Saturday, August 29, 2020

లార్డ్ కన్నెమెరా కాకినాడ సందర్శనం - 1889

 లార్డ్ కన్నెమెరా కాకినాడ సందర్శనం - 1889

.
రాబర్ట్ బర్క్ 1882 నుంచి 1890 వరకు మద్రాసు గవర్నరుగా పనిచేసాడు. ఇతను ఐర్లాండు లోని కన్నెమెరా అనే ప్రాంతానికి బారన్ (జమిందారు). ఇతనిని లార్డ్ ఆఫ్ కన్నెమెరా అని పిలిచేవారు. ఇతని పేరుమీదనే మద్రాసులోని కన్నెమెరా లైబ్రేరి నెలకొల్పబడింది. మద్రాసు నుంచి కలకత్తాకు రైల్వేలైను ఇతని హయాంలోనే పొడిగింపబడింది.

లార్డ్ కన్నెమెరా కు ప్రయాణాలంటే ఇష్టం. మద్రాసు గవర్నరుగా పనిచేసిన కాలంలో మద్రాసు ప్రొవిన్స్ అంతటా విస్తృతంగా ప్రయాణాలు చేసాడు. ఇతని సెక్రటరీ జె.డి రీస్ ఆ ప్రయాణాలను ఆద్యంతం ఆసక్తికరమైన ట్రావెలాగ్స్ గా రచించాడు. లార్డ్ కన్నెమెరా 19 డిసంబరు 1889 న మద్రాసులో Sirsa అనే ఓడపై బయలుదేరి మచిలీపట్నం, కాకినాడ రాజమండ్రి ప్రాంతాలను సందర్శన చేసాడు. ఆ వివరాలు JD Rees వ్రాసిన Narratives of Tours in India అనే పుస్తకంలో ఇలా ఉన్నాయి...
@@@
మద్రాసులో పోలీసుల గౌరవవందనం స్వీకరించాకా ఉదయాన్నే Sirsa ఓడలో గవర్నరు గారు మేము బయలుదేరాం. ఒక పగలూ ఒక రాత్రీ ప్రయాణించాక 20 డిసంబరున మచిలీపట్నం చేరుకొన్నాం. ముప్పైవేలమంది ప్రజల మరణాలకు, పదిహేనుమైళ్ళ వరకూ తీరాన్ని ముంచెత్తిన ఉప్పెనకు కారణమైన 1864 నాటి తుఫాను కలిగించిన విధ్వంసపు ఆనవాళ్ళు ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి జింకలు, బాతులు King Charles కు కానుకగా తీసుకెళ్ళేవారు ఆనాటి వర్తకులు. "King Charles బాతులకు ఆహారం అందిస్తూ ఆనందంగా గడిపిన రోజులు" అనే పేరుగల పెయింటింగ్ నేడు బ్రిటన్ అంతా చాలా ప్రఖ్యాతి గడించింది. ఆ చిత్రంలోని బాతులు మచిలీపట్నం నుంచి తీసుకెళ్ళబడి ఉండవచ్చు.

మచిలీపట్నం నుంచి బయలుదేరి ఆ రాత్రంతా ప్రయాణించి ఉదయానికల్లా కాకినాడకు పదిమైళ్ళ దూరంలో ఉన్న కోరంగి రేవుకు చేరుకొన్నాం. కోరంగి రేవు సందడిగా ఉంది. పెద్ద సంఖ్యలో ఓడలు, పడవలు లంగరు వేసి ఉన్నాయి. దూరంనుంచే యజమానులు తమ ఓడలను గుర్తించేందుకు వీలుగా ఓడలకు వివిధ రకాల రంగురంగుల జండాలు ఎగురుతూన్నాయి.

కలక్టర్ Mr. Power వచ్చి ఓడలో గవర్నరుగారిని కలిసాడు. అప్పటికే సిద్ధం చేసిన ఆవిరి పడవ ఎక్కి కాకినాడ చేరుకొన్నాము. ధవళేశ్వరం వద్ద కట్టిన ఆనకట్ట వలన కాకినాడలో వ్యాపారాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 1862 లో కాకినాడలో 3 లక్షల రూపాయిలు విలువచేసే ఎగుమతులు దిగుమతులు జరిగేవి. 1872 నాటికి అవి ఏడు లక్షల నలభైవేలు, 1888 నాటికి పదిహేను లక్షలకు పెరిగాయి. విజయవాడ నుండి కాకినాడ వరకూ విస్తరించనున్న ఈస్ట్ కోస్ట్ రైలు మార్గం ఈ వ్యాణిజ్యానికి మరింత దోహదం చేయవచ్చు.

