Sunday, August 23, 2020

కవి కులవత్సలుడు హాలుడు

 కవి కులవత్సలుడు హాలుడు - పార్ట్ 14

సప్తశతి గాథలను హాలుడు అనే శాతవాహన రాజు సేకరించాడు. ఇతనికి సంబంధించిన నాణాలు, శాసనాలు లేకపోవటంతో అది మారుపేరు కావొచ్చునని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. హాలుడు, శాతవాహనుడు అనే పేర్లు పర్యాయపదాలుగా సాహిత్యంలో కనిపిస్తాయి.

సప్తశతీ గాథలు ఎలా పుట్టాయో వివరించే కథ ఒకటి చెపుతారు. హాల చక్రవర్తి సరస్వతి దేవిని నిత్యం పూజించేవాడట. ఒకనాడు ఆమె ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మని అనగా తన రాజ్యంలో సరస్వతిదేవిని శాశ్వతంగా ఉండిపొమ్మని కోరుకొన్నాడట. ఆమె మూడురోజులు ఉండెదనని వరమిచ్చిందట. ఆ మూడురోజుల పాటు రాజ్యంలోని ప్రజలందరూ కవులుగా మారి అద్భుతమైన కవిత్వం చెప్పారట. అలా కొన్ని కోట్ల గాథలు పుట్టాయి. వాటిలోంచి హాలుడు ఉత్తమమైన ఏడువందల గాథలను ఎంపిక చేసి సప్తశతిగా కూర్చాడంటారు.

ఈ కథ బహుసా ఈ క్రింది గాథలో ఉన్న కోటానుకోట్ల అన్న పదానికి అందంగా చెప్పిన అన్వయంగా అనిపిస్తుంది.
.
ఈ ప్రపంచంలో కోటానుకోట్ల గాథలున్నాయి
వాటిలోంచి ఏడువందలు ఏరి
సప్తశతిగా కూర్చెను
కవికులవత్సలుడు హాలుడు (3)
.
పై కథ ద్వారా సప్తశతి అనేది ఒక సమిష్టి కృషి అని, దైవత్వాన్ని ఆపాదించటం ఈ గాథలను అజరామరం చేయటానికేనని అర్ధం చేసుకోవాలి. మరొక గాథలో శాతవాహన చక్రవర్తి పేరు ప్రస్తావన కనిపిస్తుంది. రాజు దైవస్వరూపుడు అనే భావనకు అతి ప్రాచీనరూపమిది.
.
కష్టకాలంలో మనలను కాపాడేది
ఇద్దరే ఇద్దరు
ఒకరు గౌరి వల్లభుడు
మరొకరు శాతవాహన చక్రవర్తి (567)
.
సప్తశతి గాథలలో వచ్చే మరొక రాజు విక్రమాదిత్యుడు. మొదటి విక్రమాదిత్యుడు క్రీపూ 57 కు చెందిన రాజు.

వీరోచితంగా పోరాడిన సైనికునికి విక్రమాదిత్యుడు లక్షవరహాలు బహూకరించినట్లుగా ఆమె తన పాదాలను కడిగినందుకు పారాణి గుర్తులను అతని చేతులకు బహూకరించింది. (564)
***
గాథాసప్తశతి వ్రాయబడిన కాలంలో శాతవాహన సామ్రాజ్యం అనేక రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ తరువాత వరుసగా వచ్చిన నలుగురు రాజులు మొత్తం పన్నెండేళ్ళు మాత్రమే పాలించారు. అదంతా సంక్షోభసమయం. యవనులు, శకులు, పహ్లావాలు లాంటి వివిధ శత్రురాజులు శాతవాహన రాజ్యాన్ని అన్నివైపులనుంచీ ముట్టడించటంతో అది చాలా మేరకు క్షీణించింది. తిరిగి గౌతమీపుత్ర శాతకర్ణి హయాంలో పునర్వైభవం పొందింది. ఈ రాజకీయపరమైన సంక్షోభాలను గూర్చి ఏ రకమైన ప్రస్తావనలు గాథలలో లేకపోవటం గమనార్హం.
సాహిత్యపరంగా శాతవాహనుల పాలన అనంతరం సంస్కృతభాష క్రమేపీ పైచేయి సాధించింది.
***

1. హాలుని కాలం
.
శాతవాహనుల పాలనాకాలంపై ఈనాటికీ చర్చ జరుగుతూ ఉన్నది. శాసనాధారాల ఆధారంగా శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుని పాలనా కాలం క్రీస్తు పూర్వం 120-96 అనుకొంటే హాలుడు క్రీశ. 20-24 మధ్య పాలించిన రాజుగా భావించవచ్చు. పురాణాలలో చెప్పబడిన ముప్పై మంది శాతవాహన రాజులలో హాలుడు పదిహేడవ వాడు. హాలుడు నాలుగేండ్లు మాత్రమే పాలన సాగించాడు

