పల్లవి పబ్లికేషన్స్ శ్రీ నారాయణ గారి ఫోన్ నంబరు: 9866115655 లో ప్రి-బుక్ చేసుకొనవచ్చును.
చక్కని కవర్ డిజైన్ ఇచ్చిన శ్రీ గిరిధర్ కు, అర్ధవంతమైన బ్లర్బ్ ఇచ్చిన శ్రీ ప్రభు కు ధన్యవాదములు.
దయచేసి ఆదరించండి
telugu kavithalu
యానాం అనేది 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాచే ఆవరింపబడిన ఒక చిన్న ప్రాంతం. ఇక్కడి ప్రజల మాతృభాష తెలుగు. వీరి సంస్కృతి సాంప్రదాయాల మూలాలు పొరుగునున్న తెలుగువారితో ముడిపడి ఉన్నాయి. అలాంటప్పుడు యానాం భారతావనిలో విలీనమైనపుడు సమీప ఆంధ్రా లో ఎందుకు కలిపేయలేదన్న ప్రశ్న సహజంగా ప్రతిఒక్కరికీ కలుగుతుంది.
1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడే సమయానికి యానాం ఫ్రెంచివారి పాలనలో ఉంది. ఆ తరువాత 1956 లో భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయానికి ఫ్రెంచి వారు ఇక్కడ నుంచి భౌతికంగా నిష్క్రమించినా, యానాంపై భారతదేశానికి చట్టపరమైన హక్కు ఇంకా రాలేదు. కనుక ఆ సమయాలలో యానాన్ని సమీప తూర్పుగోదావరిజిల్లాలో అంతర్భాగం చేయాలన్న ఆలోచనే ఎవరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికింకా యానాం అనేది ఫ్రాన్స్ అంతర్భాగం. భారతదేశంలో విలీనం కాలేదు. యానాం ఫ్రెంచిపాలననుంచి విమోచనం చెంది భారతావనిలో విలీనమైన తరువాత కూడా దీనిని సమీప ఆంధ్రప్రదేశ్ లో కలపకుండా ప్రత్యేకంగా ఉంచటానికి ప్రధాన కారణం ఫ్రెంచివారు వెళిపోయేముందు భారత ప్రభుత్వంతో చేసుకొన్న ఒక ఒప్పందం.
ట్రీటీ ఆఫ్ సెషన్
ఫ్రెంచివారు తమ కాలనీలైన యానాం, పాండిచేరీ, మాహె, కారైకాల్లను స్వతంత్య్ర భారతావనికి అప్పగించి వెళ్ళేప్పుడు, భారత ప్రభుత్వంతో 1956, మే 28 న ట్రీటీ ఆఫ్ సెషన్ (Traite de Cession) ను చేసుకొన్నారు.
ఈ ఒప్పందములో ఆర్టికల్ 2 ఇలా చెపుతుంది.
The Establishments will keep the benefit of the Special Administrative Status in force prior to 1 November 1954. Any consitutional changes in this Status which may be made subsequently shall be made after ascertaining the wishes of the people.
(సారాంశం: ఈ స్థావరాలన్నీ , 1 నవంబరు 1954 కు పూర్వము కలిగి ఉండినటువంటి ప్రత్యేక పరిపాలనా హోదా ను నిలుపుకుంటాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తెలుసుకొన్న తరువాతే రాజ్యాంగపరంగా ఈ హోదాను మార్చవలసి ఉంటుంది)
1954 కు పూర్వం ఈ ప్రాంతాలు స్వతంత్య్ర భారతావనిలో కలువకుండా ప్రత్యేకంగా ఫ్రెంచివారి పాలనలో ఉన్నాయి. భారత స్వాతంత్రానికి ముందుకూడా ఇవి బ్రిటిష్ వారి పాలనకు అతీతంగానే ఉన్నాయి. పై క్లాజులో ఆ ప్రత్యేకతను నిలబెట్టమని ఫ్రెంచిప్రభుత్వం కోరింది. అంటే ఈ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా హోదా కల్పించమని ఫ్రెంచివారు వెళ్ళిపోయేముందు అడిగిన చివరి కోరిక. ఈ హోదాను మార్చాలంటే ఈ ప్రాంతప్రజల అభిప్రాయాన్ని ఒక రిఫరెండం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా భారతప్రభుత్వం 1 జూలై, 1963 న జరిపిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచేరీగా ఏర్పరచింది. అలా వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరచి ప్రత్యేక హోదా కల్పించి ఫ్రెంచిప్రభుత్వానికి ఇచ్చిన మాటను భారతప్రభుత్వం నిలబెట్టుకొంది.
సమీపరాష్ట్రాలలో విలీనం చేయటానికి జరిగిన ప్రయత్నాలు
ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేయ్యాలని మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నపుడు ఒక ప్రయత్నం జరిగింది. అంటే యానాన్ని ఆంధ్రాలోను, పుదుచ్చేరీ, కారైకాల్ లను తమిళనాడులోను, మాహేను కేరళలోను విలీనం చేయటానికి. ఆ ప్రతిపాదనను ఈ ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో ప్రతిఘటించారు. మురార్జీదేశాయ్ కూడా 1954 నాటి ఒప్పందాన్ని చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని అంటారు. ఎందుకంటే ఈ ఒప్పందం లోని 30వ ఆర్టికిల్లో ` ఈ ఒప్పంద ఉల్లంఘనకు సంబంధించిన పిర్యాదుల పరిష్కారానికై అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించబడిరది.
1990 లో పాండిచేరికి కొత్తగా నియమించబడిన గవర్నరు శ్రీమతి చంద్రావతి పాండిచేరిలో ఇంకా బతికిఉన్న ఫ్రెంచి సంస్కృతి, ఫ్రెంచి నేషనల్స్ అందుకొంటున్న ఫ్రెంచి పించనులు, ఫ్రాన్స్ పర్యవేక్షించే విద్యా సంస్థలు ఉండటాన్ని చూసి, ‘‘పోర్చుగీస్, బ్రిటన్పాలిత ప్రాంతాలలో ఆయా వలసపాలకుల ఉనికి కనిపించదని పాండిచేరీకి ఇంతటి స్వేచ్ఛ, ప్రత్యేకతను కల్పించటం ద్వారా నెహ్రూ తప్పు చేసాడేమోనని’’ వ్యాఖ్యానించారు.
ఆ తరువాత ఫ్రెంచి అంబాసిడర్ ఆండ్రూ లెవిన్ ఈమెను కలసి, పాండిచేరీ చారిత్రిక ప్రాముఖ్యతను, ఫ్రాన్స్ ఈ ప్రాంతాలను భారత్కు అప్పగించేటపుడు ఇరుదేశాలు చేసుకొన్న ట్రీటీ ఆఫ్ సిషన్ ను వివరించినపుడు ఆమె విస్మయానికి గురయ్యారట. ఇదే విషయాన్ని భారత మినిస్ట్రీఆఫ్ ఫారిన్ అఫైర్స్ శాఖాధికారుల వద్ద లెవిన్ ప్రస్తావించినపుడు, ‘‘1956 నాటి ట్రీటీకి వ్యతిరేకంగా ఆలోచనచేసే ఉద్దేశం భారత్ కు లేదని, ఆమెకు చారిత్రిక అవగాహన లేకపోవటం వల్ల అలా వ్యాఖ్యానించి ఉంటారు’’ అని వారు వివరణ ఇచ్చారట. ఈ అంశంపై అవగాహన కలిగిన విద్యావేత్తలు, చరిత్రకారులు అనేక మంది శ్రీమతి చంద్రావతి వ్యాఖ్యలను ఖండిరచారు. వారిలో 1954 లో పాండిచేరీలో భారత కమిషనర్గా పనిచేసిన భారత అధికారి అయిన కేవల్ సింగ్ వ్రాసిన "Pondicherry and Goa - Historical Contrast --Times of India 12 April, 1990” అనే వ్యాసం ప్రముఖమైనది. (DES ANCIENS COMPTOIRS DE L'INDE?/ Future of French India veterans? by Andrew Lewin published in CIDIF letters Nov 2010)
యానాన్ని ఆంధ్రలో కలపకుండా ప్రత్యేకంగా ఉంచటానికి మరొక ప్రధాన కారణం ఆనాటి స్థానిక నాయకుల దార్శనికత.
భారతావని నుంచి బ్రిటిష్ వారు వైదొలగిన తరువాత అందరి కళ్ళు ఫ్రెంచి వారిమీద పడ్డాయి. ఈ కాలనీలలో కూడా జాతీయవాద భావనలు బలపడి ఫ్రెంచి పాలననుండి విముక్తి పొందాలన్న ఆకాంక్ష ప్రజలలో పెరగసాగింది. అప్పటికే నెహ్రూ ‘‘ఫ్రెంచి కాలనీలు భారతదేశ ముఖంపై మొటిమల వలె ఉన్నాయని’’ వర్ణించాడు. భారతావనిలో తమకాలనీల మనుగడ ఇక అసాధ్యమన్న నిర్ణయానికి ఫ్రాన్స్ వచ్చేసింది. కానీ ఈ కాలనీలను భారత్కు అప్పగించటానికి వారి రాజ్యాంగంలోని ఆర్టికిల్ 27 ప్రకారం రిఫరెండం (ప్రజలందరి అభిప్రాయం తెలుసుకోవటం) తప్పనిసరి అని పట్టు పట్టింది.( Article 27 of the Constitution of the France Fourth Republic stipulates that “no surrender, no exchange, no addition of territory shall be valid without the consent of the peoples concerned” అని స్పష్టంగా చెపుతుంది.) వదులుకోవటం తప్పనిసరైతే హుందాగా అప్పచెప్పాలే తప్ప అవమానకర పరిస్థితులలో చేజార్చుకోకూడదని ఫ్రాన్స్ భావించింది.
ఈ పరిస్థితులలో 1948 లోనే భారత`ఫ్రెంచి ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకొన్నాయి. దీని ప్రకారం ఈ ప్రాంత ప్రజలు తాము భారతదేశంలో కలవాలా ఒద్దా అనే విషయాన్ని రిఫరెండం ద్వారా తేల్చుకోవాలి. ఈ రిఫరెండం తీర్పు అది జరిగిన ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. అంటే ఒక ప్రాంతం ఫ్రెంచివారితో ఉండాలనుకొంటే ఉండొచ్చు మరొక ప్రాంతం విడిపోవాలనుకొంటే విడిపోవచ్చు. అప్పటికి మొత్తం అయిదు ఫ్రెంచి కాలనీలుండేవి. అవి పాండిచేరి, మాహె, కారైకాల్, యానాం మరియు బెంగాల్వద్దకల చంద్రనాగూర్ లు. పై ఒప్పందానికి అనుగుణంగా చంద్రనాగూర్ 19, జూన్ 1949 న రిఫరెండం జరుపుకొంది. 7587 ఓట్లు భారతావనిలో విలీనానికి అనుకూలంగాను, 114 ఓట్లు వ్యతిరేకంగాను పోల్ అయ్యాయి. అలా తొందరపడి రిఫరెండం జరిపేసుకోవటం వల్ల చంద్రనాగూర్ ఈనాడు ఈ అనంత భారతావనిలో ఉండే వేనవేల మునిసిపాలిటీలలో ఒకటిగా కనుమరుగైంది.
చంద్రనాగూర్ లోని స్థానిక నాయకులందరూ పొరుగునున్న బెంగాల్ రాష్ట్ర కమ్యూనిష్టు నాయకుల ప్రభావంలో ఉండి ఆ ప్రాంతాన్ని విదేశీపాలనా చెర నుండి విడిపించి పొరుగునున్న బెంగాల్ లో విలీనం చేయించటంలో కృతకృత్యులయ్యారు. కానీ అప్పటి యానాం నాయకులు పొరుగునున్న ఆంధ్రా నాయకుల ప్రభావంలో కాక పాండిచేరీ నాయకుల నాయకత్వంలో నడిచారు. దీన్ని బట్టి చూస్తే అప్పటి యానాం నాయకులు ఆంధ్రావైపు ఎక్కువగా మొగ్గుచూపి ఉన్నట్లయితే చంద్రనాగూర్ వలెనే యానాం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ విశిష్టతా లేని ఒక పంచాయితీ గా మిగిలిపోయేది. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని భారతావనిలో కలిపేయాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు ముందుచూపు కలిగి పాండిచేరీ తో ఉన్న సంబంధాలను తెంపుకోలేదు. అపుడు మాత్రమే యానాం ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. ఇది వారి దార్శనికతకు, రాజకీయ పరిణతికి నిదర్శనంగా చెప్పవచ్చు. పుదుచ్చేరీ నాయకులు కూడా యానాన్ని పాండిచేరీలో ఒక అంతర్భాగంగా చూసారు తప్ప వేరుగా చూడలేదు.
ఇక మిగిలిన నాలుగు ప్రాంతాల ప్రజలు ఫ్రెంచి వారిని అంత సులభంగా చేజార్చుకోవటానికి ఇష్టపడలేదు. భారతప్రభుత్వం కూడా పరిస్థితులు పక్వానికొచ్చే వరకూ ఎదురుచూసింది. హైదరాబాద్లోలా సైనిక పదఘట్టనలతో బలప్రయోగానికి సాహసించలేదు. అందునా ఇది దేశాల నడుమ వ్యవహారమాయె! 1948 డిసెంబరు, 19 న జైపూరులో జరిగిన కాంగ్రేసు ప్లీనరీసమావేశాలలో ‘‘స్వతంత్రభారతావని ఏర్పడినతరువాత, ఈ గడ్డపై విదేశీ పరిపాలన కొనసాగటం అసమంజసమే కాక దేశసమైక్యతకు భంగం కలిగించే విషయం’’ అని ఫ్రెంచివారినుద్దేశించి కాంగ్రేసు పార్టీ తీర్మానం చేసింది. ఆ తరువాత 1950 సెప్టెంబరు,21న నాసిక్ లో జరిగిన సమావేశాలలో కాంగ్రేసు పార్టీ మరలా ‘‘ దేశంలోని విదేశీ పాలిత ప్రాంతాలు స్వతంత్ర భారతదేశంలో విలీనం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని’’ పునరుద్ఘాటించింది. 1952 నాటికి పాండిచేరీలో ప్రజలు ఫ్రెంచి వ్యతిరేక, అనుకూల వర్గాలుగా చీలిపోవటంతో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొనిఉంది. చిన్న చిన్న ఘర్షణలు, కొట్లాటలతో అట్టుడికి పోతూండేది. యానాంలో కూడా ఇదే పరిస్థితి ప్రతిబింబించేది. అక్టోబరు 22 న భారతభూభాగం నుంచి కొంతమంది సాయుధులు, పాండిచేరీలోకి ప్రవేశించి అక్కడి ఫ్రెంచి పౌరులపై దాడిచేసి గాయపరిచారు. ఈ ఉదంతాన్ని నెహ్రూ దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన ‘‘ఫ్రెంచి వారు భేషరతుగా ఈ ప్రాంతాలను భారతదేశానికి స్వాధీనం చేయాలనీ, అలాచేసినట్లయితే ఈ ప్రాంతాల ప్రజల సాంస్కృతిక, భాషా, ఆచార, చట్టపరమైన హక్కులకు రక్షణ కల్పించగలనని’’ హామీ ఇచ్చాడు. ఫ్రెంచి వారు కోరుతున్నట్లుగా ఈ ప్రాంతాలలో రిఫరెండం జరిపించటానికి భారతప్రభుత్వం అంగీకరించక పోవటానికి కారణం కాశ్మీర్ లో కూడా ప్లెబిసైట్ (రిఫరెండం) జరపాలని పాకిస్తాన్ పట్టు పడుతుందన్న అనుమానం ఉండటం.
యానాం విమోచనం, డిఫాక్టో ట్రాన్సఫర్, ట్రీటీ ఆఫ్ సిషన్, డి జ్యూర్ ట్రాన్సఫర్ మరియు విలీనము
పై పదాలన్నీ ఒకే విధంగా అనిపించినప్పటికీ వాటి అర్ధాలలో చాలా వ్యత్యాసముంది. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయి ఒప్పందాలు. యానాం ఎందుకు ఆంధ్రాలో విలీనం కాలేదో, యానాం ప్రత్యేకత ఏమిటో పై అంశాల ప్రాముఖ్యతను తెలుసుకొంటే మరింత అర్ధమౌతుంది.
విమోచనం: యానాంలో ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం పతాక స్థాయిని చేరుకొని 1954, జూన్ 13 న ఉద్యమకారులు అప్పటి యానాం అడ్మినిష్ట్రేటరునుంచి అధికారాలను స్వాధీనపరచుకొని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తదుపరి ఫ్రెంచి జాతీయ జండాను అవనతం చేసి భారతదేశపతాకాన్ని ఎగురవేసి యానాం, ఫ్రెంచి పాలన నుండి ‘‘విమోచనం’’ చెందిందని ప్రకటించారు.
ఈ మొత్తం ఉద్యమంలో పాలుపంచుకొన్న ఆనాటి నాయకులలో, దడాల రఫేల్ రమణయ్య, మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, కామిశెట్టి వరప్రసాదరావు నాయుడు, కోన నరసయ్య, యర్రా సత్యనారాయణమూర్తి, భయంకరాచారి వంటివారు ప్రముఖులు. ఫ్రెంచి ప్రభుత్వం మాత్రం ఈ ఉద్యమాన్ని, ప్రభుత్వంపై జరిగిన ఒక ‘‘ముట్టడి’’ గా (Coup de’etat Yanaon) అభివర్ణించింది.
1956 మే, 28 న ఫ్రాన్స్`భారత దేశాల నడుమ జరిగిన ట్రీటీ ఆఫ్ సిషన్ ఒప్పందంలో ` యానానికి సంబంధించి 1954, జూన్ 13 తరువాత జరిగిన అన్ని అధికారిక/అనధికారిక వ్యవహారాలకు తనకు ఏ విధమైన సంబంధం లేదని విస్పష్టంగా చెప్పటాన్ని బట్టి యానాంలో ఫ్రెంచి పాలన 1954, జూన్ 13 తో చారిత్రికంగా ముగిసినట్లు భావించాలి.
