Showing posts with label గాథాసప్తశతి అనువాదాలు. Show all posts
Showing posts with label గాథాసప్తశతి అనువాదాలు. Show all posts

Sunday, August 23, 2020

కవి కులవత్సలుడు హాలుడు

 కవి కులవత్సలుడు హాలుడు - పార్ట్ 14

సప్తశతి గాథలను హాలుడు అనే శాతవాహన రాజు సేకరించాడు. ఇతనికి సంబంధించిన నాణాలు, శాసనాలు లేకపోవటంతో అది మారుపేరు కావొచ్చునని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. హాలుడు, శాతవాహనుడు అనే పేర్లు పర్యాయపదాలుగా సాహిత్యంలో కనిపిస్తాయి.

సప్తశతీ గాథలు ఎలా పుట్టాయో వివరించే కథ ఒకటి చెపుతారు. హాల చక్రవర్తి సరస్వతి దేవిని నిత్యం పూజించేవాడట. ఒకనాడు ఆమె ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మని అనగా తన రాజ్యంలో సరస్వతిదేవిని శాశ్వతంగా ఉండిపొమ్మని కోరుకొన్నాడట. ఆమె మూడురోజులు ఉండెదనని వరమిచ్చిందట. ఆ మూడురోజుల పాటు రాజ్యంలోని ప్రజలందరూ కవులుగా మారి అద్భుతమైన కవిత్వం చెప్పారట. అలా కొన్ని కోట్ల గాథలు పుట్టాయి. వాటిలోంచి హాలుడు ఉత్తమమైన ఏడువందల గాథలను ఎంపిక చేసి సప్తశతిగా కూర్చాడంటారు.

ఈ కథ బహుసా ఈ క్రింది గాథలో ఉన్న కోటానుకోట్ల అన్న పదానికి అందంగా చెప్పిన అన్వయంగా అనిపిస్తుంది.
.
ఈ ప్రపంచంలో కోటానుకోట్ల గాథలున్నాయి
వాటిలోంచి ఏడువందలు ఏరి
సప్తశతిగా కూర్చెను
కవికులవత్సలుడు హాలుడు (3)
.
పై కథ ద్వారా సప్తశతి అనేది ఒక సమిష్టి కృషి అని, దైవత్వాన్ని ఆపాదించటం ఈ గాథలను అజరామరం చేయటానికేనని అర్ధం చేసుకోవాలి. మరొక గాథలో శాతవాహన చక్రవర్తి పేరు ప్రస్తావన కనిపిస్తుంది. రాజు దైవస్వరూపుడు అనే భావనకు అతి ప్రాచీనరూపమిది.
.
కష్టకాలంలో మనలను కాపాడేది
ఇద్దరే ఇద్దరు
ఒకరు గౌరి వల్లభుడు
మరొకరు శాతవాహన చక్రవర్తి (567)
.
సప్తశతి గాథలలో వచ్చే మరొక రాజు విక్రమాదిత్యుడు. మొదటి విక్రమాదిత్యుడు క్రీపూ 57 కు చెందిన రాజు.

వీరోచితంగా పోరాడిన సైనికునికి విక్రమాదిత్యుడు లక్షవరహాలు బహూకరించినట్లుగా ఆమె తన పాదాలను కడిగినందుకు పారాణి గుర్తులను అతని చేతులకు బహూకరించింది. (564)
***
గాథాసప్తశతి వ్రాయబడిన కాలంలో శాతవాహన సామ్రాజ్యం అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ తరువాత వరుసగా వచ్చిన నలుగురు రాజులు మొత్తం పన్నెండేళ్ళు మాత్రమే పాలించారు. అదంతా సంక్షోభసమయం. యవనులు, శకులు, పహ్లావాలు లాంటి వివిధ శత్రురాజులు శాతవాహన రాజ్యాన్ని అన్నివైపులనుంచీ ముట్టడించటంతో అది చాలా మేరకు క్షీణించింది. తిరిగి గౌతమీపుత్ర శాతకర్ణి హయాంలో పునర్వైభవం పొందింది. ఈ రాజకీయపరమైన సంక్షోభాలను గూర్చి ఏ రకమైన ప్రస్తావనలు గాథలలో లేకపోవటం గమనార్హం.
సాహిత్యపరంగా శాతవాహనుల పాలన అనంతరం సంస్కృతభాష క్రమేపీ పైచేయి సాధించింది.
***

