Tuesday, July 14, 2020

సప్తశతి గాథలలో మత ప్రస్తావనలు – పార్ట్ 2


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
***
.
మనసులో ఏదో ఉంచుకొని
తనవెనుకే పదే పదే తిరుగుతున్న మరిదికి
ఆ సుగుణవంతురాలైన ఇల్లాలు
గోడపై చిత్రించిన రామాయణ దృశ్యాలను చూపిస్తూ
రామ లక్ష్మణుల అనుబంధాన్ని ఒక రోజంతా భోదించింది. (135)
.
సప్తశతి కాలానికి రామాయణం ఇంకా మతగ్రంథ స్థాయికి చేరనప్పటికీ ఆ కావ్య సారాంసాన్ని గ్రామీణులు కూడా గ్రహించగలిగారని పైగాథ ద్వారా అర్ధమౌతుంది. గాథాసప్తశతి అనగానే జనబాహుళ్యంలో శృంగారరాతలనే అపప్రథ ఉంది. కొన్ని గాథలలో విచ్చలవిడి శృంగారేచ్ఛ ప్రకటించబడినప్పటికీ, చాలాగాథలు అలా ఉండవు.
పై గాథలో రామాయణంలోని రామలక్ష్మణుల అనుబంధాన్ని ఆదర్శంగా తీసుకొమ్మని, లక్ష్మణుడు సీతాదేవిల అనుబంధం ఎలాంటిదో మనమధ్య అనుబంధం కూడా అంతటి పవిత్రమైనదేనని ఒక వదిన మరిదికి చెప్పటం ఆనాటి కుటుంబ సంబంధాలను కళ్ళకు కడుతుంది.
వెసూవియస్ అగ్నిపర్వతం వల్ల ధ్వంశమైన పాంపే శిథిలాలలో ఆనాటి అనేక కుడ్య చిత్రాలు బయటపడ్డాయి. దాదాపు అదేకాలంలో ఇక్కడి ఇండ్లలోకూడా కుడ్యచిత్రాలు ఉండేవి అనే సంగతి పైగాథ ద్వారా అర్ధం చేసుకొనవచ్చును.
***
ప్రియమైన ఎనుబోతు చనిపోగా
దాని మెడను వేలాడిన గంటల పట్టీని
ఇంటికాపు చాన్నాళ్ళు దాచుకొని చివరకు
అజ్జ దేవళానికి సమర్పించుకొన్నాడు. (272)
.
సప్తశతి గాథలలో గౌరిదేవి, లక్ష్మిదేవి వర్ణణలు చాలా చోట్ల కనిపిస్తాయి. పై గాథలో “అజ్జ” దేవి (అజ్జా-ఘరే) ప్రస్తావించబడింది. అజ్జ దేవి దుర్గామాత సాత్విక రూపం. ఈ స్వరూపం సమస్త వృక్ష, జంతు జాతులను సంరక్షిస్తుందని ఒక విశ్వాసం. అజ్జ మాతను వనదేవతగా నేటికీ ఒరిస్సాలో పూజిస్తారు (ఆఫ్రికా వనదేవత పేరు కూడా Aja నే). పైగాథలో చెప్పబడిన అజ్జాదేవిని ఒక గ్రామదేవతగా ఊహించుకోవచ్చు.
గాథలు వ్రాసిన సమయానికి హైందవ సంప్రదాయాలు ఇంకా బలపడలేదు. భిన్న మతసంప్రదాయాలు పక్కపక్కనే సహజీవనం చేసాయి. గ్రామదేవతల సంప్రదాయం కూడా అప్పటినుంచే ఉన్నదనే విషయాన్ని పై గాథ నిరూపిస్తుంది. దేవతలకు చెందిన దేవాలయం గురించి ఈ ఒక్క గాథ మాత్రమే చెబుతుంది. అదికూడా ఒక వనదేవత ఆలయం కావటం విశేషం.
పై గాథలోని విషయానికి వివిధ వ్యాఖ్యానకారులు- అక్కడ చనిపోయింది భార్య అని ఆమె నగల్ని ఆ మగడు గుడిలో ఇచ్చేసాడని అంటూ ఒకరు; కొత్తభార్యకు పాతభార్య నగలు నచ్చనందుకు వాటిని గుడిలో ఇచ్చాసాడని మరొకరు - స్త్రీపురుష కోణంలోంచి చుస్తూ రకరకాల భాష్యాలు చెప్పారు. ఎందుకో పై గాథను అర్ధం చేసుకోవటానికి అత్యంత సరళమైన మానవోద్వేగాన్ని అన్ని ఒంకర్లు తిప్పక్కరలేదనిపిస్తుంది. My dog has died./I buried him in the garden/ Some day I'll join him right there// అనె Pablo Neruda కవితావాక్యం పలికిన ఉద్వేగం లాంటి స్వచ్చమైన ఉద్వేగమే పై గాథలో కూడా కనిపిస్తుంది.
***
చిలుకముక్కు ఆకారంలో ఉండే మోదుగపూలు
రాలి నేలంతా పరచుకొని
బుద్ధుని పాదాలవద్ద మోకరిల్లిన
బౌద్ధభిక్షుకుల సమూహంలా
పరిసరాలను ప్రకాశింపచేస్తున్నాయి (308)
.
సప్తశతి గాథలలో బుద్ధుని ప్రస్తావించే ఒకే ఒక గాథ ఇది. నిజానికి ఆనాటి సమాజంలో బౌద్ధమతం ఉచ్ఛస్థితిలో ఉన్నది. అయినప్పటికీ ఒకే ఒక గాథలో బుద్ధదేవుని ప్రస్తావన అదికూడా నేరుగా కాక పరోక్షంగా ఉండటం ఆశ్చర్యం కలిగించకమానదు.
మోదుగపూలు ఎర్రగా ఉంటాయి. వాటి ఆకారం చిలుకముక్కులా ఒంపుతిరిగి ఉంటుంది. బౌద్ధభిక్షుకులు కాషాయవస్త్రాలు ధరిస్తారు. ఒక భిక్షకుడు ఒంగొని తలనునేలకు ఆన్చి సాగిలపడినపుడు దూరంనించి చూస్తే చిలుకముక్కులా, ఎర్రని మోదుగుపువ్వులా అనిపించటం ఒక మామూలు దృశ్యం.
ఆ దృశ్యాన్ని ఒక పువ్వు చెట్టుకు చేసే వందనంగాను, వినమ్రత ఈ సమాజాన్ని ప్రకాశింపచేసే అంశంగాను చేసిన ఊహ ఆ గాథలోని అవాచ్య దర్శనం. (ఇంకా ఉంది)Image may contain: outdoor and food
బొల్లోజు బాబా

కరుణ కన్నా గొప్ప మహిమ లేదు!

సూఫీల గొడుగు నీడలో

తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం సమీపంలో ఉన్న కొత్తలంకలో హజరత్ సయ్యద్ అహ్మదలీషా ఖాదర్ వలీబాబా గారి దర్గాతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి కొన్ని సంగతులు పంచుకోవాలనుకొంటున్నాను.

 

అవి 1930ల నాటి రోజులు.

మా మాతామహుని పేరు దొంతాభక్తుని సోమలింగం. యానాంలో నివసించేవారు. వీరికి సంతానం లేదు. ఎన్నిపూజలు చేసినా ఫలించలేదు. “రేవు అవతల ఎవరో యోగీశ్వరుడు వచ్చారట, ఆయన అనేక మహిమలు చూపుతున్నారట. వారిని దర్శించుకొన్నవారికి అనుకొన్నవి జరుగుతున్నాయట” అంటూ వారూ వీరూ చెప్పుకొనే మాటలను నమ్మి “సరే చూద్దాం ఏంజరుగుతుందో” అనుకొని ఒక రోజు మా తాతగారు కొత్తలంక వెళ్ళారు.

కొబ్బరితోట మధ్యలో ఓ చెట్టునీడన దిగంబరంగా కూర్చొని, బక్కపలచని శరీరంతో ఒక సాధువు, ఆయన చుట్టూ పది పదిహేను మంది భక్తులు. అరటిపళ్ళు, తీపితినుబండారాలు ప్రసాదంగా సమర్పించుకొని ఒక్కొక్కరు ఆయనపాదాలను తాకి నమస్కరించుకొని వెళిపోతున్నారు. కొంతమందితో ఆ సాధువు మాట్లాడుతున్నారు. మరికొందరిని వెళ్ళిపొమ్మని సైగలు చేస్తున్నారు. తెచ్చిన ప్రసాదాలను అక్కడక్కడా తీసుకొని ఎంగిలిచేస్తున్నారు, మరికొందరివి వారికే ఇచ్చేస్తున్నారు.