సప్తశతి గాథలు రచింపబడిన కాలం ఒకటో శతాబ్దం కాకపోవచ్చని D.R. Bandarkar ప్రతిపాదించారు. దీనికి ఆధారంగా సప్తశతిలోని 261 వ గాథలో మంగళవారం అన్న పదాన్ని, 89 వ గాథలో "రాధాకృష్ణుల ప్రేమ"ని చెప్పటాన్ని ఉదహరిస్తారు. ఎందుకంటే- రోజులను వారాలుగా వ్యవహరించే పద్దతి మొదటిసారిగా క్రీశ 398 లో వ్రాసిన శ్రీలంకకు చెందిన ఒక శాసనములో కనిపిస్తుందని, రాధాకృష్ణుల భక్తిభావన అయిదో శతాబ్దంలో వ్రాయబడిన పంచతంత్ర లో మొదటగా కనిపిస్తుందనీ ఆధారాలుగా చూపిస్తారు.

1881 లో వీబర్ సేకరించిన వివిధ వ్రాతప్రతులలో మొత్తం 430 గాథలు అన్నింటిలో ఉండగా మిగిలిన గాథలు మారుతూ వచ్చాయి. మొత్తం నేడు సుమారు తొమ్మిది వందల గాథలు లభిస్తున్నాయి. ఆ మిగిలినవి అన్నీ తదుపరి శతాబ్దాలలో చేర్చిన ప్రక్షిప్తాలు కావొచ్చునని పండితులు నిర్ధారించారు.

***

2. ఇతరకావ్యాలలో హాలుని గురించిన ప్రస్తావనలు
.
* క్రీశ 620 లో బాణుడు తన హర్షచరిత కావ్యంలో -

“సాతవాహనుడు మేలిమి రత్నాల్లాంటి
గాథలను సేకరణ జరిపాడు” ........ అంటూ చేసిన వ్యాఖ్య చరిత్రలో సంకలనకర్తగా హాలుని గురించి చేసిన తొలి ప్రస్తావన.

* క్రీశ 779 లో జైన పండితుడైన ఉద్యోదనసూరి తన కువలైమాల గ్రంధంలో -

“మత్తెంక్కించే మాటలతో
పామరులను కూడా కవులను చేసిన
హాలుని గాథలు ఉండగా ఇక కవిత్వం వ్రాసి
ప్రయోజనం ఏముంది? ....... అంటూ హాలుని సప్తశతిగాథల సాహిత్యవిలువను కీర్తించాడు.

* తొమ్మిదో శతాబ్దానికి చెందిన అభినందుడు తన రామచరిత కావ్యంలో శ్రీ హర్షుడు "హాలుని వలె" కవుల ప్రతిభను చాటే గాథలసంకలనాన్ని కూర్చాడని వర్ణించాడు.

* పన్నెండో శతాబ్దానికి చెందిన గోవర్ధనుడు తన ఆర్యసప్తశతి కావ్యంలో హాలుని గాథాసప్తశతిని ప్రస్తావించాడు.

*హర్షచరిత వ్రాసిన భాణభట్టు హాలుని ప్రస్తావన చేసాడు.

* భోజరాజు వ్రాసిన ఒక కావ్యంలో హాలుని ప్రసక్తి ఇలా ఉన్నది
హరిచంద్ర, హాలుడు వీరిరువురే కవులు. మనలాంటి వారందరమూ కవులుగా పిలవబడుతున్నవారం అంతే. (భోజ చక్రవర్తి వ్రాసిన శృంగార ప్రకాశ కావ్యం. 100)

* 5వ శతాబ్దానికి చెందిన జయవల్లభుడు రచించిన వజ్జలగ్గసప్తశతి కూడా గాథాసప్తశతిలాంటి కావ్యమే. వజ్జలగ్గలో హాలుని ప్రస్తావన ఒక గాథలో కనిపిస్తుంది.

హాల మహాచక్రవర్తి మరణించినా
ప్రతిష్టానపురం గోదావరి నదీతీరంపైనే ఉన్నది. (vajjalagga 468).

