Sunday, July 10, 2022

కోహం


చెక్క బద్దతో పిర్రలపై
టపా టపామని దెబ్బలు తింటూ
ఈ క్షణానికి
ప్రేక్షకులను రంజింపచేస్తే చాలు.
విదూషకుని
పూర్వీకుల చరిత్ర ఎవరికి కావాలి?

పదిమందిలో ప్రవర చెప్పుకొని
పరిచయం చేసుకొనే రోజులా ఇవి?

బొల్లోజు బాబా

నిష్కళంక స్వాతంత్ర్యసమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు


శ్రీ అల్లూరి సీతారామరాజు భూకబ్జాదారుడని, యాభై ఎకరాల భూమికొరకు అతను బ్రిటిష్ వారితో పోరాడాడని, దాన్ని కొద్దిమంది స్వాతంత్ర్యపోరాటంగా చిత్రీకరించారంటూ ఒక పోస్టు ఇటీవల వాట్సప్ గ్రూపులలో వైరల్ గా సంచరిస్తోంది.
శ్రీ అల్లూరి సీతారామరాజు జీవించి ఉండగా అతను జరిపిన పోరాటం పై వచ్చిన వార్తా కథనాలు, ఒక ఔత్సాహిక విలేఖరికి ఇచ్చిన అతని ఇంటర్వ్యూ ద్వారా – శ్రీ రామరాజు నిజాయితీగా, స్వాతంత్రపోరాటం జరిపినట్లు అర్ధమౌతుంది. శ్రీ రామరాజు మరణించిన వెంటనే వచ్చిన కొన్ని వ్యాసాలలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవటం కూడా శ్రీ రామరాజు నిష్కళంకతను రుజువుచేస్తుంది.
 
ఈ అంశానికి సంబంధించి ఆనాటి పత్రికా కథనాలు…. వాటి విశ్లేషణా
.
1. ఆంధ్రపత్రిక April 21, 1923

రంపపితూరి నాయకుడు శ్రీ అల్లూరి సీతారామరాజు
.
శ్రీ అల్లూరి సీతారామరాజుతో శ్రీ చెరుకూరి నరసింహమూర్తి జరిపిన సంభాషణ April 21, 1923 ఆంధ్రపత్రిక లో ప్రచురింపబడింది. శ్రీ మూర్తిగారు అప్పటికే దేశంలో ప్రబలంగా నడుస్తున్న సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు.
శ్రీ అల్లూరి సీతారామరాజు 17 వ తారీఖు ఉదయం 6:30 కు అన్నవరం పోలీసు స్టేషనును ముట్టడించి, అక్కడి పోలీసు తుపాకులను స్వాధీనం చేసుకొని, అన్నవర సత్యనారాయణస్వామి దేవాలయ సత్రంలో స్నానపానాదులు కావించి; కాసేపు జపం చేసుకొని పది గంటల సమయంలో శంకవరం గ్రామం వైపు వెళిపోయారు. ఆ రోజు మూర్తిగారు రాజు గారితో జరిపిన సంభాషణ ఇలా ఉంది.
మూర్తి: మీ రే సంకల్పముతో నీ పితూరిని నడుపుతున్నారు
రాజు: ప్రజలకు స్వాతంత్ర్యము లభించుటకే
.
మూర్తి: ఏ సాధనము వలన
రాజు: దౌర్జన్యము వలననే. యుద్ధము చేసినగాని మనకు స్వరాజ్యము రాదు
.
మూర్తి: స్వాతంత్ర్యము బడయగలుగుదునను నమ్మకము మీకు కలదా?
రాజు: రెండేండ్లలో స్వరాజ్యము తప్పక లభించునను నమ్మకము నాకు కలదు.
.
మూర్తి: రెండేండ్లలో స్వరాజ్యమెట్లు లభించును? మీ రవలంబించుచున్న పద్దతివలననే స్వరాజ్యము వచ్చునా?
రాజు: వచ్చును. తప్పక వచ్చును. నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది. జనము లోటేమియును లేదుగాని తుపాకులును మందుగుండ్లును కావలెను. వానికొరకె సంచారము చేయుచున్నాను.
.
మూర్తి: దౌర్జన్యముతో కూడిన యుద్ధములవలనను జన నష్టమువలనను ప్రపంచము విసుగు చెందియున్నది. దౌర్జన్యముకూడదను సిద్ధాంతమునే యిపుడు ప్రపంచములోని అన్నిదేశముల వారును ఆదరించుచున్నారు. జర్మనీవారుగూడా సాత్విక నిరోధమునే ప్రారంభించిరి. గాంధి మహాత్ముడు బోధించిన దౌర్జన్యరాహిత్య శాంతి సాధనములందుమాత్రమే మాకు నమ్మకముకలదు. సకలప్రపంచమునకు శాంతిమార్గమును బోధించుటకు దేవదూత గాంధిమహాత్ముని రూపమున వచ్చెనని ప్రపంచమువారందరును నమ్ముచున్నారు.
రాజు: నాకు దౌర్జన్యరాహిత్యమునందు నమ్మకము లేదు. దౌర్జన్యమువలననే స్వరాజ్యమును బడయగలుగుదుమని నేను గట్టిగా నమ్ముచున్నాను.
***
పై వార్తా కథనంలో వర్ణించిన రాజుగారి ఆకృతి: వయసు 26 ఏండ్లు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు; బక్కపలచన, ఆరోగ్యముతో, అందమైన దేహం; ఎప్పుడు నవ్వుమొఖముతో, వినయసంపదకలిగి, మర్యాదతో వ్యవహరిస్తారు; యోగులవలె గెడ్డము, తలవెంట్రుకలను కలిగి ఉన్నారు. ఖద్దరు ఖాకి పొట్టి నిక్కరు, ఖద్దరు చొక్కాను ధరించారు. చేతిలో పేనుబెత్తము కలదు. కాలికి చెప్పులు లేవు.
***
పై ఇంటర్వ్యూ లో శ్రీ అల్లూరి సీతారామరాజు తన ఉద్యమ లక్ష్యం స్వాతంత్ర్యాన్ని సాధించటమే అని నిర్ద్వంద్వంగా పేర్కొన్నాడు. హింసా పద్దతుల ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించాలి అని నమ్మిన సుభాష్ చంద్రబోస్ కంటే ముందే ఆ లక్ష్యాన్ని స్వప్నించటం గమనార్హం.
***

2. ఆంధ్రపత్రిక 1922 అక్టోబరు 18

రంపపితూరి మూలకారకుని వృత్తాంతము

నరసిపట్నం దగ్గరనున్న గూడెం కొండలలోనుండి బయలుదేరిన యేజన్సీ పితూరి (పితూరి-తిరుగుబాటు) విషయము ఇటీవల తెలియవచ్చు సంగతుల వలన తీవ్రముగా నున్నట్లు కనుపట్టుచున్నది. మూడువందలవరకును పోలీసుదళము పితూరిదారులను పట్టుకొనవలెనని ప్రయత్నించుచున్నది. ఇంతవరకు నిరువురు తెల్ల ఉద్యోగీయులు హతులైరి. పోలీసులు కాన్సటబిల్సు కూడా కొంతమంది చంపబడిరి. కొందరకు గాయములు తగిలెను. మలబారు విప్లవ సందర్భములో ననుభవముగల యే ఆర్. న్యాపుగారు కూడా స్వయముగా వచ్చి పితూరి ప్రాంతములను పరీక్షించి పోయిరి. పరిస్థితులు తీవ్రముగా నున్నట్లు ఇంతవరకు ప్రభుత్వముపయోగించిన బలము నిష్ప్రయోజనమగుట రుజువు చేయుచున్నది.
ఈ పితూరిని నడుపుచున్నది అల్లూరి సీతారామరాజను క్షత్రియ యువకుడని ప్రచురింపబడినది. ఆయన అద్భుతశక్తులు కలవాడని ప్రజలు చెప్పుకొందురు.
 
//ఈయనకు 25 సంవత్సరముల వయస్సుండును. ఆజాన బాహువు, విశాల వక్షస్కుడు, బలిష్ఠుడు, స్ఫురద్రూపి, పచ్చని దేహచ్ఛాయకలవాడు. నల్లనిగడ్డము పెంచెను. కాషాయవస్త్రములను ధరించి స్వరూపముచే నాకర్షించు బాలసన్యాసి. జ్యోతిషము, సాముద్రికము, వైద్యము తెలిసినవాడు. ప్రశ్నచెప్పగలడు. ఒక్కమారతనితో మాట్లాడువారు అతని వశులగుదురు. వైద్యముకొరకును, ప్రశ్నలను తెలుసుకొనుటకును, కొండవారనేకమందితని యొద్దకు వత్తురట. వారి ప్రశ్నలకు సరియైన నిదర్శనములు కనుపడుటచేతను కొండవాండ్రకాయన భగవంతుండను మూఢభక్తి గలదు.

//ఇతను వీలగునంతవరకును ప్రజలకు సేవజేయుచు వారి విశ్వాసమునకు పాత్రుడయ్యెను. ఎవరికే కష్టాలు గలిగినను సహానుభూతి చూపుచు తనకు వీలైన సహాయము చేయువాడట. మందస్మిత వదనముతో పలుకు యీతని పలుకులు జనులనాకర్షించి అతని ప్రేమింపజేయును. అతనికా చుట్టుపట్లనున్న గ్రామములలో చాల గౌరవము కలదు. కృష్ణాదేవి పేట చుట్టుపట్లనున్న అయిదారు గ్రామములలో నీయన పంచాయితీ కోర్టులను స్థాపించి ప్రజలలో న్యాయమును నెలకొల్పెను. ఏజెన్సీ యుద్యోగులా పంచాయతులను బ్రద్దలుగొట్టిరి. ఈ సందర్భమునని రాజుగారు నిరాకరణవాది యను నెపమున వానిని ఆరువారములు కైదులో ఉంచి, దోషిగ నెంచుటకు దగిన ఆధారములు లేక వదిలివేసిరి.
.
పై వార్తా కథనముద్వారా శ్రీ అల్లూరి సీతారామరాజు వ్యక్తిత్వం అర్ధమౌతుంది.
***

3. ఆంధ్రపత్రిక 1922, అక్టోబరు 4

రంపపితూరి
.
ఇద్దరు పోలీసు ఉద్యోగులును, 28 మంది పోలీసులును గుడెం కొండలలో పితూరిదారుల కొరకు వెతుకుచుండగా సెప్టెంబరు 24 వ తేదీన పితూరిదారులదరిపాటున వారిపై బడిరి. ఉద్యోగులగు స్కాటు కవర్డు, హయిటరు గార్లును ఒక కనిస్టెబును యీ ముగ్గురును మడసిరి (చనిపోయారు). ఒక హెడుకనిస్టేబుకును, ఇంకొక కనిస్టేబుకును గాయములు తగిలెను. మరియొక కనిస్టేబు కనబడనేలేదు.// ఉద్యోగుల మరణవార్త హతశేషులవలన విని వారి శవములను కొనితెచ్చుటకు కొండపైకేగుటకు ఆర్మిటేజి గారు ప్రయత్నింపగా అడవిలోనున్న పితూరిదారులు తుపాకులను కాల్చుటచే ఆర్మిటేజిగారు ముందుకు వెళ్లలేదు. ఈ రెండవప్రయత్నమున మరలనొక కనిస్టేబు హతుడయ్యెను. చనిపోయినవారి శవములను, గాయములు తగిలినవారిని పిమ్మట గ్రామవాసులు తీసుకొని వచ్చిరి.