మా తాతగారి వంతు వచ్చింది. అరటిపళ్ళు ఆయన ముందు ఉంచి పాదాలకు నమస్కరించి లేస్తుండగా “ఏరా బ్రహ్మం, నీకు సంతానం ఉందిలే…. ఆడసంతానం” అని పలికి తలతిప్పి మరో వైపుకు చూస్తూ ఉండిపోయారట.
ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు మా అమ్మ పుట్టింది. నెలల బిడ్డను తిరిగి బాబాగారి వద్దకు తీసుకు వెళ్ళారట మా తాతయ్య, అమ్మమ్మలు. ఎవరో తన ఒంటిపై కప్పిన శాలువాను బాబా గారు పొత్తిలిగా చేసి పసిగుడ్డుగా ఉన్న మా అమ్మను ఎత్తుకొన్నారట. సపోటా పండును వలిచి తొనలు నోటిలో పెడితే మా అమ్మ చప్పరించిందట. “ఏంపేరు పెట్టమంటారు బాబా” అని మా తాతగారు అడగ్గా ” అమ్మాజి అని పెట్టరా” అన్నారట. కప్పిన శాలువాను తిరిగి ఇచ్చేయబోతే పట్టుకొనిపొండి అని బాబాగారు సైగ చేసారట. ఆ తరువాత 1948 లో కొత్తలంక బాబాగారు స్వర్గస్తులైనారు. కొత్తలంకలో వారి సమాధి వద్ద దర్గా నిర్మించారు.
అలా మా అమ్మ పేరు అమ్మాజి. మా అమ్మకు తోబుట్టువులు లేరు. మా అమ్మ జీవితాంతం ఒక వైపు హిందువుగా అన్ని పూజలు, పండగలు, వ్రతాలూ ఆచరిస్తూనే, బాబాగారిని కూడా ఎంతో భక్తితో పూజించేది. అందరి దేవుడిపటాల సరసనా కొత్తలంక బాబాగారి ఫొటో కూడా ఉండేది. మేం ఆరుగురుం సంతానం. మా అన్నయ్యలు ముగ్గురికీ హిందూ పేర్లు పెట్టారు. నాకు మాత్రం మా అమ్మ పట్టు పట్టి కొత్తలంక బాబా గారి పేరు పెట్టించింది. నా పూర్తి పేరు బొల్లోజు అహ్మదలీబాబా. మా అందరికీ పుట్టువెంట్రుకలు కొత్తలంక దర్గావద్దే తీయించారు.
నాకు బాగా చిన్నప్పుడు కొత్తలంక వెళ్లాలంటే యానాంలో పడవకట్టించుకొని ముమ్మిడివరం రేవులో దిగి, అక్కడనుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలవగట్టుపై నడుచుకొంటూ వెళ్ళేవాళ్ళం.
***
బాబాగారు ఇచ్చిన శాలువాని ఒక చెక్క పెట్టెలో వెండిపళ్ళెంలో ఉంచి పూజించేది మా అమ్మ. మాకెవరికైనా జ్వరాలొచ్చినా, చదువులకనో, పనులమీదో పొరుగూర్లు వెళుతున్నప్పుడూ బాబాగారి శాలువాని తీసి మా తలపై ఉంచి అంతా మంచి జరగాలని ప్రార్ధించేది.

ఏడాదికి రెండు మూడు సార్లు రోజంతా ఉపవాసం ఉండి, ఆ శాలువాను బయటకు తీసి, దాని ఎదురుగా కొవ్వత్తులు, అగరొత్తులు వెలిగించి, సెంటు, గంధం పూసి “కొత్తలంక బాబా నిను కోరి భజింతును, నిను చేరి సేవింతును” అనే పాటను పాడుకొంటూ పూజచేసుకొనేది మా అమ్మ. అలాగని మా అమ్మ బేల కాదు. మాహె, కారైకాల్ లాంటి సుదూరప్రాంతాలకు బదిలీలకారణంగా మా నాన్నగారు దాదాపు పన్నిండేళ్ళ పాటు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, బంధువుల సాయం అర్ధించకుండా ఆరుగురుసంతానం ఉన్న కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించింది. పాలు అమ్మి, కోళ్ళను పెంచి కోడిగుడ్లు అమ్మి, పెరట్లో కూరగాయలు పెంచి సంసారం నడిపి ఆర్ధిక ఇబ్బందులు తప్పించేది. ఆ లోపలిధైర్యమేదో బాబాగారి నుంచి పొందిందనుకొంటాను.
***
మా నాన్నగారి సంవత్సరీకాలు అయిపోయాకా “కొత్తలంక వెళ్ళాలని ఉంది నువ్వు తీసుకెళ్తావా” అని ఒకటి రెండు సార్లు అడిగింది నన్ను. అప్పటికి మా అమ్మ వయసు డబ్బై సంవత్సరాలు. అప్పట్లో నేను ఏలేశ్వరంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. పరీక్షల హడావిడి తగ్గాక వస్తానే అని చెప్పాను. ఆ తరువాత ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ గుండుతో ఉండటం చూసి ఆశ్చర్యపడి, ఎప్పుడు వెళ్లావే దర్గాకు అని అడిగితే, “ఏమోరా నేను ఇక వెళ్లగలనో లేదో అని- దర్గా ఉన్నదిక్కుకు తిరిగి జుత్తు బాబాగారికి అర్పించేసుకొన్నాను” అన్నది. ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే మా అమ్మ కూడా గతించిపోయింది. ఇది జరిగి పదిహేనేళ్లయినా నా జీవితంలో మిగుల్చుకొన్న పెద్ద వెలితి అది ఏనాటికీ.

నేను పదో తరగతి నుంచి కొత్తలంక దర్గాకు సొంతంగా వెళ్లటం మొదలు పెట్టాను. పడవపై యానాం గోదావరి దాటి, ఎదుర్లంకలో బ్రాంచ్ సైకిల్ అద్దెకు తీసుకొని మురమళ్ళవరకూ తొక్కుకుంటూ వెళ్ళి అక్కడ దాన్ని ఇచ్చేసి నడుచుకొంటూ కొత్తలంక వెళ్ళేవాడిని అప్పట్లో.

నేడు మా ఇంట్లో అందరి దేవుళ్లపటాలతో పాటు కొత్తలంక బాబాగారి పటంకూడా ఉంటుంది. నేటికీ ఏటా రెండు మూడుసార్లు కొత్తలంక దర్గాను దర్శించుకొంటాను సకుటుంబంగా. రకరకాల చిక్కుముళ్ళలో చిక్కుకున్నప్పుడు, పెద్దపనులు ఏమైనా తలపెట్టినపుడు దర్గావద్దకు వెళ్ళి ప్రార్ధించుకొని రెండుమూడుగంటలు కూర్చొని వస్తూంటాం. మా పిల్లలిద్దరి పుట్టువెంట్రుకలు కొత్తలంక బాబాగారి దర్గా వద్ద తీయించాము. రెండో సారి కేశాలు తిరుపతిలో ఇచ్చాం.


నేను డిగ్రీ చదివేటపుడు ఏ కల్మషమూ లేని ఒక మిత్రుడు “ఒరేయ్ మీరు కొత్తలంక బాబాగారిని ఇంతగా ఆరాధిస్తారు. మా తాతగారిది కోనసీమే. ఆయన బాబాగారి సమకాలీనుడు. ఎప్పుడైనా బాబాగారు మా ఇంటి అరుగుమీద కూర్చుంటే వెళ్ళిపో ఇక్కడనుంచి అని విసుక్కొనేవారట ఆయన. ఒక వ్యక్తిని కొందరు దైవంలా పూజించటం, మరికొందరు తృణీకరించటం ఎందుకు జరుగుతుందీ?” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సరైన సమాధానం నావద్ద అప్పుడూ లేదు ఇప్పుడూ లేదు.

చుట్టూ ఉన్న విశాలమైన గోదావరి కారణంగా కోనసీమ ప్రధానస్రవంతి చరిత్రకు కొంచెం ఎడంగానే ఉంది. అలాగని చరిత్రలేని సీమకాదు. అశోకుని పుత్రిక సంఘమిత్ర నిర్మింపచేసిన ఆదుర్రు బౌద్ధ క్షేత్రం ఘనమైన గతకీర్తికి చిహ్నం. షాజహాను ఆస్థానపండితుడైన జగన్నాధపండితరాయలు ఇక్కడివాడే. ఇతను షాజహాను కూతురు లవంగికను పెండ్లాడాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఎన్నోశతాబ్దాల క్రితం గోదావరిపై పడవలలో పెద్దమొత్తంలో ముస్లిం వ్యక్తులు వచ్చి ఇక్కడి ప్రజలలో కలిసిపోయి జీవించసాగారు అని చెపుతారు. లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకంలో ప్రధాన పాత్ర తన ముస్లిమ్ మిత్రుడిని సమాదరణతో చూస్తుంది. దళిత యోగిపుంగవుడైన ముమ్మిడివరం బాలయోగీశ్వరుని, కొత్తలంకబాబాగారిని పూజించినట్లుగానే కులమతాలకు అతీతంగా ఆనాటి కోనసీమ వాసులు ఆరాధించారు.

నా మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఒక్కటి మాత్రం చెప్పగలను. పశుపక్ష్యాదుల్ని సమాదరించటం, మనుషుల బాధల్ని తొలగించటం లాంటి విషయాలలో కొత్తలంక బాబా గారు చూపిన మహిమలను ఈ ప్రాంత ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటారు.

ఈ సృష్టిలోని జీవరాశి అంతా ఒకటేనని, సాటిమనిషి పట్ల కరుణ కలిగి ఉండాలి అనే మౌలిక జీవన సూత్రాలను కొత్తలంక బాబాగారు ఈ ప్రాంతంలో సంచరిస్తూ అనుచరిస్తూ, వెళ్ళిపోతూ మనకు ఇచ్చిన దైవసందేశం అనుకొంటాను.

