Sunday, September 18, 2022

ఒంటరి గోరీలు



ఒంటరి గోరీలు

అకస్మాత్తుగా వాన
చెట్టునీడకు చేరాను
పక్కనే పాడుపడిన గోరీలు

తుంపర్ల మధ్య మెరుస్తోన్న
ఒకనాటి
జీవన వైభోగపు శకలాలు
శిథిలమౌతూ
నేలలోకే కూరుకుపోతూ
అక్షరాలు కరిగి పోయి
నగిషీలు అలుక్కుపోయి
బంధువుల రాక తగ్గిపోయి
కాలం బుగ్గపై
మొలిచిన మెటిమల్లా ...

ఒణికే వేళ్లు
చేతికర్రపై బిగుసుకొన్నాయి
వానవెలసింది
భారంగా ముందుకు కదిలాను


బొల్లోజు బాబా

Sunday, September 11, 2022

గురువుకు ఒక శిష్యుడు ఎత్తిన హారతి - " నది కాలం అతడు "



గురువుకు ఒక శిష్యుడు ఎత్తిన హారతి - " నది కాలం అతడు "
ఇస్మాయిల్ గారు తెలుగు కవిత్వలోకంలో నిలువెత్తు మనిషి. ఆయన మార్గం అపూర్వమైనది. వీరి కవిత్వంలో యుటోపియన్ స్వర్గాలు ఉండవు. నేలవిడిచి సాముచెయ్యటం కనిపించదు. జీవితాన్ని యధాతథంగా స్వీకరించి కవిత్వం చేసిన గొప్ప కవి ఇస్మాయిల్. ఇస్మాయిల్ దృక్ఫధం ఒకప్పుడు ఒక సంచలనం. ఎన్ని విమర్శలు ఎదురైనా తుదివరకూ తనమార్గాన్ని వీడని కవిత్వశూరుడు ఇస్మాయిల్.
ఈ క్రమంలో ఎందరో యువకులు ఇస్మాయిల్ కవిత్వం పట్ల ఆకర్షితులయ్యారు. ఇస్మాయిల్ గారు ఎవరినీ తన శిష్యులుగా చెప్పుకపోయిన, ఆయన కవిత్వాన్ని తమకు దిక్సూచిగా భావించారు అనేకమంది కవులు. వీరంతా ఇస్మాయిల్ వారసత్వాన్ని కొనసాగించే ప్రేమికులు, దూతలు, భక్తులు. వారిలో రవూఫ్ ఒకరు. కాకినాడలో మెడికోగా ఉండే రోజుల్లో రవూఫ్ ఇస్మాయిల్ గారిని నిత్యం కలుస్తూ, కవిత్వం గురించి చర్చిస్తూ ఒక రకంగా వారింట్లో మనిషిలా మెసిలారు. రవూఫ్ ‘అంతర్నేత్రం’ కవిత్వసంపుటికి ఇస్మాయిల్ గారు మొదటిసారిగా ముందుమాట వ్రాసారు. ఆ ముందుమాటలోనే "తెరుచుకొన్న పద్యాలు" అన్న కొత్త భావనను తెలుగు కవిత్వానికి అందించారు. అప్పట్లో అదొక సంచలనం. 'మిగిలిన వారివి మూసుకొన్న పద్యాలా" అని వాద ప్రతివాదనలు నడిచాయి.
ఇదంతా గతం. ప్రస్తుతానికి వస్తే - " నది కాలం అతడు " అనే పేరుతో ఇస్మాయిల్ కవిత్వతత్వానికి రవూఫ్ అక్షరరూపాన్ని ఇచ్చారు. ఇది నిజానికి ఇస్మాయిల్ జీవిత చరిత్ర. వారికవిత్వం లోనే వారి జీవితం ఉంది. జీవితాన్ని కవిత్వాన్ని ఆయన ఏనాడూ వేరుగా చూడలేదు. తెలుగులో ఒక కవి జీవితం గురించి, అతని కవిత్వం గురించి ఒక కవితా సంపుటి తేవటం బహుసా ఇదే మొదలు కావొచ్చు. అదీకాక ఆ కవి గతించి పదిహేనేళ్ళు గడిచిన తరువాత. ఇదొక ప్రేమపూర్వక కాన్క.
ఒకే తూలికలు కల్గిన పక్షులు గుంపు కడతాయి అన్నట్లు రవూఫ్ కవిత్వంలో ఇస్మాయిల్ కవిత్వ ఛాయలు కనిపిస్తాయి. అందుకనే ఆయన ఇస్మాయిల్ గారికి ఇష్టుడైనాడు. ఈ పుస్తకంలో ఇస్మాయిల్ గారి కవితాత్మను అద్భుతంగా ఆవిష్కరించగలిగారు.
ఇస్మాయిల్ కవిత్వంలో ఆయన జీవితం పరచుకొని ఉంటుంది. సహచరి సహనం, మనవల అల్లరి, సన్నిహితుల స్నేహం, సాయింత్రపు నడకలు, టాగోర్, కృష్ణ శాస్త్రి, చలం లపై ఉన్న భక్తి, టీసమయాలు లాంటి సామాన్య జీవనాంశాలు వారి కవిత్వంలో సహజంగా ఒదిగిపోయాయి. రవూఫ్ వీటన్నిటిని చాలా ఒడుపుగా పట్టుకొని, గొప్ప నైపుణ్యంతో నేతగాని పనితనంతో చిక్కని కవిత్వంగా మలచారు.
రాళ్లు కూడా పుష్పిస్తాయనీ
శిల్పాలై విచ్చుకొంటాయనీ
ఇస్మాయిల్ కు బాగా తెలుసు
బాధని వ్యక్తపరచడు
చిర్నవ్వులే చిందిస్తాడు-- (రాళ్లూ-పూలూ). ఇస్మాయిల్ గారు ఆర్ధికంగా ఇబ్బందులు పడిన సందర్భాలలో ఏనాడూ మిత్రులను సహాయం అర్ధించలేదని సన్నిహితులు చెపుతారు. చివరి దశలో టౌన్ లో ఇల్లు అమ్ముకొని ఊరిచివర వలసపాకల అనే ప్రాంతానికి మారిపోయారు. ఆ సందర్భాన్ని ఓ కవితలో--
వలస పాకల లోని
ఒంటరి ఆకాసంలో
కుంగిపోయిన పక్షి ఒకటి
గిరికీలు కొడుతూ
దుఃఖ సముద్రాన్నీదుతుంది (వలస-పాకనాటి ఒంటరి పక్షి ఒకటి) అంటూ చాలా ఆర్థ్రంగా రవూఫ్ వర్ణిస్తారు.
విచ్చుకొన్న పూల సున్నితత్వం
ఒకవైపు
గుచ్చుకున్న ఖడ్గకాఠిన్యం
ఇంకొకవైపు - (ఇస్మాయిల్). ఇస్మాయిల్ గారి కవిత్వం ఎంత సున్నితంగా హృదయాన్ని తాకుతుందో కవిత్వంపై వీరి అభిప్రాయాలు అంతే నిష్కర్షగా, కుండబద్దలుకొట్టినట్లు ఉంటాయి. " ప్రతిదేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికిమాలినదని యువ రచయితలకు నూరి పోసి వాళ్ల చేత నినాద ప్రాయమైన శుష్కరచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకొంటున్నారు" అంటూ ఇస్మాయిల్ వెలిబుచ్చిన పై అభిప్రాయం అప్పట్లో చాలామందికి గుచ్చుకొంది. వీరిని ప్రధాన స్రవంతి కవులనుండి వెలివేసేటట్లు చేసింది. తాను నమ్మిన అభిప్రాయం చెప్పటానికి ఎంతటి ఖడ్గకాఠిన్యం ఉండాలి!
అయినా అనుక్షణం జీవితమొక
మహోత్సవం అయినవాడికీ
సతతహరిత వృక్షానికీ
వయోకొలమానం ఏమిటీ? -- (విరమణ @55). అప్పట్లో యాభై అయిదేళ్లకే ప్రభుత్వోద్యోగులను బలవంత పదవీవిరమణ చేయించినపుడు ఇస్మాయిల్ గారు కూడా ఒక బాధితుడు. ఆ సమయానికి వీరు పి.ఆర్. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కవి, సహృదయుడు అయిన శ్రీ గోదావరి శర్మ "55 ఏళ్లకే పచ్చని చెట్టును కొట్టేస్తారా? అని వ్యాసం వ్రాసారు. రెండేళ్ల తరువాత ఆ జి.వొ రద్దు చేయగా, తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం వచ్చినపుడు ఇస్మాయిల్ గారు తిరస్కరించారని అంటారు.
ఆమె గొంతు ముడి విప్పి
పాడుతుంటే
ఆ గళమాధుర్యంలో పడి
కొట్టుకు పోతూ
అతను అస్తిత్వం కోల్పోతాడు
అది అతనికి తెలుసు - (కవి-గాయని) ఇస్మాయిల్ గారికి గాయని ఐన ఒక స్నేహితురాలు ఉండేవారు. ఆమె పాటల మాధుర్యాన్ని ఓ కవితలో ఇస్మాయిల్ గారు ఇలా వర్ణించారు. హాయిగా గొంతుముడి విప్పి పాడు/ రయిక ముడి విప్పి/చంటి బిడ్డకు/చన్నిచ్చే తల్లిలా// నీ అంతరాళాల్లో/నీ రక్తసంధ్యలో లేచిన/తెల్లటి పాట పావురాన్ని/నా రక్త సంధ్యలో వాలనీ./వెలిగే పగళ్ళతో ఉభయ సంధ్యల్నీ కలపనీ.// (పాటకత్తెకి) . ఈ విషయాన్నే పై కవితలో రవూఫ్ వర్ణించారు. ఆమె గాత్రంలో కొట్టుకుపోయి తన అస్తిత్వాన్నే కోల్పోయిన విషయం ఆయనకు తెలుసు అని ఒక కవి, గాయని అలౌకికానుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రవూఫ్.
ఇస్మాయిల్ చలాన్ని దర్శించినపుడు, ఎదురెదురుగా కూర్చొని ఎవరూ మాట్లాడుకోలేదట. మౌనంగా ఉండిపోయారట.
మమేకమైన రెండు హృదయాల
కల్లోలానికి మాటలతో పనిలేదు
కాబోలు
మౌనం పూనిన భిన్న తీరాల
నడుమ-
గడ్డకట్టిన మంచులాంటి
మాటల నది
నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది (మౌన సంభాషణం) అంటూ ఆ సందర్భాన్ని హృద్యంగా దృశ్యమానం చేసారు. రవూఫ్.
ఈ పుస్తకంలో ఇంకా ఇస్మాయిల్ స్నానం, సాయింత్రపు నడకలు, ఆయన నివశించిన లచ్చిరాజు వీధి, అందంగా వ్రాసే వారి ఉత్తరాలు, పని చేసిన కాలేజి వాడిన సైకిల్ లాంటి అనేక విషయాలపైనా, సమకాలీనులైన ఉమర్ ఆలిషా, వజీర్ రెహ్మాన్, పంతులు గారు స్మైల్ వంటి వ్యక్తులతో ఇస్మాయిల్ అనుబంధాన్ని వర్ణిస్తూనూ అనేక అందమైన కవితలున్నాయి.
తెలుగు సాహిత్యంలో ఇదొక గొప్ప ప్రయోగం. గతించిన ప్రముఖ కవుల ఇళ్లను ప్రజలు, ప్రభుత్వాలు కలిసి భద్రపరచుకోవటం వారి పేరిట మ్యూజియములు నెలకొల్పుకోవటం లాంటివి ప్రపంచంలో చాలా చోట్ల నిబద్దతతో చేస్తారని వింటాం. అవెలాగూ తెలుగునాట జరిగే విషయాలు కావని నిరూపణ అయిపోయింది. కనీసం అక్షరాలలోనైనా ఒక మహాకవి జీవించిన స్థల, కాలాదులను బ్రతికించుకొనే ప్రయత్నం చేసిన రవూఫ్ గారు ఎంతైనా అభినందనీయులు.
నావంటి వాడిని శిష్యునిగా పొందే భాగ్యం నన్నయకు లేదు తిక్కనకు లేదు మా గురువుగారైన చెళ్లపిళ్ల వారికి మాత్రమే దక్కింది అని విశ్వనాధవారు అన్నారట. అది అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇస్మాయిల్ గారిని ఇతివృత్తంగా తీసుకొని వెలువరించిన "నది కాలం అతడు " కవిత్వసంపుటి రవూఫ్ గారు తన సాహితీ గురువుకు ఎత్తిన ప్రేమ పూర్వక హారతి.
ఈ పుస్తకానికి శ్రీ విన్నకోట రవిశంకర్, శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ శిఖామణి ఆత్మీయతతో కూడిన ముందుమాటలు వ్రాసారు. అందమైన ముఖచిత్రాన్ని బ్రహ్మం భావన గ్రాఫిక్స్ వారు అందించారు. ఇస్మాయిల్ కవిత్వాన్ని ఇష్టపడేవారికి, ఇస్మాయిల్ కవిత్వతీరాన్ని చేరుకోవాలనుకొనేవారికి ఈ పుస్తకం ఒక దీపస్థంభం.
బొల్లోజు బాబా
(ఈ వ్యాసం పాలపిట్ట నవంబరు సంచికలో ప్రచురింపబడినది. ఎడిటర్ గారికి ధన్యవాదములు

 తెలియచేసుకొంటున్నాను)




Tuesday, September 6, 2022

ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తక సమీక్ష.



ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తక సమీక్ష.
.
ఇప్పుడు పుస్తక పరిచయాలే తప్ప సమీక్షలు రావటం లేదు. చాలారోజుల తరువాత ఒక మంచి సమీక్ష చదివాను. అది నా పుస్తకం పైనే కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను.