డిఫాక్టో ట్రాన్సఫర్: ఫ్రెంచికాలనీల భవితవ్యం తేల్చటానికి 1954, అక్టోబరు 18న పాండిచేరీ లోని కీళూరు వద్ద ఈ కాలనీల ప్రజాప్రతినిధులతో జరిగిన రిఫరెండం లో ` ఫ్రెంచి పాలనను కోరుతూ 7 ఓట్లు, భారతదేశంలో విలీనానికి అనుకూలంగా 164 ఓట్లు రావటంతో ఫ్రెంచి ప్రభుత్వం ఈ కాలనీలను భారతదేశానికి యథాతథంగా అప్పగిస్తూ అక్టోబరు, 26న ఒక ఒప్పందం చేసింది. ఈ ఒప్పందం ద్వారా ఫ్రెంచి ప్రభుత్వం 1954 నవంబరు, 1 న పాండిచేరీ, మాహే, కారైకాల్ మరియు యానాం లను భారత ప్రభుత్వానికి యథాతథ స్థితిలో అప్పగించింది. కనుక నవంబరు 1 ని డీఫాక్టో ట్రాన్సఫర్ దినంగా పరిగణిస్తారు.
ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం జరపాలని మొదట్లో పట్టు పట్టిన ఫ్రెంచి ప్రభుత్వం తన పట్టు సడలించుకొని, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొంటే చాలని సరిపుచ్చుకొంది. ప్రజలు పాల్గొనే రిఫరెండం లో ఫలితం తనకు అనుకూలంగా రాకపోతే విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుందన్న అనుమానంతో, భారత్ చేసిన ఒత్తిడి ఫలితమిది. (రి. అవర్ సీక్రెట్స్ ఇన్ అదర్స్ ట్రంక్స్` ఎ.జి. నూరాని, ఫ్రంట్ లైన్ పత్రిక జూలై 2005)
ట్రీటీ ఆఫ్ సిషన్: ఫ్రెంచి కాలనీలను భారత్ కు అప్పగించినా, అవి చట్ట పద్దతిలో భారతదేశంలో విలీనం కావటానికి మరో ఒప్పందం 1956 మే 28 న జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంత సార్వభౌమాధికారాలను భారతదేశానికి అప్పగించటం జరుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా పాండిచేరీలో రెండు భవనాలను ఫ్రాన్స్ తన ఆధీనంలో ఉంచుకొని (అవి Rue de Marine లో ఫ్రెంచి కౌన్సిలేట్ కొరకు ఒక భవనం, Victor Simonel వీధిలో కల French College భవనము) మిగిలిన ప్రాంతాలను భారత్ కు ఇచ్చివేసింది. ఈ ఒప్పందానికి ఫ్రెంచిపార్లమెంటు వేయాల్సిన ఆమోదముద్ర ఫ్రాన్సు-అల్జీరియన్ యుద్ధం జరుగుతున్న కారణంగా ఆలస్యం జరిగింది. (అల్జీరియాకూడా ఒక ఫ్రెంచి కాలనీయే. ఇది స్వాతంత్య్రం కొరకు ఫ్రాన్స్ తో యుద్ధమే చేయవలసివచ్చింది).
డి జ్యూర్ ట్రాన్సఫర్: 1962 లో అల్జీరియా యుద్ధం ముగిసింది. 1962 లో ఫ్రెంచి పార్లమెంటు ట్రీటీ ఆఫ్ సిషనుకు ఆమోద ముద్రవేసింది. దరిమిలా 1962, ఆగష్టు 16 న ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ కాలనీల ‘‘సార్వభౌమాధికారాల్ని’’ భారత ప్రభుత్వానికి బదలాయించింది. కనుక ఆగష్టు 16 ను డి జ్యూర్ ట్రాన్సఫర్ దినమని పిలుస్తారు. ఇది పుదుచేరి ప్రభుత్వ అధికారిక స్వాతంత్య్రదినం. ఆ విధంగా ఈ కాలనీల ప్రజలు రెండు స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటారు. ఒకటి భారత స్వాతంత్య్రదినమైన ఆగష్టు 15 రెండవది ఆగష్టు 16 న జరుపుకొనే డి జ్యూర్ ట్రాన్సఫర్ దినం.
విలీనము: ఈ ప్రాంతాల ఫ్రెంచి సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షిస్తానని ఫ్రెంచి ప్రభుత్వానికి ఇచ్చిన హామీలకనుగుణంగా భారతప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి, ఈ నాలుగు ప్రాంతాలను 1963 జూలై, 1న యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచేరీగా ప్రకటించింది. ఈ ప్రక్రియతో ఈ ఫ్రెంచికాలనీలు భారతావనిలో విలీనం కావటం పూర్తయింది.
ముగింపు
పదహారవ శతాబ్దం నుంచీ ఫ్రాన్స్ ప్రపంచవ్యాప్తంగా కాలనీలను నిర్మించటం మొదలెట్టింది. ఇరవయ్యవ శతాబ్దం నాటికి ప్రపంచం మొత్తం మీద 8.5% భూమిని చేజిక్కించుకొంది. స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు అనేక ప్రాంతాలకు స్వాతంత్య్రం ప్రకటించి తప్పుకొంది. కానీ కొన్ని కాలనీలు ఈనాటికీ ఫ్రాన్స్ పరిపాలనలోనే కొనసాతున్నాయి. ఒకప్పటి ఈ ఫ్రెంచికాలనీలు పారిస్ కు కొన్ని వేల మైళ్ళదూరంలో ఉన్నప్పటికీ, ‘ఫ్రెంచ్ ఓవర్సీస్ డిపార్ట్మెంట్స్’ అనే పేరుతో పిలువబడుతూ నేడు యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్ అంతర్భాగాలుగా పరిగణింపబడుతున్నాయి. ఇవి మార్టినిక్, గాడెలూప్, రీయూనియన్, ఫ్రెంచ్ గయానా లు. ఈ ప్రాంతాల జీవనప్రమాణాలు ఫ్రాన్స్లోని ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోవు. ఇక్కడి యువకులు ఉన్నతచదువులకు పారిస్ వెళుతూంటారు. పారిస్లో ఆవిష్కరింపబడిన కొత్త ‘ఫాషన్లు’ తెల్లారేసరికల్లా ఇక్కడ ప్రత్యక్ష్యమవుతాయి. ఈ ప్రాంతం నుండి ఫ్రెంచి సెనేట్ కు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉంది.
ఇక భారతదేశంలోని ఫ్రెంచికాలనీల విషయానికి వచ్చేసరికి 1947 లోనే ఫ్రెంచి ప్రభుత్వం వీటిని ఫ్రెంచి ఓవర్సీస్ టెరిటరీస్ లు అని (సముద్రాంతర ఫ్రాన్స్ భూభాగాలు) నామకరణం చేసింది. ఇలా చేయటం ద్వారా ఈ కాలనీలన్నీ ఫ్రాన్స్ అంతర్భాగాలని ప్రపంచానికి చెప్పటానికి ప్రయత్నించింది. కానీ 1954 లో ఈ ప్రాంతాల ప్రజలు ప్రదర్శించిన అచంచలమైన భారతదేశభక్తి కి ఫ్రెంచి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. భారతప్రభుత్వం కూడా సంయమనం పాటించి దౌత్యపరంగానే ఈ ప్రాంతాలను ఫ్రాన్స్ నుంచి పొందింది.
పాండిచేరీ, మాహే, కారైకాల్ మరియు యానాంలలో ప్రథమంగా యానామే ‘‘విమోచనం’’ చెందినట్లు ప్రకటించుకొంది. (ఆ తరువాత మాహే). పాండిచేరీ, కారైకాల్ లలో అలా జరగలేదు. ఈ విషయంలో ఈ ఫ్రెంచి కాలనీలలో ‘‘విమోచనం’’ అనేది ఒక్క యానాం, మాహే లకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ప్రాంతవాసులు డిఫాక్టో ట్రాన్ఫర్ దినం మాత్రమే జరుపుకొంటారు. ఆ విధంగా యానాం ‘‘క్రాంత దర్శి’’ గా చరిత్రకెక్కింది.
యానాం ని ఆంధ్రాలో కలపకపోవటం వెనుక ఇంతటి చరిత్ర దాగి ఉంది.
ప్రాచీన భారతదేశంలో న్యాయాధికారం రాజుగారి వద్దే ఉండేది. మనుస్మృతి అర్ధశాస్త్రాలలో చెప్పిన పద్దతులకనుగుణంగా నేరాలకు శిక్షలు విధించబడేవి. ఇక గ్రామాలలో కుల పెద్దలతో కూడిన పంచాయితీలలో స్థానిక విచారణలు జరిగేవి. ఇక్కడకూడా పైన చెప్పబడిన శాస్త్రాలననుసరించే తీర్పులు చెప్పేవారు. బ్రిటిష్ వారి రాకతో ఈ పద్దతికి తెరపడి ఆధునిక న్యాయవ్యవస్థ అవతరించింది. 1661 లో ఈస్ట్ఇండియా కంపనీ తన ఉద్యోగులకొరకు కొన్ని చట్టాల్ని, శిక్షల్ని సొంతంగా ఏర్పాటుచేసుకొంది. కాల క్రమేణా ఈ చట్టాల పరిధిలోకి సామాన్య ప్రజలను కూడా తీసుకురావటం జరిగింది.
1701 లో ఫ్రాన్స్ జారీచేసిన ఒక రాజశాసనం ద్వారా పాండిచేరీలోని
గవర్నర్ కౌన్సిల్ కు సంపూర్ణ జుడిషియల్ హక్కులు కల్పించబడ్డాయి. 1766 నుండి 1827 వరకూ పాండిచేరీలో ''Chaudrie'' అనే పేరుతో ఫ్రెంచి ఇండియా జుడిషియల్ వ్యవస్థ
రూపుదిద్దుకొంది. చాద్రిలను నేటి
కోర్టులతో పోల్చవచ్చును. (ఈ పదానికి
క్రియాసారూప్యం కలిగిన చావడి, సత్రం అనే
తెలుగు పదాలుండటం గమనార్హం) ఇక్కడ సివిలు, క్రిమినలు, శాంతిభద్రతలకు
సంబంధించిన అనేక విషయాలపై ఫ్రెంచి జడ్జిలు విచారణలు జరిపి తీర్పులు
ఇచ్చేవారు. ఈ తీర్పులు ఎక్కువగా భారతీయ
ప్రాచీన శిక్షాస్మృతులను ఆధారంగానే చేసేవారు. (రి. ఆనందరంగ పిళ్ళై డైరీలు.
పిళ్ళై కూడా ఒక చాద్రికి జడ్జిగా వ్యవహరించేవాడు) ఆ కాలంలో ఇవ్వబడిన తీర్పులను “Jugements du tribunal de la Chaudrie de Pondicherry - 1766 to 1817” అనే పేరుతో Jean Bonnan అనే ఆయన పుస్తకరూపంలోకి తీసుకొచ్చాడు. 1775 లో బ్రిటిష్ ఇండియాలో వార్న్ హేస్టింగ్స్ భారతీయ
శిక్షాస్మృతులను అనుసరించి ‘‘హిందూ లా’’ ను తయారుచేయించి ప్రవేశపెట్టాడు. కాగా
ఫ్రెంచి ప్రభుత్వం 1735 లోనే ఒక కమిటీ వేసి
స్థానిక శిక్షాస్మృతులను అధ్యయనం
చేయించింది. తదనుగుణంగానే చాద్రిలు తీర్పులు చెప్పేవి.
ఇక యానాం విషయానికి వస్తే ఇక్కడ అలాంటి చాద్రిలు
పనిచేసినట్లు తెలియరాదు. (రి. జె.బి.పి. మోర్)
1819 జనవరి, 6 న Compte Dupoy (ఫ్రెంచి గవర్నరు) ‘‘క్రిష్టియన్లు, ముస్లిములు లేక హిందువులు ఎవరైనప్పటికీ వారి వారి ఆచార
వ్యవహారాలను బట్టి విచారణ జరపవలసి
ఉంటుంది’’ అన్నాడు. ఇక్కడి ప్రజల
బాల్యవివాహాలు, వారసత్వ వ్యవహారాలు వంటివి ఫ్రెంచి
చట్టాలకు భిన్నగా ఉన్నప్పటికీ కూడా ఫ్రెంచి ప్రభుత్వం ఇక్కడి ప్రజల మనోభావాలకు
వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అలా చేస్తే
వారి వ్యాపారమనుగడ దెబ్బతింటుందన్న ఆలోచనలు కూడా
ఉండవచ్చు.
1819,
నవంబరు 22 న జారీ చేసిన ఒక
రాజ శాసనం ద్వారా ఫ్రెంచి ఇండియాలో ‘‘మాజిస్ట్రేట్ కోర్టులు’’
ప్రారంభించారు. వీటి ద్వారా
ఫ్రెంచిప్రభుత్వం తన కాలనీలలోని ప్రజలకు సమర్ధవంతమైన న్యాయాన్ని అందించే వ్యవస్థకు
శ్రీకారం చుట్టింది.
యానాం చాలా చిన్న ప్రాంతం కావటంచే సివిలు, క్రిమినల్, శాంతిభద్రత వ్యవహారాలన్నింటికీ కలిపి ఒకే జడ్జి
ఉండేవారు. మొదట్లో యానాం పెద్దొరే
(ఎడ్మినిస్ట్రేటర్) జడ్జిగా వ్యవహరించేవాడు.
ఆయనకు నోటరీ మరియు దుబాసీలు సహాయపడేవారు.
ఇక్కడ ఓడిపోయిన కేసులకు పాండిచేరీలో ఉన్న పెద్దకోర్టులో అప్పీలు చేసుకొనే
అవకాసం మొదట్లో ఉండేది కాదు. ఈ లొసుగును
ఉపయోగించుకొని Courson వంటి పెద్దొరలు నియంతలుగా
వ్యవహరించి కొంతకాలం యానాన్ని గడగడలాడిరచారు.
1784 లో చేసిన ఒక ఫ్రెంచి చట్టం ప్రకారం క్రిమినల్ కేసుల్లో
జడ్జిమెంటు ఇచ్చేముందు ముగ్గురు స్థానిక ఫ్రెంచి పౌరుల సహాయంతో విచారణ జరపవలసి
ఉంటుంది. ఈ నిబంధన వలన యానాం కోర్టులో
క్రిమినల్ కేసుల విచారణ నత్తనడకన సాగుతూండేది.
ఎంపిక చేసిన స్థానిక న్యాయ సహాయకులలో ఒకరుంటే ఒకరుండని కారణంగా కేసులు
పదేపదే వాయిదా పడేవి. ఈ ప్రతిబంధకం వలన
చాలా కేసులు కోర్టు ఫైళ్ళలో మగ్గిపోతుండేవి.
1829 లో యానాంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. వీటిని అదుపుచేయటంలో అప్పటి పెద్దొర Delarche విఫలం కావటంతో
పాండిచేరీ నుంచి Lasparda ను యానాంకు
పెద్దొరగా అత్యవసరంగా పంపించారు. లెస్పార్డా వచ్చీరాగానే ‘‘తుదితీర్పులు
ఇవ్వటానికి యానాం పెద్దొరకు సంపూర్ణ అధికారాలు పాండిచేరీలో ఇవ్వబడ్డాయి’’ అన్న
తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ లో ప్రవేశపెట్టి ఆమోదింపచేయించుకొన్నాడు. దీనితో సహాయకుల అవసరం లేకుండా జడ్జిహోదాలో
పెద్దొర ఒక్కరే తీర్పులు ఇచ్చే అవకాశం ఏర్పడిరది. అలా లెస్పార్డా తనకు కొన్ని
విశిష్టాధికారాలను సృష్టించుకొని ఆనాటి యానాం అల్లర్లను అణచివేయగలిగాడు. (అది 1784 నాటి ఫ్రెంచి చట్ట వ్యతిరేకమైనప్పటికీ)
అప్పట్లో స్త్రీలు, పిల్లలు, ప్రభుత్వోద్యోగులు, చనిపోయినవారలకు
చెందిన కేసులకు ప్రథమ ప్రాధాన్యత ఉండి వారికి సంబంధించిన కేసులకు త్వరితగతిన
తీర్పులు చెప్పేవారు.
1833,
ఫిబ్రవరి 4 న జారీ చేసిన ఒక
డిక్రీ ద్వారా యానానికి ప్రత్యేక జడ్జి నియామకం జరగటం మొదలైంది. (రి.18 February
1833, Letter of De Melay to De Lesparda, COR.GLE, India V.31). ప్రజలకు సరైన న్యాయం అందించటం కోసం 1833 లో సుమారు పదిరకాల వివిధ మాన్యుయల్స్ ను ఫ్రెంచి
ప్రభుత్వం యానాం కోర్టుకు పంపించింది.
(మాన్యుయల్ ఆఫ్ జస్టిస్, మాన్యుయల్
ఆఫ్ క్రిమినల్ లా, సివిల ప్రొసీజర్
వంటివి)
క్రిమినల్ కేసుల విచారణ ముగ్గురు లేదా నలుగురు ఫ్రెంచి
దేశస్థుల సమక్షంలో జరగాలనే నిబంధనను సడలించి ముగ్గురు లేదా నలుగురు స్థానిక
పెద్దలను భాగస్వామ్యులను చెయ్యటం 1848 నుంచి మొదలయ్యింది. పెద్దొర
సిఫార్సుల మేరకు ఈ స్థానిక జడ్జిల నియామకం జరిగేది. ఆ విధంగా కామిశెట్టి పేరమ, బళ్ల సుబ్బయ్య, బులుసు
సుబ్రహ్మణ్య శాస్త్రులు, బెజవాడ బాపనయ్య,వర్ధినీడి అయ్యప్పనాయుడు, గిరి వెంకన్న, దరియాఖాన్ వంటి
స్థానికులు సహాయక జడ్జిలుగా పనిచేసారు.
1850 నాటి యానాం జుడిషియల్ వ్యవస్థలో ` ప్రధాన
న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రాసిక్యూటర్ (ఈయనే పోలీసు
ఉన్నతాధికారి కూడా), నోటరీ వంటి ప్రధాన
పదవులలో ఫ్రెంచి దేశస్థులు, వీరుకాక నలుగురు
స్థానిక సహాయకులు, ఒక దుబాసీ, ప్రమాణములు చేయించటానికి బ్రాహ్మణుడు, బంట్రోతు మరియు జైలరు ఒక్కొక్కరు చొప్పున ఉండేవారు. సుమారు ఇరవైమంది పోలీసులతో కూడిన పోలీసు
వ్యవస్థ కోర్టుకు అనుబంధంగా పనిచేసేది.
యానాం కోర్టులో 1833 లో పద్దెనిమిది కేసులు విచారణ జరగగా 1859 నాటికి వీటి సంఖ్య 118 కి పెరిగింది. ఇది ఆనాటి ప్రజలలో న్యాయవ్యవస్థపై పెరిగిన
నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకొనవచ్చును. కానీ 1833 లో ఒకే ఒక క్రిమినల్ కేసు నమోదు కాగా 1859 లో 83 క్రిమినల్ కేసులు
నమోదు కావటం గమనార్హం.