బొల్లోజు బాబా

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 4


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. )
సప్తశతీ గాథలు వ్రాయబడిన కాలంలో రాజ్యం అనేక రాష్ట్రాలు/ఆహార లుగా విభజింపబడి పాలన జరిగేది. ప్రతి రాష్ట్రానికి కొన్ని నిగమాలు (నగరాలు) వాటికి అనుబంధంగా అనేక గ్రామాలు ఉండేవి. ఈ రాష్ట్రాలను మహారధి, మహాభోజ పేర్లు కల సామంతులు పాలించేవారు. ఉత్పత్తిలో ఆరోభాగం రాజుకు కప్పంగా చెల్లించాలి. ఈ నిగమాలు, గ్రామాలలో అమాత్య పేరుగల అధికారులు ఉంటూ పర్యవేక్షణ చేసేవారు. గ్రామాలు, నిగమాలు అత్యంత క్రిందిస్థాయి పరిపాలనా విభాగాలు కనుక చాలామేరకు స్వతంత్రతను కలిగి ఉండేవి.
ఆర్యుల రాకతో నగరాలు అభివృద్ది చెందాయి. వ్యాపారాల విస్తరణ జరిగింది. అడవులను నరికి భూములను వ్యవసాయానికి అనుగుణంగా మార్చటంతో కొత్త కొత్త గ్రామాలు వృద్దినొందాయి. వ్యాపారాల నిమిత్తం ప్రజలు నిత్యం సంచరిస్తూ ఉండేవారు. అలా సంచరించే బాటసారుల, దేశాంతరాలు వెళ్ళే భర్తల గాథలు అనేకం కనిపిస్తాయి. గ్రామాలు ఇచ్చే సంపదతో నగరాలు బలపడి వ్యాపారాలను విస్తరించుకొన్నాయి. వివిధ వృత్తికారులు నైపుణ్యాలు పెంపొందించుకొని ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారుచేసారు. వాటిని వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేసేవారు.
***
సప్తశతి గాథలు ఆనాటి గ్రామీణ ప్రజల సాంఘిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. వ్యవసాయం ప్రధానవృత్తి. దీని ప్రస్తావన సుమారు ముప్పై గాథలలో ఉంది.
1. వ్యవసాయం
వరి, పత్తి, బార్లీ పంటలసాగు ఎక్కువగా జరిగేది. పంట కోసేవరకు రైతు దాన్ని సాకుతూ ఉండాలి. నీరుపెట్టటం, పక్షులను అదిలించటం, అడవి జంతువులనుండి పంటను కాపాడుకోవటం చెయ్యాలి. ఇంతచేస్తేకానీ పంట చేతికిరాదు. అతని భార్య ఈ పనులలో సహాయం చేసేది. తొలకరిలో నేలను మొదటిసారిగా దున్నుతున్నప్పుడు రైతు భార్య నాగలికి, బొట్లు పెట్టి పూజచేసినట్లు ఒక గాథలో ఉంది. ఇది నేటికీ నిలిచిఉన్న ఒక ఆచారం. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు. ఇంటిలో దొరకని ఏకాంతమేదో ఆనాటి రైతులకు పంటచేలవద్ద దొరికేదేమో! పొలంవద్ద జరిగే శృంగారవిషయాలు అనేక గాథలలో కనిపిస్తాయి.
***
ఇదే చోట్లో కొన్నాళ్ళలో ఆమెతో జరపబోయే శృంగారాన్ని
ఊహించుకొంటూ విత్తనాలు జల్లుతున్నాడా రైతు
చెమర్చిన చేతులకు అతుక్కున్న విత్తనాలు
జారిపడటం లేదు పాపం [358]
పై గాథలో ఒక రైతు విత్తనాలు జల్లే నాడే, మునుముందు తాను పొందబోయే ఆనందాల్ని తలచుకొని ఉద్రేకపడుతున్నాడు. చేతులు చెమర్చటం అనే క్రియ అనేక గాథలలో శృంగార ఉద్దీపనను సూచించేందుకు వాడబడింది. మరోగాథలో మధ్యాహ్నం భోజనం తీసుకొస్తున్న భార్యను చూడగానే, కంగారులో ఓ కొత్తరైతు ఎద్దుకి పలుపుతాడు బదులు ముక్కుతాడు విప్పేసినట్లు చెప్పబడింది. ఇలాంటి గాథలు ఉత్త చమత్కారమే కావొచ్చు కానీ వాటిలో రెండువేలేండ్లనాటి సమాజం, ఆనాటి ప్రజల రోజువారి జీవనము కనిపిస్తాయి.
***
పంటబోదిలో పాదాలను ఉంచి
నీటిని మళ్ళిస్తోంది కాపు వనిత.
నిశ్చలంగా ఉన్న ఆమె పాదాల చుట్టూ తుమ్మెదలు
తిరుగాడుతున్నాయి. (692)
ఇదొక అందమైన దృశ్యం. కొన్ని అత్యవసర సందర్భాలలో చేలో నీరు బయటకు పోకుండానో లేక లోపలకు రాకుండానో కాసేపు అడ్డుగా నిల్చుని నిలువరిస్తారు రైతులు. భర్త బోది మరమ్మత్తు చేస్తుండగా భార్య బోదిలో నిలబడి నీటిని మళ్ళిస్తున్న దృశ్యాన్ని ఊహించుకోవచ్చు పై గాథలో. ఆనాటి సమాజంలో సంపదఉత్పత్తిలో స్త్రీపురుషులు కలిసి పనిచేసారని అనుకోవచ్చుకూడా.
ఆమె పాదాలు కలువల వలె ఉన్నాయని ఎంతో రమ్యంగా, ధ్వన్యాత్మకంగా చెబుతుందీ గాథ.
***
వింద్యపర్వతాల అడవి వరిమొక్కలని విడిచిపెట్టి
గుప్పెడు కంకుల కొరకు వరిచేనులో పడే ఏనుగు
ఏనాటికైనా మందకు నాయకత్వం వహించగలదా? (788)
రైతులు తమ పంటలను అడవి జంతువులనుండి కాపాడుకోవటం నాటినుంచి నేటివరకూ జరుగుతున్నదే. నిజానికి నేడు చూస్తున్నంత వన్యప్రాణి ఆవాసాల ధ్వంసం ఆనాడు ఉండకపోవచ్చు. వింధ్య అడవిలో గ్రాసం పుష్కలంగా లభిస్తుండగా వరిచేలో కక్కుర్తి పడే ఖర్మ ఎందుకూ? అని ఈ గాథాకారుడు ఆశ్చర్యం ప్రకటిస్తున్నాడు. అల్పవిషయాలకు ప్రలోభపడితే అర్హమైన విషయాలకు దూరమౌతామనే సూచన పై గాథలో కనిపిస్తుంది.
***
నేను పొలం వెళ్ళను
చిలుకలు పంట తినేస్తే తినేయనీ
అక్కడ ఉంటే
దారిన పోయే ప్రతీ బాటసారీ
ఈ దారెటు పోతుందని అడుగుతున్నారు
వారికి తెలిసినప్పటికీ. [821]
ఒక చిన్నది ఇంట్లో అమ్మతో చెప్పుకొంటున్న ఒక పిర్యాదు కాబోలు ఇది. పంటపోతే పోనే అనటం అమాయకత్వం అనుకోవచ్చు, కానీ ఒక మగవాడు ఎందుకు మాటలు కలపాలనుకొంటున్నాడో అర్ధంకాకపోవటం స్వచ్ఛమైన ముగ్దత్వం.
అమ్మాయిలతో మాటలు కలపి మెల్లమెల్లగా ముగ్గులోకి దింపాలని యత్నించే వ్యక్తులుండటం ఒక పురాతన సలపరింత ఈ సమాజానికి.
***
ప్రియమైన భార్యగతించాకా
ఆమె లేక పాడుపడిన ఇంటికి వెళ్ళాలనిపించక
పనేం లేకపోయినా పొలం వద్దే ఉంటున్నాడా రైతు. (169)
ఇల్లాలు లేక ఇల్లుపాడుపడిందనటం ఒక ఉదాత్తమైన భావన. ఫలవంతంగా నడచిన అన్యోన్య దాంపత్యానికి సంకేతమది.
అప్పట్లో బహుభార్యత్వం ఉన్నట్లు అనేక గాథలలో చెప్పబడింది. బహుసా అది కులీనవర్గాలకు పరిమితమై ఉండొచ్చు. పై గాథలో ఆ రైతు ఇంటికి వెళ్ళలేకపోవటానికి చెపుతున్న కారణం ఒక నిర్మలమైన మానవోద్వేగం. కలయిక, వియోగం అనేవి ప్రేమ అనే నాణానికి రెండు పార్శ్వాలు. (ఇంకా ఉంది)
బొల్లోజు బాబా

culture of suspicion and fear


.
ఆఫీసులోకి ప్రవేశిస్తుంటే
కూర్చున్న ఒక్కొక్కరూ తమ మాస్కులను సర్దుకొన్నారు.
మిత్రుడొకరు కుర్చీ దూరంగా లాక్కొని కూర్చొని
"మా ఏరియాకూడా కంటైన్మెంట్ చేసారు తెలుసా" అన్నాడు
అతని ఫేస్ షీల్డ్ తెరపై
నా మొఖమే పొడుగ్గా సాగిపోయి కనిపిస్తోంది.
ఏది బింబం? ఏది ప్రతిబింబం?
***
ఇంటికొచ్చేటపుడు
కాసేపు ఆగి కబుర్లు చెప్పుకొనే ఓ షాపు
పద్నాలుగురోజులు దాటి నెలవుతున్నా
ఇంకాతీయలేదు.
పక్క షాపు షట్టర్ కి
"తాత్కాలికంగా మూసివేయటమైనది" బోర్డు వేలాడుతోంది.
ఏది తాత్కాలికం? ఏది శాశ్వతం?
***
పిట్టగోడకు తలాన్చి
సన్నగా పడుతోన్న వర్షాన్ని చూస్తున్నాను.
అంబులెన్స్ ఒకటి సైరన్ మోగించుకొంటూ
పక్కవీధిలో ఆగింది.
ఏడుపులు తుంపర్లు తుంపర్లుగా వినిపిస్తున్నాయి.
అంబులెన్స్ వెళిపోయింది వాన హోరు పెరిగింది
ఏది వాననీరు? ఏది కన్నీరు.
***
గొడుగు చేత ధరించిన ఓ వ్యక్తి
రెడ్ జోన్ బారికేడ్ల పైకెక్కిదూకి
వానలో పరిగెట్టుకొంటూ వెళిపోతున్నాడు ఎక్కడికో.
పిట్టగోడపై వాలిన పిచ్చుక
రెక్కల తడిని విదిలించుకొంటూంది
ఇటుకలమధ్యలోంచి ఫెర్న్ మొక్క మొలకెత్తుతోంది
ఏది భయం? ఏది అభయం?
.
బొల్లోజు బాబా

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 7


(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
వివాహవ్యవస్థ
.
పరిణామక్రమంలో పురుషజీవికి తనసంతానం ఎవరో తెలుసుకోవాలనే కోర్కె వివాహవ్యవస్థకు బీజం వేసింది. ఈ క్రమంలో ఆనాటి సమాజం Polygamy, Polyandry లను తొలగించుకొంది. ధార్మికవిధులు నిర్వర్తించటం, సంతానం పొందటం సహజీవనానికి పరమార్ధాలుగా గుర్తించి monogamy ని ఎంచుకొంది. ఫలితంగా స్త్రీ అంతవరకూ మాతృస్వామిక సమాజంలో అనుభవించిన స్వేచ్ఛనుకోల్పోయింది. పురుషాధిక్య సమాజంలో పురుషుని సంరక్షణలో నిరంతరం అణిగి ఉండేలా స్మృతులు సరిహద్దులు ఏర్పరచాయి. సప్తశతి కాలం ఈ పరిణామదశను సాహిత్యంలో నిక్షిప్తం చేసింది. ఈ గాథలలో స్వేచ్ఛగా విహరించే స్త్రీలు, భర్తచాటు స్త్రీలు ఇద్దరూ ఉంటారు. అదే సమయంలో స్త్రీపురుషుల మధ్య తళుక్కుమనే అనాది మానవోద్వేగాల అద్భుత ఆవిష్కరణ జరిగింది.
.
బాల్యవివాహాలు అప్పట్లో లేవు; బహుభార్యత్వం ఉండేది. అత్తాకోడళ్ళ విరసాలు ఉన్నాయి. దూరదేశాలు వెళ్లిన భర్తకోసం ఎదురుచూసే ప్రోషితపతికలు ఉన్నారు; భర్త పరదేశంలో ఉన్నప్పుడు భార్య రోజులు లెక్కపెట్టుకొంటుంది. బక్క చిక్కిపోతుంది. అలాంటి కోడల్ని ఓదార్చే అత్తలున్నారు; దూరదేశమేగిన భర్తకు ఉత్తరం రాద్దామని కూర్చుంటే కన్నీళ్ళతో అక్షరాలు తడిచిపోతుంటాయి; భర్త ఊర్లోలేడు, అత్తపొరుగూరెళ్ళింది దొంగలభయం ఉంది అంటూ ఆహ్వానాన్ని నర్మగర్భంగా చెప్పే రసికమనోరమణులు ఉన్నారు; పొరుగింటావిడ భర్త లేనప్పుడు, ఆమె బాధలో పాలుపంచుకొని తానుకూడా పండగఅలంకరణ చేసుకోకుండా ఉంటుందో ఇల్లాలు; వానాకాలంలోపులో (వాగులు నదులు పొంగి దారులు మూసుకుపోతాయికనుక) ఇంటికి చేరాలని వడివడిగా అడుగులు వేసే భర్తలు ఉన్నారు; భర్త పేదవాడైనా, ముసలివాడైనా గుణాన్ని ప్రేమించే భార్యలున్నారు; భర్త ఆర్ధిక స్థితి ఎరిగిన ఒక భార్య శ్రీమంతం రోజున నీకేం కావాలి అని కోరినప్పుడు మంచినీళ్ళు కావాలి అని భర్తగౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తుందో ఇల్లాలు అమాయకంగా: తనతో శృంగారం చేస్తూ మరొక స్త్రీ పేరు ఉచ్ఛరించినపుడు దుఃఖపడిన ఇల్లాండ్రు ఉన్నారు, భర్త బాధచూడలేక స్వయంగా అన్యస్త్రీ ఇంటికి తీసుకు వెళ్ళే భార్యలూ ఉన్నారు; మగడు చనిపోయాకా సతీసహగమనం చేసే స్త్రీలు ఉన్నట్లుగానే, భార్యచనిపోయాక ఆ దుఃఖంతో విరాగి అయిన భర్తలూ ఉన్నారు. ఇన్నివైరుధ్యాలతో సప్తశతి గాథలలోని వివాహవ్యవస్థ చిత్రమైన స్వప్నలోకంగా అనిపించకమానదు. రకరకాల ఉద్వేగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
.
తామంతా పితృస్వామిక వ్యవస్థ అనే విషపుకోరలలో చిక్కుకొని బ్రతుకుతున్నామనే ఎరుక లేకుండానే వాళ్లంతా సుఖించి, దుఃఖించి, ఏడ్చుకొని, నవ్వుకొని, గొప్పగానో, బీదగానో జీవించేసారు. "మేమెలా జీవించామో చూడండి" అంటూ ఇన్నేళ్ల తరువాతకూడా మనకు కొన్ని జ్ఞాపకాల్ని మిగిల్చిపోయారు.
***
ముత్తైదువులు పెండ్లిపాటలు ఎత్తుకోగానే
పెండ్లికూతురి రోమాలు నిక్కబొడుచుకొన్నాయి
పెండ్లికొడుకు పేరు తాముకూడా వినాలని కాబోలు. (644)
పై గాథలో పెండ్లికూతురు యుక్తవయసుకు చెందిన అమ్మాయి అని, ఆమెకు పెండ్లిరోజునాటికి కూడా భర్త పేరు తెలియదని, పెద్దలే అన్నీ చూసి పెళ్ళి నిశ్చయం చేసి ఉండవచ్చని అర్ధమౌతుంది. “తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి” అన్నట్లు పెండ్లికూతురు ఇష్టాఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్ళిల్లు చేసే ఆనాటి సంప్రదాయం నిన్నమొన్నటి వరకూ కొనసాగింది.
***
.
నా పెండ్లి సమయంలో పలికిన
పవిత్ర మంగళాసీస్సులను విన్న
ఏటి ఒడ్డునవెదురుపొద ఇంకా ఊరి కుర్రకారు
లోలోపల నవ్వుకొన్నారేమోనని అనుమానంగా ఉంది. (645)
.
ఆనాటి ప్రజలు శృంగారాన్ని హాయిగా ఆనందించారు, ఆ విషయాన్ని అందమైన గాథలలో అరమరికలు లేకుండా చెప్పుకొన్నారు. ముందుచెప్పుకొన్న గాథ ఒక అమాయకమైన పెండ్లికూతురు గురించయితే రెండో గాథలో ప్రేమ మధురిమల్ని అనుభవించిన వలపులాడి గురించి. బహుసా “కన్యా”దాన సమయమందు చెప్పే మంత్రాలేవో ఆ విలాసవతికి నవ్వుతెప్పించి ఉంటాయి.
వెదురు గుబుర్లు ప్రేయసీప్రియులు కలుసుకొనే సంకేత స్థలాలుగా ఉండేవని అనేక గాథలలో కనిపిస్తుంది. మరో గాథలో ఓ అభిసారిక తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్న ఒక సన్యాసితో “ ఓయీ! నిన్ను రోజూ భయపెట్టే కుక్కను ఈ రోజు సింహం వచ్చి తినేసింది, రేపటినుంచి నీవు ధైర్యంగా ఇక్కడ సంచరించవచ్చు” అంటుంది. అంటే నువ్వు కుక్కకే భయపడుతున్నావు ఇక్కడ సింహం సంచరిస్తుంది, ఇకపై ఇక్కడ తిరగకు అని ధ్వన్యాత్మకంగా చెప్పటం.
***
వీటన్నిటినీ మించి భార్యభర్తల అన్యోన్యత అనేక గాథలలో అందంగా చెప్పబడింది.
.
పాదాలు పట్టుకొని
బతిమాలుతున్న భర్త వీపునెక్కి
చిన్నకొడుకు తైతెక్కలాడుతుంటే
అంత కోపంలోనూ ఆమెకు నవ్వాగలేదు. (11)
పై గాథద్వారా ఎన్ని గొడవలు పడ్డా చివరకు భార్యాభర్తలు కలిసి సంసారాన్ని సుఖమయంచేసుకొన్నారని, హాయిగా జీవితాల్ని పండించుకొన్నారని తెలుస్తుంది.
***
సుదీర్ఘకాల సహజీవనం లో కష్టసుఖాలు పంచుకొని
ప్రేమ అర్ధాన్ని కనుగొన్నదంపతులలో
మొదటచనిపోయినవారు బ్రతికినట్లు
రెండవవ్యక్తి ఉన్నా చచ్చినట్లే. (142)
చాన్నాళ్ళు కలిసున్న దంపతులలో ఒకరు మరణిస్తే మరుకొరు చనిపోయిన వ్యక్తిని తన జ్ఞాపకాలలో నిత్యం బ్రతికించుకొంటూ క్షోభపడుతూండటం ఒక పాతవిలువ. దాన్ని వివాహబంధం అనేకన్నా విశాలమైన మానవీయవిలువల ఔన్నత్యంగా అనుకోవచ్చు.
(ఇంకా ఉంది)
బొల్లోజు బాబా
(పై గాథలు Poems on Life and Love in Ancient India, Translated from the Prakrit and Introduced by Peter Khoroche and Herman Tieken నుండి చేసినవ్యాసకర్త చేసిన స్వేచ్ఛానువాదాలు. బ్రాకట్స్ లో ఇచ్చినది గాథల సంఖ్య)

సప్తశతి గాథలలో సామాజిక వ్యవస్థ – పార్ట్ 9


.
(గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు)
.
గ్రామీణ వ్యవస్థ
ఓ వటరాజమా!
నీ దట్టమైన ఊడలమధ్య చీకటిని బంధించి ఉంచావు
ఊరి కావలిదారుడు ఎంత కఠినాత్ముడైనా
రసికులకు దిగులే లేదు. (656)
.
ఊరి మధ్యలో ఊడలతో విస్తరించి ఉండే మర్రిచెట్టు ప్రేమికులకు చక్కని సంకేత స్థలంగా ఉండేది. పై గాథ ద్వారా ఊరిని కాపలా కాసే కావలిదారుడు ఒకడు ఉండేవాడని తెలుస్తుంది.
ఈ గాథను రెండు విధాలుగా అర్ధం చేసుకొనవచ్చును. ఆ కావలి బహుసా స్వైరణిల వద్దనుండి పన్నులు వసూలు చేసే అధికారి కావొచ్చు ఎందుకంటే వ్యభిచారం అనేది క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచీ రాజ్యానికి ఒక ఆదాయమార్గంగా ఉండేది లేదా విచ్చలవిడి శృంగారాన్ని నిరోధించటానికి ఆనాటి సమాజం ఏవో కొన్ని కట్టుబాట్లను ఏర్పరచి వాటిని అమలుచేయటానికి ఏర్పాటు చేసిన కావలి అధికారి కూడా కావొచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఆనాటి గ్రామాలను కావలి కాసే మనుషులుండేవారని పై గాథ తెలియచేస్తుంది.
***
.
ప్రభుత్వం తరపున శిక్షలను అమలుపరిచే తలారి ప్రస్తావన కొన్ని గాథలలో కనిపిస్తుంది. అప్పట్లో శిక్ష విధింపబడినవారిని డప్పులు వాయించుకొంటూ తీసుకువెళ్ళి ఉరితీయటమో లేక కొర్రువేయటమో చేసేవారు.
.
అతనితో సుఖించిన క్షణాలు గుర్తుకొచ్చి
నేడు ఈ వానాకాలపు తొలిమబ్బులు చేసే ఉరుములు
ఉరితీయడానికి ముందు మ్రోగించే
డప్పుల మోతలాగ అనిపిస్తున్నాయి (29)
.
పై గాథలో ఒక ప్రోషితపతిక దూరదేశమేగిన భర్తకొరకు ఎదురుచూస్తోంది. భర్త ఇంకా రాలేదు... వానాకాలం సమీపిస్తోంది. వానాకాలం వస్తే వాగులు వంకలు పొంగి రహదారులు మూసుకుపోయి మూడునాలుగు నెలలపాటు ఎక్కడివారు అక్కడే నిలిచిపోవలసి ఉంటుంది.
తొలిమబ్బులు చేసే ఉరుములు ఆ యువతికి చావుశబ్దాలుగా వినిపించటం వియోగంలోని విషాదానికి అద్భుత వ్యక్తీకరణ.
***
.
వానకు తడిచి కంచెపై కూర్చున్న కాకులు
మురికి ముఖాలతో, సత్తువకోల్పోయిన రెక్కలతో
వేలాడేసిన మెడలతో
కొర్రు వేసినట్టు కనిపిస్తున్నాయి (564)
.
రోజుల తరబడి కురిసే వానాకాలం పక్షులకు గడ్డుకాలం. పై గాథలో ఇంటినీడన ఉంటూ కంచెపై వాలిన కాకుల స్థితిని వర్ణిస్తున్నాడీ గాథాకారుడు.
ఈ గాథలో ఆసక్తికలిగించే ఒక చారిత్రిక సంగతి కొర్రు/కొరత వేయటం. నేరస్థులను ఇనుప మొన కలిగిన ఒక కర్రదూలంపై బంధించి కూర్చోపెట్టగా, దేహం బరువుకి అతను నెమ్మదినెమ్మదిగా క్రిందకి దిగుతూంటే, ఆ దూలం అతని పేగుల్ని చీల్చుకొని చాతీ నుంచో మెడ దగ్గరనుంచో వెలుపలకి వస్తుంది. అప్పటికింకా ఆ నేరస్థుడు పై గాథలో చెప్పినట్లు సత్తువుకోల్పోయిన చేతులతో, వేలాడేసిన మెడతో బ్రతికే ఉండొచ్చు కూడా. అలా కొర్రువేసిన వ్యక్తిని ఆ దూలంనుంచి దింపినవాళ్ళకి కూడా కొర్రుదండనం వేయమని చాణుక్యుని అర్ధశాస్త్రం చెపుతుంది.
బహుశా ఈ గాథాకారుడు కొర్రు వేసిన దృశ్యాన్నేదో చూసేఉంటాడు. ఒక భయానక బౌతిక దృశ్యాన్ని మరో ప్రకృతి దృశ్యానికి జతచేసిన కల్పన ఈ గాథలో కనిపిస్తుంది.
***
గ్రామానికి సంబంధించిన మరో ఉన్నత శ్రేణి వ్యక్తి వైద్యుడు. వైద్యుని ప్రస్తావన కొన్ని గాథలలో కనిపిస్తుంది.
.
తేలు కుట్టిందనే వంకతో
భర్త కళ్ళముందే ఆమెను
తెలివైన చెలులు ఎత్తుకొని తీసుకువెళ్ళి
వైద్యుడైన ప్రియుని ఇంటికి చేర్చారు. (237)
.
పై గాథలో శృంగారేచ్ఛకన్నా మానవసంబంధాలలోని 'గ్రే షేడ్స్ ' చిత్రణ ప్రతిభావంతంగా కనిపిస్తుంది. ఇలాంటి గాథలే తరువాతి కాలంలో స్త్రీల చుట్టూ ఆంక్షలు బిగుసుకు పోవటానికి దోహదపడి ఉంటాయి. (ఇంకా ఉంది)
బొల్లోజు బాబా

kavisandhya zoom meeting

Thursday, April 9, 2020

ఇస్మాయిల్ సాహితీ పురస్కార సభ



పురస్కార గ్రహీత స్పందన

(ఇస్మాయిల్ పురస్కార సభలో నేను చేసిన ప్రసంగ పాఠం )

నా కవిత్వం పై మంచి మాటలు చెప్పిన రవిప్రకాష్ గారికి, శిఖామణి గారికి, దేవదానం రాజు గారికి, వీరలక్ష్మి దేవి గారికి ముందుగా నా నమస్సులు.

ఇస్మాయిల్ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన ఇస్మాయిల్ మిత్రమండలి సభ్యులకు మరీ ముఖ్యంగా శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను. ఈ అవార్డు నాకు ఎంతో ఉత్తేజాన్ని ప్రోత్సాహన్ని కలిగిస్తున్నది. వారికి నా ధన్యవాదములు.

మా నాన్నగారు శ్రీ బొల్లోజు బసవలింగంగారు మంచి సాహిత్యాభిలాషి, కవి, నాటకరచయిత. “సువర్ణశ్రీ” అనె కలం పేరుతో అనేక నాటకాలు వ్రాసారు. ఆ కారణంగా మా ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన వాతావరణం ఉండేది. డిగ్రీ విద్యార్ధిగా ఉన్నప్పుడు నా కవితలు కాలేజ్ మాగజైన్స్ లో వచ్చేవి. అప్పుడప్పుడూ పత్రికలలో కూడా పడేవి. అలా నా సాహిత్యయానం మొదలైంది.
ఇస్మాయిల్ గారి కవిత్వాన్ని చాలా ఇష్టంగా చదువుకొని ఆనందించిన వారిలో నేనూ ఒకడిని.
నేను పిజి. చదువుతున్నప్పుడు 1991 లో ఇస్మాయిల్ గారిని కలిసాను. నా కవిత్వం చూపించాను. అప్పుడు మాట్లాడుకొన్న మాటలు పెద్దగా గుర్తులేవు కానీ వారు "నీ కవిత్వంలో స్పార్క్ ఉంది కానీ తేలికైన పదాలు వాడి క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నించు" అన్నవారి మాటలు మాత్రం గుర్తు ఉన్నాయి. నేను వారిని కలుసుకోవటం అదే మొదలు తుదీ కూడా.

ఇస్మాయిల్ గారిని “కవుల కవి” గా అభివర్ణిస్తూ ఇదివరలో నేను వ్రాసిన ఒక వ్యాసాన్ని ఈ వాక్యాలతో ముగించాను అవి......

"ఉవ్వెత్తున లేచిన అనేక కవిత్వరీతుల వెల్లువల్లో కొట్టుకుపోకుండా మూడున్నర దశాబ్దాలపాటు తనదైన శైలిలోనే ఇస్మాయిల్ గారు కవిత్వం వెలువరించారు. రాజకీయ కవిత్వాలు తమ ప్రాసంగితను కోల్పోయాక సేదతీర్చేది ఇస్మాయిల్ మార్కు కవిత్వమే అనటంలో సందేహంలేదు. ఆయన తను సాగిన బాటలో ఎందరో అభిమానులను పోగేసుకొన్నారు. ఆయన శిష్యులుగా ఎంతో మంది అదేబాటలో పయనించి తర్వాతికాలంలో మంచి కవులుగా పేరుతెచ్చుకొన్నారు. గోదావరి శర్మ, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాష్, తమ్మినేని యదుకుల భూషణ్, మూలా సుబ్రహ్మణ్యం, కొండముది సాయికిరణ్, బి.వి.వి. ప్రసాద్, చెల్లి రామ్, హెచ్చార్కె, నామాడి శ్రీథర్, శిఖామణి, రవూఫ్, అఫ్సర్, యాకూబ్ భవదీయుడు వంటి కవులకు ఇస్మాయిల్ అభిమాన కవి. అలా ఇస్మాయిల్ కవుల కవిగా కీర్తిశేషులయ్యారు."

వెలుతురు తెర, స్వేచ్ఛావిహంగాలకు కలిపి ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పుస్తకాల కు అద్భుతమైన ముందు మాటలు వ్రాసిన శ్రీ శివారెడ్డి గారిని, శ్రీ వీరభద్రుడు గారిని ఈ సందర్భంగా స్మరించుకొంటాను. నిజానికి స్వేచ్ఛా విహంగాలను నేను 2008 లోనే నేను అనువదించి నా బ్లాగులో పోస్ట్ చేసాను. దీన్ని పుస్తకంగా తీసుకొవద్దామనుకొన్నప్పుడు భద్రుడుగారు ముందు మాట వ్రాస్తే బాగుంటుందని భావించి వారిని అడిగాను. ఒకానొక దశలో వారు ముందుమాట వ్రాస్తేనే పుస్తకంగా తీసుకొని వద్దాం లేకపోతే వద్దు అని కూడా అనుకొన్నాను. భద్రుడు గారు చక్కటి ముందు మాట ఇచ్చారు. దానికన్నా ముందుగా నా ఈ అనువాదంలో దొర్లిన దుష్టసమాసాలను, కొన్ని చోట్ల అన్వయదోషాలను చెప్పి వాటిని సరిదిద్దుకోమని సూచించటం వారి ఔదార్యానికి చిహ్నం. ఆ పుస్తకం కవర్ పేజ్ కూడా భద్రుడి గారు స్వయంగా చిత్రించిన ఒక పెయింటింగ్ . ఆ పెయింటింగ్ ను ముమ్మిడి చిన్నారి అందమైన కవర్ పేజ్ గా డిజిటైజ్ చేసారు.
స్టేజ్ పై కూర్చొన్న శ్రీ రవిప్రకాష్ గారు, శిఖామణి గారు, శ్రీ దాట్ల దేవదానం రాజు గార్లతో నా సాహితీ జీవితం పెనవేసుకొని ఉంది.

ఇస్మాయిల్ గారి కవిత్వమార్గం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక పాయగా అనుకొంటే, శ్రీ రవిప్రకాష్ గారి కవిత్వం ఆ పాయలో ప్రయాణించే ఏడుతెరచాపల ఓడలాంటిదని నేను భావిస్తాను.
ఇరవై యేళ్ళ క్రితం రవి ప్రకాష్ గారు యానాం కలక్టరుగా పనిచేసే కాలంలో వారి క్రింద నేను టీచర్ గా పనిచేసాను. కవిగా వారికి నేను పెద్దగా తెలియక పోవచ్చు కానీ ఒక కవి అయిన అధికారి క్రింద పని చేస్తున్నానన్న స్పృహ నాకు ఉండేది. అప్పట్లో రామ్, శిఖామణి , నేను వారి అధికార నివాసంలో వారి ఆధ్వర్యంలో ఒక గొలుసు కవిత వ్రాసినట్లు గుర్తు.

శిఖామణి గారు నా సాహితీ గురువు. 1991 లో ఆంధ్రజ్యోతి ఈ వారం కవిత గా నా కవిత వచ్చినప్పటినుంచి ఏనాడూ ఆయన నా చేయి విడువకుండా ఇంతవరకూ నన్ను నడిపించుకొని వచ్చారు.

“ఒక కవిత నిన్ను పదేళ్ళు బతికిస్తుందని” శివారెడ్డి గారు అంటారు. ఆ తరువాత నేను చాన్నాళ్ళు కవిత్వం వ్రాయకపోయినప్పటికీ- యానాంలో ఏ సభజరిగినా, ఆ సభల్లో నేను లేకపోయినా సరే “బాబా మంచి కవి, ఈ మధ్య వ్రాయటం లేదు ఎందుకో” అంటూ నాగురించి ప్రస్తావించేవారు. యానాం కవులు తీసుకొచ్చే కవిత్వసంపుటులకు వ్రాసిన ముందుమాటలలో నా పేరును ప్రస్తావించేవారు. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా కట్టలకొద్దీ కవిత్వ పుస్తకాలు తెచ్చి చదవమని ఇచ్చేవారు.

అప్పట్లో నా కవితలను శిఖామణి గారికి దిద్దమని పంపించేవాడిని. సూచనలు చేసే వారు. ఒక కవితను ….. “తలలు తెగిపడతాయి”…. అన్న వాక్యంతో ముగించాను. తొంభైలలో విస్త్రుతంగా వచ్చిన విప్లవ కవిత్వ ప్రభావం అది. ఆ వాక్యాన్ని పెన్సిల్ తో రౌండ్ చేసి పక్కన “ఏంటిదీ” అని వ్రాసారు శిఖామణి. ఆలోచించగా ఆ వాక్యంలోని కృతకత్వం అర్ధమైంది. నేను నడవాల్సిన బాట ఏమిటో నాకు తెలిసింది. అప్పటినుంచి ఆ బాటను వీడలేదు. ఒక క్రాస్ రోడ్స్ లో ఉన్న నాకు మార్గాన్ని చూపించిన వ్యక్తిగా శిఖామణీగారి పట్ల నాకు ఎంతో గౌరవం.

శ్రీ దాట్ల దేవదానం రాజు గారు నిరంతర చైతన్యానికి ప్రతీక. వారి అవిరళ సాహితీ కృషి నాకెంతో స్ఫూర్తి నిస్తుంది. 2008 లో నా మొదటి కవితాసంపుటి “ఆకుపచ్చని తడిగీతం” పుస్తకానికి అద్భుతమైన ముందుమాట వ్రాసారు. అప్పట్లో ఎప్పుడు కలిసినా “పుస్తకం ఎప్పుడు తెస్తావు” అంటూ ముల్లుగర్ర పుచ్చుకొని గుచ్చినట్లు ప్రశ్నించేవారు. ఆ పుస్తకావిష్కరణకు ఎంతో దూరంలో ఏదో ముఖ్యమైన పని ఉన్నప్పటికీ నాకోసం చాలా వేగంగా స్కూటరు నడుపుకొంటూ, ఆయాసపడుతూ ఆయన రావటం నాకింకా జ్ఞాపకాలలో పదిలంగానే ఉంది. ఆ రోజు సభలో నా పుస్తకాన్ని గొప్పగా పరిచయం చేసారు.

ఇన్నేళ్ళ నా సాహితీయానంలో నా వెన్నంటి ఉన్న నా భార్య శ్రీమతి సూర్యపద్మ, నా సోదరుడు శ్రీబొల్లోజు దుర్గాప్రసాద్ లు నా పై చూపించే ప్రేమకు నేను బద్దుడను.
నాకు ఈ అవార్డు రావటం పట్ల నాకన్నా ఎక్కువ సంతోషాన్ని వ్యక్తం చేసిన సహృదయులు శ్రీగనారాగారికి నా ధన్యవాదములు.

నా పుస్తకాలు అన్నింటికీ చక్కని ముఖచిత్రాలను అందించే నా బాల్యమిత్రుడు చిన్నారికి, ఎంతో శ్రమకోడ్చి సభకు వచ్చిన నా మిత్రులకు, పెద్దలకు నా ధన్యవాదములు.

నా కవిత్వాన్ని చదివి మంచి చెడ్డలను చర్చించే మిత్రులు శ్రీచెల్లి రాం, శ్రీ మధునాపంతుల సత్యనారాయణ, శ్రీ అద్దేపల్లి ప్రభు, శ్రీ జోశ్యుల కృష్ణబాబు శ్రీ అవధానుల మణిబాబు, శ్రీవత్స రామకృష్ణ, శ్రీమార్ని జానకీరామ్, శ్రీమతి పద్మజావాణి, డా.శైలజగారు, శ్రీ సీతారామరాజు, శ్రీ మురళి కృష్ణ, సాహితీస్రవంతి సభ్యులు, పెద్దలు, ఇంకా అంతర్జాలంలో ప్రోత్సహించే మిత్రులందరకూ నా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

ఇంత గొప్ప గౌరవాన్ని, సన్మానాన్ని నాకు కలిగించిన ఇస్మాయిల్ మిత్రమండలి వారికి, ముఖ్యంగా శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారికి, జగన్నాధరావు గారికి, రారెడ్డి గారికి మరియు ఇస్మాయిల్ గారి కుటుంబ సభ్యులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. .

థాంక్యూ ఆల్.




