Tuesday, July 14, 2020

"భారతీయ పండితుల వద్దనుంచి వారి పవిత్ర గ్రంధాలను బ్రిటానియ స్వీకరిస్తున్న దృశ్యం"

James Rennel అనే కార్టోగ్రాఫర్ 1783 లో హిందుస్తాన్ మేప్ ని రూపొందించాడు. అప్పటికి హిందుస్తాన్ (నేటి భారతదేశం) దాదాపు ఈస్ట్ ఇండియా కంపనీ వారి చేతుల్లోకి వచ్చేసింది. వారు వర్తకులనుండి పాలకులగా మారుతున్న దశ అది.
మేప్ కు కుడిపక్క ఉన్న చిత్రం చారిత్రాత్మకమైనది. ఆ చిత్రానికి రెన్నెల్ ఇలా అర్ధం చెప్పాడు
"భారతీయ పండితుల వద్దనుంచి వారి పవిత్ర గ్రంధాలను బ్రిటానియ స్వీకరిస్తున్న దృశ్యం"
.
వివరణ
ప్రాచీన బ్రిటన్ కు మూర్తిమత్వాన్ని కల్పించి Brittannia అనే పేరుకల ఒక దేవతగా పిలుచుకొనేవారు. హిందుస్తాన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నాక ఇక్కడి పవిత్రగ్రంధాలను బ్రిటానియా దేవత స్వీకరిస్తున్నట్లు చెప్పటాన్ని - మీ జ్ఞానాన్ని మేము స్వీకరించి దాన్ని రక్షిస్తాము అని సింబాలిక్ గా చెపుతున్నట్లు చరిత్రకారులు అర్ధం చెప్పారు.
అలా చరిత్రకారులు భావించటానికి ఆధారాలు
1. కంపనీ వారు అప్పటికే భారతదేశ రచనలను సేకరించి ఆర్చైవ్ చేసే ప్రొజెక్ట్ ఒకటి చేపట్టారు.
2. హేస్టింగ్స్ పూనుకొని అప్పటికి వందలసంవత్సరాలుగా అమలులో ఉన్న హిందూ, పర్షియన్ చట్టాలను అనువదింపచేసి 1776 లో కంపనీ డబ్బులతో “A Code of Gentoo Laws” పేరుతో ప్రచురించాడు.
3. Asiatic Society of Bengal (1784) పేరుతో ఔత్సాహిక కంపనీ ఉద్యోగులు Sir William Jones ఆధ్వర్యంలో ఒక సంస్థను స్థాపించుకొని భారతీయ వ్రాతప్రతులను సేకరించటం వాటిని పరిశోధించటం చేయటం మొదలుపెట్టారు.
4. 1785 లో చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను సంస్కృతంనుంచి ఇంగ్లీషులోకి అనువదించాడు. సంస్కృతంలోంచి ఇంగ్లీషులోకి అనువదింపబడిన మొదటి పుస్తకం ఇది.
5. ఆ తదుపరి కాలంలో మెకంజీ సుమారు లక్ష పేజీల వ్రాతప్రతులను సేకరించాడు. ఇవన్నీ నేటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. (మనవద్ద చాలా కాపీలు చెదలు తినేసాయి)
***
బ్రిటిష్ లైబ్రేరీలో అనేకవేల ఆనాటి తెలుగు పుస్తకాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఆరుద్ర చాలా సమాచారం అక్కడనుంచి సేకరించాడు. ఆ తరువాత ఎవరూ ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. డా. ఎన్. గోపి ఫ్రాన్స్ నుంచి ఇక్కడ లభించని కొన్ని వేమన పద్యాలు తెచ్చారు.
మద్రాసు ప్రాచ్యలిఖితభండాగారంలో బ్రౌన్ సేకరణలను (ఇవి బ్రౌన్ తిరగరాయించిన మెకంజీ సేకరణలు కావొచ్చు) ఎవరూ పట్టించుకోవటం లేదని బంగోరె నెత్తీనోరుబాదుకొని చెప్పాడు.
బ్రిటిష్ లైబ్రేరీలో ఉన్న ఇండియన్ ఆఫీస్ రికార్డ్స్ నుంచి, మెకంజీ సేకరణల నుంచి గ్రహించిన సమాచారంతో Jennifer Howes, Philip Wagnoner, Rama Sundari Mantena లాంటి యురోపియన్ చరిత్రపరిశోధకులు పుస్తకాల మీద పుస్తకాలు రాస్తున్నారు.
.
మనకు చరిత్ర అంటే కులం మతం తప్ప మరింకేం కనిపించదు.
.
ఇక పై చిత్రంలో గమనిస్తే సుమారు రెండువందల యాభైఏండ్ల క్రితం నాటి పండితుల వేషధారణ గమనించవచ్చు. బ్రిటానియాదేవత వెనుక గ్లోబుతో ఆడుకొంటున్న సింహం, ఎత్తైన ఉన్నతస్థానం కనిపిస్తుంది. ఆ వెనుక ఏదో దేవాలయం. మరో పక్క పెద్ద ఓడ. క్రింద నేలపై విల్లంబులు.
ఒరలో కత్తితో సైనికుడు.ఆ పక్క దుబాసి కావొచ్చు.
అప్పటికే తుపాకులు వచ్చాయి అవి చిత్రంలో మిస్ అయ్యాయి.
మరొక ఆసక్తి కలిగించే అంశం చిత్రంలో వ్యక్తి తలను క్రిందకు ఉంచి, పవిత్రగ్రంధాలను పైచేయిస్థానంతో కాక, క్రింద ఉంచి ఇస్తున్నాడు. ఇది బహుసా అప్పట్లో రాజుల ఎదుట ప్రదర్శించే రీతి కావొచ్చు.
బొల్లోజు బాబా