స్కాటుకవర్డు గారికి మన్యమంతయును బాగుగా తెలియును. ఆయన చాలా సమర్ధుడు. హయిటరు గారు టెంపరరీ పోలీసు అసిస్టెంట్ సూపర్నెంటు. జర్మని యుద్ధములో, 1914 ఏడెనులో, 1919 ఆఫ్ఘను యుద్ధములో పనిచేసెను. ఈ యుద్యోగులిద్దరును హతులగుటవలన గొప్పనష్టముకలిగినది.
 
పితూరి దారుల నాయకుడగు అల్లూరి సీతారామరాజును అతని ముఖ్యానుచరులనిద్దరిని గూర్చి తెలిపినవారికిని వారిని పట్టియిచ్చిన వారికిని బహుమానము లియ్యబడునని ప్రకటింపబడెను. మన్యములో ముఠాదారులు (కౌలుదారులు) ఇట్టి తొందరలు కలిగినపుడు పోలీసులకు సహాయము చేయవలెనను షరతుకలదు గాన అట్లు సహాయము చేయవలెనని ముఠాదారులను నిర్భంధించుటకు ఏర్పాటులు చేయబడెను.
.
పై సంఘటన ద్వారా శ్రీరామరాజు ఉద్యమం ఏ మేరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిందో తెలుస్తుంది.
***

4. ఆంధ్రపత్రిక 1923, మే 31 జూన్ 4, జూన్ 18, జూన్ 19

రంపపితూరి - వాల్తేరులో విచారణ
.
1922 అక్టోబరు నెలలో జరిగిన ఎదురుకాల్పులపై విశాఖపట్నం కోర్టులో జరిగిన విచారణ వివరాలు 1923, మే 31, జూన్ 4, జూన్ 19 వ తేదీల ఆంధ్రపత్రిక లో విపులంగా వచ్చాయి. ఈ విచారణలో దుశ్చర్తి గ్రామ కౌలుదారుడైన చెక్కా లింగం దొర ఇచ్చిన సాక్ష్యంద్వారా శ్రీ రామరాజు భూకబ్జాదారుడని చేసిన ఆరోపణ పూర్తిగా సత్యదూరమని అర్ధమౌతుంది.
శ్రీ రామరాజుకి అసిస్టెంటు కమిషనరు గారు పైడిపుట్టలో 50 ఎకరముల భూమి ఇచ్చినట్లు; సదరు ఆర్డరు ప్రకారం ఈ చెక్కా లింగందొర ఆ భూమిని శ్రీరామరాజుకు అప్పగించినట్లు; ఆయన ఆ భూమిని దున్నటము మొదలగునవి ఏమీ చేయక, వారు (రామరాజు) నేపాళదేశము వెళ్ళిపోతానని చెప్పేవారని చెక్కా లింగందొర సాక్ష్యం చెప్పాడు.
***
ఇదే విచారణలో అడపా నడిపిపడాలు అనే సాక్షి “బాస్టియన్ దొర (ఏజెన్సీ డి. తహసిల్ దారు) పెట్టు బాధలచేతనే యీ పితూరి లేచినదని ప్రజలు తరుచుగా అనుకొంటారు” అని చెప్పాడు. అదే విధంగా క్రాస్ ఎగ్జామినేషను చేస్తున్న వకీలు “బేస్టియన్ దొరగారి మహా ఉద్రేకమయిన అల్లరులే ఈ పితూరీకి కారణము. ఆయనను తీసివేస్తే ఈ పితూరీ లేకపోవును” అని వ్యాఖ్యానించాడు.
 
బాస్టియన్ దొర దురాగతాలను గురించి ఖానుబహద్దరు అబ్దులు హజీజు సాహెబు (పోలవరం కలక్టరు) కూడా తన సాక్ష్యంలో ఇలా చెప్పాడు. “ బాస్టిన్ దొరగారిని నేను ఎరుగుదును. బాస్టిన్ గారు ప్రజలను బాధపెట్టెదరు. ప్రజలచే 500 రూపాయల పనిచేయించుకొని పని బాగాచేయలేదను అబద్దపు మిషపై 100 రూపాయిలు మాత్రమే కూలీలకిచ్చేవారు. // కూలీలను తీసుకురాని ముఠాదారులకు మిరపకాయగుండను వారి మర్మస్థలములో బాస్టన్ గారు రాయించేవారు. ఇటులనే అనేక బాధలు పెట్టేవారు. నేను బాస్టిన్ గారి చర్యలను గూర్చి ఒక గట్టి రిపోర్టును వ్రాయగా బాస్టిన్ గారిని ఇప్పుడు పొట్టంగికి బదిలీ చేసినారు. సంతానం పిళ్ళై అను ఓవరుసీయరు గూడ ప్రజలను బాధపెట్టుటలో బాస్టను గారికి చాలా తోడుపడెను. ఈయనను ఈ తరువాత బర్తరవు చేసిరి//.
.
మన్యంలో బాస్టిన్ దొర అతని అనుచరులు చేసిన విధ్వంసం వలన తిరుగుబాటు వచ్చింది, అనేవాదన శ్రీరామరాజు ఉద్యమానికి ఉన్న విశాల ప్రయోజనాలను పరిమితం చేస్తుంది. బహుశా ఆ దురాగతాలు రామరాజును తక్షణం ప్రేరేపించిన అంశాలుగా భావించవచ్చు.
***
ఈ విచారణలో అగ్గిదొర అనే ఒక సాక్షిని ప్లీడరు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ “రెండు సంవత్సరములలో బ్రిటిషు గవర్నమెంటు యుండదని రాజుగారు చెప్పుచుండెడివారని మీకు తెలియునా? అని ప్రశ్నించగా అతను “అట్లు రాజుగారు చెప్పుచున్నట్లు వదంతి గలదు” అని చెప్పటాన్ని బట్టి శ్రీ అల్లూరి సీతారామరాజు పోరాటం అంతా బ్రిటిషు గవర్నమెంటుకు వ్యతిరేకంగా దాన్ని కూలదోయటానికి చేసిన స్వాతంత్రపోరాటంగా విశ్వసించవచ్చును.
***
ముంజేరి కౌలుదారుడైన శరభం నాయుడు తన సాక్ష్యంలో – పితూరిదారులు సెప్టెంబరు నెలలో మా వూరు వచ్చారు. వారి చేతులలో తుపాకులు కత్తులు వగైరాలు కలవు. సర్కారుపై పోట్లాటకు కుమ్ముకు రావలెనని రాజుగారు మమ్ములనడుగగా మేము రామన్నాము. “దెబ్బలాట జరుగును గనుక మీ గ్రామములో ఎవరిని ఉంచకండి దెబ్బలు తగులుతవి అని నాతో రాజుగారు చెప్పగా భయముతో నేనుపోయి మావాళ్ళనందరిని మా వూళ్ళోనుంచి పంపివేస్తిని.
పై ఉదంతం ద్వారా శ్రీ రామరాజు బ్రిటిష్ ప్రభుత్వంతో చేస్తున్న పోరాటంలో, తనకు సహకరించని వ్యక్తులకు కూడా ఏ నష్టం జరగకూడదని కోరుకొనేవాడని అర్ధమౌతుంది. ఇది ఆయన ఉదాత్త వ్యక్తిత్వంగా భావించాలి.
***

5. శ్రీ రామరాజు గురించి స్వైరు దొర ఒక రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించాడు. అది ఇలా ఉంది. (ఆంధ్రపత్రిక 31 మే, 1923)

“నేను అల్లూరి శ్రీ రామరాజుగారిని పిలిపించి మాటలాడితిని. అతని వయసు 25 ఏండ్లు-ఆయన విద్యాధికుడు. ఆంగ్లమున చాలా బాగుగా మాటలాడగలడు. ఆయన తనచరిత్ర నిటుల తెలిపెను. కృష్ణాజిల్లా మోగల్లు గ్రామమున నేను జననమై 14 వ ఏడు వచ్చువరకు నచటనేయుండి పిమ్మట కొంతకాలము రాజమంద్రిలోను తరువాత రామచంద్రపురమున, జాతీయపాఠశాలలోను విద్యనభ్యసించితిని. విరాగినై యరణ్యవాసముచేసి తరువాత సన్యసించునుద్దేశముతో నాలుగేండ్లక్రితమీ మన్యప్రాంతమునకు వచ్చితిని” అని రాజుగారు నాతో చెప్పిరి. అది మొదలుగా నరశీపట్నము మున్నగుచోట్లకు వెళ్ళుచున్నను తరుచు మన్యములోనే కొండలలోను అడవులలోను ఆయన తిరుగుచుండెను-ప్రజలలో చిన్న చిన్న సివిలు దావాలను పరిష్కరించుటకు ఆరునెలలక్రితము పంచాయితీ కోర్టులనేర్పరచెను.
 
// “నాకు దివ్యశక్తులు కలవని అవివేకముచే ప్రజలు తలంచు చున్నారు- నేను పితూరి ప్రారంభించెదనను వదంతులు బయలుదేరినవి-నాకు అసహాయోద్యమముతో సంబంధమేమియును లేదు” అని రాజుగారే నాతో చెప్పిరి. మీరు మన్యమును వదిలి నరిశీపట్నం వెళ్లవలెనని నేను తెలుపగా వెంటనే ఆయన అంగీకరించెను-అసిస్టెంటు కమీషనరు 31 వ తేదీని నరిశీపట్నమునకు రాగా ఆయన యెదుట రాజుగారు వ్రాతమూలమున గూడనిచ్చెను-ఇపుడితడు ప్రభుత్వమునకు వ్యతిరేకముగా నేమియును చేయదలచినట్లగుపడలేదు గాన ఇతనిపై చర్యజరుపుటనవసరము- అని ఆ రిపోర్టు సారాంసము.
.
1922 లో శ్రీరామరాజును అరస్టుచేసి, ఆరువారాలపాటు బంధీగా ఉంచి, రాజద్రోహం చేసినట్లు ఏ రకమైన ఆధారాలు లభించక విడిచిపెట్టినప్పుడు విచారణాధికారిగా స్వైరు దొరగారు రాసిన రిపోర్టు అది.
 
ఈ సందర్భంగా ఈ పోలీసు చెరనుండి నన్ను విడిపించమని శ్రీ రామరాజు పోలవరం డివిజను కలక్టరైన ఫజులా సాహెబు గారికి అర్జీ పెట్టగా, ఆయన రాజుకు యాభై యకరాల భూమిఇప్పించి పైడిపుట్టి గ్రామములో ఉండి వ్యవసాయము చేసుకొని జీవించమని ఆజ్ఞాపించాడు. దుశ్చర్తి కౌలుదారుడైన చెక్కా లింగందొర కు ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసాడు. (రి. శ్రీ రామరాజు ప్రశంస - మద్దూరి అన్నపూర్ణయ్య ఆంధ్రభారతి జూలై, 1928)

బహుసా ఆ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయను అని కాగితాలపై సంతకాలు పెట్టించుకొని ఉంటారు. కానీ శ్రీ అల్లూరి సీతారామరాజు లక్ష్యం, గమ్యం వేరే ఉన్నప్పుడు ఆ సంకల్పాన్ని సంతకాలు నిలువరించగలవా?
 
