Friday, November 28, 2025

హరప్పానుంచి నేటివరకూ ..... ముందుమాట

పుస్తకం చదివి చాలామంది ఫోనులు, మెసేజులు చేసి అభినందిస్తున్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. ఈ పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది. థాంక్యూ ఆల్.
.
మనవి మాటలు

దేవానాం ప్రియుడు సమస్త (మత) శాఖల వారిని సన్యాసులైనా, గృహస్థులైనా, దానములు ఇచ్చి, ఇతర సత్కారములు చేసి గౌరవించుచున్నాడు. ఒక శాఖకు (మతానికి) చెందిన వ్యక్తులు అసందర్భంగా తమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖలను నిందించడం చేయరాదు. పరశాఖల వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన శాఖను అభివృద్ధి చేసుకోవటమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయ్యెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు. తన శాఖవారు, ఇతరశాఖలవారు ఒకరితో ఒకరు పొత్తు కలిగి ఉండడమే శ్రేయోదాయకము. సమస్త జనులకు ధర్మాభివృద్ధి ముఖ్యము. (అశోకుని XII వ శిలాశాసనం, BCE 256)

అశోకుని కాలంలో వైదికం, బౌద్ధం, జైనం, ఆజీవికం, చార్వాకం, శాక్తేయంవంటి భిన్న మతాలు (విశ్వాసాలు) ఉండేవి. ఇవికాక స్థానిక గిరిజన విశ్వాసాలు. ప్రజలు భిన్నమతాలపట్ల సహిష్ణుతతో మెలగటం, రాజ్యం అన్ని మతాలను సమాదరించటం మన ప్రాచీనభారతదేశపు జీవనవిధానం. ఈ దేశభిన్నత్వపు మూలాలు అక్కడివి. సెక్యులరిజం అనే భావన పుట్టిందే ఈ నేలపైన.

బౌద్ధం, జైనం, ఆజీవికం, చార్వాకం లాంటి మతాలు వెనుకకు మళ్లి వైదికమతం రూపం మార్చుకొని హిందూమతంగా ముందుకురావటం భారతదేశ మతాల చరిత్రలో ఒక మైలురాయి. ఇది సుమారు ఆరు ఏడు శతాబ్దాలలో ప్రారంభమై పదో శతాబ్దం నాటికి స్పష్టమైన రూపాన్ని తీసుకొంది.

హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ, కర్మ, మోక్షం, బహుదేవతారాధన, యజ్ఞయాగాదులు, వేదాలు ఉపనిషత్తులపై అంగీకారం, ద్విజుడే ఉత్తమమానవుడు లాంటి భావనలను జీవనవిధానంగా కలిగి ఉండటాన్ని హిందూమతంగా చెబుతారు. చారిత్రకంగా పాలకులు వేరేమతాలకు చెందినవారైనప్పటికీ హిందూమతం తన అస్తిత్వాన్ని నిలుపుకొని, భారతదేశం బహుళఅస్తిత్వ సమాహారంగా రూపుదిద్దుకొంది. భిన్న భాషలు, ఆరాధనలు, సంస్కృతులు, ఆహారపుటలవాట్ల ద్వారా వైవిధ్యమైన సమాజంగా నిలిచింది. ఈ బహుళత్వం ఈ దేశ భౌగోళిక వైవిధ్యం, ఎక్కడినుంచో దఫదఫాలుగా వచ్చి ఈ దేశప్రజలతో సాంస్కృతికంగా మమేకమైన వలసకారులవల్లా ఏర్పడింది.

స్వతంత్ర భారతదేశ నాయకులు భారతదేశ బహుళత్వాన్ని ప్రతిబింబించే భిన్న భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు, ఆహారపు అలవాట్లను గౌరవిస్తూ అన్ని సమాజవర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించే లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు.
***
డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ తన అసమాన ప్రతిభతో, తర్కంతో, సాక్ష్యాధారాలతో భారతదేశ చారిత్రక నెరేటివ్‌ను గొప్ప మలుపు తిప్పారు. ఆయన దృక్పథంతో సమకాలీన అంశాలను ఒక బహుజనవాదిగా పరిశీలించినపుడు అవి నాకు ఎలా కనిపించాయో, ఎలా అనిపించాయో విశ్లేషిస్తూ గత మూడు నాలుగేళ్ళు గా రాసిన వ్యాసాలు ఇవి. ఒకే అంశానికి భిన్న పెర్‌స్పెక్టివ్స్‌గా చూస్తాను వీటిని.

ఈ వ్యాసాలు పూర్తిగా అకడమిక్‌ ఆసక్తితో, స్వీయ అన్వేషణలో భాగంగా రాసినవి. ఆయా సందర్భాలకు సంబంధించిన రిఫరెన్సులను ఎక్కడికక్కడ ఇచ్చాను. అయినప్పటికీ నాకు తెలియని, నా దృష్టికి రాని అంశాలు ఎన్నో ఉండవచ్చునన్న ఎరుక, వినమ్రత నాకు ఎన్నడూ ఉంటుంది.

ఈ పుస్తకంలోని వివిధ వ్యాసాలు - హరప్పా నాగరికత నుండి సమకాలీన హిందూత్వ భావనల వరకు భారతదేశ మత వైవిధ్యాన్ని, మత విశ్వాసాల పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తాయి. ఆయా చారిత్రక కాలాల్లో ప్రజలు ఎదుర్కొన్న సామాజిక, సాంస్కృతిక సవాళ్లను చిత్రిస్తాయి. మత వైవిధ్యాన్ని, సాంస్కృతిక భిన్నత్వాన్ని వివిధ కాలాలలో ప్రజలు ఎలా కాపాడుకొంటూ వచ్చారో చెబుతాయి. ఈ ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్ళు, విభేదాలను వివరిస్తాయి.

ఈ రచనలో బౌద్ధ, జైన, చార్వాక, ఆజీవిక మతాల ప్రస్తావన ఉండాలి. అయితే వాటిని నేను ఇప్పటికే ‘వేద బాహ్యులు’ (2024) పుస్తకంలో విశదంగా చర్చించినందున, ఇక్కడ వాటి వివరాల్లోకి వెళ్లలేదు. ఇవి భిన్నకాలాలలో రాసిన వ్యాసాలు కనుక అక్కడక్కడా దొర్లే పునరుక్తులను పెద్దమనసుతో చూస్తారని భావిస్తాను.

మెజారిటేరియన్‌ వాదం ఎల్లెడలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ దేశసమైక్యతను, భిన్నత్వాన్ని కాపాడటానికి సామాన్య మానవునికి, స్వేచ్ఛ సమానత్వం కల్పించటం కొరకు ఏ మార్గం అనుసరణీయమో ఎవరికి వారు నిర్ణయించుకోవాలని నమ్ముతాను.
ఈ వ్యాసాలు కేవలం చారిత్రక సామాజిక అంశాలపై ఉండే భిన్నాభిప్రాయాల అకడమిక్‌ చర్చలకొరకు మాత్రమే ఉద్దేశించబడినవి. సహృదయ పాఠకులు అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

***
ఈ పుస్తకరచనలో శ్రీ కల్లూరి భాస్కరం గారు చేసిన సూచనలు విలువైనవి. వారు ఈ పుస్తకానికి గొప్ప నాందీ ప్రస్తావన చేస్తూ రాసిన చక్కని విశ్లేషణాత్మక ముందుమాటకు ఎంతో కృతజ్ఞుడను. విషయసారాన్ని ఈ పుస్తాకానికి బ్లర్బ్ రూపంలో కొద్ది వాక్యాల్లో బంధించిన శ్రీ అద్దేపల్లి ప్రభుకు ధన్యవాదములు.

నా పై అవ్యాజమైన ప్రేమ కురిపించే శ్రీ శిఖామణి, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి, శ్రీ గనారా, శ్రీ మార్ని జానకీరామ్‌ చౌదరి, శ్రీ అవధానుల మణిబాబు, శ్రీ ఎస్‌.కె. మోహనరావు ఇంకా నన్ను ప్రోత్సహించే మిత్రులందరకూ...

ధన్యవాదములతో...

భవదీయుడు
బొల్లోజు బాబా

సెప్టెంబరు, 2025
పేజీలు 240. ధర రూ. 275/-

9866115655 నెంబర్ కి రు. 300/-(పోస్టెజ్ తో) ఫోన్ పే చేసి ఎడ్రస్ పంపితే regd book post లో పంపగలరు, పల్లవి పబ్లిషర్స్, శ్రీ ఎస్.వి నారాయణ గారు.
అమజాన్ లింక్ కామెంటులో కలదు. థాంక్యూ.










Some stray thoughts….

ఈ మధ్య ఒటిటి ల్లో మళయాల సినిమాలు చూస్తున్నాను. చాలా సినిమాల్లో క్రిస్టియన్, ముస్లిమ్ పాత్రలు ఉంటున్నాయి. వాటిని ఏ టెర్రరిస్టులగానో, మతదురహంకారులుగానో కాక ఉదాత్తంగా చిత్రిస్తున్నారు. ఉత్తమ మానవులుగా చూపిస్తున్నారు. కొన్ని సినిమాలలో హీరోయే ఆ మతాలకు చెందినవ్యక్తిగా కథ నడుస్తుంది. ఇలాంటి కల్చర్ మనవద్ద కూడా ఒకప్పుడు ఉండేది. ప్రముఖ హీరోల చిత్రాలలో ముస్లిమ్/క్రిష్టియన్ మతాలకు చెందిన వ్యక్తులు కథలో ఏదో ఒక పాత్రగా ఉండేవారు. ఈ కల్చర్ క్రమేపీ కనుమరుగైంది.
 
హైందవేతరమతాలకు చెందిన వారిని శత్రువులుగా చూపించటం లేదా హేళనచేయటం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది.
***

“ఆ అమ్మాయి తన క్రికెట్ విజయానికి తను నమ్మే దేవుడు కారణమని చెప్పటం తప్పు కాదు కానీ ఆ మాటలు చూపించి మతమార్పిడులు చేస్తారు” అంటాడొకడు ఆ మొత్తం ట్రోలింగ్ కు ప్రధాన వాదనగా.
 
ఒకరి విశ్వాసాలను మరొకరు మార్చుతారు అనే ఆలోచనే నీచమైనదనుకొంటాను. ఎవరు ఎవరిని మార్చగలరు?. ఇలా ఆలోచించేవారికి సాటి మనిషి స్వేచ్ఛ, చేతన, ఐచ్ఛికతల పట్ల ఎంత తక్కువ అభిప్రాయం ఉందో కదా! అనిపిస్తోంది. వీరికే తప్ప ఇతరులకు సొంత అభిప్రాయాలుండకూడదు, వీరికి నచ్చినట్లే వీరి కనుసన్నల్లోనే ప్రపంచం ఉండాలి కాబోలు.
 
"ఒక వ్యక్తి ఏమి మాట్లాడాలి, ఎలా విశ్వసించాలి అనేదానిని మేము నిర్దేశిస్తాము; మీరు మమ్మల్ని అనుసరించాలి" అనే ఈ పద్ధతి, పౌరులందరికీ సమాన విచక్షణ శక్తి ఉందని నమ్మకుండా, కొంతమంది సవర్ణులు చెప్పినట్లే అవర్ణులు వినాలి, లోబడి ఉండాలి అని చెప్పే మనుస్మృతి సూత్రాలను అమలు చేయడమే.

ఇది అప్రజాస్వామికము, ఫాసిజము అనే స్పృహకూడా ఉండదు చాలామందికి.
“మనచుట్టూ ఉన్న సమాజం అంతలా పాడయిపోయిందా?”
 
బొల్లోజు బాబా

తరం మారుతున్నది…. ఆ స్వరం మారుతున్నది!

బకించంద్ర చటోపాధ్యాయ వందేమాతర గీతం రాసి 150 ఏళ్ళఅయిన సందర్భంగా సంబరాలు జరుపుకొంటున్నాం. ఈ రోజు మనం పాడుకొంటున్న పాటలో రెండు చరణాల అర్ధం ఇది.

తల్లీ నీకు వందనం!
మధురమైన జలాలతో, ఫలాలతో, పంటలతో
చల్లని మలయమారుతాలతో సుభిక్షంగా ఉండే
తల్లీ నీకు వందనం!
చంద్రకాంతులలో పులకించే రాత్రులతో
పుష్పాలతో శోభిల్లే వనాలతో
నవ్వులతో, స్నేహపూర్వక మాటలతో
సంతోషాలను, వరాలను ఇచ్చే
తల్లీ నీకు వందనం!

పై చరణాలు భరతమాత సౌందర్యం, సంపద, సుభిక్షతలగురించి చెబుతాయి. మిగిలిన చరణాలలో భారతమాతను దుర్గాదేవికి, లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ప్రతిరూపంగా చిత్రించారు. (ఈ గీతాన్ని ఆనందమఠ్ అనే నవలనుంచి తీసుకొన్నారు కనుక ఈ పోలికలు అక్కడ సందర్బోచితం)
.
నీవు దుర్గాదేవి శక్తివి
కమలదళాలమధ్య విహరించే లక్ష్మీదేవివి
జ్ఞానమును ప్రసరించే సరస్వతీ దేవివి
తల్లీ నీకు వందనం!
లక్షల కంఠాలతో గర్జించే తల్లీ!
లక్షలచేతులతో ఆయుధాలు ధరించిన తల్లీ
నీవు అబలవు కావు, మహాబలశాలివి
శత్రుసంహారిణీ
తల్లీ నీకు వందనం!
.
1896 జాతీయ కాంగ్రెస్ మహాసభలలో మొదటిసారిగా రవీంద్రనాథ్ టాగోర్ వందేమాతర గీతాన్ని ఆలపించాడు. అది మొదలు భారతస్వాతంత్ర్య పోరాటంలో వందేమాతర గీతం ఒక ఉద్యమ గీతంలా ప్రజలు సొంతం చేసుకొన్నారు. వందేమాతరం అనేది బలమైన బ్రిటిష్ శక్తులను ఎదిరించే ఒక నినాదంగా నిలిచింది.

కానీ ఈ గీతంలో ఉండే హిందూదేవతల ప్రస్తావనలున్న చరణాలపట్ల హైందవేతరులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ముఖ్యంగా మహమ్మద్ ఆలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్, ఈ గీతాన్ని బలవంతంగా అందరిచేతా పాడించటాన్ని తప్పు పడుతూ ఈ గీతం "positively anti-Islamic and idolatrous” అని పేర్కొంది. ఆమేరకు 1937 లో లక్నో లో జరిగిన ముస్లిం లీగ్ సెషన్ లో తీర్మానం చేసారు.

1937 అక్టోబరు లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ వివాదాన్ని గుర్తించి, హైందవేతరుల మనోభావాలు గాయపడకుండా ఏం చేయాలనేది చర్చించింది.

ఈ చర్చలలో- జవహర్ లాల్ నెహ్రూ అందరకూ ఆమోదయోగ్యమైన మధ్యే మార్గాన్ని సూచించమని కమిటీ సభ్యులను కోరాడు

-మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ముస్లిముల మనోభావాలను గుర్తించమని అందరినీ కోరాడు
-సుభాష్ చంద్రబోస్, వందేమాతర గీతం యధాతధంగా ఉండాలని వాదించాడు. (చంద్ర బోసు తన అజాద్ హింద్ ఫౌజ్ కు Anthem గా Abid Hasan Safrani రచించిన "Subh Sukh Chain ki Barkha Barse" అనే గీతం ఉండటం గమనార్హం)

-రవీంద్రనాథ్ టాగోర్ వందేమాతర గీతంలోని మొదటి రెండు చరణాలలో ఏ రకమైన మతప్రస్తావనలు లేవు కనుక వాటిని ఉంచి మిగిలినవి తొలగించటం ద్వారా ఈ వివాదాన్ని ముగించవచ్చునని సలహా ఇచ్చాడు.

రవీంద్రుని సూచన మేరకు వందేమాతర గీతంలో మొదటి రెండు చరణాలను మాత్రమే అప్పటినుంచి మన జాతీయ గేయంగా పాడుకొంటూ వస్తూన్నాం.
***
ఈ వందేమాతర వివాదం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మరొక్క సారి చర్చకు వచ్చింది. స్వతంత్ర్య భారతదేశానికి ఒక జాతీయ గీతం (National Anthem) కావలసి వచ్చింది. ఆ హోదా కొరకు జనగణమన, వందేమాతరం మధ్య టై పడింది. ఏ పాటకు National Anthem హోదా ఇవ్వాలి అనే అంశాన్ని 1946-1950 మధ్యలో జరిగిన constituent Assembly Debates లో కమిటీ సభ్యులు చర్చించారు. ఆ చర్చలు ఇలా ఉన్నాయి.

1. 31st July 1947 న H. V. Kamath అనే సభ్యుడు “వందేమాతర గీతాన్ని ఆగస్టు 15, 1947 అధికారబదిలీ వేడుకలలో ప్రారంభగీతంగా పాడాలి అని కోరాడు. (ఆ విధంగానే శ్రీమతి సుచేత క్రిపాలాని ఆ రోజున వందేమాతరంలోని మొదటి చరణాన్ని పాడటం జరిగింది)
.
2. 5th November 1948 న Seth Govind Das అనే సభ్యుడు ఇలా అన్నాడు
జాతీయ గీతం విషయానికి వస్తే, నేను చెప్పేది — “వందే మాతరం” మన జాతీయ గీతంగా ఉండవచ్చు.

మన స్వాతంత్ర్య పోరాట చరిత్ర వందే మాతరంతో విడదీయలేని బంధం కలిగి ఉంది.
ఎవరైనా ఇది సంగీత వాద్యములకు (orchestration) అనుకూలంగా లేదని చెబితే - అది చిన్న సమస్య మాత్రమే.

మహాకవి సూరదాస్, మీరాబాయి గారి గీతాలు ఒకే రాగంలో కాదు —అనేక రాగాల్లో పాడవచ్చు. కాబట్టి “వందే మాతరం” ను వాద్యరూపంలో స్వరపరచలేం అనడం సరైంది కాదు.
రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ పట్ల అందరకూ గౌరవమే. ఆయన నిజంగా కవులలో రాజు.
అయితే ఆయన రాసిన “జన గణ మన” కవిత 1911లో బ్రిటన్ చక్రవర్తి జార్జ్ V భారతదేశానికి వచ్చిన సందర్భంగా రాయబడింది.

ఆ కవితలోని భావాలు భారతమాతకు అంకితం చేయబడినవి కావు — అవి ఆ కాలంలోని రాజాధిరాజు (ఎంపరర్)కు అంకితం చేయబడ్డవి. “భారత భాగ్య విధాత” అనే పదబంధంలో పేర్కొన్నది ఆ చక్రవర్తినే అని “జయ రాజేశ్వర్” (రాజాధిరాజుకు జయం) అనే వాక్యంతో స్పష్టమవుతుంది.

అందువల్ల — మన దేశం ఒక ప్రజాస్వామ్య రాజ్యంగా (Republic) ఉన్నప్పుడు, ఎవ్వరైనా రాజాధిరాజుకు జయగానం చేసే పాటను జాతీయ గీతంగా ఉపయోగించలేము. అందుచేత “వందే మాతరం” మాత్రమే మన జాతీయ గీతం కావాలి
.
3. 9th November, 1948 న Shri Vishwambar Dayal Tripathi అనే సభ్యుడు ఇలా అన్నాడు
“వందే మాతరం” మరియు “జన గణ మన” మధ్య జాతీయ గీతం గురించి కొంత వివాదం ఉంది. నా అభిప్రాయం ప్రకారం, గత యాభై సంవత్సరాలుగా మన దేశ ప్రజల హృదయాలలో నిండిపోయి, మన స్వాతంత్ర్య పోరాటానికి దీపస్తంభంలా మారిన “వందే మాతరం” మన దేశపు జాతీయ గీతం కావాలి.
.
4. 24th January 1950 న Dr. Rajendra Prasad అధ్యక్షత స్థానంలో ఉండి ఇలా ప్రకటించి వందేమాతర వివాదానికి ముగింపు పలికారు.

జాతీయ గీతం (National Anthem) విషయం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ అంశాన్ని సభ ముందు ఉంచి, ఒక ప్రతిపాదన (resolution) ద్వారా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. అయితే అలా ప్రతిపాదన తీసుకోవడం కంటే, నేను జాతీయ గీతం గురించి ఒక ప్రకటన చేయడం మంచిదని భావించి నేను ఇప్పుడు ఈ ప్రకటన చేస్తున్నాను:

“జన గణ మన” అనే పదాలతో, స్వరంతో కూడిన కృతి భారత దేశ జాతీయ గీతంగా నిర్ణయించబడింది, అవసరమైతే ప్రభుత్వం కొన్ని పదాలను మార్చే అధికారాన్ని కలిగి ఉంటుంది.
అలాగే — భారత స్వాతంత్ర్య పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన “వందే మాతరం” పాటను కూడా జన గణ మనతో సమాన గౌరవం, స్థానం కలిగినదిగా గుర్తించాలి”
(అభినందనలు — సభలో చప్పట్లు)
***
వందేమాతర గీతం జాతీయగేయంగా చేయటం వెనుక చరిత్ర ఇది. మొదటిదశలో మతపరమైన అంశాలున్న కారణంగా కొన్ని చరణాలను తొలగించారు. ఆనాటి నాయకులు దార్శనికులు. ఈ దేశవైవిధ్యాన్ని, బహుళతను గౌరవించారు. భిన్నవర్గాల మధ్య సయోధ్య కుదిర్చి అన్నిటినీ ఒకే జాతీయభావన కిందకు తీసుకురావటానికి కృషిచేసారు.

రెండవ దశలో జనగణమన గీతాన్ని National Anthom గా ఆమోదిస్తూనే, వందేమాతరగీతానికి ఉన్న ప్రజాదరణ రీత్యా దానికి కూడా సమాన స్థాయి కల్పించారు.