about my proffession

నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు తెలుగు లెక్చరరా, హిస్టరీ లెక్చరరా అని.
నా ఉద్యోగం గురించిన సమాచారం నేనింతవరకూ ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకో ఈరోజు కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తోంది.
***
1994 లో జంతుశాస్త్రంలో M.Sc, M.Phil, BEd పుర్తయ్యాక కొన్నాళ్ళు ప్రెవైట్ స్కూల్ టీచర్ గా, నెల్లూరు రొయ్యలచెరువు అక్వాటెక్నిషియన్ గా, డిగ్రీకాలేజ్ లో పార్ట్ టైమ్ లెక్చరర్ గా పనిచేసి - 1998 లో ప్రభుత్వ జంతుశాస్త్ర జూనియర్ లెక్చరర్ గా సర్వీస్ కమిషన్ పరీక్షద్వారా ఎంపికయి నా కారీర్ మొదలుపెట్టాను. అప్పట్లో నేను వ్రాసిన ఇంటర్మీడియట్ జువాలజీ స్టడీ మెటిరియల్ ఆనాటి ఆర్.ఐ.ఒ శ్రీ గౌస్ గారు ముద్రించి అన్ని కళాశాలలకు పంపిణీచేసారు. 2010 లో డిగ్రీ లెక్చరర్ గా ప్రమోట్ అయ్యాను.
2013 లో కాకినాడ పి.ఆర్. కళాశాలకు బదిలీపై వచ్చినప్పుడు, మిత్రుడు శ్రీ పి. అనిల్ కుమార్ ప్రోత్సాహంతో డిపార్ట్ మెంటల్ బ్లాగ్ ను ఒకదానిని క్రియేట్ చేసాం.
పాఠం అయిపోగానే పిల్లలకు నోట్స్/మెటీరియల్ ను బ్లాగులో పోస్ట్ చేసి అక్కడనుంచి వాళ్లు డౌన్ లోడ్ కానీ ప్రింటవుట్స్ కానీ తీసుకొని చదువుకోవటం అలవాటు చేసాను. ఈ ఏడేళ్లలో దానిలో సుమారు 180 టాపిక్స్ పై తెలుగు, ఇంగ్లీషు మీడియంకు చెందిన మెటీరియల్ పోగుబడి ఉంది. దీన్ని మా విద్యార్ధులే కాక చాలా మంది చూస్తున్నారని అర్ధమౌతోంది. ఈనాటికి 31,567 వ్యూస్ కలిగి ఉన్నది.
రెండేళ్లక్రితం నేను వెళ్ళే క్లాసు విద్యార్ధులతో Moodle గ్రూపును ఏర్పరచి, వారి అసైన్మెంట్స్, ప్రొజెక్ట్స్ అన్నీ Moodle ద్వారా సబ్మిట్ చేయటం అలవాటు చేసాను. విద్యార్ధులు వారికివ్వబడిన అసైన్మెంటును పేపర్ పై వ్రాసి దానిని పి.డి.ఎఫ్ గా మార్చి గడువులోపల ఆన్ లైన్లో సబ్మిట్ చేస్తారు. దాన్ని నేను ఇవాల్యుయేట్ చేసి రాంక్ ఇస్తాను. అలాగే క్విజ్ లు. ఇంకా విడియో సెమినార్లు, విడియో ప్రొజెక్ట్ వర్క్స్. వీటన్నిటి క్యుములేటివ్ మార్కులను వారి 40% ఇంటర్నల్ మార్క్స్ గా కన్వర్ట్ చేసి పరీక్షల విభాగానికి అందచేస్తున్నాను.
దీనిద్వారా నాకు అర్ధమైన విషయం ఏమిటంటే కాస్త ప్రోత్సాహం ఇస్తే విద్యార్ధులు తొందరగా అప్ డేట్ అయ్యి మెరుగైన ఫలితాలను చూపిస్తారని. (విడియోలు చూడండి)No photo description available.No photo description available.No photo description available.

బ్లాగు లింకు: https://zoologyprgc.blogspot.com/

వీడియో సెమినర్: https://www.youtube.com/watch?v=Ycj6LuZJYbI&feature=youtu.be

వీడియో ప్రొజెక్ట్ వర్క్: Identification of any two Cattle breeds
***
ఈ రోజు జూమ్ క్లాసులద్వారా పాఠాలు చెప్పమంటున్నారు. చెపుతున్నాను. నాకు తృప్తినివ్వటం లేదు. కనీసం పదిశాతం విద్యార్ధులు కూడా రావటం లేదు. రకరకాల కారణాలు. వాటిజోలికి పోను.
విద్య అనేది క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయుడు, విద్యార్ధి మధ్య జరిగే ముఖాముఖి సంభాషణ అనుకొంటాను. టెక్నాలజీ అనేది ఆ సంభాషణకు కొనసాగింపుగా ఉండాలి అని భావిస్తాను.
***
రోజులో ఎనిమిది గంటలు ఉద్యోగానికి, మరో ఎనిమిది గంటలు కుటుంబం, సాహిత్యం కొరకు వెచ్చిస్తాను. ఉద్యోగవిషయాలు ఇంటికీ, ఇంటి/సాహిత్య విషయాలు ఉద్యోగస్థలానికీ ఏనాడూ తీసుకెళ్లలేదు.

బొల్లోజు బాబా

పిఎస్. I am very well aware that I am being paid to do all these. I just wish to share my experiences. Thats it.

ఒక మిత్రుని వాల్ పై చేసిన కామెంటు ఇది.


****
కవిత్వ వ్యక్తీకరణలో లోకల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఉంటాయి కూడా...
ఆంధ్రప్రాంత కవుల కవిత్వం ఒకరీతిగా ఉంటే తెలంగాణ కవుల కవిత్వం మరో రీతి.
నిజానికి ఆంధ్రప్రాంత కవులు గత మూడు నాలుగు దశాబ్దాలుగా షాడో (shadowed) అయిపోయారని నా వ్యక్తిగత అభిప్రాయం. చాలామందికి కోపం రావొచ్చు.
విమర్శకులు పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం వేసారు.
బొల్లోజు బాబా