భవదీయుడు
బొల్లోజు బాబా
















"మూడో కన్నీటిచుక్క" కవిత్వ సంపుటి

"మూడో కన్నీటిచుక్క" కవిత్వ సంపుటిపై ప్రముఖ విమర్శకులు శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు వ్రాసిన సమీక్ష. ఈ వ్యాసం పాలపిట్ట, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైనది. వెంకటేశ్వర రెడ్డి గారికి గుడిపాటి గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
***
కాడైపోతున్న వ్యవస్థరాల్చిన “మూడో కన్నీటిచుక్క”
ఒక కవిని అంచనా వేయాలంటే జీవితంలో ఆ కవి తోడిపోసిన జీవ చైతన్య వాక్యాలను బట్టి, గీటురాయిపై కెక్కించి నాణ్యతను చెప్పాల్సి వుంటుంది. కవికి వస్తువుతో పాటు దృశ్యం వీటితోపాటు అనుభవం, అనుభూతినందిస్తుంది. సమాజంలో విస్తరించి ఉంటున్న మౌనగానాన్ని, మౌన సందేశాన్ని ఒడిసిపట్టలేని కవి, వస్తువు మూలాల్ని స్పర్శించలేడు. కవి బహిర్ యాత్రతో పాటు అంతర్ యాత్రను చేయాల్సివుంటుంది. కవి కాళ్ళతోనే కాదు, కళ్ళతోనూ పయనిస్తూ, చెవులతోనే కాదు హృదయంతోను వింటూ, నిదర్శనాన్వితమైన విశాల దృష్టితో స్వశక్తితో పదబంధాలను కూర్చుకున్నప్పుడే, ఆ కవి తనదైన ముద్రతో కనిపిస్తాడు, సాహిత్యలోకంలో రాణిస్తాడు. ఆ కవి ఒక నవ్యచైతన్య కేతనాలను ఎగురవేయగలడు. కవిత్వం రాయడమంటే సమాజాన్ని చదవడమేననే దృష్టి, దృక్పథంతో జ్వలిస్తూ, అక్షరాలకు ఆయుస్సు పోయడమే. కాలం ఒడిలో కన్ను తెరిచిన కవిని కాలప్రవాహపు ఒరిపిడే ఆయన కవిత్వానికి మార్మికతను తాత్త్వికతను అద్దుతుంది. కవి ఆత్మశోధనలోంచి వెలువడిన భావధార పాఠకుణ్ణి తేలిగ్గా ఓన్ చేసుకుంటుంది. పై లక్షణాలను, లక్ష్యాలుగా, మార్గాలుగా చేసుకుంటూ వో సామాజిక శాస్త్రజ్ఞుడిగా, పరిశోధనాత్మకమైన కవిత్వాన్ని “మూడో కన్నీటిచుక్క” గా వెలువరించిన కవి, విమర్శకుడు బొల్లోజు బాబా.
ఈయన కవిత్వంలో సరళమైన భాష లోతైన భావాలు పాఠకుణ్ణి వెచ్చవెచ్చని ఆలోచనా కదలికల్లోకి నెడతాయి. తొలికవిత “ఒక దుఃఖానికి కొంచెం ముందు…” తో రైతు బాధ, వ్యధ, జీవితంలో జరుగబోయే పరిణామం ఎంత చక్కగా చెప్పాడో చూడండి.
“అప్పటికింకా అతను
చెట్టుకొమ్మకు పిడికెడు మట్టై వేలాడలేదు” అంటారు. పిడికెడు మట్టై వేలాడడం అంటే శవమైపోవడమే కదా! రైతు “ఎండిన పంటను ఓదారుస్తున్నాడు” అంటే మండే గుండెలను తమాయించుకోడానికి యత్నించడమే.
“ఇసుక నిండిన హృదయం” అంటే డ్రై అయిపోయిన గుండెలే కదా! కవిత్వాన్ని వచనంగా జారిపోనీయకుండా ప్రతి వాక్యానికి కవిత్వాంశను అద్దాడు
“అప్పటికింకా అతని భార్యలో
సగభాగం ఖననం చేయబడలేదు
కళాయి పోయిన అద్దంలో
చూసుకొంటూ నుదిటిపై
సూర్యబింబమంత కుంకుమ దిద్దుకొంటోంది”
హిందు ధర్మంలో భార్యలో కొన్ని చిహ్నాలు భర్తవిగా గోచరిస్తాయి. కొన్ని ఆనవాళ్ళు ఈమెకు భర్త ఉన్నాడు అనే విషయం ప్రపంచానికి చెప్పకనే చెప్తుంటాయి. “అందుకనే కవి సంప్రదాయ సూత్రాన్ని పట్టుకొని “అప్పటికింకా అతని భార్యలో సగభాగం ఖననం చేయబడలేదు” అనగలిగాడు. “కళాయి పోయిన అద్దం” రైతు పేదరికాన్ని పట్టిస్తుంది. రైతు పేదరికంలోకి దిగిపోయాడు అనకుండా వివర్ణమైన ఒక వస్తువును పాఠకుని ముందుకు తెచ్చి రైతు పేదరికాన్ని అర్ధమయ్యేలా చేశాడు. అభివ్యక్తిలో మార్మికతను చొప్పించి రాయడం ఈ కవి ప్రత్యేకత. రైతుల ఆత్మహత్యల గూర్చి అద్భుతంగా ఈ కవిత చెప్పబడింది.
“నాలుగు స్తంభాలు” అనే కవితలో దేశవిధ్వంశకర శక్తుల్ని గూర్తి ఎంతో తేలిగ్గా “సీరియస్ నెస్స్” ఉన్నట్లు కాకుండా “క్యాజువల్” గా మనం సాధారణ మాటలు మాట్లాడుకొన్నట్లుగా చెప్పాడు.
“మొన్నో నలుగురు వ్యక్తులు
కొండపై రాత్రి విందు చేసుకొన్నాకా
ఉదయానికల్లా కొండ మాయమైందట
ఆ నలుగురే నదీ విహార యాత్ర జరిపిన మర్నాటికల్లా
నదీ, నదీ గర్భపు ఇసుకా అదృశ్యమయ్యాయని/ ఆశ్చర్యంగా చెప్పుకొన్నారు”
ఈ కవితలో కనిపించే ఆ నలుగురు ఎవరు? ప్రకృత సహజ సంపదను దోచుకొనే మహానుభావులే కదా! కొండమీద వారు విందు చేసుకున్నారు అంటే కొండలో దాగున్న ఖనిజ సంపదను దోచుకొనే పన్నాగంతోనే ఆ నల్గురు అక్కడ చేరారని అర్ధం. అట్లే నదిని, నదీ జలాలను, పండ చేలను దోచుకొని ధ్వంసం చేయడమే వారి ప్రధాన వ్యాసంగం. కవిత ముగింపు ఎంత అద్భుతంగా అల్లాడో చూడండి.
“ఇంతలో
‘అలా జరగటానికి వేల్లేదు’ అంటూ
రోడ్డుపై ఒకడు గొణుక్కుంటూ
గాల్లో ఏవో రాతలు వ్రాసుకొంటూ
అడ్డొచ్చిన నన్ను తోసుకొని సాగిపోయాడు
ఎలా జరగడానికి వీల్లేదటా?
అని ఆలోచించాను” అంటూ సామాజిక విధ్వంశక మూలాలను మొదట కనిపెట్టేది మేధావులైన కవులు అని చెప్తాడో కవి. తరువాత ఈ అంశం ప్రజల్లోకి వెడుతుంది. “అవునవును/ నాకూ అన్పిస్తోంది/ ఖచ్చితంగా అలా జరగటానికి వీల్లేదు” అంటూ జనం గొంతు కలపడాన్ని చివర చెప్తాడు కవి. జనంలో చైతన్యాన్ని రగిల్చేది నిజమైన కవిత్వంగా ఈ కవి భావిస్తాడు.
“నాన్నతనం” అనే కవితలో కొత్తకోణంలో నాన్నను ఆవిష్కరించాడు కవి. అందరూ అమ్మను, అమ్మతనాన్ని పుంఖాను పుంఖాలుగా రాశారు. ఈ కవి నాన్న కాపురాన్ని ఎట్లా ఈదుతాడో, ఏ విధంగా కుటుంబానికి సేవ చేస్తాడో గొప్పగా ఆవిష్కరించాడీ కవి. నాన్నని మనమేవిధంగా గుర్తించవచ్చునో చెప్తూ-
“పార్కులో రెండు చేతుల్తో పీచు మిఠాయో
పల్లీల పొట్లాలో తీసుకెల్తూ కనిపించవచ్చు…..
“ఏ పేవ్ మెంటు మీదనో
స్కూలు బేగ్గో, షూసో కుట్టిస్తూ కంటపడొచ్చు….
పార్కు బెంచీపై కూర్చొని మిత్రులతో
కొడుకు సంపాదన, కోడలి మంచితనం
మనవల అల్లరిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ
కనిపిస్తుంది…. నాన్నతనం” అంటారు. నాన్న యౌవనంలో ఉన్నప్పటినుంచి వృద్ధాప్యంలోకి వచ్చిన దాకా ఆయన దినచర్యలను పూసగుచ్చినట్లు వర్ణిస్తాడు కవి.
“చిట్టికురువి” కవిత పర్యావరణ పరిరక్షణ మీద రాసిన కవిత. పచ్చదనం అంతరించిపోవడం, పిట్టలు రాలిపోవడం, దీనికి రాణమైన వస్తువులను ఉదహరించడం ద్వారా చెప్పాడు కవి. చివర పసిపాప హృదయం ఎంత ప్రేమలాలిత్యంగా అమాయకత్వంలో పొదవుకున్న మంచితనాన్ని పట్టిస్తుంది.
“ఒక చిన్నారి పిట్ట
నిలువ నీడలేక, దాహం తాళలేక
నేల కూలింది/ మానవుడు తయారుచేసిన
గొడ్డళ్ళన్నీ పిట్ట చుట్టూ చేరి
దీనంగా చూస్తున్నాయి…
రంపాలన్నీ
ఆ పిట్టకొరకు
కన్నీరు కారుస్తున్నాయి
బుల్ డోజర్లన్నీ పిట్టను బతికించమని
తొండాలెత్తి ప్రార్ధిస్తున్నాయి
అయినా మనిషి జాడ లేదు”
అంటూ మనిషి ఆయుధాలు సైతం కనికరం చూపుతున్నా పిట్టయెడల మనిషికి ఇసుమంత బాధలేదు. పసిపాప
“మెల్లగా నడుచుకొంటూ వచ్చి/
“చిట్టి కురివీ” నిన్నెవరు కొట్టారమ్మా”
అంటూ పిట్టను చేతిలోకి తీసుకుంది
వేళ్ల కొనలలోంచి జలపాతాల్ని పుట్టించింది
దాహం తీర్చుకొన్న పిట్ట
పాపచుట్టూ కాసేపు తిరిగి ఎటో ఎగిరిపోయింది” అంటూ పాప సహృదయతను ప్రేమను ఎత్తిచూపుతాడు కవి. ఇందులో మరో అంశం, గొడ్డళ్ళు, రంపాలు బుల్ డోజర్లు మానవుని చేతిలో ఆయుధాలు. వాటికి కూడా హృదయమున్నట్లు, స్పందించినట్లు చెప్పటం కవి చాతుర్యం. కాని మనిషికి హృదయంవున్నా ప్రకృతిమీద ప్రేమ లేదు, పశు పక్ష్యాదులమీద జాలి లేదు.
“మూడో కన్నీటిచుక్క” లో మొత్తం 78 కవితలున్నాయి. ప్రతి కవిత అనుభవాలను, అనుభూతులను ఆరవోసాయి. ట్రన్స్ పరెంటు చీకటిలా కనిపించినా, లోనవిషయం లోతుగా పాఠకుణ్ణి ఆకర్షిస్తుంది. సామాన్య స్పృహకు అతీతమైన చైతన్య స్థాయి కవిత్వంలో కనిపిస్తుంది. కవి కవిత్వంలో ఇంకిపోయి బయటకు వచ్చినట్లు సామాజిక తపన, అనుభూతి, లోకానుశీలన పుష్కలంగా కనిపిస్తుంటాయి. “మూడో కన్నీటిచుక్క” అందరూ చదువదగిన పుస్తకంగా భావిస్తూ కవిని అభినందిస్తున్నాను.
కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
9948774243