ప్రసిద్దిగాంచిన
కొన్ని కేసులు
యానాం కోర్టు ఏర్పడినపుడు దానికి ప్రథమ మాజిస్ట్రేట్ గా Emile Coet Morven నియమితుడయ్యాడు. ఇతని వ్యవహారశైలి తదనంతర
కాలంలో వివాదాస్పదమైంది. అక్టోబర్ 1833 లో మోర్వెన్ తన ఇంట్లో పనిచేసే అడపా వెంకటరెడ్డి తనకు
త్రాగటానికి మురికి నీరు ఇచ్చాడన్న కోపంతో అతను నాపై విషప్రయోగం చేసి
చంపాలనుకొంటున్నాడు అని కేసు బనాయించి పోలీసులచే చితక బాదించాడు. ముద్దాయిని పరిశీలించిన డా.పిథోస్ అతని ఒంటిపై
దారుణమైన దెబ్బలున్నాయని దృవీకరించాడు కూడా.
ఈ కేసు విషయం అంతా ఫ్రెంచి గవర్నరు De malay కు తెలిసి అప్పటి పెద్దొర అయిన జోర్డైన్ కు ఈ విధంగా ఉత్తరం వ్రాయటం
జరిగింది.
.......
నేరం ఋజువు కాలేదు.
ఆ నీరు త్రాగి మోర్వెన్ అనారోగ్యం పాలయిన దాఖలాలూ లేవు. విషప్రయోగం అన్నది ఒట్టి ఊహాగానమే తప్ప మరేమీ
కాదు. అడపా వెంకటరెడ్డిని తక్షణం విడుదల
చెయ్యండి..... అందరికీ న్యాయాన్ని అందించాల్సిన న్యాయమూర్తే ఇలా అధికార
దుర్వినియోగానికి పాల్పడటం శోచనీయం....... అంటూ అక్షింతలు పెట్టాడు.
ఆ తరువాత కూడా మోర్వెన్ వ్యవహార శైలి మారలేదు. మోర్వెన్ అనేక రకాలైన అవమానాలకు, వేధింపులకు గురిచేస్తున్నాడని ఈతని ప్రవర్తన కంటక ప్రాయంగా
ఉందంటూ యానాం ప్రజలు 1834లో గవర్నరుకు
పిర్యాదులు చేసారు. ఆర్ధిక అవకతవకలకు పాల్పడి యానాంపెద్దొర ఉద్యోగాన్ని
పోగొట్టుకొన్న కుర్సన్కు ఈ మోర్వెన్ అల్లుడే కావటం ఇక్కడ విశేషం.
మన్యవోరి మేడలో మానవ బలి కేసు
యానాం మన్యవోరి మేడలో అభియోగింపబడిన మానవబలి పై పాండిచేరి
కోర్టు ప్రధాన న్యాయమూర్తి Ristle Hueber 17 నవంబరు 1858 మరియు 25 మార్చి 1859 తారీఖులలో జరిపిన
విచారణల అనంతరం సమర్పించిన రిపోర్టు సారాంశం ఈ విధంగా ఉంది (రి. ఇండియా కార్డు 463).
........
మన్యం వెంకటరత్నం యానాంలో పేరుమోసిన జమీందారు. ఇతనికి
ఫ్రెంచి దొరలకూ మధ్య అనేక ఆర్ధిక వ్యాపారలావాదేవీలు ఉండేవి. 1856 ప్రాంతంలో ఈతనికి వచ్చిన జబ్బు ఎన్ని మందులు వాడినా
తగ్గలేదు. దానితో వెంకటరత్నం, షేక్ లాలా, ఆదినారాయణుడు
మరియు బావాజి అనే ముగ్గురు మంత్రగాళ్ళను ఆశ్రయించాడు. వాళ్ళు ఇదంతా చేతబడి ప్రభావం అని జమిందారును
నమ్మించారు. మీకు చేతబడిచేసింది నిజమే
అయితే మేం చదివే మంత్రం పూర్తికాగానే మీ ఇంటిపై రాళ్ళు వర్షిస్తాయి అంటూ ఏవో
మంత్రాలు జపించగా` వెంకటరత్నం ఇంటిపై
రాళ్ళ వర్షం కురిసిందట. దానితో జమీందారు ఆ మంత్రగాళ్ళ మాటలకు లొంగిపోయాడు. వాళ్ళు
అలా జమీందారు ఇంట్లో ఎనిమిదిరోజుల పాటు క్షుద్రపూజలు చేసారు. తోట గవన్ను అనే ఆ ఇంటి పనివాడిపై దెయ్యాన్ని
ఆవహింపచేస్తే ‘‘నువ్వొక నెలరోజుల్లో చనిపోతావు ఇప్పటికే ఆలస్యమయ్యింది తొందరగా
భూతశాంతి చేయించు’’ అన్నదట. దీంతో
బెంబేలెత్తిపోయిన జమీందారు మంత్రగాళ్ళు చెప్పినట్లు ‘‘మానవ కన్య’’ ను బలి ఇవ్వటానికి సిద్దపడ్డాడు. ఆ మంత్రగాళ్ళ కన్ను ఆ ఇంటిలోనే పనిచేస్తున్న
తోట గవన్ను కూతురైన పదేళ్ళ మంగ పై పడ్డాయి.
తోట గవన్నుకు తెలియకుండా బలి ఇవ్వటానికి ఆమెను ఎంచుకొన్నారు.
15 మే, 1856 న మంత్రగాళ్ళు
ఆమెను పెరట్లోకి తీసుకు వెళ్ళి ఏవో పదార్ధాలను ఆమెచే తాగించారు. అవి తాగాకా ఆమె ఇంటికి వెళ్ళి అపస్మారక
స్థితికి చేరి రెండురోజుల తరువాత మరణించింది.
కూతురు మరణించటం పట్ల ఆగ్రహించిన తోట గవన్ను కొంతమంది పెద్దల సహాయంతో, మన్యం వెంకటరత్నం మరియు ఆ ముగ్గురు మంత్రగాళ్ళపై యానాం
కోర్టులో కేసువేసాడు..... అంటూ రిజెల్ హూబర్ రిపోర్టు మొత్తం జరిగిన ఉదంతాన్ని
క్రోడీకరించింది.
అక్కడినుంచి మొదలైంది అసలు కధ. తోటగవన్ను ఇచ్చిన కంప్లైంట్
ఆధారంగా ఈ బలి ఉదంతంపై విచారణ జరిగింది. ఆ
అమ్మాయికి విషాన్ని పట్టించారన్న ఆరోపణ నిజానిజాలు నిర్ధారించటానికి వీలుపడలేదు, ఎందుకంటే అప్పటికే శవదహనం జరిగిపోయింది. అందుచేత
అప్పటి యానాం కోర్టు జడ్జి ణవ De Saint Hilaire ఈ కేసును కొట్టివేసి ముగ్గురు మంత్రగాళ్ళు నిర్ధోషులని విడుదల
చేసేసాడు. ఈ తీర్పు పట్ల యానాంలో పెద్ద
ఎత్తున నిరసన వ్యక్తమయింది. మన్యం
వెంకటరత్నం తన పలుకుబడిని ఉపయోగించి కేసును కొట్టివేయించాడని యానాం నుంచి
పిర్యాదులు అందటంతో ` పాండిచేరీ కోర్టు
ప్రధాన న్యాయమూర్తి రిజెల్ హ్యూబర్ మొత్తం కేసును పునర్విచారణ స్వయంగా చేపట్టి ఆ
మంత్రగాళ్ళకు మూడునెలల జైలు శిక్ష మరియు మంగ తల్లికి వెయ్యిరూపాయిల పరిహారాన్ని
ఇప్పిస్తూ తీర్పు చెప్పాడు.
ఈ మొత్తం ఉదంతంలో ఫ్రెంచి ప్రభుత్వం అప్పట్లో యానాంలో అన్ని
రంగాలలో ఆధిక్యతలో ఉన్న ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచటానికే ఆ
నిందితులకు నామ మాత్రపు శిక్షలు విధించినట్లు అనిపించక మానదు.
చెళ్లపిళ్ల
వారి కేసు
తొలితరం ప్రముఖ ఆధునిక తెలుగుకవి చెళ్లపిల్ల వెంకటశాస్త్రి
యానాంలో 1880 లలో విద్యనభ్యసించారు. చెళ్లపిల్ల వారు అల్లే కవిత్వంలో
తమను గరించి దూషణలు ఉన్నాయని కొంతమంది స్థానికులు కొంతమంది వీరిపై యానాం కోర్టులో కేసువేసారట. ఆ కేసు విచారణ చేసిన జడ్జిగారు నూనూగు
మీసాలైనా లేని చెళ్లపిల్ల వారిని చూసి ‘‘వీడు పొయెట్ అంటే నేను ఒప్పుకోను’’ అని
కేసు కొట్టివేసాట్ట. (రి. చెళ్లపిల్ల వారు రచించిన కధలు`గాధలు పుస్తకం). ఆ తరువాత కాలంలో శ్రీచెళ్లపిల్ల వారు
ఆంధ్రదేశం గర్వించదగ్గ కవిగా పేర్గాంచారు.
ఈ సందర్భంలో చెళ్లపిల్ల వారి తరపున వాదించిన లాయర్ యొక్క సామర్ధ్యం
మెచ్చుకోదగ్గది ఎందుకంటే నిజంగానే నందిని పందిగా చేయగలిగాడీ కేసులో.
ఎన్నికల
కేసులు
యానాంలో ఎన్నికలు జరిగిన ప్రతీసారీ ఓడిపోయిన అభ్యర్ధులు
విజేతలపై కేసులువేయటం పరిపాటిగా ఉండేది. 1880 మేలో జరిగిన ఎన్నికలలో బెజవాడ బాపనయ్య మేయరుగా
ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక చెల్లదంటూ
ప్రత్యర్ధులు కేసు పెట్టారు. మేయర్ పదవి
చేపట్టటానికి బెజవాడ బాపనయ్యకు 25 సంవత్సరముల
వయసులేని కారణంగా ఆయన మేయర్ ఎన్నిక చెల్లదంటూ యానాం కోర్టు తీర్పుచెప్పింది.
1922 లో కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు స్థానిక మండలి
సభ్యునిగా ఎన్నికయినపుడు ఆయనకు ఫ్రెంచిరాదనీ, ఆ ఎన్నిక
చెల్లదంటూ గిరి తాతయ్య కేసు వేసారు.
కోర్టువారు విచారణ జరిపి కామిశెట్టికి తగినంత ఫ్రెంచి వచ్చు కనుక అతని
ఎన్నిక చెల్లుతుందని తీర్పుచెప్పారు.
గ్రామ
బహిష్కరణ తీర్పు
ఫ్రెంచి కోర్టు తీర్పులలో గ్రామబహిష్కరణ కూడా ఒక
శిక్షావిధానంగా ఉండేది. ఉదాహరణకు యానానికి చెందిన సత్తర్ సాహేబ్ అనే ఫ్రెంచి
పౌరుడు దొంగతనం చేసినట్లు ఋజువు కావటంతో
అతని కేసులో 1913, జూన 27 న ఇచ్చిన తీర్పులో` మూడునెలల జైలు
శిక్ష,
25 ఫ్రాంకుల జురిమానా మరియు ఒక సంవత్సరం పాటు గ్రామ
బహిష్కరణ శిక్షలు విధించటం జరిగింది. ఈ
గ్రామ బహిష్కరణ ఒక్క యానానికి మాత్రమే పరిమితం కాక మిగిలిన అన్ని ఫ్రెంచి కాలనీలకు
కూడా వర్తిస్తుంది.
యానాం
విమోచనం లో జడ్జి పాత్ర
1954లో యానాంను ఫ్రెంచి పాలననుండి విముక్తం చేయటానికి
విమోచనోద్యమం ముమ్మరంగా జరిగింది. ఆ సందర్భంలో
ఫ్రెంచి దేశస్థుడయిన జార్జిసాలా యానాం అడ్మినిస్ట్రేటరుగా కొనసాగటం
మంచిదికాదన్న ఉద్ధేశ్యంతో ఫ్రెంచి ప్రభుత్వం ఆయనను పాండిచేరీ పిలిపించివేసింది.
అప్పటి యానాం కోర్టు న్యాయమూర్తి అయిన శ్రీ శివా గారికి యానాం అడ్మినిస్ట్రేటరు బాధ్యతలను అప్పచెప్పేరు. 1954 జూన్, 13న వేల సంఖ్యలో
విమోచనోద్యమకారులు అడ్మినిస్ట్రేటరు బంగళాను చేరుకొని ఇంచార్జ్ అడ్మినిస్ట్రేటరు
అయిన శ్రీ శివా నుండి అధికారాలను స్వాధీనపరచుకొని, యానాం రెండు శతాబ్దాల ఫ్రెంచిపాలన నుండి విముక్తమైందని ప్రకటించారు. శ్రీ శివా
పరిస్థితిని సమీక్షించి ప్రతిఘటించినట్లయితే తలెత్తే శాంతిభద్రతల సమస్యను
దూరాలోచనచేసి అధికారాలను ఉద్యమకారులకు బదలాయించారు. ఆ విధంగా యానాంలోని ఫ్రెంచిపాలనకు స్వస్థి
వాక్యం పలకబడిరది. వలసపాలకుల నుండి రాజ్యాధికారం స్థానికులకు అందించటంలో యానాం
జడ్జి పాత్ర ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయింది.
ముగింపు
యానాం మేజిస్ట్రేట్ కోర్టువారి అధికారిక వెబ్సైటు లో
యానాం కోర్టు 1725 కు పూర్వం డచ్చివారిచే
నిర్మింపబడిరదని, 1725 లో ఫ్రెంచివారి
చేతుల్లోకి వెళ్ళిందని ఉంది. ఇది మొదట డచ్చి కోర్టు అనీ తరువాత ఫ్రెంచి కోర్టుగా
రూపాంతరం చెందినట్లు వ్రాయబడిరది. ఏ
ఆధారాలతో ఒక ప్రభుత్వ వెబ్ సైటులో అలాంటి సమాచారాన్ని పొందుపరచారో ఆశ్చర్యం
కలిగించక మానదు.
యానాన్ని డచ్చివారు పరిపాలించినట్లు కానీ ఇక్కడ తమ
స్థావరాల్ని ఏర్పాటుచేసుకొన్నట్లు కానీ ఎక్కడా చారిత్రిక ఆధారాలు కనిపించవు.
డచ్చివారు పరిపాలించిన ప్రదేశాలైన పాలకొల్లు, జగన్నాధపురం
వంటి ప్రాంతాలలో ఎక్కడా ఏ విధమైన కోర్టులు నిర్మించలేదు. పాపం వారికి పదిహేడవ శతాబ్దం అంతా స్థానికరాజుల
నుండి వ్యాపారానుమతులు పొందటంతోనే సరిపోయింది.
పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారితో పోటీ పడలేక కనుమరుగయిపోయారు. ఇంగ్లీషు, ఫ్రెంచివారిలాగా
డచ్చివారికి స్థానిక పరిపాలనలో పాలుపంచుకొనే అవకాశమే రాలేదు. కనుక ప్రస్తుతకోర్టు డచ్చివారిచే
నిర్మించబడిరదనటం సత్యదూరం.
యానాంలో చాద్రిలు లేవని జె.బి.పి. మోర్
అభిప్రాయపడినప్పటికీ పాండిచేరీలో వాటి నిర్వహణ
1717 నుంచీ సమర్ధవంతంగా ఉన్నది కనుక, యానాంలో కూడా 1723`1758 మధ్య కాలంలో పెద్దొరలుగా పనిచేసిన Guillard, Choisy, Saifray వంటి ప్రభృతులు వాటిని నిర్వహించి ఉండవచ్చుననే
భావించవచ్చును. ఏది ఏమైనప్పటికీ 1833 నుంచి మాత్రం ఒక పూర్తిస్థాయి జడ్జితో యానాం కోర్టు
నడిచిందన్నది ఒక చారిత్రక సత్యం.
పంతొమ్మిదవ శతాబ్దం చివరవరకూ జరిగిన బానిస వ్యాపారం మానవజాతి ఎన్నటికీ చెరుపుకోలేని మరక. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాల ఆవశ్యకతను ప్రపంచానికి తెలియచెప్పిన ఫ్రాన్స్ ఒకానొక సమయంలో బానిస వ్యాపారంలో ప్రధాన పాత్ర వహించటం అశ్చర్యం కలిగించే విషయం. 1794 లోనే ఫ్రెంచి రిపబ్లిక్ బానిసవ్యాపారాన్ని నిషేధించింది. కానీ 1802 లో నెపోలియన్ ఆ నిషేదాన్ని ఎత్తివేసాడు. ఈ వెసులుబాటు వల్ల 1830 లో లూయిస్ ఫిలిప్ బానిస వ్యాపారాన్ని నేరమని చట్టం తీసుకువచ్చే వరకూ అది చట్టబద్దంగానే కొనసాగింది. ఇక అనధికారంగా 1850 ల వరకూ కూడా అక్కడక్కడా నడిచింది. బానిస వ్యాపారాన్ని 1772 లోనే ఇంగ్లాండ్ నిషేదించి ఫ్రాన్స్ కంటే ముందుండటం గమనార్హం. ఈ విషయంలో ఫ్రెంచి వారిపై బ్రిటిష్ వారు ఆ కాలంలో ఒక విధమైన మోరల్ పోలీసింగ్ పాత్రను పోషించారు.
ఫ్రాన్స్ కు స్థానికంగా ఈ అనాగరీకమైన బానిస వ్యాపారం పట్ల ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని నిషేదించలేకపోవటానికి ఫ్రెంచి కాలనీఅయిన రీయూనియన్ (మడగాస్కర్ సమీపంలో ఫ్రెంచివారు ఆక్రమించుకొన్న ఒక ద్వీపం) మంచి లాభాల్నిచ్చే చెరకుతోటల సాగుకు వేల సంఖ్యలో కూలీలు అవసరం కావటం, ఆ తోటలు సమకూర్చే ఆర్ధికవనరులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సుమారు యాభైలక్షలమంది ఫ్రెంచి వారికి జీవనోపాధి కలిగించటం (1763 నాటికి) వంటివి ప్రధాన కారణాలు. అందుకనే ఫ్రెంచి ప్రభుత్వం బానిస వ్యాపారానికి సబ్సిడీలు ఇచ్చి మరీ ప్రోత్సహించవలసి వచ్చేది. ఈ కారణాల దృష్ట్యా, 1672 లో 10 లీవ్ర్ లు (లీవ్ర్ R ప్రాచీన ఫ్రెంచి కరెన్సీ. ఒక లీవ్ర్ సుమారు 450 గ్రాముల వెండి విలువతో సమానం) ఉండే ఒక బానిస వెల 1730 లో 100 లీవ్ర్లకు, 1787 నాటికి 160 లీవ్ర్లకు క్రమంగా చేరింది.