ఈ గాథద్వారా హాలుడి రాజధాని ప్రతిష్టానపురమని (మహారాష్ట్ర) తెలుస్తుంది. రాజు మరణించినా రాజ్యం మరణించదు అనే ప్రాపంచిక సత్యం ప్రకటించబడింది.
***
.
3. లీలావతి కావ్యంలో హాలుని పెళ్ళి

ప్రాచీనకాలంలోని విక్రమార్కుడు, భోజుడు వంటి రాజులను కథానాయకులుగా చిత్రించిన కథలు అనేకం కలవు. అదొక సాహిత్య సాంప్రదాయము. ఎనిమిదో శతాబ్దానికి చెందిన కుతూహలుడు హాలుని ప్రధానపాత్రగా తీసుకొని వ్రాసిన కావ్యం పేరు లీలావతి (లీలావాయ్).
.
లీలావతి కావ్యం గోదావరి - సముద్రంలో కలిసే చోటులో జరిగింది.
ఈ కావ్యంలో హాలుడు కథానాయకుడు. ఇతను గోదావరి తీరంపై ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఇతని మంత్రులు పోట్టిస, భట్ట కుమారి లు కాగా ఇతని సైన్యాద్యక్షుడు విజయానంద. హాలుని గురువు పేరు నాగార్జనుడు.

హాలుని వద్ద సేనానిగా పనిచేస్తున్న విజయానందుడు, మంత్రి పొట్టిస ఒకరోజు ప్రతిష్టానపురం నుంచి బయలుదేరి పాండ్యరాజ్యం మీదుగా ధనుష్కోటి చేరుకొని రామేశ్వరాలయంలో పూజలు చేసి తిరిగి బయలు దేరేసమయానికి వీరు ప్రయాణిస్తున్న ఓడ పెద్ద తుఫానులో చిక్కుకొంటుంది. వీరు ఆ తుఫానులో కొట్టుకుపోయి గోదావరి నది సముద్రంలో కలిసేచోట ఒడ్డుకు చేరుకొంటారు.

ఇక్కడ వారు అడవిలో కొద్దిసేపు ప్రయాణించి భీమేశ్వర దేవుని ఆలయానికి చేరుకొని, దైవ దర్శనం చేసుకొని దానికి దక్షిణం వైపు ఉన్న ఒక మఠంలో బస చేస్తారు.
అక్కడ వీరు హాలుని పెండ్లాడాలని బయలుదేరిన సింహళ దేశ రాకుమారి అయిన లీలావతిని కలుస్తారు.
ఈ విషయాలన్నీ ప్రతిష్టానపురం వెళ్ళి హాలునికి చెప్పగా, హాలుడు బయలుదేరి సప్తగోదావరీ తీరాన కల భీమేశ్వర ఆలయానికి వచ్చి లీలావతిని భీమేశ్వర స్వామి సన్నిధిలో పరిణయమాడటం తో కావ్యం ముగుస్తుంది.

ఇందులో పైన చెప్పబడిన ప్రదేశం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కాదని సప్తగోదావరి అనేప్రాంతం నేటి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల మధ్య ఉన్న ధర్మపురి సమీప ప్రాంతమని 2003 లో డా. సంగనభట్ల నరసయ్య ప్రతిపాదించారు. ఈ వాదనను పూర్వపక్షం చేసే అంశాలు ఇవి


లీలావతి కావ్యంలో హాలుని వివాహం జరిగిన ప్రదేశం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం కాదని; సప్తగోదావరి అనేప్రాంతం నేటి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల మధ్య ఉన్న ధర్మపురి సమీప ప్రాంతమని 2003 లో డా. సంగనభట్ల నరసయ్య ప్రతిపాదించారు. ఈ వాదనను పూర్వపక్షం చేసే అంశాలు.

1. లీలావాయి గ్రంధంలో నౌకాభంగం జరిగి హాలుని అనుచరులు ఒడ్డుకు కొట్టుకొని వచ్చి కొద్దిదూరం అరణ్యంలో నడిచి భీమేశ్వర ఆలయాన్ని చేరుకొన్నట్లు ఉన్నది. భీమేశ్వర ఆలయం కల ద్రాక్షారామంకు పదికిలోమీటర్ల దూరంలో ప్రాచీన ఓడరేవు ఇంజరం కలదు. (పదహారోశతాబ్దంలో ఇంజరం ఒక బ్రిటిష్ ఫాక్టరీ/రేవుపట్టణం).

