పుట్టింటి వెళ్ళగా అక్కడ తల్లిదండ్రులు వానలకు ఇల్లుకూలి మరణించి ఉంటారు. ఇన్ని బాధలు ఒకేసారి మీదపడటం వల్ల ఆమె మతిస్వాధీనం తప్పిపోతుంది. అంతటి దుఃఖంలో ఆమె బుద్ధుని నీడలో చేరుతుంది. తధాగతుని బోధనలతో ఆమె స్వస్థపడి ధమ్మప్రచారంలో శేషజీవితాన్ని సాగిస్తుంది.
స్వయంగా జీవిత సర్వస్వాన్ని కోల్పోయిన ఈ పతాచర, సంతానాన్ని కోల్పోయిన కొంతమంది మహిళలను ఒకనాడు ఇలా ఓదార్చిందట….
.
“అయ్యో నా కుమారుడా” అని మీరు రోదిస్తున్నారు
వచ్చింది ఎవరో, పోయింది ఎవరో మీకు తెలియదు
ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు
ఇదంతా మానవ దుఃఖం
దీన్ని అర్ధం చేసుకొంటే
అతను రావటం పోవటం గురించి మీరు బాధపడరు.
మీరు అడగకుండా అతను వచ్చాడు
మీతో చెప్పకుండా వెళ్ళిపోయాడు
మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు
ఎక్కడినుంచో ఇక్కడకు వచ్చాడు,
కొద్దిరోజులున్నాడు
ఒక దారిలో వచ్చి మరోదారిలో వెళ్ళిపోయాడు
వచ్చాడు వెళ్ళాడు. ఇందులో బాధపడటానికి ఏముందీ?
.
(ఈ మాటలు విన్న తరువాత పుత్రులను కోల్పోయిన ఆ స్త్రీలు ఇలా అనుకొన్నారట)
.
ఆమె నా గుండెల్లో గుచ్చుకొన్న బాణాన్ని
నా పుత్రశోకాన్ని బయటకు లాగేసింది
నిన్నటివరకూ ఆ శోకం నన్ను కబళించింది
నేడు అది పోయింది.
నేను విముక్తమయ్యాను
బౌద్ధ ధర్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించి
జ్ఞానమార్గంలో జీవిస్తాను (127-132)
.
(ఇంకావుంది)
సోర్స్:
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot
గాధల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

Tuesday, August 10, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 4



వజ్జలగ్గ – గాథలు పార్ట్ 4
#వజ్జలగ్గ
.
ప్రాచీన భారత సమాజంలో స్త్రీలు పురుషులతో సమానమైన గౌరవాన్ని పొందారు. ఎవరైనా భర్తను కోల్పోయినా భర్త ఉండగా అక్రమ సంబంధం కలిగి ఉన్నా ప్రాయశ్చిత్తం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకొని సాధారణ జీవనం సాగించవచ్చు అని హిందు ధర్మశాస్త్రాలు చెప్పాయి. వితంతు పునర్వివాహం కూడా ఆనాటి సమాజానికి వింత కాదు. భారతంలోని దమయంతి పునర్వివాహ స్వయంవర ఉదంతం దీనికి తార్కాణం. పరాశర, నారద స్మృతులలో కూడా పునర్వివాహ ప్రస్తావనలు ఉన్నాయి.
కర్మకాండలు, క్రతువులు జరపవలసి వచ్చినప్పుడు తప్పని సరిగా దంపతులు పాల్గొనాలి కనుక అత్యవసర పరిస్థితులలో ముప్పై ఏండ్ల పురుషుడు పన్నెండేళ్ళు దాటిన బాలికను మాత్రమే వివాహం చేసుకోవాలని, అదే విధంగా 24 ఏండ్ల యువకుడు 8 ఏండ్లు దాటిన బాలికను మాత్రమే పెండ్లాడాలని మనుసంహిత చెప్పింది. ఎలాంటి వివాహమైనా ఆ బాలిక రజస్వల అయి యుక్తవయసువచ్చాక మాత్రమే కాపురానికి పంపాలని కూడా చెప్పబడింది. ఆ మేరకు చూసినప్పుడు ఆనాటి సమాజంలో బాల్యవివాహాలు విశృంఖలంగా జరిగినట్లు చెప్పలేం., వివాహ వయస్సు అబ్బాయిలకు 25 ఏండ్లు, అమ్మాయిలకు 16 ఏండ్లు ఉండాలని వైద్యగ్రంధమైన శుశ్రుత సంహిత నిర్ధేశించింది.
BCE 200 నుంచి CE 150 మధ్య దాదాపు 350 సంవత్సరాలు భారతదేశం మరీముఖ్యంగా ఉత్తరభారతదేశం అత్యంత క్లిష్టమైన చీకటి కాలాన్ని చూసింది. మొదట గ్రీకులు తరువాత సింథియన్ లు, పార్థియన్ లు భరత ఖంఢంపై దండయాత్రలు జరిపారు. ఈ దండయాత్రలలో మొత్తం హిందూ జనాభాలోని 50 శాతం మంది నిర్మూలించబడ్డారు. వీరిలో సగం మంది చంపబడితే మిగిలినవారిని బానిసలుగా ఎత్తుకుపోయారు. ఈ కాలంలోనే ఓడిపోయిన స్థానిక జనాభా బానిసత్వానికి గురయ్యింది. అప్పుడే స్త్రీలు బానిసకొక బానిసగా మార్చబడ్డారు.
(అలా విపరీతమైన అంతర్గత ఒత్తిడికి గురైన హిందూ సమాజం. అగ్రెసివ్ నెస్ ను పొంది శాంతి, పరిత్యాగాలను బోధించే బౌద్ధ జైనాలను ద్వేషించి వాటికి దూరంగా జరిగిందనే ఒక వాదన కలదు. అంతవరకూ సన్యాసిగా మారి అన్నీ పరిత్యజించి తపస్సు చేసుకోవటం గొప్పదిగా చెప్పబడినప్పటికీ - వార్ధక్యంలో తప్ప వయసులో ఉన్నప్పుడు సన్యసించినా వారసులను ఇవ్వకుండా ఈ ఐహిక బంధాలను పరిత్యజించినా అలాంటి వ్యక్తులను శిక్షించాలని -అర్ధ శాస్త్రంలో కౌటిల్యుడు గట్టిగా చెప్పాడు. )
ఒకప్పుడు స్త్రీలకు కూడా ఉపనయనం ఉండేది. అది CE 200 నుండి ఆగిపోయింది. వివాహ వయస్సు తగ్గించబడింది. దానివల్ల వారికి విద్యలు దూరమయ్యాయి. ఈ మూడు కారణాల వల్ల స్త్రీ యొక్క స్థానం క్రమేపీ క్రిందకు జారింది.
ఈ సందర్భంలోనే స్త్రీలకు పాతివ్ర్యత్యం గురించి; జీవితపర్యంతం పరాధీనంగా బ్రతకటమే ఆదర్శంగాను; భర్త ధూర్తుడైనా అతన్నే పూజించాలని; భర్త తనకు అనుకూలవతికాని భార్యను త్యజించవచ్చు కానీ భార్యకు ఆ హక్కు లేదని లాంటి నీతి సూత్రాలను స్మృతికారులు బోధించటం మొదలుపెట్టారు. స్త్రీ అంటే పుత్రుడను ఇచ్చే సాధనంగా మార్చివేసారు.
ఈ కాలానికే చెందిన వజ్జలగ్గలోని కొన్ని గాథలు ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో చెపుతాయి. ఈ గాథలు స్త్రీలను పురుషాధిక్యత అనే చట్రంలో బిగించటానికి సాహిత్యరూపంలో ఉన్న సామాజిక సూత్రాలు అని సులభంగానే పోల్చుకొనవచ్చును.
***
అందరూ తృప్తిగా భోంచేసాకా మిగిలినవి
ఆమె తింటుంది
సేవకులతో సహా అందరూ నిదురించాక
ఆమె నిద్రకుపక్రమించి
అందరికన్నా ముందరగా నిద్రలేస్తుంది
ఆమె ఇంటి ఇల్లాలు కాదు ఆ గృహ లక్ష్మి (455)
.
ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు ఆ ఇల్లాలు
చేతి గాజులమ్మి తన పేద భర్తకు
గౌరవభంగం కలగకుండా చూసిందట.
ఆమె ఔదార్యానికి ఊరు ఊరంతా కన్నీరు పెట్టుకొంది. 458
.
గుణమే మిన్న అని నమ్మే పేద మగని పరువు నిలపటం కొరకు
ఆడంబరాలు, పటాటోపం ప్రదర్శించే తన పుట్టింటివారితో
గిల్లికజ్జాలు పెట్టుకొని తెగతెంపులు చేసుకొందట
ఆ ఉత్తమ ఇల్లాలు. (462)
.