మేము రేవు దిగగానే జరీ దుస్తులు ధరించిన జమిందార్లు, ఇంగ్లీషు అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్స్, రంగురంగు తలపాగాలు చుట్టుకొన్న సామాన్య జనం మాకు స్వాగతం పలికారు. గవర్నరు గారు నేలపై కాలుమోపగానే పదిమంది పండితులు సంస్కృత శ్లోకాలు చదువుతూ ఆహ్వానించారు. వచ్చిన పెద్దలందరూ ఈస్ట్ కోస్ట్ రైల్వేలైను ను ఈ ప్రాంతానికి ప్రభుత్వము వారిచేత ఆమోదింప చేయించినందుకు గవర్నరుగారికి అనేక ధన్యవాదాలు తెలుపగా దానికి గవర్నరుగారు స్పందిస్తూ రైల్వే లైను రావటం వలన ఈ ప్రాంత అభివృద్ది జరుగుతుందని; కాలువల రవాణకు కేమీ నష్టం జరగదనీ; గోదావరి జిల్లా, గంజాం, విశాఖపట్టణాలకు రైలు మార్గం లేని లోటు దీనితో తీరబోతున్నదని; ప్రస్తుతం బెజవాడనుంచి సామర్లకోట వరకూ రైల్వేలైను నిర్మాణం జరుగుతున్నదని దీనిని ముందుముందు కటక్ వరకూ విస్తరింపచేయనున్నామని అన్నారు.

కాకినాడ నగరం ఇలాంటి సందర్భాలకు అనుగుణంగా సుందరంగా అలంకరించుకొంది. ఎక్కడ చూసిన తోరణాలు, పూలదండలు. గవర్నరుగారు నడుస్తూంటే అందమైన తెలుగు అమ్మాయిలు పళ్ళాలలోని పూలను ఆయనపై చల్లుతూన్నారు.
మధ్యాహ్నం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో Connemara అనే పేరుపెట్టిన ఆవిరి డ్రెడ్జర్ ను గవర్నరు గారు ప్రారంభించారు. షాంపేన్ బాటిల్ ఓపెన్ చేసి, ఒక తాడును చేతితో కొద్దిగా లాగగా - ఆ ఆవిరి ఓడ నెమ్మదినెమ్మదిగా నీటిలోకి ప్రవేశించిన దృశ్యం అందరిని సంతోషపరచింది.

ఇక అధికారిక విషయాలకు వస్తే - సంతృప్తికరంగా లేని మున్సిపల్ కౌన్సిలర్స్ పనితీరు; ఆసుపత్రులలో ఇంగ్లీషు వైద్యం చేయించుకోవటానికి ప్రజలు చూఫిస్తున్న అయిష్టం; ప్రభుత్వం ఇచ్చే రుణాలను రైతులు తీసుకోకపోవటం లాంటి విషయాలు చర్చకు వచ్చాయి.
***
ఆ మరునాడు కాకినాడ సమీప గ్రామాలను సందర్శించాము. ఇసకనేలలు, తాటి తోపులు, జీడిమామిడి, జామ తోటలు ఎక్కువగా ఉన్నాయి.
ఒక పల్లెలో మాకు కల్లుగీత కార్మికులు ఎదురయ్యారు. ప్రభుత్వం తీసుకురాబోతున్న కల్లుగీత/ఎక్సైజ్ చట్టాల పట్ల వారికున్న అభ్యంతరాలను గవర్నరు గారికి తెలియచేసారు వారు.

ఒక గ్రామంలో మాకు కొంతమంది పశుల కాపరులు కనిపించారు. అందులో ఒక ముసలివ్యక్తి గవర్నరు గారితో - "ఆ వంతెన సరిగ్గా లేదు, జాగ్రత్తగా చూసుకొని నడవమని" చెప్పాడు.
కొద్దిదూరంలో రజకులు బట్టలు ఉతుకుతూ కనిపించారు. వారు సోడా కలిపిన మట్టితో బట్టలు రుద్దుతున్నారు. బహుసా అది సోపు కు ప్రత్యామ్నాయం కావొచ్చు.

ఆదివారం అమ్మాయిల బడి, హాస్పటల్, చర్చిలను దర్శించాము. మహిళా వైద్యవిద్య ఎలా సాగుతున్నదని ఆరాతీసారు గవర్నరు గారు. హాస్పటలు లో పనిచేస్తున్న నర్స్ వద్దకు నెలకు ఇరవైమంది మాత్రమే వైద్యం చేయించుకోవటానికి వస్తున్నట్లు తెలిపింది. చర్చికి రిపేర్లు చేయించమని గవర్నరుగారు ఆదేశించారు.