ఈ రోజు వందేమాతరం "పూర్తి గీతం" అంటూ పాట ఒకటి వాట్సప్పులలో చక్కర్లు కొడుతుంది. – “తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది” అని సినారే ఏనాడో రాసారు.
.
బొల్లోజు బాబా

“ హిందుత్వ ఇండియాలో ముస్లిముగా ఉండటం” పుస్తకావిష్కరణ సభలో శ్రీ సిద్ధార్ధ వరదరాజన్ ప్రసంగం .

(Zia Salam రచించిన “Being Muslim in Hindutva India” పుస్తకావిష్కరణ సందర్భంగా “The Wire” వ్యవస్థాపక సంపాదకుడు Siddharth Varadarajan ఇచ్చిన స్పీచ్ కు formatted ఉరామరి తెలుగు లిఖితరూపం. స్పీచ్ లింక్ మొదటి కామెంటులో కలదు)
***

“Being Muslim in Hindutva India” పుస్తక రచయిత జియా సలాం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం ఆయన పుస్తకంలోని ప్రధానాంశమైన హిందుత్వ ఇండియాలో ముస్లింగా ఉండటం యొక్క కఠిన వాస్తవికతను తెలియజేస్తుంది. దీనికి కారణం ఒకే ఒక్క అక్షరం తప్పుగా ఉండటం.
 
మేం ఇద్దరం ఢిల్లీ నుండి వస్తున్నాము. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాము, ఒక ట్రావెల్ ఏజెంట్ చేసిన స్పెల్లింగ్ తప్పు కారణంగా, జియా సలాం (ప్రతిష్టాత్మక 'ది హిందూ' గ్రూప్ అసోసియేట్ ఎడిటర్ అయినప్పటికీ) ప్రయాణించలేక పోయారు. ఆయన "పొడవైన గడ్డం" ముస్లిమ్ పేరు CISF గార్డుల మనసుల్లో అనుమానాన్ని రేకెత్తించి ఉండవచ్చు. నా పేరులో కూడా స్పెల్లింగ్ తప్పు ఉంది. అయినప్పటికీ నేను ప్రయాణించగలిగాను. ఎందుకంటే, నా పేరు సిద్ధార్థ్ వరదరాజన్. 'శర్మ'ని 'హెచ్' (H) లేకుండా రాయవచ్చు, అది ఓకే. 'దేశ్‌పాండే'లో ఒక 'ఈ' (E) ను తొలగించవచ్చు, అది ఓకే. కానీ జియా సలాం గారి పేరును 'సియా సలాం' అని స్పెల్లింగ్ మిస్టేక్ జరిగినపుడు, ఈయన అదే వ్యక్తి అని చూపించడానికి ఆయన దగ్గర ప్రపంచంలో ఉన్న ఐడీలన్నీ ఉన్నప్పటికీ, ఆయనకు విమానాశ్రయంలోకి కూడా ప్రవేశించడం అసాధ్యం అవుతుంది.
ఈ పుస్తకం పేరు 'హిందుత్వ ఇండియాలో ముస్లింగా ఉండటం'. దీనిని “ఇండియాలో ముస్లింగా ఉండటం” గా ఆలోచించండి. మనం జీవిస్తున్న ఈ శకం, ఈ కాలాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది. మీరు ఒక ముస్లింను 1950లు లేదా 1960లు లేదా 70లు లేదా 80లలో ఒక పుస్తకం రాయమని అడిగి ఉంటే, మీకు చాలా భిన్నమైన పుస్తకం దొరికేది.

1950 లలో 'పేయింగ్ గెస్ట్' అనే ఒక ప్రసిద్ధ హిందీ సినిమా వచ్చింది. దేవ్‌ ఆనంద్, నూతన్ నటించారు. కథ లక్నోలో జరుగుతుంది. దేవ్‌ ఆనంద్ రమేష్ శర్మ అనే యువ లాయర్‌ పాత్రలో నటించాడు. అద్దెఇల్లు దొరకడం కష్టమవ్వటంతో ఆనంద్ ఒక వృద్ధ ముస్లిం వ్యక్తిగా వేషం వేసుకుని హిందూ యజమాని ఇంట్లో అద్దెకు దిగుతాడు, జియా సలాం గారిని ఇవాళ ఢిల్లీ విమానాశ్రయంలోకి ప్రవేశించకుండా చేసిన అదే పొడవైన గడ్డంతో!

ఈ రోజు 'పేయింగ్ గెస్ట్' లాంటి కథాంశంతో సినిమా తీయడం అనుమానమే. ఒక హీరో ముస్లిమ్ వ్యక్తి వేషం వేసుకొని హిందూ ఇంట్లో అద్దెకు దిగి ఇంటియజమాని కూతురిని ప్రేమిస్తే, “లవ్ జిహాద్” అని విరుచుకుపడతారు.
.
1. నివసించే స్వేచ్ఛ:
ఈ రోజు, బొంబాయి, ఢిల్లీ ఇంకా అనేక నగరాలలో, ఒక ముస్లిం వ్యక్తి తనకు నచ్చిన చోట ఇల్లు అద్దెకు తీసుకోవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే యజమానులు, కాలనీ ప్రజలు, చుట్టుపక్కల వారు, కొన్నిసార్లు అధికారులు కూడా "లేదు, "మేము మీకు అద్దెకు ఇవ్వము" అని చెబుతారు.

ఎవరికైనా నచ్చిన ప్రాంతంలో జీవించే హక్కు, స్వేచ్ఛ అనేవి ప్రాథమిక విషయాలు, మీరు ముస్లిం అయితే, ఈ రోజు భారతదేశంలో ఈ హక్కు ప్రశ్నార్థకమైంది.

భారతదేశంలో వివక్ష ముందునించీ ఉంది. ఇది కేవలం మోడీ సంవత్సరాల ఫలితం అని నేను చెప్పడానికి ఇష్టపడను. కానీ గత 10 సంవత్సరాలలో పరిస్థితులు చాలా చాలా దారుణంగా మారాయి,
 
గత రెండు సంవత్సరాలలోనే, కనీసం మూడు లేదా నాలుగు కథనాలు చదివాను. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుండి, ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుండి, ఒకటి గుజరాత్‌లోని వడోదర నుండి. వడోదర కేసులో ముస్లిం మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఏదో ఓ ప్రభుత్వ పథకం ద్వారా కేటాయించబడిన ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా, ఇరుగుపొరుగు కానీ, హిందూ నివాసితులు నుండి భారీ నిరసనలు వచ్చాయి, చివరికి ఆమె అక్కడ నివసించకుండా వెళిపోయారు. బరేలీలో, మొరాదాబాద్‌లో కూడా అదే జరిగింది. ఈ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిరోజూ ఇలాంటి ఎన్ని కథనాలు జరుగుతాయో ఎవరికి తెలుసు?
.
2. ప్రేమించే స్వేచ్ఛ:
మీరు ప్రేమించే వ్యక్తిని ప్రేమించే స్వేచ్ఛ కూడా నేటి భారతదేశంలో ముస్లింలకు కనుమరుగౌతుంది. మొదటగా, వారు ఈ 'లవ్ జిహాద్' అనే భావనను సృష్టించారు. ఇది ఒక మోసపూరిత కుట్ర సిద్ధాంతం. కొన్ని పదాలు తరచుగా ఉపయోగించబడతాయి, ఆపై అవి సాధారణీకరించబడతాయి చివరకు ప్రజలు వాటిని అంగీకరిస్తారు.

అమీర్ ఖాన్ ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి నేను చదివాను, అది ఇంకా విడుదల కాలేదు. కావచ్చు. రజత్ శర్మ, అమీర్ ఖాన్‌ను అడిగాడు, "మీరు మూడుసార్లు వివాహం చేసుకున్నారు, ప్రతిసారీ హిందూ మహిళలను వివాహం చేసుకున్నారు. మీరు 'లవ్ జిహాద్' చేస్తున్నారు అని అనుకోవచ్చా" అన్నాడు.

లవ్ జీహాద్ లాంటి పదాన్ని అంత అలవోకగా వాడుతూ ఒక ప్రముఖ టీవీ యాంకర్ అడగాల్సిన ప్రశ్నేనా ఇది? మీరు ప్రేమించి పెళ్ళిచేసుకొన్న వారు వేరేమతానికి చెందినవారు అయినంత మాత్రాన ఆ ప్రేమకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు.
 
ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక యువ జంట వివాహం చేసుకున్నారు. ఆ అబ్బాయి పేరు అమన్ సిద్ధిఖీ అనుకుంటున్నాను. అమన్ సిద్ధిఖీకి హిందూ తల్లి, ముస్లిం తండ్రి ఉన్నారు. అతనికి ముస్లిం పేరు ఉన్నప్పటికీ, అతన్ని హిందువుగా పెంచారు. అతని తల్లిదండ్రులు విడిపోయారు, అతను హిందూ తల్లితో జీవిస్తున్నాడు. అతను ఒక హిందూ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వారికి హిందూ వివాహ వేడుక జరిగింది. ఇద్దరి తల్లిదండ్రులు, అంటే అమ్మాయి తల్లిదండ్రులు, అతని తల్లి కూడా హాజరయ్యారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.
 
వివాహం జరిగిన కొన్ని వారాలు లేదా నెలల తర్వాత, అమ్మాయి బంధువులలో ఒకరు, బహుశా ఆమె కజిన్ కావొచ్చు, ఆ వివాహం “బలవంతపు మత మార్పిడి కేసు” అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమన్ సిద్ధిఖీ అరెస్టు చేయబడ్డాడు. హైకోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. చివరకు సుప్రీంకోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి ఆరు నెలలు పట్టింది.
 
వేర్వేరు మతాల పేర్లు ఉన్న వ్యక్తుల మధ్య వివాహం అనే ఆలోచననే చాలా షాకింగ్‌గా పరిగణించబడుతోంది నేడు.
 
అనేక చిన్న పట్టణాలలో ఇలాంటి కేసులు పెద్దసంఖ్యలో ఉంటున్నాయి
వేర్వేరు మతాలను ఆచరించే వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకుంటే, వారికి ప్రభుత్వ అనుమతి అవసరం అని చెప్పే చట్టాలను రాష్ట్రం తర్వాత రాష్ట్రం ఆమోదిస్తోంది. మనం ఎలాంటి దేశంగా మారాము?

మీరు మతం మారాలనుకుంటే, మీరు అనుమతి పొందాలి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఇప్పుడు గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో ఈ చట్టం ఉంది. ప్రజలను వేధించడానికి ఈ చట్టాలు ఉపయోగించబడుతున్నాయి.

వేరే మతానికి చెందినవారిని పెళ్ళిచేసుకోవాలంటే మీరు బంధువులనే కాదు భారతప్రభుత్వ పూర్తి బలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తిని ప్రేమించే స్వేచ్ఛ రాజీ పడింది.
.
3. ఆహార స్వేచ్ఛ: మీరు తినాలనుకున్నది తినే స్వేచ్ఛ కూడా రాజీ పడింది. రాష్ట్రం తర్వాత రాష్ట్రం ప్రజల ఆహార పద్ధతులను నియంత్రిస్తోంది. నేరంగా పరిగణిస్తోంది. ఆహార పద్ధతులను కొన్ని కొలబద్దలకు అనుగుణంగా బలవంతంగా రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది హిందువులు మాంసం తింటారు. కానీ ఇప్పుడు, ఢిల్లీ ప్రాంతంలో కూడా, నవరాత్రుల సమయంలో, కొన్ని ప్రాంతాలలో మాంసం అమ్మకంపై నిషేధం ఉంటుంది, ఇది ఒక ధోరణిగా మారింది.
ఈ 'నయా భారత్'లో ముస్లింల అన్ని ప్రాథమిక స్వేచ్ఛలు హక్కులపై ఒత్తిడిని పెరుగుతోంది. ఇతర మైనారిటీలను కూడా లక్ష్యంగా చేసుకుని, వివిధ రకాలుగా బాధపడుతున్నారు. కానీ ఈ నిరంతర దాడి భారాన్ని మోస్తున్న ఒకే ఒక మైనారిటీ భారతదేశంలోని ముస్లింలు.
.
4. వస్త్రధారణ స్వేచ్ఛ
: 2019-2020 లో సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా మన ప్రధానమంత్రి మాటలను మనం ఎలా మర్చిపోగలం, "వారు ధరించే దుస్తుల నుండి మీరు ఈ వ్యక్తులను గుర్తించవచ్చు" అని ఆయన అన్నారు.

ఈ దేశ ప్రధాని అలా మాట్లాడటం మీరు ఊహించగలరా? అయితే అది 2019 నాటి విషయం. కానీ రాష్ట్రం తర్వాత రాష్ట్రం, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో, ముస్లిం మహిళలు, ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని నేరంగా పరిగణించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటివిషయాలను ఆయా వ్యక్తుల ఇష్టానికి వదిలివేయకుండా, ప్రభుత్వం జోక్యం చేసుకొంటోంది.
 
5. ఆరాధనా స్వేచ్ఛ: భారత రాజ్యాంగం ఈ దేశప్రజలకు ఆరాధనా స్వేచ్ఛ ఇచ్చింది. కానీ బహిరంగంగా నమాజ్ ఆచరించడాన్ని క్రిమినల్ చర్యగా చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. షాపింగ్ మాల్, రైల్వే ప్లాట్‌ఫారమ్‌, బస్సు దిగి రోడ్డు పక్క లేదా విశ్వవిద్యాలయం, కళాశాలలో ప్రార్థించడానికి ప్రయత్నించినందుకు ముస్లింలపై కేసులు నమోదు అయినట్లు నేను చదివాను.
వ్యక్తిగతంగా నన్ను అడిగితే, నేను లౌడ్ స్పీకర్ల వాడకాన్ని పెద్దగా ఇష్టపడను - అది అజాన్ కోసం అయినా, జాగరణ్ కోసం అయినా. మీరు మీ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు మరెవరినీ ఇబ్బంది పెట్టవద్దు, అది మంచిదే. కానీ ఒక రకమైన ఇబ్బందిని నేరంగా పరిగణించి, ఇతర రకాల ఇబ్బందులను అనుమతించే పరిస్థితి ఉండకూడదు.

ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు పాల్గొంటున్న కొన్ని రకాల మత ఊరేగింపులను ఆపుతున్నారు. అదే సమయంలో హిందూ విశ్వాసాన్ని కలిగి ఉన్న ఇతర యాత్రలు, ఊరేగింపులు
అనుమతించబడటమే కాకుండా, పరిపాలన ద్వారా ప్రోత్సహించబడుతున్నాయి, మద్దతు ఇవ్వబడుతున్నాయి.

1991 ఆరాధనా స్థలాల చట్టం ఇది స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఉన్న ఆరాధనా స్థలాల స్వభావం మార్చకూడదని చెప్పింది.

బాబ్రిమసీదు తీర్పుకు ఒక సంవత్సరం తరువాత, బనారస్‌ జ్ఞాన్‌వాపి మసీదు, మధురలోని మసీదు ఇతర మసీదుల పునరుద్ధరణ కోసం మోసపూరితమైన వాదనలు సృష్టించబడుతున్నాయి, కోర్టుల ద్వారా ముందుకు నెట్టబడుతున్నాయి. దాదాపు ప్రతి రాష్ట్రంలో వివాదాలు తిరిగి తెరవబడుతున్నాయి. ఇది భారతదేశంలోని ముస్లిములను మరింత భయాందోళనలకు గురిచేసే స్థితి.
 
6. మాట్లాడే స్వేచ్ఛ: ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశద్రోహం కింద అరెస్టు అయిన ప్రొఫసర్ అలీ ఖాన్, మహమూదాబాద్ కేసు మీకు అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన, ‘ప్రభుత్వం కర్నల్ సోఫియా ఖురేషి వంటి వారిని రోల్ మోడల్‌గా హైలైట్ చేయడం సరిపోదని, మూక హత్యల లాంటి ముస్లిముల ఇతర సమస్యలపై కూడా దృష్టిపెట్టాలని” అని ఒక ప్రకటన చేశారు. దృష్టికి తెచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని అభినందించారు. ప్రభుత్వం చేసిన చాలా మంచి పని అని అన్నారు. అలా అన్నందుకు ఆ ప్రొఫెసర్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేసి అరెష్టు చేసి జైలుకు పంపారు.
 
అశోకా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఆ ప్రొఫెసర్‌ను, ప్రముఖ మేధావిని, పండితుడిని, బాగా గౌరవించబడిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, అరెస్టు చేయడం ద్వారా, ముస్లింలందరికీ ఒక సందేశం పంపబడింది. "ఇక్కడ మేము ఇంత ప్రసిద్ధుడైన, గౌరవించబడిన వ్యక్తిపై చర్య తీసుకుంటున్నాము, ఆయన మాట్లాడినందుకు దేశద్రోహం ఆరోపిస్తున్నాము." అని.
ఆయన మాట్లాడింది మత సామరస్యం కోసం. మతం ఆధారంగా విభజించబడని దేశం కోసం. ఆయన సందేశం జాతీయ సమైక్యతకు సంబంధించినది. కానీ బదులు సందేశం ఏమిటంటే, “అలా మాట్లాడితే మీపై దేశద్రోహ నేరం మోపబడుతుందని”
 
కానీ కర్నల్ సోఫియా ఖురేషిని "టెర్రరిస్టుల సోదరి" అని పేర్కొన్న మధ్యప్రదేశ్ మంత్రి అరెస్టు కాలేదు. నిజానికి, ప్రజలు కోర్టుకు వెళ్లిన తర్వాత మాత్రమే ఆయనపై కేసు దాఖలు చేయబడింది.
7. జీవనోపాధి స్వేచ్ఛ: మహారాష్ట్రలోని ఒక మంత్రి, బిజెపి మంత్రి, పేరు గుర్తులేదు, ఒక ప్రకటన చేశారు. "మీరు ఈసారి మార్కెట్‌కు వెళ్లి ఏదైనా కొనాలనుకుంటే, దుకాణదారుడిని హనుమాన్ చాలీసా చదవమని అడగండి, ఆయన చదవకపోతే, అతని నుండి కొనుగోలు చేయవద్దు" అని హిందువులను కోరారు.

అధికారంలో ఉన్న వ్యక్తులు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు, విభజనను వ్యాప్తి చేస్తున్నారు, ముస్లింలను బహిష్కరించమని హిందువులకు పిలుపునిస్తున్నారు. కోవిడ్ సమయంలో, కరోనా వైరస్ వ్యాప్తికి ముస్లింలను నిందించారు. 'కరోనా జిహాద్' అనే పదం వాడారు. "ముస్లింల నుండి పండ్లు, కూరగాయలు కొనవద్దు" అని చెప్పారు. ముస్లింల జీవనోపాధిపై ఈ దాడి జరుగుతోంది.
మీరు ఎక్కడ జీవించాలనుకుంటున్నారు, మీరు ఎవరిని ప్రేమించాలనుకుంటున్నారు, మీరు ఏమి తినాలనుకుంటున్నారు, మీరు ఏమి ధరించాలనుకుంటున్నారు, మీరు బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు సమయానికి మీరు నమాజ్ చేసుకొనే స్వేచ్ఛ - అదంతా సరిపోదు. మీ జీవనోపాధిని ఆచరించే స్వేచ్ఛ కూడా ఒత్తిడిలో ఉంది.
.
8. విషపూరిత ప్రచారం: ప్రజా రంగం నుండి ముస్లింల ఉనికిని తుడిచిపెట్టడానికి ఒక స్పృహతో కూడిన ప్రయత్నం జరుగుతోంది. ప్రదేశాల పేర్లను మార్చడం, భారత చరిత్రకు ముస్లిం భారతీయుల సహకారాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించడం.

ముస్లింలు శతాబ్దాలుగా భారతదేశంలో లేనట్లుగా ఈ తుడిచిపెట్టే ప్రక్రియ జరుగుతోంది. దీనిని మీరు అనేక రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చూడవచ్చు.

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, మిస్టర్ మోడీ వయనాడ్‌లో మాట్లాడుతున్నప్పుడు, రాహుల్ గాంధీ 2019 ఎన్నికలలో వయనాడ్ నుండి పోటీ చేసినందుకు ఆయనపై దాడి చేశారు. నా దృష్టిలో, ఆయన చేసినది ఒక మతపరమైన, చట్టవిరుద్ధమైన ప్రసంగం. ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన కారణాల వల్ల ఆయనపై చర్య తీసుకోకూడదని నిర్ణయించుకుంది. కానీ ఆయన చెప్పింది భారతీయ ఓటరుకు, కేరళ ప్రజలకు, వయనాడ్ ప్రజలకు, హిందువులకు, ముస్లింలకు అవమానం.
"రాహుల్ గాంధీ ఒక మైక్రోస్కోప్ తీసుకుని, భారతదేశంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్న స్థలం కోసం వెతికాడు, ఆ తర్వాత ఆ నియోజకవర్గం నుండి నిలబడాలని నిర్ణయించుకున్నాడు" అని ఆయన అన్నారు. ఇక్కడ మీరు భారత ప్రధాని ఓటర్లను మెజారిటీ, మైనారిటీగా విభజించడం, ఆపై మైనారిటీ ఓటర్లు భారతీయులు కానట్లుగా జోక్ చేయడం గమనించవచ్చు.

2019 నాటి ఆ మతపరమైన ప్రచారం, 2024 ప్రచారం సందర్భంగా ఆయన చెప్పిన దానితో పోలిస్తే సాపేక్షంగా తేలికపాటిది, ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. ఆయన దాదాపు 200 ప్రసంగాలు చేశారు. వాటిలో 100 కంటే ఎక్కువ ప్రసంగాలలో ఆయన ముస్లింలను టార్గెట్ చేసిన సందర్భాలున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ లెక్కించింది.
 
ప్రధానమంత్రి, భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి, ఆ స్థాయికి దిగజారతారని మీరు ఎప్పటికీ ఊహించరు. ఆయన ఏమి చెప్పారు? "కాంగ్రెస్ గెలిస్తే, బిజెపి ఓడిపోతే మీ మంగళసూత్రం, మీ బర్రెలు, మీ ఇళ్లు, మీ ఆభరణాలు తీసివేసి ముస్లింలకు ఇవ్వబడతాయి" అని హిందువులకు చెప్పారు. వాస్తవానికి, ఆయన ముస్లిం అనే పదాన్ని నేరుగా ఉపయోగించలేదు, చొరబాటుదారులు, ఎక్కువ పిల్లలను ఉత్పత్తి చేసే వ్యక్తులు వంటి నిందలను ఉపయోగించారు.
ఒక ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడి, నేరుగా రెచ్చగొట్టడం అనేది చివరిసారిగా ఎప్పుడు జరిగింది? రాజీవ్ గాంధీ 1984 నవంబర్‌లో సిక్కుల హత్యను సమర్థిస్తూ, "ఒక పెద్ద చెట్టు పడిపోతే, భూమి కదలక తప్పదు" అని ఒక అపఖ్యాతి పాలైన ప్రకటన చేశారు. కానీ ఇక్కడ మీరు ఒక ప్రధానమంత్రిని చూస్తున్నారు, ఆయన హిందువులను భయపెట్టడానికి ప్రయత్నిస్తూ, హిందు, ముస్లింల మధ్య ద్వేషాన్ని నేరుగా రెచ్చగొడుతున్నారు
 
మీ ప్రధానమంత్రి, ఆయన అందరు భారతీయులకు ప్రాతినిధ్యం వహించవలసిన వ్యక్తి, పక్షపాతిగా ఉండి, విభజన భాష, ద్వేష భాష మాట్లాడటం కంటే అవమానకరమైనది ఇంకేముంటుంది?
 
ఈ నెల ప్రారంభంలో నేను ఒక ప్రసంగం విన్నాను. అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆపరేషన్ సింధూర్‌కు మద్దతు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరాటంలోకి నేను వెళ్లాలనుకోవడం లేదు. ఇది వారి పోరాటం, ఇది వారి వ్యవహారం. ఆయన మమతా బెనర్జీని ఆపరేషన్ సింధూర్‌ను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించడంపై నాకు పట్టింపు లేదు.

కానీ ఆయన చెప్పింది ఈ క్రింది కారణాల వల్ల ఆమోదయోగ్యం కాదు. ఆయన ఇలా అన్నారు: "భారతదేశంలోని ముస్లింలను సంతృప్తి పరచడానికి (appease), మమతా ఆపరేషన్ సింధూర్‌ను వ్యతిరేకించింది." కాబట్టి ఇక్కడ లక్ష్యం నిజానికి మమతా కాదు, దయచేసి శ్రద్ధగా గమనించండి. "ముస్లింలను సంతృప్తి పరచడానికి, ముస్లిం ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి, మమతా ఆపరేషన్ సింధూర్‌ను వ్యతిరేకించింది" అని. భారతదేశ హోంమంత్రి ఇలా మాట్లాడటం, మొత్తం ముస్లిం సమాజాన్ని, సో-కాల్డ్ ముస్లిం ఓటు బ్యాంకును దేశభక్తి లేనివారిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.
 
ద్వి-జాతి సిద్ధాంతపు స్థాపకుడి వారసులు, రాజకీయ వారసులు ఈ రోజు భారతదేశాన్ని పాలిస్తున్నారు. వారు హిందూ, ముస్లింలను విభజించడం, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం, వారిపై ఒత్తిడి తేవడం, వారి స్వేచ్ఛను పరిమితం చేయడానికి ప్రయత్నించడం, వారి హక్కులను అడ్డుకోవడానికి ప్రయత్నించడం, వారు అసురక్షితంగా, బెదిరింపులకు గురైనట్లు భావించేలా చేసేఈ విషపూరిత సిద్ధాంతాన్ని అమలు చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
మూక హత్య (mob lynching) లాంటియాదృచ్ఛిక హింసాత్మక సంఘటనల లక్ష్యం ప్రజలను విభజించి, భయభ్రాంతులకు గురిచేయడం. ఈ లక్ష్యం సాధించటం కొరకు ఒక చోట్లో ఎక్కువమందిని చంపాల్సిన అవసరం లేదు, దేశంలోని వివిధ ప్రాంతాలలో యాదృచ్ఛికంగా మూక హత్యలు చేస్తే సరిపోతుంది. రైలుప్రయాణం, హైవే ప్రయాణం, బస్సు ప్రయాణం లాంటి చోట్ల జరిపే మూకహత్యలు. ఆ యాదృచ్ఛిక స్వభావం సాధారణ ముస్లింలకు ఒక సందేశాన్ని పంపుతుంది: మీరు ముస్లింలా కనిపిస్తే, ముస్లింలా అనిపిస్తే, మీరు ముస్లింలా మాట్లాడితే, మీకు ఆ రకమైన గడ్డం ఉంటే, మీ వెనుక ఎల్లప్పుడూ ఒక ప్రమాదం ఉంటుంది, ఎల్లప్పుడూ ఒక భయం ఉంటుంది.
***

ఈ రోజు ఈ దేశముస్లిములు ఎదుర్కొంటున్న ఒత్తిడిని , వాస్తవికతను జియా సలాం గారు తన పుస్తకంలో చెప్పారు.
 
నిజాయితీగా, ఇది ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. ఈ సంఘటనల గురించి మనందరికీ తెలుసు, మనందరం కథలు విన్నాము. కానీ మీరు దానిని డాక్యుమెంట్ చేసి, పుస్తకం రూపంలో ఉంచడం చూసినప్పుడు, సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీరు గ్రహిస్తారు. కాబట్టి ఈ పుస్తకం రాసినందుకు నేను జియా గారిని అభినందిస్తున్నాను. ఆయన ఈ రోజు ఇక్కడ లేకపోవడం బాధాకరం.

పాఠకులకు ఈ పుస్తకం అందుబాటులో ఉండేలా చూసిన ప్రచురణకర్తలు, అనువాదకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ పుస్తకం విస్తృతంగా ప్రచారం అవుతుందని, ప్రజలు దానిని చదివి, జియా గారు వ్రాసిన సరళమైన సత్యాలను చర్చించి, అభినందిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

(“The Wire” వ్యవస్థాపక సంపాదకుడు శ్రీ సిద్ధార్థ్ వరదరాజన్ ఇచ్చిన స్పీచ్ కు formatted ఉరామరి తెలుగు లిఖితరూపం)


https://www.youtube.com/watch?v=_13v4eucZiw

ఆర్ద్రత, ఆగ్రహం, తాత్వికతలను "చిగురించే పేజీలు"


.
శ్రీమతి నాగజ్యోతి శేఖర్ “రెప్పవాల్చని స్వప్నం” కవితా సంపుటితో తెలుగు సాహిత్యలోకంలో తనదైన స్థానాన్ని సంపాదించుకొన్నారు. “చిగురించే పేజీలు” వీరి రెండవ కవిత్వ సంపుటి. ఈ పుస్తకంలో కవితలు సామాజిక స్పృహ, మానవసంబంధాల గాఢత, ప్రకృతి పట్ల ప్రేమ, స్త్రీవాద దృక్పథాలను గాఢంగా ప్రతిబింబిస్తాయి. వీరి వస్తువైవిధ్యం విస్తారమైనది. అభివ్యక్తి నవ్యం. కవితను నడిపించే శైలి వినూత్నం.

నాగజ్యోతి తన కవిత్వాన్ని కేవలం భావవ్యక్తీకరణగా మాత్రమే కాక, సామాజిక మార్పుకు, ముఖ్యంగా బడుగు జీవన చిత్రణకు, వ్యవస్థీకృత నిరసనకు ఒక శక్తివంతమైన మాధ్యమంగా ఆమె మలచుకున్నారు.

నాగజ్యోతి కవితా ప్రపంచాన్ని నాలుగు ప్రధాన కోణాలలోంచి దర్శించవచ్చు.

1. సామాజిక స్పృహ, సహానుభూతి

ఈమె సమాజంలోని అణగారిన వర్గాలు, బాధితుల పక్షాన నిలబడి వారి స్వరాన్ని తన కవిత్వంలో శక్తివంతంగా పలికిస్తారు.

"బర్త్ మార్క్" కవితలో,

"వాడెవడో
పాదాల నుండి పుట్టావని
రాసిన / బర్త్ సర్టిఫికెట్
ఇంకా తగుల బెట్టడు ఎందుకో" - అని ప్రశ్నిస్తూ, కుల వ్యవస్థలోని అమానవీయతను నిలదీస్తారు.
"భూమి మింగిన సూరీడు" కవితలో, అప్పుల భారంతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకొన్న రైతు కథను ప్రతీకాత్మకంగా చెబుతారు.

వెతుక్కుంటూ వెళ్ళిన లాంతరు
వెక్కుతూ వచ్చింది
కూడా వచ్చిన
ఖాళీపురుగుమందు డబ్బా
ఆ ఇంటి పచ్చని చేనును
అప్పుల పురుగు/ తినేసిందని
ఎర్రని కుంకుమ బొట్టుతో
చెప్పి కూలబడింది – (భూమి మింగిన సూరీడు). ఎక్కడా అస్పష్టత ఉండదు. బరువైన దృశ్య చిత్రాలద్వారా పదునైన విషాదం హృదయానికి గుచ్చుకొనేలా పలికించారు.

“వాక్సినేషన్” అనే కవితలో-
“ఏ ఊరి బయటి మందారమో
చదువుల నూతిలో నీళ్ళు తోడుకుంటుంది
తక్షణమే ఓ తక్షకుడు కులం కోరలతో కాటేసి
నీళ్ళు తాగాలన్న కోరికను మసి చేస్తాడు//”
“గిట్టుబాటు ధర కోల్డ్ స్టోరేజిలో శవమౌతుంది//”
“భూమితల్లి గుండెల్లో మైనింగ్ చేసి ఓ పలుగు పెత్తందారీ అవుతుంది”
- లాంటి వాక్యాలు సమాజంలో వేళ్ళూనుకుపోయిన కులవివక్ష, దళారీ వ్యవస్థ, సహజవనరుల దోపిడి లాంటి వివిధ రకాల అవినీతి స్వరూపాలను తీవ్రంగా ఎత్తిచూపుతాయి.

2. స్త్రీవాద దృక్పథం:

నాగజ్యోతి కవిత్వంలో స్త్రీల అణచివేత, అంతర్గత సంఘర్షణ, వారి స్వేచ్ఛా కాంక్ష బలంగా ధ్వనిస్తాయి.

"ఆమెనలా వదిలేయండి" కవితలో, స్త్రీని నదిగా, చెట్టుగా అభివర్ణిస్తూ, “నది సర్దుకుపోవడం అంటే జీవాన్ని కోల్పోవడమే” అని హెచ్చరిస్తారు.

అరచేతుల్లో గోరింట పూయించాలని
పుట్టింటికి వెళ్ళా
పాత జ్ఞాపకాల పరిమళం గుప్పుమంది
అమ్మ నా గదిలో గతాన్ని సర్దుతున్నది (అలిఖిత ఆస్తి)
పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి పుట్టింటికి వచ్చినప్పుడు పొందే అనుభూతుల్ని ఈ కవిత బంధిస్తుంది. “గదిలో గతాన్ని సర్దటం” అనే వర్ణన అత్యద్బుతంగా సందర్భాన్ని కళ్ళకు కడుతుంది.

“పుట్టింట్లో కూతురికి తనదైన ఓ గది ఉంచడం
హృదయ రాజ్యాంగం కల్పించాల్సిన
ఆస్తిహక్కు” అంటూ ఈ కవిత ముగుస్తుంది. స్త్రీల మానసిక హక్కుల పట్ల కవయిత్రికి ఉన్న స్పష్టతను ఆ వాక్యాలు పట్టిచూపుతాయి. “అలిఖిత ఆస్తి” అనే కవితా శీర్షికకు గొప్ప ఉదాత్తమైన ముగింపు అది.

మణిపూర్ ఘటనల నేపథ్యంలో రాసిన "నగ్నత్వం" కవిత స్త్రీలపై జరిగే హింసను అత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తుంది.

“ఇప్పుడిక నగ్నత్వానికి సంస్కారం నేర్పక్కరలేదు
కొత్త రాజ్యాంగం బట్టలిప్పడాన్ని శాసనం చేసింది
ఊరావలి పుష్పాలను దిగంబరంగా
ఊరేగించడానికి చట్టం చేసింది
ఇక్కడంతా స’మ్మతమే” అనే వాక్యాలలో మతం పేరిట జరుగుతోన్న ఉన్మాద ఊరేగింపులకు ఎవరు బలవుతున్నారో, వాటి వెనుక ఎవరున్నారో స్పష్టపరుస్తారు.

"నువ్వు గొంతు విప్పకపోతే కుకీల నగ్నదేహాలు
శాశ్వత తీతువులై
నీ చరిత శిరస్సుపై నిత్యం ఎగురుతూనే ఉంటాయి
వారి ఆర్తనాదాలు అగ్నిపూలయి
నిన్ను దహిస్తూనే ఉంటాయి" అని హెచ్చరించడం, ఈ అన్యాయాలపై మౌనంగా ఉండకూడదన్న ఆమె తిరుగుబాటు తత్వాన్ని చూపుతుంది.

3. యుద్ధ వ్యతిరేకత, శాంతి కాంక్ష

ఈ కవయిత్రి శాంతిని, సామరస్యజీవనాన్ని అమితంగా ప్రేమిస్తారని వివిధ కవితల ద్వారా స్పష్టమవుతుంది. "రెండు సత్యాలు" "మూడవ ప్రపంచం" కవితల్లో యుద్ధం మిగిల్చే విధ్వంసాన్ని వర్ణించారు.

యుద్ధం ముగిసినా దాని బీభత్సం మానవజీవితాన్ని వెంటాడుతూనే ఉంటుందని, యుద్ధం ముగియటం అనేది విరామం మాత్రమే అనే రెండు పరమసత్యాలను “రెండు సత్యాలు” అనే కవితలో ఆవిష్కరిస్తారు కవయిత్రి.

“అస్థిపంజరాల నదీ
రక్తపు సంద్రం/ సంగమిస్తాయి
తేలుతున్న పడవలనిండా
తెగిపడ్డ అవయవ శకలాలు
పూచిన పూలనిండా విరిగిన పాల
నీచువాసన
అప్పుడే పుట్టిన పిట్టనోట్లో
గాయాల రొమ్ము (రెండు సత్యాలు)” లాంటి పదచిత్రాలు యుద్ధబీభత్సాన్ని ఎంతో భయావహంగా వర్ణిస్తాయి.

ఈరోజు జరుగుతున్న యుద్ధంలో చిన్నపిల్లలు టార్గెట్స్ గా ఉంటున్నారు. ఇది అత్యంత హేయం. ఈ అంశాన్ని స్పృశిస్తూ రాసిన "శిథిల స్వప్నాలు" కవితలో

“తెగిపడ్డ ఆ చిన్ని చేతులు
ఎన్ని పున్నములు పుట్టించేవో
ఆ లేత కాళ్ళు ఏ గెలుపు గ్రహంపై అడుగుపెట్టేవో” అనే వాక్యాలు యుద్ధం వల్ల పిల్లల భవిష్యత్తు నాశనమవడం పట్ల తీవ్ర ఆవేదనను పలికిస్తాయి. "యుద్దానికి గర్భసంచి ఉంటే తెలిసేది గర్భస్రావమెంత నరకమో" అనడం హింస పట్ల కవయిత్రికున్న తీవ్ర వ్యతిరేకతకు పరాకాష్ట

4. అంతర్యానం, జీవన తాత్వికత

ఈ కవయిత్రి సామాజిక అంశాలపై ఎంత బలంగా స్పందిస్తారో, వ్యక్తిగత భావోద్వేగాలను, దుఃఖాన్ని, ఏకాంతాన్ని కూడా అంతే లోతుగా విశ్లేషించుకుంటారు. “దుఃఖానికో గది” కవితలో
“లోలోపల ఎక్కడో వాన
గుండెను నిలబెట్టిన గుప్పెడంత నేలపై
ఆరని తడి
నాలుగు గదుల్లోనూ అల్పపీడనం// అనే ప్రారంభ వాక్యాలు మనసులోని లోతైన బాధను, ఒంటరితనాన్ని, నిస్సహాయతను కళ్ళకు కడతాయి. మానవజీవితంలో దుఃఖం అనివార్యతను చెబుతూ “గుండె బరువు తీర్చుకొనేందుకు/ దుఃఖానికో గది కావాలి” అంటూ ముగుస్తుందీ కవిత.
ఈ కవిత కేవలం బాధను వర్ణించే కవిత కాదు. దుఃఖాన్ని గౌరవించమని, దాన్ని అంగీకరించమని, ఆ బరువును దించుకోవడానికి మనకు మనమే ఒక "గది"ని (ఏకాంతాన్ని) ఇచ్చుకోవాలని చెప్పే ఒక తాత్విక విశ్లేషణ.

‘పట్టాలు తప్పిన రాత్రి’ కవిత మొత్తం సృజనాత్మక ప్రక్రియ (creative process) గురించిన అంతర్మథనం.

"పొద్దు పొద్దున్నే ప్రయాణం మొదలు పెడతాను" , కానీ "రాత్రైనా రావాల్సిన రైలు రాదు" అంటారు.
ఆ "రైలు" మరేదో కాదు, ఆమె రాయాలనుకుంటున్న "వాక్యం" లేదా "కవిత". సృజన కోసం పడే నిరీక్షణ ఇది. సృజన సామాజికం కావొచ్చు, కానీ ఆ సృజన చేసే క్షణంలో సృజనకారుడు ఒంటరి. ఎంత ఒంటరి అంటే “రైలు ఎక్కేటప్పుడో/ దిగేటప్పుడో/ జారిపడ్డ చెప్పు” అంత ఒంటరి అని ఉపమిస్తారు కవయిత్రి.

"ఉదయపు బుగ్గపై సిరా చుక్క పెడతాను” అనటం ద్వారా సృజన పూర్తయింది అని సూచిస్తారు. ఇంత అంతర్మథనం, ఒంటరితనం, నిరీక్షణ... ఇవన్నీ ఆమె "కవిత్వం" కొరకు చెల్లించిన మూల్యం.

కెటలిస్ట్" కవితకూడా సృజనకు సంబంధించినదే. దీనిలో
"నలిగిన గుండెను కాగితం చేసి మడతల మధ్య నన్ను నేను పరుచుకుంటాను" అనే వాక్యం ద్వారా, బాధ నుండే సృజన పుడుతుందని సూచిస్తారు.
“నేల హృదయపు లోతులు
చెప్పుల్లేని పాదాలకే తెలుస్తాయి (డార్వినిజం)” ఇది కేవలం నేల గురించి కాదు, జీవితం గురించి చెప్పిన తాత్విక వాక్యం. నిజమైన అనుభవం, జ్ఞానం ఆడంబరాలకు దూరంగా, నేలతో మూలాలతో మమేకమైనప్పుడే తెలుస్తాయని ఈ పదచిత్రం చెబుతుంది.

“దుఃఖాన్ని పూడ్చిపెట్టి
ఓ నవ్వుగా చిగురించాలంటే
చెట్టుకెంతటి
ప్రసవ వేదన (ఇంకెవరికి….?)” చెట్టు చిగురించడానికి ఎంత అంతర్గత శక్తి అవసరమో, మనిషి కూడా దుఃఖాన్ని దాచుకుని నవ్వడానికి అంతటి "వేదనా" అనుభవిస్తాడని చెప్పడం చాలా ఆర్ద్రమైన పోలిక.
“దుఃఖాన్ని పూడ్చిపెట్టి
నవ్వుగా మొలకెత్తడం
“ఆమెకు”
తప్పా ఎవరికి సాధ్యం?” అంటూ ఈ కవిత ముగుస్తుంది. చెట్టుకి స్త్రీని ప్రతీకగా చేయటం ఒక బలమైన వ్యక్తీకరణ.

ఈ సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక హింసను, దుఃఖాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాసిన వేదనాత్మక కవిత “కొత్త కాన్పు”. ఈ కవిత ముగింపు ఆలోచింపచేస్తుంది
“క్షేత్రాన్ని కన్న తల్లుల్లారా
కలలతో పాటు కత్తులనూ కనండి
బీజాన్ని కన్న తల్లుల్లారా
వంశంతో పాటు
శవమవ్వని సంస్కారాన్ని
కూడా ప్రసవించండి. (కొత్తకాన్పు)”. నేటి వివక్షాపూరిత సమాజానికి అవసరమైన ఒక కొత్తతరం కోసం కవయిత్రి చేసిన ప్రకటన ఇది.

***
ఈ సంపుటిలో రచయిత్రి అనేక విభిన్నమైన వస్తువులను ఎంచుకున్నారు. వ్యక్తిగత అనుభూతుల నుండి ప్రపంచ యుద్ధాల వరకు, అమ్మ ప్రేమ నుండి విద్యార్థుల ఆత్మహత్యల వరకు కవితావస్తువులో వైవిధ్యం కనిపిస్తుంది. తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని, దానిలోని వైరుధ్యాలను, సంఘర్షణలను చాలా లోతుగా పరిశీలించి తనదైన తాత్విక డైమెన్షన్ ను జోడించి కవిత్వీకరించారు.

కొన్ని కవితలను భాషాపరంగా మరింత సరళంగా చెప్పటం, భావోద్వేగ తీవ్రత వల్ల నిర్మాణం తడబడకుండా చూసుకోవటం లాంటివి చేసిఉంటే అవి మరింత ప్రకాశించేవి అనిపిస్తుంది.
"ఎక్కడ ఏం జరిగినా అందులో జ్యోతి తనను తాను వెతుక్కుంటుంది. లేదూ తనలో అదుందేమోనని వెతుక్కుంటుంది" అని ముందుమాటలో ప్రసేన్ అన్నట్లు, ఆమె ప్రతి వాస్తవంతో మమేకమవుతారు. ఈ తాదాత్మ్యతే ఆమె కవిత్వానికి జీవం పోసింది.

చాలా పదచిత్రాలు ఏకకాలంలో హృద్యంగా, శక్తివంతమైన పొయెటిక్ ఎక్స్ ప్రెషన్స్ గా ఉండటం గొప్ప అరుదైన లక్షణం. మార్చురీబోయ్ ని వర్ణిస్తూ అతను “నగ్నంగా నిద్రపోయే చెట్లకు తోటమాలి” అంటారు.

"జెండా కర్ర మూల్గుతూనే ఉంది ఒక్క వర్ణాన్నే మోయలేక" ("అటే పోవాలి") అంటూ కాషాయీకరణను నిరసిస్తారు. ఈ ఒక్క వాక్యం ఒక పూర్తి రాజకీయ వ్యాసంతో సమానం.
నాగజ్యోతిశేఖర్ గారి కవిత్వం ఆలోచింపజేస్తుంది, ఆర్ద్రతతో కదిలిస్తుంది, కొన్నిసార్లు నిద్రపోతున్న మనస్సాక్షిని తట్టిలేపుతుంది. చాలా కవితలలో నేడు జడలువిప్పి తాండవం చేస్తున్న మతోన్మాదాన్ని దళితబహుజన కోణంలోంచి ఎత్తిచూపారు. స్త్రీల ఆత్మవిశ్వాసం స్వేచ్ఛాకాంక్ష వంటి అంశాలను ఈ సంపుటిలో బలంగా వినిపించారు. మొత్తం మీద, "చిగురించే పేజీలు" కేవలం ఒక కవితా సంపుటి మాత్రమే కాదు, మన కాలపు సామాజిక, మానసిక చిత్రణ. తెలుగు కవిత్వాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

బొల్లోజు బాబా

(ఈ వ్యాసం " నడుస్తున్న తెలంగాణ" పత్రికలో ప్రచురింపబడింది. శ్రీ చందు శివన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను)









పధకం ప్రకారం…..

గాంధి హత్య
ఒక accidental sequence of events అట

చారిత్రపు సన్నని దారంపై
హఠాత్తుగా గూడు కట్టిన చలిగాలి,
దాని కొసలో వణికిన దీపం.

ఎవరో సత్యాన్ని పలికారు
అది గాలిలో కలిసిపోయింది
పూలచెట్టు నీడలో రాలిన ఆకులా
నిశ్శబ్దంగా, తెలియకుండా.

ఎక్కడో దూరంలో
ఒక అగ్ని ప్రమాదం
వాసన మాత్రం దేశమంతా—
అదికూడా
accidental sequence of events
అని నది చెప్పింది తన ప్రవాహంతో.

ఎన్నికల రాత్రి వెలిగిన
వింత లెక్కల అద్దం,
యంత్రం ఒకటే మాట్లాడింది
గెలుపులు గాలిలో మొలిచాయి
చరిత్ర పుస్తకాల్లో గాయాల రూపంలో
మతోన్మాద గుసగుసలు

నిజాలు దగ్గరున్నా ఎవరూ పలకరు.
కన్ను మూసుకుంటేనే
చరిత్ర అందరికీ ఒకేలా కనిపిస్తుంది.

అన్నీ తెలిసినా
ఎవ్వరూ నేరుగా పలకని కథ
సంకేతాలతో చెప్పుకొనే
దేశకాలానుభూతి
ఇది కూడా
accidental sequence of events

బొల్లోజు బాబా

(ఒడిస్సా స్కూలు పుస్తకాలలో గాంధి హత్యను accidental sequence of events గా చెప్పారు)

సార్వత్రిక ఓటుహక్కు ఎలా వచ్చింది?

బ్రిటిష్ పాలనలో భారతీయుల స్వయంపాలనకొరకు పరిమిత ఓటుహక్కుతో ఎన్నికలు జరిగేవి. 1919 లో ప్రొవెన్షియల్, కేంద్ర శాసనసభ్యుల కొరకు జరిగిన ఎన్నికలలో - ఆస్తిపన్ను, ఆదాయపన్ను చెల్లించేవారికి, కొద్దోగొప్పో విద్యార్హత కలిగి ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది.

1921 లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడు, జవహర్ లాల్ నెహ్రూ సెక్రటరీగా పాట్నాలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏ కొద్దిమందికో కాక భారతదేశ ప్రజలందరకూ ఓటుహక్కు (Universal Adult Saffrage) కల్పించాలని తీర్మానం చేసారు. దీన్ని “నెహ్రూ రిపోర్టు” అంటారు.

మహాత్మ గాంధి తన Young India పత్రికలో సార్వత్రిక ఓటుహక్కును ఇలా సమర్ధించారు.

“డబ్బు ఉన్న మనిషికి ఓటు హక్కు ఇచ్చి, సంపద లేదా అక్షరాస్యత లేని మనిషికి ఓటు హక్కు ఇవ్వకపోవడం నేను ఎంతమాత్రం సహించలేను. ప్రతిరోజూ కష్టపడి నిజాయితీగా పనిచేసే మనిషికి, కేవలం పేదవాడు అయిన 'నేరం' కారణంగా ఓటు హక్కు ఉండకూడదు అనే ఆలోచనను నేను అంగీకరించలేను."- మహాత్మా గాంధి (1931).

1935 లో నెహ్రు అధ్యక్ష్యతన జరిగిన లక్నో అఖిలభారత కాంగ్రెస్ మహాసభలలో “సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరగాలని” తీర్మానం చేసారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన రాజ్యాంగం మనం రాసుకొనే క్రమంలొ 1946-1950 మధ్యలో జరిగిన constituent Assembly Debates లో కమిటీ సభ్యులు జాతి, కులం, ధనం, మతం, లింగ భేదం లేకుండా - ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలి అని దాదాపు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ సందర్భంగా- సార్వత్రిక ఓటుహక్కు ఆధారంగా ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూన్నదని జవహర్ లాల్ నెహ్రూ గుర్తుచేసారు. చారిత్రకంగా అణగారిన వర్గాలను శక్తివంతం చేయడానికి సార్వత్రిక ఓటుహక్కు తప్పనిసరి అని డా. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.

నెహ్రూ, డా. అంబేద్కర్, శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, శ్రీ వి మునిస్వామి పిళ్లై లాంటి దార్శనికులు రాజ్యాంగ నిర్మాణ సమయంలో 21 సంవత్సరములు నిండిన ప్రతి భారతీయునికి ఓటుహక్కు కల్పించటం ద్వారా ఈ దేశ నిర్మాణంలో సామాన్యుడు కూడా పాలుపంచుకొనే అవకాశం కల్పించారు.
***

స్వతంత్రభారతదేశ భవిష్యత్తును దేశప్రజల భాగస్వామ్యంతో తీర్చిదిద్దటంలో ఆనాటి దార్శనికులు కృషిచేస్తూండగా…. మరో వైపు ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించటాన్ని ఆనాటి సనాతనవాదులు తీవ్రంగా విమర్శించారు.

రాజ్యాంగ సార్వత్రిక ఓటుహక్కు కల్పించిన సందర్భంలో శ్రీ గోల్వాల్కర్ ఒక సభలో ప్రసంగిస్తూ “అందరికీ ఓటు హక్కు కల్పించటం అంటే కుక్కలు పిల్లులకు హక్కులు ఇవ్వడం కంటే మరేమీ కాదు" అని వ్యాఖ్యానించాడు. (రి. Critical analysis of Rastriya Swayamsevak Sangh by Govind Sahai, ex chief parliamentary secy. pn. 39)

గోల్వాల్కర్ దృష్టిలో ముస్లిములు, క్రిష్టియనులు, కమ్యూనిష్టులు లోపలి శత్రువులు. అదే విధంగా వర్ణవ్యవస్థ ద్వారా దళితబహుజనులను దూరంపెట్టే మనుస్మృతిని రచించిన మనువును మానవాళికి గొప్ప శాసనకర్తగా అభివర్ణిస్తాడు. ఇలాంటి అభిప్రాయాలున్న వ్యక్తి కుక్కలు పిల్లులకు హక్కులు కల్పించారు అనటంలో- ఆ కుక్కలు పిల్లులు ముస్లిములు, క్రిష్టియనులు, కమ్యూనిష్టులు, అవర్ణులు అని సులభంగానే పోల్చుకోవచ్చు.

సాటి మనిషిని కుక్కలు పిల్లులుగా చూసే సంస్కృతి మనువాదులది.

ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ January 7, 1952 సంచికలో సార్వత్రిక ఓటుహక్కు ను ఎద్దేవా చేస్తూ "భారతదేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు (universal adult franchise) విఫలమైందని పండిట్ నెహ్రూ స్వయంగా ఒప్పుకునే వరకు జీవించే ఉంటారు" అని వ్యాఖ్యానించింది. (Reference: India After Gandhi: The History of the World's Largest Democracy By Ramachandra Guha pn 157)

ఈ అభిప్రాయం, కొత్తగా ఓటు హక్కు పొందిన, నిరక్షరాస్యులైన భారతీయ ప్రజల సామర్థ్యాన్ని వెటకరిస్తుంది. వయోజనులందరకీ ఓటుహక్కును ఇవ్వటం లోని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది.

ప్రజలందరూ సమానంకాదు, ఎక్కువతక్కువలుగా విభజింపబడి ఉన్నారని చెప్పిన మనుస్మృతి సూత్రాలను తిరస్కరించి ప్రజలందరూ సమానమే అని చెప్పింది రాజ్యాంగం. అది కల్పించిన సార్వత్రిక ఓటుహక్కును మనువాదులు విమర్శించిన తీరు ఇది.

దీని వెనుక ఉద్దేశాలు స్పష్టమే. వేల సంవత్సరాలుగా సమాజపు నెత్తిపై కూర్చుని అందరిపై సాగించిన పెత్తనం ఇంకా కొనసాగించాలని.

***
ఈ రోజు విచ్చలవిడిగా జరుపుతోన్న తొలగింపుకు మూలాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీ గోల్వాల్కర్ చెప్పినట్లు కుక్కలకు పిల్లులకు ఓట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోవటం అభ్యంతరకరం. …. పిర్రలు కోయాలి…. ఏ కాలంలోనైనా….

బొల్లోజు బాబా

మతవాదులు పదే పదే ప్రచారంలో ఉంచే కొన్ని అంశాలు….


1. ప్రచారం: బ్రిటిష్ వారికి కావలసిన బానిసలను తయారుచేయడానికి మెకాలే అంతవరకూ అద్భుతంగా నడిచిన గురుకులాలను తొలగించి ఇంగ్లీషు చదువులను ప్రవేశపెట్టాడు. ఈ మెకాలే విద్య వలన బానిస మనస్తత్వం పెరిగింది.

వాస్తవం: మెకాలే శాస్త్రీయ విద్యను ప్రవేశపెట్టాడు. దాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరకూ అందుబాటులోకి తెచ్చాడు. దీనివల్ల శతాబ్దాలుగా విద్యకు దూరంగా ఉన్న శూద్ర, అతి శూద్ర వర్గాలు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను పొందారు. అలా వచ్చినవారిలో మహాత్మా పూలే, డా. అంబేడ్కర్ లు నేటికి సమాజానికి వేగుచుక్కలే.

గురుకులాలు బ్రాహ్మణులకు మాత్రమే విద్యనందించేవి. వర్ణవ్యవస్థలో శూద్ర అతిశూద్ర వర్ణాలకు, స్త్రీలకు విద్య నిషేదం. సమాజంలో సుమారు 90 శాతం ఉండే ఈ ప్రజలు 10% ఉండే ఉన్నత వర్ణాలకు జీవితపర్యంతం సేవలు చేయాలని ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఈ బానిసత్వాన్ని మెకాలే విద్యావిధానం బద్ధలుకొట్టి శూద్ర అతిశూద్రులకు స్వేచ్చనిచ్చింది. కులానికి విద్యకు ఉన్న బంధాన్ని తుంచేసింది. అలా జరగటం ఇష్టం లేని వ్యక్తులే ఇంకా మెకాలేని ఆడిపోసుకొంటారు.
.
2. ప్రచారం: బ్రిటిష్ వారు కులాన్ని సృష్టించి, ప్రజలను కులాలుగా విభజించారు

వాస్తవం: ధర్మశాస్త్రాల ప్రకారం సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణాలుగా విభజింపబడి ఉండేది. క్రమేపీ పై మూడు వర్ణాలు ఒక్కోకులంగా స్థిరపడగా శూద్రవర్ణం మాత్రం వృత్తులు ఎండోగమీ కారణంగా భిన్నకులాలుగా c100 CE అంటే సుమారు రెండువేల సంవత్సరాల క్రితం స్థిరపడ్డాయని ఆధునిక జన్యుశోధనలు తెలియచేసాయి. పదకొండోశతాబ్దం నుంచీ వేయబడిన అనేక శాసనాలలో వివిధ కులాల పేర్లు కనిపిస్తాయి. అప్పటికి ముస్లిములు (పూర్తిస్థాయిలో), బ్రిటిష్ వారు లేరు.

పోనీ బ్రిటిష్ వారు కులగణన చేసి అప్పటికి ఉన్న కులాలను స్థిరీకరించారా అనుకొంటే, భారతదేశంలో మొదటిసారిగా కులగణన 1658-1664 మధ్య హిందూ పాలిత మార్వాడ్ రాజ్యంలో మహరాజా జస్వంత్ సింగ్ ఆధ్వర్యంలో జరిగింది.

బ్రిటిష్ వారికి ఏ సంబంధమూ లేని కులవిభజనను వారికి ఆపాదించటం అంతకు ముందు సమాజం గొప్ప సమానత్వంతోను, ఐకమత్యంతోను, ఏ హెచ్చుతగ్గులు లేకుండా నడిచిందని ప్రచారించటానికే.
.
3. ప్రచారం: బ్రిటిష్ వారు మనలను విభజించి పాలించారు

వాస్తవం: నిజానికి శతాబ్దాలుగా ప్రజలను ఎక్కువతక్కువ వర్ణాలుగా విభజించి ఆధిపత్యంతో 90 శాతం ప్రజలను బానిసలుగా చేసుకొని పాలించింది మనుధర్మమే. తాము చేసిన పనిని బ్రిటిష్ వారు చేసారని చెప్పటం కాపట్యం.
.
4. ప్రచారం: ముస్లిమ్ దండయాత్రలనుండి కాపాడుకోవటానికే స్త్రీ స్వేచ్చను కట్టడి చేయటం, సతి ఆచారం, బాల్యవివాహాలు వంటివి వచ్చాయి.

వాస్తవం: ఇస్లామ్ మతం పుట్టకముందే రాసుకొన్న మహాభారతంలో సతి సహగమన ఉదంతం ఉంది. విష్ణుపురాణంలో శ్రీకృష్ణుని అష్టభార్యలు సతీసహగమనం ఆచరించినట్లు ఉంది.
సతీసహగమనం గురించి విష్ణుస్మృతి (25.14), పరాశర స్మృతి (4.29-31, అగ్నిపురాణం (222:19-23), గరుడపురాణం (1.107.29) లలో చెప్పబడింది.

మనుధర్మ శాస్త్రంలో బాల్యవివాహ ప్రస్తావన ఉంది. స్త్రీ విశ్వసించదగిన వ్యక్తి కాదు అంటుంది.
ఈ హిందూ గ్రంథాలేవీ ముస్లిం పాలనలో రాసినవి కావు. ఈ ప్రచారం ఒక వర్గంపై ద్వేషాన్ని నూరిపోయడానికే
.
5. ప్రచారం: వేదాలలో విమాన నిర్మాణం, అటమిక్ బాంబ్ తయారీ, ప్లాస్టిక్ సర్జరీ, (వినాయకుడు) క్వాంటమ్ థీరీ, టెస్ట్యూబ్ బేబీ (కర్ణుడు) లాంటి ఆధునిక శాస్త్ర సాంకేతిక శాస్త్రాలు ఉన్నాయి.

వాస్తవం: ఇది పురాణాలను చరిత్ర/సైన్సు ను కలగాబులగం చేయడం. పెద్ద పెద్ద పదవులలో ఉన్నవారే ఇలా మాట్లాడటం శోచనీయం. వేదాలను అనువదించిన మాక్స్ ముల్లర్ ఇలాంటి గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణల కనీస ప్రస్తావన తేలేదు. అందుకే మాక్స్ ముల్లర్ అంటే నేటికీ మతవాదులకు ద్వేషం.

పోనీ ఈ పండితులు వేదాలలో ఉన్నట్లు చెబుతున్న ఈ అంశాలపై సైంటిఫిక్ జర్నల్స్ లో పేపర్లు రాసి అంతర్జాతీయ శాస్త్రవేత్తల అంగీకారం పొందారా అంటే అదీ లేదు. ఈ నాటికీ కూడా వేదాలలో అన్నీ ఉన్నాయి అంటూ మాటలు చెబుతారు. ఆధారాలు చూపటం మనపద్దతి కాదు అని బండగా వాదిస్తారు.

ఖగోళశాస్త్రం, వైద్యం, గణితం లాంటి రంగాలలో ప్రాచీనభారతీయుల కృషి ఎన్నదగ్గది. ఆయా శాస్త్రాల పురోగతిలో బౌద్ధ, జైన, చార్వాక మతస్థుల ప్రమేయాన్ని కొట్టిపడేయలేం. ఆరోశతాబ్దంలో హిందుమతం అన్ని మతాలపై పైచేయి సాగించిన పిదప పై రంగాలలో పెద్దగా ఆవిష్కరణలు కనిపించవు. పైపెచ్చు ఖగోళశాస్త్రం అశాస్త్రీయ జోతిష శాస్త్రంగా మారి కొందరికి ఉపాధిగా మిగలటం చారిత్రక విషాదం.
.
6. ప్రచారం: ఆర్యుల వలస జరగలేదు. ఇది బ్రిటిష్ చరిత్రకారుల సృష్టి. ఆర్యులు ఇక్కడి వారే. ఇక్కడనుంచి ప్రపంచదేశాలకు వలసలు వెళ్ళారు (out of india theory)

వాస్తవం: ఆర్యులు అనబడే యోధజాతి Eurasian Steppe (మధ్య ఆసియా) ప్రాంతాలనుండి c1900-1500 BCE మధ్య భరతఖండానికి వలస వచ్చినట్లు నేడు జన్యు పరిశోధనలద్వారా నిరూపించబడింది. ఇంకా… ఈ ఆర్యుల జన్యువులు (R1 haplogroup) నేటి బ్రాహ్మణులలో ఎక్కువగాను, lower castes లో తక్కువగాను ఉన్నట్లు గుర్తించారు.

అలా బయటనుంచి వచ్చిన విదేశీ ఆర్యులు భరతఖండంలోకి సంస్కృతాన్ని తీసుకొని వచ్చారు. ఆర్యులు రాసుకొన్న వేదసాహిత్యంలో అప్పటికి ఉన్న నగరాలను ధ్వంసం చేసినట్లు అనేక సూక్తాలు కలవు. వర్ణవ్యవస్థను ఏర్పరచి హరప్పాకాలం నుంచీ అంటే సుమారు 8000 సంవత్సరాలుగా భరతఖండంలో నివస్తున్న అబొరిజినల్ ప్రజలను దిగువశ్రేణి ప్రజలుగా చేసారు.
ఆర్యులు విదేశీయులైతే వారి జన్యువులు కలిగిన ఈ పండితులు కూడా టర్కీ నుంచి వలసవచ్చిన తురకలతో సమానమవటం ఇష్టం లేక, మేము ఇక్కడి వాళ్ళమే అని చెప్పుకోవటానికి ఆర్యుల వలస సిద్ధాంతం తప్పు అని ఇంకా ప్రచారం చేస్తున్నారు. out of india theory అంటూ అతివిశ్వాసపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జన్యు ఆధారాలు చూపలేక ప్రపంచం ముందు నవ్వులపాలయ్యారు.
.
7. ప్రచారం: RSS కులరహితమైనది, సమానత్వాన్ని పాటిస్తుంది (RSS is casteless and egalitarian)

వాస్తవం: కులం/జాతి కాలం చెల్లిన వ్యవస్థ అని దాన్ని తొలగించాలని ఆ సంస్థ పెద్దలు వేదికలపై మాట్లాడతారు. కానీ ఆ సంస్థ అధినాయకత్వం బ్రాహ్మణులతో నిండి ఉంటుంది. దళిత బహుజనులు కిందిస్థాయి, కొంతమేరకు మిడిల్ కేడర్ లో ఉంటారు తప్ప పై స్థాయిలో ఉండరు. వందేళ్ల చరిత్రలో ఒక్కరంటే ఒక్క అబ్రాహ్మణుడు ఆ సంస్థ అధ్యక్షుడు కాలేదు. ఒక్క మహిళ కూడా. ఈ సంస్థ సిద్ధాంతకర్తలకు కులవివక్షను అనుసరించే మనుస్మృతి ఆదర్శనీయం. కాగా ఈ సంస్థ కులరహితమైనదని అనటం వాస్తవాల వక్రీకరణ.
***

ఇవేకాక లాక్డ్ ప్రొఫైల్ పెయిడ్ మనువాదుల పోస్టులలో, కామెంటులలో – రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా మెరిట్ వాదం; మనుస్మృతి ఏనాడు సామాజికంగా అమలులో లేదని; ఏదైనా విమర్శిస్తే బ్రాహ్మణ ద్వేషమని దాడి చేయటం; గుణ కర్మల వలన ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చని దబాయించటం; అహింస గొప్పహిందూ ధర్మమని హింస ఇతరమతాలదనటం; వేదాలలో ఆవుమాంసం తినేవారనే సత్యాన్ని అంగీకరించక అది మాంసం కాదు దుంపలు అంటూ వాదించటం; వారి బ్రాహ్మణ మూలాలను దాచిపెట్టి వాల్మీకి, వ్యాసుడు లాంటి కొందరిని చూపి తక్కువ కులాలవారిపై ఏనాడూ ఆంక్షలు లేవని బుకాయించటం…. లాంటి అనేక అసత్యాలు, వక్రీకరణలు అలవోకగా దొర్లిపోతూంటాయి. చూసి నవ్వుకోవడమే.

బొల్లోజు బాబా

ఉత్తరం రాసిన 272 మంది.

భారతరాజ్యాంగ అధికారులపై దాడిచేస్తున్నారని అభియోగిస్తూ ఇటీవల 272 మంది సమాజంలోని కొందరు మర్యాదస్తులు ఉత్తరం రాసారు. ఈ రాసినవారు “ఎవరు” అని గ్రోక్ ని అడిగాను. దాని సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించలేదు.

వీరిలో 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 133 రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు.
 
వీరి సామాజికవర్గాన్ని విశ్లేషించమని అడిగినపుడు గ్రోక్ ఇలా చెప్పింది…

వీరిలో బ్రాహ్మణులు+క్షత్రియులు+కాయస్తులు+వైశ్యులు లాంటి ఉన్నతవర్ణాలకు చెందిన చెందిన వారు సుమారు 248 మంది ఉన్నారని - సింగ్, రావు, గుప్తా, వర్మ దలాల్ లాంటి పేర్లద్వారా తెలుస్తుంది. అంటే సంతకాలు చేసినవారిలో 91 శాతం ఉన్నతవర్గాలకు చెందినవారే. దేశజనాభాలో వీరు 10 శాతం కన్నా తక్కువ.
 
ఇక ఈ 248 మందిలో 61 శాతం అంటే సుమారు 165 మంది బ్రాహ్మణ వర్గాలకు చెంది ఉన్నట్లు - శర్మ మిశ్రా, తివారి, శుక్లా, త్రివేది, ద్వివేది, అయ్యర్, శ్రీ వాస్తవ, సిన్హా, మాథుర్, పాఠక్, త్రిపాటి, భండారి, భరద్వాజ భార్గవ, చతుర్వేది, చావ్లా, మెహతా వంటి ఇంటిపేర్ల ద్వారా తెలుస్తుంది.
ఈ లిస్టులో దళితులు, బహుజనులు ముస్లిముల ప్రాతినిధ్యం అతి స్వల్పం. నిజానికి ఈ దేశ జనాభాలో వీరు 90%. క్రిష్టియన్ లు లేనే లేరు. స్త్రీలు 5 % కూడా మించలేదు.
***

ఇదీ ఆధునిక భారతదేశపు సామాజిక స్వరూపం. రాజకీయ వాస్తవం. సమాజం ఎంత లోతుగా పోలరైజ్ అయిపోయిందో ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది. ఈ 10 శాతం వ్యక్తులు దేశప్రజలకు ఎలా ప్రాతినిథ్యం వహిస్తారనేది ప్రశ్నార్ధకం.
 
ఈ ఉత్తరంలో మరొక కనిపించని పార్శ్వం ఏమిటంటే ఈ దేశంలోని ఉన్నతపదవులలో ఉన్నతవర్ణాలు ఏ స్థాయిలో తమ ప్రభావాన్ని నేటికీ కూడా చూపగలుగుతున్నాయో అనే అంశం.
"ఈ సవర్ణ లాబీయింగ్ దేనికొరకు అనే విషయాన్ని ఎవరికి వారే గ్రహించాలి.

బొల్లోజు బాబా

ఫ్రాగ్మెంట్

రోజూ అంకెలు
మనప్రపంచాన్ని
కత్తిరిస్తూ, అతికిస్తూ
సులభంగా మనకందించేందుకు
నిత్యం శ్రమిస్తూంటాయి

తొలి ఉషస్సును తట్టిలేపిన
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం

అధర్మస్థాపన చేసిన
పది అవతారాలు

చావుబతుకుల్ని శాసించే
15 ఎమ్.ఎమ్ కణితి

జ్ఞాపకాల దండను మెడలో వేసే
వేయి శరత్తుల సంబరాలు.... అలా...

బొల్లోజు బాబా

ఇస్మాయిల్ ఒక స్కూల్ ఆఫ్ థాట్ కు తెలుగునాట ప్రతినిధి

అందరు సాహితీ వేత్తలకు ఒక్కో స్కూల్ ఉన్నట్లే ఇస్మాయిల్ కి కూడా కవిత్వం పట్ల నిర్ధిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఇస్మాయిల్ కవిత్వాన్ని పొయెట్రీ ఆఫ్ ఐడియాస్, పొయెట్రీ ఆఫ్ ఎక్స్పిరియన్స్ అని విభజించారు. రాజకీయ ఐడియాకు కట్టుబడి రాసేవారి కవిత్వంలో పునరుక్తి అనివార్యంగా దొర్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ కవిత్వం శుష్క నినాదప్రాయంగా మిగిలిపోతుందని, దానివల్ల కవిత్వ ప్రయోజనం సిద్ధించదు అని ఆయన విశ్వసించారు. కవిత్వం అనేది “హృదయ సంబంధి” అని బలంగా నమ్మారు. ఈ అభిప్రాయాలపై అప్పట్లో లోతుగానే చర్చలు జరిగాయి. ఇస్మాయిల్ కవిత్వం “కర్రల అడితి” కవిత్వం అన్నారు. (అంటే కవిత్వం అనే అరణ్యాన్ని నరికి సైజులవారిగా కోసి అడుగుల లెక్క అమ్మే దుకాణం అనే వ్యంగ్యం). చిలకపలుకుల కవిత్వం అని ఎద్దేవాచేసారు. సామాజిక ప్రయోజనం లేని వ్యర్ధసృజన అని బ్రాండ్ చేసారు. ఇంకా మరికొందరు విమర్శకులు ఇస్మాయిల్ కవిత్వం దోపిడీశక్తులకు దోహదపడిందని అభియోగించారు.
 
వీటన్నిటినీ ఇస్మాయిల్ ఎదుర్కొన్నారు. తన మార్గాన్ని మార్చుకోలేదు, తాను రాయాల్సిందేదో రాసారు ఆయనే ఓ కవితలో అన్నట్లు
 
కీర్తి శేషుడైన కవి
కాలతీరాన
కాసేపు పచార్లు చేసి
గులకరాయొకటి
గిరవాటేసి
తిరిగి వెళ్లిపోయాడు

.... కవిగా గుప్పెడు అక్షరాల్ని మనకు మిగిల్చి వెళ్లిపోయాడు.
 
కవిగా ఇస్మాయిల్ వెలువరించిన కవిత్వం కానీ, వెలిబుచ్చిన అభిప్రాయాలు కానీ, అతనికి మాత్రమే చెందినవి కావు. అదొక స్కూలు ఆఫ్ థాట్.
 
ఇస్మాయిల్ ను విమర్శించదలచుకొన్నవారు అతని స్కూల్ ఆఫ్ థాట్ ను విమర్శించాలి కాని, అతన్ని వ్యక్తిగతంగా విమర్శించటం అకడమిక్ విమర్శ అనిపించుకోదు. ఇస్మాయిల్ వలె ఆలోచించేవారు, అతని లాంటి అభిప్రాయాలను వెలువరించినవారు ప్రపంచ సాహిత్య చరిత్రలో అనేకమంది కనిపిస్తారు

1. “క్షణక్షణం మనల్ని ప్రత్యక్షంగా తాకే అనుభవాలూ… ఇవి కాక కవిత్వానికేవీ అర్హం? “కవి అనుభవాల్ని తనలో ఇంకించుకుని అంతర్దర్శి ఐనప్పుడు మంచి కవిత్వం జనిస్తుంది.” -- ఇస్మాయిల్

ఇవే అభిప్రాయాలను “Go into yourself. Find the reason that commands you to write అని Rilke; “My poetry springs from a personal, inward source.” అని Neruda అన్నారు.
 
2. సాహిత్యంలో రాజకీయ కాలుష్యాన్ని మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను – ఇస్మాయిల్
“When a writer allows himself to be guided by politics, he kills his poetry.” అన్న Czesław Miłosz (Nobel) మాటల ద్వారా ఇస్మాయిల్ ఎందుకు రాజకీయ కవిత్వాన్ని విమర్శించాడో అర్ధం చేసుకోవాలి. అంతే తప్ప ఇస్మాయిల్ రాజకీయకవిత్వాన్ని ఇష్టపడకపోవటం ద్వారా ఈ సమాజానికి ద్రోహం చేసాడని చెప్పటం సహృదయ విమర్శ అనిపించుకోదు.
 
Poetry makes nothing happen.” అంటాడు WH Auden కవిత్వ విలువ సౌందర్యం, ఆథ్యాత్మికత తప్ప రాజకీయం కాదు అనే ఉద్దేశంలో.
 
3. “జీవిత మహోత్సవంలోని అద్భుతాన్ని ఆవిష్కరించడమే కవిత్వం పని.” – ఇస్మాయిల్
“To feel the love of people… is the most beautiful of all poetry.” నెరుడా.
 
ఇస్మాయిల్ స్కూల్ ఆఫ్ థాట్ ను కలిగి ఉండే మరికొందరు కవుల అభిప్రాయాలు
4. We make out of the quarrel with others, rhetoric, but of the quarrel with ourselves, poetry.” -- WB Yeats

స్వీయాన్వేషణ, లోలోనికి ప్రయాణించి మనతో మనం ప్రశ్నించుకోవటం ద్వారా కవిత్వం పుడుతుంది. బాహ్యంగా ఇతరులతో రాజకీయ వాదప్రతివాదనలు ద్వారా ఉపన్యాసాలు, తర్కం, మాటలు, వాదనలు పుడతాయి. (ఇస్మాయిల్ శుష్కవచనం అన్నది దీనిగురించే)

5. “Poetry is the scholar’s art… not a vehicle for moral or political instruction.” -- Wallace Stevens
కవిత్వం మేధోపరమైన కళ అది రాజకీయసందేశాలకోసం కాదు అంటాడు స్టీవెన్స్. ఇతని దృష్టిలో కవిత్వం రాజకీయవేదికగా కాకుండా అనుభూతి ప్రధానం. ఇది Art for Art’s Sake సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది.
 
6. “Poetry is more a mode of being than a way of arguing.” Seamus Heaney (Nobel Laureate)
సీమస్ తనను “రాజకీయకవి” అని లేబుల్ చేయడాన్ని ఇష్టపడలేదు. కవిత్వం అనేది వాదప్రతివాదనలు కాదు. అదొక జీవనవిధానం. అనుభూతుల ఆవిష్కరణ అంటాడు. (ఇస్మాయిల్ కూడా తనకు లేబుళ్ళు అతికించుకోవటం ఇష్టం లేదు అన్నాడు.)

7. I am not politically minded. I am aesthetically minded, philosophically perhaps. I don't belong to any party. In fact, I disbelieve in politics..."… “All political passion is a kind of blindness.” --Jorge Luis Borges (Argentina)
నాకు రాజకీయాలు ఇష్టం ఉండదు. రాజకీయాలపై తీవ్రమైన అభిమానం మనిషి చూపును, తీర్పును, సత్య దృష్టిని కబళించి, అతన్ని అంధుడిలా మార్చేస్తుందని బోర్జెస్ అభిప్రాయపడ్డాడు. ఇస్మాయిల్ జీవితాంతం పోరాడింది ఈ అంశంపైనే.

8. “We hate poetry that has a palpable design upon us.” -- John Keats (“Palpable design” means political or moral intention)
కవిత్వం అనేది సహజంగా, స్వతంత్రంగ ఉండాలి. కళ సొంత శక్తితో మనసులను తాకాలి. (అరువుతెచ్చుకొన్న ఐడియాలజీతో కాదు). పాఠకుడిని నైతికంగానో, రాజకీయంగానో ప్రభావితం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు దానిని ఆస్వాదించలేం అంటాడు కీట్స్.
.
ముగింపు

ఇవన్నీ ఇస్మాయిల్ స్కూల్ ఆఫ్ థాట్ ను ప్రతిబింబించే వివిధ కవుల అభిప్రాయాలు. కవిగా ఇస్మాయిల్‌ను విమర్శించదలచినవారు ముందుగా గ్రహించవలసిన ప్రధాన విషయం ఏమంటే—అతని వ్యక్తిత్వం, రాజకీయాలు విమర్శించే విషయాలు కావు. అతని ‘స్కూల్ ఆఫ్ థాట్’—కవిత్వ స్వరూపం, అనుభూతి ప్రాధాన్యం, రాజకీయాల నుండి కళను దూరంగా ఉంచాలనే అతని నమ్మకాలు—ఇవే చర్చనీయాంశాలు. ఏ శాస్త్రీయ విమర్శకుడైనా వ్యక్తిని కాక, ఆలోచనలను విశ్లేషించాలి.

అనుభూతి ప్రధానత, అంతర్ముఖ ప్రయాణం, కళకి ఉండాల్సిన స్వతంత్రం, రాజకీయాల వల్ల కవిత్వ స్వభావం కలుషితం అవుతుందనే హెచ్చరికలు—ఇవి అన్నీ ఇస్మాయిల్‌ ఒక్కరికి మాత్రమే ప్రత్యేకమైనవి కావు; ఇవి ప్రపంచ కవులలో సుస్పష్టంగా కనిపించే పెద్ద ధార. ప్రపంచ కవిత్వ పరంపరలో ఒక స్కూల్ ఆఫ్ థాట్ కు తెలుగునాట ప్రతినిధిగా ఇస్మాయిల్ ను చూడాలి.
అదే సమయంలో -- రాజకీయ కవిత్వాన్ని పూర్తిగా తిరస్కరించటం వల్ల సామాజిక అనుభవాలు, సమూహ పీడనలు, చరిత్ర లాంటి అంశాలు కవిత్వానికి దూరమౌతాయనే ఎరుకను కూడా కలిగి ఉండాలి. ఇస్మాయిల్ తిరస్కరించిన రాజకీయ పంథాలో గొప్ప సాహిత్యం పుట్టిందనేది కూడా సత్యమే కావొచ్చు. అది ఇస్మాయిల్ దారిని వ్యతిరేకించేది కాదు. ఆయనకు సమాంతరంగా ఉన్న మరొక సృజనపథం. అంతే. దాన్ని మరొక స్కూల్ ఆఫ్ థాట్ గా తీసుకోవాలి తప్ప ఒక్కదాన్నే అంతిమ సత్యంగా చెప్పటం సమదృష్టికాదు. అలా చెప్పటం బౌద్ధిక బహుళతను విచ్చిన్నంచేయటమే.
 
ఇస్మాయిల్ రాజకీయకవిత్వాన్ని దూరంగా ఉంచాలన్న తన సిద్ధాంతాన్ని నిర్మలంగా ఆచరించాడు. ఇస్మాయిల్ పై వ్యక్తిగత దాడి విమర్శకాబోదు, ఆనాడూ ఈనాడూ కూడా. అతని కవిత్వ ఐడియాలజీని బౌద్ధిక బహుళతలో భాగంగా చూడాలి.
 
పదిహేనేళ్ళ కాల వ్యవ్యధిలో ఇస్మాయిల్ కవిత్వం జీవితంపై మొత్తం 5 వ్యాసాలు రాసాను. అవన్నీ ఒకచోట ఉంటే బాగుంటుందని ఇలా ఇ బుక్ గా విడుదల చేస్తున్నాను.
ధన్యవాదములతో
భవదీయుడు
బొల్లోజు బాబా
25, నవంబరు 2025

(ఇస్మాయిల్ కవిత్వం, జీవితం పేరుతో 36 పేజీల పిడిఎఫ్ డౌన్ లోడ్ లింకు మొదటి కామెంటులో కలదు)
https://archive.org/details/20251125_20251125_1720

రాజ్యాంగ దినోత్సవం రోజున......

రాజ్యాంగ దినోత్సవం రోజున ఒక మిత్రుని మాటలలో రెండు ఆసక్తికర విషయాలు దొర్లాయి. వీటిని చాలా కాజువల్ గా రిమార్క్ చేసాడు.
 
1. డా. అంబేడ్కర్ విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 10 ఏళ్లకే పరిమితం చేసారు. ఆ తరువాత పాలకులు దానిని స్వప్రయోజనాలకొరకు పెంచుకొంటూ వస్తున్నారు

2. డా.అంబేడ్కర్ విభజనానంతరం భారతదేశంలో ఉండిపోయిన ముస్లిములను వారికి ఇచ్చిన దేశానికి వెళిపొమ్మని అన్నారు.

చాలా సాధారణ అంశాలలాగ కనిపించే పై విషయాల వెనుక బహుముఖాలతో లోతైన ద్వేషం, అసూయ, విషం ఉన్నాయని ఇట్టే అర్ధమైపోతుంది.
 
వివరణ:
రాజ్యాంగం పొలిటికల్ రిజర్వేషన్లకు మాత్రమే 10 ఏళ్ళ పరిమితి విధించింది. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు ఏ రకమైన పరిమితులు విధించలేదు. డా. అంబేడ్కర్ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పదేళ్లకు మాత్రమే ఇచ్చారు అని చెప్పటం వక్రీకరణ.
 
1932 పూనా ఒడంబడిక ద్వారా దళితులు మాత్రమే పోటీ చేసే Reserved Constituency లు ఏర్పరచారు.

దళితులకు Reserved Constituency ల ద్వారా అప్పటివరకూ ఇస్తున్న పొలిటికల్ రిజర్వేషన్లు కొనసాగించాలా వద్దా అనే అంశం మరలా రాజ్యాంగ పరిషత్ చర్చలలో వచ్చింది. (constituent assembly debates). ఆనాటి మేధావులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి….

1. ఈ దేశంలోని ప్రతి దళితుడుకి పది ఎకరాల భూమి ఇచ్చి ఈ పొలిటికల్ రిజర్వేషన్లను తీసివేయడానికి నాకు అభ్యంతరం లేదు - S. Nagappa (Madras) పే: 3214

2. మీరు మాకు పదేళ్లపాటు పొలిటికల్ రిజర్వేషన్లు ఇచ్చి మీకు చేయాల్సిందంతా చేసామని చేతులు దులుపుకుంటే కుదరదు. మమ్మలను విద్యాపరంగా, ఆర్ధికంగా పైకి తీసుకురావడానికి మీవద్ద ఏ ప్రణాళికలు ఉన్నాయో కూడా చెప్పండి. -- Shri H.J. Khandekar, పే:4589)

3. పొలిటికల్ రిజర్వేషన్లు పది సంవత్సరాల పాటు అనేది చాలా తక్కువ వ్యవధి -- Shri Chandrika Ram పే 4609.

4. దళితులకు పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించటం మనం వారికి చేయగలిగే అత్యుత్తమ పని – జవహర్ లాల్ నెహ్రూ పే. 3216

5. “పదేళ్ళ వరకు" అనే పదం తరువాత “అవసరమైతే మరికొంతకాలం పొడిగించవచ్చు” అనే వాక్యాన్ని ప్రవేశపెట్టండి భవిష్యత్తులో పార్లమెంటుకు ఆమేరకు వెసులుబాటు ఉండే విధంగా. (Shri V.I. Muniswamy Pillay) పే 4600

6. పొలిటికల్ రిజర్వేషన్లను సంపూర్ణంగా రద్దు పరచాలి. కులమతాలకు అతీతంగా ఎన్నికలు జరగాలి-- Prof. Shibban Lal Saksena, పే2789

పొలిటికల్ రిజర్వేషన్లకు పరిమితి విధించినట్లుగానే విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు కూడా పదేళ్ల తరువాత కొనసాగించకూడదని Pandit Hirday Nath Kunzru ఒక సవరణను ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనను రాజ్యాంగ సభ తిరస్కరించింది. పే 2123. అలా పదేళ్ల పరిమితి అనేది పొలిటికల్ రిజర్వేషన్ల కొరకే తప్ప , విద్యా ఉద్యోగాల కొరకు కాదు అని రాజ్యాంగ సభ తీర్మానించింది.
డా. అంబేడ్కర్ ఎక్కడా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పదేళ్ళ వరకే ఉండాలని చెప్పకపోయినా అలా చెప్పారని అనటం విష ప్రచారం.
 
దళిత ఆదీవాసిలకు ఇస్తున్న పొలిటికల్ రిజర్వేషన్ల వలన ప్రస్తుత పార్లమెంటులో - 84 మంది ఎస్సీ ఎంపీలు (16%), 47 ఎస్టీ ఎంపీ (9%) లతో వారి రాజకీయ ప్రాతినిధ్యం వారి జనాభాతో సరిపోతుంది. ఇది పొలిటికల్ రిజర్వేషన్లు సాధించిన ప్రగతి. ఇవే లేకుంటే- ఈ సంఖ్యలు అసంభవం. బహుజనుల పొలిటికల్ రిజర్వేషన్లు ఏనాటికైన గమ్యం కావాలి.
ఇక స్వాతంత్రపూర్వం ముస్లిములకు కూడా పొలిటికల్ రిజర్వేషన్లు ఉండేవి. (ముస్లిములు మాత్రమే తమ ప్రతినిధులను ఎన్నుకొనే కొన్ని నియోజకవర్గాలు). స్వాతంత్రం వచ్చాక అవి తొలగించారు.
 
దేశజనాభాలో దాదాపు 15% జనాభా ఉన్న ముస్లిముల ప్రాతినిధ్యం నేటి పార్లమెంటులో 24 మంది. ఇది 4.4% మాత్రమే. అంటే ప్రస్తుత పార్లమెంటులో జనాభాప్రకారం 77 మంది ఎంపీల ప్రాతినిధ్యం ఉండాల్సిన ముస్లిమ్ ఎంపీలు 24 మంది మాత్రమే ఉండటానికి కారణం వారికి తొలగించబడిన పొలిటికల్ రిజర్వేషన్ లు కారణం కావొచ్చు.
***

Pakistan or Partition of India (1947) పుస్తకంలో డా. అంబేడ్కర్ ఆనాటికి సామాజిక ఆర్ధిక రాజకీయ అంశాలను చర్చిస్తూ దేశవిభజన పట్ల తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. దీనిలో డా. అంబేడ్కర్ హిందూ ముస్లిమ్ మతరాజకీయాలను నిరసించారు. అవి అలాగే కొనసాగితే హిందూ ముస్లిములు ఒక దేశంగా జీవించలేరని దేశవిభజన అనివార్యం అని అభిప్రాయపడ్డారు.
 
మతప్రాతిపదికన దేశ విభజనకు, ద్విజాతి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేదు. దేశం ఒకటిగా ఉండాలని కోరుకున్నారు.
 
దేశ విభజన పర్యవసానాలైన – భారీ వలసలు, హింస, లక్షల ముస్లిములు కాందిశీకులుగా మారిపోవటం గురించి ఈ పుస్తకంలో చర్చించారు తప్ప విభజన జరిగితే ఇక్కడి ముస్లిములందరూ వారికివ్వబడిన దేశానికి వెళ్ళిపోవాలని ఎక్కడా అనలేదు. పార్టిషన్ పై డా. అంబేడ్కర్ ది శాస్త్రీయ విశ్లేషణ.
 
విభజనానంతరం ఇక్కడ ఉండిపోయిన ముస్లిముల పట్ల డా. అంబేడ్కర్ సహానుభూతితో వ్యవహరించారు. రాజ్యాంగంలో- ఇస్లామిక్ పర్సనల్ లా, ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపుని, విద్యా వ్యవస్థను కాపాడుకొనే హక్కు, మైనారిటీ హక్కులు, మెజారిటేరియన్ మత ఆధిపత్యం నుండి రక్షణ, మతస్వేచ్ఛ లాంటి రక్షణలను ఆర్టికిల్స్ 25–30 లలో పొందుపరచారు. ఇవన్నీ డా. అంబేడ్కర్ ముస్లిములను తన సహోదరులగా భావించి కల్పించిన రాజ్యాంగ హక్కులు.
డా. అంబేద్కర్ ఈ దేశ ముస్లిములను విభజన పూర్వం కానీ, అనంతరంకానీ ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లమని అనలేదు. అది వక్రీకరణ.

బొల్లోజు బాబా

పోస్ట్ స్క్రిప్ట్.

శ్రీ Srinivas Vuruputuri గారి తో జరిపిన చర్చలో ఈ అంశంపై మరికొన్ని చేర్పులు ఇవి.....
డా. అంబేడ్కర్ జిన్నా, సావార్కర్ లాంటి భావజాలంతో దేశ విభజనకు, ద్విజాతి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేదు. డా. అంబేడ్కర్ Pakistan or the Partition of India పుస్తకంలో ముస్లిములు, దేశవిభజనపై వెలిబుచ్చిన అభిప్రాయాలు పూర్తిగా అకడమిక్, డెమొక్రటిక్ గా సాగుతాయి తప్ప మతకోణం లోంచి కాదు. కొన్ని వాక్యాల ఉటంకింపులు ఇవి.

1. డా. అంబేడ్కర్ భారతదేశ విభజనను సమర్ధించారా?

కొన్ని షరతులకు లోబడి సమర్ధించారు. ముస్లింలు పాకిస్తాన్ కావాలని నిశ్చయించుకుంటే, దేశరక్షణ, భద్రత కొరకు విభజనను అంగీకరించాలని డా. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. బలవంతపు ఐక్యత ప్రమాదకరమని అన్నారు. అది స్కాలర్లీ అకడమిక్ అభిప్రాయం తప్ప, మతోన్మాదంతో జిన్నా సావార్కర్ ల ద్విజాతి సిద్ధాంతానికి సమర్ధింపుగా కాదు.
 
• ముస్లిములు పాకిస్తాన్ కావాలని గట్టిగా పట్టుబడితే, దానిని వారికి ఇవ్వాల్సిందే అని నేను గట్టిగా నమ్ముతున్నాను." పే. 363

• “ముస్లిం ఇండియా మరియు ముస్లిమేతర ఇండియాగా భారతదేశాన్ని విభజించడం అనేది రక్షణ పరంగా ఇరువురికి క్షేమదాయకం అని భావిస్తున్నాను." పే.367 (non muslim India అంటారు తప్ప హిందూ ఇండియా అనలేదు)

• "పాకిస్తాన్ అనేది ఒక సమస్యగా అనుకొన్నప్పుడు, తప్పించుకోవడానికి మార్గం కనిపించదు, దానికి పరిష్కారం కనుగొనబడాలి అని నమ్మేవారిలో నేను ఒకడిని." పే. 385
.
2. అంబేద్కర్ భారతదేశ ద్వి-జాతి సిద్ధాంతాన్ని (Two-Nation Theory) సమర్థించారా?

ముస్లింలు తమను తాము ఒక ప్రత్యేక జాతిగా చెప్పుకోవడాన్ని అంగీకరించారు. హిందువులతో కలిసి జీవించటం అనేది వారి సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తుందని నమ్మటం వలన వారు రాజకీయంగా సాంస్కృతికంగా ఒక జాతిగా అర్హత పొందారని డా. అంబేద్కర్ భావించారు.
 
• "ముస్లింలు 'ఒక జాతిగా జీవించాలనే సంకల్పాన్ని' పెంపొందించుకున్నారు. వారు కెనడాలో ఫ్రెంచివారిలాగో, సౌత్ ఆఫ్రికాలో ఇంగ్లీషువారిలాగో (ద్వితీయపౌరులుగా) బతకటానికి ఇష్టపడటం లేదు. వారు మాకంటూ ఒక దేశం కావాలని కోరుకొంటున్నారు. పే.39

• "మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండి, ఇతరులు అంగీకరించిన దానిని తాము అంగీకరించడానికి నిరాకరించే ప్రజలు ఒక జాతి అవుతారు." పే.336. ఆ విధంగా ముస్లిములు వేరే జాతి అని అంటున్నారు.
.
3. .డా. అంబేడ్కర్ ముస్లింలను భారతదేశం విడిచి వెళ్ళమని అడిగారా?

పాకిస్తాన్ అంటూ ఏర్పడితే, మైనారిటీల బదిలీ (ముస్లింలు పాకిస్తాన్‌కు, హిందువులు/సిక్కులు ఇండియాకు) "ఏకైక శాశ్వత పరిష్కారం" అని డా. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ ఈ బదిలీలు "స్వచ్ఛందంగా" ఉండాలని వాదించారు. ఎవరినీ బలవంతంగా ఒకచోటి నుండి మరొక చోటుకి పంపటాన్ని డా. అంబేద్కర్ అంగీకరించలేదు.
 
• పాకిస్థాన్, ఇండియాలు తమ తమ ప్రాంతాలలో నివసిస్తున్న మైనారిటీలకు తాము వలసకు వెళ్లాలా వద్దా అనే ఐచ్చికతను ఇవ్వాలి. పే. 381

• బదిలీని బలవంతం చేయకూడదు, మేము వలసవెళతామని ప్రకటించిన వారికి మాత్రమే ఆ అవకాశం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. పే. 382

డా. అంబేద్కర్ ముస్లిములు, దేశవిభజనపై చెప్పిన అభిప్రాయాలన్నీ స్కాలర్లీ అకడమిక్ అభిప్రాయాలు. అవి శాస్త్రీయంగా ఆనాటి జాతీయ అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చేసిన రిమార్కులు.
 
డా. అంబేద్కర్ ముస్లిములపై వెలిబుచ్చిన అభిప్రాయాలన్నీ విభజనపూర్వమైనవి. అప్పటికి 600 ఏళ్ల పాలకులుగా ముస్లిములు భారతదేశంలోనే ఉన్నారు.
 
విభజనానంతరం ఇక్కడే మిగిలిపోయిన ముస్లిముల పట్ల డా. అంబేడ్కర్ సహానుభూతితో ఉన్నారు.
 
విషవాదులు డా. అంబేద్కర్ విభజనపూర్వ వాదనలను తెలివిగా ముందుకు తెస్తారు, ఆయనపై బురదచల్లడానికి. ఇది దుర్బుద్ధి.

విభజన పూర్వ అంబేద్కర్ అభిప్రాయాలు ప్రత్యేక స్థల కాలాదులకు లోబడి చేసినవి అని గ్రహించాలి.

ఈ విచక్షణ ద్వేషవాదులకు ఉండదు.

(Photo శ్రీ పొనుగుమట్ల విష్ణుమూర్తిగారి ఆఫీసులో)



Monday, October 20, 2025

ఫ్రెంచి పాలన చివరి రోజులు


            భారత్‌ లోని ఫ్రెంచి కాలనీల చరిత్రను గమనిస్తే, వీరు మొదటగా 1668 లో సూరత్‌ వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని తమ వ్యాపార కార్యకలాపాలను మొదలెట్టారు. ఆ తరువాత మచిలీపట్నం, ఢాకా, కాసింబజార్‌, బాలాసోర్‌, కాలికట్‌, పాట్నా లలో చిన్న చిన్న వ్యాపార గిడ్డంగులను నెలకొల్పారు. 1673/74 లో పాండిచేరీ, 1721 లో మాహే, 1723 లో యానాం, 1738 లో కారైకాల్‌, 1774 లో చంద్రనాగూర్‌ లను తమ స్థావరాలుగా చేసుకొన్నారు. పాండిచేరీ, మాహె, కారైకాల్‌, చంద్రనాగూర్‌ మరియు యానాం లు మినహా మిగిలిన చిన్న చిన్న ప్రాంతాలను ఫ్రెంచి గవర్నర్‌ బారన్‌ 1947 అక్టోబరు 6 న స్వతంత్య్ర భారతదేశానికి అప్పగించేసాడు.

1. ఫ్రాన్స్‌కు సెంటిమెంటు భారత్‌కు అవసరం

            మిగిలిన ప్రాంతాలు  ఫ్రెంచి పాలననుండి విమోచనం చెంది భారతావనిలో విలీనం చెందటంలో అనేక నాటకీయపరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఫ్రెంచి కాలనీలన్నీ దూర దూరంగా ఉండటం వల్ల వీటిని నియంత్రించటం ఫ్రెంచి వారికి కష్టంగా ఉండేది. భారతావని సుమారు 10 లక్షల చదరపు మైళ్ళు ఉంటే, ఈ కాలనీలన్నీ కలిపి రెండువేల చదరపు మైళ్ళ విస్తీర్ణం మాత్రమే. అంతే కాక ఈ ప్రాంతాలకు స్పష్టమైన సరిహద్దులు లేవు.  ఉదాహరణకు పాండిచేరీలోని చాలా ప్రాంతాలు పాండీతో విభక్తమై అన్నివైపులా భారత భూభాగాన్ని కలిగి    ఉన్నాయి.  పాండీనుంచి ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే భారత భూభాగాన్ని దాటి పోవాల్సిందే.  ఈ ప్రాంతాలను సంరంక్షించుకొనేందుకు అవసరమైన మిలటరీ శక్తి కూడా ఈ ఫ్రెంచి కాలనీలలో లేదు. అయినప్పటికీ భారత్‌ లోని తన కాలనీలతో ఫ్రాన్స్‌ కు ఉన్న అనుబంధం వలసరాజ్య భావనలకు అతీతంగా ఉండేది. ఇవి తమ దేశ అంతర్భాగాలని ఫ్రాన్స్‌ ఏనాడో ప్రకటించింది. అందుకనే ఫ్రాన్స్‌ లో చేపట్టే ప్రతీ సంస్కరణనూ పాండిచేరీలో కూడా అమలు పరచేది. 1882 లో తొలిసారి మున్సిపల్‌ ఎలక్షన్లు జరుపుతున్న సమయంలో ‘‘ఈ ఎలక్షన్ల ద్వారా ప్రజలు ఫ్రెంచి దేశంతో తమకున్న బంధాన్ని బలోపేతం చేసుకొంటారని ఆశిస్తున్నామని’’ గవర్నరు వ్యాఖ్యానించాడు.

            1881 లో ఒక డిక్రీ ద్వారా స్థానిక ప్రజలు తమ భారతీయతను త్యజించినట్లయితే వారు కూడా ప్రాన్స్‌లోని పౌరులవలే ఫ్రెంచిచట్టాల పరిధిలోకి వస్తారని ప్రకటించింది. ఆ విధంగా పాండిచేరీనుంచి అనేక వేల మంది తమ భారతీయతను త్యజించి ఫ్రెంచి సంస్కృతి సాంప్రదాయాల పట్ల తమ కున్న అభిమానాన్ని చాటుకొన్నారు. తద్వారా ఈ కాలనీ ప్రజలు ఫ్రాన్స్‌ లో నివసించే ఫ్రెంచి పౌరులతో సమాన రాజకీయ, పౌరహక్కులను కలిగి ఫ్రెంచి సెనేట్‌లో తమ ప్రాతినిధ్యాన్ని పొందటం మొదలైంది. అందుకనే 1954 లో ఈ ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేయమంటే ` సుమారు 8 దశాబ్దాల పాటు  ఫ్రెంచి పౌరులుగా ఉన్న ఈ ప్రజల అభిప్రాయం రిఫరెండం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రాన్స్‌ వాదించింది. 

            ఇక భారత్‌ విషయానికి వస్తే, భౌగోళికంగా ఐక్యంగా ఉండటమనేది స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత భారతదేశం ముందున్న ప్రధమ లక్ష్యం. అందుకనే అప్పటికి దేశమంతా చెల్లాచెదురుగా ఉన్న కొన్ని వందల ప్రిన్స్‌లీ స్టేట్‌ లను ఒక్కొక్కటినీ నయానా భయానా ఒప్పించి విలీనం చేసుకోవటంలో కృతకృత్యమైంది. (ఆనాడు విలీనం కాకుండా మిగిలిపోయిన కాశ్మీర్‌ నేటికీ ఒక సమస్యగానే మిగిలిపోయింది).  పోర్చుగీస్‌ మరియు ఫ్రెంచి దేశాలు 1947 నాటికి భారతదేశంలో ఇంకా తమ కాలనీలను కలిగిఉన్నాయి. వీటిని కూడా కలుపుకోగలిగినట్లయితే భారతదేశం అవిచ్ఛిన్నమైన భూభాగంగా అవతరిస్తుంది. అలా చేయలేక పోయినట్లయితే ఈ ప్రాంతాల వల్ల దేశ సమగ్రత, అంతర్గత భద్రతలకు ముప్పువాటిల్లే అవకాశముంటుందని భారత్‌ భావించింది.

            పోర్చుగీస్‌ కాలనీలైన  గోవా, డయ్యు, డామన్‌, దాద్రా మరియు నగర్‌ హవేలీ లను భారతావనిలో వీలీనం చేసే ప్రక్రియలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం ఒకానొక దశలో పట్టుమని మూడువేల మంది కూడాలేని పోర్చుగీసు బలగాలపై ముప్పయివేల మంది సైనికులను, భారీ వాయుసేనలను రంగంలోకి దింపవలసి వచ్చింది. భారత్‌ చర్యలకు వ్యతిరేకంగా పోర్చుగల్‌, భద్రతా మండలిని ఆశ్రయించగా రష్యా తనకున్న వీటో పవర్‌ ను ఉపయోగించి భారత ఉద్దేశ్యాలు నెరవేరేలా సహకరించింది. అలా 1961లో  పోర్చుగీసు కాలనీలు భారతదేశపు అంతర్భాగాలైనాయి.

            ఇక ఫ్రెంచి కాలనీల విషయానికి వస్తే భారతదేశం సంయమనం పాటించింది. ఎందుకంటే  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంఅనే భావనలను ప్రవచించే దేశంగా ప్రాన్స్‌ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతే కాక భారతదేశంలోని తమ కాలనీలను ఒక వ్యాపార స్థావరాలుగా ఫ్రాన్స్‌ భావించక తమ దేశ అంతర్భాగాలుగా పరిగణించి ఇక్కడి పౌరులకు ఫ్రెంచి పౌరులకున్నటువంటి అన్ని రకాల రాజకీయ పౌర హక్కులను కల్పిస్తూఉండటం కూడా ఈ కాలనీల విషయంలో భారతదేశం ఆచి తూచి వ్యవహరించటానికి మరో కారణం. అహింస, అలీనతలకు పెద్దపీట వేసిన వ్యక్తిగా నెహ్రూకు అంతర్జాతీయంగా పెద్ద పేరు ఉంది.  ఫ్రెంచి కాలనీల విషయంలో 1947-1954 మధ్య భారత్‌-ఫ్రాన్స్‌ లు చిన్న చిన్న అభిప్రాయభేధాలను వ్యక్త పరచినా, అంతిమంగా  విన్‌-విన్‌ పరిస్థితులను పరస్పరం కల్పించుకొని ఇరుదేశాలు సమస్యనుంచి గౌరవంగా బయటపడ్డాయి. ఈ కాలనీల విషయమై భారత్‌`ఫ్రాన్స్‌ ల మధ్య యుద్ధం జరగవచ్చునని అప్పట్లో ఉహాగానాలు ఉండేవని పాండిచేరీ ఆఖరు ఫ్రెంచి గవర్నరుగా పనిచేసిన André Ménard,  August 30, 1985 న Patrick Pitoeff అనే చరిత్రకారునికి ఇచ్చిన ఇంటర్యూలో అనటాన్ని బట్టి ఆనాటి పరిస్థితులను అర్ధం చేసుకొనవచ్చును. భారతదేశం ఒకవైపు దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు, చేస్తూనే, మరో వైపు ఈ కాలనీలను దిగ్బంధనం చేయటం వంటి చాణుక్యనీతిని ప్రదర్శించిందన్న విమర్శను ఎదుర్కోవలసి వచ్చింది.

2. భిన్న వాదనలు

            ఫ్రెంచి కాలనీల విలీనం పట్ల రెండు ప్రధాన వాదనలు ఉన్నాయి. ప్రాన్సే స్వచ్చందంగా ఈ కాలనీలను భారత్‌ కు అప్పచెప్పేసిందంటూ ఇండో`ఫ్రెంచి సంబంధాలను బలోపేతం చేసే వాదన ఒకవైపు; ఈ కాలనీల ప్రజలలో జాతీయవాద భావనలు పెరిగి వలస పాలకులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి వారిని పారద్రోలారన్న వాదనలు మరో వైపు వినిపిస్తాయి.  రెండు వాదనలనూ వాస్తవాలుగానే స్వీకరించాలి. ఈ కాలనీల ప్రజల కోరుకుంటే ఈ ప్రాంతాలను భారతావనికి అప్పచెప్పేస్తానని ఫ్రాన్స్‌ ముందునుంచీ చెపుతూనే ఉంది. అలాగే చంద్రనాగూరును 1949 లోనే భారత్‌ కు ఇచ్చివేసింది.  అదే విధంగా ఆనాడు ఫ్రెంచి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వి.సుబ్బయ్య, దడాల రఫేల్‌ రమణయ్యల ఆత్మకధలను పరిశీలిస్తే రెండవ వాదనను కూడా అంగీకరించక తప్పదు. ఇక భారతదేశం సంయమనంతో ఈ రెండు ప్రక్రియలకు ప్రేరణకారిగా వ్యవహరించి, సమస్యను శాంతియుతంగా, అహింసా పద్ధతులలో పరిష్కరించుకోగలిగింది.

            భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వబోతున్నట్లు బ్రిటన్‌ ప్రకటించగానే, ఫ్రెంచ్‌ఇండియా పరిపాలనా వ్యవస్థను 1946 లో ఫ్రాన్స్‌ సమూలంగా మార్చివేసి, ప్రజా ప్రతినిధులకు విస్త్రుతాధికారాలు కట్టబెట్టి ‘‘స్వయంపాలన’’ జరుపుకొనే విధంగా చేసింది.

            ఎప్పుడైతే బ్రిటిష్‌ వారు భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించి తప్పుకొన్నారో, ఈ కాలనీల ప్రజలలో కూడా స్వాతంత్ర కాంక్ష పెరిగి ఈ ప్రాంతాలను ఫ్రెంచి పాలననుండి విముక్తి చేయాలన్న భావనలు పెరగసాగాయి.  అదే సమయంలో  ఫ్రెంచి పాలన ఉండాలని కోరుకొనే ప్రజలు కూడా ఉండేవారు. ఈ నేపథ్యంలో 1948 లో భారత్‌`ఫ్రెంచి ప్రభుత్వాలు ఈ 5 కాలనీల గురించి ఒక ఒప్పందం చేసుకొన్నాయి.  దీని ప్రకారం ఈ కాలనీల ప్రజలు వారు భారతదేశంలో విలీనం చెందాలా వద్దా అనే విషయాన్ని ఎన్నికల ద్వారా (రిఫరెండం) తెలియచేయాలి.  ఈ రిఫరెండం కూడా ఏ ప్రాంతంలో జరిగితే దాని ఫలితం ఆ ప్రాంతానికే పరిమితం. తదనుగుణంగా చంద్రనాగూర్‌ 1949 లో రిఫరెండం జరుపుకొని సమీప బెంగాల్‌ లో విలీనం అవుతానన్న తన ఆకాంక్షను తెలియచేసింది. దరిమిలా ఫ్రెంచి ప్రభుత్వం మారు మాట్లాడక చంద్రనాగూరు ను భారతదేశానికి ఇచ్చివేయటానికి 1951 లో ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ అనే ఒప్పందాన్ని చేసి, 1952లో దాని సార్వభౌమాధికారాలను భారత ప్రభుత్వానికి అప్పచెప్పింది.

            1948 లో పాండిచేరీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఫ్రెంచి పాలన ఉండాలని కోరుతున్న సోషలిస్టు పార్టీ ఘనవిజయం సాధించటంతో మిగిలిన ప్రాంతాలలో జరగాల్సిన ‘రిఫరెండం’ ప్రక్రియ అటకెక్కింది. అప్పట్లో పాండిచేరీ ఎన్నికలలో భారీ ఎత్తున రిగ్గింగులు జరిగేవి. ఆ కారణంగా  రిఫరెండం జరపటానికి తగిన పరిస్థితులు ఫ్రెంచి కాలనీలలో లేవని భారత్‌ తన నిరసనను తెలియచేసింది.

            ఈ సందర్భంలో విలీనానికి సంబంధించి ఫ్రెంచి ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వాలు ఈ కాలనీల ప్రజలకు ‘అయితే ఫ్రెంచి ప్రభుత్వం లేక భారత ప్రభుత్వం’ అనే తప్ప మరే విధమైన ఎంపిక అవకాశాల్ని ఇవ్వలేదు. రిఫరెండం జరగాలని ఫ్రెంచి ప్రభుత్వం, రిఫరెండం లేకుండా విలీనం జరగాలనీ పట్టుపట్టుకొని కూర్చున్నాయి తప్ప ఈ కాలనీలు ఫ్రాన్స్‌ మరియు భారత్‌ ల ఉమ్మడి సార్వభౌమాధికారాలతో ఉండటమా (Project Ramadier) లేక ఈ కాలనీలన్నీ భారతంలో ఉంటూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఫ్రెంచి ప్రాంతాలుగా ఉండటమా  (Project Coste Floret)  లేదా ఫ్రెంచి వారు దశలు దశలుగా ఓ పాతిక ముప్పయి సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాలనుండి వైదొలగటమా లేక వీటిని స్వతంత్య్ర రాజ్యాలుగా పరిగణించటమా వంటి అవకాశాలను అన్వేషించలేదన్న విమర్శలు లేకపోలేదు.

3. దిగ్బంధనం/Blockade

            పాండిచేరీలో ఫ్రెంచి పాలనను అంతమొందించాలని ఉద్యమించిన వారిలో వి.సుబ్బయ్య, సెల్లాన్‌ నాయకర్‌, బాలసుబ్రమణియన్‌, ఎ. అరుల్‌రాజ్‌, ఎమ్‌. పెరియసామి, దడాల రఫేల్‌ రమణయ్య వంటివారు ప్రముఖులు.  ఫ్రెంచి విధేయుడైన ఎడ్వర్డ్‌ గుబేర్‌ (వీరు తరువాత తమ అభిప్రాయాలను మార్చుకోవటం జరిగింది) నాయకత్వంలో కొంతమంది ఫ్రెంచిపాలన కొనసాగాలని పోరాటం జరిపేవారు. మొదట్లో ప్రజలు ఈ ఫ్రెంచి విధేయవర్గానికే మద్దతు పలికారు. ఈ మద్దతు చూసుకొని కొంతమంది ఫ్రెంచి అధికారులు ‘‘ఫ్రెంచి కాలనీలలోని అంగుళం భూమిని కూడా భారతదేశం చేజిక్కించుకోలేదు’’ అని బీరాలు పోయారు. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం రాజకీయ చతురతను ప్రదర్శించి ఫ్రెంచికాలనీలను ఆర్ధికంగా, వ్యాపార రీత్యా, రాకపోకల పరంగా, మౌలిక వసతుల పరంగా ఒక రకమైన దిగ్బంధనానికి గురిచేసి ఫ్రెంచి ప్రభుత్వాన్ని, ప్రజలనూ ఉక్కిరి బిక్కిరి చేసింది. (THE “COLD WAR” FRANCO- INDIAN (1949-1954) By Jacques Weber CIDIF).  ఇలాంటి నిర్బంధాలు పాండిచేరీకి కొత్త కాదు. బ్రిటిష్‌ వారివల్ల అనేకసార్లు ఇలాంటి ఇబ్బందులకు గురయ్యిన చరిత్ర ఉంది. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అల్లా ఫ్రెంచి వారిలో లోపించిన నైతికస్థైర్యం మరియు వలసవాదుల పట్ల సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసన.

            పాండిచేరీ చుట్టూ ముళ్లతీగె వేయబడి భారతభూభాగంలోకి రాకపోకలు నియంత్రించబడ్డాయి.  పాండిచేరీనుంచి ఎవరైనా బయటకు రావాలంటే అక్కడి భారత కౌన్సిల్‌ చే జారీ చేసిన ఫొటోతో కూడుకొన్న ‘‘పాస్‌పోర్ట్‌’’ ను సరిహద్దు వద్దనున్న చెక్‌ పోస్ట్‌ ల వద్ద చూపించవలసి వచ్చేది.  ఈ పాస్‌పోర్టును ఒక రూపాయి రుసుముతో (అప్పట్లో రూపాయి అంటే చాలా పెద్ద మొత్తం) ఒకటి లేదా రెండు నెలల ‘వెలిడిటీ’ తో, కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే పాండిచేరీలో ఉన్న భారత కౌన్సిల్‌ జారీ చేసేది.  ఒక్కోసారి అప్లయిచేసిన కొన్ని నెలల తరువాత పాస్‌పోర్ట్‌ మంజూరు అయ్యేది.  ఈ విధానం వల్ల పాండిచేరీ ఒక ‘‘బంధింపబడిన ప్రజల ప్రాంతం’’ అయిపోయింది.

            ఈ విధానం వల్ల నిత్యం పాండిచేరీ నుంచి బయటకు వెళ్లి పనులు చేసుకొనే కూలీల మనుగడ కష్టమై పస్తులుండే పరిస్థితి వచ్చింది. అంతే కాక పాండిచేరీ నుంచి ఏ విధమైన వస్తువులను బయటకు/లోపలకు తీసుకువెళ్ల కూడదన్న నిబంధన వల్ల`పాండిచేరీకి చెందిన కూలీలు బయట ప్రాంతాలకు కూలి పనులకు వెళ్ళేటపుడు వారు తీసుకొని వెళ్ళే అన్నం కేరేజీలను   కూడా అనుమతించేవారు కాదు. అందువల్ల వారి భోజనాన్ని సరిహద్దుల వద్ద తినటమో లేక పారవేయటమో చేయవలసి వచ్చేదట. ఇదే నిబంధన వల్ల జాలరులు తాము పట్టుకొన్న చేపలను ఇంటికి తీసుకొని వెళ్ళే అవకాశం ఉండేది కాదట. దీనికి తోడు పాండిచేరీకి రాకపోకలు చేసేవారి వద్ద 50 రూపాయిలకు మించి డబ్బులు ఉండకూడదన్న నియమం కూడా ఉండేది.

            వెహికిల్‌ యజమానులకు భారతభూభాగం/పాండిచేరీ లలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకోవటానికి భారతప్రభుత్వం 120 రోజుల సమయం  ఇచ్చింది. ఆ తరువాత వాటి రాకపోకలను నియంత్రించటం మొదలెట్టింది. పాండిచేరీకి వెళ్ళే  రైళ్లు బస్సులు బయటే నిలిపివేయబడేవి. ఫ్రెంచి కాలనీ ప్రజలకు స్వేచ్చా రాకపోకలను కల్పిస్తూ ఫ్రెంచి ప్రభుత్వం 1941 లో బ్రిటిష్‌ ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందాన్ని భారతప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని ఫ్రెంచిప్రభుత్వం ఆరోపించింది. (UNE HISTOIRE SINGULIÈRE : PONDICHÉRY DE 1947 À 1954 By Stephanie Samy CIDIF)

            ఈ సమయంలోనే సందట్లో సడేమియా లాగ, పాండిచేరీకి బంగారం, వజ్రాలు వంటి విలువైన వస్తువులు విదేశాలనుంచి దిగిమతి అయి, భారతసరిహద్దు ప్రాంతాలకు స్మగుల్‌ అయ్యేవి. ఒక్క 1951-1952 మధ్య పాండిచేరీ వ్యాపారులు పదిహేను టన్నుల బంగారాన్ని, పద్నాలుగు కోట్ల ఫ్రాంకుల విలువైన వజ్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సమీప భారత పాలిత ప్రాంతాలకు స్మగుల్‌ చేసి భారీ లాభాలు మూటకట్టుకొన్నారు.  ఈ విషయాన్ని గ్రహించిన భారత ప్రభుత్వం పాండిచేరీ చుట్టూ తన పహారాను మరింత కఠినతరం చేసింది.

            పాండిచేరీకి చెరాల్సిన పోస్టల్‌ కవర్లు మద్రాసులో నిలిచిపోయేవి.  1954 నాటికి ఇవి 8 వేలకు పైగా పేరుకు పోయాయి. 1937 నుంచి పాండిచేరీకి విద్యుత్తును సరఫరా చేస్తున్న కావేరీ విద్యుదుత్పత్తి కేంద్రంను రిపేరుల నిమిత్తం మూసివేస్తున్నందున,  ఇకపై సరఫరా చేయలేదని భారతప్రభుత్వం 1953 లో ఒక లేఖ ద్వారా ఫ్రెంచి గవర్నరుకు తెలిపింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో పాండిచేరీలోని తక్కువ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం సహాయంతో మరియు అవసరాన్ని బట్టి జెనరేటర్‌లను ఏర్పాటు చేసుకొని ఫ్రెంచి ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు పరిమితంగా విద్యుత్‌ ను సరఫరా చేయటం మొదలెట్టింది. పాండిచేరీకి దిగుమతి చేసుకొనే పెట్రోల్‌, కూరగాయలు, దుస్తులు, పండ్లు వంటి వస్తువుల నిలుపుదల జరిగింది. నిత్యావసరాలైన బియ్యం, నూనెలు వంటి వాటిని ఫ్రెంచిప్రభుత్వం  ఇండోచైనా పాకిస్తాన్‌ వంటి దేశాలనుంచి షిప్పులలో దిగుమతి చేసుకోవలసి వచ్చేది.

            పాండిచేరీ కి నీటిని సరఫరా చేసే పంట కాలువ 1954 లో మూసివేయబడిరది. పాండిచేరీలోని బాహూరు చెరువుకు నీటినందించే కాలువ లాకులు మూతపడటంతో, పంటలకు నీరందక నాశనం అయ్యాయి. 1949 లో మొదలైన ఈ దిగ్బంధన ప్రక్రియ 1954 నాటికి పాండిచేరీని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఫ్రాన్స్‌ వెలుపలి నుండి అన్ని విధాల సహాయ సహకారాలందించినా, పోగా పోగా ప్రజలలో అసంతృప్తి పెరగసాగింది.

            ఈ మొత్తం పరిస్థితులను అవగాహన చేసుకొన్న పాండిచేరీ ఆర్చిబిషప్‌, ఫ్రాన్స్‌ ఫారిన్‌ మినిస్ట్రీలో పనిచేస్తున్న తన మిత్రునికి వ్రాసిన లేఖలో  ‘‘ఫ్రాన్స్‌ ఇకపై ఏమాత్రమూ ఇండియాలోని తన కాలనీలను నిలుపుకోలేదు. తనను నమ్ముకొన్న ప్రజలకు కొన్ని సదుపాయాలు కల్పించి నవ్వుతో బయటకు వెళ్లటమే ఉత్తమం, గెంటివేయబడటం కన్నా’’ అని అనటం ఆనాటి ఫ్రెంచివారి ఆలోచనలకు అద్దం పడుతుంది.

            (పాండిచేరీ దిగ్బంధం గురించి ఇంతటి సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందు పరచటానికి కారణం` ఆనాటి ఫ్రెంచి పౌరుల త్యాగాల పట్ల, ఫ్రాన్స్‌ ప్రదర్శించిన సౌహార్ధ్రత పట్ల అవగాహన లేకుండా, ఈ ఫ్రెంచికాలనీలకు ఇంతటి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించటం ద్వారా నెహ్రూ తప్పుచేసాడనీ, ఈ ప్రాంతాలలో ఉన్న ఫ్రెంచ్‌ ఉనికి వల్ల మనమింకా వలసవాదుల పాలనలోనే ఉన్నట్లు అనిపిస్తోందనీ, ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో ఎందుకు విలీనం చేయటం లేదనీ వంటి రకరకాల వాదనలు నేడు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. భారతదేశానికి ఈ ప్రాంతాలను భౌగోళికంగా తనలో కలుపుకోవటం అనేది దేశ సమగ్రత, ఐక్యత, అంతర్గత భద్రత ల దృష్ట్యా ఒక చారిత్రిక అవసరం. హైదరాబాద్‌, పోర్చుగీస్‌ పాలిత ప్రాంతాల విలీనంలో జరిపినట్లు ఫ్రాన్స్‌ పై సైనిక ప్రయోగానికి భారత్‌ సాహసించలేకపోవటానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. అందుకనే దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులూ ఒకవైపు చేస్తూనే గొప్ప పరిణతి కలిగిన చాణుక్యనీతిని ప్రదర్శించింది.  ఆనాడు ఫ్రాన్స్‌ మరియు ఈ కాలనీలలోని ఫ్రెంచి పౌరులు చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా భారత్‌ ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిందన్నది విస్మరించకూడని ఒక చారిత్రిక వాస్తవం `` రచయిత)

            ఇక యానాం విషయానికి వస్తే, పాండిచేరీలో జరిగినంత తీవ్రంగా కాకపోయినా ఈ ప్రాంతం కూడా దిగ్బంధనానికి గురయినట్లు ఆనాటి వార్తాపత్రికల ద్వారా తెలుసుకొనవచ్చును.  20 ఏప్రిల్‌, 1954 నుండి యానాంకు వచ్చే బస్సులను యానాంకు వెలుపలే నిలువరించటం మొదలైంది (రి. హిందూ, 22,ఏప్రిల్‌, 1954). శ్రీ దడాల, భయంకరాచారి, డి.ఎస్‌.ఆర్‌.సోమయాజులు, కొంపెన సుబ్బారావు ల ఆధ్వర్యంలో కాకినాడనుంచి యానాంకు సరుకులు చేరవేస్తున్న బండ్లను, 24 ఏప్రిల్‌, 1954 న నిలిపివేసి తిరిగి కాకినాడ పంపించి వేయటం జరిగింది.  ఈ విషయం తెలుసుకొని కాకినాడనుంచి యానాంకు రావాల్సిన బళ్ళు బయలుదేరనే లేదు (రి. 28 ఏప్రిల్‌, 1954).

యానాంకు నిత్యావసరాలు అందకపోవటంతో ఇక్కడి ప్రజాజీవనం స్థంభించిపోయింది. యానాం వ్యాపారులకు కాకినాడలో పెట్రోలు, కిరోసిన్‌, ఇతరనూనెలు అక్కడి వ్యాపారులు నిరాకరించేవారట. బిల్లు భారతీయుని పేరుపై తీసుకొని అతికష్టం మీద సరుకులను యానానికి రహస్యంగా చేరవేయవలసి వచ్చేదట. గోదావరి నదిపై జరిగే సరుకుల రవాణాను అడ్డుకొని పడవలను, సరుకులను, వలలను భారత కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొనేవారట.

            పంటకాలువల రిపేర్లు పనులు చేయిస్తున్నామన్న కారణంచే, యానాంకు వచ్చే మంచినీటి సరఫరాను 28 ఏప్రిల్‌, 1954న కాకినాడ కలక్టరు నిలుపుదల చేయించారు. యానాం ప్రజలందరికీ మంచినీటి నందించే నీళ్ళ చెరువులు అప్పటికే ఖాళీ అయ్యాయి.  ఈ విషయంలో ఫ్రెంచి ఎంబసీ కల్పించుకొంటే తప్ప మే 1 నుండి యానాంకు నీటి సరఫరా పునరుద్దరణ కాలేదు.  (]. The Last Days of Yanam - George Sala published in July 1996, Lettre du CIDIF)        

            ఈ నేపథ్యంలో భారతదేశంలో తమ మనుగడ ఇక అసాధ్యమన్న నిర్ణయానికి ఫ్రాన్స్‌ వచ్చేసింది.  ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం జరపాలని అంతవరకూ వాదించిన ఫ్రెంచిప్రభుత్వం తన పట్టు సడలించి, ప్రజానాయకులు పాల్గొనే రిఫరెండానికి సిద్ధపడిరది.  అలా 1954లో పాండిచేరీ సమీపంలోని కీళూరు అనే ప్రాంతంవద్ద జరిగిన ప్రజానాయకుల అభిప్రాయసేకరణ జరిపింది. దీనిలో 7 ఓట్లు ఫ్రెంచిపాలనకు అనుకూలంగాను, 164 ఓట్లు వ్యతిరేకంగాను రావటంతో, ఫ్రెంచిప్రభుత్వం 1954 అక్టోబరు 26న పాండిచేరీ, మాహె, కారైకాల్‌ మరియు యానాంలను యథాతథ స్థితిలో భారతదేశానికి అప్పగించుతూ ఒక ఒప్పందం చేసింది.  దీనినే ‘డిఫాక్టో ఒప్పందం’ అంటారు.  దీనికి అనుగుణంగా 1954 నవంబరు, 1న ఈ ప్రాంతాలనుండి ఫ్రెంచివారు ఖాళీచేసి వెళిపోయారు.  ఈ రోజును ‘డిఫాక్టో దినం’ గా ఇక్కడి ప్రజలు పాటిస్తారు.

4.  భారత పతాక రెపరెపలు

            పాండిచేరీలో అంతవరకూ పనిచేస్తున్న ఫ్రెంచి దేశస్థులు వెళిపోయే ముందు అట్టహాసంగా అధికారిక సంబరాలు జరిపి వెళ్లాలని యోచించినా, ఫ్రాన్స్‌ ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది.  ఒక వార్‌ షిప్పులో పాండిచేరీలోని ఫ్రెంచివారినందరినీ ఫ్రాన్స్‌కు తరలించాలని మొదట్లో భావించినా ఆ ఆలోచనకూడా కార్యరూపం దాల్చలేదు.  కడకు ఎవరికి వారు మద్రాసు వెళ్లి ఫ్లయిట్‌ ద్వారా పారిస్‌ చేరుకొన్నారు. 1954 నవంబరు 1 నాటికి పాండిచేరీలో ఫ్రెంచి గవర్నరు ఇంచార్జిగా ఎస్క్వర్‌గుయిల్‌ (Escargueil) డిప్లొమేటిక్‌ సలహాదారునిగా P. Landy మరియు మరికొద్ది మంది ఫ్రెంచి అధికారులు మాత్రమే పాండిచేరీ లో మిగిలారు. ఢల్లీ నుంచి వచ్చిన భారత విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ జనరల్‌  RK Nehru నవంబరు 1ఉదయాన పాండిచేరీలో ప్రప్రథమంగా భారతదేశ జండాను ఎగురవేశారు. పాండిచేరీ చివరి భారత కౌన్సిల్‌ జనరల్‌ మరియు మొదటి హై కమీషనర్‌ అయిన కేవల్‌ సింగ్‌ ను P. Landy ఆహ్వానించి అధికారాలను బదలాయించారు.  ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో, భారత ప్రెసిడెంట్‌ రాజేంద్ర ప్రసాద్‌, ప్రధాని నెహ్రూ లు పంపించిన సందేశాలను RK Nehru ప్రజలకు చదివి వినిపించారు. ఆ విధంగా మూడు  వందల సంవత్సరాల ఫ్రెంచి పాలనకు తెరపడి భారత పాలనకు తెరలేచింది. 20 జనవరి, 1955 నాటి హిందూ పత్రిక తన ఎడిటోరియల్‌ లో ఈ ప్రాంతాలకు కల భౌగోళిక, సాంస్కృతిక వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకొని, చంద్రనాగూర్‌ విషయంలో జరిగినట్లుగా  సమీప రాష్ట్రాలలో విలీనం చేయాలని వ్రాసింది. 

5. ఈ ప్రాంతాల భవిష్యత్తు పై అనేక సందేహాలు

            అంతర్జాతీయ చట్టాల ప్రకారం డీఫాక్టో ట్రాన్స్‌ఫర్‌ జరిగినా ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాలు ఫ్రాన్స్‌ వద్ద ఉన్నట్లే లెక్క. ఈ రకమైన పరిస్థితి ఇదివరలో బోస్నియా, సిప్రస్‌ ప్రాంతాల విషయంలో వచ్చిందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అంటే ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాలను ఫ్రాన్స్‌ భారత్‌ కు సమర్పించనంతవరకూ భారత్‌ ఈ ప్రాంతాలలో అధికారిక పరిపాలన చేపట్టటానికి వీలుండదు.  అందుకనే భారత్‌ ఫ్రాన్స్‌తో మరో ఒప్పందం చేసుకొనే వరకూ ఇక్కడ ఫ్రెంచి పరిపాలనా వ్యవస్థను యథాతథంగా కొనసాగించింది.  ఆ మరో ఒప్పందమే 1956 మే, 28న భారతప్రధాని శ్రీపండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ మరియు ఫ్రాన్స్‌ దేశ ప్రతినిధి ఒష్ట్రరాగ్‌ లు  చేసుకొన్న ట్రీటీ ఆఫ్‌ సిషన్‌  (Traité de cession).

            ఈ మొత్తం ప్రక్రియపట్ల పాండిచేరీలో నిరసన వ్యక్తమయింది.  Grande Comore, Mohammed Saeed Sheikh, MP Raymond Dronne  దైవశిఖామణి వంటి కొంతమంది ఫ్రెంచి విధేయులు తమ తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కాలనీల ప్రజలకు ద్వంధ్వ పౌరసత్వం కల్పించాలనీ, ప్రజలందరూ పాల్గొనే రిఫరెండం తిరిగి నిర్వహించాలనీ, ఈ ప్రాంతపు ఫ్రెంచి సంస్కృతిని కాపాడమనీ, ఆటోనమీ ని కల్పించాలనీ, కీళూరు లో ప్రజాప్రతినిధులు మాత్రమే పాల్గొన్న రిఫరెండం ఫ్రెంచి రాజ్యాంగ విరుద్దమనీ అంటూ వీరు ఇరు ప్రభుత్వాలను డిమాండ్‌ చేసారు.  ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేస్తారేమోన్న ప్రజల అనుమానాలను నివృత్తి చేయటానికి ఆనాటి భారత హైకమీషనరు కృపాలానీ, 1957, ఫిబ్రవరి 9 న ఏర్పాటుచేసిన ఒక ప్రెస్‌ కాన్ఫరెన్సులో  ‘‘ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేసే ఉద్దేశాలు భారతప్రభుత్వానికి లేవని, ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ లో చేసుకొన్న ఒప్పందం ప్రకారం వీటి ప్రత్యేకతను నిలుపుతుందనీ’’ తెలిపారు.

            ఈ ప్రాంతాల భవిష్యత్తు గురించి ప్రజలలో ఉండిన ఆందోళనలు 1955 లో పాండిచేరీలో జరిగిన ఎన్నికలను ప్రభావితం చేసాయి.  ఫ్రెంచి కాలనీలను భారతావనిలో విలీనం చేయటంలో ప్రధాన పాత్రపోషించిన శ్రీగుబేర్‌ ` ‘పాండిచేరీని ఫ్రాన్స్‌ కు అప్పగించాలి’ అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన Marcel Valot అనే స్వతంత్ర అభ్యర్ధిచేతిలో ఓడిపోయాడు.   ఈ ప్రాంతాలకు ఆటోనమీ కల్పించాలనీ ఇక్కడి ఫ్రెంచి సంస్కృతిని కాపాడాలన్న డిమాండ్‌ తో ఎన్నికలలో పోటీ చేసిన పాపులర్‌ పార్టీ పాండిచేరీలో ఉన్న 18 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్ని గెలుచుకోవటం గమనార్హం. (ఇతర ప్రాంతాలలో గుబేర్‌ వర్గం ఎక్కువ సీట్లను దక్కించుకొంది).  మున్సిపల్‌ ఎన్నికలలో మూడొంతులు పైగా సీట్లను పాపులర్‌ పార్టీ కైవసం చేసుకొంది.  పై  ఫలితాల ద్వారా పాండిచేరీ ప్రజలలో ఫ్రెంచి విధేయత ఉన్నట్లు స్పష్టమవటంతో ఈ కాలనీల భవిష్యత్తుపై ఆ తదుపరి జరిగిన చర్చలలో  ఈ ప్రాంత ప్రజల ఫ్రెంచి సంస్కృతిని పరిరక్షించాలన్న వాదనకు బలం చేకూరింది. ఈ ఎన్నికల తరువాత గుబేర్‌ తన పంథాను మార్చుకొని, ప్రజాభీష్టం మేరకు ఈ ప్రాంతాలకు ప్రత్యేకప్రతిపత్తి కల్పించటంలో అవిరళ కృషిచేయటం గమనార్హం.  (కోడిపందాలు ఎక్కువగా ఆడతాడు కనుక ఎడ్వర్డ్‌ గుబేర్‌ ను ఫ్రెంచివారు కోడి`గుబేర్‌ అని పిలిచేవారట. ఫ్రెంచి వారు వెళిపోవటంతో ఇతని పేరు గుబేర్‌ పిళ్ళై గా మారిపోయింది.  ఈ చిన్న ఉదంతం ఫ్రెంచిపాలనకు`భారత పాలనకు మధ్య మౌలికంగా ఉన్న తేడాను అద్భుతంగా పట్టి చూపుతుంది. మొదటిదానిలో జాత్యహంకారం రెండవదానిలో సామాజిక మూలాల ప్రదర్శన కనిపిస్తాయి.)

            అంతర్గత కుమ్ములాటల కారణంగా 1955 ఎన్నికల ద్వారా ఏర్పడిన అసెంబ్లీని 1958 లో భారతప్రభుత్వం రద్దు చేసి పాండిచేరీలో రాష్ట్రపతి పాలనను విధించింది.  తిరిగి 1959 లో జరిగిన ఎన్నికలలో,  ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చేయం’ అన్న నినాదంతో కాంగ్రెస్‌ ఎన్నికలలోకి దిగి విజయం సాధించింది.

6. ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ కల్పించిన హామీలు

            డిఫాక్టో ట్రాన్ఫ్‌ర్‌ ఒప్పందానికి ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ఒప్పందానికి మధ్య కల సుమారు రెండేళ్ల వ్యవధిలో ఇరుదేశాలు ఈ ప్రాంతాల భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనకు వచ్చాయని ఆ ఒప్పందంలో పొందుపరచిన ఈ క్రింది అంశాలను బట్టి తెలుస్తుంది.

ఎ. పౌరసత్వం: 1956 నాటికి పాండిచేరీలో మూడు రకాలైన ఫ్రెంచి పౌరులుండేవారు. ఇక్కడకు వచ్చి స్థిరపడిన ఫ్రెంచి దేశస్థులకు పుట్టిన వారు, 1880 లలో తమ భారతీయతను త్యజించి ఫ్రెంచి సివిల్‌కోడ్‌ ను ఎంచుకొన్న భారతీయులు మరియు ఈ రెండు వర్గాలకు చెందని వారు. వీరు తమకు ద్వంధ్వ పౌరసత్వం ఇమ్మని భారత మరియు ఫ్రెంచి ప్రభుత్వాలను కోరారు. అది జరగని పనని ఇరుదేశాలు తేల్చి చెప్పేసాయి.  ఈ ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ లో వీరికి పౌరసత్వ ఎంపిక అవకాశం కల్పించబడిరది.  దీని ప్రకారం ఈ ట్రీటీ అమలులోకి వచ్చిన (1962) ఆరునెలలలోగా తమ ఫ్రెంచి పౌరసత్వాన్ని నిలుపుకోవటానికి వ్రాతపూర్వకంగా తెలియచేయవలసి ఉంటుంది. అలా చేసిన వారికి వారు అంతవరకూ కలిగి ఉన్న ఫ్రెంచి పౌరసత్వాన్ని ఇక ముందు కూడా కలిగి ఉంటారు లేనివారు భారతపౌరసత్వాన్ని పొందుతారు.

            ఫ్రెంచి వారు వెళిపోయేటపుడు ఇచ్చిన సౌహార్థ్ర పూర్వక పౌరసత్వ ఐచ్చికతను ఉపయోగించుకొని పాండిచేరీనుంచి సుమారు 6000 మంది ఫ్రెంచి నేషనాలిటీని నిలుపుకొన్నారు.  వీరి సంఖ్య ప్రస్తుతం పదిహేనువేలకు పైమాటే.  ఫ్రాన్స్‌లో నివసించే పౌరునికి ఉండే వృద్ధాప్య పించను, పేదరికంలో ఉంటే అందే సహాయం, నిరుద్యోగ భృతి, విద్య వైద్యాల కొరకు రాయతీలు వంటి సోషల్‌ సెక్యూరిటీ పథకాలన్నీ ఈ ఫ్రెంచినేషనల్స్‌ కూ ఉన్నాయి. ఆ కారణంగా వీరందరూ ఆర్ధికంగా, సామాజికంగా సాటి భారతీయుల (వీరుకూడా ఒకప్పుడు ఫ్రెంచి పాలితులే అయినప్పటికీ ఫ్రెంచినేషనాలిటీని ఎంచుకోకపోవటం వల్ల భారత పౌరులుగా మిగిలిపోయారు) కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. కొన్ని సందర్భాలలో వారి అసూయకు కూడా పాత్రులవుతున్నారు.   అందుకనే పాండిచేరీ ఫ్రెంచి పౌరుల అసోషియేషన్‌ నాయకుడైన పి. ఆరోగ్యసామి  ఒకచోట ‘‘ఈనాడు పాండిచేరీలో రిఫరెండం పెడితే ప్రజలందరూ ఫ్రెంచి పౌరసత్వాన్ని స్వీకరించటం తథ్యం’’ అని వ్యాఖ్యానించాడు. (రి.  LES GENS DE NULLE PART Auteur : Author: Banerji Monideepa CIDIF). 1962 లో ఫ్రాన్స్‌ తన అప్పటి మరో కాలనీ అయిన అల్జీరియాకు స్వాతంత్య్రం ప్రకటించినపుడు అక్కడి ఫ్రెంచి పౌరులలో పదిలక్షల మందికి పైన ప్రజలు ఫ్రాన్స్‌తో తమ అనుబంధాన్ని తుంచుకోలేదు.  వీరందరూ ఫ్రాన్స్‌ చేరుకోగా, ఫ్రెంచి ప్రభుత్వం పునరావాసం కల్పించింది.  వీరందరినీ ఇప్పటికీ Pieds-noirs అని పిలుస్తారు.

బి. ఫ్రెంచి సంస్కృతి పరిరక్షణ:  ఈ ఒప్పందంలో ఈ కాలనీలలో అంతవరకూ పరిఢవిల్లిన ఫ్రెంచి సంస్కృతి పరిరక్షణ కావించబడుతుందని హామీ ఇవ్వబడిరది.  దీనిలో భాగంగా, ఫ్రెంచి అధికారిక భాషగా ఉంటుందని (ప్రజానాయకులు మార్చనంతవరకూ), స్కూళ్లలో ఫ్రెంచి భోధన కొనసాగుతుందనీ, ఫ్రెంచి సంస్కృతిని పెంపొందించటానికి సంస్థలు నెలకొల్పాలని వంటి హామీలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.  అప్పట్లో నెహ్రూ ఈ ప్రాంతాలను Windows Open to France  అని వర్ణించాడు కూడా. కానీ ఫ్రెంచివారు వెళ్ళిపోయిన తరువాత ఈ ప్రాంత అధికారులు ఎక్కువగా బ్రిటిష్‌ ఇండియాలో పనిచేసిన వారు కావటంతో ఫ్రెంచి అధికారిక భాషగా ఎంతో కాలం కొనసాగలేదు. అంతే కాక ఇక్కడి ప్రజలు కూడా క్రమక్రమంగా ఇంగ్లీషుకు అలవాటు పడక తప్పలేదు. అంతవరకూ పనిచేసిన అధికారులు  ఫ్రెంచి పౌరసత్వాన్ని తీసుకొని ఫ్రాన్స్‌ వెళ్ళిపోవటం కూడా మరో కారణం. అందుకనే 1965 లో అసెంబ్లీ తీర్మానం ద్వారా ఈ కాలనీల లో ఇంగ్లీషు, తమిళ్‌, మళయాలం మరియు తెలుగులను అధికార భాషలుగా చేస్తూ చట్టం చేయటంతో, ఫ్రెంచి అధికార భాషగా కనుమరుగైపోయింది. ఇక ఫ్రెంచి భోధన కొరకు ఒక  కాలేజీ, సంస్కృతి పెంపొందించటం కొరకు అలయన్స్‌ ఫ్రాంకాయిస్‌ వంటివి నెలకొల్పటం జరిగింది. ఇవి నేటికీ పనిచేస్తూ ఉన్నాయి. యానానికి సంబంధించి జూనియర్‌ కాలేజీలో తొంభైల మధ్యవరకూ ఫ్రెంచి ద్వితీయ భాషగా బోధించబడేది. ఆ తరువాత శ్రీబొల్లోజు బసవలింగం గారి ఆధ్వర్యంలో యానాంలో కొంతకాలం ఒక ప్రైవేట్‌ ఫ్రెంచిస్కూలు నడపబడింది.

            భారతదేశంలో ఫ్రెంచి రాజ్యస్థాపనకై పాటుపడిన డూప్లే విగ్రహాన్ని  పాండిచేరీ నుంచి తొలగించవద్దని, ఒకవేళ తొలగించేటట్టయితే దానిని ఫ్రాన్స్‌ అప్పగించమనీ ఫ్రెంచి ప్రభుత్వం కోరింది.

            ఫ్రెంచి ప్రభుత్వం అంతవరకూ ఇచ్చిన విద్యార్హతలకు సమానమైన భారత విద్యార్హతలను నిర్ణయించటానికి  ఇరుదేశాల విద్యావేత్తలతో కూడిన ఒక కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకొన్నారు.

సి. ఫ్రెంచి చట్టాల కొనసాగింపు: ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ఒప్పందంలో 1954 నాటికి ఉన్న కోర్టుకేసులకు ఫ్రెంచి చట్టాలకు అనుగుణంగానే తీర్పులు చెప్పాలనీ, ఈ చట్టాలను నెమ్మది నెమ్మదిగా తొలగించి, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ను ప్రవేశపెట్టుకోవచ్చని వ్రాసుకోవటం జరిగింది.  తదనుగుణంగా భారత ప్రభుత్వం 1963 లో  ఫ్రెంచి చట్టాల తొలగింపు మొదలుపెట్టి 1968 నాటికి పూర్తిచేసింది.

డి. ప్రత్యేక పరిపాలనా హోదా: చంద్రనాగూర్‌ అప్పగింత భేషరతుగా జరిగింది కనుక అది సమీప రాష్ట్రమైన బెంగాలులో విలీనం అయి ఒక మున్సిపాలిటీగా మారిపోయింది. కానీ మిగిలిన ఫ్రెంచికాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్‌ మరియు యానాంల విలీనం ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ఒప్పందం ద్వారా విలీనం అయ్యాయి.  దానిలోని ఆర్టికల్‌ రెండు ప్రకారం ఈ ప్రాంతాలకు ‘‘ప్రత్యేక పరిపాలనా హోదా’’ను కల్పించాలని/కల్పిస్తాననీ ఇరుదేశాలు అంగీకరించుకొన్నాయి. అంతే కాక ప్రజల సమ్మతి లేకుండా ఈ హోదాను మార్చకూడదని కూడా వ్రాసుకోవడం జరిగింది.  దీనికి అనుగుణంగా 1962 లో భారతప్రభుత్వం 14 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసింది. ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినందుకు మీడియాలో నిరసన రాకపోలేదు.  1962, ఆగస్టు 9 నాటి హిందూ పత్రిక తన ఎడిటోరియల్‌ లో ఈ చిన్న ప్రాంతాలకు ఈ విధమైన ప్రత్యేకతను కల్పించటం ఒక ‘‘లగ్జరీ’’ గా పేర్కొనింది. ది మెయిల్‌ అనే పత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచింది.

            ప్రాంతాలు భారతావనిలో విలీనం అయితే వీటికి ప్రత్యేక హోదాను కల్పించి కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచుతానని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ,  27 అక్టోబరు, 1949 న వ్రాసిన ఒక లేఖద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంతాల విలీనం ఇంకా ఒక కొలిక్కి రాని సమయంలోనే తాను ఫ్రెంచి ప్రభుత్వానికి  ఇచ్చిన మాటను భారత ప్రభుత్వం ఈ విధంగా నిలుపుకొంది. 

తుది పలుకులు

            1957 లో ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ కు ఆమోద ముద్ర కొరకు ఫ్రాన్స్‌ ఫారిన్‌ అఫైర్స్‌ మినిష్ట్రీ కు పంపించినపుడు (Devinat report) ఈ ఒప్పందం ఫ్రెంచి రాజ్యాంగానికి లోబడి లేదని, ప్రజలు పాల్గొన్న రిఫరెండం జరగలేదనీ వంటి కొరీలు వేసి, దీన్ని ఆమోదించాలంటే ఫ్రెంచి పార్లమెంటు అనుమతి కావాలంటూ తిరస్కరించింది. (అప్పుడు జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు  ప్రతికూలంగా  27 ఓట్లు, అనుకూలంగా 15 ఓట్లు పడ్డాయి)

            ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాల అప్పగింతపై జరుగుతున్న జాప్యం పట్ల అప్పట్లో అనేక మంది నిరసనను తెలియచేసారు.  1958 జూన్‌, 16 నాటి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఎడిటోరియల్‌ లో ‘‘ డిజ్యూర్‌ ట్రాన్ఫ్‌ర్‌ (సార్వభౌమాధికారాల అప్పగింత) జరపటానికి తొందరగా చర్యలు గైకొనకపోయినట్లయితే  ఫ్రెంచివిధేయులకు, భారతవిధేయులకు పాండిచేరీ ఒక రణస్థలిగా మారే ప్రమాదం ఉంది’’ అని వ్రాసింది. ఎందుకంటే పాండిచేరీలో “Popular Republican Movement of French India”  అనే పేరిట ఒక సంస్థ  ఏర్పడి ఫ్రెంచిపాలన కొనసాగాలని ఆందోళనలు సాగిస్తున్న సమయమది.

            1958 ఆగస్టు, 11న జరిగిన పార్లమెంటు సమావేశాలలో  ఈ ప్రాంతాల బదలాయింపు గురించి ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నెహ్రూ ‘‘ఈ ప్రాంతాల డిఫాక్టో బదలాయింపు ఎన్నో సంవత్సరాల క్రితమే జరిగిపోయింది.  ఈ స్థితినుంచి వెనుకకు మరలే ప్రసక్తే లేదు. కానీ ఈ స్థితికి కొన్ని కొన్ని చట్ట పరమైన చిక్కులు ఉన్న మాట వాస్తవమే. డిజ్యూర్‌ ట్రాన్స్‌ఫర్‌ త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను.  చేసిన ఒప్పందాన్ని నెరవేర్చమని  ఫ్రాన్స్‌ పై ఒత్తిడి తీసుకురావటం సబబనిపించుకోదు. అది లేనిపోని అపోహలకు దారితీస్తుంది’’ అనటాన్ని బట్టి అప్పట్లో భారత ప్రభుత్వం ఎంతటి సహనాన్ని ప్రదర్శించిందో సులువుగానే అర్థమౌతుంది. 

            ఫ్రాన్స్‌ అల్జీరియాలో చేస్తున్న యుద్ధంలో తలమునకలైపోయి ఉండటం వల్ల ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ ను ఫ్రెంచి ప్రభుత్వం దాదాపు పక్కన పెట్టేసిందనే భావించాలి.

            ఎట్టకేలకు 1962, జూలై 19 న ట్రీటీ ఆఫ్‌ సిషన్‌ బిల్లు ఆమోదం కొరకు ఫ్రెంచి సెనేట్‌ కు వచ్చింది.  ఈ బిల్లును ప్రవేశపెట్టినపుడు, ఫిలిఫ్పి అర్జిన్‌ల్యూ అనే సెనేటర్‌ చేసిన ప్రసంగపు  తుదిపలుకులు ఈ ప్రాంతాలపై ఫ్రాన్స్‌ కు ఉన్న అభిప్రాయాలను పట్టిచూపుతాయిThe choice before us left seems strangely small. Or, unable to resist the feelings of deep regret to see a new tear in what was the French Empire, and whose institutions namely Pondicherry, Karaikal, Mahe and Yanam, for three centuries, formed the most beautiful jewels, it is against any acceptance of such an abandonment. Or, more modestly, but certainly a more realistic way, we accept the inevitable. we resign ourselves to a factual situation that allows no alternative, in other words, we agree, regardless of melancholy and sorrow that embrace the heart, the sensible and dull solution of accepting the treaty that gives our citizens a few guarantees and benefits, while formally inviting our diplomacy to resume talks at the earliest promptly to strengthen as far as possible the position of our country in this region and save up the rights of former French nationals. …….. (Ref. Le transfer-Part.3(8)-Part.III--La ratification du traité de cession - Written by Gabriel Piesse, CIDIF letters - Letter No. 26/27)

            1962 జూలై 23 న ఈ బిల్లుకు ఆమోదముద్ర పడిరది. దరిమిలా 1962 ఆగష్టు, 16 న ఫ్రెంచి ప్రభుత్వం ఈ ప్రాంతాల సార్వభౌమాధికారాలను భారత్‌ కు బదలాయించటం ద్వారా ఈ ప్రాంతాలపై చట్టపరమైన హక్కులను కల్పించినట్లయింది. ఈ రోజును ఈ ప్రాంతవాసులు ‘‘డిజ్యూర్‌ దినం’’ గా సెలిబ్రేట్‌ చేసుకొంటారు.  ఆ తరువాత భారతప్రభుత్వం 30 ఆగష్టు 1962 న పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి పాండిచేరీ, కారైకాల్‌ మాహే మరియు యానాంలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించటం ద్వారా ఈ ప్రాంతాలకు ఉన్న మూడు శతాబ్దాల ‘‘ఫ్రెంచి కనెక్షన్‌’’ శాశ్వతంగా తెగిపోయింది.

(ఫ్రెంచికాలనీలు భారతదేశంలో విలీనం అయిన పరిణామ క్రమాన్ని వివరించే సమాచారం ఇంతవరకూ తెలుగులో పెద్దగా లేని కారణంగా ఈ చాప్టరులో ఆ అంశాన్ని ఎక్కువగా వివరించటం జరిగింది. గమనించగలరు)

 

 (ఈ వ్యాసం నేను రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం (2010) నుండి. Pdf ఆర్కైవ్స్ లో కలదు)

బొల్లోజు బాబా
Uploading: 437373 of 437373 bytes uploaded.