పిల్లలందరూ భోజనాలు చేసాకా
మిగిలిన ఆహారపదార్ధాలను
తనకు ఆకలిగా ఉన్నప్పటికీ
ఆ ఇల్లాలు యాచకులకు బిక్షంగా వేస్తోంది
కుటుంబగౌరవం నిలబెట్టటం కొరకు (461)
***
చక్కగా చూర్ణం చేసి సరైన పాళ్ళలో కలిపి
సిరా తయారు చేయటం నీకు రాదు,
లేఖినిని సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు, తప్పులు రాస్తున్నావు
మూర్ఖుడా! నీవు ప్రజ్ఞకలిగిన లిపికారుడవు కాదు
అందమైన పత్రాలను పాడుచేసేలా ఉన్నావు
నీవింక దయచేయి. (508)
ఒకప్పుడు లేఖకులు ఊరూరా తిరుగుతూ ఊరి పండితుల వద్ద ఉండే వివిధ గ్రంధాలకు పుత్రికలను పుట్టిస్తూ (నకళ్ళు తీయటం) జీవనం సాగించేవారు. రామాయణ భారతాదులకు నకళ్ళుతీయించి పంచిపెట్టటం ఒక పుణ్యకార్యంగా ఉండేది అప్పట్లో. అలాంటి లేఖన పని సరిగ్గా చేతకాని ఒక లేఖకుని గురించి పైగాథ తెలుపుతుంది.
ధార్మిక కావ్యాల నకళ్ళు తీయించటానికి అవసరమయ్యే తాళపత్రాల కొరకు ఊరిలో తాటి వనాలను పెంచి ఆలయాలకు దానంగా ఇచ్చినట్లు పలు శాసనాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు: విమలపాత్రుడు అనే దాత CE 1433 లో నాలుగు లక్షల అరవై వేల తాళ్ళను నాటించి ఆ సందర్భముగా పిఠాపురం కుంతీమాథవ స్వామి ఆలయంలో వేయించిన ఒక శాసనంలో – ప్రజలకు బుద్దిన్ని, మతివిశేషమున్ను ధర్మమున్ను యీ తాడాకుల నే పంచాంగాలు పురాణాలు శాస్త్రాలు ధర్మకర్తలు వ్రాసి చదువంగాను//సకలధర్మాలకున్ను తాంటి వృక్షమే మూలము…. అని ఉన్నది.
.
జ్యోతిష్కుడు బలపాన్ని చేత ధరించి
నగరవీధుల్లో సంచరిస్తున్నాడు,
అతనికి గ్రహగతులన్నీ తెలుసు
ఎవరైనా తమ గ్రహచారం అడిగితే
అతను లెక్కించి చెబుతాడు. (497)
వేదకాండలకు శుభ ముహూర్తములు నిర్ణయించేందుకు వేదాలకు ఉపాంగంగా జ్యోతిష్యశాస్త్రం ఏర్పడింది. వరాహమిహిరుడు, ఆర్యభట్టారకుడు, పరాశరుడు, కల్యాణవర్మ లాంటి వారు ఖగోళశాస్త్ర పరిశీలనలను జ్యోతిష్యశాస్త్రానికి అన్వయించి ఈ రంగాన్ని తీర్చిదిద్దారు.
ఈ జ్యోతిష్యశాస్త్రం హిందూ సమాజాన్ని సంపూర్ణంగా శాసించిందనే చెప్పాలి. రాజుల స్థాయిలో యజ్ఞయాగాదులకు, యుద్ధాలకు, మంచి చెడ్డలకు ముహుర్తాలు, శాంతులు నిర్ణయించటమే కాక సామాన్యుల జీవితాలలోకి కూడా జ్యోతిష్యం ఏ మేరకు చొచ్చుకుపోయిందో పై గాథ తెలియచేస్తుంది. నగరవీధుల్లో జ్యోతిష్యం ఒక అంగడి సరుకుగా ఉంటూ ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసి ఉంటుందో! ఎంతమందికి ఉపాధి కల్పించి ఉంటుందో ఊహింపశక్యం కాదు.
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

Sunday, August 8, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 3



వజ్జలగ్గ – గాథలు పార్ట్ 3
.
(వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు)
***
వింధ్యపర్వతాలు, తూర్పుకనుమలు ప్రాకృతగాథల భౌగోళిక సరిహద్దులుగా ఉన్నాయి. అక్కడి అరణ్యాలలో జీవించే పుళిందుల ప్రస్తావనలు అనేక గాథలలో విస్తారంగా కనిపిస్తాయి. వేటాడి సేకరించిన జంతువుల చర్మాలు, ఏనుగు దంతాలను ఈ పుళిందులు పట్టణం నుంచి వచ్చే వ్యాపారులకు విక్రయించేవారని కొన్ని గాథలద్వారా తెలుస్తుంది. ప్రాకృత గాథలలో ఈ పుళిందులు కారుమేఘాలను చూసి ఏనుగుల మంద అని సంబరపడేవారిగాను, ముత్యాలను కాదని గవ్వలను ఎంచుకొనే కల్లకపటం లేనివారిగాను కనిపిస్తారు. "వేటగాడు అతని కొత్తపెండ్లాము" అనే Motif లో (వివిధ గాథల మూలాంశం) అకలుషిత ప్రేమ, శృంగారేచ్ఛ అపురూపంగా వ్యక్తీకరింపబడుతుంది.
.
వింటిని చెక్కగా వచ్చిన పేళ్ళు
గాలికి సుడులు తిరుగుతూ
పైకి లేచిన దృశ్యం విజయపతాకంలా
ఆ వేటగాని భార్యకు పట్టిన అదృష్టాన్ని
అందరకూ చాటుతోంది. (207)
.
పై గాథ హాల విరచితం గా సప్తశతి లో కూడా ఉన్నది. కొత్తగా పెళ్ళయిన వేటగాడు భార్యతో మిక్కిలి అన్యోన్యంగా ఉన్నాడని చెప్పటానికి, రోజూ అతను తన బరువైన విల్లును (అంతబరువు మోయలేక) చెక్కి చెక్కి సన్నగా తేలికగా చేసుకొంటున్నాడు అనే సాదృశ్యం అనేక గాథలలో కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు బరువైన విల్లును ధరించి పులులు ఏనుగులను వేటాడిన ఆ వేటగాడు భార్యతో సరసాలలో మునిగిపోయి బరువైన విల్లును మోసే సత్తువను కూడా కోల్పోయడని అనటంలో వ్యంగ్యం కన్నా వారి అన్యోన్యతే ఎక్కువ ప్రతిబింబిస్తుంది.
.
సవతులంతా ఏనుగు కుంభస్థలాలలో
దొరికే ముత్యాలతో అల్లిన హారాలను ధరించగా
వేటగాని పడుచుభార్య నెమలి ఈకలు ధరించి
వారి మధ్య గర్వంగా నడుస్తోంది. (212)
.
ఇదే గాథ హాల సప్తశతిలో పొట్టిస అనే కవి పేరిట ఉంది. ఏనుగు కుంభస్థలాలోని ముత్యాలను (ఒకరకమైన గుండ్రని సున్నపు నిర్మాణాలు) సంపాదించటం వీరత్వానికి చిహ్నం. ఆ వేటగాడు ఏన్నో ఏనుగులను చంపి వాటినుంచి సేకరించిన ముత్యాలతో హారాలు అల్లి పాత భార్యలకు బహూకరించి ఉంటాడు. ఇక పడుచుదైన కొత్త భార్య భర్తను కొంగున కట్టేసుకొంది. భర్త వేటకు వెళ్ళటమే లేదు. ఏనుగుల వధా లేదు, ముత్యాల హారాలు లేవు. ఆమెకు దక్కుతున్నవి నెమలి ఈకలు మాత్రమే. అలా భర్త తన చుట్టూ తిరుగుతూ ఉండటం తన ఆడతనానికి దక్కిన గౌరవంగా గర్వంగా భావిస్తూ నెమలి ఈకలు మాత్రమే ధరించి సవతుల మధ్య తిరుగుతోన్నదట ఆ పడుచు పుళింద స్త్రీ.
.
ఆడ ఏనుగుల మంద
వేటగాని భార్య వక్షోజాలతో
“మీ దయ వల్ల మాకు వైధవ్యం సంక్రమించటం లేదు.
మీ కివే మా వందనాలు” అన్నది. (211)
ఒక సప్తశతి గాథలో - పుట్టింటికి వెళ్ళి తిరిగి వస్తూన్నపుడు దారిపొడవునా కానుగ చెట్ల ఆకులకు అంటుకొని ఉన్న మత్తగజాల మదజలాలను గమనించి- తన భర్త మరణాన్ని ముందే ఊహించిందట ఒక వేటగాని భార్య. వీరుడైన తన భర్త బ్రతికి ఉంటే ఏనుగులు అంత విశృంఖలంగా సంచరించగలిగేవి కావు అని ఆమె విశ్వాసం. ఒక స్త్రీ తన భర్త వీరత్వంపై ఉంచిన నమ్మకానికి ఉదాత్త వ్యక్తీకరణ ఇది. దాదాపు అలాంటి భావనే వజ్జలగ్గ పై గాథలో కూడా కనిపిస్తుంది.
.
అనేక ప్రాకృత గాథలలో జింకలను వేటాడే వేటగాని వర్ణనలు ఉంటాయి. వీటి ద్వారా అన్యోన్య దాంపత్యం, కరుణ, ప్రేమ వంటి భావాలనెన్నింటినో పలికించారు ప్రాచీన గాథాకారులు.
ఒక గాథలో కొత్తగా పెళ్ళయిన వేటగాడు జింకల జంటపై బాణం గురిపెట్టి భార్య గుర్తుకు రాగా బాణాన్ని క్రిందకు దించివేసాడనటంలో ఉదాత్తగుణం ఆనాటి కుటుంబ అనుబంధాలలోని ఆర్థ్రతను ఇన్ని వందల సంవత్సరాల తరువాతకూడా తడితడిగా ప్రకటిస్తుంది.
ఈ క్రింది గాథలో వేటగాడు మగజింకను బాణంతో కొట్టాడు. ఆడ జింకపై సంధించటానికి మరొక బాణం తీస్తుంటే, ఆడజింక అన్న మాటలట ఇవి.
.
ఓ వేటగాడా!
ఒక బాణం సరిపోతుంది కదా
ఎందుకు పొదిలోంచి మరొకటి తీస్తున్నావు
మా ఇరుదేహాలలో ఉండేది ఒకే ప్రాణం (217)
***
బాణం తగిలిన వృద్ధ హరిణం
భుజాలు ఎగవేస్తూ ఇలా అంటోంది
“గానం ఆపకు... పాడు
గొంతులో జీవం ఉన్నంతవరకూ
పాడుతూనే ఉండు” (218)
.
నిండైన జీవితాన్ని చూసి పండిపోయిన ఒక జింక చావును ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఎన్ని కష్టాలొచ్చినా గానం ఆగకూడదు, పాట కొనసాగాలి అనటం ఒక జీవితాదర్శంగా చెపుతున్నాడు గాథాకారుడు.
*
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

Thursday, August 5, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 2



వజ్జలగ్గ – గాథలు పార్ట్ 2
.
(వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు)
***
హరప్ప ముద్రలపై (Seal) ఏనుగు బొమ్మలుండటాన్ని బట్టి అయిదువేల ఏండ్లక్రితం నుంచే మనపూర్వీకులకు ఏనుగులతో సాహచర్యం ఉందని ఊహించవచ్చు.
రుగ్వేదంలో ఏనుగు "మృగ హస్తిన్" (చేయికలిగిన జంతువు) అని చెప్పబడింది. . మహాభారత యుద్ధంలో ఏనుగుల ప్రస్తావన కలదు. అలగ్జాండర్ యుద్ధ ఏనుగును చూసి హడిలిపోయాడని ఒక కథనం ఉంది.
ఏనుగులను మచ్చికచేయటం, వాటిని వివిధ అవసరాలకు వాడుకోవటం రాజుకు మాత్రమే ఉండే హక్కుగాను, ఏనుగుని ఇతరులెవరైనా మచ్చికచేసిన, చంపినా మరణదండన అని కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ( BCE రెండో శతాబ్దం) చెప్పబడింది. ఏనుగులపై మోనోపలి రాజ్యానికి మాత్రమే పరిమితం చేయటం రాజ్య సంరక్షణ వ్యూహంగా అనుకోవాలి.
ఏనుగులను పట్టుకోవటం, శిక్షణ, సంరక్షణ, వాటి పోషణ చూసే అధికారిని హస్త్యాధ్యక్ష అంటారని అతని విధులు, బాధ్యతలు గురించి ఒక అధ్యాయమే కలదు కౌటిల్యుని అర్ధశాస్త్రంలో.
పైవన్నీ ఒకపార్శ్వం కాగా - అడవిలో స్వేచ్ఛగా సంచరించే ఏనుగులను బంధించి వాటిని వివిధ రకాల యాతనలకు గురిచేసి శిక్షణ ఇవ్వటాన్ని ఎవరో ఓ ప్రాచీన గాథాకారుడు నిశితంగా పరిశీలించి ఉంటాడు. ఆ సందర్భాలను ఉద్వేగభరిత గాథలుగా పోతపోయటం మరో పార్శ్వం….. ఆ పని ఒక్క సాహిత్యం మాత్రమే చేయగలదు
.
సరస్సులో జలకాలాడుతున్నప్పుడు
తొండంతో సుతారంగా తెంపిన తామరతూడుతో
ఆడ ఏనుగు తనను మెత్తగా తట్టటం
శృంఖలాలతో బంధించబడిన ఏనుగుకు ఇంకా గుర్తు (191)
.
ఓ గజరాజమా!
నీవు స్వేచ్ఛగా ఉన్నప్పుడు తినిన
గంధపు చెట్ల ఆకుల గురించి ఆలోచిస్తూ చింతించకు.
నీ యజమాని ఇప్పుడు అందించిన ఎండుగడ్డిని అంగీకరించు
ఉన్నతులు విధి వైపరీత్యాలను
తమను తాము మెరుగుపరచుకోవటానికి వాడుకొంటారు. (192)
.
విపరీతమైన ఆకలి బాధిస్తున్నప్పటికీ
దూరమైన తన తోడు గుర్తుకు రావటంతో
తొండం చివర పచ్చని తామరతూడులు
అలా నిశ్చలంగా నిలిచిపోయాయి (196)
ఏనుగులు సమూహజీవులు. వాటి మధ్య అనుబంధాలు ఉంటాయి. ఏనుగులు ఒకదానినొకటి గుర్తించుకొని సహానుభూతి ప్రకటించుకొంటాయి. ఒక సారి జంటకడితే మరణంలో తప్ప విడిపోవు. ఒకదానిపట్ల మరొకటి నిబద్దులై ఉంటాయి. వాటి అన్యోన్యత పైగాథలలో అద్భుతంగా ఒదిగిపోయింది. 196 వ గాథలో దూరమైన తన జోడు జ్ఞాపకం రాగా తిండి సయించటం లేదు అనే మాట ఎంత గొప్పగా చెప్పాడా ప్రాచీన కవి.
***
.
ఓ హంసరాజమా!
స్వర్ణపద్మాలు, మంచిముత్యాలతో నిండిన
పవిత్ర మానససరోవరాన్ని విడిచిపెట్టి
ఊరికాలువలో వసిస్తూన్నందుకు
సిగ్గుతో నీవింకా చచ్చిపోలేదేమి? (261)
పై గాథకు ఒక చాటువు ఆధారం.
మానససరోవరం నుంచి వచ్చి ఊరి చెరువుగట్టుపై వాలిన ఒక హంసను అక్కడి లోకల్ కొంగలు “ఎవరు నీవు, ఎక్కడనుంచి వచ్చావు?” అని ప్రశ్నించగా “నన్ను హంస అంటారు నేను స్వర్ణపద్మాలు, మంచిముత్యాలతో నిండి, దేవతలు స్నానించే పవిత్ర మానససరోవరం నుంచి వచ్చాను” అన్నదట. దానికి ఆ లోకల్ కొంగలు “అక్కడ నత్తలుంటాయా” అని ప్రశ్నించగా “నత్తలంటే ఏమిటి” అని విస్తుపోయి ఎదురుప్రశ్నించిందట ఆ మానససరోవరపు హంస. ఆ ప్రశ్నకు “నత్తలంటే తెలీదా” అని పకపక నవ్వాయట లోకల్ కొంగలు.
పై చాటువులో పారలౌకిక విషయాలు గొప్పవనీ ప్రాపంచిక విషయాలు అల్పమైనవనే వెటకారపు భావన ఉంది. ఇదే చాటువుని కొనసాగిస్తూ చాన్నాళ్లక్రితం నేను వ్రాసిన “ఆ తరువాత ఏమైందంటే…” అనే కవితను ఇలా ముగించాను.
//కొన్నాళ్లకు
అమృతజలాలు లభించక
నత్తల్నెలా పగలగొట్టుకొని తినాలో తెలియక
మానససరోవరపు కొంగ కృశించి కృశించి
ఆ చెరువు గట్టునే చచ్చిపోయింది. (“ఆ తరువాత ఏమైందంటే…” వెలుతురు తెర- 2016)
వజ్జలగ్గలోని 261 వ గాథ పై చాటువును స్పృశిస్తూ చక్కని లోతైన కోణాన్ని దర్శింపచేస్తుంది.