about Afsar sir

అఫ్సర్ ని నేను ఇంతవరకూ ప్రత్యక్షంగా చూడలేదు. అయిదార్లు సార్లు తప్ప ఫోనుల్లోనూ పెద్దగా మాట్లాడుకోలేదు. మా ఇద్దరిదీ కవిత్వసంబంధం.
"అప్పటినుంచి ఇప్పటిదాకా" సంపుటిపై ఇటీవల వ్రాసిన వ్యాసంలోని కొన్ని వాక్యాలివి
//.......అనన్యత కొరకు చేసిన అనంతమైన పెనుగులాటే అఫ్సర్ కవిత్వం మొత్తం. తాను ఈ సమాజానికి అన్యుడనని అంగీకరించలేకపోవటం ఒక వైపు, తనను ఎందుకు అన్యుడిగా ఈ సమాజం భావిస్తున్నదో అంటో అన్వేషించుకొనే ప్రక్రియ మరో వైపు. ఈ రెండు దృవాల మధ్యా నలిగే హృదయఘర్షణ సంక్లిష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోంచి తన పరాధీనతను గానం చేస్తాడు అఫ్సర్. ఒక మైనారిటీ కవి అవటం వలన అతనిపై అదనపు భారం ఉంటుంది. అందరికీ చక్కగా కుదురుకొన్న వ్యవస్థలో అఫ్సర్ ను ఏదో తెలియని అశాంతి వెంటాడుతుంది.
మనచుట్టూ రక్తమాంసాలతో సంచరించే ఇండియన్ కు, సమకాలీన రాజకీయాలు నిర్మిస్తోన్న ఆదర్శ భారతీయునికి మధ్య పెరిగిపోతున్న అగాధం గురించి అఫ్సర్ కవిత్వం మాట్లాడుతుంది. ఒక అరాచక కట్టుకథ వాస్తవ రూపం దాల్చటం పట్ల సగటు మనిషి పొందే భీతిని పట్టుకొంటుంది. ఈ కవి ఈ నేల యొక్క శతాబ్దాల సామరస్యానికి ప్రతినిధి. తను పుట్టిన నేలపై “లవ్ హేట్” బంధాన్ని కలిగి ఉన్నాడు.....//
.
(నలభై ఏళ్ల వర్తమానం – అఫ్సర్ కవిత్వం-- 1/3/2020)
***
.
అఫ్సర్ రాసిన "యానాం వేమన ఏమనె..." నన్ను అప్పట్లో కలవరపెట్టింది. చాన్నాళ్ళు ఆలోచింపచేసింది, స్పష్టపరచింది. తెలుగు కవిత్వం ఒక సంధికాలంలో ఉన్నప్పుడు వచ్చిన కవిత అది. అప్పటికి ఇంకా అస్తిత్వవాద ఉద్యమాలు చిక్కబడలేదు.
ఆ సందర్భంలోంచి 2009 లో ఆ కవితను విశ్లేషించాను. అప్పటికి, ఇప్పటికీ పరిస్థితులు మరింత క్లిష్టతనొందాయి. స్వేచ్ఛగా, హేతుబద్దంగా, గౌరవప్రదంగా బ్రతకాలనుకొనే ప్రతీ సగటువ్యక్తి వెనుకా మింగేయటానికి భూతమొకటి పొంచిఉంది. కవులు కత్తిఅంచున నిలబడి మాట్లాడవలసివస్తోంది.
***
“యానాం వేమన ఏమనె….” అఫ్సర్ కవిత గురించి
బొల్లోజు బాబా - September 8, 2009
*****************************************************
అనుభవం నుంచి పుట్టే కవిత్వానికి ఆయుర్ధాయం ఎక్కువ. అనుభవాన్ని వెచ్చని స్పర్శగా మలచగలిగే కవి చేతిలో పడితే ఇక అది ఓ శిల్పమై నిలుస్తుంది. టౌనుల్లో కూర్చొని రాసే విప్లవగీతాల హోరులో, సుష్టుగా భోంచేసి అల్లిన ఆకలి కేకల కవిత్వం మధ్య, మూలాల్లో నిలుచుని పలికిన “యానం వేమన ఏమనె…..” కవితా వాక్యాలు నన్ను చాన్నాళ్లు కలవర పెట్టాయి. నా జీవనయాన రెపరెపల్లో చెక్కుచెదరక మరల మరల గుచ్చుకొంటూ, అదే బాధ, అదే అశాంతిని రగిల్చే కొన్ని వాక్యాలలో ఇవి మరపురానివి.
ఈ కవితను మొదటి సారిగా ఆంధ్రజ్యోతి పత్రికలో చదివాను (1992). ఈ కవి ఎవరో మా “యానాం” గురించి రాసాడన్న కుర్రతనపు ఉత్సుకత మొదట్లో ఉండినా, పదే పదే చదివినపుడు, ఈ కవితలో జీవిత సామస్త్యాన్ని ఇముడ్చుకొన్న ఒక “రక్త స్పర్శ” కనిపించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. “శ్రమైక జీవన సౌందర్యం” అని శ్రీశ్రీ వర్ణించినా, “మంచియన్నది మాలయైతే మాలనేనగుదున్” అని గురజాడ ప్రకటించినా, “శ్రమకు విశ్రాంతి కంటికి రెప్పలా ఉంటుంది” అని టాగోర్ అన్నా ఏదో వెలితి. ఒక ఆలోచన ఎప్పటికీ తెగేది కాదు. లోపలి దారం కనిపించనితనం వెంటాడుతూండేది.
ఆ మహాకవుల కాలంనుంచీ ఇప్పటిదాకా సామాజిక చైతన్యం వేయి దళాలతో వికసించటం వల్లనో ఏమో, ఆ కనిపించని దారమేదో ఈ కవితలో కవికి దర్శనమయ్యింది.
సందర్భం-: కవి యానాం వెళ్లినప్పుడు మాదేటి “సుబ్రమణ్యం” అనే ఒక దళితుడు కొన్ని వేమన పద్యాలు పల్లె పాటలు వినిపించాడు. ఆ యానాం వేమన ఆ రోజు “ఇన్నాళ్లుగా రాస్తుండారు, మా కష్టాలూ, కన్నీళ్లు మీకు ఆపడ్డయా దొరా. ఒకే దారి గుండా వచ్చాం కదా మన ఆకెందుకు ఎడమయ్యింది బాబయ్యా” అని సంధించిన ఒక ప్రశ్న కవిహృదయపు బుల్స్ ఐ కి గుచ్చుకుంది. అంతవరకూ కలల లోకంలో విహరించిన కవి ఆలోచనల్ని పేకమేడలా కూల్చివేసిందా ప్రశ్న. కూలిన ఆ ఆలోచనల్లోంచి ఓ ఫీనిక్స్ పక్షిలా ఈ కవిత పైకి లేచింది. కవుల్ని “నిజం చెప్పు” అంటూ శాసిస్తూంది ఈనాటికీ.
ఆ దళితుని ప్రశ్నకవిలో రగిల్చిన అంతర్మధనం ఈ కవిత లో కనపడుతుంది. ఏమిటీ పరిస్థితులలకు కారణం అనుకుంటూ తన లోపల్లోకంలో అన్వేషణ సాగిస్తాడు కవి. తన చదువునూ, జ్ఞానాన్ని తడిమి చూసుకుంటాడు. ఒక సమాధానంకోసం దోసిలి పట్టి అర్ధిస్తాడు కవి. ఆ వెతుకులాటలో ఎన్నోతరాలుగా మూసుకుపోయిన కనులు సాక్షాత్కరిస్తాయి. తన అంధత్వం తనకే గోచరమౌతుంది. బలవంతంగా వర్గాల మధ్య ఏర్పడిన కండిషనింగ్ తెలుస్తుంది. ఒక వర్గం సాగించిన వివక్ష కనపడుతుంది. ఆ అనుభవం ఇచ్చిన జ్ఞానంతో కవి “మాటకీ అక్షరానికీ చెమట చేతుల మోటుదనం కావాలిక” అని ప్రకటిస్తాడు. మట్టివాసనను, కన్నీటి జాడలనీ, కవిత్వం ప్రతిబింబించాలని ఒక దిశానిర్దేశం కావిస్తాడు.
కవిత్వంలో మనిషివాసన కన్నా చమట చేతుల మోటుదనం యొక్క అవసరతను ఈ కవితలోని అక్షరక్షరం ఎలుగెత్తి చాటింది. దళితకవిత్వ ఉద్యమంలో వస్తువుని నిర్ధిష్టంగా గుర్తించి వ్రాయబడ్డ కవితలలో ఈ కవిత ముందుంటుంది. ఎందుకంటే, ఈ కవితానంతర కాలంలో మహోత్తుంగ తరంగాల్లా ఎగసిపడ్డ దళిత, బహుజన, మైనారిటీ కవిత్వాలలో ఈ కవితాత్మే శత సహస్ర రూపాలతో సంచరించటం ఒక చారిత్రక పరిణామం.
నాకు ఈ కవితలో, వ్యక్తి అనుభవాన్ని కవిత్వంగా మార్చగలగటం, లోపల్లోకపు సంఘర్షణను నిజాయితీగా అక్షరీకరించటం, కవిత్వం సామజిక హితాన్ని కలిగించాలన్న దృక్పధము కనిపిస్తాయి. బహుసా మంచి కవిత్వానికి పై మూడు లక్షణాలు కొలబద్దలేమో కూడా.
నాకు నచ్చిన కవిత గురించి, ఆ కవిత కలిగించిన ఆలోచనలగురించి పంచుకొనే అవకాశాన్ని కలిగించిన పుస్తకం.నెట్ వారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటూ, అఫ్సర్ గారు వ్రాసిన యానం వేమన ఏమనె.. కవితను ఇలా మిత్రులతో పంచుకోవటాన్ని సంతోషిస్తూ……
యానాం వేమన ఏమనె……..
కలల పక్క మీంచి కలవరిస్తూ
నేల మీద దబ్బున పడిపోయినట్టు
చితికిపోయిన ఆకాశం మీంచి నువ్వు
నన్ను భూమ్మీదికి నెట్టినప్పుడు
నా ప్రపంచం మీద కొత్త సూర్యుడు పొడిచాడు
ఒకటి రెండు పదులు వందలుగా విస్తరించి నువ్వు
ఆకాశ శూన్యాన్ని నింపుకొని పోతున్నప్పుడు
నేను ఒఠ్ఠి శున్యాన్నై
శూన్య గోళాన్నయి నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉండి పోయాను.
నేను నిలబడినప్పుడు
మళ్లీ నన్నొక ప్రశ్నగా మార్చి
నా కాళ్ల కింద భూమిని తొలిచావు నువ్వు.
ఆ తర్వాత నేను
నా మొహం వెనుక
వేన వేల భూగోళాల్ని కొండకోనల్ని తవ్వుకుంటూ వెనక్కి వెళ్లిపోయాను
నేను తెచ్చుకున్న చదువునంతా పారబోసుకున్నాను
మళ్లీ దాహం తీర్చమని నీ ముందు దోసిలి ఎత్తాను
నువ్వు నీళ్లూ వొంపలేదు
నా దోసిలీ నిండలేదు
నా దాహం పిడచకట్టుకుని నేను ఎడారినయ్యాను.
నా వొడ్డున ఏ నీటి చుక్కయినా చేపపిల్లలా
విలవిల విల్లాడుతుందేమోనని
మళ్లీ మళ్లీ ఎదురుచూస్తూనే ఉంటాను నేను.
2.
ఎవడు పుట్టినా ఆడదానికేగా
ఏ ఆడదైతేనేం
ఎవడు పుట్టినా రక్తం లోంచేగా
ఏ రక్తం అయితేనేం, మరి
నా యిస్తరి దూరంగా ఎందుకు పెడ్తివి నా దొరా నా రాజా
అని ఈ భూమి కెదురుంగా నిలబడి
సూర్యుడిలా నువ్వు నన్ను పొడుస్తూనే ఉంటావా!
ఇంత తెలిసీ ఇంత చేసీ
నీ కష్టాన్నీ, నీ కన్నీళ్లనీ చూడలేని
అంధుణ్నయిపోయినందుకు
నా కన్రెప్పలకి నీ మాటల సూదులు వేలాడ్తూనే ఉన్నాయి నా మట్టి మనిషీ!
నేను వొట్టి మనిషినే అనుకున్నా
నువ్వూ వొట్టి మనిషివే అనుకున్నా
మనిద్దరి చీమూ రక్తవూ వొక్కటే అనుకున్నా
తోలు తిత్తి ఏదైతేనేం
మనిద్దరి కష్టాలూ వొక్కటే అనుకున్నా
అంతా వొట్టిదే నా మట్టి మనిషీ!
నా వొంటి మీద చొక్కా రంగుని బట్టీ
నా పెదవి మీద మాటల వాసన్ని బట్టీ
నా తల్లీదండ్రీ నాకు పంచిచ్చిన రక్తాన్ని బట్టీ
నా చేతుల మోటుదనాన్ని బట్టీ
తలపాగా తీసి నువ్వొచ్చినప్పుడు
నీ ముందు వొంగున్న తీరును బట్టి
నా మనిషితనం ఖాయమైపోతున్నప్పుడు
నేను వొట్టి మనిషిని ఎట్లవుతా?
3
మాటకీ
అక్షరానికీ
మనిషివాసన ఉంటే సరిపోద్దా?
పోదు,
ఏ మనిషి వాసనో గట్టిగా పసికట్టనీ.
మాటకీ అక్షరానికీ
చెమట చేతుల మోటుదనం కావాలిక!
మాటకీ
అక్షరానికీ
కళ్లకింద బాధతో ఏడుపుతో
తడిసీ నానీ
నల్లబారిన నీడ కావాలిక
మాట నిజంగా మాటయితే
మనువు మాటలో చెప్పాలంటే
అది కాళ్లలోంచి పుట్టాలి
మట్టి కాళ్లలోంచి పుట్టాలి.
– అఫ్సర్