1. హాలుని కాలం
.
శాతవాహనుల పాలనాకాలంపై ఈనాటికీ చర్చ జరుగుతూ ఉన్నది. శాసనాధారాల ఆధారంగా శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుని పాలనా కాలం క్రీస్తు పూర్వం 120-96 అనుకొంటే హాలుడు క్రీశ. 20-24 మధ్య పాలించిన రాజుగా భావించవచ్చు. పురాణాలలో చెప్పబడిన ముప్పై మంది శాతవాహన రాజులలో హాలుడు పదిహేడవ వాడు. హాలుడు నాలుగేండ్లు మాత్రమే పాలన సాగించాడు

సప్తశతి గాథలు రచింపబడిన కాలం ఒకటో శతాబ్దం కాకపోవచ్చని D.R. Bandarkar ప్రతిపాదించారు. దీనికి ఆధారంగా సప్తశతిలోని 261 వ గాథలో మంగళవారం అన్న పదాన్ని, 89 వ గాథలో "రాధాకృష్ణుల ప్రేమ"ని చెప్పటాన్ని ఉదహరిస్తారు. ఎందుకంటే- రోజులను వారాలుగా వ్యవహరించే పద్దతి మొదటిసారిగా క్రీశ 398 లో వ్రాసిన శ్రీలంకకు చెందిన ఒక శాసనములో కనిపిస్తుందని, రాధాకృష్ణుల భక్తిభావన అయిదో శతాబ్దంలో వ్రాయబడిన పంచతంత్ర లో మొదటగా కనిపిస్తుందనీ ఆధారాలుగా చూపిస్తారు.

1881 లో వీబర్ సేకరించిన వివిధ వ్రాతప్రతులలో మొత్తం 430 గాథలు అన్నింటిలో ఉండగా మిగిలిన గాథలు మారుతూ వచ్చాయి. మొత్తం నేడు సుమారు తొమ్మిది వందల గాథలు లభిస్తున్నాయి. ఆ మిగిలినవి అన్నీ తదుపరి శతాబ్దాలలో చేర్చిన ప్రక్షిప్తాలు కావొచ్చునని పండితులు నిర్ధారించారు.

***

2. ఇతరకావ్యాలలో హాలుని గురించిన ప్రస్తావనలు
.
* క్రీశ 620 లో బాణుడు తన హర్షచరిత కావ్యంలో -

“సాతవాహనుడు మేలిమి రత్నాల్లాంటి
గాథలను సేకరణ జరిపాడు” ........ అంటూ చేసిన వ్యాఖ్య చరిత్రలో సంకలనకర్తగా హాలుని గురించి చేసిన తొలి ప్రస్తావన.

* క్రీశ 779 లో జైన పండితుడైన ఉద్యోదనసూరి తన కువలైమాల గ్రంధంలో -

“మత్తెంక్కించే మాటలతో
పామరులను కూడా కవులను చేసిన
హాలుని గాథలు ఉండగా ఇక కవిత్వం వ్రాసి
ప్రయోజనం ఏముంది? ....... అంటూ హాలుని సప్తశతిగాథల సాహిత్యవిలువను కీర్తించాడు.

* తొమ్మిదో శతాబ్దానికి చెందిన అభినందుడు తన రామచరిత కావ్యంలో శ్రీ హర్షుడు "హాలుని వలె" కవుల ప్రతిభను చాటే గాథలసంకలనాన్ని కూర్చాడని వర్ణించాడు.

* పన్నెండో శతాబ్దానికి చెందిన గోవర్ధనుడు తన ఆర్యసప్తశతి కావ్యంలో హాలుని గాథాసప్తశతిని ప్రస్తావించాడు.

*హర్షచరిత వ్రాసిన భాణభట్టు హాలుని ప్రస్తావన చేసాడు.

* భోజరాజు వ్రాసిన ఒక కావ్యంలో హాలుని ప్రసక్తి ఇలా ఉన్నది
హరిచంద్ర, హాలుడు వీరిరువురే కవులు. మనలాంటి వారందరమూ కవులుగా పిలవబడుతున్నవారం అంతే. (భోజ చక్రవర్తి వ్రాసిన శృంగార ప్రకాశ కావ్యం. 100)

* 5వ శతాబ్దానికి చెందిన జయవల్లభుడు రచించిన వజ్జలగ్గసప్తశతి కూడా గాథాసప్తశతిలాంటి కావ్యమే. వజ్జలగ్గలో హాలుని ప్రస్తావన ఒక గాథలో కనిపిస్తుంది.