ప్రాకృతభాష స్థానీయమైనది. (లోకల్ కొంగల భాష). సంస్కృతభాష పండితులది. బౌద్ధ, జైన మతాల భాష ప్రాకృతం కాగా సంస్కృతం హిందూమత భాష. బౌద్ధ జైనాలు మోక్షం, కర్మకాండలు లాంటి పారలౌకిక విషయాలను అంగీకరించవు. మానససరోవరం, దేవతలు స్నానం చేయటం లాంటి అలౌకిక విషయాలవెనుక ఉండే కాల్పనికతను పై ప్రాకృత గాథలో “నీవింకా చచ్చిపోలేదేమి” అంటూ కత్తివాదర లాంటి వ్యంగ్యంతో ఖండించాడా ప్రాకృత జైన గాథాకారుడు.
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan
అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

Tuesday, August 3, 2021

వజ్జలగ్గ – గాథలు పార్ట్ 1



వజ్జలగ్గ – గాథలు పార్ట్ 1
.
వజ్జలగ్గ అనేది గాథాసప్తశతి లానే అందమైన ప్రాకృత గాథల సమాహారం. ఈ సంకలనంలోని గాథలు CE 750-1337 మధ్య కాలానికి చెందినవి. వజ్జలగ్గలోని భాష శ్వేతాంబర జైనులు వాడే మహారాష్ట్ర ప్రాకృతము. జైన పండితుడైన జయవల్లభుడు ఈ గాథలను సేకరించాడు అందుకే వజ్జలగ్గ కు జయవల్లభమనే పేరు కూడా ఉంది. జయవల్లభుడు మొదటగా 700 గాథలను సేకరించి వాటిని 48 విభాగాలుగా వర్గీకరించి వజ్జలగ్గగా కూర్చాడు. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే ధర్మ, అర్ధ, కామ అనే త్రివర్గాల ఆధారంగా ఈ విభజన ఉంటుందని జయవల్లభుడే ఒక గాథలో చెప్పాడు. ఇది జైన రచన కనుక మోక్షం అనే భావన లేకపోవటం గమనార్హం.
.
ధర్మ అంటే కర్తవ్యము, నైతికత; అర్ద అంటే ప్రాపంచిక విజయాలు; కామ అంటే ఐహిక సుఖాలు. వజ్జలగ్గ తొలికూర్పులో ధర్మ అనే అధ్యాయంలో 63 గాథలు, అర్ధ పేరుగల అధ్యాయంలో 347 గాథలు, కామ ప్రకరణంలో 342 గాథలు ఉండేవి. కాలానుగుణంగా అనేక గాథలు వచ్చి చేరటం తో మొత్తం 95 విభాగాలుగా 990 గాథలుగా వజ్జలగ్గ విస్తరించింది. హాలుని గాథాసప్తశతి, గౌడవహ, గాథాకోశ లాంటి ప్రాకృత రచనలలోని అనేక గాథలు వజ్జలగ్గలో పునరుక్తం అయ్యాయి.
.
వజ్జలగ్గలోని గాథలకు హాలుని సప్తశతిలోని గాథలకున్నంత ప్రాచుర్యం రాలేదు. అయినప్పటికీ కొన్ని వజ్జలగ్గ గాథలను ఆనందవర్ధనుడు, మమ్మటుడు వంటి ఆలంకారికులు తమ శాస్త్రాలలో ఉదాహరణలుగా ప్రస్తావించారు.
వజ్జలగ్గ కావ్యానికి 1969 లో Prof. M.V. Patwardhan ఇంగ్లీషు అనువాదం వెలువరించారు. ఈ క్రింది గాథల అనువాదాలు పై పుస్తకం నుంచి చేసినవే.
***
మంచి వ్యక్తికి కోపంరాదు,
వచ్చినా మనసులో చెడు తలపులు పెట్టుకోడు
పెట్టుకొన్నా వాటిని ఎన్నడూ వ్యక్తం చేయడు
ఒకవేళ చేసినా, ఆ పనికి సిగ్గుపడిపోతాడు (34)
.