ఆ తదనంతరం ఆ భూమినాకు అవసరం లేదు అంటూ, మీ ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకోవచ్చును అంటూ 14-06-1922 న ఒక ఉత్తరం ద్వారా శ్రీ రామరాజు చెక్కా లింగందొర కు తెలియచేసాడు. ఈ సంఘటన ద్వారా కూడా శ్రీ రామరాజు తృణప్రాయమైన సంపదలకొరకు తన వ్యక్తిత్వాన్ని, లక్ష్యాన్ని అమ్ముకొనే వ్యక్తి కాదని నిరూపితమౌతుంది.
***
6. శ్రీ రామరాజు ప్రశంస - మద్దూరి అన్నపూర్ణయ్య ఆంధ్రభారతి జూలై, 1928

స్వరాజ్యమే అతని లక్ష్యము

…. కానీ అది పితూరీ కాదు. అది స్వాతంత్ర్య యుద్ధము. బాష్టియను దుండగములు భూముల రిజర్వేషను వలన ప్రభుత్వముపై కోయదొరలలో జనించిన ద్వేషమును శ్రీ రామరాజు ఊతగాగొని స్వరాజ్యము లభించినగాని శాశ్వతసౌఖ్యము జేకూరదని అతడు నిష్కర్షగా బోధించియుండవలెను.
 
//స్వరాజ్యమే తన పరమావధియైనటుల తనకు కుడిభుజములైన గాం సోదరులతో స్పష్టముగా చెప్పినట్లు ఒక పితూరీదారుడు కోర్టులో చెప్పెను. సిఐడి సబినస్పెక్టరు గుండాల శ్రీనివాసరావు గారు కూడా కోర్టులో స్వరాజ్యముకొరకే యుద్ధముజేస్తున్నానని రాజు తనతో చెప్పినట్లు తెలిపినాడు. కాన ముమ్మాటికిని ఆయన వుద్దేశం స్వరాజ్యస్థాపనమే అని రూఢియగుచున్నది.
***

7. శ్రీ అల్లూరి రామరాజు గారు - భోగరాజు పట్టాభిసీతారామయ్య, భారతి 1-7-1928

//శ్రీ రామరాజుగారు దోపిడి చేయలేదు. పితూరిగావింపలేదు. స్వార్ధముకొరకు ఘోరకృత్యములు సలుపలేదు. తన దేశవిముక్తికొరకు బ్రిటిషువారిపై యుద్ధము చేసెను. ఆనాడు నానాఫర్నవీసు, రాణీలక్ష్మీభాయి మున్నగువారు భారత స్వాతంత్ర్య యుద్ధముకొరకు యెటుల పోరాడిరో అటులనే 3 సంవత్సరములకాలము, బ్రిటిషు ప్రభుత్వోద్యోగులకు పూర్వసూచనలు గావించి, బహిరంగ యుద్ధములకై స్థల కాలనిర్ణయములతో నాహ్వానములనంపుచు, యుద్ధమును జరిపెను.
.
8. ముగింపు

శ్రీ రామరాజును బ్రిటిష్ వారితో సహా ఆయన సమకాలీనులు సరిగానే అర్ధం చేసుకొన్నప్పటికీ నేడు కొందరు ఆయన భూకబ్జా దారుడని, సొంత భూమికోసం బ్రిటిష్ వారితో చేసిన పోరాటాన్ని స్వాతంత్ర్యపోరాటంగా చిత్రీకరిస్తున్నారంటూ దుర్మార్గమైన కట్టుకథలను ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరించబూనటం గర్హనీయం.
 
కేవలం ఎనిమిది వందలమంది అనుచరులతో, అరకొర ఆయుధసంపత్తితో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించబూనటాన్ని అవగాహనా రాహిత్యంగా కాక మాతృదేశ దాస్యశృంఖలాలను విడిపించాలన్న జ్వలించే తీవ్రమైన కాంక్షగానే చూడాలి. ప్రాక్టికల్ గా ఆలోచించే నేటి తరానికి అలా పోరాడటం వెనుక నిప్పులాంటి నిష్కల్మషమైన చిత్తశుద్ధి, నిజాయితీ ఉండేవనే విషయం నమ్మబుద్ధికాక ఏవో స్వార్ధప్రయోజనాలు ఉండే ఉంటాయని సరిపెట్టుకోచూడటం, ఆ మేరకు వక్ర భాష్యాలు చెప్పటం విషాదకరం.
 
శ్రీ రామరాజు ఉదంతంలో భిన్న వ్యవస్థలు కలవరపడిన వైనం ఆనాటి వార్తాకథనాలద్వారా స్పష్టంగా అర్ధమౌతుంది

కాంగ్రెస్ పార్టీ అప్పటికి సహాయనిరాకరణోద్యమం పేరిట మెత్తమెత్తగా స్వాతంత్ర్యపోరాటం జరుపుతోంది. శ్రీ రామరాజు మన్యంలో జరుపుతున్న ఈ సాయుధ పోరాటం తమపీకకు ఎక్కడ చుట్టుకొంటుందో అని- మన్యం అనేది దుర్గమమైన కీకారణ్యం. అక్కడకు కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఆ ప్రజలను ప్రభావితం చేసి పితూరీ లేవదీసే అవకాసమే లేదు అని ప్రకటించి చేతులు దులుపుకొంది.

బ్రిటిష్ ప్రభుత్వం ఈ పితూరి ప్రభుత్వంపై కాదని, ఏదో స్థానిక బాస్టిన్, సంతానం వంటి అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేగిన చెదురుమదురు అల్లర్లని ప్రకటించుకోవటానికి ఆరాటపడింది.
 
పితూరీదారులు ఊర్లను దోచుకొన్నారని వైజాగ్ లో జరిగిన కోర్టు విచారణలో పదే పదే సాక్షులతో చెప్పించినప్పటికీ, చాలామంది సాక్షులు పితూరి దారులు బియ్యం, వంట సామాగ్రి, పడుకోవటానికి మంచాలు ఎత్తుకుపోయారని చెప్పారు తప్ప ధనకనక వస్తువులు దోచుకొన్నట్లు చెప్పలేదు. అంతే కాక స్త్రీలను చెరిచిన దాఖలాలు కూడా కానరావు. ఇది శ్రీ రామరాజు నాయకత్వ పటిమగా అర్ధం చేసుకోవాలి.

శ్రీ రామరాజుకు 50 ఎకరాలు భూమి ఆశచూపి ఉద్యమాన్ని నీరుకార్చాలని చూడటం కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన ఒక ప్రయత్నం.

ఇక అన్ని ప్రయత్నాలు విఫలమై, ఈ ఉద్యమం దావానలమై ప్రజలలో విస్తరిస్తున్నదన్న సంగతి గ్రహించిన ప్రభుత్వం, చివరకు ఎన్కౌంటర్ రూపంలో శ్రీరామరాజును మట్టుబెట్టటం జరిగింది. తనను ప్రశ్నించేవారిపై రాజ్యం చేసే చివరి దరహాసమని అనాదిగా పదే పదే రుజువయ్యే పరమ సత్యమది.
 
బొల్లోజు బాబా
9/7/2022















Sunday, July 3, 2022

అడవిలో అద్దం



అడవిలో అద్దం
.
ఒక చిరుతపులి
దాని ముందు నడుస్తూ ఒక్కసారి ఆగింది
అద్దంలో దాని ప్రతిబింబం కూడా ఆగింది
కొంచెం ముందుకు కదిలింది
ప్రతిబింబం కూడా
దగ్గరకు వెళ్ళింది
దగ్గరకు వచ్చింది
ముంగాలితో దాన్ని తాకింది
అది కూడా తాకింది
భయపడింది
చరిచింది
అరిచింది
ఉరికింది
అలసిపోయి నేలపై కూలబడింది
ఈ ప్రపంచం కూడా
ఏదో ఒకరోజు దానిముందు
నేను అలా కూలబడక పోతానా
అని ఎదురుచూస్తోంది
.
బొల్లోజు బాబా
3/07/2022

సభా విశేషాలు
















ప్రియవిభునకు....



ప్రియవిభునకు....
.
ఇన్నేళ్ళ నా ప్రయాణంలో
చివరకు నువ్వు మాత్రమే మిగిలావు నాకు
నీవేంటో తెలుసుకోగలిగానుకానీ
నేనేంటో తెలుసుకోలేకపోయాను.
ప్రభూ
నీ కాంతిని ఈ చిన్ని చేతుల్లో
ఇముడ్చుకోలేకపోతున్నాను
జారిపోతోంది
కారిపోతోంది
పొరలిపోతోంది
ఈ దుమ్ములో,
దహించే ఈ దాహంలో
నన్నునేను కోల్పోతున్నాను
చీకట్లోకి
చిమ్మెటల శబ్దాలలోకి
నేను కరిగిపోతున్నాను
ప్రభూ!
నిన్ను నేను
పూర్తిగా నిరాశ పరచాననే నా చివరి వాక్యాన్ని
ఈ కూలుతున్న స్వప్నాలపైనా
ఈ వాలుతున్న దిక్కులపైనా
రాసే శక్తిని ప్రసాదించు
మరొక సారి జీవించే అవకాశం ఇచ్చి
నీ ప్రేమను శైశవం నుంచే గ్రహించేలా చేయి
ప్రభూ!
.
బొల్లోజు బాబా
26/6/2022

కృశా

 శ్రీ దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారి స్వగ్రామమైన చంద్రం పాలెం లో


Thursday, June 9, 2022

రూమి వాక్యాలు - ఇ.బుక్



రూమి వాక్యాలు - ఇ.బుక్

జలాలుద్దీన్ మహమ్మద్ రూమి కవిత్వాన్ని మొదటి సారిగా 2009 లో చదివాను. ఆ భావతీవ్రతలో కొట్టుకుపోయాను. కొన్ని కవితలను అనువదించి నా బ్లాగులో పోస్ట్ చేసాను.
అంతర్జాలంలో రూమి కవిత్వంలోని వాక్యాలను కొటేషన్లుగా పోస్ట్ చేసే అనేక గ్రూపులను చూసి ప్రేరణ పొంది 20 March 2016 న "రూమీ వాక్యాలు" పేరుతో ఒక పేస్ బుక్ గ్రూప్ క్రియేట్ చేసాను. రూమీ కోట్స్ ను అనువదించి దానిలో చాన్నాళ్ళ పాటు పోస్ట్ చేసాను. వాటన్నిటిని ఒకచోటకు చేర్చాలనే ఉద్దేశంతో ఇ.బుక్ రూపంలో వెలువరిస్తున్నాను.

ఏడువందల సంవత్సరాల తరువాత కూడా జలాలుద్దిన్ రూమి రచనలకి ఆదరణ తగ్గలేదు. రూమి సాహిత్యం ఇస్లామ్ మత బోధనలకు అనుగుణంగా నడచినప్పటికీ, ఏ మతప్రసక్తి లేనటువంటి ఒక సార్వజనీన మానవానుభూతిని వాక్యవాక్యానా పోల్చుకొనగలం.
ఇక్కడనుంచి డౌన్ లోడ్ చేసుకొనవచ్చును

https://archive.org/details/20220608_20220608_1359

బొల్లోజు బాబా
8/5/2022

Saturday, May 14, 2022

ఊహల కొంగలు కవిత్వ గూటికి చేరేవేళ



డా. కాళ్ళకూరి శైలజ గారి "కొంగలు గూటికి చేరే వేళ" కవితా సంపుటి పై వ్రాసిన సమీక్షా వ్యాసం. ఇది పాలపిట్ట ఏప్రిల్, 2022 సంచికలో ప్రచురింపబడింది. ఎడిటర్ శ్రీ గుడిపాటి వెంకట్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
బొల్లోజు బాబా
.
ఊహల కొంగలు కవిత్వ గూటికి చేరేవేళ

.
డా. కాళ్ళకూరి శైలజ గారు వక్తగా, విశ్లేషకురాలిగా ఇప్పటికే ప్రసిద్ధులు. వృత్తిరీత్యా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న వైద్యులు. ఇప్పుడు “కొంగలు గూటికి చేరేవేళ” అనే ఈ కవిత్వ సంపుటితో మంచి కవయిత్రిగా మనముందు నిలిచారు. ఇది వీరి మొదటి కవిత్వ సంపుటి.
శైలజ గారు చదువుకునే వయసునించీ గొప్ప సాహిత్యాభిమాని, విస్త్రుతమైన చదువరి. ఈ సంపుటిలోని కవితలు- ఊదాపూలు, నాచుట్టూ, వ్యధార్తగాథలు, అస్తిత్వం అని నాలుగు భాగాలుగా ఉన్నాయి. ఊదాపూలలో 19 కవితలు, నాచుట్టూ లో 9 కవితలు, వ్యధార్తగాథలు అనే విభాగంలో 8 కవితలు, అస్తిత్వం అనే చివరి భాగంలో 2 కవితలు ఉన్నాయి.

I. ఊదాపూల… Confessions

సాహిత్యంలో ఊదారంగు ప్రేమని, నిజాయితీని, మార్మికతను, జ్ఞాపకాలను సూచిస్తుంది. ఈ 19 కవితలలో అవే అంశాలు ప్రతిబింబించటం గమనించవచ్చు.
శైలజగారు తనజీవితంలో ఎదుర్కొంటున్న సంఘర్షణలను, వేదనలను నిజాయితీగా కవిత్వీకరించారు. స్వీయానుభవాలను ఇంటలెక్చువల్ గా కవిత్వీకరించే కవులను Confessional Poets అని అంటారు. ఆ కోణం లోంచి చూసినపుడు వీరు Confessional Poetess గా కనిపిస్తారు. ఈ విభాగంలోని మొదటి అయిదు కవితలు చాలా విశిష్టంగా కనిపిస్తాయి. ఇవి కవయిత్రి తాలూకు మనఃస్థితిని, కవిత్వం వైపు ఆమె చేసిన ప్రయాణాన్ని సూచిస్తాయి.
గతించిపోయిన పుత్రుని తాలూకు జ్ఞాపకాలు మొదటి మూడు కవితలలో చాలా లోతుగా వ్యక్తీకరించబడ్డాయి. ఒక బలమైన వేదనను ప్రతిబింబించాయి. అదొక పెనుదుఃఖం. ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసిన శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారు, నేను ఆ మొదటి మూడు కవితల వద్ద చాలాసార్లు ఆగిపోతూ వచ్చాను అన్నారు. మొదటి మూడు కవితలలో తన పుత్రశోకాన్ని….

పచ్చి గాయం మీద
జ్ఞాపకాల లేపనం పూసి
కాలంతో రాజీ పడాలి…. అంటూ ఒకచోట
వెలవెల బోయిన అమావాస్య నిశిలో
తేలిపోయిన విత్తు
మరెక్కడో మొలకెత్తే ఉంటుంది …. అంటూ మరో చోట నిర్వేదంతో సమాధానపడటం గమనిస్తాం.
 
“కలలు కన్నీళ్ళు దాయటానికి పదాలను మించిన సురక్షిత స్థలాలు లేవు ఈ ప్రపంచంలో” అని ముందుమాటలో శ్రీ సీతారాం అన్నట్లు - ఆ వేదననుండి, ఆ వేదనామయ బరువైన జ్ఞాపకాలనుండి ఆమెకు సాంత్వన కవిత్వంలో లభించినట్లు నాల్గవ కవిత డేజావూ లో అర్ధమౌతుంది. ఏదైన ఒక కొత్త ప్రదేశానికి వచ్చినపుడు, ఇదివరకెన్నడో ఆ ప్రదేశాన్ని చూసామని, అక్కడ సంచరించామనీ అనిపించటాన్ని డే జావూ అంటారు.

ఓహో! ఇదే ఆ చోటు
కలతలు, కన్నీళ్ళ సాక్షిగా
అల్లనల్లన ఎగిరే మనసుకు
కంటిచెమ్మ తుడిచి
కలల చీకట్లు చెరిపి
జన్మజన్మ స్మృతుల బాటలో
దర్శించిన క్షణకాలపు “ఆనంద సీమ” ఇదే
ఇక్కడే!
అడవిలో మిణుగురు నేనే
తోటలో తేనెపిట్టా నేనే
వెన్నెల వర్షంలో క్రీనీడల నడుమ మెత్తని చీకటి నేనే
తూర్పుకొండల నారింజ రశ్మి నేనే (డే జావు)

ఇదొక అపురూపమైన సందర్భం. జీవితంలోని డిప్రెస్సింగ్ మొమెంట్స్ ని కవిత్వం తిరిగి జీవన క్షణాలుగా మార్చటం, -- అల్లనల్లన ఎగిరే మనసుకు కంటిచెమ్మ తుడిచి, చీకట్లు చెరిపి “ఆనంద సీమ” ను దర్శింపచేయటం, ఇదంతా ప్రకృతి చేసే మాయ అనే ఎరుక కలిగించటం- ఒక గొప్ప మానవానుభవం. విశ్వసిస్తే దైవీక ఘటన కూడా. ఆ మేరకు శైలజగారు కవిత్వానికి ఒక ప్రొడిగల్ డాటర్ గా అనిపిస్తారు.

ఇక ఐదవ కవితలో శైలజగారు తాను కవిత్వం వైపు చేసిన ప్రయాణానికి తనకు మార్గదర్శిగా ఎవరున్నారో ఇలా చెబుతున్నారు.

మరి నా గురువో?
జటాధారి, మౌని కాదు.
ఉధ్గ్రంథ సారమూ కాదు!
సుతిమెత్తని ఇసుకలో తగిలే ములుకు
నమ్మకాన్ని ప్రశ్నించే బాధ
విశ్వాసాన్ని నిలదీసే విషాదం
పాలలో నీటిని వేరుచేసే రాయంచ
కలలో మెలుకవ
మెలుకవలో ఎరుక… (మార్గదర్శి). ….. మొత్తం మీద జీవనానుభవాలే తన కవిత్వానికి నేపథ్యం అంటున్నారు. అందుకనే ఈ సంపుటిలోని అనేక కవితల వెనుక స్పందించే ఒక దయామయి హృదయం ఉండటం స్పష్టంగా గమనించవచ్చు.

ఊదాపూల విభాగంలోని మిగిలిన కవితలలో ఎక్కువగా నాస్టాల్జియా, ప్రకృతి, మానవ సంబంధాలు, ఆత్మవిశ్వాసము, సహానుభూతి లాంటివి వస్తువులుగా ఉన్నాయి. నువ్వొచ్చివెళ్ళిన సాయింత్రం, అప్పుడు, కేరింత, మిస్సింగ్ లాంటి కవితలను కథనాత్మక శైలిలో చెప్పారు. నేడు కవిత్వాన్ని కథనాత్మక పద్దతిలో చెప్పటానికి ప్రాముఖ్యత పెరుగుతున్నది. కథనాత్మక శైలి పఠితల్ని ఆకర్షిస్తుంది. చెపుతున్న సంఘటననో దృశ్యాన్నో మనో ఫలకంపై చిత్రించుకోవటం ద్వారా చక్కని అనుభూతిని కలిగిస్తుంది.

ఒకానొక శరత్ పూర్ణిమరోజున ఇంటిల్లపాదీ పిల్లాపాపలతో డాబాపైకి వెన్నెలలో భోజనాలు చేసిన సందర్భాన్ని ఒక కథలా చెప్పిన ఈ కవితా సౌందర్యం చూడండి

వెన్నెల భోజనానికి అంతా సిద్దం
డాబామీద చాప, పళ్ళెంలో పాల బువ్వ
గిరికీలు కొడుతున్న మిణుగురుల్లా
పసికేరింతలు//
పెరుగన్నం పులుముకున్న వేళ్లకొనలకు
అందక పరుగులు తీసే
చిట్టికూనల పాదాలు//
పందిరి కింద పడక్కుర్చీలో నాన్న,
పైకీ కిందకీ అమ్మ
కలబోసుకున్న కబుర్ల అక్కాచెల్లెళ్ళు//
ఎక్కడిదో సాంబ్రాణిధూపం//
ఇప్పటికీ శరత్ పూర్ణిమ నిండుకుండ
చేదుకున్న కొద్దీ వెలుగు నీడల సైయాట
నింగిని ఎదలో వెలిగించే పెన్నిధి. (అప్పుడు)

పై కవితలో సామాజిక స్పృహ ఏది? సామాజిక ప్రయోజనం ఏమేరకు నెరవేరుతుందీ? అంటూ ఆధునిక విమర్శకుడు ప్రశ్నించవచ్చు. పై కవితలో వేల సంవత్సరాలుగా కాపాడుకొంటూ వచ్చిన భారతీయ సంస్కృతి ఉంది. మనిషిని మనిషితో బంధించిన మానవ సంబంధాలు ఉన్నాయి. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవటం, మానవసంబంధాలను నిలుపుకోవటాన్ని మించిన సామాజిక ప్రయోజనం ఏమీ ఉండదు ఏ కాలంలోనైనా. ఈ రెండు పనులు చేయటానికి సాహిత్యం వినా మరో మార్గం లేదు.

II. నాచుట్టూ … నేనే

ఈ విభాగంలో తొమ్మిది కవితలు ఉన్నాయి. ఇవి కవి చుట్టూ ఉన్న సమాజిక జీవనం పట్ల చేసిన పరిశీలనాపూర్వక వ్యాఖ్యానాలు. ఈ విభాగంలో -పల్లెలకు దూరమై పట్నంలో పరాయీకరణ పాలౌతున్న మనిషిగురించి రెండు కవితలు, ప్రకృతి వైపరీత్యాలలో పేదల అగచాట్లపై రెండు, వృద్ధాప్యంపై రెండు, దివ్యాంగులపై ఒకటి, రాత్రి పహారా కాచే గూర్కాపై ఒకటి, సరిహద్దు సైనికునిపై ఒకటి ఉన్నాయి.
 
నేడు మానవుడెంత పరాయీకరణకు గురయ్యాడో చెప్పకుండా ఆధునిక జీవనాన్ని చెప్పటం సాధ్యపడదు. గుంపులో ఏకాకితనం, అమానవీకరణ, హిపొక్రిసి, నగరంలో ఉంటూనే నగరం పట్ల విముఖత, పల్లె లేదా బాల్యజ్ఞాపకాలను తలచుకోవటం, నిరాశ వంటివన్నీ పరాయికరణ వివిధ స్థాయిలు.

చీకటి కవల కవితలో నగరభీభత్స సౌందర్యం వివిధ మెటఫర్లలో ఇలా దర్శనమిస్తుంది

నగరం ఒక భీతావహ సత్యం/
జూదగృహం పట్నం/
కృత్రిమ ఆటబొమ్మ/
దేహాన్ని బేరం పెట్టమంటుంది
మోసం, మోహం కలనేసిన మలిన వస్త్రం నగరం/
చీకటి కవల నగరం.
 