23 వతారీఖు ఉదయాన్నే కాకినాడనుంచి కాలువ మార్గం ద్వారా రాజమండ్రికి బయలుదేరాం. మేమున్న ఫామిలీ బోటును Arthor Cotton పేరుగల స్టీమరుకు తగిలించగా అది మమ్ములను రాజమండ్రి వరకూ లాక్కుని వెళ్ళింది.
ధవళేశ్వరం బేరేజ్ వద్ద గోదావరి థేమ్స్ నదంత వెడల్పుగా ఉంది. కాటన్ బేరేజ్ ద్వారా ఆరులక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. సుమారు రెండువేల చదరపు మైళ్ళకు నీరు అందుతోంది. 1852 లో ధవళేశ్వరం బేరేజ్ లక్షా యాభై వేల పౌండ్లతో నిర్మించబడింది. ఈ ఆనకట్ట కట్టకముందు 1847 లో ఈ జిల్లా స్థూల ఉత్పత్తి లక్షాడబ్బై వేల రూపాయిలుండగా 1887 నాటికి అది పదిహేను లక్షల రూపాయిల పైచిలుకు చేరటం గమనార్హం.

మా బోటు ప్రయాణిస్తూండగా ఒక చిన్నపడవద్వారా మాకు ఆ రోజునాటి తపాలా అందచేయబడింది. బొంబాయిలోని ఒక వ్యాపారస్థుడు పంపిన ప్రకటనల కేటలాగు అది. చికాకు కలిగి దానిని కాలువలోకి విసిరేసాను. అది పొరపాటున జారిపడిపోయిందనుకొన్న ఒక సిబ్బంది నీళ్ళలోకి దూకి దాన్ని తిరిగి మాకు ఇచ్చాడు. ప్రకటనల నుంచి తప్పించుకోవటం చాలా కష్టం.

రాజమండ్రిలో దిగగానే పాతకోట శిధిలాలు మాకు కనిపించాయి. సామాన్యప్రజలు రంగురంగుల తలపాగాలు చుట్టుకొని కనిపించారు. ఎక్కువగా ముదురు ఎరుపురంగులో ఉన్నాయవి. చిన్నపిల్లలు ముద్దుగా బొద్దుగా ఉన్నారు. మాకు జడ్జి గారి ఇంటిలో బస ఏర్పాటు జరిగింది. రాత్రిపూట కోలాటం బృందనాట్యం మాకొరకు ఏర్పాటు చేసారు. ఈ కోలాటం ఆట నాకు Seoul లో చూసిన అదే తరహా నృత్యాన్ని గుర్తుకు తెచ్చింది.
గవర్నరు గారి కొరకు వివిధ తమాషా కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక దాంట్లో ఒక వ్యక్తి " పురప్రజలారా ఇదిగో చూడండి గవర్నరుగారు, తమ పల్లకి ఎక్కి గవర్నమెంటు బంగ్లాకు వెళుతున్నారు.... ఇదిగో చూడండి" అని ప్రకటించగా... గవర్నరుగారి వేషం వేసుకొన్న ఒక వ్యక్తి గవర్నరుగారిలా నడుచుకొంటూ పల్లకిలో ఎక్కినట్లు అభినయం చేసాడు. మేమంతా నవ్వుకొన్నాం.
ఆ మరునాటి ఉదయం గోదావరినదిపై వ్యాహ్యాళికి వెళ్లాం. ఆ అందాలను చూడటానికి రెండుకళ్ళూ సరిపోవు. ప్రతీచోటా కాసేపు ఆగి వాటిని ఆస్వాదించాల్సిందే. ...
@@@

ఆ తరువాత లార్డ్ కన్నెమెరా బృందం ఏలూరు, బెజవాడ, సింగరేణి, హైదరాబాదు వెళ్ళిన ఉదంతాలు కలవు.

ఈ విషయాల ద్వారా ఆనాటి ఆర్ధిక, సామాజిక పరిస్థితులను అర్ధంచేసుకొనవచ్చును. కొన్ని ఆసక్తికర అంశాలు

1. జలమార్గాలే ప్రధాన రవాణా సౌకర్యం గా ఉండటం.
2. రైల్వేలు వస్తే జలమార్గాల ప్రాధాన్యం తగ్గిపోదని హామీ ఇచ్చినా ఆ తరువాత వచ్చిన ట్రాన్స్ పోర్ట్ ఇండస్ట్రీ లాబీయింగ్ వలన జలమార్గాలు క్రమేపీ అంతరించిపోయాయి.
3. కాటన్ బేరేజి వ్యయం అది ఇచ్చిన ఫలితాలు
4. ప్రకటనల ప్రహసనం
5. ఇంగ్లీషు వైద్యాన్ని ప్రజలు నమ్మకపోవటం
6. ప్రభుత్వం రుణాలిస్తానన్నా రైతులు ముందుకు రావకపోవటం.

ఆనాటి సమాజంలోకి ఇదొక ఆసక్తికరమైన historical peeping.

బొల్లోజు బాబా

ఫొటోలు:
1. Episode of the Happier Days of Charles I. (1600 – 1649) Illustration for The Illustrated Times, 17 October 1857. రాజకీయకారణాల వల్ల పార్లమెంటు ఇతనికి మరణశిక్ష విధించింది.
2&3 మద్రాసు గవర్నర్ లార్డ్ కన్నెమెరా.

Image may contain: one or more people, sky, outdoor and waterImage may contain: 1 person

2 comments: