Monday, December 2, 2019

మెకంజీకి సహాయపడిన కావలి సోదరులు

మెకంజీకి సహాయపడిన కావలి సోదరులు

ఏలూరు కు చెందిన కావలి వెంకట సుబ్బయ్యకు నలుగురు కుమారులు ఒక కుమార్తె. ఆ నలుగురూ వరుసగా వెంకట సీతయ్య, వెంకట రామస్వామి, వెంకట బొర్రయ్య, వెంకట లక్ష్మయ్య. కుమార్తె పేరు లక్ష్మి దేవమ్మ. ఈమెకు విస్సన్నకోట జమిందారు రమణప్పతో వివాహం అయింది. వారికి పిల్లలు లేకపోవటంతో వెంకట సీతయ్య తన కుమారుడిని దత్తత ఇచ్చి విస్సన్నపేట జమిందారీని సొంతం చేసుకొన్నాడు. (రి. కృష్ణా జిల్లా మాన్యువల్, పే 339).  మిగిలిన ముగ్గురు సోదరులు కల్నల్ కాలిన్ మెకంజీ వద్ద సహాయకులుగా పని చేసారు.

కావలి వెంకట బొర్రయ్య (Cavelly Venkata Boriah) (1776-1803)

బొర్రయ్య 1776 లో ఏలూరులో జన్మించాడు. ఇతను ఏలూరు లోని ఒక ప్రెవేట్ స్కూలు లో పది సంవత్సరముల వరకూ విద్యనభ్యసించాడు. ఆ తరువాత సంస్కృతం నేర్చుకోవటంకోసమని ఆ స్కూలునుండి బయటకు వచ్చేసి సాంప్రదాయ సంస్కృతపాఠశాలలో చేరాడు. ఇక్కడ అయిదారు నెలలలోనే సంస్కృతంలో ప్రావీణ్యత గడించి సొంతంగా పద్యాలల్లేవాడట.

అప్పటికే ఇతని అన్నలు ఈస్ట్ ఇండియా కంపనీలో ఉద్యోగులుగా ఉండటం, వారిలాగే తానుకూడా ఉన్నతంగా జీవించాలనే ఆశయంతో ఉండేవాడు బొర్రయ్య. ఈ క్రమంలో తన ఇంటికి రెండుమైళ్ల దూరంలో కల కొత్తూరు వెళ్ళి పెర్షియన్, హిందీ భాషలను,నేర్చుకొన్నాడు. పద్నాలుగేళ్ళు వచ్చాక మచిలీపట్నంలో Mr. Morgan నడుపుతున్న స్కూలులో చేరి కొన్నాళ్లు విద్యాభ్యాసం చేసాడు. ఇది 1790-93 మధ్య కాలం కావొచ్చు. అప్పట్లో చర్చిఫాదర్లే చర్చ్ లలో విద్యాబోధన చేస్తుండేవారు.

తీరిక సమయాలలో తెలుగు సాహిత్యం, చందస్సు, అలంకారశాస్త్రం అభ్యసనం చేస్తూ పద్యాలు రాయటం మొదలు పెట్టాడు. అత్తలూరి పాపయ్య వ్రాసిన కవిత్వం ఎక్కువగా ఇష్టపడేవాడు.
మచిలీపట్నంలో ఆంగ్లేయులతో ఏర్పడిన పరిచయాల ద్వారా బొర్రయ్య ఈస్ట్ ఇండియా కంపనీ, మచిలీపట్నం సైనిక విభాగంలో ఉద్యోగం సంపాదించాడు. ఒంగోలు, మునగాల, కొండపల్లి లాంటి వివిధ ప్రాంతాలలో ఉంటున్న సైనికులకు జీతాలను తీసుకొనివెళ్ళి పంచిపెట్టే ఉద్యోగం అది. ఉద్యోగరీత్యాకూడా బొర్రయ్యకు అనేకమంది ఆంగ్లేయులతో పరిచయాలు పెరిగాయి. అప్పటికి ఇతని వయసు పద్దెనిమిదేళ్ళు. కొంతకాలం నర్సాపురంవద్ద బ్రిటిష్ స్థావరమైన మెడపొల్లం (మాధవపాలెం) లో కూడా పనిచేసాడు.

కల్నల్ మెకంజీ వద్ద పనిచేస్తున్న సోదరుడు నారయణప్ప (క్రిష్ణా జిల్లా మాన్యువల్ 338 పేజి లో నారాయణప్ప వెంకట లక్ష్మయ్య కొడుకు అని ఉంది) సిఫార్సుతో, బొర్రయ్య మెకంజీ వద్ద ప్రధాన లేఖకునిగా ఉద్యోగంలో కుదిరాడు. బొర్రయ్య మేధాశక్తులపట్ల మెకంజి ఎంతో మాన్యత కలిగిఉండేవాడు. బొర్రయ్య చక్కని చిత్రకారుడు కూడా కావటంతో అనేక ఆలయాల డ్రాయింగులను చిత్రించాడు