నేను రచించిన “ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా” పుస్తకంపై శ్రీ పేపకాయల ప్రసాద్ గారు చేసిన సమీక్ష సెప్టెంబరు-2022 సాహిత్య ప్రస్థానం పత్రికలో వచ్చింది. ప్రచురించినందుకు ఎడిటర్ గారికి ధన్యవాదములు


పెద్దాపురంలో జరిగిన ఒక సభలో జోశ్యుల కృష్ణబాబు గారు శ్రీ ప్రసాదు గారిని నాకు పరిచయం చేసారు. “ప్రసాద్ గారు మంది మేధావి, రాసిన అన్ని కాంపిటిటివ్ పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకులను పొందారు, ప్రస్తుతం ఉపాధ్యాయునిగా చేస్తున్నారని, అతనిని నా శిష్యుడని చెప్పుకోవటానికి నేను గర్వపడతానని” –అని చెప్పారు.


ఈ రోజు ప్రసాద్ గారు వ్రాసిన ఈ వ్యాసం చదువుతుంటే ఆ మాటలు అక్షరసత్యాలు అనిపిస్తుంది.
.
ఈ సమీక్షలో శ్రీ పేపకాయల ప్రసాద్ గారు చరిత్రలో భిన్నపార్శ్వాలను కలిగిఉండే రెండు మూడు చర్చనీయాంశాలను ప్రస్తావించారు. వాటిని నేను ఆహ్వానిస్తున్నాను. వినమ్రంగా అంగీకరిస్తున్నాను.
.
“ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరిజిల్లా” పుస్తకాన్ని రచించాకా…. దీన్నెవరైనా చదివారా అనే అనుమానం ఉండేది. ఈ రివ్యూ చదివాకా నా కడుపు నిండిపోయింది. కరువు తీరింది.


ప్రసాద్ గారికి అనంతానంతా ధన్యవాదములతో….
.
బొల్లోజు బాబా


పిఎస్. లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655


.


తూర్పుగోదావరి జిల్లా ఒక పరిశీలన
- పేపకాయల ప్రసాద్,


ఇప్పుడు లేని మనుషుల స్మృతులను, వారు జీవించిన నాటిసంగతులను, సంస్కృతులను, ఇప్పటిమట్టిపొరలలోంచి వారునిర్మించిన కట్టడాల శిథిలాలలోంచి, వారు సంతరించిన సాహిత్యం తదితరాలనుంచి వెలికి తీయాలని, వాటిపై వెలుగులు ప్రసరింపచేయాలని తపిస్తాడు చరిత్రకారుడు. చరిత్ర పరిశోధన ట్రీట్మెంట్ లేని అడిక్షన్. ఆ అడిక్షన్లో నుంచి చరిత్రకారుడు పుట్టుకొస్తాడు. ఆయా రాజవంశాల మీద సాగినంత లోటైన పరిశోధన మనదేశంలో స్థానిక చరిత్రల మీద జరగలేదు.


ఒకప్పటి రాజుల ఉనికికి, సామ్రాజ్యాల మనికికి ఆధారమైన-ఆర్ధ్కవనరులు, ఉత్పత్తి శక్తులు, అమ్మకందారులు, కొనుగోలుదారుల కార్యకలాపాలకు నిలువరమైన పట్టణాల చరిత్ర ఆయా పట్టణాల దాపునే ఉంటూ వాటి పరిపుష్టికి అవసరమైన వనరులు అందించిన పల్లెల చరిత్రగురించి మనకు తెలిసింది చాల తక్కువ. హేతుబద్దమైన దృక్ఫథంతో వెలువడిన స్థానిక చరిత్రలు అరుదుగా ఉన్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాచీనపట్టణాల చరిత్రపై 10-15 ఏళ్లుగా రచనలు వస్తున్నాయి. భౌగోళికంగా ఈ జిల్లానే ఆనుకుని ఉన్న కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని చెబితే… దాట్లదేవదానం రాజు-యానాం చరిత్ర, బొల్లోజుబాబా-యానాంవిమోచనోద్యమం, ఫ్రెంచిపాలనలో యానాం, వంగలపూడి శివకృష్ణ-చారిత్రక పెద్దాపురం:కథలు గాథలు, బండిరాజకుమార్-మన పిఠాపురం పుస్తకాలు వాటిలో విలువైనవి.


తూర్పుగోదావరి జిల్లాలో పలురాజ్యాలకు ఒకప్పుడు రాజధానులుగా విలసిల్లిన రాజమండ్రి, పిఠాపురం వంటిపట్టణాలపై 50 ఏళ్ళ కిందటే లోతైన పరిశోధనలు జరిగాయి. మంచి వ్యాసాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఆయా ప్రాంతాల విశేషాలలో తెలియవలసిన పార్శ్వాలు ఇప్పటికీ మరుగునే పడిఉన్నాయి. వాటి చీకటి కోణాలను తెలియచెప్పటానికి ఆయా ప్రాంతాల్లో జరగవల్సిన పురావస్తు తవ్వకాలు ఈనాటికీ పూర్తిస్థాయిలో జరగలేదు. అందువల్ల దొరికిన వాటి ఆధారంగా తెలియని చరిత్రను ఊహించుకోవల్సి వస్తుంది.


2021 లో వెలువడిన బొల్లోజు బాబా గారి “ప్రాచీణపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా” పుస్తకంలో 13 ప్రాచీనపట్టణాల వివరాలు ఉన్నాయి. వాటి శీర్షికలు ఇవి : ఒకనాటి ఆంధ్ర రాజధాని పిఠాపురం, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, అపురూప ఆలయసంపదకు నిలయం బిక్కవోలు, చరిత్రపుటలలో కోరంగి మహాపట్టణం, ఆంధ్ర వేదాద్రి కోరుకొండ, ఆదుర్రు, చాళుక్యభీమవరం, సర్పవరం, ద్రాక్షారామం, బెండపూడి, పలివెల, తొలితిరుపతి, పెద్దాపురం.


పాఠకుడికి ఎక్కడా విసుగు కలుగనీయకుండా విషయాన్ని ఆసక్తికరంగా చెప్పటం, చెబుతున్న విషయంపై సాధికారత కోసం విస్తృత పరిశోధన చేసి, వివిధ ఆరాలన్నిటినీ ఒకచోటకి చేర్చి, పుస్తకానికి మంచి ఆకారాన్నివ్వటంలో బాబా నిష్ణాతులని వారి గత రచనలు రుజువు చేసాయి. సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన బాబా గత 3 దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ కవిగా, రచయితగా మంచి గుర్తింపు పొందారు. హేతుబద్దమైన దృక్ఫథంతో సమాజాన్ని పరిశీలించటం అలవాటైన వారు కాబట్టి తనలోని బుద్ధిజీవిని సంతృప్తి పరచటానికి ఆయన చరిత్ర రచనలోకి వచ్చి ఉంటారు.
ఈ పుస్తకం తొలివ్యాసంలో పిఠాపురం విశేషాలను 3 భాగాలుగా వింగడించి, క్రీ.పూ. 6 వ శతాబ్దం నుంచి 1951 వరకు గల వివిధ విశేషాలను కాలక్రమంలో పొందుపరిచారు రచయిత. శాతవాహనుల కాలం నాటి కొడవలి శాసనం, సముద్రగుప్తును అలహాబాద్ ప్రశస్తి ఈ ప్రాంతం ఉనికిని తెలిపే ప్రాధమిక ఆధారాలు. ఒకనాటి కళింగ రాజ్యానికి దక్షిణంగా చివరిప్రాంతమైన ఈ పట్టణాన్ని వివిధ కాలాల్లో చిన్న, పెద్ద రాజవంశాలెన్నో పాలించాయి. తూర్పు చాళుక్య సామ్రాజ్య స్థాపన జరిగింది. పిఠాపురం చాళుక్యులనే పేరుకి మాత్రం పరిమితమై, ప్రభవాన్ని కోల్పోయింది కూడా ఈ పట్టణంలోనే!


తూర్పుచాళుక్యుల కాలంనుంచి జమిందారీ యుగం వరకు సాహిత్యానికి మంచి ఆదరణ లభించిన తెలుగు ప్రాంతాల్లో పిఠాపురానికున్న స్థానం ప్రత్యేకం. బౌద్ధం జైనం, శైవం, శాక్తం, వైష్ణవం, గురుసంప్రదాయాల్లో దేశం మొత్తంళో ప్రాధాన్యమున్న అరుదైన ఆథ్యాత్మిక కేంద్రం పిఠాపురం. చరిత్రకారులకు పనికి వచ్చే విలువైన శాసనాలెన్నిటినో గర్భాన ధరించిన ఊరిది. ఈ పట్టణానికి సంబంధించిన అన్ని విశేషాలను చక్కగా అక్షరీకరించిన రచయిత-చారిత్రకంగా ఎంతో కీలకమైన విషయాలను అందించారు. జైన రాజు ఖారవేళుడు క్రీ.పూ. 183 లో తన హాథిగుంఫ శాసనంలో తెలిపిన “పిథుండ పట్టణం”, జైన గ్రంథం ఉత్తరాధ్యాయన సూత్రంలో చెప్పబడిన వ్యాపార కేంద్రం “పిహుండ”, టాలెమి సూచించిన “పిటిండ్రా రేవుపట్టణం” ఇక్ష్వాకుల శాంతమూలిడి పాత గండిగూడెం తామ్రశాసనంలో ప్రసక్తమైన “పిథుండ బౌద్ధ క్షేత్రం”- పిఠాపురమేనని ఆధారాలు చూపారు. హు యాన్ చాంగ్ తెలిపిన ఆంధ్రుల రాజధాని “ఫింగ్-కి-లో” కూడా పిఠాపురమేనని రుజువులు చూపారు.


రాజమండ్రిపై రాసిన వ్యాసంలో రాజమండ్రి నగర నిర్మాత—అందరూ అనుకుంటున్నట్లు అమ్మరాజో, రాజరాజ నరేంద్రుడో కాదని, రాజమండ్రి కైఫీయతులో చెప్పబడినట్లు గుణగ విజయాదిత్యుడే ఆ నగరాన్ని నిర్మించాడని తెలిపారు. క్రీ.శ. 9-13 శతాబ్దుల నడుమ రాజమండ్రి జగరానికి “జననాథ నగరమని” పేరుండేదని శాసనాథారాలు చూపారు. తూర్పుచాళుక్యుల చేతకానితనం వల్ల, ఇక్కడి సంపద వందల ఏళ్ళపాటు తమిళదేశానికి ఎలా తరలిపోయిందో ఆధార సహితంగా వివరించారు.


బిక్కవోలు గురించి రాస్తూ—ఆ ఊరి నిర్మాణాల వైశిష్ట్యాన్ని, గుణగ విజయాదిత్యుని గొప్పతనాన్ని చక్కగా వివరించారు. సాతలూరి శాసనం, ఇతర సమకాలీన ఆధారాలతో అక్కడి బృహత్ గణపతి విగ్రహం, కొన్ని ప్రాచీన ఆలయాలు గుణగుని నిర్మాణాలయి ఉంటాయని తేల్చారు. ఊలపల్లి వెళ్ళేదారిళోని 9వ శతాబ్దపు ఆలయంపై కనిపించే లకులీశ శివుని శిల్పం బిక్కవోలులో పాశుపత శైవం వర్ధిల్లిందనటానికి నిదర్శనమని తెలిపారు.


వెయ్యేళ్లకు పైగా ఓడరేవుగా, గొప్ప నౌకా నిర్మాణ కేంద్రంగా విరాజిల్లి, ఆనాటి గుర్తులు మచ్చుకైనా లేకుండా మరుగునపడిపోయిన ఓ మహా పట్టణం, సముద్ర తీరపు మట్టిదిబ్బల అడుగుపొరల్లో దగున్న సత్యాన్ని…. 1787, 1839 లలో వచ్చిన భీకర తుఫానులు, పెను ఉప్పెన ఆ పట్టణపు మహా వైభవాన్ని తుడిచిపెట్టేసిన వైనాన్ని కళ్లకు కట్టారు “కోరంగి మహా పట్టణం” వ్యాసంలో.


కాకతీయుల తర్వాత స్వతంత్రులై, ఈ ప్రాంతపు రాజకీయాలలో ప్రత్యేకతను సాధించిన కోరుకొండ పాలకులు కూనయ, ముమ్మడి సింగయ, గన్నయ నాయకుల విశేషాలను, ముమ్మడి నాయకుడి కాలంలో రామనుజ సంప్రదాయం నెలకొని, కోరుకొండ వైష్ణవ క్షేత్రంగా రూపొందిన క్రమాన్ని కథనం చేసారు…. “ఆంధ్ర వేదాద్రి కోరుకొండ”వ్యాసంలో.


అశోకుని కుమార్తె సంఘమిత్ర నిర్మింపజేసిన ఆదుర్రు బౌద్ధ స్తూపం విశిష్టతను, స్థానిక పాలకుడు పృథ్వీమూలుడి విశేషాలను ఆదుర్రు వ్యాసంలో అందించారు.
మొదటి చాళుక్యభీముడు నివసించిన చాళుక్యభీమవరం (సామర్లకోట ప్రాంతం) పై ఉన్న ఐతిహ్యాలతో పాటు కాడవ (ర్) వంశస్థుడైన కొప్పెరు చింగ శాసనాలు, మండయసెట్టి నిర్మించిన రాజనారాయణాలయ విశేషాలను అందించారు మరో వ్యాసంళో.
తీరాంధ్ర దేశంలో వైష్ణవం విస్తరించటానికి దోహదపడిన ఆలయాల్లో సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం ఒకటని, అద్భుత శిల్పంతో పాటు ప్రాచీన సంప్రదాయాన్ని చాటి చెప్పే విశేషాలు సైతం ఇక్కడి శాసనాలలో ఉన్నాయని చెబుతూ జలగడియారం గురించి ఆసక్తిదాయకంగా వివరించారు.