నగరాన్ని చీకటికి కవల అనటం ఒక నవ్యమైన ఊహ.

రచ్చబండ అనే కవితలో జ్ఞాపకాల్లోంచి ఒకనాటి పల్లె సామాజిక జీవనాన్ని ఇలా పునర్నిర్మించుకొంటారు శైలజగారు.

అనగనగా మా ఊరు
ఊరికి పెద్దన్న రావిచెట్టు/
ఆ చెట్టుకింద చదునైన రాయి
అదే ఆ ఊరికి గరిభనాభి//
బాటసారి వేసట, ముచ్చట్ల తీరిక
బైరాగిపాట, సన్యాసి విశ్రాంతి,
తలా ఒక ఆకుగా రాలిపడినది అక్కడే – (రచ్చబండ)

పల్లెటూరిలో గడచిన బాల్యపు జ్ఞాపకాలు తలచుకోవటం ఆధునిక మనిషి మీద అనివార్యంగా పడిన పరాయీకరణను తెలుపుతున్నాయి.

III. వ్యధార్తగాధల…చీకటి వెలుగులు

వ్యధార్తగాథలు అనే విభాగంలో 8 కవితలున్నాయి. శైలజగారు వృత్తిరీత్యా వైద్యులు. ప్రాణం శ్వాసపోసుకోవటాన్ని దగ్గరనుండి చూస్తారు. ఆ నేపథ్యంలోంచి రాసిన కవితలు ఈ విభాగంలో ఉన్నాయి. ఈ కవితలలోని వస్తుశిల్పాలు హృదయాన్ని కంపింపచేస్తాయనటంలో సందేహం లేదు.

రెక్కలు సాచి రివ్వుమందామనే ప్రాణంకి
మత్తిచ్చి మాయచేసి, లాలిస్తుంటారు
ఏ రక్తసంబంధం లేనివారు
రక్తపు సీసా కోసం పరుగులు తీస్తుంటారు//
ఎన్ని అరచేతులు కావాలి!
ఒక ప్రాణదీపం వెలిగించేందుకు --(ఆపరేషన్ థియేటర్)

ఎమర్జెన్సీ వార్డులో జరిగే ఒక దినచర్యను కవిత్వీకరించారు. కవిత చివరలో ఆ వ్యక్తి బ్రతికితే "గది అమ్మలా కళ్ళువొత్తుకొంటుంది, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే గుండెల్లో బాణం దిగిన గాయం జ్ఞాపకమై సలుపుతుంది - అనటం ద్వారా వైద్యవృత్తిలో ఉండే మానవీయకోణాన్ని ఆవిష్కరించారు.
 
నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొనేది ఎక్కువగా స్త్రీలే. ఎందుకో పురుషులు అలాచేసుకోవటం పెద్దగా చూడం. అత్తింటివారి వేధింపులను తట్టుకోలేక ఒక స్త్రీ నిప్పంటించుకొని కాలిన గాయాలతో హాస్పటల్ కు వచ్చిన సంఘటనను దగ్ధపరిమళం అనే కవితగా మలచారు.

అన్నం వండిన చేయి మోడై
మరణవాగ్మూలంలో సంతకం పెట్టలేక
నిరాశ తెరవెనుకనుంచి సైతం
క్షమాభిక్ష పెట్టేందుకు గొంతుసవరించుకొంటుంది
కాబోయే పెళ్ళికొడుకు మాత్రం తెలివిగా తప్పించుకుపోతాడు. (దగ్ధపరిమళం)

అలాంటి పరిస్థితులలో కూడా ఆ స్త్రీ ఆ భర్తకు క్షమాభిక్షపెట్టేందుకు సిద్ధపడినట్లు చెప్పటం ద్వారా మానవసంబంధాలలోని అనూహ్యతను, అపాత్రదానాన్ని అక్షరబద్ధం చేస్తారు శైలజగారు.
ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వటాన్ని “తొలి ఊపిరి” పేరుతో ఒక కవితా సందర్భం చేసారు శైలజగారు.

పురుటిగది సంద్రంలో
సుడిగుండాల మాయవిడినపుడు
ప్రాణం రూపుకడుతుంది.
“అమ్మా” అనే కేక మోగుతుంది
ఒక్క తల్లికే జన్మనివ్వడం తెలుస్తుంది

మాయవిడినపుడు అన్న మాటలో “మాయ” అనే పదానికి వేదాంతపరమైన మాయ అనే అర్ధంతో, శాస్త్రీయంగా పిండత్వచం/Placenta అనే అర్ధంతో కూడా అన్వయం చేసుకోవచ్చు. ఇది కవి ప్రతిభ.
ఏ మనిషైనా ఒంటరిగా బ్రతకలేడని, అనేకమంది క్రమశిక్షణతో సైన్యం వలే పనిచేస్తేనే అతని జీవనం సాధ్యమౌతుందనే సత్యాన్ని ఈ సంపుటి చివరికవిత “నీకై పోరాడే సైన్యం” ద్వారా ఆవిష్కరించారు.
 
ఆసుపత్రి గోడలు, ఆలయాల కంటే ఎక్కువ ప్రార్ధనల్ని విని ఉంటాయి అంటాడు రూమీ.

ఆసుపత్రి అంటేనే ఒక ఉద్యమం
ఆఖరుక్షణందాకా పోరాడే
అత్యున్నత పోరుభూమి
ప్రార్ధనలన్నిటికీ ప్రాణాన్ని
కానుకగా ఇచ్చే దివ్యలోకం – అంటూ శైలజ గారు ఆసుపత్రికి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు ఈ కవితలో.

VI. నా అస్తిత్వం … నా కవిత్వమే

ఈ విభాగంలో అల్కెమి, సౌమ్యవాది అనే పేర్లతో రెండు కవితలు ఉన్నాయి.

వేపపూత ఏటా తొలి సంతకం చేసినట్టు
ఓటమిలోంచి
వికసించే రహస్యం పట్టుబడింది
విషాదం కన్నా జీవితం తియ్యనిది (అల్కెమి)

“కవిత్వం ఒక అల్కెమి. దాని రహస్యం కవికే తెలుసు” అని తిలక్ అన్నాడు. అప్పటినుంచి తెలుగు సాహిత్యంలో అల్కెమి అనేపదం కవిత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది. అల్కెమి అనే పేరుతో ఉన్న ఈ కవితలో ఓటమిలోంచి తిరిగి ఫీనిక్స్ పక్షిలా తాను పైకి లేవటానికి కవిత్వం సహాయపడిందనే రహస్యాన్ని పొందుపరచారు శైలజగారు.
 
ఇదే విభాగంలోని రెండవకవితైన సౌమ్యవాదిలో

నువ్వున్నచోటును పదేళ్ళ తర్వాత 
ఎలా ఉంటుందో దర్శించే
ఒకే ఒక్కడున్నాడు//
వాడు కవి, వాడే రవి
తూర్పున కాదు,
మార్పున ఉదయిస్తాడు – అంటూ ఒక కవిని నిర్వచించారు. 

ఈ రెండు కవితలద్వారా తన అస్తిత్వంలో ఓటమిలోంచి వికసించిన కవిత్వాన్ని వినిపించే సౌమ్యవాద కవి దాగి ఉన్నదంటూ అన్యాపదేశంగా తన కవిత్వ తత్వాన్ని చెబుతున్నారు.
ఈ సంపుటిలోని కవితల వరుసక్రమాన్ని, వివిధ విభాగాలుగా వాటిని కూర్చిన విధానంలో అంతస్సూత్రంగా ఒక నెరేటివ్ ఉండటం విశేషం.
***
పదచిత్రాల సౌందర్యం, ఆర్థ్రత, జీవితానికి చేసిన లోతైన వాఖ్యానం, పదబంధాల నవ్యత్వం, తాత్వికత, కాళ్ళకూరి శైలజ గారి కవిత్వంలో పొటమరిస్తూ


ఉన్నాయి. చక్కని చిక్కని కవిత్వం ఇష్టపడేవారికి “కొంగలుగూటికి చేరే వేళ” తప్పక నచ్చుతుంది. ఈ పుస్తకాన్ని అనల్ప వారు ప్రచురించారు. అందమైన ప్రింటు, ఖరీదైన పేపరు. వెల 150/- రూపాయలు. ఈ పుస్తకం కావలసిన వారు 7193800303 ఫోన్ నంబరులో సంప్రదించగలరు.
బొల్లోజు బాబా













Monday, May 9, 2022

అంతర్ధానమైన ఆజీవిక మతం

    భారతదేశానికి సంబంధించి క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం చారిత్రికంగా చాలా విశేషమైనది. సుమారు 62 వివిధ మతాలు అప్పటికి ఆవిర్భవించాయి. వీటిలో బుద్ధిజం, జైనిజం నేటికి నిలిచి ఉన్నాయి. అదే కాలంలో పుట్టి మరో రెండువేల సంవత్సరాలపాటు మనుగడలో ఉండి మధ్య యుగాలలో సమూలంగా అంతరించిపోయిన మరొక మతం ఆజీవిక మతం.

ఆజీవక మతానికి మూల పురుషుడు మఖలి గోశాల. ఇతను జైన మహావీరుని శిష్యుడు. మఖలి గోశాల (Makkhali Gosaala) ఆజీవిక మతానికి 24 వ తీర్థంకరుడు అనే అభిప్రాయం కలదు.

మఖలి గోశాల, గౌతమ బుద్ధుడు, జైన మహావీర తీర్థంకరుడు ముగ్గురు సమకాలీనులు.

ఆజీవక మతానికి సంబంధించిన ఏ విధమైన రచనలు అందుబాటులో లేవు. వీరి గురించిన సమాచారం జైన, బౌద్ధ గ్రంధాల ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇవి ఆజీవక మతానికి ప్రత్యర్ధి మతాలు కనుక వీటిలో ఆజీవిక మతం గురించి గర్హనీయ అంశాలు తప్ప మంచి విషయాలు పెద్దగా కనిపించవు.

మఖలి గోశాల

మఖలి గోశాల తండ్రి పేరు మఖలి. జైన మతావలంబి. ఇతను దేవతల బొమ్మలను ఒక పెట్టెలో ఉంచి వాటిని ప్రదర్శిస్తూ, భక్తిగీతాలు పాడుకొంటూ జీవనం సాగించేవాడు. ఇతను ఒక దాసితో వ్యభిచరించిన ఫలితంగా ఆమె ఓ పశువులపాకలో ఒక మగ బిడ్డను కన్నది. మఖలి కి జన్మించాడు కనుక ఆ బిడ్డకు మఖలి పుత్రుడని, గోశాలలో పుట్టాడు కనుక మఖలి గోశాల అని పేర్లు కలిగాయి.

బుద్ధఘోషుని రచన ప్రకారం - ఈ మఖలి గోశాల తండ్రివలే దాస్యజీవనం సాగించాడట. ఒకనాడు నెత్తిపై ఒక నూనె కుండతో బురదగా ఉండే నేలపై నడుస్తుండగా యజమాని “జాగ్రత్తగా నడు” అని హెచ్చరిస్తున్నప్పటికీ అజాగ్రత్తతో ఆ నూనెకుండ నేలపాలు చేసాడట. దీనికి కోపించిన యజమాని మఖలి గోశాలని తరమగా పంచెమాత్రం చేతికి చిక్కిందట. అలా గోశాల నగ్నంగా పరిగెత్తుకొంటూ వెళ్ళి దిగంబర సన్యాసిగా అవతారమెత్తాడని, క్రమేపీ ఆజీవిక మతాన్ని స్థాపించాడని అంటూ బుద్ధఘోషుడు ఆజీవిక మత స్థాపకుడి పూర్వవృత్తాంతాన్ని తెలియచేసాడు.

బౌద్ధ జైన మతాలు ఆజీవిక మతాన్ని వ్యతిరేకించాయి. కనుక అతని పుట్టుక నీచమైనది అనే అర్ధం వచ్చేలా పై బౌద్ధ రచన సాగటం ఆశ్చర్యం కలిగించదు.

గోశాల ఆరేళ్ళు వర్ధమాన జైన మహావీరుని వద్ద శిష్యరికం చేసాడు. కలహించి విడిపోయాడు. పదహారేళ్ళు శ్రావస్తిలో బోధకునిగా జీవితం గడిపాడు. తన సన్యాసి జీవితంలో అధికభాగం శ్రావస్తి లో హాలహల అనే పేరు కల ఒక కుమ్మరి స్త్రీ కార్ఖానాలో తన శిష్యులతో బసచేసేవాడు.

    ఇతను శ్రావస్తి నగరంలో బుద్ధుడు నివసించే జేత వనానికి వెనుక నివసించేవాడు. గౌతమ బుద్ధుడే స్వయంగా, మఖలి గోశాల ని “ఇంద్రియ లోలుడని, మూర్ఖుడని, కేశకంబళి లాంటి వాడని అంటూ భిన్నసందర్భాలలో ప్రస్తావించటాన్ని బట్టి ఇతను బౌద్ధ మతానికి జైన మతం కన్నా బలమైన పోటీగా నిలిచాడని అర్ధం చేసుకొనవచ్చు.

    ఒకనాడు జైన మహావీరుడు మఖల గోశాల ఎదురెదురు పడి, ఒకరినొకరు శపించుకొన్నారు. మహావీరుడు ఆరునెలల్లోగా మరణిస్తాడని గోశాల శపించగా, మంఖలి గోశాల 7 రోజుల లోగా మరణిస్తాడని జైన మహావీరుడు శపించాడట. దాని ఫలితంగా గోశాలకు మతిస్థిమితం తప్పి ఉన్మత్తంగా ప్రవర్తించసాగాడట. ( టైఫాయిడ్ లాంటి విషజ్వరం వల్ల చనిపోయాడని మరో కథనం)

    తనకు అంత్య సమయం సమీపించిందని గ్రహించిన మఖలి గోశాల తన శిష్యులను రెండు కోర్కెలు కోరాడు. ఒకటి తన అంతిమ సంస్కారం అంగరంగవైభవంగా జరగాలని, రెండు “తాను నిజమైన సన్యాసిని కానని, తానొక దొంగనని, మోసగాడినని, నిజమైన జినుడు మహావీరుడని- అతనిని వ్యతిరేకించినందుకు తన శవం కాలికి తాడు కట్టి, ఈ విషయం చాటుతూ శ్రవస్తి అంతా ఊరేగించమని” కోరాడు. గోశాల మరణించాక అతని శిష్యులు రెండో కోర్కెను తీర్చటం ఇష్టం లేక- గృహంలోనే నేలపై శ్రవస్తి నగర పటం గీచి అక్కడే గోశాల శవాన్ని అటూ ఇటూ తిప్పి, అంగరంగవైభవంగా అంతిమ సంస్కారాలు జరిపించారట.

    పై కథనాలను ద్వారా అప్పట్లో మఖలి గోశాల పట్ల ఏమేరకు ఈర్ష అసూయలు ప్రత్యర్ధి మతాలైన బౌద్ధ జైనాలలో ఉండేవో అర్ధం చేసుకొనవచ్చు.బుద్ధుని నిర్యాణం క్రీపూ 483 అనుకొంటే గోశాల క్రీపూ 484 లో మరణించి ఉండవచ్చని, అదే విధంగా మహావీరుడు క్రీపూ468 గా చరిత్రకారులు గుర్తించారు

ఆజీవకునిగా సన్యసించే ప్రక్రియ

    ఆజీవక సన్యాసి జీవితంలోకి ప్రవేశించటం చాలా కష్టతరమైన ప్రక్రియ. జంబుక అనే ఒక వ్యక్తి ఆజీవక దీక్ష పొందిన విధానం బుద్ధఘోషుడు ఇలా వర్ణించాడు.

    "జంబుకని ఒక గోతిలో మెడవరకూ పాతిపెట్టారు. తలపట్టే రంద్రము కలిగిన ఒక చెక్కను అతని భుజాలపై నిలిపి దానిపై ఆజీవిక సన్యాసులు కొందరు కూర్చుని అతని తలపై వెంట్రుకలను కుదుళ్ళతో సహా పెరకి ముండనము గావించారు."

    ఇదే ఆచారం జైనులకు కూడా ఉంది. (అలా కుదుళ్ళతో సహా పెరికిన వెంట్రుకలు సరిగ్గ ఎదగవు. జైన విగ్రహాల తలలపై శిరోజాలు రింగులు తిరిగి ఉండటానికి ఇదే కారణం).

ఆజీవిక సంఘంలోకి స్త్రీలకు కూడా ప్రవేశం కలదు.

దిగంబర జీవనం

వివిధ పాళి రచనల ద్వారా ఆజీవికులు దిగంబరంగా జీవించేవారని తెలుస్తుంది. బుద్ధుని పరినిర్వాణ ఘట్ట శిల్పాలలో మహాకశ్యపుని తో మాట్లాడుతున్నట్లు కనిపించే నగ్న సన్యాసిని ఆజీవకునిగా గుర్తించారు. ఆజీవికులు పూర్తి నగ్నంగా ఉంటారని కనీసం కౌపీనం కూడా ధరించరని బుద్ధుని దివ్యావదాన కథల (Divyavadana narratives) ద్వార విదితమౌతుంది.

వీరు చేతిలో ఒక దండాన్ని ధరించి సంచరించేవారు కనుక వీరిని “ఏకదండి” లు అని పిలిచేవారు.

ఆజీవిక సన్యాసి జీవితం

    ఆజీవిక సన్యాసి జీవితం చాలా కఠినంగా ఉండేది. లోమహంస జాతక (Lomahamsa Jataka) లో ఒక ఆజీవకుని జీవన విధానం ఇలా వర్ణించబడింది.

    “ఆజీవికులు నగ్నంగా, ఒంటరిగా సంచరిస్తూ, మనుషులను చూడగానే భీతహరణిలా భయపడెదరు. దట్టమైన అడవుల్లో నివసిస్తారు. చలి, మంచు వానలు, ఎండలను ఓర్చుకొంటూ తమ కఠోర తపస్సు కొనసాగిస్తారు”.

    ఆజీవకులు -నేలపైకూర్చుని; గబ్బిలంలా వేలాడుతూ; ముళ్లపై పడుకొని; పంచాగ్నులను (కామాగ్ని, బడబాగ్ని, ఉదరాగ్ని, మందాగ్ని, శోకాగ్ని) జయించి తపస్సు చేస్తారని నంగుత్త జాతక (Nanguttha jataka) లో ఉంది.

    భిక్షను స్వీకరించటంలో పాటించే నియమాల ఆధారంగా ఆజీవిక భిక్షుకులు వివిధ రకాలు-దుఘరంతరియాలు వీరు వీధిలో ప్రతి మూడవ ఇంటినుంచి మాత్రమే భిక్షను అంగీకరిస్తారు. అలాగే తిఘరంతరీయాలు నాలుగవ ఇంటినుంచి, సత్తఘరంతరీయాలు ఎనిమిదవ ఇంటినుంచి, ఉప్పల బెంతియాలు తామర ఆకులలో మాత్రమే భిక్షను స్వీకరిస్తారు. విజ్జుఅంతరియా భిక్షకులు పగలు భిక్ష కోరరు.

    ఆజీవిక సంఘ సభ్యులు (Ajiviya-sangha) నియమిత ప్రదేశాలలో గుమిగూడి ఆథ్యాత్మిక చింతనలు చేసేవారు. అట్టి ప్రదేశాలను “ఆజీవిక సభ” (Ajiviya sabha) అని పిలిచేవారు. మఖలి గోశాల హాలహల అనే పేరు కల ఒక కుమ్మరి స్త్రీ కార్ఖానాలో తన శిష్యులతో బసచేసేవాడు. ఇది బహుశా ఊరిచివర విశాలంగా తపస్సు చేసుకోవటానికి అనుకూలంగా ఉండే ప్రదేశం కావొచ్చును.

    సంగీత వాయిద్యాలతో భక్తి పాటలు పాడుతూ, తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఆథ్యాత్మిక సభలను జరుపుకొవటం ఆజీవకులు ప్రారంభించిన ఒక ఆథ్యాత్మిక సంప్రదాయంగా చెబుతారు. వీరు మృత్యువుని చివరి గానం, చివరి నృత్యంగా అభివర్ణించారు. (carime geye and carime natte)

బుద్ధభగవానుడు ఒకరోజు తనశిష్యులలో ఒకరిని- ఆజీవకులు ఎలా జీవిస్తారని అడిగాడు. దానికి అతను ఇలా బదులిచ్చాడు

"ఆ దిగంబరులా? (acelakas), వారు ఎవరి మాట వినరు. ఎవరైనా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే పోరు. వారికొరకు ఎవరైనా ఆహారం వండితెస్తే స్వీకరించరు. సహపంక్తి భోజనాన్ని అంగీకరించరు. గర్భిణులనుంచి, బాలింతలనుంచి, అప్పుడే శృంగారము జరిపినటువంటి స్త్రీలనుంచి వారు భిక్ష స్వీకరించరు. ఈగలు వాలుతున్న ఆహారాన్ని , కుక్క ఆశగాచూస్తున్న ఆహారాన్ని వారు తీసుకోరు. చేపలను, మద్యమాంసాదులను స్వీకరించరు”

అశోకుని కాలంలో ఆజీవిక మతారాధన

    మఖల గోశాల నిర్యాణ అనంతరం ఆజీవిక మతం శ్రావస్తి నుంచి చాలా వేగంగా దేశంలోని ఇతరప్రాంతాలకు విస్తరించింది. క్రీపూ. నాలుగో శతాబ్దానికి చెందిన పాదుకాభయ అనే శ్రీలంక రాజు అనురాధపురలో ఆజీవకులు నివసించటానికి ఒక గృహాన్ని నిర్మించాడు. (Ajivikanam geham).

    అశోకుని తండ్రి బిందుసారుడు ఆజీవిక మతాన్ని అవలంబించాడు. ఇతని కొలువులో జనసాన పేరుగల ఒక ఆజీవిక జ్యోతిష్కుడు ఉండేవాడు ఇతను అశోకుడు రాజు అవుతాడని భవిష్యత్తు చెప్పాడని ఒక కథ కలదు. నిజానికి అశోకునికి రాజయ్యే అవకాశం లేదు. అశోకుని సోదరుడైన సుషిమ ను రాజుగా బిందుసారుడు ప్రకటించగా, అశోకుడు తన 99 మంది సోదరులను వధించి తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. ఈ మొత్తం ఉదంతంలో అశోకుడు రాజు అవుతాడని ముందే జోశ్యం చెప్పిన ఆజీవిక సన్యాసి చరిత్రలో నిలిచిపోయాడు.