1798 లో టిప్పుసుల్తాను గొడవల సమయంలో ఒక నిజాం జమిందారుకి చెందిన అనుచరులు కంపనీ కాగితాలను ఎత్తుకుపోతే, వాటిని తిరిగి సంపాదించిపెట్టమని బొర్రయ్య ను కోరాడు మెకంజీ. ఆ జమిందారు బొర్రయ్యను ఖైదు చేయించి తిండితిప్పలు పెట్టకుండా హింసించాడు. బొర్రయ్య ధైర్యం కోల్పోకుండా ఆ జమిందారుని పొగుడుతూ పద్యాలు అల్లి, అతని విశ్వాసాన్ని చూరగొని మెకంజీ కాగితాలతో పాటూ తనుకూడా అనేక బహుమతులను సంపాదించుకొన్నాడు.
తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృతం, పర్షియన్, భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండటంతో దక్షిణ భారతదేశ శాసనాలను అర్ధంచేసుకొని అవలీలగా ప్రతులు తీసి ఇంగ్లీషులోకి అనువదించేవాడు బొర్రయ్య. కొన్ని సార్లు బొర్రయ్య దట్టమైన అరణ్యాలు, కొండలు, వాగులు దాటుకొని విషయసేకరణ జరపాల్సివచ్చేది.

బొర్రయ్య వ్రాసిన- Account of the Jains, collected from a priest of this sect at Mudgeri; Translated by Cavelly Boria, Brahmin: for Major C Mackenzie - 1809 Asiatic Researches vol 9 - అనే పరిశోధనాత్మక వ్యాసం భారతదేశ జైనమత పునరుజ్జీవనంలో మైలురాయిగా నిలిచిపోయింది.

మెకంజీ 1811-13 ల మధ్య జావా బదిలీ అయినపుడు బొర్రయ్య ఏలూరు వచ్చేసాడు. ఈ కాలంలో టిప్పు సుల్తాను, బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధవిశేషాలను కావ్యంగా రాసాడు (?). శ్రీరంగ రాజుల వంశావళిని తెలియచేసే “శ్రీరంగరాజ చరిత్ర” కావ్యాన్ని రచించాడు.
1803 లో ఇరవైఆరేళ్ల వయసులో బొర్రయ్య, రుద్రవాతం (మెదడు నరాలు చిట్లి హఠాత్తుగా మరణించటం) బారిన పడి అకస్మాత్తుగా చనిపోయాడు. బొర్రయ్య స్మారకచిహ్నాన్నిమద్రాసు సముద్రపు ఒడ్డున ఏర్పాటు చేయించాడు మెకంజీ. ఇది 1834 నాటికి అక్కడే ఉన్నట్టు కావలి లక్ష్మయ్య దక్కను కవులపుస్తకం పై The Journal Of The Royal Asiatic Society 1834 Vol. I లో వచ్చిన ఒక రివ్యూ వ్యాసం ద్వారా తెలుస్తున్నది.

బొర్రయ్యకు పన్నెండేళ్ళ వయసులోనే కసింకోట జమిందారైన వెంకటాచలం చిన్న సోదరితో వివాహమైంది. వీరిద్దరికీ ఒక కూతురు పుట్టి చనిపోయింది.