పై గాథలో సజ్జనుడు ఎలా జీవిస్తాడనే విషయాన్ని చెపుతున్నాడా ప్రాచీన గాథాకారుడు. తమిళకవి తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురల్ కావ్యం భారతదేశానికి సంబంధించి నైతిక నియమావళిని చెప్పే ప్రాచీన రచనగా గుర్తిస్తున్నారు. ( ఇతను CE 5వ శతాబ్దం/ BCE 3వ శతాబ్దం అని రెండు భిన్నమైన వాదనలు కలవు). తిరువళ్ళువర్ ఒక జైన పండితుడు. తిరుక్కురల్ కావ్యంలో కూడా వజ్జలగ్గ లో లానే ధర్మ, అర్ధ, కామ అనే విభాగాలు ఉంటూ కొంతమేరకు భావసారూప్యం కలిగి ఉంటుంది.
.
దక్షిణభారతదేశంలో జైనులతోపాటు వారి రచనలు కూడా చాలామట్టుకు అదృశ్యమైనాయి. తమిళులు మాత్రం జైనులను కొర్రువేసి నిర్మూలించినా వారి రచనలను నేటికీ నిలుపుకొని (సంగం సాహిత్యం) తమది అతి ప్రాచీన సంస్కృతిగా ప్రచారించుకొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశ ప్రాచీన సంస్కృతి నిర్మాణంలో జైన పండితుల పాత్ర, ప్రాకృతభాష సృష్టించిన సాహిత్యం రెండూ అతి ముఖ్యమైనవి.
***
దారిద్ర్యమా!
నీవల్ల కలిగే కష్టాలను, ఇక్కట్లను
ఆత్మగౌరవం కలిగినవారు సాధారణంగా
బయటపడనీయరు.
బంధువులు వచ్చినప్పుడో పండుగ రోజునో
విపత్తు సమయాలలోనో
అవే బయటపడిపోతుంటాయి. (138)
***
దారిద్ర్యమా!
నీకు వందనాలు.
నీవు చేసిన మేలు వలన
నేను ఎవరికీ కనిపించకపోయినా
అందరూ నాకు కనిపిస్తున్నారు (140)
పై రెండుగాథలలో పేదరికం అనాదిగా మానవులకు ఎన్నెన్ని పాఠాలు నేర్పుతోందో కదా అనిపించకమానదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనచుట్టూ ఉన్నవారి నిజస్వరూపాలు మనకు తెలుస్తాయి అనే మాట ఎప్పటిదీ?
***
కాళ్ళకు అడ్డంపడుతున్న తన పేగుల్ని తప్పించుకొంటూ
ఒక చేత ఖడ్గం ధరించి మరో చేత్తో
వాలిపోతున్న శిరస్సును పైకెత్తి నిలుపుకొంటూ
మీదపడే శత్రువులపై వీరుడు ప్రతిదాడి చేస్తున్నాడు (167)
***
యుద్ధభూమిలో స్పృహతప్పి పడిపోయిన
యజమాని పక్కనే నేలకొరిగిన యోధుడు
రాబందులు తనపేగుల్ని బయటకు పీకుతున్నప్పటికీ
వాటి రెక్కల కదలికలవల్ల తన స్వామి మొఖానికి గాలి తగిలి
అతనికి మెలకువ వస్తే బాగుణ్ణు అని కోరుకొంటున్నాడు (177)
.
పై రెండు గాథలలో ధర్మాచరణ వర్ణించబడుతోంది. ఆనాటి సమాజంలో ప్రతిఒక్కనికి ఒక ధర్మం నిర్ధేశించబడింది. ఆ ధర్మం ప్రకారం అతను జీవించాల్సిందే. వేరే మార్గం లేదు. గుణకర్మలను బట్టి ఈ వర్ణధర్మాలు మార్చుకోవచ్చు అంటూ పుస్తకాలలో ఉన్నప్పటికీ వాస్తవికంగా అలాంటి వెర్టికల్ మొబిలిటీ జరిగిందా అనేది అనుమానమే. 167 వగాథలో ఒక వ్యక్తి తాను చనిపోయే చివరి క్షణం వరకూ తన ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే అనే సత్యాన్ని తెలియచేస్తుంది. 177 వ గాథలో తన ప్రాణాలు పోతున్నా సరే యజమాని క్షేమాన్నే కోరుకోవాలి అంటు స్వామిభక్తిని రొమాంటిసైజ్ చేసి చెపుతున్నాడా ప్రాచీన కవి.
బొల్లోజు బాబా
Source
Jayavallabha’s Vajjalaggam by M.V. Patwardhan