    అశోకుడు కూడా తండ్రివలే ఆజీవక మతాన్ని సమాదరించాడు. అశోకుని స్తూప శాసనాలలో ఏడవ దాంట్లో -బౌద్ధ, బ్రాహ్మన ఆజీవిక, జైన ఇంకా వివిధ ఇతర సంప్రదాయాల పట్ల తాను సమాదరణ కలిగి ఉన్నానని పేర్కొన్నాడు. ఆ వరుసక్రమంలో ఆజీవిక మతాన్ని ఇతర సంప్రదాయాలలో కలిపేయకుండా జైన, బ్రాహ్మన బౌద్ధాలతో సమానస్థాయిలో చెప్పటాన్ని బట్టి అప్పటికి ఆజీవిక మతం ప్రముఖమైన మతంగా ఉండేదని ఊహించుకోవచ్చును.

    బీహార్ లో ఉన్న బరాబర్ గుహలు రాతిని తొలిచి నిర్మించిన అత్యంత ప్రాచీన గుహలు. ఇవి మొత్తం 7 గుహలు. వీటిలో మూడింటిని అశోకుడు తన 12 వ పాలనా సంవత్సరంలో ఆజీవకులకు దానంగా ఇచ్చాడు. అప్పటికి అశోకుడు ఇంకా బౌద్ధాన్ని స్వీకరించలేదు. మిగిలిన నాలుగింటిని అశోకుని మనుమడు దశరథుడు ఆజీవికులకొరకు నిర్మింపచేసినట్లు శాసనాలు కలవు.

    బౌద్ధ మతాన్ని స్వీకరించాక, అశోకుడు – గౌతమబుద్ధుడిని అవహేళనచేస్తూన్న రాజ్యంలోని ఆజీవకులను నిర్మూలించమని ఆదేశాలు ఇచ్చాడట. ఆ విధంగా 18000 ఆజీవిక మతస్థులు వధింపబడినట్లు, అనేక ఆజీవిక శిల్పాలను నాశనం చేయించినట్లు అశోకవదనుడు పేర్కొన్నాడు.

    కాలక్రమేణా ఈ గుహల నుంచి ఆజీవికులను బయటకు పంపి, బౌద్ధులు, హిందువులు ఆక్రమించుకొన్నట్లు, ఆజీవికుల పేరుతో ఉన్న శాసనాలను చెరిపివేయటానికి ప్రయత్నించినట్లు ఆర్కియాలజి శోధనల ద్వారా తెలుస్తున్నది (ఈ బరాబర్ గుహ గోడలు అద్దం వలె ప్రతిబింబాన్ని చూపగలిగేంత నునుపైన పాలిష్ తో ఉండటం నేటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తుంది)

సంస్కృత రచనలలో ఆజీవకుల ప్రస్తావన

    బౌద్ధం పాలి భాషను ఆదరించినట్లుగా హిందూమతం సంస్కృతాన్ని ప్రోత్సహించింది. హిందూమతం ప్రారంభంలో దుష్టశిక్షణ పేరుతో హింసాత్మక అవతారాలతో చాలా అగ్రెసివ్ గా విస్తరిస్తూ వచ్చింది. దీనికి ఆజీవిక, బౌద్ధ, జైన మతాలు సహజంగానే ప్రతిపక్షంగా కనిపించకమానవు. ఆమేరకు దుష్ట శిక్షణ జరిగి ఉంటుందనటానికి పెద్దగా సందేహ పడక్కరలేదు. అందుకనే బౌద్ధ, జైన రాతలలో విస్తారంగా ప్రస్తావించబడిన ఆజీవిక మతం సంస్కృత రచనల్లో అసలు కనిపించదు. ఉన్న ఒకటి రెండు ప్రస్తావనలు కూడా ఆజీవికుల్ని తక్కువ చేస్తూ కనిపిస్తాయి.

    ఎవరైనా గృహస్తు తల్లిదండ్రులకు పిండప్రధానం చేసేటపుడు ఆజీవకులకు కానీ శాక్యులకు కానీ అన్నదానం చేసినట్లయితే అతనికి వంద పణాల అపరాధం విధించాలి అని క్రీపూ మూడో శతాబ్దానికి చెందిన కౌటుల్యుని అర్ధ శాస్త్రంలో ఉంది. (3.20.16).

    ఆజీవికులు అహింసమార్గాన్ని అనుసరిస్తూ శాఖాహార జీవనాన్ని గడుపుతారని జైన, బౌద్ధ రచనలలో ఉండగా వాయుపురాణంలో ఆజీవకులు మతపరమైన క్రతువులలో మద్యమాంసాలు స్వీకరిస్తారని ఉంది. ఇదే వాయుపురాణం- ఆజీవకులు రాత్రివేళల పాడుబడిన భవనాలలో, రహదారులపైనా అనుమానాస్పదంగా పిశాచుల్లా తిరుగుతూంటారని, వీరు వర్ణ, ఆశ్రమ ధర్మాలను సంకరం చేస్తుంటారని చెప్పింది.

    ఆరో శతాబ్దానికి చెందిన కుమారదాస అనే సంస్కృత కవి (శ్రీలంక రాజు) రచించిన జానకి హరణ అనే కావ్యంలో రావణాసురుడు సీతను ఎత్తుకొనిపోవటానికి ఆజీవక సన్యాసి వేషంలో వచ్చినట్లు వర్ణించాడు.

    ఆజీవక మతం ఉఛ్ఛ స్థితిలో ఉన్నకాలంలోనే మహాభారతం వ్రాయబడింది. అయినప్పటికీ ఎక్కడా ఆజీవక మత ప్రస్తావన కనిపించదు. కానీ “ఎక్కడైనా, ఎప్పుడైనా మానవప్రయత్నము ఫలించినట్లు కనిపించినా నిజానికి అది విధి తప్ప అన్యము కాదు” అనే ఆజీవక తత్వవాక్యం శాంతి పర్వంలో మంకి అనే పాత్ర ద్వారా చెప్పించటం గమనించవచ్చు. ఈ మంకి అన్న పాత్రపేరు కూడా ఆజీవిక తీర్థంకరుడైన మఖలి పేరుకి దగ్గరగా ఉండటం కూడా గమనార్హం. ఆజీవక మతాన్ని విస్మరించినా, దానిద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోయిన తత్వాలను మాత్రం విస్మరింపవీలుకాని పరిస్థితి ఉందని అర్ధం చేసుకోవచ్చు.

    పన్నెండో శతాబ్దానికి చెందిన జైన పండితుడు నేమిచంద్ర సన్యాసులను ఐదు రకాలుగా వర్గీకరించాడు. ఎ. నిర్గ్రంధులు/జైనులు బి. శాక్యులు/బౌద్ధులు సి. తపస్విలు/బ్రాహ్మన మునులు డి. గురు/త్రిదండులు ఇ. ఆజీవికులు

    పై విభజనద్వారా మఖలి గోశాల అనుచరులు పన్నెండోశతాబ్దం వరకూ ఉత్తర భారతదేశంలో ఆజీవక సంప్రదాయాన్ని ఒక ప్రధాన సంప్రదాయ స్రవంతిలా కాపాడుకొంటూ వచ్చారని అర్ధమౌతుంది.

    జైనమతంలో దిగంబర జైనం ఒక శాఖ. కొంతమంది చరిత్ర కారులు ఆజీవిక మతస్థులు దిగంబరంగా ఉంటారు కనుక వీరు దిగంబరజైనులు ఒకటే అని ఒక ప్రతిపాదన చేసారు. పైన చెప్పిన నేమిచంద్ర దిగంబర శాఖకు చెందిన జైనుడు. అతను చేసిన ఈ వర్గీకరణలో జైనులను ఆజీవికులను విడివిడిగా చూపటాన్ని బట్టి జైనులు ఆజీవికులు ఒకటి కాదు అని నిర్ధారించవచ్చును. కానీ కాలక్రమేణా ఆజీవికులు దిగంబరజైన శాఖలో కలిసిపోయి ఉండవచ్చునని ప్రముఖ ఇండాలజిస్ట్ Johannes Bronkhorst ప్రతిపాదించాడు.

    పదిహేనోశతాబ్దానికి చెందిన జ్యోతిష్యాస్త్ర పండితుడైన వైద్యనాథ దీక్షితులు రచించిన జాతక పారిజాత మనే గ్రంధంలో బుధుడు ఉచ్ఛదశలో ఉండగా పుట్టినవారు ఆజీవికులుగా మారతారని చెప్పాడు. చారిత్రికంగా ఇదే ఆజీవికుల చివరి ప్రస్తావన.

తమిళనాట ఆజీవిక మతం

తమిళనాట ఆజీవిక మతం ప్రబలంగా ఉండేదని మనిమేఖలై, శిలప్పదికారం లాంటి కావ్యాలు, క్రీస్తుశకం అయిదో శతాబ్దం నుండి పదిహేను శతాబ్దం మధ్య వేయించిన అనేక శాసనాల ద్వారా తెలుస్తుంది.

దక్షిణభారతదేశంలో ఆజీవికుల ప్రస్తావనలు కలిగిన కొన్ని శాసనాలు ఇవి

క్రీశ 446 లో పల్లవరాజైన సింహవర్మన్ విలవట్టి అనే గ్రామాన్ని విష్ణుశర్మ అనే బ్రాహ్మణునికి దానంగా ఇచ్చాడు. ఆ గ్రామం నెల్లూరు జిల్లాలోని విడవలూరు గా గుర్తించారు. ఈ దాన శాసనంలో - ఇనుము, తోలు, బట్టలు, తాళ్ళ అమ్మకాలపై వచ్చే పన్నులతో పాటుగా ఆజీవికుల నుండి వచ్చే పన్నులు అంటూ ప్రత్యేకంగా ఆజీవికులను పేర్కొనటం జరిగింది. (Epi. Ind. xxiv, pp. 296-308) అప్పట్లో ఒక గ్రామంలో ఆజీవిక మతాన్ని అవలంబించినందుకు పన్ను ఉండేదని అనుకోవాలి.

తూర్పు చాళుక్య రెండవ అమ్మరాజు (క్రీశ 945-970) విజయవటి లోని ఒక ఆలయానికి దానంగా ఇచ్చిన గుంటూరులోని నాలుగు గ్రామాలలో ఒక గ్రామం పేరు ఆజీవులపర్రు. ఇది ఆజీవులకొరకు ఏర్పరచిన గ్రామం అయి ఉండవచ్చు. (Epi. Ind. xxiii, pp. 161-170.)

క్రీశ. 1072 లో రాజేంద్రచోళుడు మైసూర్ కోలార్ జిల్లాలో ఒక ఆలయంలో వేయించిన ఒక శాసనంలో ఆ ప్రాంత ఆజీవిక ప్రజలు ఒక కాసు పన్ను కట్టాలని, అలా కట్టలేకపోతే మరొక కాసు అపరాధంగా చెల్లించాలని పేర్కొన్నాడు. (Epi. Carn. vol. X Mulbagal 49)

విరించిపురం పెరుమాళ్ ఆలయంలో మూడవ రాజేంద్రుడు (1233-34) వేయించిన శాసనంలో ఆజీవుకుల పన్ను ప్రస్తావన కలదు. (SII.I, no. 59)

దక్షిణభారతదేశంలో లభించిన శాసనాల ఆధారంగా ఆజీవుకులు గుంటూరు నెల్లూరు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి ఉన్నారని అర్ధమౌతుంది. ఈ అన్ని శాసనాలలో ఉన్న Acuvakkatamai అనే పదాన్ని Dr. Hultzch ఆజీవికుల పన్ను గా తప్పుగా అనువదించాడని, భిక్షమెత్తుకొంటూ జీవనం సాగించే ఆజీవిక సన్యాసులు పన్నులు ఎలా కడతారని- బహుశా అప్పట్లో ఆజీవికులు కుమ్మరి వృత్తి నెరపి ఉండవచ్చు, ఆమేరకు వారిపై వృత్తి పన్ను వేసి ఉండవచ్చు అని ఎ. చక్రవర్తి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు.

సామాన్య ప్రజలపై ఇల్లు ఒక్కింటికి పన్ను పావు కాసు కాగా ఆజీవికుల తల ఒక్కింటికి వేసిన పన్ను ఒక కాసు (28 గింజలు=1.6 grams). అంటే హిందూ మతానికి చెందిన వ్యక్తి కంటే ఆజీవిక మతాన్ని పాటించే వ్యక్తి ఇరవై నుంచి ముప్పై రెట్లు ఎక్కువ మొత్తంలో పన్ను కట్టవలసి రావటం గమనార్హం. ఇది ఒకరకంగా ఒకనాటి మతపరమైన వివక్ష. ((History and Doctrines of the Ajivikas A.L. Basham pn195)

క్రీశ. రెండో శతాబ్దపు తమిళ మహాకావ్యం శిలప్పదికారం లో మధురై లో ఆజీవిక సన్యాసులు చేస్తున్న కఠోరమైన తపస్సులు గురించిన వర్ణనలు కలవు.

ఇదే కాలంలో రచించిన మణిమేఖలై కావ్యంలో కథానాయిక ఆథ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని వివిధ ఆత్మాత్మిక గురువులను కలిసి వారి బోధనలను విని చివరకు బౌద్ధ సన్యాసినిగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఆజీవిక సిద్ధాంతాలను కూడా కథానాయిక తెలుసుకొని, ఆ గురువుతో వివిధ అంశాలు చర్చించినట్లు ఈ రచన ద్వారా తెలుస్తుంది.

ఆజీవిక మత బోధనలు

ఆజీవిక మతానికి సంబంధించిన బోధనలు నేడు అలభ్యం. బౌద్ధ జైన రచనలలోని పరోక్ష ఆధారాలే నేడు లభిస్తున్నాయి. దక్షిణభారత ఆజీవికుల బోధనలు మణిమేఖలై లాంటి కావ్యాల ద్వారా తెలుస్తున్నాయి. . ఆజీవిక మతానికి శ్రామిక, వ్యాపార వర్గాలనుంచి ఆదరణ వచ్చింది. మఖలి గోశాల తరువాత శ్రేణిలో అనేకమంది బహుజనులు ఆజీవిక మతాన్ని నడిపించారు. వీరిలో రధకారుడైన పాండుపుత్ర; గోశాలకు 16 ఏండ్లపాటు ఆశ్రయం ఇచ్చిన హలాహల కుంభకార స్త్రీ; అత్యంత ధనకారుడైన సద్దాలపుత్ర అనే కుంభకారుడు లాంటివారు ముఖ్యులు.

మఖలి గోశాల బోధనలు ఇలా ఉన్నాయి.

  • ఆజీవిక మతం నియతి వాదాన్ని ప్రతిపాదిస్తుంది. నియతి వాదం అంటే “అన్నిటికి విధే కారణమని నమ్మటం” మనిషి పుట్టినప్పుడే అతని విధి నిర్ణయించబడి ఉంటుందని; ఈ విధిని/నియతిని ఎవరూ తప్పించలేరని; మనిషి తాను ప్రయత్నించానని అనుకొంటాడు కానీ ఫలితం ముందే నిర్ణయమైపోయి ఉంటుందని నియతి వాదం బోధిస్తుంది.
  • నియతి వాదం హిందూ, బౌద్ధ, జైన మతాలలో కనిపించదు. ఇవి కర్మభావనను నమ్ముతాయి. మనిషి చేసిన కర్మల వలన అతని జీవనం నిర్ణయమౌతుందని విశ్వసిస్తాయి. నియతివాదం కర్మలకు ప్రాధాన్యత ఇవ్వదు. కర్మను ఆజీవికులు తిరస్కరించారు. మనిషి జీవితం కొండపైనుండి క్రిందకు విడిచిన ఒక దారపు బండి వంటిదని, దారం అయ్యేవరకూ అది ఎలాగైతే పగ్గాల్లేకుండా పరుగులు తీస్తుందో మనిషి జీవితం కూడా పుట్టుక చావుల మధ్య అతని ప్రమేయం లేకుండానే పరుగులు తీస్తుందని ఉదహరిస్తారు ఆజీవికులు.
  • లాభ నష్టాలు, సుఖదుఃఖాలు, జీవన్మరణాలు అనే ఆరు ముఖ్యమైన కారకాలు ప్రతిమనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
  • పునర్జన్మ ఉంది. మరణించే సమయాన పుణ్య భద్ర, మణి భద్ర పేర్లు గల యక్షులు వచ్చి మనుషులను పరీక్షిస్తారు. ఆ పరీక్షలో నెగ్గితే ఆ వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. ఓడిపోతే తిరిగి మరలా జన్మించాలి.
  • మనుషులు వారి ప్రమేయం లేకుండా పాపాత్ములు అయినట్లుగానే పుణ్యాత్ములు కూడా అవుతారు. పుణ్యం సంపాదించటం కొరకు వారు కాని, వారితరపున ఎవరైనా కానీ ఏ రకమైన పాపవిమోచన క్రతువులు చెయ్యక్కరలేదు.
  •  అప్పటికే నిర్ణయించబడి ఉన్న సుఖదుఃఖాలు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా తగ్గవు, పెరగవు.
  • నియతి వాదం విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహిస్తుంది అనే విమర్శకు- కఠోరమైన తపస్సు ద్వారా విచ్చలవిడితనాన్ని అరికట్టాలి అని సమాధానం చెప్పారు ఆజీవికులు.
  • ఈ భూమిపై మొత్తం 1,406,600 వివిధ జాతుల జీవులు జీవిస్తున్నాయని ఆజీవిక మత విశ్వాసం. పదార్ధములు అణువులతో నిర్మితమై ఉంటుందని వీరు ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని ఆ తరువాతి వైశేషిక సిద్ధాంతులు స్వీకరించారు.

ముగింపు

    క్రీ.పూ నాలుగో శతాబ్దానికి చెందిన మెగస్తనిస్ భారతదేశంలోని పండితులు బ్రాహ్మణులు, శ్రమణులు ( బౌద్ధులు, జైనులు, ఆజీవకులు, నాస్తికులు, లోకాయతులు, చార్వాకులు అంటూ శ్రమణులు వివిధ రకాలు) అనే రెండువర్గాలుగా ఉన్నారని చెప్పాడు.

    క్రీపూ. రెండో శతాబ్దానికి చెందిన సంస్కృత వ్యాకరణ వేత్త పతంజలి అతని మహాభాష్య అనే గ్రంధంలో – బ్రాహ్మణులు శ్రమణులు, పాము ముంగిసల్లా ఆగర్భ శత్రువులని అన్నాడు.

    బృహదారణ్య పురాణంలో ఈ శ్రమణకులను దొంగలుగా, గర్భవిచ్ఛిత్తి చేసే వైద్యులుగా, చండాలురుగా, పుళిందులుగా వర్ణించబడ్డారు. (The hindus an alternate history, Wendy doniger p.no 226).

    ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు ప్రవేశపెట్టినట్లు చెప్పే, పంచాయతన పూజావిధానం ద్వారా వివిధ ఆరాధనాపద్దతులు ఏకం అవ్వటంతో బలమైన హిందుమత భావన కలిగింది. శంకరాచార్యుడు అఖండ భారతావని అంతా తిరిగి హిందుధర్మాన్ని ప్రచారం చేసి, అనేకచోట్ల పండిత చర్చలు జరిపి ఆలయాలు స్థాపించి-హిందూమతానికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని తీసుకొచ్చాడు.

        ఈ వెల్లువలో అనేక ప్రాచీన సంప్రదాయాలు కొన్ని హిందూమతంలో కలిసిపోయాయి, మరికొన్ని కనుమరుగు అయ్యాయి. దాని ప్రభావం ఏ మేరకు అంటే- వైదిక క్రతువులకు వ్యతిరేకంగా పుట్టిన జైన, బౌద్ధ మతాలను కూడా హిందూ మతంలో అంతర్భాగంగా చూసేటంతగా మిగిలిన ఆరాధనవిధానాలు తమ అస్థిత్వాలను కోల్పోయాయి. ఆజీవిక, చార్వాక, కాలముఖ లాంటి శాఖలు మొత్తానికి అంతర్ధానమైపోయాయి.

***

        బుద్ధుని సమకాలీనులలో, అజితకేశ కంబల్, పూరణ కశ్యప, పకుధకచ్ఛాయన్, మంఖలి గోశాల సంజయబేలత్తిపుత్త, నిగంఠనాతపుత్త అనే ఆరుగురు సన్యాసులు ఆధ్యాత్మిక వ్యవహారాలలో జటాసత్తు అనే రాజుకు సలహాలు ఇచ్చేవారని పాళి రచనల ద్వారా తెలుస్తున్నది. వీరిలో మఖలి గోశాల (Makkhali Gosaala) ఆజీవిక మతానికి 24 వ తీర్థంకరుడు. ఇతనికి పూర్వం ఆజీవిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిలో నంద వచ్చ, కిస సంగిచ్చ లు ముఖ్యులు.

         ఉత్తరభారతదేశంలో ఆజీవిక సంప్రదాయం క్రమక్రమంగా క్షీణిస్తూ రాగా దక్షిణభారతదేశంలో కొంతకాలం కొనసాగింది.

        ఈ ఆజీవిక సంప్రదాయం ఆంధ్రదేశంలో గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఒకప్పుడు ఉన్నట్లు శాసనాధారాలు కలవు. ప్రముఖ తమిళ చరిత్రకారుడు శ్రీ కె. నెడుంజెళియన్ “ఆసీవగం అయ్యర్” (ఆజీవక స్వామి) అనే పేరుతోవ్రాసిన అయిదువందల పేజీల పుస్తకంలో ఆజీవిక మతస్థాపకుడైన మఖలిగోశాలర్ తమిళుడని, అతను తమిళనాటే నిర్యాణం చెందాడని ప్రతిపాదించాడు.

    దక్షిణభారతదేశంలో ఆజీవిక, జైన సంప్రదాయాలు పక్కపక్కనే నడుస్తూ రావటం వల్ల ఆజీవికులు క్రమక్రమంగా జైన మతంలో కలిసిపోయారు.

సంప్రదించిన పుస్తకాలు

1. History and Doctrines of The Ajivikas by A.L. Basham
2. The Ajivikas by B.M. Barua
3. The Riddle of the Jainas and Ajivikas in early Buddhist Literature by Johannes Bronkhorst
4. Ajivika by Jarl Charpentier
5. Ashoka in Ancient India bynayanjot lahiri
6. Hindus an Alternate History by Wendy Doniger