****
కావలి వెంకట లక్ష్మయ్య
ఇతని గురించి పెద్దగా వివరాలు తెలియవు. బొర్రయ్య చనిపోయాకా అతని ఉద్యోగాన్ని ఇతనికి ఇచ్చినట్లు అనుకోవాలి ఎందుకంటే ఇతను బొర్రయ్య తమ్ముడు కనుక.
మెకంజీ ముఖచిత్రంతో వచ్చిన Saturday Magazine, June 28, 1834 సంచికలో మెకంజీపై Alexander Johnston వ్రాసిన ఒక సంస్మరణ వ్యాసంలో వెంకట లక్ష్మయ్య ప్రస్తావన ఉంది. ఇందులో మెకంజీ మొదలుపెట్టిన పనిని కొనసాగించాలని, దీనికొరకు Royal Asiatic Society చర్యలు తీసుకొని, మెకంజీ సహాయకులను సంప్రదించాలని, వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని రాసుకొచ్చాడు.
తాను కావలి వెంకట లక్ష్మయ్యకు పైన చెప్పిన పనులను చేపట్టమని ఒక ఉత్తరం వ్రాసానని, అది అందుకొని – వెంకటలక్ష్మయ్య మద్రాసులో రెండువందల మంది ఔత్సాహిక స్థానికులతో Madras Literary Society ని స్థాపించి మెకంజీ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకు తెలియచేసాడు- అని అలెగ్జాండర్ పేర్కొన్నాడు
.
ఇదే వ్యాసంలో వెంకట లక్ష్మయ్య రాయల్ ఏసియాటిక్ సొసైటి లండన్ కు భారతదేశప్రతినిధిగా కావలి వెంకట లక్ష్మయ్య వ్యవహరిస్తూన్నడని ఉంది. అంతే కాక మెకంజీ చిత్రపటంలో టెలిస్కోపు ధరించిన వ్యక్తే లక్ష్మయ్య అని – అతన్ని నేను ఇటీవల కలిసానని చిత్రపటంలో ఉన్నట్లే ఉన్నాడని A. Johnston చెప్పినట్లు ఫుట్ నోట్సుద్వారా తెలుస్తుంది.
చాలాచోట్ల టెలిస్కోపు పట్టుకొన్న వ్యక్తి కిష్టప్ప అనే నౌకరుగా చెప్పబడ్డాడు. ఇది మరింత శోధించవలసిన విషయం. (ముందుపోస్టులో ఫొటో ఉంది) వెంకట లక్ష్మయ్య మద్రాసులో స్థిరపడ్డాడు.
ఇక మెకంజీ సేకరణలను కేటలాగు చేసింది లక్ష్మయ్య అని ఒక వాదన వినిపిస్తుంది. దీనికి ఆధారాలు లభించవు కానీ, మెకంజీ 1817 లోనే తన మిత్రుడు, అప్పటి ఏసియాటిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంటు అయిన Alexander Johnston రాసిన ఒక ఉత్తరంద్వారా -తన సేకరణలను 17 విభాగాలుగా విభజించుకొని సుమారు పది పేజీల నోట్సు రాసుకొని ఉన్నట్లు అర్ధమౌతుంది. (రి. Royal Asiatic society, Journal 1834 vol 1 p.no 333)
****
కావలి వెంకట రామస్వామి
ఇతని గురించి కూడా పెద్దగా వివరాలు లభించవు. మెకంజీ మరణించాక ఇతను ఉద్యోగం కోల్పోయి ఉంటాడు. వెంకట లక్ష్మయ్యలా అదే రంగాన్ని కాక మెకంజీ సేకరించిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావటానికి ప్రయత్నించినట్లున్నాడు. సి.పి బ్రౌన్ కూడా కాటమరాయని కథ, బొబ్బిలి యుద్ధం, కడప రాజుల చరిత్ర లాంటి పుస్తకాలు మెకంజీ సేకరణలనుంచే గ్రహించి ఉండచ్చనే ఊహ సత్యదూరం కాకపోవచ్చు. ఈ పని బ్రౌన్ కన్నా ఓ ముప్పై ఏళ్ల ముందే చేయటం రామస్వామి ముందు చూపు తెలియచేస్తుంది.
రామస్వామి 1829 లో కలకత్తా నుంచి, “దక్కను కవుల” పేరిట కవుల చరిత్ర అనే ఒక్క పుస్తకం మాత్రమే వెలువరించాడు.
ఈ పుస్తకాన్ని విలియం బెంటింగ్ కి చాలా భక్తితో అంకితమిచ్చాడు. దీనిలో నన్నయ, పోతన, అవ్వయార్, సుందరర్ లాంటి మొత్తం 79 మంది కవుల చరిత్రను ఇంగ్లీషులో అక్షరబద్దం చేసాడు. ఇది గొప్ప విశేషం. బహుసా ఇదే మొదటి తెలుగు కవుల చరిత్ర కావొచ్చు. (ఇందులో చాలామంది నేటి తెలంగాణాకు చెందిన కవులు కూడా ఉన్నట్లున్నారు. నాకు తెలియటం లేదు మిత్రులు పరిశీలించగలరు)
ఇతను చాలా కాలం కలకత్తాలో వ్యాపారాలు చేసి, చివరకు మద్రాసులో స్థిరపడినట్లు అర్ధమౌతుంది
బొల్లోజు బాబా
దక్కను కవుల పుస్తకం లింకు

కల్నల్ కాలిన్ మెకంజి

కల్నల్ కాలిన్ మెకంజి

కాలిన్ మెకంజీ 1754 లో స్కాట్లాండులో జన్మించాడు. 2 సెప్టెంబర్ 1783 న ఈస్టిండియా కంపనీ ఉద్యోగిగా మద్రాసులో అడుగుపెట్టాడు. అది మొదలు 1821 లో కలకత్తాలో చనిపోయేవరకూ మెకంజీ ఇండియాలోనే ఉన్నాడు.

1784-90 ల మధ్య ఇతను రాయలసీమ-కృష్ణా పరిసర ప్రాంతాలలో కంపనీ సైనిక ఇంజనీరుగా పనిచేసాడు. 1799 లో టిపు సుల్తాను ఓటమి కారణంగా కంపనీ పరమైన కర్ణాటక జిల్లాలను, నిజాం దఖలు పరచిన సీడెడ్ జిల్లాలను సర్వే చేసే బాధ్యతను మెకంజీకి అప్పగించింది కంపనీ. ఆ సమయంలో సర్వే నిమిత్తం కృష్ణా దిగువ ప్రాంతాలను విస్త్రుతంగా పర్యటించాడు. కావలి వెంకట బొర్రయ్య, వెంకటనారాయణ, వెంకట రామస్వామిల సహాయంతో అనేక శాసనాలను, గ్రామచరిత్రలను సేకరించాడు.

వీరందరిలో బొర్రయ్య చాలా చురుకైన వాడు. ఇతను తెలుగు, సంస్కృతం, పర్షియన్, ఆంగ్లభాషలలో ప్రావీణ్యుడు. బొర్రయ్య వ్రాసిన- Account of the Jains, collected from a priest of this sect at Mudgeri; Translated by Cavelly Boria, Brahmin: for Major C Mackenzie - 1809 Asiatic Researches vol 9 - అనే పరిశోధనాత్మక వ్యాసం భారతదేశ జైనమత పునరుజ్జీవనంలో మైలురాయిగా నిలిచిపోయింది. తనపేరుతో కాక తన క్రింద పనిచేసే బొర్రయ్యకే ఆ వ్యాస కర్తృత్వాన్ని ఇవ్వటం మెకంజీ నిజాయితీని ప్రతిబింబిస్తుంది.

ఈ కావలి వెంకట బొర్రయ్య అనేక సంస్కృత, కన్నడ శాసనాలను ఇంగ్లీషులోకి అనువదించినట్లు ఏసియాటిక్ జర్నల్స్ లో కనిపిస్తుంది. ఆ తరువాత చాలా సంచికలలో “బొర్రయ్య నిర్ధారించాడు” అంటూ ఇతరులు వ్రాసిన వ్యాసాలలో కొన్ని రిఫరెన్సులు కనిపిస్తాయి. గొప్ప మేథావి అయిన బొర్రయ్య 1803లో 27 సంవత్సరాల వయసులోనే మరణించాడు.
.
బొర్రయ్య స్థానాన్ని అతని సోదరుడు కావలి వెంకట లక్ష్మయ్య కొనసాగించాడు. ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా 1817 లో మద్రాసు సమీపంలో ఒక గ్రామాన్ని వంశపారంపర్యంగా అనుభవించేలా ఈస్ట్ ఇండియా కంపనీ దానం చేసింది. (రి. ఎన్సైక్లోపెడియా ఏసియాటికా వా. 5)

మెకెంజీ చేస్తున్న కృషిని గుర్తించిన కంపనీ 1810 లో ఇతనిని మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేయర్ జనరల్ గా నియమించింది. కానీ వెంటనే జావా ద్వీపానికి బదిలీ చేయటంతో 1811-1813 మధ్య మెకంజీ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అక్కడే 18 నవంబరు 1812 న డచ్ సంతతికి చెందిన Petronella jacomina Bartels ను వివాహమాడాడు.

తిరిగి ఇండియా చేరుకొన్నాకా 1815 లో మెకంజీ సర్వేయర్ జనరల్ గా నియమించబడ్డాడు. కలకత్తా సెయింట్ జార్జి కోటలో లో ఇతని ఆఫీసు ఉన్నప్పటికీ – అంతవరకూ ఆంధ్ర, తమిళ, కర్ణాటక ప్రాంతాలలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించటం కొరకు మద్రాసులో ఉండేందుకు కంపనీ అనుమతి తీసుకొని 1817 వరకూ మద్రాసులోనే ఉన్నాడు.

1, ఫిబ్రవరి 1817 న మెకంజి తన మిత్రుడైన అలెగ్జాండర్ జాన్ స్టన్ కు వ్రాసిన ఒక లేఖలో ఈ స్థానిక చరిత్రలను సేకరించటంలో తన ఉద్దేశాలను, నిబద్దతను, కష్టాలను ఇలా చెప్పుకొన్నాడు.

1. 1799 లో కంపనీకి సంక్రమించిన ప్రాంతాల హద్దులను నిర్ణయించే పని నాకు అప్పగించినపుడు- సరిహద్దులే కాక ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక స్వరూపాన్ని కూడా అధ్యయనం చేస్తానని నేను చెప్పిన ప్రణాళికను కంపనీ ఆమోదించి, ముగ్గురు గుమస్తాలను, ఒక నాచురలిస్ట్ ను నాకు సహాయకులుగా ఇచ్చింది. కానీ 1801 లో వీరిని తొలగించటంతో నా ప్రణాళికలన్నీ భగ్నమయ్యాయి. ఈ ప్రాంతాల జీవరాశిని రికార్డు చేద్దామనే నా ఆలోచన ఫలించలేదు. అంతే కాక నా జీతం, నాకు ఇచ్చే కంటింజెన్సీ డబ్బులు కూడా తగ్గించేసారు. దీనివల్ల నా ప్రణాళిక దాదాపు కుంటుపడింది.

2. అయినప్పటికీ నేనీ పనులు చేయగలిగాను

జైనులు, బుద్ధులు వేరు వేరు అని నిర్ధారించగలిగాను (అప్పట్లో వీటిని హిందూ మతంలో అంతర్భాగాలుగా గుర్తించేవారు); ప్రాచీన మతసాంప్రదాయాలైన లింగాయత్, శైవం, పాండరం, మఠాలు వివిధ శాఖలు వాటి పుట్టుపూర్వోత్తరాలు స్పష్టపరిచాను; సుమారు మూడు వేల వివిధ శిలా శాసనాలు, తామ్రపత్రాలకు నకళ్ళు తీయించాను; ఢిల్లీ నుంచి కేప్ కొమరిన్ దాకా ఉన్న Veeracul, Maastie cull లలోని పురాతనజాతుల సంస్కృతిని వెలికితీసాను. (పైన చెప్పిన అన్ని అంశాలను మెకంజీ మొత్తం 12 రీసెర్చ్ పేపర్లుగా ఆసియాటిక్ జర్నల్ లో ప్రచురించాడు)

3. కొన్నాళ్ళు మద్రాసులోనే ఉంచమని కోరటానికి కారణాలు ఈ లేఖలో ఇలా చెప్పుకొన్నాడు మెకంజీ – “నాకు సహాయకులుగా ఉన్న వ్యక్తులతో నా అనుబంధం వ్యక్తిగతమైనది. వాళ్ళు ఈ ప్రాంతపు స్థానికులు, కలకత్తాకు నాతో పాటు వచ్చి జీవించలేరు. మేము సేకరించిన విషయాలను కేటలాగ్ చేయాలి. చాలా వాటిని అనువదించాలి. ఇది కలకత్తాలో సాధ్యపడదు. నేను ఇంగ్లాండు వెళ్ళే లోగా కనీసం స్థానిక వ్రాతప్రతులు, పుస్తకాలు, శాసనాల సంక్షిప్తసమాచారాన్ని పుస్తక రూపంలో చూడాలని నా కోరిక. దీనికి నా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కనీసం విద్యావంతులకు తదుపరి పరిశోధనలకు వీలుగానైనా వీటిని కేటలాగ్ చేయించాలి"

అలా ఇంగ్లాండు వెళ్లాలని ఆశపడ్డ మెకంజీ పాపం వెళ్ళనే లేదు కలకత్తాలో 8 మే 1821 న మరణించాడు. మెకంజీ సేకరణలు శిధిలమౌతున్నాయని గమనించిన సి.పి. బ్రౌన్ 1840 ల ప్రాంతంలో వాటికి నకళ్ళు తయారు చేయించాడు. వాటికి మరలా తిరిగి 1930-40 లలో బ్రిటిష్ ప్రభుత్వం మరోసారి నకళ్ళు తీయించటం జరిగింది. నేడు మద్రాసు లైబ్రేరీలో ఉన్నతెలుగు మెకంజీ కైఫీయత్తులు చదవటానికి వీల్లేని విధంగా పూర్తిగా పాడయిపోయాయిని తెలుస్తూన్నది.
******
మెకంజీ సేకరణా విధానం

మెకంజీ ఒక సర్వేయరు. ఆఫీసులో కూర్చునే అధికారి కాదు. సర్వే అనేది వెళ్ళి స్థానికంగా చేయాల్సినపని. అందువలన ఇతనికి అనేక ప్రాంతాలలో స్వయంగా పర్యటించే అవకాశం వచ్చింది. దీనిని వినియోగించుకొని అక్కడ గ్రామ కరణాల వద్ద ఉండే కవిలెకట్టలలో గ్రామ చరిత్రలను, స్థానికంగా లభించే తాళపత్ర గ్రంధాలను, పుస్తకాలను సేకరించాడు. వివిధ ఆలయశాసనాలను చూసి వాటి ప్రతులను తయారు చేయించాడు. శిల్పాలకు డ్రాయింగులు గీయించాడు. ఇతను నియమించుకొన్న ఉద్యోగుల జీత భత్యాలు కంపనీ భరించేది. ఇది లక్షరూపాయిల మేరకు అయినట్లు రికార్డులు చెపుతున్నాయి. క్రమేపీ కంపనీ, డబ్బులు ఇవ్వటం మానేసాకా ఒకానొక దశలో వారికి జీతాలు మెకంజీయే స్వయంగా ఇచ్చాడు. మెకంజీ సేకరణలలో ఎక్కువ భాగం ఈ విధంగా స్వయంగా సేకరించినవే.

తాను స్వయంగా వెళ్లలేని ప్రదేశాలకు తన అనుచరులను పంపి రిపోర్టులు తెప్పించుకొనే వాడు. అలా నారాయణరావు అనే వ్యక్తి పంపిన అనేక రిపోర్టులు మెకంజీ కైఫీయత్తులలో లభిస్తాయి. (ఇతని రిపోర్టులలో ఆ యా ఊర్లకు ఎలా వెళ్ళిందీ, ఎంతదూరం, ఎక్కడ బసచేసాడు, ఎంతెంత ఖర్చయిందీ లాంటి వివరాలు కూడా ఉండటం విశేషం).

మెకంజీ సేకరించిన ప్రతులు సుమారు “14 భాషలకు” సంబంధించినవి. వీటిని మెకంజీ కూడా సంపూర్ణంగా పరిశీలించలేదు. వాటిని ఎప్పటికైనా స్థిమితంగా కూర్చొని క్రోడికరించాలని అనుకొని, తనదారిలో కనిపించిన ప్రతి చిన్న అంశాన్నీ సేకరించుకొంటూ పోయాడు. వీటన్నింటిని అనువదించటమో క్రోడీకరించటమో ఒక వ్యక్తి వల్ల అయ్యేపని కాదు.

మెకంజీ మరణం తరువాత

మెకంజి మరణానంతరం అతని భార్య మరొకరిని వివాహం చేసుకొని దేశం విడిచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొంది. మెకంజి సొంతడబ్బులు పెట్టికొనుక్కొన్న పుస్తకాలు, పురాతన వస్తువుల విలువ సుమారు లక్షరూపాయిలు ఉండొచ్చని గుర్తించారు. వీటన్నింటిని ఇరవై వేల రూపాయిలకు మెకంజీ భార్య బెంగాల్ ప్రభుత్వానికి ఇచ్చివేసింది. (బహుసా అన్నీ ఒకచోట ఉంటాయని భావించి ఉండవచ్చు). ఇవి ప్రస్తుతం బ్రిటిష్ లైబ్రేరీ, బ్రిటిష్ మ్యూజియం, మద్రాస్ మ్యూజియం లలో భద్రపరచబడి ఉన్నాయి.

ఇవి కాక ప్రభుత్వోద్యోగిగా మెకంజీ సేకరించిన వస్తువులు అనేకం ఉన్నాయి. మెకంజీ మరణించాక అతని స్థానంలోకి వచ్చిన అధికారికి దాదాపు “లక్ష పేజీల” వరకూ ఉన్నవ్రాతప్రతులను, వేలకొలది ఇతర సేకరణలను ఏం చెయ్యాలో తెలియలేదు. ఇవన్నీ కంపనీకి చెందిన ఆస్తి అయినప్పటికీ వీటిని ఎలా వదిలించుకోవాలా అని కంపనీ అధికారులు తలలు పట్టుకొని కూర్చునేవారట. అలాంటి సమయంలో H H Wilson అనే అధికారి, వీటిని క్రోడికరించటానికి ముందుకురాగా కంపనీ బోర్డు వెంటనే అనుమతినిచ్చింది.

అప్పటికే మెకంజీ తన సేకరణలకు రఫ్ కేటలాగు తయారుచేసినట్లు విల్సన్ గుర్తించాడు. దాని ప్రకారం మొత్తం వ్రాతప్రతులను స్థానిక చరిత్రలు (2070), శాసనాలు (8076), సాహిత్యవిషయాలు (1568), అనువాదాలు (2159), చిత్రాలు/డ్రాయింగ్స్ (2559), నాణాలు (6218) అంటూ వేరుచేసి వాటికి ఇండెక్స్ నంబర్లు ఇచ్చి మొత్తం మెకంజీ సేకరణల వివరాలను Meckenzie Collection - A Descriptive Catalogue of the Oriental Manuscripts and Other articles అనే రెండువాల్యూముల పుస్తకాలుగా 1828 లో వెలువరించాడు.

విల్సన్ కేటలాగు ప్రకారం తెలుగుకు సంబంధించి 285 కావ్యాలు, సీడెడ్ జిల్లాల 358 గ్రామ చరిత్రలు, ఇతర తెలుగు తమిళ గ్రామచరిత్రలు 274 ఉన్నట్లు తెలుస్తున్నది. ఎనిమిది వేల శాసనాలలో తెలుగు శాసనాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేదు.

విల్సన్ ఈ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో- వీటన్నింటిలో శాసనాలు, స్థానిక చరిత్రలు ముఖ్యమైనవని, వీటిని మరింత శోధించవలసి ఉందని బావించాడు. తెలుగు సాహిత్యంలో ఎక్కువగా సంస్కృత అనువాదాలు ఉన్నాయని, కొద్దిగా మాత్రమే స్వతంత్ర రచనలు లభించాయని అన్నాడు.

మెకంజీ సేకరణలు కృష్ణా నదికి దక్షిణభాగం (రాయలసీమ ప్రాంతం) నుంచి ఎక్కువ ఉన్నట్లు, ఉత్తరభాగం నుంచి పెద్దగా లేనట్టు గుర్తించాడు. బహుసా ఆ కారణం వల్లనే కడపజిల్లా కైఫీయత్తులు ఏడు సంపుటాలుగా మనకు లభించినట్లుగా ఇతరకోస్తా జిల్లాల కైఫీయత్తులు లభించవు.

కాలిన్ మెకంజీ ప్రాసంగికత

కైఫీయత్తు అంటే స్థానిక చరిత్ర అని అర్ధం. మెకంజీ సేకరించిన ఈ కైఫీయత్తులలో ఆనాటి సామాజిక వ్యవస్థ, చరిత్ర, సాహిత్యం, గ్రామాల సరిహద్దులు, అప్పటి పాలకుల వంశావళి వంటి అనేక అపురూపవిషయాలు తెలుస్తాయి. ఇవి స్థానికుల నుండి సేకరించినవి కనుక అప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తుల వంశ చరిత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. గ్రామ ఆలయాలు, వాటికి గల మాన్యాలు, అక్కడ పండే పంటలు, పన్నులు, వృత్తికులాల మాన్యాలు, గ్రామ పుట్టుపూర్వోత్తరాల గురించిన ఆనాటి కట్టుకథలు గాథలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు లాంటి అనేక సంగతులు కైఫీయత్తులలో ఉన్నాయి.

అమరావతిలోని బౌద్ధ స్థూపాన్ని కూలగొట్టి ఏదో భవన నిర్మాణానికి అక్కడి అవశేషాలను వినియోగిస్తున్నట్లు తెలుసుకొన్న మెకంజి అమరావతి వెళ్ళి, తవ్వకాలు జరిపి అక్కడి బౌద్ధ స్థూప ఉనికిని ప్రపంచానికి తెలియచేసాడు.

రెండు శతాబ్దాల క్రితం తెలుగు నేల ఎలా ఉండేది అనే విషయాలు నేడు తెలుసుకోగలుగుతున్నామంటే ఆనాడు మెకంజీ జరిపిన కృషివల్లనే అనేది అక్షర సత్యం. లేనట్లయితే చాలావిషయాలు కాలగర్భంలో కలసిపోయి ఉండేవి.

బొల్లోజు బాబా

Tuesday, November 20, 2018

కవిత్వ భాష ఆవిష్కరణ

కవిత్వ భాష పుస్తకం ఆవిష్కరణ ఖమ్మంలో, యానంలో, విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా జరిగింది.  ఆ యా సందర్భాల వివిధ ఫొటోలు.  ఇంతవరకూ వచ్చిన నా పుస్తకాల కవర్ పేజ్ లు






Sunday, July 1, 2018

గాయాల శ్వాస


CT స్కాన్ కవరును
చేతితో పట్టుకొని
ఆమె రోడ్డుపై భారంగా
అడుగులు వేస్తూ నడుస్తోంది.
సీతాకోకల తెగిన రెక్కల వానలో
వెన్నువిరిగిన అట్లాస్ లా ఆమె
స్వప్నించిన జీవితానికి
జీవిస్తోన్న స్వప్నానికి మధ్య
కన్నీటి పొరలు
నాపరాతి పొరలు
ఒక్కొక్క పొరను తవ్వుకొంటూ
ఒక్క ఆశకోసం ఒకే ఒక్క ఆశకోసం
ఆమె అన్వేషిస్తోంది
****
ఈ చేతుల్తో ఎన్నో గాయాల్ని
చిత్రించాను
ఈ గాయాన్నెందుకో
మరో కాలంలోకి
ఒంపలేకపోతున్నాను
గుండెలనిండా పురాగాయాల శ్వాస
నన్ను క్షమించు మిత్రమా!
బొల్లోజు బాబా

Monday, May 21, 2018

ఏం పని ఉంటుంది నీకూ……..


.
వెళ్తూ వెళ్తూ అతనన్నాడూ
"నే వచ్చేవరకూ
ఏం పని ఉంటుంది నీకు" అని
అతను వచ్చేసరికి
ధూళి, ఈగలు ముసిరిన నేల
బురదలో పొర్లాడిన పంది
అవతారం ఎత్తి
నట్టింట్లో తిష్టవేసి ఉంది.
నిన్నటి పూలు వాడి ఎండినా
రాల్చుకోకుండా
కొత్తమొగ్గల దుప్పటిని
కప్పుకోకుండా
మంచం మల్లెపొద
బద్దకంగా పడుకొని ఉంది
కిచెన్ సింక్ తటాకంపై
చచ్చిన చేపలు నాని ఉబ్బి
వికృతంగా తెట్టులా తేలి
పురాపరిమళాన్ని
గానం చేస్తున్నాయి.
పాపాయి జారవిడిచిన
డైపరు విదిల్చిన శకలాలను
నదులు, పర్వతాలు మైదానాలు
అలంకరించుకొన్నాయి
బట్టలపెట్టి పొట్టపగిలి
లుకలుకలాడుతూ బెకబెకలాడుతూ
బయటపడ్డ జబ్బుచేసిన సీతాకోకలు
ఇల్లు మొత్తం
క్వారీపక్కన జుత్తు నెరిసి
కాంతి నశించిన చెట్టులా ఉంది.
అతను ఇంకెప్పుడూ అలా అనలేదు!
బొల్లోజు బాబా

Thursday, May 3, 2018

నిన్ను ప్రేమించేందుకే వచ్చాను నేను - "I'M HERE TO LOVE YOU" by Tone Butta The Poet

నిన్ను ప్రేమించేందుకే వచ్చాను నేను - "I'M HERE TO LOVE YOU" by Tone Butta The Poet
నిన్ను గాయపరచటానికి కాదు
గతం నీ హృదయంలో మిగిల్చిన
గాయాలకు కట్టుకట్టటానికే వచ్చాను నేను
కానీ నన్ను నీవు అనుమతించటం లేదు
మరలా మరోసారి పగిలిముక్కలవుతానా అని
భయపడుతున్నావు
నేను అతనిలా కాదు
నేను వారిలా కాదు
నువ్వు అర్థం చేసుకోవాలని
ఆశిస్తున్నాను అర్ధిస్తున్నాను
నీచుట్టూ ఎత్తైన గోడను నిర్మించుకొన్నావు
నాకు తెలుసు నాకు తెలుసు
దాన్ని దాటడం కష్టమని
కానీ ఖచ్చితంగా ప్రయత్నిస్తాను
నువ్వు తలుపుతెరచి
నీ హృదయంలోకి ఆహ్వానించేవరకూ
నేను నిరీక్షిస్తాను.
మునుపెన్నడూ లేని విధంగా
నిన్ను ప్రేమించనీ నన్ను!
అనువాదం: బొల్లోజు బాబా
మూలం: "I'M HERE TO LOVE YOU" by Tone Butta The Poet

Monday, April 9, 2018

ఫ్రాగ్మెంట్స్


1.
పచ్చని చెట్టుమీదకు
ఆకాశం నుండి
తెల్లని కొంగ ఒకటి
కాళ్లని ముందుకు సారించి
రెక్కల్ని లోనికి తీసుకొని
కొమ్మపై వేళ్ళను బిగిస్తూ
బివివి హైకూలా వచ్చి వాలింది
2.
ఏ చెట్టుకొమ్మలకో తగులుకొని
గబ్బిలపు రెక్క పలుచని చర్మం
చిరుగులు పడింది.
నాకు ఆకలిగా లేదు
నువ్వు తినేసి పడుకో అన్నాడతను.
3. Skin Trade
ఒట్టిపోయిన సెక్స్ వర్కరో
పట్టుబడిన నిర్భాగ్యురాలో
ఆమెవరైతేనేం!
సజీవంగానే చర్మం ఒలచబడుతుంది.
విషాదమేమంటే అప్పుడు కూడా
తెల్లతోలుకు విలువెక్కువ
4. సామాన్లు సర్దుతుంటే
పాత ఫోను కనిపించింది
ఆన్ అయింది చిత్రంగా
కంటాక్ట్స్ లో అమ్మ నంబరు
అలాగే ఉంది.
5.
అన్యధా శరణం నాస్తి... రక్ష రక్ష
యన్న ప్రార్ధన ఆ పెదవులపై
నర్తించి నర్తించి అలసిపోయింది.
దేవుడు తనగదిలో దూరి తలుపు
వేసేసుకొన్నాడు
బొల్లోజు బాబా

Saturday, April 7, 2018

Skin Trade

ఒట్టిపోయిన సెక్స్ వర్కరో పట్టుబడిన అభాగ్యురాలో ఆమె ఎవరైతేనేం! బతికుండగానే చర్మం ఒలచబడుతుంది విషాదమేమంటే అప్పుడు కూడా తెల్లతోలుకు విలువెక్కువ. దేహంపై పేదరికం చేసిన మచ్చను జీవితాంతం మోసుకుతిరుగుతుందామె 'పట్టువంటి నీ మృదువైన చర్మం వయసుని తెలియనివ్వదు' అంటూ ఎక్కడో ఎవరో ప్రశంసింపబడుతూంటారు. మరొక వ్యక్తి మూడడుగుల చర్మాన్ని ఒలిచి అతికించుకొన్న సౌందర్యం అది. ఎన్నటికీ మట్టిలో కరగదు అనుకొంటున్నారు. బొల్లోజు బాబా

Thursday, April 5, 2018

ముల్లు తీయించుకోవటం

ముల్లు తీయించుకోవటం
ఒకని పాదాన్ని మరొకరు చేతుల్లోకి తీసుకొని
లోతుగా దిగి విరిగిన ముల్లుచుట్టూ
చర్మాన్నిఉమ్ముతో శుభ్రం చేసి
పిన్నీసు మొనతో
మెల్లమెల్లగా దాన్ని పైకి లేపుతూ
బొటనవేలు చూపుడు వేలు గోర్లతో
పట్టుకొని బయటకు లాగి
అరచేతిలో ఉంచుకొని
విప్పారిన నేత్రాలకు చూపటం
కాలుతున్న చుట్టను తీసుకొని
ముల్లు చేసిన గాయానికి సెగ పెట్టటం
ఎంత గొప్ప మానవీయ అనుభవం!
చిట్టిపాదాల్ని చిగుళ్లకు ఆనించి
మునిపంటితో ముల్లును తొలగించిన
అమ్మ జ్ఞాపకం లాంటి అనుభవం.
***
నేనెప్పుడైనా ఈ ప్రపంచంతో
రోజంతా వేసారి విసుగుచెంది అలసిపోయి
ఇంటికొచ్చినప్పుడు
ఆమె తన ప్రేమప్రవాహపు చేతులతో
నా ఆలోచనలకు కళ్లెం వేసి
దేహ సౌగంధికా పరిమళంతో అల్లుకొని
మెడ ఒంపులో అందంగా అమరిన
ఆకుపచ్చని రక్తనాళాలలోకి
నన్ను పొదువుకొంటుంది ప్రతీసారీ
అపుడెందుకో నాకు
ముల్లు తీయించుకొన్న అనుభవమే
పదే పదే గుర్తుకు వస్తుంది.
బొల్లోజు బాబా

Monday, March 26, 2018

మృతుడు


అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికొచ్చేసరికి
సోఫాలో కూర్చొని పాత ఆల్బమ్ లు తిరగేస్తూ కనిపించాడు
ఆశ్చర్యం నుండి తేరుకొనేలోగా మాయమయ్యాడు
ఆ తరువాత ఎన్నోసార్లు కనిపించాడు
డైజిపామ్ కి కూడా నిద్ర పట్టక దొర్లుతూంటే
తన బొజ్జపై నన్ను పడుకోపెట్టుకొని
కథలు, పద్యాలు తన చిన్ననాటి సంగతులూ
చెపుతూండగా మధ్యలో ఎపుడో నిద్ర పట్టేసేది.
"చంటాడికి ఒళ్ళు కాలిపోతోంది" అంటూ
నన్ను భుజాలపై వేసుకొని ఆరుబయట తిప్పుతూండగా
మా అమ్మాయి నా నుదిటిపై చేయివేసి
"ఏమైంది నాన్నా" అనేది చాలాసార్లు.
నదిలో తన ప్రతిబింబాన్ని చూసుకోవటానికి
ఇక్కడిక్కడే తిరుగుతున్నాడని అనిపించేది.
ఇపుడెవరూ నమ్మటం లేదు కానీ
రేపెపుడో నేనూ అలా కనిపించినపుడు
నమ్ముతారు బహుసా!
బొల్లోజు బాబా