"మెకంజి కైఫియ్యతులు - తూర్పుగోదావరి జిల్లా " పుస్తకం దాదాపు పూర్తయింది.



ఆంధ్రప్రదేష్ కు చెందిన 13 జిల్లాలలో పది జిల్లాలకు సంబంధించిన కైఫియ్యతులను ఎపి ఆర్చైవ్స్, సిపి బ్రౌన్ సంస్థల వారు ఇప్పటికే ముద్రించారు. కడప జిల్లా ఏడు సంపుటాలు, గుంటూరు జిల్లా మూడు సంపుటాలు, మిగిలిన జిల్లాలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున వెలువరించారు. కృష్ణా దాటాక ఈ కైఫియ్యతుల సేకరణ పెద్దగ జరగలేదు.
ఇక మిగిలిపోయిన మూడు జిల్లాలలో తూర్పుగోదావరి ఒకటి. ఆ లోటు ఈ పుస్తకంతో తీరుతుందని భావిస్తాను. ఈ జిల్లాకు సంబంధించి పది కైఫియ్యతులు మాత్రమే లభిస్తున్నాయి.


దీనికి సంబంధించిన మెటీరియల్ చాలామట్టుకు బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయంలో, గౌతమి లైబ్రేరీలో దొరికింది. ఎపి. ఆర్చైవ్స్ వారి సమాచారం శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు ఇచ్చారు.
ఇప్పుడున్న పరిస్థితులలో పుస్తకరూపంలో రావటానికి మరో 6 నెలలు పట్టొచ్చు.
ఇది ఇండెక్స్ పేజీ ఇంకా కొన్ని ఫొటోలు

 
బొల్లోజు బాబా








సమకాలీన తెలుగు లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్


ఇటీవల ప్రముఖ విమర్శకులు శ్రీ సీతారాం "కావ్యసౌందర్యశాస్త్రం లేదా భారతీయ లాక్షణిక సిద్ధాంతాలు వినా,మనవీ అని చెప్పుకోదగిన సాహిత్య సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా?" అని ప్రశ్నించారు. దీనికి ప్రముఖ విమర్శకులు శ్రీ లక్ష్మి నరసయ్య "దళిత, బహుజన, ముస్లిం వాద సాహిత్య దృక్పథాలు వాటికి సంబంధించిన ఈస్థటిక్స్ లాంటివి దేశీయ సాహిత్య సిద్ధాంతాలు" అన్నారు.
షేక్ పీర్ల మొహమ్మద్" ఏ సిద్దాంతానికైనా యూనివర్సల్ అప్పీల్ ఉండాలి కదా" అనే కోణాన్ని గుర్తుచేసారు.
కవిసంగమంలో ఈ అంశంపై జరిగిన చర్చ చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. నావైన కొన్ని అభిప్రాయాలు.
***
Literary theory అంటే ఏమిటి?Image may contain: 1 person, text and close-upImage may contain: 1 person, glasses and text
Literary theory సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ఏమిటి? అని ప్రశ్నించి దానికి సమాధానాలు రాబడుతుంది. అంటె రసము, ఔచిత్యం, ధ్వని, Tension, Texture, Ambiguity లాంటి ఏ ప్రక్రియ వల్ల ఒక కవిత ఎలా గొప్పకవిత అయ్యిందో/అవ్వగలదో సిద్ధాంతీకరిస్తుంది. లిటరరీ సిద్ధాంతం అంటే సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి, సృజించటానికి ఉపయోగపడే ఆలోచనలు, పద్దతులు
Literary Criticism సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది, తూకంవేస్తుంది మంచి చెడ్డలు విడమరచి చెపుతుంది. ఈ విమర్శలో ఒక కవిత ఎందువల్ల మంచికవితో లేక అకవితో పై సిద్ధాంతాల ఆధారంగా నిరూపిస్తుంది. ఎక్కడ రసభంగం జరిగింది, ఎక్కడ ఔచిత్యదోషం ఉంది, ఉద్దేశించిన ధ్వనికి ఎలా అన్వయం కుదరలేదు అనే విషయాలను విపులీకరిస్తుంది.
Literary theory, Literary Criticism లు పరస్పరాధారితాలు. ముందు theory పుడుతుంది, దానికనుగుణంగా విమర్శ జరుగుతుంది. ఉదాహరణకు సాహిత్యమనేది ఒక సాంఘిక కార్యక్రమమని, కవి సామాజిక మార్పుకు దోహదపడాలనే మార్క్సిజసిద్ధాంతం మొదటగా పుట్టింది. ఆ సిద్దాంతాన్ని ఉపయోగించుకొని ఒక కవితలో "సామాజిక ప్రయోజనం" ఏమేరకు ఉంది అంటూ విమర్శ సాగుతుంది. అలాగన్నమాట.
నిజానికి ఈ సిద్ధాంతకర్తకు, విమర్శకుడి కన్నా ముందు సృజనకారుడు అనే వాడు ఒకడుంటాడు. వాడికీ గొడవలేమీ పట్టవు. వాడిమానాన వాడు రాసుకొంటూ పోతాడు. వాడు రాసినవాటిలోంచే ఈ సిద్దాంతాలు, విమర్శలు పుట్టుకొస్తాయి.
***
దేశీయ లాక్షణిక సిద్ధాంతాలు
సాహిత్యం ఎలా ఉండాలి ఏవేం అంశాల వలన ఒక రచన సాహిత్యవిలువలను పొందుతుంది అనే విషయాలను లోతుగా శోధించి, కొన్ని ప్రతిపాదనలను చేసారు మన పూర్వీకులు. ప్రాచీన భారతీయ సిద్ధాంతాలలో ప్రధానంగా అలాంటివి ఆరింటిని గుర్తించవచ్చు
*భరతుని రస సిద్ధాంతం: రసాత్మకమైనదే కావ్యమని ప్రతిపాదిస్తుంది.
*భామహుని అలంకార సిద్ధాంతం: కావ్యానికి అలంకారాలు ప్రధానం అంటుంది
*వామనుడి రీతి సిద్ధాంతం: మంచి కావ్యానికి మంచి గుణాలుండాలంటుంది.
*ఆనందవర్ధనుని ధ్వని సిద్ధాంతం: వాచ్యంగా చెప్పిన విషయం కన్నా చెప్పకుండా వదిలేసిన విషయం ప్రధానమంటుంది.
*కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం: వక్రోక్తి అంటే అలంకారములతో నర్మగర్భంగా చెప్పటం. ఇది ఆనందవర్ధనుని ధ్వనిని పోలి ఉంటుంది.
*క్షేమేంద్రుని ఔచిత్య సిద్ధాంతం: ఏది దేనికి తగి ఉంటుందో దాన్ని ఔచిత్యం అంటారు. కావ్యానికి ఔచిత్యం ఉండాలంటుందీ సిద్దాంతం.
***
ఇరవయ్యోశతాబ్దంలో పాశ్చాత్య Literary theory లలో అనేక దృక్పథాలు ప్రవేశించి Literary criticism ను నడిపించాయి. దేశీయ లాక్షణిక సిద్ధాంతాలకు పాశ్చాత్య సిద్ధాంతాలకు పొంతన ఉండదు. భారతీయ, పాశ్చాత్య సంస్కృతులు పూర్తిగా భిన్నమైనవి కనుక ఈ రెండిటి మధ్య పోలికలు తేవటం దాదాపు అసాధ్యం.
మొదట్లో అరిస్టాటిల్ లాంటివారు జీవితాన్ని అనుకరించేదే కళ అన్నారు.
తరువాత మిల్టన్ కాలంలో చందస్సును అనుసరించి చెప్పటమే సాహిత్యం అన్నారు
కాల్పనికతే (romanticism) సాహిత్యమని షెల్లీ, కీట్స్ కవిత్వం చెప్పింది.
.
ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి
*అభ్యుదయ, సామాజిక ప్రయోజనం కలిగి ఉండటం (మార్క్సిస్ట్ సిద్ధాంతం)
*భిన్నత్వాలను celebrate చేస్తూ చరిత్రను నిరాకరించటం ద్వారా స్వీయ అస్తిత్వాన్ని ప్రకటించుకోవటం (పోస్ట్ మోడర్న్)
*మనో వైజ్ఞానిక అంశాలను పొదువుకోవటం (ఫ్రాయిడియన్)
*స్త్రీవాద (gender and Queer theories)
*సాంస్కృతిక వైవిధ్యాలను ప్రతిబింబించటం (Cultural theory)
*పాఠంలోనే అన్ని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Structuralism)
*పాఠం వెలుపల సోషల్ పొలిటికల్, హిస్టారికల్ కారణాల వల్ల చాలా కనిపించని అర్ధాలు ఉంటాయి అనే ప్రతిపాదన (Post structuralism)
*రచనలో బహుళార్ధాలను వెతకటం (Deconstruction)
*వలసపాలనానంతర ప్రభావం (Post Colonial)-- లాంటి రకరకాల లిటరరీ సిద్ధాంతాలు సాహిత్యంలో "సాహిత్యసంబంధి" ఏదో తేల్చి చెప్పటం కొరకు ప్రతిపాదించబడ్డాయి. ఒక్కోక్కటీ అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో సాగుతాయి.
పైన చెప్పిన ఆధునిక లిటరరీ థీరీలను గమనిస్తే, ఎప్పుడో వందల సంవత్సరాలక్రితం ఏర్పరచిన లాక్షణిక సిద్ధాంతాలే తప్ప ఆధునిక కాలంలో మనం సృష్టించుకొన్న ఆధునిక దేశీయ సాహిత్య సిద్ధాంతాలు ఏమున్నాయి అని ప్రశ్నించుకోవటం సందర్భోచితమే కాదు అవసరం కూడా.
ఆమేరకు లక్ష్మి నరసయ్య గారు చెప్పిన దళిత,బహుజన ఈస్థటిక్స్ కొంతమేరకు ఆ లోటును తీర్చిందని భావించవచ్చు.
మన తరంలో తెలుగులో అంత స్పష్టంగా కవిత్వానికి చక్కని నిర్వచనాన్ని, అసలు ఏది కవిత్వం అన్నదానికి సమాధానాన్ని, కవిత్వపు పరిధులు, బలహీనతలను విస్పష్టంగా చెప్పిన ఒక సిద్ధాంతకర్తగా శ్రీ ఇస్మాయిల్ కనిపిస్తారు. ఈయన వెలిబుచ్చిన అభిప్రాయాలపై పాశ్చాత్యప్రభావం లేదని చెప్పలేం అయినప్పటికీ ఇస్మాయిల్ గారి అభిప్రాయాలు స్వతంత్రంగా, స్థానీయంగా ఉండటం గమనించవచ్చు.
***
సమకాలీన లాక్షణికుడు - శ్రీ ఇస్మాయిల్
తెలుగుకు సంబంధించినంత వరకూ కవిత్వాన్ని నిర్వచించి, కొన్ని లక్షణాలను ప్రతిపాదించిన ఆధునిక కవులలో ఇస్మాయిల్ కనిపిస్తారు. నేనొక లాక్షణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాను అని ఆయన ఎక్కడా చెప్పుకోకపోయినా ఆయన వదిలివెళ్ళిన ప్రతిపాదనలు, చేసిన చర్చలు, వాదప్రతివాదనలను ఈ రోజు మనముందే ఉన్నాయి. వాటి ద్వారా, ఇస్మాయిల్ తనజీవితకాలమంతా తపస్సుచేసి ఆధునిక కవిత్వంలోని "సాహిత్యసంబంధి" లక్షణాలను నిర్వచించారని, కవిత్వాన్ని విశ్లేషించటానికి కావాల్సిన పనిముట్లను గుర్తించారని తెలుసుకోవచ్చు.
.
ఒక లాక్షణికుడిగా ఇస్మాయిల్ చేసిన ప్రతిపాదనలు
.
1. కవిత్వంలో నిశ్శబ్దం
మన చుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం. అనుభవాన్ని అనుభవంగానే ప్రత్యక్షం గా అందించటం కవిత్వం పని. అనుభూతి సామాన్య భాషకు అందదు. ఆ అనిర్వచనీయమైన ఆ నిశ్శబ్దాన్ని వాక్యాలలోకి ప్రవేశపెట్టటమే కవిత్వ లక్షణం. కవిత్వానికి శబ్దమెంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే.
(ఇది కొంతమేరకు ధ్వని సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది. శబ్దం అంటే ఒక కవితలో పైకి చెపుతున్న విషయంగాను, నిశ్శబ్దం అంటే అన్యాపదేశంగా చెపుతున్న లేదా చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంచిన విషయంగాను అర్ధం చేసుకోవాలి)
.
2. కవిత్వం హృదయ సంబంధి
.
కవిత్వం హృదయ సంబంధి. ఆలోచనా వ్యవస్థ బుద్ధికి సంబంధించినది. కవిత్వాన్ని బుద్ధి (Reason) శాసించలేదు.దాని సామ్రాజ్యమే వేరు. కవిత్వానికి "కరుణ ముఖ్యం".
అసలు సృజనాత్మకతకి మూలమేమిటి? కవి యొక్క దర్శనం (vision). ఇది పూర్తిగా వైయక్తికమైనది. ఏ కవి దర్శనం వానిది. దీన్నించే అతని కవిత్వం ఉద్భవిస్తుంది. కనక, కవి నిబద్ధుడై ఉండవలసింది తన సొంత దర్శనానికే!
కవిత్వం తల్లివేరు కవి అంతర్లోకమూ, బహిర్లోకమూ కలిసేచోట తన్ని ఉంటుంది.
.
3. కవిత్వం చేసే పని చదువరి మనస్సులో దీపం వెలిగించడం.
.
కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే. దీని వల్ల అతని అవగాహన పరిధి విస్తరిస్తుంది. తన మనస్సులో వెలిగిన దీపం వెలుతురు తన దారి తను వెతుక్కోవడానికి సహాయపడుతుంది. ఫలానా దారినే నడవమని ఒకరు చెబితే వినడు మనిషి. అది తనకు తోచాలి. తన దారేదో తను నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయానికి కవిత్వం తోడ్పడుతుంది.
“కళ కళ కోసమే” అనే వాదనా, “కళ సాంఘిక రాజకీయ ప్రయోజనాల కోసం” అనే వాదనా – రెండూ అతి వాదాలే! ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఏదీ వుండదు. ఐతే దేని ప్రయోజనం దానికుంటుంది. ఇది గుర్తించడం ముఖ్యం. ప్రపంచాన్ని అవగాహన చేసికోవటమూ, తద్వారా ప్రపంచంతో అనుభౌతిక అనుసంధానం (emotional adjustment) సాధించటమూ – అనాది నుంచీ కళా ప్రయోజనమని అనుకుంటున్నాను.
.
4. భాషని శుభ్రపరచటం
.
నేను (ఇస్మాయిల్) కవిత్వంలో ఒక ముఖ్యమైన పని చేయడానికి పూనుకున్నాను. భాషని శుభ్రపరచడానికి ప్రయత్నించాను. చాలా మాటలకు మాసిన రంగులు, పాత వాసనలు ఉంటాయి. అలాంటి మాటల్ని కవిత్వంలో వాడలేదు. పాత కావ్యాల్లోనివి, పురాణాల్లోని పదాలు, సమాసాలు, పేర్లూ, కథలూ నా కవిత్వం జోలికి రాకుండా జాగ్రత్తపడ్డాను.
నా స్వంతమైన, సరికొత్త అనుభవాల్ని వ్యక్తపరచటానికి, వ్యావహారికప్రపంచంలోని సరికొత్త మాటల్నే కోసుకొచ్చి వాడుకున్నాను.
.
5. కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు
.
కవిత్వానికి లేబిల్స్ అంటించడం నాకిష్టం ఉండదు. ఆలోచన నుంచి తప్పించుకొనే మార్గాలు లేబిల్స్. అర్థం చేసుకొనే కష్టానికి పాల్పడకుండా, తేలిగ్గా కొట్టిపారెయ్యడానికి లేబిల్స్ ఉపయోగిస్తారు. ‘బూర్జువా, శ్రామికవర్గం, రివిజనిస్టు లాంటి లేబిల్స్ అంటించి ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేయవచ్చు.
***
పైన చెప్పిన అయిదు పాయింట్లు ఆధునిక కవిత్వాన్ని అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించటానికి దోహదపడే అంశాలు. పై అయిదు పాయింట్లు స్వేచ్ఛాప్రతిపాదనలు.
కవిత్వంలో నిశ్శబ్దం అనే ప్రతిపాదనకు ధ్వనిసిద్ధాంతం మూలాలు కనిపిస్తున్నా, చెప్పిన విధానం కొత్తది. .
కవిత్వం హృదయసంబంధి అన్నటువంటి మాట emotions recollected in tranquility అన్న మాటకు దగ్గరగా అనిపించవచ్చు. కవిత్వం పూర్తిగా వైయక్తికఅనుభవంగా, దర్శనంగా ఆమేరకు తన సృజనను కొనసాగించటం ఇస్మాయిల్ నిబద్దతగా భావించాలి.
.
సాహిత్యప్రయోజనం ఆనందోపదేశాలు అని మనవాళ్లు, పాశ్చాత్యులు అంగీకరించారు. ఆ మాటకు భిన్నంగా కవిత్వం చదువరి మనస్సులో దీపం వెలిగించడం అనటం నవ్యమైన ప్రతిపాదన
.
అదే విధంగా భాషను శుభ్రపరచటం తెలుగుకు మాత్రమే అన్వయించబడే ఒక విషయంగా భావించవచ్చు. ఈ ప్రతిపాదనకు మూలాలు వాడుకభాషోద్యమంలో ఉంటాయి. అలాంటి క్లిష్టపదాలను వాడటం గురించి, డెడ్ మెటఫర్లను ఒదిలించుకోవటం గురించి ఈ ప్రతిపాదన మాట్లాడుతుంది.
.
కవిత్వానికి లేబుల్స్ ఉండకూడదు అన్నటువంటి ప్రతిపాదనకూడా పూర్తిగా ఆధునికమైనదే. కామెడిలని, ట్రాజెడీలని సాహిత్యాన్ని లేబ్లింగ్ చేసే పద్దతి పాశ్చాత్యులది. దేశీయమైన ప్రాచీన సాహిత్యంలో ఈ పద్దతిలేదు. ఒక కావ్యం జీవితసామస్త్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఉండటంచే లేబ్లింగ్ అవసరపడలేదు భారతీయ లక్షణకారులకు. ఆధునిక కాలంలో కవిత్వాలకు వేసే లేబ్లింగ్ వలన జరిగే నష్టం గురించి మాట్లాడటం కూడా "సాహిత్య సంబంధి" కి లేబుల్స్ తో పనిలేదు అని చెప్పటమే.
.
ఈ అయిదు ప్రతిపాదనలతో కూడిన "Ismayil Literary theory" సాహిత్యంలో ఉండే "సాహిత్యసంబంధి" (Literary) ని నిర్వచిస్తుంది.
***
ఇస్మాయిల్ గారి దాదాపు అన్ని కవితలు, ఇంటర్వ్యూలు, వ్యాసాలు ఆన్ లైన్ లో లభ్యంగా ఉన్నాయి. కవిత్వం ఎందుకొరకో, దాని పరిమితులేమిటో తెలుసుకోవాలనుకొనేవారు ఈ క్రింది లింకులలో ఇస్మాయిల్ రచనలను చదువుకొనవచ్చును.
.
(మే 26, ఇస్మాయిల్ జయంతి సందర్భంగా)
బొల్లోజు బాబా
.
బయటి లింకులు
ఈమాట ఆర్చైవ్స్: t.ly/iWfD
ఇస్మాయిల్ కవిత్వం:
వ్యాసాలు
ఇస్మాయిల్ గారు కవిత చదివుతున్న విడియో

breach of contract


"ఐ కాన్ట్ బ్రీత్ ఆఫిసర్ ఐ కాన్ట్ బ్రీత్"
"నాకు తెలుసు నాకు తెలుసు
నువ్వు దొంగవు
నల్లగా ఉన్నావు కనుక నువ్వే దొంగవు
నాకు తెలుసు నాకు తెలుసు"
***
విధేయుడిగా ఉంటానని వాడు
రక్షిస్తానని నువ్వూ చేసుకొన్న
ఒప్పందం ఉల్లంఘించబడింది.
పాపం చివరి వరకూ
"ఐ కాన్ట్ బ్రీత్ ఆఫిసర్ ఐ కాన్ట్ బ్రీత్" అంటూ
విధేయుడై వేడుకొంటూనే ఉన్నాడు వాడు
***
"వాళ్ళు దొంగలన్న సంగతి
వాళ్ళే నిరూపించుకొంటున్నారు చూడండి
షాపులు దోచుకొంటూ
వస్తువుల్ని మోసుకొంటూ
వాళ్ళు దొంగలే.... వాళ్ళే దొంగలు
నల్లవాళ్ళందరూ దొంగలే" .... ఇంక ఆపు నీ వాచాలత్వం.
***
అది లూటింగ్ కాదు....
శతాబ్దాల చరిత్ర చేస్తున్న ప్రకటన
నువ్వు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతీసారీ
మేము కూడా ఉల్లంఘిస్తామని
వాళ్ళు ప్రకటిస్తున్నారు....
అందరి రక్తమూ ఒకటే కన్నీరని
చేసుకొన్న ఒప్పందం
గుర్తుందా?
బొల్లోజు బాబా

dedicate this translation to the Veteran Poet, activist who is in confinement. Bolloju Baba ***


రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు - మీనా కందసామి ( The End of Tomorrow)
ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు. నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం. ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం. ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.
ప్రముఖ కవయిత్రి, మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం.
అదీ ఈ కవితకు నేపథ్యం.
ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది. ఆ ‘నువ్వు’ లో ‘నేను’ లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే.
చివర్లో నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.
****
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు
.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు. నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు. పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. పిటిషన్ పై వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నీ చిట్టితల్లి UAPA అంటే ఏమిటో తెలుసుకొంటుంది. నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి, లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి. ఎవరూ మాట్లాడరు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు. ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. నిన్ను హెచ్చరిస్తారు. నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు- కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు. నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు. మాట్లాడకు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది. మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు
రేపు ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు. నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు. ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.
నిశ్శబ్దమా వర్ధిల్లు!
.
మూలం: మీనా కందసామి ( The End of Tomorrow)
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా
APRIL 21, 2016
Published in Saranga Magazine.

ఒక మిత్రుని వాల్ పై చేసిన కామెంటు


మంచి అంశం.
కులాన్ని మనం చారిత్రికంగా కూడా చూడాలి
1. రెండువేల సంవత్సరాల క్రితంనాటి గాథాసప్తశతిలో కులం ప్రస్తావన లేదు.
2. పన్నెండో శతాబ్దం వరకూ శూద్రులు చతుర్ధాన్వయులుగానే శాసనాలులో చెప్పబడ్డారు కులాలుగా కాదు.
3. కుల వ్యవస్థ అనేది ఒకప్పుడు ఒక ఇంటర్ లింక్డ్ వ్యవస్థగా ఉండేది. నిచ్చెనమెట్లలో క్రిందివాని అవసరం పైవారి కి తప్పని సరిగా ఉండేటట్లు సాంస్కృతికంగా ముడివేయబడ్డారు. అన్ని కులాల ఇండ్లలో (బ్రాహ్మణులతో సహా) శుభ, అశుభకార్యాలకు ఇతరకులస్థుల ప్రమేయం లేనిదే జరపించలేని ఒక వ్యవస్థ అది. అదంతా ఒక క్లోజ్ నెట్ వర్క్. ఒకరి అవసరం ఒకరికి పడే అతిచిన్న లోకం ఎక్కడికక్కడ. పారిశ్రామిక విప్లవంతో అది విచ్చిన్నమైంది మంచికో చెడుకో ఎవరూ చెప్పలేం. (హరారె సెపియన్ పుస్తకం)
4. ఇక నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఉండే "ఆధిపత్యభావన" అనేది ఒక సార్వజనీన మానవలక్షణం/ఇన్ స్టింక్ట్. రకరకాల ప్రాంతాలలో, సందర్భాలలో రకరకాల పేర్లు. ఇది ప్రతిఒక్కరి మనుగడకూ చాలా సందర్భాలలో అవసరపడుతుంది. నేను వాడికన్నా తెలివైనవాడిననో, మర్యాదస్తుడననో, విశాలహృదయం కలిగినవాడిననో అనుకోకుండా ఎవరూ ప్రశాంతంగా బ్రతకలేరు. ఆ వీక్ పాయింటుమీద ఆధారపడి పనిచేస్తుంది కులవ్యవస్థ. దీన్ని కొట్టటం అంత సులభం కాదు. ఆలోచనాక్రమంలోనే సమూలమైన మార్పు రావాలి.
5. ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి పీష్వాల పాలనలో జరిగిన క్రౌర్యాలను, కుల దాష్టీకాలను భారతదేశం అంతటా జరిగినట్లు చెప్పటం వల్ల చాలా నష్టం జరిగింది. అప్పటికి 60 శాతం భూభాగాన్నికలిగి ఉన్న బ్రిటిష్ ప్రాంతాలలో వివక్ష ఉండేది కానీ చెవుల్లో సీసాలు వేసేంత, ముంతలు, తాటాకులు కట్టేంత లేదు. (ఎవరైనా చెపితే సవరించుకోగలవాడను). బ్రిటిష్ ప్రాంతాలలో చట్టాలు బలంగా ఉండేవి. సమాన హక్కులను వాడుకొని చాలామంది నిమ్నవర్గీయులు వివక్షను తప్పించుకోలేకపోయినా ప్రతిభ ఆధారిత గౌరవాలను పొందారు.
6. నిజానికి హిందూ మతం చాలా తెలివైన మతం. అన్నింటిని తనలో కలుపుకోగలగటం దాని లక్షణం. ఒకప్పటి శాక్తేయం, కాపాలికం, సౌర, గాణాపత్య, పశుపతిఆరాధన, చార్వాక లాంటి శాఖలను తనలో కలిపేసుకొంది. బౌద్ధ, జైన సిక్కు సంప్రదాయాలను తన అనుయాయి శాఖలుగా మార్చుకొంది.
ఈ రోజు మనకళ్లముందే గ్రామదేవతలు, వనదేవతలు కూడా హైందవీకరణ చెందుతున్నారు క్రమక్రమంగా.... హిందూ మతం పరిణామ శీలత అది. ఇప్పటికే చూస్తున్నాం శ్రీరామ నవమికి మజ్జిగలు పంచిపెడుతున్న ముస్లిములు అంటూ, వెసులుబాట్లు ఎక్కడపోతాయో అని హిందూ పేర్లతో కొనసాగే క్రిష్టియన్లు అంటూ .... ఇదే ధోరణులు సాగితే కొంతకాలానికి వీరిని కూడా హిందూ మతం తనలో కలిపేసుకొని అల్లాని పదకొండో అవతారంగానూ, జీసస్ ని పన్నెండో అవతారం గానూ సముచిత స్థానం ఇచ్చినా ఇచ్చీగల్దు...... ఓ వెయ్యేళ్ళకు.... 

సప్తశతి గాథలలో మత ప్రస్తావనలు – పార్ట్ 2


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
***
.
మనసులో ఏదో ఉంచుకొని
తనవెనుకే పదే పదే తిరుగుతున్న మరిదికి
ఆ సుగుణవంతురాలైన ఇల్లాలు
గోడపై చిత్రించిన రామాయణ దృశ్యాలను చూపిస్తూ
రామ లక్ష్మణుల అనుబంధాన్ని ఒక రోజంతా భోదించింది. (135)
.
సప్తశతి కాలానికి రామాయణం ఇంకా మతగ్రంథ స్థాయికి చేరనప్పటికీ ఆ కావ్య సారాంసాన్ని గ్రామీణులు కూడా గ్రహించగలిగారని పైగాథ ద్వారా అర్ధమౌతుంది. గాథాసప్తశతి అనగానే జనబాహుళ్యంలో శృంగారరాతలనే అపప్రథ ఉంది. కొన్ని గాథలలో విచ్చలవిడి శృంగారేచ్ఛ ప్రకటించబడినప్పటికీ, చాలాగాథలు అలా ఉండవు.
పై గాథలో రామాయణంలోని రామలక్ష్మణుల అనుబంధాన్ని ఆదర్శంగా తీసుకొమ్మని, లక్ష్మణుడు సీతాదేవిల అనుబంధం ఎలాంటిదో మనమధ్య అనుబంధం కూడా అంతటి పవిత్రమైనదేనని ఒక వదిన మరిదికి చెప్పటం ఆనాటి కుటుంబ సంబంధాలను కళ్ళకు కడుతుంది.
వెసూవియస్ అగ్నిపర్వతం వల్ల ధ్వంశమైన పాంపే శిథిలాలలో ఆనాటి అనేక కుడ్య చిత్రాలు బయటపడ్డాయి. దాదాపు అదేకాలంలో ఇక్కడి ఇండ్లలోకూడా కుడ్యచిత్రాలు ఉండేవి అనే సంగతి పైగాథ ద్వారా అర్ధం చేసుకొనవచ్చును.
***
ప్రియమైన ఎనుబోతు చనిపోగా
దాని మెడను వేలాడిన గంటల పట్టీని
ఇంటికాపు చాన్నాళ్ళు దాచుకొని చివరకు
అజ్జ దేవళానికి సమర్పించుకొన్నాడు. (272)
.
సప్తశతి గాథలలో గౌరిదేవి, లక్ష్మిదేవి వర్ణణలు చాలా చోట్ల కనిపిస్తాయి. పై గాథలో “అజ్జ” దేవి (అజ్జా-ఘరే) ప్రస్తావించబడింది. అజ్జ దేవి దుర్గామాత సాత్విక రూపం. ఈ స్వరూపం సమస్త వృక్ష, జంతు జాతులను సంరక్షిస్తుందని ఒక విశ్వాసం. అజ్జ మాతను వనదేవతగా నేటికీ ఒరిస్సాలో పూజిస్తారు (ఆఫ్రికా వనదేవత పేరు కూడా Aja నే). పైగాథలో చెప్పబడిన అజ్జాదేవిని ఒక గ్రామదేవతగా ఊహించుకోవచ్చు.
గాథలు వ్రాసిన సమయానికి హైందవ సంప్రదాయాలు ఇంకా బలపడలేదు. భిన్న మతసంప్రదాయాలు పక్కపక్కనే సహజీవనం చేసాయి. గ్రామదేవతల సంప్రదాయం కూడా అప్పటినుంచే ఉన్నదనే విషయాన్ని పై గాథ నిరూపిస్తుంది. దేవతలకు చెందిన దేవాలయం గురించి ఈ ఒక్క గాథ మాత్రమే చెబుతుంది. అదికూడా ఒక వనదేవత ఆలయం కావటం విశేషం.
పై గాథలోని విషయానికి వివిధ వ్యాఖ్యానకారులు- అక్కడ చనిపోయింది భార్య అని ఆమె నగల్ని ఆ మగడు గుడిలో ఇచ్చేసాడని అంటూ ఒకరు; కొత్తభార్యకు పాతభార్య నగలు నచ్చనందుకు వాటిని గుడిలో ఇచ్చాసాడని మరొకరు - స్త్రీపురుష కోణంలోంచి చుస్తూ రకరకాల భాష్యాలు చెప్పారు. ఎందుకో పై గాథను అర్ధం చేసుకోవటానికి అత్యంత సరళమైన మానవోద్వేగాన్ని అన్ని ఒంకర్లు తిప్పక్కరలేదనిపిస్తుంది. My dog has died./I buried him in the garden/ Some day I'll join him right there// అనె Pablo Neruda కవితావాక్యం పలికిన ఉద్వేగం లాంటి స్వచ్చమైన ఉద్వేగమే పై గాథలో కూడా కనిపిస్తుంది.
***
చిలుకముక్కు ఆకారంలో ఉండే మోదుగపూలు
రాలి నేలంతా పరచుకొని
బుద్ధుని పాదాలవద్ద మోకరిల్లిన
బౌద్ధభిక్షుకుల సమూహంలా
పరిసరాలను ప్రకాశింపచేస్తున్నాయి (308)
.
సప్తశతి గాథలలో బుద్ధుని ప్రస్తావించే ఒకే ఒక గాథ ఇది. నిజానికి ఆనాటి సమాజంలో బౌద్ధమతం ఉచ్ఛస్థితిలో ఉన్నది. అయినప్పటికీ ఒకే ఒక గాథలో బుద్ధదేవుని ప్రస్తావన అదికూడా నేరుగా కాక పరోక్షంగా ఉండటం ఆశ్చర్యం కలిగించకమానదు.
మోదుగపూలు ఎర్రగా ఉంటాయి. వాటి ఆకారం చిలుకముక్కులా ఒంపుతిరిగి ఉంటుంది. బౌద్ధభిక్షుకులు కాషాయవస్త్రాలు ధరిస్తారు. ఒక భిక్షకుడు ఒంగొని తలనునేలకు ఆన్చి సాగిలపడినపుడు దూరంనించి చూస్తే చిలుకముక్కులా, ఎర్రని మోదుగుపువ్వులా అనిపించటం ఒక మామూలు దృశ్యం.
ఆ దృశ్యాన్ని ఒక పువ్వు చెట్టుకు చేసే వందనంగాను, వినమ్రత ఈ సమాజాన్ని ప్రకాశింపచేసే అంశంగాను చేసిన ఊహ ఆ గాథలోని అవాచ్య దర్శనం. (ఇంకా ఉంది)Image may contain: outdoor and food
బొల్లోజు బాబా