హాల మహాచక్రవర్తి మరణించినా
ప్రతిష్టానపురం గోదావరి నదీతీరంపైనే ఉన్నది. (vajjalagga 468).

ఈ గాథద్వారా హాలుడి రాజధాని ప్రతిష్టానపురమని (మహారాష్ట్ర) తెలుస్తుంది. రాజు మరణించినా రాజ్యం మరణించదు అనే ప్రాపంచిక సత్యం ప్రకటించబడింది.
***
.
3. లీలావతి కావ్యంలో హాలుని పెళ్ళి

ప్రాచీనకాలంలోని విక్రమార్కుడు, భోజుడు వంటి రాజులను కథానాయకులుగా చిత్రించిన కథలు అనేకం కలవు. అదొక సాహిత్య సాంప్రదాయము. ఎనిమిదో శతాబ్దానికి చెందిన కుతూహలుడు హాలుని ప్రధానపాత్రగా తీసుకొని వ్రాసిన కావ్యం పేరు లీలావతి (లీలావాయ్).
.
లీలావతి కావ్యం గోదావరి - సముద్రంలో కలిసే చోటులో జరిగింది.
ఈ కావ్యంలో హాలుడు కథానాయకుడు. ఇతను గోదావరి తీరంపై ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఇతని మంత్రులు పోట్టిస, భట్ట కుమారి లు కాగా ఇతని సైన్యాద్యక్షుడు విజయానంద. హాలుని గురువు పేరు నాగార్జనుడు.

హాలుని వద్ద సేనానిగా పనిచేస్తున్న విజయానందుడు, మంత్రి పొట్టిస ఒకరోజు ప్రతిష్టానపురం నుంచి బయలుదేరి పాండ్యరాజ్యం మీదుగా ధనుష్కోటి చేరుకొని రామేశ్వరాలయంలో పూజలు చేసి తిరిగి బయలు దేరేసమయానికి వీరు ప్రయాణిస్తున్న ఓడ పెద్ద తుఫానులో చిక్కుకొంటుంది. వీరు ఆ తుఫానులో కొట్టుకుపోయి గోదావరి నది సముద్రంలో కలిసేచోట ఒడ్డుకు చేరుకొంటారు.

ఇక్కడ వారు అడవిలో కొద్దిసేపు ప్రయాణించి భీమేశ్వర దేవుని ఆలయానికి చేరుకొని, దైవ దర్శనం చేసుకొని దానికి దక్షిణం వైపు ఉన్న ఒక మఠంలో బస చేస్తారు.
అక్కడ వీరు హాలుని పెండ్లాడాలని బయలుదేరిన సింహళ దేశ రాకుమారి అయిన లీలావతిని కలుస్తారు.
ఈ విషయాలన్నీ ప్రతిష్టానపురం వెళ్ళి హాలునికి చెప్పగా, హాలుడు బయలుదేరి సప్తగోదావరీ తీరాన కల భీమేశ్వర ఆలయానికి వచ్చి లీలావతిని భీమేశ్వర స్వామి సన్నిధిలో పరిణయమాడటం తో కావ్యం ముగుస్తుంది.

ఇందులో పైన చెప్పబడిన ప్రదేశం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కాదని సప్తగోదావరి అనేప్రాంతం నేటి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల మధ్య ఉన్న ధర్మపురి సమీప ప్రాంతమని 2003 లో డా. సంగనభట్ల నరసయ్య ప్రతిపాదించారు. ఈ వాదనను పూర్వపక్షం చేసే అంశాలు ఇవి


లీలావతి కావ్యంలో హాలుని వివాహం జరిగిన ప్రదేశం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కాదని; సప్తగోదావరి అనేప్రాంతం నేటి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల మధ్య ఉన్న ధర్మపురి సమీప ప్రాంతమని 2003 లో డా. సంగనభట్ల నరసయ్య ప్రతిపాదించారు. ఈ వాదనను పూర్వపక్షం చేసే అంశాలు.

1. లీలావాయి గ్రంధంలో నౌకాభంగం జరిగి హాలుని అనుచరులు ఒడ్డుకు కొట్టుకొని వచ్చి కొద్దిదూరం అరణ్యంలో నడిచి భీమేశ్వర ఆలయాన్ని చేరుకొన్నట్లు ఉన్నది. భీమేశ్వర ఆలయం కల ద్రాక్షారామంకు పదికిలోమీటర్ల దూరంలో ప్రాచీన ఓడరేవు ఇంజరం కలదు. (పదహారోశతాబ్దంలో ఇంజరం ఒక బ్రిటిష్ ఫాక్టరీ/రేవుపట్టణం).

ఒక గోదావరి పాయ ఇంజరం, యానాం, గాడిమొగ ల మీదుగా ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది నేటికీ. కనుక సముద్రంలో నౌకాభంగం జరిగి వీరు ఈ పాయగుండా ఇంజరం వద్ద తీరాన్ని చేరుకొని, అక్కడనుంచి పదికిలోమీటర్లు ఉన్న ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని చేరుకొని ఉండవచ్చును. కరీంనగర్ నుంచి సమీప సముద్రతీరానికి కనీసం 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

2. లీలావాయి కావ్యంలో సప్తగోదావరి తీరంపై కల భీమేశ్వర ఆలయం అని మాత్రమే ఉన్నది ద్రాక్షారామము అనిలేదు అది భౌగోళికంగా నేటి ధర్మ పురి వద్ద కలదు అని నరసయ్యగారు అన్నారు. ప్రాచీనకాలంలో ధర్మపురివద్ద గోదావరికి సప్తగోదావరి అన్న పేరుకానీ, అక్కడ ప్రసిద్ధిచెందిన భీమేశ్వర ఆలయం కానీ ఉన్నట్లు మరే ఇతర సాహిత్య ఆధారాలు నరసయ్యగారు చూపలేదు.

3. స్కంద, బ్రహ్మ, వామన, దేవిభాగవత పురాణాలలో సప్తగోదావరి ప్రస్తావనలు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే నేడు ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. ఈ ఏడునదులు సంగమించి అంతర్వాహినులుగా ప్రవహించే ఒక పుష్కరిణి భీమేశ్వర ఆలయంలో ఉన్నది. సప్తగోదావరి పేరిట కల పుష్కరిణి గూర్చిన వర్ణనలు పదిహేనోశతాబ్దంలో శ్రీనాథుడు రచించిన భీమేశ్వరపురాణంలో కలవు.
ఈ ప్రాచీన ఉటంకింపులు అన్నీ నరసయ్యగారు చెపుతున్న కరీంనగర్ సప్తగోదావరి ప్రతిపాదన ఊహాజనితమని నిరూపిస్తాయి.

4. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. ఇక్కడ లభించే శాసనాలలో అతి పురాతమైనది క్రీశ తొమ్మిదోశతాబ్దానికి చెందినది. అంతకు పూర్వమిక్కడ బౌద్ధ ఆరామం ఉండి ఉండవచ్చుననే వాదన ఉంది.

5. అప్పటికే ఉన్న ఒక వాదనను తిరస్కరించేటపుడు తగిన సమర్ధన ఆధారాలు చూపటం శాస్త్రీయం. లీలావాయిలో చెప్పబడిన సప్తగోదావరి, భీమేశ్వర ఆలయం ద్రాక్షారామం లో ఉన్నది కాదు అది కరీంనగర్ కు చెందినది అని ప్రతిపాదించేటపుడు అందుకు తగినన్ని ప్రాచీన సాహిత్య ఆధారాలు కానీ, భౌగోళిక ఆధారాలుకానీ, శాసన ఆధారాలు కానీ, పౌరాణిక ఆధారాలు కానీ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అవేమీ చేయకుండా నరసయ్యగారు తమ వాదనలో గోదావరికి వరదలు ఎక్కువ కనుక ఆ వరదల్లో ఆధారాలు శిథిలమైపోయి ఉండవచ్చు అనే వాక్యంతో సరిపుచ్చటం శాస్త్రీయం కాదు.
***

హాలుడుఒక కుంభకారుని కొడుకు అని; సంస్కృత పాండిత్యము లేని రాజు అని; వాత్సాయనుడి కామసూత్రలో దుష్టుడైన రాజుయొక్క స్నేహితుడని; నాగార్జనాచార్యుడు వ్రాసిన సుహృల్లేఖలలో హాలుని ప్రస్తావన ఉన్నదని; గుణాడ్యుడు వ్రాసిన బృహత్కథను మొదట తిరస్కరించి తరువాత తప్పుతెలుసుకొని ఆ కథలను అగ్నికి ఆహుతికాకుండా కాపాడిన రాజు అని; గొప్ప పండితుడని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సత్యాసత్యాలు విచారించటానికి ఆధారాలు మృగ్యం. కానీ గాథాసప్తశతి సంకలనకర్తగా హాలుని పాత్ర నిర్వివాదాంశం.

హాలుడు ప్రతిష్టానపురం నుంచి సప్తగోదావరి తీరాన కల భీమేశ్వర ఆలయానికి లీలావతిని పెండ్లాడటానికి బయలుదేరినపుడు అతని వెంట వందమంది కవులు ఉన్నారని లీలావతి కావ్యం చెపుతుంది. దీనిని బట్టి హాలుడు కవులను ఆదరించేవాడని కవిజన వత్సలుడు అన్న బిరుదు సబబే అని అనిపించకమానదు. సప్తశతిలో సుమారు నలభై గాథలు హాలుని విరచితములు.

బొల్లోజు బాబా

Saturday, April 25, 2015

గాథాసప్తశతి - 7

 గాథాసప్తశతి  - 7
{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం.  గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము,  ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}
  
సప్తశతి గాథలలో  చాలాచోట్ల జీవితానుభవాలు చక్కని ఉదాహరణలతో దర్శనమిస్తాయి

ధనస్సును తాకిన మరుక్షణం
రివ్వున దూరమౌతుంది బాణం
వంకరగా ఉండే వారితో
సూటిగా ఉండేవారు స్నేహించగలరా?   ------ గాథాసప్తశతి

ఒకప్పుడు నీ కనులు నా చెంపలను
అలా చూస్తూనే ఉండేవి
నేనీనాటికీ అలానే ఉన్నాను
నా చెంపలు కూడా.
నీ కళ్ళు మాత్రం అలా లేవు. ------ గాథాసప్తశతి

మనసుపడినవాటిని ఎంచుకొంటాము తప్ప
గొప్పలక్షణాలను బట్టి కాదు.
పుళిందులు ముత్యాలను కాదని
గురివిందలను కోరుకోరా? ------ గాథాసప్తశతి

సుదీర్ఘకాల సహజీవనం లో కష్టసుఖాలు పంచుకొని
ప్రేమ అర్ధాన్ని కనుగొన్నదంపతులలో
మొదటచనిపోయినవారు బ్రతికినట్లు    
రెండవవ్యక్తి ఉన్నా చచ్చినట్లే.   (142)

కత్తులు ధరించిన కసాయివాళ్ళు తోలుకుపోతూంటే
గేదెలు వెనక్కు తిరిగి తోటను చూస్తూ
ఇక శెలవు అంటూ సాగిపోయాయి. ------ గాథాసప్తశతి

మగడెంత బ్రతిమాలినప్పటికీ
తన కోపం తగ్గలేదన్న విషయాన్ని
ఆమె బహు నేర్పుగా చెప్పగలదు.
ఏకాంత మందిరంలో కూడా
మగనికి మర్యాదలు చేస్తోంది.   -----  (88)

రత్యానంతరం వివశురాలైన  ఆమె  
చనిపోయిందనుకొని
పాలెకాపు భయంతో పారిపోవటం చూసి
సగం విచ్చుకొన్న
కాయలభారంతో వంగిన పత్తిచెట్టు
నవ్వుకొంటోంది.  ------ (360)

ఓహ్. కాలమా!
ప్రేమకవిత్వం పట్ల రోసిన యువకుడు
బ్రతకటాన్కి తర్కాన్ని చదువుకొంటున్నాడు
మేమేమో
మా భర్తలకు పరిమితమయ్యాము. ------ గాథాసప్తశతి


(సమాప్తం)
బొల్లోజు బాబా

Thursday, April 2, 2015

గాథాసప్తశతి - 5 (ప్రేమ గాథలు)


{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి - ప్రేమ గాథలు

సప్తశతి గాథలలో ఎక్కువ భాగం ప్రేమానుభవాలే. అందులో కూడా విరహము, రహస్యసమాగమములు, స్వైరిణీ సంయోగాలు, వివాహం వెలుపలి ప్రేమోదంతాలు వంటి అంశాలు ఎక్కువ. ఇవి ఆ కాలంలో అసహజం కాదని భావించాలి. ఆనాటి ప్రజలు శృంగారాన్ని హాయిగా అనుభవించారు, మాట్లాడు కొన్నారు, అందమైన కవిత్వరూపంలో వ్రాసుకొన్నారు.

Love at first sight అన్న మాట ఎప్పటిదో తెలియదు కాని “చూపులు కలిసిన శుభవేళ” అనే ఈ గాథ మాత్రం

రెండువేల ఏళ్ళనాటిది.....
అతడు ఆమెవైపు చూసాడు
ఆమె అతనివైపు చూసింది. 
ఆ శుభవేళే వారు తమ ప్రేమను 
ఖాయపరచుకొన్నారు -- 627

వస్తానన్న సమయానికి రాకుండా ఆలస్యం చేసిన ప్రియుని పై ప్రేయసి అలుకబూనటం ఎంత అందంగా ఉంటుందీ....

ప్రియా
నీవు నిజంగా నిద్రపోవటం లేదని
కళ్ళు మాత్రమే మూసుకొన్నావని 
నీ చెంపలు నా ముద్దుకు పులకరించటం ద్వారా
నాకు తెలుస్తూందిలే,
ఇంకెప్పుడూ ఆలస్యం చేయను సరేనా! (20)

ఈ గాథలో వర్ణించిన సంఘటన ఎంతో అందంగా, తోడు దొంగల్ని పట్టించేదిగా ఉంటుంది.

రేవు మెట్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయనే సాకుతో
ఆమె అతని చాతీకి అతుక్కుపోయింది
అతనుకూడా నిజంగా అదే ఉద్దేశంతో
ఆమెను బలంగా కౌగిలించుకొన్నాడు 193

ఈ గాథలో మరో ఇద్దరు దొంగలు అందంగా పట్టుబడ్డారు.

ఆ బాటసారి ఇందాకటి నుంచి
దోసిటివేళ్లు ఎడంచేసి నీళ్ళు తాగుతున్నాడు
తలపైకెత్తి చలివేంద్రం అమ్మాయినే చూస్తో.
అది గమనించిన ఆమె కూడా 
సన్నంగా ఉన్న ధారను మరింత తగ్గించింది. 161

ఒక అందమైన సందర్భాన్ని మరో రమ్యమైన ఒక పోలికతో ఎలా ముడిపెట్టాడో ఈ గాథాకారుడు చూడండి..

కోపం వల్ల కలిగిన ఆమె చెక్కిళ్ళ ఎరుపు 
అతను మోహంతో చుంబిస్తున్నప్పుడు
క్రమక్రమంగా అదృశ్యమౌతోంది
గాజుపాత్రలోని ద్రాక్షమధువులా. (933)

ముందుగా చెప్పినట్లు ఈ క్రింది గాథను చదివేటపుడు, ఆనాటి సమాజాన్ని దృష్టిలో నిలుపుకోవాలి...

ఊరంతా తుంటరి కుర్రాళ్ళు
వసంతకాలం, యవ్వనం, ముసలిభర్త, ఇప్పసారాయి 
ఏంచెయ్యాలో ఎవరూ చెప్పక్కర్లేదు
చెడిపోకుండా ఉండాలంటే చావొక్కటే దారి. (197)

వితంతువులైన స్త్రీలు అలనాటి కుటుంబాలలో సభ్యులుగా ఉండేవారని అనేక గాథలద్వారా అర్ధమౌతూంటుంది. ఈ క్రింది గాథలో అలాంటి ఒక స్త్రీకి వచ్చిన పెద్ద అనుమానం.......

చలికాలపు రాత్రులు ఎంతకీ తరగవు దీర్ఘమైనవి
చాన్నాళ్లుగా భర్త ఊళ్ళోనే లేడు 
రాత్రుళ్ళు చక్కగా నిద్రపోవచ్చు కదా!
పగలు నిద్రపోతున్నావు; ఏమిటి సంగతీ? (66)

ఈ గాథలో ఓ అత్తకు తగ్గ కోడలు దర్శనమిస్తుంది.....

కోడలు పిల్లా!
వెదురు ఆకులు నీ జుట్టులో చిక్కడి ఉన్నాయి
అత్తా!
నీ వీపంతా దుమ్ముఅంటుకొని ఉంది. (676)

ఈ గాథలో కనిపించే వ్యంగ్యం కానీ వెక్కిరింత స్థాయిని కానీ గమనిస్తే, అప్పటి ప్రజలు నిత్యజీవితంలో ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో బ్రతికి ఉంటారో అని ఆశ్చర్యం కలుగక మానదు.

భర్త శవంపై పడి ఆ మదనవతి
మూర్చలు పోతూ, గుండెలు బాదుకొంటూ ఏడిస్తే
ఎక్కడ సతీసహగమనం చేసుకొంటుందో అని
అందరూ హడిలి చచ్చారు...ఆమె ప్రియుడి తో సహా! (873)

రహస్యప్రేమికునికి సంకేతాల ద్వారా తన సంసిద్దతను తెలియచేసే విలాసవతులు గాథలలో చాలాచోట్ల కనిపిస్తారు. ఈ క్రింది గాథలో ఇంట్లో బస తీసుకొంటున్న బాటసారికి ఓ మోహనాంగి ఎలా తెలివిగా తను మనసులోని మాట చెపుతున్నదో చూడండి...

ఇది మా అత్త పడుకొనే చోటు
ఇక్కడ నేను పడుకొంటాను
అక్కడ పనివాళ్ళు
బాటసారీ! చీకట్లో కనిపించటం లేదని
నా పైన పడేవు. జాగ్రత్త సుమీ! - (669)

ఈ క్రింది గాథ కూడా దాదాపు అలాంటిదే

చిమ్మ చీకటి అలముకొంది
మగడు పొరుగూరు వెళ్ళాడు
ఇంట్లో ఎవరూ లేరు, దొంగలు పడతారేమో!
పొరుగింటివాడా కాస్త కనిపెడుతూ ఉండు - (335)

ఇవి ఒక స్వైరిణి మాటలులా అనిపిస్తాయి. అయినప్పటికీ ఈ గాథలో తొంగిచూసే ఆత్మవిశ్వాసం (నేను నేనే అనుకోవటం వరకూ) ముచ్చటగొల్పుతుంది.

నేను పల్లెటూర్లో పుట్టి పెరిగిన దాన్ని
పల్లెటూరివాసిని 
పట్నం పద్దతులు నాకు తెలియవు
అయినప్పటికీ
పట్నపు ఇంతుల భర్తల్ని వశపర్చుకోగలను
ఎందుకంటే నేను నేనే - 705

చెట్టెందుకెక్కావు అంటే గడ్డికొయ్యటానికి అన్నాట్ట ఒకడు, అలా ఉందీ వ్యవహారం.

ఓ బాలకా
పూలెందుకు కోస్తున్నావు
దేవతలు సంతోషించటానికి ఉదకం చాలు కదా!
గోదావరి తీరాలు
యువకులను పాడుచేస్తున్నాయి. – 355

జారిణులపట్ల వ్యామోహం పెంచుకొంటున్న కుర్రవానికి ఇచ్చిన ఉచిత సలహా...

బాలకా!
తొందరపడకు
బధ్రపరచమని ఉంచటానికి 
ఇది సరైన చోటు కాదు
నాకు తెలిసున్నంతమేరకు
ఇక్కడ దాచుకొన్న హృదయాల్ని 
ఎవ్వరూ తిరిగిపొందలేదు - 154


బొల్లోజు బాబా

Sunday, March 29, 2015

గాథాసప్తశతి 4 - రమణీ మనోహరులు


{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి  - రమణీ మనోహరులు
ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటపుడు దేహసౌందర్యం ప్రధాన పాత్రవహించటం, అదే పురుషుని వర్ణించవలసివచ్చినపుడు అది అతనిపట్ల మనసుపడ్డ ఒక స్త్రీ మనోచిత్రణ పరంగా ఉండటం ఈ గాథలలో చాలాచోట్ల కనిపిస్తుంది.

ఒక యవ్వనవతి తను మనసుపడ్డ యువకుని గురించి తన అత్తతో ఇలా అంటుంది

అత్తా!
ఆ యువకుడ్ని తదేకంగా 
ఎంతసేపు చూసినా అలుపైతే రాదు కానీ 
కలలో నీళ్ళు తాగినట్టు దాహం తీరదు. – 93

తన ప్రియుడు ఏ ఇంట్లో (ఎవరితో) ఉన్నాడో కనిపెట్టటానికి ఈ అమ్మాయి వేసిన పధకం బాగుంది చూడండి

పండగపూట కొత్తదుస్తులు ధరించి 
పిండివంటలు ఇంటింటికీ 
తిరుగుతూ పంచుతోంది పిచ్చిపిల్ల
నువ్వెక్కడయినా కనిపిస్తావన్న ఆశతో - 328

ప్రియుడి చేతిస్పర్శ పొందటమే భాగ్యంగా భావిస్తూ ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకొంటుందీ అమ్మాయి

నాకున్నవన్నీ మంటలకు బూడిదైనా
నాకు ఆనందంగానే ఉంది, ఎందుకంటే
మంటలనార్పేటపుడు
అతడు నా చేతుల్ని తాకుతూ 
నీళ్ళకడవ అందుకొన్నాడు. – 229

ఈ క్రింది గాథలో వర్ణించిన ఘటన అతిశయోక్తిగా అనిపించినా గాథాకారుని చమత్కారం అర్ధం చేసుకోవచ్చు.

నీ గొంతువినంగానే నిన్ను చూడటానికి
ఇంటినుండి పరుగులిడుతూ బయటకు వచ్చింది
నీవు వెళిపోయాకా ఆమెను 
మోసుకు తీసుకెళ్ళాల్సివచ్చింది. - 506

ఎట్టకేలకు కలుసుకొన్న ప్రియుడు మౌనంగా ఉంటే ప్రియురాలు అతన్ని ఎలా మాటల్లోకి దింపుతుందో చూడండి

చాలామంది నీ గురించి ఎంతొ చెప్పారు
ఈనాటికి నిన్ను కళ్ళారా చూస్తున్నాను
ప్రియతమా ఏదో ఒకటి మాట్లాడు
నా చెవులు కూడా తేనెను గ్రోలనీ! - 805

తాను అనుభవిస్తున్న భాదనంతా ఈమె ఎంత గడుసుగా చెపుతున్నదో చూసారా

ప్రియసఖుడా
నిన్ను చూడని స్త్రీలు మాత్రమే
సంతోషంగా ఉంటున్నారు
సుఖంగా నిద్రపోతున్నారు
చెప్పినది వింటున్నారు
మాటలుకోసం తడుముకోవటం లేదు. – 418

ప్రియుని చూసిన ఆనందాతిశయంలో చెమర్చిన నయనాలను దాచుకోలేకపోయిందట ఓ పడతి..... (వేరే అన్వయాలు కూడా చెప్పుకోవచ్చు)

నిన్నుచూచినపుడు
తల్లిదండ్రులు పక్కనున్నారని 
ఏ ఉద్వేగాన్నీ ప్రదర్శించలేదుకానీ
ఆమె రెప్పలు మూసినపుడు
ఓ కన్నీటి బిందువు జాలువారింది. – 367

ఈ గాథలోని వర్ణన నేటి సినిమా పాటలవరకూ విస్తరించి ఉందంటే అదెంత బలమైనదో ఊహించండి.

తమ ప్రియులను కనీసం స్వప్నాలలో 
దర్శించుకొనేవారు ధన్యులు
నీవు నా పక్కన లేకుంటే కలలమాట అటుంచు
నిదురే రాదు నాకు. - 397

ఈ క్రింది గాథ చాలా చాలా అందమైన ఊహ...

నిన్ను చుట్టుకొన్న నా చేతుల్ని 
బలంతో తొలగించుకొని దూరదేశానికి వెళుతున్నావు
నా హృదయం నుంచి నీ రూపు తొలగించి చూపు
అపుడు నీ బలాన్ని నేను గుర్తిస్తాను. - 749

ఇస్మాయిల్ గారు “తెరచుకొన్న పద్యం” అన్నది ఇలాంటి వాటిగురించే. పద్యం ముగిసాకా ఆ తొలుచూలు పడతి
మనసులో కోరుకునేదేమిటో పాఠకుడే పూరించుకోవాలి.

తొలిచూలు పడతిని సఖులు
నీ మనసులోని కోరిక ఏమిటని అడగగా
సిగ్గుపడుతూ భర్తను చూసింది. - 115

బొల్లోజు బాబా