Tuesday, September 6, 2022

ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తక సమీక్ష.



ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తక సమీక్ష.
.
ఇప్పుడు పుస్తక పరిచయాలే తప్ప సమీక్షలు రావటం లేదు. చాలారోజుల తరువాత ఒక మంచి సమీక్ష చదివాను. అది నా పుస్తకం పైనే కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను.


నేను రచించిన “ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా” పుస్తకంపై శ్రీ పేపకాయల ప్రసాద్ గారు చేసిన సమీక్ష సెప్టెంబరు-2022 సాహిత్య ప్రస్థానం పత్రికలో వచ్చింది. ప్రచురించినందుకు ఎడిటర్ గారికి ధన్యవాదములు


పెద్దాపురంలో జరిగిన ఒక సభలో జోశ్యుల కృష్ణబాబు గారు శ్రీ ప్రసాదు గారిని నాకు పరిచయం చేసారు. “ప్రసాద్ గారు మంది మేధావి, రాసిన అన్ని కాంపిటిటివ్ పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకులను పొందారు, ప్రస్తుతం ఉపాధ్యాయునిగా చేస్తున్నారని, అతనిని నా శిష్యుడని చెప్పుకోవటానికి నేను గర్వపడతానని” –అని చెప్పారు.


ఈ రోజు ప్రసాద్ గారు వ్రాసిన ఈ వ్యాసం చదువుతుంటే ఆ మాటలు అక్షరసత్యాలు అనిపిస్తుంది.
.
ఈ సమీక్షలో శ్రీ పేపకాయల ప్రసాద్ గారు చరిత్రలో భిన్నపార్శ్వాలను కలిగిఉండే రెండు మూడు చర్చనీయాంశాలను ప్రస్తావించారు. వాటిని నేను ఆహ్వానిస్తున్నాను. వినమ్రంగా అంగీకరిస్తున్నాను.
.
“ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరిజిల్లా” పుస్తకాన్ని రచించాకా…. దీన్నెవరైనా చదివారా అనే అనుమానం ఉండేది. ఈ రివ్యూ చదివాకా నా కడుపు నిండిపోయింది. కరువు తీరింది.


ప్రసాద్ గారికి అనంతానంతా ధన్యవాదములతో….
.
బొల్లోజు బాబా


పిఎస్. లభించు చోటు: పల్లవి పబ్లిషర్, శ్రీ ఎస్. వి. నారాయణ గారు
ఫోన్ నంబరు/ ఫోన్ పే నంబరు: 9866115655


.


తూర్పుగోదావరి జిల్లా ఒక పరిశీలన
- పేపకాయల ప్రసాద్,


ఇప్పుడు లేని మనుషుల స్మృతులను, వారు జీవించిన నాటిసంగతులను, సంస్కృతులను, ఇప్పటిమట్టిపొరలలోంచి వారునిర్మించిన కట్టడాల శిథిలాలలోంచి, వారు సంతరించిన సాహిత్యం తదితరాలనుంచి వెలికి తీయాలని, వాటిపై వెలుగులు ప్రసరింపచేయాలని తపిస్తాడు చరిత్రకారుడు. చరిత్ర పరిశోధన ట్రీట్మెంట్ లేని అడిక్షన్. ఆ అడిక్షన్లో నుంచి చరిత్రకారుడు పుట్టుకొస్తాడు. ఆయా రాజవంశాల మీద సాగినంత లోటైన పరిశోధన మనదేశంలో స్థానిక చరిత్రల మీద జరగలేదు.


ఒకప్పటి రాజుల ఉనికికి, సామ్రాజ్యాల మనికికి ఆధారమైన-ఆర్ధ్కవనరులు, ఉత్పత్తి శక్తులు, అమ్మకందారులు, కొనుగోలుదారుల కార్యకలాపాలకు నిలువరమైన పట్టణాల చరిత్ర ఆయా పట్టణాల దాపునే ఉంటూ వాటి పరిపుష్టికి అవసరమైన వనరులు అందించిన పల్లెల చరిత్రగురించి మనకు తెలిసింది చాల తక్కువ. హేతుబద్దమైన దృక్ఫథంతో వెలువడిన స్థానిక చరిత్రలు అరుదుగా ఉన్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాచీనపట్టణాల చరిత్రపై 10-15 ఏళ్లుగా రచనలు వస్తున్నాయి. భౌగోళికంగా ఈ జిల్లానే ఆనుకుని ఉన్న కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని చెబితే… దాట్లదేవదానం రాజు-యానాం చరిత్ర, బొల్లోజుబాబా-యానాంవిమోచనోద్యమం, ఫ్రెంచిపాలనలో యానాం, వంగలపూడి శివకృష్ణ-చారిత్రక పెద్దాపురం:కథలు గాథలు, బండిరాజకుమార్-మన పిఠాపురం పుస్తకాలు వాటిలో విలువైనవి.


తూర్పుగోదావరి జిల్లాలో పలురాజ్యాలకు ఒకప్పుడు రాజధానులుగా విలసిల్లిన రాజమండ్రి, పిఠాపురం వంటిపట్టణాలపై 50 ఏళ్ళ కిందటే లోతైన పరిశోధనలు జరిగాయి. మంచి వ్యాసాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఆయా ప్రాంతాల విశేషాలలో తెలియవలసిన పార్శ్వాలు ఇప్పటికీ మరుగునే పడిఉన్నాయి. వాటి చీకటి కోణాలను తెలియచెప్పటానికి ఆయా ప్రాంతాల్లో జరగవల్సిన పురావస్తు తవ్వకాలు ఈనాటికీ పూర్తిస్థాయిలో జరగలేదు. అందువల్ల దొరికిన వాటి ఆధారంగా తెలియని చరిత్రను ఊహించుకోవల్సి వస్తుంది.


2021 లో వెలువడిన బొల్లోజు బాబా గారి “ప్రాచీణపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా” పుస్తకంలో 13 ప్రాచీనపట్టణాల వివరాలు ఉన్నాయి. వాటి శీర్షికలు ఇవి : ఒకనాటి ఆంధ్ర రాజధాని పిఠాపురం, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, అపురూప ఆలయసంపదకు నిలయం బిక్కవోలు, చరిత్రపుటలలో కోరంగి మహాపట్టణం, ఆంధ్ర వేదాద్రి కోరుకొండ, ఆదుర్రు, చాళుక్యభీమవరం, సర్పవరం, ద్రాక్షారామం, బెండపూడి, పలివెల, తొలితిరుపతి, పెద్దాపురం.


పాఠకుడికి ఎక్కడా విసుగు కలుగనీయకుండా విషయాన్ని ఆసక్తికరంగా చెప్పటం, చెబుతున్న విషయంపై సాధికారత కోసం విస్తృత పరిశోధన చేసి, వివిధ ఆరాలన్నిటినీ ఒకచోటకి చేర్చి, పుస్తకానికి మంచి ఆకారాన్నివ్వటంలో బాబా నిష్ణాతులని వారి గత రచనలు రుజువు చేసాయి. సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన బాబా గత 3 దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ కవిగా, రచయితగా మంచి గుర్తింపు పొందారు. హేతుబద్దమైన దృక్ఫథంతో సమాజాన్ని పరిశీలించటం అలవాటైన వారు కాబట్టి తనలోని బుద్ధిజీవిని సంతృప్తి పరచటానికి ఆయన చరిత్ర రచనలోకి వచ్చి ఉంటారు.
ఈ పుస్తకం తొలివ్యాసంలో పిఠాపురం విశేషాలను 3 భాగాలుగా వింగడించి, క్రీ.పూ. 6 వ శతాబ్దం నుంచి 1951 వరకు గల వివిధ విశేషాలను కాలక్రమంలో పొందుపరిచారు రచయిత. శాతవాహనుల కాలం నాటి కొడవలి శాసనం, సముద్రగుప్తును అలహాబాద్ ప్రశస్తి ఈ ప్రాంతం ఉనికిని తెలిపే ప్రాధమిక ఆధారాలు. ఒకనాటి కళింగ రాజ్యానికి దక్షిణంగా చివరిప్రాంతమైన ఈ పట్టణాన్ని వివిధ కాలాల్లో చిన్న, పెద్ద రాజవంశాలెన్నో పాలించాయి. తూర్పు చాళుక్య సామ్రాజ్య స్థాపన జరిగింది. పిఠాపురం చాళుక్యులనే పేరుకి మాత్రం పరిమితమై, ప్రభవాన్ని కోల్పోయింది కూడా ఈ పట్టణంలోనే!


తూర్పుచాళుక్యుల కాలంనుంచి జమిందారీ యుగం వరకు సాహిత్యానికి మంచి ఆదరణ లభించిన తెలుగు ప్రాంతాల్లో పిఠాపురానికున్న స్థానం ప్రత్యేకం. బౌద్ధం జైనం, శైవం, శాక్తం, వైష్ణవం, గురుసంప్రదాయాల్లో దేశం మొత్తంళో ప్రాధాన్యమున్న అరుదైన ఆథ్యాత్మిక కేంద్రం పిఠాపురం. చరిత్రకారులకు పనికి వచ్చే విలువైన శాసనాలెన్నిటినో గర్భాన ధరించిన ఊరిది. ఈ పట్టణానికి సంబంధించిన అన్ని విశేషాలను చక్కగా అక్షరీకరించిన రచయిత-చారిత్రకంగా ఎంతో కీలకమైన విషయాలను అందించారు. జైన రాజు ఖారవేళుడు క్రీ.పూ. 183 లో తన హాథిగుంఫ శాసనంలో తెలిపిన “పిథుండ పట్టణం”, జైన గ్రంథం ఉత్తరాధ్యాయన సూత్రంలో చెప్పబడిన వ్యాపార కేంద్రం “పిహుండ”, టాలెమి సూచించిన “పిటిండ్రా రేవుపట్టణం” ఇక్ష్వాకుల శాంతమూలిడి పాత గండిగూడెం తామ్రశాసనంలో ప్రసక్తమైన “పిథుండ బౌద్ధ క్షేత్రం”- పిఠాపురమేనని ఆధారాలు చూపారు. హు యాన్ చాంగ్ తెలిపిన ఆంధ్రుల రాజధాని “ఫింగ్-కి-లో” కూడా పిఠాపురమేనని రుజువులు చూపారు.


రాజమండ్రిపై రాసిన వ్యాసంలో రాజమండ్రి నగర నిర్మాత—అందరూ అనుకుంటున్నట్లు అమ్మరాజో, రాజరాజ నరేంద్రుడో కాదని, రాజమండ్రి కైఫీయతులో చెప్పబడినట్లు గుణగ విజయాదిత్యుడే ఆ నగరాన్ని నిర్మించాడని తెలిపారు. క్రీ.శ. 9-13 శతాబ్దుల నడుమ రాజమండ్రి జగరానికి “జననాథ నగరమని” పేరుండేదని శాసనాథారాలు చూపారు. తూర్పుచాళుక్యుల చేతకానితనం వల్ల, ఇక్కడి సంపద వందల ఏళ్ళపాటు తమిళదేశానికి ఎలా తరలిపోయిందో ఆధార సహితంగా వివరించారు.


బిక్కవోలు గురించి రాస్తూ—ఆ ఊరి నిర్మాణాల వైశిష్ట్యాన్ని, గుణగ విజయాదిత్యుని గొప్పతనాన్ని చక్కగా వివరించారు. సాతలూరి శాసనం, ఇతర సమకాలీన ఆధారాలతో అక్కడి బృహత్ గణపతి విగ్రహం, కొన్ని ప్రాచీన ఆలయాలు గుణగుని నిర్మాణాలయి ఉంటాయని తేల్చారు. ఊలపల్లి వెళ్ళేదారిళోని 9వ శతాబ్దపు ఆలయంపై కనిపించే లకులీశ శివుని శిల్పం బిక్కవోలులో పాశుపత శైవం వర్ధిల్లిందనటానికి నిదర్శనమని తెలిపారు.


వెయ్యేళ్లకు పైగా ఓడరేవుగా, గొప్ప నౌకా నిర్మాణ కేంద్రంగా విరాజిల్లి, ఆనాటి గుర్తులు మచ్చుకైనా లేకుండా మరుగునపడిపోయిన ఓ మహా పట్టణం, సముద్ర తీరపు మట్టిదిబ్బల అడుగుపొరల్లో దగున్న సత్యాన్ని…. 1787, 1839 లలో వచ్చిన భీకర తుఫానులు, పెను ఉప్పెన ఆ పట్టణపు మహా వైభవాన్ని తుడిచిపెట్టేసిన వైనాన్ని కళ్లకు కట్టారు “కోరంగి మహా పట్టణం” వ్యాసంలో.


కాకతీయుల తర్వాత స్వతంత్రులై, ఈ ప్రాంతపు రాజకీయాలలో ప్రత్యేకతను సాధించిన కోరుకొండ పాలకులు కూనయ, ముమ్మడి సింగయ, గన్నయ నాయకుల విశేషాలను, ముమ్మడి నాయకుడి కాలంలో రామనుజ సంప్రదాయం నెలకొని, కోరుకొండ వైష్ణవ క్షేత్రంగా రూపొందిన క్రమాన్ని కథనం చేసారు…. “ఆంధ్ర వేదాద్రి కోరుకొండ”వ్యాసంలో.


అశోకుని కుమార్తె సంఘమిత్ర నిర్మింపజేసిన ఆదుర్రు బౌద్ధ స్తూపం విశిష్టతను, స్థానిక పాలకుడు పృథ్వీమూలుడి విశేషాలను ఆదుర్రు వ్యాసంలో అందించారు.
మొదటి చాళుక్యభీముడు నివసించిన చాళుక్యభీమవరం (సామర్లకోట ప్రాంతం) పై ఉన్న ఐతిహ్యాలతో పాటు కాడవ (ర్) వంశస్థుడైన కొప్పెరు చింగ శాసనాలు, మండయసెట్టి నిర్మించిన రాజనారాయణాలయ విశేషాలను అందించారు మరో వ్యాసంళో.
తీరాంధ్ర దేశంలో వైష్ణవం విస్తరించటానికి దోహదపడిన ఆలయాల్లో సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం ఒకటని, అద్భుత శిల్పంతో పాటు ప్రాచీన సంప్రదాయాన్ని చాటి చెప్పే విశేషాలు సైతం ఇక్కడి శాసనాలలో ఉన్నాయని చెబుతూ జలగడియారం గురించి ఆసక్తిదాయకంగా వివరించారు.


ఆలయాలు సంపద చలామణి సంస్థలుగా వ్యవహరించిన తీరును దాక్షారామం పట్టణంలో చూడవచ్చని దాక్షారామం ఓ మహాపట్టణంగా రూపుదిద్దుకోవడంలో “భక్తి-వాణిజ్యం” ఎలా ఉపకరించాయో చెప్పడంతో పాటు-శాసనాలలో సాహిత్యంలో దాక్షారామం ప్రస్తావనలను ఆ ఊరిని గురించి రాసిన వ్యాసంలో చెప్పారు. కాకతీయులు, రెడ్డి రాజుల కాలం నాటి బెండపూడి విశేషాలను, పలివెల వారకాంతల అంతిమసంస్కారాలకు పలివెల కొప్పు లింగేశ్వర స్వామి గుడి నుంచి అగ్నిని తీసుకువెళ్ళే వింత ఆచారాన్ని, తిరుమల కంటే ప్రాచీనమని చెప్పబడే తొలి తిరుపతి (పెద్దాపురం మండలం) వృత్తాంతాన్ని, ఈవి-ఠీవి కలిగిన పెద్దాపురం రాజుల చరిత్రను తరువాతి వ్యాసాల్లో తెలియజేసారు. ఆయా ప్రాంతాలకు వేర్వేరుకాలాల్లో ఉన్న రాజకీయ, భౌగోళిక విభజనలను సూచించే… “నాడు, స్థలము, విషయము” వంటి పేర్లు పాఠకులను గందరగోళానికి గురిచేస్తాయి కనుక వాటి జోలికి పెద్దగా పోకుండా అటువంటి వివరాలను అవసరమైన మేరకు పుస్తకం చివర్లో అనుబంధ వ్యాసాలుగా ఇచ్చారు.


అయితే వివిధ వ్యాసాల్లో రచయిత తెలిపిన విషయాలను చదువుతున్నపుడు కుతూహలంతో పాటు చిన్నచిన్న సందేహాలు కూడా కలుగుతాయి. ఆయా విషయాలపై సంపూర్ణ చర్చకు ఇది తగిన సందర్భం కాదని భావిస్తూ, ఈ వ్యాసం యొక్క పరిమితులను దృష్టిలో ఉంచుకొని వాటిని సంక్షిప్తంగానే చర్చిస్తాను.

బాబా గారు ఈ పుస్తకంలో పిఠాపురంపై రాసిన వ్యాసంలో (పుట14) పిథుండ పట్టణాన్ని గురించి చెబుతూ”ఖారవేలుడు గోదావరిని దాటి కృష్ణానదీ తీరం ప్రవేశించాలంటే అప్పటికే ఈ ప్రాంతాన్ని ఏలుతున్న శాతవాహనులను దాటుకొని వెళ్లాలి. అదే జరిగి ఉన్నట్లయితే అదొక చరిత్రాత్మక విశేషం అవుతుంది. శాతవాహన శాసనాల్లో కాని, ఖాఅరవేలుని శాసనంళో కాని అలాంటి ప్రస్తావనలు కనిపించవు” అన్నారు. కానీ ఖారవేలుడు తన రెండవ పరిపాలన సంవత్సరంలో శాతకర్ణిని లెక్కచేయకుండా పెద్దసైన్యంతో కృష్ణానదివరకు వెళ్ళి మూషిక నగరాన్ని నాశనం చేసాడని హాథిగుంఫ శాసనంళో ప్రస్తావన ఉంది. (ఎపిగ్రాఫియా ఇండికా – 10). ఈ శాసన లేఖనం స్పష్టంగా లేనందున చరిత్రకారులలో భేదాభిప్రాయాలు కలిగినప్పటిఖీ కె.పి. జయస్వాల్, ఆర్.డి బెజర్జి ప్రకటించిన శాసనపాఠం ప్రకారం మొదటి శాతకర్ణి కాలంలో ఖారవేలుడో, అతడి సైన్యమో శాతవాహన సామ్రాజ్యంలోకి ప్రవేశించారని అత్యధికులు ఆమోదించారు. గుంటుపల్లి గుహల్లో లభించిన స్తంభశాసనం కూడా గోదావరి పరీవాహక ప్రాంతంలో ఖారవేలుని ఉనికిని చాటుతోంది. (jain Monuments of Andhra-G Jawahar Lal: page 51).


మరో వ్యాసంలో- తూర్పుచాళుక్య వీరుడు గుణగ విజయాదియుని విజయాల్లో కీలకంగా వ్యవహరించిన సేనానుల్లో ఒకరు కాదేయరాజు అని ఇచ్చారు రచయిత. అతడు కాదేయరాజు కాడు. కడియరాజు బోయకొట్టాలను సాధించిన పండరంగనికి తండ్రి ఈ కడియరాజు. బహుశ అతడి పేరనే ఈనాటి కడియం ఏర్పడి ఉంటుందేమో.


రాజమండ్రిపై రాసిన వ్యాసంలో పంచగిరులను పేర్కొంటూ గతంలో గుండవరపు లక్ష్మినారాయణ, తల్లావఝుల పతంజలి శాస్త్రి ఇచ్చిన వివరాలే దాదాపు యధాతథంగా ఈ పుస్తకంలోను ఇచ్చారు బాబా. వీరంతా ఊహించినట్లు ఈ గిరులలో “రామగిరి, భద్రగిరి నగరానికి దూరంగా కాకుండా నగరంలోపలే ఉండి, తక్కిన గిరుల లాగే అవికూడా కాలక్రమాన నశించి ఉండవచ్చుననిపిస్తోంఇద్. స్థానికంగా ఇప్పటికీ వాడుకలో ఉన్న ప్రదేశాలపేర్లు, శ్రీనాథుని భీమఖండంలోని వివరాలూ ఈ ఆలోచనకు ఉపబలకాలు. రాజమండ్రిలోని గిరులు ఐదు కాదు, ఏడు. (హేమగిరి, ధవళగిరి, పుష్పగిరి/కమలాచలం, భద్రగిరి, వేదగిరి, శేషగిరి) ఉండేవని భావించాల్సి వస్తుంది.
ఈ పుస్తకంలో ఆంధ్రవేదాద్రి కోరుకొండ అనే మరొక వ్యాసంలో ముమ్మడి నాయకుడు పాలించిన ప్రాంతాలను పేర్కొంటూ కురవాట సీమ వేంగి సమీపంలోనిది లేదా కాకినాడవద్ద ఉన్నది అని రాసారు రచయిత. మంగిపూడి ముమ్మడి నాయకుడి శాసనాలలోని కురవాటసీమ కాకినాడ వద్ద ఉన్న కూరాడ కాదు. ఈ సీమ వేంగిసమీపంలోనిదే అనటానికి ప్రబలమైన ప్రమాణం క్రీడాభీరామంలోని మధుమావతి వృత్తాంతం (ఆధారం: ప్రాచీనాంద్ర భూగోళము-శ్రీకందూరి ఈశ్వరదత్తు)


సర్పవరం వ్యాసంలో రచయిత-రాజరాజ నరేంద్రుని మనుమడు, చోళ చాళుక్య ప్రభువు అయిన వీరచోడుడు వైష్ణవాన్ని ఆదరించాడని, గత పరిశోధకుల నిర్ధారణను పునరుద్ఘాటిస్తూ- క్రీశ. 1092 లో ఆ రాజు వేయించిన్ అపిఠాపురం శాసన విశేషాలను పొందుపరచారు. ఈ శాసనం ద్వారా ‘వీరచోడ చతుర్వేది మంగలం”పేరుతో వీరచోడుడు దానమిచ్చిన పొన్నతొర్ర, మాలవెల్లి, ఆలమి తదితర గ్రామాల సముదాయాన్ని తొండంగి మండలంలోని “పెరుమాళ్ళపురం” (పెరుమాళ్ అంటే విష్ణువు, వీరచోడుని శాసనంలో ప్రస్తావించబడిన దాన గ్రహీతలలో వైష్ణవులున్నారు కాబట్టి) బొల్లోజు బాబా ఊహించారు. కానీ ఈ ఊహ సరైనది కాదనిపిస్తోంది. ఉప్పాడ సమీపంలోని ఆ గ్రామాలు చిన్నచిన్నమార్పులతో దాదాపుగా 11వ శతాబ్దినాటి పేర్లతోనే ఇప్పటికీ పిలువబడుతున్నాయని నా పరిశీలనలో తేలింది. రచయిత కథనం చేయటంళో దిట్టకావటం మూలాన…. చరిత్రలో ఏ కొంతో పరిచయం, ఆసక్తి ఉన్నవారినే తప్ప సామాన్య పాఠకుల పఠనాన్ని- నేను పేర్కొన్న విషయాలేవీ అంతగా అడ్డలేవు.


క్రీస్తుకు పూర్వం నుంచీ ఎన్నో ఆధారాలున్న పిఠాపురం చరిత్రను కథనం చేయటంతో పుస్తకాన్ని మొదలుపెట్టి…. చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రాధాన్యమున్న వివిధ పట్టణాల చరిత్రను సాధికారికంగా, ఆసక్తికరంగా చెప్పటంతో ఈ పుస్తకానికి ఉత్తమ పరిశోధక గ్రంథంగా ప్రత్యేక స్థానం దక్కినట్టే! కళింగ రాజ్యానికి దక్షిణ హద్దు పిఠాపురమని, పిఠాపురంలో వెలసిన శివుని పేరులో భాగమైన ‘కుక్కుట’, ఆ దేవాలయం లోపలి కొలనుకు పేరైన ’పాదగయ’ అనే మాటలు కలిసిన ‘కుక్కుట పాదగిరి’ (గుర్పా) అనే ప్రదేశం బీహార్ లోని బోధగయ సమీపంలో ఉందని, బుద్ధుని శిష్యుడైన మహా కాశ్యపుడి పార్థివదేహం ఇప్పటికీ అక్కడే భద్రపరచబడి ఉందని తెలిసినపుడు-పిఠాపురం పాదగయ క్షేత్రానికి – బీహార్ బోధ్ గయతో ఉన్న బౌద్ధ్ అధర్మ పరమైన సంబంధం అర్ధమౌతుంది.


పిఠాపురం ప్రాచీనబౌద్ధ క్షేత్రం అయి ఉంటుందనే పరిశోధకుల మాట అక్షర సత్యమని తెలుస్తుంది.


వేంగి సామ్రాజ్య పాలకులు చోళులకు విధేయులై ఇక్కడనుంచి ఏటా 340 కళాంజుల బంగారాన్ని, లక్షా 10 వేల కలామ్స్ వరి ధాన్యాన్ని తంజావూరు ఆలయ భాంఢాగారానికి తరలించుకు పోయేవారన్న వాస్తవం విస్మయం కలిగిస్తుంది.


బిక్కవోలులోని కాంచనగుడి -గుణగ విజయాదిత్యుని విజయ చిహ్నమని, మన దేశంలో అరుదుగా కానవచ్చే శిల్పసంపదలోకి చేర్చదగిన శిల్పరీతులు బిక్కవోలు ఆలయాలపై కనిపిస్తాయని తెలిసినపుడు ఆశ్చర్యం కలుగక మానదు. సామర్లకోట, సర్పవరం, పిఠాపురం వైష్ణవ క్షేత్రాల విశేషాలు; బిక్కవోలు, దాక్షారామం, చాళుక్య భీమవరం, పిఠాపురం శైవ క్షేత్రాలు- ఈ ప్రాంతపు సంస్కృతిలో తూర్పు చాళుక్యుల విశిష్ట పాత్రను తెలియజేస్తాయి.


ఇలాంటి ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలను సందర్భోచితంగా చెబుతూ ఈ తరం పాఠకుల్లో కూడా చరిత్రపై మక్కువ పెంచే ప్రయత్నం చేశారు రచయిత. 142 పుటల్లో ఓ విజ్ఞాన సర్వస్వాన్ని ఇమిడ్చే సాహసం చేసిన రచయిత బాబా తన ప్రయత్నంలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి.


ముందుమాటలో డా.కె.ఎస్.కామేశ్వరరావు గారన్నట్లు….ఇది చరిత్రపై మక్కువపెంచే రచన. ఇలాంటి మరిన్ని ప్రామాణిక రచనలు బొల్లోజు బాబా నుంచి వస్తాయని ఆశిద్దాం.


పేపకాయల ప్రసాద్

















No comments:

Post a Comment