ఒక గోదావరి పాయ ఇంజరం, యానాం, గాడిమొగ ల మీదుగా ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది నేటికీ. కనుక సముద్రంలో నౌకాభంగం జరిగి వీరు ఈ పాయగుండా ఇంజరం వద్ద తీరాన్ని చేరుకొని, అక్కడనుంచి పదికిలోమీటర్లు ఉన్న ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని చేరుకొని ఉండవచ్చును. కరీంనగర్ నుంచి సమీప సముద్రతీరానికి కనీసం 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

2. లీలావాయి కావ్యంలో సప్తగోదావరి తీరంపై కల భీమేశ్వర ఆలయం అని మాత్రమే ఉన్నది ద్రాక్షారామము అనిలేదు అది భౌగోళికంగా నేటి ధర్మ పురి వద్ద కలదు అని నరసయ్యగారు అన్నారు. ప్రాచీనకాలంలో ధర్మపురివద్ద గోదావరికి సప్తగోదావరి అన్న పేరుకానీ, అక్కడ ప్రసిద్ధిచెందిన భీమేశ్వర ఆలయం కానీ ఉన్నట్లు మరే ఇతర సాహిత్య ఆధారాలు నరసయ్యగారు చూపలేదు.

3. స్కంద, బ్రహ్మ, వామన, దేవిభాగవత పురాణాలలో సప్తగోదావరి ప్రస్తావనలు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే నేడు ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. ఈ ఏడునదులు సంగమించి అంతర్వాహినులుగా ప్రవహించే ఒక పుష్కరిణి భీమేశ్వర ఆలయంలో ఉన్నది. సప్తగోదావరి పేరిట కల పుష్కరిణి గూర్చిన వర్ణనలు పదిహేనోశతాబ్దంలో శ్రీనాథుడు రచించిన భీమేశ్వరపురాణంలో కలవు.
ఈ ప్రాచీన ఉటంకింపులు అన్నీ నరసయ్యగారు చెపుతున్న కరీంనగర్ సప్తగోదావరి ప్రతిపాదన ఊహాజనితమని నిరూపిస్తాయి.

4. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. ఇక్కడ లభించే శాసనాలలో అతి పురాతమైనది క్రీశ తొమ్మిదోశతాబ్దానికి చెందినది. అంతకు పూర్వమిక్కడ బౌద్ధ ఆరామం ఉండి ఉండవచ్చుననే వాదన ఉంది.

5. అప్పటికే ఉన్న ఒక వాదనను తిరస్కరించేటపుడు తగిన సమర్ధన ఆధారాలు చూపటం శాస్త్రీయం. లీలావాయిలో చెప్పబడిన సప్తగోదావరి, భీమేశ్వర ఆలయం ద్రాక్షారామం లో ఉన్నది కాదు అది కరీంనగర్ కు చెందినది అని ప్రతిపాదించేటపుడు అందుకు తగినన్ని ప్రాచీన సాహిత్య ఆధారాలు కానీ, భౌగోళిక ఆధారాలుకానీ, శాసన ఆధారాలు కానీ, పౌరాణిక ఆధారాలు కానీ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అవేమీ చేయకుండా నరసయ్యగారు తమ వాదనలో గోదావరికి వరదలు ఎక్కువ కనుక ఆ వరదల్లో ఆధారాలు శిథిలమైపోయి ఉండవచ్చు అనే వాక్యంతో సరిపుచ్చటం శాస్త్రీయం కాదు.
***

హాలుడుఒక కుంభకారుని కొడుకు అని; సంస్కృత పాండిత్యము లేని రాజు అని; వాత్సాయనుడి కామసూత్రలో దుష్టుడైన రాజుయొక్క స్నేహితుడని; నాగార్జనాచార్యుడు వ్రాసిన సుహృల్లేఖలలో హాలుని ప్రస్తావన ఉన్నదని; గుణాడ్యుడు వ్రాసిన బృహత్కథను మొదట తిరస్కరించి తరువాత తప్పుతెలుసుకొని ఆ కథలను అగ్నికి ఆహుతికాకుండా కాపాడిన రాజు అని; గొప్ప పండితుడని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సత్యాసత్యాలు విచారించటానికి ఆధారాలు మృగ్యం. కానీ గాథాసప్తశతి సంకలనకర్తగా హాలుని పాత్ర నిర్వివాదాంశం.

హాలుడు ప్రతిష్టానపురం నుంచి సప్తగోదావరి తీరాన కల భీమేశ్వర ఆలయానికి లీలావతిని పెండ్లాడటానికి బయలుదేరినపుడు అతని వెంట వందమంది కవులు ఉన్నారని లీలావతి కావ్యం చెపుతుంది. దీనిని బట్టి హాలుడు కవులను ఆదరించేవాడని కవిజన వత్సలుడు అన్న బిరుదు సబబే అని అనిపించకమానదు. సప్తశతిలో సుమారు నలభై గాథలు హాలుని విరచితములు.

బొల్లోజు బాబా

1 comment:



  1. అద్భుతః మీరు కాచి వడబోసేరు గాధాసప్తశతి ని.


    పీహెచ్ డీ చేసేరా ?


    జిలేబి

    ReplyDelete