ఫ్రెంచి వారు తమ బానిసలను మొదట్లో ఆఫ్రికా నుంచి సేకరణ జరిపినా కాలక్రమేణా ఇండియాలోని తమ కాలనీలనుంచి కూడా తరలించటం మొదలెట్టారు. 1760 లో ఏడాదికి సగటున 56 షిప్పులలో బానిసల ఎగుమతి జరిగేది. ఒక్కో షిప్పు మూడు నుంచి నాలుగొందల మంది బానిసలు పట్టే సామర్ధ్యం కలిగుండేవి. 1767 లో చక్కెర ఉత్పత్తిలో ఫ్రెంచి వారు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచారు. రీయూనియన్ లో చెరకు తోటల్లో పనిచేసే బానిసల జీవనం కడు దయనీయంగా ఉండేది. వారు రోజుకు దాదాపు ఇరవై గంటలు పనిచేసేవారు. స్త్రీలు కొద్ది సంఖ్యలో ఉండేవారు. కుటుంబాలు ఉండేవి కావు. ఆ కారణాల వల్ల మరణ రేటు అధికంగా ఉండటంతో బానిసల కొరత నిరంతరం ఉండేది. బానిసలను చేరవేసే నౌకలకు Amity, Liberte వంటి గొప్ప పేర్లు ఉండటం దురదృష్టకరం.
యానాంలో ఫ్రెంచి వారు జరిపిన బానిస వ్యాపారానికి ఆధారాలు 1792 లో యానాం సమీపంలో కల ఇంజరం అనే గ్రామంలో నివసించే Mr. Yates అనే ఓ బ్రిటిషర్ పాండిచేరీలోని ఫ్రెంచి గవర్నర్ జనరల్ కి (Colo De Fresne) వ్రాసిన ఓ లేఖలో దొరుకుతాయి. (Ref. Asiatic Journal Vol. 26 No. 156 - printed in 1828, Chapter Slavery in India, Pages from 665 to 670)
యేట్స్ ఎపిసోడ్ (1792): బానిసలను ఎక్కించుకొనే ఫ్రెంచి నౌకలు కోరంగి నుంచి బయలు దేరే తారీఖు దగ్గర పడేకొద్దీ బానిసలను సరఫరా చేసే మధ్యవర్తులు రకరకాల పద్దతులకు పాల్పడేవారు. కొంతకాలం క్రితం ఈ ప్రాంతంలో విపరీతమైన కరువు విలయతాండవం చేయటం వల్ల తిండిలేక చచ్చిపోవటం కంటే బానిసగా బతకటమే మేలనే ఉద్దేశ్యంతో ప్రజలుండేవారు. కానీ ప్రస్తుతం కొద్దో గొప్పో తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండటం చే బానిసల సేకరణ ఫ్రెంచి వారికి కష్టమై హింసాత్మక పద్దతులకు పాల్పడటం మొదలెట్టారు. యానాం వీధులలో తిరిగే యాచకులను యానాంలో సరుకులు కొనుగోలు కోసం వచ్చిన ఇతర గ్రామస్తులను పట్టి బంధించి, రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి రాత్రివేళలలో ఫ్రెంచి నౌకలలోకి ఎక్కించేవారు. ఈ వ్యక్తులను వారి కుటుంబాలనుంచి అతి కిరాతకంగా విడదీయటం అనేది ఆయా ఫ్రెంచి నౌకల యజమానుల కనుసన్నల్లో జరిగేది ......... అంటూ యేట్స్ యానాంలో ఫ్రెంచి వ్యాపారులు జరుపుతున్న బానిస వ్యాపారం గురించి తన లేఖలో పేర్కొన్నాడు.
ఈ అభియోగాలను సమర్ధిస్తూ అయిదుగురు ఇంజరం వాస్తవ్యులు లిఖిత పూర్వకంగా ధృవీకరించారు. వీరిలో బొండాడ వెంకటరాయలు అనే ఓ వైశ్యుడు వ్రాసిన మరో లేఖ ఈ ఉదంతం పై మరింత వెలుగును ప్రసరింపచేస్తుంది.
బొండాడ వెంకటరాయలు ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీచే గుర్తింపు పొందిన ఒక యానాం వ్యాపారి. ఈయన తన ఉత్తరంలో...... M. de Mars, M. La Blanche మరియు M. Ellardine అనే ముగ్గురు ఫ్రెంచి నౌకయజమానులు బానిసలను కొనుగోలు చేయటానికి మధ్యవర్తులను ఏర్పాటుచేసుకొని వారి ద్వారా యానాంలోని ముష్టివారిని, పొరుగూరి వారిని బలవంతంగా నిర్బంధించి కోరంగి రేవులో నిలిపిన వారి నౌకలలోకి ఎగుమతి చేయిస్తున్నారని` అంతే కాక యానాం చుట్టుపక్కల గ్రామాలకు మనుషులను పంపించి అక్కడి కూలీలకు, దర్జీలకు పని ఇప్పిస్తామని నమ్మబలికి వారిని యానాం తీసుకువచ్చి బంధించి రాత్రివేళలలో ఎవరికీ తెలియకుండా నౌకలలోకి తరలిస్తున్నారనీ` ప్రతిఘటించేవారి నోటిలో గుడ్డలు కుక్కి లేదా సారాయిని బలవంతంగా తాగించి ఆ నిస్సహాయ స్థితిలో వారిని నౌకలోకి మోసుకుపోవటం జరుగుందనీ .......అంటూ బొండాడ వెంకటరాయలు తన లేఖలో ఆనాటి సంఘటనలను వర్ణించాడు.
ఆతేరు గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మల అబ్బాయిని, నీలపల్లి కి చెందిన ఒక భోగం పిల్లని ఏ ఊరో తెలియని ఓ బ్రాహ్మణ అమ్మాయిని కూడా ఈ విధంగానే కిడ్నాప్ చేసి నౌకలోకి తరలించారు. ఈ ముగ్గురి విషయం తన మిత్రుల ద్వారా తెలుసుకొన్న యానాం పెద్దొర (సొన్నరెట్) ఆ నౌక కెప్టెన్ కు ఆదేశాలు జారీ చేసి వారిని విడుదల చేయించాడు.
అలా ఆ ఫ్రెంచి నౌక ఎక్కి తిరిగొచ్చిన ఆ ముగ్గురూ, ఆ నౌకలో అనేక మంది కూలీలు, కుటుంబ స్త్రీలు, కొద్దిమంది బ్రాహ్మణులు ఉన్నారని చెప్పటంతో ఆగ్రహించిన స్థానికులు, ఆ మిగిలిన వారిని కూడా విడిపించమని సొన్నరెట్ ను అడిగారు. కానీ సొన్నరెట్ ఏ రకమైన హామీ ఇవ్వకపోవటం, నౌక బయలుదేరే తారీఖు దగ్గరపడుతూండటంతో వారంతా పొరుగునే ఉన్న బ్రిటిష్ అధికారులను ఆశ్రయించారు.
ప్రజల వద్దనుండి వచ్చిన విజ్ఞప్తులపై విచారణ నిమిత్తం యేట్స్ యానాం వెళ్లగా, చాలామంది యానాం ప్రజలు ఆయనను చుట్టు ముట్టి సుమారు మూడువందలకు పైగా వారి బంధువులను ఎత్తుకుపోయారని గగ్గోలు పెడుతూ తమ గోడును వెళ్ళబోసుకొన్నారు. చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టలేదని కన్నీరు మున్నీరై వారు విలపించారు. ఈ మొత్తం ఉదంతంపై సొన్నరెట్ ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని మొదట్లో వాదించి, చివరకు కావాలంటే నౌకను తనిఖీ చేసుకోవచ్చునని అనుమతినిచ్చాడు. దరిమిలా ఒక ఫ్రెంచి అధికారి, స్కోబీ అనే ఒక ఇంగ్లీషు అధికారి పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పడి నౌక తనిఖీ కి కోరంగి వెళ్ళారు. కానీ నౌక కెప్టెన్ వీరిని నౌక లోపలకు రాకుండా అడ్డుకొని ఏ విధమైన వివరణలు ఇవ్వకుండా కమిటీని వెనక్కు పంపించేసి కోరంగి రేవునుండి నౌకతో సహా జారుకొన్నాడు.
యానాం పెద్దొర తన విచక్షణాధికారాలను ఉపయోగించి నౌకను నిలుపు చేసి ఉన్నట్లయితే ఆ స్థానికుల తరలింపు నివారింపబడి ఉండేదని యేట్స్, Major Wynch అనే మరో బ్రిటిష్ అధికారికి వ్రాసిన ఒక లేఖలో పేర్కొన్నాడు.
పాండిచేరిలోని ఫ్రెంచి గవర్నరు (M.De Fresne) ఈ విషయాలనన్నీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ Lord (Cornwallis) ద్వారా తెలుసుకొని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడే వారిని అరెస్టు చేసి పాండిచేరీ పంపవలసినదిగా ఆదేశాలు జారీచేసాడు. అంతే కాక వీటిని నియంత్రించలేని తన నిస్సహాయతను కూడా తెలియచేసాడు. (సరైన పర్యవేక్షణా యంత్రాంగం లేకపోవటం వల్ల) అలాంటి అనుమతుల కోసమే ఎదురుచూస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే కోరంగి, భీమిలిపట్నం ల వద్ద సిపాయిలను నియమించి తీర ప్రాంతంలో ఫ్రెంచి వారు జరిపే దారుణ బానిస వ్యాపారం అరికట్టటానికి పూనుకొంది.
యానాం పెద్దొర సొన్నరెట్ మాత్రం ఒక లేఖలో ‘‘ఇంగ్లీషువారు కూడా ఈ బానిస వ్యాపారంలో ఉన్నారనీ, ఒకసారి ఇంగ్లీషునౌకలో బానిసలుగా తరలింపబడుతున్న 12 మంది యానాం వాసులను తాను విడిపించానని’’ చెప్పటం ఈ మొత్తం ఉదంతానికి కొసమెరుపు.
1793 నుండి 1816 వరకూ యానాం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండటం వల్ల ఆ కాలంలో యానాంలో జరిగిన విషయాలు తెలియరావు.
ఫ్రెంచి వారు చేసే ఈ బానిస వ్యాపారంపై బ్రిటిష్ వారి పహారా ఎంతెలా ఉండేదో 1820 లో జరిగిన ఒక సంఘటన తెలియచేస్తుంది.
La Jeune Estele అనే ఫ్రెంచి నౌకను బ్రిటిష్ పడవలు వెంబడిరచగా ఆ నౌక కెప్టెన్ కొన్ని పీపాలను సముద్రంలోకి విసిరేయటం మొదలెట్టాడు. అలా విసిరేసిన ఒక్కో పీపాలో 12 నుండి 14 సంవత్సరముల వయసు కలిగిన బానిసలు ఉండటం పట్ల యావత్ప్రపంచం నివ్వెరబోయింది. ఈ సంఘటన తరువాత ఫ్రెంచి నౌకలపై బ్రిటిష్ వారి కాపలా మరింత ఉదృతమైంది. అయినప్పటికీ ఈ కాలంలో 3211 మంది కూలీలను పంతొమ్మిది నౌకలలో యానాం నుంచి రీయూనియన్ కు పంపించటం జరిగింది. వీరిలో అధికశాతం ఇంగ్లీషు టెరిటరీనుంచి సమీకరించటం గమనార్హం. (Article of Mr. Jacques Weber - L’emigration Indeienne vers les colonies francaises)
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ ఫ్రెంచి ప్రభుత్వం పాత పద్దతులకు స్వస్థి పలికి కూలీల సేకరణ కొరకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
యానాంలో కాంట్రాక్టు పద్దతిపై కూలీల ఎగుమతి
రీ యూనియన్ లోని చెరుకు తోటలలో పనిచేయటానికి కార్మికుల అవసరం రోజు రోజుకూ పెరగటం, ఇండియానుంచి కూలీలను తీసుకుపోవటానికి, పొరుగు రాజ్యాన్ని ఏలే బ్రిటిష్ వారు ఎక్కడికక్కడ అనేక ఆంక్షలు విధించటం వల్ల ఫ్రెంచి ప్రభుత్వం 1828 లో కాంట్రాక్టు పద్దతి ద్వారా కూలీలను రిక్రూట్ చేసుకోవటం మొదలెట్టింది. ఫ్రెంచి ప్రభుత్వం నియమించిన ఏజెంటుకు, పనిచేయటానికి ముందుకొచ్చిన కూలీకి మధ్య జరిగే కాంట్రాక్టులో ఈ క్రింది హామీలుండేవి.
1. కాంట్రాక్టు కాల పరిమితి మూడు సంవత్సరాలు
2. ప్రతి కూలీకి నెలకు 7 రూపాయిల జీతం ఇవ్వబడుతుంది.
3. తిండి, వసతి, ఆరోగ్య సదుపాయాలు కల్పించబడతాయి.
4. వారి వారి ఆచారాలను, మతపరమైన సాంప్రదాయాలను గౌరవించటం జరుగుతుంది.
5. రాను, పోను ఖర్చులను మరియు కాంట్రాక్టు ముగియక ముందే అనారోగ్య లేదా ఇతర కారణాల వల్ల స్వదేశానికి వెళ్లాలనుకొనేవారి తిరుగు ప్రయాణ ఖర్చులను కూడా యజమానే భరిస్తాడు.
6. ప్రతి కూలీకి ముందుగా మూడు నెలల జీతం అడ్వాన్సుగా ఇవ్వబడుతుంది.
7. పనిలో చేరాకా ఇచ్చే జీతంలో 3 రూపాయిలను కూలీ చేతికి, మిగిలిన 4 రూపాయిలు ఇక్కడ అతని కుటుంబ సభ్యులకు నెల నెలా అందించబడుతుంది.
Lకాంట్రాక్టు లోని చివరి రెండు హామీలకు యానాం వాసులే కాక పొరుగు ప్రాంతాల వారు కూడా ఆకర్షితులై అధిక సంఖ్యలో ముందుకొచ్చారు. ఆ విధంగా కాంట్రాక్టు కుదుర్చుకొన్న మొత్తం 268 మంది కార్మికులు 1829 ఆగస్టు, 7 న యానాం నుంచి రీయూనియన్ కు బయలు దేరారు. వారిలో 197 మంది దళితులు, 27 మంది ముస్లిములు, పదముగ్గురు చేనేత కార్మికులు, అయిదుగురు పల్లీయులు, ఇద్దరు అగ్రకులస్థులు (మిగిలిన వారి వివరాలు తెలియరావు) ఉన్నారు(]. Personal state of Indians embarking at Yanam for Bourbon from 16 March 1828 to 6 August 1829, COR.GLE, India V. 29).
అలా బోర్బన్ (రీయూనియన్) కు పంపించబడిన యానాం కూలీల కుటుంబాలకు నెల నెలా ఇచ్చే చెల్లింపులను రీయూనియన్ లోని వారి యజమాని అయిన Mr. Argand తరపున తాను చెల్లిస్తానని యానాంలో ఉండే ఫ్రెంచి ఏజన్సీ De Courson and Co వారు హామీ ఉన్నారు. మొదటి వాయిదా డిశంబరు 1829 నాటికి చెల్లించవలసి ఉంది. కానీ జనవరి వచ్చేసినా వారికి ఒక్క పైసా కూడా ముట్టలేదు. వారందరూ యానాం పెద్దొర అయిన Mr. De Lesparda వద్దకు వచ్చి విన్నవించుకొన్నారు. ‘‘ఆర్గాండ్ నుంచి మాకేమీ డబ్బులు ముట్టలేదు కనుక మేము వీరికి ఏ రకమైన చెల్లింపులు చేయలేము’’ అని కుర్సన్ అండ్ కో వారు చేతులెత్తేయటంతో` ఎనిమిదిరోజులుగా పస్తులతో పెద్దొర బంగ్లా వద్ద ఎదురుచూస్తున్న ఆ కూలీల కుటుంబాలకు యానాం పెద్దొరే, 1830 జనవరి, 17 నుంచి కొద్దిపాటి చెల్లింపు చేయటం మొదలెట్టాడు.
యానాంలో ఇలా ఉండగా, అక్కడ రీయూనియన్ లోని చెరుకు తోటలు ఆ సమయంలో భారీ నష్టాలను ఎదుర్కోవటంతో యానాం కూలీలు సంతృప్తికరంగా లేరనే సాకు చూపి తాము కుదుర్చుకొన్న ఆర్ధిక ఒప్పందాలు నెరవేర్చలేమని అక్కడి తోటల యజమానులు తెగేసి చెప్పి, వారిని తిరిగి ఇండియా పంపించివేసారు. ఆ విధంగా యానాంలో జరిగిన కాంట్రాక్టు కూలీల ఎగుమతి వ్యవహారం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కాంట్రాక్టు పద్దతిలో కల ఆమోదయోగ్యమైన అంశాలకు ఆశ్చర్యపడిన బ్రిటిష్ వారు ఈ రకపు కూలీల తరలింపును ఏ విధంగానూ ఆటంక పరచలేకపోయారు. అయినప్పటికీ ఈ పద్దతి విజయం సాధించలేకపోవటం తో మరలా మరో ఇరవై ఏళ్ల వరకూ యానాం నుంచి ఏ విధమైన వలసలూ జరిగినట్లు తెలియరాదు.
కూలీల సేకరణలో ఫ్రెంచి వారిపై బ్రిటిష్ వారి ఆంక్షలు
కాలక్రమేణా కూలీల సేకరణ, వారి తరలింపు అనేది అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా మారటంతో పాండిచేరి, కారైకాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ లలో ఇదొక ప్రధాన పాత్ర వహించటం మొదలైంది. ఫ్రెంచి ప్రభుత్వం కూడా »»Society for Emigrationµµ అనే సంస్థకు ఈ విషయంలో సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ సొసైటీ అధిపతి అయిన Jouls Bedier Priery ఈ వ్యాపారంలో విపరీతమైన లాభాలార్జించి అప్పటి ఫ్రెంచ్ ఇండియాలో అత్యంత ధనికుడిగా పేర్గాంచాడు. ఒకానొక దశలో పాండిచేరి, కారైకాల్ లలో కూలీలు ఇక దొరకని పరిస్థితి రావటంతో బెడియర్ కళ్లు యానాం పై పడ్డాయి. దరిమిలా బెడియర్ కోరిక మేరకు ఫ్రెంచి ప్రభుత్వం, యానాంలో కూలీల సేకరణ జరుపుకోవటానికి అనుమతినిస్తూ 1849 సెప్టెంబరు, 1న ఉత్తర్వులు జారీచేసి, అప్పటి యానాం పెద్దొర జోర్డైన్ కు రెండువేల పాస్పోర్టులను పంపించింది. (ఒక ఫ్రెంచి పౌరుడు విదేశాలకు వెళ్లటానికి పాస్పోర్టులు అవసరం) ( India card 464, D 591 and the article of Jaques Weber)
లె పికార్డ్ అనే ఫ్రెంచ్ నౌకలో బెడియర్ తన మందిమార్బలంతో 1849 సెప్టెంబరు, 11 న పాండిచేరీలో బయలుదేరి 14 సెప్టెంబరుకు యానాం చేరుకొన్నాడు. ఈ ప్రాంతమంతా ఘోరమైన వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్థమై ఉండటం వల్ల వారికి కూలీల సేకరణ పెద్ద కష్టం కాలేదు. 30 సెప్టెంబరు కల్లా మొదటి దఫా కూలీల సేకరణ పూర్తయింది. వారికి (60 మంది) యానాం పెద్దొర జోర్డైన్ సంతకం చేసిన పాస్ పోర్టులు జారీ చేయబడ్డాయి. వీరందరినీ కోరింగి రేవులో ఫ్రాన్స్ జాతీయపతాకాన్ని అతిశయంతో రెపరెపలాడిస్తున్న తన నౌకలోకి చేరుస్తూండగా మొదలైంది అసలు కధ.
అక్టోబరు 1 న ఒక బ్రిటిష్ అధికారి ఓ కానిస్టేబుల్ని వెంటేసుకొని వచ్చి ఈ కూలీలు స్వచ్చందంగా వెళుతున్నారా లేక బలవంతంగా తరలించబడుతున్నారా అన్న విషయం తెలుసుకురమ్మని రాజమండ్రి కలక్టరు జారీ చేసిన ఒక ఉత్తర్వును చూపి, ఆ 60 మంది కూలీలను ఒక్కొక్కరినీ విచారించటం మొదలెట్టాడు. ఆ మరునాడు కలక్టరు ప్రెస్ డెర్గాస్త్ గారే స్వయంగా వచ్చి కూలీలను ప్రశ్నించి వారందరూ ‘‘మేము ఇష్టపూర్వకంగానే వెళుతున్నామని’’ చెపుతున్నా సంతృప్తి చెందక, పౌరులకు కోరంగి రేవు నుండి విదేశాలకు వెళ్ళే అనుమతి లేదన్న కారణంచే బెడియర్ తో సహా అందరినీ జగన్నాయకపురం తరలించి అరెస్టు చేయించాడు. వీరందరూ 10 అక్టోబరు వరకూ కటకటాల వెనుకే ఉన్నారు.
అవమాన భారంతో పాండిచేరీకి వెనుదిరిగిన బెడియర్` ఫ్రెంచి ప్రభుత్వం కూలీలకు జారీచేసిన పాస్ పోర్టులను మరియు ఇతర చట్టపరమైన అనుమతులను బ్రిటిష్ కలక్టరు ఖాతరుచేయకపోవటం వల్ల తనకు జరిగిన ఆర్ధిక, పరువు నష్టాలకు 1,80,000 ఫ్రాంకుల పరిహారాన్ని ఇప్పించమని ఫ్రెంచి ప్రభుత్వాన్ని కోరాడు. కోరంగి రేవును తటస్థ రేవుగా (బ్రిటిష్ మరియు ఫ్రెంచి నౌకల ప్రయాణానికి) ఉంచాలని పూర్వం ఫ్రెంచి మరియు బ్రిటిష్ వారు చేసుకొన్న ఒప్పందాలను బ్రిటిష్ వారు ఉల్లంఘించారని బెడియర్ ఆరోపించాడు. (దీనికి స్పందిస్తూ ఆ ఒప్పందాలేమిటి అని బ్రిటిష్ వారు అడిగినపుడు ఫ్రెంచి వారు ఏమీ చూపలేకపోవటం వల్ల కోరంగి రేవు పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి పోవటం ఆ తరువాత జరిగిన ఒక దురదృష్టకర పరిణామం ఫ్రెంచివారికి సంబంధించి).
బెడియర్ వంటి పెద్ద వ్యాపారికే అంత అవమానం జరిగిన తరువాత పాండిచేరీలోని మరే ఇతర వర్తకులు యానాంలో కూలీల సేకరణ జరపటానికి మరో పదేళ్ల వరకూ సాహసించలేదు
బ్రిటిష్`ఫ్రెంచి ప్రభుత్వాల ఒప్పందం 1861
బెడియర్ అవమానోదంతం ఫ్రెంచి ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ఫ్రెంచి రాజ్యానికి గౌరవభంగం జరిగినట్లు భావించింది. దీనితో ఫ్రెంచి వారు బ్రిటిష్ ప్రభుత్వంతో పై స్థాయిలో చర్చలు జరిపి 1861 జూలై, 1 న ఒక ఒప్పందాన్ని చేసుకొన్నారు. దీని ప్రకారం బ్రిటిష్ వారి అన్ని పోర్టుల నుంచీ ఫ్రెంచివారికి కూలీలను పంపించుకొనే అధికారం పొందింది. ఆ యా సెంటర్లలో ఒక బ్రిటిష్ అధికారి ఉండి కూలీలు స్వచ్చందంగా వెళుతున్నారా లేక బలవంతంగా తరలింపబడుతున్నారా అనే విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. (]. Year book of India 1866, Pondy, Govt.printing)
ఆ విధంగా 1861 నుంచి యానాంలో చట్టబద్దంగా కూలీల తరలింపుకు మరలా తెరలేచింది. 1861 నుండి 1870 మధ్య యానాం నుంచి సుమారు 3500 మంది కూలీలు రీయూనియన్ లోని చెరకు తోటలలో పనిచేయటానికి పంపించబడ్డారు. యానాం నుంచి బయలుదేరిన నౌకల కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి.
సంవత్సరం నౌక పేరు యానాం నుంచి బయలుదేరిన తేదీ తీసుకెళ్లిన కూలీల సంఖ్య చూడుడు ఫొటో
యానాం నుంచి బయలుదేరిన నౌకల వివరాలలో పైన ఉదహరించినవి కొన్ని మాత్రమే. మొత్తం మీద ఇరవై సంవత్సరాల కాలంలో యానాం నుంచి బయలు దేరిన పద్నాలుగు నౌకలలో సుమారు 3500 మంది, పాండిచేరీ నుంచి 13,000 మంది కలకత్తా నుంచి 9,000 మంది కూలీలు రీయూనియన్కు ఎగుమతి అయినట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నది. (రి. Mme. Mazard in her memoire de Maitrise “L’emigration indienne vers les colonies francaises from 1860 to 1880).
ఈ కాలంలో కూలీల సేకరణ మేస్త్రీల ద్వారా జరిగేది. వీరు యానాం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా కూలీలను తీసుకువచ్చి యానాంలో కల ఏజెంట్లకు అప్పచెప్పేవారు. ఆ కూలీలకు ముందుగా మెడికల్ చెకప్ జరిగేది. చిన్న చిన్న వ్యాధులకు మందులు ఇచ్చేవారు. వృద్ధులను, పిల్లలను తీసుకొనేవారు కాదు. ఈ ప్రక్రియ అంతా ఒక ఇంగ్లీషు అధికారి సమక్షంలో జరిగేది. ఇలా ఎంపిక చేయబడిన కూలీలందరూ తాము ఐచ్ఛికంగానే జీవనోపాధికొరకు రీయూనియన్కు వెళుతున్నట్లు ఆయనకు ఒక అంగీకార పత్రాన్ని వ్రాసి ఇచ్చేవారు. తదుపరి ఆ కూలీలకు రెండునెలల జీతం (నెలకు 5 రూపాయిల చొప్పున మొత్తం 10 రూపాయిలు) ముందుగా చెల్లించి, నౌక బయలుదేరే తారీఖు వరకూ వారికి తిండి వసతులు కల్పించటం జరిగేది. ఈ మొత్తం వ్యవహారంలో ఏ రకమైన నిర్బంధాలు లేవని నిర్ధారించే బ్రిటిష్ అధికారికి నెలకు 250 రూపాయిల జీతం, సరఫరా చేసిన ఒకొక్క కూలీకు 3 రూపాయిల చొప్పున మేస్త్రీలకు, 24 రూపాయిల చొప్పున ఫ్రెంచి ఏజెంటుకు ముట్టేవి.
1830 నాటి కాంట్రాక్టు పద్దతిలో ఒక్కొక్క కార్మికునకు నెలకు 7 రూపాయిల జీతం కాగా 1860 లో అది నెలకు 5 రూపాయిలు మాత్రమే కావటం గమనార్హం. ఏదైనా ఒక కుటుంబం అంతా ఈ విధమైన పద్దతిలో కూలీలుగా వెళ్ళేటపుడు, స్త్రీలకు పిల్లలకు నెలకు రెండు రూపాయిల యాభై పైసల చొప్పున జీతం ఉండేది. 1830 లో కూలి అడ్వాన్సుగా 21 రూపాయిలు ముందుగానే ఇచ్చేవారు, కానీ 1860 వచ్చేసరికి ఈ మొత్తం పదిరూపాయిలకు తగ్గిపోయింది. అయినప్పటికీ ఈ పద్దతిన వెళ్ళటానికి యానాం వాసులే కాక శ్రీకాకుళం, ఏలూరు, మచిలీపట్నం వంటి దూర ప్రాంతవాసులు కూడా వచ్చేవారు. 1862 లో యానాంలో Quillet Victor de Possel et Cie పేరుగల ఒక ఫ్రెంచి ఏజెన్సీ ద్వారా ఈ కూలీల లావాదేవీలు జరిగేవి.
ఇదే సమయంలో ఇంగ్లీషువారు చేపట్టిన రైలు మార్గాల ఏర్పాటు, సాగునీటి కాలువల తవ్వకం (ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం చివరిదశకు చేరింది), బీడుభూముల్ని సాగులోకి తీసుకురావటం వంటి వివిధ పనులకు తీవ్రమైన కూలీల కొరత ఏర్పడటంతో, బ్రిటిష్ ప్రభుత్వం ఫ్రెంచివారు సాగిస్తున్న ఈ కూలీల ఎగుమతికి అనేక విధాలైన ఆటంకాలను కలిగించటం మొదలు పెట్టారు. మేస్త్రీలపై ఏడాదికి పదిరూపాయిల టాక్స్ విధించటం, మేస్త్రీలకు లైసెన్సులు జారీ చేసి వాటిని ప్రతీ సంవత్సరం మద్రాసులో ఉండే బ్రిటిష్ ఉన్నతాధికారిచే కౌంటర్సైన్ చేయించుకోవాలన్న నిబంధన విధించటం వంటివి వాటిలో ముఖ్యమైనవి.
1866 లో యానాం నుంచి ఆఖరు సారిగా కూలీలు పంపించబడ్డారు. తరువాత అలాంటి వ్యాపారం జరగలేదు. 1863 లో 775 మంది, 1864 లో 621 మంది, 1865 లో 184 మంది కూలీలను తరలించగా, 1865 లో మాత్రం సుమారు 1500 మంది యానాంనుంచి పంపించబడ్డారు. దీనికి కారణం అప్పట్లో ఒరిస్సాలో భయంకరమైన కరువు విలయతాండవం చేయటం వల్ల చాలా మంది ప్రజలు ఇలా వలస పోవటానికి సిద్దపడినట్లు అనుకోవాలి.
ముగింపు
ఫ్రెంచి వారు తమ అవసరాల దృష్ట్యా కూలీలను తరలించటంలో మొదట కొన్ని అనాగరిక పద్దతులు పాటించినా (యేట్స్ ఉదంతం), కాలానుగుణంగా మానవీయ దృక్పధంతో వ్యవహరించినట్లే కనపడుతుంది. మరీ ముఖ్యంగా 1828 లో ప్రతిపాదించిన కాంట్రాక్టు పద్దతి ఈనాటికీ ఆదర్శప్రాయమే అనటం అతిశయోక్తి కాదు. షిప్పులో రవాణా సమయంలో ప్రతీ కూలీకి రోజుకు ఒక కేజీ బియ్యం తో వండిన అన్నం, 120 గ్రాముల పప్పులు, 200 గ్రాముల మాంసం లేక చేపలు మరియు మూడు లీటర్ల మంచినీరు ఇవ్వాలని నిబంధన ఉండేది. 1853 లో కారైకాల్ కు చెందిన కూలీలు సేకరించే ఒక మేస్త్రీ మైనారిటీ తీరని పిల్లలను కూలీలుగా ఎగుమతి చేయటానికి ప్రయత్నించినందుకు ఫ్రెంచి కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించటాన్ని బట్టి ఈ కూలీల సేకరణ ఇష్టమొచ్చినట్లు కాక, నిబంధనలకు లోబడే జరిగేదని అర్ధంచేసుకొనవచ్చును. 1854 లో పాండిచేరీ నుంచి బయలుదేరిన ఆగస్టస్ అనే షిప్పులో కూలీలు అనేక ఇబ్బందులకు గురయ్యారని పిర్యాదులు రావటంతో, ఫ్రెంచి ప్రభుత్వం రెజెల్ హ్యూబర్ అనే జడ్జితో విచారణ జరిపించి, షిప్పులో ప్రయాణించే కూలీలకు కనీస వసతి సౌకర్యాల కల్పనకు అనేక నిబంధనలను విధించింది. వీటి ఫలితంగా ఫ్రెంచి నౌకలలో తరలింపబడే కూలీలలో గమ్యస్థానాలకు చేరే లోపు జరిగే మరణాల శాతం 2.7 కు తగ్గింపబడిరది. కాగా బ్రిటిష్ నౌకలలో ఇది 7.8 గా ఉండేది. (]. Treaty Between Trade and Coolie: the case of Augustus (1854) by Jacques Weber CIDIF). 1885 నాటికి ఫ్రాన్స్ కూలీల సేకరణను పూర్తిగా నిలిపివేసింది.
ఫ్రెంచి మరియు బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చారు. ఇరువురికీ మధ్య జరిగిన అనేక కలోనియల్ రాజకీయాలలో భాగంగా ఈ కూలీల ఎగుమతి విషయంలో ఫ్రెంచి వారిని ఇంగ్లీషువారు సమర్ధవంతంగా ఇరుకున పెట్టగలిగారు. యానాం నుంచి ఫ్రెంచివారు కూలీలను తరలించిటం అనేది ఈ ప్రాంతపు ఒక చారిత్రక సత్యం. ఏ దేశచరిత్రను తీసుకొన్నా ఇలాంటి నీలినీడలు కనిపిస్తాయనటంలో సందేహం లేదు.
ఫ్రెంచి కరీబియన్ ద్వీపకల్పం లోని Sucre Island జనాభా ఏర్పడటంలో యానాం నుంచి 1849`1869 ల మధ్య ఎగుమతి చేయబడిన కూలీలు ప్రధాన పాత్ర వహించినట్లు ప్రొ. జాబ్స్ వీబర్ అభిప్రాయపడ్డాదు. (].GHC Bulliten, 16 May, 1990, page no. 134). అలా తరలించబడిన వారిలో ఎంత మంది తిరిగి వచ్చారో, ఎంత మంది అక్కడే స్థిరపడి పోయారో......
(ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" (2010) నుండి)
బొల్లోజు బాబా
నా మూడవ పుస్తకం “ఫ్రెంచి పాలనలో యానాం”
(2012). యానాంలో ఫ్రెంచివారి కలోనియల్ చరిత్ర
గురించి. ఈ పుస్తకం ఫ్రెంచివారు ఈ నేలపై అడుగుపెట్టిన
1723 తో మొదలై, వారు విడిచివెళ్ళిన 1954 తో పూర్తవుతుంది.
ఆనాటి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలను
ఈ పుస్తకం చర్చిస్తుంది. ఈ క్రింది వ్యాసం
ఆనాటి రాజకీయ చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.
ఆనాటి నాయకులు, గ్రూపులు, ఎన్నికలు, కోర్టుకేసులు లాంటి అంశాల క్రోడీకరణ ఇది.
ఇంతసమగ్రంగా వ్యాసం రావటానికి ఫ్రెంచి ప్రభుత్వ ఆర్చైవ్స్ కారణం. చరిత్రకు సంబంధించి
చిన్న చిత్తుకాగితమైనా భద్రపరచిన వారి చారిత్రిక స్పృహ గొప్పది.
ఈ వ్యాసంలో ఎంతమంది వ్యక్తులను ఉటంకించానో
పునరుక్తులను మినహాయించి చెప్పు అని చాట్ జిపిటి ని అడిగితే 137 మంది అని లెక్కగట్టి
లిస్టు ఇచ్చింది. వీరిలో ప్రారంభంలో 8 మంచి ఫ్రెంచ్ దేశస్థులు ఉన్నారు. మొత్తం మీద
ఏడుమంది ముస్లిములు, నలుగురు బ్రాహ్మణులు, ఆరుగురు వైశ్యులు, ఆరుగురు దళితులు, ముగ్గురు
బిసీలు ఉండటం మిగిలినవారందరూ కాపు సామాజిక వర్గానికి చెందటం ఉజ్జాయింపుగా గమనించవచ్చు.
ఐరనీ ఏమిటంటే అప్పట్లోనే ముప్పై వేల రూపాయల
వెచ్చించి ముద్రించిన ఈ పుస్తకాన్ని 137 మందికాదు కదా ఆ సంఖ్యలో సగం మంది కూడా యానాంలో
కొనుక్కోలేదు.
బొల్లోజు బాబా
.
ఫ్రెంచి యానాం రాజకీయ చిత్రం
యూరోపియన్లు భారతదేశాన్ని తమ కాలనీలుగా చేసుకోవటానికి
మొదట్లో వారిని ఆకర్షించింది ‘పత్తి’ అంటే ఆశ్చర్యం కలుగక మానదు. పత్తి పంట యూరప్దేశాలలో
ఉండదు. వారి దుస్తులు ఊలు తో
తయారయ్యేవి. కాటన్ దుస్తులలో వారికి
‘ఉజ్జ్వలమైన వ్యాపార భవిష్యత్తు’ కనిపించింది.
ఇక్కడ తయారయ్యిన కాటన్ వస్త్రాలను యూరప్ మార్కెట్లకు తీసుకువెళ్ళి
అధికధరలకు విక్రయించి విపరీతంగా
లాభాలార్జించటం మొదలుపెట్టారు. తమ
వ్యాపార స్థిరీకరణ కోసమని స్థానిక రాజులకు బహుమతులిచ్చి ‘మంచి’ చేసుకోవటం ద్వారా
స్థానిక రాజకీయాలలో వేలు పెట్టటం మొదలెట్టారు.
ఈ జోక్యం ఎంతవరకూ వెళ్ళిందంటే ఇంగ్లీషు వారు ‘బ్రిటిష్ ఇండియా’ ను
ఫ్రెంచివారు ‘ఫ్రెంచి ఇండియా’ ను నిర్మించేటంత వరకూ సాగింది.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్న రీతిలో ఇంగ్లీషువారు, ఫ్రెంచివారు
ఆధిపత్యం కోసం అనేక యుద్ధాలు చేసుకొన్నారు. డూప్లే కాలంలో ఫ్రెంచి వారిదే
పైచేయి గా ఉన్నప్పటికీ, చివరకు ఇంగ్లీషువారు వివిధ ఒప్పందాల ద్వారా వీరిని
భారతదేశంలో పాండిచేరీ, మాహే, కారైకాల్, చంద్రనాగూర్, మచిలీపట్నం యానాం వంటి
ప్రాంతాలకు పరిమితం చేయగలిగారు. యానాం, మచిలీపట్నం
వంటి ప్రాంతాల వల్ల ఫ్రెంచి ఇండియా ప్రభుత్వానికి ఒకానొక దశలో ఏవిధమైన ఆర్ధికలాభం
లేకపోయినా వాటిని తమ ‘గౌరవచిహ్నాలు’ గా భావించుకొంది. వీటిని వదిలించుకోవటం అంటే ఫ్రెంచి ఇండియా
నిర్మాణ సమయంలో వేల సంఖ్యలో అసువులు బాసిన ఫ్రెంచిసైనికుల బలిదానానికి అర్ధం
లేకుండా పోతుందని తలచింది.
1701 లో జారీ చేసిన ఒక రాజశాసనం ద్వారా పాండిచేరీలోని గవర్నరుకు పరిపాలన విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వం సర్వాధికారాలు కట్టపెట్టింది. చాలా కాలంవరకూ గవర్నరే పాలనా వ్యవహారాలు నడిపించేవారు.
ఫ్రెంచి గవర్నరుకు పరిపాలనా వ్యవహారాలలో సూచనలు ఇవ్వటానికని, 1790 లో 27 మంది పౌరులతో కూడిన ఒక జనరల్ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఫ్రెంచి ఇండియాలో మొదటిసారిగా పరిపాలనలో పౌరుల భాగస్వామ్యం మొదలయ్యిందని చెప్పవచ్చును. 1791 జూలై 5 న పాండిచేరి ప్రజలు సమావేశమయి, ఆ సంఖ్యను 21 కి కుదించి ఆ కూటమికి ‘కలోనియల్ అసెంబ్లీ’ అని పేరు పెట్టారు. వీరందరూ ఫ్రెంచి దేశస్థులే. ఈ 21 మందిలో 15 మంది పాండిచేరీ నుంచి, ముగ్గురు చంద్రనాగూరునుంచి, మాహే కారైకాల్ యానాంల నుంచి ఒక్కొక్కరు చొప్పున అభ్యర్ధులుండాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఇతర ఫ్రెంచికాలనీలుగా ఉన్న సూరత్, కాలికట్, మచిలీపట్నం ల నుండి ప్రాతినిధ్యం లేకపోవటంతో వాటిని యానానికి అనుసంధానం చేసారు.
ఈ కలోనియల్ అసెంబ్లీకి యానాం నుంచి ఒక ప్రతినిధి
ఉండేవాడు. పాండిచేరీలో జరుగుతున్న ఈ
రాజకీయ ప్రక్రియలపట్ల ఉత్తేజితులైన కొంతమంది యానాం పౌరులు ఇక్కడ కూడా ‘యానాం
కలోనియల్ అసెంబ్లీ’ ని ఏర్పాటు చేసుకొన్నారు.
దీనికి Marietta ను ప్రెసిడెంటుగాను, Pithois ను వైస్ ప్రెసిడెంటుగాను ఎన్నుకొన్నారు. 1791లో యానాం కలోనియల్ అసెంబ్లీ కి ‘యాక్టివ్ సిటిజెన్స్
అసెంబ్లీ’ గా పేరు మార్చారు. ఈ అసెంబ్లీకి
అప్పటి పెద్దొర సొన్నరెట్ కు మధ్య అనేక వివాదాలు నడిచాయి. 1793 లో ఫ్రెంచి కాలనీలను బ్రిటిష్ వారు ఆక్రమించుకోవటంతో ఈ మొత్తం వ్యవస్థ
తుదిరూపు దిద్దుకోకముందే అదృశ్యమైపోయింది.
స్థానికమండలి మున్సిపల్ కౌన్సిల్ ఆవిర్భావాలు
ఆనాటి యానాం రాజకీయ చిత్రంలో రెండు వ్యవస్థలుండేవి. నలుగురు సభ్యులతో ఉండే స్థానిక మండలి మరియు 12 మంది మెంబర్లతో ఉండే మున్సిపల్ కౌన్సిలు. ఇంతమంది ఉన్నా వీరి పాత్ర పర్యవేక్షణకే తప్ప
నిర్ణయాధికారాలు ఏమీ లేవు. ట్రెజరీ, విద్యావ్యవస్థ, ప్రజాపనులు, పన్నులు, పోలీసు, వైద్యం, రవాణా వంటి వివిధ
శాఖలకు సంబంధించిన విశిష్టాధికారాలు అన్నీ పెద్దొర చేతిలో ఉండేవి. ప్రజలచే
ఎన్నుకొన్న ఈ మొత్తం 16 మంది ప్రతినిధుల
పాత్ర సలహాలు, సంప్రదింపులకే పరిమితం.
25 జనవరి, 1871 న ఫ్రెంచి
ప్రభుత్వం జారీ చేసిన ఒక డిక్రీ కి అనుగుణంగా యానాంలో స్థానిక మండలి (Local Council) ఏర్పాటు జరిగింది. దీనిలో నలుగురు మెంబర్లు
మరియు వారినుంచి ఒక అధ్యక్ష్యుడు ఉంటారు. 21 సంవత్సరములు దాటిన పౌరులు ఈ మెంబర్లను ఎన్నుకొంటారు. ఈ నలుగురిలో ఒకరు
పాండిచేరీలో కల జనరల్ కౌన్సిల్కు యానాం తరపు మెంబరుగా పంపబడేవాడు. 28 మంది
సభ్యులుండే పాండిచేరీ జనరల్ కౌన్సిల్ తరపున ఫ్రాన్స్ లోని ఫ్రెంచి సెనేట్ కు
ఒక ప్రతినిధిని పంపించేవారు. ఇదీ అప్పటి రాజకీయ వ్యవస్థ.
1880 లో ఫ్రెంచి ప్రభుత్వం మరో డిక్రీ ద్వారా స్థానిక పరిపాలన
కొరకు మున్సిపాలిటీలను ఏర్పాటుచేసింది. ఆ విధంగా 1880 మార్చి, 12 న యానాం మున్సిపాలిటి పన్నెండు వార్డులతో ఏర్పడిరది. ఈ పన్నెండు వార్డులకు సాధారణ ఎన్నికల ద్వారా 12 మంది మెంబర్లు
ఎన్నికవుతారు. వీరిలో ఒకరు మేయర్ గా
ఎన్నిక కాబడి స్థానిక పరిపాలనను పర్యవేక్షిస్తాడు.
స్థానికమండలి మొదటి ఎలక్షన్లు
భారతదేశానికి ప్రజాస్వామ్యపు తొలిరోజులవి. 1872 లో 21 సంవత్సరములు నిండిన అర్హత కలిగిన 1394 మందితో కూడిన యానాం ఓటర్ల లిస్టు తయారయ్యింది. ఫ్రెంచి దేశస్థులకు, భారతీయులకు విడివిడిగా ఓటరు లిస్టులుండేవి. ఆనాటి యానాంలో అతికొద్ది సంఖ్యలో ఫ్రెంచి
దేశస్థులున్నప్పటికీ స్థానిక మండలిలో వారి ప్రాతినిధ్యానికేమీ లోటులేకుండా
చూసుకొనేవారు.
1872 లో యానాంలో ప్రప్రథమంగా స్థానిక మండలి ఎలక్షన్లు జరిగాయి.
ప్రజలకు ఎలక్షన్ల పట్ల ఏ మాత్రమూ అవగాహన
లేని కారణంగా అభ్యర్ధులను పోటీ చేయమని బ్రతిమాలవలసి వచ్చిందట. ఈ ఎన్నికలలో కవల
వెంకట చలపతి, పైడికొండల కృష్ణయ్య నాయుడు, కంతేటి సత్యప్రసన్నం, డకోస్టా
జార్జ్స్ అనే నలుగురు మెంబర్లతో అప్పటి పెద్దొర Bayot అధ్యక్షతన యానాంలో మొదటి స్థానిక మండలి ఏర్పడిరది. 1878 లో కవల వెంకటసుబ్బారాయుడు, పైడికొండల కృష్ణయ్యనాయుడు, డకోస్టా జార్జ్స్
ల స్థానాలలో సమతం వెంకట సుబ్బారాయుడు, కొమండూరి
జియన్న,
పైడికొండల సుబ్బారాయుడులు ఎన్నికయ్యారు. ఆ తరువాత కొమండూరి జియన్న స్థానంలో బెజవాడ
బాపనయ్య నాయుడు ఎన్నికయి కొంతకాలం స్థానిక మండలి అధ్యక్ష్యునిగా పనిచేసారు.
1879`1884 లలో యానాం నుంచి Le Faucheur మరియు పైడికొండల సుబ్బారాయుడులు పాండిచేరీలోని జనరల్ కౌన్సిల్ కు
పంపించబడ్డారు. 1884 లో లె ఫాషర్ స్థానాన్ని బెజవాడ బాపనయ్య నాయుడు కైవసం
చేసుకొన్నారు.
మున్సిపల్ కౌన్సిల్ మొదటి ఎలక్షన్లు
1880 మార్చి లో జరిగిన యానాం ప్రథమ మున్సిపల్ ఎన్నికలలో బెజవాడ
బాపనయ్యనాయుడు విజయ ఢంకా మోగించారు.
కంతేటి సత్యప్రసన్నం, పైడికొండల కృష్ణయ్య, కసిరెడ్డి
బ్రహ్మానందం, కోన నరసయ్య, సిదరాల సన్యాసయ్య, అబ్దుల
రెహ్మాన్, కసిరెడ్డి తిమ్మన్న, ఎర్రంశెట్టి వెంకట రామయ్య, Pharamond లు మెంబర్లుగా ఎన్నికయ్యారు.
వివిధ సార్వత్రిక ఎన్నికలు ` గెలుపోటములు
బెజవాడ బాపనయ్యనాయుడు అశేషప్రజల అభిమానం చూరగొన్నప్పటికీ, ఆయనకు 25 సంవత్సరములు నిండని
కారణంగా మేయర్ పదవికి అనర్హుడంటూ ప్రత్యర్ధులైన పైడికొండల సుబ్బారాయుడు, కామిశెట్టి పేరమనాయుడులు చేసిన అభియోగాలు బజువు కావటంతో ఆయన ఎన్నిక చెల్లదంటూ యానాం కోర్టు
తీర్పుచెప్పింది. దరిమిలా యానాంలో మరలా
మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
1883 ఎలక్షన్లలో పైడికొండల సుబ్బయ్య మేయర్ గా విజయం సాధించారు.
Pharamond బెజవాడ బాపనయ్యనాయుడు, సిదరాల సన్యాసయ్య, కసిరెడ్డి
బ్రహ్మానందం, వర్ధినీడి కొండలనాయుడు, సమతం వెంకటసుబ్బారాయుడు, అబ్దుల్
రెహ్మాన్Kerjean Theophile లు మెంబర్లు గా ఎన్నికయ్యారు. బెజవాడ బాపనయ్యనాయుడు 1885 లో మేయరు పదవిని తిరిగి దక్కించుకొన్నారు. పైడికొండల సుబ్బయ్య 1886 లో చనిపోవటాన్ని బట్టి ఆయన బహుసా అనారోగ్యకారణాల వల్ల 1885లోనే మేయరు పదవినుంచి వైదొలగి ఉండవచ్చు. బెజవాడ బాపనయ్యనాయుడు కౌన్సిల్ లో
విజే (చెళ్ళపిల్ల వారు తాను యానాంలో
చదువుకొనేటపుడు, విజే అనే ఒక టీచర్ ఉండేవారు అని
చెప్పింది వీరి గురించే) కాళ్ళ రాయపురాజు
అనే ఇద్దరు కొత్త మెంబర్లు చేరారు.
సమతం వెంకటసుబ్బారాయుడు 1886 లో కొంతకాలం మేయర్ పదవి అధిష్టించారు.
వీరినుంచి మరలా బెజవాడ బాపనయ్యనాయుడు అదే సంవత్సరంలోనే
మేయర్ పదవిని స్వీకరించి 1890 డిశంబరు 19 న జరిగిన స్థానిక కౌన్సిల్ కు మొదటి మెంబరుగా
ఎన్నికయ్యేవరకూ కొనసాగారు. ఈ ఎన్నికలలో ఆనాటి యానాం మొత్తం ఓటర్లు 1103 లో 715 మంది తమ ఓటు
హక్కును వినియోగించుకొన్నారు. బెజవాడ
బాపనయ్య 429 ఓట్లను సంపాదించుకొని విజయం సాధించారు. ఇదే ఎలక్షన్లలో పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు
కూడా విజయం సాధించి రెండవమెంబరు స్థానాన్ని కైవశంచేసుకొన్నారు.
1891 లో జరిగిన ఎలక్షన్లలో కోన నరసయ్య మేయరు గా, పుణ్యమూర్తుల వెంకటసుబ్బారాయుడు, బెజవాడ బాపనయ్యనాయుడు, కాళ్ల
రాయపురాజు, సమతం కృష్ణయ్య, వెలగలపూడి లింగయ్య, కాపగంటి
చినసారయ్య, కూనపురెడ్డి కృష్ణ, గిరి సుబ్బారాయుడు, సాత్తార్
సాహెబ్,
వంకాయల వీరన్న, వంటెద్దు
వెంకటస్వామి లు మెంబర్లుగాను ఎన్నికయ్యారు.
వీరిలో కూనపురెడ్డి కృష్ణమ, సత్తర్ సాహెబ్ లు గతించటం వలన మరియు వంకాయల వీరన్న రాజీనామా చేయటంతో ఖాళీలను
బర్తీచేయటానికి 1892, డిశంబరు 4 న మధ్యంతర ఎన్నికలు జరిగాయి. మొత్తం 1115 ఓటర్లకు గాను 382 మంది మాత్రమే
ఓటుహక్కు వినియోగించుకోవటం గమనార్హం.
కొల్లూరి భీమయ్య, కశిరెడ్డి వెంకయ్య, బళ్ళ లక్ష్మయ్య లు కొత్త మెంబర్లుగా ఎన్నికయ్యారు.
1894 లో బెజవాడ బాపనయ్య నాయుడు మేయర్ పదవి దక్కించుకొని చాలాకాలం కొనసాగారు. 1899 ఎలక్షన్లలో బెజవాడ బాపనయ్యనాయుడు తన మేయర్ పదవిని నిలబెట్టుకొన్నారు.
1903నాటి యానాం మున్సిపల్ కౌన్సిల్ కు మేయరుగా బెజవాడ బాపనయ్య
నాయుడు,
సమతం వెంకట సుబ్బారాయుడు, కోన సత్తియ్య, ఇబ్రహిం ఖాన్, కాపగంటి సత్తిరాజు, కూనపురెడ్డి
సుబ్బారాయుడు, కోన కృష్ణ, బళ్ళా వెంకట రత్నం, పుణ్యమూర్తుల
వెంకట సుబ్బారాయుడు, వంటెద్దు వెంకట
స్వామి లు మెంబర్లుగాను ఉన్నారు.
1912 లో అప్పటి మేయరయిన సమతం వెంకటసుబ్బారాయుడు
అనారోగ్యకారణాలతో పదవినుండి వైదొలగడంతో ఆయన కుమారుడు సమతం లక్ష్మీనర్సయ్య మేయర్
పదవిని పొందారు.
బెజవాడ బాపనయ్యనాయుడు 1914 లో తాను చనిపోయేవరకూ యానాం కౌన్సిల్ మెంబరుగా కొనసాగారు. ఆయన మరణంతో వారి
కుమార్డు బెజవాడ వెంకటరెడ్డి రాజకీయాలలో ప్రవేశించారు. వీరు పిన్నవయసులో చనిపోవటంచే వీరి కుమారుడు
బెజవాడ బాపన్నాయుడు (తాత గారి పేరు) ప్రవేశించి 1922 లో మున్సిపల్ మెంబరుగా ఎన్నికయ్యారు.
1922 లో కామిశెట్టి అయ్యప్పనాయుడు మేయరు పదవి
దక్కించుకొన్నారు. 1881 నుంచి కామిశెట్టి
పేరమనాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వీరి కుమార్డు కామిశెట్టి
వేణుగోపాలరావునాయుడు 1922 ఎలక్షన్లలో స్థానిక
మండలి మెంబరుగా ఎన్నికయ్యారు.
1925 లో కాపగంటి మంగయ్య, ఇబ్రహిం ఖాన్, కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు, కాళ్ళ వెంకటరత్నం లు స్థానిక మండలి మెంబర్లుగా
ఉన్నారు. ఇదే సమయంలో బెజవాడ బాపన్నాయుడు
మున్సిపల్ మేయర్ గాను, కొత్త వెంకటరత్నం, మాజేటి సోమరాజు, కాపగంటి
సత్తిరాజు, సమతం లక్ష్మీనరసయ్య, గిరిమాధవరావు, దవులూరి
చినవీరాస్వామి, కనకాల బ్రాహ్మడు, కోన వెంకటరాజు, ఉడతా
రెడ్డినాయుడు, సాదనాల వెంకన్నలు మెంబర్లుగాను
ఉన్నారు.
1925 ఎన్నికలలో పరాజయం పాలయిన అభ్యర్ధులలో కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు, ఎర్రా జగన్నాథరావు, వెలగలపూడి
వీరయ్య,
మహమ్మద్ ఉస్మాన్, నాగసూరి
కామరాజు,
కనకాల చిన నరసయ్య, తిక్కిరెడ్డి
సత్యానందం తదితరులు ఉన్నారు. 1930 లో మహమ్మద్
ఉస్మాన్ స్థానంలో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు వచ్చి చేరారు.
పాండిచేరి నాయకులకు యానాం నాయకులకు మధ్య సత్సంబంధాలు
ఉండేవి. 1928 లో బెజవాడ బాపన్నాయుడు పాండిచేరి కి చెందిన సెల్వరాజు
చెట్టియార్ ను యానాం నుంచి పోటీ చేయించి, గెలిపించి
పాండిచేరి కౌన్సిల్ కు పంపించటం జరిగింది.
1931 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కామిశెట్టి వేణుగోపాలరావు
నాయుడు మేయర్ పదవిని దక్కించుకొన్నారు.
తోట రామన్న, నాగసూరి వెంకటరాజు, చిక్కాల సీతయ్య, తిక్కిరెడ్డి సత్యానందం, షేక్ అహ్మద్, కొమ్మిరెడ్డి రామన్న, కొత్త వెంకట
రత్నం,
బెజవాడ బాపన్నాయుడు, కనకాల
బ్రాహ్మడు, కోన వెంకట రాజులు విజయం సాధించారు.
1934 లో మరలా జరిగిన ఎన్నికలలో కామిశెట్టి వేణుగోపాలరావునాయుడు
బృందం ఘనవిజయం సాధించింది. బెజవాడ
బాపన్నాయుడుకు కుడిభుజమైన సమతం లక్ష్మీనరసయ్య 1933 లో మరణించటంతో ఆయన ఒంటరిపోరు సలపవలసి వచ్చింది. ఈ ఎలక్షన్లలో తోట నరసింహస్వామి, కోన సుబ్బారావు, చింతా
బ్రహ్మానందం, చిక్కాల సూర్యనారాయణ, కామిరెడ్డి వెంకటస్వామి, కుంచం రావి
వంటి కొత్త నాయకులు మున్సిపల్ మెంబర్లుగా తెరపైకి వచ్చారు.
ప్రతిపక్షాల ఐక్యత
1931 నుంచి కామిశెట్టి వేణుగోపాలరావునాయుడు వర్గం రాజకీయంగా
రోజు రోజుకూ బలపడుతూండటంతో, ప్రతిపక్షాలు ఒకానొక
దశలో ఏమీచేయలేక నిస్సహాయులైపోవలసి వచ్చింది. రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. అధికారాన్ని అనుభవిస్తున్న కామిశెట్టి
ఈ సమయంలో అనేక ఆరోపణలను ఎదుర్కోవలసివచ్చింది.
అంతవరకూ బెజవాడ వర్గంలో ప్రధాన పాత్రవహించిన తోట రామన్న వంటి వారు
కామిశెట్టి పక్షాన చేరిపోయారు. 1935 లో జరిగిన కౌన్సిల్
ఎన్నికలలో బెజవాడ వర్గం తరపున పోటీ చేసిన మద్దింశెట్టి సత్యనారాయణ (ఫ్రెంచి టీచరు)
అయిదు ఓట్లు మాత్రమే పొందగలిగారు. బెజవాడ
బాపన్నాయుడు కూడా ఈ ఎన్నికలలో పోటీచేయగా ఆయనకు కూడా అయిదు ఓట్లు మాత్రమే రావటం, ఆయన ప్రత్యర్ధికి 587 ఓట్లు రావటం అనేది కామిశెట్టి వర్గం ఆధిపత్యాన్ని తెలియచేస్తుంది. ఈ
ఎన్నికలలో భారీస్థాయిలో రిగ్గింగు జరిగిందని బెజవాడ బాపన్నాయుడు వేసిన కోర్టు కేసు
కొట్టివేయబడిరది.
ఈ సమయంలో కామిశెట్టి వ్యతిరేక వర్గం చేతులుముడుచుకొని
కూర్చోక అధికార పక్షం కనుసన్నల్లో జరిగే అనేక అవకతవకలను ప్రభుత్వం దృష్టికి
తీసుకువచ్చేది.
అప్పటికి 17 నెలలుగా వెల్ఫేర్
కమిటీ నెల నెలా ఇచ్చే ప్రభుత్వ పించనులను
పంపిణీ చేయటం లేదని ఆ సొమ్ము స్వాహా అయిపోతున్నదని, పించనులు అందక లబ్దిదారులు బిక్షాటన చేసుకొంటున్నారని, కొంతమంది ఆకలితో చచ్చిపోయారంటూ` ప్రతిపక్షం పాండిచేరీకి పిర్యాదులు చేసింది.
అప్పటి యానాం అడ్మినిస్ట్రేటరు అయిన జీవరత్నం, కామిశెట్టికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షానికి చెందిన వారిపై
అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని బెజవాడ వర్గం ఆరోపించింది. బెజవాడ
అనుచరుడైన దున్నా కమలనాభం ఇంటిపై కామిశెట్టి వర్గానికి చెందిన వారు దాడిచేసి
ఆయనను,
కుటుంబసభ్యులను గాయపరచారని తెలిపారు.
కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడుకి ఫ్రెంచి రాదు కనుక ఆయన
మేయర్ పదవికి అనర్హుడంటూ కోర్టులో కేసు వేయటం జరిగింది.
కామిశెట్టి ఆర్ధిక పరిస్థితి అంత బాగాలేని కారణంగా (453 రూపాయిల బాకీ చెల్లించని కారణంగా ఇంటిలోని వస్తువులను
జప్తు చేయటం జరిగింది) పదివేల రూపాయిల మున్సిపల్ బడ్జెట్టును నిర్వహించే అర్హత
అతనికి లేదని కూడా పిర్యాదు చేసారు.
యానాం నుంచి పదే పదే వస్తున్న పిర్యాదుల నేపధ్యంలో, విచారణ జరపమని పాండిచేరీ కోర్టు జడ్జి వీతీ. Mr. Philippon, ఇన్స్పెక్టర్ బసవా
సుబ్బారాయుడు లను ఫ్రెంచి ప్రభుత్వం
నియమించి డిశంబరు 1933 లో యానాం
పంపించింది. వీరి విచారణలో ఈ అవకతవకలకు, ఘర్షణలకు
కారణం అడ్మినిస్ట్రేటర్ జీవరత్నమని తేల్చటంతో, జీవరత్నాన్ని
బదిలీచేసి కొమరన్ ను యానాం అడ్మినిస్ట్రేటర్గా నియమించటం జరిగింది.
ఇలాంటి ఉద్రిక్త రాజకీయపరిస్థితుల నడుమ జనవరి 1935 లో ఫ్రెంచి
గవర్నరు యానాం పర్యటనకు వచ్చారు. ఆయన గౌరవార్ధం మేయర్ హోదాలో కామిశెట్టి ఇచ్చిన
విందుకు,
బెజవాడ వర్గానికి చెందిన కౌన్సిల్ మెంబర్లను ఎవరినీ
ఆహ్వానించలేదు. దీనికి ప్రతిచర్యగా బెజవాడ బాపన్నాయుడు తన ఇంటివద్ద ఒక రీడిరగ్ రూమ్ శంఖుస్థాపన కొరకు గవర్నరుగారిని
ఆహ్వానించి ఆయననే తన ఇంటికి రప్పించుకొన్నారు. కామిశెట్టితో విభేదించి బయటకు
వచ్చేసిన యర్రా జగన్నాధరావు, గవర్నరుగారిని కలసి
మేయరు పాలనలో జరుగుతున్న అవకతవకల గురించి పిర్యాదు చేసారు.
ఇదే సమయంలో యర్రా జగన్నాధరావు ఆధ్వర్యంలో ఒక గొప్ప విందు
జరిగింది. కామిశెట్టి వ్యతిరేక వర్గం
చేసిన ఒక రకమైన బలప్రదర్శనగా ఈ విందు నిలచింది.
దీనికి యానానికి చెందిన అనేకమంది ఆనాటి ప్రముఖులు హాజరయ్యారు. అలా హాజరయిన
వారిలో `
బెజవాడ బాపనయ్య, ఇబ్రహిం ఖాన్, కాపగంటి
సత్తిరాజు, నల్లం సుబ్బారావు, మహేంద్రవాడ వీరగణపతి శాస్త్రులు, కశిరెడ్డి వెంకటరామయ్య, దవులూరి చిన
వీరాస్వామి, దున్నా కమలనాభం, సమతం గోపాలం, పంపన
వీరాస్వామి, నల్లం సత్యనారాయణ, మద్దింశెట్టి సత్తిరాజు, దవులూరి
రాజారావు,
గల్లా శ్రీనివాసులు, మొహమ్మద్
ఉస్మాన్,
తోట నరశింహస్వామి, గిరి
మాధవరావునాయుడు, దవులూరి వెంకటరాజు, మొహమ్మద్ జిక్రియా, మలిపెద్ది
అంకయ్య,
గిరి లక్ష్మినారాయణ, మద్దింశెట్టి
సత్యనారాయణ మూర్తి, మద్దింశెట్టి బాపన్న
తదితరులు ఉన్నారు. (ఇరవయ్యవ శతాబ్దంలో ఫ్రెంచియానాంలో పేర్గాంచిన వ్యక్తులను
గూర్చి తెలుసుకొటానికి ఉపయోగ పడుతుందని మొత్తం లిస్టు ఇవ్వటం జరిగింది` రచయత)
యానాం రాజకీయచిత్రాన్ని మార్చివేసిన కలయిక
ఆనాటి యానాం నాయకులు పాండిచేరీలో ప్రధాన పాత్రవహించే
కూటములకు మద్దతు పలికేవారు. ఆ విధంగా బెజవాడ బాపన్నాయుడు వర్గం పాండిచేరీలోని
సెల్వరాజు చెట్టియార్ పక్షానికి మద్దతు ఇచ్చేది.
ఒకానొక సందర్భంలో సెల్వరాజు ను యానాంనుంచి గెలిపించటం కూడా జరిగింది. కామిశెట్టి వర్గం పాండిచేరీలోని జోసఫ్ డేవిడ్
పక్షాన నిలచేది. అలా యానాంలోని రెండు వర్గాలకు వారివారి గాడ్ఫాదర్ల
ఆశీస్సులు, అండదండలు ఉండేవి. 1936 లో పాండిచేరిలో రాజకీయాలలో జరిగిన
నాటకీయపరిణామాల వల్ల సెల్వరాజ చెట్టియార్, జోసఫ్
డేవిడ్ లు ఒకటైపోయారు. అందుచేత దాదాపు
అరవై సంవత్సరాలుగా రెండు వర్గాలుగా విడిపోయి యానాం రాజకీయాల్ని నిర్ధేశిస్తూ ఉన్న
బెజవాడ,
కామిశెట్టి లు కలిసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడిరది.
ఆ విధంగా వీరిరువురూ కలిసి 1937 ఎలక్షన్లలో పోటీ చేసి విజయకేతనం ఎగరేసారు.
వీరికి ప్రతిపక్షంగా ఎర్రా జగన్నాధరావు, తోట
నరసింహమూర్తి, సమతం కృష్ణయ్య, నాగసూరి వెంకటరాజులు పనిచేసారు.
భిన్న పక్షాలు చేరి కూటమి కట్టినపుడు, ఒక దానిని మరొకటి మింగివేయటమనేది రాజకీయాలలో ఒక
సహజపరిణామం. కామిశెట్టి వర్గం యానాం
రాజకీయాలలో ఆ తరువాత కాలంలో మరో అర్ధశతాబ్దం పాటు ఏక ఛత్రాధిపత్యంగా కొనసాగటం ఆ మాటను నిజం చేసింది.
మున్సిపల్ కమిషన్ పాలన
1937 ఎలక్షన్లలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావటంతో, ఫ్రెంచి ప్రభుత్వం 1938 లో ఈ ఎన్నికలను రద్దు చేసి, మున్సిపల్ కౌన్సిల్
స్థానంలో మున్సిపల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షునిగా మారిపళన్
ను,
ఉపాధ్యక్ష్యునిగా
ఎర్రా జగన్నాథరావును నియమించింది. ఈ కమిషన్ మెంబర్లు గా కోన వెంకటరాజు, మలిపెద్ది అంకయ్య, కామిశెట్టి
అయ్యప్పనాయుడు, శింగంశెట్టి కామరాజు లు
వ్యవహరించారు. కొంత కాలానికి శింగంశెట్టి
కామరాజు స్థానంలో ఉడతా సాంబశివరావు నియమితులయ్యారు. 1938 నుంచి 1946 లో మున్సిపల్
ఎన్నికలు జరిగే వరకూ యానాం మున్సిపల్ పరిపాలనా వ్యవహారాలను ఈ మున్సిపల్ కమిషనే
చూసింది.
మరలా ఎన్నికలు
ఫ్రెంచి ఇండియా ఎన్నికలకు రెండు రకాల వోటరు జాబితాలు
ఉండేవి. ఒకటి ఫ్రెంచి దేశస్థులకొరకు మరొకటి భారతీయుల కొరకు. 1946 లో జరిగిన ఎన్నికలకు ఈ పద్దతికి స్వస్థి పలికి మొత్తం
ఓటర్లందరినీ ఒకే జాబితా క్రిందకు తీసుకువచ్చారు. (యానాంలో ఫ్రెంచి దేశస్థుల సంఖ్య
తక్కువగా ఉండటం వల్ల వారికోసం ప్రత్యేక జాబితా తయారుచేయటం 1899 లోనే నిలిపివేసారు). 1946 జూన్ 23 న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో
ఎర్రా జగన్నాధరావు మేయరుగా ఎన్నికయ్యారు. వీరి పానెల్లో గిరి మాధవరావు, అబ్దుల్ వహీద్ ఖాన్, దవులూరి
వెంకటరాజు, తోట వెంకట వేణుగోపాలరావు, కాపగంటి సూర్యప్రకాశ రావు, నాటి చినవెంకన్న కామిశెట్టి
భాష్యకారులు నాయుడు తదితరులు ఉన్నారు. వీరికి ప్రత్యర్ధులుగా కసిరెడ్డి
బ్రహ్మానందం, కామిశెట్టి పరశురామరావు నాయుడు, మద్దింశెట్టి సత్యానందం, కాపగంటి
బులిమంగరాజు, గుర్రపు వెంకటరత్నం, రొక్కం వెంకటరెడ్డి వంటి ప్రముఖులు ఉండేవారు.
ఈ ఎలక్షన్లలో పోటీచేసి విజయం సాధించిన కామిశెట్టి పరశురాంకు
25 సంవత్సరములు నిండని కారణంగా ఆయన ఎన్నికను యానాం కోర్డు
రద్దు చేసింది. అదే విధంగా మద్దింశెట్టి
సత్యానందం పేరు ఓటర్ల లిస్టులో లేని కారణంగా ఆయన ఎన్నిక కూడా చెల్లదని
తీర్పుచెప్పింది. ఇవే కాక ఈ ఎన్నికలలో
అనేక అవకతవకలు జరిగినట్లు నిరూపణ కావటంతో, 1946 ఆగస్టు 12 నాటి ఈ ఎన్నికలను రద్దు పరుస్తూ
యానాం కోర్టు తీర్పు చెప్పింది.
1948 లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో కామిశెట్టి పరశురాం బృందం
విజయం సాధించి, ఆయన మేయర్ పదవి
దక్కించుకొన్నారు. చింతా బ్రహ్మానందం, ఉడతా సాంబశివరావు, కాపగంటి
బులిమంగరాజు, వెలగలపూడి వీరయ్య, అబ్దుల్ వహీద్ ఖాన్, కోటి సత్యం, మోకా మహలక్ష్మి, రొక్కం
వెంకటరెడ్డి, కోన నరసయ్య, కనకాల తాతయ్య,
యర్రా సత్యనారాయణమూర్తి లు (యర్రా జగన్నాథరావు కుమార్డు) మెంబర్లు గా నెగ్గారు.
యానాం రాజకీయ చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి, ఎందుకంటే, ఈ ఎన్నికలు
ప్రధానంగా ఫ్రెంచి అనుకూల, వ్యతిరేక వర్గాల
మధ్య జరిగాయి. కామిశెట్టి వర్గం ఫ్రెంచి
అనుకూల ధోరణి కలిగిన రిపబ్లిక్ పార్టీ తరపున, యర్రా వర్గం
ఫ్రెంచి వ్యతిరేక ధోరణి కలిగిన ప్రజా పార్టీ తరపున పోటీ చేసింది. వీటిలో కామిశెట్టి వర్గం అఖండ విజయం సాధించటంతో
యానాం ప్రజలందరూ ఫ్రెంచి పాలనకు అనుకూలమని ఫ్రెంచి ప్రభుత్వం తలచింది. ఈ ఎలక్షన్లలో భారీఎత్తున రిగ్గింగు జరిగిందన్న
ఆరోపణల కారణంగా ప్రభుత్వం ఈ ఎన్నికలను కూడా రద్దు చేసింది.
అంతర్జాతీయ పరిశీలనా బృందం`యానాం పర్యటన
బ్రిటిష్ వారు భారతదేశం నుండి నిష్క్రమించటంతో ఫ్రెంచి
వారిపై ఒత్తిడి పెరిగింది. వీరు కూడా
భారతదేశాన్ని విడిచిపెట్టి వెళిపోవాలన్న డిమాండ్ ప్రాధాన్యత సంతరించుకొంది. మరో
వర్గం ఫ్రెంచి వారికి అనుకూలంగా ఉంటూ వారు భారతదేశం నుండి వైదొలగరాదని కోరేది. ఇలాంటి పరిస్థితుల నడుమ 1947 లో ఫ్రెంచి ప్రభుత్వం తన కాలనీలకు, సముద్రానికి ఆవలనున్న ఫ్రాన్స్ యొక్క భూభాగం అనే అర్ధం
వచ్చెలా ‘ఫ్రెంచి ఓవర్ సీస్ టెరిటరీస్’
అని నామకరణం చేసింది. ఇలా చేయటం ద్వారా ఈ కాలనీలన్నీ ఫ్రాన్స్
అంతర్భాగాలని ప్రపంచానికి చెప్పటానికి ప్రయత్నించింది. ఫ్రెంచి కాలనీలు భారతదేశంలో
విలీనం కావాలంటే 1948 లో చేసుకొన్న భారత్`ఫ్రెంచి ఒప్పందం ప్రకారం ప్రజలందరూ పాల్గొనే సాధారణ ఎన్నికల
ద్వారా ‘రిఫరెండం’ జరగాలి. ఇట్టి రిఫరెండపు ఎన్నికలలో ఎప్పటిలానే రిగ్గింగులు, బెదిరింపులు ఉన్నట్లయితే ఆ విధంగా వచ్చే ఫలితం
ఫ్రెంచివారికి అనుకూలంగా ఉండవచ్చుననే అనుమానాలు తలెత్తాయి. అందువల్ల రిఫరెండం
జరపటానికి తగిన పరిస్థితులు ఈ ఫ్రెంచికాలనీలలో లేవని భారత్ అంతర్జాతీయంగా తన
నిరసనను తెలియచేసింది.
భారతదేశంలో ఫ్రెంచికాలనీలలో రిఫరెండం జరపటానికి తగిన
పరిస్థితులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని అధ్యయనం చేయటానికి 5 సభ్యులున్న అంతర్జాతీయ బృందం మార్చి 1951 లో పాండిచేరీలో అడుగు పెట్టింది. భారతదేశం ఈ బృందానికి
అభ్యంతరం చెప్పకపోయినా ఈ బృందం ఇచ్చే రిపోర్టుకు కట్టుపడనని ముందే చెప్పేసింది. ఈ
బృందంలో ఒకరైన ఆండ్రసన్ ఏప్రిల్ లో రెండురోజులపాటు యానాంలో బసచేసి విచారణ
చేపట్టాడు. ఈయన కామిశెట్టి, మద్దింశెట్టి, గిరి మాధవరావునాయుడు, దవుళూరి
వెంకటరాజు, మహమ్మద్ జిక్రియా వంటి వారితో భేటీ
అయి యానాం ఆర్ధిక రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకొన్నాడు. 1948 ఎన్నికల సమయంలో జరిగిన అవకతవకల గురించి సమాచారం అడిగి
తెలుసుకొన్నాడు. యానాన్ని భారతావనిలో
విలీనం చేయాలని పోరాడుతున్న దడాల రఫేల్ రమణయ్య ఆండ్రసన్ ను కలిసి మెమొరాండం
సమర్పించారు.
యానాం చాలా ప్రశాంతంగా ఉందనీ, ఇక్కడి ప్రజలలో, అణగారిన వర్గాలకు
చెందిన కొంతమంది వ్యక్తులు తప్ప మిగిలిన పురప్రముఖులందరూ ఫ్రెంచి పాలన ఉండాలని
కోరుకొంటున్నారని ఆండ్రసన్ తన తన రిపోర్టులో పేర్కొన్నాడు. భారతదేశంలో రిఫరెండం జరిపే పరిస్థితులు లేవని ఈ
బృందం రిపోర్టు ఇచ్చింది.
యానాం మొదటి దళిత మేయరు
శ్రీ పాము రామమూర్తి గారు రచించిన ‘తూర్పుగోదావరి జిల్లా
ఆది ఆంధ్రప్రముఖుల జీవితచరిత్రలు’ అనే పుస్తకములో శ్రీ గుర్రపు వెంకటరత్నం గురించి
ఈ క్రింది విధంగా ఉంది.
//శ్రీ గుర్రపు వెంకటరత్నం గారు శ్రీ గుర్రపు సత్తెయ్యగారి కనిష్టపుత్రులు. యానాం పురపాలక సంఘ ఎన్నికలలో వీరు తొమ్మిది సంవత్సరములు జయము పొందినారు. ఒక ఎన్నికలో పాల్గొన్న ఇరుపార్టీలందును సమానముగా సభ్యులు ఎన్నికైరి. ప్రభుత్వ పద్దతి ప్రకారము అత్యధిక వోట్లు సంపాదించిన సభ్యుని మేయరుగా నిర్ణయించవలసి యున్నది. అట్టి నిబంధనల ననుసరించి వెంకటరత్నం గారు యానాం మేయరు పదవిని నలంకరించినారు//
పై వివరణలో ఏ సంవత్సరములో ఆ సంఘటన జరిగిందో, ఎంతకాలం వారు మేయరుగా పనిచేసారో వంటి వివరాలు
తెలియరావు. Journal officiel de l'Inde française అనే పేరుగల ఆనాటి ఫ్రెంచి ప్రభుత్వ పత్రిక యొక్క
1881 నుంచి 1943 వరకూ లభ్యంలోఉన్న
కాపీలలో ఈ సంఘటన ప్రస్థావన లేకపోవటాన్ని బట్టి ఇది బహుశా ఆ తరువాత కాలంలో జరిగి
ఉండొచ్చని భావించాలి. (పై పత్రికలను http://gallica.bnf.fr/
అనే వెబ్ సైటులో
చదువుకొనవచ్చును) 1930 లలో యానాంకు చెందిన
శ్రీ వెంకటరత్నం గారు ఫ్రెంచి ప్రభుత్వంచే మేయరుగా కొంతకాలం
నియమించబడ్డట్లు స్థానికులు చెపుతారు. ఎలా చూసినా శ్రీగుర్రపు వెంకటరత్నం గారు
ప్రజలచే ఎన్నుకోబడిన మొదటి దళిత మేయరు అన్న విషయం సుస్ఫష్టం.
కొన్ని విచిత్రమైన ఎన్నికలు
1900 సెప్టెంబరులో జరిగిన స్థానిక కౌన్సిల్ కు ఇద్దరు
సభ్యులకొరకు ఎన్నికలు జరిగాయి. ఓటరు
లిస్టులో ఓటర్ల సంఖ్య 859. వారిలో 288 మంది ఓట్
చేసారు. అలా బెజవాడ బాపనయ్య 288 ఓట్లతోను, సమతం కృష్ణమనాయుడు
కూడా 288 ఓట్లను పొంది విజేతలుగా నిలిచారు. ఓటు హక్కును వినియోగించుకొన్నవారు 288 మంది.
నెగ్గినవారికి సరిగ్గా 288 ఓట్లు మాత్రమే
రావటం వైష్ణవమాయగా అనిపించకమానదు. ఒక వేళ
ఇద్దరు అభ్యర్ధులు మాత్రమే పోటీ చేసారనుకొన్నా ఇద్దరికీ సమానంగా ఓట్లు రావటం కూడా
విడ్డూరమే!
1901 మే లో స్థానిక మండలికి
ఒక అభ్యర్ధి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక వివరాలను చూస్తే ఇవసలు ఎన్నికలా లేక
ఏకగ్రీవ ఎన్నికా అనేది అర్ధంకాదు. మొత్తం 847 ఓటర్లు కాగా వారిలో 430 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎంతమంది పోటీ చేసారో తెలియరాదు కానీ, సమతం లక్ష్మీనరసయ్య 429 ఓట్లతో పొంది విజయం సాధించినట్లు మాత్రమే రికార్డులు చెపుతున్నాయి. నెగ్గిన
అభ్యర్థికి తగ్గిన ఒక ఓటు చెల్లని ఓటు అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలలో
చెల్లని ఓట్లేమీ లేవట! బహుసా ఆ ఒక్క ఓటు
ఈయన పోటీ అభ్యర్ధికి పడిఉండాలి. అది ఆయన ఓటేమో పాపం!
అప్పట్లో ఎన్నికల లో జరిగే అవకతవకలను వైరి వర్గాలు
డేగకళ్ళతో వీక్షించేవారు. ఏ చిన్న లొసుగు ఉన్నా కోర్టును ఆశ్రయించేవారు. ప్రతీ ఎన్నిక అనంతరం తప్పనిసరిగా కోర్టు కేసులు
నడిచేవి. చాలా కేసులు కొట్టివేయబడినా కొన్ని నెగ్గిన సందర్భాలు కూడా
లేకపోలేదు.
ఫ్రెంచి ప్రభుత్వం జరిపిన చివరి ఎన్నికలు
1951 లో నిర్వహించిన ఎన్నికలే ఫ్రెంచి ప్రభుత్వం నిర్వహించిన
ఆఖరు ఎన్నికలు. భారతదేశంలో ఫ్రెంచి పాలన
కొనసాగాలా వద్దా అని నిర్ణయించటానికి జరిపిన ఎన్నికలు ఇవి. 1948 లో యానాం ఓటర్ల సంఖ్య
1200 లు ఉండగా ఈ ఎలక్షన్లకు ఆ సంఖ్య 1662 కు పెరిగింది. ఈ
ఎలక్షన్లలో కామిశెట్టి పరశురాం, యర్రాలు కలిసి
మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య లకు
వ్యతిరేకంగా పోటీ చేసారు.
ఈ ఎలక్షన్లలో కామిశెట్టి, యర్రాల వర్గం ఓడిపోయింది. మద్దింశెట్టి, కనకాల తాతయ్యలు విజయం సాధించారు.
వీరిలో మద్దింశెట్టి మేయర్ పదవి చేపట్టారు. ఈ ఎలక్షన్లలో నెగ్గిన మెంబర్లు వరుసగా, మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి వెంకటరాజారావు, గిరి
మాధవరావు నాయుడు, నాటి చినవెంకన్న, కశిరెడ్డి బ్రహ్మానందం, కోన నరసయ్య, సమతం కృష్ణయ్య, పంపన
వీరాస్వామి, గుర్రపు వెంకటరత్నం, జ్ఞానవేల్ నాచియప్పన్ మొదలగువారు.
1947 లో బ్రిటిష్ వారు ఇండియా విడిచిపోవటంతో ఫ్రెంచి కాలనీలలో
కూడా జాతీయభావనలు బలపడ్డాయి. తదనంతరం
జరిగిన అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఈ ఎన్నికలలో నెగ్గిన మద్దింశెట్టి సత్యానందం, కనకాల తాతయ్య, దవులూరి
వెంకటరాజారావు, నాటి చినవెంకన్న మరియు కశిరెడ్డి
బ్రహ్మానందం తదితరులు, అక్టోబరు 18, 1954 న పాండిచేరీ వద్ద కల కీళూరు లో జరిగిన అభిప్రాయసేకరణ లో యానాం తరపున
పాల్గొని ` ఫ్రెంచి కాలనీలను భారతదేశంలో విలీనం
చేయాలని ఓట్ చేసారు. ఆ విధంగా యానాంలోని
ఫ్రెంచి పాలనకు చరమ గీతం పాడబడిరది.
భిన్న రాజకీయ వర్గాలు - వివిధ దశలు
యానాం చిన్నప్రాంతం అవ్వటం, అప్పటి నాయకులు కూడా ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవ్వటం వలన చాలా
సందర్భాలలో నెగ్గిన, ఓడిపోయిన పక్షాల
వారి మధ్య ఏదో విధమైన చుట్టరికాలు ఉండేవి.
అంతేకాక ఎన్నికలలో ఏ పానెల్ పై పోటీ చేసినప్పటికీ అవి ముగిసాక మేయర్
ఎన్నిక సమయంలో నెగ్గిన అభ్యర్ధుల రాజకీయ
పునర్వవస్థీకరణ జరిగేది. ఆ కారణంగా యానాం
రాజకీయపరంగా రెండు వర్గాలుగా స్థిరీకరణ జరగలేదు.
అయనప్పటికీ యానాం రాజకీయ చిత్రాన్ని మూడు దశలుగా గుర్తించవచ్చును.
మొదటి దశలో బెజవాడ బాపనయ్య, కంతేటి సత్యప్రసన్నం, సమతం
వెంకటసుబ్బారాయుడు, పుణ్యమూర్తుల వెంకట
సుబ్బారాయుడులు ఒక వర్గంగాను ` పైడికొండల సుబ్బయ్య, కామిశెట్టి పేరమనాయుడు, ఫారమాండ్ లు
మరో వర్గం గా రాజకీయాలు నడచాయి. మొదటి
వర్గంలోని బెజవాడ బాపనయ్య, పుణ్యమూర్తుల వెంకట
సుబ్బారాయుడు, సమతం వెంకటసుబ్బారాయుడు ల స్థానాలలోకి
వారి వారసులుగా బెజవాడ వెంకటరెడ్డి (కొంతకాలం మాత్రమే), పుణ్యమూర్తుల శ్రీవెంకట రమణప్రసాదరావు, సమతం లక్ష్మినరసయ్యలు రంగప్రవేశం చేసారు. కామిశెట్టి పేరమనాయుడు స్థానంలో వారి
కుమారుడు వేణుగోపాలరావునాయుడు రంగప్రవేశం
చేసారు. ఈ మొదటి దశకు చెందిన నాయకులు 1880`1920 ల మధ్య యానాం రాజకీయాల్ని నడిపించారు.
రెండవ దశలో బెజవాడ వెంకటరెడ్డి కుమారుడు బెజవాడ బాపన్నాయుడు, కొత్త వెంకటరత్నం, కాపగంటి
చినమంగరాజు, సమతం లక్ష్మినరసయ్య, కనకాల బ్రాహ్మడు, బులుసు
సుబ్రహ్మణ్యశాస్త్రి, మహేంద్రవాడ గణపతి
శాస్త్రులు, కసిరెడ్డి గోపాలం, మలిపెద్ది అంకయ్య, దున్నా
కమలనాభం,
మద్దింశెట్టి సత్యనారాయణ, గిరి మాధవరావునాయుడు వంటి ప్రభృతులు ఒక వర్గం కాగా ` కామిశెట్టి వేణుగోపాల రావు నాయుడు, యర్రా జగన్నాథరావు (వీరు తరువాత కామిశెట్టితో విభేదించి
విడిపోయారు), నాగసూరి కామరాజు, తిక్కిరెడ్డి సత్యానందం, కొల్లాటి
రెడ్డినాయుడు, గ్రంధి లక్ష్మయ్య, నాగసూరి వెంకటరాజు, వెలగలపూడి
వీరయ్య,
కోన సుబ్బారావు, చింతా
బ్రహ్మానందం, కామిరెడ్డి వెంకటస్వామి, కూనపురెడ్డి సుబ్బారాయుడు, దనార్లకోట వెంకటరాజాచారి తదితరులు మరో వర్గంగాను ఉండేవారు. ఈ రెండవతరం నాయకుల హవా 1920`1950 ల మధ్య నడిచింది.
మూడవ దశ ఫ్రెంచి యానాం రాజకీయ చరిత్రలో అత్యంతకీలక
మైనది. 1948 లో జరిగిన ఎన్నికలు ఫ్రెంచి కాలనీల భవిష్యత్తు నిర్ణయించటానికి జరిగాయి. (ఈ
ఎలక్షన్లనాటి ప్రధాన, వైరిపక్షాల వివరాలు
ఇదే వ్యాసంలో చూడవచ్చును) 1951 ఎలక్షన్లలో నెగ్గిన నాయకులు అచంచల పోరాట ఫలితంగా యానాంలో ఫ్రెంచి పాలనకు
తెరపడిరది.
ముగింపు
యానాం నాయకులు ప్రారంభదశ నుండి పాండిచేరీ నాయకులతోనే తాము
మమేకమయ్యారు. అలా చేయటం ద్వారా యానానికి
మరింత మేలు చేయవచ్చునని వీరు భావించారు.
యానాం ఎన్నికలలో మొదట్లో ఉండిన ఫ్రెంచి దేశస్థుల ప్రాతినిధ్యం క్రమక్రమంగా
తగ్గిపోయింది.
1872 లో ఇక్కడ జరిగిన ఎన్నికలు భారతదేశంలోనే ప్రప్రథమంగా జరిగిన
ప్రజాస్వామ్యయుత సాధారణ ఎన్నికలు.
బ్రిటిష్ ఇండియాలో 1919 నుండి కౌన్సిల్
మెంబర్లను కొద్దిమంది ఉన్నత వర్గాల ప్రజలు మాత్రమే ఎన్నుకొనేవారు. సామాన్య ప్రజలకు
ఓటుహక్కు ఉండేదికాదు. బ్రిటిష్ ప్రభుత్వం 1935 లో చేసిన చట్టం ద్వారా ఎన్నికలలో సామాన్య ప్రజలందరికీ
ఓటుహక్కు కల్పించబడిరది. ఆ విధంగా డబ్బయి
లక్షలుండే ఓటర్ల లిస్టు మూడున్నర కోట్లకు చేరింది. కానీ ఫ్రెంచ్ ఇండియాలో 1871 లోనే 21 సంవత్సరములు నిండిన ఓటర్లందరికీ ఓటుహక్కు కల్పించబడిరది.
ఎన్నికల ప్రక్రియపై అవగాహన లేకపోవటం వల్ల యానాం మొదటి
ఎన్నికలలో 1394 మంది ఓటర్లకు 12 ఓట్లు మాత్రమే పోల్ అవ్వటం ఆశక్తిదాయకం.
ఎన్నికల తంతు ముగిసిన వెంటనే ఓడిపోయిన అభ్యర్ధులు
నెగ్గినవారి ఎన్నిక చెల్లదని కోర్టుకేసులు వెయ్యటం రివాజుగా ఉండేది. ఏవో రెండుమూడు కేసులను తప్ప దాదాపు అన్నిసార్లూ
ఆయా కేసులను యానాం కోర్టు కొట్టివేసింది.
యానాం ఎన్నికలలో దళితుల ప్రాతినిధ్యం ప్రారంభంలో లేకపోయినా
వారి ఉనికి నెమ్మది నెమ్మదిగా బయటపడిరది.
దున్నా కమలనాభం, గుర్రపు వెంకట రత్నం, మోకా మహలక్ష్మి, రొక్కం
వెంకటరెడ్డి, కమిడి వెంకట స్వామి వంటివారు
మెంబర్లుగా ఎన్నికయ్యారు. యానాన్ని
భారతావనిలో విలీనం చేయటంలో శ్రీ దడాల రఫేల్ రమణయ్య పాత్ర అనన్యమైనది. ఫ్రెంచి ఇండియా ఎన్నికలలో ముస్లిముల పాతినిధ్యం
కూడా సముచితంగానే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక బి.సి. లకు సంబంధించిన వివరాలే నిరాశను కలిగిస్తాయి. నాటి చినవెంకన్న, పంపన వీరాస్వామి, వెలగలపూడి వీరయ్య వంటివారు మాత్రమే మెంబర్లు గా ఎన్నికయ్యారు. ఏతావాతా ఫ్రెంచి పాలనలో బి.సి. లు రాజకీయంగా ఒక శక్తిగా ఎదగలేక పోయారన్నది ఒక చారిత్రక సత్యంగా మిగిలిపోయింది.
ఈ పుస్తకానికి అందమైన కవర్ పేజ్ నా బాల్యమిత్రుడు చిన్నారి డిజైన్ చేసాడు.
I still believe this is my work. No other book crossed it in my sweat and satisfaction. Its like my first love with history. :-)
బొల్లోజు బాబా
ఫిబ్రవరి, 2011