ఆలయాలు సంపద చలామణి సంస్థలుగా వ్యవహరించిన తీరును దాక్షారామం పట్టణంలో చూడవచ్చని దాక్షారామం ఓ మహాపట్టణంగా రూపుదిద్దుకోవడంలో “భక్తి-వాణిజ్యం” ఎలా ఉపకరించాయో చెప్పడంతో పాటు-శాసనాలలో సాహిత్యంలో దాక్షారామం ప్రస్తావనలను ఆ ఊరిని గురించి రాసిన వ్యాసంలో చెప్పారు. కాకతీయులు, రెడ్డి రాజుల కాలం నాటి బెండపూడి విశేషాలను, పలివెల వారకాంతల అంతిమసంస్కారాలకు పలివెల కొప్పు లింగేశ్వర స్వామి గుడి నుంచి అగ్నిని తీసుకువెళ్ళే వింత ఆచారాన్ని, తిరుమల కంటే ప్రాచీనమని చెప్పబడే తొలి తిరుపతి (పెద్దాపురం మండలం) వృత్తాంతాన్ని, ఈవి-ఠీవి కలిగిన పెద్దాపురం రాజుల చరిత్రను తరువాతి వ్యాసాల్లో తెలియజేసారు. ఆయా ప్రాంతాలకు వేర్వేరుకాలాల్లో ఉన్న రాజకీయ, భౌగోళిక విభజనలను సూచించే… “నాడు, స్థలము, విషయము” వంటి పేర్లు పాఠకులను గందరగోళానికి గురిచేస్తాయి కనుక వాటి జోలికి పెద్దగా పోకుండా అటువంటి వివరాలను అవసరమైన మేరకు పుస్తకం చివర్లో అనుబంధ వ్యాసాలుగా ఇచ్చారు.


అయితే వివిధ వ్యాసాల్లో రచయిత తెలిపిన విషయాలను చదువుతున్నపుడు కుతూహలంతో పాటు చిన్నచిన్న సందేహాలు కూడా కలుగుతాయి. ఆయా విషయాలపై సంపూర్ణ చర్చకు ఇది తగిన సందర్భం కాదని భావిస్తూ, ఈ వ్యాసం యొక్క పరిమితులను దృష్టిలో ఉంచుకొని వాటిని సంక్షిప్తంగానే చర్చిస్తాను.

బాబా గారు ఈ పుస్తకంలో పిఠాపురంపై రాసిన వ్యాసంలో (పుట14) పిథుండ పట్టణాన్ని గురించి చెబుతూ”ఖారవేలుడు గోదావరిని దాటి కృష్ణానదీ తీరం ప్రవేశించాలంటే అప్పటికే ఈ ప్రాంతాన్ని ఏలుతున్న శాతవాహనులను దాటుకొని వెళ్లాలి. అదే జరిగి ఉన్నట్లయితే అదొక చరిత్రాత్మక విశేషం అవుతుంది. శాతవాహన శాసనాల్లో కాని, ఖాఅరవేలుని శాసనంళో కాని అలాంటి ప్రస్తావనలు కనిపించవు” అన్నారు. కానీ ఖారవేలుడు తన రెండవ పరిపాలన సంవత్సరంలో శాతకర్ణిని లెక్కచేయకుండా పెద్దసైన్యంతో కృష్ణానదివరకు వెళ్ళి మూషిక నగరాన్ని నాశనం చేసాడని హాథిగుంఫ శాసనంళో ప్రస్తావన ఉంది. (ఎపిగ్రాఫియా ఇండికా – 10). ఈ శాసన లేఖనం స్పష్టంగా లేనందున చరిత్రకారులలో భేదాభిప్రాయాలు కలిగినప్పటిఖీ కె.పి. జయస్వాల్, ఆర్.డి బెజర్జి ప్రకటించిన శాసనపాఠం ప్రకారం మొదటి శాతకర్ణి కాలంలో ఖారవేలుడో, అతడి సైన్యమో శాతవాహన సామ్రాజ్యంలోకి ప్రవేశించారని అత్యధికులు ఆమోదించారు. గుంటుపల్లి గుహల్లో లభించిన స్తంభశాసనం కూడా గోదావరి పరీవాహక ప్రాంతంలో ఖారవేలుని ఉనికిని చాటుతోంది. (jain Monuments of Andhra-G Jawahar Lal: page 51).


మరో వ్యాసంలో- తూర్పుచాళుక్య వీరుడు గుణగ విజయాదియుని విజయాల్లో కీలకంగా వ్యవహరించిన సేనానుల్లో ఒకరు కాదేయరాజు అని ఇచ్చారు రచయిత. అతడు కాదేయరాజు కాడు. కడియరాజు బోయకొట్టాలను సాధించిన పండరంగనికి తండ్రి ఈ కడియరాజు. బహుశ అతడి పేరనే ఈనాటి కడియం ఏర్పడి ఉంటుందేమో.


రాజమండ్రిపై రాసిన వ్యాసంలో పంచగిరులను పేర్కొంటూ గతంలో గుండవరపు లక్ష్మినారాయణ, తల్లావఝుల పతంజలి శాస్త్రి ఇచ్చిన వివరాలే దాదాపు యధాతథంగా ఈ పుస్తకంలోను ఇచ్చారు బాబా. వీరంతా ఊహించినట్లు ఈ గిరులలో “రామగిరి, భద్రగిరి నగరానికి దూరంగా కాకుండా నగరంలోపలే ఉండి, తక్కిన గిరుల లాగే అవికూడా కాలక్రమాన నశించి ఉండవచ్చుననిపిస్తోంఇద్. స్థానికంగా ఇప్పటికీ వాడుకలో ఉన్న ప్రదేశాలపేర్లు, శ్రీనాథుని భీమఖండంలోని వివరాలూ ఈ ఆలోచనకు ఉపబలకాలు. రాజమండ్రిలోని గిరులు ఐదు కాదు, ఏడు. (హేమగిరి, ధవళగిరి, పుష్పగిరి/కమలాచలం, భద్రగిరి, వేదగిరి, శేషగిరి) ఉండేవని భావించాల్సి వస్తుంది.
ఈ పుస్తకంలో ఆంధ్రవేదాద్రి కోరుకొండ అనే మరొక వ్యాసంలో ముమ్మడి నాయకుడు పాలించిన ప్రాంతాలను పేర్కొంటూ కురవాట సీమ వేంగి సమీపంలోనిది లేదా కాకినాడవద్ద ఉన్నది అని రాసారు రచయిత. మంగిపూడి ముమ్మడి నాయకుడి శాసనాలలోని కురవాటసీమ కాకినాడ వద్ద ఉన్న కూరాడ కాదు. ఈ సీమ వేంగిసమీపంలోనిదే అనటానికి ప్రబలమైన ప్రమాణం క్రీడాభీరామంలోని మధుమావతి వృత్తాంతం (ఆధారం: ప్రాచీనాంద్ర భూగోళము-శ్రీకందూరి ఈశ్వరదత్తు)


సర్పవరం వ్యాసంలో రచయిత-రాజరాజ నరేంద్రుని మనుమడు, చోళ చాళుక్య ప్రభువు అయిన వీరచోడుడు వైష్ణవాన్ని ఆదరించాడని, గత పరిశోధకుల నిర్ధారణను పునరుద్ఘాటిస్తూ- క్రీశ. 1092 లో ఆ రాజు వేయించిన్ అపిఠాపురం శాసన విశేషాలను పొందుపరచారు. ఈ శాసనం ద్వారా ‘వీరచోడ చతుర్వేది మంగలం”పేరుతో వీరచోడుడు దానమిచ్చిన పొన్నతొర్ర, మాలవెల్లి, ఆలమి తదితర గ్రామాల సముదాయాన్ని తొండంగి మండలంలోని “పెరుమాళ్ళపురం” (పెరుమాళ్ అంటే విష్ణువు, వీరచోడుని శాసనంలో ప్రస్తావించబడిన దాన గ్రహీతలలో వైష్ణవులున్నారు కాబట్టి) బొల్లోజు బాబా ఊహించారు. కానీ ఈ ఊహ సరైనది కాదనిపిస్తోంది. ఉప్పాడ సమీపంలోని ఆ గ్రామాలు చిన్నచిన్నమార్పులతో దాదాపుగా 11వ శతాబ్దినాటి పేర్లతోనే ఇప్పటికీ పిలువబడుతున్నాయని నా పరిశీలనలో తేలింది. రచయిత కథనం చేయటంళో దిట్టకావటం మూలాన…. చరిత్రలో ఏ కొంతో పరిచయం, ఆసక్తి ఉన్నవారినే తప్ప సామాన్య పాఠకుల పఠనాన్ని- నేను పేర్కొన్న విషయాలేవీ అంతగా అడ్డలేవు.


క్రీస్తుకు పూర్వం నుంచీ ఎన్నో ఆధారాలున్న పిఠాపురం చరిత్రను కథనం చేయటంతో పుస్తకాన్ని మొదలుపెట్టి…. చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న వివిధ పట్టణాల చరిత్రను సాధికారికంగా, ఆసక్తికరంగా చెప్పటంతో ఈ పుస్తకానికి ఉత్తమ పరిశోధక గ్రంథంగా ప్రత్యేక స్థానం దక్కినట్టే! కళింగ రాజ్యానికి దక్షిణ హద్దు పిఠాపురమని, పిఠాపురంలో వెలసిన శివుని పేరులో భాగమైన ‘కుక్కుట’, ఆ దేవాలయం లోపలి కొలనుకు పేరైన ’పాదగయ’ అనే మాటలు కలిసిన ‘కుక్కుట పాదగిరి’ (గుర్పా) అనే ప్రదేశం బీహార్ లోని బోధగయ సమీపంలో ఉందని, బుద్ధుని శిష్యుడైన మహా కాశ్యపుడి పార్థివదేహం ఇప్పటికీ అక్కడే భద్రపరచబడి ఉందని తెలిసినపుడు-పిఠాపురం పాదగయ క్షేత్రానికి – బీహార్ బోధ్ గయతో ఉన్న బౌద్ధ్ అధర్మ పరమైన సంబంధం అర్ధమౌతుంది.


పిఠాపురం ప్రాచీనబౌద్ధ క్షేత్రం అయి ఉంటుందనే పరిశోధకుల మాట అక్షర సత్యమని తెలుస్తుంది.


వేంగి సామ్రాజ్య పాలకులు చోళులకు విధేయులై ఇక్కడనుంచి ఏటా 340 కళాంజుల బంగారాన్ని, లక్షా 10 వేల కలామ్స్ వరి ధాన్యాన్ని తంజావూరు ఆలయ భాంఢాగారానికి తరలించుకు పోయేవారన్న వాస్తవం విస్మయం కలిగిస్తుంది.


బిక్కవోలులోని కాంచనగుడి -గుణగ విజయాదిత్యుని విజయ చిహ్నమని, మన దేశంలో అరుదుగా కానవచ్చే శిల్పసంపదలోకి చేర్చదగిన శిల్పరీతులు బిక్కవోలు ఆలయాలపై కనిపిస్తాయని తెలిసినపుడు ఆశ్చర్యం కలుగక మానదు. సామర్లకోట, సర్పవరం, పిఠాపురం వైష్ణవ క్షేత్రాల విశేషాలు; బిక్కవోలు, దాక్షారామం, చాళుక్య భీమవరం, పిఠాపురం శైవ క్షేత్రాలు- ఈ ప్రాంతపు సంస్కృతిలో తూర్పు చాళుక్యుల విశిష్ట పాత్రను తెలియజేస్తాయి.


ఇలాంటి ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలను సందర్భోచితంగా చెబుతూ ఈ తరం పాఠకుల్లో కూడా చరిత్రపై మక్కువ పెంచే ప్రయత్నం చేశారు రచయిత. 142 పుటల్లో ఓ విజ్ఞాన సర్వస్వాన్ని ఇమిడ్చే సాహసం చేసిన రచయిత బాబా తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి.


ముందుమాటలో డా.కె.ఎస్.కామేశ్వరరావు గారన్నట్లు….ఇది చరిత్రపై మక్కువపెంచే రచన. ఇలాంటి మరిన్ని ప్రామాణిక రచనలు బొల్లోజు బాబా నుంచి వస్తాయని ఆశిద్దాం.


పేపకాయల ప్రసాద్

















Monday, August 29, 2022

శ్రావణమాసపు వానలు

.
కొలనులో బాతొకటి
నీటిలో బుడుంగున మునిగింది
కంగారుపడిన ఓ కప్ప
తామరాకుపైకి గెంతింది
ఈ సవ్వడికి
తామరపూవుపై వాలిన
తుమ్మెద గాలిలోకి లేచింది
దాని రెక్కల కదలికలకు
అంతవరకూ
స్తబ్దుగా ఉన్న ఋతుపవనాలు
తమ ప్రయాణం ప్రారంభించాయి


నీటిలోంచి బాతు పైకి లేచేసరికి
శ్రావణమాసపు వానజల్లులు


బొల్లోజు బాబా

Kursi Nashin సర్టిఫికేట్



Kursi Nashin సర్టిఫికేట్
.
ఇటీవల సోషల్ మీడియాలో 1887 లో జారీచేసిన kursi nashin సర్టిఫికేట్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. kursi nashin అంటే సదరు వ్యక్తి బ్రిటిష్ అధికారుల ఎదుట కుర్చీలో కూర్చొనే అర్హత కలిగిఉన్నాడంటూ ఇచ్చే సర్టిఫికేట్. ఎక్కడినుంచో వచ్చిన బ్రిటిష్ వాడు మనగడ్డపై మనల్ని కుర్చీలో కూర్చోనివ్వలేదు; ఇది వాళ్ళ జాత్యాహంకారం అంటూ చాలా ఆవేశంగా వాదిస్తున్నారు కొంతమంది. ఆ వాదనలో చారిత్రిక అవగాహన లేకపోవటం, రేసిజం తప్ప మరొకటి కనిపించదు.
ఈ kursi nashin వ్యవస్థను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టలేదు. ఇది భారతదేశంలో మొఘల్ పాలననుంచీ నడిచిన ఒక వ్యవస్థ. నిజానికి ఇది పురప్రముఖులకు ఇచ్చే బిరుదులాంటిది.
kursi nashin అనేది మొఘలుల పాలనలో రాజ దర్భారులో కూర్చునేందుకు ప్రముఖులకు ఇచ్చె ఒక అధికారిక అనుమతి.
మొఘలుల రాజ దర్భారులో కూర్చోవటానికి అర్హత కలిగిన వారిని దర్భారీలు అంటారు. వీరి సంఖ్యపరిమితం. వీరికి అర్హతను బట్టి కుర్చీలు కేటాయించేవారు. ప్రతీ కుర్చీకి నంబరు ఉంటుంది. దర్భారీలు తమకు కేటాయించిన కుర్చీలలో మాత్రమే కూర్చోవాలి. చక్రవర్తికి దగ్గరగా ఉండే కుర్చీలలో రాజ్యంలోని అత్యంత ప్రముఖులు కూర్చుంటారు. కొత్తగా దర్భారీ హోదా పొందినవారికి చివరి వరుసలో కుర్చీలు కేటాయించబడేవి. అలా ఆ కుర్చీల అమరికలో ఒక అధికార వరుసక్రమం ఉంటుంది.
ముందువరుసలోని దర్భారీలు మరణించినా లేక వారు తమ పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నా వారి స్థానంలోకి వెనుక వరుసలలోని వ్యక్తులు ముందుకు జరిగి దర్భారీ అంతస్తులో పైకి చేరతారు.
చాలా సందర్భాలలో ఈ కుర్చీ హోదా వంశపారంపర్య హక్కుగా పొందేవారు. కొన్ని సందర్భాలలో గొప్ప ప్రతిభవల్ల పై అంతస్తులలోకి చేరటం జరిగేది. ఉదాహరణకు హైదరాబాద్ జిల్లా దర్భారులో (పాకిస్తాన్ లోని ) Makhdum of Hala అనే పీర్ సూఫీ సాధువు జనాదరణ/రాజాదరణ పొంది- 1880 లో దర్భారు కుర్చీ 71వ స్థానం నుండి క్రమంగా ఏడవ స్థానానికి చేరుకొన్నాడు.
ఈ మొత్తం వ్యవస్థను kursi nashin అనేవారు. దర్భారీలుగా సాధారణంగా సామంతులు, ధనిక వ్యాపారులు, పండితులు, మతాచార్యులు, కవులు ఉండేవారు.
ప్రముఖ ఉర్దూ కవి మిర్జా గాలిబ్ (1796-1869) 1840 లో ముఘల్ దర్బారులో కూర్చొనే అర్హత పొందిన ఒక kursi nashin. ఈ వ్యవస్థను హిందూరాజులు కూడా పాటించేవారు. రాజ సభలో ప్రముఖులు తప్ప ఇతరులు అందరూ నిలుచునే ఉండాలి. ఎవరైనా సరే వెళిపోయేటపుడు రాజుగారికి తమ వీపును చూపించరాదు. రాజు చూసేవరకూ తలదించుకొనే ఉండాలి. రాజుగారి కళ్ళలో కళ్ళుపెట్టి చూడరాదు. ఇవి ఆనాటి రాజ సభలోని ఫ్యూడల్ కట్టుబాట్లు.
బ్రిటిష్ పాలన వచ్చాకా దర్భారులు పోయాయి. కలక్టరేట్ ఆఫీసులే అధికార కేంద్రాలు. అవే అనధికార దర్భారులు. బ్రిటిష్ అధికారులు పాత పద్దతినే కొనసాగించారు.
జిల్లా కలక్టర్ తన ఆఫీసులో స్థానికంగా ముఖ్యులైన వారికి స్థానం కల్పించి వారికి kursi nashin సర్టిఫికేట్లు జారీచేసేవాడు. జిల్లాలో kursi nashin సర్టిఫికేట్ల సంఖ్య పరిమితంగా ఉండేది. అది పొందటం గొప్ప గౌరవచిహ్నం. వీరిలోంచే కొంతమందిని ఎంపికచేసి వైస్రాయ్ ని, గవర్నరుని కలవటానికి అనుమతించేవారు.
అప్పట్లో వ్యక్తులు తమ పేర్ల వెనుక kursi nashin అని రాసుకొనేవారు ఒక హోదాలాగ.
ఇరవయ్యవ శతాబ్దం వచ్చాక ప్రజాస్వామ్య పద్దతులు అమలులోకి వచ్చి, క్రమేపీ ఈ సంప్రదాయం అంతరించిపోయింది.
నేడు kursi nashin సర్టిఫికేట్లు లేవు కానీ అనుమతిలేకుండా ఒక కలక్టరు లేదా ఒక ఎమ్మెల్యే, ఎంపి ల ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చొనే సాహసం ఎవరూ చేయలేరు. అపాయింట్ మెంట్ లేనిదే అసలు లోనికే అనుమతించరు. ఒకనాటి kursi nashin సర్టిఫికేట్ లాంటివే నేటి విఐపి పాసుల పద్దతి.
బొల్లోజు బాబా
.
సంప్రదించిన పుస్తకాలు
1. Mirza Ghalib Malik Ram
2. Sufi Saints and State Power - The Pirs of Sind, 1843 1947, by Sarah Ansari
3. In an Indian district; an enlarged ed. of Police notes by G.G.B. Iver

నాలుగు రంగులు మిగిల్చే కవిత ~ బొల్లోజు బాబా, OCTOBER 6, 2016



Happy birthday Manasa chamarthi gaaru.
ఒక పాత పోస్టు
ఏ కవితైనా అది కవియొక్క స్వీయప్రకటన. దానాలుగు రంగులు మిగిల్చే కవిత ~ బొల్లోజు బాబా, OCTOBER 6, 2016నికి సృష్టికర్త కవే . ఆ కవితను చదువుతున్నంత సేపూ ఆ కవి మనస్సులో ఆ సమయంలో కదలాడిన భావాలే కాక, ఆ కవి హృదయసంస్కారం కూడా అంతర్లీనంగా కనిపిస్తూంటుంది. కొన్ని కవితలు తమవైన కొత్తలోకాల్ని సృష్టించి, మనల్ని చేయిపట్టుకొని వాటిలోకి తీసుకెళ్ళి అలౌకికానందాలను పంచుతాయి. కవితపూర్తయ్యాకాకూడా ఆ లోకంలోనే సంచరిస్తూ ఆ మథురభావనల్లో ఉండిపోతాం చాలాసేపు.
మానస చామర్తి వ్రాసిన “వర్ణచిత్రము” అనే కవిత చదివాకా ఎందుకో ఈ మధ్య వచ్చే కవిత్వానికి భిన్నంగా అనిపించింది.
ప్రకృతి జీవితంలోకి ఎలా ప్రవేశించాలని ప్రయత్నిస్తుందో అదే సమయంలో జీవితం ఆ సౌందర్యాన్ని పీల్చుకొని జ్ఞాపకాలుగా మలచుకొని భద్రపరచుకోవాలని ఎంతెలా ఆరాటపడుతుందో – అనే Conflict ను భలే గొప్పగా పట్టుకొందీ కవిత.
కొత్తరోజులన్నీ ఖాళీకాగితాలై అంటూ మొదలౌతుంది కవిత. ఎంత చక్కని భావన! గతకాలపు బరువులు లేకుండా తేలికగా ఎగిరే సీతాకోకచిలుకల్లా – కొత్తరోజులన్నీ తెల్లకాగితాలైతే, ఎన్నెన్ని వర్ణ చిత్రాల్ని చిత్రించుకోవచ్చో కదా అనిపించకమానదు. మంచి ఎత్తుగడకు ఉండే అడ్వాంటేజ్ ఇది. చదువరిని వేగంగా లోనికి లాక్కొంటుంది. డిసెంబరు పూవులు, ఆకుపచ్చని కొండలు, సూరీడు, చంద్రవంక అంటూ ఒక్కొక్క వర్ణచిత్రాన్నీ ఒక్కో పూలరేకలా విప్పుకొంటూ, కవిత ముగింపుకు వచ్చేసరికి ఒక రోజు కాలచక్రాన్ని పూర్తిచేస్తారు మానస గడుసుగా.
పసిమికాంతుల నెగురవేస్తూ, తెల్లగా నవ్విన చంద్రవంక, గొడుగులు పట్టే ఆకుపచ్చని కొండలు వంటి ప్రయోగాలు నవ్యమైన అభివ్యక్తి. హృద్యంగా ఉంది. What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself అంటాడు John Stuart Mill ఒక దృశ్యాన్ని చూసి చలించిన హ్రుదయం తన ఉద్వేగాల్ని తనంతతాను పదాలలోకి అనువదించుకొంటుంది సహజంగా. ఆ అనుభవం కొన్నిసార్లు పైకి ఆనందాన్నిమాత్రమే ఇచ్చేదిగా కనిపించినప్పటికీ హృదయాన్ని మార్ధవం చేసే శక్తిని లోలోపల కలిగిఉంటుంది.
హృదయసంస్కారాన్నివ్వటం కన్నా ఉత్తమోత్తమమైన సామాజికప్రయోజనం ఏముంటుంది? అందుకనే కదా కవిత్వాన్ని “హృదయసంబంధి” అని ఇస్మాయిల్ అన్నది.
“నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో” ఇలాంటి కవితలే “నాలుగు రంగులు మిగిల్చిపోతాయి” అనటానికి నేనేమాత్రం సందేహించను.
*
వర్ణ చిత్రం
-మానస చామర్తి
కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు
రెపరెపలాడతాయి.
తైలవర్ణచిత్రమేదో గీయాలని
తొందరపడతాయి వేళ్ళు.
వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు
ఊదారంగు సముద్రం, పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ వెనుకొక లోకం
గీతలుగా మెదులుతూ చెదురుతున్న చిత్రం
పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది కుంచె
జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో
జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.
చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.


అభినందనలు

 మా యానాం పెద్దొర గారికి

అభినందనలు
బొల్లోజు బాబా


Wednesday, August 17, 2022

ఒక వెచ్చని హాయి....


రెక్కలు చాచుకొని వాలుతున్న రాత్రిని
మెల్లమెల్లగా తడుపుతోంది వాన
ఆకుల అంచులపై తడిచీకటి
తళతళా మెరుస్తోంది.
తప తప శబ్దాలు చేసుకొంటూ
పావురాల గుంపేదో మేడపై
వాలినట్లు వాన
కిటికీ రెక్కను గీరుతూ
నల్లని సంగీతం
వాన వెలసింది
సూర్యుడు ఉదయించాడు
పుడమిపై వెలుగు పరుచుకొంది
రాత్రంతా కురిసిన వానకు
తడిచి ముద్దయిన జీనువాయిపిట్ట
రెక్కలు దులపరించుకొని
నీరెండను లోలోనికి ఇంకించుకొంటోంది.
బొల్లోజు బాబా
Madhunapantula Satyanarayanamurthy, Mohan Babu and 88 others
78 comments
Like
Comment
Share

Tuesday, August 9, 2022

ఫ్రాగ్మెంట్స్



ఫ్రాగ్మెంట్స్
.
1.
రోజూ అంకెలు
మనప్రపంచాన్ని కత్తిరిస్తూ, అతికిస్తూ
సులభంగా మనకందించేందుకు నిత్యం
శ్రమిస్తూంటాయి
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం
పది అవతారాలు
15 ఎమ్.ఎమ్ కణితి
డబ్బై అయిదేళ్ల ఏళ్ల సంబరాలు.... అలా...
.
2.
చే బొమ్మ ఉన్న టీ షర్ట్స్ ధరిస్తాం
మన శ్రీ శ్రీ నో వరవరరావునో
తొడుక్కొందామన్న ఆలోచనే రాదు
విప్లవాన్ని కూడా కాపిటలిస్టే
ప్రచారం చేయాలి
.
బొల్లోజు బాబా

Tuesday, July 26, 2022

నన్నునేను ముందుకు తోసుకొనే శక్తి తిరిగి వస్తుందనే ఆశిస్తాను..

 ఒక మిత్రుడు సూచించిన విధంగా థెరిగాథల అనువాదం పూర్తయింది. పుస్తకరూపంలోకి తేవాలని ఉంది. విశ్లేషణా వ్యాసాలరూపంలో కాక గాథలన్నీ వరుసగా ఉంటూ పుస్తకం చివరన వాటికి సంబంధించిన ఫుట్ నోట్సు ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ ఇదివరకటిలా ఉత్సాహం ఉండటం లేదు.

సచ్చిదానందన్ - 100 కవితలు అంతా రెడీ... చిన్న చిన్న ఎడిట్స్ ఉన్నాయి.
నన్నునేను ముందుకు తోసుకొనే శక్తి తిరిగి వస్తుందనే ఆశిస్తాను..
***
.
థేరికా
(బుద్ధభగవానుడు అన్నమాటలు)
.
థేరికా
ఇప్పుడు నీవు థేరీలలో కలిసావు
నీకు చిన్నప్పుడు పెట్టిన పేరు ఇన్నాళ్ళకు నిజమైంది
నీవు స్వయంగా కుట్టుకొన్న దుస్తులను కప్పుకొని
హాయిగా నిదురించు
నీ వాంఛలన్నీ కుండలో దాచిన మూలికల్లా
వడలి ఎండి పోతాయి ఇక. (1)
.
ఫుట్ నోట్స్
థెరికా క్షత్రియకుటుంబంలో జన్మించింది. ఒకనాడు ఈమె బుద్ధుని బోధనలు విని ఆకర్షితురాలై, సంఘంలో చేరాలని నిర్ణయించుకొంది. భర్త అందుకు అంగీకరించని కారణంగా గృహస్తుగా సంసారిక బాధ్యతలు నిర్వర్తిస్తూ తథాగతుని బోధనలు మననం కొంటూ జీవనం సాగించసాగింది. ఒకనాడు వంటింట్లో మంటలు చెలరేగగా థెరికాకు ప్రాణాపాయం తప్పింది. ఆ క్షణంలో మానవ జీవితం ఎంత అశాశ్వతమో అర్ధమై, భర్తను ఒప్పించి బౌద్ధ భిక్షుణిగా దీక్ష తీసుకొంటుంది. బుద్ధుడు ఈమెతో అన్నమాటలివి.

బొల్లోజు బాబా