Sunday, February 9, 2020

తుపాకి మాట్లాడితే



చరిత్రను రికార్డు చేయటం కూడా కవిత్వానికి బాధ్యతే.

ప్రశాంతతలో జ్ఞాపకం చేసుకొనే ఉద్వేగాలలోంచి కవిత్వం పుడుతుందన్న వర్డ్స్ వర్త్ మాట – నిత్యం జాతి వివక్షతో ప్రజలు సామూహిక ఊచకోతకు బలి అయ్యే సందర్భాలలో వర్తించదనే విషయం, జీన్ అరసనాయగం బ్లాక్ జులై గురించి వ్రాసిన Apocalypse 83 సంపుటిలోని కవిత్వం చదివితే అర్ధమౌతుంది.

శ్రీలంకలో తమిళులపై జులై, 1983 లో జరిగిన మూక దాడులను ‘బ్లాక్ జులై’ అంటున్నారు చరిత్రకారులు. ఈ దాడులలో దాదాపు మూడువేలమంది ప్రాణాలు కోల్పోయారు. తమిళులకు చెందిన సుమారు ఎనిమిదివేల ఇళ్ళను, ఆరువేలకుపైగా షాపులను తగలబెట్టారు. లక్షా యాభైవేలమంది నిర్వాసితులయ్యారు. ఇదంతా చరిత్ర. చరిత్రపుస్తకాలలో పైన చెప్పిన తారీఖులు, లెక్కలు, కారణాలు మాత్రమే ఉంటాయి. ఆనాటి బాధితుల మనోద్వేగాలు, హంతకుల ఉన్మత్తత, తటస్థుల ప్రవర్తన లాంటివి ఒక్క కవిత్వంలో మాత్రమే లభిస్తాయి. జీన్ అరసనాయగం ఆ దాడులలో ఒక బాధితురాలు కనుక అవన్నీ ఆమె కవిత్వంలో ప్రతిబింబించాయి. చివరి వూపిరిదాకా శ్రీలంక వ్యథని కవిత్వం చేస్తూనే వున్న ఆమె ఈ నెలలో కన్నుమూశారు. ఆమెకి నివాళిగా ఈ అనువాదాలు.

ఈ రోజు ప్రపంచవ్యాప్తంగ ఎక్కడ వివక్షతో ఊచకోత జరిగినా అరసనాయగం కవిత్వాన్ని గుర్తుచేసుకొనే పరిస్థితి ఉంది.

*
తుపాకి మాట్లాడితే – If the gun speaks

తుపాకి మట్లాడితే
అంతా నిశ్శబ్దమే
భయం తాలూకు నిశ్శబ్దం
రక్తంతో, బుల్లెట్లతో తుపాకి మాట్లాడితే.

గణేష్ విగ్రహ తొండానికి గుచ్చిన
ఎర్ర మందారం
ఒక రక్తవాంతులా ఉంది

చేతులపై, కాళ్ళవద్దా ఉంచిన
ప్రతీ పువ్వూ
ఒక తెరిచిన గాయం

నల్లూరు ఆలయవీధిలో బంగారు రథాన్ని
తాళ్ళతో లాగుతున్నారు మనుషులు
ఇసుకలో మెల్లగా కదులుతోందది

ఠాప్ మనే శబ్దాలు
ఓ వేయి కొబ్బరికాయలు పగిలుంటాయి
వాటి తీయని నీరు
అనాచ్ఛాదిత దేహాలపై, తలలపై
ప్రవహించింది

తుపాకుల శబ్దాలు నిలచిపోయాకా
అంతా నిశ్శబ్దం
మంటల చిటపటలు
అగ్నిసముద్రంలా వ్యాపించాయి

చిధ్రమైన బూడిద నేలపై
ఓ వేయి చితులు కాల్తున్నాయి.

(నల్లూరు- ఊరిపేరు. ఇక్కడ పోలీసుల ఫైరింగ్ లో అనేకమంది చనిపోయారు.

అరసనాయకం కవిత్వంలో భక్తిని, మనిషి చేస్తున్న హింసను పారలల్ గా నిలపటం చాలాకవితల్లో కనిపిస్తుంది. నువ్వు సృష్తించిన మానవుడు ఇంత హింసను చేస్తుంటే అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నట్లుంటుంది)

భయం Fear

గొంతులో భయం అడ్డుపడుతుంది
మాటలు బయటకు రావు
అల్లరి మూకల భయం

రాత్రి భయం
వెలుగు భయం
శత్రువుని చూపించే,
పగలంటే భయం
గజగజ వణుకుతూన్న దేహం మొత్తం
భయంగా మారుతుంది

మంటలు, మంటలు, మంటలు.

మృత్యు దృశ్యాలతో కిక్కిరిసిన నేత్రాలు
జ్వరంతో, దిగ్భ్రమతో
రాయిలా అంధత్వం పొందుతాయి.

నిద్రలో భయం, కలల్లో భయం
మాట్లాడితే భయం
వీధులో నడిస్తే భయం
మనవైపు ఎవరైనా
తేరిపార చూస్తే భయం
ప్రతి చూపులో, భంగిమలో భయం,
అడుగువేయాలంటే భయం
వాళ్ళు మమ్మల్ని చంపటానికి
వస్తున్నారంటే భయం
పారిపోవాలంటే భయం

మోకరిల్లటానికి ఇంకేమాత్రమూ శక్తి లేని దేహంతో
ఇంకా ఇక్కడే ఉంటున్నందుకు
నా ఆత్మలో ఏ కొంతైనా సారం మిగిలి ఉంటుందా?

శరణార్ధి శిబిరం – Refugee camp 1983

నేను ధరించిన ఒకే బట్ట
అది భరిస్తోన్న నా చమట, మురికి
నాకొక గుర్తింపు, హోదాను ఇస్తోంది

నేనెవరినో నాకు తెలిసింది

నేనెవరితో ఉన్నానో, మాట్లాడుతున్నానో
కలిసి దుఃఖపడుతున్నానో
మా అందరకూ ఒకటే పేరు
-శరణార్థి-

ఈ స్కూలు ఆవరణలో
రెండు చేతులు ముందుకు చాచి
ఈ ప్లేటులో వేయించుకొన్న గుప్పెడు మెతుకులు
నా ఆకలిని శాంతింప చేయొచ్చు
బహుసా నీది కూడా.
ఇదోరకమైన ఆకలి, తొందరగానే తీరుతుంది
ఏ భయము, ఏ అపాయమూ లేకుండా
జీవించాలనే ఆకలి అలా కాదు.

కొన్ని గుడ్డలేవో మడతపెట్టుకొని
తలగడగా చేసుకొని సిమెంటు నేలపై పడుకొంటాను
స్కూలు డెస్క్ లే నా పొలిమేరలు.
సురక్షిత ప్రాంతపు అంచుల్లో ఉండేదాన్ని
తటస్థ భూమి.

లక్షమందో ఇంకా ఎక్కువమందో ప్రజలతో పాటూ
నేనూ నిర్వాసితమయ్యాను
-అందరూ శరణార్థులే-

అనువాదం: బొల్లోజు బాబా

(ఈ వ్యాసం సారంగ పత్రికలో ప్రచురింపబడింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు)