Showing posts with label పాబ్లో కవిత్వం. Show all posts
Showing posts with label పాబ్లో కవిత్వం. Show all posts
Sunday, April 5, 2009
పాబ్లో నెరుడా "ONLY DEATH" తెలుగులో......
పాబ్లో నెరుడా (1904-1973) చిలీ దేశానికి చెందిన కవి. ఇరవయ్యవ శతాబ్ధపు సాహిత్యాన్ని ప్రకాశింపచేసిన ప్రముఖ కవిగా నెరుడా సుప్రసిద్దుడు. ఈతని సాహిత్యకృషికి, 1971 లో నోబుల్ ప్రైజు ఇవ్వటం జరిగింది.
నెరుడా కవిత్వం అద్బుతమైన మిస్టిక్ నెస్ తో గొప్ప ప్రతీకలతో నిండిఉంటుంది. కొన్ని కవితలు అధివాస్తవిక ధోరణులతో ఉంటాయి. ఇతడు సమకాలీనులచే ఇరవయ్యవశతాబ్ధపు ఉత్తమ కవిగా" కీర్తింపబడ్డాడు. నెరుడా వ్యక్తిగతంగా చిలియన్ కమ్యూనిష్టు పార్టీ తరపున పని చేసాడు. రాజకీయకారణాల వల్ల కొంతకాలం అజ్ఞాతంగా కూడా జీవించవలసివస్తుంది. ఈతని కవిత్వంలో కమ్యూనిష్టు పోకడలు పెద్దగా ఉండవు. నెరుడా కవిత్వంలో కరుణ, మానవత్వం తొంగిచూస్తుంటాయి. తన మెటఫర్ల్ లతో నెరుడా చదువరిని మరోలోకంలోకి తీసుకుపోతాడు. అతని పద్యం ఒక కలలా పాఠకుని వెంటాడేలా చేస్తాడు.
నెరుడా కవిత్వం అనేక ప్రపంచభాషలలోకి అనువదింపబడింది.
నెరుడా వ్రాసిన Only Death అనే పద్యానికి నేచేసిన అనువాదం ఇది.
మృత్యువు మాత్రమే
మూగ ఎముకలు నిండిన గోరీలతో
ఏకాకి స్మశానాలవిగో.
సొరంగం గుండా హృదయ యానం
నీడలు.... నీడలు.... నీడలు.
మనలోకే కూలిపోయే ఓడలా
మనం చనిపోతూంటాం.
హృదయంలోకే మునిగిపోయినట్లుగా
చర్మంనుండి ఆత్మదాకా
అనంతంగా జారిపోయినట్లుగా
మనం చనిపోతూంటాం.
గవ్వలు పేరుకొన్న శిలలపాదాలవిగో
అక్కడంతా మృతదేహాలు.
స్వచ్చమైన శబ్ధంలా ఎముకలలో మృత్యువుంది.
ఏ కుక్కా లేకుండా వినిపించే మొరుగులా
గంటలనుంచో, గోరీలనుంచో జనిస్తో, తేమలో ఉబ్బుతో
ఒక ఏడ్పులానో లేక వానలానో మృత్యువు శబ్దిస్తోంది.
ఒంటరిగా ఒక్కోసారి నేను చూస్తుంటాను
తెరచాప నీడలో శవపేటికల్ని.
మృతుల, మృత జడల జవ్వనుల
తెల్లని దేవదూతల్లాంటి వంటవాళ్ల,
గుమస్తాలను పెండ్లాడిన శోక యవ్వనిల
లంగరు బరువును మోస్తోన్న
శవపేటికలను చూస్తూంటాను.
నిలువెత్తు మృత్యునదిలో
ఎర్రగా ఒరిసిపోయిన ఆ నదిలో
ప్రవాహానికి ఎదురొడ్డుతూ
మృత్యు సంగీతపు అలలతో శ్రుతి కలుపుతూ
మృత్యు మౌన కెరటాల సవ్వడితో జతకలుపుతూ
శవపేటికలు ఎగప్రాకటం
ఒక్కోసారి నేను గమనిస్తూంటాను.
మృత్యువు కనిపించదు, దాని శబ్ధమే నడిపిస్తూంటుంది.
పాదం కనిపించని బూటులా, దేహం అగుపించని సూటులా.
రాతితో కానీ, చేతితో కానీ చేయబడని
గణగణ మనే ఘంటారావం లా మృత్యువు వినిపిస్తుంది.
మృత్యువుకు నోరు లేదు, నాలుక లేదు, గొంతుకా లేదూ,
కానీ, మృత్యు పిలుపు వినిపిస్తూంటుంది.
సందేహం లేదు, నీవు మృత్యు పదఘట్టనలని
దాని దుస్తుల రెపరెపల్నీ, ఒక వృక్షంలా మౌనంగా వినగలవు.
మృత్యువు మాయా తివాచీపై కూర్చొని
నేలను నాకుతూ, మృతులకై వెతుకుతూ
భూమిని చుడుతూ ఉంటుంది.
మాయా తివాచీయే మృత్యువు.
దాని మృత్యు నాలిక మృతులను వెతుకుతూంటుంది.
తివాచీ నేసుకోవటానికి దారాలను వెతుక్కొంటూంది.
నాకు తెలియదు
నాకు కొంచెమే అర్ధమయింది
దృశ్యం అస్పష్టంగానే ఉంది, కానీ
మృత్యు గీతం అనేది తడిచిన నల్లకలువల వర్ణమని
నేను నమ్ముతున్నాను.
అవును
మట్టికి అలవాటు పడిన నల్లకలువ వర్ణమే!
ఎందుకంటే
మృత్యువు యొక్క ముఖం ఆకుపచ్చన.
ఎందుకంటే
నల్లకలువ దళపు పదునైన తడితోనూ
దాని గంభీరవర్ణపు శీతాకాల అసహనంతోనూ సారించే మృత్యువు యొక్క తీక్షణ చూపులు ఆకుపచ్చనే మరి.
మంచాలపై మృత్యువుంది
మెత్తని పరుపులపై, నల్లని దుప్పట్లలోనూ ఉంది.
దుస్తుల మడతలలో మృత్యువు విస్తరించి
అకస్మాత్తుగా పేలుతుంది.
దుప్పట్ల మధ్య నల్లటి శబ్ధం వ్యాపిస్తుంది.
మంచాలు ఓడరేవుకై ప్రయాణం సాగిస్తూంటాయి.
అక్కడ
యుద్దఓడల అధిపతి దుస్తులు ధరించిన
మృత్యువు ఎదురుచూస్తుంటుంది.
బొల్లోజు బాబా
ఆశక్తి ఉన్నట్లయితే అంతర్జాలంలో ఈ క్రింది లింకులలోని నెరుడా కవితల అనువాదాల్ని కూడా చదవండి బాగున్నాయి.
http://prajakala.org/mag/2008/02/pablo_neruda1
http://www.eemaata.com/em/issues/200209/595.html
http://www.pranahita.org/2007/08/nee_navvu/
Subscribe to:
Posts (Atom)
